15, సెప్టెంబర్ 2014, సోమవారం

ఈ రోజు మీరు ఆడిన ఆట ఎలా ఆడారు - 5 నిమిషాల్లో మనసుపైన మీరు సాధించే విజయం ఎలా ?


వొకాయన  భార్య తనకు బహుమతిగా కొనిచ్చిన తెల్ల గుర్రంపైన కూర్చుని స్వార్తీ చేస్తున్నాడు . కాకపోతే , ఆయన తోకవైపు తిరిగి కూర్చుని స్వారీ చేస్తూ , గుర్రాన్ని తిడుతూ, కొడుతూ వున్నాడు . ఆయన భార్య కోపంతో , నీలాంటి మూర్ఖుడికి ఈ తెల్ల గుర్రం కొనివ్వడమే పొరబాటు . ఎవరైనా తోకవైపు కూర్చుని ప్రయాణం చేస్తారా - అన్నది .

అందుకాయన కూడా కోపంతో - నువ్వు మూర్ఖురాలివి, నీ గుర్రం నీకంటే మూర్ఖపుది . నేను, నేను వెళ్ళ వలసిన వైపే కూర్చుని వున్నా. యిది దానికి విరుద్ధంగా వెడుతుంటే నేనేం చేసేది ? అన్నాడు .

తప్పెవరిది ? గుర్రందా , ఆయనదా ? లేక ఆయన భార్యదా ? ఆయన మాత్రం తను వెళ్ళాల్సిన వైపే కూర్చుని ఉన్నాడట . గుర్రం దానికి విరుద్ధంగా వెడుతున్నదట.

ఏ గుర్రమైనా  ముందుకే వెడుతుంది . ఈయన వెనుక వైపున్న దారిలో వెళ్ళాలి . యిప్పుడేం చెయ్యాలి . గుర్రాన్ని వెళ్ళాల్సిన వైపుకి తిప్పితే , అది ఆ మార్గంలో ముందుకే వెడుతుంది . అప్పుడు యిద్దరి గమ్యం వొకటే అవుతుంది .

నా గమ్యం వేరు . నా వాహన గమ్యం వేరైతే  ఎలా ?

నిజానికి వాహనానికి గమ్యం లేదు . అది ముందుకే వెళ్ళగలదు . కాకపోతే , బయల్దేరే ముందు  ఏ  ప్రక్కకు తిప్పి నిలబెడితే , అది ఆ ప్రక్కన ముందుకే వెడుతుంది .

మనుషులకు ముఖ్య వాహనం - వారి వారి మనసు . అదీ సాధారణంగా, గుర్రం లాగా , ముందుకే దూసుకుని వెళ్ళ గలదు .

ఏ వైపు వెళ్ళాలో , గమ్యం ఏమిటో నిర్ణయించాల్సింది  మనమే . మనకు మన గమ్యమే తెలియకుంటే ,లేదా మనం మనసు యొక్క తోక వైపు కూర్చుంటే -అంటే , మనసు పరుగెత్తే వైపు కాక మరోవైపు పోవాలనుకుంటే , ఎలా కుదురుతుంది ?

మనం ఏదో పరీక్ష పాసు కావాలి . అదీ మన గమ్యం. ఇప్పుడు మనం మన మనసును ఆ వైపు త్రిప్పి నడిపించాలి , మనసును టీవీ వైపు పెట్టి పరీక్ష పాసు కావాలంటే ఎలా ?

ఏ గమ్యం చేరాలన్నా , మనసా, వాచా, కర్మణా అ గమ్యం వైపే  కృషి చేస్తేనే, చేరడానికి  అవకాశాలుంటాయి . అలా కాక , మనసొక వైపు, మాటొక వైపు , చేతలు మరొక వైపు వుంటే - గమ్యం చేరలేము కదా .

మనలో చాలా మందికి - యిదే సమస్య . మీ గమ్యం ఏమిటని అడిగితే - సగం మంది అసలు చెప్పలేరు . వారికి గమ్యం లేదు . వారి గుర్రం - అంటే  మనస్సు ఎటు  వైపు వెడితే , వారి జీవితం అటువైపు వెళ్ళిపోతూ వుంటుంది.
ప్రత్యేకించి గమ్యం అంటూ వుండదు .

మరి కొంత మందికి గమ్యం అంటూ ఏదో వొకటి లోపల వుంటుంది . కానీ వారు - తమ మనస్సును, బుద్ధిని - తమ గమ్యం వైపు త్రిప్పి వుంచరు . అందు వలన మనస్సు పరిపరి మార్గాల్లో పోతూ వుంటుంది . అప్పుడప్పుడూ , నిరాశతో , నిస్పృహతో - అయ్యో, ఎన్నో చెయ్యాలనుకున్నానే , ఏమీ చెయ్య లేక పోతున్నానే - అనుకుంటూ వుంటారు .

మనసు గతి యింతే ; మనిషి బ్రదుకింతే ;  మనసున్న మనిషికీ సుఖము లేదంతే -  అని సినిమా పాటలో లా అనుకుంటే  ఎలా ? సినిమా అయితే  ట్రాజెడీ  కానివ్వండి . పర్లేదు . కానీ మన జీవితం ట్రాజెడీ కానక్కర్లేదు .


 మీ మనస్సు - మీకు సేవకుడుగా వుంటే - మీకు అది అత్యంత ఆంతరంగికమైన,  నమ్మ దగిన సేవకుడుగా , మిమ్మల్ని మీ గమ్యం వైపు తీసుకుని వెడుతుంది .మీ అన్ని విజయాలకు అది కారణమవుతుంది.  

అలా కాక మీ మనస్సు మీకు యజమానిగా  ప్రవర్తిస్తూ , మిమ్మల్ని శాసిస్తూ వుంటే - అది మీకు అత్యంత అంతరంగిక విరోధిగా, మిమ్మల్ని మీ గమ్యం నుండి బహు దూరంగా తీసుకుని వెడుతుంది .మిమ్మల్ని అన్ని రకాల చిక్కుల్లో పడ  వేస్తుంది .

ఈ మాట చెప్పింది  సాక్షాత్తు  శ్రీకృష్ణుడు . అదీ భగవద్గీత లో .

మనసు యజమానైతే , మనం సేవకులైతే - ఏమవుతుంది .

మనసుకు నచ్చినవి , అలవాటైనవి కొన్ని వున్నాయి . వాటినన్నిటినీ  కలిపి అంతః  శత్రువులు  అని అంటారు.  అవి - (అ) మితి మీరిన కోరికలు (కామం),    (ఆ)  రక రకాల కోపాలు (క్రోధం ),   (ఇ)  అన్నీ నాకే కావాలన్న స్వార్థం (లోభము),   (ఈ) ప్రతి దానిపైన  వ్యామోహం (మోహం),  (ఉ) నేనే గొప్ప అన్న సుపీరియారిటీ  కాంప్లెక్స్ (మదం),   (ఊ) ప్రక్క వాడి సంతోషాన్ని, విజయాన్ని వోప్పుకోలేని యిన్ఫీరియారిటీ  కాంప్లెక్స్ (మాత్సర్యం ),  (ఎ) ఎన్నో రకాల భయాలు. 

మనస్సు యజమానైతే - అది మనల్ని వీటి వైపే లాగుతుంది . వీటన్నిటిలో , మన పతనమే  వుంటుంది  కానీ , సంతోషం , విజయం  రెండూ వుండవు .

మనం, మనస్సుకు యజమానిగా వుంటే - ఆయురారోగ్య , ఐశ్వర్య , సంతోష , శాంతి, విజయాల్లాంటివి , అన్నీ లభిస్తాయి . మన  మనస్సు , మనల్ని , వీటి వైపూ నడిపించ గలదు.

అందుకే పతంజలి  మహర్షి , యోగః  చిత్త వృత్తి  నిరోధః - అన్నారు . మనస్సును మన యాజమాన్యం లో పెట్టుకుంటే - అదే యోగం. అదే సంతోషం . అదే అతి గొప్ప విజయం .

జీవితం లో మరే గమ్యమూ ,   దీని కంటే గొప్ప గమ్యం కాదు. 

కానీ - మన జీవితాల్లో, కొన్ని సాధారణ గమ్యాలు వుండనే వుంటాయి .

ప్రేమ, పెళ్లి , భార్య , భర్త, పిల్లలు, చదువులు, ఉద్యోగాలూ, సంపాదనలు, ఆటలు, స్నేహాలు, రోగాలు , యవ్వనము , మధ్య వయస్సు . ముసలితనము , చావులు -  యివన్నీ సాధారణ గమ్యాలకు సంబంధించిన విషయాలు .  వీటిని తప్పించుకుని  మనం వుండ గలమా ?

యివి వొద్దని ఎలా చెప్పగలం ? యివి వుండనే వుంటాయి , మన సాధారణ జీవితాల్లో . 

బాల్యము , కౌమారము, గార్హస్థ్యము , ముసలితనము అన్నీ వున్నాయి మనకు . ఆయా జీవిత కాలాలకు తగిన వ్యాపకాలూ వున్నాయి

శంకరాచార్యులు చాలా సందేహ రహితంగా అన్నారు - బాలస్తావః క్రీడాసక్తః ; తరుణస్తావః   తరుణీసక్తః; వృద్ధస్తావః చింతాసక్తః ;పరే బ్రాహ్మణి కోపిన సక్తః.  యిది మన అందరికీ వర్తిస్తుంది .

చిన్నతనంలో గోలీలతో ఆడుకుంటారు . చిన్న చిన్న రాళ్ళను దాచుకుంటారు . మరి యవ్వనం వస్తే , ఈ యిష్టాలన్నీ పోతాయి. క్రొత్త ఇష్టాలు వస్తాయి.  స్త్రీల వెంట  పురుషులూ, వీరి వెంట వారూ  లవ్వో,లవ్వో  అంటూ పోతారు . అది కొన్నాళ్ళే . ఆ తరువాత, అందరి అమర ప్రేమలు మరో రకంగా మారిపోతాయి . 

పిల్లలూ , వారి చదువులూ , వారు పెరగడమూ , మనం ముసలివారవడం , అప్పుడు వచ్చే చింతలు ఎన్నో , ఎన్నెన్నో. అవీ తమకు అనవసరమైన చింతలు; అందుకే  - మనవారు, వానప్రస్థము , సన్యాసము లాంటి  నియమాలు, ఆశ్రమాలు  ఏర్పరిచారు - ఎవరికీ కష్టం లేకుండా .

వయసు పెరిగే కొద్దీ - మనం ఎవరో , మన అసలు, సిసలు  గమ్యం  ఏదో తెలుసుకోవాలి . అందులో వుండే ఆనందం అర్థం చేసుకోవాలి . 

గృహస్తాశ్రమం లో భార్య, భర్త - వొకరిపై వొకరికి అనురాగం ; వొకరికి వొకరు ప్రాణం గా వుండడం ; పిల్లలను కనడం ; వారిని అపురూపంగా , ప్రేమగా పెంచడం ; వుద్యోగాలు , వ్యాపారాలు - యివన్నీ వుండనే  వుంటాయి . వొక వయస్సులో - వుద్యోగాలు , వ్యాపారాలు పిల్లలకు వదిలేసి , భార్యాభర్తలు వొకరినొకరు బాగా చూసుకోవలసిన ఆశ్రమం, దేవుడా అని కొంతైనా అనుకోవలసిన ఆశ్రమం వానప్రస్థం. ఈ రోజుల్లో  యిది మానసికంగా  చెయ్య గలమే కానీ , ముందులా - అరణ్యాలకు పోలేం కదా . అందుకే  పాపం వృద్ధాశ్రమాలు  వస్తున్నాయి. కానీ యివి రావడం, పిల్లల బాధ్యతా రాహిత్యం వలన, మరెన్నో కారణాల వలన రావడం దురదృష్టకరం .

ఈ ఆట ప్రతి వొక్కరి జీవితాల్లో - దాదాపు యిదే రకంగా , చర్విత చర్వణం గా జరుగుతూ వుంది .

బాలస్తావః క్రీడాసక్తః ; తరుణస్తావః   తరుణీసక్తః; వృద్ధస్తావః చింతాసక్తః ;పరే బ్రహ్మణి కోపిన సక్తః.  యివన్నీ , పెరిగే కొద్దీ , మనలో, శారీరకం గా, మానసికంగా, సహజ సిద్ధంగా  జరిగే మార్పులు. అంటే, ప్రకృతి మన శరీరానికి, మనస్సుకు, ముక్కుత్రాడు వేసి లాక్కు పోతూ వుంటే - మనమూ దాని వెంట అలాగే  వెళ్లి పోతూ వున్నామన్న మాట . 

దీన్ని దాటి, ముందుగా, మున్ముందు జరిగేది కూడా తెలుసుకున్న వారు ఎవరు?

ఆట కదరా శివా; ఆట కదా కేశవా - అని, సాక్షీభావంతో - ద్రష్టగా ఈ జగన్నాటకాన్ని -  ఆనందంగా చూస్తూ, ఆడుతూ వుండ గలిగే వారెందరు? 

కృష్ణుడూ - ఈ నాటకం ఆడాడు , కానీ ద్రష్టగా . అయితే , కృష్ణుడు ఈ ఆట ఆడినంత తన్మయంగా, ఆనందంగా , "ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడుతూ , ఆ పనులు చేస్తూ" తమ తమ పాత్రలలో అంత బాగా లీనమై న వారు  అప్పుడూ లేరు ; యిప్పుడూ లేరు. అంటే, మన పాత్రను మనం ఆనందిస్తూ కూడా , అందులో లీనమై కూడా - ద్రష్టగానూ  వుండొచ్చు , అలా వుండాలని మనకు చెప్పిన వాడు కృష్ణుడు .

కృష్ణుడిలో - కామ,క్రోధ, లోభ, మోహ, మద, మాత్స్యర్య, భయాలు లేవు. కానీ అమితమైన వాత్సల్యం వుంది , ప్రేమ వుంది . కరుణ వుంది . శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ రెండూ చేశాడు . 16 వేల మంది గోపికలు , ఆ నీల మేఘ శ్యాముడి వెనుక బడ్డారు. పైగా 8 మంది భార్యలు కూడా . అందరూ ఆయన భక్తులే . అందరికీ ప్రేమను పంచాడు . ఆయన లో అశక్తత, అధైర్యం లేదు. దుష్ట శిక్షణ తానూ చేశాడు . పాండవుల ద్వారానూ చేయించాడు . కృష్ణుడి జీవితాన్ని మనసులో వుంచుకునే - మనం భగవద్ గీతను  చదవాల్సి వుంటుంది ; అర్థం చేసుకోవాల్సి వుంటుంది. జీవితాన్నుండి  పారి పొమ్మని కృష్ణుడెప్పుడూ  చెప్పలేదు .

ఈ ఆట ఆడాల్సిందే. ఆనందంగా, సమర్థ వంతంగా ఆడాలి. వోటమికి క్రుంగి పోవడం, పారిపోవడం మన పాత్ర కు  న్యాయం చేసినట్టు కాదు. మళ్ళీ ఆడాలి .

"వొక్కొక్క  రోజూ కొత్త ఆటే. ఈ రోజు ఆట మీరు బాగా ఆడారా - అన్నదే ప్రశ్న. ఈ రోజు మీరు సంతోషంగా వున్నారా? ఎంత మందిని మీరు సంతోష పెట్టారు? నిన్నటి కంటే ఈ రోజు - క్రొత్తగా ఏం నేర్చుకున్నారు? ఏ విధంగా మీరు నిన్నటి కంటే బాగు పడ్డారు?  మీకు మీ గమ్యం జ్ఞాపకం వుందా? అటువైపే వెడుతున్నారా? మీరు ఈ రోజు చేసిన పనుల కంటే భిన్నంగా, గొప్పగా మరేదైనా చేసి వుండ వచ్చునా? వుంటే అది రేపు చేస్తారా? ఈ రోజు ఎవరికి సహాయ పడ్డారు? ఈ రోజంతా మీలో వచ్చిన భావనలు, ఆలోచనలు - సకారాత్మకమైనవా, నకారాత్మకమైనవా ? రేపంతా మీరు సకారాత్మకం గానూ , ఆనందం గానూ వుండాలంటే  చెయ్యాలి? "

వొక్క 5 నిమిషాలు - కళ్ళు మూసుకుని (TV కి దూరంగా) ఈ రోజు మీరు ఆడిన - మీ ఆట గురించి ఈ ప్రశ్నలు వేసి నిజమైన సమాధానాలు మీరు వెతుక్కుంటే - నిజమైన ద్రష్టగా మీరు మారిపోతారు.

మీకు యిష్టమైతే 10 నిమిషాలు గానీ , అంత కంటే ఎక్కువ కానీ ఈ ప్రక్రియ చేసుకోవచ్చు. మీకు నిజమైన , స్వచ్చమైన ఆనందం - అప్పుడే వస్తుంది.

 ఎందుకంటారా ?

ఆ పది నిమిషాల తరువాత - మీరే  "ఆనందం " గా మారిపోతారు గనుక .

లోపలున్న చెత్తంతా పొతే, మీరే ఆనందం . అదే యోగం . అదే సాధన . అంతే .

చాలా సులభమైన విషయం యిది. ప్రతి 24 గంటలలో - 5-10 నిమిషాల కృషి తో యిది సాధించదగిన విషయం. సాధించ వలసిన విజయం.

మీ మనసుపైన మీరు సాధించే విజయం యిది .

చేస్తారా మరి .

= మీ

వుప్పలధడియం విజయమోహన్




14, సెప్టెంబర్ 2014, ఆదివారం

నాకు నచ్చిన 10 మంది ఎవరు? - నాలిస్టు లో 8 మందే ! - మరి మీ సలహా ?


నాకు నచ్చిన 10 మంది

"మన దేశం" లో నాకు బాగా నచ్చిన 10 మంది వ్యక్తుల పేర్లునచ్చిన  క్రమంలో నేను రాయగలనా ? ఏమో! వెంటనే  చెప్పలేక పోతున్నాను.

కానీ అసలు నాకు బాగా తెలిసి వుండాల్సిన  లిస్టు గా యిది. మన దేశంలో నాకు బాగా నచ్చిన వాళ్ళు కనీసం పది మంది వున్నారా, లేదా వుంటే,వాళ్ళెవరు ? ఎందుకు నచ్చారు ? యిది నాకు  తెలియాలా,వద్దా ?

నచ్చని వాళ్ళ లిస్టు అక్కర లేదు. అది చాంతాడంత వుండొచ్చు ; హనుమంతుడి  తోకంత  వుండొచ్చుయింకా పెద్దగానూ వుండొచ్చు . ఆ లిస్టు వొద్దు లెండి .

కానీ నచ్చిన వాళ్ళ పేర్లు చెప్పుకోవడం లో మనకు పెద్ద శ్రమనో , ప్రమాదమో లేదు కదా .

అది తెలుసుకోవడానికి కాస్త ప్రయత్నం చేస్తా .

1. మహాత్మా గాంధీ : - గాంధీ గారు నాకు బాగా నచ్చారు . సత్యము, అహింస తో ఎన్నెన్ని సాధించ వచ్చునో - ఆయన తన జీవితం ద్వారా నిరూపించారు . ప్రపంచానికే మార్గ దర్శకుడైన  గాంధీ మనకు నచ్చకపోవడం ఎలా? నాకు ఆయన చాలా బాగా నచ్చాడు . ఆయన  రాసిన ఆత్మకథ లాంటి పుస్తకం మరొక్కటి "నభూతో న భవిష్యతి".  తన తప్పులను ఏవీ దాచుకోలేదాయన.  అలా మరెవ్వరూ చెప్పలేరు.  ఆయన జీవితంలోని సంఘటనలు చదివే , మేమూ, 55 ఏళ్ళ క్రితం , మా వూళ్ళో , మా యింట్లో , లెట్రిన్ కు మా స్వహస్తాలతో గోడలు కట్టి దాన్ని శుద్ధి చేసి , కాస్త గర్వం గా కూడా  అనుభూతి చెందాము.  కుష్టు రోగులకు స్వహస్తాలతో మందు రాయడం, వాళ్ళను బాగా చూసుకోవడం లాంటి పనులు - అప్పుడు కానీ, యిప్పుడు కానీగాంధీ తప్ప మన నాయకులెవరూ చెయ్యలేదు . గాంధీ గారిని గురించి ఎంతో చెప్పొచ్చు .కానీ , మమ్మల్ని, చిన్నతనం నుండీ ఆయన జీవితం బాగా ప్రభావితం చేసింది కనుక యీలిస్టు లో మొదట ఆయన పేరు రాస్తున్నా - ఆయన యిప్పుడు లేక పోయినా . ఆధునిక యుగంలో, మన 21 వ శతాబ్దంలో, గాంధీ చాలా గొప్ప యోగి, అభ్యుదయ వాది, మానవతా వాది అని నా ప్రగాఢ  నమ్మకం . నా ఈ లిస్టులో యిప్పుడు లేని వారి పేర్లు - గాంధీ తప్ప - మరెవరిదీ రాయను . ఎందుకంటే - భూతకాలంలో ఎంతో మంది గొప్ప వారు వుండవచ్చు . కానీ , ఈ రోజు సజీవంగా , మన మధ్య వుండి, మన మధ్య , మానవ కల్యాణానికి కృషి చేస్తున్న వారు ఎవరు , వారిలో నాకెవరు నచ్చారు - అన్నదే నా ఆలోచన

2. నరేంద్ర మోడీ :-  మన యిప్పటి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నాకు బాగా నచ్చారు . లంచగొండితనానికి   ఆయన చాలా, చాలా దూరం .  చెప్పే పని చెయ్యడం , చేసే పని చెప్పడం - ఆయన ప్రత్యేకత. ఆయన్ను గురించి చెడ్డగా మాట్లాడే వారు తాము చెప్పుకో గలిగే పనులేం చెయ్య లేదు . మోడీ గారు చాలా, చాలా మంచి పనులు, గొప్ప పనులు చేశారు; చేస్తున్నారు. మద్య పాన నిషేధం వున్న వొకే వొక రాష్ట్రం గుజరాత్ . ఆ రాష్ట్రంలో  రోడ్లు, నీరు, విద్యుత్తు -పుష్కలంగా వుండేట్టు చేసిన ఘనత ఆయనది . మన రాష్ట్రాలలో, మద్యం నుండి వొచ్చే పన్ను యొక్క ఆదాయమే చాలా ఎక్కువ .   ఆదాయం ఎక్కువ అయినా రోడ్లు లేవు, నీళ్ళు లేవు, విద్యుత్తూ లేదు మనకు.   మద్య పానం మన రాష్ట్రాలలో వుంది గనుక, నేరాలు ఘోరాలు అక్కడికంటే యిక్కడ ఎక్కువ.  కాక పొతే అక్కడ వొక్క నేరం జరిగినా  వెంటనే తెలిసిపోతుంది.  మిగతా రాష్ట్రాలలో వంద నేరాలకు వొక్కటి పైకొస్తే  ఎక్కువ.  మోడీ గారి మాటలలో, ఎప్పుడూ "నూరు  శాతం ప్రజల" అభివృద్ధి వుంటుంది.   మిగతా వారి మాటలలో - ఏదో వొక వోట్  బాంక్  ను గురించే వుంటుంది ఎప్పుడూ.  మోడీ గారి చేతలూ అంతే.   సర్వే  జనాః సుఖినోభవంతు - అనేటట్టే  వుంటుంది.  ఆయన నేతృత్వం కొనసాగితే - 10 ఏళ్ళలో మన దేశం - అన్ని దేశాల్లో ప్రథమ స్థానంలో వుంటుందన్న  విషయంలో, నాకైతే సందేహం లేదు.   మోడీని గురించి చాలా చెప్పొచ్చు . వారి విషయం లో నా ఆశ  వొక్కటే . BJP లోని వారూ, RSS  లాంటి అనుబంధ సంస్థల్లోని వారూ కూడా, మోడీ లాగా, సర్వే జనాః సుఖినో భవంతు - అని మనసా, వాచా కర్మణా - అనుకోగలగాలి.  మోడీ మార్గంలో వాళ్ళు వెళ్ళాలి. మోడీ నేతృత్వం లో వారు మసలుకోవాలి . అలా జరగాలని ఆశిద్దాం . 

3. సద్గురు జగ్గి వాసుదేవ్ :- ఈయన తమిళనాడులో , ముఖ్యంగా, యువతలో , వొక పెద్ద విప్లవమే తెచ్చాడు . దేవుడు లేడు , వద్దు - అనే  రాజకీయాలు వున్న తమిళనాడు  రాష్ట్రంలో , దాదాపు కోటి మంది ఈయన శిష్యులు గా మారిపోయారు . వారి అందరి జీవితాలలో అనూహ్యమైన మార్పు రావడం నేను చూశాను.  ప్రతి యింటిలోను , "యోగ" అనే జ్యోతి వెలగాలని , ఈయన చేస్తున్న కృషి అపారం . నిరుపమానం .  యిదే కాక, విద్యారంగంలోనూ , పర్యావరణ రంగంలోనూ  ఈయన కృషి తమిళనాడులో ప్రథమ స్థానంలో వుందని నా నమ్మకం . ముఖ్యంగా , తమిళనాడు  లోని యువతను, కుల మతాలకు అతీతంగా , ఏకం చేయడానికి ఈయన చేసినంత, చేస్తున్నంత  సకారాత్మక సేవ మరెవరూ చెయ్యలేదని నా నమ్మకం.  ఈయన ఆంగ్లంలో - చాలా సహేతుకంగా, అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడడంలో చాలా  దిట్ట . ఈయన మాట్లాడే తమిళం వొక ప్రత్యేక యాసలో వున్నా - అందరికీ నచ్చింది . మన దైనందిన సమస్యలకు ఈయన యిచ్చే సలహాలు చాలా బాగా వుంటాయి . అందరికీ చాలా బాగా నచ్చుతాయి . 

4. శ్రీ శ్రీ రవిశంకర్ (గురూజీ ) :- ఈయనా సద్గురు జగ్గి వాసుదేవ్ లాగా - యోగా, విద్య, లాంటి అనేక రంగాల్లో - యివతపై తమ అపార ప్రభావాన్ని చూపుతున్న వారే. సేవ, ప్రేమ , సహనం  లాంటి వున్నత విలువలను ఈయన ప్రపంచం అంతటా - కుల, మత, దేశ, రంగు , లాంటి అన్ని విభేదాలనూ   దాటి - విశ్వ మానవ ఐక్యత ను ప్రబోధిస్తున్న వారు  ఈయన. ఈయన శిష్యులూ కోట్ల సంఖ్యలో ప్రపంచమంతటా  వున్నారు. ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ వుండే ఈయన స్థాపించిన "ఆర్ట్ ఆఫ్ లివింగ్ " సంస్థలు 152 దేశాలలో వున్నాయి . ఈ సంస్థ నెలకొల్పిన గిన్నిస్  రికార్డులు చాలా వున్నాయి . సద్గురు జగ్గి లాగానే , మన దైనందిన సమస్యలకు శ్రీ శ్రీ గారు యిచ్చే సలహాలు చాలా బాగా వుంటాయి . అందరికీ చాలా బాగా నచ్చుతాయి . "జ్ఞాని " అన్న పదం వీరిరువురికీ బాగా వొప్పుతుంది.  

5. బ్రహ్మకుమారి శివాని :- ఈమె సంభాషణలు "పీస్  ఆఫ్ మైండ్ " అనే టీవీ  చానెల్ (బ్రహ్మ కుమారి సంస్థదే) లోనూ, మరెన్నో చానెళ్ళ లోనూ (ఆస్థా , సంస్కార్ ) ప్రతి దినమూ వస్తూ వుంటుంది . నిత్య జీవితంలోని అనేకానేక సమస్యలకు యీమె సమాధానాలు చాలా చక్కగా, సహేతుకంగా వుంటాయి.  బ్రహ్మ కుమారి సంస్థ పేరు ప్రతిష్టలు చాలా బాగా పెరగడానికి, యీమె కూడా వొక కారణమని తప్పక చెప్ప వచ్చు . ఇవి తెలుగులోనూ తర్జుమా అయితే  చాలా బాగుంటుంది . చిన్న వయసులోనే , యింత విజ్ఞానం  వెదజల్లుతున్న  యీమె కృషి చాలా ప్రశంసనీయం. ఆత్మ , పరమాత్మ లాంటి విషయాల్లో  నేను శివాని గారి భాషణలు పెద్దగా పట్టించుకోను . ఆ విషయాలు నేర్చుకోవాలంటే - శాస్త్ర జ్ఞానం అపారంగా వున్న వారు చాలామంది వున్నారు. కానీ - సామాజిక సమస్యల విషయాల్లో , దైనందిన మానవ సమస్యల విషయాల్లో , మిగతా వారి కంటే - శివాని గారి భాషణలు  నాకు చాలా బాగా నచ్చుతాయి . ఆమె చెప్పేవన్నీ మనం సులభంగా చెయ్య గలిగేవి; చెయ్యవలసినవి. మనకు ఎంతో ఉపయోగ పడేవి . 

6. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు :-  తెలుగులో  ప్రవచన కర్తలలో - ఈయన మొదటి వారు  - అని అందరూ వొప్పుకోక తప్పదు . సరస్వతీ పుత్రుడు - అనిపించే ఈయనకుసంస్కృత,ఆంధ్ర భాషలు - రెండింటి  లోనూ  వున్న  పాండిత్యము , సాహితీ ప్రకర్షధారణా  శక్తి, సమయోచిత ప్రజ్ఞ , అపారము.  హైందవ విలువలను గురించి ఈయన చెప్ప గలిగే తీరు అసమానం . వొక్కో సారి ఆది శంకరుల వారు మన విలువలను మళ్ళీ మనకు చెప్పడానికి ఈయనను పంపించాడా  అని - అనిపిస్తూ వుంటుంది నాకు. ఈయనది పూర్తిగా శాస్త్ర విశ్లేషణ . శాస్త్రంలో వున్నది తప్ప నేను మరేదీ చెప్పనంటారాయన . బ్రహ్మకుమారి శివాని గారిది పూర్తిగా సామాజిక, మానసిక  విశ్లేషణ . సామాజిక, మానసిక  విశ్లేషణ లో శివాని గారిది , శాస్త్రీయ విశ్లేషణలో  చాగంటి గారిది - భాషణలు  అద్వితీయం గా, ఆహ్లాద కరంగా, చాలా విజ్ఞాన దాయకంగా వుంటాయి.

7. S.P. బాలసుబ్రమణ్యం :- సంగీతానికి సేవ చేసిన వారు చాలా మంది వున్నారు . కానీ, తెలుగులో , సంగీతానికి యింత సేవ చేసిన వారు ఈయన వొక్కరే అని - నాకు అనిపిస్తుంది . తెలుగు యువతలో , పిల్లలలో - సంగీతం పట్ల యింత అభిరుచిని  సృష్టించిన  వారు బాలు వొక్కరే - అని చెప్పక తప్పదు. పాడటం గొప్ప. పాడించడం అంతకంటే  గొప్ప. మన రాష్ట్రంలో, లక్షలాది మందిలో , కేవలం సంగీతం వినటమే గాక , పాడటం పట్ల ఆసక్తి యింతగా పెంచిన వారిలో SP బాలు వొక్క ఎవరెస్టు శిఖరం లాంటి వాడు అని చెప్ప వచ్చు . పాడటంలో ఆయన కంటే గొప్ప వారు ముందు వుండి వుండ వచ్చు. యిక ముందూ  రావచ్చు. కానీ , నేనూ పాడాలి - అన్న ఆసక్తి లక్షల మందిలో కలిగించి , ఎలా పాడాలి అన్నది వారికి నేర్పిస్తూ , మంచి  సంగీతం వినాలి అన్న ఆసక్తి కోట్ల మందిలో కలిగించిన ఘనత బాలూ గారిదే. సహజంగా, సరళంగా, సున్నితంగా, మనసును ఆకట్టుకునేలా మాట్లాడడం , అందులోనే అత్యంత ప్రయోజన కరమైన సలహాలనూ యివ్వడం - బాలూ ప్రత్యేకత . 

8.  బాబా రాందేవ్ :- ఈయన రాజకీయాలు  మనకు  నచ్చ వచ్చు ; నచ్చక పోవచ్చు . కానీ, యోగ శిక్షణ కోసం ప్రజల మధ్య ఈయన చేసినంత కృషి మరెవరూ చెయ్య లేదని నా విశ్వాసం . యోగా గురువులలో - అన్ని ప్రక్రియలూ "తానుగా" చేసి చూపిస్తూ , దాన్ని విశ్లేషిస్తూ , అలా చెయ్యమని - ఉత్సాహపరిచే గురువులు చాలా అరుదు. అందులో ప్రథముడుగా బాబా రాందేవ్ ను చెప్పుకోవచ్చు. ఆయన యోగా శిబీర్ కు నేనూ వెళ్లాను . వారం పాటు శిక్షణ పొందాను . అలాగే - నేను సద్గురు జగ్గి గారి యోగా శిక్షణనూ , శ్రీ శ్రీ గారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షణ నూ కూడా పొందాను. యిప్పుడు అవన్నీ కలిపే సాధన చేస్తాను . నాకు అందరూ గురువులే . కానీ, రాందేవ్ గారి యోగా ప్రక్రియలు - ఆరోగ్యానికి అత్యంత సులభకరమైన , ప్రయోజన కరమైన ప్రక్రియలు అని నాకు అనిపిస్తుంది . అయితే - జగ్గి గారి శిక్షణ మరో రకంగా ఉన్నతమైనది; శ్రీ శ్రీ  గారి శిక్షణ మరో రకంగా . దేని కదే గొప్ప . బాబా  రాందేవ్ కృషి - ఆయుర్వేదం విషయంలో చాలా చాలా ప్రశంసనీయం . యిప్పుడు మా యింట్లో - చాలా వరకూ , మేము ఆయుర్వేద మందులే వాడతాం . అందులోనూ రాందేవ్ గారి పతంజలి యోగ చికిత్సాలయ్ మందులే ఎక్కువ . మిగతావి కూడా ఆయుర్వేద మందులు ఎక్కువ వాడతాము.  మేమే కాదు . లక్షలాది కుటుంబాల్లో అల్లోపతీ కంటే - ఆయుర్వేదం  ఎక్కువగా  వాడుతున్నారు యిప్పుడు . యోగా + ఆయుర్వేదం కలిస్తే  ఆరోగ్యం చక్కగా వుంటుందనడంలో నాకు సందేహం లేదు . రాందేవ్ గారి కృషి ఈ విషయంలో చాలా ప్రశంసనీయం .


నాకు పది మంది పేర్లు కావాలి . వాళ్ళు నన్నూ ప్రభావితం చేసి వుండాలి . దేశాన్నీ(లేదా రాష్ట్రాన్ని) బాగా  ప్రభావితం చేసి వుండాలి. ఇప్పుడు మన మధ్య వుండాలి. ఈ మూడు నిబంధనలూ - పై 8 మంది కే సరిపోయాయి. నేను చనిపోయిన మహాత్ముల గురించి మాట్లాడడం లేదు. వారిలో ఎందరో వున్నారు . పై ఎనిమిది మంది కంటే కూడా గొప్ప వారు వున్నారు . 

 ఇప్పుడున్న వారిలో గొప్ప వారు వున్నారు. మన పాత ప్రెసిడెంటు అయిన డాక్టర్ అబ్దుల్ కలాం గారు , మన ముఖ్య మంత్రి చంద్ర బాబు గారు నాకు బాగా నచ్చిన వారే . అయినా - వారి జీవితం నన్నెలా ప్రభావితం చేసింది - అనుకుంటే - నాకు సమాధానం దొరక లేదు. మాకు వేదాంతం నూరి పోసిన గురువు గారు స్వామి  పరమార్థానంద. ఆయన గొప్ప వారే. ఆయన స్వామీ దయానంద ముఖ్య శిష్యులలో వొకరు. అయితే - ఆయన దేశాన్ని ఎంత ప్రభావితం చేశారు అనుకుంటే - నాకు సమాధానం దొరక లేదు. 

త్వరలో - నాకు మరిద్దరు గొప్ప వాళ్ళు -  నన్నూ , దేశాన్నీ ప్రభావితం చేసే వాళ్ళు - దొరుకుతారని నేను ఆశిస్తున్నాను . 

ఇందులో పాఠకులు అయిన మీరు, నాకు - మీ సలహాలు కూడా యివ్వ గలిగితే , మీకు నచ్చిన వాళ్ళను గురించి చెబితే , చాలా సంతోషిస్తాను . కృతజ్ఞతతో మీ సలహాలను స్వీకరిస్తాను .

= మీ 

వుప్పలధడియం విజయమోహన్

28, ఆగస్టు 2014, గురువారం

50 శాతం పౌరులకు రక్షణ లేకుంటే ? మనిషి మృగంగా మారడమంటే ? ఎన్నో శిక్షలు వున్నా ఏ నేరాలు ఆగడం లేదు. ఎందుకు ? "ధనమూలం యిదం జగత్"

50 శాతం పౌరులకు రక్షణ ఎలా ?

కామ , క్రోధ, లోభ ,మోహ, మద, మాత్సర్యాలు - ఈ  ఆరూ  అంతః శత్రువులుగా మన శాస్త్రాలు చెబుతాయి .వీటికి భయం కూడా చేర్చుకోవచ్చు. 

ఇవన్నీ మనలో వుండకూడనివి ; కానీ కొద్దో, గొప్పో వుండేవి. 

ఏ కోరికైనా కామమే. సెక్సు  పరంగా మాత్రమే చెప్పుకో కూడదు . మనలో కోరికలే లేని వాడెవడు ? అందరికీ  వుంటుంది. కానీ, కోరిక ధర్మ బద్ధం గా తీర్చుకుంటే తప్పు లేదు; మంచిదే - అని శాస్త్రాలు చెబుతాయి . 

ధర్మ బద్ధం కాని కోరికే అంతః శత్రువుగా మారి మనల్ని బాధపెడుతుంది. మన ద్వారా, మన చుట్టూ వున్న వారినీ బాధ పెడుతుంది. 

సెక్సు  వాంఛ  శారీరకంగా దేవుడే సృష్టించాడు కదా. అది  తీర్చు కోవడం తప్పెలా అవుతుంది? ధర్మేచ, అర్థేచ, కామేచ   నాతి చరామి - అని ప్రమాణం  చేసి,అది పాటిస్తూ తీర్చుకుంటే - ఆడా , మగా యిద్దరికీ అందులో ఏ ప్రమాదమూ లేదు . యిద్దరికీ సుఖ సంతోషాలు ఆమరణాంతమూ  లభిస్తాయి . 

అలా కాని నాడు , అది దుఃఖ  కారకంగా , సమాజానికి పతన కారకంగా తయారవుతుంది.

అదే జరుగుతూ వుంది  యిప్పుడు. అమాయక అబలలపై బలాత్కారాలు , సామూహిక బలాత్కారాలు , ఆసిడ్ దాడులు , బలాకారాన్ని ప్రతిఘటిస్తే , వారిని క్రూరంగా హింసించి, సెక్సు వాంఛ  తీర్చుకుని, చంపడమో, అంగ వైకల్యం చేయడమో - ఏదేదో చేస్తున్నారు  కొందరు .

మరీ చిన్న చిన్న పసి పాపలపైన కూడా యిది జరగడమూ , అందులోనూ - కుటుంబం లోని వారో , వారికి దగ్గరి వారో యిది చెయ్యడమూ - యివన్నీ ప్రతి రోజూ వార్తా పత్రికల్లో చదువుతూ వుంటే చాలా కష్టంగా వుంది. 

ఈ పరిస్థితి మారాలి . వెంటనే మారాలి . రేపు  కాదు , ఈ రోజు నుండీ, ఈ నిమిషం నుండే మారాలి.  అందుకు ఏం చెయ్యాలి ? పసి పాపల పైన లైంగిక వేధింపు చేసిన వాడికి ఏ శిక్ష వెయ్యాలి ? అసలలా చెయ్యాలనే యోచనే ఎలా మనసులో పుడుతూ వుంది ? ఇది సమాజంలో పెరుగుతూ వున్న  వొక పోకడ . దీన్ని యిప్పుడే యిక్కడే ఆపాలి . మనిషి మృగంగా మారడమంటే యిదే . యిది చేసిన వారికి  కఠినాతి  కఠిన శిక్ష వెయ్యాలి. ఆదైనా, వొక నెల లోపల జరగాలి . అలాగే సామూహిక బలాత్కారం  కూడా, ఏ రకంగానూ క్షమించ రాని నేరం . దానికి వురి తీయడమే - శిక్ష గా వుండాలి. అదీ నెల లోపల జరిగి పోవాలి.

యిది జరుగుతుందా ? జరగాలి. యిది జరగాలంటే - సమాజమంతా మారాలి . అన్ని వ్యవస్థలూ మారాలి . అంటే - మనం వాటిని మార్చాలి .

మొదట పోలీసు వ్యవస్థ దగ్గర ఆరంభం కావాలి. బలాత్కారం జరిగింది - అంటే ఆ ..... అంతే కదా... అన్న మనస్తత్వం పోవాలి . అంతే కాదు . పోలీసు స్టేషన్ కు ఆడ పిల్ల వొంటరిగా రావడానికి భయ పడే - యిప్పుడున్న పరిస్థితి పోవాలి.

యిప్పుడెలా వుందంటే - పోలీసు స్టేషన్ అంటే - న్యాయంగా నడిచే పౌరులు భయపడడము , అన్యాయాలు చేసే వారు భయ పడక పోవడము - యిలా చాలా చోట్ల వుంది . పోలీసు శాఖలో అవినీతి , లంచ గొండి తనం ఎక్కువగా వున్నా పట్టించుకొనే అధికార్లూ తక్కువ. రాజకీయ నాయకులూ తక్కువ . పోలీసు శాఖ లో ఏం జరుగుతోందో - కొంత  వార్తల ద్వారా , మరి కొంత సినిమాల ద్వారా మనకు తెలుస్తూనే వుంది . అయినా , యిది పట్టించు కునే వాడే లేదు.

ప్రతి రోజూ బలాత్కారాలు జరుగుతూనే   వున్నాయి. అందులో కొన్నే పత్రికల ద్వారా వెలుగు చూస్తున్నాయి . కానీ - ఆ తరువాత పోలీసు శాఖ ఏం చేసింది , ఘనత వహించిన కోర్టు వారు ఏం చేశారు - యిది చెప్పే వారే లేరు . వొక్కో సారి పోలీసులు అసలైన నేరస్తులను పట్టుకున్నా , రాజకీయ నాయకుల వొత్తిడికి , లేదా, డబ్బు ప్రలోభానికి లొంగి  పోవడం, నేరస్తులు తప్పించుకోవడం జరుగుతూ వుంది .

కామాంధులు బలాత్కారాలు చేస్తే , లోభాంధులు - డబ్బులకో , అధికారానికో లొంగి పోయి - నేరస్తులకు  శిక్ష పడకుండా చూస్తున్నట్టు మనకు అర్థమవుతూ వుంది .

ఇదిలా వుండగా - వొక మహిళా డిస్ట్రిక్ట్ జడ్జీ గారిని , వొక హై కోర్ట్ జడ్జీ గారు  తన ముందు అశ్లీల నృత్యాలు చేయమన్నట్టు - వార్త. అది చేయనందు వలన - ఆమెను మారుమూల ప్రదేశానికి బదిలీ చేసినట్టు వార్త . ఆమె రాసిన లేఖను కంప్లయింట్ గా తీసుకోకుండా , ఆమె చట్ట పరమైన కంప్లయింట్ యివ్వ లేదు కాబట్టి  ఈ విషయం మేం తీసుకోలేం - అని అధికార వర్గాలు చెబుతున్నట్టు  వార్త . హై కోర్ట్ జడ్జీ గారు నేనేమీ చెయ్య లేదని అంటున్నారు . యింత జరిగిన తర్వాత - ఎంతో కొంత విచారణ  జరగాలి కదా ! జరుగుతుందా ? ఏమో ..... కానీ , మహిళా డిస్ట్రిక్ట్ జడ్జీ గారు  మాత్రం రిజైన్  చేసేశారు . యిప్పుడేం జరుగుతుంది ?

బెంగాల్ రాజ్యంలో రామకృష్ణ పరమహంస గారు పుట్టారు . భార్య శారదాదేవిని - దేవత గా  భావించి పూజ చేశారు.  అదే బెంగాల్ లో - వివేకానందుల వారు , ప్రపంచంలో పుట్టిన ప్రతి వారిని సోదర సోదరీమణులారా, లేదా తల్లీ అని పిలిచే సంస్కృతిని సృష్టించారు .   అదే బెంగాల్ లో యిప్పుడేం  జరుగుతూ వుంది? మా ఎదుటి పార్టీ వాళ్ళ యిళ్ళలో  చొరబడి - ఆ యిళ్ళ లోని మహిళలను , మా వాళ్ళ చేత బలాత్కారం  చేయిస్తానని - అక్కడి అధికార పార్టీ MP వొకరు హెచ్చరించారు. వీళ్ళ రాజకీయ కలహాల మధ్య  ఆ మహిళలేం  చేశారు ? అయినా - యిటువంటి దుర్యోధన , రావణుల పరంపరను ఏం చెయ్యాలి?  అక్కడి   ముఖ్య మంత్రి కూడా మహిళే . మహిళా ముఖ్య మంత్రి వుంటే  మహిళలకు  రక్షణ వుంటుందన్న గ్యారంటీ  ఏమైనా వుందా ? ఏమీ లేదు . నేను గొప్ప రౌడీ గర్వం గా చెప్పుకున్న ఆ MP గారు మాత్రం పూర్తి రక్షణ తో వున్నారు. మన పార్లమెంటులో  కూడా - స్పీకర్ గారు మహిళే . మరి యీ  MP  గారిని వారు ఏం  చేసారు; చేయ బోతున్నారు ? ఏమో. వేచి చూడాలి .

ఈ కాలంలో ,  నేను రౌడీని , నేను బలాత్కారాలు చేయిస్తాను అన్న వాడు కూడా MP . ఆ MP గారిని  ఏం చెయ్యాలన్నా - అందరికీ రాజకీయ కారణాలు - అడ్డొస్తాయి . వచ్చే ఎన్నికల్లో  ఆ MP  గెలుస్తాడా . మన లాంటి పరమ మూర్ఖులు  వోటు వేసేంత వరకు  ఆయన గెలుస్తూనే వుంటాడు. 

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి గారు - ఆ... మగ పిల్లలు అలా చేస్తూ వుంటారు .. అని కొట్టి పారేశారు .  యిలా,రాజకీయ నాయకులలో - మహిళల పట్ల నిజంగా వుండవలసిన గౌరవం  అసలు వుండడం లేదు.

బాలాత్కారాలు , సామూహిక బలాత్కారాలు జరిగిన ప్రతి చోటికి మహిళా కమిషన్ వారు వెళ్లాలి. అక్కడి పోలీసు  శాఖను,న్యాయ వ్యవస్థను  కదిలించాలి . సరైన చర్యలు తీసుకునే లాగా చెయ్యాలి . యిలా కాక లేఖలు మాత్రం , అదీ కొన్ని కేసుల్లో మాత్రం , రాస్తూ కూర్చుంటే   - మహిళలకు రక్షణ ఎలా లభిస్తుంది ? నన్నడిగితే - మహిళా కమిషన్ క్రింద వొక పటిష్టమైన సాయుధ, సాధికార రక్షక భట బృందం వుండాలి . కనీసం సామూహిక బలాత్కారాలలో - మామూలు పోలీసు శాఖ కాక , ఈ ప్రత్యేక బృందం రంగం లోకి దిగాలి. వొక వారం లోగా, కేసును పూర్తిగా ఛేదించి, అన్యాయం జరిగిన మహిళకు రక్షణ, వైద్య పరీక్షలు , అనుమానాస్పద వ్యక్తుల విచారణ అన్నిటినీ జరిపించి  మహిళా కోర్టులో ప్రవేశ పెట్టి - నెల తిరిగే లోపు శిక్ష పడే లాగు చెయ్యాలి . యిది ప్రతి  కేసు లోనూ  జరిగిన నాడే మహిళలకు కాస్తైనా ధైర్యం వస్తుంది . రక్షణ లభిస్తుంది. 

చాలా నగరాల్లో - బస్సుల్లోనూ , రైళ్ళ లోనూ , కాలేజీల ముందూ, యిళ్ళ ముందు కూడా - మహిళలను అసభ్యంగా మాట్లాడడము అసభ్యంగా వెకిలిగా ప్రవర్తించడం  జరుగుతూనే వుంది . యిది మనం ఆపలేమా ? ఆప గలం . ఆపాలి. ఎవరు చెయ్యాలి ? ప్రభుత్వం వారే చెయ్యాలి . మహిళలే ప్రభుత్వంలో వున్నత స్థానాలలో వున్న చోట్ల కూడా యిది జరగడం లేదు .

నిజానికి , ఈ విషయంలో - సాంఘిక పరిస్థితులపై చాలా పరిశోధనలు , సర్వేలు జరగాల్సిన అవసరం చాలా వుంది . అసలు ఎందుకు యిలా జరుగుతో వుంది . నేరం  శిక్ష  పడితే చాలా ? నేరం చేసిన వాడికి శిక్ష పడాలని నేనూ వొప్పుకుంటాను. కానీ, భవిష్యత్తు లో నేరం జరగకుండా ఆ శిక్ష ఆపుతుందా ?

యిప్పుడు కూడా హత్యలకు ఉరిశిక్ష వుంది . కానీ హత్యలు ఆగడం లేదు కదా . అలాగే - ఎన్నో నేరాలకు ఎన్నో శిక్షలు వున్నా ఏ నేరాలు ఆగడం లేదు.

ఎందుకు ? ఎందుకు ? ఎందుకు ?

చట్టం చేసినంత మాత్రాన  నేరాలు ఆగవని  మనం తెలుసుకోవాలి .

ప్రతి నేరానికి , సరైన నేరస్తుడికి , వెనువెంటనే  శిక్ష పడాలి. అప్పుడే - అసలు నేరస్తులకు భయం వుంటుంది . లేదంటే అసలు వుండదు.

ఎన్నో నేరాలలో - అసలు నేరస్తులకు కాక , మరెవరికో శిక్ష పడిన సందర్భాలు ఎన్నో వున్నాయి.    యివి తెలిసినవి ; తెలీనివి మరెన్నో వుంటాయి . పోలీసు శాఖలోను , న్యాయ శాఖలోనూ పూర్తి నిజాయితీ, చిత్త శుద్ధి, న్యాయ నిబద్ధత వుంటే తప్ప - న్యాయం జరుగదు .

డబ్బు కోసం  ఎవరి ప్రక్కనైనా  సరే - వాదించి , గెలిపించాలని కొందరు న్యాయ వాదులు  అనుకోవడం సరైన పద్ధతా ? "ధనమూలం యిదం జగత్" - అని వున్న ప్రస్తుత సమాజంలో రాజకీయ నాయకులు , న్యాయ వాదులు , పోలీసులు మారితే తప్ప - సాధారణ  పౌరులకు  న్యాయం జరిగే అవకాశం అసలు లేదని నా అభిప్రాయం .

ముఖ్యంగా - యిప్పుడు , 50 శాతం పౌరులైన మహిళలకు రక్షణ రోజు రోజుకూ తగ్గుతూ వుంది .  ఈ పరిస్థితి ని  ఎక్కడి నుండి మార్చాలి మనం ?

నా వుద్దేశంలో  - మన విద్యా వ్యవస్థ సరిపోతే , అందులో , మంచి పౌరులను తయారు చేసే కనీసం వొక దశాబ్దం లో నైనా - మనకు కావలసినంత మంది  మంచి పౌరులు , మంచి పోలీసులు, మంచి న్యాయ వాదులు , మంచి న్యాయ మూర్తులు , మంచి రాజకీయ నాయకులు - వచ్చే అవకాశం  వుంటుంది .

దుర్యోధనుడు  ఎవడో వొకడు ఎప్పుడూ వుంటాడు . రావణుడు ఎవడో వొకడు ఎప్పుడూ వుంటాడు . కాకపోతే , మనకు ధైర్యం, సాహసం, న్యాయ నిబద్ధత  వున్న  రాముడు,కృష్ణుడు , పాండవుల వంటి వారు కూడా కావాలి. అది విద్యా వ్యవస్థ ద్వారానే  జరగాలి . యిప్పుడు మొదట జరగాల్సింది  అదే . చదువు సంస్కారాన్ని, ధైర్యాన్ని, సాహసాన్ని, న్యాయాన్ని పిల్లల మనస్సులో, జీవితాల్లో పూర్తిగా నాటే చడువుగా వుండాలి . వూరికే -  సైన్సు , లెక్కలు , జనరల్  నాలెడ్జి  లాంటివి నేర్పేది - చదువే కాదు.

 యివన్నీ నేర్పితే - పిల్లలు తప్పకుండా నేర్చుకుంటారు . మంచి పౌరులుగా మారుతారు . కానీ , యిప్పుడు యివన్నీ మన విద్యా వ్యవస్థలో లేవు గాక లేవు . అందువలననే దేశం దరిద్రంగా , అసహ్యంగా - గంట కో రేపు, రోజుకో సామూహిక బలాత్కారం - చిన్న పిల్లలపై  బలాత్కారాలు  - యిలా తయారయ్యింది .

చట్టాలు రానీ , శిక్షలు పడనీ , కానీ, మన విద్యావ్యవస్థ మారక పొతే - ఏ నేరాలూ తగ్గవు .

ఈ మధ్యలో - పోలీసు వారికి - చాలా, చాలా నేర్పాల్సి వుంది .  పనికి మాలిన రాజకీయ నాయకులను ఎన్నుకునే మన బుద్ధులు కొంత మారాలి. న్యాయ వ్యవష్ట కూడా ఎంతో మారాల్సి వుంది. కొన్ని కేసులు దశాబ్దాల పాటు జరుగుతూ వుంటే , అది న్యాయ వ్యవస్థలో  కూడా వున్న లోపమే కదా . ఆఆ .... మమ్మల్ని మీరేం అనకూడ దంటే ఎలా? మనం అందరం మారాలి ...

= మీ

వుప్పలధడియం  విజయమోహన్


 

20, మే 2014, మంగళవారం

చంద్రబాబు నేతృత్వంలో - జరగాల్సిం దేమిటి ? ఏది మొదట? ఏది ముఖ్యం ? ఏది సులభం?


 అభివృద్ధి పథం లో 

మన రాష్ట్రం

ఎన్నికలు ముగిసిపోయాయి . వాటి ఫలితాలూ వచ్చేశాయి .

ఇవి రెండూ, నాకు బాగా నచ్చినట్టే వచ్చాయి . ఆ మాటకొస్తే , మనందరికీ బాగా నచ్చిన వాళ్ళే అధికారం లోకి వచ్చారని చెప్పుకోవచ్చు .

సీమాంధ్ర లో -  చంద్రబాబు నాయుడు గారి తెలుగు దేశం పార్టీ కి 102 సీట్లు , వారి తో బాటు పోటీ చేసిన భా.జ.పా. కు 4 అసెంబ్లీ స్థానాలు రాగా , జగన్ గారి పార్టీ కి 67 సీట్లు వచ్చాయి . కాంగ్రెసుకు ఏమీ రాలేదు . అలాగే - పార్లమెంటు స్థానాలకు, సీమాంధ్ర నుండి TDP + BJP  కూటమికి 17 స్థానాలు రాగా మిగతా 8  YSR కాంగ్రెసుకు వచ్చాయి .ప్రజలు చంద్ర , నరేంద్రులకు  బ్రహ్మ రథం పట్టి గెలిపించేశారు.  

యిక చంద్రబాబు గారు యిక్కడ , నరేంద్రుడు అక్కడ - తమ పరిపాలనా దక్షతను చూపడమే  తరువాయి .

సీమాంధ్ర లోని మొదటి పెద్ద పనులేమి ?

నా ఉద్దేశంలో - కరెంటు కొరత వెంటనే తగ్గించాల్సి వుంది . కరెంటు లేకుండా పరిశ్రమలు కానీ , వ్యవసాయం కానీ ఏదీ అభివృద్ధి చెయ్యలేము . పిల్లల చదువులు, పెద్దల ఆరోగ్యం అన్నీ కుంటు పడతాయి . ఆ విషయంలో చంద్రబాబు గారు మొదట తన దృష్టి సారించాలి .

(1) రాష్ట్రంలో - వున్న విద్యుత్తు కర్మాగారాలన్నీ సరిగా పని చేసే లాగు చూడాలి . నిజానికి దేశం అంతటా , ఎన్నో కర్మాగారాలలో - విద్యుదుత్పాదనకు సంసిద్ధంగా వున్న కర్మాగారాలున్నాయి .  వాటికి బొగ్గు, గ్యాస్ సప్లయ్  లేదు.  కొన్ని లక్షల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కర్మాగారాలన్నీ పనిచేస్తే - దేశంలో, రాష్ట్రంలో , అతి త్వరగా, విద్యుదుత్పాదన ఘనంగా పెరుగుతుంది . యిది - సులభంగా , అతి త్వరగా చెయ్యగల పని . చాలని విద్యుత్తు నేషనల్ గ్రిడ్ నుండి కొనుగోలు చెయ్యాలి .  కానీ, 2 సంవత్సరాలలోపు, రాష్ట్రాన్ని కొరత రాష్ట్రం నుండి సర్ ప్లస్ రాష్ట్రంగా మార్చ వచ్చు . మార్చాలి . తమిళనాడులో జయలలిత గారు కూడా అదే చేస్తున్నారు .

(2) మన రాష్ట్రంలో నదులున్నాయి . ఈ నదులను కలిపే ప్రణాళిక తయారు చెయ్యాలి . శ్రీకాకుళం నుండి కుప్పం వరకు నదుల నీరు ప్రవహించే ఏర్పాటు మనం చెయ్యాలి. నా చిన్న సలహా - కుప్పం పేరు శ్రీ కుప్పం అని  మారిస్తే బాగుంటుంది . అప్పుడు, మన రాష్ట్రం శ్రీకాకుళం నుండి, శ్రీ కుప్పం వరకు, అని చెప్పుకోవచ్చు . రాష్ట్రం - 'శ్రీ' ,అంటే, సిరి తో నిండి వుంటుంది.  మోడీ గారు, నవీన్ పట్నాయక్ గారు వొప్పుకుంటే - మహానది ని కూడా కలిపి - వొడిశా వొక కొన  నుండి ఆంధ్రప్రదేశ్ మరొక కొన వరకు - అన్ని జిల్లాలలో నదులు ప్రవహించే ఏర్పాటు చెయ్యవచ్చు . యిది అయిదేళ్ళు లేదా పదేళ్ళు పట్టినా ఫరవాలేదు , కానీ ఈ పనికి శ్రీకారం చుట్టాలి . మన రాష్ట్రంలో , చాలా ప్రదేశాలలో ఇప్పటికే మంచినీటి సరఫరా  చాలా తక్కువ . ఈ పరిస్థితి మారాలి. మహానది, గోదావరి , కృష్ణా   నదుల వరద నీరు మాత్రం కాలువల ద్వారా వచ్చినా , చిత్తూరు జిల్లా లాంటి ఎన్నో ప్రాంతాలకు నీటి సదుపాయం కుదురుతుంది

(3) మనకు మంచి రాజధాని కావాలి. హైదరాబాద్ పోగొట్టుకున్నది ఉత్తరోత్తరా మనకు అదృష్టంగా, మహా లాభకరంగా మారేలా చేసుకోవాలి. కొత్త రాజధానిని, రాష్ట్రం మధ్యలో, కనీసం 50 X 50 కి.మీ వైశాల్యం వుండేటట్టు , క్రొత్తగానే నిర్మించాలి . అది, చెన్నై- కోలకాతా జాతీయ రహదారికి వీలైనంత దగ్గర వుంటే మంచిది . అలాగే , కొంత చెన్నైకు సమీపం గా వుంటే చెన్నై లోని విమానాశ్రయము, పోర్ట్ మనం సులభంగా వాడుకునే వీలుంటుంది - అంటే మనం అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయము, పోర్ట్ నిర్మించే వరకు యివి అవసరం గనుక . యింతకు ముందు వొక సారి అది ఒంగోలు - నెల్లూరు మధ్య ప్రాంతాల్లో అయితే సరిపోతుంది అని రాశాను . అంటే ఒంగోలు ఆని కాదు . దానికి దగ్గర, ఢిల్లీ అంత నగరం నిర్మించ డానికి సరైన ప్రదేశం చూసుకోవాలి .

(4) మన రాష్ట్రంలో - IT  పార్కులు , ఫార్మా  పార్కులు సులభంగా నెలకొల్ప వచ్చు . వాటికి అన్ని రాయితీలు యివ్వాలి . ఈ విషయంలో - చంద్రబాబు గారికి వున్న అనుభవం తో - పారిశ్రామిక వేత్తలను సులభంగా ఆకట్టుకోవచ్చు .

(5) మన రాష్ట్రం పెద్దది. పక్క రాష్ట్రం చిన్నది. మనకు వొక రైల్వే జోన్ కావాలి కదా .  అది మోడీ గారిని అడిగి సాధించాలి .అలాగే - టెలికం సర్కుల్ , లాంటి కేంద్ర కార్యాలయాల విభజన జరగాలి . దీని వలన, ఆంధ్ర ప్రదేశ్ పైన గమనమూ పెరుగుతుంది , అభివృద్ధి     కూడా త్వరగా జరుగుతుంది . టెలికాం లో బ్రాడ్ బాండ్ రావడమూ త్వరగా జరుగుతుంది . రైల్వే లో క్రొత్త లైన్ ల నిర్మాణమూ జరుగుతుంది . వీటితో బాటు - హైదరాబాద్ లోని ఆంధ్రా ఉద్యోగులు కూడా కొంత మంది ఇక్కడికి  రావడానికి వీలుంటుంది . వీటి వలన చంద్ర బాబు గారు అనుకునే అభివృద్ధి తానుగా జరిగే వీలుంది .  అంత పెద్ద రైల్వే జోన్ తెలంగాణా కు అక్కరే లేదు అంత పెద్ద టెలికాం సర్కుల్ అక్కరే లేదు . కాని  మనకు కావాలి . అది మనం అడగాలి . 

(6) నన్నడిగితే,  TDP  పార్టీ నుండి రైల్వే మంత్రి వుంటే మేలు అని నాకు అనిపిస్తుంది . రైల్వే కాకపొతే - IT  మినిస్ట్రీ అయినా బాగుంటుంది , మన రాష్ట్ర అభివృద్ధికి . 

(7) మనకు వొక ఐ.ఐ.టి ., వొక ఐ.ఐ.యం., వొక ఏ.ఐ.ఐ.యమ్.యస్ . - లాంటి ఉత్తమ విద్యల నందించే సంస్థలు రావాలి . యివన్నీ, కేంద్రం నుండి, మనం అడగి తీసుకోవాల్సినవే ; మనం మనముగా చెయ్య వలసినవి కావు. 

(8) చంద్రబాబు గారు ఈ మధ్య పత్రికల వారికి , టీవీ చానెళ్లకు యిచ్చిన ఇంటర్ వ్యూలలో - చాలా సమస్యల గురించి బాగా చెప్పారు . మనకున్న 14 పోర్టుల గురించి , వాటికి చేయవలసిన అభివృద్ధి గురించి , వాటికి , మన వ్యవసాయ,  పారిశ్రామిక రంగాలకు మధ్య వుండవలసిన సహకారాల గురించి చెప్పారు . అలాగే , మనకు రాబోయే రాజధాని ఢిల్లీ కంటే బాగుండాలని చెప్పారు . యివన్నీ బాగుంది . 

చంద్ర బాబు గారు చెయ్యాల్సినవి చాలా వున్నాయి . యిందులో కొన్ని సులభంగా చేసేవి. కొన్ని వెంటనే చెయ్యాల్సినవి . కొన్ని నిదానమైనా, తప్పకుండా చెయ్యాల్సిన ముఖ్యమైన పనులు.  మొదట ,సులభంగా చెయ్య వలసినవి చేసేసి, వెంటనే చెయ్యవలసినవి వెంటనే చేసేసి , తరువాత , ముఖ్యమైనవి  చిత్త శుద్ధితో , అందరి సహకారంతో చెయ్యాలి . 

చంద్రబాబు గారు యింకా ఎన్నెన్నో చెయ్యొచ్చు . అసలు ... పదేళ్ళలో , తెలంగాణా వారి కొందరు నాయకుల బూతు మాటలకు, లేని చేతలకు  మొహం మొత్తి , తెలంగాణా ప్రజలు మళ్ళీ, సమైక్యంగా వుందామన్నా - ఆశ్చర్యం లేదు . పక్క పక్క నున్నా , అటువంటి వారు  మధ్య లేకుంటే , కుటుంబ కలహాలు వుండవు . రాష్ట్రాల మధ్యా కలహాలు వుండవు . 

సర్వే జనాః సుఖినో భవంతు

- మీ 

వుప్పలధడియం విజయమోహన్




18, మే 2014, ఆదివారం

చేసిన పాపం చెబితే పోతుందా ? మరి చేసిన పుణ్యం? అదీ పోతుందా ? - బిచ్చ గాడు రౌడీ గా మారితే మనకేం?


మనం ధనవంతులా , కాదా ?   మనం ఆరోగ్యవంతులా, కాదా ?    మనం అందంగా వున్నామా, లేదా ?

మనకు అధికారము , పలుకుబడి వుందా , లేదా ? మనల్ని గురించి మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు ?
యిలా మనల్ను , ఎన్నో ప్రశ్నలు వేధిస్తూ వుంటాయి .
కానీ , నేను మంచి వాడినా , కాదా - అన్న ప్రశ్న మనలో వుందా ? అలా వుండాలని మనం అనుకుంటూ వున్నామా ? 

మనమున్న సమాజం లో వొక పెద్ద పోటీ ప్రపంచం వుంది. అందులో వున్న వారు, ఎప్పుడూ, మిగతా వారితో ఏదో వొక విధంగా పోటీ పడుతూ వుంటారు ? కొందరికి ఏ పోటీ అక్కర లేదు . వారు తమ పని తాము చేసుకుని పోతూ వుంటారు ? 

మన రాజకీయ వాదులంతా పోటీ ప్రపంచం లోనే వున్నారు. పారిశ్రామిక వేత్తలలో కొంత మంది పోటీ ప్రపంచం లో, కొంత మంది  దాని బయట వున్నారు .

మనసులో పోటీ అని వుంటే - ఎంతో కొంత ఈర్ష్య వచ్చే ప్రమాదం వుండనే వుంది. ఈర్ష్య రాకుండా - పోటీ పడి, యెదుటి వాడు గెలిస్తే , అప్పుడూ, సంతోషంతో , గెలిచిన వాడిని అభినందించే మనస్తత్వం  మనలో వుందా ?  మనం సాధించిన దానికి, యితరులతో పోల్చుకోకుండా, ఆనందించే గుణం  మనలో వుందా ?

ఈర్ష్య అనేది - మానసిక కాన్సర్ - అని ఫోర్బెస్ అనే ఆయన అంటారు . నిజమే . యిది  మానసికంగా మనలను, ముఖ్యంగా మనలోని మంచిని, తినేస్తుంది . ఈర్ష్య మనసులో వుండే వాడిలో - ప్రేమ, అభిమానము ఉండలేవు - అంటారు, సెంట్ ఆగస్టిన్ . మన ఈర్ష్యకు గొప్ప కారణం వుండాలని ఏమీ లేదు. అది ఏదైనా వొక కారణం వెదుక్కుంటుంది. ఈర్ష్య మనలో వుంటే - అది  వుండడానికి ఏదో కారణాలు వెదకడం ప్రారంభిస్తుంది . తనకు తానుగా పెరగడం ప్రారంభిస్తుంది . అందుకే అది కాన్సర్ లాంటిది.     

కానీ నిజానికి , జీవితమనే నిరంతర ప్రవాహంలో, ఎప్పుడూ , ఎవరో వొకరు మనకు ముందూ వుంటారు ; వెనుకా వుంటారు . ముందు వాళ్ళ పైన ఈర్ష్య అక్కర లేదు . వెనుక వాళ్ళ పైన చిన్న చూపూ అక్కర లేదు . రెండూ మూర్ఖత్వమే . 

సరే . మన వూళ్ళో ధనవంతుడెవడో ,మనలో చాలా మందికి తెలుసు. మన వూరిలో పలుకుబడి, అధికారం,  వున్న వాడెవడో మనకు తెలుసు . అందరికంటే బలమైన వాడు , వెనుక పది మంది రౌడీలు వున్న వాడెవడో తెలుసు .

కానీ మనవూళ్ళో , అందరికంటే మంచి వాడు ఎవడో మనకు తెలుసా ? ఎలా తెలుస్తుంది?

మిగతా అన్ని విషయాల్లోనూ మనకు రక రకాల గణాంకాలు వుంటాయి . చాలామంది ద్వారా లబించే రూమర్లు కూడా వుంటాయి . కానీ - మంచి వాడు ఎవరయ్యా - అంటే , అది చెప్పడం కాస్త కష్టమే. ధనవంతుడో, రాజకీయ నాయకుడో చేసే చిన్న చిన్న పనులు కూడా పెద్దగా  చూపించే పత్రికలూ, టీవీ లు వుండనే  వున్నాయి .  కానీ ,మీరో, నేనో చేస్తే - చెప్పే వాళ్ళు లేరు . మనమే చెప్పుకోవచ్చా ?  చెప్పుకుంటే వచ్చే పుణ్యం పోతుంది అంటారు . కానీ, సంతోషం వస్తుంది . పది మంది అనుకోవచ్చు - యిదేదో పెద్ద గొప్ప పని అని చెబుతున్నాడు ; అంతా బడాయి - అని . మనకు కాస్త  గాలి  తీసేసినట్టుగా  అవుతుంది . అయినా - చేసిన చెడ్డ పని చెప్పడం కష్టం గానీ , మంచి పని చెప్పడం కష్టం కాదు . అసలు చెప్పకండా వుండడం కష్టం .

నేను చాలా ఏళ్ళ క్రితం వొక మంచి యోగా ప్రోగ్రాం పూర్తి చేశాను . అది చాలా, చాలా బాగుంటుందని  నా లాగా ఆ ప్రోగ్రాం చేసిన వారందరూ వొప్పు కుంటారు.  అందులొ వొక భాగం , మీరు అదే ప్రోగ్రాం చేస్తున్న మరొక అపరిచిత వ్యక్తికి , మీరు మీ జీవితం లో చేసిన వొక పెద్ద తప్పు పని పూర్తిగా చెప్పాలి .ఆ పాపాన్ని అలా చెప్పి కడుక్కోవాలి .   అతడూ అలాగే తను చేసిన పెద్ద తప్పు పని మీకు పూర్తిగా చెప్పాలి. ఆ తరువాత మీరిద్దరూ - మీరు విన్న, చెప్పిన ఆ తప్పు పనులు ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు . యిలా కొద్ది నియమాలు వున్నాయి . అతడు నాకేదో చెప్పాడు . నేను అతనికేదో చెప్పాను . యిందులో విశేషమేమిటంటే - యిలా చెప్పేసి ఏడవని వాడంటూ ఆ ప్రోగ్రాం లో లేదనే చెప్పాలి . నేను కూడా ఎన్నో దశాబ్దాల తరువాత , బాగా ఏడిచాను . ఎంత బండ బారిన వారికైనా ఆ ఏడుపు రావాల్సిన సమయం అది .  అది తెచ్చి పెట్టుకునే ఏడుపు కాదు . సహజంగా వచ్చేసే ఏడుపు . అలా, చేసిన ఏదో తప్పు పని , ఎవడికో చెప్పి అందరం ఎడ్చుకున్నాం . ప్రోగాం తరువాత - అందరం సంతోషం తో ఇళ్ళు చేరిన వాళ్ళమే.

మరి చేసే మంచి పనుల మాటేమిటి . అవి రహస్యంగా  వుంచము గా! అది చిన్నదో, పెద్దదో, ఏదైనా గానీ . పది మందికి చెప్పుకుంటే , వాళ్ళు కుళ్ళుకున్నా, అభినందించినా, అంతేనా అని గాలి పీకేసినా   - చెప్పేస్తే అదో సంతృప్తి .
నాకు చాలా సంవత్సరాలు - అసలు జీవితంలో మనం మంచి పనులు ఏమి చేశాము - అని మనసు పీకుతూ వుండేది . మరీ చిన్న పనులు మనకే చెప్పుకోలేము . మరొకరికి ఎలా చెబుతాము . మది కాస్తో, కూస్తో పెద్ద పనులు ఎప్పుడూ చేసినట్టు గుర్తు లేదు . మరేం చెయ్యాలి ?

వొక దశాబ్దం క్రితం అయితే - బిచ్చ గాళ్ళకు కూడా - వొక రూపాయికి మించి బిచ్చం వేసిన వాడిని కాను - అని అనుకుంటా . జేబులో డబ్బులు వున్నా , వొక్కో సారి వేద్దామనిపించినా, బిచ్చగాడిని దాటి వెళ్ళిపోయే వరకు , చెయ్యి జేబులోకి వెళ్ళేది కాదు . ఆ తరువాత, సరే, మరో సారి చూద్దాం అనుకునే వాడిని. వెయ్య కూడదని నియమం లేదు కానీ , వేసే అలవాటైతే లేదు . ఎప్పుడో వొక సారి , ఎలాగో వేసే వాడిని .

ఆ తరువాత, ఈ విషయం - నేను ప్రసంగించే కొన్ని క్లాసులలో చర్చకు వచ్చింది. వెయ్యాలని కొందరు; వెయ్యకూడదని కొందరు ; అసలు, బిచ్చ గాళ్ళలో చాలా మంది ధనవంతులున్నారని కొందరు, అసలు బిచ్చం వేస్తే , సోమరి తనాన్ని ప్రోత్సహించడమే నని కొందరు - యిలా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు , వారి వారి కారణాలతో బాటు చెప్పారు.

ఆ తరువాత - బిచ్చ గాళ్ళకు బిచ్చం వేస్తే  ఏమవుతుంది ? వెయ్యకపోతే ఏమవుతుంది ? యిదీ చర్చించాం . ఈ అంశం పైన కాస్త దీర్ఘం గానే , తీవ్రం గానే పరిశోధనే చేసాము.

అప్పుడు నాకు అనిపించింది యిది. బిచ్చ గాడికి బిచ్చం వేస్తే , వాడు ఆ రోజు భోంచేస్తాడు. మరి కొన్ని రోజులు బ్రతుకుతాడు . సరే వాడి వద్ద డబ్బు వుందనుకోండి. మనమిచ్చిందీ అందులో చేరుతుంది . వాడికి అనుభవించే  రాత లేదు . అంతే . కానీ లేని వాడు బ్రతుకుతాడు . బిచ్చగాడి గానే అయినా - కనీసం బ్రతుకుతాడు .

బిచ్చ గాడికి బిచ్చం వెయ్యలేదనుకోండి ? వాడికి ఆకలి పోలేదనుకోండి . అప్పుడేమవుతుంది . వాడికి సమాజం పైన ఈర్ష్య, కసి పుట్టుకు వస్తుంది . ఆకలికి - వాడు చిన్న చిన్న దొంగ  తనాలు   చెయ్యవచ్చు . పట్టుబడితే తన్నులు తింటాడు . జైలుకూ పోవచ్చు . పట్టుబడినా, లేకున్నా , పెరిగే కొద్దీ పెద్ద దొంగ గా , గూండా గా , రౌడీ గా, మారొచ్చు . మన దేశంలో - రౌడీలకు రాజకీయ నాయకుల వద్ద పెద్ద డిమాండు వుంది కదా . కొన్ని పార్టీలలో యిది మరీ ఎక్కువ. భూ కబ్జాలు చెయ్యాలన్నా, ఎదుటి పార్టీ వాళ్ళతో పోరాటాలన్నా, వూరేగింపులన్నా, నినాదాలన్నా - రౌడీలు తప్పకుండా వుండాల్సిందే . ఈ రౌడీలలో చాలా మంది చిన్నప్పుడు వదిలి వేయబడి,  బ్రదుకెలా గడపాలో తెలియని వాళ్ళే . దారిలో అడుక్కున్నప్పుడు , మన లాంటి వాళ్ళ వద్ద , లేదుపో, అనిపిం చుకున్న వాళ్ళే  . కాలే కడుపుకు చట్టాలూ లేవు ; నీతులూ లేవు . అలా రౌడీలుగా మారి, ఆ తరువాత , రాజకీయాలలో చేరి, మంత్రులయిన వారు కూడా ఎందరో . మీరు బిచ్చం వెయ్యక పోతే - వాడు రౌడీ కావచ్చు ; దొంగా కావచ్చు ; మంత్రీ కావచ్చు. వేస్తె - ఆనందంగా , బిచ్చ గాడిగా ఎవరికీ ప్రాబ్లం  కాకుండా వుండి , ఎప్పుడో , ఎక్కడో రాలిపోతాడు .  ఏది బెటర్ ? యిదీ నా ఆలోచన . చాలా యోచన తరువాత , అప్పటినుండి - బిచ్చగాడికి బిచ్చం వెయ్యకుండా పోరాదు - అని నిశ్చయించుకున్నా . కాస్త అది లేటుగా -  నాకు అలవాటుగా మారింది.

కానీ - అదేం పెద్ద గొప్ప పని అన్నట్టు అనిపించ లేదు. నేను యింత కారణాలు వెతికి చేసే పని, చాలా మంది - అసలు ఏ మాత్రం యోచన చెయ్యకుండా , ప్రతి దినం గుళ్ల ముందు చెయ్యడం   చాలా సార్లు చూశాను . అందులో - ఆడవాళ్ళ శాతం యెక్కువ .

మరేం చెయ్యాలి ? 

అప్పుడు నేను రిటైర్ అయిన మొదటి సంవత్సరం.  మా వూళ్ళో "సేవాలయ " అనే అనాథాశ్రమం , వృద్ధాశ్రమం , స్కూలు - కలిపి - బాగా జరుపుతున్న సంస్థ నా దృష్టికి వచ్చింది . అక్కడికెళ్ళి - 5000 రూపాయలు - వారికి వొక రోజు భోజనం కోసమని విరాళం యిచ్చాను . అది నాకు కాస్త బాగా అనిపించింది . మా అన్నదమ్ములందరితో చెప్పాను . వోహో అన్నారు - అంతే .

అలాంటి 5000 రూపాయలు విరాళం , మళ్లీ 4, 5 సార్లు యిచ్చాను . అక్కడికెళ్ళి , ఆ పిల్లలకు వొక స్వీట్ వడ్డించి , వాళ్ళతో బాటు కూర్చుని 2 సార్లు భోజనం చేశాను . యిప్పుడు మరి కాస్త బాగా అనిపించింది . అయినా - పెద్ద గొప్ప పని అని అనిపించ  లేదు.

ఆ తరువాత సంవత్సరంలో - నేను స్టాక్ మార్కెట్ లో - ఎన్నో పరీక్షలలో చాలా బాగా రాసి వుత్తీర్ణుడవడం , అందులో నేను పెట్టుబడి పెట్టిన షేర్లు కాస్త బాగానే  లాభాలివ్వడం జరిగింది .

అప్పుడనుకున్నా - వచ్చే లాభాల్లో - వొక 25 శాతం - ఈ  పిల్లలకు విరాళం గా యిస్తే ఎలా వుంటుంది ? అంతా యోచన చేసి - నా విరాళం 25000 రూపాయలకు పెంచాను. యిలా వొక 5 సార్లు వొక్కొక్క సారి 25,000 రూపాయలుగా యివ్వడం జరిగింది. 

అప్పుడెప్పుడో చదివాను - బిల్ గేట్స్  గారు, వారన్ బఫ్ఫే గారు, మనదేశంలో అజీం ప్రేమ్జీ గారు యిలా ఎంతో మంది - ఎన్నో బిలియన్ల డాలర్లు సంపాదించి అందులో చాలా భాగం ప్రపంచంలోని అన్ని దేశాలలోని బీదలకు ఎన్నో రకాలుగా సహాయం చేసిన వైనం . అందువలన బాగుపడిన కుటుంబాలు, వ్యక్తులు ఎంత మందో చెప్పలేము .

ఇలాంటి ప్రపంచంలోని గొప్ప వాళ్ళ లో, గొప్ప మంచి వాళ్ళతో - ఎవరు పోటీ పడగలరు ? దాతృత్వం అనేది మన దేశం లో వుంది కానీ , అమెరికా లెవెల్ లో లేదనే చెప్పాలి . అందుకే మనదేశంలో యింకా ఆకలి, చదువులేమి , కనీసావసరాల లేమి - అన్నీ వున్నాయి .

యిలా అనుకుంటున్న సమయంలోనే మోడీ ప్రభంజనం  మన దేశం లో వచ్చింది . నాకూ, మోడీ గారు బాగా యిష్టమైన వొక లీడర్ . ఆయన వస్తాడు, వస్తాడు అనగానే - స్టాక్ మార్కెట్ లో వొక ఉప్పెన పుట్టు కొచ్చిం ది ,

నేను పెట్టుబడి పెట్టిన షేర్లు మరి కాస్తా బాగా పైకి పోవడం జరిగింది . అప్పుడనుకున్నా. ముందు అనుకున్న ప్రకారం 25 శాతం యివ్వాలి కదా. వొక వేళ మళ్ళీ షేర్లు పడిపోతే ఎలా?

 కాస్త అనుమానం వచ్చినా, మళ్లీ , చెయ్య గలిగే మంచి పని యిప్పుడే చెయ్యాలి , చేసేద్దాం - అని నేను, నా శ్రీమతి, సేవలయా కు వెళ్లాం . ఈ సారి - ఏదో వొక ఆడ పిల్ల, 5 లేదా 6 వ తరగతి చదువుతున్న పిల్ల , బాగా చదువుతున్న పిల్లను సెలెక్ట్ చెయ్యండి; ఆ పిల్ల చదువులల కయ్యే పూర్తి  ఖర్చు 12 వ తరగతి వరకు ఎంతవుతుందో చెప్పండి . అది వొక విరాళం (ఎండో మెంటు ) గా యిచ్చేస్తానని  చెప్పాను . ఆ ప్రకారమే 80 వేలు విరాళం (ఎండో మెంటు ) గాను మరో 5000 వొక రోజు ఆ ఆశ్రమం భోజన ఖర్చు గానూ  యిచ్చాను . వాళ్ళూ,  బాగా చదివే వొక 5 వ తరగతి పిల్ల పేరులో యిది చేర్చుకున్నారు . ఆ పిల్ల వివరాలు నాకు యిచ్చారు . ఇక పై ఆ పిల్ల ఎలా చదువుతూ వుందో నాకు తెలుపుతాము - అన్నారు .  మేము కూడా అప్పుడప్పుడూ వెళ్లి చూడొచ్చు; మాట్లాడవచ్చు-యిలా ఏదేదో చెప్పారు. ఆ తరువాత - ఏదో మనసులో వున్న మాట వాళ్ళతో చెప్పాను . ఆ పిల్ల 12 వ తరగతి మంచి మార్కులతో పాసైతే , నేను, నా శ్రీమతి అప్పుడూ బాగానే వుంటే - ఆ పిల్ల కాలేజీ ఖర్చులు కూడా యివ్వగాలనో ఏమో చూద్దాం - అని . 

యిలా మోడీ గారు స్టాక్ మార్కెట్ ను మరింత పెంచుతూ వుంటే , నేనూ, మరింత మంది పిల్లల పేరులో , విరాళాలు యిస్తాను కదా అనిపించింది . మరో ఆలోచన కూడా మనసులో మెదిలింది . యిందులో మన నిర్వాకం ఏముంది ? యిలా షేర్ల ధరలు పెరిగేటట్టు మనం చేశామా . అదేదో తానుగా పెరిగింది . మనం అనుకున్న ప్రకారం ఏదో యిచ్చాము .  అంతే  కదా .

యిప్పుడు నాకు 65 సంవత్సరాలు . కనీసం మరో 15 సంవత్సరాలు యిలాగే వుంటే - మరో 20 మంది పిల్లలకైనా - ఎండో మెంటు చెయ్యొచ్చు . యింకా ఎక్కువే చెయ్యొచ్చు కూడా .

ఈ సోదంతా ఎందుకంటే - మన దేశం లో అనాథలు అన్న పదమే వాడకం లో వుండకూడదు . మనమంతా వున్నప్పుడు , మన దేశం లోని ప్రతి బాలుడూ, బాలికా - బాగా చదవాలి . ఆర్ధిక పరిస్థితి కానీ , తల్లిదండ్రులు లేకపోవడం కానీ - పసి పిల్లల భవిష్యత్తుపై  ఎలాంటి చెడు ముద్రా వెయ్యకూడదు . వచ్చే తరాలలో -  రౌడీలుగా , దొంగలుగా, బిచ్చగాళ్ళుగా ఎవరూ వుండకూడదు . యిది మనసులో వుంది . దీనికి - యింకేం చెయ్యాలో చూడాలి.

సర్వే జనాః సుఖినో భవంతు

= మీ

వుప్పలధడియం విజయమోహన్