19, మార్చి 2017, ఆదివారం

భగవద్ గీత (16) - సాంఖ్య యోగము - 2.32,2.33 - ధర్మ యుద్ధం క్షత్రియుడికి స్వర్గద్వారం - ధర్మయుద్ధం చెయ్యకపోతే పాపము కూడా చుట్టుకొంటుంది



 

భగవద్ గీత (16)


  

 రెండవ అధ్యాయము  






 సాంఖ్య యోగము 

 



భగవద్ గీత లో మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగాన్ని మొదటి నాలుగు వ్యాసాల్లో బాగా విశ్లేషించి అర్థం చేసుకున్నాం.


అయిదు నుండి పదిమూడవ వ్యాసం వరకు, శ్రీకృష్ణుడి వుపదేశంలో - దేహి(అంటే ఆత్మ), దేహాల మధ్య గల సంబంధము, తారతమ్యము, దేహి, దేహాల యొక్క స్వరూప లక్షణాలు చూస్తూ వచ్చాము. మహదాశ్చర్యం గొలిపే దేహి యొక్క స్వరూపం విజ్ఞులకు కూడా పూర్తిగా అర్థం కావడం కష్టం, యిది వ్యక్త రూపంలో దేహాన్ని ధరించి, అవ్యక్త రూపంలో దాన్ని విడిచి పెట్టేస్తుంది, మళ్ళీ వ్యక్త రూపం ధరించి  దేహంలో ప్రవేశిస్తుంది - అన్నాడు 14  వ వ్యాసంలో. 15  వ వ్యాసంలో స్వధర్మము,  క్షత్రియ ధర్మము అయిన   ధర్మయుద్ధాన్ని చెయ్యడమే అర్జునుడి కర్తవ్యమని అన్నాడు. ఇప్పుడీ 16 వ వ్యాసంలో, సాంఖ్య యోగపు 32, 33 శ్లోకాలలో, శ్రీకృష్ణుడు యింకా ఏం  చెప్పబోతున్నాడో చూద్దాం.


 శ్రీకృష్ణుడి మాట :


"యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం
  సుఖినః క్షత్రియాహ్   పార్థ లభంతే యుద్ధమీదృశం ||  (2. 32)


యదృచ్ఛయా  = తానుగానే, తనకు తానే ; చ  = మరియు ; వుపపన్నం  = వచ్చెడిది  స్వర్గద్వారమ్ = స్వర్గములోకి ప్రవేశించుటకు గల ద్వారము   ; అపావృతం = తెరువబడినది ; సుఖినః  ఆనందంగా/సుఖంగా వున్నవారుక్షత్రియాహ్  = క్షత్రియులు ; పార్థ   = ఓ అర్జునా! లభంతే = లభించిన   ; యుద్ధం  =  యుద్ధము  : యీదృశం   =  యిటువంటి  ; 

  
"ఓ అర్జునా !  ఏ క్షత్రియులకైతే అడగకుండానే యిటువంటి యుద్ధం లభిస్తుందో అది వారికి, తమ కోసం తెరిచి వుంచ బడిన స్వర్గద్వారాల లాగా కనిపించి మహదానందం పొందుతారు. "


31 వ  శ్లోకంలో శ్రీకృష్ణుడు, నీ లాంటి  క్షత్రియుడికి,  యీ ధర్మ యుద్ధము కంటే మరొకటి శ్రేయస్కరమైనది లేదు, అన్నాడు. ఇప్పుడు, అడగకుండా వచ్చిన యీ ధర్మయుద్ధం ఏ  క్షత్రియుడికైనా, తెరిచి వుంచ బడిన స్వర్గద్వారాల లాగా  కనిపించి, మహదానందం పొందుతాడు. మరి నీవు యుద్ధం వదిలి వెళ్ళిపోతానంటే అది సరి కాదు కదా, అంటున్నాడు. 


ధర్మయుద్ధం చేసి, ఆ యుద్ధంలో  వీర మరణం పొందే క్షత్రియునికి తప్పకుండా స్వర్గం లభిస్తుందని మన సంస్కృతిలో ఒక నమ్మకం వుంది. అందువలన, ధర్మం వైపు నిలిచి, నేను పోరాడుతాను, అనే క్షత్రియుడు గాయాలకు గానీ, చావడానికి గానీ  ఏ మాత్రం భయపడడు, జంకడు. గొప్ప వుత్సాహంతో, ధైర్యంతో ప్రాణాలకు కూడా తెగించి అధర్మానికి పాలుపడే శత్రువుతో పోరాడుతాడు.

క్షత్రియ వంశంలో పుట్టే ప్రతి బిడ్డకు, పుట్టిన రోజు నుండే, యిది నేర్పడం ఆనవాయితీ అయిపోయింది. మన కుల వ్యవస్థలో  కొన్ని లోపాలున్నా, ఇటువంటి ధర్మ రక్షణకై నిర్దేశింప బడిన పద్ధతులు సమాజాన్ని కాపాడేవి.  కాలక్రమంలో, లోపాలు ఎక్కువయ్యాయి. గుణాలు తగ్గాయి. 


ప్రస్తుత కాలంలో కూడా, మన దేశపు సైనికులు, దేశ సరిహద్దులలో, పాకిస్తాన్ సైన్యంతో పోరాడుతూ గెలుస్తున్నారు, అప్పుడప్పుడూ  కొంత మంది  మన సైనికులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. పాకిస్తాన్ మొదటి నుండీ మనతో అధర్మయుద్ధమే చేస్తున్నది - అని ప్రతి సారీ ప్రపంచానికంతా తెలుస్తూనే వుంది. 

టెర్రరిస్టులను ప్రచ్ఛన్నంగా పంపడం, నిద్ర పోతున్నప్పుడు దాడి చెయ్యడం, దొరికిన భారత సైనికులను, అంతర్జాతీయ యుద్ధనియమాలకు వ్యతిరేకంగా హింసించడం, తలలు కోయడం, మిగతా అంగాలను విచ్చిన్నం చెయ్యడం, సాధారణ పౌరులపై దాడి చెయ్యడం లాంటి దుర్మార్గపు, పాపపు పనులు చెయ్యడం పాకిస్తాన్ కు అలవాటై  పోయింది

ఇటువంటి అధర్మాలు పాకిస్తాన్ చేస్తున్నది కాబట్టే, మన దేశాన్ని ఆ దుర్మార్గుల నుండి రక్షించుకోవడానికి భారత దేశం పాకిస్తాన్ తో ధర్మ యుద్ధం చేస్తున్నది. చేసి తీరాలి. వేరే మార్గం కూడా లేదు. మన సైనికులు శత్రునాశనం చెయ్యాల్సిందే. అందులో ఏ మాత్రం తప్పు లేదు - అని శ్రీకృష్ణుడి  మాటల నుండి  మనం గ్రహించాలి. 


ముఖ్యంగా క్షత్రియుడికి ఇటువంటి ధర్మ యుద్ధం తన కోసమే తెరిచి వుంచ బడిన స్వర్గ ద్వారం లాగా ఆనంద దాయకంగా కనిపిస్తుంది. ఈ ధర్మయుద్ధంలో పాల్గొని జయించాలి, లేదా, యుద్ధంలో వీరమరణం పొందాలి. 
     
 శత్రువుకు చిక్కి బందీ కావడం అన్నది రామాయణ యుద్ధంలో కానీ, భారత యుద్ధంలో కానీ  లేదు. విజయమో, వీరస్వర్గమో - అంతే కానీ బందీ కావడం అన్నది క్షత్రియుడికి పనికి రాదు. నా వుద్దేశంలో, భారత దేశం, పాకిస్తాన్ లాంటి శత్రు దేశాల విషయంలో ఇటువంటి, 'విజయమో, వీరస్వర్గమో - అంతే కానీ బందీ కావడం లేదు' అన్న పధ్ధతి అనుసరించడం  మంచిది అనిపిస్తుంది. 


క్షత్రియుడంటే  ఎవరు? ఈ కాలంలో యిది కూడా ఒక ముఖ్యమైన ప్రశ్నయే. ఎవడైతే క్షత్రియ ధర్మం పాటిస్తాడో, అతడు క్షత్రియుడే. మన సైనికులందరూ క్షత్రియులే. దేశ రక్షణ విషయంలో, ప్రతి పౌరుడూ క్షత్రియుడుగా మారాలి. ధర్మాన్ని రక్షించడానికి మనమందరూ ముందుకు రావాలి, క్షత్రియులుగా మారాలి. చాలా శతాబ్దాలుగా, మన దేశంలో స్తబ్దత, నిర్వీర్యత, పిరికితనం ఎక్కువైపోతూ వుంది. ఇది మారాలి. ప్రతి పౌరుడూ, బలశాలిగా, ధైర్యశాలిగా, ధర్మాన్ని రక్షించడానికి, అధర్మాన్ని ఎదిరించి పోరాడడానికి  ముందుకు రావాలి. 

భారత యుద్ధంలో ద్రోణుడు, కృపుడు, అశ్వథామ   కుల రీతిగా బ్రాహ్మణులైనా, యుద్ధవిద్యలలో ఆరితేరిన యోధులుగా పోరాడారు కదా. క్షత్రియులైన కౌరవ పాండవులకు యుద్ధవిద్యలు నేర్పింది గురుద్రోణుడే కదా. భీష్ముడికి, కర్ణుడికి నేర్పింది మరొక బ్రాహ్మణుడైన పరశురాముడు. ప్పుడు మనం చెయ్యాల్సింది, కులంతో నిమిత్తం లేకుండా, ధర్మాన్ని, దేశాన్ని రక్షించడానికి ఎవరు ముందుకు వస్తారో, వారందరికీ, క్షత్రియ విద్యలన్నీ నేర్పించాలి.   

పౌరులలో కనీసం మూడవ వంతు, క్షత్రియులుగా ఉండాలి. కానీ, భారత దేశానికి - ఒక వైపు పాకిస్తాన్, మరొక వైపు చైనా రెండింటినీ ఎదుర్కొని నిలువగలిగే సామర్థ్యం వుండాలంటే, భారత ప్రభుత్వం తన పౌరులందరినీ మహా ధైర్యశాలులు, బలశాలులు, యుద్ధవిద్యలలో నిపుణులు గానూ, అత్యంత దేశభక్తి గలవారి గానూ మార్చాలి. ఇప్పుడున్న అస్తవ్యస్తమైన, ఉపయోగం లేని కులవ్యవస్థ స్థానంలో, అందరికీ గౌరవప్రదమైన, దేశానికి వుపయోగకరమైన వ్యవస్థ నెలకొల్పాలి. 

భగవద్ గీత యొక్క (ఒక) ముఖ్యోద్దేశం, నిర్వీర్యమైన జాతిని బలమైన, ధైర్యవంతమైన, వీర్యవంతమైన, ధర్మ నిష్టమైన  జాతిగా తయారుచెయ్యడమే. ధర్మంకోసం పోరాడడము ఏ దేశానికైనా చాలా ముఖ్యం. 
ఈ శ్లోకాలలో కృష్ణుడు అర్జునుడికి తన క్షత్రియధర్మం గుర్తు చేస్తున్నాడు. ధర్మ యుద్ధం చెయ్యాల్సిందే అని బోధిస్తున్నాడు.


శ్రీకృష్ణుడి మాట : 


 "అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం  న కరిష్యసి
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి    || (2. 33



అథ చేత్ = కానీ, యిలా అయితే త్వం    = నీవు    ; ఇమం      ఈ యొక్క ధర్మ్యం = ధర్మమైన ; సంగ్రామం = యుద్ధము;  = కాదు / లేదు ; కరిష్యసి చేసిన వాడవు (భవిష్యత్తులో) తతః  = అప్పుడు  ; స్వధర్మం = కర్తవ్యము ( ఈ ధర్మ యుద్ధము) కీర్తిం  = కీర్తి , మంచి పేరు ;   = మరియు  హిత్వావదిలివేస్తే ; పాపం = పాపము  ; వాప్స్యసి = వస్తుంది, చుట్టుకుంటుంది   ; 


" కానీ, ఒకవేళ నీవు,  ఈ ధర్మయుద్ధం చెయ్యకపోతే, నీ కర్తవ్యము నుండి, నీ ధర్మము నుండి వైదొలగినవాడవౌతావు. అందువలన నీకు పాపము కూడా చుట్టుకొంటుంది. "  


ధర్మయుద్ధం చెయ్యడం క్షత్రియుని ముఖ్య కర్తవ్యము. అందులో విజయమైనా సంప్రాప్తించ  వచ్చు; లేదా, వీరమరణమైనా  పొంద వచ్చు. విజయం లభిస్తే భూలోక సుఖాలు, ప్రజల మధ్య కీర్తి ప్రతిష్టలు వస్తాయి. వీరమరణం పొందితే, స్వర్గద్వారాలు తనకోసమే తెరుచుకుని స్వాగతిస్తాయి. 


అటువంటి ధర్మయుద్ధం చెయ్యకుండా వైదొలగితే తన కీర్తిప్రతిష్టలూ దెబ్బ తింటాయి. ఘోరమైన పాపమూ చుట్టుకుంటుంది - అంటున్నాడు శ్రీకృష్ణుడు 


కారణం చేతనైనా యుద్ధం నుండి పారిపోవడం క్షత్రియ లక్షణం కాదు. పిరికితనం వలన కానీ,  శత్రువులలో నాకు సంబంధించిన, లేదా నాకు నచ్చిన వారున్నారు అన్న కారణం వలన  కానీ, క్షత్రియ ధర్మమైన యుద్ధం నుండి  వెనుతిరిగి పోరాదు.  అలా వెనుతిరిగి  పొతే, యింకా ఏమేమి జరుగుతుందో చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు ముందు వచ్చే శ్లోకాలలో. అవి మరో వ్యాసంలో చూద్దాం. 

ధర్మ యుద్ధం అంటే ఏమిటి ? దీన్ని గురించి ప్రస్తుత కాలంలో కూడా కొన్ని విషయాలు మనము జ్ఞాపకం వుంచుకోవాలి. 

1. ధర్మ రక్షణ కోసం చేసే యుద్ధం , అధర్మంతో నిండి వుండే ప్రశాంతత కంటే ఎంతో మేలు. 
2. ప్రపంచంలో, సమాజంలో, అధర్మం ఎందుకు పెరుగుతుంది - అన్న ప్రశ్నకు  సమాధానం - ధర్మాతుల, నిజాయితీపరుల మౌనమే అన్నది చారిత్రక సత్యం. నిజాయితీపరులు మౌనం వల్లనే, అధర్మానికి బలం వస్తుంది, అన్నది నిర్వివాదాంశం. 
3. అందుకే, అధర్మం పైన యుద్ధం - క్షత్రియ ధర్మము అన్నాడు శ్రీకృష్ణుడు. నువ్వు యుద్ధం చెయ్యకపోతే నీకు పాపము, నరకము సంప్రాప్తిస్తుంది, అన్నాడు. అది మనకూ వర్తిస్తుంది. కేవలం అర్జునుడికి మాత్రమే కాదు.   
4. మనం చేసేది ధర్మ యుద్ధమేనా  అన్నది నిశ్చయం చేసుకోవాలి. మన మనసులో వున్న కారణం, మన ధ్యేయము ధర్మమేనా, లేదా, మన స్వార్థమా - అన్నది ముఖ్యంగా చూసుకోవాలి. 
5. మన యుద్ధం  కేవలం అధర్మం పైనేనా, అందులో అమాయకులపైనా, అధర్మానికి సంబంధించని వారిపైన కూడానా - అన్నది పరిశీలించుకోవాలి. 
6. అధర్మం  పైన, అంటే, అధర్మం చేసే వారిపైన యుద్ధం. వారెవరో, మనకు బాగా తెలుసా? వారిని, వారి పద్ధతులను మనం బాగా తెలుసుకోవాలి. 
7. శత్రువుల మధ్య చిక్కుకు పోయిన ధర్మ పరులకు, మన వైపు, ధర్మం వైపు రావడానికి అవకాశాలు యివ్వాలి. భారత యుద్ధానికి ముందు యివన్నీ జరిగాయి. శ్రీకృష్ణుడి రాయబారము అందుకే. శ్రీరాముడు విభీషణాదులకు శరణు యివ్వడం కూడా అందుకే. 
8. యుద్ధానికి ముందు, విజయావకాశాలను పూర్తిగా పెంపొందించుకోవాలి. అర్జునుడు యివన్నీ చేశాడు. సకల శాస్త్రాస్త్రాలను సంపాదించుకున్నాడు. భారత దేశం కూడా యివన్నీ చెయ్యాలి. 
9. శత్రువ్యూహాలను, పన్నాగాలను బాగా గమనించి తిప్పికొట్టటం తెలుసుకోవాలి. 
10. ధర్మ యుద్ధంలో శత్రు శేషం మిగల్చకూడదు. అర-కొర గా విడిచి పెట్టకూడదు.  ఒక్క అశ్వథామ ను విడిచిపెట్టినందువలన, పాండవ సైన్యము, పాండవ పుత్రులు అందరూ చనిపోయారు, అదీ, అశ్వథామ చేసిన ఘోరమైన అధర్మ యుద్ధంలో. 

70 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత మన సైన్యం యిప్పుడు ఈ విషయాలలో బాగా జాగ్రత్తలు తీసుకుంటూ వుంది. 
 
వ్యాసాలపైన - మీ అభిప్రాయాలను, విమర్శలను, అనుభవాలను కూడా నాకు మీరు తెలియ  జేస్తూ వుంటే చాలా బాగుంటుంది


సర్వే  జనాః సుఖినో భవంతు
  
= మీ   
    

ఉప్పలధడియం   విజయమోహన్ 
వజ్రాసనం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి