30, డిసెంబర్ 2011, శుక్రవారం

2012 వ సంవత్సరపు శుభారంభం = మీకందరికీ నా హార్దిక శుభాకాంక్షలు = 2011 ఎలా గడిచింది?

2012  వ సంవత్సరపు శుభారంభం 
ఈ శుభ సమయంలో -  మీకందరికీ నా హార్దిక శుభాకాంక్షలు .

2011  - మీ జీవితంలో ఎలా గడిచింది?

కొన్ని సుఖాలు, కొన్ని కష్టాలు; కొన్ని సంతోషాలు, కొన్ని దుహ్ఖాలు;

కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు; కొంత ఆరోగ్యం, కొంత అనారోగ్యం.


సరే. దేశానికెలా  గడిచింది?

లంచగొండితనం రాక్షస విహారం చేసింది. ధరల పెరుగుదల పారాకష్ట చేరింది.

రాజకీయాల్లో - అవినీతి మాత్రమే కాదు, తెలివిమాలిన తనం, కుల,మత రాజకీయాలు, 2011 లో ఎన్నో యింతలు పెరిగింది.

వొక బలిష్టమైన, సమర్థ వంతమైన, నిష్పాక్షికమైన    లోక్ పాల్ తీసుకురండని ప్రజల పక్షాన అన్నా హజారే గారు కోరితే - అందుకు, ప్రజలు, విపక్షాలు వారిని సమర్థిస్తే - చివరికి, రాజకీయ చదరంగంలోని - అన్ని రకాల చాణక్య నీతులూ ఉపయోగించి - ప్రభుత్వం - అది రాకుండా చేసింది. ముందేం జరుగుతుందో తెలీదు.  లోక్ పాల్ వస్తుందా, రాదా? గత 60 సంవత్సరాలలో - ఎందుకు రాలేదో  మాత్రం - చాలా స్పష్టంగా తెలిసి పోయింది.

అంతకు ముందు - అదే బాణీలో, బాబా రాం దేవ్ గారు - నల్ల ధనం గురించి చేపట్టిన ఆందోళన కూడా చాలా గొప్పదే. కాని - ప్రభుత్వం వారు, చేపట్టిన అర్దరాత్రి దాడి వలన - అది వీగిపోయింది.

మహాభారత యుద్ధం తర్వాత నిద్ర పోతున్న వీరుల పై అశ్వత్థామ  దాడి చేసి - వారిని చంపాడట.   ఆ పాపానికి - అప్పటి నుండి, యిప్పటి వరకు, కలియుగాంతం వరకు అశ్వత్థామ శిక్ష అనుభవిస్తూ వుంటాడట . నాకు మాత్రం - ఈసంఘటన తలుచుకుంటే - అదే జ్ఞాపకం వచ్చింది.

కాని - ప్రజలలో - రావాల్సిన స్పందన రాలేదు. రాందేవ్ గారు, పైనుండి క్రిందికి దూకాడట. ఎవరో ఆయన  శిష్యులిచ్చిన   చుడీదార్  వేసుకున్నాడట. నిద్ర నుండి లేచిన ఆ క్షణంలో  జరిగిన ఆ చిన్న చర్యను రకరకాలుగా ప్రభుత్వం వారు చెప్పుకున్నారు గానీ, ప్రజలూ దాన్ని విన్నారు గానీ -  ప్రభుత్వం నిర్వహించిన అమానుష చర్యను ఖండించాల్సినంతగా   ఖండించలేదనే  చెప్పాలి.

నా ఉద్దేశంలో - మన దేశానికి పట్టిన వొక రాక్షసి నల్ల ధనం. మరొకటి, దాని చెల్లెలు లంచగొండి తనం. రాం దేవ్ గారు మొదటి నుండి, మన దేశస్తుల నల్ల ధనం విదేశీ బాంకుల్లో  మూలుగుతోందనీ   - అది తీసుకు రాగలిగితే - మనం దేశం సుసంపన్నంగా వుంటుందనీ   -  చెప్పారు. కానీ - అది వెనక్కు తీసుకు రావడంలో - ప్రభుత్వానికి ఎంత మాత్రం - చిత్త శుద్ధి లేదని తెలుస్తూనే వుంది. ఎన్నో దేశాలు చేస్తున్న ఆ పని - మనం మాత్రం చేయడం లేదు. ఎందుకు? ఎందుకు?

అయితే - ప్రజల మనస్తత్వం విచిత్రమైనది. పక్కింటి వాడిని, రౌడీలో, పోలీసులో - కొడుతూ వుంటే - చంపేస్తే కూడా మనకేమీ పట్టనట్టు ఊరుకునే తత్వం   పెరిగిపోయింది మనకు. అది పోవాలి.

ప్రజల కంటే - టీం అన్నా సభ్యులు కూడా - రాం దేవ్ జీ గారిని - ప్రక్కన బెట్టడం - నాలుగెద్దులు, సింహం కథ లాగా వుంది. తరువాత - అదే పంథాను మళ్ళీ ప్రభుత్వం టీం అన్నా పై కూడా  ప్రయోగించాలని చూసింది.

కానీ - విపక్షాలూ, ప్రజలు, టీం అన్న సభ్యులూ బాగా మేల్కొనడంతో - చేయలేక పోయింది.

యూ.పీ.ఏ -1 ప్రభుత్వం దేశాన్ని నిజంగా,  అభ్యుదయ పంథాలో తీసుకెళ్ళిన  మాట   వాస్తవం. మరి అదే  యూ.పీ.ఏ -2  ప్రభుత్వం  - ఎందుకిలా ప్రవర్తిస్తోందో   అస్సలు తెలియడం లేదు.  ప్రధాని మన్మోహన్  సింగు గారు  యిప్పుడైన మేల్కొనాలి. వారిదైన - నిజాయితీ తో - ప్రభుత్వం నడపాలి. చెప్పుడు మాటలు పక్కన బెట్టి - మహాత్మా గాంధీ గారి పద్దతిలో - దేశాన్ని ముందుకు నడిపించాలి. తన పేరు చెడి పోతోందని, దేశం వక్ర మార్గాన్ని పట్టిందని - ఆయన అర్థం చేసుకోవాలి.

దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా - అస్తవ్యస్తం గా అయిపోతోంది. దేశ పాలనలో - తప్పులు చేయడమే -తమ వుద్యోగమన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. యిది చాలదన్నట్టు, ధరల పెరుగుదలను అరికట్టుతానంటూ -  రిజ ర్వు బ్యాంకి వారు - యిష్టం వచ్చినట్టు - వడ్డీ రెట్లు పెంచి - పారిశ్రామిక పెరుగుదలను పూర్తిగా తగ్గించేసింది. ప్రభుత్వం వారు ధరల తరుగుదలకు చేయవలసిన ఏ పనీ చేయలేదు.   దీనితో - కుక్క అరవాల్సిన చోట -గాడిద అరిచి దెబ్బలు తిన్న చందం అయిపోయింది. ధరలు తగ్గలేదు. అభివృద్ధి పడిపోయింది.

ఎవరు చెప్పినా - ఆర్.బీ.ఐ. పట్టించుకోవడం లేదు.

సరే. ఈ దెబ్బలతో - స్టాక్ మార్కెట్ - ఎప్పుడూ లేనంతగా పడిపోయింది. ఎన్నో, గొప్ప లాభాలు గడిస్తున్న కంపెనీల ధరలు కూడా -     ఎప్పుడూ లేనంతగా పడిపోయాయి.

అమెరికాలో - నిరుద్యోగుల సంఖ్య 6 %  దాటితే - వారు పెద్ద గోల పెట్టేస్తున్నారు. దానికి, ఎన్నో రకాల ప్రయత్నాలు, ప్లాన్లు అమలు చేస్తున్నారు. మన దేశంలో - నిరుద్యోగుల సంఖ్య ఎంత? చిరుద్యోగుల సంఖ్య ఎంత?

గణాంకాలే లేవు. మరి ప్లాన్లు ఎక్కడి  నుండి వస్తాయి? ఇంజనీరింగ్ చదివి నిరుద్యోగులు గానూ, చిరుద్యోగులు గానూ - వున్న వారిని ఎంతో మందిని నేను చూస్తున్నాను. అయిదు వేల రూపాయలు కూడా మాస వేతనం లేని , పట్ట భద్రులయిన నర్సులను, పది వేల జీతంతో పని చేస్తున్న డాక్టర్లను  చూస్తున్నాము.

ఈ పధ్ధతి మారేది ఎప్పుడు? అసలు యిది ఎవరు పట్టించుకుంటారు, ఎప్పుడు?

యిది చాలదన్నట్టు - రీటైల్ ఆర్ధిక వ్యవస్థలో - వాల్ మార్ట్ లాంటి విదేశీ కంపెనీలను తీసుకు రావాలని ప్రభుత్వం రకరకాల వాదనలు చేస్తోంది. తెచ్చేస్తానని బెదిరిస్తోంది. మన దేశంలో, వ్యవసాయం తరువాత - ఉపాధి కల్పన ఎక్కువగా వున్న మొదటి రంగం రీటైల్ వ్యవస్థ. అందులో - దాదాపు ఆరుకోట్ల మంది వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. నిస్సందేహంగా, వీరిలో - అసమర్థత, వుంది. లేదని కాదు. అదే అసమర్థత అన్ని రంగాల్లోనూ - వుంది. దాన్ని సవరించడానికి బదులు - వారి స్థానంలో - విదేశీ సంస్థలను తెస్తాననడం - ఏ మాత్రం న్యాయంగా లేదు. ప్రభుత్వ   రంగంలో - నికరంగా - వొక్క ఉద్యోగమూ సృష్టించ లేని ప్రభుత్వం, ఏకంగా, కోట్ల వుపాధులపై వేటు వేయ బూనడం,  చాలా ప్రమాద కరమైన విషయం. దీని వల్ల వ్యవసాయ దారులకు, వాడకం దారులకు మేలు జరుగుతుందట. అది తప్పని వాల్ మార్ట్ పుట్టిన దేశంలోనే మనకు తెలుస్తూ వుంది.

వొక వేళ రైటే అయినా  - మధ్య వాడిని చంపేస్తే, వాడి అన్నకూ, తమ్ముడికీ ఆస్తి ఎక్కువగా వస్తుంది - అన్న వాదనలాగా వుంది, యిది.  మరి, మధ్య వాళ్ళ నందరినీ చంపేద్దామా?

ప్రక్కనింటి   వాడి పెళ్ళాం కు ముక్కు బాగుందని -స్వంత పెళ్ళాం కు విడాకులిచ్చేసి - ఆవిడను పెళ్లి చేసుకున్నాడట. తరువాత తెలిసింది - ఆవిడ ముక్కు బాగుందని; మెదడు మాత్రం సరి లేదని.  ఇలాంటి పిచ్చి పనులు యిప్పుడు చాలా చూస్తున్నాము.

సరే. ప్రభుత్వం మారాలంటే - మనం చాలా మారాలి.

2012  లో  ప్రభుత్వం తీరు మారుతుందని - ఆశిద్దాము. నాకు మాన్ మోహన్ సింగు గారిపై - చిన్న ఆశ యింకా వుంది.

యింట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. మనం 2012 లో యింట గెలవాలి. యింట్లోని   అందరి మనసులనూ గెలవాలి. ప్రతి యింట్లోనూ - ప్రేమ, అభిమానం, సంతోషం, ఆదరణ చాలా, చాలా పెరగాలి. అహంకారము, కక్షలు, కార్పణ్యాలు పూర్తిగా పోవాలి.

పొరుగు వాడితో సఖ్యత పెరగాలి. పెరగాలంటే - పొరుగు వాడిపై నమ్మకం పెరిగేటట్లు - అందరం ప్రవర్తించాలి.  పొరుగు వాడి కష్టంలో - అడగకుండా మనమే సహాయం అందించే మనస్తత్వం పెరగాలి.

మన దేశంలో - దరిద్రమూ వుంది. మధ్య వర్గమూ వుంది. ధనిక వర్గమూ వుంది. దేశంలోని - అందరు బీద పిల్లలకూ - చదువూ, తిండీ -లోటు లేకుండా చేయడానికి మన వంతు సహాయం మనం ప్రతి వొక్కరూ చెయ్యాలి.  ఏదో వొక శరణాలయానికి, మీ వంతు సహాయం మీరు తప్ప కుండా చెయ్యండి. మీకు తెలుసు. మనం వెళ్ళేటప్పుడు మనతో, వచ్చేది ఈ మంచి (చెడు) పనుల ఫలితం మాత్రమే. యిచ్చేటప్పుడు వున్న సంతృప్తి, మరెప్పుడూ వుండదు.

ఈ కాలంలో -మరో జాడ్యం ప్రబలి పోతోంది. వొక ప్రక్క వయసయిన తల్లి తండ్రులను గమనించడం లేదు. మరో వైపు పిల్లలనూ గమనించడం లేదు. తల్లి దండ్రులపై గౌరవం పెరగాలి. పిల్లలపై ప్రేమ పెరగాలి. యిది రెండూ - సామాజిక వ్యవస్థకు పునాదులు. ఈ పునాదులు కూలిపోతే - మొత్తం వ్యవస్థే కూలిపోతుంది.

