11, మే 2016, బుధవారం

కామ్ప్రెహెన్సివ్ ట్రీ టైజ్ ఆన్ పతంజలి యోగ సూత్రాస్- నా ఆంగ్ల పుస్తకానికి - రామకృష్ణ మిషన్ స్వామీజీ ల ఆశీస్సులు , ప్రోత్సాహాలు

కామ్ప్రెహెన్సివ్  ట్రీ టైజ్  

ఆన్ పతంజలి  యోగ సూత్రాస్



వొక్క సంవత్సరంగ దీర్ఘదర్శి  తెలుగు బ్లాగ్  మౌనం గా వుండవలసి వచ్చింది . అందుకు కారణం యిదో - నేను రాసిన ఈ ఆంగ్ల పుస్తకం :




ఈ పుస్తకం రాయడానికి నాకు 2-3 సంవత్సరాల పైనే పట్టింది . 740 పేజీలు  A 4 సైజ్  పుస్తకం యిది . అంతా పతంజలి రాసిన యోగ సూత్రాల  గురించే . నాకు తెలిసినంత వరకు ,యోగ సూత్రాల గురించి యింత వివరణగా ,సిద్ధాంత పరంగానూ, ఆచరణ పరంగానూ  చెప్పిన పుస్తకం మరొక్కటి  లేదు . 

వీటిని - యోగ నిష్ణాతులైన రామకృష్ణ మిషన్ స్వామీజీ లకు, మిగత యోగా గురువులకు , లైబ్రరీ లకు యూనివర్సిటీ లకు పంపించడం జరిగింది. చాలా మంది  రామకృష్ణ మిషన్ స్వామీజీలు తమ ఆశీస్సులు , తమ హర్షం , తమ ప్రోత్సాహాలను చాలా బాగా వ్యక్తీకరించారు (లెటర్ల ద్వారా, ఫోన్ కాల్ ద్వారా , ఈ మెయిల్  ద్వారా నాకు ఎంతో ప్రోత్సాహం  యిచ్చారు. అలాగే ద్రావిడియన్  యూనివర్సిటీ  వైస్  చాన్సెలర్ గారు కూడా ఫోన్లో తమ ప్రోత్సాహం  వ్యక్తీకరించారు. ఇంకా , ప్రతి రోజూ, ఈ ప్రోత్సాహ వాహిని సాగుతూనే వుంది యిప్పటి వరకూ . 

ఒక స్వామీజీ, యిది మీ జీవితాన్నే ధన్యం చేసే  రచన అన్నారు .

పూరీ రామకృష్ణ మిషన్ స్వామీజీ గారు, స్వామీ  పరిశుద్ధానంద యిలా అన్నారు :

"ఈ పుస్తకం అత్యున్నతమైన   సెల్ఫ్ హెల్ప్ పుస్తకం  అనటం లో సందేహం లేదు . 

"ఈ అద్భుతమైన  వివరణాత్మక పుస్తకం లో యోగా ను గురించి మీ రెంత  అధ్యయనం  చేసారో బాగా తెలుస్తూ వుంది ... యిది యోగా ను దేశ  విదేశాల్లో వ్యాపింపజేయడానికి ,చాలా బాగా ఉపయోగ పడగలదు . అందులోనూ , మన ప్రధాన మంత్రి గారు  పోయిన సంవత్సరం లో అంతర్జాతీయ  యోగా దినోత్సవం ఆరంభించిన  నేపథ్యంలో , దీని ఉపయోగం చాలా వుంది 
"యింత అత్యంత ఉపయోగకరమైన  పుస్తకం మానవాళి కి అందించడానికి మీరు పడ్డ శ్రమకు మా హృదయపూర్వక సంతోషాన్ని వెలి బుచ్చుతున్నాము . 

"రామకృష్ణ దేవుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు వుండుగాక ...... "

యిది స్వామీజీ గారు వ్రాతపూర్వకంగా  అంగ్లంలో రాసి పంపారు . దాదాపు యిలాగే మదురై , బెంగుళూరు స్వామీజీలు ఫోన్ చేసి నాతో    మాట్లాడి  ఎంతో ప్రోత్సహించారు . అలాగే ద్రావిడియన్  యూనివర్సిటీ  వైస్  ఛాన్సలర్  గారు కూడా ఫోన్ చేసి చాలా బాగా అభినందించారు; ప్రోత్సహించారు. 

నా వరకు నాకు - నా శ్రమ, ఈ అభినందనల పరంపర అన్నీ ఈశ్వరార్పణం. శివునాజ్ఞ  లేనిది చీమైనా కదలదు  . ఆయన ఆజ్ఞ అయితే ఏదైనా జరుగుతుంది . అంతే .

అయితే , మానవ ప్రయత్నం  లేనిదే  దైవ సాహాయ్యం  వుండదు కదా . మన ప్రయత్నం వుండాలి . నేను యిది పూర్తిగా నమ్ముతాను .  

ఈ పుస్తకం యింకా కొంత మంది మహానుభావుల ఆశీస్సుల కోసం ఎదురు చూస్తోంది . ఆ తరువాత నే , మార్కెట్ లో విక్రయాలు, యివన్నీ .

ఈ పుస్తకం  లో -వొక్కొక్క యోగ సూత్రానికీ  పూర్తి వివరణ యివ్వడమే కాకుండా, ఆ సూత్రప్రకారం  సాధకుడు ఆచరించవలసిన , పాటించ వలసిన ఎక్సర్సైజ్ లు కూడా యివ్వడం జరిగింది . అంటే - సూత్రం చదివిన వెంటనే  - ఆచరణలో కూడా పెట్టె య్యడమే, తద్వారా , దాని పూర్తి  ఫలితాన్ని పొందడమే పుస్తకం వుద్దేశ్యం .   చాలా సూత్రాలకు యిలా యివ్వడం జరిగింది .

ప్రతి దినం వొక యోగ సాధకుడుగా మీరు ఆచరించ దాగిన దైనిక చర్య కూడా సులభంగా, ఆచరణ యోగ్యంగా , మీ టైం  ప్రకారం  చెయ్య దగినట్టుగా, యివ్వడం జరిగింది . అయినా పతంజలి ఆదేశించిన నియమాలన్నీ పాటించ డమూ  జరిగింది . కొండల్లో, కోనల్లో, గుహలలో, అరణ్యాలలో  మాత్రమే కాదు , ఇళ్ళల్లో కూడా యోగా పూర్తిగా  ఎలా సాధించ  వచ్చో చెప్పడం జరిగింది .

పతంజలి మహర్షి చెప్పింది మాత్రమే  కాక , శ్రీకృష్ణ భగవానుడు, ఉపనిషత్తులు, శంకరాచార్యులు - యోగాచరణ గురించి చెప్పినవి కూడా  యిందులో  విశదంగా పొందు పరచడం  జరిగింది .

అష్టాంగ  యోగా కొరకు - మీరు ఈ పుస్తకం దాటి పోననవసరం లేకుండా వుండటమే నా వుద్దేశ్యం . సిద్ధాంత పరం గానూ , ఆచరణ పరంగానూ , ఈ పుస్తకం చాలు - అన్నంతగా వుంటుంది . అంటే , గురువు  వద్దని చెప్పటం లేదు . కొంత  గురు ముఖంగా నేర్చుకుంటే మేలు . కానీ, మీ వూళ్ళో, మీ దగ్గర్లో  ఎక్కడా , గురువే లేకుంటే ? యోగా మర్చిపోవాలా ? అక్కర్లే దు . అప్పుడూ యోగా చెయ్యొచ్చు . చెయ్యాలి .   యోగా భారత దేశం ప్రపంచానికిచ్చిన గొప్ప విజ్ఞానం . యిది అందరికంటే మనమే ఎక్కువగా నేర్చుకోవాలి .

అష్టాంగ యోగా అంటే - శరీరాన్ని రకరకాలుగా బంధించే విన్యాసాలు కాదు . యిది మొదట మనకు తెలియాలి. ఆ విన్యాసాల అవసరం పతంజలి  అష్టాంగ  యోగా లో చాలా తక్కువ . దాదాపు అవసరం లేనంత తక్కువ . యోగా అనేది మనసుతో మనం ఆడే ఆట . మనసును  మన అధీనం లో సంతోషంగా వుంచుకునే విజ్ఞానం . ఆ పైన మనసును దాటి, మనలను  గురించి  మనం పూర్తిగా తెలుసుకునే విజ్ఞానం యిది .

ఇదండీ కథ...

సర్వే  జనాః  సుఖినో  భవంతు

వుప్పలధడియం  విజయమోహన్ 







10, ఏప్రిల్ 2015, శుక్రవారం

శేషాచలం లో- మానవ హక్కులు - సామూహిక హక్కులు

శేషాచలం లో మానవ హక్కులు 

సామూహిక హక్కులు 


శేషాచలం అడవుల్లో యెర్ర చందనం వృక్షాలను అక్రమం గా కొట్టడమూ , ఆ కలపను అక్రమంగా రవాణా చెయ్యడమూ చాలా కాలం గానే  జరుగుతూ వుంది .   కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం దీన్ని పెద్దగా పట్టించుకోలేదు . ఎందుకు పట్టించుకోలేదో , ఎవరు చెబుతారు ?


యిప్పుడు చంద్రబాబు గారు  ముఖ్య  మంత్రి గా వచ్చారు . తెలంగాణా  విడి పోయిన తర్వాత , రాష్ట్రానికి పెద్దగా  నిధుల కొరత అనే సమస్య కూడా   వచ్చి పడింది.


మొట్టమొదటి నుండి  ముఖ్య మంత్రి గారు, మిగతా మంత్రులూ చెబుతూనే   వున్నారు - వొక్క ఈ యెర్ర చందనం అక్రమ రవాణా  ను నిలిపి ప్రభుత్వ పరంగా దాన్ని అమ్మ గలిగితే , ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్ధిక సమస్యలు  తీరుతాయని .


 ఎన్నో వేల, లక్షల కోట్ల విలువ గలిగిన ఈ యెర్ర చందనం - స్మగ్లర్ల చేతిలో పడి - ఆంధ్ర  ప్రజల వుమ్మడి సొత్తు , స్మగ్లర్ల సొత్తుగా మారి పోతూ వుంది . యింత విలువ గలిగిన, ఆంధ్ర ప్రజల వుమ్మడి సొత్తు దొంగలు దోచుకు పోతూ  వుంటే , అది ప్రజలందరి మానవ హక్కుల ఉల్లంఘన కాదా ? యిది నిలపడానికి మానవ హక్కుల సంఘాలు ఏం చేశాయి ? ఏం చేస్తున్నాయి ? దీన్ని గురించి వారెవరికీ ఏమీ  పట్టినట్టు లేదు . అయ్యా ! ఈ యెర్ర చందనం చంద్రబాబు సొత్తు కాదు . మీ సొత్తే . అది పోతే , మీ అందరి మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్టే .

వ్యక్తి హక్కులూ ముఖ్యమే . కానీ , సామూహిక హక్కులు అంత కంటే ముఖ్యం . అది పట్టించుకోరా ?


సరే . ప్రజలందరి వుమ్మడి సొత్తు పోతూ వుంటే - ప్రజలేం చేస్తున్నారు ? అదేదో చంద్ర బాబు స్వంత విషయమే గాని తమ విషయం కాదన్నట్టు వున్నారు . మన ప్రజలలో ఈ స్తబ్దత పోవాలి .


సర్వే  జనాః సుఖినో భవంతు


= మీ

వుప్పలధడియం విజయమోహన్

20, మార్చి 2015, శుక్రవారం

ఉగాది 2015 - మీకు నా శుభాకాంక్షలు , శుభాభినందనలు

ఉగాది -2015

 

ప్రకృతి లో 

మామిడీ , చెరుకూ , వేపా , మిరపా, ఉప్పూ , చింతా - షడ్రుచులకు ప్రతీకలు .   

 అవి కలసిన ఉగాది పచ్చడి 

జీవితంలో 

సంతోషానికి , మాధుర్యానికి , కష్టాలకూ , శోకాలకూ , బాధలకూ , రోగాలకూ , 

నిజానికి నవ రసాలకూ  ప్రతీకగా  నిలుస్తుంది .

అన్నిటినీ 

 స్థిత ప్రజ్ఞత తో స్వీకరించే తెలుగు మనసులకు 

 మన్మథ నామ సంవత్సర ఉగాది నాడు 

నా హార్దిక శుభాకాంక్షలు 

ఈ సంవత్సరంలో -

మీ జీవితాల్లో 

సంతోషం , ఆరోగ్యం 

ప్రేమ , కరుణ 

ఐశ్వర్యం , ఆర్ద్రత 

నిండాలని -

మీ చుట్టూ వున్న వారిలో, మీ పట్ల 

మీ చుట్టూ వున్న వారి పట్ల , మీలో 

 స్నేహం, ప్రేమ పండాలనీ 
 
ఈ సంవత్సరం , మీ జీవితంలో 

ఒక నవ వసంతం కావాలనీ

మీకు నా శుభాకాంక్షలు , శుభాభినందనలు  తెలియజేస్తున్నాను . 


ఈ సంవత్సరంలో 

మనలో ప్రతి వొక్కరూ 

మనకంటే తక్కువ స్థితిలో వున్న 

మరొక్కరి జీవితాన్ని 

ఆదుకోవాలని , వుద్ధరించాలనీ 

ఆశిస్తున్నాను ; ఆ శక్తి , మానసికత మనలో 

అ దేవుడు నింపాలనీ 

ప్రార్థిస్తున్నాను . 

= మీ 

వుప్పలధడియం విజయమోహన్ 


PS :- పతంజలి యోగ సూత్రాల పై వ్యాఖ్యానంగా వొక పుస్తకం రాస్తూ వుండడం వలన  - ఈ మధ్య కాలం లో బ్లాగులో ఎక్కువగా రాయడం జరగలేదు . మరో నెలలోపు అది పూర్తి అయి పోతుందని నా నమ్మకం .  ఆ తరువాత , ఈ బ్లాగులో , మరింత విస్తృతంగా రాయడం జరుగుతుంది
 
 
 





8, జనవరి 2015, గురువారం

మనం సంతోషంగా వుండి - మరో పది మంది సంతోషానికి కారణమైతే ! - సర్వే జనాః సుఖినో భవంతు

 

బాధ్యత - బాధ్యతా రాహిత్యం 



మీరు లిఫ్టు లో ఏడో అంతస్తు కెళ్ళారు - అక్కడ మీ ఫ్లాటు  వుంది గనుక. పైకి వెళ్ళిన మీరు - లిఫ్టు  తలుపు మూయకపోతే - క్రింది వారు లిఫ్టు కదలక, క్రిందికి పోలేక , పైకి రాలేక - అవస్థ పడతారు . మిమ్మల్ని తిట్టు కుంటారు . లిఫ్టు తలుపులు మూయడం మీ కనీస బాధ్యత.  మీరు చేసిన తప్పే మరొకరు చేస్తే మీరూ తిట్టు కుంటారు కదా . కాబట్టి అది మీ , మన అందరి బాధ్యత . అవునా ! యిది చిన్న విషయం . యిప్పుడు మరో చిన్న విషయం . 

66 ఏళ్ళ స్వాతంత్ర్యం  తరువాత, మోడీ గారు - స్వచ్చ భారత్ ఉద్యమం ఆరంభించారు. భారత దేశం లోని ప్రతి పౌరుడికీ ఇది తన బాధ్యత అని అర్థం చేసుకోవలసిన అవసరం పూర్తిగా వుంది . మన యింట్లో, వీధిలో, వూరిలో, దేశంలో  ప్రతి వొక్కరూ స్వచ్చత , శుభ్రత పాటించాలి . చుట్టూ వున్న వారికీ తెలియ జెప్పాలి . ఇది  చిన్న విషయమే , కానీ యిదే మనం చెయ్యడం లేదు . మరి పెద్ద విషాయాలేం చేస్తాం? ఎప్పుడు చేస్తాం ?

చెయ్యాలనుకునే వారు, చేస్తూ వెడతారు. వారికీ  అడ్డంకులు, కష్టాలు వస్తాయి. కానీ, వాటిని, ఎలాగోలా అధిగమించి, తమ బాధ్యతలను పూర్తి చేస్తారు . 

రిక్షా తొక్కే వాళ్ళు, చెప్పులు కుట్టే వాళ్ళు , కూలీలు ఎంతో మంది తమ కొడుకులు, కూతుర్లను పెద్ద చదువులు చదివించి, పెద్ద ఉద్యోగాల్లో చూడడం, చూసి సంతృప్తి తో మురిసి పోవడం మనం చూస్తూ వున్నాం. అందులో కొంత మంది కొడుకులు,  కూతుర్లు , తమ తల్లిదండ్రులను బాగా చూసుకోవడం  మనకు తెలుసు . 

"మీలో ఎవరు కోటీశ్వరుడు " లో యిటువంటి వారిని మనం అప్పుడప్పుడూ చూస్తూ వున్నాం కదా . మన "నాగార్జున" గారు చాలా చక్కగా నడుపుతూ వున్నారు ఆ ప్రోగ్రామును . 

అయితే, ఎంతో కొంత వున్న వాళ్ళు - పిల్లల భవిష్యత్తును  పూర్తిగా పట్టించుకోక పోవడం , వారిని అప్రయోజకులుగా తయారు చెయ్యడం కూడా  మనం ఎన్నో కుటుంబాలలో చూడొచ్చు . 

నాకు ఈ రెండు  రకాల కుటుంబాలూ  ఎన్నో తెలుసు . 

కొంత మంది పిల్లలు,  పెద్దలు ఎంత చెప్పినా వినక , చదువును , ఆరోగ్యాన్నీ అశ్రద్ధ చేసి , తమ జీవితాలను పాడు చేసుకోవడం నేను చాలానే చూశాను, చూస్తున్నాను . కొంత మంది పెద్దలు రకరకాల వ్యసనాలలొను, అలవాట్లలోను పడి - తమ కుటుంబాన్ని, పిల్లల భవిష్యత్తు ను నాశనం చేసిన , చేస్తున్న కుటుంబాలూ చాలా చూశాను ; చూస్తున్నాను. 

అంటే - బాధ్యతలను నిర్వర్తించే వారు, నిర్లక్ష్యం చేసే వారు - రెండు రకాలూ మనలో వున్నారు. 

మన చుట్టూ వున్న పరిస్థితులను బట్టి, మన బాధ్యతలు మారుతూ వుంటాయి . పరిస్థితులను మనం మార్చలేం .  కానీ,పరిస్థితులకు అనుగుణంగా మనలను మార్చుకునే శక్తి, మన బాధ్యతలను నిర్వర్తించే  శక్తి ఎంతో కొంత దేవుడి మనకు యిచ్చాడు . 

మనకు - తల్లిదండ్రుల పట్ల , పిల్లల పట్ల, సమాజం పట్ల , దేశం పట్ల , అనేక బాధ్యతలు వున్నాయి. కొన్ని నియమాలు , కొన్ని సరిహద్దులూ, కొన్ని అధికారాలూ, కొన్ని హక్కులూ   వున్నాయి . 

ప్రస్తుతం, మన పాఠ శాలల్లో, సమాజం లో మనకు - మన హక్కులు నేర్పుతున్నారే గానీ , బాధ్యతలు  నేర్పడం లేదు. బాధ్యతలు నేర్పని సమాజం - మనం బాధ్యతా యుతంగా ఉంటామని ఎలా అనుకోగలదు. మన సమస్య అదే . 

మన దేశంలో - ముఖ్యంగా, గత 66 ఏళ్ళుగా - హక్కులు , హక్కులు అంటూ ప్రతి వర్గం వారు గోల పెట్టడము , హక్కుల కోసం పోరాడడమే కానీ, ఎవ్వరూ, ఎప్పుడూ తమ తమ బాధ్యతలు ఇవీ అని అనుకోవడం , అవి చెయ్యాలని పూనుకోవడం - చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ  వుంది .

యిప్పుడు మోడీ గారు స్వచ్ఛ  భారత్ వొక ఉద్యమం లాగా ప్రజల ముందుకు తీసుకు వచ్చారు. యిది మెల్ల మెల్లగా , ప్రజల మనస్సులో నాటుకుంటూ వుంది.  చెప్ప వలసిన వాళ్ళు , చెప్ప వలసిన విధంగా , సున్నితంగా , మనసును తాకే విధంగా చెబితే , చాలా మంది  వొప్పుకుంటారు;  పాటిస్తారు . దాదాపు 80 శాతం మందిని  మంచి మాటలతోనే  మార్చొచ్చు . 

నాయకుడుగా వున్నా వాడు , గాంధీ లాగా , రామకృష్ణ పరమహంస లాగా - తానూ చేసి , యిలా మనం చేద్దాం రండి - అంటే ఎంతో మంది ముందుకు వస్తారు. 

'నేను చెబుతున్నాను - మీరు చెయ్యండి' అంటే - అది ఉద్యమం లాగా వుండదు. ప్రజలు ప్రభావితులు కారు. ముందుకు రారు . ఆ.. మునిసిపాలిటీ  లో, జీతాలు తీసుకుంటున్న వాళ్ళు కదా ఈ పని చెయ్యాలి అనే వాళ్ళు వున్నారు యిప్పుడు కూడా. 66 ఏళ్ళు మరి అలాగే గడిచింది కదా . దేశంలో ఎక్కడ చూసినా కుళ్ళు , కంపూ - తప్ప మరొకటి లేదు . 

చిన్న వుదాహరణ - మీరు కోలకాతా నుండి చెన్నై వస్తున్నారనుకోండి . విజయవాడ ప్రాంతంలో, రాత్రి పడుకున్నారు. నిద్రలో వున్నప్పుడు , ఎక్కడో వొక చోట మహా కంపు కొట్టి, భరించ లేక మీరు లేస్తారు. మీరు పై బెర్తులో వున్నా, చీకట్లో మరేం కనిపించకున్నా , మీకు అర్థమై పోతుంది , చెన్నై దగ్గరికి వచ్చేశామని . ఈ మధ్య కాస్త పరవాలేదు కానీ ముందు చాలా దుర్వాసనగా వుండేది. యిది బాగు చెయ్యాలనుకుంటే , చెయ్యొచ్చు . చెయ్యాలని అనుకోవాలి . 60 ఏళ్ళు అనుకోలేదు . యిప్పుడూ యింకా లేదు . 

గంగ - ఆర్థికంగానూ , సామాజికం గానూ , సాంస్కృతికం గానూ - అన్ని విధాలా మనకు ముఖ్యమైన నది . స్వాతంత్ర్యం  వచ్చే వరకూ బాగానే వుండేది . ఆ తరువాత, మన నిర్లక్ష్యం కారణంగా అన్ని రకాలా కలుష పూరితంగా మారింది.  ఎన్నో దేశాల్లో, ఎన్నో నదులు - స్వచ్చంగా మార్చ బడ్డాయి. మన దేశంలో పాలకులు అనుకోలేదు . అంతే . యిప్పుడు మోడీ గారు అనుకున్నారు; అన్నారు; చాలా మంది చేత అనిపించారు.  యిప్పుడు, చుట్టూ వున్న వారి చేత - ఆ ప్రయత్నాలు తీవ్రతరం  చేయిస్తున్నారు. 

వూడవాలంటే - మొదట మోడీ గారు వూడిచి తరువాత - యిలా చెయ్యండి - అంటారు . అలాగే - గంగ విషయంలో కూడా తన స్వ ప్రయత్నం చేసి , యిక మీరు చెయ్యండి అంటారు . అన్ని విషయాల్లోనూ అంతే. 

యిప్పుడు మరో చిన్న (పెద్ద) విషయం చూద్దాం . మోడీ గారు సరే . కానీ - సంఘ్  పరివార్  లో వున్న VHP,  హిందూ మహాసభ లాంటి వారికి మోడీ గారి చిత్త శుద్ధి , కార్య దీక్ష లేదు . మిగతా మతాల వారు హిందువులను మతం మార్చేస్తున్నారు , మార్చేస్తున్నారు , వీరిని మనం మళ్ళీ మన మతం లోకి తీసుకు రావాలి, ఎలాగోలా - అన్న తపనే గానీ, వున్న వారు ఎందుకు వెళ్లి పోతున్నారు - అన్న ఆలోచన కొంత కూడా లేదు.  ఆ ఎందుకు అన్న విషయం - యిప్పుడు కాస్త చూద్దాం .

మన మత  గురువులలో ఆది శంకరాచార్యుల  వారికి  విశిష్ట స్థానం వుంది అని మనకు తెలుసు .  ఆయన అతి చిన్న వయసులో చెప్పిన నిర్వాణ షట్కం ఎంత గొప్ప  భావాలతో వుంటుందో, చదివితే మనకు చాలా ఆశ్చర్యంగా వుంటుంది . మన సంస్కృతి , మన మతం ఏమిటో - ఆ ఆరు 'శ్లోకాల మాల' అర్థం చేసుకుంటే చాలు; మనకు నిజమైన జ్ఞానం వచ్చేస్తుంది . అందులో ఆయన, నాకు  మృత్యువు కానీ, మృత్యు భయం కానీ , జాతి భేదాలు కానీ లేవుగాక లేవు అన్నారు .  

జాతులే లేవని కాదు - అవి  గుణాన్ని బట్టి , చేసే పని బట్టి అని; జన్మ వలన కాదని శ్రీ కృష్ణుడే  అన్నాడు .  పనిని బట్టి వచ్చిన జాతి భేదాల్ని కూడా నేను చూడ వలసిన అవసరం లేదు - అన్నాడు శంకరుడు . ఆ తరువాత - సాక్షాత్  శివుడే కాశీలో తన్ను అంటరానితనం  పాటిస్తున్నావు సుమా - అని మందలించి, తన తప్పు దిద్దినట్టు, ఆయన చెప్పుకున్నాడు . శంకరులు చెప్పినా, రామానుజులు చెప్పినా - మనం మాత్రం త్వరగా మారడం లేదు . 

ఆ తర్వాత వచ్చిన వారు ఎంతో గొప్ప  వారే అయినా - శంకరులు చెప్పిన ఈ మూల సూత్రాలను, తమ మఠాల్లోనూ , దేవాలయాల్లోనూ పెద్దగా అమలు చెయ్య లేదు . ఇది వారు అనుకుంటే  వొక్క రోజులో మార్చొచ్చు . మారిస్తే, ఏ హిందువూ , మరో మతానికి వెళ్ళ  వలసిన అవసరమే వుండదు . వెళ్ళరు . హైందవ సమాజంలో వున్న ఈ వొక్క విషయం సరి దిద్దుకుంటే , మనం ఎంతో ముందుకు వెళ్ళ వచ్చు. యిది ఎవరు చేస్తారు ? ఎప్పుడు చేస్తారు ? 

మోడీ గారు చేస్తారా ? VHP , RSS , మరెవరైనా చేస్తారా ? మన మఠాధిపతులు చేస్తారా ? మరెవరైనా గురువులు చేస్తారా ? ఎందరో మహానుభావులు ; ఈ మహత్కార్యానికి ముందు నిలిచి ఎవరైనా చెయ్యచ్చు . అందరూ కలిసి చెయ్యొచ్చు .  యిది జరగాలి . గంగ పవిత్ర గంగగా మారుతూ వున్న సమయం లో, యిదీ జరిగి పొతే  ఎంత బాగుంటుంది !

నేను - నా చేత అయ్యే పని ఏదో చేస్తున్నాను . రాముడికి వుడత  చేసిన సహాయం లాగా .  సేవాలయ అనే ఆశ్రమం లో - అనాథ పిల్లలకూ, అనాథలు లాంటి లాంటి వృద్దులకూ - ప్రతి సంవత్సరమూ నేను చెయ్య గలిగినంత ధన సహాయం చేస్తూ వచ్చాను. 2014 నుండి మరో రకంగా చేద్దామని, యిద్దరు పిల్లల చదువు కు - 1 నుండి 12 వ తరగతి వరకు - అయ్యే పూర్తి ఖర్చు నేనే వారికి యిచ్చాను (1.7 లక్షలు ). యిక ముందు కూడా, నా శక్తి వున్న మేరకు, ప్రతి సంవత్సరమూ  వొకరో, ఇద్దరో పిల్లలకు చదువు పూర్తి ఖర్చు యివ్వాలని ఆశ , ఆశయం . దేవుడు ఆశీర్వదిస్తే అంత కంటే ఎక్కువే చేస్తాను . 

ఏదో చిన్న తపన నాలోనూ వుంది - నేను ఎవరి కళ్ళలో సంతోషం నింప గలను; ఎవరి కన్నీళ్లు తుడవగలను - అని . అది నన్ను ముందుకు నడిపిస్తుంది - యిక ముందు కూడా . 

నాకు తెలుసు. మన దేశంలో - ఎంతో మంది  డబ్బు వున్న వారు, ఎంతో, ఎంతో చేస్తున్నారు - విప్రో యజమాని ప్రేమ్జీ లాగా . మరెంతో మంది , ముఖ్యంగా, రాజకీయాల్లో వున్న వారు , అక్రమార్కులు గా ఉన్నారే తప్ప - ఏమీ చెయ్యడం లేదు . సరే . వారిని వదిలి పెట్టి , మనం అనుకుంటే, మనం చెయ్య గలిగింది చేస్తే ,  ఎంతో కొంత దేశం బాగు పడుతుంది కదా . 

ఇదొక్కటే కాదు . మనం మరెన్నో చెయ్యొచ్చు . నేను చేస్తున్న మరి కొన్ని పనులు మరో సారి మీతో పంచుకుంటా . 


మనం సంపాదించేదేదీ మన వెనుక రాదు ; మనం యిచ్చేదే  మనతో వస్తుందని , ఉపనిషత్తులు, గీత అన్నీ ఘోషిస్తున్నాయి .

మనం సంతోషంగా వుండి , మరో పది మంది సంతోషానికి కారణమైతే - అదే మన సంస్కృతి ఆశయం, లక్ష్యం. మన జీవన సాఫల్యం కూడా అందులోనే వుంది. 

సర్వే జనాః సుఖినో భవంతు అంటే అదే. మన బాధ్యతా నిర్వహణ అంటే కూడా అదే కదా .  

సరే . మీ అభిప్రాయాలు, సలహాలు తప్పకుండా చెప్పండి . సంతోషంగా స్వీకరిస్తాను . 

సర్వే జనాః సుఖినో భవంతు

= మీ 

వుప్పలధడియం విజయమోహన్ 

మేము యిప్పటికి చదివిస్తున్న యిద్దరు పిల్లలు









20, నవంబర్ 2014, గురువారం

ఏ రోగమయినా నయం అవుతుంది - ఎలా ? - మీరేం చెయ్యాలి? - డాక్టర్లు ఏం చెయ్యాలి ?



వ్యాధులూ - మనమూ


మన దేశం లో - రక రకాల రోగాలు చాలా పెరిగి పోతున్నాయి .

కొన్ని దీర్ఘ కాలిక రోగాలు . కొన్ని మందుల్లేని రోగాలు . కొన్ని మరణం తప్పదనిపించే రోగాలు . కొన్ని  మందులతో నయమయ్యే రోగాలు . కొన్ని సర్జరీ అవసరమైనవి . కొన్ని సర్జరీ  అవసరం లేనివి .  యిలా రోగాలు ఎన్ని రకాలో . ఎన్నెన్ని రకాలో . 

పుట్టిన బిడ్డ నుండి ,  వంద ఏళ్ళ వారి వరకు  అందరికీ రోగాలే .


ఎయిడ్స్ పెద్ద రోగం  అనుకుంటే , కాదు నేనున్నాను అంటూ - ఎబోలా వస్తూ వుంది . కాన్సర్ అంటే పెద్ద భయం యిప్పటికీ అందరికీ వుంది. చర్మ రోగాలు ప్రమాద కరం కాకున్నా, చాలా వాటికి సరైన మందులు లేవు . పిచ్చికుక్క కాటుకు కూడా యిప్పటికీ సరైన వైద్యం లేదు . కరిచిన ఘంట లోగా ఇంజక్షన్లు వేసుకుంటే చాలా మంచిది  .  మనకు వచ్చే మానసిక రోగాలూ ఎన్నో, ఎన్నెన్నో . వాటికీ సరైన వైద్యాలు లేవు .
యిలా వుంటే ఎలా ?

"రాకుండా చూసుకోవడం "  ,  "నయం చేసుకోవడం" కంటే ఎంతో మేలు ; ఎంతో సులభం - అన్న నానుడి వుండనే వుంది .  అది నిజమే .  కాకుంటే - రాకుండా చూసుకోవడం ఎలా ? అది తెలిసి చావాలి కదా . ఏ రోగమూ రాకుండా ఎలా చూసుకోవడం ?

యేవో కొన్ని ముందు జాగ్రత్తలు చేసుకోవచ్చు . చేసుకుంటే కొంత మేలు .

ఏం చేసుకోవచ్చు ?

(1) దోమలు, ఈగలు , బొద్దింకలు లాంటి రోగవాహక , క్రిమి వాహక జీవులు  - యిళ్ళలో , యిళ్ళ దగ్గర లేకుండా జాగ్రత్త పడ వచ్చు . ముఖ్యంగా మురుగు నీరు వుండకూడదు . అక్కడే రోగవాహక , క్రిమి వాహక జీవులు పెరుగుతాయి .

(2) ఆహారము, విహారము , చేసే పనులు, నిద్ర, మేలుకునే సమయం - అన్నీ, మితంగా , మనకు తగినవిగా వుండాలన్నాడు - గీతలో శ్రీ కృష్ణుడు. నేను ఫాస్ట్ ఫుడ్స్  తింటాను . ఎంత  సేపైనా నిద్ర పోతాను; ఎంత సేపైనా మేలుకుంటాను . శరీర వ్యాయామం అసలు చేయను .  లేదా,దినమంతా వ్యాయామం చేస్తాను - యిలా ఏదైనా సరే , 'అమితం' గా చేసే వారికి ఆరోగ్యమూ వుండదు . సంతోషమూ వుండదు .

(3) యింట్లో - చెత్త , దుమ్ము - లాంటివి లేకుండా చూసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది .

(3) ఇలాగే , మానసిక ప్రవృత్తులు కూడా కొన్ని నియమిత పరిధులలో వుంటే - ఆరోగ్యమూ వుంటుంది ; ఆనందమూ వుంటుంది .  మితి మీరిన పోకడలు పొతే , మానసిక ఆరోగ్యము చెడుతుంది ; తన కోపమె తన శత్రువు , తన శాంతమె తనకు రక్ష , దయ చుట్టంబౌ , తన సంతోషమే స్వర్గము , తన దుఃఖమే నరకమండ్రు  తథ్యము సుమతీ ! అన్నది పెద్దల సలహా . యిది వెయ్యేళ్ళు  పోయినా - మన మానసిక ఆరోగ్యానికి సూత్రం గా నిలబడుతుంది . నోరు నెమ్మదైతే , వూరు నెమ్మదౌతుంది.  యిదీ పెద్దలు చెప్పినదే, వేల సంవత్సరాల అనుభవానికి యివి ప్రతీకలు , ఫలితాలు . వీటిని పాటించక పొతే - మనకే నష్టం . నేను నిష్కర్ష గా మాట్లాడుతాను - అనే వారెవ్వరూ , ఎదుటి వారు తమ గురించి నిష్కర్ష గా మాట్లాడితే  విన లేరు . నిజాలు కూడా , చెప్పాల్సిన విధం వుంది . అది నేర్చుకోవాలి . వీటి వల్ల ఆరోగ్యం ఎలా వస్తుంది ? తప్పకుండా వస్తుంది . ప్రశాంతం గా, సంతోషంగా వుండే వారికి, రోగాలు రావడం చాలా తక్కువ . వచ్చినా - త్వరగా తగ్గిపోతాయి . యిది, నా, మన, అందరి  జీవితానుభవమే కదా !

రోగాలు రాకుండా చేసుకోవడానికి యిలా ఎన్నో మౌలిక సూత్రాలు వున్నాయి . ఇవి మనం  పాటించాలి .

సరే . రోగాలు వచ్చేశాయి . యిప్పుడేం  చెయ్యడం ?

ఉదాహరణకు - ఎవరికో కాన్సర్ వచ్చిందనుకోండి . చుట్టూ వున్న వాళ్ళు ఏం చెయ్యాలి ? కాన్సర్ వచ్చిన వాళ్ళు ఏం చెయ్యాలి ? డాక్టర్లు ఏం చెయ్యాలి ?

ఇలాంటి రోగాల్లో - రోగం సగం . భయం సగం గా వుంటుంది . నిజానికి భయం , వైద్యం పైన అపనమ్మకం అనే 2 అంశాలు - రోగానికంటే  ఎక్కువగా రోగిని బాధ పెడుతూ వుంటుంది . మొదట యివి పోవాలి . డాక్టర్లు మొట్ట మొదట ఇవ్వాల్సింది  నమ్మకం , ధైర్యం . ఎంతో మంది డాక్టర్లు , చాలా రోగాల్లో - యివి యివ్వడం లేదు.  మేం చేసేదంతా చేస్తాం ; ఆపై దేవుడి దయ ; మీ అదృష్టం - లాంటి మాటలు అంటూ వుంటారు . యిది చాలా తప్పు .

డాక్టర్లు నమ్మకం యివ్వాలి . ధైర్యం యివ్వాలి . అదే వారిచ్చే గొప్ప ఔషధం . దేవుడి దయ, అదృష్టం ఎలా వుంటాయో  ఎవరికీ తెలీదు. రోగికి ముందు డాక్టరే పోవచ్చు . లేదా రోగి పోవచ్చు . మనకు తెలీని ఇలాంటి విషయాల గురించి కాదు . డాక్టర్ తను చేసే వైద్యం లో ప్ర ప్రథమం గా నమ్మకం , ధైర్యం యివ్వడం వుండాలి . నిజమైన పరిస్థితి చుట్టాలకు  చెప్ప వచ్చు . కానీ , రోగికి మాత్రం నమ్మకం , ధైర్యం కలిగించాలి . నా వుద్దేశంలో - డాక్టర్లు చెయ్య గలిగిన, చెయ్య వలసిన మొదటి వైద్యం యిదే .

నా అనుభవమే చెబుతాను . 5 ఏళ్ళ క్రితం నన్ను వొక పిచ్చి కుక్క వెనుక నుండి  వచ్చి కాలిపైన కొరికింది . అది పిచ్చి కుక్క అన్నది వెంటనే తెలిసిపోయింది కూడా . ఎందు కంటే , నన్ను కొరికి పరుగెత్తుకెళ్ళి , మరెంత మందినో కొరికింది. నేను వెంటనే నాకు బాగా తెలిసిన వొక డాక్టరు ఫ్రెండు కు ఫోన్ చేసి విషయం చెప్పి ఏం చెయ్యాలని అడిగాను . ఆమె చెప్పినట్టు - కొరికిన భాగాన్ని బాగా టాప్ క్రింద కడిగి (డెటాల్ తో కూడా) వెంటనే, వొక లోకల్ డాక్టర్ దగ్గరి కెళ్లి  ఆంటి రాబీస్ ఇంజక్షన్లు  వేయించుకున్నాను . ఆయన చెప్పినట్టు  చెప్పిన రోజుల్లో వెళ్లి మిగతా అన్ని యింజక్షన్ లూ  వేయించుకున్నాను. 

కానీ - నేను యిక ప్రమాదమేమీ లేదు కదా  - అని ఆయన్ను  అడిగితే, దాదాపు 3-4 నిముషాలు మౌనంగా వుండి , ఆ తరువాత , మిమ్మల్నిఆర్నెల్లలోగా మరో పిచ్చి కుక్క కొరికితే నేను వేసిన యివే ఇంజక్షన్లు పని చేస్తాయి - అన్నాడు . నేను అది సరే , మరో పిచ్చి కుక్క కరవడం అటుంచండి ; ఈ పిచ్చి కుక్క కాటుకు , మీరు చేసిన వైద్యం తరువాత  నాకు మరేమీ  ప్రమాదం లేదు కదా  - అని అడిగితే , మళ్ళీ అదే తంతు . కాస్సేపు మౌనం , మళ్ళీ, మరో పిచ్చి కుక్క కరవడం గురించే మాట్లాడుతున్నారాయన . ఇప్పటికే కరిచిన పిచ్చి కుక్కను గురించి మాట్లాడడం లేదు ఆయన . యిక లాభం లేదని , మరో ముగ్గురు  లోకల్ డాక్టర్ల  దగ్గరకెళ్ళి అడిగితే , అక్కడా యిదే తంతు . ఎందుకిలా ? ఆ తరువాత నేను ఇంటర్నెట్ లో చూశాను . అక్కడా సరిగ్గా యిదే పదాలు రాసుంది . యిదే చెబుతున్నారు ఆ డాక్టర్లు . ఆ తరువాత - దూరంలో వున్న నా ఫ్రెండు డాక్టరును అడిగాను . ఆమె చెప్పిన జవాబు నాకు సంతోషం కలిగించింది , ఆమె - "అన్నా! నేను  వారానికి కనీసం పది మందికి యివే ఇంజక్షన్లు వేస్తూనే వున్నాను . నేను పని చేస్తున్న చోట యిది మామూలు . యిప్పటికి కొన్ని వందల , వేల మందికి వేశాను . అందరూ బాగానే  వున్నారు . ఏ వొక్కరూ పోలేదు .  సరైన సమయానికి ఇంజక్షన్లు వేసుకుంటే  చాలు ; ఏ ప్రమాదమూ లేదు . మీరు యిక ఆ విషయం పూర్తిగా మరిచిపొండి . హాయిగా వుండండి . మీకు ఏ ప్రమాదమూ లేదు." అనింది .

ఈ మాటలు మిగతా వారు ఎందుకు చెప్పటం  లేదు?  వారు చేసే వైద్యం తరువాత కూడా , వొక్క శాతం కేసులు , లేదా 0. 1  శాతం కేసులు ఫెయిల్ అవ్వొచ్చు . కానీ , అడిగే పేషంటుకు ధైర్యం చెబితే ఏం పోతుంది. నా ఉద్దేశంలో వున్న వైద్యం చేసి, డాక్టరు పూర్తి ధైర్యం, నమ్మకం  యివ్వాలి . 0. 1  శాతం కేసులు ఏ రోగం లో అయినా ఫెయిల్ అవ్వొచ్చు . డాక్టర్ ధైర్యం , నమ్మకం యివ్వక పొతే , 0. 1 శాతం పదింతలు పెరిగే అవకాశం వుంది.   కుక్క కాటుకు పోకున్నా , మానసిక  అధైర్యం తో పొయ్యే అవకాశం వుంది .

కాన్సరైనా  అంతే . డాక్టర్లు పూర్తి ధైర్యం, నమ్మకం యివ్వాలి రోగికి . కాన్సర్ పూర్తిగా తగ్గి ఎన్నో దశాబ్దాలు ఆరోగ్యంగా వున్న వారు ఎంతో మంది వున్నారు..  చాలా మంది డాక్టర్లు , తగ్గొచ్చు , తగ్గక పోవచ్చు అన్న  విధంగా   మాట్లాడుతూ వుండడం  నేను చూశాను . రోగుల విషయంలో వారు - అంత సత్య హరిశ్చంద్రులుగా వుండడం చాలా తప్పు . సంస్కృతంలో  సత్యం గురించి గొప్ప నీతి వుంది . "సత్యం బ్రూయాత్ , ప్రియం బ్రూయాత్ , న బ్రూయాత్ సత్యమప్రియం ."  అంటే -  సత్యాన్ని చెప్పండి . ప్రియంగా వుండేటట్టు చెప్పండి . అప్రియంగా వుండేలా ఎలాంటి సత్యమూ చెప్పకండి .   యిలా ఎన్నో వున్నాయి . మీరు చెప్పే అబద్ధం వలన లోక హితం జరుగుతుందంటే - ఆ అబద్ధమే నిజం . ప్రకృతి కూడా , మీరు చెప్పింది , లోక హితం కోసం  అంటే , దాన్ని నిజం చెయ్యడానికి కృషి చేస్తుంది.

రోగి తనకు నయమవుతుందని నమ్మితే - అతని శరీరము , మనసు, అది నిజం చెయ్యడానికి పూర్తిగా సహకరిస్తాయి . ఆ నమ్మకం అబద్ధం కాదు . కానీ , తనకు నయం కాదని అతడు నమ్మితే , అది నిజమయ్యే ప్రమాదం చాలా వుంది - ఎంత మంచి మందులు యిచ్చినా . అందుకని డాక్టర్లు, రోగి యొక్క కుటుంబ సభ్యులు, అందరూ ,  అతనికి ఆ నమ్మకం పూర్తిగా కలిగించాలి .

నమ్మకం మొట్ట మొదటిదైనా - రోగం పోవడానికి , మందులూ తీసుకోవాలి . నా ఉద్దేశం లో - అల్లోపతి , ఆయుర్వేద - రెండూ బాగా పనిచేస్తాయి , చాలా రోగాలకు . అలాగే - హోమియోపతి వైద్యం కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎన్నో రోగాలకు . కానీ సర్జరీ కావాల్సిన చోట ,  కేమోథెరపీ కావాల్సిన చోట , యిలా మరి కొన్ని అధునాతన వైద్యాలకు - అలోపతీ వాడి తీరాల్సిందే . అయితే , యివి వాడుతున్నప్పుడు కూడా - ఎన్నో రకాల ఆయుర్వేద మందులు కూడా వాడవచ్చు . వుదాహరణకు - కాన్సరు పేషంట్లు ,  వీట్ గ్రాస్ జూస్  కానీ  వీట్ గ్రాస్ పౌడర్ కానీ వాడటం, వాటి వుపయోగం చాలా వుండడం నేను చూశాను .

అలాగే , హృద్రోగాలు రాకుండా వుండటానికి , వచ్చినవి ఎక్కువ కాకుండా వుండటానికి - అర్జున మాత్రలు, బాగా ఉపయోగ పడడం నేను చూశాను . బ్లడ్ ప్రెషర్ కు బాబా రామ్ దేవ్ గారి ముక్తావటి మాత్రలు బాగా ఉపయోగ పడటం - పూర్తిగా నయమవడం - నా ప్రత్యక్ష  అనుభవం . యిలా ఎన్నో రోగాలకు , అల్లోపతీ లో సరైన వైద్యం లేని రోగాలకు - ఆయుర్వేదం లో మంచి మందులున్నాయి .  కానీ, కొన్ని రోగాలకు అల్లోపతీ లోనే సరైన వైద్యం వుంది . రోగి - యివి రెండూ వాడితే - చాలా రోగాలు , చాలా త్వరగా నయమవడం నేను చూశాను . కానీ, అల్లోపతీ వైద్యులు యిది వొప్పుకోరు . కానీ, వారికే  యిటువంటి వ్యాధులు వచ్చినప్పుడు , ఆయుర్వేద మందులు వాడడం అన్ని దేశాల్లో జరుగుతూ వుంది . అది తమకు సత్ఫలితాలను యిచ్చినట్టు ఆ అల్లోపతీ వైద్యులు పుస్తకాలు కూడా రాశారు . యిది ఇంటర్నెట్ లో ఎంతో మంది అల్లోపతీ వైద్యులే రాయడం , చెప్పడం - మనం చూడొచ్చు.

ఆయుర్వేద వైద్య పధ్ధతి లో - రోగాలు రాకుండా చేసే వైద్య విధానాలు చాలా వున్నాయి . యివి మనం తెలుసుకోవాలి , పాటించాలి .

ప్రతి దినం  ఉదయం , రాత్రి - 15 నిముషాలు (కనీసం) యోగాసనాలు, ధ్యానం  చేస్తే - శారీరక , మానసిక ఆరోగ్యాలకు రెండింటికీ చాలా మంచిది. 

ధ్యానం ద్వారా  - ఏదైనా సాధించ వచ్చని  పతంజలి నొక్కి చెప్పారు . దురదృష్ట వశాత్తూ, ఈ రోజు - యోగా, ధ్యానం వీటిపైన అమెరికా లో వున్న నమ్మకం , మన దేశం లో లేకపోయింది . అక్కడ యోగా, ధ్యానం చేసే వారి సంఖ్య మన దేశం లో కంటే  చాలా ఎక్కువ .

మన టీవీ  చానెళ్ళలో - వీటిని గురించి ఏమీ తెలియకున్నా , హేళన గా మాట్లాడే మూర్ఖుల సంఖ్య  ఎక్కువగా వుంది . వారు చెప్పే దానికి తగినట్టు , వారికంటే  మూర్ఖులైన  దొంగ  స్వాములు , వారిని నమ్మే  అమాయక ప్రజలు కూడా ఎక్కువగానే  వున్నారు .

యోగా అన్నది మన దేశంలో వున్న అతి  గొప్ప సైన్స్ . అందులో  ధ్యానం అన్నది గొప్ప అంతర్భాగం . వీటి వుపయోగాలు అనంతం - అంటే ఏమీ అతిశయోక్తి కాదు .

నా అభిప్రాయంలో - మన దేశంలో  - డాక్టర్లు , రాజకీయ నాయకులు , మీడియా ప్రముఖులు - వీరికి మొట్ట మొదట - యోగా, ధ్యానం - వీటిలో శిక్షణ యివ్వాలి . డాక్టర్లు చాలా మంది నేర్చుకుంటూ వున్నారు . రాజకీయ నాయకులు , మీడియా ప్రముఖులు - వీరితోనే వచ్చిన చిక్కల్లా .  తమకు ఏ మాత్రమూ అనుభవం లేని ఈ విషయాల గురించి ఎంతో హేళనగా మాట్లాడుతూ వుంటారు . వారు యివి నేర్చుకుంటే - వారూ బాగు పడతారు ; దేశమూ బాగు పడుతుంది .

మీరు చెయ్య గలిగిన, చెయ్య వలసిన  విషయం వొకటి వుంది .

ప్రతి దినం - కనీసం 15 నిమిషాలు -   ధ్యానం చెయ్యండి . ఏ చిన్న, పెద్ద రోగం వున్నా , మీ ధ్యానం వల్ల , మీలో వున్న అపరిమిత నమ్మకం వల్ల , మీ రోగాలన్నీ పోతున్నట్టు , మీరు సంపూర్ణ ఆరోగ్య వంతులౌతున్నట్టు - నమ్మకం తో ధ్యానం చెయ్యండి .  మీ నమ్మకం నిజమౌతుంది. యిది - నా అనుభవం . నా చుట్టూ వున్న వారి అనుభవం . నాకు తెలిసిన ఎంతో మంది అనుభవం . అదే మీ అనుభవం అవుతుంది .

సర్వే జనాః సుఖినో భవంతు .

=  మీ

వుప్పలధడియం విజయమోహన్

27, అక్టోబర్ 2014, సోమవారం

చేసిందేమిటి ? చేస్తున్నదేమిటి ? చెయ్యాల్సినదేమిటి ? మన భవిష్యత్తును ఎలా మలుచుకోవడం?

 
చేసిందేమిటి ? చేస్తున్నదేమిటి ? చెయ్యాల్సినదేమిటి ?

 నిన్నటికీ , ఈ రోజుకూ ఏమిటి మార్పు ? ఏం తేడా వచ్చింది మన జీవితాలలో, ఈ వొక్క రోజులో - అని అప్పుడప్పుడూ మనం పునరావలోకనం  చేసుకుంటూ వుండాలి కదా. యిది చాలా, చాలా అవసరం.   


వొక్క వారంలో - గ్రుడ్డు పగిలి, పురుగుగా, ప్యూపాగా ఆ తరువాత రంగు రంగుల సీతాకోక చిలుకగా మారడం ప్రకృతి పరిణామం. జంతు జాలమంతా అంతే.  మనిషి వొక్కడే తన భవిష్యత్తు  కొంత తానే    నిర్ణయించ గల సమర్థుడు.


గ్రుడ్డు
కాటర్పిల్లర్
ప్యూపా
సీతాకోకచిలుక
 
మనకైనా , భూతకాలం యొక్క సహజ పరిణామమే వర్తమానం. వర్తమానం యొక్క పరిణామమే భవిష్యత్తు.  

వర్తమానపు వొక్క క్షణంలో - భూతకాలంలో చేసిన అన్ని పనుల ఫలితాలు, భవిష్యత్తు యొక్క అన్ని పునాదులు, యిప్పుడు అనుభవిస్తున్న అన్ని కష్టసుఖాలు - యిమిడి వున్నాయి కదా. 
మీరు భూత కాలాన్ని మార్చగలరా ?  మార్చలేరు . పోనీ వర్తమానం లో మీ అనుభవాల్ని, సుఖదుఃఖాల్ని మార్చ గలరా ? అదీ కష్టమే. ఈ క్షణంలో మీరు అనుభవిస్తున్నదంతా , మీ  భూత కాలపు శ్రమల ఫలితమే .

మీ 'నిన్న', మీ 'ఈ  రోజు' ను శాసిస్తూ వుంది.  

మీ 'నిన్న' + మీ 'ఈ రోజు',  కలిసి - మీ రేపటిని శాసిస్తూ వున్నాయి.   

మీరు చేసే పనులకన్నిటికీ మీరే బాధ్యులు, నేను కాదు అంటాడు, భగవంతుడైన శ్రీకృష్ణుడు. మీ పనులకు, మీకు రావాల్సిన ఫలితం మాత్రం నేనే యివ్వగలను, యిస్తాను ; అది ఎప్పుడు, ఎలా, మీకు యివ్వాలో - అది నిర్ణయించే వాడిని మాత్రం నేనే , నువ్వు కాదు అంటాడు భగవంతుడు .  

యిది మనకు అర్థం కావాలి . బాగా అర్థం కావాలి. ఎవ్వడికి, ఏది వచ్చినా , అది మంచైనా, చెడైనా, అది వాడు చేసిన పనుల ఫలితమే, వాటి ప్రభావమే;  మనకు రాకూడనిది ఏదీ మనకు రావడం లేదు. అలాగే, మనకు రావాల్సినవి ఏదీ , మనకు రాకపోవడం లేదు. 

ఈ  మూల సూత్రానికి కొన్ని వివరణలు అవసరం . వ్యక్తిగా మనం చేసే పనుల ఫలితం మనకు రావాలి; వస్తుంది . అయితే , సంఘంగా , మనం చేసే వుమ్మడి పనుల ప్రభావం కూడా మనలో ప్రతి వొక్కరికీ వస్తుంది. 

వొక వుదాహరణ : వికిలీక్స్ అనే సంస్థ భారత దేశంలోని  అగ్ర రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు, అగ్ర క్రీడాకారులు - వీళ్ళంతా స్విస్  బాంకుల్లో, ఎంత నల్ల దానం దాచుకున్నారో - చిన్న లిస్టు వొకటి తయారు చేసి, కొన్ని సంవత్సరాల క్రితం  బాహాటంగానే విడుదల చేసింది . అందులో యింకా ఎంతో, ఎంతో మంది  ఉన్నారన్న విషయం కూడా చెప్పింది. అందులో లక్షల కోట్లు, వేల కోట్లు పెట్టుకున్న వారు ఎంతో మంది భారతీయ నాయకులు వున్నారు. ఎంత చెప్పినా , అప్పటి భారత ప్రభుత్వం ఏ మాత్రం స్పందించ లేదని కూడా చెప్పింది . ఎందుకు స్పందించ లేదంటే , ఏం చెబుతాం ?

స్విస్ బాంకుల్లో  లక్షల కోట్లు మన డబ్బు కాజేసి పెట్టుకున్న వెధవలకు  మనం వోటు వేస్తున్నామా ? లేదా ? మా కులం, మా మతం, మా పార్టీ - అని  మహా స్వార్థంగా , మహా మూర్ఖంగా మనం వోటు వేసేంత వరకు మన దేశం ఎలా బాగు పడుతుంది ?  బాబా రాందేవ్ గారు మొత్తుకుంటూనే వున్నారు - స్విస్ బాంకుల్లో వున్న నల్ల ధనం తెస్తే చాలు - మన దేశం బాగు పడి పోతుందని.
అందుకని  అప్పటి ప్రభుత్వం చేసిందేమిటి ? రామ్ దేవ్ గారి లా ఎవ్వరడిగితే , వారిపైన లేని పోని కేసులు పెట్టింది.  మోడీ గారు వస్తే  తమ గుట్టు బయట పడిపోతుందని,  వారిపై , చెత్త చెత్త కేసులు బనాయించాలని చూసింది. కాకుంటే , చేసిన పనుల ఫలితం - ఎప్పుడో వొకప్పుడు రాక మానదు కదా. యిప్పుడు వస్తూ వుంది .  ఈ హేమా హేమీలతో పోలిస్తే - జయలలితా గారిపైన వున్న ఆస్తి కేసు అసలేమీ లేదు - అని అనిపించక  మానదు. 

అయినా ప్రజలుగా మనం మారాలి . లంచగొండి తనానికి, నల్ల  ధనానికి ఎదురుగా - వొక మహా ఉద్యమం బయలు దేరాలి . మన ఊళ్ళల్లో ప్రతి ఆఫీసులో , వున్న లంచగొండి వాళ్ళను మార్చాలి ; మారని వాళ్ళను,  శిక్షించాలి. వొక క్లార్కుగా, కానిస్టేబుల్ గా వున్న వాడు , ఆస్పత్రిలో ప్యూన్ గా వున్న వాడు కోట్లు సంపాదించాలని ఎందుకు బయలు దేరుతున్నాడు ? నాయకుడు  సర్లేదు కాబట్టి .  మనం సర్లేదు కాబట్టి .

సరైన నాయకులను ఎన్నుకుంటే దేశం బాగుపడుతుంది . మోడీ గారు మూడు సార్లు సంపన్న రాష్ట్రమైన గుజరాత్ కు  ముఖ్య మంత్రిగా వున్న వారు. వారికి కోటి రూపాయల ఆస్తి మాత్రమే వుంది. అంతకు మించి వున్న 40 లక్షలను ప్రధాన మంత్రి కాక ముందే, అనాథ శరణాలయాలకు ఇచ్చేశారు. వొక సరైన ఇల్లు కొనడానికి యిప్పుడు వారి వద్ద డబ్బు లేదు. కానీ, 9 రోజులు వుప వాసం చేస్తూ, కేవలం నీళ్ళు మాత్రం తాగుతూ , గొప్ప గొప్ప వారిని ముగ్ధులను  చేసిన వాక్పటిమ , సాధనా పటిమ రెండూ వున్న వాడాయన. అటువంటి వాడు ప్రధాన మంత్రిగా వుండాలా? చుట్టూ వున్న వారు లక్షల కోట్లు ప్రజా ధనాన్ని మింగుతూ వుంటే  నిమ్మకు నీరెత్తినట్టు నోరు తెరవని వారు ప్రధానిగా వుండాలా ? అదీ కాక పొతే, ఆ మింగే వారే పదవిలోకి రావాలా ? 

సరే . మన  వ్యక్తి గత విషయాలకు వస్తే - మనం వర్తమానంలో చేసే పనుల వలననే - మన భవిష్యత్తు శాసించ బడుతుంది . అయితే భూత కాలం లో మనం చేసిన పనుల ఫలితం కూడా చాలా వుంటుంది. బంగారు బ్రతుకైనా , బండ బ్రతుకైనా  మనం సృష్టించుకునేదే (చాలా వరకు). 

పతంజలి మహర్షి అంటారు - "హేయం దుఃఖమనాగతం " అని. అంటే, రాబోయే కాలంలో రాబోయే దుఃఖాన్ని మాత్రమే మనం అడ్డుకోగలం ; దాన్నుండి తప్పించుకోగలం; కానీ , భూత వర్తమానాల లో జరిగి పోయిన, జరుగుతూ వున్న వాటిని మనం ఏమీ చెయ్యలేం అని . 

రాబోయే సుఖ దుఃఖాలకు కారణం - మనం యిప్పుడు చేసే పని. యిదే మన భవిష్యత్తు ను శాసిస్తుంది.
 
మనం బాగా చదవ వచ్చు. మన ఆఫీసుల్లో చేసే పనులు బాగా చెయ్య వచ్చు. మంచి మాటలు మాట్లాడ వచ్చు. మన, మన వాళ్ళ ఆరోగ్యం బాగుండడానికి  ఏం చెయ్యాలో అది చెయ్యొచ్చు. లేని వారికి, తోచిన, చేతనైన సహాయం చెయ్యొచ్చు . యిలా మనం చెయ్య గలిగిన పనులెన్నో వున్నాయి .  

 యిన్ని చెప్పడం దేనికి ? మీరేం చేశారో చెప్పండి అని మీరు అనొచ్చు.  నిజమే . నేనేం చేశానో చెబితే - ఆ పైన మీరు చెప్పండి . నేను యింకా, ఏమేమి చెయ్యొచ్చో ? అది నాకూ మేలు. నేను చేసిన ఈ పనులు చాలా చిన్నవే కావచ్చు. కానీ ఏదో కొంత చేశాను. యిక ముందు మరేదైనా చెయ్యాలి . మీ సలహాలకు నా కృతజ్ఞతలు.    

నేను 60 ఏళ్ళ వయసుకు , అంటే  31-12-2008 నాడు రిటైర్ అయిన  తరువాత   యిప్పటికి 5 1/2 సంవత్సరాలు గడిచాయి.  మొదట 3 సంవత్సరాలు స్వామీ పరమార్థానంద గారి క్లాసులకు, మా అన్న, నేను యిద్దరం వెళ్ళే వాళ్ళం. ఆయన స్వామీ దయానంద గారి ప్రథమ శిష్యులలో ముఖ్యుడు. వారు అద్వైత సిద్ధాంతాన్ని, గీత, ఉపనిషత్తులు, శంకరాచార్యుల, వారి శిష్యుల గ్రంథాలు చాలా విశదంగా చెబుతారు. 3 సంవత్సరాలలో అద్వైతం బాగానే వంట బట్టిందని చెప్పొచ్చు.  

అయితే, ఆ మధ్య కాలంలోనే, నేను నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి  వారు స్టాక్ మార్కెట్ గురించి పెట్టే 13 పరీక్షలు  వొక్కొక్కటిగా రాశాను. 84 శాతం సగటు మార్కులతో పాసయ్యాను. అందుకని వారు, నాకు ఆ 13 పరీక్షల సర్టిఫికేట్ ల తో బాటు మరో మూడు సర్టిఫికేట్ లు కూడా యిచ్చారు . అవి , యివి : 

1. NSE  సర్టిఫైడ్ మార్కెట్ ప్రొఫెషనల్ - లెవెల్ -5 (యిదే  హైయెస్ట్ )
2. NSE  సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్  ఛాంపియన్ 
3. NSE సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రో (ప్రొఫెషనల్ ) 
 
వొక ప్రక్క అద్వైతం; మరో ప్రక్క స్టాక్ మార్కెట్. యిది - నాకేమీ వైవిధ్యం అని అనిపించ లేదు.  

ఈ పరీక్షలు రాయడానికి ముందు, ICICI DIRECT వారి ద్వారా,  డీమాట్ అకౌంట్  ఓపెన్ చేశాను. నాకు రిటైర్మెంట్ సమయంలో వచ్చిన డబ్బులో సగం అందులో వేశాను.  సగం బాంక్ లో ఫిక్సెడ్ డిపాజిట్ లో వేశాను. మెల్ల మెల్లగా వొక్కొక్క కంపెనీ షేర్లలో కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్  చేస్తూ వచ్చాను . ఏ కంపెనీ షేర్లలో వేసినా, దాన్ని గురించి కనీసం వొక వారం రోజులు పూర్తిగా అధ్యయనం చేసే, ఆ తరువాతనే వేశాను . 

గొప్ప గొప్ప ఇన్వెస్టర్ల  గురించి, వారి విధానాల గురించి చాలా చదివాను. ముఖ్యంగా, వారెన్ బఫే (బఫెట్ ) గారు చెప్పిన సిద్ధాంతాలు  చాలా చాలా చదివాను. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్  చేయాలనుకునే వారందరికీ, వారెన్ బఫే గురించి మొదట తెలియాలి. స్టాక్ మార్కెట్ లో 'ఇన్వెస్ట్'  చేసే వారికి,  'స్పెకులేషన్'  చేసే వారికి చాలా అంతరం  వుంటుంది. ఎంత మంది చెప్పినా , నేను యింత వరకు స్పెకులేషన్  వైపు వెళ్ళలేదు . 

స్టాక్ మార్కెట్ లో ఎలా, ఎందులో, ఎప్పుడు ఇన్వెస్ట్ చెయ్యాలనేది  వొక సైన్స్ , వొక కళ .   యిది ఎవరైనా నేర్చుకోవచ్చు. యిది జీవితాంతం ఎప్పటికీ యింకా , యింకా నేర్చు కుంటూనే వుంటాను, అని నాకు  బాగా అర్థమయ్యింది. ఈ వ్యాపకం నాకు బాగానే వుంది. లాభ దాయకం గానే వుంది.  

సరే . అందులో వచ్చే  లాభం ఏం చెయ్యడం ?  అందులో నాలుగో వంతు (25%) అనాథ బాలికల, బాలుల విద్య కోసం పెట్టాలని నిర్ణయించుకున్నా. యిలా, పోయిన మూడు సంవత్సరాలూ  చేశాను. 2013 లో , లక్ష పది వేలకు పైగా విరాళం యివ్వ గలిగాను. 2014 లో యిప్పటి వరకు 86 వేలకు పైగా యిచ్చాను.  నవంబర్ 17, మా 36 వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా, మరో 80 వేలు యిస్తానని చెప్పేశాను . అంటే - ఈ విరాళాలు రెండూ యిద్దరు అనాథ బాలికల కు 5 నుండి 12 తరగతుల వరకు అయ్యే పూర్తి ఖర్చు అన్న మాట.  యిది కాక, వొకరికి , ఆర్ధిక పరిస్థితి ననుసరించి, 50 వేలు యిచ్చాను కాని అది అభిమాన పూర్వకంగా యిచ్చింది ; విరాళంగా కాదు .  

ముందు ముందు దేవుడి ఆశీర్వాదం వుంటే - యింకా, ఎంతో చెయ్యాలని వుంది. రిటైర్  అయిన సమయంలో, జీతం పెన్షన్ గా మారిన సమయంలో, 1/3 వ వంతు కు తగ్గిన సమయంలో , యింత మాత్రం చెయ్య గలనని ఎప్పుడూ అనుకోలేదు.  యిప్పుడు యింకా , యింకా చెయ్యాలని,  ఉత్సాహం వుంది . 

సరే . జీవితం లో మరో కోణం చూద్దాం . నాకు సంస్కృతం చదవాలని , నేర్చుకోవాలని ఎప్పటి నుండో మనసులో వుండేది . బెంగళూరులో సంస్కృత భారతి  అనే ప్రసిద్ధ సంస్థ  వుంది.  వారు నిర్వహించే సంస్కృత పరీక్షలు, కరెస్పాండెన్స్  కోర్సులు  చాలా ప్రసిద్ధి గాంచినవి . నేను రెండేళ్ళ క్రితం అందులో చేరాను. నాలుగు పరీక్షలూ, ఆరు, ఆరు నెలల, రాయాల్సిన వ్యవధిలోనే రాసేశాను . ప్రవేశ , పరిచయ , శిక్ష , కోవిద - అనే యివి నాలుగూ  పాసు కావడానికి 2 ఏళ్ళు పట్టింది. కోవిద పరీక్షలో 99 శాతం మార్కులతో  పాసు కావడం, నాకు కొంత ఆనందాన్నిచ్చింది. యిప్పుడు, యింకా బాగా నేర్చుకోవాలని  ప్రయత్నిస్తున్నాను .

యివి కాక యింకేం చేశాను ? మీరు చదువుతున్న  ఈ తెలుగు బ్లాగు , ఆంగ్లంలో రెండు బ్లాగులు  రాస్తున్నా.  ఆంగ్లంలో - స్టాక్ మార్కెట్ గురించి వొక బ్లాగు, మరొకటి మన స్పిరిచువాలిటీ  గురించి. అందులో పతంజలి యోగ సూత్రాలు, ఆత్మ బోధ  లాంటి చాలా గ్రందాల గురించి విస్తృతం గా రాయడం జరిగింది. రెండేళ్ళ క్రితం చిలుకూరి వెంకటేశ్వర్లు గారు నాకు పరిచయమయ్యారు. వారు అడగడం, వారు ఆంగ్లంలో ఉపనిషత్తుల పైన రాసిన  పుస్తకాలను చదివి - వాటి మూల గ్రంథాలనూ చదివి , ఎడిట్ చెయ్యడం కూడా జరిగింది. అప్పుడు తెలిసింది , రామకృష్ణ మిషన్ వారి తెలుగు పబ్లికేషన్స్ లో చాలా పుస్తకాలు వారు రాసిందేనని.   అంతకు మించి - తెలిసింది , మన ఉపనిషత్తులు ఎంత పురాతనమైనవైనా, ఎంత గొప్పవో ! అవి చదవడానికి నాకు ప్రోత్సాహమిచ్చిన, వారికి నేనెప్పుడూ కృతజ్ఞుడనై  వుంటాను . 

ఈ  భూత కాలం పునాదుల పైన భవిష్యత్తులో, మరే చిన్న కట్టడాలు,లేదా భవంతులు వుంటాయో - నాకు తెలీదు. అయితే , నిశితంగా ఆలోచిస్తే, పెద్దగా మనం చేసేదేమీ లేదు ; ఏదో అతీత శక్తి అటు వైపు , యిటు వైపు మనలను నడిపిస్తోందని   స్పష్టం గా తెలిసి పోతుంది. ఆలోచన కాస్త మనది ; ఆపై వేసే వొక్క అడుగు మనది ; కానీ అంతకు మించి నడిపించే అతీత శక్తి మరేదో వుంది. 

నాకు తెలిసి చాలా మంది చేస్తున్న పనుల్లో చాలా చిన్న శాతం మాత్రమే చెయ్య గలుగుతున్నా - అని మాత్రం చెప్ప వచ్చు. కాబట్టి యిదేదో స్వంత డబ్బాగా నేను అనుకోవడం లేదు. ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి ?  65 1/2 సంవత్సరాల వయసులో ఏం చెయ్యొచ్చు ? ఎన్నో చెయ్యొచ్చు . 


అదీ ఆలోచన, తపన . అంతే .


మరి, మీ సలహా చెప్పండి . 

= మీ 

వుప్పలధడియం విజయమోహన్

22, అక్టోబర్ 2014, బుధవారం

నిజమైన దీపావళికి - మన గమ్యాలేమిటి - రాష్ట్రానికి గమ్యం ఏమిటి ?- చంద్రబాబు గారు ఏం చెయ్యాలి?

 

నిజమైన దీపావళి

 
చేసే ప్రతి ప్రయత్నంలోనూ,  మనం విజయం పొందుతామని గ్యారంటీ ఏమీ లేదు . అప్పుడప్పుడూ వోటమి సహజం . మన ప్రతి విజయం వెనుక కొన్ని వోటములు వుండ వచ్చు . అది సిగ్గు పడాల్సిన  విషయం కాదు . అసలు ప్రయత్నమే  చెయ్యని వాడికి , విజయమేమిటి , వోటమి ఏమిటి ? జీవితమే అగమ్యం .
 
మనలో ప్రతి వొక్కరికీ , నిర్దిష్టమైన గమ్యం అవసరం . ఆ గమ్యం వైపు వెళ్ళడానికే ప్రయత్నం కావాలి . మన ప్రయత్నం యొక్క ఫలితం గెలుపో, వోటమో, ఏదైనా కావచ్చు . కానీ, మొదటి నుండి, తుది వరకు, గమ్యం చేరడానికి చెయ్యాల్సిన ప్రయత్నం చెయ్యడంలో మాత్రం మనం ఓడిపోకూడదు. ఇది చాలా ముఖ్యమైన , చాలా అందమైన మాట .
 
జీవితం లో  మనం చేసే ప్రయత్నమే మన విజయానికి మూలము. కట్ట కడపట వచ్చే విజయాన్నే కాదు, మన ప్రతి ప్రయత్నాన్నీ మనం ఆనందించాలి.  ఇదే శ్రీకృష్ణుడు వుపదేశించిన కర్మయోగం . కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన.
 
ప్రయత్నం మన బాధ్యత.  మనం ప్రయత్నం చెయ్యడంలో, మన బాధ్యతే, మన అధికారమే వుంది ; మన ప్రయత్నాలకు దేవుడు బాధ్యుడు కాదు.  కానీ, ఫలితం యిచ్చేవాడు మాత్రం ఆయనే . ఎందుకు, ఎప్పుడు, ఎలాంటి ఫలితం యిస్తాడో - అది మన యిష్ట  ప్రకారం  కాదు ; అది తన యిష్ట ప్రకారం యిస్తాడు .   

అందుకే, మన ప్రయత్నాన్ని - మనం పూర్తిగా మన బాధ్యతగా స్వీకరించి , దాన్ని అమలు చేస్తూ ఆనందించాలి. ఫలితం ఎలాగూ వస్తుంది . రాకుండా మాత్రం వుండదు . ఎప్పుడో, ఎలాగో - అది చెప్పడం కాస్త కష్టం. ఆ ఫలితం ఏదైనా , అదీ మనం ఆనందం తో అనుభవించాలి.
 
ఫలితాలు మన ప్రయత్నానుసారంగానే  వస్తూ వుంటాయి - కానీ , కాస్త ముందూ వెనుకలుగా. మనకు అక్కడే కాస్త తికమకగా వుంటుంది .   దాన్ని గురించి  పెద్దగా చింతించ కుండా తరువాత ప్రయత్నం మొదలు పెట్టేసేయ్యాలి ; అలా గమ్యం వైపు సాగిపోవడమే జీవితం .
 
అప్పుడప్పుడూ వెనక్కి తిరిగి చూడాలా వద్దా ? చూడొచ్చు. తప్పు లేదు.  ఇది వరకు మనం చేసిందేమిటి ? చెయ్యనిదేమిటి ? చెయ్యాల్సిందేమిటి ? యివి వొక్క సారి చూసుకుని ముందడుగు వెయ్యడంలో తప్పేమీ లేదు . 24 గంటలలో , వొక 5 నిముషాలు  ఈ పని చేస్తే , మిగతా 23 గంటలు, 55 నిముషాలు ప్రయోజనాత్మకంగా వుంటుంది .
 
స్టీఫెన్ కోవీ  గారు  - మీరు వేసే ప్రతి అడుగూ , గమ్యం వైపే వేస్తున్నారా , గమ్యానికి దూరంగా వేస్తున్నారా - అది సరి చూసుకుంటూ  వేయమంటారు.  గమ్యానికి దూరంగా వేసే ప్రతి అడుగూ, మనల్ని, విజయానికి దూరంగా తీసుకెడుతూ వుంటుంది. వాటికి ఫలితం  వుండదని  కాదు .  కానీ, అ ఫలితం  పెద్ద ప్రయోజన కారిగా వుండదు. మీరు నిచ్చెనను వెయ్యాల్సిన గోడకు వేస్తే , చెయ్యాల్సిన పనే చేస్తారు. మరో గోడకు వేస్తే, చెయ్యకూడని పని చేసేస్తారు. అవునా ! యిది మనం చెయ్యాల్సిన పనేనా, వెళ్ళాల్సిన మార్గమేనా అని అప్పుడప్పుడూ చూసుకోవాల్సిన అవసరం వుంది. లేదంటే, వినాయకుడిని చెయ్యబోయి, హనుమంతుడిని  చేసేస్తారు . అమెరికాకు వెడుతున్నామనుకుని అరేబియా కు వెళ్లి పోతారు. రోడ్ల మీద మార్గ దర్శక గుర్తులు అందుకే వున్నాయి . సముద్ర యానం లో దిక్సూచి అందుకే కావాలి . జీవన యానంలోనూ, గమ్యం తెలిపే దిక్సూచి మనకు కావాలి .  
 
అలాగే , స్టీఫెన్ కోవీ  "షార్పెన్  ది సా " అంటారు . అంటే , "మీలోని మేధా శక్తికి, మీ బుద్ధి కుశలత కు, మీ పనిముట్లకు  బాగా పదును పెట్టండి . అవి  బాగా పని చెయ్యగలిగేవిగా వుండేటట్టు  చూసుకోండి" అంటారు ఆయన. యిదే మాట గీతలో శ్రీకృష్ణుడూ అంటాడు  "యోగః కర్మసు కౌశలమ్" అని . అంటే మనం చెయ్యాల్సిన పనిని చాలా బాగా చెయ్యడమే యోగం అంటాడు . యిదే  భారతంలో అర్జునుడు మొదటి నుండీ చివరి వరకు చేశాడు. దీపాలు ఆరిపోతే , చీకట్లోనే భోజనం చేసిన అర్జునుడు , చీకట్లోనే అస్త్రవిద్యను కూడా నేర్చుకోవడానికి పూర్తి  ప్రయత్నం చేసి సఫలుడయ్యాడు .
 
మనం గమ్య మార్గం లో వెళ్ళాలంటే, దానికి తోడ్పాటుగా  శారీరక బలం, బుద్ధిబలం, దైవ సహకారం అన్నీ మనకు వుండాలి .మనం సాధారణంగా విజయానికి మూల సూత్రాలు  - లాంటివి  ఎన్నో చదువుతూ వుంటాము .  అసలు విజయం అంటే ఏమిటి ? పాండవులు యుద్ధంలో గెలవడం విజయమా? అది వారికి ఎంత మాత్రం సంతోషాన్ని యిచ్చింది ? సత్యభామ నరకాసురుడిని వధించడం విజయమా? అది ఆమెకు సంతోషాన్ని యిచ్చిందా ? కళింగ యుద్ధంలో అశోకుడి గెలుపు అతడికి సంతోషాన్ని యిచ్చిందా? 
 
విజయం సంతోషాన్ని యివ్వాలి.  అలా సంతోషం యివ్వని విజయం  ఎందుకు ? అది , గెలిచినా, వోడినట్టే కదా.  
 
మనసుల్ని గెలవడం చాలా గొప్ప విజయం . మనుషుల్ని గెలవడం చాలా చిన్న విజయం . నిజానికి , దీపావళి అంటే అదే . ఎంత మంది మనసుల్లో  దీపాలు వెలిగిస్తే అంత పండుగ ; అంత ఆనందం .  
 
మోడీ గారు స్వచ్చ భారత్ కావాలి, అది మనం తీసుకు రావాలి అంటారు . అది మొదట మన మనసుల్లో  ఆరంభం కావాలి. మనసుల్లోని కల్మషాన్ని తుడిచి పారెయ్యాలి . అది మనకు ఎంతో  ఆనందం యిచ్చే బృహత్ సాధన . రోజుకు  కనీసం రెండు  సంతోషాన్ని కలిగించే మంచి మాటలు, వారానికి వొక్కటైనా మంచి పని - చెప్పాలి , చెయ్యాలి అనుకుంటే జీవితానికి వొక గొప్ప గమ్యం ఏర్పడుతుంది .  అలా చేస్తున్న వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు .  ఇది చాలా అందమైన , కానీ , అతి సులభమైన గమ్యం . 
 
వొకాయన అన్నారు - "మా మోడీ గారు స్వచ్చ భారత్ అంటే , మా దేశం లోని కోట్లాది ప్రజలు చీపురు పట్టుకుని దేశాన్ని శుభ్రం చెయ్యడానికి బయలుదేరారు.  మా దేశం శుభ్రం అవుతోంది.  కానీ -  తుపాకీ పట్టుకోండి - అని ఆయన అంటే పాకీస్తాన్ వుగ్రవాదుల్లారా ,  మా ఎదుట మీరు నిలువగలరా ? ఎందుకు మీకీ వెన్నుపోటు తుంటరి చేష్టలు ?" 
 
జీవితంలో విజయానికి అర్థం తెలియని వారికి - నాకు రెండు కళ్ళు పోయినా పొరుగు వాడికి వొక కన్ను పోవాలి - అనుకునే మూర్ఖుడికి - మొదట అది తెలియజెప్పాలి .  
 
దీన్ని దాటి - మనలో ప్రతి వొక్కరూ , మన మన జీవితాలకు వొక గొప్ప గమ్యం ఏర్పరుచుకోవాలి.  
 
ఆనందంగా వుండడమే పెద్ద గమ్యం అయినా - దాన్ని సాధించడానికి అనుబంధంగా,  ఎన్నో గమ్యాలున్నాయి . శారీరకంగానూ , మానసికం గానూ ఆరోగ్యంగా వుండాలి. యిది వొక గమ్యం. ఆర్థికంగానూ ముందుకెళ్లాలి. యిదీ వొక గమ్యం . ఏవైనా కొన్ని విద్యలలో ప్రావీణ్యత సంపాదించాలి .యిదీ వొక గమ్యం .ఇవేవీ వద్దని మన వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు . మన ఋషులు గొప్ప శాస్త్ర వేత్తలు . సృష్టిలోని ఎన్నో రహస్యాలను పరిశోధించి కనుగొన్న వారు. మన ఆయుర్వేదం ఎంత గొప్పదో ! మన వాస్తు శాస్త్రం ఎంత గొప్పదో ! మన యోగ విజ్ఞానం ఎంత గొప్పదో ! మన తర్క శాస్త్రం , మన కర్మ సిద్దాంతం , మన గుణత్రయ విభాగ శాస్త్రం మన సంఖ్యా శాస్త్రం - దేని కదే గొప్పగా యీరోజుకూ ప్రకాశిస్తున్నాయి .  
 
కాకపోతే - తన్ను తాను తెలుసుకోవడం , తన మనసు పైన , తన శరీరం పైన విజయం సాధించడం - అన్నిటి కన్నా గొప్ప విజయం అన్నారు , మన వారు. వంద కోట్ల ప్రజల పైన అధికారం వుంది కానీ, నా మనసు పైన నాకు అధికారం లేదు, నా మనసు నా మాట విననంటుంది - అంటే , అది విజయం అవుతుందా ? అదే - అప్పటి దుర్యోధనుడి , రావణుడి  సమస్య . ఈ రోజుకూ అటువంటి వారందరికీ అదే సమస్య . 
 
మనసు పైన అధికారం వున్న వాడికి , ప్రకృతి  కూడా వశ వర్తి అవుతుందని మన వాళ్ళు గట్టిగా చెప్పారు. వారేం  అనుకుంటే అది చెయ్యడానికి ప్రకృతి  లోని అన్ని శక్తులూ  ముందుకు వస్తాయట.  యిలా జరగడం మనం ఈ రోజుకూ చూడొచ్చు . కాబట్టి, ప్రతి వొక్కరికీ , యిదే గొప్ప గమ్యం . 
 
సరే . రాజుకు ఎలాటి గమ్యం వుండాలి ? ప్రజలంతా , సకల, ఆయురారోగ్య ఆనంద, ఐశ్వర్యాలతో , మహా బుద్ధి మంతులుగా , మహా శక్తి మంతులుగా , సఖ్య భావంతో వుండాలనేగా ?
 
మన మోడీ గారు పీ. టీ. ఉషా గారిని గుజరాత్ కు ఆహ్వానించి , అక్కడ, అందరికీ ఆటలలో తర్ఫీదు యివ్వమని అడిగారు ఆమె కూడా వెంటనే వొప్పుకున్నారు . మరి మన చంద్రబాబు కూడా  మోడీ గారికి తక్కువేమీ కాదు కదా ! అందువలన , వారు కూడా , మల్ల యుద్ధం , జిమ్నాస్టిక్స్ లాంటి మంచి పోటీలలో తర్ఫీదు యివ్వగలిగే వాళ్ళని ఆంధ్రా కు పిలిస్తే  ఆంధ్రులలో - శారీరక ఆరోగ్యమూ , అన్ని రంగాలలో ముందుకు పోవాలన్న బలమైన కోరిక కలగడానికి అనువుగా , ప్రోత్సాహంగా వుంటుంది.  లేదంటే - BP , చక్కర వ్యాధి లాంటి అనారోగ్యాలు మన వాళ్ళలో ఎక్కువవుతూ వుంటాయి .  
 
యిప్పుడు హర్యానా లో - అటువంటి మంచి , ప్రోత్సాహ కరమైన వాతావరణం  వుంది . మన రాష్ట్రంలో లేదు . చంద్రబాబు నాయకత్వంలో - ఆయన ప్రతి రంగంలో - హేమా హేమీ లను పిలిచి - మన వారికి ట్రైనింగ్ యిప్పిస్తే - మన రాష్ట్రం ఎంతో బాగు పడుతుంది .  

 
 
మన రాష్ట్రం లోని ప్రతి వొక్కరూ  - ఆరోగ్యంతో , వుత్సాహంతో ముందుకు సాగిపోయే వారయితే , అంతకు మించిన దీపావళి మరొక్కటి వుంటుందా ? వచ్చే ఆసియాడ్ , ఒలింపిక్స్  లాంటి పోటీలలో , ఆంధ్రులు ఎక్కువ వుంటారనీ , మన రాష్ట్రానికి గొప్ప పేరు తెస్తారనీ - మనం ఆశిద్దాం . ఈ మాటలు చంద్ర బాబు గారు వినాలి ; దానికి తగిన చర్యలు తీసుకోవాలి అని - ఆశిద్దాం .
 
ఇలాంటి గొప్ప గమ్యం పెట్టుకుంటే - రాష్ట్రం - అన్ని రంగాలలో , అభివృద్ధి చెందుతుంది - అందులో సందేహం లేదు . 
 
అది మనమందరం కలిసి సాధిద్దామని ఆశిస్తూ - దీపావళికి మీకందరికీ , నా హార్దిక శుభాకాంక్షలు . 
= మీ 
 
వుప్పలధడియం విజయమోహన్