మహిళా కమిషన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మహిళా కమిషన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, ఆగస్టు 2014, గురువారం

50 శాతం పౌరులకు రక్షణ లేకుంటే ? మనిషి మృగంగా మారడమంటే ? ఎన్నో శిక్షలు వున్నా ఏ నేరాలు ఆగడం లేదు. ఎందుకు ? "ధనమూలం యిదం జగత్"

50 శాతం పౌరులకు రక్షణ ఎలా ?

కామ , క్రోధ, లోభ ,మోహ, మద, మాత్సర్యాలు - ఈ  ఆరూ  అంతః శత్రువులుగా మన శాస్త్రాలు చెబుతాయి .వీటికి భయం కూడా చేర్చుకోవచ్చు. 

ఇవన్నీ మనలో వుండకూడనివి ; కానీ కొద్దో, గొప్పో వుండేవి. 

ఏ కోరికైనా కామమే. సెక్సు  పరంగా మాత్రమే చెప్పుకో కూడదు . మనలో కోరికలే లేని వాడెవడు ? అందరికీ  వుంటుంది. కానీ, కోరిక ధర్మ బద్ధం గా తీర్చుకుంటే తప్పు లేదు; మంచిదే - అని శాస్త్రాలు చెబుతాయి . 

ధర్మ బద్ధం కాని కోరికే అంతః శత్రువుగా మారి మనల్ని బాధపెడుతుంది. మన ద్వారా, మన చుట్టూ వున్న వారినీ బాధ పెడుతుంది. 

సెక్సు  వాంఛ  శారీరకంగా దేవుడే సృష్టించాడు కదా. అది  తీర్చు కోవడం తప్పెలా అవుతుంది? ధర్మేచ, అర్థేచ, కామేచ   నాతి చరామి - అని ప్రమాణం  చేసి,అది పాటిస్తూ తీర్చుకుంటే - ఆడా , మగా యిద్దరికీ అందులో ఏ ప్రమాదమూ లేదు . యిద్దరికీ సుఖ సంతోషాలు ఆమరణాంతమూ  లభిస్తాయి . 

అలా కాని నాడు , అది దుఃఖ  కారకంగా , సమాజానికి పతన కారకంగా తయారవుతుంది.

అదే జరుగుతూ వుంది  యిప్పుడు. అమాయక అబలలపై బలాత్కారాలు , సామూహిక బలాత్కారాలు , ఆసిడ్ దాడులు , బలాకారాన్ని ప్రతిఘటిస్తే , వారిని క్రూరంగా హింసించి, సెక్సు వాంఛ  తీర్చుకుని, చంపడమో, అంగ వైకల్యం చేయడమో - ఏదేదో చేస్తున్నారు  కొందరు .

మరీ చిన్న చిన్న పసి పాపలపైన కూడా యిది జరగడమూ , అందులోనూ - కుటుంబం లోని వారో , వారికి దగ్గరి వారో యిది చెయ్యడమూ - యివన్నీ ప్రతి రోజూ వార్తా పత్రికల్లో చదువుతూ వుంటే చాలా కష్టంగా వుంది. 

ఈ పరిస్థితి మారాలి . వెంటనే మారాలి . రేపు  కాదు , ఈ రోజు నుండీ, ఈ నిమిషం నుండే మారాలి.  అందుకు ఏం చెయ్యాలి ? పసి పాపల పైన లైంగిక వేధింపు చేసిన వాడికి ఏ శిక్ష వెయ్యాలి ? అసలలా చెయ్యాలనే యోచనే ఎలా మనసులో పుడుతూ వుంది ? ఇది సమాజంలో పెరుగుతూ వున్న  వొక పోకడ . దీన్ని యిప్పుడే యిక్కడే ఆపాలి . మనిషి మృగంగా మారడమంటే యిదే . యిది చేసిన వారికి  కఠినాతి  కఠిన శిక్ష వెయ్యాలి. ఆదైనా, వొక నెల లోపల జరగాలి . అలాగే సామూహిక బలాత్కారం  కూడా, ఏ రకంగానూ క్షమించ రాని నేరం . దానికి వురి తీయడమే - శిక్ష గా వుండాలి. అదీ నెల లోపల జరిగి పోవాలి.

యిది జరుగుతుందా ? జరగాలి. యిది జరగాలంటే - సమాజమంతా మారాలి . అన్ని వ్యవస్థలూ మారాలి . అంటే - మనం వాటిని మార్చాలి .

మొదట పోలీసు వ్యవస్థ దగ్గర ఆరంభం కావాలి. బలాత్కారం జరిగింది - అంటే ఆ ..... అంతే కదా... అన్న మనస్తత్వం పోవాలి . అంతే కాదు . పోలీసు స్టేషన్ కు ఆడ పిల్ల వొంటరిగా రావడానికి భయ పడే - యిప్పుడున్న పరిస్థితి పోవాలి.

యిప్పుడెలా వుందంటే - పోలీసు స్టేషన్ అంటే - న్యాయంగా నడిచే పౌరులు భయపడడము , అన్యాయాలు చేసే వారు భయ పడక పోవడము - యిలా చాలా చోట్ల వుంది . పోలీసు శాఖలో అవినీతి , లంచ గొండి తనం ఎక్కువగా వున్నా పట్టించుకొనే అధికార్లూ తక్కువ. రాజకీయ నాయకులూ తక్కువ . పోలీసు శాఖ లో ఏం జరుగుతోందో - కొంత  వార్తల ద్వారా , మరి కొంత సినిమాల ద్వారా మనకు తెలుస్తూనే వుంది . అయినా , యిది పట్టించు కునే వాడే లేదు.

ప్రతి రోజూ బలాత్కారాలు జరుగుతూనే   వున్నాయి. అందులో కొన్నే పత్రికల ద్వారా వెలుగు చూస్తున్నాయి . కానీ - ఆ తరువాత పోలీసు శాఖ ఏం చేసింది , ఘనత వహించిన కోర్టు వారు ఏం చేశారు - యిది చెప్పే వారే లేరు . వొక్కో సారి పోలీసులు అసలైన నేరస్తులను పట్టుకున్నా , రాజకీయ నాయకుల వొత్తిడికి , లేదా, డబ్బు ప్రలోభానికి లొంగి  పోవడం, నేరస్తులు తప్పించుకోవడం జరుగుతూ వుంది .

కామాంధులు బలాత్కారాలు చేస్తే , లోభాంధులు - డబ్బులకో , అధికారానికో లొంగి పోయి - నేరస్తులకు  శిక్ష పడకుండా చూస్తున్నట్టు మనకు అర్థమవుతూ వుంది .

ఇదిలా వుండగా - వొక మహిళా డిస్ట్రిక్ట్ జడ్జీ గారిని , వొక హై కోర్ట్ జడ్జీ గారు  తన ముందు అశ్లీల నృత్యాలు చేయమన్నట్టు - వార్త. అది చేయనందు వలన - ఆమెను మారుమూల ప్రదేశానికి బదిలీ చేసినట్టు వార్త . ఆమె రాసిన లేఖను కంప్లయింట్ గా తీసుకోకుండా , ఆమె చట్ట పరమైన కంప్లయింట్ యివ్వ లేదు కాబట్టి  ఈ విషయం మేం తీసుకోలేం - అని అధికార వర్గాలు చెబుతున్నట్టు  వార్త . హై కోర్ట్ జడ్జీ గారు నేనేమీ చెయ్య లేదని అంటున్నారు . యింత జరిగిన తర్వాత - ఎంతో కొంత విచారణ  జరగాలి కదా ! జరుగుతుందా ? ఏమో ..... కానీ , మహిళా డిస్ట్రిక్ట్ జడ్జీ గారు  మాత్రం రిజైన్  చేసేశారు . యిప్పుడేం జరుగుతుంది ?

బెంగాల్ రాజ్యంలో రామకృష్ణ పరమహంస గారు పుట్టారు . భార్య శారదాదేవిని - దేవత గా  భావించి పూజ చేశారు.  అదే బెంగాల్ లో - వివేకానందుల వారు , ప్రపంచంలో పుట్టిన ప్రతి వారిని సోదర సోదరీమణులారా, లేదా తల్లీ అని పిలిచే సంస్కృతిని సృష్టించారు .   అదే బెంగాల్ లో యిప్పుడేం  జరుగుతూ వుంది? మా ఎదుటి పార్టీ వాళ్ళ యిళ్ళలో  చొరబడి - ఆ యిళ్ళ లోని మహిళలను , మా వాళ్ళ చేత బలాత్కారం  చేయిస్తానని - అక్కడి అధికార పార్టీ MP వొకరు హెచ్చరించారు. వీళ్ళ రాజకీయ కలహాల మధ్య  ఆ మహిళలేం  చేశారు ? అయినా - యిటువంటి దుర్యోధన , రావణుల పరంపరను ఏం చెయ్యాలి?  అక్కడి   ముఖ్య మంత్రి కూడా మహిళే . మహిళా ముఖ్య మంత్రి వుంటే  మహిళలకు  రక్షణ వుంటుందన్న గ్యారంటీ  ఏమైనా వుందా ? ఏమీ లేదు . నేను గొప్ప రౌడీ గర్వం గా చెప్పుకున్న ఆ MP గారు మాత్రం పూర్తి రక్షణ తో వున్నారు. మన పార్లమెంటులో  కూడా - స్పీకర్ గారు మహిళే . మరి యీ  MP  గారిని వారు ఏం  చేసారు; చేయ బోతున్నారు ? ఏమో. వేచి చూడాలి .

ఈ కాలంలో ,  నేను రౌడీని , నేను బలాత్కారాలు చేయిస్తాను అన్న వాడు కూడా MP . ఆ MP గారిని  ఏం చెయ్యాలన్నా - అందరికీ రాజకీయ కారణాలు - అడ్డొస్తాయి . వచ్చే ఎన్నికల్లో  ఆ MP  గెలుస్తాడా . మన లాంటి పరమ మూర్ఖులు  వోటు వేసేంత వరకు  ఆయన గెలుస్తూనే వుంటాడు. 

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి గారు - ఆ... మగ పిల్లలు అలా చేస్తూ వుంటారు .. అని కొట్టి పారేశారు .  యిలా,రాజకీయ నాయకులలో - మహిళల పట్ల నిజంగా వుండవలసిన గౌరవం  అసలు వుండడం లేదు.

బాలాత్కారాలు , సామూహిక బలాత్కారాలు జరిగిన ప్రతి చోటికి మహిళా కమిషన్ వారు వెళ్లాలి. అక్కడి పోలీసు  శాఖను,న్యాయ వ్యవస్థను  కదిలించాలి . సరైన చర్యలు తీసుకునే లాగా చెయ్యాలి . యిలా కాక లేఖలు మాత్రం , అదీ కొన్ని కేసుల్లో మాత్రం , రాస్తూ కూర్చుంటే   - మహిళలకు రక్షణ ఎలా లభిస్తుంది ? నన్నడిగితే - మహిళా కమిషన్ క్రింద వొక పటిష్టమైన సాయుధ, సాధికార రక్షక భట బృందం వుండాలి . కనీసం సామూహిక బలాత్కారాలలో - మామూలు పోలీసు శాఖ కాక , ఈ ప్రత్యేక బృందం రంగం లోకి దిగాలి. వొక వారం లోగా, కేసును పూర్తిగా ఛేదించి, అన్యాయం జరిగిన మహిళకు రక్షణ, వైద్య పరీక్షలు , అనుమానాస్పద వ్యక్తుల విచారణ అన్నిటినీ జరిపించి  మహిళా కోర్టులో ప్రవేశ పెట్టి - నెల తిరిగే లోపు శిక్ష పడే లాగు చెయ్యాలి . యిది ప్రతి  కేసు లోనూ  జరిగిన నాడే మహిళలకు కాస్తైనా ధైర్యం వస్తుంది . రక్షణ లభిస్తుంది. 

చాలా నగరాల్లో - బస్సుల్లోనూ , రైళ్ళ లోనూ , కాలేజీల ముందూ, యిళ్ళ ముందు కూడా - మహిళలను అసభ్యంగా మాట్లాడడము అసభ్యంగా వెకిలిగా ప్రవర్తించడం  జరుగుతూనే వుంది . యిది మనం ఆపలేమా ? ఆప గలం . ఆపాలి. ఎవరు చెయ్యాలి ? ప్రభుత్వం వారే చెయ్యాలి . మహిళలే ప్రభుత్వంలో వున్నత స్థానాలలో వున్న చోట్ల కూడా యిది జరగడం లేదు .

నిజానికి , ఈ విషయంలో - సాంఘిక పరిస్థితులపై చాలా పరిశోధనలు , సర్వేలు జరగాల్సిన అవసరం చాలా వుంది . అసలు ఎందుకు యిలా జరుగుతో వుంది . నేరం  శిక్ష  పడితే చాలా ? నేరం చేసిన వాడికి శిక్ష పడాలని నేనూ వొప్పుకుంటాను. కానీ, భవిష్యత్తు లో నేరం జరగకుండా ఆ శిక్ష ఆపుతుందా ?

యిప్పుడు కూడా హత్యలకు ఉరిశిక్ష వుంది . కానీ హత్యలు ఆగడం లేదు కదా . అలాగే - ఎన్నో నేరాలకు ఎన్నో శిక్షలు వున్నా ఏ నేరాలు ఆగడం లేదు.

ఎందుకు ? ఎందుకు ? ఎందుకు ?

చట్టం చేసినంత మాత్రాన  నేరాలు ఆగవని  మనం తెలుసుకోవాలి .

ప్రతి నేరానికి , సరైన నేరస్తుడికి , వెనువెంటనే  శిక్ష పడాలి. అప్పుడే - అసలు నేరస్తులకు భయం వుంటుంది . లేదంటే అసలు వుండదు.

ఎన్నో నేరాలలో - అసలు నేరస్తులకు కాక , మరెవరికో శిక్ష పడిన సందర్భాలు ఎన్నో వున్నాయి.    యివి తెలిసినవి ; తెలీనివి మరెన్నో వుంటాయి . పోలీసు శాఖలోను , న్యాయ శాఖలోనూ పూర్తి నిజాయితీ, చిత్త శుద్ధి, న్యాయ నిబద్ధత వుంటే తప్ప - న్యాయం జరుగదు .

డబ్బు కోసం  ఎవరి ప్రక్కనైనా  సరే - వాదించి , గెలిపించాలని కొందరు న్యాయ వాదులు  అనుకోవడం సరైన పద్ధతా ? "ధనమూలం యిదం జగత్" - అని వున్న ప్రస్తుత సమాజంలో రాజకీయ నాయకులు , న్యాయ వాదులు , పోలీసులు మారితే తప్ప - సాధారణ  పౌరులకు  న్యాయం జరిగే అవకాశం అసలు లేదని నా అభిప్రాయం .

ముఖ్యంగా - యిప్పుడు , 50 శాతం పౌరులైన మహిళలకు రక్షణ రోజు రోజుకూ తగ్గుతూ వుంది .  ఈ పరిస్థితి ని  ఎక్కడి నుండి మార్చాలి మనం ?

నా వుద్దేశంలో  - మన విద్యా వ్యవస్థ సరిపోతే , అందులో , మంచి పౌరులను తయారు చేసే కనీసం వొక దశాబ్దం లో నైనా - మనకు కావలసినంత మంది  మంచి పౌరులు , మంచి పోలీసులు, మంచి న్యాయ వాదులు , మంచి న్యాయ మూర్తులు , మంచి రాజకీయ నాయకులు - వచ్చే అవకాశం  వుంటుంది .

దుర్యోధనుడు  ఎవడో వొకడు ఎప్పుడూ వుంటాడు . రావణుడు ఎవడో వొకడు ఎప్పుడూ వుంటాడు . కాకపోతే , మనకు ధైర్యం, సాహసం, న్యాయ నిబద్ధత  వున్న  రాముడు,కృష్ణుడు , పాండవుల వంటి వారు కూడా కావాలి. అది విద్యా వ్యవస్థ ద్వారానే  జరగాలి . యిప్పుడు మొదట జరగాల్సింది  అదే . చదువు సంస్కారాన్ని, ధైర్యాన్ని, సాహసాన్ని, న్యాయాన్ని పిల్లల మనస్సులో, జీవితాల్లో పూర్తిగా నాటే చడువుగా వుండాలి . వూరికే -  సైన్సు , లెక్కలు , జనరల్  నాలెడ్జి  లాంటివి నేర్పేది - చదువే కాదు.

 యివన్నీ నేర్పితే - పిల్లలు తప్పకుండా నేర్చుకుంటారు . మంచి పౌరులుగా మారుతారు . కానీ , యిప్పుడు యివన్నీ మన విద్యా వ్యవస్థలో లేవు గాక లేవు . అందువలననే దేశం దరిద్రంగా , అసహ్యంగా - గంట కో రేపు, రోజుకో సామూహిక బలాత్కారం - చిన్న పిల్లలపై  బలాత్కారాలు  - యిలా తయారయ్యింది .

చట్టాలు రానీ , శిక్షలు పడనీ , కానీ, మన విద్యావ్యవస్థ మారక పొతే - ఏ నేరాలూ తగ్గవు .

ఈ మధ్యలో - పోలీసు వారికి - చాలా, చాలా నేర్పాల్సి వుంది .  పనికి మాలిన రాజకీయ నాయకులను ఎన్నుకునే మన బుద్ధులు కొంత మారాలి. న్యాయ వ్యవష్ట కూడా ఎంతో మారాల్సి వుంది. కొన్ని కేసులు దశాబ్దాల పాటు జరుగుతూ వుంటే , అది న్యాయ వ్యవస్థలో  కూడా వున్న లోపమే కదా . ఆఆ .... మమ్మల్ని మీరేం అనకూడ దంటే ఎలా? మనం అందరం మారాలి ...

= మీ

వుప్పలధడియం  విజయమోహన్


 

19, నవంబర్ 2011, శనివారం

చెయ్య గలిగిన మంచి పని = యిప్పుడే చేసెయ్యండి. = స్త్రీ వేధింపు చర్యలు = లంచగొండితనం =మనమేం చెయ్యగలం ? = దేశ / రాష్ట్ర మహిళా కమిషన్ ఎం చెయ్యాలి?


మనిషికి చాలా, చాలా సంతోషాన్నిచ్చే పనులు - మనం నిస్స్వార్థంగా, మరొకరి కొరకు చేసే పనులే అని చెప్పుకోవచ్చు. అవి  చిన్నవే  కావచ్చు. కాస్త  పెద్దవీ  కావచ్చు. కొన్ని సందర్భాల్లో - మహా గొప్ప పనులూ కావచ్చు.  ఏదైనా - మనం నిస్స్వార్థంగా చేసే పనులు మనకు జీవితాంతం  సంతోషాన్నిస్తాయనడంలో  నాకు సందేహం లేదు.  

అవి యితరులకు చెప్పుకోవచ్చా - చెప్పుకోకూడదా?  మన యిష్టం. చేసిన పుణ్యం చెబితే పోతుందని వొక సామెత. సరే. పుణ్యం పోతే పోనీ. మనసుకు ఏదో వొక సంతోషం - అనుకుంటే- చెప్పొచ్చు.   చెబితే - మిగతా వారు కూడా అలాంటివి చేస్తారనుకుంటే   - తప్పకుండా చెప్పొచ్చు.

శ్రీ రామానుజాచార్యుల వారికి - వారి గురువు , చాలా రహస్యం, మరెవరికీ తెలియరాదు -అని నారాయణ మంత్రం ఉపదేశించారు. వెంటనే -  రామానుజాచార్యులు గుడిపైకెక్కి అందరినీ పిలిచి - అందరికీ ఆ మంత్రాన్ని చెప్పారు. అది మంచా కాదా -అన్నది వివాదాస్పదమే. కొందరికి చాలా గొప్ప పని అనిపిస్తుంది.  కొందరికి - మంత్రోపదేశం అలా చేయడం చాలా తప్పు అనిపిస్తుంది.

ఇలాగా - వొక్కొక్క సందర్భం లోనూ - వొక్కొక్కరికి వొక్కొక్క  రకంగా అనిపించడం చాలా సహజం.

అయితే - నిశ్చయంగా, యిది మంచి పనే అనిపించిన దాన్ని - మనం  వెంటనే చేసేస్తే మంచిది. 

వొకాయన అంటారు - మీరు చేయలేని పని చేయక పోతే మునిగి పోయిందేమీ లేదు. కాని, చేయ గలిగిన మంచి పని చేయక పోతే - జన్మ వ్యర్థం అయిపోతుంది.

నిజమే. మనం చేయగలిగిన మంచి పనులు చేస్తూ పోవాలి.

తెలుగులో వొక సామెత వుంది. మేసే గాడిదను - కూసే గాడిద వచ్చి చెడిపిందట. అలాగా, మంచి పని చేయాలనుకునే వాడిని - చేయని వాళ్ళు వచ్చి చెయ్య నివ్వకుండా ఆపుతుంటారు . చేసే వాళ్ళకు విమర్శల వర్షం తట్టుకునే  శక్తి కూడా వుండాలి. అదీ విషయం.

మనమంతా - చిన్న చిన్న - తప్పులు చేస్తూనే వుంటాము. అలాగని - మంచి పనులు చేయ కూడదని నియమమేమీ లేదు. చిన్న తప్పులు చేసిన వాళ్ళు - పెద్ద మంచి పనులు తాము చేయడమో, చేసే వాళ్లకు తోడు పడడమో - చేయకూడదని రూలేమీ లేదు. కానీ  - ఏమీ చేయని వాళ్ళు - చేసే వాళ్ళను - చిన్న తప్పులు చూపించి పరిహాసం చేస్తూ వుంటారు. విమర్శిస్తూ వుంటారు.   

యిప్పుడు దేశం స్థితి అలాగే వుంది. టీం అన్నా లోని ప్రతి సభ్యుల పైనా - ఏదో చిన్న తప్పు రుద్దడమూ - వీరా లంచా గొండి తనం పైన యుద్ధం చేసే వారు - అని విమర్శించడం జరుగుతోంది.  నా ఉద్దేశంలో -ఎవరైనా ఈ యుద్ధంలో చేరవచ్చు. యిప్పుడు మీరు లంచం తీసుకుంటూ వున్నా సరే - ఈ పధ్ధతి పోవాలి అనుకుంటే - అందరూ చేరండి.విమర్శలు చేసే వారు - మారే వారిని కూడా మారనివ్వరు. విమర్శకుల మాట వింటే - దేశం యిలాగే ఎప్పుడూ లంచగొండి దేశం గా వుండి పోతుంది. నా అభ్యర్ధన - అందరూ - ఈ యుద్ధంలో చేరండి. మనమూ- నూరు శాతం ప్రజలు - ఆర్ధిక ఉన్నతికి నోచుకోవాలి. లంచమనే పదం కూడా దేశం నుండీ వెళ్లి పోవాలి.

దేశాన్ని పీడిస్తున్న మరో మహా మారి - స్త్రీలపై వేధింపులు. ఆంగ్లంలో ఈవ్ టీజింగ్ అంటారు కదా. అదన్న మాట. కత్తితో దాడి చేయడం, ఆసిడ్ పోయడం - బస్సుల్లో, రైళ్ళలో వేధించడము   - యివన్నీ ఎక్కువవుతున్నాయి. కొన్ని నగరాల్లో మరీ ఎక్కువ.

చెన్నై నగరంలో - యిది పదిహేడేళ్ళ క్రితం జరిగిన సంగతి.

నేను నగరం మధ్య నుండి మారి - నగర శివార్లలో,  స్వంత ఇల్లు కట్టడానికి ఆరంభించిన రోజులు.  క్రొత్త వూరి నుండి ట్రెయిన్ లో దాదాపు ముప్ఫై కి.మీ. దూరం వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు తెలిసింది - చెన్నై దగ్గర కూడా - స్త్రీలపై వేధింపులు ఎంత ఘోరంగా వుంటుందో.

 సెకండు క్లాసులో వెళ్ళిన రోజు -ప్రతి రోజూ ఇలాంటి వేధింపు చర్యలు చూడవలసి వచ్చింది. సెకండు క్లాసులోనే వొక చిన్న భాగంలో - స్త్రీల భాగం వుండేది. ఈ రెండింటికీ మధ్య  తలుపు లేని వొక ద్వారం వుండేది. చాలా మంది కాలేజీ విద్యార్థులూ, కార్మికులూ - ఆ ద్వారం వద్ద నిలబడి - లోనున్న ప్రతి స్త్రీ పైనా - వొక్కొక్కరి పైనా - అసభ్యకరమైన  పదజాలం విసిరి హింసించే వాళ్ళు. అయిదేళ్ళ పసిపాప నుండి   - ఎనభై ఏళ్ళ ముదుసలి వరకూ - ఎవరినీ వారు విడిచి పెట్ట లేదు.

వచ్చే ప్రతి స్టేషన్ లోనూ - కొత్త వాళ్ళు   రావడం, వాళ్ళలో - మరి కొందరు ఆ ద్వారం వద్ద నిలబడడమూ  -  గుంపు ఎక్కువయ్యే కొద్దీ - స్త్రీల భాగంలోకే వెళ్లి - అక్కడే మరింత రెచ్చి పోయి మాట్లాడడమూ -జరిగేది. మొదటి రోజే - ఈ తంతు భరించడం నాకు చాలా కష్టమయ్యింది. వొక అబ్బాయిని పిలిచి - మన ప్రక్క ఖాళీయే   కదా. అక్కడకెళ్ళి కూర్చోకూడదా- అన్నాను. ఆ అబ్బాయి పెద్దగా నవ్వి - పూర్తిగా స్త్రీల భాగంలోకి చొచ్చుకెళ్ళాడు.

సరే. ప్రక్క నున్న ప్రయాణీకులతో మాట్లాడి - మనమంతా - వారికి - నచ్చచెప్ప కూడదా - అన్నాను. వారంతా, పెదవి విరిచేశారు. ఏమీ లాభం లేదు సార్. వీరు   ఎవరి మాటా వినే రకాలు కారు. మనం చెబితే - మరింత రెచ్చి పోతారు. ఎక్కువ చెబితే - కొట్టినా కొడతారు. వినరు గాక వినరు - అన్నారు. పది రోజులు ఈ తంతు భరించాను. కాని తరువాత - ఏదో చెయ్యాలి. ఏదైనా చెయ్యాలి - అనిపించింది.

పదకొండో రోజు - ఆఫీసు చేరిన వెంటనే - అదే మూడ్ లో -  టెలిఫోను డైరెక్టరీ లో - రైల్వే వారి పబ్లిక్ గ్రీవెన్సస్  సెల్ వారి అడ్రెస్సు, సదరు ఆఫీసర్ల పేర్లు, చెన్నై డివిషన్ సూపరింటెండెంటు   వారి పేరూ , అడ్రెస్సూ అన్నీ రాసుకున్నాను.

తరువాత దాదాపు పది పేజీల సుదీర్ఘ లేఖ తయారు చేసాను. అసలు ఏం జరుగుతోంది - అన్నది పూస గ్రుచ్చినట్టు  రాసాను. దాని క్రిందే - దానికి పరిష్కార మార్గాలు కూడా చాలా రాసాను. అయితే - అవన్నీ - గాంధీ గారి అహింసా మార్గాలే. యివన్నీ రాసి, ఆ అడ్రెస్సులకు అన్నిటికీ పంపించేసి  - అబ్బ, ఏదో చేయగలిగింది చేసాను - అని అనుకున్నా.

తరువాత పది రోజులు ఏమీ కాలేదు. పదకొండో రోజు - యిద్దరు పోలీసు ఆఫీసర్లు మా ఆఫీసుకు - నన్ను వెతుక్కుంటూ వచ్చారు. నా రూముకే వచ్చారు. వారిని కూర్చోమని - పని ఏమిటి - అని అడిగాను.  వారు - నేను రాసిన లేఖను చూపి - అది నేను రాసిందేనా అని అడిగారు. నాకు మనసులో - చిన్న జంకు. కానీ- ఎందుకో - గాంధీ గారు గుర్తుకొచ్చారు. భయమెరుగని గాంధీ దేశంలో పుట్టి - మంచి పనికి భయపడడం ఎందుకనిపించింది.

అంతే. మరి భయం లేదు. జంకూ లేదు. అవును అన్నాను. వారు - అసలేం జరుగుతోందో - నేను చూసినవన్నీ చెప్పమన్నారు. ప్రతి వొక్కటీ - వొక్కటి వదలకుండా - అన్నీ - కాస్త ఆవేశం గానే చెప్పాను.

చివర అన్నాను - ఆ రైళ్ళలో - మా వాళ్ళు గానీ, మీ వాళ్ళు గానీ ప్రయాణం చేసినా - ఎవరూ సంతోషంగా దిగ లేరు. ఎంత మంది స్త్రీలు డిప్రెషన్ కు  లోనవుతున్నారో - మనకు తెలీదు. ఎంత మంది ఈ బాధ భరించలేక  ఉద్యోగాలు, చదువులు వదిలేస్తున్నారో కూడా తెలీదు. ఇవేవీ చేయలేని వాళ్ళు - ఎవరో వొకరు ఆత్మహత్యలు చేసుకున్నా - ఆశ్చర్య పడనక్కర లేదని చెప్పాను.

వారు చాలా వోపిగ్గా విన్నారు. కడపట, నేను యిచ్చిన పరిష్కార మార్గాల గురించి కూడా చెప్ప బోయాను. అప్పుడు   - వారు కాస్త నవ్వి - సార్, మీరిచ్చిన  ఈ వివరాలు మాకు చాలు. మీ పరిష్కార మార్గాలు -అటువంటి దుర్మార్గుల పై పని చెయ్యవు. ఎం చెయ్యాలో - మేం చూసుకుంటాం.  అన్నీ - మీకు కూడా తెలుపుతాం. మీకు మా ధన్యవాదాలు -  అని వెళ్ళిపోయారు.

తరువాత, మా ఆఫీసులోని వాళ్ళంతా - వచ్చి విషయమేమిటని అడిగారు. చెప్పాను. వారందరి ఏకగ్రీవమైన అభిప్రాయం - నేను చాలా తొందర పాటు పని చేసానని. ఈ పోలీసులు మనల్నే వేధిస్తారు కాని - అసలు రౌడీలపై ఏ ఆక్షనూ   తీసుకోరు. పైపెచ్చు - ఆ రౌడీలకు మీ పేరు తెలిసిందంటే - మీపై కక్ష సాధింపు చర్యలకు దిగుతారు - అంటూ ఎన్నెన్నో చెప్పారు.

కానీ అప్పటికి - నా మనసులో - వొకే ఆలోచన. యింత దూరం వచ్చాక - ఏదైనా జరగనీ. చూచుకుందాం-అని. ఏదో అంటారు కదా. రోటిలో తల పెట్టి, రోకటి పోటుకు వెరువరాదని. నా సహ ఉద్యోగులు మాత్రం ఎం జరుగుతుందో, ఏమో  - అని చెబుతూనే వున్నారు, ప్రతి దినమూ.  నాలుగు రోజులు ఏమీ జరగలేదు.

తరువాత - వొక రోజు, మా అన్న కొడుకు వచ్చి- చిన్నాన్న! ఈ రోజు నిజంగా మన పోలీసులు పోలీసుల మాదిరి పని చేసారు - అన్నాడు. తనొచ్చిన ట్రెయిన్ లో - స్త్రీల భాగంలో నిల బడ్డ వారిని - బయటికి లాగి -అంతే కాక, వారి ద్వారం దగ్గర నిలబడ్డ వారందిరినీ బయటికి లాగి - వారి లాఠీలకు బాగా పని కల్పించారట . అందులో - ముఖ్యమైన వారిని - అరెస్టు చేసి కూడా తీసుకెళ్ళారట.    ఆహా - అనుకున్నానే - కానీ, యిది, నా నిర్వాకమే అన్నది అప్పటికి అర్థం కాలేదు.

తరువాత ట్రైన్లో వచ్చిన నా మరదలూ, ఆ తర్వాత వచ్చిన మా ప్రక్కింటి వాళ్ళూ - యిలా చాలా మంది - యిదే చెప్పడం జరిగింది. అంటే  - ప్రతి ట్రెయిన్ లోనూ  - పోలీసులు తమ ఆక్షన్ ను జరుపుతున్నారని అర్థమయ్యింది. అప్పుడు - కాస్త సందేహం - యిది నా నిర్వాకమే నేమో నని. కానీ అనుకున్నా - మరెవరైనా కూడా రాసిండొచ్చుగా     - అని.

తరువాత పదిహేను రోజులు - ప్రతి ట్రెయిన్ లోనూ - యిదే తంతు -విడవకుండా జరిపారు రైల్వే పోలీసులు.

 తరువాత - నాకు వారి పబ్లిక్ గ్రీవెన్సస్ సెల్ నుండీ, చెన్నై రైల్వే సూపరింటెండెంట్ వారి నుండీ -    రిప్లై లేఖలు అందాయి. అందులో - వారు నా లేఖ పై తీసుకున్న ఆక్షన్ అంతా - పూర్తిగా తెలపడమూ,   యిక ముందు కూడా, యిటువంటి స్త్రీ వేధింపు చర్యలు జరగకుండా చూసు కుంటామని  హామీలు యివ్వడమూ - యిలా అన్ని విషయాలూ రాసారు. 

కానీ - వారు, నన్ను మళ్ళీ  పిలవడమో, ఏ రకంగా నైనా నాకు కష్టం కలిగించడమో - అస్సలు చెయ్య లేదు. ఆ రోజు నుండీ - ఈ పదిహేడు సంవత్సరాలుగా - ఆ ట్రెయిన్ మార్గంలో - మళ్ళీ అటువంటి స్త్రీ వేధింపు చర్యలు జరగడం లేదన్నది - వాస్తవం. అటువంటి ఆఫీసర్లకు, ఆ పోలీసులకు - మనం హృదయ పూర్వక అభినందనలు తెలపాల్సిందేగా .ఆ తరువాత ఎప్పుడో, మాయింట్లో వారికి కూడా యివన్నీ  చెప్పాను. ఈ రిప్లై లేఖలు చూపాను.


ఈ మధ్య ముంబై లో జరిగిన కీనన్, ర్యూబెన్ ల హత్యలో - స్త్రీ వేధింపు చర్యలే మొదటి ఘట్టంగా వుండింది. పత్రికల్లో , టీ.వీ ఛానళ్లలో - అక్కడ వున్న వారెవరూ - హతులకు సపోర్టుగా రాలేదని ,యిది చాలా తప్పనీ రాసారు.  నిజమే, కొంత వరకు. కానీ- చాలా మంది ప్రజలలో - రౌడీలకంటే - పోలీసులంటే - ఎక్కువ భయం ఉందన్నది తెలుసు గదా. కానీ రౌడీలకు పోలీసులంటే పెద్ద భయం లేదు.  యిది పోగొట్ట వలసిన బాధ్యత- పోలీసు వ్యవస్థ దే నని చెప్పక తప్పదు. మన దేశమంతటా   -  యిది జరగాలి.

పోలీసుల్లో మంచి వాళ్ళు ఎంతో మంది వుండొచ్చు. కానీ లంచగొండి తనమూ, ఎక్కువే నని ప్రజల నమ్మకం. అటువంటి వారి దగ్గర అన్యాయమే జరుగుతుందని వొక విశ్వాసం. అందు వలన - ఎక్కడ ఏ అన్యాయం జరిగినా - సాధారణ ప్రజలు పట్టించుకోవడం వదిలేశారు.  వారిలో ధైర్యమూ ,విశ్వాసమూ కలిగించ వలసిన  బాధ్యత పాలక వర్గానిదీ, పోలీసులదీను. కొన్ని, కొన్ని చోట్ల ఇది జరుగుతున్నది. చాలా చోట్ల జరగాల్సి ఉంది.

సరే. స్త్రీలపై  వేధింపు చర్యలను - అరికట్టేందుకు - కొన్ని చోట్ల  ( ముఖ్యంగా చెన్నై లో ) అప్పుడప్పుడూ, మహిళా పోలీసులను సాధారణ దుస్తులలో బస్సు స్టాపుల్లోను, రద్దీ ప్రాంతాల్లోనూ నిలిపి,  వారి ద్వారా ఈ రౌడీలను పట్టేస్తున్నారు.  పూర్తిగా పోక పోయినా -  యిప్పుడు, చాలా  తగ్గిందని చెప్పొచ్చు. యిటువంటివి - బస్సుల్లోనూ, యితర రద్దీ ప్రాంతాల్లోనూ - యింకా జరగాల్సిన అవసరం ఉంది.

ముంబై, డిల్లీ లాంటి పట్టణాలలో - స్త్రీ వేధింపు చర్యలు ఎక్కువగానే వున్నాయి. పోలీసు వ్యవస్థ -కంప్లయింటు కోసం ఎదురు చూడకుండా - ముందు చూపు చర్యలు తీసుకుంటే - అంటే-   వేధింపులు జరిగే సమయంలో, జరిగిన చోట, రౌడీలను పట్టుకుంటే, వారికి కావలసిన శాస్తి చేస్తే - పోలీసుల పై ప్రజలకు గౌరవమూ పెరుగుతుంది. మన దేశం మరింత శాంతివంతం గానూ, నేరప్రవృత్తి లేకుండానూ  వుంటుంది.

అలాగే - కంప్లైంటు ఇచ్చే వారిని - మళ్ళీ మళ్ళీ పిలిచి వేధించకుండా , వారిని  నేరస్తుల ముందు పిలువకుండా - వారికి తగిన ప్రోత్సాహం యిస్తూ వుంటే - ధైర్యం గా కంప్లైంటు యివ్వగలరు. యిది మన దేశ / రాష్ట్ర  మహిళా కమిషన్ వారు కూడా పరిశీలించి తగిన సూచనలు, చర్యలు చేబట్టాల్సిన అవసరం ఉంది.

యిది చేస్తేనే - స్త్రీలకూ కూడా పురుషులపై గౌరవం పెరుగుతుంది.

మన  ప్రాచీనులు అంటారు - ఏ దేశంలో అయితే, ఏ యింట్లో అయితే - స్త్రీ కంట తడి పెడుతుందో - ఆ దేశం లో , ఆ యింట్లో, దేవతలు వుండరు. నీళ్ళు కూడా వుండవు. వానలు కురవవు -  అని. అందుకే గాంధీ గారు కూడా అన్నారు - అర్ధ రాత్రైనా, ఏ స్త్రీ అయినా , భారత దేశం లోని ఏ రోడ్డు లో నైన ,ఎక్కడైనా, వొంటరిగా,  ప్రయాణం చేయ గలిగిన పరిస్థితి రావాలి. అప్పుడే, మనకు నిజమైన స్వతంత్రం -అని.

చదువరులకు - వొక విన్నపం. మనమంతా, మన మహిళా కమిషన్ వారికి - యిటువంటి సూచనలు రాయాలి. అప్పుడే - ఈ జగన్నాథ రథ చక్రాలు కదుల్తాయి. మంచి రోజులు వస్తాయి. మంచి పని అనుకుంటే - వెంటనే చేసెయ్యండి. 

=మీ

వుప్పలధడియం విజయమోహన్