12, నవంబర్ 2011, శనివారం

భయమూ - దానికి గల కారణాలూ - మన మానసిక ఆరోగ్యమూ



మనం  కొన్ని వ్యాసాలలో యిది వరకే - మానసిక ఆరోగ్యం గూర్చి లోతుగా పరీక్షించాము .  అందులో - మితి మీరిన కోరికే -మానసిక అనారోగ్యానికి ప్రథమ కారణం అని తెలుసుకున్నాము. అన్ని మతాలలో - వుండేదీ అదే.

కోరిక తప్పు కాదు. కోరిక అనారోగ్యం కాదు. కోరిక లేని నాడు - మనిషే లేడు. కృష్ణుడికి కోరిక లేదా? భగవద్ గీత చెప్పడం ఎందుకు? అర్జునా! యుద్ధం చెయ్యి - అని ప్రోత్సహించడం ఎందుకు?

దేవుడి కోరికను - సంకల్పం  అన్నారు. అంటే - వుట్టి కోరిక కాదు. తీరగలిగే కోరిక. ఆ కోరిక వెనుక, వొక బలమైన సకారాత్మక శక్తి కూడా వుంది. అందు  వలన అది జరిగి తీరుతుంది. మనమైనా అంతే. తీరగలిగే కోరకలు కోరుతూ - వాటి వెనుక, బలమైన, సకారాత్మక శక్తినీ - పెట్టామంటే -  మీ కోరిక వెనుక ప్రకృతి శక్తులన్నీ కూడా తోడుంటాయి. మీ కోరికలు తప్పక తీరుతాయి. అందువలన మీ జీవితంలో - సంతోషమూ, ఆనందమూ - నిండుతాయి. 

అదే - మానసిక ఆరోగ్యమని  చెప్ప వచ్చు. 

కాబట్టి - 

తీరని కోరికలు కోరకండి.  ఎండమావుల వెనుక పరుగెత్తకండి. 

మనిషి ఎవరైనా వొక్క సారి, వొక్క అడుగే వెయ్యాలి. వెయ్య గలడు. ఆ అడుగు ప్రమాణం మీ శక్తి సామర్థ్యాల పైన ఆధారపడి  వుంటుంది. వొకరి అడుగు చిన్నది గాను, మరొకరిది, కాస్త పెద్దది గాను వుండొచ్చు .

నడిచి వెళ్ళే వాళ్ళు - యిరవై, ముప్ఫై  మైళ్ళు నడవ గలిగితే - పరుగెత్తే వాళ్ళు - వొక్క కిలోమీటరు దూరం కూడా వెళ్ళ లేరు. జీవితమంతా పరుగెత్తాలనుకునే వాళ్ళు - ఎక్కువ కాలం పరుగెత్త లేరు. ఏ విషయం లో నైనా అంతే.

యివి జ్ఞాపకం పెట్టుకుంటే - హాయిగా - జీవితమంతా గడిపెయ్య వచ్చు.

సరే. మానసిక అనారోగ్యంలో - మరికొన్ని సమస్యలున్నాయి.

మనిషికి భయం -అనేది పెద్ద అనారోగ్య లక్షణం. భయానికి ముఖ్య కారణం మన అజ్ఞానం, అశ్రద్ధ .

ఉదాహరణకు - చాలా మందికి - బొద్దింక అంటే  భయం. అది పెద్దగా కరవదని తెలుసు. కరిచినా పెద్ద ప్రమాదమేమీ లేదని తెలుసు. అయినా - అదంటే కాస్త భయం. ఎందుకంటే -  బొద్దింకకు  మనమంటే భయం లేదు. నేరుగా - మనమెక్కడున్నామో అక్కడికే వచ్చేస్తుంది. మీరు దూరంగా - తోసేసినా, మళ్ళీ దగ్గరగా వచ్చేస్తుంది. కాస్త ఏమరుపాటుగా వుంటే - దుస్తుల్లోకి వెళ్లి పోతుంది. ఎందుకో తెలీదు. యిదీ చాలా మంది భయం.  కొంత మంది - దాన్ని చంపకుండా, దాని మీసాలు పట్టుకుని దూరంగా విసిరేస్తారు. వారికి  బొద్దింక భయం లేదని చెప్పొచ్చు. కొందరు ఏ చీపురు కట్ట తోనో - దానిపై పట్టుమని కొడతారు. అది చచ్చిపోతుంది. తరువాత దాన్ని చీపురుకట్టతోనే బయట పార వేస్తారు.యిక్కడ హింసా వుంది. భయమూ వుంది. 

మన యిండ్లలో వుండే యెర్ర చీమ - దేవుడిని వరం అడిగిందట. నేను కుడితే చచ్చిపోవాలని. దేవుడు తథాస్తు అన్నాడట. అప్పటినుండి యెర్ర చీమ కుడితే - దాన్ని చంపేస్తారు. అది చచ్చిపోతుంది. వరం ఎలా అడగాలో కూడా చీమకు తెలియలేదు. బొద్దింక - పాపం, కుట్టక పోయినా చచ్చి పోతుంది.

సరే. పామంటే - చాలా మందికి భయం. అందులో విషం వుండే పాము ఏదో, విషం లేని పాము ఏదో చాలా మందికి ఖచ్చితంగా తెలీదు.ఏ పామైనా భయమే. కానీ, కొంత మందికి భయం లేదు. వారు, పెద్ద పెద్ద నాగుపాములతో కూడా ఆడుకుంటారు. పాములను చంపడం తేలికే. కాస్త ధైర్యమూ కావాలి. మెళకువలూ తెలిసుండాలి. అంతే. తెలీకపోతే - పాములకు దూరంగా వుండడమే - మంచిది.

కుక్కలంటే - కొంత మందికి భయం. పిచ్చి పట్టని కుక్క సాధారణంగా, మనిషిని ఏమీ చెయ్యదు. ఎప్పుడో వొక సారి కొరక వచ్చు. అప్పుడు - సరైన ఇంజెక్షన్లు క్రమం తప్పక వేసుకోవాలి. కానీ పిచ్చి పట్టిన కుక్క - తప్పక కొరుకుతుంది. అటువంటిది - ప్రతి వొక్కరికీ - చాలా అపాయం. అప్పుడు ముఖ్యంగా - కొరికిన భాగాన్ని బాగా నీళ్ళతో కడగడమూ   ముఖ్యమే. తరువాత - సరైన ఇంజెక్షన్లు క్రమం తప్పక వేసుకోవాలి. లేదంటే చాలా అపాయం.  కుక్క కాటును ఎప్పుడూ అలక్ష్యం చేయకండి. వొక గంటలోగా - ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా - మీ మొదటి ఇంజెక్షను వేసుకోండి. ఏ కుక్క కొరికినా క్రమం తప్పకుండా - ఇంజెక్షన్లు వేసుకోండి.

అలాంటి పిచ్చి కుక్క నన్నూ వొక సారి వెనుక నుండీ వచ్చి కొరికింది. - నాలుగేళ్ల క్రిందట. వెంటనే కొరికిన భాగాన్ని నీళ్ళతో బాగా కడిగేసి - మా ఊళ్లోనే వున్న డాక్టరు గారి దగ్గర ఆంటీ రాబీస్ ఇంజెక్షన్లు క్రమం తప్పక వేసుకున్నాను. తరువాత దాని వలన ప్రమాదమేమీ లేదు. అయితే - ఈ మధ్య మన రాష్ట్రంలో - వివిధ ప్రాంతాలలో - పిచ్చి కుక్క చాలా మందిని కొరికిన సంఘటనలు చాలా విన్నాము.  అవి కాస్త పెద్ద ఊళ్ళే అయినా -   ఆంటీ రాబీస్ ఇంజెక్షన్లు - అక్కడ లేక పోవడం చాలా దురదృష్టకరం.

