27, అక్టోబర్ 2014, సోమవారం

చేసిందేమిటి ? చేస్తున్నదేమిటి ? చెయ్యాల్సినదేమిటి ? మన భవిష్యత్తును ఎలా మలుచుకోవడం?

 
చేసిందేమిటి ? చేస్తున్నదేమిటి ? చెయ్యాల్సినదేమిటి ?

 నిన్నటికీ , ఈ రోజుకూ ఏమిటి మార్పు ? ఏం తేడా వచ్చింది మన జీవితాలలో, ఈ వొక్క రోజులో - అని అప్పుడప్పుడూ మనం పునరావలోకనం  చేసుకుంటూ వుండాలి కదా. యిది చాలా, చాలా అవసరం.   


వొక్క వారంలో - గ్రుడ్డు పగిలి, పురుగుగా, ప్యూపాగా ఆ తరువాత రంగు రంగుల సీతాకోక చిలుకగా మారడం ప్రకృతి పరిణామం. జంతు జాలమంతా అంతే.  మనిషి వొక్కడే తన భవిష్యత్తు  కొంత తానే    నిర్ణయించ గల సమర్థుడు.


గ్రుడ్డు
కాటర్పిల్లర్
ప్యూపా
సీతాకోకచిలుక
 
మనకైనా , భూతకాలం యొక్క సహజ పరిణామమే వర్తమానం. వర్తమానం యొక్క పరిణామమే భవిష్యత్తు.  

వర్తమానపు వొక్క క్షణంలో - భూతకాలంలో చేసిన అన్ని పనుల ఫలితాలు, భవిష్యత్తు యొక్క అన్ని పునాదులు, యిప్పుడు అనుభవిస్తున్న అన్ని కష్టసుఖాలు - యిమిడి వున్నాయి కదా. 
మీరు భూత కాలాన్ని మార్చగలరా ?  మార్చలేరు . పోనీ వర్తమానం లో మీ అనుభవాల్ని, సుఖదుఃఖాల్ని మార్చ గలరా ? అదీ కష్టమే. ఈ క్షణంలో మీరు అనుభవిస్తున్నదంతా , మీ  భూత కాలపు శ్రమల ఫలితమే .

మీ 'నిన్న', మీ 'ఈ  రోజు' ను శాసిస్తూ వుంది.  

మీ 'నిన్న' + మీ 'ఈ రోజు',  కలిసి - మీ రేపటిని శాసిస్తూ వున్నాయి.   

మీరు చేసే పనులకన్నిటికీ మీరే బాధ్యులు, నేను కాదు అంటాడు, భగవంతుడైన శ్రీకృష్ణుడు. మీ పనులకు, మీకు రావాల్సిన ఫలితం మాత్రం నేనే యివ్వగలను, యిస్తాను ; అది ఎప్పుడు, ఎలా, మీకు యివ్వాలో - అది నిర్ణయించే వాడిని మాత్రం నేనే , నువ్వు కాదు అంటాడు భగవంతుడు .  

యిది మనకు అర్థం కావాలి . బాగా అర్థం కావాలి. ఎవ్వడికి, ఏది వచ్చినా , అది మంచైనా, చెడైనా, అది వాడు చేసిన పనుల ఫలితమే, వాటి ప్రభావమే;  మనకు రాకూడనిది ఏదీ మనకు రావడం లేదు. అలాగే, మనకు రావాల్సినవి ఏదీ , మనకు రాకపోవడం లేదు. 

ఈ  మూల సూత్రానికి కొన్ని వివరణలు అవసరం . వ్యక్తిగా మనం చేసే పనుల ఫలితం మనకు రావాలి; వస్తుంది . అయితే , సంఘంగా , మనం చేసే వుమ్మడి పనుల ప్రభావం కూడా మనలో ప్రతి వొక్కరికీ వస్తుంది. 

వొక వుదాహరణ : వికిలీక్స్ అనే సంస్థ భారత దేశంలోని  అగ్ర రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు, అగ్ర క్రీడాకారులు - వీళ్ళంతా స్విస్  బాంకుల్లో, ఎంత నల్ల దానం దాచుకున్నారో - చిన్న లిస్టు వొకటి తయారు చేసి, కొన్ని సంవత్సరాల క్రితం  బాహాటంగానే విడుదల చేసింది . అందులో యింకా ఎంతో, ఎంతో మంది  ఉన్నారన్న విషయం కూడా చెప్పింది. అందులో లక్షల కోట్లు, వేల కోట్లు పెట్టుకున్న వారు ఎంతో మంది భారతీయ నాయకులు వున్నారు. ఎంత చెప్పినా , అప్పటి భారత ప్రభుత్వం ఏ మాత్రం స్పందించ లేదని కూడా చెప్పింది . ఎందుకు స్పందించ లేదంటే , ఏం చెబుతాం ?

స్విస్ బాంకుల్లో  లక్షల కోట్లు మన డబ్బు కాజేసి పెట్టుకున్న వెధవలకు  మనం వోటు వేస్తున్నామా ? లేదా ? మా కులం, మా మతం, మా పార్టీ - అని  మహా స్వార్థంగా , మహా మూర్ఖంగా మనం వోటు వేసేంత వరకు మన దేశం ఎలా బాగు పడుతుంది ?  బాబా రాందేవ్ గారు మొత్తుకుంటూనే వున్నారు - స్విస్ బాంకుల్లో వున్న నల్ల ధనం తెస్తే చాలు - మన దేశం బాగు పడి పోతుందని.
అందుకని  అప్పటి ప్రభుత్వం చేసిందేమిటి ? రామ్ దేవ్ గారి లా ఎవ్వరడిగితే , వారిపైన లేని పోని కేసులు పెట్టింది.  మోడీ గారు వస్తే  తమ గుట్టు బయట పడిపోతుందని,  వారిపై , చెత్త చెత్త కేసులు బనాయించాలని చూసింది. కాకుంటే , చేసిన పనుల ఫలితం - ఎప్పుడో వొకప్పుడు రాక మానదు కదా. యిప్పుడు వస్తూ వుంది .  ఈ హేమా హేమీలతో పోలిస్తే - జయలలితా గారిపైన వున్న ఆస్తి కేసు అసలేమీ లేదు - అని అనిపించక  మానదు. 

అయినా ప్రజలుగా మనం మారాలి . లంచగొండి తనానికి, నల్ల  ధనానికి ఎదురుగా - వొక మహా ఉద్యమం బయలు దేరాలి . మన ఊళ్ళల్లో ప్రతి ఆఫీసులో , వున్న లంచగొండి వాళ్ళను మార్చాలి ; మారని వాళ్ళను,  శిక్షించాలి. వొక క్లార్కుగా, కానిస్టేబుల్ గా వున్న వాడు , ఆస్పత్రిలో ప్యూన్ గా వున్న వాడు కోట్లు సంపాదించాలని ఎందుకు బయలు దేరుతున్నాడు ? నాయకుడు  సర్లేదు కాబట్టి .  మనం సర్లేదు కాబట్టి .

సరైన నాయకులను ఎన్నుకుంటే దేశం బాగుపడుతుంది . మోడీ గారు మూడు సార్లు సంపన్న రాష్ట్రమైన గుజరాత్ కు  ముఖ్య మంత్రిగా వున్న వారు. వారికి కోటి రూపాయల ఆస్తి మాత్రమే వుంది. అంతకు మించి వున్న 40 లక్షలను ప్రధాన మంత్రి కాక ముందే, అనాథ శరణాలయాలకు ఇచ్చేశారు. వొక సరైన ఇల్లు కొనడానికి యిప్పుడు వారి వద్ద డబ్బు లేదు. కానీ, 9 రోజులు వుప వాసం చేస్తూ, కేవలం నీళ్ళు మాత్రం తాగుతూ , గొప్ప గొప్ప వారిని ముగ్ధులను  చేసిన వాక్పటిమ , సాధనా పటిమ రెండూ వున్న వాడాయన. అటువంటి వాడు ప్రధాన మంత్రిగా వుండాలా? చుట్టూ వున్న వారు లక్షల కోట్లు ప్రజా ధనాన్ని మింగుతూ వుంటే  నిమ్మకు నీరెత్తినట్టు నోరు తెరవని వారు ప్రధానిగా వుండాలా ? అదీ కాక పొతే, ఆ మింగే వారే పదవిలోకి రావాలా ? 

సరే . మన  వ్యక్తి గత విషయాలకు వస్తే - మనం వర్తమానంలో చేసే పనుల వలననే - మన భవిష్యత్తు శాసించ బడుతుంది . అయితే భూత కాలం లో మనం చేసిన పనుల ఫలితం కూడా చాలా వుంటుంది. బంగారు బ్రతుకైనా , బండ బ్రతుకైనా  మనం సృష్టించుకునేదే (చాలా వరకు). 

పతంజలి మహర్షి అంటారు - "హేయం దుఃఖమనాగతం " అని. అంటే, రాబోయే కాలంలో రాబోయే దుఃఖాన్ని మాత్రమే మనం అడ్డుకోగలం ; దాన్నుండి తప్పించుకోగలం; కానీ , భూత వర్తమానాల లో జరిగి పోయిన, జరుగుతూ వున్న వాటిని మనం ఏమీ చెయ్యలేం అని . 

రాబోయే సుఖ దుఃఖాలకు కారణం - మనం యిప్పుడు చేసే పని. యిదే మన భవిష్యత్తు ను శాసిస్తుంది.
 
మనం బాగా చదవ వచ్చు. మన ఆఫీసుల్లో చేసే పనులు బాగా చెయ్య వచ్చు. మంచి మాటలు మాట్లాడ వచ్చు. మన, మన వాళ్ళ ఆరోగ్యం బాగుండడానికి  ఏం చెయ్యాలో అది చెయ్యొచ్చు. లేని వారికి, తోచిన, చేతనైన సహాయం చెయ్యొచ్చు . యిలా మనం చెయ్య గలిగిన పనులెన్నో వున్నాయి .  

 యిన్ని చెప్పడం దేనికి ? మీరేం చేశారో చెప్పండి అని మీరు అనొచ్చు.  నిజమే . నేనేం చేశానో చెబితే - ఆ పైన మీరు చెప్పండి . నేను యింకా, ఏమేమి చెయ్యొచ్చో ? అది నాకూ మేలు. నేను చేసిన ఈ పనులు చాలా చిన్నవే కావచ్చు. కానీ ఏదో కొంత చేశాను. యిక ముందు మరేదైనా చెయ్యాలి . మీ సలహాలకు నా కృతజ్ఞతలు.    

నేను 60 ఏళ్ళ వయసుకు , అంటే  31-12-2008 నాడు రిటైర్ అయిన  తరువాత   యిప్పటికి 5 1/2 సంవత్సరాలు గడిచాయి.  మొదట 3 సంవత్సరాలు స్వామీ పరమార్థానంద గారి క్లాసులకు, మా అన్న, నేను యిద్దరం వెళ్ళే వాళ్ళం. ఆయన స్వామీ దయానంద గారి ప్రథమ శిష్యులలో ముఖ్యుడు. వారు అద్వైత సిద్ధాంతాన్ని, గీత, ఉపనిషత్తులు, శంకరాచార్యుల, వారి శిష్యుల గ్రంథాలు చాలా విశదంగా చెబుతారు. 3 సంవత్సరాలలో అద్వైతం బాగానే వంట బట్టిందని చెప్పొచ్చు.  

అయితే, ఆ మధ్య కాలంలోనే, నేను నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి  వారు స్టాక్ మార్కెట్ గురించి పెట్టే 13 పరీక్షలు  వొక్కొక్కటిగా రాశాను. 84 శాతం సగటు మార్కులతో పాసయ్యాను. అందుకని వారు, నాకు ఆ 13 పరీక్షల సర్టిఫికేట్ ల తో బాటు మరో మూడు సర్టిఫికేట్ లు కూడా యిచ్చారు . అవి , యివి : 

1. NSE  సర్టిఫైడ్ మార్కెట్ ప్రొఫెషనల్ - లెవెల్ -5 (యిదే  హైయెస్ట్ )
2. NSE  సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్  ఛాంపియన్ 
3. NSE సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రో (ప్రొఫెషనల్ ) 
 
వొక ప్రక్క అద్వైతం; మరో ప్రక్క స్టాక్ మార్కెట్. యిది - నాకేమీ వైవిధ్యం అని అనిపించ లేదు.  

ఈ పరీక్షలు రాయడానికి ముందు, ICICI DIRECT వారి ద్వారా,  డీమాట్ అకౌంట్  ఓపెన్ చేశాను. నాకు రిటైర్మెంట్ సమయంలో వచ్చిన డబ్బులో సగం అందులో వేశాను.  సగం బాంక్ లో ఫిక్సెడ్ డిపాజిట్ లో వేశాను. మెల్ల మెల్లగా వొక్కొక్క కంపెనీ షేర్లలో కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్  చేస్తూ వచ్చాను . ఏ కంపెనీ షేర్లలో వేసినా, దాన్ని గురించి కనీసం వొక వారం రోజులు పూర్తిగా అధ్యయనం చేసే, ఆ తరువాతనే వేశాను . 

గొప్ప గొప్ప ఇన్వెస్టర్ల  గురించి, వారి విధానాల గురించి చాలా చదివాను. ముఖ్యంగా, వారెన్ బఫే (బఫెట్ ) గారు చెప్పిన సిద్ధాంతాలు  చాలా చాలా చదివాను. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్  చేయాలనుకునే వారందరికీ, వారెన్ బఫే గురించి మొదట తెలియాలి. స్టాక్ మార్కెట్ లో 'ఇన్వెస్ట్'  చేసే వారికి,  'స్పెకులేషన్'  చేసే వారికి చాలా అంతరం  వుంటుంది. ఎంత మంది చెప్పినా , నేను యింత వరకు స్పెకులేషన్  వైపు వెళ్ళలేదు . 

స్టాక్ మార్కెట్ లో ఎలా, ఎందులో, ఎప్పుడు ఇన్వెస్ట్ చెయ్యాలనేది  వొక సైన్స్ , వొక కళ .   యిది ఎవరైనా నేర్చుకోవచ్చు. యిది జీవితాంతం ఎప్పటికీ యింకా , యింకా నేర్చు కుంటూనే వుంటాను, అని నాకు  బాగా అర్థమయ్యింది. ఈ వ్యాపకం నాకు బాగానే వుంది. లాభ దాయకం గానే వుంది.  

సరే . అందులో వచ్చే  లాభం ఏం చెయ్యడం ?  అందులో నాలుగో వంతు (25%) అనాథ బాలికల, బాలుల విద్య కోసం పెట్టాలని నిర్ణయించుకున్నా. యిలా, పోయిన మూడు సంవత్సరాలూ  చేశాను. 2013 లో , లక్ష పది వేలకు పైగా విరాళం యివ్వ గలిగాను. 2014 లో యిప్పటి వరకు 86 వేలకు పైగా యిచ్చాను.  నవంబర్ 17, మా 36 వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా, మరో 80 వేలు యిస్తానని చెప్పేశాను . అంటే - ఈ విరాళాలు రెండూ యిద్దరు అనాథ బాలికల కు 5 నుండి 12 తరగతుల వరకు అయ్యే పూర్తి ఖర్చు అన్న మాట.  యిది కాక, వొకరికి , ఆర్ధిక పరిస్థితి ననుసరించి, 50 వేలు యిచ్చాను కాని అది అభిమాన పూర్వకంగా యిచ్చింది ; విరాళంగా కాదు .  

ముందు ముందు దేవుడి ఆశీర్వాదం వుంటే - యింకా, ఎంతో చెయ్యాలని వుంది. రిటైర్  అయిన సమయంలో, జీతం పెన్షన్ గా మారిన సమయంలో, 1/3 వ వంతు కు తగ్గిన సమయంలో , యింత మాత్రం చెయ్య గలనని ఎప్పుడూ అనుకోలేదు.  యిప్పుడు యింకా , యింకా చెయ్యాలని,  ఉత్సాహం వుంది . 

సరే . జీవితం లో మరో కోణం చూద్దాం . నాకు సంస్కృతం చదవాలని , నేర్చుకోవాలని ఎప్పటి నుండో మనసులో వుండేది . బెంగళూరులో సంస్కృత భారతి  అనే ప్రసిద్ధ సంస్థ  వుంది.  వారు నిర్వహించే సంస్కృత పరీక్షలు, కరెస్పాండెన్స్  కోర్సులు  చాలా ప్రసిద్ధి గాంచినవి . నేను రెండేళ్ళ క్రితం అందులో చేరాను. నాలుగు పరీక్షలూ, ఆరు, ఆరు నెలల, రాయాల్సిన వ్యవధిలోనే రాసేశాను . ప్రవేశ , పరిచయ , శిక్ష , కోవిద - అనే యివి నాలుగూ  పాసు కావడానికి 2 ఏళ్ళు పట్టింది. కోవిద పరీక్షలో 99 శాతం మార్కులతో  పాసు కావడం, నాకు కొంత ఆనందాన్నిచ్చింది. యిప్పుడు, యింకా బాగా నేర్చుకోవాలని  ప్రయత్నిస్తున్నాను .

