22, అక్టోబర్ 2014, బుధవారం

నిజమైన దీపావళికి - మన గమ్యాలేమిటి - రాష్ట్రానికి గమ్యం ఏమిటి ?- చంద్రబాబు గారు ఏం చెయ్యాలి?

 

నిజమైన దీపావళి

 
చేసే ప్రతి ప్రయత్నంలోనూ,  మనం విజయం పొందుతామని గ్యారంటీ ఏమీ లేదు . అప్పుడప్పుడూ వోటమి సహజం . మన ప్రతి విజయం వెనుక కొన్ని వోటములు వుండ వచ్చు . అది సిగ్గు పడాల్సిన  విషయం కాదు . అసలు ప్రయత్నమే  చెయ్యని వాడికి , విజయమేమిటి , వోటమి ఏమిటి ? జీవితమే అగమ్యం .
 
మనలో ప్రతి వొక్కరికీ , నిర్దిష్టమైన గమ్యం అవసరం . ఆ గమ్యం వైపు వెళ్ళడానికే ప్రయత్నం కావాలి . మన ప్రయత్నం యొక్క ఫలితం గెలుపో, వోటమో, ఏదైనా కావచ్చు . కానీ, మొదటి నుండి, తుది వరకు, గమ్యం చేరడానికి చెయ్యాల్సిన ప్రయత్నం చెయ్యడంలో మాత్రం మనం ఓడిపోకూడదు. ఇది చాలా ముఖ్యమైన , చాలా అందమైన మాట .
 
జీవితం లో  మనం చేసే ప్రయత్నమే మన విజయానికి మూలము. కట్ట కడపట వచ్చే విజయాన్నే కాదు, మన ప్రతి ప్రయత్నాన్నీ మనం ఆనందించాలి.  ఇదే శ్రీకృష్ణుడు వుపదేశించిన కర్మయోగం . కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన.
 
ప్రయత్నం మన బాధ్యత.  మనం ప్రయత్నం చెయ్యడంలో, మన బాధ్యతే, మన అధికారమే వుంది ; మన ప్రయత్నాలకు దేవుడు బాధ్యుడు కాదు.  కానీ, ఫలితం యిచ్చేవాడు మాత్రం ఆయనే . ఎందుకు, ఎప్పుడు, ఎలాంటి ఫలితం యిస్తాడో - అది మన యిష్ట  ప్రకారం  కాదు ; అది తన యిష్ట ప్రకారం యిస్తాడు .   

అందుకే, మన ప్రయత్నాన్ని - మనం పూర్తిగా మన బాధ్యతగా స్వీకరించి , దాన్ని అమలు చేస్తూ ఆనందించాలి. ఫలితం ఎలాగూ వస్తుంది . రాకుండా మాత్రం వుండదు . ఎప్పుడో, ఎలాగో - అది చెప్పడం కాస్త కష్టం. ఆ ఫలితం ఏదైనా , అదీ మనం ఆనందం తో అనుభవించాలి.
 
ఫలితాలు మన ప్రయత్నానుసారంగానే  వస్తూ వుంటాయి - కానీ , కాస్త ముందూ వెనుకలుగా. మనకు అక్కడే కాస్త తికమకగా వుంటుంది .   దాన్ని గురించి  పెద్దగా చింతించ కుండా తరువాత ప్రయత్నం మొదలు పెట్టేసేయ్యాలి ; అలా గమ్యం వైపు సాగిపోవడమే జీవితం .
 
అప్పుడప్పుడూ వెనక్కి తిరిగి చూడాలా వద్దా ? చూడొచ్చు. తప్పు లేదు.  ఇది వరకు మనం చేసిందేమిటి ? చెయ్యనిదేమిటి ? చెయ్యాల్సిందేమిటి ? యివి వొక్క సారి చూసుకుని ముందడుగు వెయ్యడంలో తప్పేమీ లేదు . 24 గంటలలో , వొక 5 నిముషాలు  ఈ పని చేస్తే , మిగతా 23 గంటలు, 55 నిముషాలు ప్రయోజనాత్మకంగా వుంటుంది .
 
స్టీఫెన్ కోవీ  గారు  - మీరు వేసే ప్రతి అడుగూ , గమ్యం వైపే వేస్తున్నారా , గమ్యానికి దూరంగా వేస్తున్నారా - అది సరి చూసుకుంటూ  వేయమంటారు.  గమ్యానికి దూరంగా వేసే ప్రతి అడుగూ, మనల్ని, విజయానికి దూరంగా తీసుకెడుతూ వుంటుంది. వాటికి ఫలితం  వుండదని  కాదు .  కానీ, అ ఫలితం  పెద్ద ప్రయోజన కారిగా వుండదు. మీరు నిచ్చెనను వెయ్యాల్సిన గోడకు వేస్తే , చెయ్యాల్సిన పనే చేస్తారు. మరో గోడకు వేస్తే, చెయ్యకూడని పని చేసేస్తారు. అవునా ! యిది మనం చెయ్యాల్సిన పనేనా, వెళ్ళాల్సిన మార్గమేనా అని అప్పుడప్పుడూ చూసుకోవాల్సిన అవసరం వుంది. లేదంటే, వినాయకుడిని చెయ్యబోయి, హనుమంతుడిని  చేసేస్తారు . అమెరికాకు వెడుతున్నామనుకుని అరేబియా కు వెళ్లి పోతారు. రోడ్ల మీద మార్గ దర్శక గుర్తులు అందుకే వున్నాయి . సముద్ర యానం లో దిక్సూచి అందుకే కావాలి . జీవన యానంలోనూ, గమ్యం తెలిపే దిక్సూచి మనకు కావాలి .  
 
అలాగే , స్టీఫెన్ కోవీ  "షార్పెన్  ది సా " అంటారు . అంటే , "మీలోని మేధా శక్తికి, మీ బుద్ధి కుశలత కు, మీ పనిముట్లకు  బాగా పదును పెట్టండి . అవి  బాగా పని చెయ్యగలిగేవిగా వుండేటట్టు  చూసుకోండి" అంటారు ఆయన. యిదే మాట గీతలో శ్రీకృష్ణుడూ అంటాడు  "యోగః కర్మసు కౌశలమ్" అని . అంటే మనం చెయ్యాల్సిన పనిని చాలా బాగా చెయ్యడమే యోగం అంటాడు . యిదే  భారతంలో అర్జునుడు మొదటి నుండీ చివరి వరకు చేశాడు. దీపాలు ఆరిపోతే , చీకట్లోనే భోజనం చేసిన అర్జునుడు , చీకట్లోనే అస్త్రవిద్యను కూడా నేర్చుకోవడానికి పూర్తి  ప్రయత్నం చేసి సఫలుడయ్యాడు .
 
మనం గమ్య మార్గం లో వెళ్ళాలంటే, దానికి తోడ్పాటుగా  శారీరక బలం, బుద్ధిబలం, దైవ సహకారం అన్నీ మనకు వుండాలి .మనం సాధారణంగా విజయానికి మూల సూత్రాలు  - లాంటివి  ఎన్నో చదువుతూ వుంటాము .  అసలు విజయం అంటే ఏమిటి ? పాండవులు యుద్ధంలో గెలవడం విజయమా? అది వారికి ఎంత మాత్రం సంతోషాన్ని యిచ్చింది ? సత్యభామ నరకాసురుడిని వధించడం విజయమా? అది ఆమెకు సంతోషాన్ని యిచ్చిందా ? కళింగ యుద్ధంలో అశోకుడి గెలుపు అతడికి సంతోషాన్ని యిచ్చిందా? 
 
విజయం సంతోషాన్ని యివ్వాలి.  అలా సంతోషం యివ్వని విజయం  ఎందుకు ? అది , గెలిచినా, వోడినట్టే కదా.  
 
మనసుల్ని గెలవడం చాలా గొప్ప విజయం . మనుషుల్ని గెలవడం చాలా చిన్న విజయం . నిజానికి , దీపావళి అంటే అదే . ఎంత మంది మనసుల్లో  దీపాలు వెలిగిస్తే అంత పండుగ ; అంత ఆనందం .  
 
మోడీ గారు స్వచ్చ భారత్ కావాలి, అది మనం తీసుకు రావాలి అంటారు . అది మొదట మన మనసుల్లో  ఆరంభం కావాలి. మనసుల్లోని కల్మషాన్ని తుడిచి పారెయ్యాలి . అది మనకు ఎంతో  ఆనందం యిచ్చే బృహత్ సాధన . రోజుకు  కనీసం రెండు  సంతోషాన్ని కలిగించే మంచి మాటలు, వారానికి వొక్కటైనా మంచి పని - చెప్పాలి , చెయ్యాలి అనుకుంటే జీవితానికి వొక గొప్ప గమ్యం ఏర్పడుతుంది .  అలా చేస్తున్న వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు .  ఇది చాలా అందమైన , కానీ , అతి సులభమైన గమ్యం . 
 
వొకాయన అన్నారు - "మా మోడీ గారు స్వచ్చ భారత్ అంటే , మా దేశం లోని కోట్లాది ప్రజలు చీపురు పట్టుకుని దేశాన్ని శుభ్రం చెయ్యడానికి బయలుదేరారు.  మా దేశం శుభ్రం అవుతోంది.  కానీ -  తుపాకీ పట్టుకోండి - అని ఆయన అంటే పాకీస్తాన్ వుగ్రవాదుల్లారా ,  మా ఎదుట మీరు నిలువగలరా ? ఎందుకు మీకీ వెన్నుపోటు తుంటరి చేష్టలు ?" 
 
జీవితంలో విజయానికి అర్థం తెలియని వారికి - నాకు రెండు కళ్ళు పోయినా పొరుగు వాడికి వొక కన్ను పోవాలి - అనుకునే మూర్ఖుడికి - మొదట అది తెలియజెప్పాలి .  
 
దీన్ని దాటి - మనలో ప్రతి వొక్కరూ , మన మన జీవితాలకు వొక గొప్ప గమ్యం ఏర్పరుచుకోవాలి.  
 
ఆనందంగా వుండడమే పెద్ద గమ్యం అయినా - దాన్ని సాధించడానికి అనుబంధంగా,  ఎన్నో గమ్యాలున్నాయి . శారీరకంగానూ , మానసికం గానూ ఆరోగ్యంగా వుండాలి. యిది వొక గమ్యం. ఆర్థికంగానూ ముందుకెళ్లాలి. యిదీ వొక గమ్యం . ఏవైనా కొన్ని విద్యలలో ప్రావీణ్యత సంపాదించాలి .యిదీ వొక గమ్యం .ఇవేవీ వద్దని మన వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు . మన ఋషులు గొప్ప శాస్త్ర వేత్తలు . సృష్టిలోని ఎన్నో రహస్యాలను పరిశోధించి కనుగొన్న వారు. మన ఆయుర్వేదం ఎంత గొప్పదో ! మన వాస్తు శాస్త్రం ఎంత గొప్పదో ! మన యోగ విజ్ఞానం ఎంత గొప్పదో ! మన తర్క శాస్త్రం , మన కర్మ సిద్దాంతం , మన గుణత్రయ విభాగ శాస్త్రం మన సంఖ్యా శాస్త్రం - దేని కదే గొప్పగా యీరోజుకూ ప్రకాశిస్తున్నాయి .  
 
కాకపోతే - తన్ను తాను తెలుసుకోవడం , తన మనసు పైన , తన శరీరం పైన విజయం సాధించడం - అన్నిటి కన్నా గొప్ప విజయం అన్నారు , మన వారు. వంద కోట్ల ప్రజల పైన అధికారం వుంది కానీ, నా మనసు పైన నాకు అధికారం లేదు, నా మనసు నా మాట విననంటుంది - అంటే , అది విజయం అవుతుందా ? అదే - అప్పటి దుర్యోధనుడి , రావణుడి  సమస్య . ఈ రోజుకూ అటువంటి వారందరికీ అదే సమస్య . 
 
మనసు పైన అధికారం వున్న వాడికి , ప్రకృతి  కూడా వశ వర్తి అవుతుందని మన వాళ్ళు గట్టిగా చెప్పారు. వారేం  అనుకుంటే అది చెయ్యడానికి ప్రకృతి  లోని అన్ని శక్తులూ  ముందుకు వస్తాయట.  యిలా జరగడం మనం ఈ రోజుకూ చూడొచ్చు . కాబట్టి, ప్రతి వొక్కరికీ , యిదే గొప్ప గమ్యం . 
 
సరే . రాజుకు ఎలాటి గమ్యం వుండాలి ? ప్రజలంతా , సకల, ఆయురారోగ్య ఆనంద, ఐశ్వర్యాలతో , మహా బుద్ధి మంతులుగా , మహా శక్తి మంతులుగా , సఖ్య భావంతో వుండాలనేగా ?
 
మన మోడీ గారు పీ. టీ. ఉషా గారిని గుజరాత్ కు ఆహ్వానించి , అక్కడ, అందరికీ ఆటలలో తర్ఫీదు యివ్వమని అడిగారు ఆమె కూడా వెంటనే వొప్పుకున్నారు . మరి మన చంద్రబాబు కూడా  మోడీ గారికి తక్కువేమీ కాదు కదా ! అందువలన , వారు కూడా , మల్ల యుద్ధం , జిమ్నాస్టిక్స్ లాంటి మంచి పోటీలలో తర్ఫీదు యివ్వగలిగే వాళ్ళని ఆంధ్రా కు పిలిస్తే  ఆంధ్రులలో - శారీరక ఆరోగ్యమూ , అన్ని రంగాలలో ముందుకు పోవాలన్న బలమైన కోరిక కలగడానికి అనువుగా , ప్రోత్సాహంగా వుంటుంది.  లేదంటే - BP , చక్కర వ్యాధి లాంటి అనారోగ్యాలు మన వాళ్ళలో ఎక్కువవుతూ వుంటాయి .  
 
యిప్పుడు హర్యానా లో - అటువంటి మంచి , ప్రోత్సాహ కరమైన వాతావరణం  వుంది . మన రాష్ట్రంలో లేదు . చంద్రబాబు నాయకత్వంలో - ఆయన ప్రతి రంగంలో - హేమా హేమీ లను పిలిచి - మన వారికి ట్రైనింగ్ యిప్పిస్తే - మన రాష్ట్రం ఎంతో బాగు పడుతుంది .  

 
 
మన రాష్ట్రం లోని ప్రతి వొక్కరూ  - ఆరోగ్యంతో , వుత్సాహంతో ముందుకు సాగిపోయే వారయితే , అంతకు మించిన దీపావళి మరొక్కటి వుంటుందా ? వచ్చే ఆసియాడ్ , ఒలింపిక్స్  లాంటి పోటీలలో , ఆంధ్రులు ఎక్కువ వుంటారనీ , మన రాష్ట్రానికి గొప్ప పేరు తెస్తారనీ - మనం ఆశిద్దాం . ఈ మాటలు చంద్ర బాబు గారు వినాలి ; దానికి తగిన చర్యలు తీసుకోవాలి అని - ఆశిద్దాం .
 
ఇలాంటి గొప్ప గమ్యం పెట్టుకుంటే - రాష్ట్రం - అన్ని రంగాలలో , అభివృద్ధి చెందుతుంది - అందులో సందేహం లేదు . 
 
అది మనమందరం కలిసి సాధిద్దామని ఆశిస్తూ - దీపావళికి మీకందరికీ , నా హార్దిక శుభాకాంక్షలు . 
= మీ 
 
వుప్పలధడియం విజయమోహన్ 
 
 
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి