30, నవంబర్ 2012, శుక్రవారం

ఉపనిషత్తులలో - యింత గొప్ప సామాజిక న్యాయం మనం తీసుకు రాగలమా? - అన్నం న నింద్యాత్ - అతిథి దేవో భవ - ఆకలి లేని రాజ్యం -


ఉపనిషత్తులలోని సామాజిక న్యాయం 



ఉపనిషత్తులు మన వేదవాంగ్మయం లోని అంతర్గత భాగాలు.అవి ఎప్పుడు రాయ బడ్డాయో ఎవరికీ తెలీదు. పది వేల సంవత్సరాలూ వుండొచ్చు. పది లక్షల సంవత్సరాలూ వుండొచ్చు. అవి ఎప్పటివో?

కృష్ణుడు పుట్టడానికి ముందటివి. రాముడు పుట్టడానికి ముందటివి. అంతకు ముందు ఎవరెవరు వున్నారో ఎలా వున్నారో - ఉపనిషత్తుల నుండి కొద్దిగా మనకు తెలుస్తుంది.  

ఉపనిషత్తుల పని - అప్పటి చరిత్ర , అప్పటి సమాజం గురించి చెప్పడం కానే కాదు.

 మనం చూస్తున్నది నిజమా, దీనిని మించిన నిజం మరేదైనా వుందా - అన్న దానిపై విస్త్మృతమైన  పరిశోధన  చేశారు అప్పటి ఋషులు. అప్పట్లో - వారు ఋషులు మాత్రం కాదు;మహా దూర దృష్టి  గల, సత్య వాక్పరిపాలకులైన వైజ్ఞానిక పరిశోధకులు  కూడా .

ఏది సత్యం, ఏది సత్యం - అని సత్య సాధనకై, సత్య శోధనకై , సత్య సాక్షాత్కారానికై తమ జీవితాలను,  ధారపోసిన మహానుభావులు.  

వారు చెప్పిన ఉపనిషత్తులు  మనం చదవక పోతే - మన జీవితాన్నే మనం వ్యర్థం చేసినట్టు - అన్న  విషయం - 60 ఏళ్ళ వయసు తర్వాతనే  నాకు తెలిసి వచ్చింది. రిటైర్ అయిన తర్వాత - స్వామి పరమార్థానంద గారి క్లాసులకు వెళ్లాను. మరెంతో మంది ప్రవచనాలు వింటూ వచ్చాను.

అవి మొదట పెద్దగా రుచించలేదనే మాట వాస్తవం. కానీ వాట్లో వున్న గొప్ప గొప్ప వాస్తవాలు  అర్థమయ్యే కొద్దీ - నా  మెదడు -లోని అవాస్తవికత  మెల్ల మెల్ల గా దూరం అవుతూ వుంది.

వారి  ఆలోచనా పటుత్వం -    ఎన్ని వేల, లక్షల సంవత్సరాల నాటిదైనా - యిప్పటి కంటే  చాలా గొప్పది అనడంలో - నాకు మాత్రం సందేహం లేదు.

వాటిలో న్యాయం వుంది. ధర్మం వుంది. మనం ఈ నాడు మాట్లాడే సామాజిక న్యాయమూ వుంది. అవే, మరో లక్ష సంవత్సరాలైనా, మన పరిస్థితులు ఎలా మారినా - ఎప్పుడూ నిలకడగా నిలువ గలిగేవి.

యిప్పుడు మనం మాట్లాడే న్యాయాలు - చాలా, చాలా పేలవమైనవి;    కొన్ని - సంవత్సరాల్లోనే  ఈ నాటి న్యాయాలు - రేపటి అన్యాయాలుగా మారేవి. నిజానికి న్యాయానికై  మనం చేసుకున్న ఎన్నో చట్టాలు, ఇప్పటికే - అన్యాయాలకు  నిలయమై పోయాయి. చాలా చట్టాలలో - న్యాయం జరగడం లేదనేది వాస్తవమైన విషయం. 

అంతే కాదు. ఏ వొ క్కరికీ - నిజమైన సంతోషాన్ని, న్యాయాన్ని  చేకూర్చ లేనివి - మనం ఈ రోజు పెట్టుకుంటున్న ఈ నాటి న్యాయాలు, చట్టాలు .

వీటితో పోల్చి చూస్తే - ఉపనిషత్తుల నాటి న్యాయాలు - ఎంతో బాగున్నాయి.

అందుకు కొన్ని ఉదాహరణాలు మాత్రమే -యిక ముందు, కొన్ని వ్యాసాల్లో,  మీ ముందు వుంచుతున్నాను.

ఇవేవీ చట్టాలు కాదు. యివి,సరాసరి మనుషులైన మనం పాటించ వలసిన కనీస నియమాలు.

కొన్ని నియమాలు , మనిషి, మహా మనీషిగా మారాలంటే పనికొచ్చేవి. మరి కొన్ని మనమే దేవుడు గా మారాలంటే - పనికొచ్చేవి. 

యిప్పుడు మొదట తైత్తిరీయ ఉపనిషత్తు లోని కొన్ని సూత్రాలు నియమాలు, సందేహాలకు సమాధానాలు - యివి మీ ముందుంచుతున్నాను. 

1. అన్నం న నింద్యాత్  . తద్ వ్రతం. (తై .ఉ. 3.7). 


    మనం ఆహారాన్ని ఎప్పుడూ నిందించరాదు  - అనేది వొక వ్రతం. అన్నాన్ని నిందించని వాడే - బ్రహ్మజ్ఞానానికి    అర్హుడు. అటువంటి వాడికే - పుష్కలంగా - అన్నం కూడా యివ్వ బడుతుంది. అన్నాన్ని నిందించే వాడికి - సరైన ఆహారమూ దొరకదు. అది పుష్కలంగానూ యివ్వ బడదు యిచ్చినా, అతడు, ఆ ఆహారాన్ని తినలేని పరిస్థితుల్లో వుంటాడు - యిలా ఎన్నో చోట్ల ఉపనిషత్తులలో చెప్పబడింది.  యిక్కడ - అన్నము, లేదా ఆహారము అంటే - మనం అనుభవించే అన్నిటినీ - అని కలిపి చెప్పుకోవచ్చు.

నిందించడమంటే - తిట్టడం మాత్రమే  కాదు. తట్ట లోనో, ఆకులోనో వేసుకున్న ఆహారాన్ని, ఎవరిపైననో కోపం తో  విసిరి వేయడం, చేసిన వారినో, వండిన వారినో తిట్టడం కూడా యిందులోకే వస్తుంది. - మనలో కొంత మంది ఇలాంటివి ఎన్నో చేస్తాము. యిది బాగు లేదు, అది బాగు లేదు - అనడం కూడా పనికి రాదు. యివన్నీ చేయ రాదు. దీని తరువాత మరి కొన్ని వస్తాయి. అవీ చదవండి.

2.అన్నం పరిచక్షీత.   తద్ వ్రతం. (తై .ఉ. 3.8). 


అన్నాన్ని నిరసన  భావంతో ఎప్పుడూ, నిరాకరింప కూడదు. యిది కూడా వొక వ్రతం. వ్రతం అంటే ఏమిటి?  నమ్మకంతో, భక్తితో పాటించ వలసిన నియమం. అన్నం పట్ల పూర్తి సద్భావం వుండాలి  వీళ్లిచ్చారనో, వాళ్లిచ్చారనో -  బాగున్న అన్నాన్ని తృణీకరించ రాదు.


ఈ మొదటి రెండూ - తీసుకుని తినే అతిథికి చెప్ప బడింది. అంతే కాదు. యింట్లో సాధారణంగా గృహిణి  వండి వడ్డిస్తుంది. మిగతా వారు తింటారు ఆ తినే వాళ్లకు అందరికీ యిది తప్ప కుండా వర్తిస్తుంది. వండిన వాళ్లనో, వడ్డించే వాళ్లనో, తినే ఆహారాన్నో -తినే వారు తప్పు పట్ట కూడదు. కృతజ్ఞతా భావం వుండాలి. అది వుపనిషద్  వాక్యం. యిది జీవితాంతం పాటించ వలసిన వ్రతం.   

ఈ క్రింద వచ్చే సూత్రాలు - అన్నాన్ని  సంపాదించే వారికి, చేసే వారికి, వడ్డించే వారికి వర్తించే నియమాలు, వ్రతాలు.

