18, సెప్టెంబర్ 2014, గురువారం

పరిస్థితి - మనస్థితి - మన "స్థితి" - మనలో వో అమ్మ హృదయ స్పందన


పరిస్థితి - మనస్థితి - మన "స్థితి"

మామూలుగా వచ్చే స్కూలు బస్సు ఆ రోజూ వచ్చి వీధిలో, ప్రతి రోజూ నిలిచే చోటే  నిలిచింది . ఆ వీధిలో వున్న స్కూలు పిల్లలందరూ వొకరి తర్వాత  వొకరు ఎక్కి కూర్చున్నారు . బస్సు కదిలింది . పిల్లలు తల్లిదండ్రులను చూస్తూ చేతులూపుతున్నారు. తల్లిదండ్రులూ పిల్లలను చూస్తూ, బస్సు కనుమరుగయే దాకా చేతులూపుతున్నారు. తరువాత , యిళ్ళకో , ఆఫీసులకో వెళ్లి పోతున్నారు. 

ప్రతి రోజూ ఆ వీధిలో జరిగే తంతే యిది . మళ్ళీ సాయంకాలం పిల్లలను స్కూలు నుండి తీసుకు వచ్చి దించే సమయంలో,  యిదే తంతు రివర్స్ గా జరుగుతుంది. స్కూలుకు వెళ్ళేటప్పుడు పిల్లల మనస్థితి వొక రకం. వచ్చేటప్పుడు మరో రకం .  

అదే విధంగా పెద్దల మనస్థితీ రక రకాలుగా వుంటుంది. బస్సు కాస్త ఆలస్యంగా వస్తే , ఆ రెండు మూడు నిమిషాల్లో వొక్కొక్కరి మనస్సు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ వుంటుంది.  మనసు మంచిని కోరుకున్నా, కీడునే శంకిస్తూ వుంటుంది; తల్లిదండ్రుల విషయంలో మనం యిది చూస్తూనే వుంటాము . బస్సు వచ్చినా - తమ పిల్ల వాడు దిగే వరకు ఏదో ఆత్రుత . 

బడులకెళ్ళే పిల్లలు లేని వారి మనస్తత్వాలు మరో రకంగా వుంటాయి .  కొందరైతే తమకేమీ పట్టనట్టు వుంటారు . కొందరు - ప్రతి రోజూ మన వీధిలోనే ఏమిటీ రగడ , ఏమిటీ బెడద అనుకుంటూ వుంటారు . అందులో ఎవరో వొకరు - దీనిపై తప్పకుండా కంప్లైంట్ రాయాల్సిందే, అని ప్రతి రోజూ అనుకుంటూ వుంటారు.

అసలు పిల్లలే లేని వాళ్ళు , తమకూ ఇలాంటి పిల్లలు వొకరో ఇద్దరో వుంటే బాగుంటుందని రోజూ అనుకుంటూ , ఆ పిల్లలను చూస్తూ వుంటారు . అలాంటి వారు కొంత మంది,  ఆ పిల్లలు తమను చూసినా, చూడక పోయినా, వారందరికీ తాము కూడా చేతులు వూపుతుంటారు.  ఇది వారికి ఆనందమా, కాదా, చెప్పడం కష్టం.  కానీ, చేతులు ఊపక పొతే, వొక వెలితి మిగిలిపోతుంది వారి మనసులో. కొంత మంది పిల్లలు తమ వైపు చూసి చేతులు వూపితే మహదానంద పడి పోతారు . అయినా , ఆ తరువాత , ఏదో వొక వెలితి మిగిలే వుంటుంది .

యిలా  రోజూ జరిగే సాధారణ సంఘటనకు కూడా వొక్కొక్కరి స్పందన వొక్కొక్క రకంగా వుంటుంది.

నెలకొక రోజు వాన వస్తే , "ఎన్నాళ్ళ కొచ్చావమ్మా , వానా, వానా " అని వానలో యెగిరి గంతులెయ్యొచ్చు. ప్రతి రోజూ వానే అయితే ? రోజంతా వానే అయితే ?  అప్పుడేం చేస్తాం ? రోజంతా ఎందుకమ్మా , వానా, వానా - అని  అనమా ? తిట్టుకోమా ?

అనొచ్చు . తిట్టుకోవచ్చు . కానీ వచ్చే వానను ఆపలేం . రాని వానను తెచ్చుకోలేం .

గోదావరి నిండుగా ప్రవహిస్తే అందం; ఆనందం ; కానీ, అదే గోదావరిలో వరదలు పొంగి, గ్రామాలనూ , పంటలనూ, ముంచి , నాశనం చేసి హడలెత్తిస్తే - అదీ అందమేనా ? ఆనందమేనా ?

ఎలా ప్రవహించాలి - అన్నది గోదావరి యిష్టం . మీ యిష్టం కాదు . అవునా??  ... కాదు . గోదావరి యిష్టం కూడా కాదు. వర్షాలు ఎక్కువగా కురవకపోతే గోదావరిలో తక్కువ ప్రవాహం; వర్షాలు మామూలుగా వుంటే  నిండుగా ప్రవహించ వచ్చు. ఎక్కువైతే  వరదలు.

అంటే - అదంతా వర్షాల యిష్టం . గోదావరి యిష్టం కాదు. నిజానికి వర్షాల యిష్టం కూడా కాదు. సముద్రంలో నుండి ఎక్కువ మేఘాలు తయారైతే, ఎక్కువ వర్షాలు. లేదంటే, తక్కువ వర్షాలు. అంటే - మేఘాలు తయారు చేసే సముద్రం యిష్టమా ? కాదు కాదు . సూర్యుడు సముద్రంపై ఎక్కువ ఎండలు కాస్తే , ఎక్కువ మేఘాలు ; లేదంటే, తక్కువ మేఘాలు ; అసలు , అదీ కాదు ; మేఘాలను గోదావరిపైకి తీసుకెళ్ళాలంటే ,  గాలి  తోడ్పాటు కావాలి . లేదంటే సముద్రంలో తయారైన మేఘాలు సముద్రం పైనే వర్షిస్తాయి. సూర్యుడు సముద్రం నుండి మేఘాలు తయారు చెయ్యాలి. కానీ , గాలి బాగా వీచి,  మేఘాలను గోదావరి పైకి తీసుకెళ్ళాలి. అక్కడ దానికి చల్ల గాలి తగలాలి . అంటే గోదావరి ప్రక్కన కొండలు, వృక్షాలు కావాలి . యివన్నీ ప్రకృతి లోని వలయాలు . యివి మనకు కొంత తెలుసు; చాలా తెలీదు . ఈ బాహ్య పరిస్థితుల్లో ఏది మన అదుపులో వుంది? దాదాపు  ఏదీ లేదు ! గోదావరిలో వరదలొస్తే - మనం మన కోసం  ఏం చెయ్యాలో -  అది కాస్తా చెయ్యొచ్చు .

గోదావరి నుండి , కృష్ణ కు , కృష్ణ నుండి నీళ్ళు లేని మా ఊళ్లకు కాలువలు త్రవ్వవచ్చు. అలా త్రవ్వితే - గోదావరి వరద నీరు, మా ఊళ్లలో త్రాగడానికీ, పంట పొలాలకూ పనికొస్తుంది. లేదంటే - గోదావరి వరద నీరు, చుట్టూ వున్న గ్రామాలలో ప్రళయం సృష్టించి - కడపట, ఎవరికీ ఉపయోగం లేకుండా, బంగాళాఖాతంలో కలిసి పోతుంది . కానీ, మనం ఏం చేసినా - ఆ వర్షాలను ,  డైరెక్ట్ గా  నీళ్ళు లేని మా ఊళ్లకు తీసుకు రాలేం కదా.   

అసలు ప్రపంచం లో ఏదీ మన అధీనం లో లేదు; ఏదీ మన మాట ప్రకారం నడుచుకోదు - అనిపిస్తుంది.   మన యింట్లోని  వొక్క ఈగ , దోమ ,  చీమ ,  బొద్దింక  కూడా మన మాట వినదు .

అవి వినక పొతే పోనీ . మీ ఆవిడ, మీ వారు (బోలెడన్ని సార్లు) మీ మాట వినరు . మీరూ వారి మాట వినరు - కానీ వారు మీ మాట ఎప్పుడూ వినాలనుకుంటారు.  యిద్దరూ ఏదండం అంటే కోదండం అన్నట్టు గా వుంటారు . వొకరి మాట యింకొకరు వినే యిళ్ళు లేవని నేను అనడం లేదు . వినని యిళ్ళు చాలా వున్నాయంటాను . వింటే - మేలనీ అంటాను. "అహం" పెరిగే కొద్దీ వినని యిళ్ళ సంఖ్య పెరుగుతోందంటాను .

సరే . ఎల్లప్పుడూ ఎవరు వింటారు మీ మాట ? మీ మాట ప్రకారమే నడుచుకునే వ్యక్తి ప్రపంచం లో వొక్కరైనా వున్నారా? నిజం చెప్పనా ? నిజానికి  మీ మాట మీరే వినరు . మీరు అనుకున్నది , మీరు చెయ్యల్సింది,  మీరే చెయ్యరు ; మీరు చెయ్య కూడనిది చేస్తారు .

బయటి పరిస్థితి మనకనుగుణం గా వుండక పొతే - సర్ది చెప్పుకోవచ్చు . సవాలక్ష కారణాలు చెప్పుకోవచ్చు . మనమే మన మాట వినక పోవడానికి - ఎన్ని కారణాలు చెప్పగలం ?


ఇంత కంటే  పెద్ద సత్యం మరొకటుంది .

ప్రపంచమంతా  ఎక్కడ వుందయ్యా - అంటే , మన మెదడులో , మన మనసులో  - అని జ్ఞానులు చెబుతారు . మీరు మీ భార్యను ఎక్కడ చూస్తున్నారు ? వంటింట్లో , అంటారు మీరు .  లేదా, మరో చోట అంటారు . కాదు నా కంట్లో అంటారు - మీరు కాస్త లోతుగా ఆలోచిస్తే .  వంటింట్లో కాదు , కంట్లోనూ కాదు ; నా మెదడులో , మనసులో , అంటారు - మరి కాస్త బాగా ఆలోచిస్తే . నిజమే . మీరు ఎవరిని చూసినా, దేనిని చూసినా, మీ మెదడులో, మీ మనసులోనే చూడగలరు .

మెదడు,మనసు చూడక పోతే - కన్ను తెరుచుకుని వున్నా చూడ లేరు. ఎదురుగా మనిషి లేకున్నా , కళ్ళు మూసుకుని వున్నా, తెరుచుకుని వున్నా, మనసు తలుచుకుంటే చూడగలరు . యిదొక పెద్ద చేదు నిజం .  బయటి ప్రపంచం  నిజం కాదనడం లేదు . కానీ మీ  అనుభవం , అనుభూతి మాత్రం మీ మెదడులోనే, మీ మనసులోనే కదా .

 ఈ అనుభవం , అనుభూతి ప్రతి మనిషికీ వేరు వేరుగా వుంటుంది . వొకే పువ్వును పది మంది చూస్తుంటే , ఆ పది మంది అనుభూతులూ వేరు వేరుగానే వుంటాయి . చూసే ప్రకృతి , పరిస్థితి వొకటే  అయినా, మన మనస్థితులు మాత్రం ఎంతో విభిన్నంగా వుంటాయి .   మన మనస్థితి ని బట్టి మన స్థితి వుంటుంది - పరిస్థితి ఎలా వున్నా .


బయటి పరిస్థితి లో నిరంతరం జరిగే మార్పులు, ప్రకృతి ధర్మాలను అనుసరించి వుంటాయి . అవి కొంత మనకు తెలుసు . చాలా వరకు తెలీవు .

 ఆ ప్రకృతి ధర్మాల ననుసరించి , మనకెలా కావాలో అలా,  యిండ్లు , రోడ్లు , బస్సులు, రైళ్ళు , విమానాలు యిలా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాము . వర్షాలు ఎప్పుడు రావచ్చో ఊహించి - దాన్ని వర్షాకాలం అన్నాము .  దాన్ని బట్టి పంటలూ, పొలాలూ  ఎన్నో తయారు చేసు కున్నాము .

కానీ, తుఫాన్లు,. వరదలు ఎప్పుడు వస్తాయో మనకు  తెలీదు. కాశ్మీరు లో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి . ఎంతో ప్రాణ నష్టము,  ఆస్తి నష్టము , ఎంతో మంది యిళ్ళలో వుండలేని పరిస్థితి ఏర్పడింది . మనం ఎంత మాత్రం వరదలను అడ్డుకో గలిగాము ?  అడ్డుకోలేము కదా !

కానీ - చేతనైనంత సహాయ కార్యక్రమాలు చేస్తున్నాము. మన సంగతి విడవండి . అక్కడి వారే కొంత మంది - భారత ప్రభుత్వము  చేస్తున్న సహాయక చర్యలను అడ్డుకున్నారు . ఎందుకంటే - ఈ సహాయక చర్యలు లేకపోతేనే కదా మన దేశానికి ప్రతికూలంగా వారు చేస్తున్న పన్నాగాలు, ప్రచారాలు ఫలించేది; అక్కడి ప్రజలలో మన పట్ల అపోహలు పెంచేది. యిది కాశ్మీరు ప్రజలు ఎప్పుడు తెలుసుకుంటారు ? తమకు సహాయం చేస్తున్నది భారత ప్రభుత్వం ; అడ్డుకుంటున్నది పాకిస్తానీ టెరరిస్టులు, వారితో కలిసిన కాశ్మీరీ వుగ్రవాదులు - అని కాశ్మీరు  ప్రజలు పూర్తిగా తెలుసుకోవాలి కదా . వరదలకు ఇవేవీ తెలీవు . అవి వస్తాయి .  ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అన్నీ కలిగిస్తాయి. అవి వాటి ధర్మం .

పరిస్థితులు వాటంతట అవి వస్తాయి . కానీ, మన "స్థితులు" మన మనస్థితులపై ఆధారపడి వుంటుంది .  కాశ్మీరు సమస్య మనస్థితుల సమస్యే కానీ మరేమీ కాదు . పాకిస్తాన్ లోనూ పెద్ద ఎత్తున వరదలూ, వర్షాలూ అన్నీ వచ్చాయి . ప్రాణ నష్టమూ, ఆస్తి నష్టమూ జరిగింది . భారత దేశంలోనూ  అదే ఎత్తున వరదలూ, వర్షాలూ అన్నీ వచ్చాయి . కానీ , యిక్కడ సహాయ కార్యక్రమాలు చేస్తూ వుంటే - అక్కడ,  భారత దేశం వలననే పాకిస్తాన్ లో వర్షాలు, వరదలూ - అని ప్రచారం మాత్రం చెయ్యబడుతోంది . పరిస్థితులు యిరు వైపులా వొకటే . మనస్థితులు ఎంత వేరో గమనించండి . ఆ మనస్థితిల ననుసరించే , వారి వారి కార్యక్రమాలు ఆధారపడి వుంటాయి . 

తమిళనాడులో తీర ప్రాంతంలో వొక సారి అకస్మాత్తు గా సునామీ వచ్చింది . కడలి పొంగింది . నింగికి ఎగిరింది . వుప్పుసముద్రం  జన సముద్రం మధ్యకు వచ్చేసింది . అలా వచ్చిన అల వొకటి  తాటి చెట్టు ఎత్తున వచ్చింది . వచ్చి తీరప్రాంతాన వున్న గుడిసేవాసులను ముంచి, రోడ్లు దాటి వూళ్ళలోకొచ్చి భీభత్సం సృష్టించి , మళ్ళీ మెల్లగా, వెనక్కు సముద్రం  లోకి  వెళ్ళిపోయింది .  అది వెనక్కు వెళ్ళే దారిలో  వొక గుడిసె వుంది . అది కూడా అల తాకిడికి మునిగి పోయింది . 

కానీ అందులో వొక జాలరి , అతని భార్య,  కొడుకు,కూతురు చిన్న పిల్లలు వున్నారు . వారందరూ మునిగిపోయారు . కానీ అల  వేగంగా వెనక్కు వెళ్ళే సమయంలో  జాలరి, ఆ నీటిలోనే , గుడిసె మధ్య లో వున్న స్తంభాన్ని వొక చేత్తో గట్టిగా వాటేసుకున్నాడు . అది పడి పోకుండా నిలిచింది. మరో చేత్తో భార్యచేతిని గట్టిగా పట్టుకున్నాడు . అతని భార్య తన మరో చేత్తో , దగ్గరగా అలలో కొట్టుకుపోతున్న కొడుకు చేతిని పట్టుకుంది . ఆమె కూతురు  ఆమె దగ్గరే, అలలో  కొట్టుకు పోతూ వుంది . అమ్మా, అమ్మా అని భయంగా, దీనంగా అరుస్తూ, చూస్తూ  వుంది . కానీ ఆ కూతురును రక్షించడానికి ఆమెకు మరో చెయ్యి లేదాయె . జాలరి, అతని భార్య, కొడుకు మాత్రం బ్రతికారు . కూతురు చనిపోయింది . 

బయట పడ్డ తరువాత ఆ అమ్మ ఏడుపు దీనాతిదీనంగా వుంది . తన కళ్ళ ఎదుటే , తన సమీపంలోనే తన ప్రియమైన కూతురు సునామీ అలలో కొట్టుకు పోతూ వుంటే , అమ్మా, అమ్మ అని అరుస్తూ వుంటే , నన్ను రక్షించవా , నన్ను మాత్రం వదిలేస్తున్నావా,  అన్నట్టు దీనంగా, భయంగా చూస్తూ, అల వేగం తో బాటు సముద్రం లోకి వెళ్లి పోతుంటే - వొక అమ్మ హృదయం  ఎలా స్పందిస్తుంది ? పరిస్థితి అలా వుంటే నేను మాత్రం ఏం చెయ్యగలను - అనుకుంటుందా ? లేదు కదా ! నేను ఏదో చేసి వుండాలి ; ఏదైనా చేసి వుండాలి ; నా కూతురును ఎలాగైనా రక్షించి వుండాలి ; ఎంత పాపిష్టి దాన్ని అని కుమిలి పోయే ఆ అమ్మ హృదయం .... ; అందులోనే కదా దేవుడనే వాడు వుంటే - జీవిస్తూ వుంటాడు . 

నాకనిపిస్తుంది - వొక ప్రధాన మంత్రి హృదయం ఆ అమ్మ హృదయం లాగా స్పందించాలి . వొక ముఖ్య మంత్రి హృదయం ఆ అమ్మ హృదయం లాగా స్పందించాలి . అంతెందుకు ; మన వూరి MLA హృదయం కూడా అలా స్పందించాలి . అదీ నిజమైన నాయకత్వ లక్షణం అంటే . మన మోడీ గారిలో , కొంత వరకు ఆ లక్షణాలు వున్నాయని నా నమ్మకం .

పరిస్థితులు మన చేతిలో లేక పోవచ్చు . కానీ, మన మనస్థితి మాత్రం మన చేతిలోనే , మన అధీనం లోనే వుంది . మనిషి దేవుడిలా స్పందించవచ్చు . మనిషిలా స్పందించ వచ్చు . మృగంలానో , రాక్షసుడి లానో  కూడా స్పందించ వచ్చు . కానీ వొక  నాయకుడి  స్పందన చాలా మంది ప్రజల హృదయ స్పందనగా మారుతుంది . కానీ , నాయకుడి స్పందన కోసం, "ఎవరో వస్తారని , ఏదో చేస్తారని " మనం వేచి చూడాలా ?

ఎంత మంది అనాథలున్నారు, మన చుట్టూ  ? ఎంత మంది  పేద వాళ్ళు వున్నారు? ఎంత మంది తిండి, గుడ్డ, నీడ లేని వాళ్ళు వున్నారు ? యిది వొక సునామీ కాదా ? వీరిలో కనీసం వొకరిని ఆదుకునే శక్తి మనలో ఎంతో మందికి వుందని నా నమ్మకం. మన లోని ఆ శక్తి బహిర్గతం కావాలంటే , ఆ అమ్మ హృదయ  స్పందన మనలో రావాలి. 

ఆ స్పందన మన అందరిలో రావాలని కోరుతూ 

=  మీ

వుప్పలధడియం విజయమోహన్  

15, సెప్టెంబర్ 2014, సోమవారం

ఈ రోజు మీరు ఆడిన ఆట ఎలా ఆడారు - 5 నిమిషాల్లో మనసుపైన మీరు సాధించే విజయం ఎలా ?


వొకాయన  భార్య తనకు బహుమతిగా కొనిచ్చిన తెల్ల గుర్రంపైన కూర్చుని స్వార్తీ చేస్తున్నాడు . కాకపోతే , ఆయన తోకవైపు తిరిగి కూర్చుని స్వారీ చేస్తూ , గుర్రాన్ని తిడుతూ, కొడుతూ వున్నాడు . ఆయన భార్య కోపంతో , నీలాంటి మూర్ఖుడికి ఈ తెల్ల గుర్రం కొనివ్వడమే పొరబాటు . ఎవరైనా తోకవైపు కూర్చుని ప్రయాణం చేస్తారా - అన్నది .

అందుకాయన కూడా కోపంతో - నువ్వు మూర్ఖురాలివి, నీ గుర్రం నీకంటే మూర్ఖపుది . నేను, నేను వెళ్ళ వలసిన వైపే కూర్చుని వున్నా. యిది దానికి విరుద్ధంగా వెడుతుంటే నేనేం చేసేది ? అన్నాడు .

తప్పెవరిది ? గుర్రందా , ఆయనదా ? లేక ఆయన భార్యదా ? ఆయన మాత్రం తను వెళ్ళాల్సిన వైపే కూర్చుని ఉన్నాడట . గుర్రం దానికి విరుద్ధంగా వెడుతున్నదట.

ఏ గుర్రమైనా  ముందుకే వెడుతుంది . ఈయన వెనుక వైపున్న దారిలో వెళ్ళాలి . యిప్పుడేం చెయ్యాలి . గుర్రాన్ని వెళ్ళాల్సిన వైపుకి తిప్పితే , అది ఆ మార్గంలో ముందుకే వెడుతుంది . అప్పుడు యిద్దరి గమ్యం వొకటే అవుతుంది .

నా గమ్యం వేరు . నా వాహన గమ్యం వేరైతే  ఎలా ?

నిజానికి వాహనానికి గమ్యం లేదు . అది ముందుకే వెళ్ళగలదు . కాకపోతే , బయల్దేరే ముందు  ఏ  ప్రక్కకు తిప్పి నిలబెడితే , అది ఆ ప్రక్కన ముందుకే వెడుతుంది .

మనుషులకు ముఖ్య వాహనం - వారి వారి మనసు . అదీ సాధారణంగా, గుర్రం లాగా , ముందుకే దూసుకుని వెళ్ళ గలదు .

ఏ వైపు వెళ్ళాలో , గమ్యం ఏమిటో నిర్ణయించాల్సింది  మనమే . మనకు మన గమ్యమే తెలియకుంటే ,లేదా మనం మనసు యొక్క తోక వైపు కూర్చుంటే -అంటే , మనసు పరుగెత్తే వైపు కాక మరోవైపు పోవాలనుకుంటే , ఎలా కుదురుతుంది ?

మనం ఏదో పరీక్ష పాసు కావాలి . అదీ మన గమ్యం. ఇప్పుడు మనం మన మనసును ఆ వైపు త్రిప్పి నడిపించాలి , మనసును టీవీ వైపు పెట్టి పరీక్ష పాసు కావాలంటే ఎలా ?

ఏ గమ్యం చేరాలన్నా , మనసా, వాచా, కర్మణా అ గమ్యం వైపే  కృషి చేస్తేనే, చేరడానికి  అవకాశాలుంటాయి . అలా కాక , మనసొక వైపు, మాటొక వైపు , చేతలు మరొక వైపు వుంటే - గమ్యం చేరలేము కదా .

మనలో చాలా మందికి - యిదే సమస్య . మీ గమ్యం ఏమిటని అడిగితే - సగం మంది అసలు చెప్పలేరు . వారికి గమ్యం లేదు . వారి గుర్రం - అంటే  మనస్సు ఎటు  వైపు వెడితే , వారి జీవితం అటువైపు వెళ్ళిపోతూ వుంటుంది.
ప్రత్యేకించి గమ్యం అంటూ వుండదు .

మరి కొంత మందికి గమ్యం అంటూ ఏదో వొకటి లోపల వుంటుంది . కానీ వారు - తమ మనస్సును, బుద్ధిని - తమ గమ్యం వైపు త్రిప్పి వుంచరు . అందు వలన మనస్సు పరిపరి మార్గాల్లో పోతూ వుంటుంది . అప్పుడప్పుడూ , నిరాశతో , నిస్పృహతో - అయ్యో, ఎన్నో చెయ్యాలనుకున్నానే , ఏమీ చెయ్య లేక పోతున్నానే - అనుకుంటూ వుంటారు .

మనసు గతి యింతే ; మనిషి బ్రదుకింతే ;  మనసున్న మనిషికీ సుఖము లేదంతే -  అని సినిమా పాటలో లా అనుకుంటే  ఎలా ? సినిమా అయితే  ట్రాజెడీ  కానివ్వండి . పర్లేదు . కానీ మన జీవితం ట్రాజెడీ కానక్కర్లేదు .


 మీ మనస్సు - మీకు సేవకుడుగా వుంటే - మీకు అది అత్యంత ఆంతరంగికమైన,  నమ్మ దగిన సేవకుడుగా , మిమ్మల్ని మీ గమ్యం వైపు తీసుకుని వెడుతుంది .మీ అన్ని విజయాలకు అది కారణమవుతుంది.  

అలా కాక మీ మనస్సు మీకు యజమానిగా  ప్రవర్తిస్తూ , మిమ్మల్ని శాసిస్తూ వుంటే - అది మీకు అత్యంత అంతరంగిక విరోధిగా, మిమ్మల్ని మీ గమ్యం నుండి బహు దూరంగా తీసుకుని వెడుతుంది .మిమ్మల్ని అన్ని రకాల చిక్కుల్లో పడ  వేస్తుంది .

ఈ మాట చెప్పింది  సాక్షాత్తు  శ్రీకృష్ణుడు . అదీ భగవద్గీత లో .

మనసు యజమానైతే , మనం సేవకులైతే - ఏమవుతుంది .

మనసుకు నచ్చినవి , అలవాటైనవి కొన్ని వున్నాయి . వాటినన్నిటినీ  కలిపి అంతః  శత్రువులు  అని అంటారు.  అవి - (అ) మితి మీరిన కోరికలు (కామం),    (ఆ)  రక రకాల కోపాలు (క్రోధం ),   (ఇ)  అన్నీ నాకే కావాలన్న స్వార్థం (లోభము),   (ఈ) ప్రతి దానిపైన  వ్యామోహం (మోహం),  (ఉ) నేనే గొప్ప అన్న సుపీరియారిటీ  కాంప్లెక్స్ (మదం),   (ఊ) ప్రక్క వాడి సంతోషాన్ని, విజయాన్ని వోప్పుకోలేని యిన్ఫీరియారిటీ  కాంప్లెక్స్ (మాత్సర్యం ),  (ఎ) ఎన్నో రకాల భయాలు. 

మనస్సు యజమానైతే - అది మనల్ని వీటి వైపే లాగుతుంది . వీటన్నిటిలో , మన పతనమే  వుంటుంది  కానీ , సంతోషం , విజయం  రెండూ వుండవు .

మనం, మనస్సుకు యజమానిగా వుంటే - ఆయురారోగ్య , ఐశ్వర్య , సంతోష , శాంతి, విజయాల్లాంటివి , అన్నీ లభిస్తాయి . మన  మనస్సు , మనల్ని , వీటి వైపూ నడిపించ గలదు.

అందుకే పతంజలి  మహర్షి , యోగః  చిత్త వృత్తి  నిరోధః - అన్నారు . మనస్సును మన యాజమాన్యం లో పెట్టుకుంటే - అదే యోగం. అదే సంతోషం . అదే అతి గొప్ప విజయం .

జీవితం లో మరే గమ్యమూ ,   దీని కంటే గొప్ప గమ్యం కాదు. 

కానీ - మన జీవితాల్లో, కొన్ని సాధారణ గమ్యాలు వుండనే వుంటాయి .

ప్రేమ, పెళ్లి , భార్య , భర్త, పిల్లలు, చదువులు, ఉద్యోగాలూ, సంపాదనలు, ఆటలు, స్నేహాలు, రోగాలు , యవ్వనము , మధ్య వయస్సు . ముసలితనము , చావులు -  యివన్నీ సాధారణ గమ్యాలకు సంబంధించిన విషయాలు .  వీటిని తప్పించుకుని  మనం వుండ గలమా ?

యివి వొద్దని ఎలా చెప్పగలం ? యివి వుండనే వుంటాయి , మన సాధారణ జీవితాల్లో . 

బాల్యము , కౌమారము, గార్హస్థ్యము , ముసలితనము అన్నీ వున్నాయి మనకు . ఆయా జీవిత కాలాలకు తగిన వ్యాపకాలూ వున్నాయి

శంకరాచార్యులు చాలా సందేహ రహితంగా అన్నారు - బాలస్తావః క్రీడాసక్తః ; తరుణస్తావః   తరుణీసక్తః; వృద్ధస్తావః చింతాసక్తః ;పరే బ్రాహ్మణి కోపిన సక్తః.  యిది మన అందరికీ వర్తిస్తుంది .

చిన్నతనంలో గోలీలతో ఆడుకుంటారు . చిన్న చిన్న రాళ్ళను దాచుకుంటారు . మరి యవ్వనం వస్తే , ఈ యిష్టాలన్నీ పోతాయి. క్రొత్త ఇష్టాలు వస్తాయి.  స్త్రీల వెంట  పురుషులూ, వీరి వెంట వారూ  లవ్వో,లవ్వో  అంటూ పోతారు . అది కొన్నాళ్ళే . ఆ తరువాత, అందరి అమర ప్రేమలు మరో రకంగా మారిపోతాయి . 

పిల్లలూ , వారి చదువులూ , వారు పెరగడమూ , మనం ముసలివారవడం , అప్పుడు వచ్చే చింతలు ఎన్నో , ఎన్నెన్నో. అవీ తమకు అనవసరమైన చింతలు; అందుకే  - మనవారు, వానప్రస్థము , సన్యాసము లాంటి  నియమాలు, ఆశ్రమాలు  ఏర్పరిచారు - ఎవరికీ కష్టం లేకుండా .

వయసు పెరిగే కొద్దీ - మనం ఎవరో , మన అసలు, సిసలు  గమ్యం  ఏదో తెలుసుకోవాలి . అందులో వుండే ఆనందం అర్థం చేసుకోవాలి . 

గృహస్తాశ్రమం లో భార్య, భర్త - వొకరిపై వొకరికి అనురాగం ; వొకరికి వొకరు ప్రాణం గా వుండడం ; పిల్లలను కనడం ; వారిని అపురూపంగా , ప్రేమగా పెంచడం ; వుద్యోగాలు , వ్యాపారాలు - యివన్నీ వుండనే  వుంటాయి . వొక వయస్సులో - వుద్యోగాలు , వ్యాపారాలు పిల్లలకు వదిలేసి , భార్యాభర్తలు వొకరినొకరు బాగా చూసుకోవలసిన ఆశ్రమం, దేవుడా అని కొంతైనా అనుకోవలసిన ఆశ్రమం వానప్రస్థం. ఈ రోజుల్లో  యిది మానసికంగా  చెయ్య గలమే కానీ , ముందులా - అరణ్యాలకు పోలేం కదా . అందుకే  పాపం వృద్ధాశ్రమాలు  వస్తున్నాయి. కానీ యివి రావడం, పిల్లల బాధ్యతా రాహిత్యం వలన, మరెన్నో కారణాల వలన రావడం దురదృష్టకరం .

ఈ ఆట ప్రతి వొక్కరి జీవితాల్లో - దాదాపు యిదే రకంగా , చర్విత చర్వణం గా జరుగుతూ వుంది .

బాలస్తావః క్రీడాసక్తః ; తరుణస్తావః   తరుణీసక్తః; వృద్ధస్తావః చింతాసక్తః ;పరే బ్రహ్మణి కోపిన సక్తః.  యివన్నీ , పెరిగే కొద్దీ , మనలో, శారీరకం గా, మానసికంగా, సహజ సిద్ధంగా  జరిగే మార్పులు. అంటే, ప్రకృతి మన శరీరానికి, మనస్సుకు, ముక్కుత్రాడు వేసి లాక్కు పోతూ వుంటే - మనమూ దాని వెంట అలాగే  వెళ్లి పోతూ వున్నామన్న మాట . 

దీన్ని దాటి, ముందుగా, మున్ముందు జరిగేది కూడా తెలుసుకున్న వారు ఎవరు?

ఆట కదరా శివా; ఆట కదా కేశవా - అని, సాక్షీభావంతో - ద్రష్టగా ఈ జగన్నాటకాన్ని -  ఆనందంగా చూస్తూ, ఆడుతూ వుండ గలిగే వారెందరు? 

కృష్ణుడూ - ఈ నాటకం ఆడాడు , కానీ ద్రష్టగా . అయితే , కృష్ణుడు ఈ ఆట ఆడినంత తన్మయంగా, ఆనందంగా , "ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడుతూ , ఆ పనులు చేస్తూ" తమ తమ పాత్రలలో అంత బాగా లీనమై న వారు  అప్పుడూ లేరు ; యిప్పుడూ లేరు. అంటే, మన పాత్రను మనం ఆనందిస్తూ కూడా , అందులో లీనమై కూడా - ద్రష్టగానూ  వుండొచ్చు , అలా వుండాలని మనకు చెప్పిన వాడు కృష్ణుడు .

కృష్ణుడిలో - కామ,క్రోధ, లోభ, మోహ, మద, మాత్స్యర్య, భయాలు లేవు. కానీ అమితమైన వాత్సల్యం వుంది , ప్రేమ వుంది . కరుణ వుంది . శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ రెండూ చేశాడు . 16 వేల మంది గోపికలు , ఆ నీల మేఘ శ్యాముడి వెనుక బడ్డారు. పైగా 8 మంది భార్యలు కూడా . అందరూ ఆయన భక్తులే . అందరికీ ప్రేమను పంచాడు . ఆయన లో అశక్తత, అధైర్యం లేదు. దుష్ట శిక్షణ తానూ చేశాడు . పాండవుల ద్వారానూ చేయించాడు . కృష్ణుడి జీవితాన్ని మనసులో వుంచుకునే - మనం భగవద్ గీతను  చదవాల్సి వుంటుంది ; అర్థం చేసుకోవాల్సి వుంటుంది. జీవితాన్నుండి  పారి పొమ్మని కృష్ణుడెప్పుడూ  చెప్పలేదు .

ఈ ఆట ఆడాల్సిందే. ఆనందంగా, సమర్థ వంతంగా ఆడాలి. వోటమికి క్రుంగి పోవడం, పారిపోవడం మన పాత్ర కు  న్యాయం చేసినట్టు కాదు. మళ్ళీ ఆడాలి .

"వొక్కొక్క  రోజూ కొత్త ఆటే. ఈ రోజు ఆట మీరు బాగా ఆడారా - అన్నదే ప్రశ్న. ఈ రోజు మీరు సంతోషంగా వున్నారా? ఎంత మందిని మీరు సంతోష పెట్టారు? నిన్నటి కంటే ఈ రోజు - క్రొత్తగా ఏం నేర్చుకున్నారు? ఏ విధంగా మీరు నిన్నటి కంటే బాగు పడ్డారు?  మీకు మీ గమ్యం జ్ఞాపకం వుందా? అటువైపే వెడుతున్నారా? మీరు ఈ రోజు చేసిన పనుల కంటే భిన్నంగా, గొప్పగా మరేదైనా చేసి వుండ వచ్చునా? వుంటే అది రేపు చేస్తారా? ఈ రోజు ఎవరికి సహాయ పడ్డారు? ఈ రోజంతా మీలో వచ్చిన భావనలు, ఆలోచనలు - సకారాత్మకమైనవా, నకారాత్మకమైనవా ? రేపంతా మీరు సకారాత్మకం గానూ , ఆనందం గానూ వుండాలంటే  చెయ్యాలి? "

వొక్క 5 నిమిషాలు - కళ్ళు మూసుకుని (TV కి దూరంగా) ఈ రోజు మీరు ఆడిన - మీ ఆట గురించి ఈ ప్రశ్నలు వేసి నిజమైన సమాధానాలు మీరు వెతుక్కుంటే - నిజమైన ద్రష్టగా మీరు మారిపోతారు.

మీకు యిష్టమైతే 10 నిమిషాలు గానీ , అంత కంటే ఎక్కువ కానీ ఈ ప్రక్రియ చేసుకోవచ్చు. మీకు నిజమైన , స్వచ్చమైన ఆనందం - అప్పుడే వస్తుంది.

 ఎందుకంటారా ?

ఆ పది నిమిషాల తరువాత - మీరే  "ఆనందం " గా మారిపోతారు గనుక .

లోపలున్న చెత్తంతా పొతే, మీరే ఆనందం . అదే యోగం . అదే సాధన . అంతే .

చాలా సులభమైన విషయం యిది. ప్రతి 24 గంటలలో - 5-10 నిమిషాల కృషి తో యిది సాధించదగిన విషయం. సాధించ వలసిన విజయం.

మీ మనసుపైన మీరు సాధించే విజయం యిది .

చేస్తారా మరి .

= మీ

వుప్పలధడియం విజయమోహన్




14, సెప్టెంబర్ 2014, ఆదివారం

నాకు నచ్చిన 10 మంది ఎవరు? - నాలిస్టు లో 8 మందే ! - మరి మీ సలహా ?


నాకు నచ్చిన 10 మంది

"మన దేశం" లో నాకు బాగా నచ్చిన 10 మంది వ్యక్తుల పేర్లునచ్చిన  క్రమంలో నేను రాయగలనా ? ఏమో! వెంటనే  చెప్పలేక పోతున్నాను.

కానీ అసలు నాకు బాగా తెలిసి వుండాల్సిన  లిస్టు గా యిది. మన దేశంలో నాకు బాగా నచ్చిన వాళ్ళు కనీసం పది మంది వున్నారా, లేదా వుంటే,వాళ్ళెవరు ? ఎందుకు నచ్చారు ? యిది నాకు  తెలియాలా,వద్దా ?

నచ్చని వాళ్ళ లిస్టు అక్కర లేదు. అది చాంతాడంత వుండొచ్చు ; హనుమంతుడి  తోకంత  వుండొచ్చుయింకా పెద్దగానూ వుండొచ్చు . ఆ లిస్టు వొద్దు లెండి .

కానీ నచ్చిన వాళ్ళ పేర్లు చెప్పుకోవడం లో మనకు పెద్ద శ్రమనో , ప్రమాదమో లేదు కదా .

అది తెలుసుకోవడానికి కాస్త ప్రయత్నం చేస్తా .

1. మహాత్మా గాంధీ : - గాంధీ గారు నాకు బాగా నచ్చారు . సత్యము, అహింస తో ఎన్నెన్ని సాధించ వచ్చునో - ఆయన తన జీవితం ద్వారా నిరూపించారు . ప్రపంచానికే మార్గ దర్శకుడైన  గాంధీ మనకు నచ్చకపోవడం ఎలా? నాకు ఆయన చాలా బాగా నచ్చాడు . ఆయన  రాసిన ఆత్మకథ లాంటి పుస్తకం మరొక్కటి "నభూతో న భవిష్యతి".  తన తప్పులను ఏవీ దాచుకోలేదాయన.  అలా మరెవ్వరూ చెప్పలేరు.  ఆయన జీవితంలోని సంఘటనలు చదివే , మేమూ, 55 ఏళ్ళ క్రితం , మా వూళ్ళో , మా యింట్లో , లెట్రిన్ కు మా స్వహస్తాలతో గోడలు కట్టి దాన్ని శుద్ధి చేసి , కాస్త గర్వం గా కూడా  అనుభూతి చెందాము.  కుష్టు రోగులకు స్వహస్తాలతో మందు రాయడం, వాళ్ళను బాగా చూసుకోవడం లాంటి పనులు - అప్పుడు కానీ, యిప్పుడు కానీగాంధీ తప్ప మన నాయకులెవరూ చెయ్యలేదు . గాంధీ గారిని గురించి ఎంతో చెప్పొచ్చు .కానీ , మమ్మల్ని, చిన్నతనం నుండీ ఆయన జీవితం బాగా ప్రభావితం చేసింది కనుక యీలిస్టు లో మొదట ఆయన పేరు రాస్తున్నా - ఆయన యిప్పుడు లేక పోయినా . ఆధునిక యుగంలో, మన 21 వ శతాబ్దంలో, గాంధీ చాలా గొప్ప యోగి, అభ్యుదయ వాది, మానవతా వాది అని నా ప్రగాఢ  నమ్మకం . నా ఈ లిస్టులో యిప్పుడు లేని వారి పేర్లు - గాంధీ తప్ప - మరెవరిదీ రాయను . ఎందుకంటే - భూతకాలంలో ఎంతో మంది గొప్ప వారు వుండవచ్చు . కానీ , ఈ రోజు సజీవంగా , మన మధ్య వుండి, మన మధ్య , మానవ కల్యాణానికి కృషి చేస్తున్న వారు ఎవరు , వారిలో నాకెవరు నచ్చారు - అన్నదే నా ఆలోచన

2. నరేంద్ర మోడీ :-  మన యిప్పటి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నాకు బాగా నచ్చారు . లంచగొండితనానికి   ఆయన చాలా, చాలా దూరం .  చెప్పే పని చెయ్యడం , చేసే పని చెప్పడం - ఆయన ప్రత్యేకత. ఆయన్ను గురించి చెడ్డగా మాట్లాడే వారు తాము చెప్పుకో గలిగే పనులేం చెయ్య లేదు . మోడీ గారు చాలా, చాలా మంచి పనులు, గొప్ప పనులు చేశారు; చేస్తున్నారు. మద్య పాన నిషేధం వున్న వొకే వొక రాష్ట్రం గుజరాత్ . ఆ రాష్ట్రంలో  రోడ్లు, నీరు, విద్యుత్తు -పుష్కలంగా వుండేట్టు చేసిన ఘనత ఆయనది . మన రాష్ట్రాలలో, మద్యం నుండి వొచ్చే పన్ను యొక్క ఆదాయమే చాలా ఎక్కువ .   ఆదాయం ఎక్కువ అయినా రోడ్లు లేవు, నీళ్ళు లేవు, విద్యుత్తూ లేదు మనకు.   మద్య పానం మన రాష్ట్రాలలో వుంది గనుక, నేరాలు ఘోరాలు అక్కడికంటే యిక్కడ ఎక్కువ.  కాక పొతే అక్కడ వొక్క నేరం జరిగినా  వెంటనే తెలిసిపోతుంది.  మిగతా రాష్ట్రాలలో వంద నేరాలకు వొక్కటి పైకొస్తే  ఎక్కువ.  మోడీ గారి మాటలలో, ఎప్పుడూ "నూరు  శాతం ప్రజల" అభివృద్ధి వుంటుంది.   మిగతా వారి మాటలలో - ఏదో వొక వోట్  బాంక్  ను గురించే వుంటుంది ఎప్పుడూ.  మోడీ గారి చేతలూ అంతే.   సర్వే  జనాః సుఖినోభవంతు - అనేటట్టే  వుంటుంది.  ఆయన నేతృత్వం కొనసాగితే - 10 ఏళ్ళలో మన దేశం - అన్ని దేశాల్లో ప్రథమ స్థానంలో వుంటుందన్న  విషయంలో, నాకైతే సందేహం లేదు.   మోడీని గురించి చాలా చెప్పొచ్చు . వారి విషయం లో నా ఆశ  వొక్కటే . BJP లోని వారూ, RSS  లాంటి అనుబంధ సంస్థల్లోని వారూ కూడా, మోడీ లాగా, సర్వే జనాః సుఖినో భవంతు - అని మనసా, వాచా కర్మణా - అనుకోగలగాలి.  మోడీ మార్గంలో వాళ్ళు వెళ్ళాలి. మోడీ నేతృత్వం లో వారు మసలుకోవాలి . అలా జరగాలని ఆశిద్దాం . 

3. సద్గురు జగ్గి వాసుదేవ్ :- ఈయన తమిళనాడులో , ముఖ్యంగా, యువతలో , వొక పెద్ద విప్లవమే తెచ్చాడు . దేవుడు లేడు , వద్దు - అనే  రాజకీయాలు వున్న తమిళనాడు  రాష్ట్రంలో , దాదాపు కోటి మంది ఈయన శిష్యులు గా మారిపోయారు . వారి అందరి జీవితాలలో అనూహ్యమైన మార్పు రావడం నేను చూశాను.  ప్రతి యింటిలోను , "యోగ" అనే జ్యోతి వెలగాలని , ఈయన చేస్తున్న కృషి అపారం . నిరుపమానం .  యిదే కాక, విద్యారంగంలోనూ , పర్యావరణ రంగంలోనూ  ఈయన కృషి తమిళనాడులో ప్రథమ స్థానంలో వుందని నా నమ్మకం . ముఖ్యంగా , తమిళనాడు  లోని యువతను, కుల మతాలకు అతీతంగా , ఏకం చేయడానికి ఈయన చేసినంత, చేస్తున్నంత  సకారాత్మక సేవ మరెవరూ చెయ్యలేదని నా నమ్మకం.  ఈయన ఆంగ్లంలో - చాలా సహేతుకంగా, అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడడంలో చాలా  దిట్ట . ఈయన మాట్లాడే తమిళం వొక ప్రత్యేక యాసలో వున్నా - అందరికీ నచ్చింది . మన దైనందిన సమస్యలకు ఈయన యిచ్చే సలహాలు చాలా బాగా వుంటాయి . అందరికీ చాలా బాగా నచ్చుతాయి . 

4. శ్రీ శ్రీ రవిశంకర్ (గురూజీ ) :- ఈయనా సద్గురు జగ్గి వాసుదేవ్ లాగా - యోగా, విద్య, లాంటి అనేక రంగాల్లో - యివతపై తమ అపార ప్రభావాన్ని చూపుతున్న వారే. సేవ, ప్రేమ , సహనం  లాంటి వున్నత విలువలను ఈయన ప్రపంచం అంతటా - కుల, మత, దేశ, రంగు , లాంటి అన్ని విభేదాలనూ   దాటి - విశ్వ మానవ ఐక్యత ను ప్రబోధిస్తున్న వారు  ఈయన. ఈయన శిష్యులూ కోట్ల సంఖ్యలో ప్రపంచమంతటా  వున్నారు. ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ వుండే ఈయన స్థాపించిన "ఆర్ట్ ఆఫ్ లివింగ్ " సంస్థలు 152 దేశాలలో వున్నాయి . ఈ సంస్థ నెలకొల్పిన గిన్నిస్  రికార్డులు చాలా వున్నాయి . సద్గురు జగ్గి లాగానే , మన దైనందిన సమస్యలకు శ్రీ శ్రీ గారు యిచ్చే సలహాలు చాలా బాగా వుంటాయి . అందరికీ చాలా బాగా నచ్చుతాయి . "జ్ఞాని " అన్న పదం వీరిరువురికీ బాగా వొప్పుతుంది.  

5. బ్రహ్మకుమారి శివాని :- ఈమె సంభాషణలు "పీస్  ఆఫ్ మైండ్ " అనే టీవీ  చానెల్ (బ్రహ్మ కుమారి సంస్థదే) లోనూ, మరెన్నో చానెళ్ళ లోనూ (ఆస్థా , సంస్కార్ ) ప్రతి దినమూ వస్తూ వుంటుంది . నిత్య జీవితంలోని అనేకానేక సమస్యలకు యీమె సమాధానాలు చాలా చక్కగా, సహేతుకంగా వుంటాయి.  బ్రహ్మ కుమారి సంస్థ పేరు ప్రతిష్టలు చాలా బాగా పెరగడానికి, యీమె కూడా వొక కారణమని తప్పక చెప్ప వచ్చు . ఇవి తెలుగులోనూ తర్జుమా అయితే  చాలా బాగుంటుంది . చిన్న వయసులోనే , యింత విజ్ఞానం  వెదజల్లుతున్న  యీమె కృషి చాలా ప్రశంసనీయం. ఆత్మ , పరమాత్మ లాంటి విషయాల్లో  నేను శివాని గారి భాషణలు పెద్దగా పట్టించుకోను . ఆ విషయాలు నేర్చుకోవాలంటే - శాస్త్ర జ్ఞానం అపారంగా వున్న వారు చాలామంది వున్నారు. కానీ - సామాజిక సమస్యల విషయాల్లో , దైనందిన మానవ సమస్యల విషయాల్లో , మిగతా వారి కంటే - శివాని గారి భాషణలు  నాకు చాలా బాగా నచ్చుతాయి . ఆమె చెప్పేవన్నీ మనం సులభంగా చెయ్య గలిగేవి; చెయ్యవలసినవి. మనకు ఎంతో ఉపయోగ పడేవి . 

6. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు :-  తెలుగులో  ప్రవచన కర్తలలో - ఈయన మొదటి వారు  - అని అందరూ వొప్పుకోక తప్పదు . సరస్వతీ పుత్రుడు - అనిపించే ఈయనకుసంస్కృత,ఆంధ్ర భాషలు - రెండింటి  లోనూ  వున్న  పాండిత్యము , సాహితీ ప్రకర్షధారణా  శక్తి, సమయోచిత ప్రజ్ఞ , అపారము.  హైందవ విలువలను గురించి ఈయన చెప్ప గలిగే తీరు అసమానం . వొక్కో సారి ఆది శంకరుల వారు మన విలువలను మళ్ళీ మనకు చెప్పడానికి ఈయనను పంపించాడా  అని - అనిపిస్తూ వుంటుంది నాకు. ఈయనది పూర్తిగా శాస్త్ర విశ్లేషణ . శాస్త్రంలో వున్నది తప్ప నేను మరేదీ చెప్పనంటారాయన . బ్రహ్మకుమారి శివాని గారిది పూర్తిగా సామాజిక, మానసిక  విశ్లేషణ . సామాజిక, మానసిక  విశ్లేషణ లో శివాని గారిది , శాస్త్రీయ విశ్లేషణలో  చాగంటి గారిది - భాషణలు  అద్వితీయం గా, ఆహ్లాద కరంగా, చాలా విజ్ఞాన దాయకంగా వుంటాయి.

7. S.P. బాలసుబ్రమణ్యం :- సంగీతానికి సేవ చేసిన వారు చాలా మంది వున్నారు . కానీ, తెలుగులో , సంగీతానికి యింత సేవ చేసిన వారు ఈయన వొక్కరే అని - నాకు అనిపిస్తుంది . తెలుగు యువతలో , పిల్లలలో - సంగీతం పట్ల యింత అభిరుచిని  సృష్టించిన  వారు బాలు వొక్కరే - అని చెప్పక తప్పదు. పాడటం గొప్ప. పాడించడం అంతకంటే  గొప్ప. మన రాష్ట్రంలో, లక్షలాది మందిలో , కేవలం సంగీతం వినటమే గాక , పాడటం పట్ల ఆసక్తి యింతగా పెంచిన వారిలో SP బాలు వొక్క ఎవరెస్టు శిఖరం లాంటి వాడు అని చెప్ప వచ్చు . పాడటంలో ఆయన కంటే గొప్ప వారు ముందు వుండి వుండ వచ్చు. యిక ముందూ  రావచ్చు. కానీ , నేనూ పాడాలి - అన్న ఆసక్తి లక్షల మందిలో కలిగించి , ఎలా పాడాలి అన్నది వారికి నేర్పిస్తూ , మంచి  సంగీతం వినాలి అన్న ఆసక్తి కోట్ల మందిలో కలిగించిన ఘనత బాలూ గారిదే. సహజంగా, సరళంగా, సున్నితంగా, మనసును ఆకట్టుకునేలా మాట్లాడడం , అందులోనే అత్యంత ప్రయోజన కరమైన సలహాలనూ యివ్వడం - బాలూ ప్రత్యేకత . 

8.  బాబా రాందేవ్ :- ఈయన రాజకీయాలు  మనకు  నచ్చ వచ్చు ; నచ్చక పోవచ్చు . కానీ, యోగ శిక్షణ కోసం ప్రజల మధ్య ఈయన చేసినంత కృషి మరెవరూ చెయ్య లేదని నా విశ్వాసం . యోగా గురువులలో - అన్ని ప్రక్రియలూ "తానుగా" చేసి చూపిస్తూ , దాన్ని విశ్లేషిస్తూ , అలా చెయ్యమని - ఉత్సాహపరిచే గురువులు చాలా అరుదు. అందులో ప్రథముడుగా బాబా రాందేవ్ ను చెప్పుకోవచ్చు. ఆయన యోగా శిబీర్ కు నేనూ వెళ్లాను . వారం పాటు శిక్షణ పొందాను . అలాగే - నేను సద్గురు జగ్గి గారి యోగా శిక్షణనూ , శ్రీ శ్రీ గారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షణ నూ కూడా పొందాను. యిప్పుడు అవన్నీ కలిపే సాధన చేస్తాను . నాకు అందరూ గురువులే . కానీ, రాందేవ్ గారి యోగా ప్రక్రియలు - ఆరోగ్యానికి అత్యంత సులభకరమైన , ప్రయోజన కరమైన ప్రక్రియలు అని నాకు అనిపిస్తుంది . అయితే - జగ్గి గారి శిక్షణ మరో రకంగా ఉన్నతమైనది; శ్రీ శ్రీ  గారి శిక్షణ మరో రకంగా . దేని కదే గొప్ప . బాబా  రాందేవ్ కృషి - ఆయుర్వేదం విషయంలో చాలా చాలా ప్రశంసనీయం . యిప్పుడు మా యింట్లో - చాలా వరకూ , మేము ఆయుర్వేద మందులే వాడతాం . అందులోనూ రాందేవ్ గారి పతంజలి యోగ చికిత్సాలయ్ మందులే ఎక్కువ . మిగతావి కూడా ఆయుర్వేద మందులు ఎక్కువ వాడతాము.  మేమే కాదు . లక్షలాది కుటుంబాల్లో అల్లోపతీ కంటే - ఆయుర్వేదం  ఎక్కువగా  వాడుతున్నారు యిప్పుడు . యోగా + ఆయుర్వేదం కలిస్తే  ఆరోగ్యం చక్కగా వుంటుందనడంలో నాకు సందేహం లేదు . రాందేవ్ గారి కృషి ఈ విషయంలో చాలా ప్రశంసనీయం .


నాకు పది మంది పేర్లు కావాలి . వాళ్ళు నన్నూ ప్రభావితం చేసి వుండాలి . దేశాన్నీ(లేదా రాష్ట్రాన్ని) బాగా  ప్రభావితం చేసి వుండాలి. ఇప్పుడు మన మధ్య వుండాలి. ఈ మూడు నిబంధనలూ - పై 8 మంది కే సరిపోయాయి. నేను చనిపోయిన మహాత్ముల గురించి మాట్లాడడం లేదు. వారిలో ఎందరో వున్నారు . పై ఎనిమిది మంది కంటే కూడా గొప్ప వారు వున్నారు . 

 ఇప్పుడున్న వారిలో గొప్ప వారు వున్నారు. మన పాత ప్రెసిడెంటు అయిన డాక్టర్ అబ్దుల్ కలాం గారు , మన ముఖ్య మంత్రి చంద్ర బాబు గారు నాకు బాగా నచ్చిన వారే . అయినా - వారి జీవితం నన్నెలా ప్రభావితం చేసింది - అనుకుంటే - నాకు సమాధానం దొరక లేదు. మాకు వేదాంతం నూరి పోసిన గురువు గారు స్వామి  పరమార్థానంద. ఆయన గొప్ప వారే. ఆయన స్వామీ దయానంద ముఖ్య శిష్యులలో వొకరు. అయితే - ఆయన దేశాన్ని ఎంత ప్రభావితం చేశారు అనుకుంటే - నాకు సమాధానం దొరక లేదు. 

త్వరలో - నాకు మరిద్దరు గొప్ప వాళ్ళు -  నన్నూ , దేశాన్నీ ప్రభావితం చేసే వాళ్ళు - దొరుకుతారని నేను ఆశిస్తున్నాను . 

ఇందులో పాఠకులు అయిన మీరు, నాకు - మీ సలహాలు కూడా యివ్వ గలిగితే , మీకు నచ్చిన వాళ్ళను గురించి చెబితే , చాలా సంతోషిస్తాను . కృతజ్ఞతతో మీ సలహాలను స్వీకరిస్తాను .

= మీ 

వుప్పలధడియం విజయమోహన్