నా ఉద్దేశంలో - ఆడ వాళ్లకు - మెట్టినింటిపై   - గౌరవం, మమకారం క్రమక్రమంగా సడలి పోతోంది.  దీనికి - ఎన్నో కారణాలు. వచ్చిన కోడలిపై ప్రేమ చూపక పోవడం వొక కారణం. మరో వైపు, వచ్చే కోడళ్ళకి కూడా, పెద్ద వారిపై ఏ మాత్రము గౌరవం లేక పోవడం మరో కారణం. మన వ్యవస్థను కూల్చేసే చట్టాలు - మరో కారణం. ముఖ్య కారణం, ఆడవారిలో - సహనం బాగా తగ్గి పోతోంది. ప్రేమాభిమానాల స్థానంలో - అహంకారం పెరుగుతోంది. మా చిన్న తనంలో చెప్పే వారు - మగ వాడు చెడితే - వాడు మాత్రమే చెడతాడు; ఆడది చెడితే - ఊరంతా చెడుతుందని.

మన వ్యవస్థలో - ఆడ వాళ్ళకున్నంత గౌరవం - మరెక్కడా లేదు. ఆ గౌరవం తరగరాదు. అదే సమయంలో - ఆడవాళ్ళు - యింటికీ, దేశానికి చెడ్డపేరు తీసుకు రారాదు. ఈ మధ్య కొన్ని చోట్ల కొంత మంది ఆడ వారు, స్లట్ వాక్  అని - మా యిష్టం వచ్చినట్టు, మేము దుస్తులు వేసుకుంటాం, మా యిష్టం వచ్చినట్టు - మేము రోడ్లపై నడుస్తాం - అని ప్రదర్శనలు యిచ్చారు. యింత కంటే మూర్ఖత్వం మరోటి లేదు.  యిలా జరుగుతూ, జరుగుతూ, యిప్పుడు అమెరికా లాంటి దేశాలలో - పరిస్థితి ఏమిటంటే - వొకరిపై వొకరికి ఆకర్షణ పూర్తిగా పోయి, మగ వారిని మగవారు; ఆడవారిని ఆడవారు పెళ్లి చేసుకునే  స్థితికి వచ్చేసింది. యిప్పుడిప్పుడు, మన దేశంలో కూడా, యిది పెరుగుతూ వుంది. ఈ పరిస్థితి మారాలి. ఆడవారిలో - ఎంతో మంది మేధావులున్నారు. వారు, యిటువంటి వాటిని మార్చడానికి పూనుకోవాలి.

సరే. ఈ పరిస్థితికి కారణం 50  శాతం  మగవారిలో చోటు చేసుకున్న - విశ్రుంఖలత్వం  అని చెప్పక తప్పదు. నీకొక రూలు, నాకొక రూలు - అని మగ వాళ్ళు ప్రవర్తించడం మానాలి. రామాయణమంతా -  అదే చెబుతుంది.

మగ వారిలో - భార్యా పిల్లల పట్ల ప్రేమ, గౌరవం, బాధ్యతాయుతమైన ప్రవర్తన చోటు చేసుకోవాలి. మనం మారుతామా? 2012  లో మనం మారాలి.

2012  వ సంవత్సరానికి -కొన్ని ప్రత్యేకతలు వున్నాయని అంటారు.

ప్రపంచం ఏదో అయిపోతుందని - మాయన్ సంస్కృతి వారు వేల  ఏండ్ల క్రిందట రాసి పడేసారు. డిసెంబర్, 21 వ తేదీ నాడు, ఆ తేదీ దగ్గర - ఏదో అయిపోతుందని - వొక నమ్మకం. మిగతా ప్రత్యేకతలు, మరో సారి మాట్లాడదాం.

అయితే, గియితే - ఏం పరవాలేదు. మనమంతా, వొక్క సారి ఎక్కడికి వెళ్ళినా - మంచిదే. ఎక్కడికి వెళ్ళితే - అదే మన ప్రపంచం అయిపోతుంది. దాన్ని గురించి వచ్చే వదంతులను ప్రక్కన పెట్టండి.

దేశమును ప్రేమించుమన్నా ; మంచి అన్నది పెంచుమన్నా -అన్నది ఆర్యోక్తి.

కుల, మత, ప్రాంతీయ, భాషా విభేదాలను ప్రక్కన పెట్టి -మనమంతా వొక్క కుటుంబమే , మనమంతా సహోదరులమే. ప్రేమైక జీవులమే - అని గ్రహించి - మన యింటిని, ఊరినీ, దేశాన్ని - నందన వనం చేద్దాం.   

= మీ

వుప్పలధడియం విజయమోహన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి