23, జనవరి 2014, గురువారం

అక్కినేని నాగేశ్వరరావు గారు - 90 ఏళ్ల మహత్తర జీవితం - వారు మిగిల్చిన తీపి గురుతులు ఎన్నో , ఎన్నెన్నో


అక్కినేని నాగేశ్వరరావు గారు పోయారు. 

90 ఏళ్ల మహత్తర జీవితం గడిపి , తుది వరకు , ఉత్సాహంగా , చిన్న పిల్లాడిలాగా తుళ్ళుతూ , అందరికీ ఆనందాన్ని పంచుతూ , ఎవరికీ కష్టం లేకుండా వెళ్లి పోయారు.

పోయినోళ్ళందరూ మంచోళ్ళు ; వున్నోళ్ళూ పోయినోళ్ళ తీపి గురుతులు - కదా . నిజమే. అక్కినేని ఎన్నో తీపి గురుతులని మిగిల్చి వెళ్లి పోయారు. ఆయన తీపి గురుతులే ఎన్నో , ఎన్నెన్నో. మరి ఆయన కొడుకులు మనమలు మళ్ళీ సినిమా ప్రపంచంలో, తమదైన  స్థానం , ఆయన్ను మరపించేది కాదు , ఆయన్ను తలపించేది సంపాదించుకున్నారు.

75 ఏళ్ళ నట జీవితం సామాన్యం కాదు . అందులోనూ - ఆయన నట జీవితం చాలా అసామాన్యం . ఎందరో నటులు వచ్చారు , వెళ్ళారు - అందరూ ANR లు , NTR లు కాలేదు కదా.  ANR గారు ఎక్కువగా చదువుకో లేదట. చదువంటే బళ్ళో చదివేదే చదువా ? నిజ జీవితంలో, నట జీవితంలో , ఆయన ఎంతో చదివారు. ఎంతో నేర్చుకున్నారు .  

నిజానికి - తెలుగు ప్రజానీకం ఆయననుంచి ఎంతో నేర్చుకుంది . భక్త జయదేవుడు తెలుగు వాడు కాదు ; కానీ నాగేశ్వరరావు గారి ద్వారా తెలుగు వాడు అయ్యదు. అలాగే, భక్త తుకారాం, విప్రనారాయణుడు,  కాళిదాసు, జక్కన్న , చివరికి కబీరు - వీరు అందరూ, తెలుగు వారు కాకున్నా , అక్కినేని ద్వారా - మనవారయ్యారు . దేశంలోని - అన్ని రాష్ట్రాల లోని గొప్ప వారిని మనకు పరిచయం చేసి, తెలుగు వారన్నా , భారతీయులన్నా వొకటే - అన్న ఏకీకృత భావం మనలో కలిగించారు అక్కినేని.  ఈ మహా కార్యం మరో నటుడెవ్వరూ, ఏ భాషలోనూ యింత ఎక్కువగా చెయ్యలేదు.  యివి మాత్రమా ! అనార్కలి, దేవదాసు, లైలా మజ్నూ లాంటి చిత్రాల ద్వారా - దేశంలోని - వివిధ రాష్ట్రాల లోని అత్యుత్తమ ప్రేమ కథలనూ మనకు అందించారు. దిలీప్ కుమార్ గారు అన్నారట - దేవదాసు అంటే వొక అక్కినేని నాగేశ్వర రావు గారు మాత్రమే అని . హిందీ లో ఆ పాత్ర పోషించింది ఆయనే .

255  పైగా చిత్రాలలో నటించిన అక్కినేని - తనకు నచ్చని, నప్పని పాత్రలను ఎప్పుడూ ఎన్నుకోలేదు. ఎప్పుడూ పదవుల కోసమో , ప్రతిష్ట కోసమో ప్రాకులాడలేదు . కావాలంటే - అవన్నీ వచ్చి పడేవే . కానీ - ఆయనకు, తన జీవితంలో - ఏం కావాలో, నిర్దిష్టంగా తెలుసు . అలాగే చివరి వరకు వున్నారు .

అయినా ఆయనకు ఎన్నో ప్రతిష్టలు , అవార్డులు  వచ్చిపడ్డాయి .అందులో కొన్ని యివి :-

1. పద్మ విభూషణ్ 
2.దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ 
3. ఫిల్మ్ ఫేర్  బెస్ట్ ఆక్టర్  అవార్డు - తెలుగు - 4 సార్లు
4. రఘుపతి వెంకయ్య అవార్డు 
5. NTR నేషనల్ అవార్డ్ 
6. నంది అవార్డ్ - బెస్ట్ ఆక్టర్ - 2 సార్లు 
7. కలై మామణి  అవార్డ్ -తమిళనాడు 
యింకా ఎన్నో ....

నాకు దేవుడంటే పెద్ద నమ్మకం లేదు - అని అనే వారట.  అంటూ, అంటూ, దేవుడి దగ్గరికి వెళ్లి పోయారు . NTR  లాగా ఎక్కువ "దేవుడి" పాత్రలు వెయ్యలేదు.  కానీ,  అన్ని రకాల "భక్తుడి" పాత్రలు వేశారు . దేవుడు లేదనే మహా మనీషి ప్రజలలో దేవుడి పట్ల భక్తిని బాగా పెంచారు. 

అదంతే. సాధారణంగా కొట్టుకుంటూ వుండే గుండె - దేవుడా , దేవుడా అంటూ వుంటుంది. అదేదో లబ్ - డబ్  అని మనం అనుకుంటూ వుంటాము. 

దేవుడు, ఆ, ఏమిటీ - అని పలికిన రోజున మరి కొట్టుకోదు. దేవుడు పిలిస్తే - వెళ్ళిపోతాం . అంత వరకు, మరో గుండె కొట్టుకునే శబ్దం వినాలి - అనుకుంటూ వుంటుంది ; దానికోసం వెంపర్లాడుతూ వుంటుంది.  అదే  మన మనసుల్లోని ప్రేమాభిషేకం.   

ANR  గారి ప్రేమాభిషేకానికి, హైదరాబాదు - 533 రోజులు ఉర్రూతలూగి పోయింది.  యిప్పటి వరకు, అన్ని రోజులు ఏకధాటిగా చూడ బడిన ఏకైక తెలుగు సినిమా అదే.

ANR  గారి సినిమాల్లో  పాటలు  పెద్ద హై లైట్ . పాటల్లో, రాసే వారి గొప్పదనం, పాడిన ఘంటసాల, బాలు వారి కంఠం, సంగీత దర్శకుడి గొప్పదనం - యివన్నీ వున్నా, ఆ పాటలకు ANR  గారు ఎలా స్పందించారో - అది చూస్తూ వింటే - ఆ అనుభూతే  వేరు. పాట  వింటే , ANR  గుర్తుకొస్తారు. నటనలో జీవించడం - ఆయనలా మృదువుగా , నిజ జీవితానికి అంత దగ్గరగా చేసిన వారు చాలా అరుదు. 

వారి కాలం లో, వారిలాగా, నాట్యానికి వొక కొత్త నిర్వచనం  చెప్పిన వారు లేరు గాక లేరు. పచ్చ గడ్డి కోసేటీ పడుచు పిల్లోయ్ - అంటూ ఆయన చూపే హావ భావాలు - ఆయనకు ముందూ లేదు ; చెప్పాలంటే , ఆయన తరువాతా లేదు . 

పిల్లల్నీ, పెద్ద వారినీ, ముసలి వారినీ, ఆడవారినీ - వొక్కరేమిటి , అందరినీ వుర్రూత లూగించిన అక్కినేని  - అమరజీవి అయిపోయ్యారు.   ఆ లోటు వుండనే  వుంటుంది . 

కొందరికి కుటుంబం అంటే - మహా వుంటే 10 -20 మంది దాకా వుంటారు . కానీ, చాలా కొద్ది మందికి కోట్ల మంది తమ కుటుంబం గా వుంటారు. అంటే - వారిది వసుధైక కుటుంబకం. అందునా కొంత మంది, మరణం తర్వాత ఎన్నో దశాబ్దాలు  జీవిస్తూనే వుంటారు - వున్న వారి మనస్సులో. 

మనం ముఖ్య మంత్రులను , గవర్నర్లను  సులభంగా మర్చి పోతాం. మీకు గుర్తున్నారా - మన ముఖ్య మంత్రులందరూ? నాకు లేరు . వారి వల్ల  మనకు పెద్దగా వొరిగిందేమీ లేదు. 

కానీ - NTR , ANR  గార్లు కనీసం వొక శతాబ్దం కాలం అందరి మనస్సులో వుంటారు ; వున్నారు . మా అవ్వ గారు , మా అమ్మగారు , నేను , నా పిల్లలు - యిలా కనీసం 4 తరాలు - దాదాపు అన్ని తెలుగు కుటుంబాల్లోనూ వారిని బాగా అభిమానించిన వారే . 

యింత చెప్పినా - కడపట శ్రీకృష్ణుల వారి ఉపదేశం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకొవలసిందే.  

"గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః" -   బుద్ధిమంతులు, వున్న వారికోసం కానీ , పోయిన వారి కోసం కానీ శోకించరు. 

"న త్వే వాహం  జాతు నాసం న త్వం నేమే జనాధిపాః ;  న చైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం"  - నీవూ , నేనూ , వీరెవరూ - ముందెప్పుడూ లేని వారు కాదు . యిక ముందెప్పుడూ వుండని వారు కూడా కాదు. ( ఎల్లప్పుడూ  వుండే వారే ) . 

"దేహినః అస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా ; తథా దేహాంతర ప్రాప్తిహ్ ధీరస్తత్ర న ముహ్యతి" - ఆత్మగా వున్న మనం , ఈ దేహంలో వుండి బాల్యం , యవ్వనం , ముసలితనం  ఎలా అనుభవిస్తామో , అలాగే , వొక దేహం నుండి మరో దేహానికి కూడా వెళ్లి పోతాము . జ్ఞాని అయిన వాడు , బుద్ధి మంతుడు - దీని కోసం శోకించడు. 

అంతే . ఈ ప్రవాహం యిలా సాగి పోతూనే వుంటుంది . కొన్ని తీపి గురుతుల్ని , మిగిల్చి  పోతూ వుంటుంది . ANR  మిగిల్చిన  తీపి గురుతులు  ఎన్నో , ఎన్నెన్నో . 

= మీ 

వుప్పలధడియం  విజయమోహన్

 
 

 


12, జనవరి 2014, ఆదివారం

2014 : క్రాంతి : సంక్రాంతి - మనం ఏం చేస్తే అది నిజమైనక్రాంతి - నిజమైన సంక్రాంతి

2014 : క్రాంతి : సంక్రాంతి

 


2013 వెళ్ళిపోయి 12 రోజులయింది . అంతలో భోగి వచ్చేసింది. సంక్రాంతి వచ్చేస్తో వుంది .  మన  జీవితాల్లో ఏం క్రాంతి వచ్చింది; లేదా రాబోతూ వుంది ? ప్రపంచంలో ఎన్నెన్నో జరిగి పోతున్నాయి ; మన ప్రమేయంతో కొన్ని . మన ప్రమేయం ఏమాత్రం లేకుండా ఎన్నో ! 

మనకు పండగలు చేసుకోవడం అలవాటు.  

చేస్తే - 365 రోజులూ ఏదో వొక పండగ చెయ్యొచ్చు. మన సంస్కృతి లో ఆ వెసులుబాటు వుంది. అలా చేస్తూ వుండే వాళ్ళం కూడా . పండగలు, వ్రతాలు , పూజలు, నోములు, అన్నీ - ఏదో రకంగా మనల్ని ఆనంద పరిచేవే . 

పంటలు పండాయని కొన్ని, వానలు కురిసాయని కొన్ని, పూలు పూసాయని కొన్ని,  పండ్లు, ఫలాలు చెట్ల నిండుగా వున్నాయని కొన్ని, ఋతువులు మారాయని కొన్ని, చంద్రుడు వచ్చాడని , రాలేదని, యిలా ప్రతి దానికీ పండగే . సూర్యుడు కక్ష్య మారితే పండగ.

ఈ రోజు, యిప్పుడు ఆనందంగా ఉన్నామని కొన్ని పండగలు, వ్రతాలు, నోములూ చేస్తే, భవిష్యత్తులో మరింత  ఆనందంగా వుండాలని మరి కొన్ని చేస్తాం. మగ వాళ్ళు చేసేవి కొన్ని, మగ , ఆడా కలిసి చేసేవి కొన్ని, ఆడవాళ్ళు మాత్రమే చేసేవి కొన్ని, ఊరంతా కలిసి చేసేవి కొన్ని. దేశమంతా  కలిసి చేసేవి మరి కొన్ని.  ఆనందంగా వుండడానికి అన్నీ కారణాలే . ప్రతి పండుగకూ , పెద్ద వాళ్లకు మొక్కడాలూ , పిల్ల వాళ్లకు ఆశీర్వాదాలూ , స్పెషల్ వంటలు ,పూజలు, నైవేద్యాలు, ప్రసాదాలు - అంతా కోలాహలమే . అంతా వొక్కో రకమైన ఆనందమే; అన్నిటిలో, అంతర్లీనంగా వుండే అతి గొప్ప సంస్కృతి .

మనం చెట్లలో దేవుడిని చూస్తాం . రాళ్ళలో దేవుడిని చూస్తాం.   ప్రతి జంతువులో, పాముల్లో, అన్నిటిలో దేవుడిని చూస్తాం . తులసి చెట్టు దేవుడు . రాగి చెట్టు, మద్ది చెట్టు -యిలా ఎన్నో దేవుళ్ళు . యిన్ని దేవుళ్ళు వుంటారా ?
నాగు పామూ దేవుడే . దాన్ని వేటాడే గరుడ పక్షీ దేవుడే . కాకి కూడా దేవుడే . ఎలా ? 

అంతేనా . మొదటి దేవుడు తల్లట. మాతృదేవో భవ . రెండో దేవుడు తండ్రట.  పితృదేవోభవ . గురువూ దేవుడే . అతిథీ దేవుడే . సరే . పెళ్ళైన ఆడవాళ్ళు  అత్తారింటికి వెళ్లి పొతే , తల్లీ , తండ్రీ దూరమౌతారు కదా . అప్పుడెలా ? పతిదేవుడు. అదెలా? ఆడా, మగా సరి సమానులు అనే రోజుల్లో, పతి ని దేవుడు అంటే ఎలా ? పక్కింటి వాడినో , ఎదురింటి వాడినో - దేవుడంటే - సమస్యలు కదా.  ఎక్కడో వొక చోట దేవుడిని చూడాలి. ప్రేమ వున్న చోట, రక్షణ వున్న చోట  దేవుడు వుండనే వుంటాడు.  లేకుండా ఎలా పోతాడు ? 

 ప్రేమ, రక్షణ  వున్న చోట దేవుడు తప్పకుండా వుంటాడు. ధర్మేచ , అర్థేచ, కామేచ - నాతి  చరామి అన్న వాడు, అన్నిటా తోడు  గా వుండే వాడు,  వాడిలో - దేవుడు లేదంటే ఎలా ? ఎందుకుండడు? ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా, భార్యను రక్షించే వాడే భర్త . అదే మన సంస్కృతి . మరి పత్ని దేవత కాదా ? నిస్సందేహంగా దేవతే !  అందుకే  కదా అర్ధ నారీశ్వర తత్వము దేవుడు అన్నాము . శివుడు లేనిది శక్తి లేదు ; శక్తి లేనిది శివుడు లేదు. 

అంతటా దేవుడే. నాలో దేవుడు . నీలో దేవుడు . అయినా,  బ్రహ్మచారి, సన్యాసి యిద్దరూ భిక్ష మడిగి బ్రతకాల్సిందే . వారిలో - అహం అనేది వుండకూడదు. గర్వం అనేది వుండకూడదు . కానీ, గృహస్తు - వారికి భిక్ష వెయ్యనని చెప్పడానికి వీలు లేదు . యింట్లో ఏదుంటే అది భిక్ష వెయ్యాలి . ఉపనిషత్తుల్లో చెప్పడం - గృహస్తు ఎంతైనా సంపాదించ వచ్చు - తనకు, పిల్లలకు, అతిథులకు కూడా తగినంత సంపాదించాలి . అదీ రూలు . అతిథులకు లేదనకుండా పెట్టడం గృహిణి వంతు . యింట్లో  లేకపోతే క్రొత్తగా చేసైనా పెట్టాలి .

అయితే, యిందు లోని మూల సూత్రం అంత సులభంగా అందరికీ వంట పట్టదని - వ్రతాలు, పూజలు, నోములు - యిలా పెట్టారు. అన్నిట్లోనూ వారి వారికి కావలసినంత ఆనందం నింపారు . 

గుళ్ళన్నీ రాళ్ళూ , మట్టే కదా . గుళ్ళోని దేవుడూ రాయే కదా . వాటిని పూజిస్తే , అవేం  చేస్తాయి మనకు ? యిదీ కొంత మంది  తర్కం . వినడానికి - నిజమే కదా అనిపించేలా వుంది కదా . 

సరే . ఆ మట్టి నుండే కదా - అన్ని పంటలూ, చెట్లూ, ఔషధాలూ వచ్చేది. నిజానికి- మన శరీరము, దాన్లోని అన్ని భాగాలు  మట్టి నుండి వచ్చిన వాటితోనే కదా తయారయ్యాయి.  మట్టి నుండే వచ్చాము. మట్టిలోకే వెళ్లి పోతాము - అన్నది మనకు కాస్తో, కూస్తో అర్థం అవుతూనే వుంది కదా. మనం మట్టే . రకరకాల మట్టే .

చిన్నప్పుడు 3 కిలోలున్న మనం, యిప్పుడు, యిన్ని కిలోలు ఎలా అయ్యాం?  ఇన్ని కిలోల శరీరమూ మట్టి నుండి వచ్చిందే కదా . 40-80 కిలోల మట్టి గా వున్న మనం ఎంత ఆలోచనా వంతులం , ఎంత జ్ఞాన వంతులం అనుకుంటున్నాం . అదంతా ఎక్కడి నుండి వచ్చింది మనకు ? అసలు అండము , శుక్రకణాలు కూడా మట్టి నుండీ కాక ఆకాశం నుండి  వచ్చాయా ? అంతా మట్టే నని తెలుసు మనకు . అప్పుడప్పుడు మర్చి పోతాం . అంతే .

కానీ ,యింత మంది మనుషులను  పుట్టిస్తూనే వున్న భూమాత లో  ఎంత జ్ఞానం, ఆలోచన వుండాలి ? యిది  మనకు తెలుసా ?అలాగే యింత మహా విశ్వంలో మరెంత జ్ఞానం వుండాలి ?

ఆ జ్ఞానాన్నే దేవుడు అన్నాం . మనం ఎక్కడ చూసినా ఆ జ్ఞానాన్నే చూడాలని ఆశిస్తాం . చదువు వున్న వాడైనా, లేని వాడైనా, శివ లింగానికి నమస్కరిస్తాడు . ఆచరణలో దేవుడిని చూసిన వాడికి , వేదాలు కూడా అక్కర్లేదని వేదాలే చెప్పాయి. కౌశిక మహర్షి తపస్సు చేసింది గొప్పా , ఆయన భిక్ష అడిగిన యింటి ఇల్లాలు గొప్పా, మాంసం అమ్మి బ్రదికే ధర్మ వ్యాధుడు గొప్పా?  అన్ని పనులూ తపస్సే - తపస్సు లాగా చెయ్యాలని చెప్పిన సంస్కృతి  గొప్ప.

సంక్రాంతి నాడు - సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడట. ఉత్తరాయణం ప్రారంభం చేస్తాడట. యిది కోట్ల సంవత్సరాలకు ముందు చెప్ప బడింది. మన పండగలలో, ఈ వొక్క పండగే సూర్య మానం ప్రకారం వస్తుంది గనుక, ఎప్పుడూ, యింగ్లీషు కాలెండర్ ప్రకారం కూడా, జనవరి 14 వ తేదీ నే వస్తుంది.  మిగతా పండుగలు చాంద్ర మానం ప్రకారం గనుక మన నక్షత్రాలు, తిథుల ప్రకారం వస్తాయే గానీ - యింగ్లీషు కాలెండర్ ప్రకారం కాదు. 

సూర్యుడు కక్ష్య మారితే మనకేం ? మనకు వసంత ఋతువు రాబోతూ వుంది . చలి తగ్గ బోతూ వుంది.  చెట్లన్నీ వికసించ బోతూ వున్నాయి  . పక్షులు కిలకిలారవాలు చేయ్యబోతూ వున్నాయి. ప్రకృతిలోని అన్నింటిలో - క్రొత్త ఉత్సాహం , క్రొత్త ఆనందం రాబోతూ వుంది . అదే ఆనందం మనలోనూ రావాలి. మనోహరమైన ప్రకృతిలో , మనోహరంగా మనిషి ఆడుకోవాలి . అదీ సంక్రాంతి . 

సంక్రాంతి  నాడు మనలో క్రాంతి  రావాలి . పాత సంస్కృతికి కొత్త మెరుగులు దిద్దాలి. మరిచిపోయిన మంచిని పునరుద్ధరించాలి.  మనలోని సూర్యుడు ఉత్తరాయణం ప్రారంభించాలి. మనలోని ప్రకృతి  వసంత ఋతువుగా మారాలి . 

ఎలా? ఏం చెయ్యాలి?  కొన్ని కొన్ని చిన్న, చిన్న పనులు, పెద్ద పెద్దగా మనం చెయ్యొచ్చు . 

నా వొక్క అనుభవం మాత్రం చెబుతాను, వినండి. నేను వొకప్పుడు బిచ్చగాళ్ళకు బిచ్చం వేసే వాడిని కాదు. కొందరిలా, అసలు  వెయ్య కూడదని రూలేం పెట్టుకోలేదు . దార్లో, ఎక్కడైనా , బిచ్చ గాడిని చూస్తే , అయ్యో పాపం అనిపిస్తుంది . కానీ, జేబులో ఉన్న ఏ నాణ్యమైనా  వేద్దామని చెయ్యి అనుకోదు. బిచ్చ గాడిని దాటి వెళ్ళిన తర్వాత , వేసింటే  బాగుండేదేమో అని వొక్కో సారి అనిపిస్తుంది . కొంత మంది యింట్లో బయల్దేరేటప్పుడే , జేబులోనో, పర్సులోనో , యిందు కోసమే కొన్ని నాణ్యాలు వేసుకుని బయల్దేరడం , అవి ఎక్కడో వొక చోట, ఎవరికో వొకరికి వేసేసి వెళ్లి పోవడం, నేను చాలా సార్లు చూశాను . అందులో చాలా మంది ఆడవాళ్ళు . వారికుండే దయాగుణం నాకెందుకు రావడం లేదు అని నేను చాలా సార్లు అనుకున్నా కూడా. ఆ తరువాత నేను కూడా - అలాంటి అలవాటు కొంత పెట్టుకున్నా.  అయితే వొక సారి, వొక రైల్వే స్టేషన్ లో,  వొక కుంటి బిచ్చ గాడికి (యిరవై ఏళ్ళకి ముందు) - అర్ధ రూపాయి వేస్తే, ఆతను, దాన్ని పట్టాల పైకి విసిరి వేసేసి - నన్ను చూస్తూ వెళ్లి పొయ్యాడు . 

నాకూ కోపం వచ్చింది. కాస్త సిగ్గు వేసింది కూడా . మళ్ళీ కొన్నాళ్ళు షరా మామూలే; ఏ బిచ్చ గాడికీ బిచ్చం వెయ్య లేదు . కానీ కొంత మంది బిచ్చ గాళ్ళ ని చూస్తే - దేవుడు వీరిని ఎందుకిలా బాధ పెడుతున్నాడని చాలా సార్లు అనిపించింది .  అప్పుడప్పుడూ - కొంత మంది బిచ్చం వేసే వారిని చూస్తే  - ఆశ్చర్యం, ఆనందం  అనిపించేది.  ఎక్కడో అంత దూరం నుండి  బిచ్చ గాడిని చూస్తే  చాలు - వాళ్ళ వెళ్తున్న రూటు నుండి యింత దూరం వచ్చి, పర్సు లో నుండి, ఎంతో కొంత వేసి వెళ్ళే వారు. నేను మారాలి- అని చాలా సార్లు అనుకున్నా. 

దానికేదో ముహూర్తం వచ్చింది . ఎప్పుడో వొక సారి, నేను కూడా వారి లాగే చేశాను. ఏదో లోభితనం గానే అనుకోండి - కొంత, కొంత వేశాను. అప్పుడు అలవాటు, వొక రూపాయకు తక్కువ వెయ్యడం లేదు . తరువాత అది రెండు రూపాయలకు పెరిగింది . వొక సారి మరో నాణ్యం  లేక - అయిదు  రూపాయల నాణ్యం  మాత్రమే వుంటే - అయ్యో, యిప్పుడెలా, అనుకుంటూ, అదే వేశాను. ఆ తరువాత అనిపించింది - అయిదు రూపాయలే  వెయ్యాలి - యిప్పుడు అంత మాత్రం ఆర్ధిక స్తోమతు  నాకు వుంది; కాబట్టి మనసూ వుండాలి - అని . 

అదీ అలవాటు అయ్యింది. అప్పుడు అనిపించేది - నేను చేసే పని ఆ బిచ్చ గాడికి నిజంగా ఉపయోగ పడాలి - లేదంటే, మొక్కుబడిగా నేను వేసేది ఏం ప్రయోజనం అని . కానీ, ఏం చెయ్యాలో - తెలియ లేదు . ఆ తరువాత ఎప్పుడో , మా నేషనల్ అకాడెమీ లో HR & MANAGEMENT  విభాగానికి  DGM గా వెళ్ళిన తరువాత , అసలు  మానవతా దృక్పథం అంటే ఏమిటి అన్నది - కాస్త తెలిసి వచ్చింది . నేను యిచ్చే ప్రసంగాలు , వాటికి నేను చేసుకునే  ప్రయత్నాలు  - వీటి మధ్యలో - ఏదేదో  క్రొత్త ఆలోచనలు, ఐడియాలు  వచ్చేవి . కొన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు , CRY  లాంటివి వస్తే , ఏదో కొద్ది విరాళం యిచ్చే వాడిని . వంద, రెండు వందలు - యిలా . 

మళ్ళీ చెన్నై వచ్చిన తర్వాత - నేనున్న తిరునిన్రవూరు లోనే 20 ఏళ్ళకు పైగా వొక అనాథ బాలల, వృద్ధుల శరణాలయం వుండడం, అది చాలా బాగా నడప బడడం తెలిసొచ్చింది. ఆ శరణాలయం పేరు సేవాలయ. దాని ముఖ్య ట్రస్టీ  పేరు మురళీధరన్. వొకప్పుడు, అతి చిన్న సంస్థ గా వుండేది. యిప్పుడు 1300 నిరు పేద బాలలకు స్కూలు, 300 అనాథ బాలలకు ఉచిత విడుది , వంద మందికి పైగా అనాథ వృద్ధులకు శరణాలయం - యిలా ఎన్నో వున్నాయి. ఎంతో మంది దాతలు డొనేషన్లు యిస్తూ వున్నారు. 

సరే . మా ఊళ్లోనే వుంది. నేను కూడా ఏదో కొంత చెయ్యొచ్చు  కదా అనిపించింది . మొదట ఎంత యిచ్చానో జ్ఞాపకం లేదు . ఆ తరువాత 5 వేలు రూపాయలు విరాళం వొక్క సారిగా యిచ్చాను . యిది ఏదో కాస్త బాగా అనిపించింది . ఆ తరువాత, నాకు వీలైనప్పుడు , 5 వేలు, 5 వేలు యిలా యివ్వ సాగాను. వొక సంవత్సరంలో 20 వేలు అయ్యింది - యిలా విరాళం పెరిగింది .  

రిటైర్ అయ్యిం తరువాత నాకు కొన్ని వ్యాపకాలు బాగా పెరిగాయి.   అందులో వొకటి షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్  చేసే ధ్యాస . వచ్చిన గ్రాట్యూటీ , ప్రావిడెంట్ ఫండ్ లాంటివన్నిటినీ కలిపి - షేర్ మార్కెట్లో పెట్టాలనుకునా; కానీ, మా ఆవిడ వొప్పుకొలేదు. అందుకని, సగం ఫిక్సెడ్ డిపాజిట్ , సగం షేర్ మార్కెట్ లో పెట్టాను.  నిజానికి - అదే మంచి విధానం. 

ఆ తరువాత - నేను మార్కెట్ ను బాగానే అధ్యయనం చేశాను . నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్  వారు పెట్టే ఎన్నో పరీక్షలు  పాసయ్యాను. ఫలితంగా, నాకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వారి నుండి  (1) NSE  సర్టి ఫైడ్  మార్కెట్ ప్రొఫెషనల్ (NCMP ) -లెవెల్-5 (యిదే పెద్ద లెవెల్) (2) NSE  సర్టి ఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అనాలిస్ట్  ఛాంపియన్  (3) NSE  సర్టి ఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అనాలిస్ట్  ప్రో  అన్న సర్టిఫికెట్లు కూడా లభించాయి .

యిప్పుడు - ఈ రంగం లో కొంత నిపుణత వుంది . ఏ కంపెనీ లో  షేర్లు , ఎప్పుడు, ఎలా కొంటే, ఎలా అమ్మితే లాభకరమో బాగా తెలిసొచ్చింది . అందుకని  నేను ఇన్వెస్ట్  చేసిన మొత్తాలలో - నాకు లాభాలు వస్తూ వున్నాయి . మార్కెట్ పూర్తిగా పడిపోయిన రోజుల్లో కూడా నష్టాలు రాలేదు. యిక మీదట మోడీ గారు ప్రధాన మంత్రి గా వస్తే గిస్తే - దేశం , ముఖ్యంగా ఆర్ధిక రంగం, బాగా అభివృద్ధి చెందుతుంది అన్న వొక ఆశ మార్కెట్ లో చాలా మందికి వుంది . - చెప్పాలంటే నాకూ వుంది .  

సరే . లాభాలు ఏదో వస్తున్నాయి . యిప్పటి వరకు మెల్ల మెల్లగా పెరిగింది - యిక ముందు యింకా బాగా పెరగొచ్చు . యివన్నీ దేవుడిచ్చిన, యిస్తున్న అవకాశాలే కదా . అందుకని , రెండు సంవత్సరాల క్రితం , నా డొనేషన్లు - 25 వేల రూపాయలకు  పెంచాను . ఆ సంవత్సరం - 2012 లో- అలాంటి డొనేషన్లు 2 యిచ్చాను . అంటే - 50 వేలు అన్న మాట . 2013 లో  అలాంటివి 4 సార్లు యిచ్చాను; అంటే - 1 లక్ష రూపాయలు అన్న మాట. యిది కాక, ఈషా  ఫౌండేషన్ అన్న, సద్గురు  జగ్గి వాసుదేవ్  గారి సంస్థకు 6-7 వేలు దాకా ప్రతి సంవత్సరమూ యిస్తాను. అది గురుదక్షిణ అనుకుంటా. ఎందుకంటే , నేను వారి వద్ద, చాలా యోగా శిక్షణలు పొందాను గనుక . 

మరి, 2014 సంవత్సరం  మాటో ? నాకు తెలీదు . మార్కెట్ బాగా పెరిగితే - బాగా లాభాలు వస్తే - ఎంత యివ్వాలి ? నేను ఏ లిమిట్ పెట్టుకో లేదు. సేవాలయా లోని ఆ చిన్నారి పిల్లల మొహాలు చూస్తే , వారితో  బాటు నేనూ కూర్చుని భోంచేస్తే , వారికి ఏదో వొక ఐటెం వడ్డిస్తే, వారు చిన్ని చిన్ని మొహాలతో, థాంక్యూ సార్- అని చెబుతుంటే - ఆ అనుభూతికి - ఆ చిన్నారి దేవుళ్ళకి - ఎంతిస్తే  సరిపోతుంది?  అది దేవుడికి పెట్టే నైవేద్యం కాదా ?

మా యింట్లో, వొక్కో సారి, చిన్న వివాదం వస్తుంది - మీరు, మన పిల్లలకోసం పెట్టుకోకుండా, ఎవరికోసమో చేస్తున్నారేమిటి - అని. నిజానికి - పిల్లలు బాగానే వున్నారు . యిద్దరు కొడుకులు, కోడళ్ళు -అందరూ కాస్త మంచి వుద్యోగాల్లోనే వున్నారు.  నేను చెబుతాను - నేను ఏం సంపాదిస్తే - అందులో కనీసం నాలుగో భాగం - అనాథ బాలలకు -మిగతాది మన పిల్లలకు అని . కాకపొతే, నా మనసులో - సగం సగం అనుకుంటే బాగుంటుంది  అన్న అభిప్రాయం వుంది. విప్రో  ఛేర్మన్ డాక్టర్ అజీం ప్రేంజీ గారు వొక సారి అన్నారు - యింత మంది అనాథలు, నిరు పేదలు బయట తిండీ , గుడ్డా, చదువూ లేకుండా వుంటే , మనకు అసలు నిద్రెలా పడుతుంది ;తిండెలా సహిస్తుంది , అని. భారత దేశంలో అత్యధికంగా డొనేషన్లు యిస్తున్న వ్యక్తి  యిప్పట్లో ఆయనే. యివ్వడం కాదు గొప్ప. మనసులో వున్న ఆ భావం  గొప్ప . దాన్ని ఆచరణలో పెట్టే హృదయం గొప్ప . 

అంతే  కానీ, మనకు యిచ్చే వాడూ ఆ పై వాడే. మన నుండీ తీసుకునే వాడూ వాడే . తీసుకునే వాడిలో దేవుడిని చూడాలి , యిచ్చే వాడు .

అయితే - నరేంద్ర మోడీ గారు అంటారు - నా పాలనలో - మీకు ఉచిత కరెంటు, ఉచిత నీరు ఇలాంటి వాటిని గురించి మాట్లాడను . మీరు దేన్నైనా  సరే - దాని విలువను యిచ్చి మీరే కొనుక్కునే సామర్థ్యం - మీకు కల్పిస్తాను - అని. అది నాకు బాగా నచ్చింది .

అది జరిగే వరకూ - 

మన చుట్టూ వున్న అనాథ బాలలు, అనాథ వృద్ధుల మొహాల్లో - మనం ఆనందపు దీపాలు, అభివృద్ధి వెలుగులు వెలిగించాలి . అదీ క్రాంతి. అదీ మనకు సంక్రాంతి . మనలోని సూర్యుడు వుత్తరాయణం  వైపు  దిశ మళ్ళే  సంక్రాంతి. మనలో విరిసే నిజమైన వసంతఋతువుకు మనం పలికే సుస్వాగతం. 

అటువంటి సంక్రాంతికి - మీకు నా సుస్వాగతం . నా శుభాకాంక్షలు . 

= మీ 

వుప్పలధడియం  విజయమోహన్