27, అక్టోబర్ 2014, సోమవారం

చేసిందేమిటి ? చేస్తున్నదేమిటి ? చెయ్యాల్సినదేమిటి ? మన భవిష్యత్తును ఎలా మలుచుకోవడం?

 
చేసిందేమిటి ? చేస్తున్నదేమిటి ? చెయ్యాల్సినదేమిటి ?

 నిన్నటికీ , ఈ రోజుకూ ఏమిటి మార్పు ? ఏం తేడా వచ్చింది మన జీవితాలలో, ఈ వొక్క రోజులో - అని అప్పుడప్పుడూ మనం పునరావలోకనం  చేసుకుంటూ వుండాలి కదా. యిది చాలా, చాలా అవసరం.   


వొక్క వారంలో - గ్రుడ్డు పగిలి, పురుగుగా, ప్యూపాగా ఆ తరువాత రంగు రంగుల సీతాకోక చిలుకగా మారడం ప్రకృతి పరిణామం. జంతు జాలమంతా అంతే.  మనిషి వొక్కడే తన భవిష్యత్తు  కొంత తానే    నిర్ణయించ గల సమర్థుడు.


గ్రుడ్డు
కాటర్పిల్లర్
ప్యూపా
సీతాకోకచిలుక
 
మనకైనా , భూతకాలం యొక్క సహజ పరిణామమే వర్తమానం. వర్తమానం యొక్క పరిణామమే భవిష్యత్తు.  

వర్తమానపు వొక్క క్షణంలో - భూతకాలంలో చేసిన అన్ని పనుల ఫలితాలు, భవిష్యత్తు యొక్క అన్ని పునాదులు, యిప్పుడు అనుభవిస్తున్న అన్ని కష్టసుఖాలు - యిమిడి వున్నాయి కదా. 
మీరు భూత కాలాన్ని మార్చగలరా ?  మార్చలేరు . పోనీ వర్తమానం లో మీ అనుభవాల్ని, సుఖదుఃఖాల్ని మార్చ గలరా ? అదీ కష్టమే. ఈ క్షణంలో మీరు అనుభవిస్తున్నదంతా , మీ  భూత కాలపు శ్రమల ఫలితమే .

మీ 'నిన్న', మీ 'ఈ  రోజు' ను శాసిస్తూ వుంది.  

మీ 'నిన్న' + మీ 'ఈ రోజు',  కలిసి - మీ రేపటిని శాసిస్తూ వున్నాయి.   

మీరు చేసే పనులకన్నిటికీ మీరే బాధ్యులు, నేను కాదు అంటాడు, భగవంతుడైన శ్రీకృష్ణుడు. మీ పనులకు, మీకు రావాల్సిన ఫలితం మాత్రం నేనే యివ్వగలను, యిస్తాను ; అది ఎప్పుడు, ఎలా, మీకు యివ్వాలో - అది నిర్ణయించే వాడిని మాత్రం నేనే , నువ్వు కాదు అంటాడు భగవంతుడు .  

యిది మనకు అర్థం కావాలి . బాగా అర్థం కావాలి. ఎవ్వడికి, ఏది వచ్చినా , అది మంచైనా, చెడైనా, అది వాడు చేసిన పనుల ఫలితమే, వాటి ప్రభావమే;  మనకు రాకూడనిది ఏదీ మనకు రావడం లేదు. అలాగే, మనకు రావాల్సినవి ఏదీ , మనకు రాకపోవడం లేదు. 

ఈ  మూల సూత్రానికి కొన్ని వివరణలు అవసరం . వ్యక్తిగా మనం చేసే పనుల ఫలితం మనకు రావాలి; వస్తుంది . అయితే , సంఘంగా , మనం చేసే వుమ్మడి పనుల ప్రభావం కూడా మనలో ప్రతి వొక్కరికీ వస్తుంది. 

వొక వుదాహరణ : వికిలీక్స్ అనే సంస్థ భారత దేశంలోని  అగ్ర రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు, అగ్ర క్రీడాకారులు - వీళ్ళంతా స్విస్  బాంకుల్లో, ఎంత నల్ల దానం దాచుకున్నారో - చిన్న లిస్టు వొకటి తయారు చేసి, కొన్ని సంవత్సరాల క్రితం  బాహాటంగానే విడుదల చేసింది . అందులో యింకా ఎంతో, ఎంతో మంది  ఉన్నారన్న విషయం కూడా చెప్పింది. అందులో లక్షల కోట్లు, వేల కోట్లు పెట్టుకున్న వారు ఎంతో మంది భారతీయ నాయకులు వున్నారు. ఎంత చెప్పినా , అప్పటి భారత ప్రభుత్వం ఏ మాత్రం స్పందించ లేదని కూడా చెప్పింది . ఎందుకు స్పందించ లేదంటే , ఏం చెబుతాం ?

స్విస్ బాంకుల్లో  లక్షల కోట్లు మన డబ్బు కాజేసి పెట్టుకున్న వెధవలకు  మనం వోటు వేస్తున్నామా ? లేదా ? మా కులం, మా మతం, మా పార్టీ - అని  మహా స్వార్థంగా , మహా మూర్ఖంగా మనం వోటు వేసేంత వరకు మన దేశం ఎలా బాగు పడుతుంది ?  బాబా రాందేవ్ గారు మొత్తుకుంటూనే వున్నారు - స్విస్ బాంకుల్లో వున్న నల్ల ధనం తెస్తే చాలు - మన దేశం బాగు పడి పోతుందని.
అందుకని  అప్పటి ప్రభుత్వం చేసిందేమిటి ? రామ్ దేవ్ గారి లా ఎవ్వరడిగితే , వారిపైన లేని పోని కేసులు పెట్టింది.  మోడీ గారు వస్తే  తమ గుట్టు బయట పడిపోతుందని,  వారిపై , చెత్త చెత్త కేసులు బనాయించాలని చూసింది. కాకుంటే , చేసిన పనుల ఫలితం - ఎప్పుడో వొకప్పుడు రాక మానదు కదా. యిప్పుడు వస్తూ వుంది .  ఈ హేమా హేమీలతో పోలిస్తే - జయలలితా గారిపైన వున్న ఆస్తి కేసు అసలేమీ లేదు - అని అనిపించక  మానదు. 

అయినా ప్రజలుగా మనం మారాలి . లంచగొండి తనానికి, నల్ల  ధనానికి ఎదురుగా - వొక మహా ఉద్యమం బయలు దేరాలి . మన ఊళ్ళల్లో ప్రతి ఆఫీసులో , వున్న లంచగొండి వాళ్ళను మార్చాలి ; మారని వాళ్ళను,  శిక్షించాలి. వొక క్లార్కుగా, కానిస్టేబుల్ గా వున్న వాడు , ఆస్పత్రిలో ప్యూన్ గా వున్న వాడు కోట్లు సంపాదించాలని ఎందుకు బయలు దేరుతున్నాడు ? నాయకుడు  సర్లేదు కాబట్టి .  మనం సర్లేదు కాబట్టి .

సరైన నాయకులను ఎన్నుకుంటే దేశం బాగుపడుతుంది . మోడీ గారు మూడు సార్లు సంపన్న రాష్ట్రమైన గుజరాత్ కు  ముఖ్య మంత్రిగా వున్న వారు. వారికి కోటి రూపాయల ఆస్తి మాత్రమే వుంది. అంతకు మించి వున్న 40 లక్షలను ప్రధాన మంత్రి కాక ముందే, అనాథ శరణాలయాలకు ఇచ్చేశారు. వొక సరైన ఇల్లు కొనడానికి యిప్పుడు వారి వద్ద డబ్బు లేదు. కానీ, 9 రోజులు వుప వాసం చేస్తూ, కేవలం నీళ్ళు మాత్రం తాగుతూ , గొప్ప గొప్ప వారిని ముగ్ధులను  చేసిన వాక్పటిమ , సాధనా పటిమ రెండూ వున్న వాడాయన. అటువంటి వాడు ప్రధాన మంత్రిగా వుండాలా? చుట్టూ వున్న వారు లక్షల కోట్లు ప్రజా ధనాన్ని మింగుతూ వుంటే  నిమ్మకు నీరెత్తినట్టు నోరు తెరవని వారు ప్రధానిగా వుండాలా ? అదీ కాక పొతే, ఆ మింగే వారే పదవిలోకి రావాలా ? 

సరే . మన  వ్యక్తి గత విషయాలకు వస్తే - మనం వర్తమానంలో చేసే పనుల వలననే - మన భవిష్యత్తు శాసించ బడుతుంది . అయితే భూత కాలం లో మనం చేసిన పనుల ఫలితం కూడా చాలా వుంటుంది. బంగారు బ్రతుకైనా , బండ బ్రతుకైనా  మనం సృష్టించుకునేదే (చాలా వరకు). 

పతంజలి మహర్షి అంటారు - "హేయం దుఃఖమనాగతం " అని. అంటే, రాబోయే కాలంలో రాబోయే దుఃఖాన్ని మాత్రమే మనం అడ్డుకోగలం ; దాన్నుండి తప్పించుకోగలం; కానీ , భూత వర్తమానాల లో జరిగి పోయిన, జరుగుతూ వున్న వాటిని మనం ఏమీ చెయ్యలేం అని . 

రాబోయే సుఖ దుఃఖాలకు కారణం - మనం యిప్పుడు చేసే పని. యిదే మన భవిష్యత్తు ను శాసిస్తుంది.
 
మనం బాగా చదవ వచ్చు. మన ఆఫీసుల్లో చేసే పనులు బాగా చెయ్య వచ్చు. మంచి మాటలు మాట్లాడ వచ్చు. మన, మన వాళ్ళ ఆరోగ్యం బాగుండడానికి  ఏం చెయ్యాలో అది చెయ్యొచ్చు. లేని వారికి, తోచిన, చేతనైన సహాయం చెయ్యొచ్చు . యిలా మనం చెయ్య గలిగిన పనులెన్నో వున్నాయి .  

 యిన్ని చెప్పడం దేనికి ? మీరేం చేశారో చెప్పండి అని మీరు అనొచ్చు.  నిజమే . నేనేం చేశానో చెబితే - ఆ పైన మీరు చెప్పండి . నేను యింకా, ఏమేమి చెయ్యొచ్చో ? అది నాకూ మేలు. నేను చేసిన ఈ పనులు చాలా చిన్నవే కావచ్చు. కానీ ఏదో కొంత చేశాను. యిక ముందు మరేదైనా చెయ్యాలి . మీ సలహాలకు నా కృతజ్ఞతలు.    

నేను 60 ఏళ్ళ వయసుకు , అంటే  31-12-2008 నాడు రిటైర్ అయిన  తరువాత   యిప్పటికి 5 1/2 సంవత్సరాలు గడిచాయి.  మొదట 3 సంవత్సరాలు స్వామీ పరమార్థానంద గారి క్లాసులకు, మా అన్న, నేను యిద్దరం వెళ్ళే వాళ్ళం. ఆయన స్వామీ దయానంద గారి ప్రథమ శిష్యులలో ముఖ్యుడు. వారు అద్వైత సిద్ధాంతాన్ని, గీత, ఉపనిషత్తులు, శంకరాచార్యుల, వారి శిష్యుల గ్రంథాలు చాలా విశదంగా చెబుతారు. 3 సంవత్సరాలలో అద్వైతం బాగానే వంట బట్టిందని చెప్పొచ్చు.  

అయితే, ఆ మధ్య కాలంలోనే, నేను నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి  వారు స్టాక్ మార్కెట్ గురించి పెట్టే 13 పరీక్షలు  వొక్కొక్కటిగా రాశాను. 84 శాతం సగటు మార్కులతో పాసయ్యాను. అందుకని వారు, నాకు ఆ 13 పరీక్షల సర్టిఫికేట్ ల తో బాటు మరో మూడు సర్టిఫికేట్ లు కూడా యిచ్చారు . అవి , యివి : 

1. NSE  సర్టిఫైడ్ మార్కెట్ ప్రొఫెషనల్ - లెవెల్ -5 (యిదే  హైయెస్ట్ )
2. NSE  సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్  ఛాంపియన్ 
3. NSE సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రో (ప్రొఫెషనల్ ) 
 
వొక ప్రక్క అద్వైతం; మరో ప్రక్క స్టాక్ మార్కెట్. యిది - నాకేమీ వైవిధ్యం అని అనిపించ లేదు.  

ఈ పరీక్షలు రాయడానికి ముందు, ICICI DIRECT వారి ద్వారా,  డీమాట్ అకౌంట్  ఓపెన్ చేశాను. నాకు రిటైర్మెంట్ సమయంలో వచ్చిన డబ్బులో సగం అందులో వేశాను.  సగం బాంక్ లో ఫిక్సెడ్ డిపాజిట్ లో వేశాను. మెల్ల మెల్లగా వొక్కొక్క కంపెనీ షేర్లలో కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్  చేస్తూ వచ్చాను . ఏ కంపెనీ షేర్లలో వేసినా, దాన్ని గురించి కనీసం వొక వారం రోజులు పూర్తిగా అధ్యయనం చేసే, ఆ తరువాతనే వేశాను . 

గొప్ప గొప్ప ఇన్వెస్టర్ల  గురించి, వారి విధానాల గురించి చాలా చదివాను. ముఖ్యంగా, వారెన్ బఫే (బఫెట్ ) గారు చెప్పిన సిద్ధాంతాలు  చాలా చాలా చదివాను. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్  చేయాలనుకునే వారందరికీ, వారెన్ బఫే గురించి మొదట తెలియాలి. స్టాక్ మార్కెట్ లో 'ఇన్వెస్ట్'  చేసే వారికి,  'స్పెకులేషన్'  చేసే వారికి చాలా అంతరం  వుంటుంది. ఎంత మంది చెప్పినా , నేను యింత వరకు స్పెకులేషన్  వైపు వెళ్ళలేదు . 

స్టాక్ మార్కెట్ లో ఎలా, ఎందులో, ఎప్పుడు ఇన్వెస్ట్ చెయ్యాలనేది  వొక సైన్స్ , వొక కళ .   యిది ఎవరైనా నేర్చుకోవచ్చు. యిది జీవితాంతం ఎప్పటికీ యింకా , యింకా నేర్చు కుంటూనే వుంటాను, అని నాకు  బాగా అర్థమయ్యింది. ఈ వ్యాపకం నాకు బాగానే వుంది. లాభ దాయకం గానే వుంది.  

సరే . అందులో వచ్చే  లాభం ఏం చెయ్యడం ?  అందులో నాలుగో వంతు (25%) అనాథ బాలికల, బాలుల విద్య కోసం పెట్టాలని నిర్ణయించుకున్నా. యిలా, పోయిన మూడు సంవత్సరాలూ  చేశాను. 2013 లో , లక్ష పది వేలకు పైగా విరాళం యివ్వ గలిగాను. 2014 లో యిప్పటి వరకు 86 వేలకు పైగా యిచ్చాను.  నవంబర్ 17, మా 36 వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా, మరో 80 వేలు యిస్తానని చెప్పేశాను . అంటే - ఈ విరాళాలు రెండూ యిద్దరు అనాథ బాలికల కు 5 నుండి 12 తరగతుల వరకు అయ్యే పూర్తి ఖర్చు అన్న మాట.  యిది కాక, వొకరికి , ఆర్ధిక పరిస్థితి ననుసరించి, 50 వేలు యిచ్చాను కాని అది అభిమాన పూర్వకంగా యిచ్చింది ; విరాళంగా కాదు .  

ముందు ముందు దేవుడి ఆశీర్వాదం వుంటే - యింకా, ఎంతో చెయ్యాలని వుంది. రిటైర్  అయిన సమయంలో, జీతం పెన్షన్ గా మారిన సమయంలో, 1/3 వ వంతు కు తగ్గిన సమయంలో , యింత మాత్రం చెయ్య గలనని ఎప్పుడూ అనుకోలేదు.  యిప్పుడు యింకా , యింకా చెయ్యాలని,  ఉత్సాహం వుంది . 

సరే . జీవితం లో మరో కోణం చూద్దాం . నాకు సంస్కృతం చదవాలని , నేర్చుకోవాలని ఎప్పటి నుండో మనసులో వుండేది . బెంగళూరులో సంస్కృత భారతి  అనే ప్రసిద్ధ సంస్థ  వుంది.  వారు నిర్వహించే సంస్కృత పరీక్షలు, కరెస్పాండెన్స్  కోర్సులు  చాలా ప్రసిద్ధి గాంచినవి . నేను రెండేళ్ళ క్రితం అందులో చేరాను. నాలుగు పరీక్షలూ, ఆరు, ఆరు నెలల, రాయాల్సిన వ్యవధిలోనే రాసేశాను . ప్రవేశ , పరిచయ , శిక్ష , కోవిద - అనే యివి నాలుగూ  పాసు కావడానికి 2 ఏళ్ళు పట్టింది. కోవిద పరీక్షలో 99 శాతం మార్కులతో  పాసు కావడం, నాకు కొంత ఆనందాన్నిచ్చింది. యిప్పుడు, యింకా బాగా నేర్చుకోవాలని  ప్రయత్నిస్తున్నాను .

