19, మార్చి 2014, బుధవారం

శ్రీకృష్ణుడా?యదువీరులా ? శల్య సారథ్యమా ? శ్రీకృష్ణ సారథ్యమా ? మీ నిజ జీవితంలో ఏది కావాలి మీకు ?


శ్రీకృష్ణుడా - యదువీరులా ?  
ఎవరు కావాలి మీకు ? 
శల్య  సారథ్యమా ? శ్రీకృష్ణ సారథ్యమా ?
ఏది కావాలి మీకు ? 
 

ఈ మహా భారత కథ మీకు తెలిసే వుంటుంది. కానీ ఈ కథ వెనుక దాగివున్న జీవిత సత్యం మీకు తెలుసా ?  

నిజానికి , మహా భారతంలో వుండే అనేక పిట్ట కథలలో , అలాగే , అందులోని అనేక ముఖ్య సంఘటనలలో - ఈ రోజుకూ మనకు కావలసిన జీవిత సత్యాలు, జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపించ గల జీవిత సూత్రాలు  - ఎన్నెన్నో నిక్షిప్తమై వున్నాయి . 

యిటువంటి, యింత గొప్ప ఇతిహాసం - ప్రపంచం లో మహా భారతం వొక్కటే . దీన్ని మించిన పుస్తకం, కావ్యం , యితిహాసం మరెక్కడా మరొక్కటి లేదు. కాకపొతే , దీన్ని సరైన రూపంలో - ప్రపంచానికి, మనం అందించలేక పోతున్నాము.  అందువలన మహాభారతం లాంటి మహత్తర గ్రంథం కూడా మరుగున పడిపోతున్నది.  మన భారత ప్రభుత్వం వారి వైఫల్యాల్లో యిది కూడా ప్రముఖమైనదిగా చెప్పుకోవాలి. 

సరే . యిప్పుడు అసలు కథకు వద్దాం . 

మహాభారత యుద్ధం ఆరంభం చెయ్యడానికి - ఇరువైపులా సన్నాహాలు జరుగుతున్న సమయం అది . పాండవులూ, కౌరవులూ భారత దేశం లోని అందరు రాజుల సహాయమూ అర్థిస్తున్న సమయం  అది.  ఆ కాలంలో, చాలా మంది రాజులకు వొక నియమం వుండేటట్టు కనిపిస్తుంది. ఎవరు తమను ముందుగా సహాయం అడుగుతారో , వారి ప్రక్కన యుద్ధం చెయ్యడమే కానీ , వారి వైపు ధర్మం వుందా , లేదా - అన్నది పెద్దగా చూడ లేదు వారిలో చాలా మంది . 

ఉదాహరణకు శల్యుడు. శల్యుడు మద్ర దేశపు రాజు . చాలా కాలానికి  ముందు, వొక సారి శల్యుడి సేన, పాండురాజు సేన వొక చోట ఎదురు పడతాయి. అప్పుడు శల్యుడు , శల్యుడి సేనాపతి పాండురాజుతో మాట్లాడే సందర్భం వస్తుంది. శల్యుడి ప్రక్కన సన్నగా ముచ్చటగా వున్న అతడి సేనాపతి పాండురాజు దృష్టిని ఆకర్షిస్తాడు. అది చూసి శల్యుడు , మనలో ఎవరు విజయం చేపట్టుతారో - అది యుద్ధం చేసైనా సరే , లేదా వివాహ బంధం తో నైనా సరే - తేల్చుకుందాం, అంటాడు. నిజానికి అతడి సేనాపతి అతడి చెల్లెలైన మాద్రి .  పాండురాజు సంతోషంతో మాద్రిని వివాహం చేసుకుంటాడు. దీన్ని బట్టి మనకు ,  ఆ కాలంలో మహిళలు కూడా - అందరు కాక పోయినా , కొందరైనా - యుద్ధ విద్యలను అభ్యసించే వారని తెలుస్తుంది . యిలా శల్యుడు పాండవులకు మేనమామ  అయిన వాడు ;

భారత యుద్ధానికి ముందు శల్యుడు , పాండవుల వైపు యుద్ధం చెయ్యాలని , సైన్యం తో సహా బయలుదేరుతాడు. కానీ, మార్గ మధ్యం లో దుర్యోధనుడు శల్యుడికి విందు భోజనం పెట్టి, పెట్టినది పాండవులే అని శల్యుడు అనుకుని , ఆ విందు పెట్టిన వారికి ఏ సహాయమైనా చేస్తానని శల్యుడు నుండి దుర్యోధనుడు కుయుక్తితో మాట తీసుకుని - ఆ తరువాత చెబుతాడు , ఆతిథ్యం యిచ్చింది , కౌరవులని , శల్యుడు వారివైపే వుండాలని . 

యిలా ఏదో చిన్న కారణానికి , శల్యుడు కౌరవుల వైపు యుద్ధం లో చేరిపోతాడు . ఇది దుర్యోధనుడి కుయుక్తి . అయితే , ఈ కుయుక్తిని కాస్త ఆలస్యంగా, కౌరవులకు మాట యిచ్చిన తరువాత,  తెలుసుకున్న శల్యుడు - మళ్ళీ ధర్మరాజు వద్దకు వెళ్లి తన విచారం వెలి బుచ్చుతాడు.  అప్పుడు ధర్మ రాజు, శ్రీకృష్ణుడు, కాస్త ఆలోచించి -  శల్యుడికి వొక సలహా యిస్తారు.  యుద్ధంలో, ఏదో వొక సమయంలో కర్ణుడు సేనాధిపతి అయిన తరుణంలో, శల్యుడు అతనికి సారథ్యం వహించ వలసిన పరిస్థితి వస్తుంది ; ఆ సమయంలో  శల్యుడు , తన మాటలతో కర్ణుడిని నిర్వీర్య పరచవలసినదిగా చెబుతారు. ఈ విధంగా , కర్ణుడికి శల్య సారథ్యం , దాని ఫలితంగా కర్ణుడి మరణానికి శ్రీకృష్ణుడి  సలహాతో యుద్ధానికి ఎంతో ముందే పునాది వెయ్యడం జరుగుతుంది. దుర్యోధనుడి కుయుక్తి అతనికే ఆపద తెచ్చిపెడుతుంది. 

మరి కృష్ణ సారథ్యం గురించి తెలుసుకోవాలిగా . యుద్ధానికి శ్రీకృష్ణుడి సహాయం అర్థించడానికి, అర్జునుడూ దుర్యోధనుడూ , యిద్దరూ దాదాపు ఏక కాలంలో వస్తారు.  వారు వచ్చిన సమయంలో శ్రీకృష్ణుడు నిద్రిస్తూ వున్నట్టు నటిస్తూ వుంటాడు . వచ్చిన దుర్యోధనుడు , కృష్ణుడి తలవైపున్న ఆసనం లో కూర్చుంటాడు . అదో అహంకారం - నేను మహారాజాధిరాజును, ఈ యాదవుడి కాళ్ళ దగ్గర కూర్చోవడమేమిటని.  అర్జునుడు కృష్ణుడి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు.  దుర్యోధనుడి మనసులో అహంకారం . అయినా అతడికి కృష్ణుడి సహాయం కావాలి, యుద్ధం లో. అర్జునుడి మనసులో కృష్ణుడి పట్ల స్నేహానుబంధం;మమతానుబంధం; భక్తిభావం; అన్నీ వున్నాయి.  అర్జునుడికి యెలాగైనా సరే, కృష్ణుడు కావాలి ; కేవలం యుద్దానికని కాదు . అది అతనికి కృష్ణుడితో వున్న జన్మ జన్మల అనుబంధం. అందుకని అతడికి కృష్ణుడే కావాలి.

కృష్ణుడు లేస్తాడు. లేచినట్టు నటిస్తాడు. జగన్నాటక కర్త గదా . లేచిన వెంటనే కాళ్ళ వద్ద నున్న ఆర్జునుడిని చూస్తాడు. కుశల ప్రశ్నలు వేస్తాడు. ఆ తరువాత దుర్యోధనుడినీ చూస్తాడు . అతనితోనూ మాట్లాడుతాడు. ఆ తరువాత అడుగుతాడు విషయం ఏమిటని. యిద్దరూ విషయం చెబుతారు. దుర్యోధనుడు చెబుతాడు - నేనే మొదట వచ్చాను, కాబట్టి , నువ్వు నాకే సహాయం చెయ్యాలని . కానీ, కృష్ణుడు అంటాడు - కానీ, నేను మొదట అర్జునుడి నే చూశాను; అతడినే అడిగాను విషయమేమిటని . అయినా, మీరిద్దరూ , నాకు కావాల్సిన వారే కదా . యిద్దరికీ సహాయం చెయ్యడం నా ధర్మం కదా . కాబట్టి, మీకు వొక నిర్ణయాధికారం యిస్తాను. నేను నిరాయుధుడిగా, అస్త్రం పట్టకుండా, వొకరి వైపు వుంటాను ; మరొకరి వైపు నాతో సమానమైన 10 వేల మంది యదు వీరులు, శస్త్రాస్త్రాలలో ప్రవీణులు , వారు యుద్ధం కూడా చేస్తారు. వారు మరొక వైపు వుంటారు . 

అయితే , మీయిద్దరిలో  చిన్న వాడు  అర్జునుడు గనుక - మొదట కోరుకునే అవకాశం అతడికే యిస్తున్నాను - అంటాడు .    

దుర్యోధనుడికి కోపం . శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి గనుక ఎలాగో యదు వీరులను వారికి యిచ్చి తాను  యుద్ధం చెయ్యకుండా తమ ప్రక్క కూర్చుంటాడేమో నన్న అనుమానం . 

కానీ , అర్జునుడి మనసులో శ్రీకృష్ణుడు తప్ప మరేమీ లేదు. ముల్లోకాలను యిచ్చినా అవేవీ వద్దు గాక వద్దు , కృష్ణుడే కావాలి అన్న మనో భావం వున్న వాడు . మరో అనుమానం , ఆలోచన ఏవీ లేకుండా, తాను కృష్ణుడినే  కోరుకుంటాడు .
కృష్ణుడు దుర్యోధనుడి వైపు చూస్తాడు . దుర్యోధనుడి మనసులో - ఈ అర్జునుడెంత మూర్ఖుడు , యుద్ధం చేసే పది వేల మంది వీరులను వదిలి పెట్టి, యుద్ధం చెయ్యని ఈ శ్రీకృష్ణుడిని ఎన్నుకున్న పరమ బుద్దిహీనుడు - అనుకుంటాడు . సంతోషంతో, పదివేల మంది యదు వీరులను వెంట బెట్టుకుని హస్తినాపురానికి వెళ్లి పోతాడు . 

యుద్ధం చెయ్యని ఆ శ్రీకృష్ణుడే - కౌరవుల అందరు సేనాపతుల మరణానికి ఏదో విధంగా కారణమవుతాడు . అనేక ఆపదల నుండి, పాండవులలో ప్రతి  వొక్కరినీ  రక్షించిన వాడూ అవుతాడు. అంతే కాదు. దుర్యోధనుడిపై  ఎంత ప్రీతిభావం వున్నా, కృష్ణుడి కి ఎదురు పక్షంలో యుద్ధం చెయ్యలేనని చెప్పి , తీర్థ యాత్రలకు బలరాముడు వెళ్లి పోవడానికి కారణం అవుతాడు.

భీష్మ,ద్రోణ, కర్ణుల శస్త్రాస్త్రాల నుండి, అన్ని రకాలుగా అర్జునుడి రక్షణకు చివరి వరకు తానే కారణం గా - శ్రీకృష్ణుడు  నిలుస్తాడు.

అన్నిటినీ మించి , అర్జునుడి మనసులో విషాద భావం బలంగా నాటుకుని వున్న సమయంలో - అర్జునుడికీ , అర్జునుడి పతాకం లో వున్న తన మరో భక్తుడు హనుమంతుడికీ - సంజయుడి ద్వారా, వ్యాసుడి ద్వారా మనకూ-  భగవద్ గీత లాంటి అత్యున్నతమైన వొక సైన్స్ ను బోధిస్తాడు శ్రీకృష్ణుడు . అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగే ప్రశ్నలే - మన జీవితాలలో , మనం ఎదుర్కొనే ప్రశ్నలు . అన్నిటికీ , శ్రీకృష్ణుడు  సశాస్త్రీయమైన సమాధానాలు యిస్తాడు . 

