10, ఏప్రిల్ 2015, శుక్రవారం

శేషాచలం లో- మానవ హక్కులు - సామూహిక హక్కులు

శేషాచలం లో మానవ హక్కులు 

సామూహిక హక్కులు 


శేషాచలం అడవుల్లో యెర్ర చందనం వృక్షాలను అక్రమం గా కొట్టడమూ , ఆ కలపను అక్రమంగా రవాణా చెయ్యడమూ చాలా కాలం గానే  జరుగుతూ వుంది .   కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం దీన్ని పెద్దగా పట్టించుకోలేదు . ఎందుకు పట్టించుకోలేదో , ఎవరు చెబుతారు ?


యిప్పుడు చంద్రబాబు గారు  ముఖ్య  మంత్రి గా వచ్చారు . తెలంగాణా  విడి పోయిన తర్వాత , రాష్ట్రానికి పెద్దగా  నిధుల కొరత అనే సమస్య కూడా   వచ్చి పడింది.


మొట్టమొదటి నుండి  ముఖ్య మంత్రి గారు, మిగతా మంత్రులూ చెబుతూనే   వున్నారు - వొక్క ఈ యెర్ర చందనం అక్రమ రవాణా  ను నిలిపి ప్రభుత్వ పరంగా దాన్ని అమ్మ గలిగితే , ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్ధిక సమస్యలు  తీరుతాయని .


 ఎన్నో వేల, లక్షల కోట్ల విలువ గలిగిన ఈ యెర్ర చందనం - స్మగ్లర్ల చేతిలో పడి - ఆంధ్ర  ప్రజల వుమ్మడి సొత్తు , స్మగ్లర్ల సొత్తుగా మారి పోతూ వుంది . యింత విలువ గలిగిన, ఆంధ్ర ప్రజల వుమ్మడి సొత్తు దొంగలు దోచుకు పోతూ  వుంటే , అది ప్రజలందరి మానవ హక్కుల ఉల్లంఘన కాదా ? యిది నిలపడానికి మానవ హక్కుల సంఘాలు ఏం చేశాయి ? ఏం చేస్తున్నాయి ? దీన్ని గురించి వారెవరికీ ఏమీ  పట్టినట్టు లేదు . అయ్యా ! ఈ యెర్ర చందనం చంద్రబాబు సొత్తు కాదు . మీ సొత్తే . అది పోతే , మీ అందరి మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్టే .

వ్యక్తి హక్కులూ ముఖ్యమే . కానీ , సామూహిక హక్కులు అంత కంటే ముఖ్యం . అది పట్టించుకోరా ?


సరే . ప్రజలందరి వుమ్మడి సొత్తు పోతూ వుంటే - ప్రజలేం చేస్తున్నారు ? అదేదో చంద్ర బాబు స్వంత విషయమే గాని తమ విషయం కాదన్నట్టు వున్నారు . మన ప్రజలలో ఈ స్తబ్దత పోవాలి .


సర్వే  జనాః సుఖినో భవంతు


= మీ

వుప్పలధడియం విజయమోహన్