యివి కాక యింకేం చేశాను ? మీరు చదువుతున్న  ఈ తెలుగు బ్లాగు , ఆంగ్లంలో రెండు బ్లాగులు  రాస్తున్నా.  ఆంగ్లంలో - స్టాక్ మార్కెట్ గురించి వొక బ్లాగు, మరొకటి మన స్పిరిచువాలిటీ  గురించి. అందులో పతంజలి యోగ సూత్రాలు, ఆత్మ బోధ  లాంటి చాలా గ్రందాల గురించి విస్తృతం గా రాయడం జరిగింది. రెండేళ్ళ క్రితం చిలుకూరి వెంకటేశ్వర్లు గారు నాకు పరిచయమయ్యారు. వారు అడగడం, వారు ఆంగ్లంలో ఉపనిషత్తుల పైన రాసిన  పుస్తకాలను చదివి - వాటి మూల గ్రంథాలనూ చదివి , ఎడిట్ చెయ్యడం కూడా జరిగింది. అప్పుడు తెలిసింది , రామకృష్ణ మిషన్ వారి తెలుగు పబ్లికేషన్స్ లో చాలా పుస్తకాలు వారు రాసిందేనని.   అంతకు మించి - తెలిసింది , మన ఉపనిషత్తులు ఎంత పురాతనమైనవైనా, ఎంత గొప్పవో ! అవి చదవడానికి నాకు ప్రోత్సాహమిచ్చిన, వారికి నేనెప్పుడూ కృతజ్ఞుడనై  వుంటాను . 

ఈ  భూత కాలం పునాదుల పైన భవిష్యత్తులో, మరే చిన్న కట్టడాలు,లేదా భవంతులు వుంటాయో - నాకు తెలీదు. అయితే , నిశితంగా ఆలోచిస్తే, పెద్దగా మనం చేసేదేమీ లేదు ; ఏదో అతీత శక్తి అటు వైపు , యిటు వైపు మనలను నడిపిస్తోందని   స్పష్టం గా తెలిసి పోతుంది. ఆలోచన కాస్త మనది ; ఆపై వేసే వొక్క అడుగు మనది ; కానీ అంతకు మించి నడిపించే అతీత శక్తి మరేదో వుంది. 

నాకు తెలిసి చాలా మంది చేస్తున్న పనుల్లో చాలా చిన్న శాతం మాత్రమే చెయ్య గలుగుతున్నా - అని మాత్రం చెప్ప వచ్చు. కాబట్టి యిదేదో స్వంత డబ్బాగా నేను అనుకోవడం లేదు. ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి ?  65 1/2 సంవత్సరాల వయసులో ఏం చెయ్యొచ్చు ? ఎన్నో చెయ్యొచ్చు . 


అదీ ఆలోచన, తపన . అంతే .


మరి, మీ సలహా చెప్పండి . 

= మీ 

వుప్పలధడియం విజయమోహన్

1 కామెంట్‌:

  1. మీ ఈ రిటైర్మెంట్ ప్రస్థానం చదివాక...నాకు చాలా చాలా సంతోషం వేస్తోంది.
    కేవలం మాటలు కాదు...నేను చేతలమనిషినే అని నిరూపించే మరో మంచితనం మూర్తీభవించిన వ్యక్తిగా వుండటం...నాకు తెలినినంతవరకు కొన్ని లక్షలమంది చేయలేని పని మీరు చేస్తున్నారు. (ఈ మాట అతిశయోక్తి కాదు. ముఖస్తుతి అంతకన్నా కాదు!) నిజం చెబుతున్నాను నమ్మాలి మీరు.
    ఎంతోమంది మీకన్నా ఎక్కువ సంపాదన వున్నవాళ్ళు, పెన్షన్ తీసుకుంటున్నవాళ్ళు (నాకు పర్సనల్‌గా కొంతమంది తెలుసు) ఇలా కొద్దిగానైనా మిగతావాళ్ళకు సాయం (స్వలాభం లేకుండా ) చేస్తున్నారా?....ఏమో..సందేహమే! సంపాదను ఎక్కువయ్యే కొద్దీ రూపాయి రూపాయి లెక్క చూేనవాళ్ళను నేను ఈరోజుకీ చూస్తున్నాను.
    మన బంధువులకి, ేన్నహితులకి, ఇంకా అయినవాళ్ళకి సహాయం చేయటంలో ఎంతో కొంత లాభం, కీర్తికాంక్ష వుంటుందేమోననిపిస్తుంది...కానీ మనకేమాత్రం సంబంధంలేనివాళ్ళకు ఆర్థికసాయం చేయటం...ముఖ్యంగా ఆడపిల్లల్ని చదివించటం....నాకు చాలా నచ్చింది...
    ఈరోజు మనం చేేన మంచి చెడులే, రేపటి మన భవిష్యత్తు...అక్షరాలా నిజమని నేను నమ్ముతాను.
    మీలోని ఈ దయాగుణం మరింకెంతోమందికి మేలు చేయాలని, మీరింకా ఇంకా అన్నిరంగాలలో ఎదగుతూ వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి