9, డిసెంబర్ 2012, ఆదివారం

బ్రహ్మమంటే ఏమిటి? - బ్రహ్మ జ్ఞానం మనకెందుకు? - బ్రహ్మానందం ఏమిటి? - ఏం చేస్తే మనకు బ్రహ్మానందం కలుగుతుంది?

బ్రహ్మమంటే  ఏమిటి?


నీరుల్లి (ఎర్రటి) గడ్డ - పొరలు పొరలు గా వుంటుంది కదా. అందులోని పొరలను వొకదాని తర్వాత వొకటి, పైనుండి లోపలికి  వలుస్తూ పోతే, చిట్ట చివర ఏం మిగుల్తుంది?

ఏమీ మిగలదు. అంతా పొరలే . కానీ - లోపల శూన్యమే.

 బ్రహ్మమంటే  కూడా - దాదాపు అంతే.

ప్రపంచమంతటా - బ్రహ్మం వుంది.  బ్రహ్మమే వుంది. బ్రహ్మం తప్ప మరేమీ లేదు. అయినా , అది ఎక్కడ చూసినా కనిపించదు, వినిపించదు.   

ఈ బ్రహం యొక్క స్వరూపం ఏమిటి ?

బ్రహ్మం = సత్యం = జ్ఞానం = అనంతం

యిది ఉపనిషత్తులు యిచ్చిన  డెఫనిషన్.

బ్రహ్మం అంటే సత్యం. సత్యం అంటే జ్ఞానం. జ్ఞానం అంటే అనంతం.

అంటే - ఇవేవీ వేర్వేరు  కాదు. అన్నీ వొకటే.

అదెలా? సత్యమంటే నిజం కదా. జ్ఞానమంటే తెలివి తో ఆర్జించే బుద్ధి సంపద కదా. అనంతం అంటే మరేదో ఆకాశ మంత పెద్దది అని కదా. యిలా, మన మనస్సులో చాలా సందేహాలు సాధారణంగా వస్తాయి.

మీకు తెలుసా - యిలా వచ్చే మన సందేహాలు -అన్నిటికీ  మన ఉపనిషత్తులలో సమాధానాలు వున్నాయి.

కాక పోతే - యిప్పుడు ఈ విజ్ఞానంపై చాలినంత ఆసక్తి వున్న వారు చాలా తక్కువ. సంస్కృతం తెలిసిన వారు చాలా తక్కువ.

వీటిని - జన సామాన్యానికి అందించాలన్న తపన వున్న వారు అంతకంటే తక్కువ.  అందువలన - యిదేదో - అంటరాని పదార్ధం అయి కూర్చుంది.

నిజానికి - కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో కూడా - ఈ వేదాంత సారం గ్రహించాలంటే - ఎక్కడో, అరణ్యాలలో, అది తెలిసిన ఋషుల దగ్గరికి వెళ్ళాలి.   ఆ ఋషులు, యివి చెప్పాలంటే - వెయ్యి షరతులు పెడతారు. ఆ షరతులకు వొప్పుకున్న వాడికే,  వేదాంత సారం, బ్రహ్మ జ్ఞానం తెలుసుకోవడానికి అర్హత వస్తుంది.

కొన్ని ఉపనిషత్తులు చదివితే  - ఆ ఋషులు పెట్టే  షరతులు నిజంగా కావాల్సినవే - అని మనకూ తెలిసొస్తుంది. ఆ షరతులకు వొప్పుకునే వాడు - మనలో, కోటికి  వొక్కడున్నా  - చాలా, చాలా ఎక్కువే.

మనకు  లోకం లో  ఎన్నో కావాలి. అవన్నీ వద్దనిపిస్తే - అప్పుడు బ్రహ్మజ్ఞానం.

అప్పుడు బ్రహ్మ జ్ఞానం మాత్రం ఎందుకు ?

అన్ని రకాల అందాలు, ఆనందాలు, సుఖాలు వదిలేసి - బ్రహ్మ జ్ఞానం వద్దకు పరుగు తీయడం ఎందుకు?

సినిమాలు వద్దు. టీ .వీ లు వద్దు. సెల్ ఫోన్లు వద్దు. కాఫీలు, టిఫిన్లు  వద్దు. మంచి బట్టలు వద్దు, పెళ్ళీ పెటాకులు వద్దు - అసలేమీ వద్దు?  అటువంటి బ్రహ్మ జ్ఞానం మనకెందుకు?

అవును. ఎందుకు? ఏదో, ఈజీ గా వస్తే, అదికూడా ఓకే . కానీ అన్నీ వదిలేసి,  అది ఎందుకు?

 ఎందుకు?   ఎందుకు?    ఎందుకు?   

అదండీ ప్రశ్న .

దీనికి ఉపనిషత్తుల సమాధానం ఏమిటి?


తై త్తరీయంలో  వొక చిన్న వివరణ వుంది చూద్దాం.

బాగా బలవంతుడైన , ఆరోగ్య వంతుడైన , యౌవన వంతుడైన, అందగాడైన , సర్వ సంపదలతో కూడిన  వొక రాజ కుమారుడు ఉన్నాడనుకొందాం. ప్రపంచంలో అతనికి ఎక్కడా ఎదురు లేదు. అతడికి కావాల్సిన సర్వ సుఖాలు వున్నాయనుకొందాం.   అందమైన, ప్రేమించే  భార్య - యిలా అందరూ.

యిప్పుడు - ఈ రాజకుమారుని ఆనందానికి లోటు లేదు. అతడి ఆనందం - వొక యూనిట్ అనుకొందాం. యిది నేను చెప్పింది కాదుః   తై త్తరీయం చెప్పిందే.

యిట్లాటి  మనుష్యానందాలు నూరు రెట్లైతే - వొక మనుష్య గంధర్వుడి ఆనందానికి సమం. 

 వొక మనుష్య గంధర్వుడి  ఆనందం వంద రెట్లైతే  -    వొక దేవగంధర్వుడి ఆనందానికి సమం.

దేవ గంధర్వుడి ఆనందం వంద రెట్లైతే  -   చిరకాల (బ్రహ్మ) లోక వాసుడగు వొక్క పితృ దేవత ఆనందానికి సమం.

   
చిరకాల (బ్రహ్మ) లోక వాసుడగు వొక్క పితృ దేవత ఆనందం వంద రెట్లైతే - అజానజుడనే దేవత యొక్క ,  వొక్క ఆనందానికి సరి అవుతుంది   

వొక్క అజానజుడనే దేవత ఆనందం వంద రెట్లైతే - వొక్క కర్మ దేవత ఆనందానికి సమం.

అలాగే కర్మ దేవత  అనందం  వంద రెట్లైతే - వొక్క దేవత  ఆనందానికి సమం.

వొక్క దేవత అనందం  వంద రెట్లైతే - యింద్రుని  ఆనందానికి సమం.

యింద్రుని ఆనందం వంద రెట్లైతే - బృహస్పతి ఆనందానికి సమం.

బృహస్పతి ఆనందం వంద రెట్లైతే - ప్రజాపతి  ఆనందానికి సమం.

 ప్రజాపతి ఆనందం వంద రెట్లైతే - హిరణ్య గర్భుని ఆనందానికి సమం.

వొక  కామ రహితుడైన బ్రహ్మ జ్ఞాని  - అటువంటి గొప్ప  హిరణ్య గర్భుని ఆనందం కూడా సాధారణంగా, నిరంతరాయంగా  పొందుతాడు.

ఇక్కడేదో  వంద రెట్లు - అంటూ చెప్పారు కానీ - బ్రహ్మ జ్ఞాని ఆనందం, అనంతం - అసలు ఎల్ల లేనిది, అనే చెప్పారు.. 

సరే.  యిప్పుడు మనకు  అది కావాలా, వద్దా - అన్నది మనమే నిర్ణ యించుకోవాలి.

కావాలి. వూరికే యిస్తే కావాలి. కానీ- వూరికే యివ్వరు కదా .

మరి, అందుకేం  కావాలి మనకు?

గురువు కావాలి మనకు. గురువు మనకు యిది చెప్పాలంటే -  మనకు 4 అర్హతలు కావాలి.

1. వైరాగ్యము 2. వివేకము.  3. శమ,దమ, ఉపరతి, తితిక్ష ,శ్రద్ధ, సమాధానం  అనే ఆరు సంపదలు 4.ముముక్షత్వం . యివి ఏమిటి అన్నది పెద్ద చర్చనీయాంశం. అది మరో సారి చూద్దాం. 

యివి నాలుగూ మీలో ఉన్నాయా? - అని మీ గురువు మిమ్మల్ని పరీక్ష చేసి గానీ మీకు  బ్రహ్మ జ్ఞానం బోధించడు. 

వొకానొక బ్రహ్మజ్ఞాని అయిన గురువు, తన దగ్గరకు  వచ్చిన గొప్ప ఋషులను, సంవత్సరం పాటు  పరీక్ష చేసి గానీ, బ్రహ్మ జ్ఞానం బోధించ లేదు.

వరుణుడు తన కొడుకైన భ్రుగువును, ఎన్నో రకాలుగా పరీక్ష చేసి - బ్రహ్మ జ్ఞానం తెలుసుకోనేటట్టు చేస్తాడు.

మీరు షావోలిన్ లో కుంగ్ ఫూ నేర్చుకోవడానికంటే  - హార్వర్డ్  యునివర్సిటీ లో చేరడానికంటే -  ఈ బ్రహ్మ జ్ఞానం కాలేజీలో  చేరడానికి - అర్హతలు ఎక్కువ కావాలి. 

సరే. చేరితే - ఎన్ని ఏళ్ళు పడుతుంది - ఈ జ్ఞానం రావడానికి?

చెప్పలేం.

వొక్క క్షణం లో కూడా రావొచ్చు.  వొక్క రోజులో రావొచ్చు. వొక్క సంవత్సరంలో రావొచ్చు. వొక్క జన్మ కావొచ్చు. కొన్ని జన్మలూ పట్టొచ్చు.

యిదేం అంత పెద్ద బ్రహ్మ విద్యా? అవును - యిదే బ్రహ్మ విద్య.

మీకు బ్రహ్మ జ్ఞానం రావడం కాదు. మీరే బ్రహ్మంగా మారిపోతారు. 

మారడమూ కాదు. అసలు మీరెప్పుడూ బ్రహ్మం గానే వున్నారు - అని తెలుసుకొంటారు.

కానీ - మీలో వున్న అజ్ఞానపు, మాయ పొరల వల్ల, మీరు ప్రకృతి మాయలో పడి,   ఈ మనుష్యానందాల్లో కొట్టు మిట్టాడుతున్నారు.

ఈ "మన " ఆనందాలు చాలా స్వల్పం; క్షణికం.  కానీ, బ్రహ్మానందం ఏ పొగడ్తకూ అందనంత  గొప్పది; నిరంతరం అయినది 

మన ఈ ఆనందాలు చాలా తక్కువ ఆనందం యిచ్చేవి;  తరువాత అవే - కష్టాలుగా కూడా మారిపోతాయి. బ్రహ్మానందంలో మరి కష్టాలు లేవు గాక లేవు.

మన ఆనందాలకన్నింటికి  మూడు (ఆవ)లక్షణాలు వున్నాయి.

(1) యివన్నీ వస్తాయి. మళ్ళీ వెళ్ళిపోతాయి. మీతో వుండవు. మీరుపోయే చోటికి అవి రావు. మీరు వాటిని,  మీవి అనుకోవచ్చు కానీ - అవేవీ - అవి మీవి అని అనుకోవు. మీ ఇల్లు మీతో బాటు రాదు; తను  మీది అని అనుకోదు. మీ భార్య కూడా - తను మీది అనుకోదు. మీరు తన వాడు అనుకుంటుంది. 

(2) యివి - పూర్తి ఆనందంగా ఎప్పుడూ వుండవు. వచ్చేటప్పుడు, కూడా, వొక దుహ్ఖపు సంచిని తమతో బాటు  తెచ్చుకుంటాయి. దుహ్ఖపు పాలు - పోను,పోను ఎక్కువవుతుంది. మీరు ఇల్లు కొన్నారు. ఆ రోజు బాగుంది. కొనడానికి కష్ట పడాలి. యింటిని శుభ్రంగా పెట్టుకోవడానికి కష్ట పడాలి. మీరు ఎంత కష్ట పడ్డా- అది మీరు వుం డమన్నట్టు గా మాత్రం వుండదు. ఎక్కడో, ఏదో, చెడిపోతూ వుంటుంది. కష్ట సుఖాలు కలిసే వస్తాయి. వొక్కో సారి వోక్కోటి  దర్శనమిస్తుంది. అంతే. అందమైన, ఆరోగ్యవంతమైన, యౌవన వతి అయిన  భార్య అలాగే వుండి  పోతుందా?  వుండదు. ఆవిడకూ రోగాలు వస్తాయి.అందమూ పోతుంది.   యౌవనమూ  పోతుంది.   వొక వేళ,  ఆవిడ  ఏమీ మారక - అలాగే వుందనుకోండి. కానీ మీరు మారుతారు. అప్పుడూ మీకు చాలా పెద్ద సమస్యే కదా.

(3) ఆనందం ఏది వచ్చినా - అది మీకు వొక "బంధం" గా కూడా మారుతుంది. ప్రతి వొక్కటీ మీలో వొక అలవాటు సృష్టిస్తుంది. మీరు తాగే కాఫీ వొక అలవాటు. మీ భార్య మీకు వొక అలవాటు. ఆమెకు మీరు వొక అలవాటు. సిగరెట్టూ, మత్తు పానీయాలూ -అయితే  మరీ ఘోరం. వాటిని వదిలించుకోవడం కష్టం.-అంటే  అవి మీకు అలవాటు మాత్రమే కాదు. వాటికి మీరూ అలవాటే. అవి మిమ్మల్ని వదిలిపెట్టవు.  

యిలా మూడు రకాల అవగుణాలున్నాయి ప్రతి ఆనందానికీ . 

మొదటిది -   వస్తాయి,పోతాయి. ఏదీ శాశ్వతం కాదు.

రెండోది    -   వచ్చేటప్పుడే , కష్టాన్నీ మూటగా కట్టుకునే వస్తాయి.అది లేకుండా వచ్చే సుఖమే లేదు. 

మూడోది  -   మిమ్మల్ని, తనకు బందీగా చేసుకుంటుంది. మీకు రకరకాల బంధాలు కలుగ చేస్తుంది.

ఎంత గొప్ప మనుష్యానందమైనా - ఏదీ, ఈ మూడు అవగుణాలు లేనిది ప్రపంచం లో లేదు.

బ్రహ్మానందానికి -ఏ అవగుణమూ లేదు. అందుకనే దాన్ని - సత్యం .జ్ఞానం, అనంతం అన్నారు.

సరే. దీన్ని నేర్పగలిగే గురువు ఎక్కడున్నాడో మనకు తెలీదాయె.  ఇప్పుడెలా?

మీరు కొన్ని పనులు చేస్తూ పోతే - మీ గురువే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినా రావచ్చు.

ముఖ్యంగా - బ్రహ్మ జ్ఞానానికి - వొక అర్హత ఏదంటే  - ప్రతి వొక్కరి లోనూ - మిమ్మల్ని మీరు చూడగలరా.మీలో, ఆ ప్రతి వొక్కర్ని చూడగలరా.

అంటే - సర్వ మానవ సమానత్వం. 

చుట్టూ వున్న వారందరూ మీ వారే - నిజానికి మీరే అన్న భావన మీలో కలగాలి.

మీరు మీకు ఏమేం చేసుకుంటారో,  అవన్నీ మీ  చుట్టూ వున్న వారికి చెయ్య గలరా. 

యిది లేకుండా - బ్రహ్మ జ్ఞానం లేదు గాక లేదు.

కేవలం మానవులే కాదు - పశు,పక్ష్యాదులలో కూడా మిమ్మల్ని మీరు చూసుకోవాలి..

- అన్నిటినీ విడిచి పెట్టేసెయ్యడం వైరాగ్యం అనుకోవాల్సిన పని లేదు. అన్నిటినీ - నాలాగే చూసుకుంటాననడం  కూడా వైరాగ్యమే 

"అన్నీ -నాదే" అని  కాదు.

"అన్నీ నేనే".- అన్న మాట  

నిజానికి, మనలో ఎక్కడో ఈ భావన కదిలి - మన వారు కాని వారికి - మన జాతి వారు కాని వారికి, అసలెవరూ లేని వారికి - మనం సహాయం చేస్తే - మనలో - ఆ బ్రహ్మము - కొద్దిగా కదులుతుంది.

అలాంటి సందర్భాల్లో బ్రహ్మజ్ఞానం తాలూకు వాసనలు మనలో వెల్లి విరుస్తాయి.

మామూలు సుఖాలలో లేని - ఆ ఆనందం అనుభవించండి.  