యివి కాక యింకేం చేశాను ? మీరు చదువుతున్న  ఈ తెలుగు బ్లాగు , ఆంగ్లంలో రెండు బ్లాగులు  రాస్తున్నా.  ఆంగ్లంలో - స్టాక్ మార్కెట్ గురించి వొక బ్లాగు, మరొకటి మన స్పిరిచువాలిటీ  గురించి. అందులో పతంజలి యోగ సూత్రాలు, ఆత్మ బోధ  లాంటి చాలా గ్రందాల గురించి విస్తృతం గా రాయడం జరిగింది. రెండేళ్ళ క్రితం చిలుకూరి వెంకటేశ్వర్లు గారు నాకు పరిచయమయ్యారు. వారు అడగడం, వారు ఆంగ్లంలో ఉపనిషత్తుల పైన రాసిన  పుస్తకాలను చదివి - వాటి మూల గ్రంథాలనూ చదివి , ఎడిట్ చెయ్యడం కూడా జరిగింది. అప్పుడు తెలిసింది , రామకృష్ణ మిషన్ వారి తెలుగు పబ్లికేషన్స్ లో చాలా పుస్తకాలు వారు రాసిందేనని.   అంతకు మించి - తెలిసింది , మన ఉపనిషత్తులు ఎంత పురాతనమైనవైనా, ఎంత గొప్పవో ! అవి చదవడానికి నాకు ప్రోత్సాహమిచ్చిన, వారికి నేనెప్పుడూ కృతజ్ఞుడనై  వుంటాను . 

ఈ  భూత కాలం పునాదుల పైన భవిష్యత్తులో, మరే చిన్న కట్టడాలు,లేదా భవంతులు వుంటాయో - నాకు తెలీదు. అయితే , నిశితంగా ఆలోచిస్తే, పెద్దగా మనం చేసేదేమీ లేదు ; ఏదో అతీత శక్తి అటు వైపు , యిటు వైపు మనలను నడిపిస్తోందని   స్పష్టం గా తెలిసి పోతుంది. ఆలోచన కాస్త మనది ; ఆపై వేసే వొక్క అడుగు మనది ; కానీ అంతకు మించి నడిపించే అతీత శక్తి మరేదో వుంది. 

నాకు తెలిసి చాలా మంది చేస్తున్న పనుల్లో చాలా చిన్న శాతం మాత్రమే చెయ్య గలుగుతున్నా - అని మాత్రం చెప్ప వచ్చు. కాబట్టి యిదేదో స్వంత డబ్బాగా నేను అనుకోవడం లేదు. ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి ?  65 1/2 సంవత్సరాల వయసులో ఏం చెయ్యొచ్చు ? ఎన్నో చెయ్యొచ్చు . 


అదీ ఆలోచన, తపన . అంతే .


మరి, మీ సలహా చెప్పండి . 

= మీ 

వుప్పలధడియం విజయమోహన్

22, అక్టోబర్ 2014, బుధవారం

నిజమైన దీపావళికి - మన గమ్యాలేమిటి - రాష్ట్రానికి గమ్యం ఏమిటి ?- చంద్రబాబు గారు ఏం చెయ్యాలి?

 

నిజమైన దీపావళి

 
చేసే ప్రతి ప్రయత్నంలోనూ,  మనం విజయం పొందుతామని గ్యారంటీ ఏమీ లేదు . అప్పుడప్పుడూ వోటమి సహజం . మన ప్రతి విజయం వెనుక కొన్ని వోటములు వుండ వచ్చు . అది సిగ్గు పడాల్సిన  విషయం కాదు . అసలు ప్రయత్నమే  చెయ్యని వాడికి , విజయమేమిటి , వోటమి ఏమిటి ? జీవితమే అగమ్యం .
 
మనలో ప్రతి వొక్కరికీ , నిర్దిష్టమైన గమ్యం అవసరం . ఆ గమ్యం వైపు వెళ్ళడానికే ప్రయత్నం కావాలి . మన ప్రయత్నం యొక్క ఫలితం గెలుపో, వోటమో, ఏదైనా కావచ్చు . కానీ, మొదటి నుండి, తుది వరకు, గమ్యం చేరడానికి చెయ్యాల్సిన ప్రయత్నం చెయ్యడంలో మాత్రం మనం ఓడిపోకూడదు. ఇది చాలా ముఖ్యమైన , చాలా అందమైన మాట .
 
జీవితం లో  మనం చేసే ప్రయత్నమే మన విజయానికి మూలము. కట్ట కడపట వచ్చే విజయాన్నే కాదు, మన ప్రతి ప్రయత్నాన్నీ మనం ఆనందించాలి.  ఇదే శ్రీకృష్ణుడు వుపదేశించిన కర్మయోగం . కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన.
 
ప్రయత్నం మన బాధ్యత.  మనం ప్రయత్నం చెయ్యడంలో, మన బాధ్యతే, మన అధికారమే వుంది ; మన ప్రయత్నాలకు దేవుడు బాధ్యుడు కాదు.  కానీ, ఫలితం యిచ్చేవాడు మాత్రం ఆయనే . ఎందుకు, ఎప్పుడు, ఎలాంటి ఫలితం యిస్తాడో - అది మన యిష్ట  ప్రకారం  కాదు ; అది తన యిష్ట ప్రకారం యిస్తాడు .   

అందుకే, మన ప్రయత్నాన్ని - మనం పూర్తిగా మన బాధ్యతగా స్వీకరించి , దాన్ని అమలు చేస్తూ ఆనందించాలి. ఫలితం ఎలాగూ వస్తుంది . రాకుండా మాత్రం వుండదు . ఎప్పుడో, ఎలాగో - అది చెప్పడం కాస్త కష్టం. ఆ ఫలితం ఏదైనా , అదీ మనం ఆనందం తో అనుభవించాలి.
 
ఫలితాలు మన ప్రయత్నానుసారంగానే  వస్తూ వుంటాయి - కానీ , కాస్త ముందూ వెనుకలుగా. మనకు అక్కడే కాస్త తికమకగా వుంటుంది .   దాన్ని గురించి  పెద్దగా చింతించ కుండా తరువాత ప్రయత్నం మొదలు పెట్టేసేయ్యాలి ; అలా గమ్యం వైపు సాగిపోవడమే జీవితం .
 
అప్పుడప్పుడూ వెనక్కి తిరిగి చూడాలా వద్దా ? చూడొచ్చు. తప్పు లేదు.  ఇది వరకు మనం చేసిందేమిటి ? చెయ్యనిదేమిటి ? చెయ్యాల్సిందేమిటి ? యివి వొక్క సారి చూసుకుని ముందడుగు వెయ్యడంలో తప్పేమీ లేదు . 24 గంటలలో , వొక 5 నిముషాలు  ఈ పని చేస్తే , మిగతా 23 గంటలు, 55 నిముషాలు ప్రయోజనాత్మకంగా వుంటుంది .
 
స్టీఫెన్ కోవీ  గారు  - మీరు వేసే ప్రతి అడుగూ , గమ్యం వైపే వేస్తున్నారా , గమ్యానికి దూరంగా వేస్తున్నారా - అది సరి చూసుకుంటూ  వేయమంటారు.  గమ్యానికి దూరంగా వేసే ప్రతి అడుగూ, మనల్ని, విజయానికి దూరంగా తీసుకెడుతూ వుంటుంది. వాటికి ఫలితం  వుండదని  కాదు .  కానీ, అ ఫలితం  పెద్ద ప్రయోజన కారిగా వుండదు. మీరు నిచ్చెనను వెయ్యాల్సిన గోడకు వేస్తే , చెయ్యాల్సిన పనే చేస్తారు. మరో గోడకు వేస్తే, చెయ్యకూడని పని చేసేస్తారు. అవునా ! యిది మనం చెయ్యాల్సిన పనేనా, వెళ్ళాల్సిన మార్గమేనా అని అప్పుడప్పుడూ చూసుకోవాల్సిన అవసరం వుంది. లేదంటే, వినాయకుడిని చెయ్యబోయి, హనుమంతుడిని  చేసేస్తారు . అమెరికాకు వెడుతున్నామనుకుని అరేబియా కు వెళ్లి పోతారు. రోడ్ల మీద మార్గ దర్శక గుర్తులు అందుకే వున్నాయి . సముద్ర యానం లో దిక్సూచి అందుకే కావాలి . జీవన యానంలోనూ, గమ్యం తెలిపే దిక్సూచి మనకు కావాలి .  
 
అలాగే , స్టీఫెన్ కోవీ  "షార్పెన్  ది సా " అంటారు . అంటే , "మీలోని మేధా శక్తికి, మీ బుద్ధి కుశలత కు, మీ పనిముట్లకు  బాగా పదును పెట్టండి . అవి  బాగా పని చెయ్యగలిగేవిగా వుండేటట్టు  చూసుకోండి" అంటారు ఆయన. యిదే మాట గీతలో శ్రీకృష్ణుడూ అంటాడు  "యోగః కర్మసు కౌశలమ్" అని . అంటే మనం చెయ్యాల్సిన పనిని చాలా బాగా చెయ్యడమే యోగం అంటాడు . యిదే  భారతంలో అర్జునుడు మొదటి నుండీ చివరి వరకు చేశాడు. దీపాలు ఆరిపోతే , చీకట్లోనే భోజనం చేసిన అర్జునుడు , చీకట్లోనే అస్త్రవిద్యను కూడా నేర్చుకోవడానికి పూర్తి  ప్రయత్నం చేసి సఫలుడయ్యాడు .
 
మనం గమ్య మార్గం లో వెళ్ళాలంటే, దానికి తోడ్పాటుగా  శారీరక బలం, బుద్ధిబలం, దైవ సహకారం అన్నీ మనకు వుండాలి .మనం సాధారణంగా విజయానికి మూల సూత్రాలు  - లాంటివి  ఎన్నో చదువుతూ వుంటాము .  అసలు విజయం అంటే ఏమిటి ? పాండవులు యుద్ధంలో గెలవడం విజయమా? అది వారికి ఎంత మాత్రం సంతోషాన్ని యిచ్చింది ? సత్యభామ నరకాసురుడిని వధించడం విజయమా? అది ఆమెకు సంతోషాన్ని యిచ్చిందా ? కళింగ యుద్ధంలో అశోకుడి గెలుపు అతడికి సంతోషాన్ని యిచ్చిందా? 
 
విజయం సంతోషాన్ని యివ్వాలి.  అలా సంతోషం యివ్వని విజయం  ఎందుకు ? అది , గెలిచినా, వోడినట్టే కదా.  
 
మనసుల్ని గెలవడం చాలా గొప్ప విజయం . మనుషుల్ని గెలవడం చాలా చిన్న విజయం . నిజానికి , దీపావళి అంటే అదే . ఎంత మంది మనసుల్లో  దీపాలు వెలిగిస్తే అంత పండుగ ; అంత ఆనందం .  
 
మోడీ గారు స్వచ్చ భారత్ కావాలి, అది మనం తీసుకు రావాలి అంటారు . అది మొదట మన మనసుల్లో  ఆరంభం కావాలి. మనసుల్లోని కల్మషాన్ని తుడిచి పారెయ్యాలి . అది మనకు ఎంతో  ఆనందం యిచ్చే బృహత్ సాధన . రోజుకు  కనీసం రెండు  సంతోషాన్ని కలిగించే మంచి మాటలు, వారానికి వొక్కటైనా మంచి పని - చెప్పాలి , చెయ్యాలి అనుకుంటే జీవితానికి వొక గొప్ప గమ్యం ఏర్పడుతుంది .  అలా చేస్తున్న వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు .  ఇది చాలా అందమైన , కానీ , అతి సులభమైన గమ్యం . 
 
వొకాయన అన్నారు - "మా మోడీ గారు స్వచ్చ భారత్ అంటే , మా దేశం లోని కోట్లాది ప్రజలు చీపురు పట్టుకుని దేశాన్ని శుభ్రం చెయ్యడానికి బయలుదేరారు.  మా దేశం శుభ్రం అవుతోంది.  కానీ -  తుపాకీ పట్టుకోండి - అని ఆయన అంటే పాకీస్తాన్ వుగ్రవాదుల్లారా ,  మా ఎదుట మీరు నిలువగలరా ? ఎందుకు మీకీ వెన్నుపోటు తుంటరి చేష్టలు ?" 
 
జీవితంలో విజయానికి అర్థం తెలియని వారికి - నాకు రెండు కళ్ళు పోయినా పొరుగు వాడికి వొక కన్ను పోవాలి - అనుకునే మూర్ఖుడికి - మొదట అది తెలియజెప్పాలి .  
 
దీన్ని దాటి - మనలో ప్రతి వొక్కరూ , మన మన జీవితాలకు వొక గొప్ప గమ్యం ఏర్పరుచుకోవాలి.  
 
ఆనందంగా వుండడమే పెద్ద గమ్యం అయినా - దాన్ని సాధించడానికి అనుబంధంగా,  ఎన్నో గమ్యాలున్నాయి . శారీరకంగానూ , మానసికం గానూ ఆరోగ్యంగా వుండాలి. యిది వొక గమ్యం. ఆర్థికంగానూ ముందుకెళ్లాలి. యిదీ వొక గమ్యం . ఏవైనా కొన్ని విద్యలలో ప్రావీణ్యత సంపాదించాలి .యిదీ వొక గమ్యం .ఇవేవీ వద్దని మన వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు . మన ఋషులు గొప్ప శాస్త్ర వేత్తలు . సృష్టిలోని ఎన్నో రహస్యాలను పరిశోధించి కనుగొన్న వారు. మన ఆయుర్వేదం ఎంత గొప్పదో ! మన వాస్తు శాస్త్రం ఎంత గొప్పదో ! మన యోగ విజ్ఞానం ఎంత గొప్పదో ! మన తర్క శాస్త్రం , మన కర్మ సిద్దాంతం , మన గుణత్రయ విభాగ శాస్త్రం మన సంఖ్యా శాస్త్రం - దేని కదే గొప్పగా యీరోజుకూ ప్రకాశిస్తున్నాయి .  
 
కాకపోతే - తన్ను తాను తెలుసుకోవడం , తన మనసు పైన , తన శరీరం పైన విజయం సాధించడం - అన్నిటి కన్నా గొప్ప విజయం అన్నారు , మన వారు. వంద కోట్ల ప్రజల పైన అధికారం వుంది కానీ, నా మనసు పైన నాకు అధికారం లేదు, నా మనసు నా మాట విననంటుంది - అంటే , అది విజయం అవుతుందా ? అదే - అప్పటి దుర్యోధనుడి , రావణుడి  సమస్య . ఈ రోజుకూ అటువంటి వారందరికీ అదే సమస్య . 
 
మనసు పైన అధికారం వున్న వాడికి , ప్రకృతి  కూడా వశ వర్తి అవుతుందని మన వాళ్ళు గట్టిగా చెప్పారు. వారేం  అనుకుంటే అది చెయ్యడానికి ప్రకృతి  లోని అన్ని శక్తులూ  ముందుకు వస్తాయట.  యిలా జరగడం మనం ఈ రోజుకూ చూడొచ్చు . కాబట్టి, ప్రతి వొక్కరికీ , యిదే గొప్ప గమ్యం . 
 
సరే . రాజుకు ఎలాటి గమ్యం వుండాలి ? ప్రజలంతా , సకల, ఆయురారోగ్య ఆనంద, ఐశ్వర్యాలతో , మహా బుద్ధి మంతులుగా , మహా శక్తి మంతులుగా , సఖ్య భావంతో వుండాలనేగా ?
 
మన మోడీ గారు పీ. టీ. ఉషా గారిని గుజరాత్ కు ఆహ్వానించి , అక్కడ, అందరికీ ఆటలలో తర్ఫీదు యివ్వమని అడిగారు ఆమె కూడా వెంటనే వొప్పుకున్నారు . మరి మన చంద్రబాబు కూడా  మోడీ గారికి తక్కువేమీ కాదు కదా ! అందువలన , వారు కూడా , మల్ల యుద్ధం , జిమ్నాస్టిక్స్ లాంటి మంచి పోటీలలో తర్ఫీదు యివ్వగలిగే వాళ్ళని ఆంధ్రా కు పిలిస్తే  ఆంధ్రులలో - శారీరక ఆరోగ్యమూ , అన్ని రంగాలలో ముందుకు పోవాలన్న బలమైన కోరిక కలగడానికి అనువుగా , ప్రోత్సాహంగా వుంటుంది.  లేదంటే - BP , చక్కర వ్యాధి లాంటి అనారోగ్యాలు మన వాళ్ళలో ఎక్కువవుతూ వుంటాయి .  
 
యిప్పుడు హర్యానా లో - అటువంటి మంచి , ప్రోత్సాహ కరమైన వాతావరణం  వుంది . మన రాష్ట్రంలో లేదు . చంద్రబాబు నాయకత్వంలో - ఆయన ప్రతి రంగంలో - హేమా హేమీ లను పిలిచి - మన వారికి ట్రైనింగ్ యిప్పిస్తే - మన రాష్ట్రం ఎంతో బాగు పడుతుంది .  

 
 
మన రాష్ట్రం లోని ప్రతి వొక్కరూ  - ఆరోగ్యంతో , వుత్సాహంతో ముందుకు సాగిపోయే వారయితే , అంతకు మించిన దీపావళి మరొక్కటి వుంటుందా ? వచ్చే ఆసియాడ్ , ఒలింపిక్స్  లాంటి పోటీలలో , ఆంధ్రులు ఎక్కువ వుంటారనీ , మన రాష్ట్రానికి గొప్ప పేరు తెస్తారనీ - మనం ఆశిద్దాం . ఈ మాటలు చంద్ర బాబు గారు వినాలి ; దానికి తగిన చర్యలు తీసుకోవాలి అని - ఆశిద్దాం .
 
ఇలాంటి గొప్ప గమ్యం పెట్టుకుంటే - రాష్ట్రం - అన్ని రంగాలలో , అభివృద్ధి చెందుతుంది - అందులో సందేహం లేదు . 
 
అది మనమందరం కలిసి సాధిద్దామని ఆశిస్తూ - దీపావళికి మీకందరికీ , నా హార్దిక శుభాకాంక్షలు . 
= మీ 
 
వుప్పలధడియం విజయమోహన్