28, మే 2012, సోమవారం

మనం మారితే - పాలకుల్లో - మార్పు వస్తుంది. కానీ- మనం మారే ఛాన్సు, ఎంత వుందంటారు ? - జగన్ గారి కేసు ఏమవుతుందో ఎవరికి తెలుసు?


కర్నాటక లో గాలి జనార్దన రెడ్డి గారు అరెస్ట్  అయినప్పుడు - వారికీ, ఆంధ్ర లో జగన్ మోహన్   రెడ్డి గారికి వున్న సంబంధాల గురించి  దుమారం రేగింది. అబ్బే.మాకస్సలు అలాంటి సంబంధమేమీ లేదు గాక, లేదని, వీరు కొట్టి పారేసారు.

గాలి గురించి అంతా తెలిసినా - అక్కడి ప్రభుత్వం వారు - వారిని బాగా వెనకేసుకు వచ్చారు. ఆఖరికి సుప్రీం  కోర్టు వారు కన్నెర్ర చేస్తే - వారిపై చట్టం ముందుకు కదిలింది.

మరి ఆంధ్ర ప్రదేష్  రాష్ట్రం వారు జగన్ పై  ఎలాంటి చర్య తీసుకోవడానికీ - ముందుకు రాలేక పోయ్యారు -వారి ఆస్తుల విషయం కర్ణాకర్ణిగా- రాష్ట్రమంతా కొంత తెలుసు. పక్క రాష్ట్రంలో వారికి కూడా తెలుసు. అయినా -  తనకు తానుగా, రాష్ట్రం ముందుకు కదల లేదు.

వారికి తెలుసు - తీగ కదిపితే - డొంకంతా కదులుతుందని.

కాని- కేసు సుప్రీం కు వెళ్లిందంటే - ఏదో కొంత ముందుకు వెళ్ళక తప్పదు. అదే జరిగిందిప్పుడు.

కేసు సి.బీ.ఐ కి వెళ్ళడము ,  సి.బీ.ఐ  వారికి  కొంత  ఆధారాలు  దొరకడము,  ముందుకు  వెళ్ళే  కొద్ది,  మరిన్ని  ఆధారాలు  దొరకడము, యివి జరిగిన తరువాత,  కేసు తప్పక కోర్టుకు వెళ్ళుతుందనడంలో - సందేహం    లేక పోయింది.

కానీ - వారి పార్టీలో, వారి వెనుకే వున్న వారికి, యిదేదో గొప్ప అవకాశం  లభించినట్టుగా -అంటే , జగన్ గారికి, తమ పూర్తి లాయల్టీ  - మద్దతు - తెలపడానికి - వొక మహదావకాశం  గా మురిసిపోయేటట్టు  కనిపిస్తుంది.

దీని వెనుక  పెద్ద రాజకీయ కుట్ర  వున్నట్టు - జగన్ గారు తప్పక బయటకు వస్తారు, గెలుస్తారు, సి.యం  అవుతారు - అన్నంత  ధీమా తో మాట్లాడుతున్నారు. అయితే - ఈ అక్రమాస్తుల విషయం గురించి వారు మాట్లాడరు. జగన్ గారు త్వరగా బయటకు రావాలి, సి.యం  కావాలి - తాము మరేదో కావాలి - ఈ  ఆరాటం  మనకు  బాగా  కనిపిస్తుంది.

మిగతా పార్టీలు - వారి వారి సమస్యలలో - వారున్నారు -కాంగ్రెసుతో సహా.

కిరణ్ కుమార్ రెడ్డి గారు - జగన్ గారి విషయంలో నిర్దోషి . పాపం - ఆయన ఏమీ చెయ్యలేదు. చెయ్యాల్సిన పనులు ఎన్నో వున్నా - అవేవీ ఆయన చెయ్య లేదు. ఆయనను ఈ విషయంలో - పొగడడమో, తిట్టడమో, రెండూ - అనుచితమే.

బాబు గారు కూడా అంతే. వొక ప్రతి పక్ష నాయకుడిగా - ఈ విషయంలో - ఆయన ఏమీ చెయ్యలేక పొయ్యారు. వారిని కూడా - ఈ విషయంలో - పొగడడమో, తిట్టడమో, రెండూ - అనుచితమే.

కే.సి.ఆర్.  గారు - తిట్ట గలరు ఎవరినైనా. ఆయనకు పొగడడం అస్సలు రాదు. తమ పార్టీ వారినైనా. 

కనీసం తెలంగాణా లోనైనా - ఏ వొక్కరినైనా - ఆయన పొగడగా మీరెవరైనా విన్నారా? జగన్ ను ఆయన తిట్టి వుండే వుండొచ్చు - ఎప్పుడైనా.  తెలంగాణా వచ్చేసినా - వారి పధ్ధతి  వారిది గానే వుంటుంది.

కానీ - జగన్ గారి ప్రస్తుత పరిస్తితికి  ఆయన కారణం కానే కాదు. ఆయన తిట్టుకు అంత శక్తి  లేదు.  శ్రీకృష్ణుడే అన్నాడు - ఎప్పుడూ అలగని వాడు, తిట్టని వాడు, అలిగితే,తిడితే, అది ప్రమాదం; కానీ, ఎప్పుడూ అలిగే వాడు, తిట్టే వాడు, అలిగితే, తిడితే - ఏం భయపడాల్సిన పని లేదు.

కాబట్టి,  జగన్ గారి విషయంలో - అదంతా కారణం  ఏమీ కాదు.  

కాగల కార్యం గంధర్వులు (సి.బీ.ఐ) చేస్తున్నారు. అంతే. ఏం జరగబోతోందో - పై వాడికి  (ఘనత  వహించిన కోర్టు వారికి)  మాత్రమే  తెలుసు. అదీ యిప్పుడు కాదు. ఎప్పుడో తెలుస్తుంది  వారికి ! 

కాకపోతే - వొక్క విషయం మాత్రం సందేహం గా వుంది. కొంత  మంది విద్యార్థులు (నేను కూడా చేసాను అలాంటివి ) పరీక్షల్లో  కూర్చుంటే - అరవై మార్కులు వచ్చే వరకు రాసామనుకుంటే -  యిక చాలు, పదండి పోదాం క్రికెట్ చూడ్డానికి - అను పేపర్ యిచ్చేసి, వెళ్లి పోతారు.  

కొన్ని కొన్ని కేసులలో - సి.బీ.ఐ - అలా, అల్ప సంతోషంతో పొంగి పోతోందో -అని అనిపిస్తోంది. చేసింది చాలు. కనిపెట్టింది చాలు -యిక పోదాం మరో కేసుకు -అని - అలా మీకేమైనా అనిపిస్తోందా ? 

యిప్పుడు దేశమంతా  - మిమ్మల్నే నమ్ముకుంది, దేశంలోని, ప్రతి రాష్ట్రం లోని ప్రతి కేసుకూ. మీరు తప్ప మరొకరు ఇవేవీ చెయ్య లేరు. -అని చెప్పాలనిపిస్తుంది.

అది సరే. మళ్ళీ జగన్ కేసు విషయానికి వద్దాం. మీకు జరిగేవన్నీ , మీకు జరగవలసినవే కానీ - మీకు జరగ కూడనివి కాదు - అంటుంది గీత. 

రేపు ఆయన బయటకు వచ్చి సి.యం  అయినా అంతే . లేక ,  శిక్ష తప్పించుకోలేక పోయినా అంతే .

ఎన్ని కుల రాజకీయాలు , మత రాజకీయాలు నడిపినా - ప్రతి దానికి - వొక మూల్యం వుంటుంది. జగన్ కూ  అంతే . ఎవరికైనా అంతే . ప్రజలకూ అంతే . 

మన కులం వాడికి వోటు వేద్దాం ; మన మతం వాడికి వేద్దాం అని ప్రజలు అనుకుంటే - అందుకు , రాష్ట్రమంతా - తగిన మూల్యం చెల్లించక తప్పదు .

యిప్పుడే - రాష్ట్రంలోని, ఎన్నో వూర్లలో, ఎన్నో జిల్లాల్లో, కనీసం "మంచి" నీటి సౌకర్యం లేదు. అసలు నీటి సౌకర్యమే లేని వూళ్ళు చాలా వున్నాయి. విద్యుత్తు  కొరత ఎప్పుడూ వుంది. ఉద్యోగావకాశాలు మన రాష్ట్రంలో చాలా తక్కువ. మన రాష్ట్రంలో పుష్కలం గా దొరికేది - మన కొంప ముంచే మద్యం వొక్కటే.

65 ఏళ్ళుగా - మన - కులం వాళ్లకు వోటు వేసి   మనం సాధించింది యిదే.

ఈ కుల,  మత ప్రాతి పదికలు  పక్కన పెట్టి -  ఏ జయప్రకాష్ నారాయణ్ లాంటి వారికో - వొక్క సారి - మూకుమ్మడిగా వోటు వేసి చూడండి. అయిదు సంవత్సరాలు - ఈ కుల రాజకీయాల వాళ్ళు, మత రాజకీయాల వాళ్ళు - చెప్పే మాటలు పక్కన పెట్టి - ఇప్పుడున్నంత తెలివితోనే - వొక్క సారి - వారికి, మద్దతు యిచ్చి చూడండి.

మనకు పోయేదేమీ లేదు. మరి ఎన్నికలు లేవుగా - అంటారేమో. ఏదో వొకటి వస్తూనే వుంది. అందులో చూపండి మీ విజ్ఞత .

ఈ మధ్యలో  జగన్ గారు ,ఆయన ఆస్తులు, కేసులు, వొక కొలిక్కి రావచ్చు. ఆయన కూడా బాగా మారొచ్చు.

బాబు గారు,  కే.సి.ఆర్. గారు, చిరంజీవి గారు,ఏదేదో ప్రణాళికలు వెయ్యొచ్చు.తమ తమ రాజకీయాల  ధోరణి మార్చుకోవచ్చు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎన్నెన్నో చెయ్యొచ్చు. యిప్పట్లో - ఆయనకు రాజకీయాలు అంతు  బట్టడం లేదు కాబట్టి - కొన్ని నిజమైన ప్రజోపయోగ కార్యాలు చేసినా చెయ్యొచ్చు.

తెలంగాణా వొక వేళ  వస్తే - తమ పాలకుల ధోరణికి, తెలంగాణా ప్రజల మొహం మొత్తచ్చు. ఏ జాతి చరిత్ర చూసినా - ఏమున్నది గర్వ కారణం -అని తెలిసి పోవచ్చు.

మనం మారితే - పాలకుల్లో - ఎన్నో మార్పులు వస్తుంది..... కానీ..... మనం మారే ఛాన్సు, ఎంత వుందంటారు ?


=మీ 

వుప్పలధడియం విజయమోహన్  



2 కామెంట్‌లు:

  1. well said. A very apt analysis. Unless people change they shouldn't expect things to change.

    రిప్లయితొలగించండి
  2. baaga chepparu. kaani evarina vintara annadi anumaname. mana samajamlo, kulam chaala chaala mukyam, enduko mari naku ardham kadu.
    http://www.youtube.com/watch?v=ru7tF4YzWPM watch between 8:00 - 12:00. we will understand how stupidest is the caste

    రిప్లయితొలగించండి