మీ వూళ్ళో - ఈ ఆంటీ రాబీస్ ఇంజెక్షన్లు ప్రతి డాక్టరు దగ్గరా వుండాలి. లేకపోతే - వెంటనే - ప్రభుత్వం వారికి ప్రతి వొక్కరూ రాయండి. పిచ్చి కుక్క కాటుకు, పాము కాటుకు మందు మాత్రం - ప్రతి వూర్లో వుండి తీరాలి.  అంతే కాదు. కరిచిన వెంటనే కరిచిన భాగాన్ని కడగడము, వెంటనే డాక్టరు గారి దగ్గరకు వెళ్ళడము మనం చెయ్యాలి. దీన్ని గురించి మరింత సమగ్ర సమాచారం - నా మరో బ్లాగులో - వైజ్ లివింగ్ ఐడియాస్ . బ్లాగ్ స్పాట్. కాం లో రాసాను. ఎందుకంటే - భారత దేశంలోని - ప్రతి గ్రామంలోనూ- ప్రతి పట్టణంలోనూ - వీధి కుక్కలూ వున్నాయి. కొంత వరకూ - పాములూ వున్నాయి. అందు వలన వాటి వలన వచ్చే ప్రమాదాలూ, విరుగుళ్లూ అందరికీ తెలిసుండాలి. నిజానికి - యిది - ఐదో  తరగతి చదివే విద్యార్థికి కూడా  సమగ్రంగా తెలిసుండాలి. 

మన దురదృష్టం ఏమంటే   - మన చదువులో - మనకు ఉపయోగ పడేది చాలా తక్కువ. ఎప్పుడో ఏదో చేసిన ఔరంగజేబు ను గురించి చాలా చదువుతాము. యిందు వలన మనకొచ్చే ఉపయోగం - నన్నడిగితే సున్నా.

దారిలో రోజూ కనపడే పాములు, కుక్కలు మనల్నేం చేస్తాయో, మనమేం చెయ్యాలో - మనకు తెలీదు. వాటికి కావలసిన మందులు - ఘనత వహించిన మన  ప్రభుత్వం వారు - చాలా ఊళ్లలో సప్లయ్ చేసినట్టు లేదు. మనమూ అడిగేటట్టు లేదు. సరైన చదువు ద్వారా వీటన్నిటిని గురించిన విజ్ఞానమూ రావాలి. సరైన విజ్ఞానముతో బాటు, వీటివలన వచ్చే భయమూ పూర్తిగా పోవాలి. ఈ రెండూ చదువు ద్వారా జరగడం లేదు. కనీసం పాము యొక్క మృత శరీరాన్నైనా  విద్యార్థులు తాకి పార వేసేటట్టుగా వుండాలి. 

నాగు పాములంటే మనకు భయమూ వుంది. భక్తీ వుంది. కానీ పాముకాటుకు మన వూళ్ళో మందు వుందో లేదో మాత్రం తెలీదు.



మనకు తెలుసు - మన పూర్వీకులలో చాలా మంది అరణ్యాలలో వుండే వారని. కొందరు రుషులుగా తపస్సు చేసుకుంటూ వుంటే - మరి కొందరు - వేట తోనో, మరో వృత్తి తోనో  అడవుల్లో జీవించే వారు.  పులులు, సింహాలు కూడా వున్న అడవుల్లో - వారు భయపడ కుండా వుండే వారు.  మేము పిల్లలు గా వున్న సమయంలో కూడా - వూరి బయటే- పెద్ద అడవులుండేవి .  మృగాలూ, పాములూ, తేళ్ళూ- అన్నే వుండేవి. కానీ- మనస్సులో ఎవరికీ భయం వుండేది కాదు. యిప్పుడు - అడవులూ లేవు. మృగాలూ చాలా వరకూ లేవు. కానీ - పాములు - అందులోనూ విష సర్పాలు యింకా  చాలా వున్నాయి. వాటి కాట్లకు ఉపయోగ పడే పాత మందుల పరిజ్ఞానం యిప్పుడు లేదు.కొత్త మందులు సప్ప్లై  లేదు. 

వీధి కుక్కలు వున్నాయి. వర్షాలు వొచ్చినప్పుడో, పిల్లలు పుట్టినప్పుడో - వొక్కొక్క సారి - వాటికి పిచ్చి పడుతూ వుంటుంది. అలాంటప్పుడు, అవి స్వంత పిల్లల్ని కూడా చంపేయడం జరుగుతూ ఉంది. అప్పుడే - కనిపించిన మనిషినల్లా కొరకడం కూడా జరుగుతూ వుంటుంది. అప్పుడు - మన ఆధునిక పరిజ్ఞానం ప్రకారం - వాటిని పట్టుకుని , రెండు వారాలు వాటిని జాగ్రత్తగా గమనించమని అంటారు. యిది నాకు వొక పిచ్చి సలహా గా కనిపిస్తుంది.

నన్నడిగితే - పిచ్చి కుక్కను మీరు పట్టుకునే ప్రయత్నం చేయడమంత    మూర్ఖత్వం మరోటి లేదనిపిస్తుంది. బ్లూ క్రాస్ వాళ్ళను పిలిచి - అయ్యా- పిచ్చి కుక్క మమ్మల్ని కరిస్తే - మేము దాన్ని ఏం చేయాలి - అని వారిని అడగండి.  సమాధానం వాళ్ళ దగ్గరా లేదు. యిది ఎలా వుంటుందంటే   -  మమ్మల్ని ఎవడైనా మర్డరు లేదా రేపు చేయడానికి వస్తే - మేమేం చెయ్యాలి అని పోలీసు వాళ్ళను అడగండి. వాళ్ళేం చెబుతారు? మీరు చట్టాన్ని మీచేతిలోకి తీసుకోకూడదు. మా దగ్గరకు వచ్చి చెప్పండని చెబుతారు.

మిమ్మల్ని మర్డరు చేసిన తరువాత పోలీసు స్టేషనుకు వెళ్లి చెబుతారా.

మిమ్మల్ని రేపు చేసేంత  వరకూ ఆగి తరువాత పోలీసు స్టేషనుకు వెళ్లి చెబుతారా. 

మిమ్మల్ని పిచ్చి కుక్క కరిచేంత   వరకూ చూస్తూ వుండి , దాన్ని మెల్లగా పట్టుకుని బ్లూ క్రాస్ వారికి అప్పగిస్తారా?

నాకయితే - మన డెమాక్రసీ ప్రభుత్వాల  కంటే - కొంత మంది పాత కాలపు రాజులు ఈ విషయంలో - తెలివిగా చట్టాలు చేసే వారని అనిపిస్తుంది.  మన చాలా భయాలకు కారణం మన ప్రస్తుత విద్యా విధానము, పాలనా విధానము, మన చట్టాలు, వాటిని మనం అమలు చేస్తున్న తీరు  - అని చెప్పక తప్పదు.

మిమ్మని రేపు చేసారనుకోండి. మీరూ తీరిగ్గా వెళ్లి పోలీసు వారికి రిపోర్టు ఇచ్చారనుకోండి.  ఏం జరుగుతుందో - మనకు తెలీదా. పోలీసు స్టేషన్లో ఏమీ జరక్క పోయినా - మరో సారి పత్రికల్లో, కోర్టుల్లో తప్పక  మీ రేపు జరుగుతుంది. సరే. కేసు ఏ యుగంలో ముగుస్తుందో - ఎలా ముగుస్తుందో ఎవరూ చెప్ప లేరు.

మన చాలా భయాలకు - కారణం మన చట్టాలూ, దాన్ని మనం అమలు చేస్తున్న విధానమే అని నాకు అనిపిస్తుంది. జాతిని, పూర్తిగా నిర్వీర్యం చేసే ఈ పాలనా విధానం మారాల్సిన అగత్యం ఉంది. 

ఈ మధ్య కీనన్ సాన్తోజ్ , ర్యూబెన్ ఫెర్నాండెజ్ అనే యిద్దరు యువకులు  ముంబై వీధులలో గూండాలచేత హత్య చేయ బడిన విషయం  మనకందరికీ తెలిసిన విషయమే.వొక అమ్మాయిని, పట్ట పగలు, నడివీధిలో, గూండాలు  అవమానం చేస్తూ వుంటే - సహించ లేక వాళ్ళను ఈ యిద్దరు యువకులూ అడ్డుకున్నారు. అక్కడికక్కడే - వాళ్ళను ఆ గూండాలు కత్తులతో పొడిచి చంపేశారు.   సరే. నలభై మంది ఆ ఘటనను చూస్తూ వున్నారు. కానీ   వారెవరూ  ఆ గూండాలను అడ్డుకోలేదు. కీనన్ తండ్రి గారు - తరువాత "కీనన్   చేసింది సరి అయిన  పని.  పిరికి వాడిగా జీవించడం కంటే - అన్యాయాన్ని ఎదుర్కొని కీనన్ లాగ మరణించడమే మంచిది" అన్నారు.

