10, నవంబర్ 2013, ఆదివారం

స్వగతం (1) - టర్నింగ్ పాయింట్స్ - దేశభక్తి ఎలా వస్తుంది - మహాత్మా గాంధీ పాకీ పని చేస్తే మనకేం లాభం?


స్వగతం లో 

కొన్ని "టర్నింగ్ పాయింట్స్ "


Dr A.P.J. అబ్దుల్ కలాం, నాకు చాలా, చాలా నచ్చిన భారత రాష్ట్రపతి. మత వాదాలకు, రాజకీయాలకు ,  అతీతుడైన  మహా మనీషి గా చెప్పుకోవచ్చు .  ఆయన రాసిన "టర్నింగ్ పాయింట్స్ " అనే పుస్తకం చదువుతూ వున్నాను . అకస్మాత్తుగా - నాలో వొక వూహ ; ప్రతి వొక్కరి జీవితం లోనూ యేవో కొన్ని "టర్నింగ్ పాయింట్స్ " వుంటాయి కదా - అని.  అవి బాగు పడటానికి కావచ్చు.   చెడి పోవడానికి కూడా  కావచ్చు. ప్రతి టర్నింగ్ పాయింట్ లోనూ - మనం నేర్చు కోవాల్సిన పాఠాలు ఎన్ని వుంటాయి కదా. 

 అయితే , నా జీవితంలో "టర్నింగ్ పాయింట్స్" ఏమిటి - అన్న మథనం  మనసులో కదిలింది . వస్తున్నాయ్ ; వస్తున్నాయ్ ; జగన్నాథ రథ చక్రాల్  వస్తున్నాయ్ ; అనే లా  ఎన్నో సంఘటనలు మనసులో  కదిలాయి . అన్నిటికీ జీవితంలో,  నా భవిష్యత్తు ను దిద్దడం లో ఎంతో కొంత మఖ్యత్వం కనిపించింది . 

జరిగినవి మంచీ, చెడూ రెండూ వుండనే వుంటాయి . గాంధీ గారైతే చెడును కూడా యథా తథం గా రాసుకున్నారు. అలా రాయడానికి వొక్క గాంధీ గారే సమర్థులు . ఆయన జీవితంలో అసత్యానికి గానీ, హింస కు గానీ తావు లేదు. పొగడ్తలకు ఆయన పొంగి పోలేదు . విమర్శలకు క్రుంగి పోలేదు. అలా మనం వుండగలమా - అన్నది నాకు సందేహమే . కానీ, అలా వుండాలి - అన్నది మాత్రం తెలుసు .  అందుకే , ఆయన మహాత్ముడు ; మనం కాదు . మనం - అంటే నేను . మీ సంగతి నాకు తెలీదు . 

కానీ మహాత్మా గాంధీ గారి ప్రభావం - మా చిన్న తనంలో మాపై చాలానే వుండేది . నేను పుట్టిన అసలు తేదీ 26 - 01-1950 ఆట. కానీ, స్కూల్  రికార్డుల్లో  26-12-1948 గా నమోదయ్యింది. చిన్న తనంలో, యింట్లో నేను చేసే గోల భరించ లేక - స్కూల్ లో చేర్చారట. వయసు చాలదు కాబట్టి - కొంత ఎక్కువ వేశారు. అందువలన, పెద్ద నష్టం ఏమీ లేదు. కానీ, ఉద్యోగంలో చేరడం, ఉద్యోగ విరమణ - రెండూ, అర్హత కంటే - వొక సంవత్సరం ముందుగా జరిగిపోయ్యాయి.  కానీ, నా పుట్టిన రోజు మాత్రం 26 జనవరి నాడే - అప్పుడూ, యిప్పుడూ యింట్లో జరుపుకుంటాం. 

స్కూల్ లో, మాకు నచ్చిన హీరో లు - గాంధీ, నెహ్రు , సుభాస్ చంద్ర బోస్ . వొక్కొక్కరు, వొక్కొక్క విధంగా నచ్చారు . కొంత వరకు పటేల్ గారు కూడా. ఆ కాలంలో - వారందరి గురించి గొప్పగా పాఠాలుండేవి.   మరి, యిప్పుడున్నాయో లేదో - నాకు సందేహమే. తమిళ నాడులో అస్సలు వున్నాయా  అంటే - నాకు తెలీదు . 

మన  జాతీయ గీతం  అంటే - మాకు చాలా యిష్టం . స్కూల్లో అది పాడేటప్పుడు, గొంతెత్తి , బిగ్గరగా, పాడే వాళ్ళం . ఆ కాలంలో - సినిమాల కెడితే , సినిమా చివర , జాతీయ గీతం  రికార్డు  పెట్టే  వారు . మేము, పిల్లలు మాత్రం, ఠంచను గా, నిలబడి, ప్రక్కనున్న వారు మమ్మల్ని తోసుకుని వెడుతూ వున్నా, మళ్ళీ సర్దుకుని - జాతీయగీతం  పూర్తి  అయ్యే వరకు - అటెంషన్ పోజు లో నిలబడి వుండే వాళ్ళం . జయహే, జయహే, జయహే, జయ,జయ,జయ, జయహే - అనేటప్పుడు, గొంతు పూర్తిగా విప్పి పాడే వాళ్ళం . 

మాలో దేశ  భక్తి - వుండేదా ? తప్పకుండా వుండేది. చదువు వలన , గురువు వలన దేశ భక్తి  తప్పకుండా వస్తుంది . మరి - అవన్నీ యిప్పుడేమై పొయ్యాయి . అప్పట్లో కూడా - కొంత మంది జాతీయ గీతం వస్తూ వుంటే  - నిలబడే వారు కాదు. నిజమే. కానీ, నిలబడే పిల్లలు ఎంతో మంది. నాకు తెలిసి, ఆ నిలబడని వాళ్ళు - నిలబడడం లేదని, జాతీయ గీతాన్ని అవమానిస్తున్నారని - సినిమాల్లో, చివర్న , అది వేసే పద్దతి నిలిపి వేసినట్టు - అప్పట్లో చెప్పుకున్నారు . నిజమో కాదో, నాకు తెలీదు. కానీ, అలా, నిలిపి వుండ కూడదనేది - మాత్రం, మా పసి మనసులకు - అప్పుడే తెలుసు. కోకొల్లలుగా దేశ భక్తులు, సత్య వ్రతులు  తయారవుతున్న దేశంలో - లంచ గొండి  తనం,  దేశ భక్తి లేక పోవడం, వొకరిపై వొకరికి సుహృద్భావం లేక పోవడం - యిప్పుడు చెప్పిన, యిటువంటి చిన్న, చిన్న తప్పుల వల్లే  జరిగాయి . ఇవి- మాలోనూ, దేశం లోనూ  కూడా - వొక పెద్ద టర్నింగ్ పాయింట్,  అనడం లో నాకు సందేహం లేదు .  దేశం తప్పు దారి పట్టింది .

సరే . అప్పట్లో - గాంధీ గారి పాఠాల్లో  వున్న - ఎన్నో అంశాలు - మా మనసుల్లో  తిష్ట వేశాయి. 

ఆయన పాకీ పని తమ యింట్లోనే కాక, అందరి యింట్లో చేయడానికి కూడా ముందు నిలబడే వారట. ఇల్లు శుభ్రం గా వుండాలంటే, మన మల మూత్రాలు మనమే శుభ్రం  చేసెయ్యాలి - కానీ, అది మరెవరి కోసమో, నిలుప కూడదు - అని ఆయన సిద్దాంతం. అది ఆయన ప్రతి రోజూ చేసే వారని - మా పాఠాల్లో  వుంది. 

అప్పట్లో, మా పిల్లలందరి యిళ్ళలో , సరైన శౌచ స్థలాలు లేనే లేవు. చాలా మంది మగ వాళ్ళు - వూరి బయట,  పొలాల మధ్య , చెట్ల వెనుక వెళ్ళే వారు . ఆడ వాళ్ళు, యింటి వెనుక ఎక్కడో వెళ్ళే వారు . బయటకు  వెళ్ళ లేని మగ వారు కూడా - యింటి వెనుకే . ఏదో చిన్న గొయ్యి త్రవ్వినా - అది యిట్టే నిండి పొయ్యేది. దాన్ని మళ్ళీ ఎవరు ఖాళీ చేస్తారు?  చెయ్యరు. అలా, యింటి వెనుకంతా - అసహ్యంగా, దుర్గంధం తో నిండి  వుండేది . 

గాంధీ గారి కథ చదివిన, వినిన- మాకందరికీ, అందులో, చాలా ముఖ్యమైన ఆరోగ్య సిద్దాంతం, వుందని తెలిసి పోయింది. మా పెద్దలు యిది విన లేదు కాబట్టి - వారికి తెలీదు;  మేం చెప్పినా, వారి మనసుకెక్కదు . చెప్ప గల వయసూ మాకు లేదు.  అందుకని, మా అందరి ఇళ్ళ లో, గాంధీ గారు చేసినట్టు, అసలింకా  బాగా చెయ్యాలని  నిర్ణయించుకున్నాం . 

అంతే  - పిల్లందరూ కలిసి , ప్రతి యింట్లోనూ, మట్టితో, దొరికిన రాళ్ళతో  శౌచ స్థలాలు తయారు చేశాం . ఆ చిన్న గోడలు ఏదో కాస్త అడ్డు. అలాగే - దాని వెనుక నున్న మల మూత్రాలను మేమే చేటలతో - ఎత్తి, దూరంగా, పారబోశాం. ఆ స్థలాలు కాస్త శుభ్ర పడ్డాయి. మా యింట్లో - ఈ పనులు చెయ్యడంలో -  అందరు పిల్లలూ   పాల్గొన్నాం . మాకెప్పుడూ - అది తప్పని అనిపించ  లేదు . 

అమ్మలందరూ, పిల్లల  మల మూత్రాలు ప్రేమ తో ఎత్తి పోస్తున్నప్పుడు - అదే, మేం చేస్తే  తప్పెలా అవుతుంది . అందులోనూ గాంధీ గారు కూడా అది చేసి చూపారుగా. కాబట్టి, అది మనం చెయ్యాల్సిన కార్యమే. మేం - ఈ పనులు చాలా ఏళ్ళ పాటు, మాకు తోచినట్టు, మాకు తెలిసినట్టు చేశాం. మా పెద్దలు ఎవరూ, ఈ మా పనికి  అడ్డు  చెప్ప లేదు. ఎందుకంటే, అంతకు ముందు వారు పడుతున్న , నానా అవస్థలు మా వలన - కాస్త తీరాయి కదా. అలాగే - ఆడవాళ్ళకు, కాస్త మరుగు, శుభ్రమైన స్థలం దొరికాయి . మరెందుకు అభ్యంతరం చెబుతారు ? 

యిటువంటి కొన్ని సంఘటనలు మా జీవితాలపై , మనస్తత్వాలపై - చాలా, చాలా ప్రభావం చూపాయి. 

వొక ఆదర్శ నాయుకుడు - మన మధ్య వుంటే - వారి ప్రభావం మనపై, ముఖ్యంగా పిల్లలపై - బలంగా వుంటుందనడానికి - యింత కంటే నిదర్శనం కావాలా ? భావి పౌరులకు - అలాంటి ఆదర్శ నాయకుడు ఎప్పుడూ వొకడుండాలి . 

యిప్పుడెవరున్నారు  చెప్పండి?  పోనీ, నిస్వార్థంగా, అలా, దేశ  సేవ కై ఎవడైనా, ముందుకు వస్తే , అతడిని, నాయకుడిగా - మీరు, నేను అంగీకరిద్దామా ?

అలాంటి వాళ్లకు - పట్టం కట్టి, కులాలకు , మతాలకు అతీతంగా - వారికి వోటు వేసి గెలిపిద్దామా?

ఉదాహరణకు - Dr A.P.J. అబ్దుల్ కలాం; మన జయప్రకాష్ నారాయణ్ గారు,  లాంటి వాళ్ళు.  యింకా ఎంతో మంది వుండొచ్చు . పదండి చూద్దాం . మన మనస్సులో - ఈ జగన్నాథ రథ చక్రాలు సాగనియ్యండి. ఎక్కడో వొక చోట - ఆ జగన్నాథుడే  ఎదురు రావచ్చు . 

మరో  స్వగతం లో - మరో టర్నింగ్ పాయింట్ చూద్దాం 

= మీ 

వుప్పలధడియం విజయమోహన్



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి