16, ఫిబ్రవరి 2017, గురువారం

భగవద్ గీత (8) - సాంఖ్య యోగము - 2.16,17 - తత్వ దర్శనము - సత్, అసత్, నిజం, అబద్ధం యివి ఏమిటి?


 

భగవద్ గీత (8)


  

 రెండవ అధ్యాయము

 

  సాంఖ్య యోగము 

 



భగవద్ గీత లో మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగాన్ని మొదటి మూడు వ్యాసాల్లో బాగా విశ్లేషించి అర్థం చేసుకున్నాం. నాలుగవ వ్యాసంలో అర్జునుడి సమర్పణ భావాన్ని, 'నా సమస్యకు నువ్వే సమాధానం చెప్పు, నేను నీ శిష్యుడిని' అన్న మాటలను విశదంగా పరిశీలించి ఆకళింపు చేసుకున్నాం

యిదవ వ్యాసంలో శ్రీకృష్ణుడి మొట్టమొదటి ఉపదేశ శ్లోకం చూశాం.  పోయిన  వారి కోసమైనా, వున్న వారి కోసమైనా జ్ఞాని అయిన వాడు దుఃఖించ రాదని శ్రీకృష్ణుడు చెప్పాడు.  శ్రేయస్ అంటే శాశ్వతమైన సుఖాలు, ప్రేయస్ అంటే అశాశ్వతమైన, భౌతిక సుఖాలు అన్నది తెలుసుకున్నాం. అలాగే, మనిషి కోరదగిన రెండు వరాలు  ఏమిటో కూడా తెలుసుకున్నాం.
ఆరవ వ్యాసంలో - మనకెవరికీ ఎప్పుడూ మరణం లేదు, మనం లేని సమయమంటూ  ఎప్పుడూ లేదు - అని శ్రీకృష్ణుడు అన్నాడు. మన దేహాలు మాత్రం, సమయానుసారం, మరణించి, పంచ భూతాలలో కలిసిపోతాయి. మనం అప్పుడు మరో శరీరాన్ని వెదుక్కుంటూ వెళ్లి శరీరాన్ని  ధరిస్తాము  - అని చెప్పాడు. 
ఏడవ వ్యాసంలో - యింద్రియాలు తమ తమ సంబంధిత వస్తువుల స్పర్శ వలన, మనకు శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు కలిగిస్తున్నాయి.వన్నీ వస్తూ, పోతూ వుండే, అశాశ్వతమైన విషయాలు. వీటిని నువ్వు భరించక తప్పదు. వచ్చే సుఖాన్నీ, దుఃఖాన్నీ, రెండింటినీ  సమానంగా  తీసుకుంటూ వుండే వాడికి, అవి ఎవరినైతే బాధించవో అటువంటి వాడికి - చావు, పుట్టుకలు లేని అమృతత్వానికి  అర్హత వస్తుంది- అన్నాడు శ్రీకృష్ణుడు

ఇప్పుడు శ్రీకృష్ణుడు యింకా ఏం చెబుతాడో చూద్దాం. 
  
శ్రీకృష్ణుడి మాట :
నాసతో  విద్యతే భావో నాభావో విద్యతే సతః   |  
ఉభయోరపి దృష్టాంతస్త్వనయోహ్ తత్వ దర్శిభిః ||  (2.16) 
  న = కాదు / లేదు; అసతః = సత్యం కానిది, మిథ్య; విద్యతే = వున్నది ; భావః = వుండడము; న = కాదు / లేదు; అభావః = లేకుండడము ; విద్యతే = వున్నది; సతః = సత్యమైనది; ఉభయోహ్ = ఈ రెండింటి యొక్క ; అపి = మరియు ; దృష్టాహ్ = చూడబడింది ;అంతః = చివరిది (సత్యము); తు = నిజముగా ; అనయోహ్ = ఈ రెండింటి మధ్యలో ; తత్వ = సత్యాన్ని ; దర్శిభిః = చూడగలిగిన / చూచిన వారు .  
 
"సత్యం కానిది ఎప్పుడూ వుండింది లేదు. సత్య మైనది ఎప్పుడూ లేకుండా లేదు. జ్ఞానులకు ఈ రెండింటి యొక్క సత్యము, వాటి మధ్య  గల తారతమ్యము బాగా తెలుసు . "


తత్వ దర్శనము అంటే - ఈ విశ్వము యొక్క నిజమైన, సత్య స్వరూపాన్ని బాగా చూడగలగడం, తెలుసుకో గలగడం. చాలా నిజాలు మన పంచేంద్రియాలకు పూర్తిగా అందవు. అందుకే, చూసినవన్నీ నిజం కావు, విన్నవన్నీ నిజం కావు, వాటిని, ఎంతో జాగ్రత్తగా, క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాటి నిజాలు బోధపడతాయి. 

మన శరీరానికి బోధ పడే శీతోష్ణాలు, సుఖ,దుఃఖాలు, మన మనసుకు బోధపడే  మానావమానాలు, సంతోష, విచారాలు లాంటివన్నీ శాశ్వతమైన  నిజాలు కావు. ఇవి వస్తుంటాయి; పోతుంటాయి. ఒకరికి సుఖమనిపించేది, మరొకరికి దుఃఖం కావచ్చు. ఒకరికి సంతోషం కలిగించేది, మరొకరికి విచారం కలిగించొచ్చు. ఒకరి శరీరానికి చలి అనిపించేది, మరొకరి శరీరానికి వేడి అనిపించొచ్చు. ఏది నిజం? ఏదైనా, యీ నిముషమున్నది, మరో నిముషానికి మారిపోతుంది, లేకుండా పోతుంది. ఎప్పుడూ మారుతూ వుండేది మిథ్య అన్నారు. ఎప్పుడూ మారకుండా వుండేది మాత్రమే  'సత్యము' అన్నారు. 
మన శరీరం కొన్ని సంవత్సరాలకు ముందు లేదు. ఇప్పుడుంది. కానీ, క్షణ, క్షణమూ, మారుతూ వుంది. అంటే, ఇప్పుడున్న శరీరం, ముందెప్పుడూ లేదు,  యిక ముందూ వుండదు. 
మన మనసూ అంతే. ఈ క్షణంలో వుండే మనసు, యిలా ముందెప్పుడూ లేదు, యిక ముందూ వుండదు. క్షణ క్షణమూ మారుతూ వుంది. వీటినే మిథ్య లేదా అసత్ - అన్నారు. పంచేంద్రియాలకు అందే ప్రపంచమంతా మిథ్యే, అసత్తే.  

మారుతూ వుండే ఈ ప్రపంచమంతటా వ్యాపించి వున్నా, సామాన్యులకు అగోచరమైన సత్య పదార్ధం ఒకటి వుండనే వుంది. అది ఎప్పుడూ ఒకే విధంగా, మార్పు లేకుండా వుంది. 
అది నిత్యం; సత్యం; నిర్వికల్పం; నిరాకారం; నిర్వికారం.  సత్యాన్ని, మిథ్యనూ - రెండింటినీ సుష్పష్టంగా దర్శించ గలిగిన వాడు, అర్థం చేసుకోగలిగిన వాడు - తత్వ దర్శి, జ్ఞాని అని చెప్పబడతాడు .

ఇప్పటి వరకూ యీ నిత్య సత్య పదార్థానికి శ్రీకృష్ణుడు ఏ పేరూ పెట్ట లేదు. ఉపనిషద్వాక్యాలలో - 'తత్  త్వం ఆసి' అన్నారు. ఏదైతే, నువ్వు వెదుకుతున్నావో, అది (ఆ సత్య పదార్ధం) నువ్వే- అని అన్నారు.    'ప్రజ్ఞానాం బ్రహ్మ' - అని కూడా అన్నారు. నువ్వు దాన్ని తెలుసుకుంటే , నువ్వే ఆదిగా వుండి పోతావు. ' అహం బ్రహ్మ అస్మి'  = నేనే సత్య పదార్థమైన బ్రహ్మాన్ని.  'అయం ఆత్మా బ్రహ్మ' = నేనే బ్రహ్మాన్ని ; యిలా సత్య పదార్ధం ఏది అని ఎన్నో రకాలుగా వివరించారు,  వుపనిషత్తులలో . 
మరి అసత్,లేదా మిథ్య అయినది ఏది? అది కూడా వివరించారు.  బ్రహ్మ సత్యం; జగన్మిథ్యా - అన్నారు.  బ్రహ్మం సత్యం. జగత్తు మిథ్య .  ఇక్కడ - అసత్, లేదా మిథ్య  అనే పదాలకు అర్థం - అసలు లేనే లేదని కాదు. ఎప్పుడూ మారుతూ వుంటుంది, కాబట్టి ఒకే విధంగా ఎప్పుడూ వుండదు. సత్ - అంటే ఎప్పుడూ మార్పు లేనిది. అసత్ - అంటే ఎప్పుడూ మారుతూ వుండేది. 
నేను కళ్ళతో చూస్తున్నాను కదా! చెవులతో వింటున్నాను కదా. యిది అసత్ - అంటారేమిటి? 
మీరు చూసారు, విన్నారు - కానీ మరుక్షణం అది ఆదిగా లేదు. అది మరొకటిగా మారిపోయింది.   అందుకని  'అసత్ ' అన్నారు.