నిజమే. మన సమాజం అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్య వంతులను తయారు చెయ్యాలి.  పిరికి వాళ్ళను కాదు.

కానీ - ఆ చూస్తూ ఊరుకున్న నలభై మందిని అడగండి - వాళ్ళెందుకు వూరుకున్నారో తెలుస్తుంది. మన చట్టాలు, మన పోలీసులు, మన పాలనా వ్యవస్థ  - ఏ వొక్కటీ మనలను ధైర్య వంతులను చేసేవి కావని తప్పక చెబుతారు. వారు భయపడింది - గూండాలకు కాదు. వారి వెనుక నున్న వారికి. చట్టాన్ని తమ చేతిలో కీలు బొమ్మగా నడిపిస్తున్న వారికి.  యిది మారాలి. యిది మారాలంటే - మన విద్యా వ్యవస్థ మారాలి. మనలను చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వారిగా తయారు చేసే  విద్య రావాలి. 

మీ వూళ్ళో - గూండాలెవరో - మీ వూళ్ళో పోలీసులకు తెలీదా.   వాళ్ళేం చేస్తున్నారో వీరికి తెలీదా. మరి గూండాలు -  గూండాలుగానే  ఎలా కొనసాగుతున్నారు?

యిప్పుడు మన దేశంలో -ఏ విషయాన్ని కదిపినా - వందల, వేల, లక్షల కోట్ల లంచ గొండి తనం  బయటకు వస్తూ ఉంది. మరి - ఈ వ్యవస్థను సరిచేసే నాథుడు ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు. పాలకులలో లేని మానసిక ఆరోగ్యం ప్రజలలో ఎలా వుంటుంది.

యథా రాజా, తథా ప్రజా. మీరు ఏ రాజా గురించైనా అనుకోండి. దాదాపు యిదే కథ గా ఉంది.

ఈ వ్యవస్థ మారాలి. ఎలా మారుతుంది. మనం అందరూ కలిసి మార్చాలి. కనీసం అది మార్చడానికి ప్రయత్నిస్తున్న - అన్నా హజారే, రాం దేవ్ జీ, జయప్రకాశ్ నారాయణ్   లాంటి వారికి పూర్తి మద్దతు నివ్వాలి.

పాలకుల లోనూ, ప్రజలలోనూ - న్యాయానికి, ధర్మానికి విలువ వచ్చేటట్టు మనం చూడాలి.  అది వుంటే - మనలోని భయాలు చాలావరకు పోతాయి.   అది రావాలంటే - మన విద్యా వ్యవస్థ - బాబర్లు , ఔరంగజేబులను కాస్త వదిలి పెట్టి - ప్రస్తుత సమాజ సమస్యలకు రావాలి. మానవ విలువలను విద్యార్థులలో నింపాలి. కనీసం వచ్చే తరం అయినా బాగుంటుంది. భయం లేని వారిగా, ధైర్య వంతులుగా వుంటారు. చట్టాలను కాస్త మానవతా దృక్పథంతో తయారు చెయ్యాలి. వాటిని అమలు చెయ్యడం కూడా అలా వుండాలి. 

యిదంతా ఎందుకు చెబుతున్నానంటే -  అమెరికాలో , బ్రిటన్ లో ప్రజలకు   వున్న  ధైర్యం భారత దేశ ప్రజలకు ఈ రోజు లేదు.  అది వారి తప్పు కాదు. పాలకుల తప్పు. అటువంటి పాలకులను  ఎన్నుకోవడం ప్రజల తప్పు.

భయాన్ని గురించి మనం తెలుసుకోవలసిన మరి కొన్ని ముఖ్యమైన విషయాలు మరో వ్యాసంలో చూద్దాం.

= మీ

వుప్పలధడియం విజయమోహన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి