20, నవంబర్ 2014, గురువారం

ఏ రోగమయినా నయం అవుతుంది - ఎలా ? - మీరేం చెయ్యాలి? - డాక్టర్లు ఏం చెయ్యాలి ?



వ్యాధులూ - మనమూ


మన దేశం లో - రక రకాల రోగాలు చాలా పెరిగి పోతున్నాయి .

కొన్ని దీర్ఘ కాలిక రోగాలు . కొన్ని మందుల్లేని రోగాలు . కొన్ని మరణం తప్పదనిపించే రోగాలు . కొన్ని  మందులతో నయమయ్యే రోగాలు . కొన్ని సర్జరీ అవసరమైనవి . కొన్ని సర్జరీ  అవసరం లేనివి .  యిలా రోగాలు ఎన్ని రకాలో . ఎన్నెన్ని రకాలో . 

పుట్టిన బిడ్డ నుండి ,  వంద ఏళ్ళ వారి వరకు  అందరికీ రోగాలే .


ఎయిడ్స్ పెద్ద రోగం  అనుకుంటే , కాదు నేనున్నాను అంటూ - ఎబోలా వస్తూ వుంది . కాన్సర్ అంటే పెద్ద భయం యిప్పటికీ అందరికీ వుంది. చర్మ రోగాలు ప్రమాద కరం కాకున్నా, చాలా వాటికి సరైన మందులు లేవు . పిచ్చికుక్క కాటుకు కూడా యిప్పటికీ సరైన వైద్యం లేదు . కరిచిన ఘంట లోగా ఇంజక్షన్లు వేసుకుంటే చాలా మంచిది  .  మనకు వచ్చే మానసిక రోగాలూ ఎన్నో, ఎన్నెన్నో . వాటికీ సరైన వైద్యాలు లేవు .
యిలా వుంటే ఎలా ?

"రాకుండా చూసుకోవడం "  ,  "నయం చేసుకోవడం" కంటే ఎంతో మేలు ; ఎంతో సులభం - అన్న నానుడి వుండనే వుంది .  అది నిజమే .  కాకుంటే - రాకుండా చూసుకోవడం ఎలా ? అది తెలిసి చావాలి కదా . ఏ రోగమూ రాకుండా ఎలా చూసుకోవడం ?

యేవో కొన్ని ముందు జాగ్రత్తలు చేసుకోవచ్చు . చేసుకుంటే కొంత మేలు .

ఏం చేసుకోవచ్చు ?

(1) దోమలు, ఈగలు , బొద్దింకలు లాంటి రోగవాహక , క్రిమి వాహక జీవులు  - యిళ్ళలో , యిళ్ళ దగ్గర లేకుండా జాగ్రత్త పడ వచ్చు . ముఖ్యంగా మురుగు నీరు వుండకూడదు . అక్కడే రోగవాహక , క్రిమి వాహక జీవులు పెరుగుతాయి .

(2) ఆహారము, విహారము , చేసే పనులు, నిద్ర, మేలుకునే సమయం - అన్నీ, మితంగా , మనకు తగినవిగా వుండాలన్నాడు - గీతలో శ్రీ కృష్ణుడు. నేను ఫాస్ట్ ఫుడ్స్  తింటాను . ఎంత  సేపైనా నిద్ర పోతాను; ఎంత సేపైనా మేలుకుంటాను . శరీర వ్యాయామం అసలు చేయను .  లేదా,దినమంతా వ్యాయామం చేస్తాను - యిలా ఏదైనా సరే , 'అమితం' గా చేసే వారికి ఆరోగ్యమూ వుండదు . సంతోషమూ వుండదు .

(3) యింట్లో - చెత్త , దుమ్ము - లాంటివి లేకుండా చూసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది .

(3) ఇలాగే , మానసిక ప్రవృత్తులు కూడా కొన్ని నియమిత పరిధులలో వుంటే - ఆరోగ్యమూ వుంటుంది ; ఆనందమూ వుంటుంది .  మితి మీరిన పోకడలు పొతే , మానసిక ఆరోగ్యము చెడుతుంది ; తన కోపమె తన శత్రువు , తన శాంతమె తనకు రక్ష , దయ చుట్టంబౌ , తన సంతోషమే స్వర్గము , తన దుఃఖమే నరకమండ్రు  తథ్యము సుమతీ ! అన్నది పెద్దల సలహా . యిది వెయ్యేళ్ళు  పోయినా - మన మానసిక ఆరోగ్యానికి సూత్రం గా నిలబడుతుంది . నోరు నెమ్మదైతే , వూరు నెమ్మదౌతుంది.  యిదీ పెద్దలు చెప్పినదే, వేల సంవత్సరాల అనుభవానికి యివి ప్రతీకలు , ఫలితాలు . వీటిని పాటించక పొతే - మనకే నష్టం . నేను నిష్కర్ష గా మాట్లాడుతాను - అనే వారెవ్వరూ , ఎదుటి వారు తమ గురించి నిష్కర్ష గా మాట్లాడితే  విన లేరు . నిజాలు కూడా , చెప్పాల్సిన విధం వుంది . అది నేర్చుకోవాలి . వీటి వల్ల ఆరోగ్యం ఎలా వస్తుంది ? తప్పకుండా వస్తుంది . ప్రశాంతం గా, సంతోషంగా వుండే వారికి, రోగాలు రావడం చాలా తక్కువ . వచ్చినా - త్వరగా తగ్గిపోతాయి . యిది, నా, మన, అందరి  జీవితానుభవమే కదా !

రోగాలు రాకుండా చేసుకోవడానికి యిలా ఎన్నో మౌలిక సూత్రాలు వున్నాయి . ఇవి మనం  పాటించాలి .

సరే . రోగాలు వచ్చేశాయి . యిప్పుడేం  చెయ్యడం ?

ఉదాహరణకు - ఎవరికో కాన్సర్ వచ్చిందనుకోండి . చుట్టూ వున్న వాళ్ళు ఏం చెయ్యాలి ? కాన్సర్ వచ్చిన వాళ్ళు ఏం చెయ్యాలి ? డాక్టర్లు ఏం చెయ్యాలి ?

ఇలాంటి రోగాల్లో - రోగం సగం . భయం సగం గా వుంటుంది . నిజానికి భయం , వైద్యం పైన అపనమ్మకం అనే 2 అంశాలు - రోగానికంటే  ఎక్కువగా రోగిని బాధ పెడుతూ వుంటుంది . మొదట యివి పోవాలి . డాక్టర్లు మొట్ట మొదట ఇవ్వాల్సింది  నమ్మకం , ధైర్యం . ఎంతో మంది డాక్టర్లు , చాలా రోగాల్లో - యివి యివ్వడం లేదు.  మేం చేసేదంతా చేస్తాం ; ఆపై దేవుడి దయ ; మీ అదృష్టం - లాంటి మాటలు అంటూ వుంటారు . యిది చాలా తప్పు .

డాక్టర్లు నమ్మకం యివ్వాలి . ధైర్యం యివ్వాలి . అదే వారిచ్చే గొప్ప ఔషధం . దేవుడి దయ, అదృష్టం ఎలా వుంటాయో  ఎవరికీ తెలీదు. రోగికి ముందు డాక్టరే పోవచ్చు . లేదా రోగి పోవచ్చు . మనకు తెలీని ఇలాంటి విషయాల గురించి కాదు . డాక్టర్ తను చేసే వైద్యం లో ప్ర ప్రథమం గా నమ్మకం , ధైర్యం యివ్వడం వుండాలి . నిజమైన పరిస్థితి చుట్టాలకు  చెప్ప వచ్చు . కానీ , రోగికి మాత్రం నమ్మకం , ధైర్యం కలిగించాలి . నా వుద్దేశంలో - డాక్టర్లు చెయ్య గలిగిన, చెయ్య వలసిన మొదటి వైద్యం యిదే .

నా అనుభవమే చెబుతాను . 5 ఏళ్ళ క్రితం నన్ను వొక పిచ్చి కుక్క వెనుక నుండి  వచ్చి కాలిపైన కొరికింది . అది పిచ్చి కుక్క అన్నది వెంటనే తెలిసిపోయింది కూడా . ఎందు కంటే , నన్ను కొరికి పరుగెత్తుకెళ్ళి , మరెంత మందినో కొరికింది. నేను వెంటనే నాకు బాగా తెలిసిన వొక డాక్టరు ఫ్రెండు కు ఫోన్ చేసి విషయం చెప్పి ఏం చెయ్యాలని అడిగాను . ఆమె చెప్పినట్టు - కొరికిన భాగాన్ని బాగా టాప్ క్రింద కడిగి (డెటాల్ తో కూడా) వెంటనే, వొక లోకల్ డాక్టర్ దగ్గరి కెళ్లి  ఆంటి రాబీస్ ఇంజక్షన్లు  వేయించుకున్నాను . ఆయన చెప్పినట్టు  చెప్పిన రోజుల్లో వెళ్లి మిగతా అన్ని యింజక్షన్ లూ  వేయించుకున్నాను. 

కానీ - నేను యిక ప్రమాదమేమీ లేదు కదా  - అని ఆయన్ను  అడిగితే, దాదాపు 3-4 నిముషాలు మౌనంగా వుండి , ఆ తరువాత , మిమ్మల్నిఆర్నెల్లలోగా మరో పిచ్చి కుక్క కొరికితే నేను వేసిన యివే ఇంజక్షన్లు పని చేస్తాయి - అన్నాడు . నేను అది సరే , మరో పిచ్చి కుక్క కరవడం అటుంచండి ; ఈ పిచ్చి కుక్క కాటుకు , మీరు చేసిన వైద్యం తరువాత  నాకు మరేమీ  ప్రమాదం లేదు కదా  - అని అడిగితే , మళ్ళీ అదే తంతు . కాస్సేపు మౌనం , మళ్ళీ, మరో పిచ్చి కుక్క కరవడం గురించే మాట్లాడుతున్నారాయన . ఇప్పటికే కరిచిన పిచ్చి కుక్కను గురించి మాట్లాడడం లేదు ఆయన . యిక లాభం లేదని , మరో ముగ్గురు  లోకల్ డాక్టర్ల  దగ్గరకెళ్ళి అడిగితే , అక్కడా యిదే తంతు . ఎందుకిలా ? ఆ తరువాత నేను ఇంటర్నెట్ లో చూశాను . అక్కడా సరిగ్గా యిదే పదాలు రాసుంది . యిదే చెబుతున్నారు ఆ డాక్టర్లు . ఆ తరువాత - దూరంలో వున్న నా ఫ్రెండు డాక్టరును అడిగాను . ఆమె చెప్పిన జవాబు నాకు సంతోషం కలిగించింది , ఆమె - "అన్నా! నేను  వారానికి కనీసం పది మందికి యివే ఇంజక్షన్లు వేస్తూనే వున్నాను . నేను పని చేస్తున్న చోట యిది మామూలు . యిప్పటికి కొన్ని వందల , వేల మందికి వేశాను . అందరూ బాగానే  వున్నారు . ఏ వొక్కరూ పోలేదు .  సరైన సమయానికి ఇంజక్షన్లు వేసుకుంటే  చాలు ; ఏ ప్రమాదమూ లేదు . మీరు యిక ఆ విషయం పూర్తిగా మరిచిపొండి . హాయిగా వుండండి . మీకు ఏ ప్రమాదమూ లేదు." అనింది .

ఈ మాటలు మిగతా వారు ఎందుకు చెప్పటం  లేదు?  వారు చేసే వైద్యం తరువాత కూడా , వొక్క శాతం కేసులు , లేదా 0. 1  శాతం కేసులు ఫెయిల్ అవ్వొచ్చు . కానీ , అడిగే పేషంటుకు ధైర్యం చెబితే ఏం పోతుంది. నా ఉద్దేశంలో వున్న వైద్యం చేసి, డాక్టరు పూర్తి ధైర్యం, నమ్మకం  యివ్వాలి . 0. 1  శాతం కేసులు ఏ రోగం లో అయినా ఫెయిల్ అవ్వొచ్చు . డాక్టర్ ధైర్యం , నమ్మకం యివ్వక పొతే , 0. 1 శాతం పదింతలు పెరిగే అవకాశం వుంది.   కుక్క కాటుకు పోకున్నా , మానసిక  అధైర్యం తో పొయ్యే అవకాశం వుంది .

కాన్సరైనా  అంతే . డాక్టర్లు పూర్తి ధైర్యం, నమ్మకం యివ్వాలి రోగికి . కాన్సర్ పూర్తిగా తగ్గి ఎన్నో దశాబ్దాలు ఆరోగ్యంగా వున్న వారు ఎంతో మంది వున్నారు..  చాలా మంది డాక్టర్లు , తగ్గొచ్చు , తగ్గక పోవచ్చు అన్న  విధంగా   మాట్లాడుతూ వుండడం  నేను చూశాను . రోగుల విషయంలో వారు - అంత సత్య హరిశ్చంద్రులుగా వుండడం చాలా తప్పు . సంస్కృతంలో  సత్యం గురించి గొప్ప నీతి వుంది . "సత్యం బ్రూయాత్ , ప్రియం బ్రూయాత్ , న బ్రూయాత్ సత్యమప్రియం ."  అంటే -  సత్యాన్ని చెప్పండి . ప్రియంగా వుండేటట్టు చెప్పండి . అప్రియంగా వుండేలా ఎలాంటి సత్యమూ చెప్పకండి .   యిలా ఎన్నో వున్నాయి . మీరు చెప్పే అబద్ధం వలన లోక హితం జరుగుతుందంటే - ఆ అబద్ధమే నిజం . ప్రకృతి కూడా , మీరు చెప్పింది , లోక హితం కోసం  అంటే , దాన్ని నిజం చెయ్యడానికి కృషి చేస్తుంది.

రోగి తనకు నయమవుతుందని నమ్మితే - అతని శరీరము , మనసు, అది నిజం చెయ్యడానికి పూర్తిగా సహకరిస్తాయి . ఆ నమ్మకం అబద్ధం కాదు . కానీ , తనకు నయం కాదని అతడు నమ్మితే , అది నిజమయ్యే ప్రమాదం చాలా వుంది - ఎంత మంచి మందులు యిచ్చినా . అందుకని డాక్టర్లు, రోగి యొక్క కుటుంబ సభ్యులు, అందరూ ,  అతనికి ఆ నమ్మకం పూర్తిగా కలిగించాలి .

నమ్మకం మొట్ట మొదటిదైనా - రోగం పోవడానికి , మందులూ తీసుకోవాలి . నా ఉద్దేశం లో - అల్లోపతి , ఆయుర్వేద - రెండూ బాగా పనిచేస్తాయి , చాలా రోగాలకు . అలాగే - హోమియోపతి వైద్యం కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎన్నో రోగాలకు . కానీ సర్జరీ కావాల్సిన చోట ,  కేమోథెరపీ కావాల్సిన చోట , యిలా మరి కొన్ని అధునాతన వైద్యాలకు - అలోపతీ వాడి తీరాల్సిందే . అయితే , యివి వాడుతున్నప్పుడు కూడా - ఎన్నో రకాల ఆయుర్వేద మందులు కూడా వాడవచ్చు . వుదాహరణకు - కాన్సరు పేషంట్లు ,  వీట్ గ్రాస్ జూస్  కానీ  వీట్ గ్రాస్ పౌడర్ కానీ వాడటం, వాటి వుపయోగం చాలా వుండడం నేను చూశాను .

అలాగే , హృద్రోగాలు రాకుండా వుండటానికి , వచ్చినవి ఎక్కువ కాకుండా వుండటానికి - అర్జున మాత్రలు, బాగా ఉపయోగ పడడం నేను చూశాను . బ్లడ్ ప్రెషర్ కు బాబా రామ్ దేవ్ గారి ముక్తావటి మాత్రలు బాగా ఉపయోగ పడటం - పూర్తిగా నయమవడం - నా ప్రత్యక్ష  అనుభవం . యిలా ఎన్నో రోగాలకు , అల్లోపతీ లో సరైన వైద్యం లేని రోగాలకు - ఆయుర్వేదం లో మంచి మందులున్నాయి .  కానీ, కొన్ని రోగాలకు అల్లోపతీ లోనే సరైన వైద్యం వుంది . రోగి - యివి రెండూ వాడితే - చాలా రోగాలు , చాలా త్వరగా నయమవడం నేను చూశాను . కానీ, అల్లోపతీ వైద్యులు యిది వొప్పుకోరు . కానీ, వారికే  యిటువంటి వ్యాధులు వచ్చినప్పుడు , ఆయుర్వేద మందులు వాడడం అన్ని దేశాల్లో జరుగుతూ వుంది . అది తమకు సత్ఫలితాలను యిచ్చినట్టు ఆ అల్లోపతీ వైద్యులు పుస్తకాలు కూడా రాశారు . యిది ఇంటర్నెట్ లో ఎంతో మంది అల్లోపతీ వైద్యులే రాయడం , చెప్పడం - మనం చూడొచ్చు.

ఆయుర్వేద వైద్య పధ్ధతి లో - రోగాలు రాకుండా చేసే వైద్య విధానాలు చాలా వున్నాయి . యివి మనం తెలుసుకోవాలి , పాటించాలి .

ప్రతి దినం  ఉదయం , రాత్రి - 15 నిముషాలు (కనీసం) యోగాసనాలు, ధ్యానం  చేస్తే - శారీరక , మానసిక ఆరోగ్యాలకు రెండింటికీ చాలా మంచిది. 

ధ్యానం ద్వారా  - ఏదైనా సాధించ వచ్చని  పతంజలి నొక్కి చెప్పారు . దురదృష్ట వశాత్తూ, ఈ రోజు - యోగా, ధ్యానం వీటిపైన అమెరికా లో వున్న నమ్మకం , మన దేశం లో లేకపోయింది . అక్కడ యోగా, ధ్యానం చేసే వారి సంఖ్య మన దేశం లో కంటే  చాలా ఎక్కువ .

మన టీవీ  చానెళ్ళలో - వీటిని గురించి ఏమీ తెలియకున్నా , హేళన గా మాట్లాడే మూర్ఖుల సంఖ్య  ఎక్కువగా వుంది . వారు చెప్పే దానికి తగినట్టు , వారికంటే  మూర్ఖులైన  దొంగ  స్వాములు , వారిని నమ్మే  అమాయక ప్రజలు కూడా ఎక్కువగానే  వున్నారు .

యోగా అన్నది మన దేశంలో వున్న అతి  గొప్ప సైన్స్ . అందులో  ధ్యానం అన్నది గొప్ప అంతర్భాగం . వీటి వుపయోగాలు అనంతం - అంటే ఏమీ అతిశయోక్తి కాదు .

నా అభిప్రాయంలో - మన దేశంలో  - డాక్టర్లు , రాజకీయ నాయకులు , మీడియా ప్రముఖులు - వీరికి మొట్ట మొదట - యోగా, ధ్యానం - వీటిలో శిక్షణ యివ్వాలి . డాక్టర్లు చాలా మంది నేర్చుకుంటూ వున్నారు . రాజకీయ నాయకులు , మీడియా ప్రముఖులు - వీరితోనే వచ్చిన చిక్కల్లా .  తమకు ఏ మాత్రమూ అనుభవం లేని ఈ విషయాల గురించి ఎంతో హేళనగా మాట్లాడుతూ వుంటారు . వారు యివి నేర్చుకుంటే - వారూ బాగు పడతారు ; దేశమూ బాగు పడుతుంది .

మీరు చెయ్య గలిగిన, చెయ్య వలసిన  విషయం వొకటి వుంది .

ప్రతి దినం - కనీసం 15 నిమిషాలు -   ధ్యానం చెయ్యండి . ఏ చిన్న, పెద్ద రోగం వున్నా , మీ ధ్యానం వల్ల , మీలో వున్న అపరిమిత నమ్మకం వల్ల , మీ రోగాలన్నీ పోతున్నట్టు , మీరు సంపూర్ణ ఆరోగ్య వంతులౌతున్నట్టు - నమ్మకం తో ధ్యానం చెయ్యండి .  మీ నమ్మకం నిజమౌతుంది. యిది - నా అనుభవం . నా చుట్టూ వున్న వారి అనుభవం . నాకు తెలిసిన ఎంతో మంది అనుభవం . అదే మీ అనుభవం అవుతుంది .

సర్వే జనాః సుఖినో భవంతు .

=  మీ

వుప్పలధడియం విజయమోహన్