18, సెప్టెంబర్ 2014, గురువారం

పరిస్థితి - మనస్థితి - మన "స్థితి" - మనలో వో అమ్మ హృదయ స్పందన


పరిస్థితి - మనస్థితి - మన "స్థితి"

మామూలుగా వచ్చే స్కూలు బస్సు ఆ రోజూ వచ్చి వీధిలో, ప్రతి రోజూ నిలిచే చోటే  నిలిచింది . ఆ వీధిలో వున్న స్కూలు పిల్లలందరూ వొకరి తర్వాత  వొకరు ఎక్కి కూర్చున్నారు . బస్సు కదిలింది . పిల్లలు తల్లిదండ్రులను చూస్తూ చేతులూపుతున్నారు. తల్లిదండ్రులూ పిల్లలను చూస్తూ, బస్సు కనుమరుగయే దాకా చేతులూపుతున్నారు. తరువాత , యిళ్ళకో , ఆఫీసులకో వెళ్లి పోతున్నారు. 

ప్రతి రోజూ ఆ వీధిలో జరిగే తంతే యిది . మళ్ళీ సాయంకాలం పిల్లలను స్కూలు నుండి తీసుకు వచ్చి దించే సమయంలో,  యిదే తంతు రివర్స్ గా జరుగుతుంది. స్కూలుకు వెళ్ళేటప్పుడు పిల్లల మనస్థితి వొక రకం. వచ్చేటప్పుడు మరో రకం .  

అదే విధంగా పెద్దల మనస్థితీ రక రకాలుగా వుంటుంది. బస్సు కాస్త ఆలస్యంగా వస్తే , ఆ రెండు మూడు నిమిషాల్లో వొక్కొక్కరి మనస్సు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ వుంటుంది.  మనసు మంచిని కోరుకున్నా, కీడునే శంకిస్తూ వుంటుంది; తల్లిదండ్రుల విషయంలో మనం యిది చూస్తూనే వుంటాము . బస్సు వచ్చినా - తమ పిల్ల వాడు దిగే వరకు ఏదో ఆత్రుత . 

బడులకెళ్ళే పిల్లలు లేని వారి మనస్తత్వాలు మరో రకంగా వుంటాయి .  కొందరైతే తమకేమీ పట్టనట్టు వుంటారు . కొందరు - ప్రతి రోజూ మన వీధిలోనే ఏమిటీ రగడ , ఏమిటీ బెడద అనుకుంటూ వుంటారు . అందులో ఎవరో వొకరు - దీనిపై తప్పకుండా కంప్లైంట్ రాయాల్సిందే, అని ప్రతి రోజూ అనుకుంటూ వుంటారు.

అసలు పిల్లలే లేని వాళ్ళు , తమకూ ఇలాంటి పిల్లలు వొకరో ఇద్దరో వుంటే బాగుంటుందని రోజూ అనుకుంటూ , ఆ పిల్లలను చూస్తూ వుంటారు . అలాంటి వారు కొంత మంది,  ఆ పిల్లలు తమను చూసినా, చూడక పోయినా, వారందరికీ తాము కూడా చేతులు వూపుతుంటారు.  ఇది వారికి ఆనందమా, కాదా, చెప్పడం కష్టం.  కానీ, చేతులు ఊపక పొతే, వొక వెలితి మిగిలిపోతుంది వారి మనసులో. కొంత మంది పిల్లలు తమ వైపు చూసి చేతులు వూపితే మహదానంద పడి పోతారు . అయినా , ఆ తరువాత , ఏదో వొక వెలితి మిగిలే వుంటుంది .

యిలా  రోజూ జరిగే సాధారణ సంఘటనకు కూడా వొక్కొక్కరి స్పందన వొక్కొక్క రకంగా వుంటుంది.

నెలకొక రోజు వాన వస్తే , "ఎన్నాళ్ళ కొచ్చావమ్మా , వానా, వానా " అని వానలో యెగిరి గంతులెయ్యొచ్చు. ప్రతి రోజూ వానే అయితే ? రోజంతా వానే అయితే ?  అప్పుడేం చేస్తాం ? రోజంతా ఎందుకమ్మా , వానా, వానా - అని  అనమా ? తిట్టుకోమా ?

అనొచ్చు . తిట్టుకోవచ్చు . కానీ వచ్చే వానను ఆపలేం . రాని వానను తెచ్చుకోలేం .

గోదావరి నిండుగా ప్రవహిస్తే అందం; ఆనందం ; కానీ, అదే గోదావరిలో వరదలు పొంగి, గ్రామాలనూ , పంటలనూ, ముంచి , నాశనం చేసి హడలెత్తిస్తే - అదీ అందమేనా ? ఆనందమేనా ?

ఎలా ప్రవహించాలి - అన్నది గోదావరి యిష్టం . మీ యిష్టం కాదు . అవునా??  ... కాదు . గోదావరి యిష్టం కూడా కాదు. వర్షాలు ఎక్కువగా కురవకపోతే గోదావరిలో తక్కువ ప్రవాహం; వర్షాలు మామూలుగా వుంటే  నిండుగా ప్రవహించ వచ్చు. ఎక్కువైతే  వరదలు.

అంటే - అదంతా వర్షాల యిష్టం . గోదావరి యిష్టం కాదు. నిజానికి వర్షాల యిష్టం కూడా కాదు. సముద్రంలో నుండి ఎక్కువ మేఘాలు తయారైతే, ఎక్కువ వర్షాలు. లేదంటే, తక్కువ వర్షాలు. అంటే - మేఘాలు తయారు చేసే సముద్రం యిష్టమా ? కాదు కాదు . సూర్యుడు సముద్రంపై ఎక్కువ ఎండలు కాస్తే , ఎక్కువ మేఘాలు ; లేదంటే, తక్కువ మేఘాలు ; అసలు , అదీ కాదు ; మేఘాలను గోదావరిపైకి తీసుకెళ్ళాలంటే ,  గాలి  తోడ్పాటు కావాలి . లేదంటే సముద్రంలో తయారైన మేఘాలు సముద్రం పైనే వర్షిస్తాయి. సూర్యుడు సముద్రం నుండి మేఘాలు తయారు చెయ్యాలి. కానీ , గాలి బాగా వీచి,  మేఘాలను గోదావరి పైకి తీసుకెళ్ళాలి. అక్కడ దానికి చల్ల గాలి తగలాలి . అంటే గోదావరి ప్రక్కన కొండలు, వృక్షాలు కావాలి . యివన్నీ ప్రకృతి లోని వలయాలు . యివి మనకు కొంత తెలుసు; చాలా తెలీదు . ఈ బాహ్య పరిస్థితుల్లో ఏది మన అదుపులో వుంది? దాదాపు  ఏదీ లేదు ! గోదావరిలో వరదలొస్తే - మనం మన కోసం  ఏం చెయ్యాలో -  అది కాస్తా చెయ్యొచ్చు .

గోదావరి నుండి , కృష్ణ కు , కృష్ణ నుండి నీళ్ళు లేని మా ఊళ్లకు కాలువలు త్రవ్వవచ్చు. అలా త్రవ్వితే - గోదావరి వరద నీరు, మా ఊళ్లలో త్రాగడానికీ, పంట పొలాలకూ పనికొస్తుంది. లేదంటే - గోదావరి వరద నీరు, చుట్టూ వున్న గ్రామాలలో ప్రళయం సృష్టించి - కడపట, ఎవరికీ ఉపయోగం లేకుండా, బంగాళాఖాతంలో కలిసి పోతుంది . కానీ, మనం ఏం చేసినా - ఆ వర్షాలను ,  డైరెక్ట్ గా  నీళ్ళు లేని మా ఊళ్లకు తీసుకు రాలేం కదా.   

అసలు ప్రపంచం లో ఏదీ మన అధీనం లో లేదు; ఏదీ మన మాట ప్రకారం నడుచుకోదు - అనిపిస్తుంది.   మన యింట్లోని  వొక్క ఈగ , దోమ ,  చీమ ,  బొద్దింక  కూడా మన మాట వినదు .

అవి వినక పొతే పోనీ . మీ ఆవిడ, మీ వారు (బోలెడన్ని సార్లు) మీ మాట వినరు . మీరూ వారి మాట వినరు - కానీ వారు మీ మాట ఎప్పుడూ వినాలనుకుంటారు.  యిద్దరూ ఏదండం అంటే కోదండం అన్నట్టు గా వుంటారు . వొకరి మాట యింకొకరు వినే యిళ్ళు లేవని నేను అనడం లేదు . వినని యిళ్ళు చాలా వున్నాయంటాను . వింటే - మేలనీ అంటాను. "అహం" పెరిగే కొద్దీ వినని యిళ్ళ సంఖ్య పెరుగుతోందంటాను .

సరే . ఎల్లప్పుడూ ఎవరు వింటారు మీ మాట ? మీ మాట ప్రకారమే నడుచుకునే వ్యక్తి ప్రపంచం లో వొక్కరైనా వున్నారా? నిజం చెప్పనా ? నిజానికి  మీ మాట మీరే వినరు . మీరు అనుకున్నది , మీరు చెయ్యల్సింది,  మీరే చెయ్యరు ; మీరు చెయ్య కూడనిది చేస్తారు .

బయటి పరిస్థితి మనకనుగుణం గా వుండక పొతే - సర్ది చెప్పుకోవచ్చు . సవాలక్ష కారణాలు చెప్పుకోవచ్చు . మనమే మన మాట వినక పోవడానికి - ఎన్ని కారణాలు చెప్పగలం ?


ఇంత కంటే  పెద్ద సత్యం మరొకటుంది .

ప్రపంచమంతా  ఎక్కడ వుందయ్యా - అంటే , మన మెదడులో , మన మనసులో  - అని జ్ఞానులు చెబుతారు . మీరు మీ భార్యను ఎక్కడ చూస్తున్నారు ? వంటింట్లో , అంటారు మీరు .  లేదా, మరో చోట అంటారు . కాదు నా కంట్లో అంటారు - మీరు కాస్త లోతుగా ఆలోచిస్తే .  వంటింట్లో కాదు , కంట్లోనూ కాదు ; నా మెదడులో , మనసులో , అంటారు - మరి కాస్త బాగా ఆలోచిస్తే . నిజమే . మీరు ఎవరిని చూసినా, దేనిని చూసినా, మీ మెదడులో, మీ మనసులోనే చూడగలరు .

మెదడు,మనసు చూడక పోతే - కన్ను తెరుచుకుని వున్నా చూడ లేరు. ఎదురుగా మనిషి లేకున్నా , కళ్ళు మూసుకుని వున్నా, తెరుచుకుని వున్నా, మనసు తలుచుకుంటే చూడగలరు . యిదొక పెద్ద చేదు నిజం .  బయటి ప్రపంచం  నిజం కాదనడం లేదు . కానీ మీ  అనుభవం , అనుభూతి మాత్రం మీ మెదడులోనే, మీ మనసులోనే కదా .

 ఈ అనుభవం , అనుభూతి ప్రతి మనిషికీ వేరు వేరుగా వుంటుంది . వొకే పువ్వును పది మంది చూస్తుంటే , ఆ పది మంది అనుభూతులూ వేరు వేరుగానే వుంటాయి . చూసే ప్రకృతి , పరిస్థితి వొకటే  అయినా, మన మనస్థితులు మాత్రం ఎంతో విభిన్నంగా వుంటాయి .   మన మనస్థితి ని బట్టి మన స్థితి వుంటుంది - పరిస్థితి ఎలా వున్నా .


బయటి పరిస్థితి లో నిరంతరం జరిగే మార్పులు, ప్రకృతి ధర్మాలను అనుసరించి వుంటాయి . అవి కొంత మనకు తెలుసు . చాలా వరకు తెలీవు .

 ఆ ప్రకృతి ధర్మాల ననుసరించి , మనకెలా కావాలో అలా,  యిండ్లు , రోడ్లు , బస్సులు, రైళ్ళు , విమానాలు యిలా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాము . వర్షాలు ఎప్పుడు రావచ్చో ఊహించి - దాన్ని వర్షాకాలం అన్నాము .  దాన్ని బట్టి పంటలూ, పొలాలూ  ఎన్నో తయారు చేసు కున్నాము .

కానీ, తుఫాన్లు,. వరదలు ఎప్పుడు వస్తాయో మనకు  తెలీదు. కాశ్మీరు లో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి . ఎంతో ప్రాణ నష్టము,  ఆస్తి నష్టము , ఎంతో మంది యిళ్ళలో వుండలేని పరిస్థితి ఏర్పడింది . మనం ఎంత మాత్రం వరదలను అడ్డుకో గలిగాము ?  అడ్డుకోలేము కదా !

కానీ - చేతనైనంత సహాయ కార్యక్రమాలు చేస్తున్నాము. మన సంగతి విడవండి . అక్కడి వారే కొంత మంది - భారత ప్రభుత్వము  చేస్తున్న సహాయక చర్యలను అడ్డుకున్నారు . ఎందుకంటే - ఈ సహాయక చర్యలు లేకపోతేనే కదా మన దేశానికి ప్రతికూలంగా వారు చేస్తున్న పన్నాగాలు, ప్రచారాలు ఫలించేది; అక్కడి ప్రజలలో మన పట్ల అపోహలు పెంచేది. యిది కాశ్మీరు ప్రజలు ఎప్పుడు తెలుసుకుంటారు ? తమకు సహాయం చేస్తున్నది భారత ప్రభుత్వం ; అడ్డుకుంటున్నది పాకిస్తానీ టెరరిస్టులు, వారితో కలిసిన కాశ్మీరీ వుగ్రవాదులు - అని కాశ్మీరు  ప్రజలు పూర్తిగా తెలుసుకోవాలి కదా . వరదలకు ఇవేవీ తెలీవు . అవి వస్తాయి .  ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అన్నీ కలిగిస్తాయి. అవి వాటి ధర్మం .

పరిస్థితులు వాటంతట అవి వస్తాయి . కానీ, మన "స్థితులు" మన మనస్థితులపై ఆధారపడి వుంటుంది .  కాశ్మీరు సమస్య మనస్థితుల సమస్యే కానీ మరేమీ కాదు . పాకిస్తాన్ లోనూ పెద్ద ఎత్తున వరదలూ, వర్షాలూ అన్నీ వచ్చాయి . ప్రాణ నష్టమూ, ఆస్తి నష్టమూ జరిగింది . భారత దేశంలోనూ  అదే ఎత్తున వరదలూ, వర్షాలూ అన్నీ వచ్చాయి . కానీ , యిక్కడ సహాయ కార్యక్రమాలు చేస్తూ వుంటే - అక్కడ,  భారత దేశం వలననే పాకిస్తాన్ లో వర్షాలు, వరదలూ - అని ప్రచారం మాత్రం చెయ్యబడుతోంది . పరిస్థితులు యిరు వైపులా వొకటే . మనస్థితులు ఎంత వేరో గమనించండి . ఆ మనస్థితిల ననుసరించే , వారి వారి కార్యక్రమాలు ఆధారపడి వుంటాయి . 

తమిళనాడులో తీర ప్రాంతంలో వొక సారి అకస్మాత్తు గా సునామీ వచ్చింది . కడలి పొంగింది . నింగికి ఎగిరింది . వుప్పుసముద్రం  జన సముద్రం మధ్యకు వచ్చేసింది . అలా వచ్చిన అల వొకటి  తాటి చెట్టు ఎత్తున వచ్చింది . వచ్చి తీరప్రాంతాన వున్న గుడిసేవాసులను ముంచి, రోడ్లు దాటి వూళ్ళలోకొచ్చి భీభత్సం సృష్టించి , మళ్ళీ మెల్లగా, వెనక్కు సముద్రం  లోకి  వెళ్ళిపోయింది .  అది వెనక్కు వెళ్ళే దారిలో  వొక గుడిసె వుంది . అది కూడా అల తాకిడికి మునిగి పోయింది . 

కానీ అందులో వొక జాలరి , అతని భార్య,  కొడుకు,కూతురు చిన్న పిల్లలు వున్నారు . వారందరూ మునిగిపోయారు . కానీ అల  వేగంగా వెనక్కు వెళ్ళే సమయంలో  జాలరి, ఆ నీటిలోనే , గుడిసె మధ్య లో వున్న స్తంభాన్ని వొక చేత్తో గట్టిగా వాటేసుకున్నాడు . అది పడి పోకుండా నిలిచింది. మరో చేత్తో భార్యచేతిని గట్టిగా పట్టుకున్నాడు . అతని భార్య తన మరో చేత్తో , దగ్గరగా అలలో కొట్టుకుపోతున్న కొడుకు చేతిని పట్టుకుంది . ఆమె కూతురు  ఆమె దగ్గరే, అలలో  కొట్టుకు పోతూ వుంది . అమ్మా, అమ్మా అని భయంగా, దీనంగా అరుస్తూ, చూస్తూ  వుంది . కానీ ఆ కూతురును రక్షించడానికి ఆమెకు మరో చెయ్యి లేదాయె . జాలరి, అతని భార్య, కొడుకు మాత్రం బ్రతికారు . కూతురు చనిపోయింది . 

బయట పడ్డ తరువాత ఆ అమ్మ ఏడుపు దీనాతిదీనంగా వుంది . తన కళ్ళ ఎదుటే , తన సమీపంలోనే తన ప్రియమైన కూతురు సునామీ అలలో కొట్టుకు పోతూ వుంటే , అమ్మా, అమ్మ అని అరుస్తూ వుంటే , నన్ను రక్షించవా , నన్ను మాత్రం వదిలేస్తున్నావా,  అన్నట్టు దీనంగా, భయంగా చూస్తూ, అల వేగం తో బాటు సముద్రం లోకి వెళ్లి పోతుంటే - వొక అమ్మ హృదయం  ఎలా స్పందిస్తుంది ? పరిస్థితి అలా వుంటే నేను మాత్రం ఏం చెయ్యగలను - అనుకుంటుందా ? లేదు కదా ! నేను ఏదో చేసి వుండాలి ; ఏదైనా చేసి వుండాలి ; నా కూతురును ఎలాగైనా రక్షించి వుండాలి ; ఎంత పాపిష్టి దాన్ని అని కుమిలి పోయే ఆ అమ్మ హృదయం .... ; అందులోనే కదా దేవుడనే వాడు వుంటే - జీవిస్తూ వుంటాడు . 

నాకనిపిస్తుంది - వొక ప్రధాన మంత్రి హృదయం ఆ అమ్మ హృదయం లాగా స్పందించాలి . వొక ముఖ్య మంత్రి హృదయం ఆ అమ్మ హృదయం లాగా స్పందించాలి . అంతెందుకు ; మన వూరి MLA హృదయం కూడా అలా స్పందించాలి . అదీ నిజమైన నాయకత్వ లక్షణం అంటే . మన మోడీ గారిలో , కొంత వరకు ఆ లక్షణాలు వున్నాయని నా నమ్మకం .

పరిస్థితులు మన చేతిలో లేక పోవచ్చు . కానీ, మన మనస్థితి మాత్రం మన చేతిలోనే , మన అధీనం లోనే వుంది . మనిషి దేవుడిలా స్పందించవచ్చు . మనిషిలా స్పందించ వచ్చు . మృగంలానో , రాక్షసుడి లానో  కూడా స్పందించ వచ్చు . కానీ వొక  నాయకుడి  స్పందన చాలా మంది ప్రజల హృదయ స్పందనగా మారుతుంది . కానీ , నాయకుడి స్పందన కోసం, "ఎవరో వస్తారని , ఏదో చేస్తారని " మనం వేచి చూడాలా ?

ఎంత మంది అనాథలున్నారు, మన చుట్టూ  ? ఎంత మంది  పేద వాళ్ళు వున్నారు? ఎంత మంది తిండి, గుడ్డ, నీడ లేని వాళ్ళు వున్నారు ? యిది వొక సునామీ కాదా ? వీరిలో కనీసం వొకరిని ఆదుకునే శక్తి మనలో ఎంతో మందికి వుందని నా నమ్మకం. మన లోని ఆ శక్తి బహిర్గతం కావాలంటే , ఆ అమ్మ హృదయ  స్పందన మనలో రావాలి. 

ఆ స్పందన మన అందరిలో రావాలని కోరుతూ 

=  మీ

వుప్పలధడియం విజయమోహన్  

1 కామెంట్‌: