5, మే 2011, గురువారం

పంచ మహా యజ్ఞాలు చివరి మాట = అమృతం మీ చేతిలో వుంది! = మీరు దేవతలా? రాక్షసులా?

పంచ మహా యజ్ఞాలు 
చివరి మాట 

యింత వరకు మనం చూసిన ఐదు యజ్ఞాలు - దేవ, ఋషి, పితృ, మనుష్య, భూత యజ్ఞాలు. 

అంటే - ప్రపంచం లోని - దాదాపు ప్రతి ప్రాణి పట్ల - మీ కర్తవ్యం ఏమిటో చూసాము.
ఈ ప్రపంచం లోని అన్ని ప్రాణులూ - వొకటి  పై మరొకటి  ఆధార పడి ఉన్నదన్న  సత్యాన్ని - ఈ యజ్ఞాలు గుర్తు చేస్తాయి. 

మీరు ప్రార్థిస్తే - దేవతలు సంతోష పడితే - దాని అర్థం ఏమిటి? దేవతల సంతోషం కూడా - కొం త వరకు, మీ ప్రార్థనలపైన ఆధార పడి వుందనా? 

ఆధార పడక పోయినా - వారు సంతోష పడతారన్న మాట నిజమే.

ప్రకృతి శక్తులు (దేవతలు) ప్రపంచంలోని - ప్రతి ప్రాణినీ - సమానం గానే చూస్తారు.
 
వొక్క మానవుడి విషయం లోనే - ప్రకృతి శక్తులు - కొంత భిన్నంగా నడుచు కుంటాయి 
.
 ప్రార్థన చేయ గల, అర్థించ గల, ప్రకృతి శక్తుల పనికి తోడు పడ గల , లేదా, వాటి పనికి, కొంత అడ్డు పడ గల - శక్తి  వొక్క మనిషికే వుంది. 

మనిషి వొక్కడే - ప్రకృతి శక్తుల శక్తి ని అధిగమించి  - తన లోని పరమ తత్వాన్ని, దైవత్వాన్ని, సిద్ధింప చేసుగోగల  సమర్థుడు.  ఆ ప్రయత్నంలో, వొక భాగమే, పంచ మహా యజ్ఞాలు. 

ఏనుగు కానీ, సిం హము కాని - వొకరికొకరు సహాయం చేసుకోవాలని - ఎప్పుడూ అనుకోలేవు. పాము, కప్ప సఖ్యంగా వుండటం - మనం చూడలేం.వొక్క కార్టూన్ ఫిల్ములో తప్ప.

మనిషికి మాత్రమే - ప్రతి ప్రాణి తోనూ సఖ్యంగా వుండటం సాధ్యం.
అలాగే - మనిషితో మాత్రమే - సఖ్యంగా వుండటం, ప్రతి ప్రాణికీ సాధ్యం. లేదంటే - వాటి గుణం - స్వజాతితో సఖ్యం విజాతితో విరోధం. స్వజాతిలో కూడా - కేవలం, స్వప్రయోజనాలకోసమే సఖ్యం. లేదంటే - విరోధం సహజం.

అంటే  -  మనిషికి మాత్రమే - ప్రతి ప్రాణి తోనూ సఖ్యంగా వుండటం సాధ్యం. అంటే - మనిషిలో మాత్రమే  - దైవత్వపు చాయలు  పూర్తిగా వున్నాయి. ప్రతి ప్రాణిలోనూ, తనను తాను చూసుకోగలడు. తనలో, ప్రతి ప్రాణినీ చూడ గలడు.
ప్రతి ప్రాణినీ, తన ప్రేమతో, దయతో - కట్టి పడేయగలడు. అంతకు మించి క్రూరత్వం వుంటే - సంహరించనూ గలడు.  ఇదీ దైవత్వమే.   

మనిషి తనలోని దైవత్వంతో , మనం చూసిన పంచ మహా యజ్ఞాల ద్వారా,  ప్రకృతికి ఎంతో తోడుపడ గలడు. ఆ ప్రయత్నంలో - తన జీవితాన్ని కూడా, ఆనందమయం చేసుకో గలడు.

కాని - స్వార్థం తలెత్తితే  - మనకు, ప్రకృతి శక్తులూ, ఎదురు నిలుస్తాయి. దైవం కూడా ఎదురు నిలుస్తుంది. 

అప్పుడు - సాధారణ మృగాల లాగా - ప్రకృతి శక్తి ముందు, మనం సమసి పోతాం.
సరే. పంచ మహా యజ్ఞాలలో - మనం చూడని వొకే వొక ప్రాణి - "మనమే".  అంటే - మీరే.

నిజమా? కాదు. సర్వే జనాః  సుఖినో భవంతు - అంటే, ఆ అందరిలో, మీరు వున్నారా, లేదా? ఉన్నారుగా!

మనం, ముఖ్యంగా; చాలా, చాలా, ముఖ్యంగా - గుర్తు పెట్టుకోవలసిన గొప్ప నిజం వొకటుంది.
మీరు - మీకోసం, మీ స్వార్థం కోసం  చేసే ప్రయత్నాలలో - మీకు వచ్చే సుఖం, ఆనంధం చాలా తక్కువ. సాధారణ జంతువులకొచ్చే ఆనందమే మీకూ వస్తుంది. అంతే.

కానీ- మనం చెప్పుకున్న - పం చ మహా యజ్ఞాలలో, మీ కొచ్చే ఆనందం, అలౌకికం, దైవీకం, వెల కట్ట లేనిది.

అందుకే  - నిస్స్వార్థ సేవ చేసే వారి ముఖంలో - ఎప్పుడూ, (ఎంతో) ఆనంధం, చిరునవ్వు  వుంటుంది.

స్వార్థపరుల ముఖాలలో, మనస్సులో - ఆనందం చాలా తక్కువ, అశాంతి చాల ఎక్కువ. ఎందుకంటే - స్వార్థం మృగ లక్షణం గనుక . 

మీరే  చూడండి . మీకే తెలుస్తుంది.

చిన్న కథ -

దేవతలకూ, రాక్షసులకూ,  చేతులు వంగకుండా గట్టిగా కట్టివేసాడట దేవుడు.  తరువాత, వారి  వొక్కొక్కరి దోసిలిలో , అమృతం పోసి - తాగమన్నాట.

రాక్షసులు - కట్టిన చేతులు వంచలేక, అమృతం తాగడానికి, నానా అవస్థలూ పడి, చేతుల్లోని అమృతం క్రింద పారబోసుకున్నారట.

దేవతలు - కట్టిన చేతులలోని అమృతాన్ని,తమకు ఉపయోగ పడక పోయినా - ఎదుటివారికి, తమ దోసిలితో , త్రాగిం చారట. అలా, దేవతలందరికీ, ఎవరో, వొకరు త్రాగిపించారట. 

నిస్స్వార్థంతో, ప్రేమతో,  అమరత్వాన్ని సాదించ వచ్చునని వారు తెలుసుకున్నారు.

మనమైనా అంతే. మనకైనా అంతే.  

మీ చేతులు మీకు  కనిపించని త్రాళ్ళతో కట్ట బడి వున్నాయి. మీ చేతులలో, ప్రేమ అనే అమృతం వుంది. అది మీరు త్రాగలేరు. కాని, పది మందికి త్రాగించ గలరు. 

మీరది చేయాలే గాని - వందలాది, వేలాది, లక్షలాది చేతులు - ప్రేమనే, ఆనందమనే, అమృతంలో - మిమ్మల్ని ముంచెత్తుతాయి. 

యిక - ఆలస్యం వద్దు. ...రండి. ...పదండి ముందుకు; 

- మీ

వుప్పలధడియం విజయమోహన్ .

1 కామెంట్‌: