27, ఫిబ్రవరి 2017, సోమవారం

భగవద్ గీత (11) - సాంఖ్య యోగము - 2.22,23 - దేహం ఉపయోగం ఎంత వరకు? ఆత్మజ్ఞానం ఉపయోగం ఎంత వరకు ?




 

భగవద్ గీత (11)


  

 రెండవ అధ్యాయము  

 సాంఖ్య యోగము 

 



భగవద్ గీత లో మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగాన్ని మొదటి మూడు వ్యాసాల్లో బాగా విశ్లేషించి అర్థం చేసుకున్నాం. నాలుగవ వ్యాసంలో అర్జునుడి సమర్పణ భావాన్ని, 'నా సమస్యకు నువ్వే సమాధానం చెప్పు, నేను నీ శిష్యుడిని' అన్న మాటలను విశదంగా పరిశీలించి ఆకళింపు చేసుకున్నాం


అయిదు నుండి పదవ వ్యాసం వరకు, శ్రీకృష్ణుడి వుపదేశంలో - దేహి, దేహాల మధ్య గల సంబంధము, తారతమ్యము, దేహి(ఆత్మ) యొక్క స్వరూపము, లక్షణాలు చూస్తూ వచ్చాము.  ఇప్పుడు, పదకొండవ వ్యాసంలో, సాంఖ్య యోగపు 22, 23 శ్లోకాలలో, శ్రీకృష్ణుడు యింకా ఏం  చెప్పబోతున్నాడో చూద్దాం.


 శ్రీకృష్ణుడి మాట :


"వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృణ్హాతి నరోపరాణి | 
తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి ||  (2. 22)


వాసాంసి = వస్త్రాలు/దుస్తులు; జీర్ణాని  = చిరిగిపోయినవి; యథా  = ఏ విధముగా నైతే ; విహాయ  = పారవేయుట, విసరివేయుట ; నవాని = క్రొత్తవి  ; గృణ్హాతి   = తీసుకుంటామో  ; నరః   = మనుష్యుడు ; అపరాణి   = వేరే, (పారేసిన)పాతవి కాక ;  తథా   = అదే విధంగా ; శరీరాణి  = దేహాలను కూడా ; విహాయ  = పారవేయుట, విసరివేయుట ; జీర్ణాని  = చిరిగి/అరిగి పోయినవి ; అన్యాని  = అవి కాక మరొకటి/వేరేవి ; సంయాతి  = లోపలి చేరుట/వెళ్ళుట ; నవాని = క్రొత్తవి ;  దేహి  = ఆత్మ; దేహమునందున్న వాడు ;

  
"చిరిగిపోయిన పాత బట్టలను(వస్త్రాలను) ఏవిధంగానైతే పారవేసి మనం (మానవుడు) క్రొత్తవి ధరిస్తామో, అదేవిధంగా జీర్ణించిన శరీరాన్ని వదలి   దేహి(ఆత్మ) క్రొత్త దేహంలో చేరుతాడు . "


ఇప్పటి వరకు ఆత్మస్వరూపుడిని గురించి కొంత, పాంచభౌతిక దేహాలను గురించి కొంత వివరంగా చెప్పిన శ్రీకృష్ణుడు, యిప్పుడు ఆత్మస్వరూపుడికి, దేహానికి గల అనిత్యమైన సంబంధాన్ని గురించి చక్కటి వుదాహరణంతో  వివరిస్తున్నాడు. మనిషి చిరిగిపోయిన పాతబట్టలు పారేస్తాడు. వాటి స్థానంలో క్రొత్త బట్టలు ధరిస్తాడు. అదే విధంగా దేహి(ఆత్మ) జీర్ణించిన పాత దేహాన్ని వదలి, క్రొత్త దేహంలో చేరడానికి వెళ్ళిపోతాడు. 

భగవద్ గీతను శ్రీకృష్ణుడు బోధించింది కనీసం 5,500 ఏండ్లకు ముందు - అని మనమూ, పాశ్చాత్యులూ అందరూ వొప్పుకున్నదే. అప్పటికి, మనదేశంలో బట్టల నేత పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది - అనడానికి   యిది ఒక చక్కటి ఆధారం. పాత బట్టలు జీర్ణమైపోతే, అవి పారేసి, క్రొత్తవి ధరించే ఆచారము, పద్ధతి మన దేశంలో బాగానే వుందన్నది తెలుస్తూ వుంది కదా! మిగతా దేశాల్లో అప్పటికి ఎలాంటి  పరిస్థితి వుందన్నది చరిత్ర కారులు చెప్పనే చెప్పారు.  సరే. ది, కేవలం ఒక చక్కటి ఉదాహరణ మాత్రమే. యిప్పుడు అసలు విషయం చెబుతున్నాడు శ్రీకృష్ణుడు. 

దే విధంగా దేహంలో నివసిస్తున్న మనం - ఆ దేహం ఏ కారణం చేతనైనా జీర్ణమై పోతే, శిథిలమైపోతే, పనికిరాకపోతే, పాతబడి పోతే, దాన్ని వదలి, మరో క్రొత్త శరీరాన్ని ధరిస్తాము.  అంతే. చాలా చక్కగా ప్రకృతిలో , మనకోసం , మన సౌకర్యం కోసం వున్నా పధ్ధతి యిది. దీనిలో మనం ఒప్పుకో కూడని దేదైనా వుందా ?

ఇది బాగా అర్థమైన వాడికి జీర్ణమైన, శిథిలమైన, ముసలిదైన    దేహాన్ని విడిచిపెట్టడానికి భయం కలుగుతుందా?  లేదు కదా. 

అలాగే, అతనికి క్రొత్త దేహాన్ని పొందడానికి  ఉత్సాహం ఉంటుంది, వుండాలి  కదా. పుట్టిన ప్రతివొక్కడికి, క్రొత్త దేహం లభిస్తుంది. అది అందంగా వుంటుంది. పెరుగుతుంది. దాన్లో ఎన్నో అందమైన మార్పులు వస్తాయి. ఆ తర్వాత, మెల్లమెల్లగా, ఆ అందం పోతుంది. ఆ పటుత్వం పోతుంది. వృద్ధాప్యం వస్తుంది. అప్పుడు మనకు రావాల్సిన మనోభావం ఏమిటి ? ఇక, ఈ జీర్ణ శరీరం వదలి, క్రొత్త శరీరానికి పోదాం అన్న ఉత్సాహం మనలో రావాలి కదా. ఈ జీర్ణ శరీరాన్ని అలాగే  పెట్టుకోవాలి, దీన్ని విడవను గాక విడవను, అని దానిపై అమిత ప్రేమ పెంచుకోవాలా ? కూడదు కదా.

ఇదండీ భగవద్ గీత గొప్పదనం. ఈ ఒక్క విషయం అర్థమై పోతే, మనలో వుండే  భయాలు, కక్షలు, భ్రమలు  ఎన్నో తొలిగిపోతాయి. దీన్నే 'అశోచ్యాన్ అన్వశోచస్త్వం' - దేనికోసమైతే శోకించకూడదో దాని కోసం శోకిస్తున్నావు, అని 2.11 శ్లోకంలో చెప్పాడు. ఎలాగూ విడిచి పెట్టేసే దేహాలకోసం ఏడుపెందుకు, అని అడుగుతున్నాడు. అదీ నవ్వుతూ అడిగాడు శ్రీకృష్ణుడు. ఎవరిని?  ఏడుపు మొహంతో కూర్చున్న అర్జునుడిని.  

ఎలాగూ యుద్ధభూమికి వచ్చేశారు. ఎందుకు వచ్చారు? చంపడానికి, లేదా చావడానికి. అందరూ తయారుగానే వున్నారుగా, చావడానికి, చంపడానికి. భీష్ముడు కూడా అందుకే వచ్చాడు. ద్రోణుడు కూడా అందుకే వచ్చాడు. నువ్వు కూడా అందుకే వచ్చావు. వచ్చి, యిప్పుడు ఏడుపుమొహం పెట్టుకోవడం దేనికి?  నీకు పాశుపతాస్త్రం, ఐన్ద్రాస్త్రం, బ్రహ్మాస్త్రం యివన్నీ దేనికి? నన్ను సారథిగా రమ్మన్నావు,ఎందుకు? 'క్షుద్రం హృదయ దౌర్బల్యం',  ఈ అధైర్యం చాలా చెడ్డది అర్జునా - అనే చెప్పడం మొదలు పెట్టాడు. దేహాన్ని గురించి ఇంతగా బాధపడడం  చాలా తప్పు అంటున్నాడు.  సరే. నువ్వు దేహి కదా. ఆత్మ స్వరూపుడివి కదా. నువ్వేమవుతావు ఈ యుద్ధంలో ? అది చెబుతాను విను - అని యింకా ఏదో చెప్పబోతున్నాడు.  


శ్రీకృష్ణుడి మాట : 


 "నైనం  ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః         | 
న చైనం క్లేదయంత్యోపో న శోషయతి మారుతః     || (2. 23) 


న = కాదు;  ఏనం = యిది (ఆత్మ) ; ఛిన్దన్తి = చీల్చుట ; శస్త్రాణి = ఆయుధాలు  ; న = కాదు;  ఏనం = యిది (ఆత్మ) ; దహతి = కాల్చుట  ; పావకః = అగ్ని ; న = కాదు; చ = మరియు ; ఏనం = యిది (ఆత్మ) ; క్లేదయంతి =   తడపగలుగుట ; ఆపః  = నీరు ; న = కాదు; శోషయతి  =  తడి ఆర్పుట   ; మారుతః = గాలి;

"దీనిని (ఈ ఆత్మను) ఆయుధాలేవీ చీల్చలేవు, గాయపరచలేవు. అగ్ని కాల్చలేదు. నీరు తడపలేదు. గాలి ఆర్పలేదు. "


11,13,14,16,22 శ్లోకాలలో   దేహాన్ని  గురించి, దాని అశాశ్వత స్వభావాన్ని గురించి,  పాంచ భౌతిక  తత్వాన్ని గురించి  వివరించాడు శ్రీకృష్ణుడు.    
  
12,13,15,16,19,20,21,23  శ్లోకాలలో ఆత్మస్వరూప,లక్షణాల గురించి వివరించాడు. 

ఆత్మ నిత్యత్వాన్ని, పంచ భూతాలకు ఆత్మకు వున్న  సంబంధము, భిన్నత్వము రెండింటినీ  చాటుతున్నాడు ఈ 23 వ శ్లోకంలో. దేహం అనిత్యం, అశాశ్వతం. అది పంచ భూతాలతో చెయ్యబడినది. చివరకు, పాత బడిన, జీర్ణించిన  దేహాన్ని ఆ పంచ భూతాలకే వదిలివేసి, మనం క్రొత్త శరీరాన్ని మళ్ళీ ఆ పంచ భూతాలతోనే నిర్మించుకోవాలి.  


మరి ఈ పంచ భూతాలు ఆత్మ స్వరూపుడిపై ఎలాంటి ప్రభావాన్ని చూపగలవు? అవి ఆత్మస్వరూపుడిని ఏమీ చెయ్యలేవు. ఆయుధాలు దేహాన్ని చీల్చగలవు, కానీ దేహిని చీల్చలేవు, ఏమాత్రమూ గాయపరచ లేవు. అగ్ని దేన్నైనా కాల్చగలనని అనుకుంటాడు. కానీ, ఆత్మస్వరూపుడిని ఏమీ చెయ్యలేడు. నీళ్లు దేన్నైనా తడపగలనని అనుకుంటుంది, కానీ ఆత్మ స్వరూపుడిని ఏమీ చెయ్యలేదు. వాయువు ఎంత అగ్నినైనా, తడినైనా ఆర్ప గలనని అనుకుంటుంది, కానీ దాని ప్రభావం, ఆత్మ స్వరూపుడిపై ఏ మాత్రమూ లేదు.

నిర్వికల్పమైన, నిర్వికారి అయిన, నిరాకారి  అయిన, శాశ్వతమైన, ఆత్మ స్వరూపుడితో  మనలను మనం  అన్వయించుకుంటామో, లేదా, ఎప్పుడూ మార్పుచెందే,  ఎన్నో రకాల వికారాలకు ఆలవాలమైన, పంచభూతాలతో నిర్మింప బడ్డ, అశాశ్వతమైన దేహంతో అన్వయించుకుంటామో, అది మనం నిర్ణయించుకుంటాం.    

దేహంతో అన్వయించుకుంటే - పుట్టుక, పెరుగుదల, తరుగుదల, చావు, మళ్లీ  పుట్టుక, మళ్ళీ చావు - వీటి మధ్యలో కామ, క్రోధ, లోభ , మోహ, మ, మాత్సర్య, భయాలనే అంతః శత్రువులతో పోరాడుతూ - సంసారం అనే  నరక కూపంలో, అజ్ఞానాంధకారంలో  కొట్టు మిట్టాడుతూ వుంటాము. ఈ అన్వయమే అజ్ఞానం వలన  చేసే అన్వయం. 

ఆత్మ స్వరూపుడితో మనం మనల్ను అన్వయించుకుంటే - మనము  జ్ఞాన జ్యోతిలో వెలుగుతూ, ఆనంద సాగరం లో తేలుతూ, ఆనందమే మనముగా, సత్-చిత్- ఆనంద స్వరూపులుగా, శాశ్వతులుగా  విలసిల్లుతాము . అప్పుడు ఏ బాధా , ఏ శోకమూ మనకు లేదు. 


ఈ జ్ఞానం కేవలం పాండిత్యంగా, నాకూ తెలుసు అన్నంత మాత్రాన చాలదు. అన్వయం కావాలి. ఆత్మానుభవం కావాలి. నేను దేహాన్ని కాదు, దేహిని అన్న పూర్ణ అనుభవం మనలో కలగాలి. అందుకే, శ్రీకృష్ణుడు ఈ జ్ఞానాన్ని యిన్ని రకాలుగా, యింత విశదంగా అర్జునుడికి, అర్జునుడి ద్వారా మనకు బోధిస్తున్నాడు. ఈ జ్ఞాన బోధ, మరెవరూ, మరెక్కడా యింత  స్పష్టంగా, తేటతెల్లంగా  చెప్పలేదు, చెయ్యలేదు అన్నది నిర్వివాదాంశం. అందుకే, ఆది శంకరాచార్యుల వారు, భగవద్  గీత  లోని ఒక్క శ్లోకమైనా, ప్రతి రోజూ చదవండి అన్నారు. 


అందులోనూ, ఈ 2.22, 2.23 శ్లోకాలు చాలామందికి, బాగా నచ్చిన శ్లోకాలు. అత్యంత అర్థపూరితమైన, చదవగానే, ఎంతో కొంత జ్ఞానం క్షణంలో  కలుగ గల శ్లోకాలు . 22 వ శ్లోకం లో దేహంతో, ఆత్మకు గల సంబంధాన్ని గురించి, 23 వ శ్లోకంలో ఆత్మ గొప్పదనాన్ని గురించి చాలా  తేట తెల్లంగా  చెప్పబడింది. నా అభిప్రాయంలో కూడా, యీ రెండు శ్లోకాలను మీరు బాగా అర్థం చేసుకుని మననం చేసుకుంటే, మీ మిత్రులకూ తెలియచెబుతూ వుంటే, మీకూ, మీ చుట్టూ వున్న వారికి చాలా, చాలా  మంచిది 

మీకింకా ఎన్నో సందేహాలున్నాయి కదా. అవన్నీ అర్జునుడికీ  వున్నాయి. ఈ దేహి, దేహము అనే వాటిని గురించి మనకు మరింత స్పష్టత  కావాలి. 
 

ఈ విషయాన్నే, యింకా విశదంగా, స్పష్టంగా చెప్పబోతున్నాడు  ముందు వచ్చే శ్లోకాలలో . అవి మరో వ్యాసంలో చూద్దాం. 
 
వ్యాసాలపైన - మీ అభిప్రాయాలను, విమర్శలను, అనుభవాలను కూడా నాకు మీరు తెలియ  జేస్తూ వుంటే చాలా బాగుంటుంది


సర్వే  జనాః సుఖినో భవంతు
  
= మీ   
    

ఉప్పలధడియం   విజయమోహన్ 
వజ్రాసనం


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి