22, మార్చి 2017, బుధవారం

భగవద్ గీత (17) - సాంఖ్య యోగము - 2.34,2.35 - యుద్ధం నుండి పారిపోతే ప్రజలేమంటారు - మహారథులేమంటారు




 

భగవద్ గీత (17)


  

 రెండవ అధ్యాయము   





 సాంఖ్య యోగము 

 



భగవద్ గీత లో మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగాన్ని మొదటి నాలుగు వ్యాసాల్లో బాగా విశ్లేషించి అర్థం చేసుకున్నాం.


అయిదు నుండి పదిమూడవ వ్యాసం వరకు, శ్రీకృష్ణుడి వుపదేశంలో - దేహి(అంటే ఆత్మ), దేహాల మధ్య గల సంబంధము, తారతమ్యము, దేహి, దేహాల యొక్క స్వరూప లక్షణాలు చూస్తూ వచ్చాము. మహదాశ్చర్యం గొలిపే దేహి యొక్క స్వరూపం విజ్ఞులకు కూడా పూర్తిగా అర్థం కావడం కష్టం, యిది వ్యక్త రూపంలో దేహాన్ని ధరించి, అవ్యక్త రూపంలో దాన్ని విడిచి పెట్టేస్తుంది, మళ్ళీ వ్యక్త రూపం ధరించి  దేహంలో ప్రవేశిస్తుంది - అన్నాడు 14  వ వ్యాసంలో. 

15  వ వ్యాసంలో స్వధర్మము,  క్షత్రియ ధర్మము అయిన   ధర్మయుద్ధాన్ని చెయ్యడమే అర్జునుడి కర్తవ్యమని అన్నాడు. 16వ వ్యాసంలో - "క్షత్రియులకు  అడగకుండా వచ్చిన యిటువంటి  ధర్మయుద్ధము  తమకోసం తెరచివుంచిన స్వర్గద్వారాల లాగా ఆనందదాయకంగా కనిపిస్తుంది. కానీ నువ్వు, ఈ ధర్మయుద్ధం చెయ్యకపోతే నీ ధర్మాన్ని విడిచిపెట్టి, పాపం చేసినవాడవౌతావు. " అన్నాడు. 


17 వ వ్యాసంలో, సాంఖ్య యోగపు 34, 35 శ్లోకాలలో, శ్రీకృష్ణుడు యింకా ఏం  చెప్పబోతున్నాడో చూద్దాం.


 శ్రీకృష్ణుడి మాట :


"అకీర్తించాపి  భూతాని కథయిష్యన్తి తేవ్యయామ్  
  సంభావితస్య  చాకీర్తిహ్ మరణాత్ అతిరిచ్యతే ||  (2. 34)


అకీర్తిం   = అకీర్తి, అవమానము ; చ  = మరియు ; అపి   = కూడా  భూతాని   సకల ప్రాణులు ; కథయిష్యన్తి చెబుతాయి  ; తే   నువ్వు ; అవ్యయామ్   ఎప్పుడూ వుండునది ;  సంభావితస్య   =  కీర్తిపరులుగా కొనియాడబడువారు ; = మరియు    ; అకీర్తిహ్   =  అకీర్తి, అవమానము   : మరణాత్    =  మరణము లేదా చావు కంటే  ;  అతిరిచ్యతే = ఎక్కువ. 

 
"సకల ప్రజలు నీ యీ  అకీర్తికరమైన పనిని, అవమానాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోగలరు. కీర్తిపరులుగా కొనియాడబడువారికి  ఈ అకీర్తి, అవమానము  చావుకంటే  హీనమైనది "


ఈ ధర్మయుద్ధం చేస్తే, నీ కోసం స్వర్గ ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. ఎంతో గొప్ప పుణ్యాత్ముడిగా లెక్కింపబడతావు.  కానీ, నీ ధర్మాన్ని మరచి యుద్ధం నుండి వెనుతిరిగి వెళ్ళిపోతే నువ్వు పాపం చేసినవాడవౌతావు. నరకానికి అర్హుడవౌతావు - అన్నాడు శ్రీకృష్ణుడు, క్రిందటి శ్లోకాలలో. 

స్వర్గం, నరకం రెండూ మరణం తరువాత కదా. అది ఎప్పుడో జరిగేది.  ఇప్పటి మాటేమిటి. నువ్వు ఈ ధర్మయుద్ధం నుండి  వెనుదిరిగి వెళ్ళిపోతావు. ది లోకంలో అందరికీ తెలుస్తుంది. వాళ్లేమనుకుంటారు? 

వాళ్ళందరూ నువ్వు యుద్ధం నుండి పారిపోయిన ఈ అవమానకరమైన వృత్తాంతాన్ని వారున్నన్ని నాళ్లూ హేళనగా చెప్పుకుంటూ వుంటారు. యిది నీలాంటి కీర్తివంతుడికి చావుకన్నా హీనమైనది కదా. నీలాంటి వాళ్ళు  ఆదర్శ వంతులు గా వుండాలి. నువ్వే యుద్ధం నుండి పారిపొయే లాంటి పిరికివాడివైపోతే, నీ ప్రజలూ అలాగే మారిపోతారు కదా. యథా రాజా, తథా ప్రజా - అని కదా విజ్ఞులు అంటారు - అంటున్నాడు శ్రీకృష్ణుడు. 


ప్రస్తుత కాలంలో కూడా, గొప్ప, గొప్ప ప్రెసిడెంట్లు, ప్రధాన మంత్రులు, రక్షణమంత్రులు, కమాండర్లు -  తమ సైన్యాలకు, శత్రు సైన్యాలకు మధ్య హోరాహోరీగా పోరు జరుగుతున్న ప్రదేశాలకు - స్వయంగా వెళ్లి, తమ సైన్యాలకు వుత్సాహం యివ్వడం మనం వింటూ వున్నాము.  వాళ్ళు చాలా గొప్ప నాయకులుగా వుండి, తమ సైన్యం యొక్క విజయానికి ఎంతో కారణభూతులౌతారు.  పోరుకు భయపడే వాడు, మరణానికి భయపడే వాడు సైన్యానికి నాయకుడు కాలేడు


అటువంటి గొప్ప నాయకులు యిప్పుడు మనకూ వున్నారు.అవునా! 


శ్రీకృష్ణుడి మాట : 


 "భయాద్రణాదుపరతం  మంశ్యంతే త్వామ్   మహారథాహ్ 
ఏషామ్ చ త్వమ్  బహుమతో భూత్వా యాస్యసి లాఘవం || (2. 35



భయాత్ =  భయము వలన రణాత్     యుద్ధమునుండి   ; వుపరతం       వెనుదిరిగి వెళ్ళితే ; మంశ్యంతే =  అనుకుంటారు ; త్వామ్ = నువ్వు  ;  మహారథాహ్ =  మహారథుడవైన ; ఏషామ్ = ఎవరిగురించి అయితే   ;   మరియు  త్వమ్ =  నీవు ; బహుమతః = ఎంతో  గొప్పగా అనుకొనబడిన ; భూత్వా  =  వుండినటువంటి యాస్యసితీసుకోబడు  ; లాఘవం = తేలికగా (అనుకొందురు) ; 


"ఇక్కడున్న మహారథులందరు నీవు,  ఈ యుద్ధం నుండి, భయం చేత పారిపోయిన వాడవనే అనుకొందురు. ఇంతవరకు నిన్ను చాలా గొప్పగా అనుకొన్న వీరు నిన్ను యికమీద చాలా తేలికగా తీసుకొందురు.  "  


ప్రజలేమనుకుంటారో, ఎలా ప్రభావితులౌతారో విన్నావు కదా . ఈ యుద్ధంలో, నీ ముందే, నీలాంటి  మహారథులైన వీరులెంతో మంది వున్నారు.  వారేమనుకుంటారో  ఊహించు. నీవు వారి చేతిలో ఓడిపోవుటకో, మరణించుటకో  భయపడి, పారిపోయిన వాడవనే అనుకొందురు కదా. నువ్వు అందరి కంటే చాలా గొప్ప మహారథుడవని అనుకొన్న యీ మహారథులందరూ, యుద్ధం నుండి భయపడి పారిపోయిన వాడవని, యికమీదట చాలా తేలికగా మాట్లాడరా, హేళన చెయ్యరా?  పాండవుల వైపే వున్న మహారథులు కూడా  నిన్ను గురించి చాలా హేళనగా మాట్లాడుతారు కదా


యుద్ధం చేస్తే ప్రజల మధ్య, గొప్ప వీరుల మధ్య వచ్చే గౌరవం, కీర్తి, యుద్ధం చెయ్యకుండా వెనుతిరిగి  పొతే, వచ్చే అగౌరవం, అపకీర్తి  గురించి, పూసగ్రుచ్చినట్టు చెబుతున్నాడు శ్రీకృష్ణుడు.  అలాంటి అవమానాలతో, అపకీర్తితో  అర్జునుడిలాంటి మహావీరుడు బ్రతుక గలడా? - అని ప్రశ్నిస్తున్నాడు. 


నిజానికి, మనకందరికీ కూడా, ఇలాంటి ధర్మయుద్ధం  ఏదో ఒకటి ఉంనే వుంది. అధర్మం పలువిధాలుగా మన చుట్టూ నాట్యమాడుతూ వుంది. మనం దాన్ని వీరులులాగా ఎదుర్కొంటున్నామా, భయపడి  పారిపోతున్నామా - అన్న ఒక్క  అంశం పైనే మన యొక్క, మన దేశం యొక్క   పురోగతి , ప్రశాంతత ఆధారపడి వుంది. 

అధర్మాన్ని ఎదిరించే  అర్జునులు  యిప్పుడు కూడా మనకు కావాలి. మనమే అలా తయారు కావాలి. అవునా, కాదా? యోచించండి. భగవద్ గీత ఒక్క అర్జునుడి కథ మాత్రం కాదు. శ్రీకృష్ణుడు మనల్నందరినీ కూడా యిదే మాటలంటున్నాడు. యిదే  వేస్తున్నాడు.  

ధర్మం వైపు నిలబడి యుద్ధం చేస్తావా , భయపడి పారిపోతావా ? మీకూ, నాకూ కూడా యిదే ప్రశ్నయే.   


ఇంకా ఏమేమి పరిణామాలు జరుగుతుందో చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు ముందు వచ్చే శ్లోకాలలో. అవి మరో వ్యాసంలో చూద్దాం. 
వ్యాసాలపైన - మీ అభిప్రాయాలను, విమర్శలను, అనుభవాలను కూడా నాకు మీరు తెలియ  జేస్తూ వుంటే చాలా బాగుంటుంది


సర్వే  జనాః సుఖినో భవంతు
  
= మీ   
    

ఉప్పలధడియం   విజయమోహన్ 
వజ్రాసనం