చంద్రబాబు నేతృత్వంలో లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చంద్రబాబు నేతృత్వంలో లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, అక్టోబర్ 2014, బుధవారం

నిజమైన దీపావళికి - మన గమ్యాలేమిటి - రాష్ట్రానికి గమ్యం ఏమిటి ?- చంద్రబాబు గారు ఏం చెయ్యాలి?

 

నిజమైన దీపావళి

 
చేసే ప్రతి ప్రయత్నంలోనూ,  మనం విజయం పొందుతామని గ్యారంటీ ఏమీ లేదు . అప్పుడప్పుడూ వోటమి సహజం . మన ప్రతి విజయం వెనుక కొన్ని వోటములు వుండ వచ్చు . అది సిగ్గు పడాల్సిన  విషయం కాదు . అసలు ప్రయత్నమే  చెయ్యని వాడికి , విజయమేమిటి , వోటమి ఏమిటి ? జీవితమే అగమ్యం .
 
మనలో ప్రతి వొక్కరికీ , నిర్దిష్టమైన గమ్యం అవసరం . ఆ గమ్యం వైపు వెళ్ళడానికే ప్రయత్నం కావాలి . మన ప్రయత్నం యొక్క ఫలితం గెలుపో, వోటమో, ఏదైనా కావచ్చు . కానీ, మొదటి నుండి, తుది వరకు, గమ్యం చేరడానికి చెయ్యాల్సిన ప్రయత్నం చెయ్యడంలో మాత్రం మనం ఓడిపోకూడదు. ఇది చాలా ముఖ్యమైన , చాలా అందమైన మాట .
 
జీవితం లో  మనం చేసే ప్రయత్నమే మన విజయానికి మూలము. కట్ట కడపట వచ్చే విజయాన్నే కాదు, మన ప్రతి ప్రయత్నాన్నీ మనం ఆనందించాలి.  ఇదే శ్రీకృష్ణుడు వుపదేశించిన కర్మయోగం . కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన.
 
ప్రయత్నం మన బాధ్యత.  మనం ప్రయత్నం చెయ్యడంలో, మన బాధ్యతే, మన అధికారమే వుంది ; మన ప్రయత్నాలకు దేవుడు బాధ్యుడు కాదు.  కానీ, ఫలితం యిచ్చేవాడు మాత్రం ఆయనే . ఎందుకు, ఎప్పుడు, ఎలాంటి ఫలితం యిస్తాడో - అది మన యిష్ట  ప్రకారం  కాదు ; అది తన యిష్ట ప్రకారం యిస్తాడు .   

అందుకే, మన ప్రయత్నాన్ని - మనం పూర్తిగా మన బాధ్యతగా స్వీకరించి , దాన్ని అమలు చేస్తూ ఆనందించాలి. ఫలితం ఎలాగూ వస్తుంది . రాకుండా మాత్రం వుండదు . ఎప్పుడో, ఎలాగో - అది చెప్పడం కాస్త కష్టం. ఆ ఫలితం ఏదైనా , అదీ మనం ఆనందం తో అనుభవించాలి.
 
ఫలితాలు మన ప్రయత్నానుసారంగానే  వస్తూ వుంటాయి - కానీ , కాస్త ముందూ వెనుకలుగా. మనకు అక్కడే కాస్త తికమకగా వుంటుంది .   దాన్ని గురించి  పెద్దగా చింతించ కుండా తరువాత ప్రయత్నం మొదలు పెట్టేసేయ్యాలి ; అలా గమ్యం వైపు సాగిపోవడమే జీవితం .
 
అప్పుడప్పుడూ వెనక్కి తిరిగి చూడాలా వద్దా ? చూడొచ్చు. తప్పు లేదు.  ఇది వరకు మనం చేసిందేమిటి ? చెయ్యనిదేమిటి ? చెయ్యాల్సిందేమిటి ? యివి వొక్క సారి చూసుకుని ముందడుగు వెయ్యడంలో తప్పేమీ లేదు . 24 గంటలలో , వొక 5 నిముషాలు  ఈ పని చేస్తే , మిగతా 23 గంటలు, 55 నిముషాలు ప్రయోజనాత్మకంగా వుంటుంది .
 
స్టీఫెన్ కోవీ  గారు  - మీరు వేసే ప్రతి అడుగూ , గమ్యం వైపే వేస్తున్నారా , గమ్యానికి దూరంగా వేస్తున్నారా - అది సరి చూసుకుంటూ  వేయమంటారు.  గమ్యానికి దూరంగా వేసే ప్రతి అడుగూ, మనల్ని, విజయానికి దూరంగా తీసుకెడుతూ వుంటుంది. వాటికి ఫలితం  వుండదని  కాదు .  కానీ, అ ఫలితం  పెద్ద ప్రయోజన కారిగా వుండదు. మీరు నిచ్చెనను వెయ్యాల్సిన గోడకు వేస్తే , చెయ్యాల్సిన పనే చేస్తారు. మరో గోడకు వేస్తే, చెయ్యకూడని పని చేసేస్తారు. అవునా ! యిది మనం చెయ్యాల్సిన పనేనా, వెళ్ళాల్సిన మార్గమేనా అని అప్పుడప్పుడూ చూసుకోవాల్సిన అవసరం వుంది. లేదంటే, వినాయకుడిని చెయ్యబోయి, హనుమంతుడిని  చేసేస్తారు . అమెరికాకు వెడుతున్నామనుకుని అరేబియా కు వెళ్లి పోతారు. రోడ్ల మీద మార్గ దర్శక గుర్తులు అందుకే వున్నాయి . సముద్ర యానం లో దిక్సూచి అందుకే కావాలి . జీవన యానంలోనూ, గమ్యం తెలిపే దిక్సూచి మనకు కావాలి .  
 
అలాగే , స్టీఫెన్ కోవీ  "షార్పెన్  ది సా " అంటారు . అంటే , "మీలోని మేధా శక్తికి, మీ బుద్ధి కుశలత కు, మీ పనిముట్లకు  బాగా పదును పెట్టండి . అవి  బాగా పని చెయ్యగలిగేవిగా వుండేటట్టు  చూసుకోండి" అంటారు ఆయన. యిదే మాట గీతలో శ్రీకృష్ణుడూ అంటాడు  "యోగః కర్మసు కౌశలమ్" అని . అంటే మనం చెయ్యాల్సిన పనిని చాలా బాగా చెయ్యడమే యోగం అంటాడు . యిదే  భారతంలో అర్జునుడు మొదటి నుండీ చివరి వరకు చేశాడు. దీపాలు ఆరిపోతే , చీకట్లోనే భోజనం చేసిన అర్జునుడు , చీకట్లోనే అస్త్రవిద్యను కూడా నేర్చుకోవడానికి పూర్తి  ప్రయత్నం చేసి సఫలుడయ్యాడు .
 
మనం గమ్య మార్గం లో వెళ్ళాలంటే, దానికి తోడ్పాటుగా  శారీరక బలం, బుద్ధిబలం, దైవ సహకారం అన్నీ మనకు వుండాలి .మనం సాధారణంగా విజయానికి మూల సూత్రాలు  - లాంటివి  ఎన్నో చదువుతూ వుంటాము .  అసలు విజయం అంటే ఏమిటి ? పాండవులు యుద్ధంలో గెలవడం విజయమా? అది వారికి ఎంత మాత్రం సంతోషాన్ని యిచ్చింది ? సత్యభామ నరకాసురుడిని వధించడం విజయమా? అది ఆమెకు సంతోషాన్ని యిచ్చిందా ? కళింగ యుద్ధంలో అశోకుడి గెలుపు అతడికి సంతోషాన్ని యిచ్చిందా? 
 
విజయం సంతోషాన్ని యివ్వాలి.  అలా సంతోషం యివ్వని విజయం  ఎందుకు ? అది , గెలిచినా, వోడినట్టే కదా.  
 
మనసుల్ని గెలవడం చాలా గొప్ప విజయం . మనుషుల్ని గెలవడం చాలా చిన్న విజయం . నిజానికి , దీపావళి అంటే అదే . ఎంత మంది మనసుల్లో  దీపాలు వెలిగిస్తే అంత పండుగ ; అంత ఆనందం .  
 
మోడీ గారు స్వచ్చ భారత్ కావాలి, అది మనం తీసుకు రావాలి అంటారు . అది మొదట మన మనసుల్లో  ఆరంభం కావాలి. మనసుల్లోని కల్మషాన్ని తుడిచి పారెయ్యాలి . అది మనకు ఎంతో  ఆనందం యిచ్చే బృహత్ సాధన . రోజుకు  కనీసం రెండు  సంతోషాన్ని కలిగించే మంచి మాటలు, వారానికి వొక్కటైనా మంచి పని - చెప్పాలి , చెయ్యాలి అనుకుంటే జీవితానికి వొక గొప్ప గమ్యం ఏర్పడుతుంది .  అలా చేస్తున్న వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు .  ఇది చాలా అందమైన , కానీ , అతి సులభమైన గమ్యం . 
 
వొకాయన అన్నారు - "మా మోడీ గారు స్వచ్చ భారత్ అంటే , మా దేశం లోని కోట్లాది ప్రజలు చీపురు పట్టుకుని దేశాన్ని శుభ్రం చెయ్యడానికి బయలుదేరారు.  మా దేశం శుభ్రం అవుతోంది.  కానీ -  తుపాకీ పట్టుకోండి - అని ఆయన అంటే పాకీస్తాన్ వుగ్రవాదుల్లారా ,  మా ఎదుట మీరు నిలువగలరా ? ఎందుకు మీకీ వెన్నుపోటు తుంటరి చేష్టలు ?" 
 
జీవితంలో విజయానికి అర్థం తెలియని వారికి - నాకు రెండు కళ్ళు పోయినా పొరుగు వాడికి వొక కన్ను పోవాలి - అనుకునే మూర్ఖుడికి - మొదట అది తెలియజెప్పాలి .  
 
దీన్ని దాటి - మనలో ప్రతి వొక్కరూ , మన మన జీవితాలకు వొక గొప్ప గమ్యం ఏర్పరుచుకోవాలి.  
 
ఆనందంగా వుండడమే పెద్ద గమ్యం అయినా - దాన్ని సాధించడానికి అనుబంధంగా,  ఎన్నో గమ్యాలున్నాయి . శారీరకంగానూ , మానసికం గానూ ఆరోగ్యంగా వుండాలి. యిది వొక గమ్యం. ఆర్థికంగానూ ముందుకెళ్లాలి. యిదీ వొక గమ్యం . ఏవైనా కొన్ని విద్యలలో ప్రావీణ్యత సంపాదించాలి .యిదీ వొక గమ్యం .ఇవేవీ వద్దని మన వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు . మన ఋషులు గొప్ప శాస్త్ర వేత్తలు . సృష్టిలోని ఎన్నో రహస్యాలను పరిశోధించి కనుగొన్న వారు. మన ఆయుర్వేదం ఎంత గొప్పదో ! మన వాస్తు శాస్త్రం ఎంత గొప్పదో ! మన యోగ విజ్ఞానం ఎంత గొప్పదో ! మన తర్క శాస్త్రం , మన కర్మ సిద్దాంతం , మన గుణత్రయ విభాగ శాస్త్రం మన సంఖ్యా శాస్త్రం - దేని కదే గొప్పగా యీరోజుకూ ప్రకాశిస్తున్నాయి .  
 
కాకపోతే - తన్ను తాను తెలుసుకోవడం , తన మనసు పైన , తన శరీరం పైన విజయం సాధించడం - అన్నిటి కన్నా గొప్ప విజయం అన్నారు , మన వారు. వంద కోట్ల ప్రజల పైన అధికారం వుంది కానీ, నా మనసు పైన నాకు అధికారం లేదు, నా మనసు నా మాట విననంటుంది - అంటే , అది విజయం అవుతుందా ? అదే - అప్పటి దుర్యోధనుడి , రావణుడి  సమస్య . ఈ రోజుకూ అటువంటి వారందరికీ అదే సమస్య . 
 
మనసు పైన అధికారం వున్న వాడికి , ప్రకృతి  కూడా వశ వర్తి అవుతుందని మన వాళ్ళు గట్టిగా చెప్పారు. వారేం  అనుకుంటే అది చెయ్యడానికి ప్రకృతి  లోని అన్ని శక్తులూ  ముందుకు వస్తాయట.  యిలా జరగడం మనం ఈ రోజుకూ చూడొచ్చు . కాబట్టి, ప్రతి వొక్కరికీ , యిదే గొప్ప గమ్యం . 
 
సరే . రాజుకు ఎలాటి గమ్యం వుండాలి ? ప్రజలంతా , సకల, ఆయురారోగ్య ఆనంద, ఐశ్వర్యాలతో , మహా బుద్ధి మంతులుగా , మహా శక్తి మంతులుగా , సఖ్య భావంతో వుండాలనేగా ?
 
మన మోడీ గారు పీ. టీ. ఉషా గారిని గుజరాత్ కు ఆహ్వానించి , అక్కడ, అందరికీ ఆటలలో తర్ఫీదు యివ్వమని అడిగారు ఆమె కూడా వెంటనే వొప్పుకున్నారు . మరి మన చంద్రబాబు కూడా  మోడీ గారికి తక్కువేమీ కాదు కదా ! అందువలన , వారు కూడా , మల్ల యుద్ధం , జిమ్నాస్టిక్స్ లాంటి మంచి పోటీలలో తర్ఫీదు యివ్వగలిగే వాళ్ళని ఆంధ్రా కు పిలిస్తే  ఆంధ్రులలో - శారీరక ఆరోగ్యమూ , అన్ని రంగాలలో ముందుకు పోవాలన్న బలమైన కోరిక కలగడానికి అనువుగా , ప్రోత్సాహంగా వుంటుంది.  లేదంటే - BP , చక్కర వ్యాధి లాంటి అనారోగ్యాలు మన వాళ్ళలో ఎక్కువవుతూ వుంటాయి .  
 
యిప్పుడు హర్యానా లో - అటువంటి మంచి , ప్రోత్సాహ కరమైన వాతావరణం  వుంది . మన రాష్ట్రంలో లేదు . చంద్రబాబు నాయకత్వంలో - ఆయన ప్రతి రంగంలో - హేమా హేమీ లను పిలిచి - మన వారికి ట్రైనింగ్ యిప్పిస్తే - మన రాష్ట్రం ఎంతో బాగు పడుతుంది .  

 
 
మన రాష్ట్రం లోని ప్రతి వొక్కరూ  - ఆరోగ్యంతో , వుత్సాహంతో ముందుకు సాగిపోయే వారయితే , అంతకు మించిన దీపావళి మరొక్కటి వుంటుందా ? వచ్చే ఆసియాడ్ , ఒలింపిక్స్  లాంటి పోటీలలో , ఆంధ్రులు ఎక్కువ వుంటారనీ , మన రాష్ట్రానికి గొప్ప పేరు తెస్తారనీ - మనం ఆశిద్దాం . ఈ మాటలు చంద్ర బాబు గారు వినాలి ; దానికి తగిన చర్యలు తీసుకోవాలి అని - ఆశిద్దాం .
 
ఇలాంటి గొప్ప గమ్యం పెట్టుకుంటే - రాష్ట్రం - అన్ని రంగాలలో , అభివృద్ధి చెందుతుంది - అందులో సందేహం లేదు . 
 
అది మనమందరం కలిసి సాధిద్దామని ఆశిస్తూ - దీపావళికి మీకందరికీ , నా హార్దిక శుభాకాంక్షలు . 
= మీ 
 
వుప్పలధడియం విజయమోహన్ 
 
 
 

20, మే 2014, మంగళవారం

చంద్రబాబు నేతృత్వంలో - జరగాల్సిం దేమిటి ? ఏది మొదట? ఏది ముఖ్యం ? ఏది సులభం?


 అభివృద్ధి పథం లో 

మన రాష్ట్రం

ఎన్నికలు ముగిసిపోయాయి . వాటి ఫలితాలూ వచ్చేశాయి .

ఇవి రెండూ, నాకు బాగా నచ్చినట్టే వచ్చాయి . ఆ మాటకొస్తే , మనందరికీ బాగా నచ్చిన వాళ్ళే అధికారం లోకి వచ్చారని చెప్పుకోవచ్చు .

సీమాంధ్ర లో -  చంద్రబాబు నాయుడు గారి తెలుగు దేశం పార్టీ కి 102 సీట్లు , వారి తో బాటు పోటీ చేసిన భా.జ.పా. కు 4 అసెంబ్లీ స్థానాలు రాగా , జగన్ గారి పార్టీ కి 67 సీట్లు వచ్చాయి . కాంగ్రెసుకు ఏమీ రాలేదు . అలాగే - పార్లమెంటు స్థానాలకు, సీమాంధ్ర నుండి TDP + BJP  కూటమికి 17 స్థానాలు రాగా మిగతా 8  YSR కాంగ్రెసుకు వచ్చాయి .ప్రజలు చంద్ర , నరేంద్రులకు  బ్రహ్మ రథం పట్టి గెలిపించేశారు.  

యిక చంద్రబాబు గారు యిక్కడ , నరేంద్రుడు అక్కడ - తమ పరిపాలనా దక్షతను చూపడమే  తరువాయి .

సీమాంధ్ర లోని మొదటి పెద్ద పనులేమి ?

నా ఉద్దేశంలో - కరెంటు కొరత వెంటనే తగ్గించాల్సి వుంది . కరెంటు లేకుండా పరిశ్రమలు కానీ , వ్యవసాయం కానీ ఏదీ అభివృద్ధి చెయ్యలేము . పిల్లల చదువులు, పెద్దల ఆరోగ్యం అన్నీ కుంటు పడతాయి . ఆ విషయంలో చంద్రబాబు గారు మొదట తన దృష్టి సారించాలి .

(1) రాష్ట్రంలో - వున్న విద్యుత్తు కర్మాగారాలన్నీ సరిగా పని చేసే లాగు చూడాలి . నిజానికి దేశం అంతటా , ఎన్నో కర్మాగారాలలో - విద్యుదుత్పాదనకు సంసిద్ధంగా వున్న కర్మాగారాలున్నాయి .  వాటికి బొగ్గు, గ్యాస్ సప్లయ్  లేదు.  కొన్ని లక్షల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కర్మాగారాలన్నీ పనిచేస్తే - దేశంలో, రాష్ట్రంలో , అతి త్వరగా, విద్యుదుత్పాదన ఘనంగా పెరుగుతుంది . యిది - సులభంగా , అతి త్వరగా చెయ్యగల పని . చాలని విద్యుత్తు నేషనల్ గ్రిడ్ నుండి కొనుగోలు చెయ్యాలి .  కానీ, 2 సంవత్సరాలలోపు, రాష్ట్రాన్ని కొరత రాష్ట్రం నుండి సర్ ప్లస్ రాష్ట్రంగా మార్చ వచ్చు . మార్చాలి . తమిళనాడులో జయలలిత గారు కూడా అదే చేస్తున్నారు .

(2) మన రాష్ట్రంలో నదులున్నాయి . ఈ నదులను కలిపే ప్రణాళిక తయారు చెయ్యాలి . శ్రీకాకుళం నుండి కుప్పం వరకు నదుల నీరు ప్రవహించే ఏర్పాటు మనం చెయ్యాలి. నా చిన్న సలహా - కుప్పం పేరు శ్రీ కుప్పం అని  మారిస్తే బాగుంటుంది . అప్పుడు, మన రాష్ట్రం శ్రీకాకుళం నుండి, శ్రీ కుప్పం వరకు, అని చెప్పుకోవచ్చు . రాష్ట్రం - 'శ్రీ' ,అంటే, సిరి తో నిండి వుంటుంది.  మోడీ గారు, నవీన్ పట్నాయక్ గారు వొప్పుకుంటే - మహానది ని కూడా కలిపి - వొడిశా వొక కొన  నుండి ఆంధ్రప్రదేశ్ మరొక కొన వరకు - అన్ని జిల్లాలలో నదులు ప్రవహించే ఏర్పాటు చెయ్యవచ్చు . యిది అయిదేళ్ళు లేదా పదేళ్ళు పట్టినా ఫరవాలేదు , కానీ ఈ పనికి శ్రీకారం చుట్టాలి . మన రాష్ట్రంలో , చాలా ప్రదేశాలలో ఇప్పటికే మంచినీటి సరఫరా  చాలా తక్కువ . ఈ పరిస్థితి మారాలి. మహానది, గోదావరి , కృష్ణా   నదుల వరద నీరు మాత్రం కాలువల ద్వారా వచ్చినా , చిత్తూరు జిల్లా లాంటి ఎన్నో ప్రాంతాలకు నీటి సదుపాయం కుదురుతుంది

(3) మనకు మంచి రాజధాని కావాలి. హైదరాబాద్ పోగొట్టుకున్నది ఉత్తరోత్తరా మనకు అదృష్టంగా, మహా లాభకరంగా మారేలా చేసుకోవాలి. కొత్త రాజధానిని, రాష్ట్రం మధ్యలో, కనీసం 50 X 50 కి.మీ వైశాల్యం వుండేటట్టు , క్రొత్తగానే నిర్మించాలి . అది, చెన్నై- కోలకాతా జాతీయ రహదారికి వీలైనంత దగ్గర వుంటే మంచిది . అలాగే , కొంత చెన్నైకు సమీపం గా వుంటే చెన్నై లోని విమానాశ్రయము, పోర్ట్ మనం సులభంగా వాడుకునే వీలుంటుంది - అంటే మనం అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయము, పోర్ట్ నిర్మించే వరకు యివి అవసరం గనుక . యింతకు ముందు వొక సారి అది ఒంగోలు - నెల్లూరు మధ్య ప్రాంతాల్లో అయితే సరిపోతుంది అని రాశాను . అంటే ఒంగోలు ఆని కాదు . దానికి దగ్గర, ఢిల్లీ అంత నగరం నిర్మించ డానికి సరైన ప్రదేశం చూసుకోవాలి .

(4) మన రాష్ట్రంలో - IT  పార్కులు , ఫార్మా  పార్కులు సులభంగా నెలకొల్ప వచ్చు . వాటికి అన్ని రాయితీలు యివ్వాలి . ఈ విషయంలో - చంద్రబాబు గారికి వున్న అనుభవం తో - పారిశ్రామిక వేత్తలను సులభంగా ఆకట్టుకోవచ్చు .

