20, మార్చి 2012, మంగళవారం

యోగా ఎందుకు? అది కష్టమా, కాదా? దాని వలన ఏం లాభం? దాని వలన లౌకిక లాభాలు పోతాయా?



మన మాట వినే మనసు మనకు పరమ మిత్రుడు. మన మాట వినని మనసు మనకు   పరమ శత్రువు.

ఈ మాట అనింది శ్రీకృష్ణుడు. అర్జునుడితో - భగవద్ గీతలో.

గీతను మించిన మానసిక శాస్త్రము మరెక్కడా లేదు.

మన మనసు మన మాట వినదు. అది తానుగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ వుంటుంది. ఏదేదో ఆలోచనలు చేస్తూ వుంటుంది. దానికి ఈ నిమిషం కోపం వస్తుంది. మరో నిమిషం సంతోషం. మరో నిమిషం ఎవరినో తలుచుకుని కుళ్ళుకోవడం. మరో నిమిషం, ఎవరినో తలుచుకుని పొంగి పోవడం - యిలా ఏదేదో చేస్తూ వుంటుంది.

యిదంతా మనమే చేస్తూ ఉన్నామని మనం భ్రమ పడుతూ వుంటాం. ఎందుకంటే - మనసు ఎక్కడికి వెళ్ళినా, మనల్ని కూడా లాక్కుని వెడుతూ వుంటుంది. మనసు చేసే ఆలోచనలు - మన శరీరాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తూ వుంటుంది. మనసుకు కోపమో, వైరమో  ఎక్కువగా కలిగిందనుకోండి . మన శరీరంలో వొత్తిడి పెరిగిపోతుంది. మీకు  రక్తపు పోటు ఎక్కువ కావచ్చు. మీ హృదయంపై వొత్తిడి పెరిగి మరేదో కావచ్చు. మీ శరీరంలోని చక్కెర శాతం పెరగొచ్చు. లివర్ పైనో, చర్మం పైనో, కిడ్నీ పైనో - ఈ వొత్తిడి - తన ప్రభావం చూపొచ్చు. వొక్కొక్కరికి హృదయపుపోటు - (హార్ట్ అటాక్) రావచ్చు. చాల రోగాలు మనసునుండే   బయలు దేరుతాయనడంలో ఆశ్చర్యం లేదు. అవి మనల్నే కాదు. మనచుట్టూ వున్న వారిని కూడా ప్రభావితం చేస్తాయి.

మనసు గుణం - అది మన అధీనంలో వుండను - అని పట్టుదలగా వుండడం.

అర్జునుడు కృష్ణుడితో ఇదే మాట అంటాడు. నా మనసు నా అధీనంలో వుండనంటుందే    -  నేనేమి చేయ గలను, అని. శ్రీ కృష్ణుడు కూడా వొప్పు కుంటాడు.  తరువాత మార్గాలు చెబుతాడు.

సరే. మీ మనసు మీ అధీనంలో వుందా, లేదా? కాస్త టెస్ట్ చేసుకోండి. 

యిది కాస్త వినండి. ఆఫ్రికా లో  వొక నల్లటి.....గొరిల్లా కోతి వుంది.  దాని ఎత్తు ఆరు అడుగులు. అయితే - దాని తోక పొడవు కూడా ఆరు అడుగులే. తోక మాత్రం తెల్లగా వుంటుంది. కోతి మాత్రం చీకటి నలుపు. దాని కళ్ళు పెద్దవిగా..గోళాలు లాగా ... ఎప్పుడూ..ఎర్రగా వుంటాయి. దాని చెవులు చేట చెవులు...పెద్దవిగా..అవికూడా...తెల్లగా...తోక రంగులో వుంటాయి.. మరోసారి చదువుకోండి... నల్లటి ..గొరిల్లా..ఆరు అడుగుల ఎత్తు..ఆరు అడుగుల తెల్లటి తోక...అదే రంగు, పెద్ద (తెల్లటి) చేట చెవులు.. ఎర్రటి గోళాలు లాంటి కళ్ళు.. 

యిప్పుడు మీరు చేయాల్సింది చాలా సింపుల్. మీ కళ్ళు మూసుకోండి. అయిదు నిమిషాల పాటు... మీరు దేన్ని గురించైనా యోచన చేయ వచ్చు. ఆ  వొక్క గొరిల్లా కోతిని గురించి తప్ప... మీ వూరి పెద్ద మనుషులు గురించి యోచన చేయండి. మీ భార్య / భర్త / పిల్లల గురించి యోచన చెయ్యండి. ఏదైనా సరే... మీరు ప్రేమలో పడి వుంటే..మీ ప్రియుడిని గురించో, ప్రియురాలిని గురించో.. ఎవరి గురించైనా సరే.. మీ ఇష్టదైవాన్ని గురించైనా సరే... మీరు యోచన చెయ్యండి వొక్క అయిదు నిమిషాలు... కాని - వొక్కటే మీరు యోచన చెయ్య కూడని విషయం.. ఆ వొక్క గొరిల్లా కోతిని గురించి తప్ప.

చేయండి మరి........అయిదు నిమిషాలు తప్పక చేయండి.

చేసారా... యిప్పుడు చెప్పండి..మీ మనసు మీ మాట వింటుందా... వినదు.

మీరు తెల్లారి లేచినప్పటి నుండి...తన రామాయణం మొదలు పెడుతుంది. మీ ప్రసక్తే లేదు...మీరు కావాలన్నా..వద్దన్నా.. ఎన్నో విషయాల గురించి ...యోచన చేస్తుంది..మీరు కావాలంటే.. మీకు నచ్చిన విషయాన్ని గురించి వొక్క నిమిషం లోపు..ఏదో కాస్త యోచనలు చేస్తుంది..కాని.. మధ్యలో..అది విడిచేసి..మరో విషయాన్ని పట్టుకుంటుంది... కోతి లాగా..వొక విషయం నుండి..మరో విషయానికి గెంతుతూ పోతూ వుంటుంది.. దానిపై..మీ కంట్రోలు ఏ మాత్రమూ లేదు. మీరు దాని కంట్రోలులో వున్నారనే విషయం మీకు   అర్థమై పోతుంది.

కృష్ణుడి భగవద్ గీతా శాస్త్రమంతా   - దీన్ని గురించే.  పతంజలి యోగ సూత్రాలన్నీ - దీన్ని గురించే. మన మనసునెలా - మన అధీనం లోకి తెచ్చుకోవడం. సరే. మనసును, మన అధీనంలోకి తెచ్చుకుంటే - ఏమవుతుంది?

పిచ్చివాడా - అప్పుడే - నువ్వు నిజంగా ఎవరో, నీకు తెలుస్తుంది. అంత వరకు, నువ్వు, మనసు నిన్ను ఆడించే కోతి ఆటలు ఆడుతూ పిచ్చివాడిగా వుంటావు. మనసు నీ అధీనంలోకి వచ్చేస్తే - నువ్వు - నిరంతరం వుండే అమృత మూర్తి వనీ,  ప్రపంచమంతా నిండి వుండే జ్ఞాన రూపుడివనీ.. నువ్వే..మహదానంద మూర్తివనీ  తెలుస్తుంది.

ఆనందం మరెక్కడో వెదక నక్కర లేదు. అది నీలోనే వుంది. అది నువ్వే.

నీకు మృతి లేదు. నీకు లేని జ్ఞానము లేదు. నీకు లేని ఆనందం లేదు.  నీనుండే - అందరికీ ఆనందం ఇవ్వొచ్చు. 

ఆంగ్లంలో -సర్వ సమర్థత, సర్వజ్ఞత, సర్వత్వత - ఆమ్ని ప్రెజెంట్, ఆమ్ని పొటెంట్, ఆమ్నిషెంట్ - అంటారు - అది మీకు మెల్ల, మెల్లగా  వచ్చేస్తుంది.

సంస్కృతంలో - సత్,చిత్, ఆనంద మూర్తి మీరే - అని అంటారు - యోగ శాస్త్ర వేత్తలు.

మరి యోగా గురువులందరూ చని పోయారు కదా? అని సందేహం వస్తుంది కదా. లేదు. వారికి మరణం లేదు. వారు వున్నారు. ఏ దేహాన్నయినా విడిచి పెట్టాల్సిందే. ఎవరైనా  సరే. మరో దేహాన్ని తీసుకోవాలనుకుంటే -  తీసుకోవచ్చు - యిది యోగులకు.

మనం - మరో దేహాన్ని తీసుకుని తీరాలి. ఎలాంటిది అనేది - మనం చేసే కర్మ ఫలాల పైన ఆధార పడి  వుంటుంది.  మనకు స్వతంత్రం లేదు. యోగులకు వుంది.

వారు సునాయాసంగా దేహం విడిచి పెట్టేస్తారు. సునాయాసంగా క్రొత్తది తీసేసుకుంటారు. లేదా -  దేహం లేకుండా వుండి పోగలరు.

యోగా దేనితో ప్రారంభించాలి? ఆసనాలతోనా? ప్రాణాయామాలతోనా?  రెండూ కాదు.

మహాత్మా గాంధీ గారు చెప్పిన  అహింస, సత్యములతో ! గౌతమ బుద్ధుడు చెప్పినదీ అదే.

పతంజలి మహర్షి చెప్పింది అదే. ప్రతి వొక్కరి మనసుకు - ఈ అహింస, సత్యముల సాధన తో - వొక మహా గొప్ప శక్తి, పరివర్తన, శుద్ధత వస్తుంది.అక్కడి నుండి - యోగ సాధన - చాలా సులభంగా జరిగిపోతుంది.

మరి ఈ కాలంలో - నిజం చెప్పి బ్రదుకగలమా?   కాస్త కష్టమైనా - ప్రయత్నం చేయాలి.

యిలా మరి కొన్ని నియమాలున్నాయి. తరువాత వస్తుంది - ఆసనాలు, ప్రాణాయామాలు. మొదటివి లేకున్నా - యివి కూడా , శారీరక, మానసిక ఆరోగ్యానికి - చాలా మంచివే. యివి - కాస్త సులభంగా చేయ గలిగేవి అవడం వలన - మాడెర్న్ గురువులు మొదట యివి చెబుతున్నారు.  యిలా, యివి మొదట చేయడం తప్పని నేను చెప్పను. యివి చేస్తూ సత్య సాధన , అహింసా సాధన చెయ్య వచ్చు.

సరే. కొంత మంది - ధ్యాన సాధనకు ముందు - కొన్ని చిట్కాలు చెబుతున్నారు. అవీ మంచిదే.

ఉదాహరణకు - శ్వాస మీద ధ్యాస. మీరు సాధారణంగా, ఊపిరి పీల్చి, విడుస్తూ వుండండి. ఈ ప్రక్రియ మీ ప్రమేయం లేకుండానే మామూలుగా జరిగి పోతూ వుంటుంది. మీరు మరిచి పోవడం ఊపిరి పీల్చడం నిలిచిపోవడం జరుగదు. యోగ సాధనలో - ఈ ప్రక్రియ మీ  శరీరంలో ఎలా జరుగుతూ  వుందో కాస్త గమనిస్తూ వుండండి.

మీరు ఈ శ్వాస ప్రక్రియను  చేయాలని చెప్పడం లేదు. సహజంగా జరిగే ఈ ప్రక్రియను మీరు గమనిస్తూ వుండండి కాస్సేపు. అది చాలు. అదే శ్వాస మీద ధ్యాస.

ఇదేమీ సులభం కాదు. మీ మనసు 10  సెకన్ల పాటు   శ్వాస మీద వుంటే గొప్ప. తరువాత , అది ఎక్కడికో వెళ్లి  పోతూ వుంటుంది. శ్వాస మీద ధ్యాస వదిలేసి - అది తనే చేయాలని మనసు చెబుతుంది. తరువాత మీరు కాస్త గట్టిగా ఊపిరి పీలుస్తారు.యిప్పుడు మీ  మనసు శ్వాసను గమనించడం లేదు. శ్వాసను తను చేస్తూ వుంది. చేస్తూ, చేస్తూ, పక్క వాళ్ళేం చేస్తున్నారో అని చూస్తుంది. వారూ చేస్తుంటే - వాళ్ళు బాగా చేస్తున్నారా, మీరు బాగా చేస్తున్నారా - అనే విషయం పైన రిసెర్చ్ చేస్తూ కూర్చుంటుంది. వాళ్ళ కంటే మీరు బాగా చేయాలి. యిదీ యిప్పుడు ధ్యాస.

యిలా మనసు ఎక్కడికో వెళ్లి పోతూ వుంటుంది. సరే. కాస్సేపటికి, శ్వాస సంగతి వదిలేసి - వారి గుణగణాలను మీ గుణగణాలను రిసెర్చ్ చేస్తూ వుంటుంది. యింకా ఎక్కడెక్కడికి వెళ్లి పోతూ వుంటుందో - చెప్పలేం.  కానీ అనూహ్యమైన చోట్లకు వెళ్లి వస్తూ వుంటుంది. అయినా, ఈ ప్రక్రియ చాలా మంచిదనే చెపాలి. మళ్ళీ, మళ్ళీ మనస్సును శ్వాస మీద పెట్టాలి. అది మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతూ వుంటుంది. మళ్ళీ, మళ్ళీ, దాన్ని వెనక్కు తీసుకు వచ్చి శ్వాస మీద పెట్టాలి.

అయ్యో, వెళ్లి పోయిందే - అని బాధ పడనవసరం లేదు. మళ్ళీ శ్వాస మీద ధ్యాస. మళ్ళీ, మళ్ళీ శ్వాస మీద ధ్యాస. అంతే.

పతంజలి చెప్పడం - శ్వాసను కాదు - డైరెక్టుగా - మీ మనస్సునే గమనించండి. దీన్ని ద్రష్టగా వుండడం, లేదా సాక్షిగా వుండడం అంటారు.

మీరు ఆలోచించరు.మీ మనస్సులో వచ్చే ఆలోచనలను అడ్డుకోరు. వద్దని చెప్పరు. వాటిని గమనిస్తూ వుంటారు. వాటి వెనుక మీరు పరుగెత్తరు . మీరే క్రొత్త ఆలోచనలను సృష్టించరు. ఆలోచనలలో - మీ ప్రమేయం వీలైనంత వరకు లేకుండా చూసుకుంటారు. గమనించడం, సాక్షిగా వుండడం - ద్రష్టగా వుండడం -యిదే మీరు ప్రాక్టీసు చేయాల్సింది.

ఈ - శ్వాస మీద ధ్యాస, మనసు పట్ల సాక్షీ భావం - మీరు ప్రయత్నించి చూడండి. రోజూ - కాస్సేపు, తెల్లవారి ఝామున, రాత్రి నిద్ర పోయే ముందు - వొక పది నిముషాల పాటు చేయండి.  రాలేదనో, కాలేదనో నిరుత్సాహం వద్దు. దీన్లో ప్రయత్నమే ముఖ్యం. ఏదో వొక రోజు - మీకు తెలియకుండానే - మీకు వచ్చేస్తుంది.  అంతే.

దీని వలన లాభమేమిటి? మీరు గమనించనంత   వరకు -  మనసు మిమ్మల్ని రక రకాలుగా ఆడిస్తూ వుంటుంది.

మీరు గమనించడం ప్రారంభిస్తే - అది మెల్ల మెల్లగా -నిజానికి చాలా మెల్లగా - తన తోక ముడుచుకుంటుంది. అనుకున్నంత సులభం కాదు. మీ మనసు వొక్కొక్క నిముషం మిమ్మల్ని తన వెంట లాగేస్తుంది. దానికి మీరు బాధ పడ నవసరం లేదు.  అయ్యో అనుకోనవసరం లేదు. అది అలాగే జరుగుతుంది. మళ్ళీ, మళ్ళీ, ద్రష్టగా, సాక్షిగా మీ పని ప్రారంభించండి.

మీరు విక్రమార్కుడు, భేతాళుడి కథలు విన్నారు కదా.  యివి మరేం కాదు. మీ, మీ మనస్సుల కథే.

విక్రమార్కుడు మీరు. భేతాళుడు మీ మనస్సు. పట్టు వదలని విక్రమార్కుడు మళ్ళీ, మళ్ళీ, చెట్టెక్కి, భేతాళుడిని తన భుజం పైన వేసుకుని  స్మశానం వైపు తీసుకెళ్ళుతుంటాడు . విక్రమార్కుడు మాట్లాడరాదు. సమాధానం యివ్వ రాదు. అదీ నియమం. కానీ భేతాళుడు వదలదు. ఏదో కథ చెబుతాడు. కడపట ఏదో ప్రశ్న వేస్తాడు.  సమాధానం తెలిసీ చెప్పక పోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది - అంటాడు. మరో మార్గం లేని విక్రమార్కుడు సమాధానం చెబుతాడు. అంతే. భేతాళుడు మళ్ళీ చెట్టెక్కి వెళ్లి పోతాడు. మళ్ళీ కథ మొదటికి. 

అంతిమ విజయం విక్రమార్కుడిదే. అప్పుడు, భేతాళుడు తన మిత్రుడవుతాడు. ఎన్నో రకాలుగా సహాయం చేస్తాడు.

నిజానికి - యిది - మన, మన మనస్సుల కథే.పట్టు వదలని వారికి, మనస్సు వశమవుతుంది. మిత్రుడవుతుంది. ఎన్నో రకాలుగా సహాయమూ చేస్తుంది.

అప్పుడు - మీ నిజ స్వరూపం మీకు అర్థమవడం ఆరంభమవుతుంది.

యిందులో - అంటే - మీ ప్రాక్టీసు జరుగుతున్నప్పుడు కూడా - మీకు ఎన్నో రకాల లాభాలున్నాయి.

మనకు అర్థం కాకుండా - మనకు ఎన్నో రకాల మంచి జరగడం మనం గమనించొచ్చు.

యోగా చేసే వారి పట్ల ప్రకృతికి ఎంతో యిష్టం ఏర్పడుతుంది.  వారికి ప్రకృతి ఎన్ని రకాలుగానో  తోడ్పడడానికి  ప్రయత్నిస్తుంది. యిది, యోగులకు కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది చాలా సార్లు.

మనుషుల్లో కూడా - చాలా మందికి - అంటే - యోగులకు దగ్గరైన వారికి - వారంటే - యిష్టం, పూజనీయ భావన ఏర్పడుతుంది. కానీ - దూరంగా వున్న మనుషులలో మార్పు అంత త్వరగా రాదు. రాకపోవచ్చు కూడా.

యోగా చేసే కొద్దీ - మీలో వున్న భయాలు పోతుంది. ఆనందం పెరుగుతుంది. ఆప్యాయత పెరుగుతుంది. ప్రేమ పెరుగుతుంది.  అందరూ మీ వాళ్ళ లాగే కనిపిస్తారు. చాలా విషయాలు - మీరు అనుకునే లోగా జరిగి పోతూ వుండడం మీరు చూస్తారు.

యిదెవరో చాలా గొప్ప యోగులకు మాత్రమే జరుగుతుందనుకోకండి.

ప్రాక్టీసు మొదలు పెట్టిన కొన్ని వారాలు, నెలలలోనే - మీరు - ఈ పరిణామం మీ జీవితం లోనే చూడొచ్చు. అనుభవించొచ్చు.

మీ మనసు మీ మిత్రుడుగా మారడం మీకే తెలుస్తుంది. ప్రకృతంతా - మీ మిత్రుడుగా మారడం మీరు చూడొచ్చు. క్రమ క్రమంగా - మీ దగ్గర వున్న వారిలో - మీ పట్ల ఎంతో సదభిప్రాయం కలగడం మీరు చూడొచ్చు.

మీ మనస్సులో - ఎంతో ఆనందం, శాంతి కలుగుతూ వుండడం మీరు అనుభవిస్తారు. ఈ ఆనందానికి - ఏ డబ్బు గానీ, అధికారం గానీ, సెక్సు గానీ సమం కాదనేది - మీరు గ్రహిస్తారు. సరే. ప్రాపంచిక సుఖాలకు మీరు దూరమై పోతారా? అదేం లేదు.  అవన్నీ మరింత ఆనందంగా అనుభవించ గల సామర్థ్యం మీకు వస్తుంది.

యిటువంటి ఆనందకరమైన మార్పులు మీ జీవితంలో రావాలని ఆశిస్తూ 

= మీ

వుప్పలధడియం విజయమోహన్






1 కామెంట్‌: