13, మే 2011, శుక్రవారం

అసెంబ్లీ ఎన్నికలూ - ఫలితాలూ


ఎన్నికలూ  - ఫలితాలూ 

పశ్చిమ బెంగాల్ . తమిళనాడు, ఆస్సాం,కేరళ , పాండిచ్చేరి రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల  ఫలితాలు వచ్చేసాయి .
రిజల్టు తెలుసు - కాని ఎందుకలా జరిగింది? అన్న ఊహా గానాలకు - ప్రశ్నలకు, సరియిన సమాధానాలు చెప్పలేం.

గెలిచినా వారందరికీ - ఈ బ్లాగు శుభాభినందనలు.


బెంగాలు లో గెలిచిన మమతా బెనర్జీ గారిని అడిగితే - వొక్క విషయం చాలా బాగా చెప్పారు.


"నాలో వున్నా సర్వ అహంకారమంతా - నా కంటి నీటిలో తుడిచి పారేసేయ్యి" - అని. యిది రవీంద్ర నాథ్ టాగోర్ గారి పాట అట.

యిది నాకు - ఎన్నికల కంటే - ఎన్నికల  ఫలితాల  కంటే - చాలా బాగా నచ్చింది.

మన పాలకులంతా - యిది  ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటే - ఇండియా నందన వనం అయిపోదా? 

2 జీ లాంటి, సి డబ్లుయు జీ లాంటి స్కాములెందుకొస్తాయి ?

ముందు, ముందు - మమతా గారిలో - మమత ఎలా వుంటుందో నాకు తెలీదు.

కాని -  

ఎన్నికల  ఫలితాల తరువాత ఆమె చెప్పిన ఈ వాక్యం ఎల్లప్పుడూ - ఆమె మనసులో వుండాలని - దేవుడిని  అడుగుదాం.

అలా వుంటే - బెంగాల్ లో - మరో రవీంద్రుడు, మరో రామకృష్ణుడు పుట్టడానికి  అవకాశాలున్నాయి.

గెలిచిన మిగతా అందరూ - అలాగే వుండాలని కోరుతూ - 


= మీ

వుప్పలధడియం విజయమోహన్ 

ఈ అదృష్టం ఎందుకొచ్చింది? = సుఖాలూ - కష్టాలూ = మీలో వున్న శక్తులు = సంతోషం మీ జన్మ హక్కు


ఈ అదృష్టం ఎందుకొచ్చింది? 

యింతకు ముందు పోస్టు లో దృష్టాదృష్ట ఫలాలను గురించి కొంత తెలుసుకున్నాం.
అదృష్టం - అంటే మనకొక అపోహ వుంది. 

ఏదో గొప్ప మంచి జరిగితే, అది మన కొక వరం లాగా మనం భావిస్తే - అది మన అదృష్టం అని అంటుంటాము  .

అదృష్టం -  అంటే - జరిగిన దానికి,  కారణం, మూలము మనకు, కనిపించడం   లేదని మాత్రమే అర్థం.

ఎందుకొచ్చిందిది, ఏ కారణము వలన - అంటే, మనకు సరి అయిన జవాబు దొరకడం లేదు - అందుకని దాన్ని అదృష్టమని అంటున్నాము. అంతే కాని - అది చాలా మంచిది కాబట్టి అదృష్టం అని కాదు.  మంచో, చెడో - మనకు కారణము తెలీకండా వచ్చింది. అంతే.

నువ్వు - నా భార్య (లేదా భర్త)   గా దొరకడం నా అదృష్టం - అని మీరు ఏ అర్థం తో నైనా  అన వచ్చు. 

అసలు విషయం తెలీక వారూ పొంగి పోవచ్చు. 

నిజానికి - మనకొచ్చే చాలా సంగతులకు  - మనకు మూల కారణం తెలీదు. అవన్నీ మన అదృష్టాలే.

మీ  భార్య (లేదా భర్త)  మీకు  దొరకడం నిజంగా మీ  అదృష్టమే! 

మీ అత్త గారు మీకు అత్త గారిగా  దొరకడం మీ  అదృష్టమే! ఎటువంటి  అత్త గారైనా - వారే మీరు చేసిన పుణ్య పాపాలకు - మీకు తగిన వారు. మీరూ, వారికి తగిన వారే.

మీ కొడుకు / లేదా కూతురు - మీకు పుట్టడం మీ అదృష్టమూ - వారి అదృష్టమూ  కూడా!

మనకు జరిగే చాలా విషయాలు మన అదృష్టాలే. 

మీకు యివ్వ బడిన శరీరము, ఆరోగ్యము, రోగాలు, కష్టాలు, డబ్బు,విరోధాలు, వినోదాలు   - అన్నీ మీ అదృష్టాలే.

మీ పనులకు మెచ్చి - మీకు యివ్వ బడిన పారితోషికములు.

కాకపోతే - మీ - ఎప్పటి, ఏ పనికి, ఫలానా, ఫలానా పారితోషికం, అదృష్టం గా   యివ్వబడిందని  - మీకు తెలీదు.

కష్టాలెవరూ కొని తెచ్చుకోరు. రోగాలెవరూ అడిగి తీసుకొచ్చుకోరు. కాని - అవి మీకు యివ్వ బడ్డాయి. మీ పనులకు ప్రతిఫలంగా.  వాటిని - మీరు వద్దనే ప్రసక్తే లేదు మరి.

పనులంటే - ఉత్త పాప పుణ్యాలా? మరేమైన ఉన్నాయా?

మీరు తిన కూడని వస్తువు తిన్నా, త్రాగ కూడని పదార్ధం త్రాగినా - ఎప్పుడో, మీ శరీరానికి, దాని ప్రతిఫలం ఇవ్వబడుతుంది. అది కూడా - మీరు, మీ శరీరానికి చేసిన "పాపమే" అని చెప్పుకోవచ్చు. 

సుఖాలూ - కష్టాలూ

అంటే - అదృష్టమనేది - సుఖాన్నివ్వచ్చు. దుహ్ఖాన్నివ్వచ్చు .ఏదైనా - ఆ కర్మ ఫల దాత మన పనులకు, మనకిచ్చిన  ప్రతిఫలమే.
కష్టాలొస్తే - రోగాలొస్తే - దేవుడా, కాపాడు నాయనా - అంటాము. తప్పులేదు. అనొచ్చు. ఈ వినమ్రత, సమర్పణా భావము కూడా వొక పనే; వొక పుణ్యమే. దాని ఫలితమూ మనకు వస్తుంది.

అయితే - దేవుడిని మరొక రకంగా కూడా - మనం తలుచుకోవచ్చు. చిన్న కస్టాలు వచ్చినపుడు - ఏదైనా - నీవిచ్చిన ప్రసాదమే - సంతోషంగా తీసుకుంటాను - అన్నారనుకోండి . ఆ కష్టాలే సుఖాలుగా మారిపోవచ్చు. 

మనకు కష్టాలు అని అనిపించే ఎన్నిటినో - సుఖంగా గడిపిన వారెందరో వున్నారు.

ఎలా?

ఎన్నో రకాలుగా - కష్టాలను, సుఖాలుగా గడపొచ్చు.

తోడుగా - నీడగా, ప్రేమిం చే, భార్యో, భర్తో, వుంటే -  ఎన్నో కష్టాలు, సుఖాలుగా మారిపోతాయి. మీరు - వెంటనే అలాంటి భార్యగానో, భర్తగానో, మారండి. .....   మీ వారు / మీ భార్య - మీ ఉదాహరణతో - కొన్ని రోజుల్లోనో, నెలల్లోనో -  మిమ్మల్ని అమితంగా ప్రేమిం చే వ్యక్తిగా మారిపోతారు. ప్రేమలో భగవంతుడున్నాడు.  ప్రేమకు అమితమైన శక్తి వుంది.

మంచి స్నేహితులు ఇద్దరో, ముగ్గురో, నలుగురో వుంటే -   ఎన్నో కష్టాలు, సుఖాలుగా మారిపోతాయి. మీరు - వెంటనే వొక మంచి వాడికి - అలాంటి స్నేహితుడిగా మారండి.అతనూ మీకు మంచి స్నేహితుడిగా మారతాడు.

మంచి వాత్సల్య పూరితులైన తండ్రిగా, తల్లిగా, ప్రేమమయులైన పుత్రులుగా, పుత్రికలుగా మారండి. ఎన్నో కష్టాలు సుఖాలుగా మారిపోతాయి.

అంటే - పక్కనున్న వారి - కష్టాన్ని పంచుకోండి. వారి శరీర, ఆర్ధిక, మనో భారాల్ని తగ్గించండి. 

అందు వల్ల మీకూ మంచే  జరుగుతుంది. వారికీమంచే జరుగుతుంది.

అన్నిటినీ మంచి - ఏదొచ్చినా - నీ ప్రసాదమే - నీ ప్రసాదమేదైనా, సం తోషంగా  స్వీకరిస్తానన్న భావన మీలో వుంటే - కష్టాలను, చాలా సులభం గా సుఖాలుగా స్వీకరించ వచ్చు. 

మీ మనసుకు -కష్టాన్ని - సుఖంగా మార్చుకునే  అపారమైన శక్తి వుంది.   

ఉదాహరణకు - మీరు వొక కిలో మీటరు నడవాలని కష్ట పడుతూ, బాధ  పడుతూ నడుస్తున్నారు.  చేతిలో, 10 రూపాయలుంటే  -   రిక్షా లో వెళ్లి వుందును గదా - అని మీ మనుసు లో బాధ. 
కాస్త ధన వంతుడుగా  వుంటే - కార్లో వెళ్ళే వాడిని గదా - అనుకుంటున్నారు.  

కాస్త    మనుషులను  గమనిం చండి. 

కొంత మంది - మా ఆరోగ్యం  బాగుండాలి  - కాబట్టి మేము నడుస్తామని , కార్లున్నా, డబ్బు వున్నా, ఏదీ లేక పోయినా, వొక కాలే లేకున్నా  - ఎన్నో కిలోమీటర్లను, సంతోషం గా  నడిచే వాళ్ళను మీరు చూడగలుగుతారు. మీకూ, వారికీ తేడా ఎక్కడ? మీ మనసులోనే.  కష్టం కాదనుకునేదేదీ కష్టంగా వుండదు. కష్టం అనుకునేదేదైనా - సుఖంగా వుండదు. కారులో వెళ్ళడం కష్టంగా అనుకునే వాళ్ళెంతో మంది వున్నారు. 

ముఖ్య మంత్రి పదవి వద్దు బాబోయ్ అన్న వారూ వున్నారు. కావాలని కొట్టుకునే వారూ వున్నారు. అన్నిటికీ మనసే కారణం.

పనులూ - ప్రతిఫలాలూ

యిక్కడ  మీరు కర్మ సిద్దాంతం యొక్క విశిష్టతను బాగా అర్థం చేసుకోవాలి.

యిప్పుడు - మీకివ్వబడుతున్న ప్రతి ప్రతిఫలమూ - మీరు గతంలో - చేసుకున్న పుణ్య, పాప ఫలితాలే. మళ్ళీ - పాపమంటే - సరిగ్గా అర్థం చేసుకోవాలి. దారిలో, చూడకుండా, రాయిని తన్నారనుకోండి .  మీకు తగులుతుంది.  నొప్పి  పెడుతుంది. రక్తమూ రావచ్చు. యిది పాపమా? మీకు మీరు చేసుకున్న పాపము. ప్రతి పనీ - పాపమైనా, పుణ్యమైనా, రెండూ కాక పోయినా -  దానికి, ప్రతి ఫలం మాత్రం తప్పక వుంటుంది. 

మీకు వచ్చిన ఏదో ప్రతిఫలం - ఏదో చెడు జరగడం  అనుకోండి. ఏదో రోగం వచ్చిందనుకొండి . 

యిది ఏదో పాపానికి మీకొచ్చిన ప్రతిఫలం అనుకుందాం. "మా ఫలేషు కదాచన" అన్నట్టు, ఈ ప్రతిఫలం రావడంలో - మీ ఎంపిక లేదా ఛాయిస్ చాలా తక్కువ. ఇది వస్తుందని -మీరు అనుకోలేదు. అయినా వచ్చింది. మనం చెడ్డ చేసేటప్పుడు - ఎప్పుడో, మనకూ చెడ్డ తప్పకుండా జరుగుతుందని మనం అనుకుని చేస్తున్నామా? కాని - అటువంటి ప్రతిఫలం - రాక మానదు. ఎప్పుడో తెలీదు. ఎలాగో తెలీదు. కానీ వస్తుంది. 

మీలో వున్న శక్తులు
కాని - "కర్మణ్యేవ  అధికారస్తే" అన్నట్టు - ఈ వచ్చే, ప్రతిఫలాన్ని, మీ జీవితం లో , మీ మనసులో,  మీరు  ఎలా  తీసుకుంటారో -  అది, మళ్ళీ మీ "పనే" , అది మీ "కర్మ"నే .       అది - మీరే నిర్ణయించుకోగలరు.

కష్టాన్ని - సంతోషంగా తీసుకోగల సామర్థ్యం దేవుడు మీకు యిచ్చాడు.   అది మీలో వుంది.

రేపటి సుఖాలను, ఈ రోజు కర్మలతో మలుచుకో  గల సామర్థ్యమూ మీకు దేవుడు యిచ్చాడు.అదీ మీలో వుంది.

ప్రక్క వాడి కష్టాలను తగ్గించగల సామర్థ్యమూ మీకు దేవుడు ఇచ్చాడు.

ప్రేమలో, జ్ఞానంలో, ధ్యానంలో, నిస్స్వార్థ కర్మలలో - దేవుడినే మీలో చూడగల, మీలో బంధించుకోగల   సామర్థ్యమూ మీకు  దేవుడు ఇచ్చాడు.
    
యిన్నిఅపార  శక్తులను పక్కన బెట్టి - నోట్ల కట్టలలో, అధికారాలలో - పదవులలో - మట్టిలో - సంతోషం వెదికితే - అవి ఎండమావులే అవుతాయి. వాటి ప్రతిఫలాలు - వెంటనే - మన వెన్నంటుతాయి.    అవి ఎప్పుడు ,ఏ రూపంలో మీ జీవితంలో ప్రవేశిస్తాయో మాత్రం తెలియదు.

కర్మ సిద్దాంతం -కొన్ని వేల, లక్షల సంవత్సరాల నాటిది. నిజానికి, సృష్టిలో - అది వొక మౌలికమైన ధర్మం. ఎప్పుడూ ఉన్నదే.

ఇంగ్లీషులో - కాస్ - అండ్ - ఎఫెక్టు - థియరీ అని పేరు పెట్టాము. అంతే.
సంతోషం మీ జన్మ హక్కు. అది "ఎఫెక్టు" అయితే - "కాస్" ఏమిటో, ఎవరో తెలుసా?


మీరే!


=మీ

వుప్పలధడియం విజయమోహన్

11, మే 2011, బుధవారం

ఈ వొక్క రోజు సంతోషం గా గడపండి = ఈ వొక్క విషయంలో - మీ మాట మీరు వినండి. = యిదే వేదాంతమంటే !



ప్రపంచంలో ఎవ్వరు మీ మాట విన్నా - మీరు పూర్తి 'శాంతి' తో వుండలేరు.

మీ చుట్టూ వున్న వారు - మీకు  ఏమి చేసినా - మీ 'సంతోషం' పరిపూర్ణంగా వుండదు.

ఎందుకంటే - 

మీ మాట ముఖ్యముగా వినవలసిన వొకే వొక ముఖ్య వ్యక్తి - మీ మాట వినడం లేదు గనుక.

యింతకీ - ఎవరా  ముఖ్య వ్యక్తి?

మీరే!                  మీరే, ముఖ్యంగా  మీ మాట వినడం లేదు.
అందు వల్లనే - మీలో పరిపూర్ణత లేక పోవడం, అశాంతి నిండి వుండడం.

నా మాట నేను వింటున్నా కదా. వినడం లేదని మీరెలా చెబుతారు?

మీ యీ ప్రశ్నకు మీరే సమాధానం వెతుక్కోవచ్చు. చాలా సులభం.

మీరు రేపు - ఏమేం చేయాలో వొక డయరీ లో రాయండి. 

ఎప్పుడు లేయాలో, ఎప్పుడు పడుకోవాలో, ఏమేం తినాలో, ఎవరితో మాట్లాడాలో, ఏమేం చేయాలో - అన్నీ వివరంగా , సమయంతో బాటు రాసుకోండి.

ఈ రోజు రాత్రి 9 గంటలకు -  యివన్నీ రాసి, మీ దగ్గిరే పెట్టుకుని, పడుకోండి. 

తరువాత - తెల్ల వారి లేయడం నుండీ - పడుకునే వరకు - మీరుగా రాసుకున్న లిస్టు లో - ఏమేమి సరిగ్గా, సమయం ప్రకారం చేస్తారో  చూసుకోండి.

మీరు 25 నుండి 50 శాతం వరకు చేయ గలిగితే - చాలా ఎక్కువ, చాలా బాగా చేసారన్న మాట.

మీరు అనుకున్న సమయానికి లేయను కూడా లేయరు. అనుకున్న సమయానికి పడుకోరు. నిద్ర పోరు. తినరు. యివి కాక, ముఖ్యమైన పనులు రాసుకుని వుంటే - ఆ అనుకున్న పనులలో సగం చేస్తే చాలా, చాలా ఎక్కువ. సగం చదివితే చాలా ఎక్కువ.   25 % రాస్తే చాలా, చాలా ఎక్కువ.వ్యూహాత్మకంగా, రచనాత్మకంగా చేయాలనుకున్న పనులు ఆరంభం చేస్తేనే ఎక్కువ. యిలా వుంటుంది సగటు మనిషి జీవితమంతా.

విద్యార్థులు తాము అనుకున్న వాటిలో - సగం అయినా  చదువ గలుగుతున్నారా? ఎక్కువైతే -  పది శాతం మంది చేస్తుండొచ్చు.

ఆ పది  శాతం మంది   మంచి  మార్కులతో పాసవుతూ వుండొచ్చు. అరవై లోపు మార్కులతో - పాసయే వారే ఎక్కువ కదా. వారంతా - సగటు మనుషులలోకే వస్తారు.
జీవితం లోనూ అంతే. అరవై మార్కుల కంటే తక్కువతోనే - ప్రతి విషయం లోనూ - మనం పాసవుతున్నాము.

ఎందుకు?  

మన మాట మనమే వినడం లేదు గనుక.

సరే. మన ముఖ్యమైన  ఆశ, ఆకాంక్ష  ఏమిటి? మనం సంతోషంగా  వుండాలని.

అంతేనా. 

వొక పని చేద్దాం.

ఈ వొక్క రోజు - యీ వొక్క  24 గంటల కాలం - ఏం జరిగినా - అంటే : అత్త గారు  ఏమన్నా - బాసు తిట్టినా , డబ్బు పోయినా - కోడలు ఏ పనీ చేయకున్నా, భార్య ఎన్ని రకాలుగా మీ మూడు పాడు చేయాలని ప్రయత్నించినా,   భర్త తాగొచ్చినా - మిగతా ప్రపంచం ఏమైనా,  ...

నేను మాత్రం సంతోషం గానే వుంటానని భీష్మ ప్రతిజ్ఞ  చేయండి.

ఈ క్షణం నుంచి - యిది జరగాలి. 

మళ్ళీ వాయిదా వేసుకోకండి - రేపటి నుండి, వచ్చే  వారం నుండి అని. 

ఈ క్షణం నుంచి. వొక్క  24 గంటల కాలం- మీరు సంతోషంగా వుండాలి.

ఏ కారణానికీ - మీ సంతోషాన్ని మాత్రం పాడు చేసుకోకండి. డబ్బు పోతే పోనీయండి. సంతోషాని విడవకండి.

ఎవరు తిట్టిన్నా - తిట్టుకోనీయండి. మీ సంతోషాన్ని మాత్రం విడవకండి.

వొంట్లో - ఏవైనా రోగాలున్నా - మందులేసుకోండి. అంతకు మించి, అవి రేపెమవుతుంధో  - మాపెమవుతుం ధో నాన్న దిగుల్లంతా  విడిచెయ్యండి.  యీ 24 గంటల పాటు. అంతే. చాలా సింపుల్.

 వొక్క  24 గంటల కాలం - అంతే.

జీవితంలో ఈ వొక్క రోజు సంతోషం గా  గడపండి. ( రేపేం చేయాలో  రేపు చూద్దాం.)

యిదే వేదాంతం.       మరేం లేదు. అసలేం లేదు!!

చిదానంద రూపః  ; శివోహం; శివో హం. 
= మీ 

వుప్పలధడియం విజయమోహన్

మీ సుఖానికి కారణం ఎవరు? = మీ విజయానికి ఎన్ని మెట్లు?




మీరు  ఏ  పని చేసినా  - దానికి - దృష్ట ఫలము;. అదృష్ట ఫలము - అని - రెండు రకాల ఫలితాలు వుంటాయి.

దృష్ట ఫలం మీరు వెంటనే చూడగలిగేది, లేదా, ఏదో విధంగా , త్వరగా అనుభవించ గలిగేది. 

మీరు, వొక మంచి పాట విన్నారు.  చాలా హాయిగా అనిపించింది.  యిది దృష్ట ఫలము. మీకు వెంటనే తెలిసి పోయింది. 

తరువాత - ఆ పాట అర్థానికో, మాదుర్యానికో  -  మీ మనస్సులో - వొక ముద్ర పడ వచ్చు. మీలో, కొద్దో, గొప్పో, వొక మౌలికమైన మార్పు రావచ్చు. అయితే - అది ఈ పాట వలన వచ్చిందని మీకు తెలియక పోవచ్చు. ఈ మార్పు - అదృష్ట ఫలం గా చెప్ప వచ్చు. యిలా - మనం చేసే పనులలో, ఎన్నిటికో - రెండు రకాల ఫలితాలూ వుంటున్నాయి.

దృష్ట ఫలము   - చాలా వరకు - వెంటనే తెలిసి పోయేటటువంటి ఫలితము. అదృష్ట ఫలం - ఎప్పుడో గానీ తెలీదు. ఫలం తప్ప కుండా వస్తుంది - గానీ,  మన పనికీ, ఫలానికీ - ఏ రకమైన లింకు  మనకు కనిపించదు, చాలా గమనికతో చూస్తే తప్ప.
 
ఉదాహరణకు - మత్తు పదార్థాల వాడకం లో - యిప్పుడే వచ్చేది మత్తు. తరువాత వచ్చేవి  - రోగాలు, ధుహ్ఖాలు.పదుగురి మధ్య అవమానాలు, కోపాలు, కొట్లాటలు  యిత్యాది.

యిలా - ప్రతి పని లోనూ వున్న - దృష్ట, అదృష్ట ఫలాల్ని అన్నిటినీ, బేరీజు వేసి, రెండు ఫలితాలూ, అనుకూల ఫలితాలుగా వుండేటట్టు - పని చేసే వాడు - దీర్ఘ దర్శి, దూర దృష్టి గలవాడు, అని చెప్పుకోవచ్చు. 

ఆటువం టి వారికి - భాగ్య రేఖ కూడా అనుకూలిస్తూ వుంటుంది. 

అంటే - అదృష్టఫలం కానీయండి; దృస్ట ఫలం కానీయండి  -  రెండింటినీ - కొంత వరకూ, మనం ముందుగానే, వూహించ వచ్చు.  ఊహించాలి కూడా.

విజయానికి ఎన్ని మెట్లు?  అని యండమూరి గారిని అడిగితే - ఏమంటారు?

నేను - నేషనల్ అకాడెమి ఆఫ్ టెలికాం (హైదరాబాదు) లో వున్నప్పుడు - దాదాపు 4 - 5  సంవత్సరాలు -  యండమూరి గారిని, బి,వి. పట్టాభిరాం గారిని - వొక్కొక్క వారమూ మా అకాడెమీకి - ఆహ్వానించే వాడిని. దేశంలోని - ప్రతి రాష్ట్రం నుండీ  వచ్చిన వారు - మన ఈ యిద్దరు  ప్రముఖ రచయితల - ఉపన్యాసాలను  - ఎంతో ఇష్టంగా వినే వారు. వారు వెళ్లి - వొక్కొక్కరు, మరో ముగ్గురిని, తమ రాష్ట్రాల నుండి,  పంపించే వారు.  

యండమూరి గారు తమకు యిష్టమైనది, అందరికీ వెంటనే ఉపయోగ పడే -  విజయానికి ఐదు మెట్లు - లాంటి అంశం పైననే మాట్లాడే వారు.పట్టాభిరాం గారు - మనస్తత్వ శాస్త్రం నుండి, అనేక అంశాల పైన మాట్లాడే వారు. 

ఈ ఆసక్తి కరమైన ఉపన్యాసాల గురించి -మరో సారి చెబుతాను.

విజయానికి మెట్లు వున్నాయంటేనే - మన  మనస్తత్వాన్ని - మనం మలుచుకోగలం  - అంటేనే - దృష్ట, అదృష్ట ఫలాల్ని అన్నిటినీ, ఏదో కొంత వరకైనా, చెప్పొచ్చుననే గదా.

అది ముఖ్యం.

కొన్ని రకాల పనులకు - దృష్టాదృష్ట   ఫలాలు మరో రకంగా వుంటాయి.

ఉదాహరణకు - మీరు ఎవరైనా - వొక అనాథ బాలుడికి, విద్యాసౌకర్యం కలిగించారనుకోండి. దాని దృష్టాదృష్ట ఫలాలు ఎలా వుంటాయి.

  • ఆ బాలుడికి విద్య వస్తుంది. (దృష్టం)
  • అతడికి - సంఘం లో వొక సముచిత స్థానం ఏర్పడుతుంది.(దృష్టం)
  • మీ డబ్బు కాస్తా ఖర్చవుతుంది.(దృష్టం).
  • మీ మనసులో వొక మంచి పని చేశామనే సంతృప్తి, వెంటనే కలుగుతుంది (దృష్టం).

  • భగవంతుడి దగ్గర - మీ పుణ్యం అనే ఖాతాలో - వొక పెద్ద మొత్తం చేరుతుంది. దాని నుండి, ఆ కర్మ ఫల దాత ఈ జన్మ లోనే మీకు  - ఏదో వొక మంచి ఫలితాన్ని ఈవచ్చు. (అదృష్టం).
  • ఆ బాలుడు, పెరిగి పెద్ద వాడై, మీకు, అనుకోని రీతుల్లో, సహాయ పడవచ్చు.(అదృష్టం).
  • మీరు చేస్తున్న మంచి పనులు, - మీరు, ఎవరికీ చెప్పక పోయినా - పది మందికి తెలిసి   సంఘంలో, అనుకోని రీతుల్లో, మీ గౌరవం పెరగవచ్చు.(అదృష్టం).
మీరు చేస్తున్న నిస్స్వార్థ పనుల అదృష్ట ఫలాన్నే - పుణ్యం అంటారు.

వీటి ఫలం, ఎక్కువైతే - అవి మీ తరువాతి జన్మకు కూడా, మీతో బాటు వస్తాయి.   మీరు, మంచి కుటుంబంలో పుట్టడము, సంతోషమైన జీవితం గడపడమూ జరుగుతుంది.(అదృష్టం). ఈ విషయం - శ్రీ కృష్ణ పరమాత్మ స్వయానా భగవద్ గీత లో కూడా అన్నారు.

పుణ్య కార్యాల అదృష్ట ఫలాలను -  వొక పండులో వుండే గింజతో పోల్చవచ్చు. గింజ చిన్నదే. కానీ - ఆ వొక్క  గింజ నాటి పోషించిన వాడికి  -  ఆ గింజ నుండి వొక మహా (ఫల)వృక్షము పుట్టి, వేల కొద్ది పండ్లను , సంవత్సరాల తరబడి - తర తరాలకూ - యిస్తుంది.  పుణ్య ఫలం ఇలాంటిదే. చిన్న పుణ్యానికి పెద్ద ఫలితం రావచ్చు.

పాప ఫలమూ ఇలాంటిదే. కాక పోతే - అది చెడు ఫలితాలను, ముళ్ళ చెట్టు లాగా, యిస్తుంది.

మీరు చేస్తున్న కీడు / చెడ్డ పనుల అదృష్ట ఫలాన్నే పాపం అంటారు.

ఉదాహరణకు - మీరు ఎవరి భూమినో అక్రమంగా - ఆక్రమించారనుకుందాం. వారికి శక్తి లేక, వూరికే శాపనార్థాలు మాత్రమే పెట్టగాలిగారనుకుందాం. దాని ఫలితాలేమిటి?

  • మీకు భూమి స్వంతం అయ్యింది (దృష్టం)
  • మీరు,లేదా, యితరులు, ఈ శాపనార్థాలు విన్నారు (దృష్టం).
  • అందరూ - మిమ్మల్ని గురిం ఛి - రౌడీ అనుకున్నారు (దృష్టం).
  • కర్మఫలదాత ఖాతాలో - మీ పేరు క్రింద, వొక పెద్ద పాపం నమోదు అయింది (అదృష్టం).
  • దీని కర్మ ఫలంగా - మీకు, ఎప్పుడైనా ఆక్సిడెంటు కావచ్చు.రోగాలు రావచ్చు. ముందుగా చనిపోవచ్చు. (అదృష్టం).
  •  వచ్చే జన్మలో - మీరు ఆ భూమిలోనే, పాముగానో, ఎలుకగానో పుట్టి, మీ  వారి చేతిలోనే - దెబ్బలు తిన వచ్చు. (అదృష్టం).
  • వొక వేళ మనిషిగా పుట్టినా - నీచుల కుటుంబంలో పుట్టి -  నానా కష్టాలు అనుభవించ వచ్చు.(అదృష్టం).

అయితే - ఈ కష్టాలన్నిటినీ, మానసికంగా అధిగమించి - యీ జన్మలో - మళ్ళీ మంచి పనులు చేయ గలిగే వారు - త్వరగా - కష్టాల నుండి బయటపడ వచ్చు.

నిన్నటి కర్మ యొక్క అదృష్ట ఫలం మీకు ఈ రోజు వస్తుంది; లేదా, రేపో, మాపో, వచ్చే జన్మ లోనో వస్తుంది.. అది  మీ చేతుల్లో  లేదు.

ఈ రోజు కర్మ మీచేతులలో వుంది.   అందుకనే అన్నారు - "కర్మణ్యేవ అధికారస్తే, మా ఫలేషు కదాచన" అని.
 
కర్మ మీ చేతుల్లో వుంది. మీ "చేతల్లో" వుంది. మీరు ఎటువంటి కర్మ అయినా  - చేయ వచ్చు. కాని, వాటి ఫలితాల పైన - ముఖ్యంగా అదృష్ట ఫలితాల పైన -  అధికారం వున్నది, ఆ కర్మ ఫల ధాతకు మాత్రమే. అది, ఎప్పుడు, ఎలా మీకు ఇవ్వాలో మీ   కర్మ ఫల ధాత మాత్రమే నిర్ణయిస్తాడు.

అందుకనే - మన సంస్కృతిలో - నాలుగు పురుషార్థాలు చెప్పారు.

అందులో మొదటిది - ధర్మం - అంటే - పుణ్యము మరియు, పాపము.

యివి - మన భవిష్యత్తుకు , మనం వేసే బాట. మన భవిష్యత్తును, వీటి ద్వారా, మనం, నిర్ణయించుకోవచ్చు. ఇవి, మనకు, తిరుగులేని, ఇన్స్యూరన్సు గా చెప్పుకోవచ్చు.వీటిలో - దృష్ట ఫలం పోగా, మిగిలింది, మనతో బాటు వస్తుంది.మన భవిష్యతును శాసిస్తుంది  .

అర్థము, కామము - మన వర్తమానం కోసం, మనం చేసే కృషి, వాటి  ఫలితాలు, యివి.
ధనం సంపాదించడం, అన్ని రకాల కోరికలు తీర్చుకోవడం - యివి చాలా వరకు వర్తమానానికి, లేదా, ఈ జన్మకు మాత్రం సంబంధించినవి.

కామము - అంటే , అన్ని రకాలయిన కోరికలు. అర్థాన్ని (ధనాన్ని), కోరికలను , ధర్మ మార్గంలో  పొందాలనే, మొదటి పురుషార్థముగా , "ధర్మాన్ని "  చెప్పారు.

చివరిది మోక్షం - ధర్మ, అర్థ, కామాలు మూడూ - ప్రతి మనిషిని తమలో బందిస్తాయి. మూడిటినీ, బంధ హేతువులని  - అంటారు.  మోక్షమనేది - అన్ని బంధాలనుండి బయట పడడం.
 
మనిషి కే  కాదు.  దేశాలకు కూడా ఈ పురుషార్థాలు వర్తిస్తాయి.

ధర్మం ఎక్కువగా వున్నా దేశాలలో, అర్థము, కామము అనుభవించ గలగడం  కూడా ఎక్కువగా వుండడం మనం చూస్తూనే ఉన్నాము.

ధర్మ బుద్ధి తక్కువగా వున్నా దేశాలలో - అర్థము, కామము ,- అన్నీ తక్కువవడం;  నేరాలు, దొమ్మీలు లాంటివి ఎక్కువవడం, అందరూ, అశాంతిలో  వుండడము  - మనం చూడవచ్చు.

కొన్ని దేశాలలో - ఎప్పుడు చూసినా - అశాంతే! దీనికి - ముఖ్య కారణం - ఎక్కడో వెదకాల్సిన పని లేదు.

మనిషి మనసులో - దయ, కరుణ, వాత్సల్య భావన, ఉదారత, లాంటి ధర్మ గుణాలు లోపించడమే.


మనం ,  చేసే ప్రతి పని యొక్క "అదృష్ట ఫలం" తెలుసుకొని చేస్తే చాలు - 

మన అందరి మనసులూ  పెద్దదవుతుంది. ప్రతి మనిషీ  పెద్ద వాడవుతాడు.దేశమూ గొప్పదవుతుంది.

చిన్న మాటల్లో చెప్పాలంటే -

- మీ సుఖానికి కారణం నేను కావాలి.

- నా సుఖానికి కారణం మీరు కావాలి.

ఈ చిన్న పాటి సూత్రం తెలిస్తే - ఎకనామిక్సు అక్కరలేదు. పాలిటిక్సు అక్కర లేదు. మరేం అక్కర లేదు.

 ఇదండీ మన సంస్కృతి, సైన్సు .

=  మీ

వుప్పలధడియం విజయమోహన్

  .

10, మే 2011, మంగళవారం

సత్యం వద = సత్యమేవ జయతే = ఏది నిజం?


"సత్యం వద" అన్నారు పెద్దలు.            

"సత్యమేవ జయతే" అని కూడా అన్నారు.


యిది  కాకుండా  -  యింకా యిలా అన్నారు. 


"సత్యం    బ్రూయాత్,  ప్రియం  బ్రూయాత్,  


న  బ్రూయాత్  సత్యం  అప్రియం 



ప్రియం చ  నానృతం బ్రూయాత్ 

ఏషా  ధర్మః సనాతనః "


యిలా - మన పూర్వీకులు, మహర్షులు సత్యాన్ని గురించి ఎన్నో చెప్పారు. వారు చెప్పినవి - ఈ కొన్ని మాత్రం, వొక్క సారి - సమీక్షించు కుందాం.

  • నిజమే చెప్పాలి. 
  • నిజమే  జయిస్తుంది; 
  • నిజమే చెప్పాలి. కాని నిజాన్ని, ప్రియంగా వుండేటట్టు చెప్పాలి. 
  • నిజమే అయినా -  ప్రియం కానిది  - చెప్పకండి.
  • ప్రియమైనటువంటి దైనా - అబద్ధాన్ని చెప్పకండి.
  • యిదే మన సనాతన ధర్మం.

నిజంగా - నిజమే జయిస్తుందని మనం మనసారా నమ్మితే ; నమ్మ గలిగే పరిస్థితులు, మన మధ్య వుంటే -

మనలో, అబద్ధాలు మాట్లాడే వారు వుండరు. వున్నా - చాలా తక్కువ మంది వుంటారు.

దేవుడి సృష్టిలో - అబద్ధం అస్సలు జయించధం టే - ఆ పరిస్థితి  చాలా, చాలా  బాగుంటుంది.  అప్పుడు, అందరూ - నిజమే మాట్లాడుతారు.

కానీ - మనకందరికీ తెలిసిన  నిజం - అబద్ధం కూడా, చాలా చాలా సార్లు, జయిస్తూ వుందని;


నిజానికీ, అబద్ధానికీ మధ్య - ఎప్పుడూ, యుద్ధం జరుగుతూనే వుంది. వొక్కో సారి, నిజం జయిస్తూ వుంది. వొక్కో సారి అబద్ధం జయిస్తూ వుంది. ఔనా, కాదా??
పగలు, రాత్రి వున్నట్టుగా , ప్రకృతిలో - నిజం, అబద్ధం ఎప్పుడూ వుండనే వుంది.

నిజం  వొక్కటే.

నిజంగా - జరిగింది వొక్కటే.  సంఘటన వొక్కటే.

కానీ - దాన్ని, ప్రతి వొక్కరూ  - వొక్కొక్క విధంగా చెప్పచ్చు.

నిజమే  చెప్పాలనుకునే వాళ్లకు కూడా -  జరిగింది జరిగినట్టుగా,.- యదాతథం గా , చెప్పడం చాలా, చాలా కష్టం.

కళ్ళతో చూసిందీ  అబద్ధం. చెవులతో వినిందీ అబద్ధం, పూర్తిగా, విచారించి తెలుసుకొన్నదే నిజం -  అని తమిళం లో వొక గొప్ప సామెత వుంది.చూసినంతనే, వినినంతనే  , తొందర పడక, ప్రశాంతమైన  మనస్సుతో, అన్ని విషయాలూ తెలుసుకొన్న తరువాతనే -మనం, నిజం  ఇది అని తెలుసుకోగలం. చెప్పగలం.

మన కళ్ళు మనను మోసం చేస్తాయి. మన చెవులు, మన మనస్సు అన్నీ, మనల్ని, మోసం చేసి, అబద్దాల్ని, నిజమని నమ్మేట్టు చేస్తాయి. తొందరపాటు వుంటే - యిది చాలా సార్లు జరుగుతుంది.

మన ఋషులు - నిజాన్ని మూడు రకాలుగా మన ముందుంచారు.

(1 ) పారమార్థిక సత్యం  : ఇది, ఎప్పుడూ సత్యమే. మారదు. నిన్న ఎంత సత్యమో, ఈనాడూ అంతే సత్యం. రేపూ అంతే సత్యం. ఉదాహరణకు  - మీరెవరు? అన్న ప్రశ్నకు సమాధానం - "సత్-చిత్-ఆనంద" స్వరూపం. దీన్ని, యిప్పుడు మనం, విశ్లేషించ బోవడం లేదు.  మీకెప్పుడైనా - చాలా బోరు కొడితే - ఈ"ప్రశ్నయొక్క సమాధానాల" వెనుక వెళ్ళండి. మీరెవరో తెలుసుకోండి. అదే పెర్మనెంటు ట్రూత్, లేదా,  పారమార్థిక సత్యం. కానీ -పారమార్థిక సత్యం, ఎంత సత్యమైనా - ఈ ప్రపంచ వ్యవహారాలకు, ఏ మాత్రమూ ఉపయోగ పడదు.

(2 ) ప్రాతిభాసిక సత్యం : కొన్ని, నిజం మాదిరి అనిపిస్తుంది. కాని, నిజం కాదు. ఎండమావులు  దూరం నుండి - జలాశయాల మాదిరి అనిపిస్తుంది. కాని, కావు.  
                               దూరం నుండి వొక రకంగా కనిపించేవి, వినిపించేవి, అనిపించేవి - నిజానికి, అవి కావు;  మరొకటి అని తెలుస్తున్నాయి కదా. 
                                    అయినా - మన పంచేంద్రియాలకు , దూరం  నుండి, మళ్ళీ, మళ్ళీ, ఎన్ని సార్లు చూసినా, అవే అనే భ్రాంతి కలిగిస్తూనే  వుంటాయి.  
                                   దాన్లో సుఖం వుంది, దీన్లో సుఖం వుంది - అని మనం వెదికి, వెదికి, వేసారి, కట్ట, కడపట, చిట్ట చివర - పారమార్థిక సత్యం వెనుక పడతాం. ప్రాతిభాసిక సత్యాల వెనుక పరుగువేట - కడ వరకు విడువలేం.

 (3 ) వ్యావహారిక సత్యం :  వ్యావహారిక సత్యం  అనేది - పంచేంద్రియాల ఆట. మనస్సు ఆట.
                               నేనెవరు - అన్న ప్రశ్నకు, మనం చెప్పే సమాధానం, మన శరీరం, మన మనస్సు, వాటికి మనం పెట్టుకొన్న పేరు, మన చదువు, మనం పుట్టిన రాష్ట్రం, మన భాష యిత్యాదులు. 
                               వ్యావహారికం గా - ఈ రోజుకు, యివన్నీ కరెక్టే. కాని - కొన్ని రోజులకు - ఇవేవీ చెప్పరు, మనల్ని  గురించి. "బాడీ" అంటారు.
                                       యిరవై, ముప్ఫై  ఏళ్ళ క్రితం వున్న మీరు , యిప్పటి మీరు, వొక్కటేనా?
                                  కానే కాదు. అప్పటి మీలో వున్న, వొక్క అణువు కూడా,  యిప్పుడు మీలో లేదు తెలుసా. అయినా- మనలోని, ఏదో చైతన్య "రూపం" , అదీ నేనే, ఇదీ నేనే అనే భావం కలిగిస్తూ వుంది. దీన్నే మనం వ్యావహారిక సత్యం అని అంటూ  ఉన్నాము.

"నిజం చెప్పండి" - అని మనం అంటే - ఈ వ్యావహారిక సత్యం గురించే. పారమార్థికం కాదు. ప్రాతిభాసికం కాదు.
ఈ వ్యావహారిక సత్యం పూర్తిగా -భూత కాలానికి సంబంధించినదే

ఈ వ్యావహారిక సత్యము భవిష్యతులోనిది  కాదు. -  వర్తమానము లోనిదీ కాదు. 


సత్యం వద - అంటే, మన పంచేంద్రియాలతో చూసిన, వినిన, ఘ్రాణించిన, తాకిన, రుచి చూసిన వాటి గురించి,   భూత కాలం లో  ఎలా గ్రహించామో - అలాగే, యధా తథంగా చెప్పడం.

మరో విధంగా చెబితే - అది అబద్ధమవుతుంది.

దీన్లో కూడా - నిజం వొక్కటే. జరిగింది వొక్కటే.

మీరు రెండు నిజాలు చూడలేదు. రెండు వినలేదు. నిజం వొక్కటే. కాని - పది మంది, పది రకాలుగా చెప్ప వచ్చు.

యిం దులో - మీరు ఐదు మంది - నిజమే చెప్పాలనుకునే వాళ్ళు  కూడా - జరిగిందాన్ని , ఐదు రకాలుగా చెప్ప వచ్చు. మీ కళ్ళతో వాళ్ళు  చూడలేరు.   వాళ్ళ కళ్ళతో మీరు చూడలేరు. మీ మనస్సు విశ్లేషించినట్టు వాళ్ళ మనస్సు విశ్లేషించదు.  వాళ్ళ మనస్సు విశ్లేషించినట్టు మీ మనస్సు విశ్లేషించదు.వొకే సంఘటనకు - యిప్పుడు ఐదు నిజాలున్నాయి.

ఏ వొక్కరూ   - పూర్తి నిజాన్ని పూర్తిగా చూసి, పూర్తిగా, నిజంగా చెప్పలేరు.

యిది కేవలం, మన సృష్టిలోనే  వున్న,  మన అసంపూర్ణత, శక్తీ హీనత ల కారణంగా జరుగుతూ వుంది.

పూర్తి నిజాన్ని గ్రహించ గలిగే శక్తి - మనిషికి యివ్వ బడ లేదు. ఏ విషయం లో నైనా సరే.

అందుకే అన్నారు - కళ్ళతో చూసిందీ  అబద్ధం; చెవులతో వినిందీ అబద్ధం; పూర్తిగా, విచారించి తెలుసుకొన్నదే నిజం - అని.

కాని, యిది , నిజంగా, నిజమే - చెప్పాలనుకునే  వాళ్ళ సంగతి.

మిగతా ఐదు మంది సంగతేమిటి ? వాళ్ళు చూడక్కర లేదు. వినక్కర లేదు. సంఘటనా స్థలం లో వాళ్ళు లేకపోయినా - వున్న వారికంటే బాగా, వర్ణించి మరీ చెప్ప గలరు. యిప్పటి సమాజంలో - వీరి సంఖ్య బాగా పెరిగిం ది.

నిజం వొక్కటే. 

అది - మన అసంపూర్ణత కారణం వల్ల - కాస్త, అటూ, యిటూ రూపాంతరాలు చెందడం సహజం. దాన్ని, మనం, చాలా వరకు సరిదిద్దుకోవచ్చు .

కాని - మన "సనాతన సంస్కార" హీనత వల్ల వొచ్చే రూపాంతరాలను - మనం అబద్దాలని చెప్పొచ్చు.

నిజమే చెప్పాలి - అన్న భావనే మనలో లేకపోతే - అబద్ధాలు ఎన్నైనా చెప్పొచ్చు.

నిజం చెప్పాలంటే - మీరేం చూసారో, విన్నారో  , మీరు  బాగా జ్ఞాపకం చేసుకోవాలి. కాని, మీ మనస్సు అంత  గొప్ప  జ్ఞాపక శక్తి కలిగిం దేమీ కాదు. మరిచి పోతుంది.

కాబట్టి  - రెండో సారో, మూడో సారో,   . జ్ఞాపకం చేసుకోవడంలో, జ్ఞాపకం మాత్రమే గాక - మీ ఊహాగానాలు, అంటే అబద్ధాలు, చాలా వుంటాయి.

మొన్న ఎం తిన్నాడో జ్ఞాపకం రాని మనిషిని -  సంవత్సరం క్రితం జరిగిన, ఆ సంఘటనను , మళ్ళీ  యిప్పుడు కరెక్టు గా  చెప్పు - అన్నది నా దృష్టిలో, చాలా, చాలా, చాలా అర్థ రహితమైన విషయం.

నా అభిప్రాయంలో - అటువంటి వాడు - ఈ రోజు చెప్పేవన్నీ, కట్టుకథలే.  నిజానికి,అతని  పెళ్లి రోజును గురించి  కూడా - అతను  కరెక్టు గా చెప్ప లేడు.

సరే.   మరి నిజమే చెప్పాలి - అంటే మన మహర్షుల అభిప్రాయం ఏమిటి? మీకు నిజంగా జ్ఞాపకం  వున్న, నిజంగా తెలిసిన, వ్యావహారిక సత్యం మాత్రమే చెప్పాలని.

దాన్ని గురించి ఊహాగానాలు చేయక, తెలిసింది, తెలిసినంత వరకు, వున్నది వున్నట్టు  చెప్పాలి.

అందరూ - యిలా తమకు నిజంగా తెలిసింది మాత్రం చెబితే - "సత్యమేవ జయతే" - అంటే, సత్యమే జయిస్తుంది. లేకపోతే, అబద్ధం జయిస్తుంది.

ఉదాహరణకు - వొక భార్య, భర్త మధ్య నిజాలు మాత్రమే వుందనుకోండి. వారు - వొకరినొకరు పూర్తిగా నమ్మొచ్చు.

నమ్మకం వున్న చోటనే - ప్రేమ కూడా వుంటుంది.   .

ప్రేమ వున్న చోట, సత్యం వున్న చోట - జన్మ జన్మల అనుబంధం  సాగిపోతుంది.

అంటే - సత్యం వున్న చోటే ప్రేమ వుంటుంది.  సత్యం లేని చోట ప్రేమ వుండే ఆస్కారమే లేదు - అన్న నిజాన్ని మనం అర్థం చేసుకోవాలి..

కొన్ని దేశాలలో, జరిగే వివాహాలలో, 54 శాతం పైగా  , మొదటి  రెండు సంవత్సరాలలోనే - వివాహ రద్దు జరిగిపోతూ వుందని, లెక్కలు (స్టాటిస్టిక్సు )  చెబుతున్నాయి. అవన్నీ - పేరుకు, ప్రేమ వివాహాలే కావడం విశేషం. సత్యం లేని   చోట ప్రేమ వుండనే వుండదు. ప్రేమ వుండని చోట - జన్మానుబంధం వుండే ఆస్కారమే లేదు. ఆటువం టి వాటికీ - ప్రేమ అనే పేరు పెడుతున్నారు మరి!

కొన్ని దేశాలలో - దేశానికి ముఖ్యమైన విషయాలలో చాలావరకు నిజం చెప్పాలని పాటిస్తారు. మరి కొన్ని దేశాలలో, దేశ వ్యవహారాలన్నీ -ఎక్కువగా  అబద్దాలతో నిండి  వుండటం మనం గమనించ వచ్చు.  అటువంటి దేశాలు, అడుగడుగునా, చాలా విషయాల్లో,  విఫలాన్ని, వోటమిని, చవి చూడటమూ మనం గమనించ వచ్చు. సత్యమేవ జయతే - అన్న విషయం ఇక్కడకూడా మనకు బాగా తెలుస్తుంది.

ప్రేమ వివాహాలు విఫలమైనా, దేశం సఫలం కావడం కూడా కొన్ని చోట్ల మనం చూడొచ్చు. ఎక్కడ సత్యం వుందో - ఆ విషయం విజయం వైపు పయనిస్తుంది. ఎక్కడ అబద్ధం వుందో - ఆ విషయం వోటమి వైపు పయనిస్తుంది.  కొన్ని దేశాలలో, వైవాహిక సంబంధాలలో - లేని నిజాయితీ దేశం విషయంలో కనిపిస్తుంది. అక్కడ అది సఫలం కావచ్చు.

ఒక సంఘము , వొక సంస్కృతి - సఫలం, విజయవంతం కావాలంటే - వ్యక్తిత్వ సంబంధాలలోనూ-   నిజాయితీ వుండాలి. సాంఘిక సంబంధాలలోనూ నిజాయితీ వుండాలి. అప్పుడు - సత్యమేవ జయతే - అన్నది - ఆ దేశము, లేదా, సంఘము విషయం లో సార్థకమవుతుంది.

లేదంటే - ఆ యా దేశాలలో - చాలా సార్లు అబద్ధానికి విజయం సంప్రాప్తించినా  -  దేశం మొత్తానికి - ఆ అబద్ధాల పుట్ట, చేటు తెచ్చి  పెడుతుంది. దేశం విఫలమవడానికి కారణమవుతుంది.

సరే. నిజమే చెప్పాలి. కాని ప్రియంగా చెప్పాలి అని మహర్షులు అన్నారు.

అప్రియం కాని నిజాల్ని చెప్పరాదనీ అన్నారు. ప్రియమైన అబద్ధాలనీ - చెప్పరాదన్నారు.

నీ ముక్కు అస్సలు బాగాలేదని - మీరు, మీ భార్య తోనో, స్నేహితుడితోనో చెబితే - మీరేదో చాల గొప్ప నిజాన్ని, చాలా ఫ్రాంకు గా చెప్పినట్టు కాదు. అది - మీ సనాతన సంస్కార హీనతను మాత్రమే చాటుతుంది. మీరు నిజాలనుకునే అటువంటి, అప్రియ  వాక్యాల్ని చెప్పే హక్కు  మీకు లేదు.

ఏ నిజాన్ని చెప్పినా -మీరు ఎంత ప్రియంగా , ఎంత అందంగా , ఆనందం కలిగించే విధంగా, సమయోచితం గా (ఎప్పుడు చెప్పాలో అప్పుడు), ఎవరి మధ్య చెప్పాలో అప్పుడు (సభోచితముగా), చెబితే - అదే నిజమనిపించుకుంటుంది. అలాకాకుండా చెప్ప బడేది - నిజమనిపించుకోదు.

సనాతన సంస్కారానికి    - మరో ముఖ్య లక్షణం వుంది.

మీరు   -   ఎంత ప్రియంగా , ఎంత అందంగా , ఎంత ఆనందం కలిగించే విధంగా , మరెంత సమయోచితంగా , మరెంత సభోచితముగా  చెప్పినా -  అబద్ధాలు  చెబితే అది సనాతన  ధర్మము, సంస్కారము, నిజము - అని అనిపించుకోదు

అబద్ధం ఎంత బాగున్నా - నిజం అనిపించుకోదు.

కాని - నిజం నిజం అనిపించుకోవాలంటే - దానికి, ఎన్నో అర్హతలు వుండాలి..

అదండీ నిజం. 

= మీ

వుప్పలధడియం విజయమోహన్

5, మే 2011, గురువారం

పంచ మహా యజ్ఞాలు చివరి మాట = అమృతం మీ చేతిలో వుంది! = మీరు దేవతలా? రాక్షసులా?

పంచ మహా యజ్ఞాలు 
చివరి మాట 

యింత వరకు మనం చూసిన ఐదు యజ్ఞాలు - దేవ, ఋషి, పితృ, మనుష్య, భూత యజ్ఞాలు. 

అంటే - ప్రపంచం లోని - దాదాపు ప్రతి ప్రాణి పట్ల - మీ కర్తవ్యం ఏమిటో చూసాము.
ఈ ప్రపంచం లోని అన్ని ప్రాణులూ - వొకటి  పై మరొకటి  ఆధార పడి ఉన్నదన్న  సత్యాన్ని - ఈ యజ్ఞాలు గుర్తు చేస్తాయి. 

మీరు ప్రార్థిస్తే - దేవతలు సంతోష పడితే - దాని అర్థం ఏమిటి? దేవతల సంతోషం కూడా - కొం త వరకు, మీ ప్రార్థనలపైన ఆధార పడి వుందనా? 

ఆధార పడక పోయినా - వారు సంతోష పడతారన్న మాట నిజమే.

ప్రకృతి శక్తులు (దేవతలు) ప్రపంచంలోని - ప్రతి ప్రాణినీ - సమానం గానే చూస్తారు.
 
వొక్క మానవుడి విషయం లోనే - ప్రకృతి శక్తులు - కొంత భిన్నంగా నడుచు కుంటాయి 
.
 ప్రార్థన చేయ గల, అర్థించ గల, ప్రకృతి శక్తుల పనికి తోడు పడ గల , లేదా, వాటి పనికి, కొంత అడ్డు పడ గల - శక్తి  వొక్క మనిషికే వుంది. 

మనిషి వొక్కడే - ప్రకృతి శక్తుల శక్తి ని అధిగమించి  - తన లోని పరమ తత్వాన్ని, దైవత్వాన్ని, సిద్ధింప చేసుగోగల  సమర్థుడు.  ఆ ప్రయత్నంలో, వొక భాగమే, పంచ మహా యజ్ఞాలు. 

ఏనుగు కానీ, సిం హము కాని - వొకరికొకరు సహాయం చేసుకోవాలని - ఎప్పుడూ అనుకోలేవు. పాము, కప్ప సఖ్యంగా వుండటం - మనం చూడలేం.వొక్క కార్టూన్ ఫిల్ములో తప్ప.

మనిషికి మాత్రమే - ప్రతి ప్రాణి తోనూ సఖ్యంగా వుండటం సాధ్యం.
అలాగే - మనిషితో మాత్రమే - సఖ్యంగా వుండటం, ప్రతి ప్రాణికీ సాధ్యం. లేదంటే - వాటి గుణం - స్వజాతితో సఖ్యం విజాతితో విరోధం. స్వజాతిలో కూడా - కేవలం, స్వప్రయోజనాలకోసమే సఖ్యం. లేదంటే - విరోధం సహజం.

అంటే  -  మనిషికి మాత్రమే - ప్రతి ప్రాణి తోనూ సఖ్యంగా వుండటం సాధ్యం. అంటే - మనిషిలో మాత్రమే  - దైవత్వపు చాయలు  పూర్తిగా వున్నాయి. ప్రతి ప్రాణిలోనూ, తనను తాను చూసుకోగలడు. తనలో, ప్రతి ప్రాణినీ చూడ గలడు.
ప్రతి ప్రాణినీ, తన ప్రేమతో, దయతో - కట్టి పడేయగలడు. అంతకు మించి క్రూరత్వం వుంటే - సంహరించనూ గలడు.  ఇదీ దైవత్వమే.   

మనిషి తనలోని దైవత్వంతో , మనం చూసిన పంచ మహా యజ్ఞాల ద్వారా,  ప్రకృతికి ఎంతో తోడుపడ గలడు. ఆ ప్రయత్నంలో - తన జీవితాన్ని కూడా, ఆనందమయం చేసుకో గలడు.

కాని - స్వార్థం తలెత్తితే  - మనకు, ప్రకృతి శక్తులూ, ఎదురు నిలుస్తాయి. దైవం కూడా ఎదురు నిలుస్తుంది. 

అప్పుడు - సాధారణ మృగాల లాగా - ప్రకృతి శక్తి ముందు, మనం సమసి పోతాం.
సరే. పంచ మహా యజ్ఞాలలో - మనం చూడని వొకే వొక ప్రాణి - "మనమే".  అంటే - మీరే.

నిజమా? కాదు. సర్వే జనాః  సుఖినో భవంతు - అంటే, ఆ అందరిలో, మీరు వున్నారా, లేదా? ఉన్నారుగా!

మనం, ముఖ్యంగా; చాలా, చాలా, ముఖ్యంగా - గుర్తు పెట్టుకోవలసిన గొప్ప నిజం వొకటుంది.
మీరు - మీకోసం, మీ స్వార్థం కోసం  చేసే ప్రయత్నాలలో - మీకు వచ్చే సుఖం, ఆనంధం చాలా తక్కువ. సాధారణ జంతువులకొచ్చే ఆనందమే మీకూ వస్తుంది. అంతే.

కానీ- మనం చెప్పుకున్న - పం చ మహా యజ్ఞాలలో, మీ కొచ్చే ఆనందం, అలౌకికం, దైవీకం, వెల కట్ట లేనిది.

అందుకే  - నిస్స్వార్థ సేవ చేసే వారి ముఖంలో - ఎప్పుడూ, (ఎంతో) ఆనంధం, చిరునవ్వు  వుంటుంది.

స్వార్థపరుల ముఖాలలో, మనస్సులో - ఆనందం చాలా తక్కువ, అశాంతి చాల ఎక్కువ. ఎందుకంటే - స్వార్థం మృగ లక్షణం గనుక . 

మీరే  చూడండి . మీకే తెలుస్తుంది.

చిన్న కథ -

దేవతలకూ, రాక్షసులకూ,  చేతులు వంగకుండా గట్టిగా కట్టివేసాడట దేవుడు.  తరువాత, వారి  వొక్కొక్కరి దోసిలిలో , అమృతం పోసి - తాగమన్నాట.

రాక్షసులు - కట్టిన చేతులు వంచలేక, అమృతం తాగడానికి, నానా అవస్థలూ పడి, చేతుల్లోని అమృతం క్రింద పారబోసుకున్నారట.

దేవతలు - కట్టిన చేతులలోని అమృతాన్ని,తమకు ఉపయోగ పడక పోయినా - ఎదుటివారికి, తమ దోసిలితో , త్రాగిం చారట. అలా, దేవతలందరికీ, ఎవరో, వొకరు త్రాగిపించారట. 

నిస్స్వార్థంతో, ప్రేమతో,  అమరత్వాన్ని సాదించ వచ్చునని వారు తెలుసుకున్నారు.

మనమైనా అంతే. మనకైనా అంతే.  

మీ చేతులు మీకు  కనిపించని త్రాళ్ళతో కట్ట బడి వున్నాయి. మీ చేతులలో, ప్రేమ అనే అమృతం వుంది. అది మీరు త్రాగలేరు. కాని, పది మందికి త్రాగించ గలరు. 

మీరది చేయాలే గాని - వందలాది, వేలాది, లక్షలాది చేతులు - ప్రేమనే, ఆనందమనే, అమృతంలో - మిమ్మల్ని ముంచెత్తుతాయి. 

యిక - ఆలస్యం వద్దు. ...రండి. ...పదండి ముందుకు; 

- మీ

వుప్పలధడియం విజయమోహన్ .

పంచ మహా యజ్ఞాలు - 5 వ వ్యాసము = భూత యజ్ఞము = పంచ కవ్యం ఏమిటి? = చెట్లతో మాటలు = కాకికి అన్నం

పంచ మహా యజ్ఞాలు - 5 వ వ్యాసము
 భూత యజ్ఞము 

సర్వ ప్రాణులనూ - మనం భూతములనే పిలుస్తాము. భూతమంటే - పుట్టినదని అర్థం. 
సంభూతము - అంటే - బాగా పుట్టినదని - ఏదో వొక మాతృక నుండి పుట్టిందని చెప్ప వచ్చు.

పుట్టిన ప్రతి దానికి - మరణం తథ్యము! 

మరి పంచ మహా భూతాలంటాము గదా?భూమి, జలము, తేజస్సు (అగ్ని), వాయువు, ఆకాశము - 

మరి వాటి సంగతేమిటి ? అవి కూడా - సృష్ట్యాదిలో - పుడతాయి. సృష్ట్యంతములో వెళ్ళిపోతాయి. 

మళ్ళీ సృష్ట్యాదిలో - పుడతాయి. సృష్ట్యంతములో వెళ్ళిపోతాయి. యిది వేదాంతము.

ఈ వేదాంతము జోలికి యిప్పుడు  మనం వెళ్ల నవసరం లేదు. వెళితే - అది వొక బ్లాక్ హోల్ - లాంటిది.  అందులోనుండి - ఇప్పుడప్పుడే, బయటికి రాలేము.

యిప్పుడు, భూత యజ్ఞం అంటే - మొదటి నాలుగు యజ్ఞాల తెగలలో - మనం చూడని ప్రాణులన్న మాట. వాటి కొరకు  మనం చేసే నిస్స్వార్థ సేవనే - భూత యజ్ఞం అంటారు.

అంటే - దేవతలు (పంచ భూతాలతో సహా) , ఋషులు, పితృ దేవతలు, మనుష్యులు - కాక, మిగతా ప్రాణులన్నీ కూడా , ఏదో వొక సృష్టి ప్రయోజనం కోసం పుట్టినవే. వాటి ప్రయోజనం నెరవేరడానికి - మానవులుగా, మనం అందించే సహాయమే భూత యజ్ఞము.

యిది కాక - అవి మనకు అందించే సహాయమూ - చాలా వుంది. వాటికి మనం కృతజ్ఞత తెలుపవలసిన అవసరమూ చాలా వుంది. యివన్నీ - భూత యజ్ఞం కోవ లోకే వస్తాయి.

సరే. ఈ భూతాలలో,అంటే, ఈ ప్రాణులలో -మొట్ట మొదటగా - మనం గౌరవించ వలసిన ప్రాణి  - గోమాత.

ఆవును - మాతృ సమానురాలన్నాము. గోవు మనకు యిచ్చేట టువం టి - గోమూత్రం, గోమయం, క్షీరం, దధి, ఘ్రుతం - అన్నిటినీ కలిపి పంచ కవ్యం  -  అని అంటారు.

ఈ పంచ కవ్యం లో - వొక్కొ క్కటికీ, తన తన , ప్రత్యేక, ఔషధ  గుణాలున్నప్పటికీ -   అన్నిటినీ - తగు పాళ్ళలో కలిపిన పంచ కవ్యానికి  - మరెన్నో, ఔషధ  గుణాలున్నాయని  చెబుతారు.

ఇదిలా వుంచితే - యివన్నీ - మనిషికి  ఉత్తమోత్తమమైన  "సత్వ" గుణాన్ని కలిగించేవిగా కూడా మనం తెలుసుకోవాలి.

ఆవు పాలూ పాలే. గేదె పాలూ పాలే. 

విటమిన్లూ , ప్రోటీన్లూ వొక ప్రక్కన  వుంచితే - మనిషికి  "ప్రశాంతతనూ, సంతోషాన్నీ  జ్ఞానాన్నీ" - ఎక్కువగా యివ్వ గలిగేది    - ఆవు పాలే నని చెప్పొచ్చు.అందుకే - మహర్షులు , గురువులు, దేవతలు కూడా  - ఆవులను ఎక్కువగా చేరదీసారు. ఆవు పాలకు  వొక ముఖ్యత్వాన్ని - ఆపాదిం చారు.

మీరూ  చూడండి. ఆవు మోహంలో కనిపించే ప్రశాంతత - మరే ప్రాణి మొహంలో నైనా తెలుస్తుందేమోనని.  

మీకు - ఆ ప్రశాంతత, ఆ సంతోషము కావాలంటే -  ఆవు నాశ్రయించండి. ఆవిను, అన్ని విధాలుగా కాపాడండి.

ఏ ముఖ్యత్వమూ లేకుంటే - మన వారు, దేవుడి పూజకు ముందు  ఆవుకు పూజ చేస్తారటండీ?  భూత యజ్ఞం లో ప్రథమ స్థానం ఆవుకే. 
సరే. సంక్రాంతి తరువాతి రోజు  - మనం పశువుల పండగ జరుపుతాం గదా. అందులో - మన పెంపుడు పశువులన్నీ చేరుతాయి. వాటన్నిటికీ -  పూజ చేస్తాం గదా. అదీ భూత యజ్ఞమే .

ఎన్నో జంతు స్వరూపాలకు - మనం దైవత్వాన్ని ఆపాదిం చి పూజిస్తాము. మత్స్య , కూర్మ, వరాహ, నాగ, గరుడ, భైరవ, నెమలి, ఏనుగు, సింహము, పులి లాంటి చాలా జంతువులకు దైవత్వాన్ని ఆపాదించి పూజిస్తాము.

వాటిని - బలమైన, కారణము లేకుండా, చంపాలని అనుకోము. యివన్నీ, వున్న అడవులను - నాశనం చేసే వుద్దేశమెప్పుడూ  - భారత దేశం లో లేదు. కానీ - అడవులను వదలి, మనుషులపై బడి, చంపేటటువంటి క్రూర మృగాలను  - మాత్రము, వేట ఆడి - క్షత్రియులు సంహరించేవారు. 

వొక్కొక్క పెంపుడు జం తువుకూ - వొక్కొక్క ప్రయోజనం వుండేది.  గుర్రాలను స్వారీకి ఉపయోగిస్తే - గాడిదలను, చాకలి బట్టలకు వుపయోగించారు. ఎద్దును, దున్నడానికి, కుక్కను - యింటి బయట కావలికి ఉపయోగించారు. కుక్క విశ్వాసాన్ని, యింటి బయటనే  వుపయోగిం చుకున్నారు. - లోపల కాదు - ఈ నాటి లాగా.
విశ్వాసము లేని జంతువులను ( పిల్లి ??), క్రూర మృగాలను - మన వాళ్ళు పెంచ లేదు. కానీ, అనవసరంగా చంపనూ లేదు. చీమల్లో కూడా - సాధు చీమలను, దేవుడి చీమలన్నారు. వాటి కోసం , ప్రతి రోజూ - యింటి ముందు, ముగ్గులు వేసే సమయంలో - బియ్యపు పిండి ( చాక్ పీసు కాదు) ఉపయోగించే వారు. ఇది - అవి తినటానికే.. 

మరి, కుట్టే చీమలు, కీటకాలు లోపలి రాకుండా, పేడ లాంటివి వాడేవారు. 

అన్నం తినే ముందు - యింటి ముందు, లేదా యింటి పైన, కాస్తా  ఎత్తయిన ప్రదేశంలో, కాకులకు, యితర  పక్షులకు వండిన అన్నం పెట్టే వారు. యిందుకు, ఎన్నో కారణాలు చెబుతారు. ఈ కాకులు, మిగతా పక్షులోచ్చే చోట - పాములు రావు. యిదొక ముఖ్య కారణం. కాకుల వల్ల, మనకొచ్చే పెద్ద ప్రమాదం లేదు కానీ -  పాముల వల్ల వుంది కదా. 

యిలాం టి పద్ధతులు - ఎన్నో వున్నాయి. అయితే - మిమ్మల్ని కరవగలిగే పాము మీ మీదికి వస్తుంటే - చంపొద్దని మన వాళ్ళు  ఎప్పుడూ చెప్ప లేదు.  మిమ్మల్ని చంపి తినడానికి, పులి మీ  మీద పడితే - చంపొద్దని మన వాళ్ళు  ఎప్పుడూ చెప్ప లేదు. మిమ్మల్ని - మీరు రక్షించుకోవడం కూడా ముఖమైన యజ్ఞమే. 

నిజానికి - ధ్యానానికి - జింక చర్మము  గాని,  పులి చర్మము గాని (దర్భ పైన) వేసుకుని, దానిపై తెల్లని గుడ్డ వేసుకోవడం శ్రేష్టమని -  గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు. అది యోగులకు ఉపయోగకారి అన్నాడు.అంటే - అహింస ఎంత వరకు, ఎప్పుడు , ఎంత హింస వాడవచ్చుననేది - మన వారు - ఈ పంచ మహా యజ్ఞాలద్వారా - చాలా నిర్దిష్టంగా చెప్పారు.

ముఖ్యమైనది - మీ మనస్సులో - అమాయక ప్రాణుల పట్ల - దయ వుందా. మీరు వాటి రక్షణకై ఏమైనా చేస్తున్నారా?

అంతే.  అందుకని, మరీ అతిగా చేయనవసరం లేదు - మీరు మహా యోగులైతే తప్ప. వొక సారి, వొక యోగి, శిష్యులతో నది వొడ్డున వెళుతూ వున్నాడు. నదిలో, వొక తేలు మునిగి పోతూ కనిపించింది.  యోగి  గారు - ఆ తేలును, చేతితో పట్టి బయట పెట్టారు. తేలు బ్రతికింది - కాని, బ్రతికించిన యోగి చేయిని కుట్టింది. యోగికి  చేయి బాగా నొప్పి పెట్టింది. శిష్యులు  - ఎందుకండీ, గురువుగారూ, తేలును బ్రతికించారు?  దాని బుద్ధి అది మానలేదు చూడండి. బ్రతికించిన  మిమ్మల్నే కుట్టింది - అన్నారు. 

గురువుగారు - అవును. కుట్టే దాని బుద్ధి, అది మాన లేదు. బ్రదికించే  నా  బుద్ధి నేను మాన లేను - అన్నారు.

అదండీ భూత యజ్ఞం లో పారాకాష్ఠ. మీరు మాత్రం  - మీ చేత ఐనటువంటి భూత యజ్ఞం చేయండి.

మన సంస్కృతిలో - చెట్లకు, నీటి ప్రవాహాలకు,  కొండలకు చాలా ప్రముఖ స్థానం వుంది. వీటన్నిటికీ ప్రాణముందనీ -  వొక విలక్షణమైన - వ్యక్తిత్వము కూడా వుందనీ - మన నమ్మకం. హిమాలయాలు లేని భారత దేశమే లేదు. అలాగే, వింధ్య పర్వతాలు. మరెన్నో పర్వతాలు.

గంగ మన తల్లి అంటాము. గోదావరి మన తల్లి అంటాము. స్వచ్చమైన, గంగా జలాన్ని , కల్మషం చేసి - ఆ నీటిని శుభ్రపరిచి, 10 -15  రూపాయలకు చిన్న బాటిల్సు లో కొనుక్కునే స్థితి వచ్చేసింది .
అడుసు త్రొక్క నేల - కాలు కడుగనేల -  అంటారు. శుభ్రమైన గంగనీళ్ళను - కల్మషం చేయనేల. కల్మషం నీళ్ళను మళ్ళీ శుభ్రము చేయ నేల - అనే స్థితికి వచ్చేశాము.

కొన్ని దశాబ్దాల క్రితము - వీర బ్రహ్మము లాంటి యోగులు - చెప్పారట - ముందు, ముందు , నీళ్ళను కొనుక్కునే దుస్థితి వస్తుందని.    మన స్వార్థము వలన ఆ దుస్థితి  వచ్చేసింది. 
యిప్పుడు, గాలిని కూడా - విపరీతంగా కల్మషం చేస్తున్నాము. గాలి కూడా - మళ్ళీ శుభ్ర పరిచి , మనమే కొనుక్కో వలసిన పరిస్థితి- మనమే తెస్తున్నాము.

దేవుడిచ్చిన శుభ్రమైన నీళ్ళను, గాలిని - కొందరు చేరి కల్మష పరిచి, దాన్ని కొందరు శుభ్రపరిచి, మళ్ళీ, అందరూ, కొనుక్కోవడం -  హాస్యాస్పదం కాదా? 

 చెట్లు మనకు ఎలా ఉపయోగ పడతాయో - మరో వ్యాసంలో- రాసాను. మనం పీల్చే ఆక్సిజను చెట్లే మనకు యివ్వ గలవు. కాంక్రీటు రోడ్డు యివ్వలేదు. మనం విడిచే కార్బను డై ఆక్సైడును విడగొట్టి - కార్బనును వేరుగా చేసి, ఆక్సిజను వేరుగా చేసి - వాతావరణ కాలుష్యాన్ని నివారించి - మన ప్రాణాన్ని నిలుపగల శక్తి, చెట్లకు మాత్రమే వుంది. మన 8 అంతస్తుల భవనాలకు లేదు.  వర్షాలు తెప్పించ గల శక్తి చెట్లకే వుంది. వైద్యానికి కావలసిన అన్ని మూలికలనూ యివ్వగల శక్తి చెట్లకే వుంది. 

మీకు తెలుసా - ప్రకృతి ద్వారా వచ్చిన ఏ వ్యాధి కైనా - మందు, ప్రకృతి లోనే వుంది - ముఖ్యంగా చెట్లలోనే వుంది.

మందు లేని వ్యాధి ప్రకృతిలో లేదు. చెట్లకూ ప్రాణం వుందన్న సంగతి మన వారికెప్పుడూ తెలుసు. తులసికీ, రాగిచేట్టుకూ, బిల్వానికీ, మరెన్నో చెట్లకు - మనం దేవుడి స్థానం కల్పిస్తాము.

చాలా చెట్లు - గుళ్ళలో - తప్పకుండా వుండాలంటాము. చెట్లనే  - గుళ్ళుగా  మార్చి, దాని చుట్టూ మనం తిరగడం కూడా వుంది. 

మీ మాటలను, మీ చేతలను - యింతెందుకు  , మీ ఆలోచనలను కూడా -  చెట్లు గ్రహించ గలవు. చెట్లను ప్రేమించం డి. చెట్ల నూ గౌరవించండి. చెట్లు మీకు ఎంతో మేలు చేస్తాయి.

కాని - అవి మనకు చేయగలిగే మేలు - మనం వాటికి చేయ గలిగే మేలు - మనం మరిచి పోతున్నాము. 

అందుకే మనకు - భూత యజ్ఞం తప్పక కావాలి.

ఈ రోజు నుండి - 

(1 ) ఏదో వొక చెట్టుకు మీరు నీళ్ళు  పోయడము, ఎరువు వేయడము చేయండి. 
(2 ) ఆ చెట్టుతో మాట్లాడడానికి ప్రయత్నించండి.
(3 ) ఆ చెట్టుకు - మీ ప్రేమ, ఆదరణ తెలియ చేయండి. 
(4 ) మీకు తెలుసా- యిదొక యోగ శాస్త్ర  ప్రక్రియ అని.
(5 )  కాకికి  ప్రతి రోజూ, కొద్దిగా అన్నం పెట్టి చూడండి.
(6 ) మరెవరికీ హాని చేయని - జంతువుతో స్నేహం చేసి చూడండి. ఆ జంతువుతోనూ - మాట్లాడండి.
(7 )  ఆవులను పెంచే ఏ గుడికైనా, ఆశ్రమానికైనా - ఆవులను పెంచడానికి - విరాళాలివ్వండి. ఆవులను పెం చ గలిగితే - చాలా  మంచిది. లేదంటే - పెంచే వ్యక్తికి - ప్రోత్సాహమివ్వండి.

భూత యజ్ఞంలో - మరేమేం చేయ గలరో - యోచన చేసి - చేయండి. మీ జీవితం చాలా మారుతుంది.

మరో చిట్టా చివరి - చిన్న వ్యాసం కూడా వుంటుంది  . అదీ చదవండి - ఆ అంశం పైనే.   

= మీ

వుప్పలధడియం విజయమోహన్