అంగుళీమాలుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అంగుళీమాలుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, సెప్టెంబర్ 2011, ఆదివారం

అంగుళీమాలుడు = బుద్ధుడు = సమైక్యతా వాదం = లంచగొండితనానికి ప్రతిగా పోరాటం = నరేంద్ర మోడీ


బుద్ధుడి కాలంలో  అంగుళీమాలుడు అనే గజ దొంగ వుండే వాడట. వాడు దొంగ మాత్రమే కాదు. 999  మందిని చంపి వారి వేళ్ళను హారంగా తన మెడలో వేసుకు తిరిగే వాడట.

వాడు ఎక్కడో కొండల్లో , కీకారణ్యం మధ్య - వుండే వాడు. వాడి భయంతో అటువైపు ఎవరూ వెళ్ళే వారు కాదు.
      
వొక సారి బుద్ధుడు  అటు వైపుగా వొక గ్రామానికి వెళ్ళ వలసి వచ్చింది.

శిష్యులు, అనుయాయులు అంతా భయపడ్డారు.

అందరూ - బుద్ధుడితో  అటువైపు పోనే పోవద్దని ఎంతగానో చెప్పారు.

కానీ బుద్ధుడు విన లేదు. అంగుళీమాలుడు కొండ పైన వుంటే - నా పనీ అక్కడే - అంటూ బయల్దేరాడు.

శిష్యులు వేరే మార్గం తోచక - బుద్ధుడి వెనుకే - బయల్దేరారు.

కొండ పైన - వొక చోట - దూరం నుండి  అంగుళీమాలుడు - వీరిని చూడనే చూసాడు.

మరి శిష్యులకు  అడుగు ముందుకు పడ లేదు. భయంతో - వున్న చోటనే నిలిచి పోయారు.

కానీ - బుద్ధుడు చిరునవ్వుతో - ముందుకు  సాగాడు.

అంగుళీమాలుడు - బుద్ధుడిని చూసాడు. వాడిలో - ఏదో మార్పు. ఏదో కలవరం.

వెయ్యో వాడిని చంపాలి. కానీ - 

ఇతడిని చూస్తే చాలా మంచివాడి లాగా వున్నాడు. వెయ్యో వాడిగా - యింత మంచి వాడిని - ఎలా చంపడం?

యిదీ అంగుళీమాలుడిలో  - ద్వైధీభావం.

అందుకని దూరం నుండే అరిచాడు - వెనక్కు పారిపో - లేదంటే చస్తావు.... పారిపో - లేదంటే చస్తావు.

బుద్ధుడు ముందుకు పోతూనే వున్నాడు.     అంగుళీమాలుడిని చూసి నవ్వుతూ అరిచాడు.

పారిపోతున్నది నీవే. యిక పారిపోకు. నేను వస్తున్నాను - అని.
అంగుళీమాలుడికి యిది అర్థం కాలేదు. నేను పారిపోతున్నానా? యిక పారిపోకూడదా?  ఏమంటున్నాడు ఇతను?

బుద్ధుడి మొహం లోని ప్రశాంతత - ఏదో ఆకర్షణ - అతడ్ని అక్కడే నిల బెట్టింది. జీవితంలో ఎప్పుడూ అనుభవించని అల్లకల్లోలం అతడి మనసులో.

ఏదో జరగ బోతూ  వుంది తన జీవితంలో. ఏదో  తన దగ్గర లేనిది - ఈ బుద్ధుడి దగ్గర వుంది. అది తనకూ కావాలి. అంత మాత్రం తెలుస్తూ వుంది. 

అయినా - ఏదో భయం. పారిపో. దగ్గర రాకు - అని అరుస్తున్నాడు.

బుద్ధుడూ - నువ్వు పారిపోకు. నేను వస్తున్నాను - అని దగ్గరకు వచ్చేస్తున్నాడు.

కాస్సేపట్లో - యిద్దరూ ముఖాముఖిగా - నిలబడ్డారు.

బుద్ధుడి మొహంలో ప్రశాంతత , చిరునవ్వు.  అంగుళీమాలుడి మనస్సులో - ఏదో కలవరం. ఏదో కావాలి తనకు. ఏదో తెలుస్తో వుంది తనకు.  విధి తన పని తాను చేస్తూ వుంది.

బుద్ధుడు ఏం చెప్పాడో, అంగుళీమాలుడు - ఏం విన్నాడో - శిష్యులకు తెలీదు.  తెలిసిందల్లా - అంగుళీమాలుడు బుద్ధుడి శిష్యుడు గా మారి పోయాడు.

తరువాత - బుద్ధుడు శిష్యులతో - ఏదో  రాజ్యానికి వెడతాడు. అక్కడ - శిష్యులందరూ భిక్షాటనకు వెడతారు.   అంగుళీమాలుడు కూడా.

రాజ్యంలో అందరూ చూసారు.   అంగుళీమాలుడు - అంటే - అందరికీ భయం.వణుకు.

అంగుళీమాలుడిపై - రాళ్ళు విసిరారు. అంగుళీమాలుడిలో యిప్పుడు భయం లేదు. ద్వేషం లేదు. భవతి బిక్షాం దేహి  - అంటూ , రాళ్ళ దెబ్బలు తింటూ - ముందుకు సాగాడు. 

యిప్పుడు  అంగుళీమాలుడిలో - గజ దొంగ లేదు.హంతకుడు లేదు. అది ఎప్పటి మాటో.

యిప్పుడు వున్నది - వొక మహర్షి. వొక యోగి. 

కానీ - ప్రజలకు అది తెలీదు. రాళ్ళు విసురుతూనే వున్నారు. రాళ్ళ దెబ్బలకు అంగుళీమాలుడి శరీరం వాలి పోయింది.  శిష్యులు పరుగెత్తి వెళ్లి - బుద్ధుడికి చెప్పారు. బుద్ధుడు వచ్చాడు.

అంగుళీమాలుడి శిరస్సును  - తన వొడిలో పెట్టుకున్నాడు. బాధగా వుందా - అని అడిగాడు. 

అంగుళీమాలుడు - లేదన్నాడు. నమస్కారం చేసాడు. బుద్ధుడిని చూస్తూ, బుద్ధుడి వొడిలో ప్రాణాలు వదిలాడు.

కొన్ని వేల, లక్షల యేండ్ల క్రితం వేట గాడుగా, దొంగగా వున్న - వాల్మీకి కూడా యిలాగే -  మహర్షి గా మారాడు - నారద మహర్షి మాటలతో.

రామాయణం రాసింది - దొంగగా వున్న వాల్మీకా? మహర్షి వాల్మీకా?

బుద్ధుడి వొడిలో- శిరస్సు వాల్చింది - దొంగ గా వున్న అంగుళీమాలుడా ? మహర్షి ఐన  అంగుళీమాలుడా ? 

యిదంతా ఎందుకంటే - మనుషులు మారుతారు. వారిని మారనివ్వాలి. మారే పరిస్థితులు కల్పించాలి. యిరవై ఏళ్ళ క్రితం చూసిన వాడు యింకా గజ దొంగైన  అంగుళీమాలుడు గానో, వాల్మీకి గానో - వున్నాడని అనుకోవాల్సిన పని లేదు.  వారిని మారనివ్వాలి.

మరి - ఈ రోజు మాట కొద్దాం.

ఈ రోజు - లంచ గొండులుగా వున్న వారంతా మారుతారా? మారరా? అస్సలు మారరనుకుంటే  -  ఈ నిరాహార దీక్షలు, ఈ లోక్ పాల్ లు - యివన్నీ ఎందుకు? లోక్ పాల్ వ్యవస్థనే - లంచ గొండి వ్యవస్థగా మారుతుందా?  చెప్పలేం. కానీ -

మనం మారాలి. మారి తీరాలి.  మన మానవ విలువలు మారితే - లంచగొండి తనం పోతుంది. లోక్ పాల్ వున్నా, లేకున్నా పోతుంది. మనం మారక పోతే - యిప్పటి పోలీసు వ్యవస్థ లాగా - అదీ వొక ప్రమాదంగా మారొచ్చు. అయినా - లోక్ పాల్ వ్యవస్థ కావాలి. ఎవడో వొకడు - టీ. ఎన్.  శేషన్ - లాగా వచ్చి - వ్యవస్థను ప్రక్షాళనం చెయ్యొచ్చు. అదండీ మన ఆశ.

నిజానికి - మనం - మన విద్యా వ్యవస్థలోనే - మనుషులను - మహనీయులుగా మార్చాలి. వూరికే - ఫిజిక్సు, కెమిస్ట్రీ, లెక్కలు, బయాలజీ తెలుసుకుంటే - మర మనుషులుగా మారిపోతాం.  మానవులుగా మారాలి. కొంత మందైనా - మహనీయులుగా మారాలి.  అందుకు అధ్యాపకులే కృషి చేయాలి. 

ఈ మధ్య -వొక మంచి ఆలోచన చాలా మంది చెబుతున్నారు. భారతీయ అధ్యాపక సర్వీసు - అని వొక ఉన్నత శ్రేణి సర్వీసు నెలకొల్పాలని. అది - అత్యున్నత ప్రమాణాలు, మంచి జీతాలతో సహా వుండాలని.  యిది - ఎంత త్వరగా వస్తే - దేశం అంత త్వరగా బాగు పడుతుంది. యిది వొక  గొప్ప మౌలికమైన మార్పు గా వుంటుంది. చదివే వారు అందరూ - దీన్ని గురించి తమ అభిప్రాయాలను - ప్రతి వార్తా పత్రికకు - ప్రభుత్వానికి రాస్తే - బాగుంటుంది.

సరే - వొక  కొస మెరుపు- నరేంద్ర మోడీ గారు - సద్భావానా మిషన్ - అని మూడు రోజుల నిరశన వ్రతం  చేస్తున్నారు. వారి పాలన - అద్భుతంగా వుందని - యిది వరలో - చాలా మంది అన్నారు. యిప్పుడు సాక్షాత్తూ అమెరికా కాంగ్రెసు వారే అన్నారు. వారికి నరేంద్ర  మోడీ గారు అస్సలు నచ్చరు. కానీ వారే యిప్పుడు - మోడీ గారి పాలన అద్భుతంగా వుందన్నారు.  

అయినా, 2001 -02 - ఆ మధ్యలో గుజరాత్ లో -  జరిగిన మత కలహాల్లో - రెండు వైపుల వారూ - అల్లర్లు చేసారు. అప్పట్లో - మోడీ గారు - వాటిని అణచడానికి - తగిన కృషి చేయలేదని వారిపై ఆరోపణ.  వుండొచ్చు.

కానీ - యిప్పుడు పదేళ్ళు గడిచాయి. ఈ పదేళ్ళలో - వారు అద్భుతమైన పాలన యిచ్చారు. ఈ పదేళ్ళలో - మత కలహాలు అక్కడ జరగలేదు. మరి మిగతా రాష్ట్రాలన్నింటిలో - జరిగాయి.  మన రాష్ట్రంలో కూడా జరిగాయి. మరి, వీరు, వారిని, పదేళ్ళ క్రితం నాటి మత  కలహాల గురించే గుచ్చడం -గురివింద గింజ తన క్రింద నున్న నలుపు మరిచిపోవడం లాగా వుంది.

డిల్లీ, మహారాష్ట్ర, యు.పీ, ఆంధ్ర లతో సహా - అన్ని రాష్ట్రాలలో జరిగిన, జరుగుతున్న మత కలహాలను వదిలేసి - పదేళ్ళ నాటి కలహాలను - అదీ - గుజరాత్ కలహాలను - దాన్లోనూ - వొకటిని మరిచి పోయి - మరొక్క దాన్ని గురింఛి మాత్రం    ప్రశ్నిస్తూ వుండడం - సబబుగా తోచడం లేదు.

గుజరాత్ లో - అందరినీ - సమైక్య పరుస్తున్నాను - అని అనే వారిని - ఎందుకు నిరుత్సాహ పరచాలి.

మోడీ గారి మంచి పాలనలో - యిదీ వొక భాగంగా - ఎందుకు తీసుకో రాదు. రాజకీయాలు మరెక్కడైనా వుండనీయండి. సమైక్యతా వాదం, లంచగొండితనానికి ప్రతిగా పోరాటం - లాంటి విషయాల్లో - దేశమంతా వొకటి కావాలి. 

విభజించి పాలించే రాజకీయ వాదులు చాలా ఎక్కువగా ఉన్న  మన దేశంలో - వొక్క సమైక్యతా వాది వచ్చినా మంచిదే.


వారికి - గాంధీకి పోలిక లేదు. వారికి అన్నా కు పోలిక లేదు లాంటి - వాదాలు అనవసరం. మనకు సమైక్యత కావాలి. మతవాదం, జాతివాదం వద్దు.   అవి వద్దని గుజరాత్ లో అందరూ అనడం, ముఖ్యంగా బీ.జే.పీ. వారనడం - ఈ దేశానికి చాలా మంచిదనే  నా  భావన. 

మళ్ళీ గాంధీ రాడు. మోడీ వస్తే తప్పు లేదు. మరి వారు ప్రైం మినిస్టరు కావాల్నా, వద్దా -  ఈ చర్చ అనవసరం. వొక వేళ రాహుల్ గాంధీ గారు - యింత కంటే గొప్ప పని చేస్తే  వారూ రావచ్చు. నితీష్ కుమార్ గారు గొప్ప పనులు చేస్తే - వారూ రావచ్చు. మన దేశానికి - నాలుగైదు ప్రత్యామ్నాయాలుంటే మంచిదే కదా. 

దురదృష్ట వశాత్తూ - ఈ రోజు - వొక్కరు కూడా లేదు.   మన వోటులో - "వీరెవరూ నాకు వద్దు"  అని మనం పోరాడ వలసిన  దుస్థితిలో మనం వున్నాం. అది పోయి - మనకు - గొప్ప నాయకులు వస్తారని - వీరైతే మంచిది - వారైతే యింకా మంచిది అనగలిగిన స్థితి రావాలి - అని ఆశిద్దాం.

= మీ 
వుప్పలధడియం విజయమోహన్