నన్ను ముట్టుకోకు, నన్నుముట్టుకోకు - అనే వారికి - యిది ఎన్న జన్మలైనా కావొచ్చు.

యిదే ఆది శంకరాచార్యులూ చెప్పారు. అదీ మహా శివుడి సందేశంగా  చెప్పారు .

రమణ మహర్షి, రామకృష్ణులు, గాంధీ గారు - యిదే సందేశం తమ జీవితాల ద్వారా చెప్పారు. రమణుల వారి జీవితంలో - ఈ సర్వ మానవ సమానత్వం ఎంతగా పాటించారో చదివితే ఆశ్చర్యం వేస్తుంది. రామ కృష్ణులూ అంతే. గాంధీ గారు కూడా అంతే.
మీ మొట్ట మొదటి ప్రయత్నంగా - నెలలో వొక రోజు, ఏదైనా అనాథ శరణాలయం వెళ్ళిపొండి. అక్కడున్న పిల్లలకు మీరు ఏమేం చెయ్య గలరో చెయ్యండి. అక్కడ వున్నప్పుడు, మిగతా ప్రపంచాన్ని మరచి పొండి. ఆ పిల్లలో, పెద్దలో వారే మీ వారుగా వుండండి .  మీ మొదటి -ప్రయత్నంలోనే  మీకు ఎంతో ఆనందం కలగొచ్చు.

రెండు, మూడు నెలలలో - మీలో బ్రహ్మానందపు తాలూకు చాయలు కలగక మానవు. ఆ ఆనందం మిగతా సుఖాలకంటే - ఎంతో గొప్ప అని మీరూ వొప్పుకుంటారు.

ఆ తరువాత అక్కడి నుండి ముందుకు వెళ్ళచ్చు.

= మీ 

వుప్పలధడియం విజయమోహన్ 

  

     










30, నవంబర్ 2012, శుక్రవారం

ఉపనిషత్తులలో - యింత గొప్ప సామాజిక న్యాయం మనం తీసుకు రాగలమా? - అన్నం న నింద్యాత్ - అతిథి దేవో భవ - ఆకలి లేని రాజ్యం -


ఉపనిషత్తులలోని సామాజిక న్యాయం 



ఉపనిషత్తులు మన వేదవాంగ్మయం లోని అంతర్గత భాగాలు.అవి ఎప్పుడు రాయ బడ్డాయో ఎవరికీ తెలీదు. పది వేల సంవత్సరాలూ వుండొచ్చు. పది లక్షల సంవత్సరాలూ వుండొచ్చు. అవి ఎప్పటివో?

కృష్ణుడు పుట్టడానికి ముందటివి. రాముడు పుట్టడానికి ముందటివి. అంతకు ముందు ఎవరెవరు వున్నారో ఎలా వున్నారో - ఉపనిషత్తుల నుండి కొద్దిగా మనకు తెలుస్తుంది.  

ఉపనిషత్తుల పని - అప్పటి చరిత్ర , అప్పటి సమాజం గురించి చెప్పడం కానే కాదు.

 మనం చూస్తున్నది నిజమా, దీనిని మించిన నిజం మరేదైనా వుందా - అన్న దానిపై విస్త్మృతమైన  పరిశోధన  చేశారు అప్పటి ఋషులు. అప్పట్లో - వారు ఋషులు మాత్రం కాదు;మహా దూర దృష్టి  గల, సత్య వాక్పరిపాలకులైన వైజ్ఞానిక పరిశోధకులు  కూడా .

ఏది సత్యం, ఏది సత్యం - అని సత్య సాధనకై, సత్య శోధనకై , సత్య సాక్షాత్కారానికై తమ జీవితాలను,  ధారపోసిన మహానుభావులు.  

వారు చెప్పిన ఉపనిషత్తులు  మనం చదవక పోతే - మన జీవితాన్నే మనం వ్యర్థం చేసినట్టు - అన్న  విషయం - 60 ఏళ్ళ వయసు తర్వాతనే  నాకు తెలిసి వచ్చింది. రిటైర్ అయిన తర్వాత - స్వామి పరమార్థానంద గారి క్లాసులకు వెళ్లాను. మరెంతో మంది ప్రవచనాలు వింటూ వచ్చాను.

అవి మొదట పెద్దగా రుచించలేదనే మాట వాస్తవం. కానీ వాట్లో వున్న గొప్ప గొప్ప వాస్తవాలు  అర్థమయ్యే కొద్దీ - నా  మెదడు -లోని అవాస్తవికత  మెల్ల మెల్ల గా దూరం అవుతూ వుంది.

వారి  ఆలోచనా పటుత్వం -    ఎన్ని వేల, లక్షల సంవత్సరాల నాటిదైనా - యిప్పటి కంటే  చాలా గొప్పది అనడంలో - నాకు మాత్రం సందేహం లేదు.

వాటిలో న్యాయం వుంది. ధర్మం వుంది. మనం ఈ నాడు మాట్లాడే సామాజిక న్యాయమూ వుంది. అవే, మరో లక్ష సంవత్సరాలైనా, మన పరిస్థితులు ఎలా మారినా - ఎప్పుడూ నిలకడగా నిలువ గలిగేవి.

యిప్పుడు మనం మాట్లాడే న్యాయాలు - చాలా, చాలా పేలవమైనవి;    కొన్ని - సంవత్సరాల్లోనే  ఈ నాటి న్యాయాలు - రేపటి అన్యాయాలుగా మారేవి. నిజానికి న్యాయానికై  మనం చేసుకున్న ఎన్నో చట్టాలు, ఇప్పటికే - అన్యాయాలకు  నిలయమై పోయాయి. చాలా చట్టాలలో - న్యాయం జరగడం లేదనేది వాస్తవమైన విషయం. 

అంతే కాదు. ఏ వొ క్కరికీ - నిజమైన సంతోషాన్ని, న్యాయాన్ని  చేకూర్చ లేనివి - మనం ఈ రోజు పెట్టుకుంటున్న ఈ నాటి న్యాయాలు, చట్టాలు .

వీటితో పోల్చి చూస్తే - ఉపనిషత్తుల నాటి న్యాయాలు - ఎంతో బాగున్నాయి.

అందుకు కొన్ని ఉదాహరణాలు మాత్రమే -యిక ముందు, కొన్ని వ్యాసాల్లో,  మీ ముందు వుంచుతున్నాను.

ఇవేవీ చట్టాలు కాదు. యివి,సరాసరి మనుషులైన మనం పాటించ వలసిన కనీస నియమాలు.

కొన్ని నియమాలు , మనిషి, మహా మనీషిగా మారాలంటే పనికొచ్చేవి. మరి కొన్ని మనమే దేవుడు గా మారాలంటే - పనికొచ్చేవి. 

యిప్పుడు మొదట తైత్తిరీయ ఉపనిషత్తు లోని కొన్ని సూత్రాలు నియమాలు, సందేహాలకు సమాధానాలు - యివి మీ ముందుంచుతున్నాను. 

1. అన్నం న నింద్యాత్  . తద్ వ్రతం. (తై .ఉ. 3.7). 


    మనం ఆహారాన్ని ఎప్పుడూ నిందించరాదు  - అనేది వొక వ్రతం. అన్నాన్ని నిందించని వాడే - బ్రహ్మజ్ఞానానికి    అర్హుడు. అటువంటి వాడికే - పుష్కలంగా - అన్నం కూడా యివ్వ బడుతుంది. అన్నాన్ని నిందించే వాడికి - సరైన ఆహారమూ దొరకదు. అది పుష్కలంగానూ యివ్వ బడదు యిచ్చినా, అతడు, ఆ ఆహారాన్ని తినలేని పరిస్థితుల్లో వుంటాడు - యిలా ఎన్నో చోట్ల ఉపనిషత్తులలో చెప్పబడింది.  యిక్కడ - అన్నము, లేదా ఆహారము అంటే - మనం అనుభవించే అన్నిటినీ - అని కలిపి చెప్పుకోవచ్చు.

నిందించడమంటే - తిట్టడం మాత్రమే  కాదు. తట్ట లోనో, ఆకులోనో వేసుకున్న ఆహారాన్ని, ఎవరిపైననో కోపం తో  విసిరి వేయడం, చేసిన వారినో, వండిన వారినో తిట్టడం కూడా యిందులోకే వస్తుంది. - మనలో కొంత మంది ఇలాంటివి ఎన్నో చేస్తాము. యిది బాగు లేదు, అది బాగు లేదు - అనడం కూడా పనికి రాదు. యివన్నీ చేయ రాదు. దీని తరువాత మరి కొన్ని వస్తాయి. అవీ చదవండి.

2.అన్నం పరిచక్షీత.   తద్ వ్రతం. (తై .ఉ. 3.8). 


అన్నాన్ని నిరసన  భావంతో ఎప్పుడూ, నిరాకరింప కూడదు. యిది కూడా వొక వ్రతం. వ్రతం అంటే ఏమిటి?  నమ్మకంతో, భక్తితో పాటించ వలసిన నియమం. అన్నం పట్ల పూర్తి సద్భావం వుండాలి  వీళ్లిచ్చారనో, వాళ్లిచ్చారనో -  బాగున్న అన్నాన్ని తృణీకరించ రాదు.


ఈ మొదటి రెండూ - తీసుకుని తినే అతిథికి చెప్ప బడింది. అంతే కాదు. యింట్లో సాధారణంగా గృహిణి  వండి వడ్డిస్తుంది. మిగతా వారు తింటారు ఆ తినే వాళ్లకు అందరికీ యిది తప్ప కుండా వర్తిస్తుంది. వండిన వాళ్లనో, వడ్డించే వాళ్లనో, తినే ఆహారాన్నో -తినే వారు తప్పు పట్ట కూడదు. కృతజ్ఞతా భావం వుండాలి. అది వుపనిషద్  వాక్యం. యిది జీవితాంతం పాటించ వలసిన వ్రతం.   

ఈ క్రింద వచ్చే సూత్రాలు - అన్నాన్ని  సంపాదించే వారికి, చేసే వారికి, వడ్డించే వారికి వర్తించే నియమాలు, వ్రతాలు.

3. అన్నం బహుకుర్వీత . తద్ వ్రతం .  (తై .ఉ. 3.9). 


అన్నాన్ని ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా  సంపాదించాలి . యిది కూడా వొక వ్రతం. అన్నం - అంటే - మనం నిత్యం ఉపయోగించే వస్తువులు కూడా - అని తెలుసుకోవాలి. అంటే- మనుషులకు ఉపయోగ పడే అన్ని వస్తువులు సంపాదించాలి. ఎందుకు మన అవసరాలకు మించి సంపాదించాలి?  ఈ ప్రశ్న  మన మనస్సులో తప్పక వస్తుంది .


ఎందుకు?

దీనికి సమాధానం, దీని తరువాత చాలా రకాలుగా నిర్దిష్టంగా  యివ్వ బడింది. పూర్తిగా చదవండి. మనం  గమనించ వలసిన  ముఖ్య విషయం ఏమిటంటే   -  "ఎక్కువ సంపాదించడం " - తప్పు  అని మన వారు అనలేదు. ధార్మికంగా  ఎంతైనా  సంపాదించండి. తప్పు లేదు.  

4. న కంచన వసతౌ ప్రత్యా చక్షీత . తద్ వ్రతం. తస్మాత్ యయాకయా చ విధయా - అన్నం - ప్రాప్నుయాత్ (తై .ఉ .3.10.)


ఆశ్రయాన్ని కోరి మీ యింటికి ఎవరైనా వస్తే - అటువంటి అతిథిని - ఎవరిని కానీ - లేదు, అని చెప్పి, తిప్పి పంప రాదు .  యిది కూడా వొక వ్రతం.    వారికి కావలసినవన్నీ - ఎంత వీలైతే అంత, ఎన్ని రకాలు గా నైనా సంపాదించాలి . అంటే  అన్నీ ధర్మ బద్ధమైన మార్గాలలోనే. చూశారా ! అతిథుల కోసం, అవసరం ఉన్నవారి కోసం, అడిగే వారి కోసం, లేని వారి కోసం - మీరు (ఎంత ఎక్కువైనా)  సంపాదించాలనే  - ఉపనిషత్తు కూడా చెబుతోంది. 

యిది వ్రతం అన్నారు

 కానీ, నిజానికి,  అన్నం,ఆస్తి లాంటివి - సంపాదించడంలో నిజమైన ఆనందం లేదు. యివి, ఏ విధంగా, మనం ఉపయోగిస్తామో, ఎవరి కోసం ఉపయోగిస్తామో - అందులోనే ఆనందం వుంది. యిది తెలియనంత వరకు - - జీవితంలో తృప్తి  నివ్వని, సుఖాలు వుంటాయేమో కాని , తృప్తి నిచ్చే ఆనందం మాత్రం అనుభవం లోకి రాదు.    

తెలుగులో మనకు తెలిసిన పద్యం వొకటి వుంది :

దానము, భోగము, నాశము, పరగంగా మూడు గతులె  భువి ధనమునకున్, దానము, భోగము నెరుగని దీనుని ధనమునకు, గతి తృతీయమే సుమ్మీ.  

దానము మొదటి  ,ఉత్తమమైన ఉపయోగం. యిక్కడ ధనం అన్న మాట, అన్నిరకాల ధనానికీ, అంటే, అన్నంతో బాటు అన్నిటికీ చేర్చి  - వాడబడింది. కాబట్టి, ఆస్తి, ధనము, అన్నము అన్నీ అని చెప్పొచ్చు. వీటికి మొదటి, శ్రేష్టమైన ఉపయోగం - దానమే. దాని తరువాత, దాన్ని మనమూ  భోగించ వచ్చు. సంతోషం పొందచ్చు. తప్పు లేదు. యివి రెండూ లేని మనిషి ధనం - ఎందుకూ పనికి రానిదౌతుంది. యిది మనం జ్ఞాపకం పెట్టుకో వాల్సిన విషయం. అక్షర సత్యం.  

5.    అరాధ్యస్మా అన్నమిత్యా ( అస్మై అన్నం అరాథి యితి), ఆ చక్షతే  (తై .ఉ .3.10.)


అతిథి  వస్తే - ఆహారం సిద్ధం గా వుంది, రండి భోంచెయ్యండి  - అనాలి. అంతే గాని లేదు, పోండి అనరాదు


చూడండి. మన పూర్వీకులు, అతిథి, అభ్యాగతులకు మనం చేయ వలసిన మర్యాదల గురించి ఎంత వివరం గా చెబుతున్నారో.  లేదనే పద్ధతి - మన సంస్కృతిలో లేదు. యిది ఎప్పటిది? ఉపనిషత్తు పుట్టిన కాలం నాటిది. ఈ -సంస్కృతి నా మనం కించ పరిచేది?  ఈ పద్ధతుల నుండి మనం ఎప్పుడు మారామంటే  - తురుష్కుల దండయాత్రలతో  సగం పైగా మారాము. ఆంగ్లేయుల   దండయాత్రలతో పూర్తిగా మారాము. లార్డ్ మెకాలే  అనే ఆంగ్ల ప్రభువు ఆంగ్ల పరిపాలకులకు యిచ్చిన సలహా యిదే . వీరి సంస్కృతిని నాశనం చేస్తే తప్ప, వీరి దయాగుణాన్ని నాశనం చేస్తే తప్ప - మనం వీరిని పరిపాలించడం అసంభవం అన్నాడు .అదే చేశారు కూడా. వొకరిపై, మరొకరికి వున్న మర్యాదను , నమ్మకాన్ని పోగొట్టడానికి. అతిథి మర్యాదలను పూర్తిగా పోగొట్టడానికి - ఎన్నో రకాల  పన్నాగాలు పన్నారు మనమూ అందులో పడ్డాము.

6.ఏతత్ ద్వై ముఖతోన్నగుం రాద్ధం; ముఖతోస్మా అన్నగుం రాధ్యతే  (తై .ఉ .3.10.)


- ఎవరైతే సిద్ధముగా వున్న అటువంటి అన్నమును ప్రసన్నతా భావం తోనూ శ్రద్ధ తోనూ అతిథికి యిస్తున్నాడో - అతనికి, అదే ప్రసన్నతా భావం తోనూ శ్రద్ధ తోనూ, అన్నం (అంటే - అన్నము, ఆస్తి, లాంటివన్నీ) తప్పకుండా ఇవ్వబడతాయి. దయా గుణం, దాన గుణం వున్న వానికి లోటు లేకుండా వచ్చి చేరుతుందని భావం.  

ఎవరిస్తారు  అతనికి ?  ప్రకృతిలోని సర్వ శక్తులూ, పరమాత్మా - అతని పట్ల కృతజ్ఞులై వుంటారు; వారు, ఎన్నో రకాలుగా అతనికి యివ్వడానికి ప్రయత్నిస్తారు అని - ఎన్నో శాస్త్రాలలో చెప్ప బడింది.  

ఈ మధ్య , యిదే విషయాన్ని - పాశ్చాత్య దేశాలలో  -లా ఆఫ్ అట్రాక్షన్ -అని అనేక రకాలుగా చెబుతున్నారు. మనం చేసే గొప్ప పనులకు, మంచి పనులకు, నిస్స్వార్థ  సేవలకు -  ప్రకృతి తోడుగా వుంటుందనేది  - యిప్పుడు వారు చెబుతున్న విషయం. అది తప్పు కాదు. నిజమే. అయితే  ఈ విషయం, మన వారికి, లక్షల సంవత్సరాలకు పూర్వమే బాగా తెలుసు. యిది, మన సంస్కృతి  లో ముఖ్యమైన భాగం. మనం పోగొట్టుకో కూడని భాగం.   యిక ముందు ఏం చెబుతుందో చూడండి.


7. ఏతద్వై మధ్యతోన్నగుం  రాద్ధం;  మధ్యతోస్మా అన్నగుం రాధ్యతే  (తై .ఉ .3.10.)


- ఎవరైతే సిద్ధముగా వున్న అటువంటి అన్నమును రాజసిక భావం తోనూ కాస్త అశ్రద్ధ , ఆలస్యం తోనూ అతిథికి యిస్తున్నాడో - అతనికి, అదే రకమైన భావం తోనూ అశ్రద్ధ తోనూ, ఆలస్యంగానూ అన్నం (అంటే - అన్నము, ఆస్తి, లాంటివన్నీ) తప్పకుండా ఇవ్వబడుతుంది. ప్రకృతి వారికీ వారిలోని గుణాన్నిబట్టే యిస్తుంది.

వొక్కో సారి - మన పూర్వజన్మ నుండి వచ్చిన సంచిత కర్మ కాస్త ఎక్కువగా వుంటే - యిప్పటి ఫలితం, అప్పటి సంచిత కర్మ ఫలంగా మొదట వచ్చేస్తుంది. ఆ తర్వాత , యిప్పటి కర్మ యొక్క ఫలితం మొదలవుతుంది. అందు వలన - యిప్పుడు అనుభవించే ఫలం, యిప్పటిదే అనుకునే ప్రమాదం వొక్కో సారి వుంటుంది. 

దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, చేసిన వారు, కొన్ని సంవత్సరాలు కేసు కూడా లేకుండా కులకడము యిందుకే. కానీ, యిప్పుడు చేస్తున్న పనికి ఫలితం - దాని తర్వాత తప్పక వచ్చేస్తుంది. అరె. యిదేమిటి. యింత అన్యాయాలు చేసే వారికే దేవుడు యిలా ఇస్తున్నాడే -అని  మనం వొక్కో సారి అనుకోవడము - ఆ, దేవుడేం చేస్తాడులే. అంతా నా చేతుల్లోనే వుంది - అని కొంత మంది లంచగొండులు, దోపిడీ గాళ్ళు అనుకోవడం   మనం చూస్తూనే వున్నాం కదా .

అటువంటి వారికి - కాస్త ఆలస్యంగా - శిక్ష పడి, న్యాయం జరగడమూ జరుగుతోంది కదా. యివన్నీ గీత లో కూడా రాయ బడింది.  యిది ఉపనిషత్తుల నాటి నుండి వుంది. మనిషి పుట్టిన నాటి నుండీ వుంది.


8. ఏతద్వై అంతతోన్నగుం  రాద్ధం;  అంతతోస్మా అన్నగుం రాధ్యతే. ఏ ఏవం వేదా .  (తై .ఉ .3.10.)


   
 ఎవరైతే సిద్ధముగా వున్న అటువంటి అన్నమును తామసిక భావం తోనూ, చాలా అశ్రద్ధ , చాలా ఆలస్యం తోనూ అతిథికి యిస్తున్నాడో - అతనికి, అదే రకమైన భావం తోనూ అశ్రద్ధ తోనూ, ఆలస్యంగానూ, అన్నం (అంటే - అన్నము, ఆస్తి, లాంటివన్నీ) యివ్వ బడుతుంది . ప్రకృతి, తామసిక గుణం వున్న వారికీ, వారిలోని గుణాన్నిబట్టే యిస్తుంది. యిది మనం బాగా తెలుసుకొని, అర్థం చేసుకుని వ్యవహరించాలి.

సరే. అసలు అన్నం దానమే చెయ్యని వానికి ఎలాంటి ఫలితం లభిస్తుంది. దీనికి, రామాయణం లోనూ, మరెన్నో పురాణాలలోనూ,  ఎంతో వివరణ వుంది. వొక గొప్ప రాజు, ఏన్నో మంచి కార్యాలు చేసాడు గాని - అన్న దానం చెయ్య లేదట . అందుకని, ఆయన బ్రహ్మ లోకానికెళ్ళినా, ఆయన ఆకలి మాత్రం తీరలేదట. తరువాత ఎప్పుడో, అగస్త్య మహాముని దయ వలన ఆయన ఆకలి బాధ తీరుతుంది. ఇలాంటి కథలెన్నో వున్నాయి మన సంస్కృతిలో.

అన్ని దానాల లోకి - అన్న దానం గొప్ప అని అందుకే అన్నారు.

చేసుకున్న వాడికి చేసుకున్నంత -అన్న సామెత వుంది కదా. అలాగే అన్ని దానముల లోకి , అన్న దానం గొప్ప - అన్న సామెత కూడా వుంది.

యిక్కడ మరొక ముఖ్యమైన అంశం మనము మరిచి పోకూడదు. 

అతిథికి మనమేదో, గొప్ప దానం చేసేస్తున్నాం - మనం లేకుండా అతనికి ఆకలి కూడా తీరదు. మనపై అతడు ఆధారపడి - వున్నాడు అనే భావనతో చేసే దానం చాలా వరకు వ్యర్థం అయిపోతుంది.  మనపై అతడు ఆధారపడడం కాదు. అతడు, మనకు పరమాత్మ యిచ్చిన గొప్ప అవకాశం, గొప్ప వరం  అని భావించి , "అతిథి దేవో భవ " అన్న భావంతోనే - అతనికి అన్నం పెట్టడం, తదితర సత్కారాలు చెయ్యాలి .

ఇలాంటి సమాజంలో ఎవరికి ఆకలి దప్పులు వుంటాయి చెప్పండి. దేశంలో ఎవరికి ఆకలి తీరకున్నా - అక్కడి రాజు నిద్ర పొయ్యే వాడు కాదు. రామ రాజ్యం అంటే - ఎక్కడా ఆకలి అన్నది లేని రాజ్యం.  



కొన్ని ఉదాహరణలు చూద్దాం.


1. శబరి రాముడికి తాను  కాస్తా కొరికి, బాగుంది అనుకొన్న దానినే  తినడానికి యిచ్చింది. ఆ అమాయకురాలి అతిథి సత్కారం ఎలాంటిది?

2. కృష్ణుడు హస్తినాపురానికి వెళ్లి - ఎవరి ఆతిథ్యం స్వీకరించాడు? విదురుడు సంజయుడు యిండ్లకు వెళ్ళాడు. అహంకారంతో పిలిచిన ఏ పెద్ద కులాల వాళ్ళ యిండ్లకూ వెళ్ళలేదు. అలాగే దరిద్ర భక్తుడైన కుచేలుడి వద్ద వున్నసత్తు పిండిని బ్రహ్మానందం తో తిన్నాడు కదా. ఎవరు యిస్తారన్నది, ఏం యిస్తారన్నది కాదు,  ఏ  భావంతో యిస్తారన్నది చాలా, చాలా, ముఖ్యం.

3. శంకరాచార్యులు - భిక్షాం దేహి అన్నప్పుడు, అయ్యో , తన దగ్గర ఏమీ లేదే అని కుమిలిపోతున్న గృహిణి  వద్ద, వొక్క మెతుకు తిని, కనక ధారా స్తోత్రం ద్వారా దేవిని అర్చించి - ఆమె యింట కనక వర్షం కురిపించాడు కదా.

ఇలాంటి ఎన్నో సంఘటనలు మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, కావ్యాలు లో కోకొల్లలుగా వున్నాయి.

అదే - మన  ఉపనిషత్తులలోని సామాజిక న్యాయం. పెట్టే వాడు అన్నం మాత్రం పెట్టడు. అతిథిని - దేవుడి లాగా సత్కరిస్తాడు.  అలాంటి - రాజ్యంలో అందరూ పెట్టే వాళ్ళే . తినే వాళ్ళ కోసం మీరు వెతకాలి. కుల, మత జాతి భేదాలు లేకుండా - అన్న దానం , అతిథి సత్కారం చెయ్యాలి. అదీ వుంది మన శాస్త్రాలలో.

నాకు తెలిసి, మా చిన్న  తనంలో, అప్పటి పెద్ద వారు చాలా మంది యిలా వుండడం నేను చూశాను.   


మనమందరూ - యిలా వుండాలి మరి. వుందామా?

=మీ 

వుప్పలధడియం విజయమోహన్ 

 



26, నవంబర్ 2012, సోమవారం

సత్యమేవ జయతే - సత్యానికి సాక్ష్యాలు ముఖ్యం - మూడు రకాల సత్యాలు - అబద్ధం - ఏమిటి? ఎక్కడుంది?

సత్యమేవ జయతే 



సత్యమేవ జయతే -అన్నది మన అశోక చిహ్నంలో రాసి పెట్టుకుని - మర్చిపోయాం. 

కళ్ళకు  అద్దాలు పెట్టుకుని కళ్ళద్దాలు వెదికే లాగ - యిప్పుడు సత్యం కోసం అందరూ వెదుకుతున్నారు.

మరి - ఘనత వహించిన కోర్టు వారు సాక్ష్యాధారాలు పరిశీలించి - వారికి తోచింది చెబితే అది సత్యం క్రింద చెలామణి అవుతుంది. దానిపై అప్పీలుకు వెళ్ళచ్చు. చాలా కోర్టులు పెట్టుకున్నాము మనం. ఏదో వొక చోట అసలు సత్యం యిదే - అని ఎవరో చెబుతారు. దానిపై యిక అప్పీలు వుండదు.

సత్యానికి సాక్ష్యాలు ముఖ్యం.

మొన్నటి నాడు మాయింట్లో ఏం కూరలు వండారో నాకు గుర్తుండదు. కానీ కోర్టుల్లో -పదేళ్ళ నాడు - ఆరోజు - రాత్రి మీరు ఎన్ని గంటలా ఎన్ని నిముషాలకు అక్కడ వున్నారు, ఏం చూశారు, అసలేం జరిగింది -అని లాయర్లు అడగడమూ, చూశాము, అన్న వాళ్ళు గడగడా తడుముకోకుండా పూస గ్రుచ్చినట్టు, ఏదో చెప్పడము, దానిపై ఆధార పడి  జడ్జీ గారు తమ తీర్పు మరో అయిదేళ్ళలో చెప్పడమూ - అప్పుడు, యిదీ నిజం అని మనం అనుకోవడము - జరుగుతోంది.

అబ్బా, ఈ కోర్టులకెళ్ళే వారందిరికీ, యింత జ్ఞాపక శక్తి ఎలా వస్తూ వుందో?

నాకైతే - పది వాక్యాలు చదివి - వాటిని వొప్ప జెప్పాలంటే  - రోజూ పది సార్లు చదివితేనే - గానీ  చెప్పలేను. అయినా స్కూల్లో ఫస్టు , సెకండు వచ్చే వాణ్ని. అరవై మూడేళ్ళ వయసు తరువాత  ఈ మధ్య -నేషనల్ స్టాక్  ఎక్స్చేంజ్  వారు నిర్వహించే పరీక్షలు రాసి 11 పరీక్షల్లో 85 శాతం పైగా వచ్చి - యెన్.ఎస్.ఈ. సర్టిఫయ్డ్ మార్కెటింగ్ ప్రొఫెషనల్ -లెవల్.5. అని సర్టిఫికేట్ కూడా తీసుకున్నా. అయినా, అక్కడా అంతే. మళ్ళీ - మళ్ళీ -చదివేతేనే గానీ - ఏదీ పెద్దగా గుర్తుండి చావవు.    

అందుకే నాకు పెద్ద ఆశ్చర్యం. ఈ కోర్టులకెళ్ళే వారందిరికీ, యింత జ్ఞాపక శక్తి ఎలా వస్తూ వుందో?

ఏక సంథా గ్రాహులున్నారు. కానీ, వారు కూడా, నాకు తెలిసినంత వరకూ, విన్నది మాత్రం చెప్పగలరు. చూసినవన్నీ మాత్రం కాదు. మీరు వున్న గదిలో (లేదా యింట్లో) - మీరు పదేళ్లుగా వున్నారనుకోండి. యిప్పుడు, మిమ్మల్ని, ఎవరైనా - మీ గదిలో ఉన్నవన్నీ సరిగ్గా, పూస గ్రుచ్చినట్టు చెప్పమంటే - మీరు చెప్పలేరు. చాలా తప్పులు చెబుతారు. మీ గదే మీకు తెలీదు. వూర్లో జరిగే విషయాలు మీకెలా తెలుస్తాయి.

అందుకే నాకు పెద్ద ఆశ్చర్యం. ఈ కోర్టులకెళ్ళే వారందిరికీ, యింత జ్ఞాపక శక్తి ఎలా వస్తూ వుందో?

అంత దూరం వద్దు. ఇప్పటికిప్పుడు, మీరు - కళ్ళు మూసుకుని - మీ శరీరంలో ఏమేమి ఎలా వుందో - బాగా చెప్పగలరా ? మీరు పడుకుని బాగా రిలాక్స్ అయి తరువాత - చెప్పమంటే మీకు నిజంగా రెండు కాళ్ళు వాటికి పది వేళ్ళు వున్నాయో కూడా -   మీకు తెలీదు.

మీ వెనుక (వీపు) భాగాన్ని మీరు ఎప్పుడు చూసారు? పదేళ్లకు ముందా ? అప్పుడూ చూడ లేదా? నేనూ అంతే.

కానీ, మీరు దారిలో వెళ్ళుతూ వుంటే, చీకట్లో, ఏ ఆక్సిడెంటో, దొంగతనమో జరిగితే - అందులో ఎవరికైనా, మీరు ఏ విధంగా నైనా, సహాయ పడితే -   అప్పుడు, మీరు అన్నీ చూడాలి. కనిపించక పోయినా సరే. అన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి.  అప్పుడెంత టైమో, సెకండ్ల వరకూ మీకు తెలియాలి. డిజిటల్ కెమీరా లో వీడియో తీసినట్టు, మీ మనస్సు అవన్నీ సరిగ్గా రికార్డు చేసుకోవాలి. ఆ కేమీరాలో కూడా - ఫోకస్ వున్న చోటు మాత్రమే వస్తుంది. మిగతావి రావు. కానీ, మీరు మాత్రం ఏదీ మిస్ కాకూడదు. నాకు ఇవేవీ చాత కాదు. కాబట్టి, నేను అటువంటి చోట్లలో వుండనే వుండను. అంటే నేను వున్న చోట - అటువంటివేవీ జరగనే జరగవు.

అందుకే నాకు పెద్ద ఆశ్చర్యం. ఈ కోర్టులకెళ్ళే వారందిరికీ, యింత జ్ఞాపక శక్తి ఎలా వస్తూ వుందో?

యిదంతా మాయా మంత్రాల కథ లాగా వుంటుంది నాకు.

ఏది నిజం? ఏది అబద్ధం? ఏది సత్యం? ఏది అసత్యం ? ఎలా తెలుస్తుంది - మనలాంటి సామాన్యులకు.

మన ప్రాచీనులు, అంటే ఋషులు, సత్యం అన్న దాన్ని రకరకాలుగా తెలియజెప్పారు.

సత్యం - వొక్క భగవంతుడే తప్ప - మరేదీ కాదు అన్నారు. ఆ భగవంతుడికి మరో పేరు పెట్టారు - బ్రహ్మం అని. బ్రహ్మం వొకటే వుంది (లేదా వున్నాడు).మరోటి లేదు - అన్నారు.

మార్పు లేనిది, ఎల్ల వేళలా -వొకే రకంగా వుండేది సత్యం అన్నారు.

బ్రహ్మం అన్న దానికి వొక డెఫనిషన్ యిచ్చారు ;  బ్రహ్మం =  సత్యం = జ్ఞానం = అనంతం 

అంటే - ఇవేవీ వేరు వేరు విషయాలు కాదు, అన్నీ వొక్కటే అని అన్నారు. బ్రహ్మం  అంటే  సత్యం అంటే జ్ఞానం  అంటే అనంతం - అన్న మాట. యిది ఎలా - అని తెలుసుకోవాలంటే ఉపనిషత్తులు చదవాలి. సరే.

బ్రహ్మాన్ని - పారమార్థిక సత్యం అన్నారు. మార్పే లేని సత్యం ఇదొక్కటే. యిది కాక, వేరే రెండు రకాల సత్యాలున్నాయి.

వొకటి - ప్రాతిభాసిక సత్యం. 

మెరిసేదల్లా బంగారం కాదు అంటాము. మెరిసేదాన్లో వొకటి బంగారం. మిగతావి మరేదైనా  కావచ్చు. కానీ, వొక్కో సారి, పసుపు పచ్చగా, రోడ్లో  దుమ్ములో మెరిసిపోతూ వుంటే మరో ఆలోచన లేకుండా తీసి జేబులో వేసుకుంటారు. అవసరంలో చూడరు.  ఎందుకు చూడరంటే  - మనం చేసే  పని మరెవరూ చూడకూడదని. అసలే చీకటి. అమావాస్య కూడా. మీకు అదృష్టమైన రోజు.

యింటికెళ్ళి మీ భార్యకో, భర్తకో చూపిస్తారు. వారి కళ్ళలో భయం కనిపిస్తుంది. అప్పుడు మీరూ చూస్తారు ఏమైందని.

యండమూరి బాణీలో - చెప్పాలంటే  - అప్పుడు తెలిసింది అది చిన్న పాము పిల్లని.

మీరు మీ భార్యని వదిలేసి, పామును పారేసి వీధి లోకి పరుగెత్తారు.

పాము పిల్ల బంగారం లా కనిపించడం ప్రాతిభాసిక సత్యం. మీరు మీ భార్యకు చూపే వరకు, అది సత్యమే. పాము పిల్ల జేబులో ఊగుతూ వుంటే - మీరు ఎంత సంతోషం తో నడిచారు. ఆ సంతోషం నిజం కాదా. అది పచ్చి నిజం.

కట్టెను పాము అనుకోవడం, భయ పడడం - ఈ ప్రాతిభాసిక సత్యానికి ఉదాహరణం గా వేదాంత గ్రంధాలలో చాలా సార్లు చెబుతారు. అది పరవాలేదు. దానికి రివర్స్ గా- పామును కట్టె  అనుకోవడం - దానిపై కాలు పెట్టడం, లేదా, దాని ప్రక్కనే నడవడం  చాలా సార్లు జరిగే విషయమే. అది ప్రమాద కరమైన - ప్రాతిభాసిక సత్యం.

ఏ భ్రమైనా - ప్రాతిభాసిక సత్యం క్రిందనే వస్తుంది. ఎండమావులలో నీళ్ళు వుందనే భ్రమ సహజం గా ఎడారుల్లో కలిగేది. 

మన దేశంలో, వొక పెద్ద భ్రమ వుంది.    నా కష్టాలకన్నిటికీ కారణం, వేరే ఎవరో - నేను మాత్రం కాదు - అనేది పెద్ద భ్రమ. యిది మనలో వున్న ప్రాతిభాసిక సత్యం.

మీ కష్టాలకు కారణం మీరు కాక పోతే - మీ సుఖాలకూ, మీరు కారణం కాలేరు. మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. కష్టే ఫలీ -అన్న సత్యాన్ని గుర్తుంచుకోండి. చెడ్డ అలవాట్లు వదిలి పెట్టండి. మీ సుఖాలకు మీరు కారణం అవుతారు. అప్పుడు తెలుస్తుంది - మీ కష్టాలకూ మీరే కారణం అని. యిది  ప్రాతిభాసిక సత్యం కాదు దీన్ని వ్యావహారిక సత్యం అంటారు.

 అలాగే - పక్క వాడికేవీ కష్టాలు లేవు - అన్నీ నాకే - అనిపిస్తుంది కొందరికి. ఎందుకు నాకే యిలా? అంటూ వుంటారు.అనుకుంటూ వుంటారు. పక్కింటాయనా యిలాగే అనుకుంటూ వుంటాడు. యిది  ప్రాతిభాసిక సత్యం.

అయితే - మగవాళ్ళు మరొకర్ని, వాళ్ళ కష్టాల్ని గురించి పెద్దగా అడగరు.స్వంత గోడు చెప్పుకోరు. మగ వాళ్ళు - కలిస్తే  మన్ మోహన్ సింగును గురించి, ఒబామాను గురించి, తక్కువ లెవెల్ లో మాట్లాడితే - లోకల్ యం.యల్.ఏ. గురించి మాట్లాడుతారు. తమ విషయాల్లో నామోషీ . 

కానీ - ఆడవాళ్ళు చాలా మంది - తమ, తమ విషయాలన్నీ అడిగి, చెప్పి, ఆ తర్వాత  - తెలుసుకున్న దాన్ని , మరో యిద్దరికీ చెప్పి - వొకరి కన్నీళ్లు, మరొకరి కళ్ళలో తుడుస్తూ వుంటారు. అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళ గొప్పా కాదు. 

ద్వాపర యుగంలో  ధర్మ రాజు శాపం పెట్టాడట - ఆడ వాళ్ళ నోట్లో ఏదీ దాగదని. సత్యమేవ జయతే - అక్కడి నుండే - వచ్చింది. అబద్ధం వుంటేనే సత్యం సత్యం 'జయిస్తుంది'.   లేకుంటే - దేనిపై జయిస్తుంది? 

కలల్లో వచ్చేవన్నీ - ఆ కలల వరకు నిజమే కదా. కలల్లో మీరు ఎంతో మందిని చంపుతారు. ఎంతో - మందితో ఏమేమో మాట్లాడుతారు, ఏడుస్తారు నవ్వుతారు. భయపడతారు. ఎన్నెన్నో మాజిక్కులు చేసుకుంటూ పోతారు.  అది మీ కల; మీ సృష్టి . మీరు ఏమైనా చెయ్యొచ్చు. చేస్తారు.  లేచిన తరువాత - అది నిజం కాదు , అప్పటి (కలలోని) ప్రాతిభాసిక సత్యం అని తెలుస్తుంది మీకు .

చాలా మందికి ప్రేమ అనేది, 'ప్రేమ కల' లో ఉన్నంత వరకు చాలా గొప్ప నిజంగా కనిపిస్తుంది. పెళ్ళి (లో నిద్ర లేచిన) తరువాత - అది "ప్రేమ కల" అన్న విషయం మెల్ల మెల్లగా తెలుస్తుంది. అమెరికాలో ప్రేమించి పెళ్లి చేసుకుని -మూడేళ్ళలో డైవర్స్ చేస్తూ వుంటారు. సత్యం తెలియడానికి మూడేళ్ళు కావాలి.   కొందరికి, మూడు రోజులు లేదా మూడు గంటలు కూడా సరిపోతుంది.

మరి ప్రేమ సత్యం కాదా? సత్యమే. ప్రాతిభాసిక సత్యమే. మీరు అందులో నుండి,  నిద్ర లేచే వరకు సత్యమే. మరి అమర ప్రేమలు, ఆజన్మాంత ప్రేమలు లేవా. వున్నాయి. అన్నమయ్య సినిమాలో అన్నట్టు - తెగవవి నీవు తెంచే వరకు .

ప్రాతిభాసిక సత్యం చచ్చే వరకు వుంటే - అది సత్యమా, కాదా. అది అప్పుడేమవుతుంది?

అదే - వ్యావహారిక సత్యం - అంటారు. అది వొక రకంగా జీవితాంతపు భ్రమ.

కోర్టుల్లో చెప్పే తీర్పు -   వ్యావహారిక సత్యం. 

పది మంది జరిగిందన్నారు. యిరవై మంది జరగలేదన్నారు. మరి తీర్పు ఎలా వుంటుంది? యిరవై మంది చెప్పేది సత్యం.

ఈ రోజు కూడా, పాకిస్తానీ లాయర్ గారు వొకరు - అసలు కసాబ్, మీ కాశ్మీరీ టెరరిస్టే  అయి వుంటాడు - మా వాడు కాదన్నాడు.మరి వారి కోర్టు ఏమంటుంది? ఏమీ అనదు. ముంబై లో చచ్చిన వాళ్ళంతా - వాళ్ళను వాళ్ళే -కాల్చుకున్నారు  అని చెప్పినా - మనమేం చెయ్యలేము. అంతా - ప్రాతిభాసిక సత్యమే. 

కానీ - అసలైన నిజం అనేది వొకటి వుంది. అది దేవుడికి తెలుసు. మనకు తెలియక పోవచ్చు.

వ్యావహారిక సత్యం అనేది - మనం మన పంచేంద్రియాలతో చూసి,విని,తాకి, మనసుతో (మెదడుతో) గ్రహించే విషయాలు. 

యిక్కడ చిక్కాల్లా - మనం కళ్ళద్దాలు వేసుకుంటే వొక రకంగా కన్పిస్తుంది. వేసుకోక పోతే మరో రకంగా కనిపిస్తుంది. వినేది రెండు,మూడు సార్లు వింటే కాని,జ్ఞాపకం వుండదు. మన, ఈ యింద్రియాలు  ఏవీ సరైనవి కావు. మన కంటే గ్రద్దకు, చూపు బాగుంది. కుక్కకు, చీమకు వాసనలు ఎక్కువగా తెలుస్తుంది.దోమ కూర్చుంటే తెలీదు. కుడితే తెలుస్తుంది. యిలా, మనకు తెలిసే వ్యావహారిక సత్యం వొక పరిధిలోనే తెలుస్తుంది.

అందుకే న్యాయ స్థానాలలో మనుషుల సాక్ష్యం కన్నా కుక్కల సాక్ష్యం విలువైనది. అవి దొంగలను సరిగ్గా గుర్తు పడతాయట. యివన్నీ వ్యావహారిక సత్యాలు. 

మీ భార్య వ్యావహారిక సత్యం. వొక్కో సారి ప్రాతిభాసిక సత్యంగా మారినా - ఆశ్చర్యం అక్కర లేదు. అలాగే, భర్త కూడా.

యిప్పుడు మనం మూడు రకాల సత్యాలను గురించి - కొద్దిగా చూసాం. 

- మొదటిది పారమార్థిక సత్యం. దాన్ని బ్రహ్మం అన్నాం.అదే నిజమైన సత్యం; నిజమైన జ్ఞానం; నిజమైన అనంతం. దాన్ని గురించి చెప్పాలంటే,వేదాంతం చెప్పాలి. అది మరో సారి, జీవితంలో బాగా విసిగిపోయినప్పుడు -  ఇహ నిజంగా జ్ఞానం వొచ్చేస్తే మేలు అన్నప్పుడు - చెప్పుకుందాం.

-రెండోది ప్రాతిభాసిక సత్యం. నిజంలా కనిపించే భ్రమ. కానీ భ్రమ కూడా అది ఉన్నంత వరకు నిజమే.భ్రమ పడి పోతే- అది నిజం కాదని వెంటనే తెలుస్తుంది.

-మూడోది వ్యావహారిక సత్యం. మీకు రెండు చేతులు వున్నాయి. అది వ్యావహారిక సత్యం. కానీ, అవి నిజానికి మీవి కావు అన్నది పారమార్థిక సత్యం.ఎక్కడినుండో వచ్చాయి. ఎప్పుడో వెళ్ళిపోతాయి.మీరు పుట్టడం పెరగడం, పెళ్లి చేసుకోవడం మీ అవస్థలు మీరు పడడం, సుఖం లో దుహ్ఖాన్ని, దుహ్ఖం లో సుఖాన్ని అనుభవించడం, యివన్నీ వ్యావహారిక సత్యాలే. 

మీ ప్రేమలు ప్రాతిభాసిక సత్యం కావచ్చు. వ్యావహారిక సత్యం కూడా కావచ్చు. మీ గుళ్ళో దేవుడు వ్యావహారిక సత్యం. కానీ పారమార్హ్తిక సత్యం కావాలంటే - మీ గుడి దేవుడు చాలా ఉపయోగ పడతాడు. యిది అర్థం కాని వారు, మీ విగ్రహారాధన తప్పు అంటారు. నిజానికి, మీ పూజలు పునస్కారాలు, వ్రతాలూ, అన్నీ పారమార్థిక సత్యం తెలుసుకోవడానికి గొప్ప మెట్లుగా ఉపయోగ పడతాయి.

నిజానికి స్వర్గం, నరకం రెండూ - వ్యావహారిక సత్యాలే. పారమార్థిక సత్యం కాదు.స్వర్గానికెళ్ళి - నిజంగా మీరు ఏం చేస్తారు, చెప్పండి ? గీత వొకరు, బైబిల్ వొకరు, కొరాన్ వొకరు చదువుతూ కూర్చుంటారా? అసలేం చేయాలని వుంది అక్కడ? అది యిక్కడే చేస్తే పోలా?

సరే.  యివన్నీ వదిలి పెట్టండి. అబద్ధం అంటే - ఏమిటి? అది ఎక్కడుంది?

సృష్టిలో ఎక్కడా అబద్ధం లేదు - వొక్క మనిషి నాలుకపై తప్ప.  సృష్టిలో మరే ప్రాణికీ - అబద్ధం ఆడడం తెలీదు. చెట్లూ పుట్టలూ పాములూ గ్రద్దలూ ఏవీ అబద్ధం ఆడ లేవు.మంచీ చెడూ, నాలుక నుండే వస్తూ వుంది. నాలుక కు మనిషి చిత్తం నుండీ వస్తూ వుంది.

నేను యింట్లో లేనని చెప్పరా - అంటే - నాన్న గారు యింట్లో లేరని చెబుతున్నారు - అని మనమూ పిల్లలూ, అబద్ధాలు చెబుతూ వుంటాము.  

మనం, రోజుకు కనీసం నాలుగు అబద్ధాలు చెబుతామట - సరాసరిగా. అందులో 50 శాతం చెప్పే అబద్ధం - "మేం బాగున్నామండీ" అని. అయితే - అది శుద్ధ అబద్ధం  అని ఆ తరువాత చెప్పే పది వాక్యాలలో - చెప్పేస్తాం.

రాసుకోవడం సత్యమేవ జయతే - కానీ, అది చేయాల్సింది మనం కాదు, ఏ దేవుడో వచ్చి చెయ్యాలి. అదీ మన పంథా.

యిక్కడే వుంది మన వేదాల సారాంశమంతా; వేదాంతపు సారాంశమంతా. 

మన చిత్తంలో, మన నాలుక పైన - అబద్ధం తగ్గే కొద్దీ - అక్కడ బ్రహ్మం సాక్షాత్కరిస్తూ వస్తుంది. మనలో, సత్యం పెరిగే  కొద్దీ, జ్ఞానం పెరుగుతూ పోతుంది. అప్పుడు, అనంతం ఏమిటో తెలుస్తూ వుంటుంది.  

అబద్ధం మనలో, పూర్తిగా పోయిన నాడు, మనకు మోక్షమే. జ్ఞానమే ఆనందమే. ఎక్కడో కాదు - యిక్కడే. బ్రతికి వున్నప్పుడే. 

అందుకే - చాలా మంది నిజమైన స్వాములు - ఎప్పుడూ చిరునవ్వుతో  కనిపిస్తారు. కానీ - మనకు దొంగ స్వాములపైనే వుంటుంది మనసు. మిమ్మలను ఎలెక్షన్ లో గెలిపిస్తాను. మీ శత్రువు వోడి పోయేలా చేస్తాను. మీకు వ్యాపారంలో  లాభం వచ్చేలా చేస్తాను - అనే వాళ్ళంతా - దొంగ స్వాములే. వాళ్ళు చెప్పేది అన్నీ అబద్ధాలే . మీరు అడిగేవి అన్నీ అబద్ధాలు నిజాలు కావాలనే.  ఆ రూట్ లో ఆనందం ఎప్పుడూ వుండదు.

కానీ - రమణ మహర్షి కానీ, శ్రీ శ్రీ రవిశంకర్ కానీ, రామకృష్ణులు కానీ - గాంధీ గారు కానీ - - నవ్వితే అమాయకపు, నిజమైన, స్వచ్చమైన నవ్వులే నవ్వుతారు. వారు మీకు యిచ్చేది - వేరే రకపు ఆనందం. వారి సమక్షంలో - మీకు వచ్చేది - కోరికలే లేని, స్వచ్చమైన మనసు.  అందులో వుండేది అనిర్వచనీయమైన ఆనందం. 

-దాన్నే  బ్రహ్మానందం అంటారు. అంతకు మించిన ఆనందం  ప్రపంచం లో మరొకటి లేదు. 

నిజానికి, ఎప్పుడో వొక సారి, మనం, ఏదైనా వొక గొప్ప నిజం చెప్పిన నాడు, మన మనసులో ఎక్కడో, కాస్సేపు అది ప్రతిఫలిస్తుంది. ఆ ఆనందం - చాలా, చాలా గొప్పది - అనేది మనకు తెలుస్తుంది కూడా.

అది కావాలనుకున్న నాడు -అబద్దాలాడడం - నిలిపేసెయ్యండి.  

సత్యమేవ జయతే.

= మీ 

వుప్పలధడియం విజయమోహన్  


 
  





19, నవంబర్ 2012, సోమవారం

PSORIASIS - GREAT WAYS TO GET RID OF - గొప్ప చిట్కాలు - సోరియాసిస్-యితర చర్మ సమస్యలు


skin Problems- Psoriasis - Good way to get rid of

చిన్న రోగాలు- పెద్ద సమస్యలు - గొప్ప చిట్కాలు 

సోరియాసిస్-యితర చర్మ సమస్యలు 


గత వొక దశాబ్దం గా అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోతున్నాయి.

హృద్రోగ సమస్యలు, ఊపిరి తిత్తుల వ్యాధులు , చక్కెర వ్యాధి, రక్త పోటు లాంటివి ఎన్నో - యిప్పుడు చాలా సాధారణమై పోయాయి.

వీటిలో దేనికీ - అల్లోపతీ వైద్యంలో - సరైన . పూర్తి నయం చేసే మందులే లేవు. పోగొట్టడం కాదు - ఎక్కువ బాధ పెట్టకుండా చేయడం వుండటం మాత్రమే వారు  చేయ గలుగుతున్నారు . దీన్ని వారు రోగాల మేనేజ్మెంట్ -అంటున్నారు 

యివి నయమైతే - వారి మందులకు విక్రయం వుండదు  గనుక వారు - యిదే మంచిది అనుకున్నట్టు    - వొక్కో సారి అనిపిస్తుంది .

హృద్రోగాలు రాకుండా కాపాడే మందులు ఆయుర్వేదంలో ఎన్నో వున్నాయి. అందులో - ప్రశస్తమైనవి "అర్జున" చెట్టు నుండి వచ్చే మందులు. అలాగే ఆశ్వ గంధ ; ఇలాంటి ప్రశ స్తమైన మందులు  చాలా రోగాలు రాకుండా కాపాడతాయి. వచ్చిన రోగాలనూ, క్రమంగా, తగ్గించేస్తాయి.

చదివే వారికి నా విన్నపం ఏమంటే - వీటిని గురించి - మీకు తెలిసిన వారందరికీ చెప్పండి. రోగాలు రాకుండా చూసుకోవచ్చు.

సరే.  కొన్ని వ్యాధులు ప్రాణ హాని చేయవు కానీ. మానసికంగా చాలా బాధ పెడతాయి. అటువంటి వాటిలో - చర్మ రోగాలు ముఖ్యమైనవి. అందులో వొకటి సొరియాసిస్. యిది ఎందుకు వస్తుందో - యిదిమిత్థంగా  ఎవరికీ తెలీదు.

కానీ, మానసిక ఉద్విగ్నత (స్ట్రెస్) అందులో వొక ముఖ్య కారణం. అది కాక, వాతావరణం, అందులోని హెచ్చు తగ్గులు , కాలుష్యం మరొక కారణం. చర్మంలో తగినంత తేమ లేకపోవడం వొక ముఖ్య కారణం.అంటే - డ్రై స్కిన్ -వుంటే  యిది రావడానికి ఎక్కువ అవకాశం వుంటుంది. అంటే - చలి కాలం ; ఏ.సీ లో ఎక్కువ గడపడం యివి కూడా ముఖ్య కారణాలే .

తెల్లవారి 5 గంటల కాలంలో - సూర్యుడి కిరణాల్లో - విటమిన్-డీ. ఎక్కువగా వుంటుంది.అది తగులుతూ వుంటే - చర్మానికి అనేక రకాలుగా మంచిది. చర్మ వ్యాధులు రావు.

అలాగే చర్మం పొడి గా కాకుండా చూసుకోవడం ముఖ్యం. అంటే - అలోవేరా, ఈవియాన్ లాంటి ఆయింట్మెంట్లు ఎక్కువ గా వాడడం వలన చాలా ప్రయోజనం కనిపిస్తుంది . వీటిలో విటమిన్.డీ. కూడా వుండే ఆయింట్మెంట్లు యిప్పుడు ఎన్నో మార్కెట్లో వున్నాయి. అవి చాలా మంచివి.

యివన్నిటితోబాటు - మరో ముఖ్యమైన చిట్కా ఏమిటంటే - పసుపు కలసిన మంచి  ఆయింట్మెంట్లు -ఎన్నో మార్కెట్ లో వున్నాయి. ఉదాహరణకు, వీకో టర్మేరిక్ లాంటివి.  అవి - చర్మ సౌందర్యానికి అని చెబుతున్నారు. కానీ, చర్మ రోగాలకు, ముఖ్యంగా, సోరియాసిస్ కు బాగా పని చేయడం  నేను చూసాను.. సోరియాసిస్ వున్న వారు, యివి అన్నీ వొకే సారి వాడినా తప్పు లేదు. వాడి చూడండి. మీకు చక్కటి ఫలితం కనిపిస్తుంది.

యివి కాక, ఆయుర్వేదాలోనూ ,సిద్ధ వైద్యం లోనూ - చాలా మంచి మందులే వున్నాయి. ఉదాహరణకు - స్వామీ రాందేవ్ గారి వద్ద దొరికే మందులు , తై లాలూ బాగా పని చేస్తాయి. (కాయకల్పవటి తైలము, టాబ్లెట్లు , మహామంజుష్ట టాబ్లెట్లు లాంటివి). వీటన్నిటితో బాటు - టర్మరిక్, ఆలోవేరా  ఆయింట్మెంట్లు (విటమిన్.డీ కలసినవి ) తప్పక వాడండి. 

సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులకు అతి ముఖ్య వైద్యము - వాటిని గురించి వర్రీ కాక పోవడమే. ముఖ్యంగా - అది చర్మపు పైపొరకు మాత్రం వచ్చే వ్యాధి  - చర్మం లోని రెండో  పొరని కూడా అది బాధించదు అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. లోపలి అన్ని అంగాలు బాగా పని చేస్తున్నాయి అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి.

వీటిలో - మనలో వుండే భయము, సిగ్గు మాత్రమే ముఖ్య రోగం కాని - అవి రెండూ వదిలేస్తే - నిజమైన రోగం ఏమీ బాధించదు -అనేది గుర్తుంచుకోవాలి.

నిజానికి - చాలా రోగాలకు మనలోని భయము, సిగ్గు - మిగతా వారు ఏమనుకుంటారో అన్న భావన, ఎవరో ఏదో వొక మాట అంటే దానిని తలుచుకునే బాధ పడటం తప్ప , నిజమైన  బాధ ఏమీ వుండదు. ఈ మనో వ్యధల / బాధల వల్లనే మోకాళ్ళ నొప్పులు , మరో నొప్పులు, మరో వ్యాధులు వస్తూ వుంటాయి.

ప్రాణాయామాలు, ధ్యానము నేర్చుకొని ప్రతి రోజూ ఎంత సేపు వీలైతే అంత సేపు చెయ్యండి.  మీకు తప్పకుండా తగ్గుతుంది. తగ్గుతుందన్న  నమ్మకంతో చెయ్యండి. తగ్గాలనే నిశ్చయంతో చెయ్యండి. నిరాశకు అసలు చోటు ఇవ్వకండి. 

చాలా రోగాలు మనో జనితమైనవి. మనసుతోనే తగ్గించుకోగలిగేవి.

మీ ఆరోగ్యం - మీ చేతుల్లోనే వుందన్న నమ్మకంతో చెయ్యండి. గెలుపు మీదే .

ఈ రోగాలున్న వారికి ప్రక్క నున్న వారు -వీరికి అన్ని రకాలుగా ప్రోత్శాహం యివ్వాలి. ఈ చర్మరోగాలు, ప్రక్క నున్న  వారికి ఎవరికీ రావు. వీలైతే వారికి ఆయింట్మెంట్లు మీరే పుయ్యవచ్చు. అది చాలా మంచిది.

మనకు వచ్చే రోగాలన్నీ పోగలిగేవే. యిది గొప్ప సూత్రం. ప్రతి రోగానికీ మందు వుంది. సగం మందు మనలోనే  వుంది. దాంతోనే పూర్తిగా పోవచ్చు కూడా. సగం మందు బయట వుంది. 

ధైర్యే , సాహసే, ఆరోగ్య లక్ష్మి. (అధైర్యే, భయే, అనారోగ్య ప్రాప్తి).


= మీ 

వుప్పలధడియం విజయమోహన్ 





18, నవంబర్ 2012, ఆదివారం

సేవాలయ - శివాలయ - దేవాలయ - ఎందరో మహానుభావులు - వారికి, నా అభివందనాలు


సేవాలయ -  శివాలయ  - దేవాలయ 

సేవాలయా టీం  లోని వారు -మధ్యలో మురళి -వ్యవస్థాపకుడు 



ఇప్పుడు - నేను వుండే వూరి  పేరు తిరునిన్రవూరు . ఇది తమిళనాడులో చెన్నై - తిరుపతి  జాతీయ రహదారిలో, చెన్నై లో- చిట్టచివర వుంది.

మా వూళ్ళో , వొక బహు పురాతన, చరిత్ర ప్రసిద్ధి గల శివాలయము, మరొక   బహు పురాతన, చరిత్ర ప్రసిద్ధి గల విష్ణు ఆలయము వున్నాయి.

శివాలయానికి హృదయాలయ ఈశ్వర ఆలయమని పేరు. యిది  వొక గొప్ప యోగి తన హృదయంలో తన  కల్పన ద్వారా     మొదట నిర్మించాడట. ఆ తరువాత, వొక రాజు దీనిని  కట్టాడు. అదొక అందమైన కథ. విష్ణు ఆలయం  కూడా చాలా పురాతన ఆలయం. రెండూ - వేల సంవత్సరాల క్రితం కట్టినవే 

అవి రెండూ, ప్రసిద్ధ ఆలయాలే .

చాలా గొప్పవే.

కానీ మా వూళ్ళో - మరో గొప్ప ఆలయం వుంది. దాని పేరు సేవాలయ. 

అది వొక అనాథ శరణాలయం - అనాథలకోసం వొక మంచి పాఠశాల - వొక మంచి వృద్ధాశ్రమం - వొక గోశాల -  యిలా ఎన్నిటికో రూప కల్పన జరిగి, చాలా బాగా నడుస్తున్న దేవాలయమని చెప్పొచ్చు.  

17-నవంబరు -మా 34-వ పెళ్లిరోజు.

క్రిందటి రెండు సంవత్సరాలూ - మేం అక్కడికి వెళ్లి మాకు తోచిన డొనేషన్ యిచ్చేసి వచ్చాము.     మళ్ళీ , అప్పుడప్పుడు, డొనేషన్ ( పుట్టిన రోజు  లాంటి వాటికి)   యిస్తూ వుంటాను.

కానీ ఈ సారి, కాస్త మార్పు వుండాలని - అక్కడి పిల్లల తో కాస్సేపు గడపాలని అనుకున్నాము.

16 నాడు  డొనేషన్ యిచ్చేసి - 17 న  మేం  వస్తామని  చెప్పాము. చెప్పినట్లే, నేను, నా శ్రీమతి  12.20 మధ్యాహ్న సమయంలో - అక్కడికి వెళ్ళాము.

మొదట వృద్ధాశ్రమంలో - అక్కడి వయోవృద్ధులు, దాదాపు డెబ్భై మంది  భోజనం చేస్తూ వుంటే -వారితో  అక్కడ,  వారి జీవితాన్ని గురించి  ముచ్చటించాము. వారు - బయటి ప్రపంచంలో -దాదాపు ఎవరూ లేని వారు. ఏమీ లేని వారు. కానీ అక్కడ సంతోషం గా గడుపుతున్నారు. 

వారందరూ మమ్మల్ని ఆశీర్వదించితే - చాలా సంతోషమనిపించింది. 

వారి ఆశీర్వాదంలో - అది వారి హృదయాంతరాళం నుండి వస్తూ ఉందన్నది చాలా బాగా, స్పష్టంగా,  మాకు కనిపించింది. కొంత మంది అన్నం తింటూ వున్న చేతితో , లేచి, కొద్దిగా, ఆనందంతో వచ్చే కన్నీళ్ళతో, రెండు చేతులతో ఆశీర్వదించడం - ఎంతో హృదయాన్ని తాకే విధంగా వుంది.    

- గోశాలలో 70 ఆవులకు  పైగా వున్నాయి. వాటిల్లో - పాతిక భాగం పాలిచ్చే ఆవులైతే, ముప్పాతిక భాగం వట్టిపోయిన వృద్ధ ఆవులు. వాటినీ  బాగా చూసుకుంటున్నారు వాళ్ళు . సంతోషం అనిపించింది. ఆ ఆవులూ సంతోషంగా  కనిపించాయి .

సరే. అక్కడినుండి, పిల్లలను చూసేందుకు వెళ్ళాము. అది వారి భోజన సమయం. మేమూ వారితో పాటు కూర్చుని భోంచేశాము. నేను వారికి వడలు వడ్డిస్తూ, వారితో మాట్లాడాను. వారి పేర్లు, చదువుతున్న క్లాసు, ఎలా చదువుతున్నారో అని - అన్నీ అడిగాను. అందరినీ అడిగాను.

యల్  కే  జీ  నుండి 12 వరకు - అన్ని క్లాసుల పిల్లలూ వున్నారు.

మామూలు పిల్లలలో  వుండే డిసిప్లిన్ - కంటే అక్కడ చాలా ఎక్కువ - అని చెప్పొచ్చు. అక్కడే వుండి  చదువుకునే పిల్లలంతా   - తల్లీ-తండ్రీ  లేని వారే .దాదాపు 200 మంది.

బయటి నుండీ వచ్చే పిల్లలూ చాలా బీద కుటుంబాల నుండీ వచ్చిన వారే.  వారు దాదాపు వెయ్యి మంది.

హాస్టలు పిల్లలు అందరితో మాట్లాడాను. వారంతా - థాంక్సు చెబుతుంటే - తమాషాగా వుంది. 

యల్ కే జీ పిల్లలు, వారి అమాయకపు కన్నులతో మిమ్మల్ని చూస్తూ, ఉత్సాహంగా, మీకు థాంక్స్ చెబితే ఎలా  వుంటుంది? 12 వ క్లాసు పిల్లలలో వారి భవిషత్తు గురించి  కలలు కొంత మనం స్పష్టంగా చూడొచ్చు. సేవాలయ వారు - వారి కాలేజీ చదువుకూ సహాయం చేస్తారట. వుద్యోగం దొరికే వరకు రక రకాల సహాయం చేస్తారట.

మాకు  చాలా బాగా అనిపించింది.

తల్లీ-తండ్రీ  లేని పిల్లలు - అక్కడ సంతోషంగా వుండి - బాగా చదువుతున్నారు; నూటికి నూరు శాతం వుత్తీ ర్ణులవుతున్నారు - అంటే  సేవాలయ యాజమాన్యం బాగా పని చేస్తున్నట్టే కదా . ఎందరో  మహానుభావులు . నేను చేయని (లేని) పని అంత సమర్థంగా నిర్వహిస్తున్న -  వారికి, నా  హృదయ పూర్వక అభివందనాలు.  

పిల్లల శుభాకాంక్షలు , వృద్ధుల ఆశీర్వాదాలు అందుకోవడం - దేవుడు నేరుగా వచ్చి ఆశీర్వాదం యిచ్చినట్టే వుంది.

మరి దేవాలయంలో అయితే - దేవుడి ఆశీర్వాదం - అలా మన అనుభవంలోకి రాదు కదా.

దేశంలో -  ఏ వొక్కరూ భోజనం లేకుండా వుండకూడదు; చదువు లేకుండా వుండకూడదు . ఏ వొక్కరూ - అనాథలుగా  వుండాల్సిన అవసరం వుండకూడదు - అని నాకు మాత్రం స్పష్టంగా అనిపించింది.

మీరూ - నేనూ అనుకుంటే - యిది మనం చేయ గలం.

మరి చేద్దామా? 

సేవాలయా  ను గురించి  వొక విడియో ను మీరు క్రింద యిచ్చిన యు ఆర్ యల్  ను కాపీ చేసి  మీ ఇంటర్నెట్  ద్వారా చూడొచ్చు. వినొచ్చు .

http://www.youtube.com/watch?v=CuZeSQSZ2bc&feature=youtu.be

= మీ 

వుప్పలధడియం  విజయమోహన్ 





 


1, నవంబర్ 2012, గురువారం

కొత్త రోగాలకు పాత మందులు - డెంగ్యూ వ్యాధి కి బొప్పాయ చెట్టు ఆకుల రసం - హృద్రోగాలకు అర్జున - ఎన్నో రోగాలకు, బలహీనతలకు ఆశ్వ గంధ


కొత్త రోగాలకు పాత మందులు 


ఈ మధ్య ఎన్నో కొత్త కొత్త రోగాలూ వస్తున్నాయి. కొత్త కొత్త మందులూ వస్తున్నాయి.

మనకు తెలిసిన వాటిలో  ప్రముఖం గా వుండే వైద్య విధానాలు - (1) అల్లోపతి (2) హోమియోపతి (3) ఆయుర్వేదం. 

యింకా ఎన్నో వున్నాయి. యునాని, చైనీస్  ఆకుపంక్చర్ లాంటివి. కానీ మన దేశంలో, బాగా ఉపయోగంలో వుండేవి పై మూడూ.

నేను - అన్ని విధానాలనూ , ఎంతో, కొంత ఉపయోగించే  వాడిని.

మూడూ కొన్ని, కొన్ని రోగాలకు ప్రత్యేక తరహాలలో ఉపయోగ పడతాయని నాకు అనిపిస్తుంది.

సర్జరీ కావాల్సిన పరిస్థితులలో, అల్లోపతి తప్పనిసరి.  అలాగే మరికొన్ని రోగాలకూ అల్లోపతి బాగా పనికొస్తుంది. ఉదాహరణకి, కుక్క కాటు, పాము కాటు, కొన్ని జ్వరాలు, టీబీ లాంటి వాటికి అల్లోపతి మంచిది.

కానీ - చాలా రోగాలకు, అల్లోపతిలో సరి అయిన మందులు లేవు.

 వాటిలో చాలా వాటికి ఆయుర్వేదంలో - చాలా మంచి మందులు వున్నాయి. కొన్నిటికి హోమియోపతి లో మంచి మందులు వున్నాయి.

ఆయుర్వేదం లక్షల ఏండ్ల అనుభవంతో వచ్చిన శాస్త్రం. మన దేశంలో పుట్టినది పెరిగినది. నా ఉద్దేశంలో తురుష్కుల , ఆంగ్లేయుల పాలన లేకుండా వుంటే   యిప్పటికి ఆయుర్వేదంలో, ఎన్నో పరిశోధనలు జరిగేవే. ఎన్నో రకాల ప్రక్రియలు వచ్చేవే .


యిప్పుడైనా - భారత ప్రభుత్వం వారు - ఈ శాస్త్రానికి బహుళ  ప్రాధాన్యత యిచ్చి, పరిశోధనలను ప్రోత్సహించ వలసిన అవసరం  ఎంతైనా వుంది.

ఈ మధ్య - నాకు వచ్చిన సమాచారాల ప్రకారం - డెంగ్యూ వ్యాధి కి అల్లోపతి లో పెద్దగా మందులు లేవు. కానీ, ఆయుర్వేదం ప్రకారం - బొప్పాయ చెట్టు ఆకుల రసం -రోజుకు రెండు ఆకుల రసం యిస్తే చాలు, వెంటనే - రక్తం లోని ప్లేట్లెట్ల సంఖ్య గణ నీయంగా పెరిగి, జ్వరం కూడా తొందరాగా వుపశమిస్తుంది.  

  నాకు వచ్చిన ఈ సమాచారాన్ని నేను నాకు తెలిసిన వారందిరికీ పంపించాను. వారిలో నాకు బాగా తెలిసిన వారింట్లో దీన్ని అమలు   చెయ్యడము  జరిగింది . చాలా సత్ఫలితాలు వచ్చినట్టు  వారి నాకు చెప్పడమూ జరిగింది. 

బొప్పాయ ఆకులు, పండ్లు 



అందు వలన నాకు తెలిసిన ఈ వైద్యాన్ని పాఠకులందరికీ  అంద  జేస్తున్నాను. అల్లో పతి  వైద్యం వద్దని అనడం లేదు. డాక్టర్ దగ్గరికి పోవద్దని చెప్పడం లేదు. తప్పకుండా వెళ్ళండి. కానీ, వొక ప్రముఖ సినీ నిర్మాత దర్శకుడైన యాష్ చోప్రా గారిని కూడా అల్లోపతి మందులు రక్షింప లేకపోయాయి . కనుక  మన  దేశీయ వైద్యం, మన ప్రక్కనే దొరికే బొప్పాయి ఆకుల రసం త్రాగడం, మనల్ని రక్షిస్తే మంచిదే కదా. అందుకని రాస్తున్నాను.

అలాగే - వొక ఉపన్యాసంలో, స్వామీ రాందేవ్ గారు తిప్పతీగ రసం, డెంగ్యూ కు బాగా ఉపయోగపడుతుంది - అన్నారు. దీన్ని అమృతారిష్టము అని- టాబ్లెట్ల రూపంలో కూడా అమ్ముతారు.  యిది జ్వరం వున్న వారు తీసుకుంటే - మంచిది. అసలు, ముందుగా తీసుకునే వారికి  వ్యాధులు రాకుండా చేయగల సామర్థ్యం వుంది తిప్ప తీగకు. 

ఈ వైద్యాలు మీకు తెలిసిన అందరికీ చెప్పండి.

అలాగే - ఆయుర్వేదంలో - మరెన్నో అద్భుతమైన మందులు వున్నాయి. నాకు తెలిసిన వాటిలో " అర్జున" అన్న మందు వొకటి. హృదయానికి, అనేక రకాలుగా శక్తి  నిచ్చి, అనేక  హృద్రోగాలనుండి - కాపాడగల సామర్థ్యం వుంది "అర్జున" కు. 

హృద్రోగాలు వున్న వారైనా సరే , భవిష్యత్తులో - రావచ్చునేమో అన్న శంక వున్నా వారైనా సరే -  అలాంటి ఏ శంకా  లేని వారైనా సరే - "అర్జున" వాడడం చాలా మంచిది. 

నేను వాడుతున్నాను. నాకు తెలిసిన వారు చాలా మంది వాడుతున్నారు.  


అర్జున ఆకులు, పండ్లు, చెట్టు బెరడు 


యింటర్ నెట్ లో దీన్ని గురించి విస్త్మృత  సమాచారం వుంది. 

ఉదాహరణకు :



ఈ లింక్ క్లిక్ చేసి చూడండి ఇలాంటి మరిన్ని వున్నాయి. మీరు ఏ ఆయుర్వేద వైద్యుడిని అడిగినా చెబుతారు దీన్ని గురించి. - అయితే యిప్పుడు , దీని పై మరిన్ని పరిశోధనలు జరగడము, మరిన్ని సత్ఫలితాలు కనుగొనడమూ జరుగుతోంది. 

అలాంటిదే - మరొక దివ్యౌషధము -ఆశ్వ గంధ - అన్నది . యిది కూడా ఎన్నో రకాలుగా మన ఆరోగ్యానికి ఉపకరించే  ఔషధం.  యిది, ఎన్నో, ఎన్నో రోగాలకు, బలహీనతలకు చాలా, చాలా బాగా ఉపయోగ పడే ఔషధం. యిదీ నేను వాడుతున్నాను. చాలా మంది వాడుతున్నారు.


ఆశ్వ గంధ చెట్టు బెరడు, ఆకులు, పండ్లు 


దీన్ని గురించి కూడా  యింటర్ నెట్ లో విస్త్మృత  సమాచారం వుంది. ఉదాహరణకు :



యిలా ఎన్నో దివ్యౌషధాలు ఆయుర్వేదంలో వున్నాయి. రోగాలు రాకుండా కాపాడేవి కొన్ని. దీర్ఘ రోగాలను కూడా పోగొట్టేవి కొన్ని. వీటికి - అల్లోపతి  మందులకున్న -సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. నిజానికి వొక రోగానికి తీసుకున్న మందు, మరెన్నో రోగాలకు కూడా పనికొస్తుంది. అయితే - -ఏదైనా  మోతాదు మించి తీసుకోవడం పనికి రాదు. మితంగా తీసుకుంటే - అమృతం. 

అమితంగా తీసుకునేది ఏదైనా   తప్పే కదా.

నాకు తెలిసిన వాటిలో, చాలా మంచివి అని నేను నమ్మే వాటిని - కొన్నిటిని యిక్కడ చెప్పాను.

యివన్నీ మనకు దొరికేవే. మంచి ఆయుర్వేద తయారీ కంపెనీలు తయారు చేస్తున్నవే. యింట్లోనూ - చేసుకో గలిగేవే.

ఆరోగ్యమే మహా భాగ్యం కదా.  

మీకు తెలిసిన వారికి చెప్పండి. ఎంత మంది ఆరోగ్యం బాగు పడితే  అంత మంచిది.

= మీ 

వుప్పలధడియం విజయమోహన్ 








    

17, సెప్టెంబర్ 2012, సోమవారం

మతమూ - మానవత్వమూ

మతమూ - మానవత్వమూ 


మానవత్వం తెలియడానికి మతం అవసరమే లేదనిపిస్తుంది. మన సమకాలీన గురువు వొకాయన అంటారు - మీ బొటన వేలును చూడండి. దాన్ని గట్టిగా సుత్తితో కొట్టండి. నరకండి. మీ యిష్టం వచ్చినట్టు గాయపరచండి. ...

ఈ పనులు మీరు చేస్తారా? చెయ్యరు గాక  చెయ్యరు. ఎందుకు? అది మీ వేలు గనుక. అందులో మీరు వున్నారు గనుక. అది గాయపడితే మీరు గాయ పడ్డట్టు.అది బాధ పడితే మీరు బాధ పడ్డట్టు. అది  మీది. అది మీరు - అన్న భావన మీలో వుంది గనుక.

అదే మరొకరి వేలును గాయ పరచమంటే - మనలో - వొక్కొక్కరి స్పందన వొక్కొక్క రకంగా వుంటుంది. వొకరు ససేమిరా -నేను చెయ్యను; చెయ్యలేను.అంటారు. మరొకరిని శారీరకంగానో, మానసికంగానో, హింసించలేని  సున్నిత మనస్కులు యిప్పుడూ మన దేశంలోనూ, చాలా దేశాల్లోనూ - వున్నారు. అంటే - మానవత్వం వున్న వారు ఎంతో మంది వున్నారు.

సరే.  మరో రకం వారు - తమ మిత్రులనైతే , తమ వారినైతే హింసించలేరు గానీ - తమ శత్రువులనో, తమ వారు కాని వారినో  హింసించడానికి   ముందుకొస్తారు. వారిలోనూ, రక రకాల మనుషులున్నారు. కొంత మంది ఉత్త మాటలతో అయితే  హింసిస్తారు గాని - చేతల ద్వారా  హింసించలేరు.

కొంత మంది - ఎవరైనా మరొకరిని పంచ్ బాగ్ లాగా కొడుతూ వుంటే - చూసి ఆనందిస్తారు. సినిమాల్లో నైతే - విలన్లు అలాంటి పంచ్ బాగ్ లు గా మారి - హీరో చేతిలో దెబ్బలు తింటూ వుంటే - వాడిని యింకా కొట్టు, యింకా కొట్టు అనుకుంటూ వుంటాము. ఇక్కడ, మనకు తెలియకుండానే, మనలో - హింసను ఆనందించే ప్రవృత్తి ఏర్పడుతూ వుంటుంది. అదే - హీరోను కొడుతూ వుంటే - సహించలేము.

మన వారికి ఏదైనా ఆపద వస్తే - విలవిల్లాడి పోతాం. కాని - ఆపద వచ్చింది మన వారికి కాదు - అనిపిస్తే - నిశ్చింత వచ్చేస్తుంది మనలో. మన వారికి గోరు కాస్త తగిలితే - మనసులో - విల విల. కానీ పరాయివాడి ప్రాణం పోయినా - మన మనసులో ఏమీ లేదు.

నిజమా, కాదా?

కానీ,  మనలోనే కొందరు, ఎక్కడ, ఏ ఆపదదొచ్చినా - మూటా, ముల్లె సర్దుకుని అక్కడికెళ్ళి - అందరికీ సహాయ పడుతూ వుంటారు. అలాంటి ఎన్నో సంస్థలు వున్నాయి.

అటువంటి - మనస్తత్వం అందరికీ వుంటే - దేశం నందన వనం అయిపోదా? స్వర్గం గా మారిపోదా? మరి అటువంటి మనస్తత్వం మనలో ఎలా వస్తుంది? మన విద్యా విధానం ద్వారా వస్తుంది. గొప్ప గురువుల సాన్నిధ్యంలో వస్తుంది.

నాకు తెలిసి అటువంటి గురువులు మన దేశంలో చాలా మంది వున్నారు. కానీ, కొంత మంది - వారి దగ్గరకు వెళ్ళకుండానే, వారి ప్రబోధాలు వినకుండానే, వారు చేసే ప్రతి పనీ గమనించకుండానే   - వారిపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ వుంటారు.

తాము చేయలేని పని వారు చేస్తున్నారు. అదెలా సాధ్యం. యిందులో, వారి స్వార్థం వుండనే వుంటుంది - వారు తమకంటే - ఏ విధంగానూ గొప్ప వారు అవడానికి వీలే లేదు -అనే భావన వుంటుంది. కానీ అటువంటి గురువుల సాన్నిధ్యానికి వొక సారి వెడితే - యిటువంటి వారు మారడానికి - అవకాశం వుంటుంది.

సరే. ఇలాంటి వారు రక రకాలుగా వున్నారు. 

జీవితంలో, మనిషి - వికాసాత్మకం గానూ, నిర్మాణాత్మకం గానూ వుండొచ్చు . లేదా, విమర్శకుడిగా మిగిలి పోవచ్చు. అందులోనూ  - వికాసాత్మక విమర్సకుడి గానూ వుండొచ్చు. లేదా, వినాశాత్మక విమర్శకుడిగానూ  వుండి  పోవచ్చు.

మన దేశంలో ముఖ్యంగా - నిర్మాణాత్మకతను  మనలో పెంచే విద్యా విధానం రావాలి . ఇప్పుడున్న విద్యావిధానం - అటువంటిది కాదని నిశ్చయంగా చెప్పొచ్చు.అలాగే - సహృదయంతో, వికాసాత్మకంగా చూడగలిగే విమర్శనా దృష్టి కూడా కావాలి.మన ఆలోచనా విధానమే మారాలి.

మరి -నకారాత్మక దృష్టి , నకారాత్మక స్వభావం కొందరిలో - మరీ మితి మీరి పోతుండడం  కూడా మన దేశంలో వుంది. మనం చూస్తూనే వున్నాం. కావాలని, రైళ్ళు  పడగొట్టడం, బస్సులు కాల్చడం, మనుషులను హింసించడం, చంపడం, ఆడవాళ్లనైతే ,అత్యాచారాలకు, సామూహిక అత్యాచారాలకు గురి చెయ్యడం - ఈ మధ్య ఎక్కువై పోతూ వుంది. నా వుద్దేశంలో యిందుకు ప్రధాన కారణం విద్యా విధానం లోని లోపాలే.

మరో కారణం సినిమా , టీ.వీ ల ద్వారా యిటువంటి హింసను -ముఖ్యంగా హీరో ద్వారా హింసను -ఎక్కువగా ప్రోత్సహించడం.  అశ్లీలత కూడా ఈ రోజుల్లో చాలా సరిహద్దులు దాటింది.

కాకపోతే - మన దేశం - మరి కొన్ని యితర దేశాలతో పోల్చి చూసుకుంటే -  కొంత మెరుగేనని చెప్పొచ్చు.

మనం చూస్తున్నాం కదా - మగ వాళ్ళు చేసే నేరాలకు ఆడ వాళ్ళను రాళ్ళతో కొట్టి చంపుతూ దాన్ని ఆనందించే ప్రవృత్తి యింకా కొన్ని దేశాలలో వుంది. మతం పేరిట మన దేశంలో కొంత అంటరానితనం మాత్రం వుంది - కానీ - కొన్ని దేశాలలో - క్రూర మృగాల లాగా, మిగతా మతాల వారిని - హింసించడం, తమ మతంలో చేర్చుకోవడానికి బలాత్కారం చెయ్యడం - తత్ ఫలితంగా వారు దేశాంతరాలకు పోవడం జరుగుతూనే వుంది.

మతం పేరిట ఏదేదో జరుగుతూ వుంది. ఎన్నెన్నో జరుగుతూ వుంది. చాలా మందిలో  - రావాల్సిన మంచి మార్పు  రావడం లేదు.

అన్ని మతాల లోనూ - కొంత మంది మంచి వారూ వున్నారు. కొంత మంది చాందస వాదులూ వున్నారు.మంచి వారి వొక్కటిగా చేరితే - అన్ని దేశాల వారూ, అన్ని మతాల వారూ హాయిగా వుండొచ్చు.

అది జరగక పోతే - ఛాందస వాదుల ద్వారా - మానవత్వం మంట గలిసి, రాక్షసత్వం పెరగడం ఖాయం.

చాందస వాదులు మారాలంటే - ఎలా? ఆయా మతాల లోని మంచివారిద్వారానే - అది జరగాలి.  చెడును ప్రోత్సహించకపోయినా - చెడుని చూసీ చూడనట్లు వుంటే - చెడు పెరగడం ఖాయం. మన పొరుగు దేశాలలో అది జరుగుతుందో, లేదోచెప్పలేం . కానీ, మన దేశంలో - ఈ మార్పు రావాలి. రావచ్చు.వస్తుందనే నమ్మకం కలుగుతూ వుంది.

మతాలలో కూడా -గణనీయమైన మార్పులు రావాలి. మతంలో ఎంతో మంచి వుంది. కానీ- కొంత చెడూ వుంది. కొన్ని అమానుషమైన అలవాట్లూ ఉనాయి. 

మా మతమే గొప్ప - మా నాయకుడే గొప్ప -మా గ్రంధమే గొప్ప అనుకుంటే - మార్పు ఎప్పుడూ రాదు.

ఈ గంధాలన్నీ - వొక కాలంలో - ఆ కాలానికి తగినట్టు చెప్పబడ్డవి; రాయ బడ్డవి. -అందులోనూ  కొన్ని మాత్రం నిత్య సత్యాలే. వొప్పు కుంటాను. కొన్ని - కాలానుగుణంగా  మారాలి.

అందులో వొకటి - హిందు మతానికి -సంబంధించినది  - జాతి వివక్షత, అస్పృశ్యత. యిది మారుతూ వుంది కానీ - యింకా ఎంతో వేగంగా - అందరికీ నచ్చేటట్టుగా  మారాలి. 

మరొకటి మిగతా మతాలకు -మనకూ మధ్య వున్న సంబంధాలకు సంబంధించినది. మిగతా వారి వారి మతాలకు సంబంధించిన  విషయాలను నేను ప్రస్తావించను.

వొకటా మా మతంలో చేరండి - లేదా - మీరు నరకానికి వెళ్లి పోతారు - అన్నది హాస్యాస్పదమైన వాదం.యిందులో పెద్దగా వాదించి తెలుసుకోవలసిన సత్యం ఏమీ లేదు. కొద్దిగా, కళ్ళూ మనసూ తెరిచి చూస్తేనే చాలు - యిట్టే - అర్థమై పోతుంది.  

ఈ మతాలు వచ్చిందే 2000 ఏళ్ళ క్రితం. అంతకు క్రితం మంచి వాళ్ళు ఎంతో మంది వున్నారు కదా. వాళ్ళు ఎవరూ స్వర్గానికి వెళ్ళ లేదా? 

అలాగే - భారత దేశంలో కూడా, కృష్ణుడు లాంటి దేవుడి అవతారాలు 5000-6000 క్రితం వచ్చారంటే - గీత లాంటి   - గొప్ప సందేశాలు - అందించారంటే   -  ఎందుకు నమ్మక పోవడం? అందులో అంతగా నమ్మక పోవడానికి ఏముంది?

అలాగే - విగ్రహారాధన అంటే - ఏమిటో - అసలు తెలుసుకోకుండా - దీన్ని విమర్శించే  వాళ్ళు చాలా మంది  వున్నారు. విగ్రహారాధన చేసే వారిని తెగ కోసి  చంపితే మాకు స్వర్గం వస్తుందనే వారూ వున్నారు.

హిందు తత్వంలో కూడా - దేవుడు నిరాకారుడే అని ఎన్ని సార్లు చెప్పలేదు? కానీ - తన భక్తుల కోసం - దేవుడు - వారు కోరుకున్న రూపాల్లో వస్తాడని చెప్పడమే యిది .  అంతే కాక - పరి పరి విధాలుగా పోయే  మనస్సును మొదట వొక చోటికి చేర్చడమే  యిష్ట దేవతా విగ్రహాల లక్ష్యం.

ఆ తరువాత  నిరాకారుడైన దేవుడు. ఆ దేవుడి ఆరాధన.

ఆ తరువాత వుపనిషద్ వాక్యాల ప్రకారం  -అహం బ్రహాస్మి - నేనే బ్రహ్మమును - అనేదే నిత్య సత్యము. యివన్నీ తెలుసుకోకుండా -  పర మతాల్ని విమర్శిస్తే - సఖ్యత ఎలా కుదురుతుంది. విశ్వ శాంతి ఎలా వస్తుంది?

యిదైనా - ఎందుకు చెప్పాల్సి వస్తూ వుంది? నన్ను ఏం చేసినా తమకు పరవాలేదు - అంతకు మించి స్వర్గం కూడా వస్తుంది - అని కొంత మంది చాందస వాదులు అనుకోవడం - నేను వొప్పుకోలేను కదా. అందుకే. 

ఈ చాందస వాదాన్ని ఎవరు అరికట్టాలి . ఆయా మతాల లోని మంచి వాళ్ళే అరికట్టాలి. వారు అందుకు - ముందుకు వచ్చిన నాడు - చాందస వాదులు అణిగి పోతారు.

హిందూ  సంస్కృతి ప్రకారం - సర్వే జనాః సుఖినో భవంతు . మనమందరూ బాగుండాలి. అంతే 

మొదట చెప్పిన వాక్యాన్ని మరో సారి గుర్తు చేసుకుందాం....మీ బొటన వేలును చూడండి. దాన్ని గట్టిగా సుత్తితో కొట్టండి. నరకండి. మీ యిష్టం వచ్చినట్టు గాయపరచండి. ...మీరు చేస్తారా? చెయ్యరు కదా?  అలాగే. మిగతా వారినీ చూడండి. అందరూ దేవుడి బిడ్డలే. అందరి దేవుడూ వొకడే.  దేవుడి పేర్లు మనం పెట్టుకొన్నవి. ఆయన నా పేరు యిదీ - అని చెప్పిన దాఖలాలు ఏమీ లేవు.

ముందు చెప్పినట్టు - ప్రతి మతం లోనూ - కొంత మంచి, కొంత చెడూ - రెండూ వుంది. 

ప్రతి మతం లోని మంచి స్వీకరిద్దాం. ప్రతి మతం లోని చెడును గుర్తించి వదిలేద్దాం.


 =మీ 

 ఉప్పల దడియం విజయామోహన్  
 





29, ఆగస్టు 2012, బుధవారం

చీకటి వెలుగుల ఆట - అహంకారం, మమకారాల పై మన పోరాటం - శ్రీరాముడు శ్రీకృష్ణుడు తమ జీవితాల్లో నిజంగా చేసింది ఏమిటి?-



మన నిజమైన పోరాటం  ఎవరిపై ?

మన సంస్కృతి  లక్షల సంవత్సరాల నుండి వస్తున్న సంస్కృతి.  


వేదాలు ఎప్పుడు వచ్చాయో, ఎలా వచ్చాయో, ఎవరికీ తెలీదు.



ఆందులోని ఉపనిషత్తులు, ఆరణ్యకాలు లాంటివి  వొక్కటొక్కటి ఎప్పుడు వచ్చాయో - వాటి కర్త ఎవరో - ఎవరికీ తెలీదు . 



నా వరకు నేను - శంకరాచార్యుల రచనలు, ఉపనిషత్తుల సారము - కొంత వరకు  చదవడం వినడం చేసాను - గత నాలుగు సంవత్సరాలలో .




మహానుభావులయిన  గురువుల సమ్ముఖంలో వాటి లోతుపాతులను గురించి వినడం జరిగింది. 


మన సంస్కృతి - చాలా శాస్త్రీయమైన - సైంటిఫిక్ అయిన - సంస్కృతి అని  మనం తప్పకుండా తెలుసుకోవచ్చు. అసలు లోపాలే లేవని నేను చెప్పను. ఏదైనా - కాలం మారే కొద్దీ, కొంత మార్పు చెందాలి. మన సంస్కృతి కూడా, శ్రీకృష్ణుడి కాలం వరకు మార్పులు, చేర్పులు, కాలానుగుణంగా, పొందుతూనే వుంది. శ్రీకృష్ణుడి భగవద్ గీత - ఈ మార్పులు, కూర్పులలో - వొక అంతర్గత భాగమే. 

భారత కాలంలోనే వ్యాసుల వారు - వేదాలను, పురాణాలను - ఎంతో సంస్కరించడము  జరిగింది. వ్యాసుల వారి తల్లి - సత్యవతి అనబడే యోజనగంధి. ఆమె పూర్వపు పేరు, మత్స్య గంధి . మత్స్య కారుల వంశస్తురాలు.  కానీ- ఆమె వొక వైపు మహా గొప్ప వాడై న వ్యాస మహర్షి పుట్టుకకు, మరొక వైపు, పాండవకౌరవ -వంశాలకు  మూల కారణం అయింది. అది ఆ కాలం.


మనిషికి వుండవలసిన గుణాలేవి; వుండకూడని గుణాలేవి - మనిషికి నిజంగా కావలసినది ఏది; వద్దన్నది ఏది - లాంటి విషయాలపైన - ఎంత సుదీర్ఘ  చర్చ జరిగిందో - అది మన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్ గీత లాంటివి  చదివి అర్థం చేసుకుంటే - తెలుస్తుంది.

ఉదాహరణకు - ముఖ్యంగా వుండ కూడని రెండు గుణాలు - అహం; మమ - అంటారు. అంటే అహంకారం; మమకారం. ప్రస్తుతానికి - ఈ రెండింటిని గురించి కొద్దిగా విశ్లేషణ చేద్దాం. 

అహంకారం - అంటే, నేను,నావి,  నాకే -అనే భావం. 

నేను గొప్ప -అనే భావం లో, నేను కాని వారు, నాకంటే  తక్కువ - అనే భావం -మిళితమై వుండనే వుంటుంది.అది - తననూ నాశనం చేస్తుంది. చుట్టూ వున్న వారినీ నాశనం  చేస్తుంది. ఆంగ్లం లో దీన్ని - ఈగో -అని చెప్ప వచ్చు.   

వొక సారి, స్వామి సుఖ బోధానంద గారు -  "ఈగో" అనే పదానికి - ఎడ్జింగ్ గాడ్ అవుట్ -అంటే - లోనున్న దేవుడిని బయటకు గెంటేయడం -అని అర్థం - అని చాలా అందమైన నిర్వచనం చెప్పారు.

మీ లోపల అప్పుడు మీరు మాత్రమే వుంటారు.మరెవరికీ చోటు లేదు. దేవుడికి కూడా లేదు. మీలో ఎవరి ఆలోచనైనా వస్తే - దేవుడి ఆలోచన వచ్చినా సరే - వారు. మీ స్వార్థానికి ఎలా ఉపయోగ పడతారనే విషయానికోసమే అయి వుంటుంది . మీరు మాత్రమే బాగుండాలి;మిగతా వారు - ఎలా పోయినా ఫరవా లేదు -అనే భావన పెరిగి పోతుంది. 

అహంకారానికి - వొక గొప్ప ఉదాహరణం -రావణాసురుడు.   రావణుడికి  తానూ, తన సుఖం తప్ప - మిగతా ఏదీ గొప్ప కాదు. అందులో వొక భాగంగానే - సీతను ఎత్తుకు పోవడం. 

వొక్క సీతపై మాత్రం కామం రాలేదు రావణుడికి.  మహా కవులు  అంటారు - పార్వతీ దేవి పై కామం తో శివుడినే నువ్వెంత అన్నవాడు  రావణుడు. అందుకు ఫలితం అనుభవించాడు. కానీ అహంకారం నిండిన రావణుడు వూరికే  వుండలేడు కదా. నన్ను మించిన వాడు లేడని గర్వం. వొక సారి తన అన్న గారైన కుబేరుడి కోడలు, రంభనే-   బలవంతంగా చెరిచాడు.  నువ్వు నాక మామ గారు, తండ్రి లాంటి వాడు అని ఎంత మొత్తుకున్నా వినలేదు రావణుడు .అందుకు, కోపంతో, ఆమె భర్త నలకూబరుడు - శాపం పెట్టాడు. అలాగే - వేదవతి అనే - తపస్సు చేసుకుంటున్న కన్యను చెరచ బోయి - ఆమె శాపానికీ గురి అయ్యా డు. అయినా, అహంకారం పోలేదు.

ఎంతోమంది ఆడవారిని యిలా బలవంతంగా ఎత్తుకొచ్చిన వాడు రావణుడు. ఎంతో మంది ఋషులకు, రాజులకు, దేవతలకు, ప్రజలకు - ఎన్నో కష్టాలను తెచ్చి పెట్టిన వాడు రావణుడు. తాను సీతను అనుభవించడానికి - తన వాడై న మారీచుడి ప్రాణాలను కూడా పణం గా పెట్టిన వాడు రావణుడు. మారీచుడు వద్దు మొర్రో అంటున్నా, వినక - రాముడి చేతుల్లో చస్తావో లేదో కాని - నా పని చేయక పోతే, నా చేతుల్లో చస్తావు, అని బెదిరించిన వాడు.

సీత కోసం విభీషణుడిని కూడా ఫో అన్న వాడు. కుంభకర్ణుడిని, తన కొడుకులను, తన వంశంలోని అందరినీ  పణం గా పెట్టి - ఏ  మాత్రం బాధ పడని వాడు. సీత దక్క లేదే అన్న బాధ, రాముడిని జయించ లేదే -అన్న బాధ పెద్దది  కాని - యింత  మందిని  పోగొట్టుకున్నామే అన్న బాధ పెద్దది కాదు  రావణుడికి.

ఏదో సినిమాల్లో -చూసి రావణుడు మహా మంచి వాడు అనుకుంటే - చాలా తప్పు . అంటే - రావణుడిలో మంచి గుణాలే  లేవని  కాదు

గొప్ప  శివ భక్తుడు. కానీ శివుడి భార్యనే - లోక మాతనే, కామదృష్టితో చూసిన వాడు.

వేదాలన్నీ చదివిన వాడు. కానీ - వేదాలలోని మంచి నంతా  వదిలేసి - అవి, వద్దు, వద్దు అనే - కామక్రోధాదులనే  అంతః శతృవులకు - పూర్తిగా లోబడిన వాడు. వర గర్వితుడు. నన్ను మించిన వాడు లేదని విర్ర వీగిన వాడు. మొత్తానికి ప్రపంచంలో మహా అహంకారిగా పేరు పొందిన వాడు. కులము లో - వొక అహంకారి -వుంటే  కులమంతా నాశనమవుతుందని -చెప్పడానికి, వొక గొప్ప ఉదాహరణం,  రామాయణం లోని రావణుడు.

అహంకారం లేని, పరోపకారిగా, వొక వైపు రాముడు; మహా అహంకారిగా, మరోవైపు రావణుడు. వీరి మధ్య కాదు -యుద్ధం  ; ఈ గుణాల మధ్య యుద్ధం. అదీ రామాయణం. అహంకారం ఎంత చెడుపు చేస్తుందో , అది - చెప్పడమే రావణుడి పాత్ర లక్ష్యం. అహంకారం లేకుండా వుండాలంటే ఏం చెయ్యాలి మనలో అహంకారం వుందో, లేదో ఎలా తెలుసు కోవడం అన్న దానికి నిదర్శనం రాముడు .  

సరే. మన విషయానికొస్తే - అహంకారం మనలో  వుందో లేదో ఎలా తెలుసు కోవడం?

1. మీరు  మగ వారైతే - మీ తల్లితండ్రులను ఎంత మాత్రం గౌరవిస్తున్నారో - మీరే తరచి చూడండి. మీరు వారికేం చేస్తున్నారు.  వారు మీ పట్ల ఎంత సంతోషంతో వున్నారు - అన్నది మొదటి అంశం. మీరు ఎప్పుడైనా - వారికి నమస్కారం చేసి, వారి ఆశీర్వాదం తీసుకోవాలని ప్రయత్నం చేసారా? మీకు - చేయాలని అనిపించలేదంటే - మీలో అహంకారం దాగి ఉన్నట్టే .

2. మీరు ఆడ వారైతే -  పెళ్ళైన వారైతే - యిదే విషయం - మీ అత్త మామల పట్ల వర్తించుకోవాల్సి వుంటుంది. అదేమిటి. మేమూ మా తల్లి తండ్రుల పట్లే - విధేయంగా - వుంటాము అంటే - నేను చెప్పేదేమీ లేదు.సహ ధర్మ చారిణి, బెటర్ హాఫ్ , గృహ లక్ష్మి -అన్న పదాలు - మీరు ఎంతగా భర్త కుటుంబంలో కలిసిపోతారో -  దానిని బట్టే వుంటుంది.  నిజానికి  భార్యాభర్త లిద్దరూ -అత్తమామలను, తల్లితండ్రులను కూడా  గౌరవించవలసిన వారే. కానీ భార్య ఎంతగా, భర్త కుటుంబంలో కలిసి పోతుందో - అంతగా , ఆమె - రెండు కుటుంబాలకూ  గౌరవ కారణం అవుతుంది. యిది జరగని చోట  -ఆమెలో  అహంకారం వున్నట్టు లెక్క 

3. మీ భార్యకు - కాలో, చెయ్యో తగిలింది , లేదా బెణికింది - అనుకోండి. - నేనేమిటి, తన కాలును తాకడం ఏమిటి - అని మీరు (మగ వారు) -అనుకుంటే, మీలో బాగా అహంకారం ఉన్నట్టే లెక్క.   ధర్మేచ, అర్థేచ, కామేచ - అన్నిటిలో సహధర్మ చారిణి అయిన భార్యను, అన్ని రకాలుగా కాపాడ వలసిన, సంతోష పరచ వలసిన కర్తవ్యం పురుషుడికి తప్పకుండా వుంది. అది చెయ్యని నాడు - అది అహంకారానికి గుర్తే. అలాగే భార్య కూడా - భర్తకు, ఏదైనా సరే -  చెయ్యాలి. నా భర్త (లేదా నా భార్య)  ఆరోగ్యం, సంతోషం, నా పూర్తి బాధ్యత - అని యిద్దరూ - అనుకుంటేనే -వారిలో  అహంకారం లేనట్టు లెక్క. నేనెందుకు చెయ్యాలి - అనుకునే వారిలో అహంకారం వున్నట్టు లెక్క.

4. గురువుల పట్ల, వయోవృద్ధుల పట్ల, జ్ఞాన వృద్ధుల పట్ల- గౌరవం వుండాలి. మనిషికి, ఏ వయసులో నైనా - వొక గురువు వుండాలి. ఎవరినో వొకరిని గురువుగా అంగీకరించి - వారి మాటే వినే వారికి - అహంకారం కాస్త దూరంగా వుంటుంది.

5. నాకు తెలుసు - నాకే తెలుసు - నాకు అన్నీ తెలుసు - అనే భావనలు వస్తూ వుంటే - అహంకారం పెరుగుతూ పోతుంది. నాకు తెలియనిది ఏది, అది నేను  ఎలా తెలుసుకోవాలి  అనుకునే వారికి; తనకు తెలియదు అనే విషయాల్ని -సంకోచం లేకుండా, అంగీకరించే వారికి, అహంకారం దూరంగా వుంటుంది. మన దేశంలో కొంత మంది సినిమా హీరోలు, రాజకీయ వేత్తలు, ఇలాంటి వారు - అన్నీ తమకు తెలిసినట్టు,  ఏ విషయం పైన ప్రశ్నలు అడిగినా - టక్కు టక్కు మంటూ  జవాబులు చెప్పడం  మనం చూడవచ్చు. తెలియనివి, తెలియదని చెప్పడానికి నామోషీ . అ నామోషీ వెనుక అహంకారం తప్పకుండా వుంటుంది.

6. నాకు తెలియదు - అని నేను అంగీకరించనంత వరకు -  మరింత తెలుసుకునే ప్రయత్నం నేను చెయ్యను. ఆ అవకాశం నాకు పోతుంది. నిజంగా తెలిసిన వారు, నాకు దూరంగావెళ్ళుతూ  వుంటారు.  యిది, మన జీవితంలో -జరుగుతూ వుంటుంది . కానీ, మనకు తెలియదు. అర్థమూ కాదు. అహంకారం మహిమ అలా వుంటుంది. మన శ్రేయోభిలాషులను మనకు దూరం చేస్తుంది. మూర్ఖులను, స్వార్థ పరులను చుట్టూ చేరుస్తుంది.

యిలా యెన్నైనా  చెబుతూ పోవచ్చు. ప్రయత్నం చేస్తే , మనలో  అహంకారం వుందా, లేదా అనేది - యిట్టే తెలిసి పోతుంది.

సరే. అహంకారానికి విరుగుడు ఏమిటి? ఏది వుంటే అహంకారం వుండదు?

చాలా, చాలా సులభమైన  ప్రశ్న యిది.

ప్రేమ వున్న చోట స్వార్థమూ వుండదు; అహంకారమూ వుండదు.

అహంకారం స్వార్థాన్ని మాత్రమే కోరుకుంటుంది. ప్రేమనిస్స్వార్థమైనది. ప్రేమకు యివ్వడమే తెలుసు కానీ - అడగడము, దాచడము,  స్వార్థం - ఇలాంటివి తెలీదు.

నాదీ నీదే, నీదే నీదే - అనేది ప్రేమ. నీదీ నాదే.నాదీ నాదే  - అనేది అహంకారము,స్వార్థము. 

ఈ రెండింటి  మధ్య కొంత అహంకారము, కొంత ప్రేమ, కొంత సంశయము - వీటితో కొట్టుకులాడుతుంటారు - చాలా మంది.  ప్రేమంటే ఏమిటో  తెలిసి ; నిజంగా దాన్ని అనుభవించిన నాడు - అహంకారం  పూర్తిగా పోతుంది.



జ్ఞానము రెండవది . జ్ఞానము వున్న చోట కూడా అహంకారం వుండదు.

వొక సారి చీకటి  దేవుడి దగ్గరకు వెళ్లి - వెలుగుపై  ఫిర్యాదు చేసిందట. నేను ఎక్కడకు వెళ్ళినా, ఈ వెలుగు, నన్ను తరిమి కొడుతూ వుంది. దాన్ని కాస్త ఆపి, నన్ను కూడా దానికి సమంగా వుండ నివ్వండి, అని.  సరే, నేను కనుక్కుంటానులే, నువ్వు,వెళ్ళు అన్నాడు దేవుడు. వెలుగును పిలిచి అడిగాడు - చీకటి యిలా నీపై ఫిర్యాదు చేసింది - అని.

వెలుగు ఆశ్చర్య పోతూ అంది. నేనెప్పుడూ  చీకటిని తరమనేలేదు. కనీసం చూడనే లేదు. అయినా మీరు చెప్పారు కాబట్టి, చీకటి ఎక్కడుందో,చూసి, క్షమాపణ అడుగుతాను -అనింది. ఆ రోజు నుండి, ఈ రోజు వరకూ, వెలుగు, చీకటిని వెదుకుతూ వుంది. కానీ చీకటి, వెలుగుకు కనిపించడం లేదు. అలాగే. చీకటి మాత్రం, వెలుగును చూసి భయపడి పారిపోతూనే  వుంది కానీ -  ఎదుట పడటం లేదు.

జ్ఞానం కథ యింతే. జ్ఞానం వచ్చిన వెంటనే - అహంకారం మాయమవుతుంది. అది జ్ఞానం వున్న చోట వుండ  జాలదు. కాక పోతే - సగం తెలిసి,సగం తెలియకుండా వున్న వారిలో - వారి సగం తెలియని తనం లో దాక్కుని వుంటుంది. నాకు - యిది తెలియదు, నేను యిది తెలుసుకోవాలి  అన్న జ్ఞానం వస్తే చాలు - అహంకారం మరి వుండలేదు;  పారిపోతుంది.

జ్ఞానమూ అహంకారాన్ని పారద్రోలుతుంది. ప్రేమ కూడా అహంకారాన్ని పారద్రోలుతుంది.

నిజానికి - జ్ఞానమున్న చోట ప్రేమ వుండనే వుంటుంది. అలాగే - ప్రేమ వున్న చోట - జ్ఞానం కూడా - అంతర్గతంగా వుండనే వుంటుంది. - ప్రేమకు జ్ఞానం ఎవరూ చెప్పకుండానే - తెలిసి పోతుంది. ఈ రెండింటిలో  - ఏది మీలో (కాస్త ఎక్కువగా) వున్నా సరే  - మీలో అహంకారం వుండదు.

అహంకారానికి ప్రతీక రావణుడైతే - మమకారానికి ప్రతీక ధృత రాష్ట్రుడు. భారత యుద్ధానికి  ముఖ్య కారణం  ధృతరాష్ట్రుని  మమకారమే. దుర్యోధనుడు చిన్నతనం నుండీ చేసిన చెడ్డ పనులను - దేనినీ ధృతరాష్ట్రుడు  వారించ లేదు.

మమకారము అంటే - ప్రేమ అని మనం సాధారణంగా అనుకుంటూ వుంటాము. కాదు. రెండింటికీ అంతరం వుంది. ముందే అన్నాం - ప్రేమలో స్వార్థం వుండదని. ప్రేమ -ఎప్పుడూ  చెడును ప్రోత్సహించదు.

మమకారమంటే - నా  వారు మాత్రమే బాగుండాలి - అనే భావన.  మిగతా వారు ఎలా పోయినా ఫరవాలేదు.

భగవద్ గీత అంతటికీ -ధృతరాష్ట్రుడు మాట్లాడే మాట - వొక్క మొదటి శ్లోకం మాత్రమే. ఈ  శ్లోకం మమకారానికి ప్రతీకగా చెబుతారు.

 నా వాళ్లైన కౌరవులు, వారు (పాండవులు) ఏమేమి చేస్తున్నారో, చెప్పు సంజయా -అని అడుగుతాడు. కౌరవులేమో - నా వాళ్ళు.   పాండవులకు - నా వాళ్ళు అనే పదం వర్తింప జేయ లేదు ధృతరాష్ట్రుడు.  ధృతరాష్ట్రుడి అంధత్వం - కళ్ళది కాదు , మనసుది. మనసులోని మమకారానిది.  మమకారానికి  కళ్ళు  లేదు. అది గ్రుడ్డిది. తన వాళ్ళు - అనుకునే వాళ్ళకోసం -మిగతా వారికి ఎంత అన్యాయమైనా చేయడానికి - ప్రోత్సహిస్తుంది.  నిజమైన ప్రేమ వెనుక జ్ఞానం వుంటుంది. అది అన్యాయాన్ని ప్రోత్సహించదు.

దుర్యోధనుడిది అహంకారం. ధృతరాష్ట్రుడిది, గాంధారిది - మమకారమనే గ్రుడ్డి తనం. రెండూ వినాశనానికే  దారి తీస్తాయి. 

మనం  వొక కథ వినే వుంటాం. వొక కొడుకు ప్రక్క నింట్లోని చెట్లో - పళ్ళు కాజేస్తాడు. వాళ్ళమ్మ - ఎవరికీ చెప్పకు, అని  కొడుకును తినమంటుంది . కొడుకు మరో రోజు - కూరగాయలు తస్కరిస్తాడు. అప్పుడూ తల్లి ఏమీ అనదు. ఆ కూరగాయలను  వండి పెడుతుంది . స్కూల్లో - ప్రక్క పిల్లల వస్తువులు కాజేస్తాడు.అప్పుడూ అంతే .


యిలా, తల్లి మమకారంతో, ప్రోత్సాహంతో పెరిగిన కొడుకు గజదొంగ గా  తయారవుతాడు. ఎవరికీ చిక్కడు అప్పుడూ అంతే . తల్లికి కొడుకును ప్రోత్సహించడమే  పని. వొక సారి  హత్య చెయ్యాల్సి వస్తుంది. ఎప్పుడో వొక సారి పట్టు బడతాడు.  ఉరిశిక్ష పడుతుంది. తన కడపటి కోరిక ఏమిటని - అడుగుతారు. తన తల్లిని చూడాలని అంటాడు. తల్లి వస్తుంది. అప్పుడు - కొడుకు తిడతాడు. మొదటి సారి పండు కాజేసిన నాడే - నువ్వు నన్ను తిట్టి , చెయ్యొద్దని చెప్పి వుంటే , నేను బాగు పడే వాడిని కదా - అంటాడు. 

ఈ రోజుల్లో, ముఖ్యంగా - మన దేశ  రాజకీయాల్లో - అహంకారము, మమకారాల పాత్ర మనం చూస్తూనే వున్నాం. పట్టుబడితే దొంగ. లేదంటే - దొర. యిదీ కథ.  వీటి వలన - వారు మాత్రమే కాక, అందరం  రకరకాల బాధలు పడుతున్నాం.


యింట్లోని  వారు కానీ, పార్టీల నాయకులు కానీ - మరెవరైనా కానీ  - తప్పులు చేసే వారిని - తమకు లాభం వచ్చే వరకు - అస్సలు - అడగడం - లేదు. చివరికి - మతాలూ, మిగతా  రకాల సంస్థలూ  కూడా అలాగే  వుంటున్నాయి.

ఎప్పుడో లక్షల ఏండ్ల నాడు ఎవరో వొకాయన రాసిన మనుధర్మ శాస్త్రాన్ని - మనం తప్పు బడతాం.అయినా ,దాన్ని సంస్కరించుకోం. 


కానీ- దేశంలోఎక్కడైనా, కనీసం  వొక్క రోడ్డైనా-  సింగపూర్ లాగా, అమెరికా లాగా - వేయగలుగుతున్నామా - అంటే లేదు. కారణం - 'నా' స్వార్థం. 'నా వారి' స్వార్థం. అంటే - అహంకారం, మమకారం. బియ్యంలో కలపడం; పాలలో కలపడం; పప్పుల్లో కలపడం; మందుల్లో కలపడం; కలపడం లేని - వస్తువే మన దేశంలో దొరకడం లేదు. కారణం - అహం-మమ. ఈ రెండు కారాలే. బ్రిడ్జీలు -కట్టక ముందే -కూలిపోతున్నాయి.అడగ వలసిన వాడు అడగడు . మనం నోరు తెరిచి అడగ లేము. 

లంచ గొండి తనానికి  ముఖ్య కారణం - మనలో ప్రేమ శూన్యమై పోవడమే అంటారు శ్రీ శ్రీ రవిశంకర్ గారు. అందరూ నా వారే - అనుకుంటే - లంచ గొండి తనమూ వుండదు, కలపడమూ వుండదు.

సద్గురు  జగ్గి వాసుదేవ్ గారంటారు - మీ వేలు వొక్క సారి చూసుకోండి. దాన్ని,ఏదైనా రాయెత్తి  కొట్టండి చూద్దాం. మీరు చెయ్యరు. ఎవరూ చెయ్యరు. ఎందుకంటే - అది నాది అనే భావన. మీ కొడుకు దగ్గరో భార్య దగ్గరో లంచం అడుగుతారా? అడగరనే అనుకుంటున్నా . ఎందుకంటే , వీళ్ళు నా వాళ్ళు  అనే భావన మీలో వుంది గనుక. "నా వారు" అని అనుకోని వారి దగ్గరే - మీలో స్వార్థము, వారికేమైనా ఫరవాలేదు అనే భావన తలెత్తుతాయి.

మీరు హాస్పిటలుకు -వెళితే  వెయ్యి ఫారాలు రాసిన తర్వాత గానీ   అడ్మిషన్  యివ్వని డాక్టర్ గారు - తనకైతే ఏం చేస్తారు? మొదట ట్రీట్మెంటు -తరువాత ఫారాలు. మీ వారు రేపుకు గురైతే - పోలీసు వారు ఏంచేస్తారు? తమ వారు గురైతే ఏం చేస్తారు?

వీటన్నిటి వెనుక - అహంకారం వుంది. మమకారం వుంది.  యివే స్వార్థమనే రూపం లో వెయ్యి, వెర్రి తలలు వేస్తూ వుంది.

అసలైన జ్ఞానమూ లేదు. ప్రేమా లేదు.

యివి నశించి పోతూ వుంది మనలో.   "ఐ లవ్ యూ " అనే మాటల్లో కూడా - ఎక్కువగా అహంకారం, మమకారం మాత్రమే వున్నాయి. నువ్వు నాకు ఉపయోగ పడే వరకే  "ఐ లవ్ యూ ". లేదంటే - యిది మరో చోటికి వెళ్లి పోతుంది.

గీతా సారమంతా - వొక్క వాక్యంలో చెప్పాలంటే - "అహంకారం, మమకారం వున్నమీ మనస్సులో , జ్ఞానము, ప్రేమ నింపుకోండి."   శ్రీకృష్ణుడి ప్రబోధమంతా యింతే 

జ్ఞానమూ, ప్రేమా మీలో వున్నట్టు ఏం గుర్తు?

 మీరు మనసారా- "సర్వే జనాః సుఖినోభవంతు" అని అనుకోగాలరా . అలా ఉండగలరా.  అదే గుర్తు.

ఈ మధ్య స్వామి పరిపూర్ణానంద  గారు - దళిత వాడలలో పర్యటించి, వారితో మాట్లాడి, వారి మాటలను విన్న తరువాత - వొక్క మాట అన్నారట - నేను యిప్పుడే  నిజంగా పరిపూర్ణానంద అయ్యా ను. వూరికే ఉపన్యాసాలు, ప్రవచనాలు యిచ్చేటప్పుడు, ఏదో వెలితి వుండేది - అని. ఆ తర్వాతా ఆయన మాట్లాడే మాటలలో సర్వే జనాః సుఖినోభవంతు - అన్న భావన హృదయపు లోతుల నుండి వచ్చేటట్టు మనం గమనించ వచ్చు. 

అంతే . అంతకు మించి చెప్పేదేమీ  లేదు. తమ,తమ జీవితాల్లో, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు యిద్దరూ చేసింది యిదే.

సర్వే జనాః సుఖినో  భవంతు .


= మీ

వుప్పలధడియం విజయమోహన్