21, నవంబర్ 2011, సోమవారం

SEVALAYA =ఎందరో మహానుభావులు = సేవాలయ = బాలల, వృద్ధుల ఆశ్రమం = మనమేం చెయ్యగలం ?


క్రిందటి వ్యాసంలో - చెయ్యగలిగిన మంచి పనిని వెంటనే చేసెయ్యాలని అనుకున్నాం.

అందులో వొక భాగంగానే - పదిహేడు సంవత్సరాల క్రితం దక్షిణ రైల్వే  పోలీసు వారు -వొక స్త్రీ వేధింపు చర్య ఘటనల పైన చాలా బాగా వ్యవహరించిన తీరును గురించి రాయడం జరిగింది. అలాంటి మంచి పనులు అక్కడక్కడా జరుగుతూనే వున్నాయి. అయితే - వారికి మన లాంటి వారు సరైన సమయానికి సరైన రిపోర్టు యిస్తే బాగుంటుంది. అలాగే - పోలీసు వారు కూడా - రిపోర్టు యిచ్చే వారిని వేధించకుండా, వారికి సరి అయిన రక్షణ కల్పిస్తూ వుంటే,  పౌరులు-పోలీసుల మధ్య మరింత సహకారం పెరుగుతుంది .

సరే. ప్రాచీన కాలంలో - స్త్రీ, బాల, వృద్ధులు సంతోషంగా వుండే సమాజమే - ఆదర్శ వంతమైన సమాజమని చెప్పారు.

వయసులో వున్న వారు - స్త్రీ, బాల, వృద్ధులను  సంతోషంగా  ఉంచుకోవడానికి - చాలా ప్రయత్నాలు చేసే వారు. పురాణాలు, ఇతిహాసాలలో - వున్న వృత్తాంతాలన్నీ ఇలాంటివే.  క్రిందటి వ్యాసంలో కొంత స్త్రీ వేధింపు చర్యల గురించి మాట్లాడాము.

మిగతావి వచ్చే వ్యాసాలలో చూద్దాము. ఈ వ్యాసంలో -  మరో చిన్న సంఘటన. నవంబర్ పదిహేడో తేదీ - మా దంపతులు వివాహం జరిగి  ముప్ఫై మూడు వసంతాలు ఆనందంగా గడిపిన సందర్భంగా, మా ఊళ్లోనే వున్న - "సేవాలయ" -అనే  అనాథ బాలుర, వృద్ధుల ఆశ్రమానికి వెళ్ళాము.

 యిది రెండో సారి, అక్కడికి మేము వెళ్ళడము.

మొదటి సారి లాగే- ఈ సారీ వొక్క రోజు పూర్తి ఖర్చులు మేము యిచ్చేసాము. కాని, అది జరిపే  వారి చిత్త శుద్ధి, కార్య శుద్ధి   ముందు - మనం చేసే  ధన సహాయం అసలు ఏమీ లేదు. యిప్పటికి దాదాపు 200 మంది వృద్ధులు, 200  మంది తల్లీ,. తండ్రీ లేని విద్యార్థులు - ఆ ఆశ్రమం లో వుంటున్నారు. ఆ విద్యార్థులతో బాటుగా-  మరో 800  మంది బీద విద్యార్థులు  కూడా   ప్రక్క గ్రామాల నుండి వచ్చిఅక్కడ పాట్హ శాలలో చదువుకుంటున్నారు.అందుకనే - సేవాలయా వారికి చాలా మంది సహాయం చేస్తున్నారు. 

అంతకు మించి మనం ఏమిచేయ గలమా -అన్నదే, మనం ఆలోచించ వలసిన విషయం.

తిరిగి వస్తూవుంటే - ఆ కాంపౌండు లోనే - వొక చిన్న పిల్ల మమ్మల్ని చూసి చిరునవ్వుతో   -  చెయ్యి ఊపింది. చాలా ముచ్చటగా వుంది. నేనే  అడిగాను - నీ పేరేమి, ఎన్నో క్లాసు చదువుతున్నావు అని . చెప్పింది. పేరు కృత్తిక. క్లాసు 6  - బీ సెక్షను.

బాగా చదవాలి. మళ్ళీ మేం వస్తాము. వచ్చినప్పుడు నిన్ను తప్పకుండా వెతుక్కుంటూ వచ్చి చూస్తాము - అన్నాము. ఆ పిల్ల సంతోషంగా -సరే, అంది. చూట్టానికీ ముచ్చటగా వుంది. దేవుడి దయ వుంటే - (వుండాలి)- బాగా వృద్ధిలోకి రాగల పిల్ల. కానీ తల్లీ, తండ్రీ లేరు.ఇలాంటి వారిని చూసినప్పుడు - మనమెందుకు, దాదాపుగా, చేయ గలిగే మంచి పనులు, ఏవీ  చేయడం లేదు - అనిపిస్తుంది.

దేశంలో, అనాథలంటూ - ఎవరూ వుండకూడదు. ప్రతి వొక్కరికీ -  నీకు సహాయం నేనున్నాను,  అని చెప్పే ఏదో వొక సహృదయుడు (రాలు)  తోడు వుండాలి. ప్రతి బాలుడు, బాలిక మొహంలో సంతోషం వుండాలి. అది చెరిగిపోనివ్వకూడదు మనం. ఆ సంతోషం మనం చూడాలి.

అప్పుడే - వారు, మంచి పౌరులుగా పెరగ గలరు.

అంటే - మనం చెయ్య గలిగిన మంచి పనులు - యింకా ఎన్నో వున్నాయి చెయ్యడానికి. రోజూ చెయ్య గలిగినవి, వారం, వారం చెయ్య గలిగినవి. నెలా,నెలా చెయ్య గలిగినవి -  కనీసం ప్రతి నెలా , ఏదో, మంచి పని చెయ్యాలి.

ఎందరో ఎంతో మంది మహానుభావులు ఎన్నో గొప్ప పనులు చేస్తున్నారు కూడా. వారికి - చేయూత నివ్వడం కూడా చేయాలి.

యిది వృద్ధుల ఆశ్రమం

బాలల క్లాసు రూము.
వీరి వెబ్ సైటు = సేవాలయ.ఆర్గ్ ; అందులో మీరు వారి పూర్తి వివరాలు చూడొచ్చు. యిప్పుడు యింకా బాగా - ఎన్నో చేస్తున్నారు.

వీరి లాగా - మంచి పనులు - త్వరగా చెయ్యాలనుకునే వారిని - చేసే వారిని తలుచుకుంటే - ఆనందంగా వుంది కదా .

=మీ 

వుప్పలధడియం విజయమోహన్

19, నవంబర్ 2011, శనివారం

చెయ్య గలిగిన మంచి పని = యిప్పుడే చేసెయ్యండి. = స్త్రీ వేధింపు చర్యలు = లంచగొండితనం =మనమేం చెయ్యగలం ? = దేశ / రాష్ట్ర మహిళా కమిషన్ ఎం చెయ్యాలి?


మనిషికి చాలా, చాలా సంతోషాన్నిచ్చే పనులు - మనం నిస్స్వార్థంగా, మరొకరి కొరకు చేసే పనులే అని చెప్పుకోవచ్చు. అవి  చిన్నవే  కావచ్చు. కాస్త  పెద్దవీ  కావచ్చు. కొన్ని సందర్భాల్లో - మహా గొప్ప పనులూ కావచ్చు.  ఏదైనా - మనం నిస్స్వార్థంగా చేసే పనులు మనకు జీవితాంతం  సంతోషాన్నిస్తాయనడంలో  నాకు సందేహం లేదు.  

అవి యితరులకు చెప్పుకోవచ్చా - చెప్పుకోకూడదా?  మన యిష్టం. చేసిన పుణ్యం చెబితే పోతుందని వొక సామెత. సరే. పుణ్యం పోతే పోనీ. మనసుకు ఏదో వొక సంతోషం - అనుకుంటే- చెప్పొచ్చు.   చెబితే - మిగతా వారు కూడా అలాంటివి చేస్తారనుకుంటే   - తప్పకుండా చెప్పొచ్చు.

శ్రీ రామానుజాచార్యుల వారికి - వారి గురువు , చాలా రహస్యం, మరెవరికీ తెలియరాదు -అని నారాయణ మంత్రం ఉపదేశించారు. వెంటనే -  రామానుజాచార్యులు గుడిపైకెక్కి అందరినీ పిలిచి - అందరికీ ఆ మంత్రాన్ని చెప్పారు. అది మంచా కాదా -అన్నది వివాదాస్పదమే. కొందరికి చాలా గొప్ప పని అనిపిస్తుంది.  కొందరికి - మంత్రోపదేశం అలా చేయడం చాలా తప్పు అనిపిస్తుంది.

ఇలాగా - వొక్కొక్క సందర్భం లోనూ - వొక్కొక్కరికి వొక్కొక్క  రకంగా అనిపించడం చాలా సహజం.

అయితే - నిశ్చయంగా, యిది మంచి పనే అనిపించిన దాన్ని - మనం  వెంటనే చేసేస్తే మంచిది. 

వొకాయన అంటారు - మీరు చేయలేని పని చేయక పోతే మునిగి పోయిందేమీ లేదు. కాని, చేయ గలిగిన మంచి పని చేయక పోతే - జన్మ వ్యర్థం అయిపోతుంది.

నిజమే. మనం చేయగలిగిన మంచి పనులు చేస్తూ పోవాలి.

తెలుగులో వొక సామెత వుంది. మేసే గాడిదను - కూసే గాడిద వచ్చి చెడిపిందట. అలాగా, మంచి పని చేయాలనుకునే వాడిని - చేయని వాళ్ళు వచ్చి చెయ్య నివ్వకుండా ఆపుతుంటారు . చేసే వాళ్ళకు విమర్శల వర్షం తట్టుకునే  శక్తి కూడా వుండాలి. అదీ విషయం.

మనమంతా - చిన్న చిన్న - తప్పులు చేస్తూనే వుంటాము. అలాగని - మంచి పనులు చేయ కూడదని నియమమేమీ లేదు. చిన్న తప్పులు చేసిన వాళ్ళు - పెద్ద మంచి పనులు తాము చేయడమో, చేసే వాళ్లకు తోడు పడడమో - చేయకూడదని రూలేమీ లేదు. కానీ  - ఏమీ చేయని వాళ్ళు - చేసే వాళ్ళను - చిన్న తప్పులు చూపించి పరిహాసం చేస్తూ వుంటారు. విమర్శిస్తూ వుంటారు.   

యిప్పుడు దేశం స్థితి అలాగే వుంది. టీం అన్నా లోని ప్రతి సభ్యుల పైనా - ఏదో చిన్న తప్పు రుద్దడమూ - వీరా లంచా గొండి తనం పైన యుద్ధం చేసే వారు - అని విమర్శించడం జరుగుతోంది.  నా ఉద్దేశంలో -ఎవరైనా ఈ యుద్ధంలో చేరవచ్చు. యిప్పుడు మీరు లంచం తీసుకుంటూ వున్నా సరే - ఈ పధ్ధతి పోవాలి అనుకుంటే - అందరూ చేరండి.విమర్శలు చేసే వారు - మారే వారిని కూడా మారనివ్వరు. విమర్శకుల మాట వింటే - దేశం యిలాగే ఎప్పుడూ లంచగొండి దేశం గా వుండి పోతుంది. నా అభ్యర్ధన - అందరూ - ఈ యుద్ధంలో చేరండి. మనమూ- నూరు శాతం ప్రజలు - ఆర్ధిక ఉన్నతికి నోచుకోవాలి. లంచమనే పదం కూడా దేశం నుండీ వెళ్లి పోవాలి.

దేశాన్ని పీడిస్తున్న మరో మహా మారి - స్త్రీలపై వేధింపులు. ఆంగ్లంలో ఈవ్ టీజింగ్ అంటారు కదా. అదన్న మాట. కత్తితో దాడి చేయడం, ఆసిడ్ పోయడం - బస్సుల్లో, రైళ్ళలో వేధించడము   - యివన్నీ ఎక్కువవుతున్నాయి. కొన్ని నగరాల్లో మరీ ఎక్కువ.

చెన్నై నగరంలో - యిది పదిహేడేళ్ళ క్రితం జరిగిన సంగతి.

నేను నగరం మధ్య నుండి మారి - నగర శివార్లలో,  స్వంత ఇల్లు కట్టడానికి ఆరంభించిన రోజులు.  క్రొత్త వూరి నుండి ట్రెయిన్ లో దాదాపు ముప్ఫై కి.మీ. దూరం వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు తెలిసింది - చెన్నై దగ్గర కూడా - స్త్రీలపై వేధింపులు ఎంత ఘోరంగా వుంటుందో.

 సెకండు క్లాసులో వెళ్ళిన రోజు -ప్రతి రోజూ ఇలాంటి వేధింపు చర్యలు చూడవలసి వచ్చింది. సెకండు క్లాసులోనే వొక చిన్న భాగంలో - స్త్రీల భాగం వుండేది. ఈ రెండింటికీ మధ్య  తలుపు లేని వొక ద్వారం వుండేది. చాలా మంది కాలేజీ విద్యార్థులూ, కార్మికులూ - ఆ ద్వారం వద్ద నిలబడి - లోనున్న ప్రతి స్త్రీ పైనా - వొక్కొక్కరి పైనా - అసభ్యకరమైన  పదజాలం విసిరి హింసించే వాళ్ళు. అయిదేళ్ళ పసిపాప నుండి   - ఎనభై ఏళ్ళ ముదుసలి వరకూ - ఎవరినీ వారు విడిచి పెట్ట లేదు.

వచ్చే ప్రతి స్టేషన్ లోనూ - కొత్త వాళ్ళు   రావడం, వాళ్ళలో - మరి కొందరు ఆ ద్వారం వద్ద నిలబడడమూ  -  గుంపు ఎక్కువయ్యే కొద్దీ - స్త్రీల భాగంలోకే వెళ్లి - అక్కడే మరింత రెచ్చి పోయి మాట్లాడడమూ -జరిగేది. మొదటి రోజే - ఈ తంతు భరించడం నాకు చాలా కష్టమయ్యింది. వొక అబ్బాయిని పిలిచి - మన ప్రక్క ఖాళీయే   కదా. అక్కడకెళ్ళి కూర్చోకూడదా- అన్నాను. ఆ అబ్బాయి పెద్దగా నవ్వి - పూర్తిగా స్త్రీల భాగంలోకి చొచ్చుకెళ్ళాడు.

సరే. ప్రక్క నున్న ప్రయాణీకులతో మాట్లాడి - మనమంతా - వారికి - నచ్చచెప్ప కూడదా - అన్నాను. వారంతా, పెదవి విరిచేశారు. ఏమీ లాభం లేదు సార్. వీరు   ఎవరి మాటా వినే రకాలు కారు. మనం చెబితే - మరింత రెచ్చి పోతారు. ఎక్కువ చెబితే - కొట్టినా కొడతారు. వినరు గాక వినరు - అన్నారు. పది రోజులు ఈ తంతు భరించాను. కాని తరువాత - ఏదో చెయ్యాలి. ఏదైనా చెయ్యాలి - అనిపించింది.

పదకొండో రోజు - ఆఫీసు చేరిన వెంటనే - అదే మూడ్ లో -  టెలిఫోను డైరెక్టరీ లో - రైల్వే వారి పబ్లిక్ గ్రీవెన్సస్  సెల్ వారి అడ్రెస్సు, సదరు ఆఫీసర్ల పేర్లు, చెన్నై డివిషన్ సూపరింటెండెంటు   వారి పేరూ , అడ్రెస్సూ అన్నీ రాసుకున్నాను.

తరువాత దాదాపు పది పేజీల సుదీర్ఘ లేఖ తయారు చేసాను. అసలు ఏం జరుగుతోంది - అన్నది పూస గ్రుచ్చినట్టు  రాసాను. దాని క్రిందే - దానికి పరిష్కార మార్గాలు కూడా చాలా రాసాను. అయితే - అవన్నీ - గాంధీ గారి అహింసా మార్గాలే. యివన్నీ రాసి, ఆ అడ్రెస్సులకు అన్నిటికీ పంపించేసి  - అబ్బ, ఏదో చేయగలిగింది చేసాను - అని అనుకున్నా.

తరువాత పది రోజులు ఏమీ కాలేదు. పదకొండో రోజు - యిద్దరు పోలీసు ఆఫీసర్లు మా ఆఫీసుకు - నన్ను వెతుక్కుంటూ వచ్చారు. నా రూముకే వచ్చారు. వారిని కూర్చోమని - పని ఏమిటి - అని అడిగాను.  వారు - నేను రాసిన లేఖను చూపి - అది నేను రాసిందేనా అని అడిగారు. నాకు మనసులో - చిన్న జంకు. కానీ- ఎందుకో - గాంధీ గారు గుర్తుకొచ్చారు. భయమెరుగని గాంధీ దేశంలో పుట్టి - మంచి పనికి భయపడడం ఎందుకనిపించింది.

అంతే. మరి భయం లేదు. జంకూ లేదు. అవును అన్నాను. వారు - అసలేం జరుగుతోందో - నేను చూసినవన్నీ చెప్పమన్నారు. ప్రతి వొక్కటీ - వొక్కటి వదలకుండా - అన్నీ - కాస్త ఆవేశం గానే చెప్పాను.

చివర అన్నాను - ఆ రైళ్ళలో - మా వాళ్ళు గానీ, మీ వాళ్ళు గానీ ప్రయాణం చేసినా - ఎవరూ సంతోషంగా దిగ లేరు. ఎంత మంది స్త్రీలు డిప్రెషన్ కు  లోనవుతున్నారో - మనకు తెలీదు. ఎంత మంది ఈ బాధ భరించలేక  ఉద్యోగాలు, చదువులు వదిలేస్తున్నారో కూడా తెలీదు. ఇవేవీ చేయలేని వాళ్ళు - ఎవరో వొకరు ఆత్మహత్యలు చేసుకున్నా - ఆశ్చర్య పడనక్కర లేదని చెప్పాను.

వారు చాలా వోపిగ్గా విన్నారు. కడపట, నేను యిచ్చిన పరిష్కార మార్గాల గురించి కూడా చెప్ప బోయాను. అప్పుడు   - వారు కాస్త నవ్వి - సార్, మీరిచ్చిన  ఈ వివరాలు మాకు చాలు. మీ పరిష్కార మార్గాలు -అటువంటి దుర్మార్గుల పై పని చెయ్యవు. ఎం చెయ్యాలో - మేం చూసుకుంటాం.  అన్నీ - మీకు కూడా తెలుపుతాం. మీకు మా ధన్యవాదాలు -  అని వెళ్ళిపోయారు.

తరువాత, మా ఆఫీసులోని వాళ్ళంతా - వచ్చి విషయమేమిటని అడిగారు. చెప్పాను. వారందరి ఏకగ్రీవమైన అభిప్రాయం - నేను చాలా తొందర పాటు పని చేసానని. ఈ పోలీసులు మనల్నే వేధిస్తారు కాని - అసలు రౌడీలపై ఏ ఆక్షనూ   తీసుకోరు. పైపెచ్చు - ఆ రౌడీలకు మీ పేరు తెలిసిందంటే - మీపై కక్ష సాధింపు చర్యలకు దిగుతారు - అంటూ ఎన్నెన్నో చెప్పారు.

కానీ అప్పటికి - నా మనసులో - వొకే ఆలోచన. యింత దూరం వచ్చాక - ఏదైనా జరగనీ. చూచుకుందాం-అని. ఏదో అంటారు కదా. రోటిలో తల పెట్టి, రోకటి పోటుకు వెరువరాదని. నా సహ ఉద్యోగులు మాత్రం ఎం జరుగుతుందో, ఏమో  - అని చెబుతూనే వున్నారు, ప్రతి దినమూ.  నాలుగు రోజులు ఏమీ జరగలేదు.

తరువాత - వొక రోజు, మా అన్న కొడుకు వచ్చి- చిన్నాన్న! ఈ రోజు నిజంగా మన పోలీసులు పోలీసుల మాదిరి పని చేసారు - అన్నాడు. తనొచ్చిన ట్రెయిన్ లో - స్త్రీల భాగంలో నిల బడ్డ వారిని - బయటికి లాగి -అంతే కాక, వారి ద్వారం దగ్గర నిలబడ్డ వారందిరినీ బయటికి లాగి - వారి లాఠీలకు బాగా పని కల్పించారట . అందులో - ముఖ్యమైన వారిని - అరెస్టు చేసి కూడా తీసుకెళ్ళారట.    ఆహా - అనుకున్నానే - కానీ, యిది, నా నిర్వాకమే అన్నది అప్పటికి అర్థం కాలేదు.

తరువాత ట్రైన్లో వచ్చిన నా మరదలూ, ఆ తర్వాత వచ్చిన మా ప్రక్కింటి వాళ్ళూ - యిలా చాలా మంది - యిదే చెప్పడం జరిగింది. అంటే  - ప్రతి ట్రెయిన్ లోనూ  - పోలీసులు తమ ఆక్షన్ ను జరుపుతున్నారని అర్థమయ్యింది. అప్పుడు - కాస్త సందేహం - యిది నా నిర్వాకమే నేమో నని. కానీ అనుకున్నా - మరెవరైనా కూడా రాసిండొచ్చుగా     - అని.

తరువాత పదిహేను రోజులు - ప్రతి ట్రెయిన్ లోనూ - యిదే తంతు -విడవకుండా జరిపారు రైల్వే పోలీసులు.

 తరువాత - నాకు వారి పబ్లిక్ గ్రీవెన్సస్ సెల్ నుండీ, చెన్నై రైల్వే సూపరింటెండెంట్ వారి నుండీ -    రిప్లై లేఖలు అందాయి. అందులో - వారు నా లేఖ పై తీసుకున్న ఆక్షన్ అంతా - పూర్తిగా తెలపడమూ,   యిక ముందు కూడా, యిటువంటి స్త్రీ వేధింపు చర్యలు జరగకుండా చూసు కుంటామని  హామీలు యివ్వడమూ - యిలా అన్ని విషయాలూ రాసారు. 

కానీ - వారు, నన్ను మళ్ళీ  పిలవడమో, ఏ రకంగా నైనా నాకు కష్టం కలిగించడమో - అస్సలు చెయ్య లేదు. ఆ రోజు నుండీ - ఈ పదిహేడు సంవత్సరాలుగా - ఆ ట్రెయిన్ మార్గంలో - మళ్ళీ అటువంటి స్త్రీ వేధింపు చర్యలు జరగడం లేదన్నది - వాస్తవం. అటువంటి ఆఫీసర్లకు, ఆ పోలీసులకు - మనం హృదయ పూర్వక అభినందనలు తెలపాల్సిందేగా .ఆ తరువాత ఎప్పుడో, మాయింట్లో వారికి కూడా యివన్నీ  చెప్పాను. ఈ రిప్లై లేఖలు చూపాను.


ఈ మధ్య ముంబై లో జరిగిన కీనన్, ర్యూబెన్ ల హత్యలో - స్త్రీ వేధింపు చర్యలే మొదటి ఘట్టంగా వుండింది. పత్రికల్లో , టీ.వీ ఛానళ్లలో - అక్కడ వున్న వారెవరూ - హతులకు సపోర్టుగా రాలేదని ,యిది చాలా తప్పనీ రాసారు.  నిజమే, కొంత వరకు. కానీ- చాలా మంది ప్రజలలో - రౌడీలకంటే - పోలీసులంటే - ఎక్కువ భయం ఉందన్నది తెలుసు గదా. కానీ రౌడీలకు పోలీసులంటే పెద్ద భయం లేదు.  యిది పోగొట్ట వలసిన బాధ్యత- పోలీసు వ్యవస్థ దే నని చెప్పక తప్పదు. మన దేశమంతటా   -  యిది జరగాలి.

పోలీసుల్లో మంచి వాళ్ళు ఎంతో మంది వుండొచ్చు. కానీ లంచగొండి తనమూ, ఎక్కువే నని ప్రజల నమ్మకం. అటువంటి వారి దగ్గర అన్యాయమే జరుగుతుందని వొక విశ్వాసం. అందు వలన - ఎక్కడ ఏ అన్యాయం జరిగినా - సాధారణ ప్రజలు పట్టించుకోవడం వదిలేశారు.  వారిలో ధైర్యమూ ,విశ్వాసమూ కలిగించ వలసిన  బాధ్యత పాలక వర్గానిదీ, పోలీసులదీను. కొన్ని, కొన్ని చోట్ల ఇది జరుగుతున్నది. చాలా చోట్ల జరగాల్సి ఉంది.

సరే. స్త్రీలపై  వేధింపు చర్యలను - అరికట్టేందుకు - కొన్ని చోట్ల  ( ముఖ్యంగా చెన్నై లో ) అప్పుడప్పుడూ, మహిళా పోలీసులను సాధారణ దుస్తులలో బస్సు స్టాపుల్లోను, రద్దీ ప్రాంతాల్లోనూ నిలిపి,  వారి ద్వారా ఈ రౌడీలను పట్టేస్తున్నారు.  పూర్తిగా పోక పోయినా -  యిప్పుడు, చాలా  తగ్గిందని చెప్పొచ్చు. యిటువంటివి - బస్సుల్లోనూ, యితర రద్దీ ప్రాంతాల్లోనూ - యింకా జరగాల్సిన అవసరం ఉంది.

ముంబై, డిల్లీ లాంటి పట్టణాలలో - స్త్రీ వేధింపు చర్యలు ఎక్కువగానే వున్నాయి. పోలీసు వ్యవస్థ -కంప్లయింటు కోసం ఎదురు చూడకుండా - ముందు చూపు చర్యలు తీసుకుంటే - అంటే-   వేధింపులు జరిగే సమయంలో, జరిగిన చోట, రౌడీలను పట్టుకుంటే, వారికి కావలసిన శాస్తి చేస్తే - పోలీసుల పై ప్రజలకు గౌరవమూ పెరుగుతుంది. మన దేశం మరింత శాంతివంతం గానూ, నేరప్రవృత్తి లేకుండానూ  వుంటుంది.

అలాగే - కంప్లైంటు ఇచ్చే వారిని - మళ్ళీ మళ్ళీ పిలిచి వేధించకుండా , వారిని  నేరస్తుల ముందు పిలువకుండా - వారికి తగిన ప్రోత్సాహం యిస్తూ వుంటే - ధైర్యం గా కంప్లైంటు యివ్వగలరు. యిది మన దేశ / రాష్ట్ర  మహిళా కమిషన్ వారు కూడా పరిశీలించి తగిన సూచనలు, చర్యలు చేబట్టాల్సిన అవసరం ఉంది.

యిది చేస్తేనే - స్త్రీలకూ కూడా పురుషులపై గౌరవం పెరుగుతుంది.

మన  ప్రాచీనులు అంటారు - ఏ దేశంలో అయితే, ఏ యింట్లో అయితే - స్త్రీ కంట తడి పెడుతుందో - ఆ దేశం లో , ఆ యింట్లో, దేవతలు వుండరు. నీళ్ళు కూడా వుండవు. వానలు కురవవు -  అని. అందుకే గాంధీ గారు కూడా అన్నారు - అర్ధ రాత్రైనా, ఏ స్త్రీ అయినా , భారత దేశం లోని ఏ రోడ్డు లో నైన ,ఎక్కడైనా, వొంటరిగా,  ప్రయాణం చేయ గలిగిన పరిస్థితి రావాలి. అప్పుడే, మనకు నిజమైన స్వతంత్రం -అని.

చదువరులకు - వొక విన్నపం. మనమంతా, మన మహిళా కమిషన్ వారికి - యిటువంటి సూచనలు రాయాలి. అప్పుడే - ఈ జగన్నాథ రథ చక్రాలు కదుల్తాయి. మంచి రోజులు వస్తాయి. మంచి పని అనుకుంటే - వెంటనే చేసెయ్యండి. 

=మీ

వుప్పలధడియం విజయమోహన్


12, నవంబర్ 2011, శనివారం

భయమూ - దానికి గల కారణాలూ - మన మానసిక ఆరోగ్యమూ



మనం  కొన్ని వ్యాసాలలో యిది వరకే - మానసిక ఆరోగ్యం గూర్చి లోతుగా పరీక్షించాము .  అందులో - మితి మీరిన కోరికే -మానసిక అనారోగ్యానికి ప్రథమ కారణం అని తెలుసుకున్నాము. అన్ని మతాలలో - వుండేదీ అదే.

కోరిక తప్పు కాదు. కోరిక అనారోగ్యం కాదు. కోరిక లేని నాడు - మనిషే లేడు. కృష్ణుడికి కోరిక లేదా? భగవద్ గీత చెప్పడం ఎందుకు? అర్జునా! యుద్ధం చెయ్యి - అని ప్రోత్సహించడం ఎందుకు?

దేవుడి కోరికను - సంకల్పం  అన్నారు. అంటే - వుట్టి కోరిక కాదు. తీరగలిగే కోరిక. ఆ కోరిక వెనుక, వొక బలమైన సకారాత్మక శక్తి కూడా వుంది. అందు  వలన అది జరిగి తీరుతుంది. మనమైనా అంతే. తీరగలిగే కోరకలు కోరుతూ - వాటి వెనుక, బలమైన, సకారాత్మక శక్తినీ - పెట్టామంటే -  మీ కోరిక వెనుక ప్రకృతి శక్తులన్నీ కూడా తోడుంటాయి. మీ కోరికలు తప్పక తీరుతాయి. అందువలన మీ జీవితంలో - సంతోషమూ, ఆనందమూ - నిండుతాయి. 

అదే - మానసిక ఆరోగ్యమని  చెప్ప వచ్చు. 

కాబట్టి - 

తీరని కోరికలు కోరకండి.  ఎండమావుల వెనుక పరుగెత్తకండి. 

మనిషి ఎవరైనా వొక్క సారి, వొక్క అడుగే వెయ్యాలి. వెయ్య గలడు. ఆ అడుగు ప్రమాణం మీ శక్తి సామర్థ్యాల పైన ఆధారపడి  వుంటుంది. వొకరి అడుగు చిన్నది గాను, మరొకరిది, కాస్త పెద్దది గాను వుండొచ్చు .

నడిచి వెళ్ళే వాళ్ళు - యిరవై, ముప్ఫై  మైళ్ళు నడవ గలిగితే - పరుగెత్తే వాళ్ళు - వొక్క కిలోమీటరు దూరం కూడా వెళ్ళ లేరు. జీవితమంతా పరుగెత్తాలనుకునే వాళ్ళు - ఎక్కువ కాలం పరుగెత్త లేరు. ఏ విషయం లో నైనా అంతే.

యివి జ్ఞాపకం పెట్టుకుంటే - హాయిగా - జీవితమంతా గడిపెయ్య వచ్చు.

సరే. మానసిక అనారోగ్యంలో - మరికొన్ని సమస్యలున్నాయి.

మనిషికి భయం -అనేది పెద్ద అనారోగ్య లక్షణం. భయానికి ముఖ్య కారణం మన అజ్ఞానం, అశ్రద్ధ .

ఉదాహరణకు - చాలా మందికి - బొద్దింక అంటే  భయం. అది పెద్దగా కరవదని తెలుసు. కరిచినా పెద్ద ప్రమాదమేమీ లేదని తెలుసు. అయినా - అదంటే కాస్త భయం. ఎందుకంటే -  బొద్దింకకు  మనమంటే భయం లేదు. నేరుగా - మనమెక్కడున్నామో అక్కడికే వచ్చేస్తుంది. మీరు దూరంగా - తోసేసినా, మళ్ళీ దగ్గరగా వచ్చేస్తుంది. కాస్త ఏమరుపాటుగా వుంటే - దుస్తుల్లోకి వెళ్లి పోతుంది. ఎందుకో తెలీదు. యిదీ చాలా మంది భయం.  కొంత మంది - దాన్ని చంపకుండా, దాని మీసాలు పట్టుకుని దూరంగా విసిరేస్తారు. వారికి  బొద్దింక భయం లేదని చెప్పొచ్చు. కొందరు ఏ చీపురు కట్ట తోనో - దానిపై పట్టుమని కొడతారు. అది చచ్చిపోతుంది. తరువాత దాన్ని చీపురుకట్టతోనే బయట పార వేస్తారు.యిక్కడ హింసా వుంది. భయమూ వుంది. 

మన యిండ్లలో వుండే యెర్ర చీమ - దేవుడిని వరం అడిగిందట. నేను కుడితే చచ్చిపోవాలని. దేవుడు తథాస్తు అన్నాడట. అప్పటినుండి యెర్ర చీమ కుడితే - దాన్ని చంపేస్తారు. అది చచ్చిపోతుంది. వరం ఎలా అడగాలో కూడా చీమకు తెలియలేదు. బొద్దింక - పాపం, కుట్టక పోయినా చచ్చి పోతుంది.

సరే. పామంటే - చాలా మందికి భయం. అందులో విషం వుండే పాము ఏదో, విషం లేని పాము ఏదో చాలా మందికి ఖచ్చితంగా తెలీదు.ఏ పామైనా భయమే. కానీ, కొంత మందికి భయం లేదు. వారు, పెద్ద పెద్ద నాగుపాములతో కూడా ఆడుకుంటారు. పాములను చంపడం తేలికే. కాస్త ధైర్యమూ కావాలి. మెళకువలూ తెలిసుండాలి. అంతే. తెలీకపోతే - పాములకు దూరంగా వుండడమే - మంచిది.

కుక్కలంటే - కొంత మందికి భయం. పిచ్చి పట్టని కుక్క సాధారణంగా, మనిషిని ఏమీ చెయ్యదు. ఎప్పుడో వొక సారి కొరక వచ్చు. అప్పుడు - సరైన ఇంజెక్షన్లు క్రమం తప్పక వేసుకోవాలి. కానీ పిచ్చి పట్టిన కుక్క - తప్పక కొరుకుతుంది. అటువంటిది - ప్రతి వొక్కరికీ - చాలా అపాయం. అప్పుడు ముఖ్యంగా - కొరికిన భాగాన్ని బాగా నీళ్ళతో కడగడమూ   ముఖ్యమే. తరువాత - సరైన ఇంజెక్షన్లు క్రమం తప్పక వేసుకోవాలి. లేదంటే చాలా అపాయం.  కుక్క కాటును ఎప్పుడూ అలక్ష్యం చేయకండి. వొక గంటలోగా - ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా - మీ మొదటి ఇంజెక్షను వేసుకోండి. ఏ కుక్క కొరికినా క్రమం తప్పకుండా - ఇంజెక్షన్లు వేసుకోండి.

అలాంటి పిచ్చి కుక్క నన్నూ వొక సారి వెనుక నుండీ వచ్చి కొరికింది. - నాలుగేళ్ల క్రిందట. వెంటనే కొరికిన భాగాన్ని నీళ్ళతో బాగా కడిగేసి - మా ఊళ్లోనే వున్న డాక్టరు గారి దగ్గర ఆంటీ రాబీస్ ఇంజెక్షన్లు క్రమం తప్పక వేసుకున్నాను. తరువాత దాని వలన ప్రమాదమేమీ లేదు. అయితే - ఈ మధ్య మన రాష్ట్రంలో - వివిధ ప్రాంతాలలో - పిచ్చి కుక్క చాలా మందిని కొరికిన సంఘటనలు చాలా విన్నాము.  అవి కాస్త పెద్ద ఊళ్ళే అయినా -   ఆంటీ రాబీస్ ఇంజెక్షన్లు - అక్కడ లేక పోవడం చాలా దురదృష్టకరం.

మీ వూళ్ళో - ఈ ఆంటీ రాబీస్ ఇంజెక్షన్లు ప్రతి డాక్టరు దగ్గరా వుండాలి. లేకపోతే - వెంటనే - ప్రభుత్వం వారికి ప్రతి వొక్కరూ రాయండి. పిచ్చి కుక్క కాటుకు, పాము కాటుకు మందు మాత్రం - ప్రతి వూర్లో వుండి తీరాలి.  అంతే కాదు. కరిచిన వెంటనే కరిచిన భాగాన్ని కడగడము, వెంటనే డాక్టరు గారి దగ్గరకు వెళ్ళడము మనం చెయ్యాలి. దీన్ని గురించి మరింత సమగ్ర సమాచారం - నా మరో బ్లాగులో - వైజ్ లివింగ్ ఐడియాస్ . బ్లాగ్ స్పాట్. కాం లో రాసాను. ఎందుకంటే - భారత దేశంలోని - ప్రతి గ్రామంలోనూ- ప్రతి పట్టణంలోనూ - వీధి కుక్కలూ వున్నాయి. కొంత వరకూ - పాములూ వున్నాయి. అందు వలన వాటి వలన వచ్చే ప్రమాదాలూ, విరుగుళ్లూ అందరికీ తెలిసుండాలి. నిజానికి - యిది - ఐదో  తరగతి చదివే విద్యార్థికి కూడా  సమగ్రంగా తెలిసుండాలి. 

మన దురదృష్టం ఏమంటే   - మన చదువులో - మనకు ఉపయోగ పడేది చాలా తక్కువ. ఎప్పుడో ఏదో చేసిన ఔరంగజేబు ను గురించి చాలా చదువుతాము. యిందు వలన మనకొచ్చే ఉపయోగం - నన్నడిగితే సున్నా.

దారిలో రోజూ కనపడే పాములు, కుక్కలు మనల్నేం చేస్తాయో, మనమేం చెయ్యాలో - మనకు తెలీదు. వాటికి కావలసిన మందులు - ఘనత వహించిన మన  ప్రభుత్వం వారు - చాలా ఊళ్లలో సప్లయ్ చేసినట్టు లేదు. మనమూ అడిగేటట్టు లేదు. సరైన చదువు ద్వారా వీటన్నిటిని గురించిన విజ్ఞానమూ రావాలి. సరైన విజ్ఞానముతో బాటు, వీటివలన వచ్చే భయమూ పూర్తిగా పోవాలి. ఈ రెండూ చదువు ద్వారా జరగడం లేదు. కనీసం పాము యొక్క మృత శరీరాన్నైనా  విద్యార్థులు తాకి పార వేసేటట్టుగా వుండాలి. 

నాగు పాములంటే మనకు భయమూ వుంది. భక్తీ వుంది. కానీ పాముకాటుకు మన వూళ్ళో మందు వుందో లేదో మాత్రం తెలీదు.



మనకు తెలుసు - మన పూర్వీకులలో చాలా మంది అరణ్యాలలో వుండే వారని. కొందరు రుషులుగా తపస్సు చేసుకుంటూ వుంటే - మరి కొందరు - వేట తోనో, మరో వృత్తి తోనో  అడవుల్లో జీవించే వారు.  పులులు, సింహాలు కూడా వున్న అడవుల్లో - వారు భయపడ కుండా వుండే వారు.  మేము పిల్లలు గా వున్న సమయంలో కూడా - వూరి బయటే- పెద్ద అడవులుండేవి .  మృగాలూ, పాములూ, తేళ్ళూ- అన్నే వుండేవి. కానీ- మనస్సులో ఎవరికీ భయం వుండేది కాదు. యిప్పుడు - అడవులూ లేవు. మృగాలూ చాలా వరకూ లేవు. కానీ - పాములు - అందులోనూ విష సర్పాలు యింకా  చాలా వున్నాయి. వాటి కాట్లకు ఉపయోగ పడే పాత మందుల పరిజ్ఞానం యిప్పుడు లేదు.కొత్త మందులు సప్ప్లై  లేదు. 

వీధి కుక్కలు వున్నాయి. వర్షాలు వొచ్చినప్పుడో, పిల్లలు పుట్టినప్పుడో - వొక్కొక్క సారి - వాటికి పిచ్చి పడుతూ వుంటుంది. అలాంటప్పుడు, అవి స్వంత పిల్లల్ని కూడా చంపేయడం జరుగుతూ ఉంది. అప్పుడే - కనిపించిన మనిషినల్లా కొరకడం కూడా జరుగుతూ వుంటుంది. అప్పుడు - మన ఆధునిక పరిజ్ఞానం ప్రకారం - వాటిని పట్టుకుని , రెండు వారాలు వాటిని జాగ్రత్తగా గమనించమని అంటారు. యిది నాకు వొక పిచ్చి సలహా గా కనిపిస్తుంది.

నన్నడిగితే - పిచ్చి కుక్కను మీరు పట్టుకునే ప్రయత్నం చేయడమంత    మూర్ఖత్వం మరోటి లేదనిపిస్తుంది. బ్లూ క్రాస్ వాళ్ళను పిలిచి - అయ్యా- పిచ్చి కుక్క మమ్మల్ని కరిస్తే - మేము దాన్ని ఏం చేయాలి - అని వారిని అడగండి.  సమాధానం వాళ్ళ దగ్గరా లేదు. యిది ఎలా వుంటుందంటే   -  మమ్మల్ని ఎవడైనా మర్డరు లేదా రేపు చేయడానికి వస్తే - మేమేం చెయ్యాలి అని పోలీసు వాళ్ళను అడగండి. వాళ్ళేం చెబుతారు? మీరు చట్టాన్ని మీచేతిలోకి తీసుకోకూడదు. మా దగ్గరకు వచ్చి చెప్పండని చెబుతారు.

మిమ్మల్ని మర్డరు చేసిన తరువాత పోలీసు స్టేషనుకు వెళ్లి చెబుతారా.

మిమ్మల్ని రేపు చేసేంత  వరకూ ఆగి తరువాత పోలీసు స్టేషనుకు వెళ్లి చెబుతారా. 

మిమ్మల్ని పిచ్చి కుక్క కరిచేంత   వరకూ చూస్తూ వుండి , దాన్ని మెల్లగా పట్టుకుని బ్లూ క్రాస్ వారికి అప్పగిస్తారా?

నాకయితే - మన డెమాక్రసీ ప్రభుత్వాల  కంటే - కొంత మంది పాత కాలపు రాజులు ఈ విషయంలో - తెలివిగా చట్టాలు చేసే వారని అనిపిస్తుంది.  మన చాలా భయాలకు కారణం మన ప్రస్తుత విద్యా విధానము, పాలనా విధానము, మన చట్టాలు, వాటిని మనం అమలు చేస్తున్న తీరు  - అని చెప్పక తప్పదు.

మిమ్మని రేపు చేసారనుకోండి. మీరూ తీరిగ్గా వెళ్లి పోలీసు వారికి రిపోర్టు ఇచ్చారనుకోండి.  ఏం జరుగుతుందో - మనకు తెలీదా. పోలీసు స్టేషన్లో ఏమీ జరక్క పోయినా - మరో సారి పత్రికల్లో, కోర్టుల్లో తప్పక  మీ రేపు జరుగుతుంది. సరే. కేసు ఏ యుగంలో ముగుస్తుందో - ఎలా ముగుస్తుందో ఎవరూ చెప్ప లేరు.

మన చాలా భయాలకు - కారణం మన చట్టాలూ, దాన్ని మనం అమలు చేస్తున్న విధానమే అని నాకు అనిపిస్తుంది. జాతిని, పూర్తిగా నిర్వీర్యం చేసే ఈ పాలనా విధానం మారాల్సిన అగత్యం ఉంది. 

ఈ మధ్య కీనన్ సాన్తోజ్ , ర్యూబెన్ ఫెర్నాండెజ్ అనే యిద్దరు యువకులు  ముంబై వీధులలో గూండాలచేత హత్య చేయ బడిన విషయం  మనకందరికీ తెలిసిన విషయమే.వొక అమ్మాయిని, పట్ట పగలు, నడివీధిలో, గూండాలు  అవమానం చేస్తూ వుంటే - సహించ లేక వాళ్ళను ఈ యిద్దరు యువకులూ అడ్డుకున్నారు. అక్కడికక్కడే - వాళ్ళను ఆ గూండాలు కత్తులతో పొడిచి చంపేశారు.   సరే. నలభై మంది ఆ ఘటనను చూస్తూ వున్నారు. కానీ   వారెవరూ  ఆ గూండాలను అడ్డుకోలేదు. కీనన్ తండ్రి గారు - తరువాత "కీనన్   చేసింది సరి అయిన  పని.  పిరికి వాడిగా జీవించడం కంటే - అన్యాయాన్ని ఎదుర్కొని కీనన్ లాగ మరణించడమే మంచిది" అన్నారు.

నిజమే. మన సమాజం అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్య వంతులను తయారు చెయ్యాలి.  పిరికి వాళ్ళను కాదు.

కానీ - ఆ చూస్తూ ఊరుకున్న నలభై మందిని అడగండి - వాళ్ళెందుకు వూరుకున్నారో తెలుస్తుంది. మన చట్టాలు, మన పోలీసులు, మన పాలనా వ్యవస్థ  - ఏ వొక్కటీ మనలను ధైర్య వంతులను చేసేవి కావని తప్పక చెబుతారు. వారు భయపడింది - గూండాలకు కాదు. వారి వెనుక నున్న వారికి. చట్టాన్ని తమ చేతిలో కీలు బొమ్మగా నడిపిస్తున్న వారికి.  యిది మారాలి. యిది మారాలంటే - మన విద్యా వ్యవస్థ మారాలి. మనలను చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వారిగా తయారు చేసే  విద్య రావాలి. 

మీ వూళ్ళో - గూండాలెవరో - మీ వూళ్ళో పోలీసులకు తెలీదా.   వాళ్ళేం చేస్తున్నారో వీరికి తెలీదా. మరి గూండాలు -  గూండాలుగానే  ఎలా కొనసాగుతున్నారు?

యిప్పుడు మన దేశంలో -ఏ విషయాన్ని కదిపినా - వందల, వేల, లక్షల కోట్ల లంచ గొండి తనం  బయటకు వస్తూ ఉంది. మరి - ఈ వ్యవస్థను సరిచేసే నాథుడు ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు. పాలకులలో లేని మానసిక ఆరోగ్యం ప్రజలలో ఎలా వుంటుంది.

యథా రాజా, తథా ప్రజా. మీరు ఏ రాజా గురించైనా అనుకోండి. దాదాపు యిదే కథ గా ఉంది.

ఈ వ్యవస్థ మారాలి. ఎలా మారుతుంది. మనం అందరూ కలిసి మార్చాలి. కనీసం అది మార్చడానికి ప్రయత్నిస్తున్న - అన్నా హజారే, రాం దేవ్ జీ, జయప్రకాశ్ నారాయణ్   లాంటి వారికి పూర్తి మద్దతు నివ్వాలి.

పాలకుల లోనూ, ప్రజలలోనూ - న్యాయానికి, ధర్మానికి విలువ వచ్చేటట్టు మనం చూడాలి.  అది వుంటే - మనలోని భయాలు చాలావరకు పోతాయి.   అది రావాలంటే - మన విద్యా వ్యవస్థ - బాబర్లు , ఔరంగజేబులను కాస్త వదిలి పెట్టి - ప్రస్తుత సమాజ సమస్యలకు రావాలి. మానవ విలువలను విద్యార్థులలో నింపాలి. కనీసం వచ్చే తరం అయినా బాగుంటుంది. భయం లేని వారిగా, ధైర్య వంతులుగా వుంటారు. చట్టాలను కాస్త మానవతా దృక్పథంతో తయారు చెయ్యాలి. వాటిని అమలు చెయ్యడం కూడా అలా వుండాలి. 

యిదంతా ఎందుకు చెబుతున్నానంటే -  అమెరికాలో , బ్రిటన్ లో ప్రజలకు   వున్న  ధైర్యం భారత దేశ ప్రజలకు ఈ రోజు లేదు.  అది వారి తప్పు కాదు. పాలకుల తప్పు. అటువంటి పాలకులను  ఎన్నుకోవడం ప్రజల తప్పు.

భయాన్ని గురించి మనం తెలుసుకోవలసిన మరి కొన్ని ముఖ్యమైన విషయాలు మరో వ్యాసంలో చూద్దాం.

= మీ

వుప్పలధడియం విజయమోహన్

2, నవంబర్ 2011, బుధవారం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడెలా వుంది? = భిన్నత్వంలో ఏకత్వం = దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ = నాది భారత దేశం. అంతే.


1953, నవంబర్, వొకటవ తేదీ నాడు కర్నూలు రాజధానిగా  ఆంధ్ర రాష్ట్రం గా మొదట అవతరించి, తరువాత, 1956 , నవంబర్,వొకటవ  తేదీ నాడు హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ గా మారిన మన రాష్ట్రం  ఇప్పుడెలా వుంది? ఎందుకలా వుంది? 

మొన్న,మొన్న జరిగిన అసెంబ్లీ ఎలెక్షన్లలో కూడా, ప్రజలందరూ - సమైక్యంగా వుండాలనే పార్టీలకే వోటు చేసారు. ఆ తరువాత  వై.యస్.ఆర్. గారు పోవడమూ, మరో సరైన, సమర్థుడైన, అందరూ వొప్పుకో గలిగే  నాయకుడు రాక పోవడమూ జరగడం తో -  వేర్పాటు వాదం బలపడిందని అనిపిస్తుంది.

భారత దేశంలోనే - మొదటి నుండి - భిన్నత్వంలో ఏకత్వం - అని మనం అంటున్నా కూడా,  ఏకత్వాని కంటే, భిన్నత్వానికే ప్రాముఖ్యమిచ్చే  రాజకీయ వాదులు - అన్ని రాష్ట్రాల్లో బల పడుతుండడం  మెల్ల మెల్లగా జరుగుతోంది.

ప్రతి రాష్ట్రంలోనూ యిదే కథ. భాషకు చాలా ఎక్కువ ప్రాధాన్యత నిచ్చే తమిళనాడు లాంటి కొన్ని రాష్ట్రాలలో తప్ప - భాష కూడా మనుషులను కలిపే ముఖ్యమైన సాధనంగా వుండడం లేదు.  

అంటే - వేర్పాటు వాదాలకు - బలమైన కారణాలే లేవా? వుంటాయి. విడిపోవడానికి ఎన్నో బలమైన కారణాలు మనం చూడొచ్చు. అలాగే - కలిసి వుండాలంటే కూడా - ఎన్నో బలమైన కారణాలూ మనం చూడొచ్చు.

యిది పాత కథే. గ్లాసు అర్ధం నిండి వుందా? అర్ధం ఖాళీగా వుందా? అనేది - చూసేవారి దృక్పథం పైన ఆధార పడి వుంది. వారూ కరెక్టే. వీరూ కరెక్టే. నేను ఖాళీనే చూస్తాను -అనుకుంటే - ఖాళీనే చూడొచ్చు. నేను నిండి వున్న భాగాన్నే చూస్తాను - అంటే -  నిండి వున్న భాగాన్నే చూడొచ్చు.

అమెరికాలో - యిప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్ళలో - యాభై శాతం పైన - చాలా త్వరగా, విడాకులలో, ముగిసిపోతూ వుందట. వీరంతా ఖాళీ భాగాన్ని ఎక్కువగా చూస్తారనిపిస్తుంది . మిగతా వారు కలిసే వున్నారు. వీరు నిండి వున్న భాగాన్నే ఎక్కువగా చూస్తూ వున్నారని అనుకోవచ్చు.

కొంత మంది లాయర్ల వద్దకు వెళితే - ఎంత అన్యోన్యమైన భార్యాభర్తలకు కూడా - ఖాళీ గ్లాసు భాగంలోని జీవితాన్నే చూపించి -  సునాయాసంగా విడాకులు ఇప్పించేయగలరు. మరి కొంత మంది లాయర్ల దగ్గరికి వెళితే -  విడాకులకోసం పోట్లాడుతూ వచ్చిన వారిని కూడా కలిపేయ గలరు. 

వైవాహిక జీవితంలో - అసలు పోట్లాడని భార్యాభర్తలున్నారా? అలాటి జీవితంలో అస్సలు రుచి లేదని కూడా మనకు తెలుసు కదా. అలాగని - పోట్లాటలు మాత్రం జ్ఞాపకం వుంచుకొని - అందరూ విడిపొతున్నారా?  రోజూ కొట్లాడే భార్యాభర్తలకు కొందరికి - వొకరినొకరు చూడకుంటే - క్షణమైనా గడవదు. వాళ్ళు కలిసే వున్నారు. ఎప్పుడో వొక రోజు కొట్లాడి,  ఆ మాత్రానికి, విడాకుల వరకు పొయ్యే భార్యా భర్తలు కొందరు ఈ కాలంలో తయారవుతున్నారు.

ఇల్లైనా అంతే.  జిల్లా అయినా అంతే. రాష్ట్రమైనా అంతే. దేశమైనా అంతే. యిప్పుడు మన దేశానికి కూడా, దేశమంతటా వొప్పుకో దగ్గ నాయకుడో, నాయకురాలో కావాలి. దేశ నాయకుడంటే -   దేశమంతా నాది. దేశ ప్రజలందరూ - నా వాళ్ళు -వారందరి బాగు కోసం నేను కృషి చేస్తాను - అని మనసారా  కోరుకునే వారు, ప్రతి ప్రాంతం లోని వారితో సులభంగా కలిసి పోయే వారూ నాయకులు గా రావాలి.

మొట్ట మొదట భారత దర్శనం అని - దేశమంతటా యాత్ర చేసిన గాంధీ గారు - దేశ నాయకుడయ్యారు. మరెంతో మంది స్వాతంత్ర్య యోధులున్నా - దేశమంతటా తిరిగిన నాయకుడుగా గాంధీ గారే మనకు మొదట కనిపిస్తారు. స్వాతంత్ర్యం తరువాత    - నెహ్రూ గారు దేశమంతటా తిరిగి -తద్వారా -దేశప్రజల  మనస్సులో - సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

ఎంతో మంది ప్రధాన మంత్రులయారు. కానీ - భారత దేశమంతటా తిరిగి, అందరితో కలిసిన  ప్రధాన మంత్రులుగా - నాకు మాత్రం ముగ్గురే జ్ఞాపకం వస్తారు. నెహ్రూ గారు, ఇందిరా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు.

మిగతా ఎవరూ - దేశమంతటా తిరిగారా లేదా అని నాకు తెలీదు. వారు, వచ్చిందీ, పోయిందీ కూడా గుర్తు లేదు. యిప్పుడు యల్.కే. అద్వానీ గారు దేశంలోని కొన్ని ముఖ్య భాగాలలో రథ యాత్ర చేస్తున్నారు. నిజమే.  కానీ - దక్షిణ భారతంలో కూడా - ఆయన హిందీ లోనే - మాట్లాడి వెళ్లి పోతే - ఆయన వచ్చిందీ, పోయిందీ ఎవరికీ గుర్తుండదు.  అదే - యిందిరా గాంధీ గారు  కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ  వస్తే - ఆంధ్ర దేశంలో రెండు ముక్కలు తెలుగులోనూ, తమిళనాడులో తమిళంలోనూ కర్ణాటకా లో కన్నడంలోనూ తప్పక మాట్లాడుతారు. తరువాత ఆంగ్లంలో మాట్లాడుతారు. ప్రజల మనస్సులో నిలవాలనే ప్రయత్నం చేస్తారు. మిగతా వారిలో అది చాలా తక్కువ.

సరే. యిప్పుడు - దేశ నాయకులుగా వుండాలనే కోరిక వున్న వారు కూడా ఏ పార్టీ లోనూ వున్నట్టు అనిపించదు. రాష్ట్రం సంగతికి వస్తే - అదే సంగతి. రాష్ట్రంలోని అన్ని భాగాలలో నివసించిన వారికైతే -  అన్ని భాగాలనూ వొకే రకంగా చూడాలనే కోరిక వుంటుంది.  తాము పుట్టిన జిల్లానుండి కూడా బయటికి పోనీ వారికి - తాము తప్ప మిగతా అందరూ బాగున్నారు-అని అనిపించడం  సాధారణంగా జరుగుతుం ది. 

అదే విధంగా, వొకే రాష్ట్రంలో, పుట్టి పెరిగి, మరో రాష్ట్రం కూడా చూడని వారికి, జాతీయతా భావం రావడం కాస్త కష్టమవుతుంది. ఇప్పుడున్న ముఖ్య మంత్రులు కానీయండి, యం.యల్.ఏ.లు కానీయండి - ఏ  వొకరిద్దరు తప్ప - దాదాపు అందరూ - తమ రాష్ట్రపు ఎల్లలు దాటని వారే. మరో రాష్ట్రంలో - రెండేళ్ళు వుండి వుంటే - వారి దృక్పథం మరోలా వుంటుంది.

మా నీళ్ళు   మాదే. మా బొగ్గు మాదే. మా గాలి మాదే - అని  రామారావు గారో, జయలలిత గారో అనరు.  అలా అనే వారు - ఆ రాష్ట్రపు పొలిమేరలు దాటలేదని అర్థము చేసుకోవచ్చు.

పొరుగు రాష్ట్రం వారిపట్ల శివ సేన వారు వ్యవహరించేటట్లుగా - టెండుల్కర్  వ్యవహరించలేడు కదా. 

నాయకులు మారాలి. కనీసం భారత దేశమంతా మనది - దేశమంతా అభివృద్ధి చెందాలి - అనే నాయకులు రావాలి. నిజమైన, హృదయపూర్వకమైన జాతీయ దృక్పథం రావాలి.  ప్రతి మంత్రీ, ప్రతి యమ్.యల్.ఏ., ప్రతి యమ్.పీ. భారత దేశమంతా తిరిగీ, ప్రతి సంస్కృతినీ ఆకళింపు చేసుకున్న వారిగా - ప్రతి వోక్కరు నా వారే - అనుకునే వారు గా వుంటే - మన దేశం చాలా బాగు పడుతుంది.

తెలంగాణా రావాలా, వద్దా - అన్నది ప్రశ్నే కాదు. ప్రజలు కావాలనుకుంటే  రావచ్చు. ప్రజలు వద్దనుకుంటే - రాకపోవచ్చు.  చిన్న రాష్ట్రాలలో - మంచి నాయకులుంటే   -  అభివృద్ధి బాగానే వుంటుంది. అయితే- పెద్ద రాష్ట్రాలలో కూడా - అటువంటి అభివృద్ధి సాదించవచ్చు .మనసుంటే - మార్గం వుంటుంది.

కానీ - అభివృద్ధి అంటే - నేలకా, మనుషులకా - అన్నది మనం అర్థం చేసుకోవాలి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే  మనుషులోయ్ - అన్న సత్యాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. కొన్ని, కొన్ని ప్రదేశాలలో - ప్రకృతి వనరులు వుండవు. కొన్ని ప్రదేశాలలో - ఎక్కువగా వుంటాయి. వొక జీవ నది డెల్టా ప్రాంతంలో పండే పంటలు - మనం ఏం చేసినా - కొన్ని ప్రాంతాలలో పండే అవకాశం లేదు.  వొక చోట గాసు నిల్వలు వుండొచ్చు. మరొక చోట బొగ్గు గనులు వుండొచ్చు. వొక చోట రక రకాల ఖనిజాలు వుండవచ్చు. యిలా - ఎన్నో రకాల ప్రకృతి వనరులు - వివిధ ప్రదేశాలలో వుండ వచ్చు.  నా గాసు, నా బొగ్గు అని అనుకుంటే - బొగ్గు వాడికి గాసు లేదు. గాసు వాడికి బొగ్గు లేదు. అందుకే అన్నారు - దేశమంటే  మనుషులోయ్ - అని.

ముంబై లాంటి మహా పట్టణం - దేశంలో  మరొకటి లేదు. శివ  సేన అది మాదే అంటున్నారు. మరి డిల్లీ ఎవరిది? అలాగే - హైదరాబాద్ ఎవరిది? చెన్నై ఎవరిది?  దేశమంటే  మనుషులే కానీ ఆయా ప్రదేశాలు కావు. యివన్నీ భారతీయులందరిదీ .

మరి ముంబై లాగా చెన్నై ఎందుకు కాలేదు? చెన్నై లాగా హైదరాబాద్ ఎందుకు కాలేదు? హైదరాబాద్ లాగా  చిత్తూరు, కర్నూలు ఎందుకు కాలేదు? చిత్తూరు లాగా, మావూరు ఎందుకు కాలేదు? అలా ఎప్పటికీ కావు.కాలేవు.   కాకుంటే - అన్ని ప్రాంతాలలో - రోడ్లు బాగుండాలి . ఆ రోడ్లు బాగా వేయనివాడు ఖచ్చితంగా - మీ / మా వూరి వాడే అయివుంటాడు. ప్రతి ఊరికీ - మంచి నీటి సదుపాయం వుండాలి. అవి మన రాష్ట్రంలోని నదులు, చెరువుల నుండే  రావాలి. లేదంటే - పక్క రాష్ట్రం నుండీ అయినా రావాలి. 

భారతీయులందిరికీ వారి వారి వూర్లో రోడ్లు, నీళ్ళు, స్కూళ్ళు, దగ్గరలో కాలేజీలు, ప్రతి ప్రదేశంలోని ఉద్యోగాల్లో పాల్గొనే హక్కు - ఇవీ మనకు కావలసిన కనీస సౌకర్యాలు. మన ఊళ్లోనే - వొక స్టీలు ఫాక్టరీ, వొక బొగ్గు గని, వొక నది, వొక విమానాల కర్మాగారం వుండాలంటే - కాదు కదా.

యింతకు ముందు, నాయకులకు వుండ వలసిన మనస్తత్వం గురించి అనుకున్నాము. మనకు కూడా - ఉద్యోగాల కోసం, వేరే ఉపాధుల కోసం  దేశంలో ఎక్కడికయినా వెళ్ళ గలిగే మనస్తత్వమూ, స్వాతంత్ర్యమూ రెండూ వుండాలి. వొక జోకు చెబుతారు. టెన్ సింగ్ నార్కే, ఎడ్మండ్  హిల్లరీ  ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కి - అబ్బ, అంటూ కూర్చున్నారట. అంతలో - అక్కడికి - వొక మలయాళీ అతను - చాయ్, చాయ్ - అంటూ - టీ అమ్మ వచ్చాడట. అది మలయాళీల మనః స్వాతంత్ర్యానికి ఉదాహరణగా చెబుతారు.

తెలుగు వారు వొకప్పుడు వున్న వూరు కదిలి వెళ్ళే వారు కారు. యిప్పుడిప్పుడు వెళుతున్నారు.  రైతు సమూహం తప్ప, మిగతా అందరూ - అన్ని ప్రదేశాలకూ వెళ్లి ఉండగలిగే  మానసిక స్వాతంత్ర్యం కలిగి వుండాలి.భారత దేశానికి యిది చాలా ముఖ్యం. అలాగే - అందరూ, నా వారే - అనే మనస్తత్వమూ వుండాలి. ఎక్కడో పుట్టిన మదర్  థెరెసా కున్న భావం మనలో కూడా వుండాలి కదా.

పైనున్న మ్యాపు అలాగే వుంటుందా , మారిపోతుందా?  ఎప్పుడు?

ఏమో. నాకు తెలీదు. కానీ - ఖమ్మం  పక్కన  తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి అలాగే వుంటాయి. నల్గొండ ప్రక్కన - కృష్ణా, గుంటూరు లు అలాగే వుంటాయి. మహబూబ్ నగర్ ప్రక్కన కర్నూలు, ప్రకాశంలు అలాగే వుంటాయి. దేవుడు పెట్టినవి, ఏవీ, ఎక్కడికీ మారవు. అక్కడి గాలి ఇక్కడికీ, యిక్కడి వానలు అక్కడికీ పోతూనే వుంటాయి. రాజకీయ వాదులు మరీ స్వార్థపరులు కాకుంటే - నదులు మహారాష్ట్రలో పుట్టినా, కర్నాటకాకు, అక్కడి నుండి తెలంగాణా ప్రాంతం ద్వారా కోస్తాకూ - అక్కడి నుండి బంగాళాఖాతానికీ వెళ్ళుతూనే వుంటాయి. కాళిదాసు గారు -మహా కవి కాక ముందు -  తానున్న కొమ్మను తానే నరుకుతూ ఉన్నాడట. అలా  మన నెత్తిన మనమే రాళ్ళు వేసుకునే పనులు ఎన్నైనా, ఏ రాష్ట్రం వారైనా చెయ్యొచ్చు - నదుల విషయంలో.  లేదంటే - రాష్ట్రాలు ఎన్నైనా మనమంతా వొక్కటే.

నేను ఉద్యోగ రీత్యా - దేశంలోని - దాదాపు అన్ని ప్రాంతాలలో - నివసించవలసి వచ్చింది. బెంగాల్ ,అస్సాం, కోస్తా, హైదరాబాద్, తమిళనాడు లతో సహా ఎన్నో ప్రాంతాలలో ఎన్నో సంవత్సరాలు గడిపాను. నాకు - ఆ అన్ని ప్రాంతాలూ నచ్చాయి. మనుషులూ నచ్చారు. భాషలూ నచ్చాయి. కానీ రాజకీయ వాదులు మాత్రం చాలావరకు స్వార్థ పరులు గానే వున్నారు. 

యిప్పుడు నా రాష్ట్రం ఏది? నాకు తెలీదు. నాది భారత దేశం. అంతే.


 = మీ 

  వుప్పలధడియం విజయమోహన్   




31, అక్టోబర్ 2011, సోమవారం

ఎస్.పీ.బాలసుబ్రమణ్యం గారు = పాడుతా, తీయగా = ఎనభై ఏళ్ళ తరువాత ?? =

ఎస్.పీ.బాలసుబ్రమణ్యం గారు ఎన్నో మధురమైన పాటలు పాడారు. తెలుగులో, తమిళం లో, హిందీ లో, కన్నడంలో, మరెన్నో భాషలలో. 

మనకు,అంటే తెలుగు వారికి,  వారు తెలుగులో పాడిన ఎన్నో పాటలు, ఎంతో, ఎంతో, ఎంతో యిష్టం కదా.  

అందుకని, తెలుగు వారికి అత్యంత ఆప్తుడైన మన ఎస్.పీ.బాలు గారు - నాకు కూడా - చాలా,చాలా యిష్టమైన వ్యక్తులలో వొక ముఖ్యమైన వ్యక్తి. 

సినీమాల్లో ఆయన పాడడం తగ్గించుకోవడం మనకు కాస్త నిరాశాజనకంగా వున్నా - అందువలన -  తెలుగు వారందరికీ మరో గొప్ప మేలు జరిగింది. బాలు గారు - భవిష్యత్తులో, బాలుగారిలాగా - పాడగల ఎంతో మంది చిన్నారులను -  తెలుగునాట, వెలుగులోకి తీసుకొచ్చారు. వారికి రకరకాల మెరుగులు దిద్దారు.

ఆయన సారథ్యం వహించిన సంగీత రథాలు - ఎంతో మంది పిల్లల స్వప్నాలను  సాకారం చేసింది. ఎంతో మందిని ముందుకు నడిపించింది . ఈ అందరికీ సినిమాల్లో అవకాశము దొరుకుతుందో లేదో గాని -  మనందరి మనస్సులో మాత్రం - స్థానం దొరికింది, అనడంలో - ఏమాత్రం అతిశయోక్తి లేదు.  

వారు సారథ్యం వహించిన పాడుతా, తీయగా - చాలా అమోఘంగా,(ఆ సమయంలో) మరే ప్రోగ్రామునూ చూడనివ్వకుండా, నడిచింది.

ఈ రోజు పోటీ  ఫయనల్సు ముగిసింది. చిన్నారుల పాటలన్నీ చాలా, చాలా  బాగుంది. పోటీ ముగిసే సమయానికి  - వారు తమను తాము ఎంత మెరుగుపరుచుకున్నారో -  చూడటానికి, వినడానికీ - చాలా హాయిగా, ఆనందంగా వుంది. మరి యింత మంది పిల్లల ఈ అభివృద్ధికి - బాలు గారు ఎన్ని రకాలుగా కారణమయారో చూసిన వారికి - వారిని తప్పక అభినందించాలని ఆకాంక్ష కలుగుతుంది.

దేశ సేవ, మానవ సేవ ఎన్ని రకాలుగా చేయ వచ్చో  గాని - ఇలాంటి దేశ సేవ, మానవ సేవ -మరో వందేళ్ళు నిలిచి పోయే సేవ అని మాత్రం చెప్పొచ్చు.  మనం మాతృ దేవోభవ, పితృదేవోభవ అన్న తరువాత - ఆచార్య దేవోభవ అని - గురువు గారిని దైవం స్థానంలో నిలిపే సాంప్రదాయం వున్న వాళ్ళం.   సరే. ఈ చిన్నారులు - ఎనభై ఏళ్ళ తరువాత - ఎవరి గురించి  మాట్లాడుకుంటారంటే - బాలు గారిని గురించి, అదీ వొక ఆచార్య స్థానంలో వారిని  వుంచి -  మాట్లాడుతారని - తప్పకుండా చెప్పొచ్చు. తాము పాడిన పాటలు కూడా వారి మనస్సులో తప్పక నిలిచిపోతాయి. బాలు గారి జీవితం నిజంగా ధన్యమే.

బాలు గారికి - ఆంధ్ర దేశం మరే సత్కారాలు అందజేస్తుందో  - నాకు తెలియదు గాని - వారికి భగవంతుడు - నిండు నూరేళ్ళు ఆరోగ్యవంతమైన జీవితం యివ్వాలని, అంత వరకు వారు సంగీతానికి సేవ చెయ్యాలని - నేనైతే కోరుకుంటాను.  

= మీ

వుప్పలధడియం విజయమోహన్

23, అక్టోబర్ 2011, ఆదివారం

మనసే మిత్రుడు-మనసే శత్రువు - కోరికలు రెండు విధాలు - కోపమొస్తే - ధైర్యమూ, బుద్ధిబలమూ - వున్న చోటే సంతోషము, విజయము


క్రిందటి వ్యాసంలో మానసిక ఆరోగ్యాన్ని గురించి కొంత తెలుసుకున్నాము.

మన మనస్సు చేసే పని చాలా చిత్రమైన పని.
  • ఎప్పుడూ -వొకదానితో మరొకటి బేరీజు వేసి యిదా,అదా అని చూసుకొంటూ వుంటుంది. అందు వలన ఎక్కడా స్థిరంగా నిలవదు.
  • ఎక్కువ సమయం భూతకాలంలో గడపడానికే యిష్టపడుతుంది భూతకాలంలో లేదంటే - భవిష్యతు వైపు పరుగులెడుతుంది.వర్తమానం లో నిలవడం దానికి చాలా కష్టమైన పని.
  •  తన అలవాట్లకు చాలా సులభంగా బానిసై పోతుంది.అవి - మంచైనా సరే, చెడైనా సరే. వాటినుండి బయట పడడం మనసుకు చాలా కష్టమైన పని.
  • మనసుకు మంచి అలవాట్లు రావడానికి మనం కొంతైనా శ్రమ పడాలి. కొన్ని రోజుల పాటో, నెలల పాటో - పరిశ్రమించాలి . సాధారణంగా - మంచి అలవాట్లు మనసులో నాటుకోవాలంటే - మండలం రోజులు - అంటే 45   నుండి 48  రోజులు - అంతరాయాలు లేకుండా పాటించాలి.  తరువాత, వాటిని కాపాడడం - సులభమే.
  • కానీ - చెడు అలవాట్లను చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. వొక్క నిముషంలో - మీరు పొగ  త్రాగడానికో, మత్తు పదార్థాలు త్రాగడానికో, తినడానికో అలవాటు పడొచ్చు.
  • దురదృష్టమేమంటే   - మంచి అలవాట్లను విడిచిపెడ్డడం చాలా సులభం. యాభై ఏళ్ళ మంచి అలవాటును - వొక్క రోజులో విడిచి పెట్ట వచ్చు. కానీ - చెడు అలవాట్లను విడిచి పెట్టడం చాలా కష్టం.
  • మంచి అలవాట్లను మనం వుంచుకోవాలంటే   - సరైన పరిసరాలు, వాతావరణం ముఖ్యం. చెడు అలవాట్లు తమకు కావాల్సిన పరిస్థితులను తామే సృస్టిస్తాయి, లేదా, సులభంగా వెదుక్కుంటాయి . 
  • బుద్ధి మాట వినని మనసు - తాత్కాలికంగా - సంతోషాన్ని తెచ్చినా- పోను,పోనూ, దుఖాలనూ, కష్టాలనూ తప్పకుండా తెచ్చిపెడతాయి.
  • బుద్ధి మాట వినే మనసే - దుహ్ఖాలనూ, కష్టాలనూ తప్పించుకుంటూ -  ఎక్కువ కాలం సంతోషాన్ని, ఆనందాన్ని - తన స్వంతం చేసుకోగలదు.
అసలు మనసంటే ఏమిటి? మనలోని ఆలోచనల ప్రవాహము; వాటితో బాటు చేరిన భావ ప్రవాహము. ఈ రెండింటికి   నిలకడ లేదు. ఏ వొక్క ఆలోచన పైనా మీ మనస్సు అయిదు నిమిషాలు కూడా నిలువలేదు. ఆలోచనలూ, వాటితో బాటు, భావనలూ మారిపోతుంటాయి. ఈ నిమిషంలో - మీ బాసు జ్ఞాపకం వస్తే మనసు కోపంతోనో, భయంతోనో, ఏహ్యత తోనో - నిండచ్చు. అయిదు నిమిషాల తర్వాత మీ  భార్య జ్ఞాపకం వస్తే - మీరు ఆఫీసులోనే, ఆనందంగా ఈల వేయవచ్చు. సరే. మీ బాసు, మీ భార్య వీరి పట్ల మీ జ్ఞాపకాలను బట్టి - రివర్సు గానూ వుండచ్చు.ఆలోచనలూ, వాటితోబాటు తలెత్తే భావావేశాలూ - యివి రెండూ లేక పొతే మనసే లేదని చెప్ప వచ్చు. 

సంతోషమే సగము బలము -అన్నారు. నిజమే. మనసు సంతోషం గానూ, ప్రశాంతం గానూ, హాయి గానూ  - వుండడమే మానసిక ఆరోగ్యం. అలా లేకుంటే - మానసిక అనారోగ్యం. తమిళంలో - ఎప్పటిదో వొక మంచి పాట వుంది. దీనికి తెలుగులో అర్థం - కళ్ళు వెళ్ళే చోటికి, కళ్ళు వెళ్ళే విధంగా, కాళ్ళనూ పోనివ్వ వచ్చా? కాళ్ళు వెళ్ళాలీ,వెళ్ళాలీ అనే చోటికి, మనస్సును వెళ్ళనివ్వ వచ్చా?  మనస్సు వెళ్ళే చోటికి, మనస్సు వెళ్ళే విధంగా, మనిషి వెళ్ళ వచ్చా? - అని. నిజంగా,

యిందులో, ఎంతో మనస్తత్వ శాస్త్రం ఇమిడి వుందని చెప్పవచ్చు. కళ్ళకు అడ్డు లేదు. ఎక్కడికైనా వెడతాయి. పోరాని చోటుకు కళ్ళు పోకుండా మనం అడ్డు పెట్టాలి.  సరే. కళ్ళు చూసాయి. చూసినవన్నీ మనకు మంచి చేసేవి కావు. కానీ, మంచి చేయనివి ఎన్నో, మనను - రా,రా, అంటూ రెచ్చ గొడతాయి. మరి కళ్ళు చూసిన అటువంటి చోట్లకంతా, కాళ్ళు వెళ్ళ వచ్చా? ప్రమాదం, ప్రమాదం అని బుద్ధి హెచ్చరిస్తున్నా వినకుండా వొక్కో సారి కాళ్ళు అటువైపు దారి తీయ మంటాయి. అటువంటి చోటికి - మనసును వెళ్ళ నివ్వ వచ్చా? అటువంటి వెళ్ళ కూడని చోట్లకూ మనసు వెళ్లూ, వెళ్ళూ - అని తొందర పెడుతుంది. అట్టి చోట్లకు మనిషి వెళ్ళవచ్చా? వొద్దూ, వొద్దనే బుద్ధి మాట వినకుండా - మనసు చెప్పిన వైపు పరుగెత్తే వాళ్లకు ప్రమాదం ఎప్పుడూ పొంచి వుండనే వుంటుంది. బుద్ధి బలహీనంగా వుంటే - మంచి గురువుల మాట వినాలి. మంచి స్నేహితుల మాట వినాలి.

మానసిక ఆరోగ్యానికి కావాల్సింది యింతే. పంచేంద్రియాల పైన కాస్త నియంత్రణ.మనసుపైన కాస్త నియంత్రణ. యివి వుంటే - మానసిక ఆరోగ్యానికి కొరత  వుండదు.

దీన్ని గురించి - ఆధునిక మనస్తత్వ శాస్త్రము, మన ప్రాచీన మనస్తత్వ శాస్త్రము రెండూ ఏం చెబుతాయో - రెండింటికి గల వైవిధ్యమూ, వైరుధ్యమూ ఏమిటో మనం తెలుసుకోవాలి.

మనసే మన మిత్రుడు.మనసే మన శత్రువు అన్నాడు శ్రీకృష్ణుడు.

బుద్ధి మాట వినే మనసు మన మిత్రుడు. బుద్ధి మాట వినని మనసు మన శత్రువు.

మంచేదో చెడేదో తెలుసు.కానీ చెడే చేయమని నా మనసు చెబుతూ వుంటుంది - దాని మాటే వింటూ వచ్చాను.మంచి  తెలిసీ, చెడే చేసాను - అంటాడు దుర్యోధనుడు. దాని ఫలితం అనుభవించాడు.

భగవద్గీత  దాదాపు అంతా మనస్తత్వ శాస్త్రమే అని చెప్పవచ్చు. నా మనస్సు చాలా బలవత్తరంగా వుంది - అది నేను నా బుద్ధి అధీనం లోకి తీసుకు రాగాలనా - అని అర్జునుడు అడుగుతాడు. 

శ్రీ కృష్ణుడు  కూడా - ఔను. నిజమే. మనసును మన బుద్ధి అధీనం లోకి తీసుకు రావడం  కష్టమైన పనే. కాని నిరంతర సాధనతో చెయ్యాలి - అని అంటాడు.  మనసు మన బుద్ధి అధీనం లోకి రావాలి - అన్న జ్ఞానం మనకు పుట్టడమే  మొదటి సోపానం.

మరి ఈ కాలంలో - మనసు ఎలాచెబితే అలా నడుచుకోవాలనుకునే సమయంలో - యిది మరీ కష్టమైన పనే. మనసును తప్పు మార్గంలోకి తీసుకెళ్ల గల మార్గాలు, సాధనాలు ఎన్నో! టీ.వీలు, సినిమాలు, బార్లు,మనసును విచ్చల విడిగా విడిచే షికార్లు,   కంప్యూటర్లు , యింటర్ నెట్ లు -యిలా ఎన్నెన్నో . యివి కాక -మత్తు పదార్థాలు, రక రకాల దురలవాట్లు చేసుకోగల అవకాశాలు అందరికీ ప్రక్కనే వున్నాయి.

మనసును గురించి వొక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి.  మనసుకు ఏది  మనం అలవాటు చేస్తామో - దానికి అది బానిసగా మారుతుంది. అదే మళ్ళీ మళ్ళీ కావాలంటుంది. బుద్ధి అలా కాదు. ఏది మంచో, ఏది చెడో యోచన చేసి చెబుతుంది.  కానీ - ప్రతి సారీ - మనసు మార్గానికే ప్రాధాన్యత యిస్తే - తరువాత మనసు బుద్ధి మాట వినదు . బుద్ధి కూడా తన పని మానుకుంటుంది .యింక అధో మార్గమే నన్న మాట. 

అందుకే - చెడు అలవాట్లకు మొదటి సారీ "నో" అని చెప్పాలి. ప్రతి సారీ "నో" అని చెప్పాలి. లేదంటే - ప్రమాదమే. యివి అలవాట్ల సంగతి.
సరిగ్గా తెలుసుకుంటే - యిది  నిజంగా చిన్న విషయమే.  చెడు అలవాట్లను, మానసిక రోగాలను రాకుండా చేసుకోవడం అంత కష్టమైన విషయం కాదు. మీ  మనసులో, ఎక్కువగా కలిగే భావ ప్రకంపనలు ఎలాంటివి? లేదా - ఎక్కువ కాలం, మీ మనసులో -ఎలాంటి భావాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే చాలు.

మీలో సాధారణంగా కోపం ఎక్కువా; కామం ఎక్కువా, మోహం  ఎక్కువా, గర్వం (మదం) ఎక్కువా -లోభం ఎక్కువా - యివన్నీ - చాలా సులభంగా మనమే తెలుసుకో గలిగే విషయాలు.  మనకు తెలియక పొతే - మన మిత్రులను అడగ వచ్చు. ఏ గుణం ఎక్కువో -అది,తనకు కావాల్సిన అలవాట్లు  తెచ్చుకుంటుంది. మిమ్మల్ని అటువైపు పరుగులు  తీయిస్తుంది. యిప్పుడు కళ్ళేలు మీ బుద్ధి చేతిలో లేవు కాబట్టి పరుగు పతనం వైపే వుంటుం ది.    

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, భయాలు - ఇవీ మీ నిజమైన మానసిక శత్రువులు. అంతః శత్రువులు. ఇవీ మీ నిజమైన మానసిక రోగాలు. వీటినే నకారాత్మక గుణాలు అంటారు.యివి మీ మనసులో ఎక్కువగా వుంటే -మీ మనసే మీ శత్రువని  మీరు నిర్ధారించ వచ్చు. మీకు మానసిక ఆరోగ్యం లేనట్టే లెక్క.

యివి కాక -ప్రేమ, దయ, వాత్సల్యము, కరుణ, ఆర్ద్రత, దానగుణము, ధైర్యము, శాంతము  లాంటి సకారాత్మక గుణాలు ఎక్కువగా వుంటే - మీ మనసు మీ బుద్ధి మాట కొద్దో, గొప్పో వింటూ వుందన్న మాట. యిక్కడ  మరొక మాట చెప్పుకోవాలి. ధైర్యము సకారాత్మకమా కాదా అన్నది - మన ధైర్యం దేనికి అన్న దానిపై  కూడా ఆధారపడి వుంది. దుర్యోధనుడి ధైర్యములో కామ, క్రోధ,లోభాదులన్నీ వున్నాయి. అప్పుడు - ఆ ధైర్యము కూడా నకారాత్మకమే అవుతుంది.

ఏ మనసులో - నకారాత్మక గుణాలున్నాయో - అది రోగ గ్రస్త మైన మనస్సు.

పైన చెప్పిన - కామ,క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, భయాలు  లేని మనస్సులో రోగాలు లేవు.


వీటన్నిటికీ - మూలమైన, ముఖ్యమైన మొదటి రోగము - కామము - అంటాడు శ్రీకృష్ణుడు. ఈ కామం - స్త్రీ పురుషుల మధ్య వున్న ఆకర్షణ కాదు. కామము అంటే కోరిక - ధర్మానికి లోబడని కోరిక. ధర్మానికి లోబడిన కోరిక ఏదీ నకారాత్మకం కాదు. మానసిక రోగం కాదు.

యుదిష్టిరుడు, పాండవులు కౌరవులతో చేసిన యుద్ధంలో   - ధర్మ బద్ధమైన కోరిక వుంది. కామము లేదు. దుర్యోధనుడి యుద్ధంలో కామము నిండి వుంది.

రావణుడి నాశనానికి కారణం పర స్త్రీ అయిన సీత పై మనసులో బలంగా నాటుకున్న   కామము. రాముడిలో సీతపై వున్న ప్రేమ ధర్మానికి కట్టుబడ్డ కోరిక.

సరే. ఈ కామము   లేదా అధార్మికమైన  కోరిక ఎక్కడినుండి పుడుతుంది? దీనికీ మరొక మూలం వుందా?

దీనికి సమాధానం - గీత లోని  మొట్ట మొదటి శ్లోకం లోనే   మనకు లభిస్తుంది. అధార్మికమైన కోరికలకు మూలం - అహంకారము, మమకారము.

ధృతరాష్ట్రుడు చెప్పే వొకే వొక గీతా శ్లోకంలో - మానవుల అతి ముఖ్యమైన, పతన కారణమైన రెండు గుణాలు - మహా భారత యుద్ధానికి మూలమైన రెండు మానసిక రోగాలు - అహంకారము, మమకారము గా - ధృత రాష్ట్రుని ముఖ్య గుణాలుగా యిక్కడ మనకు తెలుస్తుంది. అహంకారమంటే - నేను, అన్నీ నాకే కావాలి. నేనే గొప్ప అన్న తత్త్వం. మమకారం అంటే - అన్నీ నా వారికే కావాలి అన్న తత్త్వం. యివి రెండూ వున్న వారికి - నేనూ, నా వారూ - మేం బాగుండాలి. మిగతా వారు ఎలా పోయినా పరవాలేదు. అనేదే న్యాయము, ధర్మమూ.  యివి మానసిక రోగాలే అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.

మనస్సు యొక్క ఆరోగ్యం ఏమిటి - మనస్సు యొక్క అనారోగ్యం ఏమిటి -ఇది  పైన  చెప్పిన విధంగా నిర్ధారితంగా తెలియనంత కాలం మనం మానసిక రోగాలకు యిచ్చే పేర్లు వేరుగా వుంటాయి.

ఉదాహరణకు - ఆధునిక మానసిక వైద్య శాస్త్రము మానసిక రోగాలకు ఇచ్చే పేర్లు చూడండి.

అక్యూట్ స్ట్రెస్  డిజార్డర్  
అంక్సైటీ     డిజార్డర్
డిప్రెషన్
ఇన్సోమ్నియా
మేగాలోమానియా
శిజోఫ్రేనియా
హిస్టీరియా  

-ఇలాంటి మానసిక వ్యాధుల పెద్ద లిస్టు మీరు క్రింద చూపిన వెబ్ సైటులో చూడొచ్చు:

http://en.wikipedia.org/wiki/List_of_mental_disorders 

యివి కాక - మానసిక వొత్తిడి -స్ట్రెస్ - అనేది పెద్ద వ్యాధిగా వుంది ఈ రోజుల్లో. అంతేనా? నిజానికి - దాదాపు ప్రతి భౌతిక వ్యాధికీ - మనసులోని ఏదో బలహీనత కారణం అంటున్నారు. అంటే - దాదాపు ప్రతి వ్యాధీ - సైకో సోమాటిక్ వ్యాధి (మానసిక-భౌతిక వ్యాధి) అని చెబుతున్నారు. మీకు వచ్చే పడిశం, జ్వరాలు, చర్మ వ్యాధుల నుండీ, కాన్సర్ వరకూ గల అన్ని వ్యాధుల వరకు  సైకో సోమాటిక్ వ్యాధులని చెబుతున్నారు.

కానీ - నిజమైన మానసిక వ్యాధులు యివి కావు. యివి వ్యాధి లక్షణాలు, వాటి ప్రభావాలు మాత్రమే. నిజమైన వ్యాధులు మొదట చెప్పిన ఏడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, భయాలు.వీటికి మూలమైన అహంకార, మమకారాలు.

వీటిలో-ఏదున్నా మరో పది రోగాలు తెచ్చి పెడతాయి. యిది అర్థం కానంత కాలం వైద్యులు ప్రతి లక్షణానికీ - వొక పేరు పెట్టి - అదే వ్యాధి అని -దాన్ని, మత్తు మందు, నిద్ర మందు, మెదడును మొద్దు పరిచే మందు లాంటి వాటితో వైద్యం చేస్తారు. సంవత్సరాల తరబడి వైద్యం చేసినా మానసిక వ్యాధులు తగ్గడం లేదన్నది - అందరికీ తెలుసు. తగ్గినట్టు తగ్గి మళ్ళీ వస్తూ వుంది. మందుల వలన - రక రకాల శారీరక వ్యాధులూ పుట్టుకొస్తున్నాయి.

అసలు రోగాలైన కామ, క్రోధాదులు  పొతే కానీ -  మానసిక రోగం పోనే పోదని - ఘంటా పథంగా చెప్పొచ్చు.
యివి లేక పోతే - మానసిక రోగాలు దాదాపు లేవని, రావని  చెప్ప వచ్చు.

అయితే - ఇవి కాక, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు కొన్ని వున్నాయి. అవి భౌతిక వ్యాధులే అయినా - మెదడును , అందులోని నరాలను బలహీన పరిచేవి అయి వుండడం వలన - మానసిక వ్యాధులుగా పరిగణించ బడతాయి.  ఉదాహరణకు - అల్జీమర్స్, డెమెంషియా, పార్కిన్సంస్ లాంటివి. యివి కూడా - మొదటి నుండీ - మానసిక ఆరోగ్యాన్ని రక్షించుకునే వారికి - చాలా వరకు రావని చెప్ప వచ్చు.

సరే. ఈ మానసిక రోగాలు -రాకుండా ఎలా చేసుకోవాలి?

 బాల్యంలో - మనకు చెప్పిన చిన్న చిన్న నీతి పద్యాలు - పాటిస్తే చాలు.

ఉదాహరణకు - "తన కోపమె   తన శత్రువు, తన శాంతమె   తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమె   స్వర్గము, తన దుహ్ఖమె  నరకమండ్రు తథ్యము సమతీ" అన్నారు."

మీ కోపము మీ శత్రువు - అనేది మీకు పూర్తిగా అర్థమయిందా? లేదా - అదేదో - మీకు చాలా ముఖ్యమైన  ఆయుధం, మీ మిత్రుడు   అనుకుంటున్నారా?

మీకు కోపం వస్తే మీలో ఏమవుతుందో కొద్దిగా తెలుసా?

మీ రక్తపు పోటు చాలా  ఎక్కువవుతుంది.

పళ్ళు కొరుకుతారు. ముష్టి బిగిస్తారు. చెమట ఎక్కువగా పడుతుంది. శరీరమంతా -పాలిపోవచ్చు.  మీలో అడ్రినాలిన్ అనే హార్మోను ప్రసారం ఎక్కువవుతుంది. వెంటనే - ఏదైనా చేసేయాలని ఆత్రుత వుంటుంది.
మీ మెదడులోని అమిగ్డాలా భాగం రకరకాలుగా పనిచేస్తుంది.ఏదో ప్రతీకార చర్య చేసేయాలని పరుగెడుతూ వుంటుంది.
మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. మీ శ్వాస వేగంగా జరుగుతుంది. మీకు తల నొప్పి రావచ్చు  నిద్ర రాకపోవచ్చు.  చర్మరోగాలు ( ఎక్జేమా లాంటివి) రావచ్చు. యింకా ఎన్నో అవాంఛనీయ మార్పులు మనలో జరుగుతాయి.  

నిజానికి ఎన్నో రకాల మానసిక, మరియూ భౌతిక రోగాలకు మూల కారణం మీలోని కోపం; కోపానికి మూల కారణం అధార్మికమైన కోరికలు (కామము). మనిషి లోని  కోరికలు రెండు విధాలు.

ఏదో లేనిది -కావాలని.

ఏదో వున్నది - పోవాలని.

లేనిది కావాలి; వున్నది పోవాలి. యివి రెండు తప్ప మరేదైనా కోరికలున్నాయా - ఏవీ లేవు.

ఈ కోరికలు తీరకపోతే కోపం వస్తుంది. ఉదాహరణకు - పొగడ్త కావాలి.తిట్టడం పోవాలి. మిమ్మల్ని గురించి తిట్టడం అలవాటుగా వున్న వారికి - ఆ అలవాటు పోవాలని మీరు కోరుకుంటారు. మిమ్మల్ని తిట్టడం వున్నది. అది ఆ తిట్టే వారికి పోవాలి. పొగడడం లేనిది. అది వారికి రావాలి. అదే మీ శత్రువులను తిడుతూ, మిమ్మల్ని పొగుడుతూ ఉన్నారనుకోండి. సరే. యిదేదో బాగానే వుందనుకొంటారు.  బంగారం కావాలి.  ధనం కావాలి. బలం కావాలి. రోగం పోవాలి. దుహ్ఖం పోవాలి. శత్రువులు పోవాలి. మిత్రులు కావాలి.

ఇలాంటి కోరికల ప్రవాహమే - మనస్సు. వీటిని - సక్రమ మార్గంలో పెట్టేదే బుద్ధి. బుద్ధి మాట వినని మనస్సు ఎలా వుంటుంది?

మనసుకు పగ్గాలు లేకుండా  విడిస్తే  అదేం చేస్తుంది?

రావణుడు మొదట పార్వతీ దేవిని కూడా మోహించినట్టు;  శివుడి  దగ్గర బాగా శిక్ష పడి, ప్రాయశ్చిత్తమైనట్టు;  తరువాతనే నిజమైన శివ భక్తుడైనట్టు - కథ. శివుడు తనకంటే మహా బలవంతుడని గ్రహించిన తర్వాత  బుద్ధి వచ్చింది. మళ్ళీ నలకూబరుడి భార్య అయిన రంభను చెరుస్తాడు. అక్కడ మళ్ళీ పగ్గాలు లేని, కోరికల ప్రకోపమే.బల గర్వమే.  ఎన్ని శాపాలు వచ్చినా యిది మాత్రం పోలేదు.  మళ్ళీ రాముడేం చేయగలడని ధీమాతో సీతమ్మను ఎత్తుకు వెడతాడు. అంతే. లంకతో బాటు  తానూ నాశనమౌతాడు. అధార్మికమైన కోరిక వల్ల ఎవరైనా నాశనమౌతారని  చెప్పడమే - రామాయణం. భారతమూ - అంతే. రావణుడిపై రాముడి విజయం - మనసుపై బుద్ధి విజయం. కౌరవులపై పాండవుల విజయం - మనసుపై బుద్ధి విజయం.

అన్ని సమస్యలకూ మూల కారణం - మనసులో - అతిగా వున్న, అధార్మికమైన కోరికలే.

కోరికలు తీరితే లోభము, మోహము, మదము మన మనస్సులో చోటు చేసుకుంటాయి. కోరికలు తీరకపోతే, క్రోధము, మాత్సర్యమూ , భయమూ  వస్తాయి.

అందుకనే శ్రీ కృష్ణుడు, గౌతమ బుద్ధుడు, ఆది శంకరుడు-అందరు మహానుభావులూ - కోరికలను, ధర్మ మార్గంలో పెట్టుకోమన్నారు.ధర్మ మార్గంలో తీర్చుకోమన్నారు.

సరే. ధర్మ మార్గంలో కోరిక -ఎంత వుండొచ్చు? అతి సర్వత్ర వర్జయేత్. ఏదీ అతిగా వుండకూడదు. మీరు ఎంత  పని చేస్తారో - అంత లాభం వుంటుంది. సంతోషం కోరికలో లేదు. కోరిక వలన వచ్చిన లాభంలోనూ లేదు. మీరు ఆ లాభాన్ని అనుభవించే విధానంలో వుంది. నిజానికి - మీ లోనే ఆనందం వుంది.  బయటి నుండి వచ్చిన వాటిలో కాదు.

పది మంది భార్యలో, భర్తలో వున్న వారికి - భౌతిక కామం పది రెట్లు తీరుతుందన్న మాట ఏమీ  లేదు.అనురాగవతి(వంతుడు) అయిన భార్య (భర్త),  వుంటే చాలు.

మీకు తెలుసా. వసిష్టుడు, అరుంధతి - లకు నూరుగురు కొడుకులని. వారు - అరణ్యం లో తమ ఆశ్రమంలో - తపస్సులో వున్న వారు. వసిష్టుడి తపస్సు వొక రకం. అరుంధతి తపస్సు వొక రకం. ధర్మేచ, అర్థే చ,   కామేచ నాతిచరామి - అన్న సిద్దాంతం పాటించిన వారు ఎంత ఆనందాన్ని అనుభవించ గలరో -ఈ దంపతులే సాక్ష్యం. సంతోషంగా వుండడం ఎలా - అన్న దానిపై మన వారు చేసినంత  రీసెర్చి -మరే దేశంలోనూ, ఈ కాలం లోనూ జరగలేదని -చెప్పవచ్చు. అది - భౌతికమైనా సరే, మానసికమైన సరే - ఆనందానికి మూలం నిర్దిష్టంగా తెలుసుకున్న వారు మన వారు.

అందుకే - మనసు బుద్ధి మాట విని, బుద్ధి  మార్గంలో నడవాలి కానీ - తనలో లేచే కోరికల ప్రవాహంతో బాటు పొతే -  దుర్గతే నని మళ్ళీ మళ్ళీ చెప్పారు.

భౌతిక కామానికి - వొక కామ శాస్త్రం రచింప బడినది - మన దేశంలో మాత్రమే నని మరిచి పోకూడదు. అర్థ శాస్త్రమూ వుంది. ధర్మ శాస్త్రమూ వుంది. మోక్ష శాస్త్రమూ వుంది మన దేశంలో. ఏ చెట్టు ఆకులలో, బెరడులో, వేరులో, కాయలో, పూవులో, పండులో - ఏ రోగానికి ఔషధం దాగి వుందో - యిప్పటికీ మన వారికి తెలిసినట్టు - ప్రపంచంలో - మరెక్కడా తెలీదు.

మరి పాశ్చాత్యులకు - మన కామ శాస్త్రం మాత్రం కావలసి వచ్చింది కానీ - అంత కన్నా ముఖ్యమైన ధర్మ, అర్థ, మోక్ష, ఆయుర్వేద శాస్త్రాల లాంటివి కావాల్సి రాలేదు. అందుకే - ప్రతి వొక్కరూ -మానసిక వైద్యుల వద్దకు వెళ్లి వస్తుంటారు.   మనసుకు పగ్గాలు వేయనంట కాలం ఈ పరిస్థితి యింకా ఎక్కువవుతుంది - కానీ తగ్గే అవకాశం లేదు.  

సరే. కోపానికి మూలమైన కోరికను గురించి - ఆధునిక శాస్త్రాలకు తెలియనే తెలియదు.

కోపమెలా తగ్గడం - అని రీసెర్చి  చేస్తున్నారు. అవన్నీ తప్పని అనడం లేదు. కోపమొస్తే - ఆ స్థలం నుండీ - దూరంగా వెళ్ళమన్నారు.చల్లటినీళ్ళలోముఖం కడుక్కోవడమో, స్నానం చేయడమో చెయ్య వచ్చు. కళ్ళు మూసుకుని వొకటి నుండి పది వరకు లెక్క పెట్ట వచ్చు.

చాల, చాలా ముఖ్యమైనది - ప్రతి మానసిక రోగానికీ - యిప్పుడు "యోగ" చేయమంటున్నారు. అందులో మంచి జరుగుతూ వుందన్న విషయం పాశ్చాత్యులకూ అర్థమైంది. కానీ -ఎలా అన్నది యింకా అర్థం కాలేదు వారికి .

యోగ - అంటేనే పతంజలి చెప్పిన నిర్వచనం - "యోగః చిత్త వృత్తి నిరోధః" అని. అంటే - మనసును అదుపులో ఉంచడమే యోగ - అని  అర్థము.  యోగ  శాస్త్రాన్ని  గురించి  మీరు  పూర్తిగా ,  వివరంగా  తెలుసు కోవాలనుకుంటే - ఆంగ్లంలో వున్న నా బ్లాగు "వై స్ స్పిరిచువల్  ఐడియాస్.బ్లాగ్ స్పాట్ . కాం" లో చదవ వచ్చు.

కోపమొస్తే - రెండు రకాల  రీయాక్షన్లు మనలో జరగ వచ్చు.     వొకటి - ఎదుటి వాడితో కొట్లాడుతాము. రెండవది - అక్కడి నుండి వెళ్లిపోతాము. ఆంగ్లంలో - ఫైట్ మరియు ఫ్లైట్ అంటారు వీటిని. మనకు బలం వుందనిపిస్తే   మొదటి పధ్ధతి. లేదనిపిస్తే - రెండవది. బలం లేకున్నా కొట్లాడమన్నారు కొన్ని పరిస్తితులలో - పరాయి మగ వాడు ఎంత బలవంతుడైనా - భార్యనుకానీ, తల్లిని కానీ, కూతురిని గానీ అవమానపరిస్తే, మానహరణ చేయాలనుకుంటే - ఫైట్  - కొట్లాడడమే  కానీ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు మగ వాడికి. ప్రాణం పోయినా పరవాలేదు.

రెండు కుక్కలు కొట్లాడుతుంటే -వాటిల్లో ఏది గెలుస్తుందో  చెప్పమని వొక పెద్దాయనను అడిగారట.పెద్దదా, చిన్నదా.  తెల్లదా, నల్లదా?  అవేవీ కాదు. ఏ కుక్కలో ధైర్యం ఎక్కువో - అదే గెలుస్తుందన్నాడట   ఆయన. ఎంత పెద్ద కుక్కైనా - ధైర్యం చాల ఎక్కువగా వున్న చిన్న కుక్క దగ్గర ఎక్కువ సేపు నిలువ లేదు. 

మీలో కోపం ఎక్కువగా వుందా - అన్నది ప్రశ్న కాదు.  మీలో బలం ఎక్కువగా వుందా అన్నది కూడా ప్రశ్న కాదు. మీలో ధైర్యం వుందా? సాహసం వుందా? మీ ఆదర్శం కోసం ప్రాణాలు కూడా అర్పించే నిరతి వుందా? యిది చాలా ముఖ్యం. ధైర్యమూ, బుద్ధి బలమూ - వున్న చోట, విజయమూ, సంతోషమూ ఎల్లప్పుడూ వుంటుందన్నది  గీతా వచనం. "యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర  పార్ధో ధనుర్ధరః  తత్రశ్రీర్విజయో భూతిహ్  ధృవా నీతిర్ మతిర్ మమ" . గీతా శాస్త్రం అంతా మనం భూమ్మీద సంతోషంగా వుండడం ఎలాగో తెలిపే శాస్త్రమే.

యిక్కడ బుద్ధిబలం శ్రీకృష్ణుడు. ధైర్యమూ మనోబలము - అర్జునుడు. యివి రెండూ వున్న చోట - శ్రీ (అంటే, ఐశ్వర్యమూ, సంతోషమూ) మరియూ విజయోహ్    (అంటే - సదా విజయమే అన్న మాట) -రెండూ ఎప్పుడూ వుంటాయని చెబుతూ - గీతను సమాప్తం చేస్తారు.

ఇదండీ   - మానసిక ఆరోగ్యానికి వొక ముఖ్య మూల సూత్రము - ధైర్యమూ, బుద్ధిబలమూ.  యివి రెండూ - అలవరుచుకోండి. మాటిమాటికీ బుద్ధి మాట వినండీ - అని చెబుతున్నాము. ఎందుకంటే - మనసే సంతోషాన్ని యివ్వ గలిగేది - కానీ నిరంతర సంతోషానికి మార్గం చూపేది బుద్ధి మాత్రమే.

అయినా - మానసిక రోగాలూ, ఆరోగ్యాలూ - గురించి మరి కాస్త చాలా ముఖ్య విషయాలు మనం తెలుసుకో వలసి వుంది. అవి మరో వ్యాసంలో.


= మీ

వుప్పలధడియం విజయమోహన్  

17, అక్టోబర్ 2011, సోమవారం

మానసిక ఆరోగ్యానికి మూల సూత్రాలు - మనసూ - బుద్ధీ ఎలా పనిచేస్తాయి - మీకు సంతోషం కావాలంటే తిరుగు లేని మార్గం


మనో మయ కోశము
మానసిక ఆరోగ్యానికి మూల సూత్రాలు 

క్రిందటి వ్యాసంలో ప్రాణమయ కోశాన్ని గురించి  తెలుసుకున్నాము. అందులో, ముఖ్యంగా  మనం గుర్తుం చుకోవలసినవి   -
  1.  స్వచ్చమైన గాలి వున్న చోట నివసిస్తే - ఆరోగ్యం బాగుంటుంది.  గాలిలో రక రకాల పొగలు, కార్బన్ మోనాక్సై డు, వుండే చోట - రోగాలు ఎక్కువగానే వస్తాయి.   కార్బన్ మోనాక్సైడు - మోటారు వాహనాల నుండి ఎక్కువగా వస్తుంది.
  2. కొంత మందికి పూల పుప్పొడి అలెర్జీ గా వుంటుంది. ఆస్తమా ,ఉబ్బసం వున్న వారికి. అటువంటివారు - పూల చెట్ల కంటే  - యితర  చెట్లు వేసుకోవడం మంచిది. కానుగ, రాగి, మద్ది చెట్ల గాలి చాలా మంచిదని చెబుతారు. ఏ చెట్ల గాలైనా మంచిదే. కానీ - వీటికి - కొన్ని ప్రత్యేకతలు  వున్నాయి.
  3. కొన్ని రకాల సులభమైన ప్రాణాయామాలు ప్రతి వొక్కరూ నేర్చుకుని, ప్రతి దినం చేస్తే చాలా ఆరోగ్యకరం.యివి శారీరక, మానసిక ఆరోగ్యాలకు రెండింటికీ  మంచిది. ముఖ్యంగా అనులోమ విలోమ; భ్రామరి; కపాలభాతి లాంటివి. వీటి ప్రయోజనం  -  మనం కొద్ది రోజులలోనే చూడవచ్చు.
  4. బ్రాహ్మీ ముహూర్తం లోను, సాయంకాలం లోనూ - సూర్య కిరణాల ఎదురుగా - ప్రాణాయామము, ధ్యానము చేయడం చాలా మంచిది.
  5. మీకు ప్రాణాయామం తెలియకుంటే - మీ ఉచ్చ్వ్వాస, నిశ్వాసలను  - ప్రశాంతంగా, హాయిగా గమనిస్తూ కూర్చోండి. మధ్యలో, మీ మనసు మరెక్కడికో వెళ్ళుతూ వుంటే - ఫరవాలేదు. మళ్ళీ దాన్ని  మీ ఉచ్చ్వాస, నిశ్వాసల పైకి మళ్లిం చండి. దీన్ని  శ్వాస మీది ధ్యాస అని చెప్పుకోవచ్చు.
  6. మీకు మంచి గురువు దగ్గర నేర్చుకునే వీలుంటే - రక రకాల ప్రాణాయామాలను సాధన చేయడం నేర్చుకోండి. 
యిక మనో మయ కోశాన్ని గురించి, మానసిక ఆరోగ్యాన్ని గురించి చూద్దాము.  దీన్లో - ముఖ్యంగా నాలుగు భాగాలు వున్నాయి. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అనేవి. నాలుగూ -నాలుగు రకాల పనులు చేస్తుంది.

మనస్సులో - భావుకత ఎక్కువ. ఎమోషనల్ నేచర్ అంటాము కదా .  అదన్న మాట.

బుద్ధి - మంచి, చెడుల వివరణ - తనకు తెలిసినంతగా చేసి,  మనస్సు కు చెబుతుంది.

కొంత మంది మనస్సుకు ప్రాధాన్యత యిస్తారు. కొంత మంది బుద్ధికి ప్రాధాన్యత  యిస్తారు.రెండూ ముఖ్యమే. రెండింటికీ సమాన   ప్రాధాన్యత వుంది - జీవితం లో.

మనిషి జీవితంలో సంతోషంగా వుండాలని కోరుకుంటాడు.  సంతోషంగా వుండటం మనసుకే సాధ్యం. కాని - మంచి చెడులు తెలియకుండా సంతోషంగా వుండటానికి ప్రయత్నించే వారికీ - జీవితం దుహ్ఖ మయమై  పోతుంది. దుహ్ఖం కూడా మనసుకే సాధ్యం. సంతోషమూ, దుహ్ఖమూ అనుభవించ గలిగేది - మనస్సు. మనలను వాటి వైపు పరుగు తీయించేది  మనస్సు. దుహ్ఖం లో పడితే - బయటకు రాలేక అవస్థ పడేది మనస్సు.

వీటి నుండి మనల్ని కాపాడ గలిగేది బుద్ధి.  బుద్ధికి సంతోషమూ లేదు. దుహ్ఝామూ లేదు. యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం వుంది. మనసుకు ఆలోచన వుంది. కాని అది చాలా భావుకతతో కూడిన ఆలోచన.మనసుకు మంచి చెడు చెప్ప గలిగేది బుద్ధి. ఈ రెండూ - వికసించిన మనిషిలో, సంతోషమూ వుంది. తనను తాను కాపాడుకునే నేర్పూ వుంది. సంతోషాన్ని, జీవితాంతమూ కాపాడుకోగలిగే సమర్థతా వుంది.

అహంకారము - అంటే - నేను అనే వ్యక్తిత్వ పరిధి. ఈ శరీరం నేను. ఈ ఆలోచన నేను చేస్తున్నాను. ఈ సంతోషమూ, దుహ్ఖమూ - నేను అనుభవిస్తున్నాను.  అని మనకు చెప్పేది అహంకారము.

చిత్తము అనే భాగంలో - మన భూత కాలమంతా వుంది. మన అనుభవాలన్నీ వున్నాయి. మన విజ్ఞానమంతా  వుంది. సరే. అన్ని భాగాలను కలిపే భాగం కూడా యిదే అని చెప్పొచ్చు.

బుద్ధికి - మంచి, చెడూ - ఎలా తెలుస్తుంది? యిది - చాలా ముఖ్యమైన ప్రశ్న.   

బుద్ధి - మనకు - ఆత్మ స్వరూపమైన భగవద్ చైతన్యానికీ మధ్య  వారధి లాంటిది. బుద్ధిలో - ఈ విశ్వ వ్యాప్త   చైతన్యం యొక్క ప్రతిబింబం ప్రతిఫలిస్తూ వుంటుంది. ఆ చైతన్య ప్రతిబింబం బుద్ధిలో ప్రతిఫలించడం వలననే - మన శారీరక, మానసిక జీవనంలో - చైతన్యం వుంది. అది లేని నాడు - మనలో మరి చైతన్యం లేదు.  దీన్ని గురించి ఆది శంకరుల  వారు - తమ వివేక చూడామణి, ఆత్మ బోధ లాంటి గ్రంధాలలో - "చిదాభాస"  అని పేరు పెట్టి - విశదీకరించారు . దీన్ని గురించి మరింతగా తెలుసికోవాలనుకునే వారు - ఆంగ్లములో వున్న నా బ్లాగు - వైస్ స్పిరిచువల్ ఐడియాస్.బ్లాగ్స్పాట్. కాం. లో చదవ వచ్చు.

మనకు సంతోషం కావాలి. అది జీవిత గమ్యం. అదీ నిజమే. కాని - బుద్ధి మాట  వినకుండా సంతోషం వెనుక పొతే - దుహ్ఖంలో మునిగిపోతాం. సంతోషానికి గమ్యం - దానికి మార్గం బుద్ధి - అన్న మాట. బుద్ధికి ప్రాధాన్యత యిస్తూ సంతోషం వెతుక్కుంటూ పోయే వారికి - జీవితం హాయిగా వుంటుందన్న మాట.

అయితే - దేవుడి సృష్టి విచిత్రమైనది. ఈ విషయంలో - మగ వారికీ, ఆడ వారికీ - కాస్త తేడా సృస్టించాడు.

సగటు ఆడవారు - అరవై శాతం పైగా - మనసుకే ప్రాధాన్యతనిస్తారు. యిది వారు అనుకుని చేసేది కాదు. సృష్టి విచిత్రం. అంటే - బుద్ధికి - నలభై శాతం కంటే తక్కువ ప్రాధాన్యత అన్న మాట. యిది మంచా చెడా అంటూ ఏమీ లేదు. సృష్టి యిలా వుంది. అంతే.   సంతోషాన్ని అనుభవించ గలిగే సామర్థ్యమూ, ఆడవారికే ఎక్కువ. దుహ్ఖ పడే సంభవాలూ వారికే ఎక్కువ. మమసుకు ప్రాధాన్యత ఎక్కువ, బుద్ధికి ప్రాధాన్యత తక్కువ యిస్తారు. అయితే - యిది సగటు ఆడవారిని గురించి - అంటే, 95 శాతం పైగానే వున్న వారిని గురించి -   చెబుతున్నాము.

కొంత మంది  ఆడవారు - బుద్ధికి ఎక్కువ ప్రాధాన్యత యిస్తూ వుండడం మనం చూడొచ్చు. అయితే - వారిలో, సంతోషం తగ్గి పోవడమూ మనం చూడొచ్చు. అదే విధంగా - కొంత మంది ఆడవారు - భావుకతకే ప్రాధాన్యత నిస్తూ - చిన్న విషయాలకు ఎక్కువ దుహ్ఖ పడడమో, సంతోష పడడమో కూడా మనము చూడొచ్చు.

సగటు మగ వారి విషయం యిందుకు మారుగా వుంటుంది.

సగటు మగ వారు - అరవై శాతం పైగా, బుద్ధి కే ప్రాధాన్యతనిస్తారు. యిది వారు అనుకుని చేసేది కాదు. యిదీ సృష్టి  విచిత్రమే. అంటే, మనసుకు - నలభై శాతం కంటే తక్కువ ప్రాధాన్యత  యిస్తారన్న మాట. యిది కూడా మంచా చెడా అంటూ ఏమీ లేదు. సృష్టి యిలా వుంది. అంతే.   ముందే చెప్పినట్టు,  సంతోషాన్ని అనుభవించ గలిగే సామర్థ్యమూ -ఆడవారికే ఎక్కువ. దుహ్ఖ పడే సంభవాలూ వారికే ఎక్కువ. మగవారికి తక్కువ. ఎందుకంటే -మగవారిలో మనసుకు ప్రాధాన్యత తక్కువ. బుద్ధికి ప్రాధాన్యత ఎక్కువ. అయితే - యిది సగటు మగ వారిని గురించి చెబుతున్నాము.

కొంత మంది  మగ వారు - మనసుకు ఎక్కువ ప్రాధాన్యత యిస్తూ, బుద్ధికి తక్కువ ప్రాధాన్యత నిస్తూ  వున్న వారినీ మనం చూడొచ్చు. వారిలో - కోపాలూ, తాపాలూ, చెడు సావాసాలూ, చెడు అలవాట్లకు లోను కావడమూ మనం చూడొచ్చు. చిన్న వాటికి పొంగి పోవడమూ, క్రుంగి పోవడమూ కూడా వీరిలో జరుగుతూ వుంటుంది. అదే విధంగా - కొంత మంది మగ వారు  - బుద్ధి జీవనానికే ప్రాధాన్యత నిస్తూ - సంతోషమూ, దుహ్ఖమూ - ఏమిటో కూడా తెలియకుండా వుండడమూ, ఎప్పుడూ, రాజకీయాలు, సైన్సు లాంటి వాటిలో - మునిగి వుండడం మనం చూడొచ్చు.

మగ వారు - బుద్ధి జీవనానికి ప్రాధాన్యత యివ్వ గలరు. యివ్వాలి కూడా. కాని సంతోషం అనుభవించడం కూడా తెలిసి వుండాలి; అనుభవించాలి. అంటే - బుద్ధీ, మనసూ 60 : 40 నిష్పత్తిలోనే వుండాలి వారిలో.

కానీ - ఆడ వారు, మానసిక జీవనానికి ఎక్కువ  ప్రాధాన్యత యివ్వ గలరు. యివ్వాలి కూడా. అయినా బుద్ధి జీవనం కూడా తెలిసి వుండాలి. మంచీ, చెడూ ఆలోచించ గలగాలి. సంతోషం అనుభవించడం పుట్టుకతోనే ఎక్కువగా వున్న గుణం;ఆలోచన అలవారుచుకోవలసిన గుణం. అంటే - బుద్ధీ, మనసూ 40 : 60 నిష్పత్తిలోనే వుండాలి వారిలో.  

సరే. మగ, ఆడ కలిసి జీవించడంలో అంతరార్థం ఏమిటి?  శివుడిని అర్ధ నారీశ్వరుడని చిత్రించడంలో అంతరార్థం ఏమిటి? ఆడ మగ కలయికలో మాత్రమే - సంతోషం (60  + 40 ) పూర్తిగా  100  శాతమూ, బుద్ధి కూడా ( 40 + 60 ) పూర్తిగా  100  శాతమూ యిద్దరికీ వస్తుంది. యిది ప్రకృతి నియమం.  

ఇద్దరినీ కలిపే బంధం - అనురాగము, బుద్ధి రెండూ అయి వుండాలి. అంతే.

మహర్షులలో మొదటి వాడుగా పేరు పొందిన వసిష్ఠ మహర్షి - అరుంధతిని విడిచి ఎప్పుడూ వుండలేదు. పార్వతి, శివుడు దూర దూరంగా వుంటే - యిద్దరిలోనూ - పరిపూర్ణత ఉండదని - పురాణాలు ఎలుగెత్తి చెప్పాయి. చాలా మంది ఋషులూ యిదే ఆదర్శం పాటించారు.

సరే. మగ, ఆడ వారిలో - ఏ వొక్కరైనా- బుద్ధి, మనస్సు సమంగా వుంచుకోగాలరా?  వుంచుకోవచ్చు. కానీ - 50 , 50  శాతం   మాత్రమే వుంచుకో గలరు.  రెండూ నూరు శాతం వుండాలంటే - యిద్దరూ - వొకటిగా వుండాలి.  యిదీ మనోమయ కోశానికి మొదటి సోపానం.
ఇది అర్థం కాకుండా - వొకరికొకరు పరిపూర్ణతను - యిచ్చే వారని తెలుసుకోకుండా - నేను గొప్ప, నువ్వు గొప్ప అనో, సమానత్వం కోసమనో  -  ప్రాకులాడడం - అర్థం లేని పని.

ఈ లోకంలో - ఏ ప్రాణికీ - మరొక ప్రాణి సమానం కాదు. కాలేదు.సృష్టే అలాంటిది. సర్వే జనాః సుఖినో భవంతు - అన వచ్చు; అది సాధించవచ్చు  - కానీ - సర్వే జనాః సమానో భవతు  - అనడం  కుదరదు. అది జరగదు. దేని ప్రత్యేకత దానిదే.

మనోమయ కోశము యొక్క  గమ్యం - అంటే మనిషి గమ్యం - సంతోషమే. కానీ - దీనికి మార్గం బుద్ధి. వొకటి వొకరి వద్ద - మరొకటి, మరొకరి వద్ద - ఎక్కువగా వుంది. అంతే.

మన ప్రాచీనులు - పురుషార్థాలు నాలుగు - ధర్మ, అర్థ, కామ, మోక్షాలు - అన్నారు. యిక్కడ, పురుష అన్న పదం అడ, మగ, యిద్దరికీ వర్తిస్తుంది.

మొదటి పురుషార్థం ధర్మము అన్నారు. అంటే - ఏ పని చేసినా - ధర్మ మార్గం లో నే - చెయ్యాలని అర్థం.  ఏ పనికైనా అధర్మ మార్గం పనికి రాదు. ఎందుకు?

ఉదాహరణకు - మీరు దొంగతనం చేసో, లంచగొండి తనం తోనో - కోటి రూపాయలు సంపాదించారనుకోండి. యిప్పుడు. కోటి రూపాయలు మీ దగ్గరున్నాయి. నిజమే. కానీ - దీనికి తగ్గ సంచిత కర్మ ఫలం - మీ పైన అదృశ్యంగా వున్న కర్మ ఫల సంచి లో చేరుతుంది. అది - మీ జీవితంలో, ఎప్పుడు, మిమ్మల్ని - ఎంత ఘోరంగా, దెబ్బ తీస్తుందో, మీకు - యిప్పుడు తెలీదు.  కాని - మీ సంచిత కర్మ ఫలం, మీరు అనుభవించడం మాత్రం తథ్యం. ఈ జన్మలో అది పూర్తి కాక పోతే - వచ్చే జన్మలో కూడా, మీ వెంటే వస్తుంది. మీ జన్మనూ, ఆయుస్సునూ, సుఖ,దుహ్ఖాలనూ - చాలా వరకూ శాసి స్తుంది. చెడ్డ మాత్రమే కాదు, మీరు చేసే మంచిపనుల ఫలితం కూడా మీతో బాటు వస్తుంది.

కానీ - ఈ రోజు మీరు మంచి పనులు చేస్తారా, మంచి మాటలు మాట్లాడుతారా, ఏ పనులు చేస్తారు, అన్న స్వాతంత్ర్యం మీకు వుంది. అది మీ మనస్సు పైన మీకు వున్న అధికారం పైన, మీ బుద్ధి పైన మీకు వున్న అధికారం పైన ఆధార పడి వుంది.

మంచి పని చేసినా - బుద్ధి ప్రేరేపణ తోనే చేస్తారు. దానికి, మొదట మీ మనసు సంతోష పడుతుంది. అయితే - వొక్కో సారి - మంచి పనికి చెడ్డ ఫలితం వచ్చినట్టు భ్రమ కలుగుతుంది. యింతకు ముందు వొక వ్యాసంలో - ప్రతి పనికీ రెండు రకాల ఫలితాలున్నట్టు చెప్పుకున్నాము. వొకటి దృష్ట ఫలం. రెండవది అదృష్ట ఫలం.

ఇప్పుడు మీరు చేసిన వొక మంచి పనిని దృష్టాంతంగా చూద్దాము. మీరు వొక అనాథ బాలుడికి విద్యా సౌకర్యం కోసం పది వేల రూపాయలు అతడి స్కూలులో యిచ్చేసి వస్తున్నారు. వస్తూ, వస్తూ దారిలో వొక గోతిలో పడ్డారు. బాగా గాయ పడ్డారు.  మీ మనసులో - వొక మంచి పని చేసిన దానికి,  నాకొచ్చిన బహుమానం యిదా - అనిపించ వచ్చు. కానీ అది సరి కాదు. మీరిచ్చిన డొనేషన్ కు మీకు -దృష్ట ఫలం గా సంతోషం కలిగింది. 

అన్యాయంగా - పదివేల రూపాయలు పోయిందే - అని మీరు అనుకోకుండా, హృదయపూర్వకంగా ఈ పని చేసుంటే మీకు తప్పక సంతోషం కలుగుతుంది. దీన్ని కొన్ని దశాబ్దాలు - తలుచుకుంటూ - చాలా మంచి పని చేసాను అని పొంగి పోతుంటారు. ఈ సంతోషం దృష్ట ఫలం. కానీ, పది వేల రూపాయలు పోయిందే అనుకుంటే - అది పాపమే అవుతుందే కానీ పుణ్యం కాదు. అయ్యో అనుకునే పనులు చేయకండి. నిజమైన పుణ్యానికి  దృష్ట ఫలం గా సంతోషం తప్పక కలుగుతుంది; వెంటనే కలుగుతుంది.

సరే. మీరు ప్రస్తుతం చేసిన ఏదైనా పుణ్య కార్యం ఫలితం ఎలా వుంటుందో చూడండి :

యిప్పటి పుణ్య కార్య ఫలితం = (1 )  ఈ పని యొక్క దృష్ట ఫలం సంతోషం  +  (2 ) ఎప్పటిదో అయిన  పుణ్య  పాపాల ఫలితం గా ఏదో వొక అదృష్ట ఫలం.

వొక ఫలితం యిప్పటిది. యింకొకటి ఎప్పటిదో. రెండూ కలిసి వస్తుంది. ఈ రెండవది ఎప్పటిదో, దేనిదో, మీకు తెలీదు. కానీ - ఈ రోజు చేసిన పుణ్య కర్మ యొక్క అదృష్ట ఫలం కూడా మరెప్పుడో మీకు తప్పక వస్తుంది. ఉదాహరణకు - మీరిచిన డొనేషన్ కు ఫలితం యిలానూ వుండచ్చు

దృష్ట ఫలం గా  యిప్పుడే సంతోషం (+) అదృష్ట ఫలం గా  మీకు కొన్ని నెలల తర్వాత, లేదా కొన్ని సంవత్సరాల తర్వాత,  ఏ సత్కారమో జర గొచ్చు, పేరు ప్రతిష్టలు రావచ్చు. పెద్ద పదవి రావచ్చు. ఎన్నో రావచ్చు. అబ్బా. నేను చేసిన చిన్న మంచి పనికి, నాకింత పెద్ద ఫలితమా అని మీరు ఆశ్చర్య పోవచ్చు. కానీ మీరు ఈ రోజు గోతిలో పడ్డం మాత్రం  ఎప్పడిదో అయిన కర్మ యొక్క అదృష్ట ఫలం. వీటికి సరైన లింకు పెట్టడం మనకు కష్టం.

యింతా - ఎందుకు చెబుతున్నానంటే - మనసు సంతోషానికి - ముఖ్య కారణం మనం చేసే పుణ్య కార్యాలే  - అని ఘంటా పథంగా చెప్ప వచ్చు.


యిప్పుడు చెప్పండి. మీరు సంతోషంగా వుండాలంటే - ఏం చెయ్యాలి?  ఆ..; ప్రతి రోజూ పుణ్యకార్యాలు అందరూ చెయ్య గలమా? యిది మీరే  యోచన చేయాల్సిన విషయం.పుణ్యం -మనసా, వాచా, కర్మణా - మూడు రకాలుగా చెయ్య వచ్చు.  ఉదయం లేచిన వెంటనే - లోకాః సమస్తాః సుఖినో భవంతు అనో, సర్వే జనాః సుఖినో భవంతు అనో - కళ్ళు మూసుకుని - హృదయ పూర్వకంగా ధ్యానం చేయడం కూడా పుణ్యమే. ఎవరైనా రోగులకో,   ధైర్యం లేని వారికో, దుహ్ఖంలో వున్న వారికో, మన మాటలతో - సంతోషము, ధైర్యమూ కలిగించడం కూడా పుణ్యమే. మనిషికి  మహా సంతోషం కలిగించేది, దుఖమో, కోపమో కలిగించేది రెండూ మాటే. మీరు మీ మాటల ద్వారా సంతోషం కలిగిస్తున్నారా, దుహ్ఖం లేదా కోపం కలిగిస్తున్నారా - మీ చుట్టూ వున్నా వారికి? యోచన చేయండి. యివి కూడా పుణ్య పాపాల లోకే వస్తాయి.

మీ అమ్మ మా అందరికీ అమ్మ లాంటిదే - అన్న వాడికీ, మిగతా వారికీ తేడా మీకు తెలుసు. ఆ మాట కూడా మనుషులను సంతోష పెట్టే పుణ్య కార్యమే.
 
కార్యాచరణ ద్వారా చేయ దగ్గ పుణ్యాలు పంచ మహా యజ్ఞాలుగా  చెప్పబడ్డాయి. యివి పుణ్యాలే కాదు. ప్రతి మనిషి యొక్క బాధ్యతలు కూడా.  దేవతలను, ఋషులను, గురువులను, మనుషులను, పశు పక్ష్యాదులను చెట్లతో సహా సమస్త జీవరాసులను - ఎవరిని సంతోషపెట్టే కార్యం చేసినా అది పుణ్యమే. వీటికి, దృష్ట,అదృష్ట ఫలాలు రెండూ వుంటాయి.

ధర్మం తరువాత పురుషార్థం అర్థం. లోకంలో మనకు కావలసినవన్నీ - ధర్మ మార్గం తప్పకుండా మీరు ఎంతైనా సంపాదించొచ్చు . తప్పే లేదు. దాన్ని అనుభవించడంలోనూ - ఆనందం   వుంది. దానం చేయండంలో - అంతకు మించి ఆనందం వుంది.

మూడవ పురుషార్థం కామం. ధర్మ మార్గంలో - అనుభవించే కోరికలు - ఆనందాన్నిస్తాయి. వాటిలో తప్పు లేదు. ధర్మం దాటి అనుభవించే కోరికలు - మన సంచిత కర్మం లో చేరి - రక రకాల ప్రమాదాలు తెచ్చి పెడతాయి.

ధర్మేచ, అర్థేచ , కామేచ - నాతి చరితవ్య - నాతిచరామి - అనేది వివాహం రోజున - వధూవరులిద్దరూ - చెయ్య వలసిన ప్రమాణం. అంటే - ధర్మం లోనూ, అర్థంలోనూ, కామంలోనూ - యిద్దరూ, కలిసి నడుస్తామని అర్థం. పురోహితుడు వారి దగ్గర చెప్పించాలి - ఈ ప్రమాణం. తనే చెప్పేసి వెళ్లి  పోకూడదు.

మరి  - ఈ  మంత్రాలలో  - మోక్షేచ అని ఎందుకు చెప్పలేదు? - అన్న ప్రశ్న వస్తుంది కదా. మోక్షానికి వెళ్ళేటప్పుడు భవబంధాలేవీ వుండదు. ఎవరికి వారే. దీన్ని గురించి మరో సారి చూద్దాం.
   
ఒకటో  క్లాసులో చెప్పే ఓనమాలూ, పెళ్లి రోజు చెప్పే ప్రమాణాలూ - కడ వరకూ జ్ఞాపకం వుంటాయి.  మరిచి పోయే మాటే లేదు.  కాబట్టి - పెళ్లి చేసే పెద్ద వారూ - పురోహితుడూ - వధూవరుల చేత - ఈ ప్రమాణాలు తప్పక చేయించాలి. వాటి అర్థాన్ని  - తెలుగులోనూ విడమరిచి చెప్పాలి.

యివన్నీ - యిక్కడ ఎందుకు చెబుతున్నామంటే - మన సంతోషానికీ - యివి అన్నీ పునాదులు.

మీరు చేసే పెద్ద పుణ్యం - మీ భార్యను, లేదా మీ భర్తను, సంతోష పెట్టడమే. మీ జీవితంలో - మీరు తీసుకోవలసిన ముఖ్యమైన చాలెంజ్ - కనీసం ఈ వొక్క మనిషి ఆరోగ్యానికి, సంతోషానికి, నేను పూర్తి బాధ్యత వహిస్తాను - అని.  యిందులో  పోటీ మనస్తత్వం రాకూడదు. ఎడమ చేయి చెయ్యలేదు కదా అని - కుడి చేయి, కుడి చేయి చేయ లేదు కదా అని ఎడమ చేయి - పనులు మానేయడం లాంటిది పోటీ తత్త్వం. దేని పనులు అవి చేస్తూ వుంటేనే, ఆరోగ్యమూ, సంతోషమూ.

సంతోషానికి - మూల సూత్రాలనదగిన రెండు మాటలు యిక్కడ చెప్పాలి. మీకు మంచి భర్త (లేదా భార్య) కావాలంటే -  మీరు మొదట మంచి భార్య (లేదా భర్త ) గా వుండాలి. మీకు మంచి స్నేహితుడు  కావాలంటే - మీరు  మొదట మంచి స్నేహితుడుగా వుండాలి.మీకు మంచి కొడుకో, కూతురో కావాలంటే - మీరు మొదట మంచి తల్లో,తండ్రో అయి వుండాలి.

అలాగే - మీకు   సంతోషం కావాలంటే -   తిరుగు లేని మార్గం - చుట్టూ వున్న వారికి సంతోషం యివ్వడమే. మీరు - చుట్టూ వున్న వారికి - ఏది యిస్తారో - అదే మీకు తిరిగి వస్తుంది.

నిరంతర సంతోషమే మానసిక ఆరోగ్యానికి చిహ్నం. మరి మానసిక అనారోగ్యానికి చిహ్నాలు ఏవి? అవి ఎలా పోగొట్టుకోవాలి? యిది వచ్చే వ్యాసంలో చూద్దాం.

= మీ
వుప్పలధడియం విజయమోహన్