దీన్ని మరి కాస్త విశ్లేషిద్దాం. సత్, అసత్ అనేవి వేరు. మనం తెలుగులో చెప్పుకునే నిజం, అబద్ధం వేరు. మనం ఏదో చూశాం లేదా విన్నాం. అది యధాతథంగా మనం చెప్పగలిగితే - అది నిజం అనబడుతుంది.  ఆ నిజం యిప్పుడు లేదు. ఎప్పుడో వుండింది. ఇక ముందెప్పుడూ ఉండదు. మారిపోయింది.  ఇక ముందు వుండబోయేది మరో నిజం అవుతుంది.  దీన్ని వ్యావహారిక సత్యం - అని చెప్పుకోవచ్చు. లేదా, మిథ్య అనీ చెప్పొచ్చు. ఇది అబద్ధం కాదు. అబద్ధం అంటే - అసలు జరగని దాన్ని, అసలు లేని దాన్ని - జరిగినట్టుగా, వున్నట్టుగా కల్పించి చెప్పడం. జగత్తు మిథ్య - అన్నారు. అంటే, ఎప్పుడూ మార్పుచెందేది అని అర్థం చేసుకోవాలి.   దీన్నే, శ్రీకృష్ణుడు  విశదంగా బోధిస్తున్నాడు అర్జునుడికి.
 శ్రీకృష్ణుడి మాట :


" అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతం   | 

  వినాశం అవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హసి   || (2. 17)


  అవినాశి = నాశనం లేనిది; తు = నిజముగా; తత్  = అది ; విద్ధి = (నువ్వు) తెలుసుకో ;  యేన  = ఎవరిచేత;  సర్వం  = అంతయు; యిదం   = యిదంతయూ ; తతం  = వ్యాపించబడి వుంది ; వినాశం = నాశనము ; అవ్యయస్యాస్య  = (నాశనము లేకుండా) ఎల్లప్పుడూ వుండునది ఏదో ; న = కాదు / లేదు; కశ్చిత్ = ఎవరైనా సరే; కర్తృమ్ = చేయుటకు ; అర్హసి  = అర్హుడు; చేయ గలిగిన వాడు. 

"ఈ విశ్వమంతటా  వ్యాపించి వున్న (సత్యమైన ) దేదో, అది ఎల్లప్పుడూ నాశనమే లేకుండా వుంటుంది. దాన్ని   నాశనం చేయగల సమర్థులు ఈ విశ్వములో ఎవరూ లేరు "   

విశ్వము - అని మనం అనేది, మన పంచేంద్రియాలకు అందేది. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివి - అనే పంచ భూతాలతో కూడింది. యిది కూడా అనంతమే. ఇందులో మనము వుండే భూమి చిన్న గోళమే. అందులో మనమెంత? చాలా, చాలా చిన్న వాళ్ళం కదా . 
ఇలా మనం చెప్పుకునేది, కేవలం, మన శరీరాన్ని గురించి , మనసు గురించి మాత్రమే. నిజమైన నేను - ఈ శరీరము,  మనసు వెనుక, వాటంతటా   దాగి వున్నాను. వాటికి నేను ప్రభువును. అవి నా కోసం పుట్టాయి. పెరిగాయి. నశిస్తున్నాయి. నాకు పుట్టుక, పెరుగుదల, తరుగుదల, మరణము లేదు. 
విశ్వమంతటా, వ్యాపించి వున్న బ్రహ్మ పదార్ధం - పుట్టుక, పెరుగుదల, నాశనము లాంటి ఎలాంటి మార్పులూ లేనిది.  విశ్వమంతటా అది వ్యాపించి వుంటే , నేను వుండే ఈ శరీరం లో కూడా అది వున్నట్టే  కదా ! మరి ఈ శరీరంలో నేనూ వ్యాపించి వున్నా; బ్రహ్మమూ వ్యాపించి  వుంది . అంటే అర్థం ఏమిటి?

 
ఈ విషయాన్నే, యింకా విశదంగా, స్పష్టంగా చెప్పబోతున్నాడు  ముందు వచ్చే శ్లోకాలలో . అవి మరో వ్యాసంలో చూద్దాం. 
 
వ్యాసాలపైన - మీ అభిప్రాయాలను, విమర్శలను, అనుభవాలను కూడా నాకు మీరు తెలియ  జేస్తూ వుంటే చాలా బాగుంటుంది
సర్వే  జనాః సుఖినో భవంతు
  
= మీ   
    
ఉప్పలధడియం   విజయమోహన్ 
పద్మాసనం





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి