మోడీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మోడీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, సెప్టెంబర్ 2014, ఆదివారం

నాకు నచ్చిన 10 మంది ఎవరు? - నాలిస్టు లో 8 మందే ! - మరి మీ సలహా ?


నాకు నచ్చిన 10 మంది

"మన దేశం" లో నాకు బాగా నచ్చిన 10 మంది వ్యక్తుల పేర్లునచ్చిన  క్రమంలో నేను రాయగలనా ? ఏమో! వెంటనే  చెప్పలేక పోతున్నాను.

కానీ అసలు నాకు బాగా తెలిసి వుండాల్సిన  లిస్టు గా యిది. మన దేశంలో నాకు బాగా నచ్చిన వాళ్ళు కనీసం పది మంది వున్నారా, లేదా వుంటే,వాళ్ళెవరు ? ఎందుకు నచ్చారు ? యిది నాకు  తెలియాలా,వద్దా ?

నచ్చని వాళ్ళ లిస్టు అక్కర లేదు. అది చాంతాడంత వుండొచ్చు ; హనుమంతుడి  తోకంత  వుండొచ్చుయింకా పెద్దగానూ వుండొచ్చు . ఆ లిస్టు వొద్దు లెండి .

కానీ నచ్చిన వాళ్ళ పేర్లు చెప్పుకోవడం లో మనకు పెద్ద శ్రమనో , ప్రమాదమో లేదు కదా .

అది తెలుసుకోవడానికి కాస్త ప్రయత్నం చేస్తా .

1. మహాత్మా గాంధీ : - గాంధీ గారు నాకు బాగా నచ్చారు . సత్యము, అహింస తో ఎన్నెన్ని సాధించ వచ్చునో - ఆయన తన జీవితం ద్వారా నిరూపించారు . ప్రపంచానికే మార్గ దర్శకుడైన  గాంధీ మనకు నచ్చకపోవడం ఎలా? నాకు ఆయన చాలా బాగా నచ్చాడు . ఆయన  రాసిన ఆత్మకథ లాంటి పుస్తకం మరొక్కటి "నభూతో న భవిష్యతి".  తన తప్పులను ఏవీ దాచుకోలేదాయన.  అలా మరెవ్వరూ చెప్పలేరు.  ఆయన జీవితంలోని సంఘటనలు చదివే , మేమూ, 55 ఏళ్ళ క్రితం , మా వూళ్ళో , మా యింట్లో , లెట్రిన్ కు మా స్వహస్తాలతో గోడలు కట్టి దాన్ని శుద్ధి చేసి , కాస్త గర్వం గా కూడా  అనుభూతి చెందాము.  కుష్టు రోగులకు స్వహస్తాలతో మందు రాయడం, వాళ్ళను బాగా చూసుకోవడం లాంటి పనులు - అప్పుడు కానీ, యిప్పుడు కానీగాంధీ తప్ప మన నాయకులెవరూ చెయ్యలేదు . గాంధీ గారిని గురించి ఎంతో చెప్పొచ్చు .కానీ , మమ్మల్ని, చిన్నతనం నుండీ ఆయన జీవితం బాగా ప్రభావితం చేసింది కనుక యీలిస్టు లో మొదట ఆయన పేరు రాస్తున్నా - ఆయన యిప్పుడు లేక పోయినా . ఆధునిక యుగంలో, మన 21 వ శతాబ్దంలో, గాంధీ చాలా గొప్ప యోగి, అభ్యుదయ వాది, మానవతా వాది అని నా ప్రగాఢ  నమ్మకం . నా ఈ లిస్టులో యిప్పుడు లేని వారి పేర్లు - గాంధీ తప్ప - మరెవరిదీ రాయను . ఎందుకంటే - భూతకాలంలో ఎంతో మంది గొప్ప వారు వుండవచ్చు . కానీ , ఈ రోజు సజీవంగా , మన మధ్య వుండి, మన మధ్య , మానవ కల్యాణానికి కృషి చేస్తున్న వారు ఎవరు , వారిలో నాకెవరు నచ్చారు - అన్నదే నా ఆలోచన

2. నరేంద్ర మోడీ :-  మన యిప్పటి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నాకు బాగా నచ్చారు . లంచగొండితనానికి   ఆయన చాలా, చాలా దూరం .  చెప్పే పని చెయ్యడం , చేసే పని చెప్పడం - ఆయన ప్రత్యేకత. ఆయన్ను గురించి చెడ్డగా మాట్లాడే వారు తాము చెప్పుకో గలిగే పనులేం చెయ్య లేదు . మోడీ గారు చాలా, చాలా మంచి పనులు, గొప్ప పనులు చేశారు; చేస్తున్నారు. మద్య పాన నిషేధం వున్న వొకే వొక రాష్ట్రం గుజరాత్ . ఆ రాష్ట్రంలో  రోడ్లు, నీరు, విద్యుత్తు -పుష్కలంగా వుండేట్టు చేసిన ఘనత ఆయనది . మన రాష్ట్రాలలో, మద్యం నుండి వొచ్చే పన్ను యొక్క ఆదాయమే చాలా ఎక్కువ .   ఆదాయం ఎక్కువ అయినా రోడ్లు లేవు, నీళ్ళు లేవు, విద్యుత్తూ లేదు మనకు.   మద్య పానం మన రాష్ట్రాలలో వుంది గనుక, నేరాలు ఘోరాలు అక్కడికంటే యిక్కడ ఎక్కువ.  కాక పొతే అక్కడ వొక్క నేరం జరిగినా  వెంటనే తెలిసిపోతుంది.  మిగతా రాష్ట్రాలలో వంద నేరాలకు వొక్కటి పైకొస్తే  ఎక్కువ.  మోడీ గారి మాటలలో, ఎప్పుడూ "నూరు  శాతం ప్రజల" అభివృద్ధి వుంటుంది.   మిగతా వారి మాటలలో - ఏదో వొక వోట్  బాంక్  ను గురించే వుంటుంది ఎప్పుడూ.  మోడీ గారి చేతలూ అంతే.   సర్వే  జనాః సుఖినోభవంతు - అనేటట్టే  వుంటుంది.  ఆయన నేతృత్వం కొనసాగితే - 10 ఏళ్ళలో మన దేశం - అన్ని దేశాల్లో ప్రథమ స్థానంలో వుంటుందన్న  విషయంలో, నాకైతే సందేహం లేదు.   మోడీని గురించి చాలా చెప్పొచ్చు . వారి విషయం లో నా ఆశ  వొక్కటే . BJP లోని వారూ, RSS  లాంటి అనుబంధ సంస్థల్లోని వారూ కూడా, మోడీ లాగా, సర్వే జనాః సుఖినో భవంతు - అని మనసా, వాచా కర్మణా - అనుకోగలగాలి.  మోడీ మార్గంలో వాళ్ళు వెళ్ళాలి. మోడీ నేతృత్వం లో వారు మసలుకోవాలి . అలా జరగాలని ఆశిద్దాం . 

3. సద్గురు జగ్గి వాసుదేవ్ :- ఈయన తమిళనాడులో , ముఖ్యంగా, యువతలో , వొక పెద్ద విప్లవమే తెచ్చాడు . దేవుడు లేడు , వద్దు - అనే  రాజకీయాలు వున్న తమిళనాడు  రాష్ట్రంలో , దాదాపు కోటి మంది ఈయన శిష్యులు గా మారిపోయారు . వారి అందరి జీవితాలలో అనూహ్యమైన మార్పు రావడం నేను చూశాను.  ప్రతి యింటిలోను , "యోగ" అనే జ్యోతి వెలగాలని , ఈయన చేస్తున్న కృషి అపారం . నిరుపమానం .  యిదే కాక, విద్యారంగంలోనూ , పర్యావరణ రంగంలోనూ  ఈయన కృషి తమిళనాడులో ప్రథమ స్థానంలో వుందని నా నమ్మకం . ముఖ్యంగా , తమిళనాడు  లోని యువతను, కుల మతాలకు అతీతంగా , ఏకం చేయడానికి ఈయన చేసినంత, చేస్తున్నంత  సకారాత్మక సేవ మరెవరూ చెయ్యలేదని నా నమ్మకం.  ఈయన ఆంగ్లంలో - చాలా సహేతుకంగా, అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడడంలో చాలా  దిట్ట . ఈయన మాట్లాడే తమిళం వొక ప్రత్యేక యాసలో వున్నా - అందరికీ నచ్చింది . మన దైనందిన సమస్యలకు ఈయన యిచ్చే సలహాలు చాలా బాగా వుంటాయి . అందరికీ చాలా బాగా నచ్చుతాయి . 

4. శ్రీ శ్రీ రవిశంకర్ (గురూజీ ) :- ఈయనా సద్గురు జగ్గి వాసుదేవ్ లాగా - యోగా, విద్య, లాంటి అనేక రంగాల్లో - యివతపై తమ అపార ప్రభావాన్ని చూపుతున్న వారే. సేవ, ప్రేమ , సహనం  లాంటి వున్నత విలువలను ఈయన ప్రపంచం అంతటా - కుల, మత, దేశ, రంగు , లాంటి అన్ని విభేదాలనూ   దాటి - విశ్వ మానవ ఐక్యత ను ప్రబోధిస్తున్న వారు  ఈయన. ఈయన శిష్యులూ కోట్ల సంఖ్యలో ప్రపంచమంతటా  వున్నారు. ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ వుండే ఈయన స్థాపించిన "ఆర్ట్ ఆఫ్ లివింగ్ " సంస్థలు 152 దేశాలలో వున్నాయి . ఈ సంస్థ నెలకొల్పిన గిన్నిస్  రికార్డులు చాలా వున్నాయి . సద్గురు జగ్గి లాగానే , మన దైనందిన సమస్యలకు శ్రీ శ్రీ గారు యిచ్చే సలహాలు చాలా బాగా వుంటాయి . అందరికీ చాలా బాగా నచ్చుతాయి . "జ్ఞాని " అన్న పదం వీరిరువురికీ బాగా వొప్పుతుంది.  

5. బ్రహ్మకుమారి శివాని :- ఈమె సంభాషణలు "పీస్  ఆఫ్ మైండ్ " అనే టీవీ  చానెల్ (బ్రహ్మ కుమారి సంస్థదే) లోనూ, మరెన్నో చానెళ్ళ లోనూ (ఆస్థా , సంస్కార్ ) ప్రతి దినమూ వస్తూ వుంటుంది . నిత్య జీవితంలోని అనేకానేక సమస్యలకు యీమె సమాధానాలు చాలా చక్కగా, సహేతుకంగా వుంటాయి.  బ్రహ్మ కుమారి సంస్థ పేరు ప్రతిష్టలు చాలా బాగా పెరగడానికి, యీమె కూడా వొక కారణమని తప్పక చెప్ప వచ్చు . ఇవి తెలుగులోనూ తర్జుమా అయితే  చాలా బాగుంటుంది . చిన్న వయసులోనే , యింత విజ్ఞానం  వెదజల్లుతున్న  యీమె కృషి చాలా ప్రశంసనీయం. ఆత్మ , పరమాత్మ లాంటి విషయాల్లో  నేను శివాని గారి భాషణలు పెద్దగా పట్టించుకోను . ఆ విషయాలు నేర్చుకోవాలంటే - శాస్త్ర జ్ఞానం అపారంగా వున్న వారు చాలామంది వున్నారు. కానీ - సామాజిక సమస్యల విషయాల్లో , దైనందిన మానవ సమస్యల విషయాల్లో , మిగతా వారి కంటే - శివాని గారి భాషణలు  నాకు చాలా బాగా నచ్చుతాయి . ఆమె చెప్పేవన్నీ మనం సులభంగా చెయ్య గలిగేవి; చెయ్యవలసినవి. మనకు ఎంతో ఉపయోగ పడేవి . 

6. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు :-  తెలుగులో  ప్రవచన కర్తలలో - ఈయన మొదటి వారు  - అని అందరూ వొప్పుకోక తప్పదు . సరస్వతీ పుత్రుడు - అనిపించే ఈయనకుసంస్కృత,ఆంధ్ర భాషలు - రెండింటి  లోనూ  వున్న  పాండిత్యము , సాహితీ ప్రకర్షధారణా  శక్తి, సమయోచిత ప్రజ్ఞ , అపారము.  హైందవ విలువలను గురించి ఈయన చెప్ప గలిగే తీరు అసమానం . వొక్కో సారి ఆది శంకరుల వారు మన విలువలను మళ్ళీ మనకు చెప్పడానికి ఈయనను పంపించాడా  అని - అనిపిస్తూ వుంటుంది నాకు. ఈయనది పూర్తిగా శాస్త్ర విశ్లేషణ . శాస్త్రంలో వున్నది తప్ప నేను మరేదీ చెప్పనంటారాయన . బ్రహ్మకుమారి శివాని గారిది పూర్తిగా సామాజిక, మానసిక  విశ్లేషణ . సామాజిక, మానసిక  విశ్లేషణ లో శివాని గారిది , శాస్త్రీయ విశ్లేషణలో  చాగంటి గారిది - భాషణలు  అద్వితీయం గా, ఆహ్లాద కరంగా, చాలా విజ్ఞాన దాయకంగా వుంటాయి.

7. S.P. బాలసుబ్రమణ్యం :- సంగీతానికి సేవ చేసిన వారు చాలా మంది వున్నారు . కానీ, తెలుగులో , సంగీతానికి యింత సేవ చేసిన వారు ఈయన వొక్కరే అని - నాకు అనిపిస్తుంది . తెలుగు యువతలో , పిల్లలలో - సంగీతం పట్ల యింత అభిరుచిని  సృష్టించిన  వారు బాలు వొక్కరే - అని చెప్పక తప్పదు. పాడటం గొప్ప. పాడించడం అంతకంటే  గొప్ప. మన రాష్ట్రంలో, లక్షలాది మందిలో , కేవలం సంగీతం వినటమే గాక , పాడటం పట్ల ఆసక్తి యింతగా పెంచిన వారిలో SP బాలు వొక్క ఎవరెస్టు శిఖరం లాంటి వాడు అని చెప్ప వచ్చు . పాడటంలో ఆయన కంటే గొప్ప వారు ముందు వుండి వుండ వచ్చు. యిక ముందూ  రావచ్చు. కానీ , నేనూ పాడాలి - అన్న ఆసక్తి లక్షల మందిలో కలిగించి , ఎలా పాడాలి అన్నది వారికి నేర్పిస్తూ , మంచి  సంగీతం వినాలి అన్న ఆసక్తి కోట్ల మందిలో కలిగించిన ఘనత బాలూ గారిదే. సహజంగా, సరళంగా, సున్నితంగా, మనసును ఆకట్టుకునేలా మాట్లాడడం , అందులోనే అత్యంత ప్రయోజన కరమైన సలహాలనూ యివ్వడం - బాలూ ప్రత్యేకత . 

8.  బాబా రాందేవ్ :- ఈయన రాజకీయాలు  మనకు  నచ్చ వచ్చు ; నచ్చక పోవచ్చు . కానీ, యోగ శిక్షణ కోసం ప్రజల మధ్య ఈయన చేసినంత కృషి మరెవరూ చెయ్య లేదని నా విశ్వాసం . యోగా గురువులలో - అన్ని ప్రక్రియలూ "తానుగా" చేసి చూపిస్తూ , దాన్ని విశ్లేషిస్తూ , అలా చెయ్యమని - ఉత్సాహపరిచే గురువులు చాలా అరుదు. అందులో ప్రథముడుగా బాబా రాందేవ్ ను చెప్పుకోవచ్చు. ఆయన యోగా శిబీర్ కు నేనూ వెళ్లాను . వారం పాటు శిక్షణ పొందాను . అలాగే - నేను సద్గురు జగ్గి గారి యోగా శిక్షణనూ , శ్రీ శ్రీ గారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షణ నూ కూడా పొందాను. యిప్పుడు అవన్నీ కలిపే సాధన చేస్తాను . నాకు అందరూ గురువులే . కానీ, రాందేవ్ గారి యోగా ప్రక్రియలు - ఆరోగ్యానికి అత్యంత సులభకరమైన , ప్రయోజన కరమైన ప్రక్రియలు అని నాకు అనిపిస్తుంది . అయితే - జగ్గి గారి శిక్షణ మరో రకంగా ఉన్నతమైనది; శ్రీ శ్రీ  గారి శిక్షణ మరో రకంగా . దేని కదే గొప్ప . బాబా  రాందేవ్ కృషి - ఆయుర్వేదం విషయంలో చాలా చాలా ప్రశంసనీయం . యిప్పుడు మా యింట్లో - చాలా వరకూ , మేము ఆయుర్వేద మందులే వాడతాం . అందులోనూ రాందేవ్ గారి పతంజలి యోగ చికిత్సాలయ్ మందులే ఎక్కువ . మిగతావి కూడా ఆయుర్వేద మందులు ఎక్కువ వాడతాము.  మేమే కాదు . లక్షలాది కుటుంబాల్లో అల్లోపతీ కంటే - ఆయుర్వేదం  ఎక్కువగా  వాడుతున్నారు యిప్పుడు . యోగా + ఆయుర్వేదం కలిస్తే  ఆరోగ్యం చక్కగా వుంటుందనడంలో నాకు సందేహం లేదు . రాందేవ్ గారి కృషి ఈ విషయంలో చాలా ప్రశంసనీయం .


నాకు పది మంది పేర్లు కావాలి . వాళ్ళు నన్నూ ప్రభావితం చేసి వుండాలి . దేశాన్నీ(లేదా రాష్ట్రాన్ని) బాగా  ప్రభావితం చేసి వుండాలి. ఇప్పుడు మన మధ్య వుండాలి. ఈ మూడు నిబంధనలూ - పై 8 మంది కే సరిపోయాయి. నేను చనిపోయిన మహాత్ముల గురించి మాట్లాడడం లేదు. వారిలో ఎందరో వున్నారు . పై ఎనిమిది మంది కంటే కూడా గొప్ప వారు వున్నారు . 

 ఇప్పుడున్న వారిలో గొప్ప వారు వున్నారు. మన పాత ప్రెసిడెంటు అయిన డాక్టర్ అబ్దుల్ కలాం గారు , మన ముఖ్య మంత్రి చంద్ర బాబు గారు నాకు బాగా నచ్చిన వారే . అయినా - వారి జీవితం నన్నెలా ప్రభావితం చేసింది - అనుకుంటే - నాకు సమాధానం దొరక లేదు. మాకు వేదాంతం నూరి పోసిన గురువు గారు స్వామి  పరమార్థానంద. ఆయన గొప్ప వారే. ఆయన స్వామీ దయానంద ముఖ్య శిష్యులలో వొకరు. అయితే - ఆయన దేశాన్ని ఎంత ప్రభావితం చేశారు అనుకుంటే - నాకు సమాధానం దొరక లేదు. 

త్వరలో - నాకు మరిద్దరు గొప్ప వాళ్ళు -  నన్నూ , దేశాన్నీ ప్రభావితం చేసే వాళ్ళు - దొరుకుతారని నేను ఆశిస్తున్నాను . 

ఇందులో పాఠకులు అయిన మీరు, నాకు - మీ సలహాలు కూడా యివ్వ గలిగితే , మీకు నచ్చిన వాళ్ళను గురించి చెబితే , చాలా సంతోషిస్తాను . కృతజ్ఞతతో మీ సలహాలను స్వీకరిస్తాను .

= మీ 

వుప్పలధడియం విజయమోహన్

18, సెప్టెంబర్ 2011, ఆదివారం

అంగుళీమాలుడు = బుద్ధుడు = సమైక్యతా వాదం = లంచగొండితనానికి ప్రతిగా పోరాటం = నరేంద్ర మోడీ


బుద్ధుడి కాలంలో  అంగుళీమాలుడు అనే గజ దొంగ వుండే వాడట. వాడు దొంగ మాత్రమే కాదు. 999  మందిని చంపి వారి వేళ్ళను హారంగా తన మెడలో వేసుకు తిరిగే వాడట.

వాడు ఎక్కడో కొండల్లో , కీకారణ్యం మధ్య - వుండే వాడు. వాడి భయంతో అటువైపు ఎవరూ వెళ్ళే వారు కాదు.
      
వొక సారి బుద్ధుడు  అటు వైపుగా వొక గ్రామానికి వెళ్ళ వలసి వచ్చింది.

శిష్యులు, అనుయాయులు అంతా భయపడ్డారు.

అందరూ - బుద్ధుడితో  అటువైపు పోనే పోవద్దని ఎంతగానో చెప్పారు.

కానీ బుద్ధుడు విన లేదు. అంగుళీమాలుడు కొండ పైన వుంటే - నా పనీ అక్కడే - అంటూ బయల్దేరాడు.

శిష్యులు వేరే మార్గం తోచక - బుద్ధుడి వెనుకే - బయల్దేరారు.

కొండ పైన - వొక చోట - దూరం నుండి  అంగుళీమాలుడు - వీరిని చూడనే చూసాడు.

మరి శిష్యులకు  అడుగు ముందుకు పడ లేదు. భయంతో - వున్న చోటనే నిలిచి పోయారు.

కానీ - బుద్ధుడు చిరునవ్వుతో - ముందుకు  సాగాడు.

అంగుళీమాలుడు - బుద్ధుడిని చూసాడు. వాడిలో - ఏదో మార్పు. ఏదో కలవరం.

వెయ్యో వాడిని చంపాలి. కానీ - 

ఇతడిని చూస్తే చాలా మంచివాడి లాగా వున్నాడు. వెయ్యో వాడిగా - యింత మంచి వాడిని - ఎలా చంపడం?

యిదీ అంగుళీమాలుడిలో  - ద్వైధీభావం.

అందుకని దూరం నుండే అరిచాడు - వెనక్కు పారిపో - లేదంటే చస్తావు.... పారిపో - లేదంటే చస్తావు.

బుద్ధుడు ముందుకు పోతూనే వున్నాడు.     అంగుళీమాలుడిని చూసి నవ్వుతూ అరిచాడు.

పారిపోతున్నది నీవే. యిక పారిపోకు. నేను వస్తున్నాను - అని.
అంగుళీమాలుడికి యిది అర్థం కాలేదు. నేను పారిపోతున్నానా? యిక పారిపోకూడదా?  ఏమంటున్నాడు ఇతను?

బుద్ధుడి మొహం లోని ప్రశాంతత - ఏదో ఆకర్షణ - అతడ్ని అక్కడే నిల బెట్టింది. జీవితంలో ఎప్పుడూ అనుభవించని అల్లకల్లోలం అతడి మనసులో.

ఏదో జరగ బోతూ  వుంది తన జీవితంలో. ఏదో  తన దగ్గర లేనిది - ఈ బుద్ధుడి దగ్గర వుంది. అది తనకూ కావాలి. అంత మాత్రం తెలుస్తూ వుంది. 

అయినా - ఏదో భయం. పారిపో. దగ్గర రాకు - అని అరుస్తున్నాడు.

బుద్ధుడూ - నువ్వు పారిపోకు. నేను వస్తున్నాను - అని దగ్గరకు వచ్చేస్తున్నాడు.

కాస్సేపట్లో - యిద్దరూ ముఖాముఖిగా - నిలబడ్డారు.

బుద్ధుడి మొహంలో ప్రశాంతత , చిరునవ్వు.  అంగుళీమాలుడి మనస్సులో - ఏదో కలవరం. ఏదో కావాలి తనకు. ఏదో తెలుస్తో వుంది తనకు.  విధి తన పని తాను చేస్తూ వుంది.

బుద్ధుడు ఏం చెప్పాడో, అంగుళీమాలుడు - ఏం విన్నాడో - శిష్యులకు తెలీదు.  తెలిసిందల్లా - అంగుళీమాలుడు బుద్ధుడి శిష్యుడు గా మారి పోయాడు.

తరువాత - బుద్ధుడు శిష్యులతో - ఏదో  రాజ్యానికి వెడతాడు. అక్కడ - శిష్యులందరూ భిక్షాటనకు వెడతారు.   అంగుళీమాలుడు కూడా.

రాజ్యంలో అందరూ చూసారు.   అంగుళీమాలుడు - అంటే - అందరికీ భయం.వణుకు.

అంగుళీమాలుడిపై - రాళ్ళు విసిరారు. అంగుళీమాలుడిలో యిప్పుడు భయం లేదు. ద్వేషం లేదు. భవతి బిక్షాం దేహి  - అంటూ , రాళ్ళ దెబ్బలు తింటూ - ముందుకు సాగాడు. 

యిప్పుడు  అంగుళీమాలుడిలో - గజ దొంగ లేదు.హంతకుడు లేదు. అది ఎప్పటి మాటో.

యిప్పుడు వున్నది - వొక మహర్షి. వొక యోగి. 

కానీ - ప్రజలకు అది తెలీదు. రాళ్ళు విసురుతూనే వున్నారు. రాళ్ళ దెబ్బలకు అంగుళీమాలుడి శరీరం వాలి పోయింది.  శిష్యులు పరుగెత్తి వెళ్లి - బుద్ధుడికి చెప్పారు. బుద్ధుడు వచ్చాడు.

అంగుళీమాలుడి శిరస్సును  - తన వొడిలో పెట్టుకున్నాడు. బాధగా వుందా - అని అడిగాడు. 

అంగుళీమాలుడు - లేదన్నాడు. నమస్కారం చేసాడు. బుద్ధుడిని చూస్తూ, బుద్ధుడి వొడిలో ప్రాణాలు వదిలాడు.

కొన్ని వేల, లక్షల యేండ్ల క్రితం వేట గాడుగా, దొంగగా వున్న - వాల్మీకి కూడా యిలాగే -  మహర్షి గా మారాడు - నారద మహర్షి మాటలతో.

రామాయణం రాసింది - దొంగగా వున్న వాల్మీకా? మహర్షి వాల్మీకా?

బుద్ధుడి వొడిలో- శిరస్సు వాల్చింది - దొంగ గా వున్న అంగుళీమాలుడా ? మహర్షి ఐన  అంగుళీమాలుడా ? 

యిదంతా ఎందుకంటే - మనుషులు మారుతారు. వారిని మారనివ్వాలి. మారే పరిస్థితులు కల్పించాలి. యిరవై ఏళ్ళ క్రితం చూసిన వాడు యింకా గజ దొంగైన  అంగుళీమాలుడు గానో, వాల్మీకి గానో - వున్నాడని అనుకోవాల్సిన పని లేదు.  వారిని మారనివ్వాలి.

మరి - ఈ రోజు మాట కొద్దాం.

ఈ రోజు - లంచ గొండులుగా వున్న వారంతా మారుతారా? మారరా? అస్సలు మారరనుకుంటే  -  ఈ నిరాహార దీక్షలు, ఈ లోక్ పాల్ లు - యివన్నీ ఎందుకు? లోక్ పాల్ వ్యవస్థనే - లంచ గొండి వ్యవస్థగా మారుతుందా?  చెప్పలేం. కానీ -

మనం మారాలి. మారి తీరాలి.  మన మానవ విలువలు మారితే - లంచగొండి తనం పోతుంది. లోక్ పాల్ వున్నా, లేకున్నా పోతుంది. మనం మారక పోతే - యిప్పటి పోలీసు వ్యవస్థ లాగా - అదీ వొక ప్రమాదంగా మారొచ్చు. అయినా - లోక్ పాల్ వ్యవస్థ కావాలి. ఎవడో వొకడు - టీ. ఎన్.  శేషన్ - లాగా వచ్చి - వ్యవస్థను ప్రక్షాళనం చెయ్యొచ్చు. అదండీ మన ఆశ.

నిజానికి - మనం - మన విద్యా వ్యవస్థలోనే - మనుషులను - మహనీయులుగా మార్చాలి. వూరికే - ఫిజిక్సు, కెమిస్ట్రీ, లెక్కలు, బయాలజీ తెలుసుకుంటే - మర మనుషులుగా మారిపోతాం.  మానవులుగా మారాలి. కొంత మందైనా - మహనీయులుగా మారాలి.  అందుకు అధ్యాపకులే కృషి చేయాలి. 

ఈ మధ్య -వొక మంచి ఆలోచన చాలా మంది చెబుతున్నారు. భారతీయ అధ్యాపక సర్వీసు - అని వొక ఉన్నత శ్రేణి సర్వీసు నెలకొల్పాలని. అది - అత్యున్నత ప్రమాణాలు, మంచి జీతాలతో సహా వుండాలని.  యిది - ఎంత త్వరగా వస్తే - దేశం అంత త్వరగా బాగు పడుతుంది. యిది వొక  గొప్ప మౌలికమైన మార్పు గా వుంటుంది. చదివే వారు అందరూ - దీన్ని గురించి తమ అభిప్రాయాలను - ప్రతి వార్తా పత్రికకు - ప్రభుత్వానికి రాస్తే - బాగుంటుంది.

సరే - వొక  కొస మెరుపు- నరేంద్ర మోడీ గారు - సద్భావానా మిషన్ - అని మూడు రోజుల నిరశన వ్రతం  చేస్తున్నారు. వారి పాలన - అద్భుతంగా వుందని - యిది వరలో - చాలా మంది అన్నారు. యిప్పుడు సాక్షాత్తూ అమెరికా కాంగ్రెసు వారే అన్నారు. వారికి నరేంద్ర  మోడీ గారు అస్సలు నచ్చరు. కానీ వారే యిప్పుడు - మోడీ గారి పాలన అద్భుతంగా వుందన్నారు.  

అయినా, 2001 -02 - ఆ మధ్యలో గుజరాత్ లో -  జరిగిన మత కలహాల్లో - రెండు వైపుల వారూ - అల్లర్లు చేసారు. అప్పట్లో - మోడీ గారు - వాటిని అణచడానికి - తగిన కృషి చేయలేదని వారిపై ఆరోపణ.  వుండొచ్చు.

కానీ - యిప్పుడు పదేళ్ళు గడిచాయి. ఈ పదేళ్ళలో - వారు అద్భుతమైన పాలన యిచ్చారు. ఈ పదేళ్ళలో - మత కలహాలు అక్కడ జరగలేదు. మరి మిగతా రాష్ట్రాలన్నింటిలో - జరిగాయి.  మన రాష్ట్రంలో కూడా జరిగాయి. మరి, వీరు, వారిని, పదేళ్ళ క్రితం నాటి మత  కలహాల గురించే గుచ్చడం -గురివింద గింజ తన క్రింద నున్న నలుపు మరిచిపోవడం లాగా వుంది.

డిల్లీ, మహారాష్ట్ర, యు.పీ, ఆంధ్ర లతో సహా - అన్ని రాష్ట్రాలలో జరిగిన, జరుగుతున్న మత కలహాలను వదిలేసి - పదేళ్ళ నాటి కలహాలను - అదీ - గుజరాత్ కలహాలను - దాన్లోనూ - వొకటిని మరిచి పోయి - మరొక్క దాన్ని గురింఛి మాత్రం    ప్రశ్నిస్తూ వుండడం - సబబుగా తోచడం లేదు.

గుజరాత్ లో - అందరినీ - సమైక్య పరుస్తున్నాను - అని అనే వారిని - ఎందుకు నిరుత్సాహ పరచాలి.

మోడీ గారి మంచి పాలనలో - యిదీ వొక భాగంగా - ఎందుకు తీసుకో రాదు. రాజకీయాలు మరెక్కడైనా వుండనీయండి. సమైక్యతా వాదం, లంచగొండితనానికి ప్రతిగా పోరాటం - లాంటి విషయాల్లో - దేశమంతా వొకటి కావాలి. 

విభజించి పాలించే రాజకీయ వాదులు చాలా ఎక్కువగా ఉన్న  మన దేశంలో - వొక్క సమైక్యతా వాది వచ్చినా మంచిదే.


వారికి - గాంధీకి పోలిక లేదు. వారికి అన్నా కు పోలిక లేదు లాంటి - వాదాలు అనవసరం. మనకు సమైక్యత కావాలి. మతవాదం, జాతివాదం వద్దు.   అవి వద్దని గుజరాత్ లో అందరూ అనడం, ముఖ్యంగా బీ.జే.పీ. వారనడం - ఈ దేశానికి చాలా మంచిదనే  నా  భావన. 

మళ్ళీ గాంధీ రాడు. మోడీ వస్తే తప్పు లేదు. మరి వారు ప్రైం మినిస్టరు కావాల్నా, వద్దా -  ఈ చర్చ అనవసరం. వొక వేళ రాహుల్ గాంధీ గారు - యింత కంటే గొప్ప పని చేస్తే  వారూ రావచ్చు. నితీష్ కుమార్ గారు గొప్ప పనులు చేస్తే - వారూ రావచ్చు. మన దేశానికి - నాలుగైదు ప్రత్యామ్నాయాలుంటే మంచిదే కదా. 

దురదృష్ట వశాత్తూ - ఈ రోజు - వొక్కరు కూడా లేదు.   మన వోటులో - "వీరెవరూ నాకు వద్దు"  అని మనం పోరాడ వలసిన  దుస్థితిలో మనం వున్నాం. అది పోయి - మనకు - గొప్ప నాయకులు వస్తారని - వీరైతే మంచిది - వారైతే యింకా మంచిది అనగలిగిన స్థితి రావాలి - అని ఆశిద్దాం.

= మీ 
వుప్పలధడియం విజయమోహన్