బుద్ధుడి కాలంలో అంగుళీమాలుడు అనే గజ దొంగ వుండే వాడట. వాడు దొంగ మాత్రమే కాదు. 999 మందిని చంపి వారి వేళ్ళను హారంగా తన మెడలో వేసుకు తిరిగే వాడట.
వాడు ఎక్కడో కొండల్లో , కీకారణ్యం మధ్య - వుండే వాడు. వాడి భయంతో అటువైపు ఎవరూ వెళ్ళే వారు కాదు.
వొక సారి బుద్ధుడు అటు వైపుగా వొక గ్రామానికి వెళ్ళ వలసి వచ్చింది.
శిష్యులు, అనుయాయులు అంతా భయపడ్డారు.
అందరూ - బుద్ధుడితో అటువైపు పోనే పోవద్దని ఎంతగానో చెప్పారు.
కానీ బుద్ధుడు విన లేదు. అంగుళీమాలుడు కొండ పైన వుంటే - నా పనీ అక్కడే - అంటూ బయల్దేరాడు.
కొండ పైన - వొక చోట - దూరం నుండి అంగుళీమాలుడు - వీరిని చూడనే చూసాడు.
మరి శిష్యులకు అడుగు ముందుకు పడ లేదు. భయంతో - వున్న చోటనే నిలిచి పోయారు.
కానీ - బుద్ధుడు చిరునవ్వుతో - ముందుకు సాగాడు.
అంగుళీమాలుడు - బుద్ధుడిని చూసాడు. వాడిలో - ఏదో మార్పు. ఏదో కలవరం.
వెయ్యో వాడిని చంపాలి. కానీ -
ఇతడిని చూస్తే చాలా మంచివాడి లాగా వున్నాడు. వెయ్యో వాడిగా - యింత మంచి వాడిని - ఎలా చంపడం?
యిదీ అంగుళీమాలుడిలో - ద్వైధీభావం.
అందుకని దూరం నుండే అరిచాడు - వెనక్కు పారిపో - లేదంటే చస్తావు.... పారిపో - లేదంటే చస్తావు.
బుద్ధుడు ముందుకు పోతూనే వున్నాడు. అంగుళీమాలుడిని చూసి నవ్వుతూ అరిచాడు.
పారిపోతున్నది నీవే. యిక పారిపోకు. నేను వస్తున్నాను - అని.
అంగుళీమాలుడికి యిది అర్థం కాలేదు. నేను పారిపోతున్నానా? యిక పారిపోకూడదా? ఏమంటున్నాడు ఇతను?
బుద్ధుడి మొహం లోని ప్రశాంతత - ఏదో ఆకర్షణ - అతడ్ని అక్కడే నిల బెట్టింది. జీవితంలో ఎప్పుడూ అనుభవించని అల్లకల్లోలం అతడి మనసులో.
ఏదో జరగ బోతూ వుంది తన జీవితంలో. ఏదో తన దగ్గర లేనిది - ఈ బుద్ధుడి దగ్గర వుంది. అది తనకూ కావాలి. అంత మాత్రం తెలుస్తూ వుంది.
అయినా - ఏదో భయం. పారిపో. దగ్గర రాకు - అని అరుస్తున్నాడు.
బుద్ధుడూ - నువ్వు పారిపోకు. నేను వస్తున్నాను - అని దగ్గరకు వచ్చేస్తున్నాడు.
కాస్సేపట్లో - యిద్దరూ ముఖాముఖిగా - నిలబడ్డారు.
బుద్ధుడి మొహంలో ప్రశాంతత , చిరునవ్వు. అంగుళీమాలుడి మనస్సులో - ఏదో కలవరం. ఏదో కావాలి తనకు. ఏదో తెలుస్తో వుంది తనకు. విధి తన పని తాను చేస్తూ వుంది.
బుద్ధుడు ఏం చెప్పాడో, అంగుళీమాలుడు - ఏం విన్నాడో - శిష్యులకు తెలీదు. తెలిసిందల్లా - అంగుళీమాలుడు బుద్ధుడి శిష్యుడు గా మారి పోయాడు.
తరువాత - బుద్ధుడు శిష్యులతో - ఏదో రాజ్యానికి వెడతాడు. అక్కడ - శిష్యులందరూ భిక్షాటనకు వెడతారు. అంగుళీమాలుడు కూడా.
రాజ్యంలో అందరూ చూసారు. అంగుళీమాలుడు - అంటే - అందరికీ భయం.వణుకు.
అంగుళీమాలుడిపై - రాళ్ళు విసిరారు. అంగుళీమాలుడిలో యిప్పుడు భయం లేదు. ద్వేషం లేదు. భవతి బిక్షాం దేహి - అంటూ , రాళ్ళ దెబ్బలు తింటూ - ముందుకు సాగాడు.
యిప్పుడు అంగుళీమాలుడిలో - గజ దొంగ లేదు.హంతకుడు లేదు. అది ఎప్పటి మాటో.
యిప్పుడు వున్నది - వొక మహర్షి. వొక యోగి.
కానీ - ప్రజలకు అది తెలీదు. రాళ్ళు విసురుతూనే వున్నారు. రాళ్ళ దెబ్బలకు అంగుళీమాలుడి శరీరం వాలి పోయింది. శిష్యులు పరుగెత్తి వెళ్లి - బుద్ధుడికి చెప్పారు. బుద్ధుడు వచ్చాడు.
అంగుళీమాలుడి శిరస్సును - తన వొడిలో పెట్టుకున్నాడు. బాధగా వుందా - అని అడిగాడు.
అంగుళీమాలుడు - లేదన్నాడు. నమస్కారం చేసాడు. బుద్ధుడిని చూస్తూ, బుద్ధుడి వొడిలో ప్రాణాలు వదిలాడు.
కొన్ని వేల, లక్షల యేండ్ల క్రితం వేట గాడుగా, దొంగగా వున్న - వాల్మీకి కూడా యిలాగే - మహర్షి గా మారాడు - నారద మహర్షి మాటలతో.
రామాయణం రాసింది - దొంగగా వున్న వాల్మీకా? మహర్షి వాల్మీకా?
బుద్ధుడి వొడిలో- శిరస్సు వాల్చింది - దొంగ గా వున్న అంగుళీమాలుడా ? మహర్షి ఐన అంగుళీమాలుడా ?
యిదంతా ఎందుకంటే - మనుషులు మారుతారు. వారిని మారనివ్వాలి. మారే పరిస్థితులు కల్పించాలి. యిరవై ఏళ్ళ క్రితం చూసిన వాడు యింకా గజ దొంగైన అంగుళీమాలుడు గానో, వాల్మీకి గానో - వున్నాడని అనుకోవాల్సిన పని లేదు. వారిని మారనివ్వాలి.
మరి - ఈ రోజు మాట కొద్దాం.
ఈ రోజు - లంచ గొండులుగా వున్న వారంతా మారుతారా? మారరా? అస్సలు మారరనుకుంటే - ఈ నిరాహార దీక్షలు, ఈ లోక్ పాల్ లు - యివన్నీ ఎందుకు? లోక్ పాల్ వ్యవస్థనే - లంచ గొండి వ్యవస్థగా మారుతుందా? చెప్పలేం. కానీ -
మనం మారాలి. మారి తీరాలి. మన మానవ విలువలు మారితే - లంచగొండి తనం పోతుంది. లోక్ పాల్ వున్నా, లేకున్నా పోతుంది. మనం మారక పోతే - యిప్పటి పోలీసు వ్యవస్థ లాగా - అదీ వొక ప్రమాదంగా మారొచ్చు. అయినా - లోక్ పాల్ వ్యవస్థ కావాలి. ఎవడో వొకడు - టీ. ఎన్. శేషన్ - లాగా వచ్చి - వ్యవస్థను ప్రక్షాళనం చెయ్యొచ్చు. అదండీ మన ఆశ.
నిజానికి - మనం - మన విద్యా వ్యవస్థలోనే - మనుషులను - మహనీయులుగా మార్చాలి. వూరికే - ఫిజిక్సు, కెమిస్ట్రీ, లెక్కలు, బయాలజీ తెలుసుకుంటే - మర మనుషులుగా మారిపోతాం. మానవులుగా మారాలి. కొంత మందైనా - మహనీయులుగా మారాలి. అందుకు అధ్యాపకులే కృషి చేయాలి.
ఈ మధ్య -వొక మంచి ఆలోచన చాలా మంది చెబుతున్నారు. భారతీయ అధ్యాపక సర్వీసు - అని వొక ఉన్నత శ్రేణి సర్వీసు నెలకొల్పాలని. అది - అత్యున్నత ప్రమాణాలు, మంచి జీతాలతో సహా వుండాలని. యిది - ఎంత త్వరగా వస్తే - దేశం అంత త్వరగా బాగు పడుతుంది. యిది వొక గొప్ప మౌలికమైన మార్పు గా వుంటుంది. చదివే వారు అందరూ - దీన్ని గురించి తమ అభిప్రాయాలను - ప్రతి వార్తా పత్రికకు - ప్రభుత్వానికి రాస్తే - బాగుంటుంది.
సరే - వొక కొస మెరుపు- నరేంద్ర మోడీ గారు - సద్భావానా మిషన్ - అని మూడు రోజుల నిరశన వ్రతం చేస్తున్నారు. వారి పాలన - అద్భుతంగా వుందని - యిది వరలో - చాలా మంది అన్నారు. యిప్పుడు సాక్షాత్తూ అమెరికా కాంగ్రెసు వారే అన్నారు. వారికి నరేంద్ర మోడీ గారు అస్సలు నచ్చరు. కానీ వారే యిప్పుడు - మోడీ గారి పాలన అద్భుతంగా వుందన్నారు.
అయినా, 2001 -02 - ఆ మధ్యలో గుజరాత్ లో - జరిగిన మత కలహాల్లో - రెండు వైపుల వారూ - అల్లర్లు చేసారు. అప్పట్లో - మోడీ గారు - వాటిని అణచడానికి - తగిన కృషి చేయలేదని వారిపై ఆరోపణ. వుండొచ్చు.
కానీ - యిప్పుడు పదేళ్ళు గడిచాయి. ఈ పదేళ్ళలో - వారు అద్భుతమైన పాలన యిచ్చారు. ఈ పదేళ్ళలో - మత కలహాలు అక్కడ జరగలేదు. మరి మిగతా రాష్ట్రాలన్నింటిలో - జరిగాయి. మన రాష్ట్రంలో కూడా జరిగాయి. మరి, వీరు, వారిని, పదేళ్ళ క్రితం నాటి మత కలహాల గురించే గుచ్చడం -గురివింద గింజ తన క్రింద నున్న నలుపు మరిచిపోవడం లాగా వుంది.
డిల్లీ, మహారాష్ట్ర, యు.పీ, ఆంధ్ర లతో సహా - అన్ని రాష్ట్రాలలో జరిగిన, జరుగుతున్న మత కలహాలను వదిలేసి - పదేళ్ళ నాటి కలహాలను - అదీ - గుజరాత్ కలహాలను - దాన్లోనూ - వొకటిని మరిచి పోయి - మరొక్క దాన్ని గురింఛి మాత్రం ప్రశ్నిస్తూ వుండడం - సబబుగా తోచడం లేదు.
గుజరాత్ లో - అందరినీ - సమైక్య పరుస్తున్నాను - అని అనే వారిని - ఎందుకు నిరుత్సాహ పరచాలి.
మోడీ గారి మంచి పాలనలో - యిదీ వొక భాగంగా - ఎందుకు తీసుకో రాదు. రాజకీయాలు మరెక్కడైనా వుండనీయండి. సమైక్యతా వాదం, లంచగొండితనానికి ప్రతిగా పోరాటం - లాంటి విషయాల్లో - దేశమంతా వొకటి కావాలి.
విభజించి పాలించే రాజకీయ వాదులు చాలా ఎక్కువగా ఉన్న మన దేశంలో - వొక్క సమైక్యతా వాది వచ్చినా మంచిదే.
వారికి - గాంధీకి పోలిక లేదు. వారికి అన్నా కు పోలిక లేదు లాంటి - వాదాలు అనవసరం. మనకు సమైక్యత కావాలి. మతవాదం, జాతివాదం వద్దు. అవి వద్దని గుజరాత్ లో అందరూ అనడం, ముఖ్యంగా బీ.జే.పీ. వారనడం - ఈ దేశానికి చాలా మంచిదనే నా భావన.
మళ్ళీ గాంధీ రాడు. మోడీ వస్తే తప్పు లేదు. మరి వారు ప్రైం మినిస్టరు కావాల్నా, వద్దా - ఈ చర్చ అనవసరం. వొక వేళ రాహుల్ గాంధీ గారు - యింత కంటే గొప్ప పని చేస్తే వారూ రావచ్చు. నితీష్ కుమార్ గారు గొప్ప పనులు చేస్తే - వారూ రావచ్చు. మన దేశానికి - నాలుగైదు ప్రత్యామ్నాయాలుంటే మంచిదే కదా.
దురదృష్ట వశాత్తూ - ఈ రోజు - వొక్కరు కూడా లేదు. మన వోటులో - "వీరెవరూ నాకు వద్దు" అని మనం పోరాడ వలసిన దుస్థితిలో మనం వున్నాం. అది పోయి - మనకు - గొప్ప నాయకులు వస్తారని - వీరైతే మంచిది - వారైతే యింకా మంచిది అనగలిగిన స్థితి రావాలి - అని ఆశిద్దాం.
= మీ
వుప్పలధడియం విజయమోహన్