16, డిసెంబర్ 2011, శుక్రవారం

పరంజలి యోగ సూత్రాలు = 2.36 = సత్యానికి బలం ఎంత? మీకు తెలుసా? = యోగి వాక్కు బ్రహ్మ వాక్కు =జరిగి తీరుతుంది

పరంజలి యోగ సూత్రాలు 
2.36  =  సత్య ప్రతిష్ట 

గత రెండు మూడు నెలలుగా - నా బ్ల్లాగు - వైజ్ స్పిరిచువల్ ఐడియాస్.కాం లో -   పతంజలి యోగ సూత్రాలకు, ఆంగ్లంలో వ్యాఖ్యానము రాస్తున్నాను.  అది రాయడానికి, స్వామీ వివేకానందా, స్వామీ గురుపరానందా, స్వామీ శివానందా,  ఓషో లాంటి  వారి  వ్యాఖ్యానాలూ పరిశీలించి , గీతలోని ధ్యాన యోగాన్నీ పరిశీలించి ఆకళింపు చేసుకునే రాస్తున్నాను.

ఎన్నో ఏళ్ళుగా రక రకాల ధ్యాన ప్రక్రియలు పాటిస్తున్నా - యిది రాసేటప్పుడు - నేను చేస్తున్న పొరబాట్లను సరిదిద్దుకోవడానికి  ఎంతో ఉపయోగంగా వుంది.

కొన్ని, కొన్ని విషయాలు చదివితేనే చాలు. మనం చేసేస్తామని అనిపిస్తుంది.

కొన్ని కొన్ని విషయాలు పతంజలి మహర్షి చెప్పినవి - మహాత్ములు వ్యాఖ్యానించినవి  -  చాలా ఆనంద పరుస్తుంది.

అందులో మచ్చుకు వొక్కటి క్రింద ఉదాహరిస్తున్నాను.

సాధన పాదంలో -36 వ సూత్రంలో యిలా చెప్ప బడింది.

సత్య ప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వం.

దీనికి వివేకానందుల   వారి వ్యాఖ్యానం ప్రకారం - సత్యంలో నెలకొని వుండటం వల్ల యోగి (తన కొరకూ, యితరుల కొరకూ కూడా) కర్మలను చేయకుండానే కర్మ ఫలాలను పొందే శక్తి సంపన్నుడౌతాడు.

యిలాగే, స్వామి గురుపరానందా, తదితరులు కూడా సత్య నిష్ఠ తో వున్న యోగి వాక్మహిమ ను గురించి చాలా చెప్పారు.  

యోగి ఏమన్నా - దీవించినా, శపించినా -  అది జరిగి పోతుంది.యోగి సాధారణంగా శపించడు.   ఆయనకు కష్టం కలిగిస్తే చాలు. ఆయన ఏమీ అనక పోయినా - కలిగించిన వాడికి వినాశనం తప్పదు. ఆయన ఆజ్ఞా పాలన చేయడానికి, ఆయన మనస్సుననుసరించి  నడవడానికి -   ప్రకృతి సంతోషంతో కాచుకుని వుంటుంది.

భారత సంస్కృతిలో - యిది అందరికీ తెలుసు. ఏ యోగి మన వూరికి వచ్చినా - సాధారణంగా - అందరూ వెళ్లి - వారి ఆశీర్వచనం తీసుకోవడం మనం చూడొచ్చు.  ముఖ్యంగా చిన్న పిల్లలను వారి పాదాలకు నమస్కరింప చేసి - ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీగా వుంది.

అసలు సాయి బాబా లాంటి - పరమపదించిన యోగుల శిలా విగ్రహాలపై కూడా - పసిపాపలను పడుకోబెట్టి ఆయన ఆశీర్వాదము, అనుగ్రహమూ కోరుకొనే  వారు ఎందరో వున్నారు.

ఏసుక్రీస్తు - అడగండి. మీకు యివ్వ బడుతుంది - అన్నారు. అయితే - ఎవరిని అడగాలి. ఎం అడగాలి అన్నది ముఖ్యం. ఎదురుగా వున్న దైవ స్వరూపులు, సత్య స్వరూపులు యోగులు. వారిని అడగండి. ముఖ్యంగా వారి ఆశీర్వాదం అడగండి.

యోగి అంటే, ముక్కు మూసుకుని కూర్చొన్న వారు మాత్రమే కాదు. కొద్దో, గొప్పో, సత్య నిష్ఠ వున్న వాళ్ళందరికీ - ఈ ఆశీర్వాద బలం వుంటుంది. సత్య నిష్ఠ వున్నవారందరూ యోగ సాధకులే. అటువంటి సత్య సాధకులు మీ వూళ్ళో, మీ ఎదురుగా కూడా వుండొచ్చు . వారి వారి సత్య నిష్టను బట్టి, వారి వారి ఆశీర్వాద బలం వుంటుంది.

ఈ కాలంలో కూడా - చాలా మంది యోగుల వెనుక కోట్ల కొద్ది శిష్యులు వుండటం మనం చూడొచ్చు. వారికి గురువులు ఏం ఇస్తున్నారు? రెండు మంచి మాటలు. హృదయ పూర్వక ఆశీర్వాదమూ.  అంతే. వాటితోనే - వారి మనస్సులో - మహదానందం నింప గల శక్తి ఆ యోగుల మాటల్లో వుంది.

కానీ - అటువంటి కొంత మంది యోగుల పై అసత్య ఆరోపణలు చెయ్యడం, వారిపై కేసులు బనాయించడం, వారిని జైలుకు పంపించిన సంఘటనలూ   జరిగాయి కొన్ని. వాటిని పరిశీలిస్తే - అవి చేసిన వారిపై -ప్రకృతి ఎంత తీవ్రంగా స్పందించిందో   - మనకు అర్థమౌతుంది. ఎంతో ఆర్ధిక, రాజకీయ, ఉద్యోగ   బలాలు అన్నీ వున్న వారిగా కనిపించిన వారు డిస్మిస్ కావడమూ, వారి కుటుంబాలు అనారోగ్యాల   పాలు కావడము, వారు అర్ధాంతరంగా చని పోవడము - మరి కొంత మంది వేరే ఎన్నో కేసుల్లో చిక్కుకోవడం లాంటివన్నీ చాలా జరిగాయి. 

కానీ ఆ యోగుల జీవితంలో జైల్లో వున్నా మార్పు రాలేదు.  వారు వీరిని తిట్టడమో, దూషించడమో  జరుగలేదు. వారిపై వచ్చే ప్రతి అభియోగానికీ - ప్రకృతి స్పందించడం చాలా ఆశ్చర్యంగా మనకు కనిపిస్తుంది.  కానీ - యిది ఎప్పటికైనా వారికి అర్థం అవుతుందా - అంటే - ఏమో. యిటువంటివి వచ్చినప్పుడు - మనం అప్పుడు చేసిన ఆ కర్మకు - యిది, యిప్పుడు  ఫలితం  అని తెలియడం విజ్నులకే గానీ అజ్నులకు సాధ్యం కాదు.

యిక ముందు కాస్త నిశితంగా చూడండి. యోగులకు చెడ్డ చేసే వారిపై ప్రకృతి ఎలా స్పందిస్తుందో?

అయినా - యోగులను గౌరవిస్తే, వారి ఆశీర్వాదం, వారి సలహా స్వీకరిస్తే - మేలు జరుగడం మాత్రం ఖాయం. 
 మనం వారి సత్-ప్రయత్నాలకు చేదోడుగా ఏదైనా చేస్తే - యింకా మంచిది. దీన్ని పంచ మహా యజ్ఞాలలో - రుషి యజ్ఞం అంటారు. రుషి యజ్ఞానికి ఫలితం చాలా గొప్పది.

ఈ మేలు - మీకు, ఎలా, ఎప్పుడు జరుగుతుంది? - అదీ విజ్నులకే తెలుస్తుంది. కానీ మీకు మేలు జరగడం ఖాయం. యిది పతంజలి చెప్పారు. శ్రీ కృష్ణుడు చెప్పారు. వేదాలు, వుపనిషిత్తులు, పురాణాలు, ఇతిహాసాలు - అన్నిటిలో చెప్పబడిన అంశం యిది.

మనం చేయవలసిన, సులభంగా చేయదగిన పని - యోగులను గురువుగా అనుకోవడం. వీలైనప్పుడు, వారి సన్నిధికి వెళ్లి వారి ఆశీర్వాదం స్వీకరించడం, వారి మహత్-ప్రయత్నాలకు మనం చేయ గలిగిన సహాయం చేయడం.

యింతకు మించి ఏమైనా చేయ గలరా? గలరు! మీరే సత్య నిష్టా పరులు అవడానికి ప్రయత్నించండి. మీరే యోగ విద్య అభ్యసించండి. అదేమంత   కష్టమైన విషయం కాదు.

బురద నుండి బయటకు వచ్చి మనల్ని మనం కడుక్కున్నట్టు వుంటుంది.  అంతే.

= మీ

వుప్పలధడియం విజయమోహన్

వివరణ : యోగులకు కష్టం కలిగించే వారికి ప్రకృతి దండన విధిస్తుంది. అది సరే. మరి యోగులకు కష్టాలెందుకు? ఈ సందేహం చాలా మందికి వస్తుంది. యోగులకు కష్టాలేమీ  లేవు. కానీ ప్రతి సాధనకూ - అప్పుడప్పుడూ - శోధన (పరీక్ష) వుంటుంది. ఆ శోధన యోగి మనః శక్తిని పెంచడానికే. అది మామూలే. ఆ శోధన యోగికీ తెలుసు. 

రమణ మహర్షి గారికి రాచపుండు వచ్చింది. ఆయనేం బాధ పడ లేదు. ఆయనకు తెలుసు. వొక్కొక్క శోధనతో, యోగి వొక్కొక్క మెట్టు పైకి వెళ్ళుతుంటాడు. 

హరిశ్చంద్రుడికి వచ్చిందీ శోధనే కాని కష్టం కాదు. హరిశ్చంద్రుడు కష్టం అని - ఈ విశ్వామిత్రుడేమిటి - యిలా చేస్తున్నాడే అంటే చాలు -   ప్రకృతంతా అంతటి విశ్వామిత్రుడిపైన విరుచుకు పడేది. కాని ఆయన అలా అనుకోలేదు. అదంతా - తన సత్యవ్రతానికి వచ్చిన శోధన అనుకున్నాడు.  లేదంటే - ఆయన మానవుడుగా వున్నా - బ్రహ్మ సభలో చర్చనీయుడయ్యే వాడా? 

శోధన అని తెలిసున్న యోగికి కష్టాలంటూ ఏం లేవు. వారి మనసులో - ఎప్పుడూ - ఆనందమే.

3 కామెంట్‌లు: