14, జనవరి 2012, శనివారం

సంక్రాంతి శుభాకాంక్షలు

అందరికీ  నా  సంక్రాంతి  శుభాకాంక్షలు.  

మకర సంక్రాంతి నాడు - సూర్యుడు ధనుర్రాశి నుండి మకర రాశికి వచ్చే రాజు. 

సాధారణంగా - పండుగలన్నీ తేదీలు మారి వచ్చినా - మకర సంక్రాంతి మాత్రం జనవరి పదినాలుగవ తేదీ నాడు తప్పక వస్తుంది. యిది నాలుగు రోజుల పండుగగా - అంధ్రదేశంలో   జరుపుకుంటారు.(1 ) భోగి (13  వ తేదీ)  (2 ) మకర సంక్రాంతి (14  వ తేదీ) (3 ) కనుమ (4 )  ముక్కనుమ పండుగ.

కానీ - 2012  సంవత్సరంలో - మకర సంక్రాంతి అరుదుగా 15  వ తేదీ నాడు వచ్చింది. 

ఈ అరుదైన సంక్రాంతి నాడు - మీ  

అందరికీ  నా  సంక్రాంతి  శుభాకాంక్షలు.  

= మీ 

వుప్పలధడియం విజయమోహన్ 




 

సుమతి శతకం = బంగారు తెలుగు వెలుగులు = కొన్ని ఆణి ముత్యాలు

సుమతి  శతకం
కొన్ని ఆణి ముత్యాలు 

తెలుగులో భారతం, రామాయణాల లాంటి కావ్యాలు, అత్యద్భుతంగా అతి గొప్ప  కవీంద్రుల చేత రాయ బడ్డాయి.  మరెన్నో కావ్యాలు, నాటకాలు, ఎన్నో,ఎన్నో వచ్చాయి.

అయితే - తెలుగు వారి నోటిలో - ఎక్కువగా నానేవి - సుమతి, వేమన శతకాలే - అంటే  అతిశయోక్తి కాదు.

తమిళం లో తిరువళ్ళువర్ రచించిన తిరుక్కురళ్ వారికి చాలా గర్వ కారణం అని అందరికీ తెలుసు. అలాగే - ప్రతి భాషలోనూ - ఏదో వొక గొప్ప పుస్తకం వుండనే వుంటుంది. ఎవరి గొప్ప వారికానందం.

తెలుగు వరకు - వేమన, సుమతి శతకాలు - ఎంత గొప్పవి - అంటే - చెప్ప లేనంత.మాకు చిన్న తనంలో - మా అవ్వ గారు - కాళహస్తి గుళ్ళో నేర్పించేవారు - అవన్నీ.

కాబట్టి - వాటిలోని - ఆణిముత్యాలు మనసులో పదిలంగా అలాగే నిలిచి పోయాయి. జీవితంలో - ఏ వొత్తిడి వచ్చినా, ఏ సమస్య  వచ్చినా, ఈ శతకాలలోని పాఠాలు - నన్ను ఆదుకున్నాయని  తప్పకుండా చెప్ప గలను. యివన్నీ ప్రతి వొక్కరికీ - బాల్యంలోనే, తప్పక  నేర్పించాలి. అలా నేర్పించడం వలన, వారి జీవితం సుఖ మయం అవుతుందనడంలో  ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
 
వేమన శతక పద్యం వొక్కటి మొదట చూద్దాం.

తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్వి జనుల కెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తమతప్పులెరుగరు
విశ్వదాభిరామ వినుర వేమ

తప్పులే చేయని వారు ప్రపంచం లో లేనే లేరు. మరొకరి తప్పులే వెదుకుతూ వెళ్ళే వాళ్లకు తమ తప్పులు తెలుసుకునే సమయమూ వుండదు. సామర్థ్యమూ వుండదు. వారి జీవితమంతా - మరొకరి తప్పులు వెదకడంలో జరిగిపోతుంది. వారు - ఏ రకమైన ఆనందమూ అనుభవించ లేరు. ఎంత గొప్ప జీవిత సత్యం యిది! నిజానికి మన తప్పులు మనం సరిజేసుకుంటూ   వెడితే - మనం బాగుపడతాము. యితరుల తప్పులే వెదికితే - ఎవరూ మన దగ్గరికి కూడా రారు. మనకు ఏ స్నేహాలూ, చుట్టాలూ వుండవు. మనం బాగు పడే ఆవకాశమూ వుండదు. 

కానీ, వేమన గారి దగ్గర వేదాంతం పాలు ఎక్కువగా కనిపిస్తుంది. అద్భుతమైన అద్వైత వేదాంతం - అతి సులభ మార్గంలో చెబుతారు వేమన గారు. అవన్నీ మరో సారి చూద్దాం.

సుమతి శతకంలో - నిజ జీవితానికి సంబంధించిన సూక్తులు ఎక్కువ.  అవి పిల్లలకూ, పెద్దలకూ - చాలా బాగా నచ్చుతాయి.సుమతి శతక కర్త పేరు బద్దెన కవి. 13  వ శతాబ్దికి చెందిన వాడు. ఆయన సూక్తులు, చాలా వరకు, ఈ నాటికీ వర్తిస్తాయి. కొన్ని సూక్తులు - యిప్పటి కాలానికి పనికి రానివి వున్నాయి.

మనకు చాలా, చాలా, ఉపయోగ పడే - కొన్ని సూక్తులు యిక్కడ ఉదాహరిస్తున్నాను :

"అక్కరకు రాని చుట్టము ;   మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున తా;నెక్కిన బారని గుఱ్ఱము;  గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ!  " అంటారు ఆయన.

చుట్టమంటే  - సమయానికి సహాయపడే వాడే గానీ మొహం చాటు చేసే వాడు కాదు. మనమూ అలాగే వుండాలి గదా. మీరు ఎవరికి సహాయ పడతారో - వారే, మీకు సహాయ పడే ఆవకాశం ఎక్కువ. వరమీని వేలుపు సంగతి ప్రక్కన పెడితే - మీరు యుద్దానికని  వెళ్ళారు; మీ గుఱ్ఱము, మీకు అనువుగా పరుగెత్త నంటుంది . మీరేం చేయాలి? అక్కరకు రాని చుట్టం లాగే యిదీ. వెంటనే వదిలి పెట్టండి. అవసరానికి పనికి రానివి - మనం వెంటనే వదిలి పెట్టాలి.  జీవితానికి కావలసిన సత్యమే కదా.

"అప్పిచ్చు వాడు, వైద్యుడు; ఎప్పుడు,ఎడతెగక బారు ఏరును, ద్విజుడున్; చొప్పడిన ఊరనుండుము ; చొప్పడకున్నట్టి వూరు చొరకుము సుమతీ! " అంటారు శతక కారుడు. 

మీ వూళ్ళో, అవసరానికి అప్పిచ్చే వాడు వున్నాడా? వైద్యుడు వున్నాడా? నిరంతరం త్రాగునీరు సదుపాయం వుందా? మంచీ,చెడూ చెప్పే బ్రాహ్మణుడున్నాడా? ఈ రోజూ కూడా - ఎవరికైనా -  యివన్నీ వున్న వూళ్ళో వుండడమే శ్రేయస్కరం. వీటి రూపాంతరాలు వుండొచ్చు. కాలంతో బాటు కొంత మార్పు సహజం. కానీ - (1) అవసరానికి అప్పు (2 ) రోగాలకు మంచి వైద్యుడు (3 ) మంచి నీటి సదుపాయం (4 ) మంచి చెడులు తెలియ జెప్పే వాడు - వుండే వూరిలో వుండడం, వుండని ఊరిని వదిలి పెట్టడం  అందరికీ మంచిదే కదా.

"ఎప్పటికెయ్యది ప్రస్తుత; మప్పటికా మాటలాడి యన్యుల మనముల్; నొప్పింపక తానొవ్వక; తప్పించుక   తిరుగువాడె ధన్యుడు సుమతీ!" 

యిది ఎంత మంచి మాట. ఎవరినీ నొప్పించకండి  . మీరూ నొచ్చుకోకండి. అలా - ఎప్పుడు ఏది మాట్లాడితే  అందరి మనుసుకూ బాగుంటుందో - అప్పుడు అది మాట్లాడి - సమస్యలు రాకుండా తప్పించుకోండి.

కొంత మందికి -తమకు తెలియకుండానే - చుట్టూ వున్న వారిని - నొప్పించే మాటలనడం -చాలా అలవాటుగా వుంటోంది . అలా మాట్లాడడం తప్పని ప్రతి వొక్కరూ తెలుసుకోవాలి. తెలియని వారికి, ఎవరో వొకరు,చెప్పి తీరాలి. లేదంటే - వారి వలన, వారి చుట్టూ వున్న వారు ఎప్పుడూ, బాధ పడుతూనే వుంటారు.

"తన కోపమె తన శత్రువు; తన శాంతమె తనకు రక్షా దయ చుట్టంబౌ; దన సంతోషమె స్వర్గము ;తన దుహ్ఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!"

యిది వొక ఆణిముత్యం. మనకు, మన కోపాన్ని మించిన శత్రువు మరొకరు లేరు. మనల్ని కాపాడేది మన శాంతమే. మనలోని దయా గుణమే మనకు బంధువు. మన స్వర్గం మరెక్కడో లేదు - మన సంతోషం లోనే వుంది. అలాగే మన నరకం మరెక్కడో లేదు. మన దుహ్ఖమే మనకు నరకప్రాయము.  ఎంత గొప్ప నిజం!  యిది వొక్కటి  జ్ఞాపకం వుంటే - జీవితాన్ని హాయిగా గడిపెయ్యొచ్చు. మన మిత్రులూ, శత్రువులూ - మనలోనే వున్నారు. గుర్తించండి.

"నవ్వకుమీ సభలోపల; నవ్వకుమీ తల్లి దండ్రి నాథులతోడన్; నవ్వకుమీ పరసతితో; నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!"

యిక్కడ నవ్వకుమీ అంటే - రక రకాల అర్థాలున్నాయి. (1 ) పెద్ద వారున్న సభలలో - వూరికే నవ్వడమో, ఎవరినైనా అపహాస్యం చేయడమో అస్సలు చేయరాదు. సాధారణంగా సభలో, వూరికే నవ్వితే - ఎవరినో అపహాస్యం చేసినట్టు పదుగురు అనుకోవచ్చు.  దాని వలన పదుగురూ, మనలను అసహ్యించుకుంటారు.(2 )  అలాగే - తల్లిని, తండ్రిని, భర్తను గానీ, రాజును కానీ (నాథుడు  అంటే - రెండు అర్థాలూ వున్నాయి) ఎప్పుడూ అపహాస్యం చేయకండి.  యివన్నీ పాప హేతువులు. (3 ) మరొకరి భార్యతో పక పకా నవ్వడం ఎప్పుడూ చెయ్య కండి. అది ఆమెకూ, ఆమె భర్తకూ, మీకూ - మంచిది కాదు. (4 ) మీకు మంచీ ,చెడూ చెప్పే విప్రుడిని అపహాస్యం చెయ్యకండి. యివి చేస్తే ఏమిటనే వారికి -ఎప్పుడో వొకప్పుడు చేటు రానే వస్తుంది.

"కనకపు సింహాసనమున; శునకమును కూర్చుండబెట్టి శుభ లగ్నమునం; దొనరగ పట్టము గట్టిన; వెనుకటి గుణమేల మాను గదరా సుమతీ!"    

యిది కూడా సర్వత్ర, సర్వదా వర్తించే సూక్తి. అర్హుడైన వాడినే ముఖ్య పదవులకు అధికారిగా చేయ వలెను గాని - అనర్హుడైన వాడిని, మూర్ఖుడిని అధికారిగా చేస్తే - ఎవరికీ మంచిది కాదని భావము. ఈ రోజుల్లో - ప్రజలు - మంచి వాడికి, సమర్థుడికి   వోటు వెయ్యాలే కానీ - అసమర్థుడికి  పట్టం కడితే - దేశం దుర్గతి పాలవుతుందని భావం.

"కులకాంత తోడ నెప్పుడు; గలహింపకు, వట్టి తప్పు ఘటియింపకుమీ; కలకంఠి  కంట కన్నీ; రొలికిన సిరి యింట నుండ దొల్లదు సుమతీ!"  

భార్యతో నెప్పుడూ  కలహింపకు;కొట్లాడకు; ఆమెలో లేని తప్పులు వూరికే చెప్పకు; అటువంటి కుల స్త్రీల కంటి నీరు పడిన యింటిలో - లక్ష్మి (అంటే - సిరి సంపదలు) ఎప్పుడూ నివసించదు. నివసించడానికి యిష్టపడదు. యిది మగ వారందరూ గుర్తుంచుకోవాలి.  యిది మనువు కూడా చెప్పాడు. మీ యింట్లోని ఆడ వారు - సంతోషం గా వుండడం - మీ, అంటే, మగ వారి బాధ్యత - అన్నది - భారత సంస్కృతి.

"కూరిమి గల దినములలో; నేరములెన్నడును కలుగ;నేరవు మరియా; కూరిమి విరసంబైనను; నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!"

యిది కూడా గొప్ప ఆణిముత్యమే. మనసులో, స్నేహభావమో, ప్రేమో వుంటే -  ఎదుటి వారిలో మనకు ఎటువంటి చెడూ కనిపించదు. కాని ఆ స్నేహభావము, ప్రేమ ఏ కారణము వలనైనా పోయి, ఏహ్యభావం చోటు చేసుకుంటే - ఎదుటి వారు చేసేవన్నీ - మనకు నేరాలుగానూ, సహింపలేనివి   గానూ కనిపిస్తాయి. కాబట్టి - మన మనసులో ఏం ఉండాలో - స్నేహమా, ఎహ్యమా? అనేది మనమే నిర్ణయించుకోవాలి.

"కొరగాని కొడుకు బుట్టిన; గొరగామియే గాదు తండ్రి గుణముల జెరచున్;జెరకు తుద వెన్ను బుట్టిన;జెరకున తీపెల్ల జెరచు సిద్ధము సుమతీ!"

కొడుకు పనికిరాని వాడితే - వాడు పనికి రాని వాడని మాత్రం అనరు. వాడి తండ్రిని కూడా లోకం తప్పు పడుతుంది. తండ్రి ఎంత మంచి వాడైనా, మూర్ఖపు కొడుకు గుణాలను తండ్రికీ అంటగడతారు. చెరకు గడ ఎంత బాగా వున్నా, దాని చివర వెన్ను పుట్టిందంటే   - గడ అంతటా చేదు తయారవుతుంది. తీపి పోతుంది. యిదీ అలాగే.

"తన వారు లేని చోటను; జనవించుక లేని చోట జగడము చోటన్; అనుమానమయిన చోటను; మనుజున కట నిలువ దగదు మహిలో సుమతీ!"

మనం ఎక్కువ కాలం వుండాలంటే - తన, మన అని అనే వారు, మనం తమ వారు అనుకునే వారు వున్న చోటే వుండాలి కానీ . తన, మన అనే వారు ఎవరూ లేని చోట వుండ రాదు. అదే లాగ, ఏదో కాస్త - మనకూ స్వాతంత్ర్యం వున్న చోట వుండాలి కానీ, కూర్చుంటే తప్పు, లేస్తే తప్పు, అనే చోట వుండ రాదు. ఎప్పుడూ, మనల్ని అనుమానం తో,  చూసే వారున్న చోట కూడా ఉండరాదు. అటువంటి వారు - ఎప్పుడో వొకప్పుడు, మనపై అపవాదులు పెట్టడం ఖాయం. అటువంటి స్థలాల్లో నివసించడం క్షేమ కరం కానే కాదు.

"వినదగునెవ్వరు చెప్పిన; వినినంతన వేగపడక వివరింపదగున్; గనికల్ల నిజం దెలసిన;  మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!"

మనిషికి సలహాలిచ్చే వారు, ఉన్నవీ లేనివీ వార్తలు చెప్పే వారు ఎంతో మంది వస్తారు. సలహాలు, వార్తలు  వినవచ్చు. తప్పు లేదు. కానీ -ఏది వింటే, అది వెంటనే నమ్మేయాలనీ,  చేసేయాలనే ఆత్రుత పనికి రాదు. అదంతా నిజం అనుకునే మనస్తత్వం పనికి రాదు. ఏది నిజమో, కాదో; ఏది చేస్తే మంచిదో కాదో, బాగా వివరంగా తెలుసుకుని - మరీ కార్యంలో దిగాలి కానీ - వినినంతనే - ఆత్రుత పడితే - ముప్పే.

మొదట వినండి. మంచి వారి మాట ఎక్కువగా వినండి.  మీ శ్రేయోభిలాషులైన వారి మాట వినండి.  తల్లీ, తండ్రీ, గురువూ మాట తప్పక వినండి. ఏది విన్నా - అందులోని నిజమెంతో తెలుసుకుని మరీ ఏ కార్యమైనా చేయండి. 

ఇలాంటి ఆణి ముత్యాలు మన శతకాలలో కోకొల్లలుగా వున్నాయి. అవన్నీ - యిప్పుడే చెపినట్టు - యిప్పటికి తగినవే అనుకోవడం సబబు కాదు. కాలానుగుణం గా కొన్ని మార్చుకోవాలి. కొన్ని - అన్ని కాలాలకూ పనికొచ్చేవి వున్నాయి. అవి తెలుసుకోవాలి. మనసులో రంగరించుకోవాలి . మన జీవితం సుఖమయం చేసుకోవాలి.


యిక్కడ యిచ్చినవి - అన్నీ యిప్పటి కాలానికీ తగినవే - యివి మనమూ పాటించాలి. మన పిల్లలికీ నేర్పించాలి.

= మీ

వుప్పలధడియం విజయమోహన్

13, జనవరి 2012, శుక్రవారం

మానవీయ సంబంధాలు = యండమూరి వీరేంద్రనాథ్ = డాక్టర్ బీ.వీ.పట్టాభిరాం = వొక జ్ఞాపకాల వెల్లువ = ఏడవడంలోని సంతోషమూ, సంతోషంగా ఏడవడమూ - జీవితానికి ఎంత ముఖ్యమో


వొక జ్ఞాపకాల  వెల్లువ 

నేషనల్ అకాడెమీ ఆఫ్ టెలికాం ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ మన హైదరాబాద్ లోనే వుంది. అప్పట్లో - అంటే నేను అక్కడ వున్న రోజుల్లో - భారత్ సంచార్ నిగం వారి ఆధ్వర్యంలోచాలా, చాలా బాగా, జరిగేది. జరిపించే వాళ్ళం.

నేను అందులో  మానవీయ సంబంధాలు (హ్యూమన్ రిలేషన్స్) అండ్ మేనేజ్మెంటు విభాగానికి హెడ్ గా వుండే వాడిని.  ఎన్నో రకాల  ట్రైనింగులు, సెమినార్లు,వర్కు షాపులు - రకరకాల నూతన ప్రక్రియలతో నిర్వహించాము.


వొకరికొకరిని పరిచయం చేసే విధానం నుండి - అన్నీ - సరి కొత్త విధానాలే.  అన్నీ, ఎన్నో రకాలుగా యోచించి మేము  తీసుకొచ్చిన ప్రక్రియలే.

ప్రతి మనిషిలోనూ - వొక గొప్ప సృష్టికర్త -ఉన్నాడని - అతన్ని - బయటకు తీసుకు రావడమే - మనిషి చేయాల్సిన పని అని - మాకు బాగా తెలిసి వచ్చింది - అప్పుడే.

హైదరాబాదులో వున్న మన తెలుగు వారిలో - ముఖ్యంగా మానవీయ సంబంధాలలో  - చాలా గొప్ప రచయితలుగానూ, వక్తలుగానూ, పేరుపొందిన వారిని - భారత దేశానికంతా పరిచయం చేయాలని మేము ప్రయత్నాలు చేయడం జరిగింది. 

అందులో భాగంగానే - అప్పట్లో - యండమూరి వీరేంద్రనాథ్   గారిని,  డాక్టర్ బీ.వీ.పట్టాభిరాం గారిని , వారి సోదరుడిని , మరెంతో మంది - ప్రముఖులను ఆహ్వానించే వాళ్ళం.  

వీరేంద్ర నాథ్ గారి ప్రసంగము, పట్టాభిరాం గారి ప్రసంగము - వీటిలో - బయటి వారిని బాగా ఆకర్షించేవి.  సరే. మా అకాడెమీ లోని వక్తలలో - నేను. కల్యాణ్ సాగర్ గారని యింకొకరు - మా యిద్దరి  ప్రసంగాలూ -  చాలా బాగుండేవని - అందరి ప్రశంసలూ పొందేవి .  

వీరేంద్రనాథ్   గారిని -  ముఖ్యంగా వారి విజయానికి అయిదు మెట్లు ను గురించి మాట్లాడమనే వాడిని. ఆయనా - అది తనకిష్టమైన విషయం కాబట్టి - చాలా ఆకర్షణీయంగానూ, మనస్సులో హత్తుకుని పోయే లాగానూ మాట్లాడే వారు.

పట్టాభిరాం గారు - తనకు బాగా నచ్చిన ఏదో వొక విషయం పైన మాట్లాడే వారు. రక రకాల వుదాహరణాలతో,  చాలా ఆసక్తి కరంగా జరిపే వారు.

అన్ని రాష్ట్రాల నుండి - చాలా మంది మా ట్రైనింగ్ కు వచ్చే వారు.

క్లాసు రూములో - సాధారణ సంఖ్య ముప్పైకి మించరాదు. అటువంటిది - వద్దన్నా - వంద మంది వరకు భారత దేశమంతటి నుండీ వచ్చేసే వారు. మేమూ - వారిని నిరుత్సాహ పరచకుండా - రెండు క్లాసు రూముల్లో - వొకే సారి, వొక్కొక్క క్లాసు రూములో, యాభై మంది దాక ఎలాగో సర్ది - జరిపే వాళ్ళం.

మొదటి అంశం పరిచయం. నేనే చేసే వాడిని. నేను జరిపే పరిచయం ఎలా వుండేదంటే   -  వో ముప్పావు  గంటలో - క్లాసులోని ప్రతివొక్కరికి, అందరినీ - వారి పేర్లూ, వారి వూరి పేర్లతో  సహా జ్ఞాపకం వుండేటట్టు చేసే వాడిని.  మరి నాకూ గుర్తుండాలిగా. ఆ ప్రక్రియ వచ్చిన వారికి చాలా ఆశ్చర్యకరంగా  వుండేది. వచ్చిన వారిలో ఏ వొక్కరూ - తాము యాభై మంది క్రొత్త వాళ్ళను - వివిధ రాష్ట్రాలనుండి వచ్చిన వాళ్ళను -  వారి పేర్లు, ఊర్లతో సహా మనుషులను కూడా 45 నిమిషాలలోగా గుర్తించగలమని    మొట్ట మొదట నమ్మగలిగే వాళ్ళు కాదు. కానీ - ఆ 45  నిమిషాల తర్వాత - అది చెయ్య లేని వాళ్ళూ ఎవరూ లేదు.

ఆ ప్రక్రియ మా ట్రైనింగ్ కు గట్టి   పునాదిగా మారింది.   అంతర్జాతీయ ప్రఖ్యాతి గల శివ్ ఖేరా లాంటి వారి ట్రైనింగ్ కు కూడా నేను వెళ్లాను కానీ - మా ట్రైనింగ్ లోని యిటువంటి అద్భుతమైన అంశాలు మరెక్కడా నాకు కనిపించ లేదు.

దానితో, వచ్చిన వారికి ట్రైనింగు పైన - చాలా గౌరవం వెంటనే కలిగేది. మానవీయ సంబంధాల పైన ట్రైనింగు కదా.

ట్రైనింగును - వొక పద్ధతి ప్రకారం తీసుకెళ్ళే వాళ్ళం. అయిదు రోజులు అయ్యే సారికి - వారిలో - మేము కోరుకున్న మార్పు వచ్చి తీరాలని ప్రయత్నం చేసే వాళ్ళం. వచ్చిన వాళ్ళు ప్రతి వొక్కరూ, వచ్చినట్టు  వెళ్ళకూడదు. కొంత, నిరంతరమైన , సకారాత్మకమైన - మార్పు తోనే వెళ్ళాలి.
మొదటి రోజు - జీవితాన్ని - ఆట లాగా, పాట లాగా  హాయిగా, ఆనందంగా గడపాల్సిన అవసరం గురించి చెబుతూ - కడపటి రోజు ప్రతి వొక్కరూ, కనీసం వొక పాట లోని వొక చరణమైనా పాడాలని చెప్పే వాళ్ళం. అందుకని ప్రతి వొక్కరూ ప్రయత్నమూ చేసే వాళ్ళు. పాడే వాళ్ళు.   డాన్సు కూడా చేసే వాళ్ళు. చివరి రోజు, చివరి క్లాసు వాళ్ళదే. చాలా బాగా జరిగేది.

సరే. యండమూరి గారి క్లాసు చాలా విజ్ఞాన దాయకంగా జరిగేది. ఆయన యిచ్చే ఆలోచనలు - ప్రతి వొక్కరి మనస్సులోనూ హత్తుకు పోయేవి. మరి విజయానికి మెట్లు కదా. ఆయనను పరిచయం చేయడం మొదట నా సహ ఆఫీసర్లు లో ఎవరికైనా వొప్పగించే వాడిని. వారు - ఆయనను గురించి పేపర్లో రాసుకుని పూర్తిగా క్లాసులో చదివే వారు.

వొక్కో సారి నేనే చేసే వాడిని. యండమూరి గారి కథలు, నవలలు, అన్నీ- పత్రికలలో ప్రచురితమైనప్పుడే చదివిన వాడిని నేను. ఆయన జీవితం లోని - ముఖ్య సంఘటనలు, ఆయన విజయాలు అన్నీ బాగా తెలిసున్న వాడిని. సరే - ఆయనంటే - బాగా అభిమానమూ వున్న వాడిని అవడం వల్ల -  నాకు పేపర్లో రాసుకోవలసిన అవసరం లేదు. నేను పరిచయం చేయడంలో - ప్రతి సారి చాలా వైవిధ్యం వుండేది.  అది ఆయనకు బాగా నచ్చేది.

తరువాత, తరువాత   - ఆయన, నా పరిచయం మాత్రం మీరే చెయ్యండి - అనే వారు. నేనూ అలాగే చేసే వాడిని. ఆ తరువాత - ఆయన, విజయమోహన్ గారూ, నేను మాట్లాడడానికి ముందు మీరు వొక పది పదిహేను నిమిషాలు మాట్లాడరా, నేను వినాలి - అనే వారు. అప్పటికప్పుడు, ఏదైనా వొక విషయాన్ని గురించి మాట్లాడే వాడిని. అంతా మానవీయ సంబంధాల గురించే. అప్పట్లో - ఎన్నో వందల పుస్తకాలు చదివాను. వేల పస్తకాలు కూడా వుండొచ్చు.

అందులోని - అతి ముఖ్యమైన విషయాల గురించి, ఆ పదిహేను నిముషాలు మాట్లాడే వాడిని. ఆ తరువాత, యండమూరి - తన ప్రసంగం ఆరంభించే వారు.  యండమూరి, పట్టాభిరాం గార్ల ప్రసంగాలు - గొప్ప హై లైట్ గా చెప్పొచ్చు.

వొక రోజు - యండమూరి గారి కారు ఎక్కడో - ట్రాఫిక్ జామ్ లో యిరుక్కు పోయింది. కాస్త ఆలస్యం అవుతుందని వార్త వచ్చింది.   ఆయనకు తెలుసు - అంత వరకు - నేను కొన సాగిస్తానని. సరే. నేనూ ఏదో చెబుతున్నాను. కాని - వచ్చిన వాళ్ళు - సార్,  ఆఖరి రోజు మమ్మల్నంతా పాడమని అన్నారు కదా.  మీరు ఈ రోజు - వొక పాట   పాడండి - అని బలవంతం చేసారు. సరే. తప్పేదేముంది.

నేను పెద్ద గాయకుడిని కాను. కానీ - ఎవరైనా సరే. కొద్దో, గొప్పో పాడగలరు - అని నమ్మే వాడిని. ఆ రోజు - కభీ, కభీ - హిందీ చిత్రంలోని - కభీ,కభీ, మేరె దిల్ మే - అనే పాట కళ్ళు మూసుకుని పాడాను.

యండమూరి ఎప్పుడు వచ్చారో తెలీదు కానీ - పాటంతా అయిన తరువాత- నేను కళ్ళు తెరిచి చూస్తే -  క్లాసులోని అందరితో బాటు - ఆయన కూడా కరతాళ ధ్వనులు చేసేస్తున్నారు.

తరువాత - ఆయన పరిచయం చేసాను. మీరు పాటలో - బాగా లీనమై, చాలా బాగా పాడారని ఆయన మనస్ఫూర్తిగా అనడం - నాకు చాలా బాగా అనిపించింది.

నేను అప్పుడప్పుడూ వెళ్లి ఆయన క్లాసులోనూ, పట్టాభిరాం గారి క్లాసులోనూ వెళ్లి కూర్చుని, వినే వాడిని.

నా  ప్రసంగం -  లైఫ్ స్కిల్స్ - అనే అంశం పైన చేసే వాడిని. అందులో నేను చెప్పే విషయాలు - ఏ పుస్తకం లోనూ దొరకవు. నేను మానవీయ సంబంధాల పైన చేసిన రీసెర్చ్ ఫలితాలే. చాలా సులభంగా - ప్రతి వొక్కరూ - చేయ గలిగే అంశాలే. నేను చేయ లేనివి, నేను చేయనివి - నేను చెప్పకూడదని  సిద్ధాంతం   పెట్టుకున్నాను. అలాంటి అంశాలే చెప్పే వాడిని.

చిన్న రహస్యం - ఏమిటంటే - నా ప్రసంగం లో   - ప్రతి వొక్కరూ - చాలా సార్లు నవ్వాలి. కొన్ని సార్లు వారి కళ్ళల్లో నీళ్ళు రావాలి - యిది జరిగితేనే - నా ప్రసంగం విజయవంతం అయినట్టు - అని వొక  గోల్ / గుర్తు పెట్టుకున్నాను.

అది జరిగేది - కానీ, చివర అందరూ, మీరు బలే ఏడిపిస్తారు సార్ - అని సంతోషంతోనూ, వొక రకమైన సంతృప్తితోనూ, చెప్పే వారు.

ఏడవడంలోని సంతోషమూ, సంతోషంగా ఏడవడమూ - జీవితానికి  ఎంత ముఖ్యమో - ఎంత తృప్తి నిస్తాయో - అందరికీ తెలిసొచ్చేది. హృదయాన్ని కన్నీళ్లు ఎంత బాగా కడగ గలవో - నాకు సద్గురు జగ్గి వాసుదేవ్ గారి "భావ స్పందన" అనే యోగా ట్రైనింగ్ లో - చాలా బాగా తెలిసొచ్చింది.

మనిషికి ఈ రెండూ కావాలి. నవ్వ గలగాలి. యేడవ గలగాలి. తరువాత - ఆ రెండింటినీ -  దాటి పరిణితి చెందాలి. ముందుకెళ్లాలి.

మనిషి ఆనంద స్వరూపుడు. అది తెలుసుకున్న వాడే యోగి. ఆ ఆనందంలోనూ - కన్నీళ్ళున్నాయి. అదీ తెలుసుకోవాలి. రామకృష్ణ పరమ హంస ఎన్నో సార్లు సంతోషంతో కన్నీళ్ళు కార్చే వారు.

నిర్లిప్తంగా, నిర్వేదంగా - వుండటంలో - జీవితం సాఫల్యం చెందదు. ఆడండి. పాడండి. చిన్న పిల్లల్లా గంతులెయ్యండి. నవ్వండి. ఏడవాల్సి వస్తే, తృప్తిగా ఏడవండి. నిద్ర పోయేటప్పుడు - హాయిగా, ప్రపంచాన్ని మరిచి నిద్ర పోండి.

ప్రతి రోజూ, సృష్టి కర్త గా, సకారాత్మకంగా ఏదో వొకటి సృష్టించండి. ముఖ్యంగా - కనీసం వొకరి మనసులో, ఏదో కొంత, సంతోషాన్ని సృష్టించండి.

= మీ

వుప్పలధడియం విజయమోహన్

5, జనవరి 2012, గురువారం

దేశం పాడవడం చెడ్డ వాళ్ళ చర్యల కంటే - మంచి వాళ్ళ మౌనం వలన ఎక్కువ = మాన భంగాలకు అసలైన కారణం ఏమిటి?


ఈ మధ్య మానభంగాల సంఖ్య చాలా ఎక్కువయిపోతోందని - అందుకు కారణాలేమిటని -      మీడియా వారడిగిన వొక ప్రశ్నకు సమాధానంగా ఆంధ్రప్రదేశ్ డీ.జీ.పీ. గారు - అందుకు కొందరి ఆడవారి అర్ధనగ్న దుస్తులు, మితి మీరిన ఫాషన్లు కూడా కారణమని  అన్నారట.

ఆ వొక్క మాటకు - (కొంత మంది) ఆడవారినుండి   - తీవ్ర వ్యతిరేక స్పందన ఎదురైంది.

కానీ యిదే మాట ఢిల్లీ ముఖ్య మంత్రి షీలా దీక్షిత్ గారు కూడా అన్నారట. అసలింతకీ - ఈ విషయం వొక సామాజిక పరిశోధనలో తేలిన అంశమట.

ఎక్కువయి పోతోన్న మాన భంగాల సంఖ్యకు అర్ధ నగ్న, మితిమీరిన  ఫాషను దుస్తులు  కూడా వొక కారణం కాదా?

నిస్సందేహంగా - అది కూడా వొక బలమైన కారణమే  అని - నా వరకు నేను డీ.జీ.పీ గారి పై మాటతో తప్పకుండా అంగీకరిస్తాను. నిజాన్ని చెప్పినందుకు ఆయన ఎవరికీ సంజాయిషీ యివ్వాల్సిన పని లేదు- అన్నది నా అభిప్రాయం. అదే మాట చెప్పిన షీలా దీక్షిత్ గారు -జీవితాన్ని మధించి చెప్పిన మాటే అది.

పాషన్ల పేరిట ప్రపంచం లోని అందరు మగాళ్లనూ - ఆకర్షించాలని కొందరు ఆడవారు చేసే ప్రయత్నాలు -అందరు ఆడ వాళ్ళ కొంప ముంచుతుందనడంలో  నాకు సందేహం లేదు.

ఆడ-మగ మధ్య పరస్పర సంబంధాలు, ఆకర్షణలు,ప్రేమలు, పెళ్ళిళ్ళు, -ఈ వ్యవస్థకు  పునాది నే పీకి పారేయాలని మూర్ఖంగా ఆలోచిస్తే - సమాజమంతా  - అస్తవ్యస్తంగా తయారవుతుంది.

దుస్తుల విషయంలో, ఆడవారికి గానీయండి, మగ వారికి గానీయండి - పూర్తి స్వాతంత్ర్యం లేదు. వుండ రాదు.

వొకరిపై, వొకరికి గౌరవం వచ్చే విధంగా దుస్తులు వుండాలి గాని - సెక్సీ గా, ఆకర్షించే విధంగా వుంటే - ప్రమాదమే - అన్నది ప్రతి వొక్కరు తెలుసుకోవాలి.

మగ వారి విషయంలో - చాలా వరకు, దుస్తులు దేహాన్ని కప్పే వున్నాయి. ఎవరో, వొకరిద్దరు తప్ప.

ఎటుతిరిగీ - కొంతమంది (అందరూ కాదు) ఆడ వారే - సినిమాల్లో కానీయండి, టీ.వీ లో కానీయండి, మరీ బరి తెగించి  ఎంత భాగం నగ్నంగా ప్రదర్శించ గలమా అని చూస్తున్నట్టు తెలుస్తూనే వుంది కదా. పైగా - అది నా యిష్టం అంటున్నారు.

అందుకు కొంత మంది మగ నిర్మాతలూ, దర్శకులూ కూడా చాలా, చాలా, కారణం గా వుంటున్నారు.

సరే. ప్రేక్షకుల్లో వొక భాగం - దీనికి బానిసలై పోతునారు. మందు కొట్టడం, పొగత్రాగడం లాగా, యిది కూడా వొక వ్యసనమే అని - ఆ వ్యసనానికి బానిసలైతే - మనం మరే మంచి పనీ చేయలేమని సమాజం గుర్తించాలి.

టీ.వీ. తెరిస్తే చాలు - ఈ అర్ధ నగ్న డాన్సులు ప్రత్యక్షమవుతున్నాయి. యివి మగ వారి మనస్సులో సెక్సు కాంక్షని కొద్దో, గొప్పోరేకెత్తిస్తాయి- అనడంలో అతిశయోక్తి లేదు.  సమాజం మొత్తం వీటికి బానిసై పోతున్నారు . మరి యివి చూసి, చూసి, మగ వాళ్ళు పక్కన ఎవరున్నారా, వీధిలో ఎవరున్నారా - అని చూస్తే - అది ఎవరి తప్పు?

మన సమాజంలో - యివన్నీ తెలిసే - కొన్ని నిబంధనలు పెట్టారు. అలాగని - పైనుండి, క్రింది వరకు ముసుగులో దాచెయ్యలేదు. మగ వాడు చేసే తప్పుకు కూడా ఆడవారిని కొట్టి చంపాలని చెప్ప లేదు.

కానీ - ఎవరికైనా - ఎప్పుడూ -విశృంఖలమైన   స్వాతంత్ర్యం లేదు. వుండ రాదు.వుంటే - అది కావాలనుకుంటే - మళ్ళీ ఆ సమాజానికి భవిష్యత్తు లేదనే చెప్పొచ్చు.

సరే. యిందులో - మగ వారి తప్పు లేదా? మగ వారి తప్పు లేకుండా - ఆడది తప్పు చెయ్య లేదు. అలాగే - ఆడ వారి తప్పు లేకుండా - మగ వాడు తప్పు చెయ్య లేదు.

మానభంగం జరిగితే - అది చేసేది - మగ వాడే కాని - ఆడది కాదుగా. అది మగ వాడి తప్పే. అందులో ఆవ గింజంత సందేహం కూడా అక్కర లేదు.

వొక ఆడది యిచ్చే నగ్న ప్రదర్శనలను - తప్పు అని మొట్ట మొదటే చెప్ప గలిగే - ధైర్యం మగ వాడికి వుండాలి. ఎందుకు? అది కొంప ముంచేది - మగ వాడినే గనుక!

మన పురాణాల్లో కూడా- యిది మళ్ళీ,మళ్ళీ చెప్ప బడింది. ఎక్కడో అడవిలో కూర్చుని ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే విశ్వామిత్రుడిని - పనిగట్టుకుని వెళ్లి , మేనక చెడిచింది - ఇలాంటి అర్ధ నగ్న దుస్తులు, డాన్సులుతోనే కదా.  

మరి తపస్సు చేసుకునే విశ్వామిత్రుడినే చెడప గలిగే లాంటి దుస్తులు, చాలా మంది ఆడ వారు వేసుకుంటే - జరిగేదేమిటి?   మాన భంగాలు పెరగవా? కాక పొతే - రోడ్డు మీదో, సినిమా లో నో, టీ.వీ. లోనో - యివన్నీ చూసి, చూసి - మనసు పాడైన -  కొందరు - ఎక్కడో దొరికిన చోట, ఎవరో అమాయకులను మాన భంగాలు చేసేస్తున్నారు. తప్పొకరిది. చేటొకరికి. మాన భంగం చెయ్య బడిన అమ్మాయి తప్పు అస్సలు లేక పోవచ్చు. కాని మరెక్కడో తప్పు జరిగింది.

అదే విధంగా - కేవలం డబ్బు కోసం - కొంత మంది నిర్మాతలు, దర్శకులు - ఇలాంటి అర్ధ నగ్న డాన్సులు, ప్రదర్శనలను ప్రోత్సహించడం వలననే - కొంత మంది ఆడ వారు యిలా చేస్తున్నారనడం లో కూడా - సందేహం లేదు. అంటే- సగం తప్పు మగ వారిది. సగం తప్పు ఆడ వారిది. కానీ - నష్టం అందరికీ.

తప్పును - తప్పు అని చెప్పే ధైర్యం మనకు లేదంటే - తప్పులే పెరుగుతాయి.

ఆడవారిపై, మగ వారికీ, మగ వారిపై ఆడవారికి -గౌరవం యిచ్చే లాగా యిద్దరి ప్రవర్తనా వుండాలి. అదే అందరికీ క్షేమం.

రోడ్డు పై నడిచే మగవారిలో - 25 శాతం మంది - సరే. కనీసం అయిదు శాతం మంది - సెక్సు కాంక్షతో   - వుంటే - జరిగేదేమిటి?

యిది పోవాలంటే - సినిమాల్లో, టీ.వీ.లలో, ఆమ్మాయిలు వేసుకునే దుస్తులలో - కాస్త  గౌరవ నీయత వుండాలంటే - తప్పేమిటో - నాకు తెలియడం లేదు.

మగ వారిలో - ఆడవారి పట్ల గౌరవం పెంచాలి - కానీ ఆకర్షణ ను  కాదు - అన్న విషయం - అందరూ అర్థం చేసుకోవాలి.

అప్పుడే - గాంధీ గారు అన్న - "అర్ధ రాత్రి కూడా, ప్రతి ఆడది, వొంటరిగా, భారత దేశంలోని ఏ వీధిలో నైనా నిర్భయంగా తిరగగలిగే" -  స్వాతంత్ర్యం వస్తుంది.

యిప్పుడి జరుగుతున్న కొన్ని సంఘటనలు వింటే, చదివితే, చాలా, చాలా బాధ కలుగుతుంది. మూడేళ్ళ పసిపాపను యింట్లో వారే , లైంగికంగా వాడుకున్నారట. మరో యింట్లో - డెబ్భై ఏళ్ళ ముసలమ్మపై అత్యాచారం జరిగిందట. వాళ్ళు మనుషులేనా - అన్న సందేహం మనకు రావాలి. అమ్మంటే గౌరవం లేదు. అవ్వంటే మర్యాద లేదు. అక్క చెల్లెళ్ళంటే కూడా  ఏమీ స్నేహ భావం లేదు. యిలా తయారవుతున్నారు - కొంత మంది మగ వారు.

మరి కొంత మంది ఆడవారైతే - మామ  గారి ఎదురుగా, తండ్రి ఎదురుగా, మరుదుల ఎదురుగా - ఇలాంటి సెక్సు ఆకర్షణ కలిగించే విధంగా తిరగొచ్చునా   -  అన్న విచక్షణ లేకుండా వున్నారు.

ఈ పధ్ధతి మారాలి.

కొన్నేళ్ళ  క్రితం - దక్షిణ రైల్వే లోని - వొక ట్రైన్ రూటు లో - నేను ప్రతి రోజూ ఫస్టు క్లాసు, సెకండు క్లాసులలో - ఆఫీసుకు వెళ్ళే వాడిని. అప్పట్లో - ఆ రూటులో - స్త్రీ వేధింపు చర్యలు ( ఈవ్ టీజింగ్) చాలా, చాలా ఎక్కువగా  వుండడం నేను చూసాను.

నా సహ ప్రయాణీకులతో ప్రతి రోజూ అనే వాడిని - మనమంతా కలిసి - ఈ రౌడీ వెధవల ఆగడం అరికట్టాలి - అని.  వొక్కరంటే - వొక్కరు కూడా ముందుకు రావడానికి సాహసించ లేదు.

కొన్ని రోజుల పాటు చూసి, చూసి - వోర్చుకోలేక - పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ కు, జనరల్ మేనేజర్ గారికి - పెద్ద ఫిర్యాదు రాసి పంపించాను. వారి పోలీసు ఆఫీసర్లు - మా ఆఫీసుకు వచ్చి - నా వద్ద - రాసింది నేనేనా, నాకు యింకా చెప్ప వలసింది ఏదైనా   వుందా -  అని మాత్రం అడిగి తెలుసుకుని వెళ్ళారు.

అంతే. తరువాత - నెల రాజులు వారు తీసుకున్న చర్యల ఫలితంగా - ఆ రూటులో -యిప్పటి వరకూ స్త్రీ వేధింపు చర్యలు దాదాపు లేవనే చెప్పొచ్చు. కానీ - దురదృష్టమేమంటే   -  వొక్కరంటే, వొక్కరు, నాకు మొదట సపోర్టు యిచ్చిన వారు లేరు. అయినా నేను ముందుకు వెళ్లి పోయాను. అదృష్ట వశాత్తూ - దక్షిణ రైల్వే లోని - ఆఫీసర్లు చిత్త శుద్ధితో వ్యవహరించారు. అందువలన ఆ రూటులో - ఆడవారి సమస్యలు - తీరిపోయాయి.

సరే. ఆడదే , మరో ఆడదానికి సమస్యగా మారితే?

డీ.జీ.పీ. గారు చెప్పిన దానికి అర్థం అదే. ఆ పరిస్థితి కూడా మారాలి.

సరిగ్గా ఆలోచించే ఆడవారు, మగ వారు - అందరూ - వెర్రితలలు వేస్తున్న అర్ధ నగ్న దుస్తులను, శరీరాన్ని  పూర్తిగా అంటుకుని, అంతటినీ - దాదాపు బహిర్గతం చేసే లాగున్న దుస్తులు మంచిది కావన్న సంగతి - మన పిల్లలందరికీ  చెప్పాలి.  అలాగే, ఐటం సాంగు పేరుతో - అశ్లీల ప్రదర్శనలు చేయించే  నిర్మాతలకు, దర్శకులకూ కూడా చెప్పాలి.

లేదంటే - డీ.జీ.పీ. గారు చెప్పినట్టు - మానభంగాలను అరికట్టడం సుసాధ్యం కాదు.

చదివే వారిని - నేను కోరేదేమిటంటే - అయ్యలారా,అమ్మలారా, మీ అభిప్రాయాలూ చెప్పండి. మన పిల్లలు - తప్పు మార్గాల్లో వెళ్ళకూడదంటే   -  అందరూ క్షేమంగా, ఆనందంగా వుండాలంటే - సరైన సమయంలో - సరైన అభిప్రాయం చెప్పక తప్పదు.

దేశం పాడవడం చెడ్డ వాళ్ళ చర్యల కంటే - మంచి వాళ్ళ మౌనం వలన ఎక్కువ - అని అందరం గ్రహించాలి. ఈ విషయంలో అందరూ చేయి కలపండి.

= మీ

వుప్పలధడియం విజయమోహన్