గీత అనే ఆ సైన్స్ ను అర్థం చేసుకున్న వారి జీవితాలలో - విషాదానికి చోటు లేదు . ఆనందానికి అలవి లేదు . జ్ఞానానికి అంతు లేదు . సంపూర్ణ ఆరోగ్యానికి మూల సూత్రాలు అన్నీ గీతలో వున్నాయి.  ఆనంద మయ జీవితానికి మూల సూత్రాలు యిందులో వున్నాయి. విజయానికి కావలసిన  అన్ని మెట్లూ యిందులో వున్నాయి. గీతను A  to Z  ఆఫ్ లైఫ్  అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. శ్రీకృష్ణుడు  అర్జునుడికి ఏదో మతం గురించి బోధించనే లేదు. విజ్ఞానము, జ్ఞానము - అదీ జీవితానికి వొక్కొక్క నిముషమూ వుపయోగపడేవి చెప్పాడు . ఎన్నో రకాల కిటుకులూ , టెక్నిక్స్  చెప్పి - యిందులో నీకేది కావాలో అది నిర్ణయించుకో అన్నాడు. శ్రీకృష్ణుడు అహింస బోధించ లేదు. యుద్ధం ఎందుకు, ఎవరితో, ఎప్పుడు , ఎలా చెయ్యాలో చెప్పాడు .  ఏది ఎలా ధర్మం అవుతుందో చెప్పాడు . మనిషి గుణాలు ఏవి , అవి ఎలా వస్తాయి, ఏది ఎప్పుడు వుంటే మేలు - శ్రేష్టమైనది ఏది - అది ఎలా అలవరచుకోవడం - యివన్నీ గీతలో వున్నాయి . ఈనాటి మనస్తత్వ శాస్త్రానికి ఏమీ తెలీని , గొప్ప మనస్తత్వ శాస్త్రం గీతలో వుంది . ఈ నాటి ఆరోగ్య శాస్త్రానికి తెలీని ఎన్నో ఆరోగ్య సూత్రాలు గీతలో వున్నాయి . కాకపొతే , గీతను బట్టీ పెట్టడం ముఖ్యం కాదు. అది తప్పని కాదు. అది మంచిదే . కానీ అంత కంటే ముఖ్యం - అందులోని అంతరార్థం బాగా ఆకళించుకోవడం , పాటించడం .

వొక అర్జునుడు తనకు పది వేల మంది యదు వీరులు వద్దు - శ్రీకృష్ణుడే కావాలి - అని కోరుకుంటే ,   ఎంత మేలు జరిగింది - అర్జునుడికీ , పాండవులకూ , మనకూ .

మరి మీరేం కోరుకుంటూ వున్నారు ? మీకేం కావాలి ?

యదు వీరులు అంటే -  మనం మరొకరితో  శత్రుత్వం పెంచుకుని ,కొట్లాడి , యుద్ధం చేసి,  సంపాదించాలనుకునే    విజయం . అక్కడ విజయం రావచ్చు; రాక పోవచ్చు . విజయం వచ్చినా , అందులో వచ్చే సంతోషం చాలా తక్కువ ; అది ఎక్కువ కాలం నిలువదు కూడా .

శ్రీకృష్ణుడు అంటే - మనం మొదట - మన బలహీనతల పైన యుద్ధం చేసి విజయం సంపాదించడం . ఇది సాధిస్తే  - మిగత ప్రపంచం పై విజయం సంపాదించడం ఎంత సులభమో గ్రహించడం.  ఈ విజయం, దీని ద్వారా వచ్చే ఆనందం నిరంతరం , మహోన్నతం అని గ్రహించడం , దీన్ని అనుభవించడం. దీన్లో ప్రాపంచిక విజయమూ వుంది; పారమార్థిక విజయమూ  వుంది .

యడువీరులు అంటే - పరిమాణం ; సంఖ్య ; ఆంగ్లం లో క్వాంటిటీ  అనవచ్చు . శ్రీకృష్ణుడు అంటే - ఉత్తమత్వం ; వుపయోగత్వం ; ఆంగ్లం లో క్వాలిటీ - అనవచ్చు . మరి , మీకేది కావాలి?

సర్వే  జనాః సుఖినో భవంతు

= మీ

వుప్పలధడియం విజయమోహన్

( ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ - బ్రాండ్ ఈక్విటీ  సెక్షన్ లో " సేనను కాదు ; కృష్ణుడిని ఎన్నుకోండి ; క్వాంటిటీ  కాదు; క్వాలిటీ ఎన్నుకోండి " అన్న వొక  హెడింగ్ చూసిన సందర్భంగా రాయడం జరిగింది. కానీ ఆ  వ్యాసానికీ, ఈ వ్యాసానికీ మరే సంబంధం లేదు . )

14, మార్చి 2014, శుక్రవారం

కుక్క / పిచ్చి కుక్క కరిస్తే - ఏమి ప్రమాదం ? ఏమి చెయ్యాలి ? ఎంత త్వరగా?

కుక్క / పిచ్చి కుక్క కరిస్తే 
ఏమి ప్రమాదం ? ఏమి చెయ్యాలి ? ఎంత త్వరగా?


జీవితంలో  ఎన్నో మలుపులుంటాయి . జీవితంలో సంతోషం తెచ్చే మలుపులు కొన్ని అయితే , భయానకం చేసేవి కొన్ని ; దుఃఖకరమైనవి మరి కొన్ని ; అనూహ్యమైన మలుపులు కూడా ఎన్నో, ఎన్నెన్నో . 

మన  కళ్ళ ఎదురుగా, ఎంతో  మంది జీవితాలలో ఇలాంటివి జరగడం - మనం అయ్యో; అయ్యో పాపం - యిలా అనుకోవడం  జరుగుతూనే వుంటుంది . కానీ - మన జీవితాలలోనే జరిగితే - మనం ఏం అనుకుంటాం ? ఎలా ప్రతిస్పందిస్తాం ?

రక రకాలుగా స్పందిస్తాం . కొన్ని  ఏళ్ల  క్రితం, మాకు తెలిసిన వొకమ్మాయి కి పెళ్లై అత్తగారింటికి వెళ్ళింది. మొదటి రోజే ఆమె భర్త పిచ్చికుక్క కాటు వల్ల "హైడ్రోఫోబియా " వచ్చి చనిపోయాడు.  పెళ్లి కి కొద్ది రోజుల ముందే పిచ్చి కుక్క కరిచిందట . కానీ, దాన్ని  వారు పట్టించుకోలేదు . ఏదో, ఆంటీ బయోటిక్స్ వేసుకున్నాడు. తరువాత మరిచిపోయారు . ఆ తరువాత పెళ్ళయ్యింది. పెళ్లి కూతురుతో సహా వారి ఊరుకు వెళ్ళారు . వెళ్ళిన కొన్ని ఘంటల  లోనే - కుక్క కాటు ప్రభావం పని చేసి - చనిపొయ్యాడు. అతడు చనిపోయిన విధానాన్ని గురించి చిలవలు పలవలుగా అప్పట్లో వర్ణించే వారు .

కొద్ది రోజుల క్రితం మద్రాసు క్రిస్టియన్ కాలేజీ లో - యిద్దరు విద్యార్థులు , కాలేజీ ఆవరణ లోని చిన్న కుక్క పిల్లలతో ఆడుకుంటూ  వుండగా, అవి వారిని కరిచింది; వో రెండు రోజుల్లో ఆ విద్యార్థులకు హైడ్రోఫోబియా వచ్చి చని పోయారు . కరిచిన వెంటనే , సరైన వాక్సీను వేసుకుని వుంటే , వారి బ్రతికే వారే . అంతే కాదు; ఆ కాలేజీ ఆవరణ లో ఈ మధ్య కుక్కల సమూహం చాలా ఎక్కువగా పెరిగిందట.  అది చూసి సరైన చర్యలు తీసుకున్న వారు లేరు . యిటువంటి అసమర్థత , మూర్ఖత్వం మన దేశం లో చాలా ఎక్కువ .

పిచ్చి కుక్క కరిస్తే - యింత భయంకరంగా పని చేస్తుందా - మనుషులు యిలా చనిపోతారా - అని నాకూ చాలా ఆశ్చర్యంగా వుండేది. అయితే - దానికి ఏం చెయ్యాలో, నాకూ వొకప్పుడు తెలీదు . చాలా మందికి యిప్పటికీ తెలీదు. మన సమాజంలో , మన విద్యా విధానంలో , యిదొక పెద్ద లోపం . అతి పెద్ద దురదృష్టం . 

ఎప్పుడో చనిపోయిన మొగలాయీ వంశం, ఆంగ్ల వైస్ రాయ్ లు - లాంటి వారిని గురించి అంతా చదువుతాం . కాని మన వూర్లో , మన వీధిలో పోతున్న కుక్క మనల్ని కరిస్తే - ఏం చెయ్యాలో - వూర్లో 90 శాతం మందికి తెలీదు.   చాలా ఊళ్లలో పిచ్చి కుక్క కాటుకు వెయ్య వలసిన మందులూ లేవు .

చాలా మందికి కుక్కలంటే అమితమైన ప్రేమ. కుక్కలకు కూడా తమ యజమానులైన మనుషులపై అమితమైన విశ్వాసము. నిజానికి కుక్కలకున్నంత విశ్వాసము, ప్రేమ మరే జంతువుకూ వుండడం మనం చూడలేము . అది మంచిదే. కానీ, యింట్లో పెంచే కుక్కలకు కూడా, అప్పుడప్పుడూ ఆంటీ రాబీస్ వాక్సిన్ వేస్తూ వుండాలి. అలా చేస్తే వాటి వల్ల, మనకు ప్రమాదం లేదు. అలా వాక్సిన్ వేయించకుంటే వాటికీ ప్రమాదమే. వాటి వల్ల మనకూ ప్రమాదమే.  వాటికి రాబీస్ రోగం వచ్చిందంటే, అవీ చావడం ఖాయం; వాటివలన మనయిళ్ళలో , వొకరో, ఇద్దరో చావడం కూడా అంతే ఖాయం .

యిక వూరికుక్కలైతే , వాటికి ఎప్పుడు రాబీస్ వస్తుందో చెప్పలేము . ఎప్పుడైనా రావచ్చు ; ఎన్నో కారణాల వల్ల  రావచ్చు . రాబీస్ వస్తే , ఆ కుక్క కనిపించిన  మనిషినల్లా కొరకడానికి ప్రయత్నించడం మనం చూడవచ్చు . యిది ఎన్నో వూళ్ళలో జరిగింది . యికముందూ జరుగుతుంది . నిజానికి ప్రపంచ దేశాలన్నింటిలో ఈ రాబీస్ మరణాలు మన దేశం లోనే చాలా ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. వూరకుక్కల్ని చంపరాదని మనం చట్టం కూడా చేసుకున్నామని వికీ పేడియా వెబ్ సైట్ చెబుతో వుంది . వూరకుక్కల్ని చంపరాదు సరే ;వాటికి రాబీస్ రాకుండా చేసే చట్టాలేవీ మనం చేసుకోలేదు . అసలు అటువంటి ప్రయత్నాలే మన దేశంలో లేవు . యిదొక పెద్ద మూర్ఖత్వం .

చాలా దేశాలలో అసలు రాబీస్ అనే రోగమే లేదు, రాదు . మరి మన దేశంలో యింత ఎక్కువగా ఎందుకు వుంది? కొన్ని కొన్ని ఊర్లలో, వూరకుక్కలు మనుషుల కంటే  ఎక్కువ సంఖ్యలో వున్నాయి . రాత్రి పూట ఎవరూ మరో  వీధికి కూడా వెళ్ళలేని పరిస్థితి చాలా ఊళ్లలో వుంది .  అయినా అక్కడి ప్రభుత్వ యంత్రాంగం ఇవేవీ పట్టించుకునే  పరిస్థితి లేదు . పంచాయితీ పాలన అంటామే కానీ - అది చాలా దరిద్రం గానూ, అసమర్థంగానూ వుంది.  పూర్తి  లంచ గొండి తనం తో నిండి వుంది.  మన ప్రభుత్వ విధానాలు కూడా చాలా అసమర్థంగా వున్నాయి .

అమెరికా , చైనా లాంటి దేశాలలో - యిప్పుడు రాబీస్ ప్రమాదం చాలా తక్కువ . ముందు చెప్పినట్టు - కొన్ని దేశాలలో అసలు లేనే లేదు . మన దేశంలోనే చాలా ఎక్కువ గా వుంది . భూత దయఅంటే యిటువంటి మూర్ఖత్వం అని కాదు అర్థం . చైనా లోని బీజింగ్ లో యింటికి  వొక   కుక్కకు  పైగా పెంచ రాదని; అది కూడా, 14 ఇంచీలు (35. 5సెం. మీ) కంటే పెద్దవిగానూ వుండకూడదు ;భయం కొలిపేది గానూ వుండకూడదు -అని చట్టం కూడా చేశారట. యిది కూడా రాబీస్ రోగం రాకుండా నివారించడం కోసమే .

రాబీస్ రోగం రాకుండా, ముందే వేసుకునే వాక్సీన్ వుంది కాని, వచ్చింతరువాత దాన్ని పోగొట్టే మందే  లేదు ; మరణం ఖాయం . రాబీస్ వచ్చిన కుక్క ఎంత మంది మనుషుల్ని కరుస్తుందో చెప్ప లేము . ఎంత మంది నైనా కరవ వచ్చు . దానికి చూసిన వారినందిరినీ కరవాలని అనిపిస్తుంది. కరుస్తూ పొతుంది. కరచిన వారందిరికీ రాబీస్ వచ్చే ప్రమాదం వుంది - వారు వెనువెంటనే  వాక్సీన్ వేసుకోక పొతే. 

మన రాష్ట్రం గురించి , ఎన్నో ఊర్లలో ఈ పిచ్చి కుక్కల స్వైర విహారం గురించి, రాబీస్ వచ్చిన వారి గురించి వార్తలు - అప్పుడప్పుడూ వస్తూనే వున్నాయి.  అయినా - రాష్ట్ర ప్రభుత్వం గానీ, పంచాయితీలు గానీ ఈ కుక్కలను అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నమే చెయ్యడం లేదు . దీనికి తోడు , బ్లూ క్రాస్  వారి గొడవ పెద్దది . చస్తున్న మనుషుల గురించి వారికి అస్సలు పట్టదు. కుక్కలకు పిచ్చి పట్టడం గురించి కూడా వారికి బాధ లేదు . కానీ కుక్కలను యెవరు ఏం చేసేస్తారో - అన్నది మాత్రమే బాధ.

మనుషుల క్షేమం మొదట - కుక్కల క్షేమం తరువాత గా వుంటే తప్ప దేశం  బాగుపడదు . మన ప్రభుత్వాలు చేసిన పనికి మాలిన చట్టాలు చాలావి యిలాగే వున్నాయి .

కుక్కల సంఖ్య , ముఖ్యంగా  ఊరకుక్కల సంఖ్య గణనీయంగా తగ్గాలి . వాటికి కుటుంబ నియంత్రణ పథకాలు వున్నాయి  కాని అమలు చేసే ప్రభుత్వ యంత్రాంగం సరిగ్గా లేదు . ప్రతి జిల్లా కలెక్టరూ వొక్క వారం రోజులు , పోలీసు, పంచాయితీ, బ్లూ క్రాస్ - యిలా అన్ని విభాగాలనూ కూడదీసి , కుక్కల కుటుంబ నియంత్రణ 100 శాతం చేయిస్తే తప్ప , ఊరకుక్కల బెడద తగ్గదు . రాబీస్ ప్రమాదం వుండనే వుంటుంది .

అలాగే , మన స్కూళ్ళలో , కుక్కలు కరిస్తే - వెంటనే ఏం చెయ్యాలో చెప్పే వొక పాఠం తప్పకుండా  వుండి తీరాలి . కుక్కలను పెంచాలంటే , ఎలాంటి నియమాలు పాటించాలో తెలియాలి .

 నన్ను కూడా ఆరేళ్ళ క్రితం వొక పిచ్చి కుక్క , వెనుక నుండి వచ్చి,  కరిచింది . నన్ను కరిచిన కుక్క మళ్ళీ యింకెంతో మందిని కూడా కరిచిందట.  ఆ తరువాత , దాన్ని ఎవరో చంపేశారట.   నేను మాత్రం - వెంటనే , 5 నిమిషాల లోపే , నాకు తెలిసిన వొక డాక్టరుకు ఫోను చేశాను . ఆమె సలహా ప్రకారం , వెంటనే, కుక్క కరిచిన శరీర భాగాన్ని సోపు తో కడిగి, వేగంగా వెళ్ళే నీళ్ళలో మరింత బాగా కడిగాను. అక్కడున్న కుక్క నోటి లోని సలైవా వీలైనంత పూర్తిగా పోవాలి. అది మొదట చెయ్య వలసిన పని . వెనువెంటనే, దగ్గరున్న డాక్టరు దగ్గరికి వెళ్లి ఆంటీ రాబీస్ వాక్సీన్ ఇంజెక్షన్ చేయించుకున్నాను . ఆ తరువాత , మరో నాలుగు ఇంజెక్షన్లు డాక్టర్ చెప్పిన రోజులలో - వేయించుకున్నాను. మనం చెయ్యాల్సింది యింతే . యిది చేస్తే, మరిక భయం లేదు .

కానీ, యిది చెయ్యకపోతే - కొన్ని రోజులలోగానే రాబీస్ రావచ్చు . లేదా, కొన్ని మాసాలలో రావచ్చు . వొక్క సారి  రాబీస్ లక్షణాలు వస్తే, మళ్ళీ మందే లేదు.  వొక్కో సారి మనం మంచ్జ్హి కుక్క అనుకునేది , రాబీస్ కుక్కగా వుండవచ్చు . కాబట్టి, కుక్క కాటు ఏ  మాత్రమూ అశ్రద్ధ చెయ్య తగనిది .  పైన చెప్పిన వైద్యం వెనువెంటనే  చెయ్యాలి . నాకు ఆయుర్వేదమంటే , చాలా యిష్టం . చాలా విషయాలకు ఆయుర్వేద మందులే వాడతాను . అయినా కుక్క కాటుకు మాత్రం - ఆంటీ రాబీస్ వాక్సీన్  తప్పని సరి . 

మీ వూళ్ళో ఊరకుక్కలు ఎక్కువగావుంటే - వెంటనే పంచాయితీ వారికో , కలెక్టరు గారికో రిపోర్ట్ చెయ్యండి.  వారిద్వారా , వాటి పెరుగుదలనూ అరికట్టాలి ;  వీలైతే , వాటిని, వూరికి దూరంగా వదిలి వేసే  ఏర్పాటూ చెయ్యాలి . ఏదైనా కుక్క అందరినీ కరవాలని  చూస్తుంటే - దానికి పిచ్చెక్కిందనే అనుకోవాలి . అది ఎవరినీ కరవనీకుండా జాగ్రత్త పడాలి.  అది కరిచిన వారూ, బరికిన వారూ - అందరూ ఇంజెక్షన్లు వేసుకుని తీరాలి .  ప్రతి వూర్లోనూ , గ్రామంలోనూ , ఈ వాక్సీన్ వుండి తీరాలి. యిది కరిచిన వెంటనే , వేసుకుంటే  చాలా మంచిది . ఎంత త్వర పడితే - అంత మేలు . అందుకని, మీరున్న ఊళ్లోనే వాక్సీను వుండి తీరాలి - మీకు అందుబాటులో వున్న డాక్టరు గారి దగ్గర వుండాలి . ముఖ్యమైంది - యిది అందరికీ తెలిసుండాలి .

ఇదండీ సంగతి . ప్రతి వారం చదువుతున్న రాబీస్ చావులను చూస్తూ వుంటే; చదువుకున్న వారు కూడా చేస్తున్న నిర్లక్ష్యం , దాని ఫలితాలు  చూస్తూ వుంటే - యిది తప్పక రాయాలనిపించింది .   మీకు తెలిసిన వారికి తప్పక చెప్పండి .

సర్వే  జనాః సుఖినో భవంతు .

= మీ

వుప్పలధడియం విజయమోహన్

 

4, మార్చి 2014, మంగళవారం

కొత్త రాష్ట్రం ఏది ? తెలంగాణానా -సీమాంధ్రానా ? కె సి ఆర్ ను నమ్మితే...దేన్లో మునిగినట్టు ? కాంగ్రెస్ వారే చెప్పాలి .


కొత్త రాష్ట్రం ఏది ?
తెలంగాణానా -సీమాంధ్రానా 
క్రొత్త రాష్ట్రానికి ఏం కావాలి ?

ఇదీ ప్రశ్న . ఇదివరకెప్పుడూ ఇలాంటి ప్రశ్న , ఏ రాష్ట్ర విభజనలోనూ రాలేదు. వుత్తరాఖాండ్ , ఝార్ఖండ్, ఛత్తీస్ గర్హ్  లాంటి రాష్ట్రాలన్నీ కొత్త రాష్ట్రాలుగా ఆవిర్భవించిన సందర్భంలో - ఈ ప్రశ్నే లేదు. కానీ యిప్పుడొచ్చింది. హైదరాబాద్  కూడా, కర్నూలు, విజయవాడ, విశాఖ  లా వుండి  వుంటే , ఇలాంటి ప్రశ్న వచ్చేది కాదు.  వాళ్ళకూ మనకూ,  ఎందు వల్లనో పొసగ లేదు . పొతే పోనీ . వేరు కుంపటి పెట్టుకుంటే - మనకూ , వారికీ కూడా మేలే - అన్న విధంగా లేదాయె . 

మనం  హైదరాబాదులో రాజధాని పెట్టుకున్నాం. వొక్కటి మాత్రం వొప్పుకుని తీరాల్సిందే . NT రామారావు ముఖ్యమంత్రి  కాకముందు , హైదరాబాదు లో తెలుగు వాతావరణం శూన్యం . ఎక్కడికి వెళ్ళినా , తెలుగు తెలిసిన వారు కూడా - ఉర్దూ లో మాట్లాడే వారు. మరి పట్టణం లో ఏ విధమైన  అభివృద్ధీ  కనిపించేది  కాదు . నిజాముల భవనాలు తప్ప - మిగతా ముస్లిముల యిండ్లు కూడా కూప గృహాలుగా  దర్శనమిచ్చేవి. రామారావు గారు వచ్చిన తరువాతే , నిజంగా అభివృద్ధి ప్రారంభమయ్యింది .  ఆ తరువాతే - అక్కడ కాస్తో కూస్తో తెలుగు మాట్లాడడం కూడా ప్రారంభమయ్యింది . ఆ తరువాత, IT రంగం కానియ్యండి, ఫార్మా రంగం కానియ్యండి - చాలా శీఘ్రంగా అభివృద్ధి  కావడానికి రామారావు గారు , ఆ తరువాత చంద్ర బాబు గారు  కారణం గా నిలిచారు .

ఆ తరువాత మళ్ళీ - కాంగ్రెసు వారి ప్రభుత్వాలు రావడం - క్రమక్రమంగా వున్న విద్యుత్తు  పోయి , కొరతగా మారి  అన్ని రంగాలకు కరెంటు లేదనే స్థితికి వచ్చేసింది . ఆ తరువాత మళ్ళీ - మన రాష్ట్రానికి - హైదరాబాదుకు కూడా -  . క్రొత్త కంపెనీలు రావడం తగ్గి, యిప్పుడు దాదాపు రావడం మానేశాయి . దీనికి కారణం సగం కాంగ్రెస్ ప్రభుత్వాల అసమర్థత, లంచగొండి తనం కాగా, మిగతా సగం, గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి "మధురవాక్కులకు " బెదిరిపోయిన పారిశ్రామిక వేత్తలు  కారణం .

అయితే రామారావు గారు, చంద్రబాబు గారు , మిగతా ముఖ్యమంత్రులు కూడా - చేసిన అతి పెద్ద తప్పు - చెయ్యవలసిన అభివృద్ధిలో సగానికి పైగా , హైదరాబాదు లో మాత్రమే  కేంద్రీకరించడం , దాన్ని మాత్రమే అభివృద్ధి చెయ్యడం .  మిగతా నగరాలేవీ కావలసినంతగా అభివృద్ధి చెంద లేదనే చెప్పాలి . అయినా - ఆంధ్రా ప్రజలు తెలంగాణా కు ఏదో అన్యాయం చేసినట్టుగా చిత్రీకరించడం జరిగింది . అందుకు కారణం కే సీ ఆర్ మాత్రమే కాదు . అసమర్థమైన కాంగ్రెస్ నాయకత్వం. వారికి - వారి వారికి కావాల్సిన సొత్తుల సేకరణ తప్ప మరేదీ పెద్దగా పట్ట లేదు. అందుకే వచ్చింది తెలంగాణా వుద్యమం .

తమిళనాడులో చూస్తే - కోయంబత్తూరు లో వున్నన్ని కంపెనీలు - చెన్నై లో కూడా లేవు . ఇప్పుడు  IT  కంపెనీలు కూడా కోయంబత్తూరు లో చాలా వచ్చాయి . వస్తున్నాయి . మనం ఎందుకలా చెయ్యడం లేదు ? - అంటే తమిళనాడు లో ఎలా వుంటే అలా చెయ్యాలని కాదు . రాష్ట్రము లోని ప్రతి ప్రాంతమూ వీలైనంత సమంగా అభివృద్ధి చెందాలి కదా.


ఈ కేంద్రీకరణలో - ఉత్త ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే కాదు; ఉత్త కంపెనీలు మాత్రం కాదు - మన ఆర్టిస్టులు, రచయితలు, మేధావులు కూడా హైదరాబాదు కు వెళ్లి - అక్కడే స్థిరపడి పోయారు. యిప్పుడు వారందరూ మా వాళ్ళు కాదు - అనే విధంగా , దేశంలో మరెక్కడా జరగని విధంగా మనకు క్రొత్త రాష్ట్రం ఏర్పడుతూ వుంది. రామారావు గారు , వున్నప్పుడు తెలంగాణా ప్రజలు కూడా ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఆ తరువాత, చంద్రబాబు గారికి కూడా అన్ని ప్రాంతాల ఆదరమూ లభించింది . ఎప్పుడైతే - ఘనతవహించిన  YSR  గారు - అన్ని రకాల భూ ఆక్రమణలను , లంచగొండి తనాన్ని ప్రోత్సహించారో, అన్ని రకాల కుల, మత రాజకీయాలను ప్రోత్సహించారో, - అప్పటి నుండే , KCR గారికి అక్కడి ప్రజలు పట్టం గట్టడం ప్రారంభమయ్యింది .

అది, యిప్పుడు - విభజన కు దోహదం చేసింది . మధ్యలో వచ్చిన సమైక్యాంధ్ర వుద్యమం మంచిదే కానీ - దాని వెనుక నున్న నాయకత్వం సరి లేదు . సమైక్యాంధ్ర అంటే ఏమిటి ? ఏ వొక్కరైనా - తెలంగాణా ప్రాంతంలో కూడా తిరిగి , వారిని నమ్మించే ప్రయత్నం చేశారా ? లేదు కదా . మరి సమైక్యాంధ్ర ఎలా వస్తుంది ? సీమాంధ్ర లో బస్సులు నిలపడం, కార్లు నిలపడం, విద్యుత్తు నిలపడం, హాస్పిటళ్ళతో సహా, అంగళ్ళతో సహా, స్కూళ్ళతో సహా - అన్నింటినీ మూయించడం , పార్లమెంటులో గోల గోల చేసి మన పరువు తీయడం - యిది చేసారే  తప్ప - తెలంగాణా ప్రజలను నమ్మించడం  చెయ్య లేదు ; పార్లమెంటులోని - ఏ ముఖ్య పార్టీనీ నమ్మించ లేదు. కాస్తో కూస్తో ఈ ప్రయత్నం చేసింది వొక్క చంద్ర బాబు మాత్రమే . మిగతా వారిలో - రాబోయే రాష్ట్రానికి కాబోయే ముఖ్య మంత్రిని నేనే కావాలి - అన్న ఆత్రుత వొక్కటే నాకు కనిపించింది. యిప్పుడు తెలంగాణా వచ్చేసినట్టే . అది  పోనీయండి . జరిగే ప్రతి కార్యం, జరిగే ప్రతి విపత్తు కూడా - మనకొక క్రొత్త అవకాశాన్నిస్తుంది.  అదే ప్రకృతి నియమం . దాన్ని మనం వుపయోగించుకుంటామా - అన్నదే యిప్పుడు ముఖ్యం .  


యిప్పుడు సీమాంధ్ర ప్రజలు కొత్త రాజధాని నిర్మించుకోవాలి . కొత్తగా పరిశ్రమలను ఆకర్షించాలి . కొత్త, అత్యున్నత విద్యాలయాలను ఆకర్షించాలి. నదులలోని నీరు శ్రీకాకుళం నుండి చిత్తూర్ జిల్లా వరకు అన్ని ప్రాంతాలకూ తీసుకు రావాలి. సినిమా , ఫార్మా, ఐ టీ రంగాలకు కావలసిన ప్రోత్సాహాన్ని, సదుపాయాలను కలుగజెయ్యాలి . యివన్నీ చెయ్యాలంటే - స్వార్థ రహిత నాయకులకే పట్టం కట్టాలి . లంచగొండి తనం తో , కుల మత రాజకీయాలతో, ఫాక్షన్ రాజకీయాలతో పైకొచ్చిన వారిని ప్రక్కన బెట్టాలి . మంచి నాయకులైన జే పీ లాంటి వారిని - యిటు వైపుకు ఆకర్షించాలి .

కానీ, యిప్పుడు జరుగుతున్నదేమిటి ? ఎవరు అవినీతికి పేరు మోశారో , వారికే ఆంధ్ర ప్రజలు పట్టం కట్ట బెడతారేమో అన్న అనుమానం వస్తూ వుంది .

అది వొక  ప్రక్క వుండనిస్తే , మన క్రొత్త రాజధాని ఎక్కడ వుండాలన్నది - పనికి మాలిన స్వార్థాలలో, రాజకీయాలలో చిక్కుకుంటూ   వుంది . మా గ్రామంలో  పెడితే బాగుండు - మా గ్రామంలోనే పెట్టాలి - అనే విధంగా మన (వి)నాయకులు ఘోషిస్తూ వున్నారు .

రాజధాని కనీసం 50 చ కి మీ  విస్తీర్ణం అయినా వుండాలి . వీలైనంతగా రాష్ట్రానికి మధ్యలో వుండాలి . కనీసం వొక ఇంటర్నేషనల్  ఎయిర్పోర్ట్ కు వీలైనంత దగ్గరగా వుండాలి . మనకు వున్న పెద్ద నేషనల్ రహదారికి వీలైనంత సమీపంగా వుండాలి . మంచినీటి వసతి వుండాలి; లేదా, కృష్ణ, గోదావరులనుండి నీరు తీసుకురావడానికి అనుకూలంగా వుండాలి.  IT పరిశ్రమకు అనుకూలంగా వుండాలి . ఫార్మా పరిశ్రమకు అనుకూలంగా వుండాలి .

మనమే వొక ఇంటర్నేషనల్  ఎయిర్పోర్ట్ కట్టుకునే వరకు - చెన్నై ఎయిర్పోర్ట్ ను వాడుకోవడంలో తప్పు లేదు. మళ్ళీ, మళ్ళీ హైదరాబాదు ను, అక్కడి ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చెయ్యడం మన మూర్ఖత్వమే అవుతుంది . కానీ వొక ఇంటర్నేషనల్  ఎయిర్పోర్ట్ మనం కట్టుకునే లాగా సరిపడేటంత  స్థలం యిప్పుడే వుంచుకోవాలి. వొక చిన్న ఎయిర్పోర్ట్ వెంటనే కట్టుకోవాలి కూడా.  చెన్నై - కలకత్తా నేషనల్ రహదారికి వీలైనంత సమీపంలో వుండాలి . చిత్తూరుకు, శ్రీకాకుళానికి రెంటికీ అందుబాటులో వుండాలి - అవే రాష్ట్రానికి ఎల్లలు గనుక. 

గుజరాత్ కూడా అహమదాబాద్ నే పెట్టుకోలేదు . గాంధీనగర్ ను కట్టుకున్నారు. సీమాంధ్ర  కూడా అలాంటి క్రొత్త నగరాన్నే నిర్మించుకోవాలి. అక్కడ స్థలాలను ఆక్రమణ దారుల స్వంతం చెయ్యకూడదు . వొక్కొక్క స్థలాన్నీ - వొక్కొక్క నిర్ణీత పథకానికి కేటాయించాలి . యిళ్ళ  స్థలాలను , సరైన ధరకు సరైన వాళ్లకు అమ్మాలి . అక్కడ వుండాల్సిన ప్రభుత్వోద్యోగులకు - యిళ్ళ స్థలాలను కేటాయించాలి . ఎన్ని క్వార్టర్స్  కావాలో - అన్ని కట్టడానికి స్థలం పెట్టుకోవాలి. నా ఉద్దేశంలో - యివన్నీ నెల్లూరుకు దగ్గరగా , నేషనల్ రహదారికి సమీపంగా, కనీసం 50 చ కి మీ ఖాళీ స్థలం నిర్దేశించి, ఏదైనా ప్రఖ్యాతి చెందిన అంతర్జాతీయ సంస్థకు - ఆ పని వొప్పగిస్తే , బాగుంటుంది - అనిపిస్తుంది .

యిది ఎవరు చెయ్యగలరు ? నా ఉద్దేశంలో - చంద్రబాబు గారు , జే పీ  గారు - మోడీ గారితో కలిస్తే - కలిసి ప్రభుత్వం నెలకొల్పితే - చాలా సులభంగా సాధ్యమవుతుంది . చాలా బాగా సాధ్యమవుతుంది . నాకు మిగతా వారిపై నమ్మకం లేదు . లంచగొండి తనానికి పేరు మోసిన కాంగ్రెస్ వారిపై అసలు నమ్మకం లేదు . అది ఏ కాంగ్రెసైనా  సరే .

ఆలోచించండి మరి . యిందులో మళ్ళీ, కొట్లాటలకు , ఉద్యమాలకు తావు లేదు . వుండకూడదు .

సరే . కెసిఆర్ గారితో కలిస్తే  ఏమవుతుందో కాంగ్రెస్ వారికి ఈ రోజు తెలిసొచ్చింది. తెలంగాణా యివ్వండి - మా పార్టీని మీ పార్టీ లో విలీనం చేసేస్తానన్న పెద్ద మనిషి - తెలంగాణాను కాంగ్రెసు వారు చాలా కష్ట పడి యిచ్చేశాక - యిప్పుడిక విలీనం ప్రసక్తే లేదంటున్నారు .

కాంగ్రెసుకు యిది కావాల్సిందే . కె సి ఆర్ గారిని నమ్మకండి - అని ఎందరో రాసారు; ఎన్నో రకాలుగా చెప్పారు. ఆయన నోరు తెరిస్తే బూతులు, అబద్ధాలు తప్ప  వేరే రావాయె .   దేశాన్ని నట్టేట్లో దింపిన కాంగ్రెసును,  కె సి ఆర్ గారు ఈ రోజు నట్టేట్లో దింపారు. అయినా పిచ్చి గాకపోతే - కె సి ఆర్ ను నమ్మితే , కాంగ్రెసుకే కాదు, తెలంగాణా ప్రజలకూ చివరికి అదే అవుతుంది కదా. కానీ వారు బాగుండాలి; వారు మంచి నాయకులను ఎన్నుకుంటారని ఆశిద్దాం. అలాగే - దేశమంతటా , నమ్మకం కోల్పోయిన కాంగ్రెసుకు , అది పాత కాంగ్రెసైనా, క్రొత్త కాంగ్రెసైనా, ఏదైనా  సరే - దాన్నే మళ్ళీ నమ్మితే - దానికే మళ్ళీ వోటేస్తే  - కే సి ఆర్ ను నమ్మినట్టే వుంటుంది  మన గతీ . 

అయితే - కొంత మంది మారొచ్చు . మారిన నాయకులు మంచి దార్లో నడుస్తారా అన్నది  చూడాలి. వారి పాత చరిత్ర చూడాలి . స్వార్థ రాజకీయాలు, కుల మత  రాజకీయాలు, నేర చరిత్ర, లంచగొండి తనం ,గూండా చరిత్ర లాంటివి లేని వారిని ఎవరినైనా ఆహ్వానించ వచ్చు . నిజానికి - అందరూ అలా మారాలి . అప్పుడే రాష్ట్రం బాగుంటుంది .

సర్వే  జనాః  సుఖినో భవంతు

= మీ

వుప్పలధడియం  విజయమోహన్