28, జనవరి 2017, శనివారం

భగవద్ గీత (2) - అర్జున విషాద యోగము - పారాయణ గీత

భగవద్ గీత (2)


మొదటి అధ్యాయము

అర్జున విషాద యోగము

 

భగవద్ గీత  శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినదేశ, కాల, మత, జాతులకు అతీతమైన, మహోత్కృష్టమైన జీవన విధానం

మనిషి జీవితానికి అర్థం, పరమార్థం, మనం చెయ్య వలసినవి, చెయ్యకూడనివి, ఏది చేస్తే ఏమవుతుందో, ఏది కాదో, ఏది చెయ్యకూడదో - అన్నీ సమగ్రంగా తెలిపిన ఏకైక, నభూతో నభవిష్యతి అయిన మహోపదేశం భగవద్ గీత

మహా భారత సంగ్రామానికి ముందుగా, అంత వరకు కర్తవ్యోన్ముఖుడైన, మహావీరుడైన అర్జునుడు , తన మనసులో రేకెత్తిన అల్లకల్లోలానికి,కర్తవ్య విముఖతకు ఎన్నెన్ని కారణాలో మనసు విప్పి  శ్రీకృష్ణుడి  ముందు ఏకరువు పెడతాడు. ఇది భగవద్ గీతలో మొదటి అధ్యాయం


ఇందులో మొదటి శ్లోకం  క్రిందటి వ్యాసంలో చూశాము. అంధుడైన ధృతరాష్ట్రుడు , దివ్యదృష్టి కలవాడైన సంజయుడిని వేసిన ప్రశ్న అది . తరువాత ధృత రాష్ట్రుడు భగవద్ గీత కడపటి వరకు మౌనం గానే వుంటాడు.

"
ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రంలో , యుద్ధోత్సాహంతో వున్న  నా వాళ్ళు (అయిన కౌరవులు), పాండవులు ఇప్పటి వరకు ఏం చేశారు?" అని శ్లోకంలో అడుగుతాడు అంధుడైన ధృతరాష్ట్రుడు.  

సంజయుడు - యుద్ధభూమిలో దుర్యోధనుడికి, ద్రోణాచార్యుల వారికి జరిగిన సంభాషణ చెప్పటం ప్రారంభిస్తాడు . మీ కొడుకు దుర్యోధనుడు ద్రోణాచార్యులతో యిలా అన్నాడు  - అని సంజయుడు ప్రారంభిస్తాడు :

"మీ శిష్యుడైన ద్రుష్టద్యుమ్నుడి నాయకత్వంలో వున్న పాండవ సేనను చూడండి. అందులో, అర్జునుడు, భీముడు, యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడి లాంటి మహారథులున్నారు. వీరే కాదు. ధృష్టకేతుడు, చేకితానుడు,కాశీ రాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైబ్యుడు లాంటి నరపుంగవులున్నారు. యుధామన్యుడు లాంటి ధైర్యశాలి, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ద్రౌపది కొడుకులైన ఉప పాండవులు లాంటి మహారథులూ వున్నారు.

"ఇక మన సైన్యం లోని గొప్ప వీరులు చూడండి. మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వథామ, వికర్ణుడు, సోమదత్తుడి కొడుకుయింకా ఎంతో మంది మహా వీరులు , యుద్ధవిద్యలో ఆరితేరిన వారు, అన్ని శాస్త్రాస్త్రాలలో ప్రవీణులైన వారు, నా కోసం తమ ప్రాణాలనుఅర్పించడానికి సిద్ధంగా వున్నారు

"మన సేన చాలా అపారమైనది, భీష్ముల వారిచే రక్షింప బడుతున్నది, పాండవ సేన మనకంటే చిన్నది , భీముడిచే రక్షింప బడుతున్నది. నా అభిప్రాయంలో మీరంతా మీ, మీ స్థానాలలో వుండి ఎలాగైనా సరే, భీష్ముడిని మాత్రం తప్పక కాపాడి తీరాలి . "

దుర్యోధనుడి మాటలు విని, అతన్ని ఉత్సాహ పరచ డానికి, కురు వృద్ధుడుపితామహుడు ఐన భీష్ముడు గట్టిగా సింహనాదం చేసి, తన శంఖాన్ని పూరించాడు. అది విని, కౌరవ సైన్య యోధులు అందరూ తమ తమ శంఖాల్ని, భేరీలను, మరెన్నో యుద్ధ వాయిద్యాలను పూరించి నినాదాలు చేశారు

నాదాలు విని తెల్లటి దివ్యాశ్వాలు తో వున్న దివ్య రథం పైన కూర్చుని వున్న  శ్రీకృష్ణుడు, అర్జునుడు కూడా  తమ అద్భుత శంఖాలైన పాంచజన్యము, దేవదత్తాలను పూరించారువృకోదరుడు (భీముడు) తన పౌండ్ర శంఖాన్ని గట్టిగా పూరించాడు. అలాగే, యుధిష్ఠిరుడు అనంతవిజయాన్ని, నకులుడు సుఘోషాన్ని, సహదేవుడు మణి పుష్పకాన్ని పూరించారు

కాశీరాజు, శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపదేయులు, సౌభద్రుడు, యిలా పాండవ సేన లోని వీరులందరూ చేసిన శంఖ ధ్వానాలకు కౌరవుల గుండెలు అదిరాయి

అప్పుడు, కౌరవులందరినీ  ఒక్క సారి చూసి, కపి ధ్వజుడైన అర్జునుడు, తన చేతిలో గాండీవాన్ని ధరించి, సారథి ఐన శ్రీకృష్ణుడిని వుద్దేశించి యిలా అన్నాడు :

"అచ్యుతా ! యుద్ధోత్సుకులైన వీరులందిరినీ  నేను చూసేటట్టుగా మన రథాన్ని, యీ రెండు సేనల మధ్య నిలుపు. దుష్ట బుద్ధి అయిన దుర్యోధనుడిని సంతోష పెట్టాలని, అతని పక్షం  లో యుద్ధం చేయాలనుకున్న వారిని   నేను చూడాలి."

అది విని శ్రీకృష్ణుడు - రథాన్ని భీష్మ ద్రోణులు , తదితర వీరులు వున్న స్థలం లో, రెండు సేనల మధ్య నిలిపి , పార్థా! కౌరవుల నందరినీ బాగా చూడు - అన్నాడు. అర్జునుడు రెండు సేనల లోని చిన్నాన్నలు,మామలు, మేనమామలు, తాతలు, గురువులు, సోదరులు, కొడుకులు, మనమళ్లు, స్నేహితులు, తనకెన్నో రకాలుగా సహాయ పడిన వాళ్ళు - అందరినీ వీక్షించాడు.

అందరినీ చూసి దయార్ద్ర హృదయుడు , శోక తప్తుడు అయిన అర్జునుడు యిలా అన్నాడు  -

"
కృష్ణా! యుద్ధ సన్నద్ధులై నిలిచియున్న నా బంధువుల నందరినీ చూస్తూ ఉంటే నా నోరు ఎండిపోతూ వుంది. నా శరీరము స్తబ్ధమైపోతూ వుంది. నా శరీరం కంపిస్తూ ఉంది. నా రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. గాండీవం నా చేతినుండి జారి పడిపోతూ వుంది. నా చర్మమంతా మండుతూ వుంది. కేశవా! నేను నిలబడలేక పోతున్నాను . నా మనసు గిర్రున తిరుగుతూ ఉన్నట్టుందిదుశ్శకునాలు కనిపించేటట్టు  వుంది.

"
నా బంధువులను, యుద్ధంలో చంపడంలో నాకు రకమైన మంచీ కనిపించడం లేదు. కృష్ణా ! నాకు సంపదలు, సుఖాలు , రాజ్యము, విజయము యివేవీ వద్దు అని అనిపిస్తూ వుంది గోవిందా! రాజ్యము, సుఖాలు, చివరకు జీవితం వలన కూడా ప్రయోజనమూ కనిపించడము లేదు. ఎవరికోసమైతే  రాజ్యము, సుఖాలు కావాలనుకున్నానో, వారందరూవాళ్ళ జీవితాలనూ, ధనాన్ని పూర్తిగా పణంగా పెట్టి యుద్ధభూమిలో నిలబడి ఉన్నారు. గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మామలు, మనమళ్లు, బావమరుదులు, మరెంతో మంది బంధువులు యిక్కడ యుద్ధభూమిలో వున్నారు. నన్ను వాళ్ళు చంపినా, చంపాలనుకున్నా, ముల్లోకాలు కోసం కూడా వాళ్ళను నేను చంపాలనుకోనుఅలాంటిది  కేవలం రాజ్యం కోసం నేనెలా వాళ్ళను చంపగలను?

"
కృష్ణా ! మూర్ఖులైన కౌరవులను చంపితే నాకు  పాపమే వస్తుంది   కానీ  ఆనందమెలా వస్తుంది ? కాబట్టి వీళ్ళను నేను చంపరాదు. నా బంధువులైన వీళ్ళను చంపడంలో నాకు ఆనందమెలా వస్తుంది? వాళ్ళు లోభంతో  కళ్ళు మూసుకున్న వాళ్ళై కులక్షయ కారకులవడానికి, మిత్రద్రోహానికి వొడిగట్టినా, మనం పాపాన్ని అర్థం చేసుకున్న తరువాత, దాన్నుండి బయట పడాలి కదా! కులక్షయమైతే , సనాతనం గా వస్తున్న కులధర్మాలన్నీ నశించి అధర్మం నిండిపోతుంది. కృష్ణా ! అధర్మం నిండితే స్త్రీలు తమ శీలం విడిచిపెట్టేస్తారు. వాళ్ళు శీలం విడిచి పెడితే, వర్ణ సంకరము అవుతుంది. వర్ణ సంకరమైతే, కులానికి, కులఘాతకులకు యిద్దరికీ నరకమే ప్రాప్తిస్తుంది. కులం నాశనం వైపు వెడుతుంటే , పితరులకు పిండప్రదానం చేసే వాళ్ళు  కూడా వుండరు.

"
ఎప్పటి నుండో వున్న కుల, జాతి  ధర్మాలు, వాటి గొప్పదనాలు వర్ణసంకరం చేసే వాళ్ళ వలన పూర్తిగా నశించి పోతుందిమనం విన్నాము కదా - జాతి ధర్మాలు పూర్తిగా విడిచి పెట్టే వాళ్లకు, శాశ్వత నరకమే కలుగుతుందని. రాజ్యం, సుఖాలు వీటి లోభంలో పడి మనము మన బంధువులనే చంపడం అనే పాపానికి వొడిగట్టుతున్నాము కదా !

"
దీనికంటే, నిరాయుధుడనై, కదలక మెదలక, కౌరవుల చేతిలో, వారి ఆయుధాల వలన చావడం కూడా మేలు కదా! "

యిలా శోకతప్తుడైన అర్జునుడు చెబుతూ, తన  గాండీవాన్ని , అస్త్రాలను విడిచిపెట్టి రథంలో కూలబడిపోయాడు. 47 శ్లోకాలున్న మొదటి అధ్యాయం , అర్జున విషాద యోగం యిక్కడ పూర్తవుతుందిఇంత వరకు  శ్రీకృష్ణుడు, వింటూ వున్నాడే తప్ప నోరు తెరవ లేదు. దానికి కారణం మరో బ్లాగ్ పోస్ట్ లో చెబుతాను. శ్లోకాలను మనం విశ్లేషించ వచ్చు . కానీ, కృష్ణుడి విశ్లేషణే మొదట విందాం. అదే బాగుంది .

మరో మాటతో  దీన్ని ముగిద్దాం. భగవద్  గీతను యిక్కడ  బ్రహ్మ విద్యను తెలియజేసే ఉపనిషత్తు గానూ, యోగశాస్త్రం గానూ పేర్కొనడం మనం ముఖ్యంగా  తెలుసుకోవాలి. యిది ఒక పరిపూర్ణ యోగ శాస్త్రము. ఇందులో బ్రహ్మ విద్య బోధింప బడింది. దీన్ని ఒక ఉపనిషత్తు గానూ చెప్పారు. మనం భారతాన్నే పంచమ  వేదం అంటాము గానీ, నిజానికి, భగవద్ గీతను అలా చెబితే సరిగ్గా వుంటుంది - అని నాకు అనిపిస్తుంది.

దీన్లో వర్ణాలు, వర్ణ సంకరాల  జోలికి పోకండి. భారత కాలం నాటికి ఎన్నో మారిపోయాయి. భారతం బండ  పురాణము అన్న నానుడి మీరు వినే వుంటారు. అర్జునుడు మాట అనేటప్పటికే, వాళ్ళ కులంలోనే ఎన్నో జరిగిపోయాయి. శ్రీకృష్ణుడు పుట్టింది క్షత్రియ కులమే అయినా , అమ్మ పాలు తాగి పెరిగింది యదుకులంలో . తరువాత యాదవులు గొప్ప వీరులుగా పేరు గన్నారు అని భారత యుద్ధం లో మనకు  తెలుస్తుందికర్ణుడు సూతకుల మాత పాలు  త్రాగి పెరిగిన వాడు, తరువాత అర్జునుడంత వీరుడైన వాడు. వ్యాసమహర్షి తండ్రి బ్రాహ్మణుడు, తల్లి  బెస్త కులవనిత. యిలా ఎన్నో. శ్రీకృష్ణుడికి నచ్చిన వాళ్ళు - కుబ్జ, విదురుడు, సంజయుడు లాంటి వాళ్ళు, అర్జునుడి లాంటి క్షత్రియ భక్తులు ,కుచేలుడు లాంటి  బడుగు బాపడు - నిజానికి కృష్ణుడు కులం జోలికే పోలేదు. దానికి ప్రాముఖ్యమే యివ్వలేదు. నిజాయితీ, భక్తి - వీటినే మెచ్చాడు.

సరే. యిది వదిలి పెట్టి , శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడో ఇక ముందు చూద్దాం. ముఖ్యమైన వాటికి శ్లోకము, అర్థము, వివరణ, విశ్లేషణ కూడా యిస్తాను. వీటిని కలిపితే 'పారాయణ గీత' అని చెప్పుకోవచ్చు. వీటిని మనం నిత్యం మననం చేసుకోవచ్చు.

ఆది శంకరాచార్యులవారు - ప్రతి నిత్యమూ  ఒక్క గీతా శ్లోకమైనా చదివి అర్థం చేసుకుని , ఆనందించండి , జీవితం సాఫల్యం చేసుకోండి - అన్నారు . అది ముఖ్యంగా పారాయణ గీతా శ్లోకాలకు అన్వయించుకోండి.
 
మీ అభిప్రాయాలను , విమర్శలను , అనుభవాలను కూడా నాకు మీరు తెలియ  జేస్తూ వుంటే చాలా బాగుంటుంది.

సర్వే  జనాః సుఖినో భవంతు 

= మీ 

ఉప్పలధడియం   విజయమోహన్  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి