4, జనవరి 2013, శుక్రవారం

ఏ వ్యాధైనా తప్పకుండా తగ్గుతుంది. ఎలా ? రోగాలు ఎలా రాకుండా జాగ్రత్త పడాలి? ఆరోగ్యానికి మూల సూత్రాలు ఏవి?

 

ఏ వ్యాధైనా తప్పకుండా తగ్గుతుంది. ఎలా ?

రోగాలు - ఎలా తగ్గుతాయి? - ఎలా రాకుండా వుంటాయి?

ఆరోగ్యానికి  మూల సూత్రాలు ఏవి?

  


రోగాలు మనిషికి ఎప్పుడైనా రావచ్చు. తల్లి కడుపులో ఉన్నప్పుడే రావచ్చు; పసి పాప గా వున్నప్పుడు  రావచ్చు; పెరిగేటప్పుడు రావచ్చు. యవ్వనంలోనూ రావచ్చు. మధ్య వయస్కులుగా ఉన్నప్పుడు, ముసలితనంలో- ఎప్పుడైనా రావచ్చు. చనిపోయే  వరకు ఏ క్షణంలో నైనా రావచ్చు.

రోగాలు వస్తూ వుంటాయి. ఏదైనా సరే - వొక కాలంలో వచ్చేది, మరో కాలంలో పోతుందని, తాత్త్వికులు చెబుతారు . కానీ- కొన్ని రోగాలు రావడమే గాని, పోవడం అంటూ వుండదు కొందరికి. మనం పోయేటప్పుడు, మనతో బాటే అవీ పోతాయి. అంత వరకు మనతో బాటే వుంటాయి.

కొన్ని మహా బాధ పెట్టేవి. మరి కొన్నిటిలో శారీరక బాధ తక్కువ. అటువంటి వాటిని మనం తరచూ పట్టించుకోక పోవడం  జరుగుతుంది, మన కొంప అవి ముంచే వరకూ .

మరి కొన్ని అసలు  రోగాలా, కాదా - అని చెప్పడం మహా కష్టం. పుట్టే టప్పుడు,  తలలోనో, వీపులోనో, మరెక్కడో అతకబడి పుట్టిన పిల్లలు వున్నారు. అది సరి చెయ్యకపోతే, జీవితాంతం వారికి ఎన్నో రకాల బాధలు తప్పవు. సరి చెయ్యాలంటే  ఎన్నో సమస్యలు.

అయిదారు ఏళ్ళ పాపకు మధుమేహం. కొందరికి పుట్టినప్పుడే గుండెలో ఏదో సమస్యలు. లేదా, కొందరికి ఎప్పుడూ  ఎడతెగని పడిశం, దగ్గు లాంటి చిన్న, చిన్న రోగాలు. పేరు చిన్న, కానీ అవి పెట్టే బాధ, పెద్ద రోగాలు కూడా పెట్టవు . ఏ రోగానికీ తట్టుకోలేని పిల్లలు ఎంతో మంది.

కొంత మందిని, పుట్టేనప్పుడే, అనారోగ్యంతో ఎందుకు పుట్టిస్తున్నాడు దేవుడు? ఆ..అది...వాళ్ళ నాన్నా, అమ్మలకో,  వా...రి నాన్నా అమ్మలకో... ఆ.. జబ్బులు వుంది కాబట్టి వీరికీ వచ్చింది - అంటుంది సైన్స్. పోయిన జన్మ లో చేసిన కర్మ ఫలితం నాయనా - అనుభవించక తప్పదు అంటుంది - కర్మ సిధ్ధాంతం . రెండూ కొంత నిజమే కావచ్చు.

మరి వచ్చినవి - ఎప్పుడు పోతుంది ,ఎలా పోతుంది? కొన్ని పోనే పోవు  అంటుంది సైన్స్. చేసిన కర్మ ఫలితం తీరిపోతే మంచైనా, చెడైనా , ఏదైనా పోతుంది - అంటుంది కర్మ సిద్దాంతం. - అయితే రోగాలకు వైద్యం వొద్దని కర్మ సిద్దాంతం  చెప్ప లేదు.  సమస్యలకు సమాధానాలు వెతకొద్దని ఎప్పుడూ చెప్ప లేదు.

వొక్కో సారి - కొన్ని ప్రాంతాలలో , మహా మారి లాగా కొన్ని రోగాలు లక్షల, కోట్ల మందిని పీడిస్తాయి. ఉదాహరణకు,ఆఫ్రికాలో, కొన్ని ప్రాంతాలలో, ఎయిడ్స్ వ్యాధి, ముప్ఫై శాతం మందికి వుందట. ఎయిడ్స్ వ్యాధి కి యిప్పటికీ మందు లేదు.యిప్పట్లో వచ్చే ఆస్కారం కూడా కనిపించడం లేదు. కానీ వ్యాధి రాకుండా కొంత జాగ్రత్త పడ వచ్చు.  వొక్క  దక్షిణ ఆఫ్రికాలో మాత్రం  2010 లో 2,80,000 మంది ఎయిడ్స్ వలన చని పోయారట చనిపోయే వారిలో  ఎయిడ్స్ తో పోయే వారి శాతం ఆ దేశంలో - చాలా ఎక్కువ .

మన దేశంలో - మధుమేహం, రక్త పోటు, ఆస్తమా, గుండె జబ్బులు -అన్నీ ఎక్కువగా వున్నాయి.-అయితే  భారతీయులంతా - వీటికి భయపడడం మానేశారు. మీకుందా, అంటే మీకుందా అని అడుగుతూ - మీరేం తీసుకుంటున్నారు అంటే, మీరేం తీసుకుంటున్నారు అని తెలుసుకుంటూ - వొకరికొకరు సలహాలిచ్చుకుంటూ - బ్రతికేస్తున్నారు.

అల్లోపతి లో కొన్ని నూతన పరిశోధనలు జరుగుతూ వున్నాయి. పాత రోగాలకు మందులు వస్తే - కొత్త రోగాలు పుట్టుకు వస్తున్నాయి. కలరా పోయిందా. డెంగ్యూ వచ్చింది. మలేరియా పోతే స్వైన్ ఫ్లూ  వచ్చింది. మరి కొన్ని వ్యాధులకు పేర్లే లేదు. రేపేం కొత్త వ్యాధి వస్తుందో ఎవరికీ తెలీదు.

కనీసం వొక్క నెలైనా -  ఏ  రోగంలేకుండా వున్న కుటుంబం ఎక్కడైనా వుంటే - దాన్ని చూడాలని ఆశ  పడుతున్నాను. కానీ ఈ రోజు వరకూ చూడలేక పోతున్నాను.

ఎవరో వొక మాట చెప్పారు ఈ మధ్య.  ప్రతి సగటు మనిషీ, ప్రతి రోజూ,  తెలిసో, తెలియకో, కనీసం నాలుగు అబద్ధాలాడతారట. అంటే - సంవత్సరానికి, దాదాపు 1,500 అబద్ధాలన్న మాట. 70 ఏళ్ళ జీవితంలో లక్షకు పైగా అబద్ధాలాడతారట.కొంత మంది పది లక్షల అబద్ధాలు చెప్పే వారూ వున్నారు. అంత కంటే ఎక్కువ అబద్ధాలు చెప్పే వారూ వుండ వచ్చు.

చిత్రమేమంటే - దీన్లో  సగం భాగం అబద్ధాలు జీవితాంతమూ వొక్కటే అబద్ధమే. అదేమిటంటే - ఐ ఆమ్  ఫైన్  - తెలుగులో , "నేను బాగున్నాను" - అనడం.  కానీ - ఆ తరువాత పది మాటలు మాట్లాడిస్తే - తను ఎన్ని రకాలుగా బాగా లేదో నిజం చెప్పేస్తుంటారు.

నేను బాగున్నాను - అని నోటితో అనే  వారు వున్నారు కానీ, నేను బాగున్నాను అని తనలో తాను నిజంగా, మనస్ఫూర్తిగా  అనుకునే వారు, అనుకోగలిగే వారు - చాలా తగ్గి పోతున్నారు, ఈ రోజుల్లో .

శారీరక రుగ్మతలు మాత్రమే కాదు.  మనకు తెలిసినవి తెలీనివి - అనేక  రకాల మానసిక రుగ్మతలు కూడా మన సమాజంలో చాలా ఎక్కువ;   యింకా ఎక్కువ అవుతున్నాయి  అని - తెలుస్తూనే వుంది.

ఎందుకిలా? మనం బాగుండగలమా? బాగున్నామని మనస్ఫూర్తిగా అనుకోగలమా?ఎందుకు, ఎప్పుడూ బాగుండ  లేని పరిస్థితులలో చాలా మంది వుంటున్నాము?

రామ రాజ్యం అంటే ఏమిటి?  రోగాలు చాలా తక్కువగా వుండడం. అకాల మరణాలు లేకపోవడం. ప్రజలలో ధార్మిక జీవనం వలన - సుఖ సంతోషాలు ఎక్కువగా వుండడం - యివన్నీ  రాజుగా వున్న వారు  ముఖ్యంగా చూసుకోవలసిన విషయం.

భవిష్యత్తులో  వోటు వేసేటప్పుడు - "మన' వాడికి" కాదు - "మంచి వాడికి" వోటు వేద్దాం. ఆ వొక్క పని చేస్తే, మన రోగాలు సగం తగ్గుతాయి.

యిప్పుడు వున్న రోగాలు పోగొట్టుకోవడం ఎలాగో కాస్త చూద్దాం .


చాలా మంది వైద్యులు, మీరు జీవితాంతామూ మందులు తీసుకుంటూ వుండాల్సిందే, కష్ట పడాల్సిందే - అన్న వ్యాధుల గురించి - ముఖ్యంగా, కొంత మంది రోగులు, నన్ను సలహా అడుగుతూ వుంటారు.

నేను వైద్యుడు కాదు - కానీ - ఏ రోగాన్నైనా - పూర్తిగా నయం చేయగలిగే మందు వుందని - నేను విశ్వసించే వాడిని.  అలాగే, ఏ రోగాన్ని గురించి ఎవరు నన్నడిగినా - సరైన, వైద్య ప్రముఖులు ఎక్కడ వున్నారని ఇంటర్ నెట్ ద్వారా - కనిబెట్టి, వారికి చెప్పడం నా అలవాటు.అందులోనూ - అల్లోపతీ, ఆయుర్వేదాలు రెండింటినీ  వాడటం వలన అతి త్వరితంగా వ్యాధులు వుపశమిస్తాయని - నా నమ్మకం. అలాగే, కొన్నిటికి, హోమియోపతీ కూడా బాగా పని చేయడం నేను చూసాను. కానీ అల్లోపతీ, హోమియోపతీలు వొకే సారి వాడడం కుదరదని చాలామంది చెబుతారు. రెండూ వొకదానికొకటి, విరుద్ధమైన పద్ధతులు.

ఎక్కడో  వొక గొప్ప వైద్యుడు చెప్పాడని చదివాను - ఎక్కడ రోగం వస్తుందో, అక్కడే,  దానికి విరుగుడు కూడా వుండనే వుంటుంది -అని.  అంటే - చుట్టుపట్ల - మన రోగానికి తగిన వైద్యం వుండనే వుంటుంది - అనేది - సిద్దాంతం.

జీవకుడనే ప్రాచీన కాలపు  వైద్యుడు వొక సారి, శిష్యులతో అన్నాడట - ప్రపంచంలో ఏదైనా "మందు" కాని పదార్ధం  వుంటే కనుక్కుని తీసుకు రండి - అని. ఏతా, వాతా తేలిందేమిటంటే -వైద్యానికి పనికి రాని  పదార్థమంటూ ప్రపంచంలో లేదని.

మనిషి మాట మహా గొప్ప మందు. నమ్మకం కలిగించే ప్రతి మాటా మందే. మీ చుట్టూ వున్న రోగులలో - మీరు మొట్ట మొదట - రోగం పోతుందనే - నమ్మకం కలిగించాలి.

అలాగే, రోగం మనతో ఉన్నంత కాలం కూడా - మనం సంతోషం గా వుండగలం; వుండాలి - అనే విశ్వాసం మనలో వుండాలి. రమణ మహర్షి గారు కానీ, రామకృష్ణ పరమహంస గానీ, ఆది శంకరాచార్యులు గానీ, పెద్ద రోగాలతో బాటు, చాలా  సంతోషంగా - జీవితం గడిపిన వారే.

కాకపోతే - మనం మందులు కూడా తీసుకుంటూ, రోగాలు పోతాయనే నమ్మకంతో - సంతోషంగా వుండొచ్చు. వారు శరీరం పోతే పోనీ అని వదిలేసారు. అలా మనకు వద్దు. మనం సామాన్యులు కదా. శరీరం పైన కాస్తో , కూస్తో ప్రేమ వున్నవాళ్ళం కదా.

మనకోసం చెప్పబడిన వాక్యం - దేహో దేవాలయో ప్రోక్తః -అంటే మీ దేహం వొక దేవాలయం. దాన్ని శుభ్రంగా, రోగాలు రాకుండా, లేకుండా పెట్టుకొండి  - అని.

చిన్న, చిన్న విషయాలలో శ్రద్ధ వహిస్తే - చాలా రోగాలు రానే రావు.

మీకు తెలుసు - చాలా రోగాలకు ప్రధానమైన వాహకాలు - అంటే రోగాన్ని, అది వున్న చోటినుండి , మన శరీరం వరకు తీసుకొచ్చి, మనలోకి చేర్చేవి - దోమలు, ఈగలు.

మీ యింటి దగ్గర యివి లేకుండా చూసుకుంటే - చాలా రోగాలు రావు.  ఎలా? మీ యింటి దగ్గర మురుగు నీరు, కుళ్లి పోతున్న పదార్థాలు  లేకుండా చూసుకోవాలి. వుంటే, వాటిపై, బ్లీచింగ్ పౌడర్ లాంటివి - చల్లాలి. సరే. మీ పంచాయితీ వారి ముఖ్యమైన పని - వీటిపై వొక లాంటి గాస్ విడవడం. లేదా బ్లీచింగ్ పౌడర్ వంటివి చల్లడం.  వూళ్ళో దోమలు, ఈగలు లేకుండా చూసుకోవలసిన అతి ముఖ్య బాధ్యత పంచాయితీ వాళ్ళదే. వాళ్ళు చెయ్యలేదంటే - కంప్లైంట్  యివ్వండి. వాళ్ళు చెయ్యాలి. లేదంటే - చేసేటట్టు మీరు చెయ్యాలి.

యింట్లో దోమలు, ఈగలు వుంటే - మీరు మరీ జాగ్రత్త పడాలి. అవి చావకుండా ఎగిరిపోయేటటువంటి పరికరాలు  వాడొచ్చు. కానీ - మీరు మరీ అంత  అహింసా వాదులైతే  కష్టం. ఈ రోజు వొక ఈగ, వొక దోమ వుంటే, రేపటికి అవి వొక వందగా మారుతాయి.  తరువాత వేలు, లక్షలుగా మారుతాయి. మీ పైన పండుగ చేసుకుంటూ వుంటాయి. మీకు, వాటి వల్ల,  ఎన్ని రకాల రోగాలు రావొచ్చో - చెబితే ఆశ్చర్యపోతారు. ఏనుగు కాలు నుండీ కలరా, మలేరియా,  మరి ఎన్నో వ్యాధులు  వాటి వల్ల వస్తాయి.- అవి తగ్గడం చాలా కష్టమైన వ్యాధులు కూడా. కాబట్టి మీ ఛాయిస్ వొకటే - మీరు బాగుండాలా?  దోమలు, ఈగలు బాగుండాలా?    మరో ఛాయిస్ లేదు. ఎవరో వొకరు బాగుండొచ్చు.యిద్దరూ కాదు.

ఏదో, ఈగ సినిమా చూసేసి, యీగలంటే  భయపడడమో, వాటిపై ప్రేమ పెంచుకోవడమో  లాంటివి చెయ్యకండి. యీగలకూ, దోమలకూ, మీరు విలన్లు కాకపోతే, అవి మాత్రం మీకు పుట్టడమే విలన్లు గానే పుట్టాయి - అన్నది జ్ఞాపకం పెట్టుకోండి.  బాగున్న సినిమాలు, కొందరు మనుషులపై పనికి రాని కొన్ని పెద్ద ముద్రలు వేస్తూ వుంటాయి.

సరే. నా సలహా - ఈగలు, దోమలు మీ యింటి పరిసరాలు, మీ యింటి లోపల - వుండకుండా చూసుకోండి.  వుంటే మాత్రం, కిటికీలకు, వాకిళ్ళకు దోమ తెరల లాంటివి దొరుకుతాయి - అవి కట్టండి.

ఆహార పదార్థాలు అన్నిటి పై మూతలు పెట్టడం ఎప్పుడూ మరిచి పోకండి.

వీలైనంత వరకు - ఆహార పదార్థాలు - అప్పటికప్పుడు చేసుకుని, వేడిగా తింటే - బాధ లేదు. చల్లటి పదార్థాలు, అంటే నిన్నటి రోజు, లేదా, యింకా అంతకు కూడా ముందు చేసినవి - వద్దే వద్దు. అవి తామస గుణ ప్రధానమైనవి. రోగాలతో బాటు, సోమరితనం, మరెన్నో తామస గుణాలు కలుగ జేస్తాయి.   యిది చెప్పింది - గీతలో శ్రీకృష్ణుల వారు. మరి మీ యిష్టం.

చల్లటి ఆహార పదార్ధం వేడి పెడితే చెడి పోతుందని, కొంత మది చల్లగా తినేస్తూ వుంటారు. దాని వాసన మీ ముక్కుకు తెలియక పోవచ్చు కానీ - అది అప్పటికే చెడి పోయినట్టే లెక్క. ఆరోగ్యం కావాలంటే - ఆ మాత్రం శ్రమ పడాలి మనం. లేకుంటే - అనారోగ్యం  మన వెనుకే వస్తుంది. ఎందుకొచ్చిందో తెలీకుండా వచ్చేస్తుంది.

యింట్లో, ఊడ్చిన చెత్త, ఆహారపదార్థాలు, ఆకులు, లాంటివి - వూడ్చి మన ఇంట్లోనే ఏదో మూలలో వున్న చెత్త కుండీ లో వెయ్యడం మన అలవాటు. అవి రోజుకు రెండు సార్లు - యింటి బయట వున్న పంచాయితీ వారి చెత్త కుండీలలో వేసెయ్యాలి.  చాలా వరకు, దోమలు మన  యింట్లోని చెత్త కుండీల్లోనే - నివాసం పెడతాయి. అక్కడి నుండీ, రాత్రి మనపైన స్వైర విహారం చేస్తాయి. అందుకని, రాత్రి పడుకునే ముందు, తప్పక  యింట్లోని చెత్త కుండీ ఖాళీ  చేసెయ్యండి. యిది ముఖ్యం. మీరు పడుకునే గదిలో - దోమలు, ఈగలు  లేకుండా చూసుకోవడం అతి ముఖ్యం.

ఎందుకింత ఉపోద్ఘాతం చెబుతున్నానంటే - వీటిపై చాలా మందికి అవగాహన లేదు గనుక.

నిజానికి - మంచి ఆహారము, మంచి నీరు, మంచి గాలి, మంచి, పరిశుద్ధమైన పరిసరాలు - ఇవీ మన ఆరోగ్యానికి ముఖ్యమైన అవసరాలు; ప్రాతిపదికగా నిలిచే అంశాలు. వీటన్నిటినీ మనం రకరకాలుగా పాడు చేస్తూ ఉన్నాము.

ఆహారంలో ఎన్ని రకాల కలపడాలు జరుగుతున్నాయో, చదువుతూ వుంటే ఆశ్చర్యం వేస్తుంది. దీన్ని అడిగే నాథుడే లేదు. అడగవలసిన వాడు, తనకు డబ్బొస్తే   చాలనుకుంటూ వున్నాడు. మన  ఉద్యోగుల, నాయకుల  లంచగొండి తనానికి హద్దే లేకుండా పోయింది. కాయలు పండ్లు కావడానికి, విష ప్రదమైన లోహాలను  వాడుతున్న వారు చాలా మంది వున్నారు. పాలలో, నీళ్ళు కలపడం కాదు; బోరిక్ పౌడర్ లాంటివి కలుపుతున్నారట. వడ్లలో, బియ్యంలో,  గోధుమల్లో, రాళ్ళు కలపడం పాత విషయం. మనం ఎప్పుడు మారుతాం? ఎవరికి రోగాలోచ్చినా ఎవరు చచ్చినా-నాకేం ఫరవాలేదు. నేను మాత్రం కలపడం చెయ్యకుండా వుండను - అనే వారు చాలామంది. నేను బంగారంలో కలపడం గురించి కాదు - మనం ప్రాణంతో వుండాలంటే కావలసిన శుభ్రమైన  ఆహారాన్ని గురించి మాట్లాడుతున్నాను.  ఈ కలపడం అనే వొక్క అలవాటు మాన్ప గలిగితే దేశంలో సగం రోగాలు రావు.

మొన్న వొక అంతర్జాతీయ వ్యాపార సంస్థ - మన దేశంలో  అమ్మే చికెన్ పదార్థాలలో, పురుగులుండడం చూసిన కొనుగోలుదారులు, వారిని పట్టి నిలదీశారు.లోపలి కెళ్ళి చూస్తే, ఎన్ని పదార్థాలలోనో పురుగులుండడం గమనించారు.    యిండియా కదా - యిక్కడ ఏమైనా చెయ్య వచ్చు అని వారూ అనుకొని వుంటారు. మనలో వున్న ఈ స్తబ్దత పోవాలి. తప్పు చేస్తున్న వాడిని, కలపడం చేస్తున్న వాడిని నిలదీసి అడిగే సామర్థ్యం, ధైర్యం రావాలి.  ప్రతి గ్రామం లోనూ - వొక కన్స్యూమర్ సంఘం రావాలి. అందులో అందరూ, సభ్యత్వం వుండాలి వారి ద్వారా విక్రయ దారులను నిలదీయాలి. 

మంచి ఆహారం వున్నా, చేతిలో డబ్బు కూడా వున్నా - ఆ డబ్బును, మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు, పొగ త్రాగడానికి ఖర్చు చేసే,  తనకూ,యింట్లో వారికీ  సరైన తిండి లేకుండా చేసే  మహానుభావులెందరో వున్నారు.

మరి వారి ఆరోగ్యము, వారి కుటుంబం లోని వారి ఆరోగ్యము, చదువులు, యింట్లోని  సుఖ సంతోషాలు చెడి పోవడం తప్పక జరుగుతాయి కదా.   యిదంతా  దేని ప్రభావం?  వారు ఈ అలవాట్లు మానక పోతే - ఎవరేం సహాయం చేసినా ప్రయోజనం లేదు. ఈ మధ్య మనం చదువుతున్న రేపు కేసులు చాలా వాటిలో - మనకు కనపడుతున్న ముఖ్యాంశం - రేపు చేసిన వారు చాలా వరకు, తాగున్న వారే. మరి కొన్ని కేసులలో - మాదక ద్రవ్యాలు అలవాటున్న వారు.  ఏది తినాలో అది తినరు. ఏది త్రాగాలో అది త్రాగరు. ఏది తమ ఆరోగ్యానికి, సమాజ ఆరోగ్యానికి భంగం  కలిగిస్తుందో - అదే తింటామంటారు, త్రాగుతామంటారు.

 మనం త్రాగే నీరు మంచి, త్రాగు నీరు కాక పోతే, అనేక రోగాలు రానే వస్తాయి. పల్లెలలో కానీయండి పట్టణాలలో కానీయండి; యిప్పటికీ, శుభ్రమైన  త్రాగు నీటి సదుపాయం పూర్తిగా లేదు.  నీళ్ళలో అనేక రకాల ప్రమాద కరమైన రసాయనిక పదార్థాలు వున్న ప్రదేశాలు ఎన్నో వున్నాయి. అక్కడ వున్న చాలా మంది లో - అనేక రకాల రోగాలు ప్రబలం గా వున్నాయి. ఈ మధ్య వచ్చిన వొక రిపోర్ట్ ప్రకారం గంగానది లో కూడా, ప్రమాదకరమైన ఆర్సెనిక్ లాంటి రసాయనాలు కలిపే పరిశ్రమలెన్నో వున్నాయట. తత్ ఫలితంగా -  కొన్ని గంగా తీరప్రాంతాలలో, రక రకాల కాన్సర్లు చాలా ఎక్కువగా వున్నాయట. నదులను కలుషితం చేస్తూ కొంత మంది ధనవంతులు కావడానికి, మనం ఎన్నో ప్రాణాలను పణంగా పెడుతున్నాము.

అలాగే - మనం పీల్చే గాలి శుభ్రంగా వుండాలి. దేవుడు శుభ్రమైన గాలినే యిచ్చాడు.  కానీ దాన్ని కూడా మనం కలుషితం చేస్తున్నాము - రకరకాలుగా .

రెండు నెలల క్రితం  మేము, కాశీ నుండి  చెన్నైకి వస్తున్నాము. మార్గంలో, మహారాష్ట్ర -ఆంధ్ర ల మధ్య , వొక చోట ఏదో వొక మిల్లు ప్రక్కన మా రైలు సిగ్నలు లేక పది నిముషాలకు పైగా ఆగింది.

ఆ మిల్లు నుండి వస్తున్న కలుషితమైన గాలితో, రైలంతా నిండి పోయింది. ఆ గాలి - దట్టమైన చెక్క రంగుతో, ఏదో దుర్గంధమైన వాసనతో నిండి వుంది.  రైలు లో వున్న ఎవరూ వొక్క నిముషం కూడా ఆ గాలిని భరించ లేక పోయారు. అందరూ తలుపులన్నీ  వేసేశాం. అయినా ఆ గాలి పీల్చిన ఫలితంగా - తిరిగి వచ్చిన తరువాత,  వొక వారం రోజులు, ప్రతి వొక్కరూ  ఏదో వొక అనారోగ్యం అనుభవించ వలసి వచ్చింది . మరి అక్కడే ఆ ఫాక్టరీ లో పని చేసే వారి సంగతి ఏమిటి?  చుట్టూ వున్న వారి   సంగతి ఏమిటి? వొక దేశం గా మనం ఏం చేస్తున్నాము?

తినే ఆహారాన్ని కలుషితం చేస్తున్నాం. త్రాగే నీటిని కలుషితం చేస్తున్నాము. పీల్చే గాలినీ కలుషితం చేస్తున్నాము.ఇవీ మనకు, మన శారీరక ఆరోగ్యానికీ కావలసిన అతి ముఖ్యమైన  సాధనాలు. మరి మన ఆరోగ్యం ఎలా బాగుంటుంది?  

మనం సెల్ ఫోన్లను ఎక్కువగా వాడుతున్నాము కదా. ఈ అధిక వాడకం యొక్క ఫలితాలు గవర్నమెంటు  వారే చెబుతున్నారు. ఈ మధ్య   టెలికాం  డిపార్ట్ మెంటు వారి వెబ్ సైటులో విస్త్మృతంగా  దీన్ని గురించి మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఎన్నో వేసారు. ముఖ్యంగా గుండె దగ్గర యిది పెట్టు కోకండి వీలైనంత, శరీరానికి దూరంగా పెట్టుకోండి. ముఖ్యంగా మీ దిండు క్రింద  సెల్ ఫోను పెట్టుకోకండి.   పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వకండి. వీలైనంత వరకు  లాండ్ లైన్ ఫోన్లు వాడండి. సెల్  ఫోన్లో  - వొకే సారి ఎక్కువ సేపు మాట్లాడ కండి.  ఇలాంటివి ఎన్నో.


యిప్పుడు, వచ్చిన వ్యాధులు పోగొట్టుకోవడం, రాని  వ్యాధులు రాకుండా చేయడం కోసం కొన్ని వైద్యాలు చూద్దాం.

మన దేశంలో యిప్పుడు, చాలా ఎక్కువగా వున్న వ్యాదులలో వొకటి రక్త పోటు.  ఆయుర్వేదంలో దీనికి చాలా మంచి మందులు వున్నాయి. యిది వొక సారి వస్తే పోదని అలోపతి వైద్యులు అంటారు. కానీ, నాకే 6-7 ఏళ్ళ క్రితం బీపీ వచ్చింది - చికెన్ గునియా వచ్చినప్పుడు, దానితో బాటుగా చాలా ఎక్కువగానే వచ్చింది. అప్పుడు, నేను స్వామీ రాం దేవ్ గారి యోగా శిబీర్ వారం రోజులు వెళ్లాను. ఆ యోగ శిక్షణ శిబిరం నాలో చాలా మార్పు తీసుకు వచ్చింది.

ఆయన చెప్పినట్టు గానే, ప్రాణాయామాలు, ఆసనాలు, వాటిపై ఆయుర్వేదంలో వారు తయారు చేసే మందులు - ముఖ్యంగా ముక్తావటి అనే టాబ్లెట్లు - వాడాను. మూడు నెలలలో,  బీ.పీ మాటు మాయం. తరువాత యిప్పటి వరకు, ఆరు సంవత్సరాలుగా -  నేను ఏ మందు, బీ.పీ. కోసం, వాడడం లేదు.  అంటే - బీ.పీ, ఈ మందులతోనూ, కొద్ది పాటి ప్రాణాయామాలు, ఆసనాలు తో పూర్తిగా పోతుందని - నా విషయంలో నాకే తెలిసింది.

 కానీ, బీ.పీ. వచ్చినపుడు , అలోపతి వైద్యులు చెప్పిన మాటలు, యిచ్చిన మందులు - ఈ మందులు ఎన్నాళ్ళు తీసుకోవాలని అడిగితే, వారు, జీవితాంతం తీసుకోవాలని చెప్పారు. బీపీ వుండనే వుంటుంది. దాన్ని, మీరు కొంత నియంత్రణలో పెట్టుకోవాలి, ఈ మందులతో - అన్నారు . కానీ నా వరకు, నాకు బీ.పీ. సంపూర్తిగా పోయింది. 

ఎందుకు చెబుతున్నానంటే - కొద్ది పాటి ఆసనాలు, ప్రాణాయామాలు, ముక్తావటి లాంటి మందులతో - బీ.పీ వున్నవారు - అది పోగొట్టుకోవచ్చని   చెబుతున్నాను. మూడు నెలల పాటు అల్లోపతీ టాబ్లెట్ల తో బాటు, మక్తావటి కూడా వేసుకుంటూ, తరువాత, అల్లోపతీ తగ్గిస్తూ ,కొన్నాళ్ళకు అల్లోపతీ పూర్తిగా మానేసి, తరువాత కొన్నాళ్ళకు ముక్తావటి కూడా మానేయ వచ్చు. ఈ మధ్య కాలంలో మీకు బీ.పీ ఎంత  వుందో మాత్రం అప్పుడప్పుడూ చెక్ చేసుకుంటూ వుండడం ముఖ్యం. నా అభి ప్రాయంలో - వొక ఆరు నెలల లో - మీకు బీ.పీ. మరి లేదు - అన్న ఆరోగ్య స్థితికి వస్తారు.

యిలాగే ఎన్నో రోగాలు - పోవు, అనుకొన్నవి, చాలా మందికి  పోవడం నేను చూసాను. ఆయుర్వేదంలో యింకా ఎంతో పరిశోధనలు జరగాల్సి వుంది.

అలాగే, ఆయుర్వేదము, అల్లోపతీ కలిపి వైద్యం చెయ్య వలసిన అవసరం కూడా వుంది.

అంత కంటే - చాలా ముఖ్యం - మనం, మన చుట్టూ వున్న రోగాలను గురించి బాగా తెలుసుకుని , అవి రాకుండా చూసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.

ముందు చెప్పినట్టు, దోమలు, ఈగలు లేకుండా చూసుకుంటే - ఎన్నో రోగాలు రావు. ఎప్పుడు చేసిన ఆహారమో తినడం మానేసి, కనీసం ఈ రోజే చేసిన ఆహారం, వేడి చేసుకుని - తింటే కొన్ని రోగాలు రావు.

కొంత ధ్యానం, ప్రాణాయామం, ఆసనాలు - చేస్తే యింకా ఎన్నో రోగాలు రాక పోవడమే కాక, మనసు కూడా, ప్రశాంతం గానూ ఆహ్లాదం గానూ వుంటుంది.యింట్లో వాళ్ళు వొకరితో  వొకరు, పొరుగువారితో కూడా - వీలైనంత వరకు, మంచి మాటలే  మాట్లాడాలని, నియమం పెట్టుకుంటే మీకూ, అవతలి వారికీ - చాలా రోగాలు రావు; వున్న రోగాలు కూడా తగ్గుతాయి.

ఏ రోగమొచ్చినా - నేను నా సంతోషం మాత్రం  కోల్పోను - అని నిర్ణయించుకుంటే - మన చివరి క్షణం వరకు - మనం సంతోషంగా , వుండగలం. మీకు తెలుసా - ప్రతి రోగంలోనూ, అసలు రోగం -"భయం, నిరాశ, నిస్పృహ" - యివే. యివి వదిలేసి చూడండి.  ఏ రోగమొచ్చినా మనకు దాదాపు రోగం లేనట్టే   వుంటాము.

ఆ పైన మందులు కూడా వాడాలి. కొన్ని రోగాలకు చాలా మంచి మందులే వున్నాయి. అయినా, ఆ రోగాలతో, విపరీతంగా అవస్థ పడుతున్న రోగులను ఎందరినో మనం చూస్తున్నాము.

ఉదాహరణకు - బోదకాలు ,లేదా, ఫైలేరియా వ్యాధితో అవస్థ పడే వారిని మనం చాలా మందిని చూస్తున్నాము. కానీ దీన్ని దాదాపు 95 శాతం వరకు నయం చేసే పద్ధతులు చాలా వున్నాయి. కేరళలో - కాసర్గోడ్ అన్న పట్టణంలో -ఇనస్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ డెర్మటాలజీ లో - డాక్టర్ నరహరి -అనే డాక్టర్ ఆధ్వర్యంలో  - 2 వారాల ట్రీట్మెంట్  తో - ఎంతో బాగా నయమవుతూ   వున్నట్టు - మనకు తెలుస్తూ వుంది.

అలాగే - చర్మవ్యాధులు -సోరియాసిస్ లాంటివి -చెన్నై లో - డాక్టర్ జె.ఆర్ .కృష్ణమూర్తి  అనే   సిద్ధ డాక్టర్ గారు బాగా నయమయ్యే టట్లు చేస్తున్నారు.యిదే సోరియాసిస్ కు రాందేవ్ గారి మందులు కూడా బాగా పని చేస్తాయి.

హృద్రోగాలు రాకుండా చెయ్యడమే కాక, వచ్చిన వాటిని కూడా బాగా తగ్గించగల మందు - అర్జున , లేదా  అర్జునారిష్ట అంటారు. యివి, ఎవరైనా వాడవచ్చు. ఇటువంటిదే, రామ్ దేవ్ వారి హృదయామృత వాటి.

అలా - దాదాపు ప్రతి రోగానికీ - మందులు వున్నాయి.

అయితే - వీటన్నిటిలో చాలా ముఖ్యమైన అంశం - మనం మనసులో ఆరోగ్యంగా వుండాలని, వుండగలనని నమ్మకం వుండడం; వీటితో బాటు దినమూ, ఎంత సేపు వీలైతే అంత - ధ్యానము, ప్రాణాయామము, ఆసనాలు చెయ్యడం - యివి ఎంతో ముఖ్యంగా చెప్పబడుతోంది.

స్వామి రాందేవ్  గారి ట్రీట్మెంట్ చాలా వరకు  దీనిపైనే ఆధారపడి వుంది.ప్రాణాయామాలలో, వారు ముఖ్యంగా అనులోమ,విలోమ ప్రాణాయామం, మరియు, కపాల భాతి ప్రాణాయామం - లకు ప్రాముఖ్యం  యిస్తారు. యివి చాలా సులభం. ఆహారం తీసుకునే ముందు తెల్ల వారి 15 నిముషాలు, సాయంకాలం  15 నిముషాలు తప్పకుండా చెయ్యాల్సినవి.

అంటే - రోగాల వరకు - మనం  పాటించాల్సిన కొన్ని ముఖ్య సూత్రాలు యివి -

1.  రోగాలు రాకుండా జాగ్రత్త పడాలి. (దోమలు, ఈగలు లేకుండా చెయ్యడం; సరైన తిండి, నిద్ర, వ్యాయామం, యోగ, ప్రాణాయామాలు  పాటించడం)

2. రోగాలు వస్తే - అశ్రద్ధ చెయ్యకుండా, వెంటనే సరైన ట్రీట్మెంట్ ఆరంభించాలి.  ఎంత త్వరగా, సరైన ట్రీట్మెంట్ ఆరంభిస్తే - అంత త్వరగా, రోగాలు నయమౌతాయి. 

3. నా ఉద్దేశంలో - అల్లోపతి, ఆయుర్వేద వైద్యాలు రెండూ తీసుకోవడం - చాలా మంచిది.  యిప్పుడు ఆయుర్వేదం లోనే - సిద్ధ, యునాని అన్నీ చేరిపోతున్నాయి.


4. కొన్ని రోగాలకు హోమియోపతీ కూడా బాగా పనిచేస్తుంది - కానీ దానితో, అల్లోపతీ వైద్యాన్ని మాత్రం చేర్చకూడదని  చెబుతారు.

5. ముఖ్యంగా - దీర్ఘ రోగాలనబడే - ఆస్తమా, రక్త పోటు, మధుమేహం , చర్మవ్యాధులు, బోదకాలు - లాంటి వాటికి, రెండు రకాల వైద్యాలు వొకే సారి, త్వరగా ఆరంభించడం చాలా మంచిది.

6.  రోగంలో సగం రోగం - "భయం నిరాశ, నిస్పృహ". యివి పూర్తి వదిలేసేయ్యండి. మన  చివరి శ్వాస వరకు, మనం సంతోషం గానే  ఉంటామని -దృఢ నిశ్చయం తీసుకోవాలి. ఏదొచ్చినా - భయం, నిరాశ పనికి రాదు. యివి లేక పోతే, సంతోషం వుంటే - వచ్చే ఏ రోగమైనా - తొందరగా తగ్గి పోతుంది. సంతోషంగా వున్న వారికి - దీర్ఘ రోగాలు కూడా, మందే  లేకుండా తగ్గిన సందర్భాలు  చాలా వున్నాయి.

7. హిప్పోక్రేట్స్ , యిప్పటి అల్లోపతీ వైద్యానికి మూల పురుషుడు. ఆయన చెప్పడం - ప్రకృతి మాత్రమే  రోగాలకు నిజమైన వైద్యం.

8. వోల్టైర్  అనే విజ్ఞాని అంటాడు - అందరి కంటే గొప్ప వైద్యుడు  రోగాలు రాకుండా మందులు, జాగ్రత్తలు  ముందే చెప్పే వాడు.   అతని తరువాత లెవెల్ వైద్యుడు - కొద్ది రోజుల్లో రాబోయే రోగాన్ని కనిబెట్టి, అది రాకుండా మందులిచ్చే వాడు. చిట్ట చివరి వాడు, వచ్చిన రోగానికి మందు లిచ్చే వాడు.

9. సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు చెప్పడం - దేహానికి అన్నిటి కంటే గొప్ప మందు -  ప్రశాంతం గా వుండే   మనస్సు.

10. మదర్ తథెరెసా గారంటారు - టీ.బీ కంటే, లెప్రసీ కంటే - మరే యితర వ్యాధుల కంటే కూడా - పెద్ద వ్యాధి - నాకెవరూ లేరు, నేనెవరికీ వద్దు - అన్న మనో భావన.

11. మనపై మనకు నమ్మకం లేక పోవడమే - అతి పెద్ద వ్యాధి - అంటారు,  రాల్ఫ్  వాల్డో  ఎమర్సన్  గారు.

12.  మూసి పెట్టుకున్న రోగానికి మందు లేదు - మన దేశం సామెత 

మీరంతా ఆరోగ్యంగా వుండాలి.  మీ చుట్టూ వున్న వారి ఆరోగ్యం కూడా మీరు కాపాడాలని  ఆశిస్తూ 

=  మీ

వుప్పలధడియం విజయమోహన్