(5) మన రాష్ట్రం పెద్దది. పక్క రాష్ట్రం చిన్నది. మనకు వొక రైల్వే జోన్ కావాలి కదా .  అది మోడీ గారిని అడిగి సాధించాలి .అలాగే - టెలికం సర్కుల్ , లాంటి కేంద్ర కార్యాలయాల విభజన జరగాలి . దీని వలన, ఆంధ్ర ప్రదేశ్ పైన గమనమూ పెరుగుతుంది , అభివృద్ధి     కూడా త్వరగా జరుగుతుంది . టెలికాం లో బ్రాడ్ బాండ్ రావడమూ త్వరగా జరుగుతుంది . రైల్వే లో క్రొత్త లైన్ ల నిర్మాణమూ జరుగుతుంది . వీటితో బాటు - హైదరాబాద్ లోని ఆంధ్రా ఉద్యోగులు కూడా కొంత మంది ఇక్కడికి  రావడానికి వీలుంటుంది . వీటి వలన చంద్ర బాబు గారు అనుకునే అభివృద్ధి తానుగా జరిగే వీలుంది .  అంత పెద్ద రైల్వే జోన్ తెలంగాణా కు అక్కరే లేదు అంత పెద్ద టెలికాం సర్కుల్ అక్కరే లేదు . కాని  మనకు కావాలి . అది మనం అడగాలి . 

(6) నన్నడిగితే,  TDP  పార్టీ నుండి రైల్వే మంత్రి వుంటే మేలు అని నాకు అనిపిస్తుంది . రైల్వే కాకపొతే - IT  మినిస్ట్రీ అయినా బాగుంటుంది , మన రాష్ట్ర అభివృద్ధికి . 

(7) మనకు వొక ఐ.ఐ.టి ., వొక ఐ.ఐ.యం., వొక ఏ.ఐ.ఐ.యమ్.యస్ . - లాంటి ఉత్తమ విద్యల నందించే సంస్థలు రావాలి . యివన్నీ, కేంద్రం నుండి, మనం అడగి తీసుకోవాల్సినవే ; మనం మనముగా చెయ్య వలసినవి కావు. 

(8) చంద్రబాబు గారు ఈ మధ్య పత్రికల వారికి , టీవీ చానెళ్లకు యిచ్చిన ఇంటర్ వ్యూలలో - చాలా సమస్యల గురించి బాగా చెప్పారు . మనకున్న 14 పోర్టుల గురించి , వాటికి చేయవలసిన అభివృద్ధి గురించి , వాటికి , మన వ్యవసాయ,  పారిశ్రామిక రంగాలకు మధ్య వుండవలసిన సహకారాల గురించి చెప్పారు . అలాగే , మనకు రాబోయే రాజధాని ఢిల్లీ కంటే బాగుండాలని చెప్పారు . యివన్నీ బాగుంది . 

చంద్ర బాబు గారు చెయ్యాల్సినవి చాలా వున్నాయి . యిందులో కొన్ని సులభంగా చేసేవి. కొన్ని వెంటనే చెయ్యాల్సినవి . కొన్ని నిదానమైనా, తప్పకుండా చెయ్యాల్సిన ముఖ్యమైన పనులు.  మొదట ,సులభంగా చెయ్య వలసినవి చేసేసి, వెంటనే చెయ్యవలసినవి వెంటనే చేసేసి , తరువాత , ముఖ్యమైనవి  చిత్త శుద్ధితో , అందరి సహకారంతో చెయ్యాలి . 

చంద్రబాబు గారు యింకా ఎన్నెన్నో చెయ్యొచ్చు . అసలు ... పదేళ్ళలో , తెలంగాణా వారి కొందరు నాయకుల బూతు మాటలకు, లేని చేతలకు  మొహం మొత్తి , తెలంగాణా ప్రజలు మళ్ళీ, సమైక్యంగా వుందామన్నా - ఆశ్చర్యం లేదు . పక్క పక్క నున్నా , అటువంటి వారు  మధ్య లేకుంటే , కుటుంబ కలహాలు వుండవు . రాష్ట్రాల మధ్యా కలహాలు వుండవు . 

సర్వే జనాః సుఖినో భవంతు

- మీ 

వుప్పలధడియం విజయమోహన్