3. అన్నం బహుకుర్వీత . తద్ వ్రతం .  (తై .ఉ. 3.9). 


అన్నాన్ని ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా  సంపాదించాలి . యిది కూడా వొక వ్రతం. అన్నం - అంటే - మనం నిత్యం ఉపయోగించే వస్తువులు కూడా - అని తెలుసుకోవాలి. అంటే- మనుషులకు ఉపయోగ పడే అన్ని వస్తువులు సంపాదించాలి. ఎందుకు మన అవసరాలకు మించి సంపాదించాలి?  ఈ ప్రశ్న  మన మనస్సులో తప్పక వస్తుంది .


ఎందుకు?

దీనికి సమాధానం, దీని తరువాత చాలా రకాలుగా నిర్దిష్టంగా  యివ్వ బడింది. పూర్తిగా చదవండి. మనం  గమనించ వలసిన  ముఖ్య విషయం ఏమిటంటే   -  "ఎక్కువ సంపాదించడం " - తప్పు  అని మన వారు అనలేదు. ధార్మికంగా  ఎంతైనా  సంపాదించండి. తప్పు లేదు.  

4. న కంచన వసతౌ ప్రత్యా చక్షీత . తద్ వ్రతం. తస్మాత్ యయాకయా చ విధయా - అన్నం - ప్రాప్నుయాత్ (తై .ఉ .3.10.)


ఆశ్రయాన్ని కోరి మీ యింటికి ఎవరైనా వస్తే - అటువంటి అతిథిని - ఎవరిని కానీ - లేదు, అని చెప్పి, తిప్పి పంప రాదు .  యిది కూడా వొక వ్రతం.    వారికి కావలసినవన్నీ - ఎంత వీలైతే అంత, ఎన్ని రకాలు గా నైనా సంపాదించాలి . అంటే  అన్నీ ధర్మ బద్ధమైన మార్గాలలోనే. చూశారా ! అతిథుల కోసం, అవసరం ఉన్నవారి కోసం, అడిగే వారి కోసం, లేని వారి కోసం - మీరు (ఎంత ఎక్కువైనా)  సంపాదించాలనే  - ఉపనిషత్తు కూడా చెబుతోంది. 

యిది వ్రతం అన్నారు

 కానీ, నిజానికి,  అన్నం,ఆస్తి లాంటివి - సంపాదించడంలో నిజమైన ఆనందం లేదు. యివి, ఏ విధంగా, మనం ఉపయోగిస్తామో, ఎవరి కోసం ఉపయోగిస్తామో - అందులోనే ఆనందం వుంది. యిది తెలియనంత వరకు - - జీవితంలో తృప్తి  నివ్వని, సుఖాలు వుంటాయేమో కాని , తృప్తి నిచ్చే ఆనందం మాత్రం అనుభవం లోకి రాదు.    

తెలుగులో మనకు తెలిసిన పద్యం వొకటి వుంది :

దానము, భోగము, నాశము, పరగంగా మూడు గతులె  భువి ధనమునకున్, దానము, భోగము నెరుగని దీనుని ధనమునకు, గతి తృతీయమే సుమ్మీ.  

దానము మొదటి  ,ఉత్తమమైన ఉపయోగం. యిక్కడ ధనం అన్న మాట, అన్నిరకాల ధనానికీ, అంటే, అన్నంతో బాటు అన్నిటికీ చేర్చి  - వాడబడింది. కాబట్టి, ఆస్తి, ధనము, అన్నము అన్నీ అని చెప్పొచ్చు. వీటికి మొదటి, శ్రేష్టమైన ఉపయోగం - దానమే. దాని తరువాత, దాన్ని మనమూ  భోగించ వచ్చు. సంతోషం పొందచ్చు. తప్పు లేదు. యివి రెండూ లేని మనిషి ధనం - ఎందుకూ పనికి రానిదౌతుంది. యిది మనం జ్ఞాపకం పెట్టుకో వాల్సిన విషయం. అక్షర సత్యం.  

5.    అరాధ్యస్మా అన్నమిత్యా ( అస్మై అన్నం అరాథి యితి), ఆ చక్షతే  (తై .ఉ .3.10.)


అతిథి  వస్తే - ఆహారం సిద్ధం గా వుంది, రండి భోంచెయ్యండి  - అనాలి. అంతే గాని లేదు, పోండి అనరాదు


చూడండి. మన పూర్వీకులు, అతిథి, అభ్యాగతులకు మనం చేయ వలసిన మర్యాదల గురించి ఎంత వివరం గా చెబుతున్నారో.  లేదనే పద్ధతి - మన సంస్కృతిలో లేదు. యిది ఎప్పటిది? ఉపనిషత్తు పుట్టిన కాలం నాటిది. ఈ -సంస్కృతి నా మనం కించ పరిచేది?  ఈ పద్ధతుల నుండి మనం ఎప్పుడు మారామంటే  - తురుష్కుల దండయాత్రలతో  సగం పైగా మారాము. ఆంగ్లేయుల   దండయాత్రలతో పూర్తిగా మారాము. లార్డ్ మెకాలే  అనే ఆంగ్ల ప్రభువు ఆంగ్ల పరిపాలకులకు యిచ్చిన సలహా యిదే . వీరి సంస్కృతిని నాశనం చేస్తే తప్ప, వీరి దయాగుణాన్ని నాశనం చేస్తే తప్ప - మనం వీరిని పరిపాలించడం అసంభవం అన్నాడు .అదే చేశారు కూడా. వొకరిపై, మరొకరికి వున్న మర్యాదను , నమ్మకాన్ని పోగొట్టడానికి. అతిథి మర్యాదలను పూర్తిగా పోగొట్టడానికి - ఎన్నో రకాల  పన్నాగాలు పన్నారు మనమూ అందులో పడ్డాము.

6.ఏతత్ ద్వై ముఖతోన్నగుం రాద్ధం; ముఖతోస్మా అన్నగుం రాధ్యతే  (తై .ఉ .3.10.)


- ఎవరైతే సిద్ధముగా వున్న అటువంటి అన్నమును ప్రసన్నతా భావం తోనూ శ్రద్ధ తోనూ అతిథికి యిస్తున్నాడో - అతనికి, అదే ప్రసన్నతా భావం తోనూ శ్రద్ధ తోనూ, అన్నం (అంటే - అన్నము, ఆస్తి, లాంటివన్నీ) తప్పకుండా ఇవ్వబడతాయి. దయా గుణం, దాన గుణం వున్న వానికి లోటు లేకుండా వచ్చి చేరుతుందని భావం.  

ఎవరిస్తారు  అతనికి ?  ప్రకృతిలోని సర్వ శక్తులూ, పరమాత్మా - అతని పట్ల కృతజ్ఞులై వుంటారు; వారు, ఎన్నో రకాలుగా అతనికి యివ్వడానికి ప్రయత్నిస్తారు అని - ఎన్నో శాస్త్రాలలో చెప్ప బడింది.  

ఈ మధ్య , యిదే విషయాన్ని - పాశ్చాత్య దేశాలలో  -లా ఆఫ్ అట్రాక్షన్ -అని అనేక రకాలుగా చెబుతున్నారు. మనం చేసే గొప్ప పనులకు, మంచి పనులకు, నిస్స్వార్థ  సేవలకు -  ప్రకృతి తోడుగా వుంటుందనేది  - యిప్పుడు వారు చెబుతున్న విషయం. అది తప్పు కాదు. నిజమే. అయితే  ఈ విషయం, మన వారికి, లక్షల సంవత్సరాలకు పూర్వమే బాగా తెలుసు. యిది, మన సంస్కృతి  లో ముఖ్యమైన భాగం. మనం పోగొట్టుకో కూడని భాగం.   యిక ముందు ఏం చెబుతుందో చూడండి.


7. ఏతద్వై మధ్యతోన్నగుం  రాద్ధం;  మధ్యతోస్మా అన్నగుం రాధ్యతే  (తై .ఉ .3.10.)


- ఎవరైతే సిద్ధముగా వున్న అటువంటి అన్నమును రాజసిక భావం తోనూ కాస్త అశ్రద్ధ , ఆలస్యం తోనూ అతిథికి యిస్తున్నాడో - అతనికి, అదే రకమైన భావం తోనూ అశ్రద్ధ తోనూ, ఆలస్యంగానూ అన్నం (అంటే - అన్నము, ఆస్తి, లాంటివన్నీ) తప్పకుండా ఇవ్వబడుతుంది. ప్రకృతి వారికీ వారిలోని గుణాన్నిబట్టే యిస్తుంది.

వొక్కో సారి - మన పూర్వజన్మ నుండి వచ్చిన సంచిత కర్మ కాస్త ఎక్కువగా వుంటే - యిప్పటి ఫలితం, అప్పటి సంచిత కర్మ ఫలంగా మొదట వచ్చేస్తుంది. ఆ తర్వాత , యిప్పటి కర్మ యొక్క ఫలితం మొదలవుతుంది. అందు వలన - యిప్పుడు అనుభవించే ఫలం, యిప్పటిదే అనుకునే ప్రమాదం వొక్కో సారి వుంటుంది. 

దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, చేసిన వారు, కొన్ని సంవత్సరాలు కేసు కూడా లేకుండా కులకడము యిందుకే. కానీ, యిప్పుడు చేస్తున్న పనికి ఫలితం - దాని తర్వాత తప్పక వచ్చేస్తుంది. అరె. యిదేమిటి. యింత అన్యాయాలు చేసే వారికే దేవుడు యిలా ఇస్తున్నాడే -అని  మనం వొక్కో సారి అనుకోవడము - ఆ, దేవుడేం చేస్తాడులే. అంతా నా చేతుల్లోనే వుంది - అని కొంత మంది లంచగొండులు, దోపిడీ గాళ్ళు అనుకోవడం   మనం చూస్తూనే వున్నాం కదా .

అటువంటి వారికి - కాస్త ఆలస్యంగా - శిక్ష పడి, న్యాయం జరగడమూ జరుగుతోంది కదా. యివన్నీ గీత లో కూడా రాయ బడింది.  యిది ఉపనిషత్తుల నాటి నుండి వుంది. మనిషి పుట్టిన నాటి నుండీ వుంది.


8. ఏతద్వై అంతతోన్నగుం  రాద్ధం;  అంతతోస్మా అన్నగుం రాధ్యతే. ఏ ఏవం వేదా .  (తై .ఉ .3.10.)


   
 ఎవరైతే సిద్ధముగా వున్న అటువంటి అన్నమును తామసిక భావం తోనూ, చాలా అశ్రద్ధ , చాలా ఆలస్యం తోనూ అతిథికి యిస్తున్నాడో - అతనికి, అదే రకమైన భావం తోనూ అశ్రద్ధ తోనూ, ఆలస్యంగానూ, అన్నం (అంటే - అన్నము, ఆస్తి, లాంటివన్నీ) యివ్వ బడుతుంది . ప్రకృతి, తామసిక గుణం వున్న వారికీ, వారిలోని గుణాన్నిబట్టే యిస్తుంది. యిది మనం బాగా తెలుసుకొని, అర్థం చేసుకుని వ్యవహరించాలి.

సరే. అసలు అన్నం దానమే చెయ్యని వానికి ఎలాంటి ఫలితం లభిస్తుంది. దీనికి, రామాయణం లోనూ, మరెన్నో పురాణాలలోనూ,  ఎంతో వివరణ వుంది. వొక గొప్ప రాజు, ఏన్నో మంచి కార్యాలు చేసాడు గాని - అన్న దానం చెయ్య లేదట . అందుకని, ఆయన బ్రహ్మ లోకానికెళ్ళినా, ఆయన ఆకలి మాత్రం తీరలేదట. తరువాత ఎప్పుడో, అగస్త్య మహాముని దయ వలన ఆయన ఆకలి బాధ తీరుతుంది. ఇలాంటి కథలెన్నో వున్నాయి మన సంస్కృతిలో.

అన్ని దానాల లోకి - అన్న దానం గొప్ప అని అందుకే అన్నారు.

చేసుకున్న వాడికి చేసుకున్నంత -అన్న సామెత వుంది కదా. అలాగే అన్ని దానముల లోకి , అన్న దానం గొప్ప - అన్న సామెత కూడా వుంది.

యిక్కడ మరొక ముఖ్యమైన అంశం మనము మరిచి పోకూడదు. 

అతిథికి మనమేదో, గొప్ప దానం చేసేస్తున్నాం - మనం లేకుండా అతనికి ఆకలి కూడా తీరదు. మనపై అతడు ఆధారపడి - వున్నాడు అనే భావనతో చేసే దానం చాలా వరకు వ్యర్థం అయిపోతుంది.  మనపై అతడు ఆధారపడడం కాదు. అతడు, మనకు పరమాత్మ యిచ్చిన గొప్ప అవకాశం, గొప్ప వరం  అని భావించి , "అతిథి దేవో భవ " అన్న భావంతోనే - అతనికి అన్నం పెట్టడం, తదితర సత్కారాలు చెయ్యాలి .

ఇలాంటి సమాజంలో ఎవరికి ఆకలి దప్పులు వుంటాయి చెప్పండి. దేశంలో ఎవరికి ఆకలి తీరకున్నా - అక్కడి రాజు నిద్ర పొయ్యే వాడు కాదు. రామ రాజ్యం అంటే - ఎక్కడా ఆకలి అన్నది లేని రాజ్యం.  



కొన్ని ఉదాహరణలు చూద్దాం.


1. శబరి రాముడికి తాను  కాస్తా కొరికి, బాగుంది అనుకొన్న దానినే  తినడానికి యిచ్చింది. ఆ అమాయకురాలి అతిథి సత్కారం ఎలాంటిది?

2. కృష్ణుడు హస్తినాపురానికి వెళ్లి - ఎవరి ఆతిథ్యం స్వీకరించాడు? విదురుడు సంజయుడు యిండ్లకు వెళ్ళాడు. అహంకారంతో పిలిచిన ఏ పెద్ద కులాల వాళ్ళ యిండ్లకూ వెళ్ళలేదు. అలాగే దరిద్ర భక్తుడైన కుచేలుడి వద్ద వున్నసత్తు పిండిని బ్రహ్మానందం తో తిన్నాడు కదా. ఎవరు యిస్తారన్నది, ఏం యిస్తారన్నది కాదు,  ఏ  భావంతో యిస్తారన్నది చాలా, చాలా, ముఖ్యం.

3. శంకరాచార్యులు - భిక్షాం దేహి అన్నప్పుడు, అయ్యో , తన దగ్గర ఏమీ లేదే అని కుమిలిపోతున్న గృహిణి  వద్ద, వొక్క మెతుకు తిని, కనక ధారా స్తోత్రం ద్వారా దేవిని అర్చించి - ఆమె యింట కనక వర్షం కురిపించాడు కదా.

ఇలాంటి ఎన్నో సంఘటనలు మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, కావ్యాలు లో కోకొల్లలుగా వున్నాయి.

అదే - మన  ఉపనిషత్తులలోని సామాజిక న్యాయం. పెట్టే వాడు అన్నం మాత్రం పెట్టడు. అతిథిని - దేవుడి లాగా సత్కరిస్తాడు.  అలాంటి - రాజ్యంలో అందరూ పెట్టే వాళ్ళే . తినే వాళ్ళ కోసం మీరు వెతకాలి. కుల, మత జాతి భేదాలు లేకుండా - అన్న దానం , అతిథి సత్కారం చెయ్యాలి. అదీ వుంది మన శాస్త్రాలలో.

నాకు తెలిసి, మా చిన్న  తనంలో, అప్పటి పెద్ద వారు చాలా మంది యిలా వుండడం నేను చూశాను.   


మనమందరూ - యిలా వుండాలి మరి. వుందామా?

=మీ 

వుప్పలధడియం విజయమోహన్ 

 



1 కామెంట్‌:

  1. ఉపనిషత్ విజ్ఞానం జనసామాన్యానికి సరళమైన భాషలో అందించాలన్న మీ తాపత్రయానికి భగవంతుని సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది. ఉపనిషత్తులంటే అవేవో కేవలం హిందూధర్మానికి మాత్రమే చెందినవనే అపోహను దూరం చేసి ఇవి మనిషికి అవసరమైనవి అన్న జ్ఞానం జనాలలో కల్గించిననాడు అందరూ ఈ సత్యాలను తెల్సుకోవడానికి తద్వారా పాటించడానికి ప్రాముఖ్యతనిస్తారు.మీ ప్రయత్నం నిర్విఘ్నంగా సాగాలని దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నాను.

    రిప్లయితొలగించండి