6, మే 2014, మంగళవారం

సంస్కృతం నుండి - సుభాషితాలు కొన్ని - పుణ్యమంటే, పాపమంటే నిజంగా ఏమిటి ? పరో(రా)పకారమంటే ఏమిటి ?

సంస్కృతం నుండి
సుభాషితాలు కొన్ని 

ఈ మధ్య సంస్కృతం బాగా నేర్చుకోవాలనే తపన ఎక్కువై , సంస్కృత భారతి  వారు జరుపుతున్న మూడు పరీక్షలు రాసి బాగా పాసవడం , చివరిదైన కోవిద పరీక్షకు రిజిస్టరు చెయ్యడం జరిగింది . సంస్కృతం భారతీయ / ప్రపంచ  భాషలన్నిటిలో, అతి ప్రాచీనమైనది ; అందులోని జ్ఞాన సంపద అత్యున్నతమైనది - అన్న మాట మనలో చాలా మందికి తెలిసినదే .

సంస్కృతం నుండి కొన్ని శ్లోకాలను యిక్కడ ఉదాహరిస్తున్నాను .

ఋగ్వేదం : " ఆ నో భద్రాః క్రతవో యంతు విశ్వతః

అంటే , "అన్ని దిక్కుల నుండి  మంచి ఆలోచనలే మనకు వచ్చు గాక"  అని అర్థం . చూడండి . ఋగ్వేదం ఎప్పుడు మొదట రాయబడిందో , ఎవరికీ  తెలీదు . ఎంత ప్రాచీనమైనదో ఎవరికీ తెలీదు . ప్రపంచంలోని  అన్ని గ్రంధాలలో - అన్నిటికంటే అతి ప్రాచీనమైనది ఋగ్వేదం . అందులో చెప్పబడిన వాక్యం యిది . యిది ఎప్పటి వాక్యం ? ఎన్నో వేల ఏండ్లది  కావచ్చు . ఎన్నో లక్షల ఏండ్లదైనా  కావచ్చు . అంత ప్రాచీనమైన మాట యిది . 

అన్ని దిక్కుల నుండి మనకు మంచి ఆలోచనలే రావాలి. అప్పుడే కదా , మన మనసు మంచి ఆలోచనలు చేస్తుంది. అప్పుడే కదా, సమాజమంతా - మంచిగా వుంటుంది . దీనికి మరో పిల్ల వాక్యం చెప్పాలంటే , వొక వేళ , వొక వైపు నుండి, చెడు ఆలోచనలు వస్తూ వుంటే , ఏం చెయ్యాలి? మొదట, అవి మీ మనసులో దూరకుండా చూసుకోవాలి . మళ్లీ  అవి - ఆ దిక్కున పుట్టకుండా , మన వద్దకు రాకుండా , మరెన్నో చెయ్యాలి . యిలా - ఈ వాక్యార్థం ఎన్నో విధాలుగా చెప్పుకోవచ్చు . నిజానికి - మన జీవితం బాగుండాలంటే, సుఖ మయం కావాలంటే - ఈ వాక్యం వొక్కటి పాటిస్తే  చాలు - ఔనా !


2. "ఆత్మార్థం జీవలోకేస్మిన్  కో న జీవతి మానవః ;  పరం పరోపకారార్థం యో జీవతి స జీవతి" . 

ప్రపంచం లో  చాలా మంది స్వహితం , స్వసుఖం చూసుకునే  వాళ్ళుగానే  వున్నారు . 

కానీ , పరోపకారార్థం , పర హితార్థం  ఎవరు జీవిస్తారో , వారి జీవితమే , నిజమైన , ధన్య జీవితం . అది కాని జీవితము , నిరర్థక జీవితం. యిదీ దీని భావం .

యిది విన్న తరువాత - మనం మన జీవితాన్ని కాస్త నిశితం గా పరిశీలించి - మనలో ఈ పర హితార్థకత  వుందా , లేదా; ఎంత వుంది - అని చూసుకోవాలనిపించాలి కదా .


3. "శ్లోకార్ధేన  ప్రవక్ష్యామి  యదుక్తం గ్రంధకోటిభిహి  ;  పరోపకారః పుణ్యాయ పాపాయ పర పీడనం . "

కోటి గ్రంధాల లో చెప్ప బడిన దాని (సారాన్ని) అర్ధ (సగం) శ్లోకం లో చెబుతున్నాను . పుణ్యమంటే - పరోపకారమే . పాపమంటే - పరపీడనమే . 

మరొకరికి ఉపకారం చెయ్యడమే పుణ్యము . 

దేవుడికి మ్రొక్కితే పుణ్యము . పూజ చేస్తే పుణ్యము - అని అనుకుంటాము .  నిజానికి , యివన్నీ మన మనసును పరిశుద్ధం  చేసేవి . అంతే కాని పుణ్యాలు కావు . పుణ్యమంటే  పరోపకారమే - అంతే కానీ , మరేదీ కాదు.  దీన్ని మరింతగా మనం విశ్లేషించుకోవచ్చు . రాజు పట్టుకోవాలనుకునే దొంగను దాచి పెట్టడం  దొంగకు ఉపకారం లాగా తోచ వచ్చు . కానీ, ప్రజలకు అపకారం కదా . అందువలన , మనం చేసే పరోపకారం - మరొకరికి , ముఖ్యంగా, మంచి వారికి అపకారంగా పరిణమించ కూడదు . లంచగొండి అయిన వాడికి వోటు వేస్తే - వాడికి ఉపకారం ; కానీ, ప్రజలకు అపకారం . అలా వోటు వెయ్యడం కూడా పాపం క్రిందకే వస్తుంది . 

పర పీడనమే పాపము , అన్నారు. పరులకు కష్టం కలిగించడం ఖచ్చితంగా పాపమే . యిది మనం సాధారణం గా మాటల ద్వారా ప్రతి దినం , ఎన్నో సార్లు చేస్తూ వుంటాము . "నిజం మాట్లాడడం"  పుణ్యం అనుకుంటాం . కాదు . ఆ నిజం వలన పరోపకారం జరగాలి . సజ్జనోపకారం జరగాలి . ఆ నిజం, మృదువుగా, ఆహ్లాదకరంగా , మనసుకు నచ్చేటట్టు  చెప్పగలగాలి . అన్ని సమయాల్లోనూ , అలాంటి ప్రయత్నం చెయ్యాలి .  

అందుకే "సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్ , న బ్రూయాత్, సత్యమప్రియం " అన్నారు. సత్యం చెప్పాలి. ప్రియంగా చెప్పాలి. ఏ సత్యాన్నీ  అప్రియంగా చెప్పకండి . -అని భావం . 

నువ్వు చూడ్డానికి అందంగా లేవు - అన్నది సత్యమా?  ఎదుటి వారిని గురించి - మీ మనసులో అలాంటి భావం వచ్చినా , అది నిజమే అని మీరు అనుకున్నా , అది చెప్పడం  సత్యం క్రిందకు రాదు, కానీ పాపం క్రిందకు మాత్రం తప్పకుండా వస్తుంది . పరులకు ఆనందమూ , ఆహ్లాదమూ కలిగించే సత్యాలు ఎన్నో వున్నాయి . అవి చెబితే , పుణ్యం కూడా .   కానీ, అవి చెప్పము . చెప్పాలని తోచదు . పరులకు కష్టాన్ని కలిగించే సత్యాలు చెప్పాల్సి వస్తే - అది ఎలా చెప్పాలో, అసలు చెప్పాలా వద్దా అన్నది మనకు తెలియాలి . చెప్పరాని విధంగా చెబితే - అది పాపం .  అంటే - మన మాట , మంచి  మాటగా , మంచిని పెంచే, పంచే మాటగా వుండాలి .

 మరి,  దుష్టులకు, వారు చేసే పనులు ఆకృత్యాలని చెప్పాలా , వద్దా ? చెప్పాలి.  వీలైనంత వరకు - వారిలో మార్పు వచ్చే రీతిగా చెప్పాలి . అందుకనే - సామ,  దాన, భేద , దండోపాయాలను - ఆ వరుస క్రమంలో ప్రయోగించ మన్నారు . 

యిది - కేవలం మాటల ద్వారా మనం చెయ్య గలిగే పుణ్యాలు , చేస్తున్న పాపాలు . 

ఉత్త మాటల ద్వారా మనం ఎంతో మందిని సంతోష పెట్ట వచ్చు . ఆలోచించండి . 

దీని తరువాత - మనం చేసే కార్యాలు - పుణ్యాలా , పాపాలా ? యిది చూసుకోవాలి . దీనికీ పై సూత్రమే వర్తిస్తుంది . ప్రతి రోజూ - మనలో, ప్రతి వొక్కరు , పంచ మహా యజ్ఞాలు - అనేవి చెయ్యాలి, అని పెద్దలు చెప్పారు . దేవతలకు, ఋషులకు, పితరులకు , మానవులకు, సకల భూత కోటికి (జంతువులు, పక్షులు, వృక్షాలు యిత్యాదులు)  మన సహాయం అందాలి . యిది మన నిత్య కృత్యం గా మారాలి . ఈ పుణ్యాలు చేసే వాడికి,  పాపాలను గురించి యోచన చేసే సమయం కూడా వుండదు . అతని జీవితం కూడా మహదానంద మయం  గానే వుంటుంది .


చివర , మహా భారతం లోని వొక చిన్న శ్లోకం :

4. "అలక్ష్మీరావిశత్యేనం  శయానమలసం నరం . "

సిరి ఎవరిని వరించదు? దురదృష్టం ఎవరికి వస్తుంది ?

ఎవడైతే నిద్ర మత్తులోనే వుంటాడో , ఎవడైతే సోమరితనంలోనే వుంటాడో - వాడికే దురదృష్టం వస్తుంది; సిరి వాడి వద్దకు రానే రాదు . 

- యిలా చురుకుతనాన్ని , పనిలో కుశలతను ఎంతగానో ప్రోత్సహించే తత్త్వం, సంస్కృతి  మనది . "కర్మలో కుశలత నే యోగం "  అని శ్రీకృష్ణుడు భగవద్ గీతలో కూడా అంటాడు. 

సంస్కృతంలో సుభాషితాలు చాలా, చాలా, చాలా ఎక్కువ . అవి చదివితే చాలు ; జీవితాలు మారిపోతాయి . మన పాఠ్య పుస్తకాలలో కూడా , ప్రతి క్లాసులోనూ - ఈ సుభాషితాలను చేరిస్తే చాలు - మన మనసుల్లోను, జీవితాల్లోను  ఎంతో ప్రగతి వస్తుంది . అది జరుగుతుందా ?  ఎప్పుడు జరుగుతుందో ?  శుభస్య  శీఘ్రం !

సర్వే  జనాః సుఖినో భవంతు 

= మీ 

వుప్పలధడియం  విజయమోహన్  


2, మే 2014, శుక్రవారం

ఎన్నికలు -2014- 1950 నాటి పద్ధతులు-ఈ నాటి టెక్నాలజీకి,వోటర్లకు ,తగినట్టుగా వుందా?. ఎన్నో మార్పులు రావాలి

ఎన్నికలు -2014


ఎన్నికలు  జరిగి పోతూ వున్నాయి. మరో పదిహేను రోజులలో అంతా అయిపోయి నట్టే . తరువాత -  ఎన్నికల ఫలితాలు వచ్చేస్తాయి . జూన్ నెలలో క్రొత్త ప్రభుత్వాలు రాష్ట్రాలలోను, కేంద్రంలోనూ వచ్చేస్తాయి .

ఎవరొస్తారో ? ....యెవరికి తెలుసు . 

తెలుసు అనే వాళ్ళ లోనూ,   మేమే గెలుస్తాం అనే వారి లోనూ కూడా గుండె దడ వుండనే వుంటుంది . మరి మేమే వోడిపోతాం -అని నిశ్చయించుకున్న వారి మనసు ఎలా వుంటుంది ?

ఎదుటి  వారిని , గెలిచే వారిని , ఎలాగైనా , ఏదో వొక చిక్కుల్లో యిరికించి పోదామని వుంటుంది .

యిప్పుడు కాంగ్రెస్ అలాగే చేస్తూ వుంది . యిప్పుడు కాంగ్రెస్ చేస్తూ  వున్న ఏ పని లోనూ నిజాయితీ , హుందా తనం కనిపించడం లేదు .

పదేళ్లుగా లోక్ పాల్ కావాలి అని ఉద్యమాలు జరిపిన వారందరినీ - ఎన్నో రకాలుగా వేధించిన కాంగ్రెస్ - యిక పది రోజుల్లో ఎలెక్షన్లు ముగిసిపోతుండగా ,  యిప్పుడు ఎవరితోనూ చర్చలు కూడా జరపకుండా , లోక్ పాల్ ను మేము పెడతాము - అనడం, హాస్యాస్పదం .

అలాగే మరెన్నో అప్పాయింట్ మెంట్లు చేస్తూ వుంది . స్నూప్ గేట్ అని పేరు పెట్టి - ఏమీ లేనిది , ఏదో జరిగిందని ఏదో చీమను భూతం లాగా చూపించడం , దానికి ఏ జడ్జీ యింతవరకూ - మేము వొప్పుకోము అన్న తరువాత కూడా - ఎవరో వొక జడ్జీని - ఎన్నికల ముందు పెడతాము -అనడం   విచారకరం ; హాస్యాస్పదం .  

మిగతా ఎంతో మంది జడ్జీలు ఎందుకు నిరాకరించారో  మొదట కాంగ్రెస్ చెప్పాల్సి వుంది . 

 లంచగొండి  తనం వొక ప్రక్క వున్నా - రాజకీయ ప్రత్యర్థులను యిలా ఎదుర్కొనడం , యిలా అనుకోవడం  కూడా  అంత కంటే, చాలా శోచనీయం .


కాంగ్రెస్ ఈ  పధ్ధతి మానుకుంటే  మేలు . లేకుంటే - వచ్చే అయిదేళ్ళలో , బీ . జే . పీ  కూడా అలాంటి పద్ధతే  పాటించితే - అది తప్పెలా అవుతుంది ?

మొత్తానికి రాజకీయాలను ఎంత కల్మషంగా మార్చాల్నో , అంత కల్మషం గా మార్చేస్తునారు . ఈ నేపథ్యంలో  ప్రజలు ఎన్నికలలో ఏం చేస్తున్నారో , ఏం చేయ్యబోతున్నారో  మనకు తెలీదు ;  కానీ , ఈ నెల అంతం లోగా తెలిసి పోతుంది .

ఈ మధ్యలో - ఎన్నికల కమిషన్ వారి తీరు కూడా కాస్త వింతగా వుంది . మోడీ గారు ఎక్కడో కమలం సింబల్ చూపారట . అది ఎక్కడా, ఏమీ అనేది విచారించ కుండా , వారిపై FIR  దాఖలు చేయించారు . మరి పోలీసులేమో - అది - వుండాల్సిన దూరాన్ని దాటే జరిగిందని చెబుతున్నారు .

మరో వైపు - కాంగ్రెస్ నేతలు ఎంతో మంది పోలింగ్ బూతు బయటికి రాగానే,  క్యూ లో నించున్న   వోటర్లకు   తమదైన  "హస్తం" గుర్తు చూపుతున్నట్టు  అందరికీ తెలుస్తోనే వుంది గా . మరి దానికేం FIR  లేదా ? తామర గుర్తు ఎక్కడో వోటర్లు కాని వాళ్లకు చూపితే ఏం తప్పు ?  ఈ గుర్తుల విషయంలో  EC వారు  కాంగ్రెస్ వారి వాదన పక్కకు పెడితే - ఎన్నో యిటువంటివి అన్ని పార్టీల వారూ చేస్తుండడం తెలుస్తుంది .

అంతెందుకు . సైకిలు గుర్తు వారు , కారున్నా కూడా , ఆ రోజు మాత్రం బూతుకు సైకిలు లో రావడం, దాన్లోనే ఊరంతా తిరగడము  జరుగుతూ వుంది . కారు గుర్తు వారూ అంతే . అది వోటర్ల మనసులలో - ఆహా , యిదీ వారి గుర్తు , అని చెప్పినట్టే కదా !

ఎలెక్షన్ కమిషన్ వారి  వోటింగ్ బూతుల్లోనూ , బయటా కూడా - "ఝాడూ" లు (పరకలు ) ఉన్నాయా లేదా ? అలాగే, బూతుల్లో - "ఫాన్లు" - అవీ వొక పార్టీ సింబల్ కదా - అవన్నీ వోటర్లకు కొన్ని పార్టీల గుర్తులు చూపుతున్నట్టే కదా. అవి చూస్తే - ఆ పార్టీలు మనకు , వోటు వేసే ముందు , గుర్తుకు వొస్తాయిగా ! ఎదురుగా వుండేది ఎందుకు  గుర్తుకు రాదు.

అసలు బూతుల్లో వుండే వస్తువులను - పార్టీల సింబల్సు గా ఎలా వొప్పుకున్నారు ? అందరూ చెయ్యెత్తి చూపే "చెయ్యి" సింబల్ - వొక పార్టీ సింబలు  గా యివ్వ వచ్చా?  యిప్పుడు వారేమో , బూతు నుండి  బయటికి రాగానే , చెయ్యెత్తి ఊపుతూ వెళ్ళిపోతున్నారు . 

యిలా ఎన్నో పార్టీ ల సింబల్సు - అందరూ - బూతుల్లోనూ , బయటా వోటర్లకే  చూపుతూ వుంటే - ఎక్కడో దూరంగా , మోడీ గారు, చిన్న తామర సింబల్ ను వోటర్లే కాని వారు ఎవరికో చూపితే - అది మాత్రమే - తప్పెలా అవుతుంది .

సరే . ఆ వోటర్లు కాని వారు టెలివిజన్ లో చూపారు అనుకోండి . అది ఎవరికని ? భారత దేశమంతా , యింకా ఎన్నో చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయా , లేదా ? అది వారికోసం కాదా . యిప్పుడు అందరూ , ప్రతిదినం ప్రచారం చేస్తున్నారు .  ప్రతి దినం ఏదో వొక చోట ఎలెక్షన్  వుంది . రెండూ జరుగుతూనే వున్నాయి కదా . మరి, ఎవరూ , మరెక్కడా మాట్లాడ కూడదా ? ఈ రోజుల్లో , దేశం లో కానీ విదేశాలలో కానీ - ఎక్కడ మాట్లాడినా , అది 10 నిమిషాల్లో ప్రతి వొక్కరికీ అందుతుంది  కదా .  అసలు అందితే తప్పేమిటి ?

ఈ చట్టాలన్నీ , యిన్ని టెక్నాలజీలు లేని సమయంలో చేసినవి , యివి, యిప్పటికి పనికి రాదు కదా .

మోడీ గారు ఎవరికో తామర సింబల్  చూపినంత మాత్రాన - అందరి మనసులూ ఆ క్షణాన  మారిపోయి ఆయనకే  వోటు వేస్తారు - అనుకోవడం ఎంత మాత్రం బాగుంది ?

కొన్ని నెలలుగా దేశమంతటా , ఎక్కడ చూసినా తామర సింబల్ వుందా లేదా ? యిన్ని నెలలుగా, మోడీ గారు అది పెట్టుకుని తిరుగుతున్నారా లేదా . తామర BJP సింబల్ అని తెలియని వోటర్లకు (నిజంగా వుంటే), ఇప్పుడాయన  ఎక్కడో, ఆ సింబల్ తీసి యిలా పట్టుకుంటే , అదీ వారెవరూ చూడక , ఎవరో, జర్నలిస్టులు మాత్రం చూస్తే - అది తప్పెలా అవుతుంది . అది అసలు ఆ జర్నలిస్టుల తప్పు మాత్రం ఎలా అవుతుంది ? వారు బూతు దగ్గరికి రాలేదు, అక్కడ అడగ లేదు . మోడీ గారు కూడా బూతు దగ్గర చెప్పలేదు చూప లేదు.

మరి యింత - సీనుందా ఈ విషయానికి ?  జర్నలిస్టులు కూడా ఆ రోజు కానీ , ఈ రోజు కానీ , ఈ మధ్య రోజుల్లో కానీ తామర ను చూపడమే లేదా . ప్రతి రోజూ , 24 గంటలూ , ప్రతి చానల్ లోనూ చూపిస్తూనే వున్నారు ; మనమూ చూస్తూ వున్నామా లేదా ? టీవీ తెరిస్తే తామర గుర్తు వుండనే వుంది కదా.

అంతే కాదు.  యింకా ఎలెక్షన్లు వున్నాయి కదా . మరి మోడీ గారు ఎక్కడో , ఎవరికో , కమలం గుర్తు చూపితే , అక్కడి బూతుల్లోని వోటర్లు మాత్రం, అది చూడకుండానే మారిపోతారంటే యెలా ? అలా మారిపోతారా ఎవరైనా ?

నా ఉద్దేశంలో - యిటువంటి రూల్సు మారాలి . నిజానికి బూతు దగ్గర కూడా వొక పెద్ద పట్టిక వుండాలి . ఎవరి సింబల్  ఏదో తెలిసేటట్టు చెప్పాలి కమిషన్ వారే . బయట వోటర్లు అది చూస్తే  -  మంచిదే . వోటింగు త్వరితంగా జరుగుతుంది . వోటర్లు తప్పుగా వేసే ప్రమాదం వుండదు . యిలా ఎన్నో వుపయోగాలున్నాయి .

అది విడిచేసి , ఎక్కడో వొక తామర చూపాడని , ఆయనపై FIR దాఖలు చేసే లాంటి రూల్సు పనికి రావు . నేను కమిషన్ ను తప్పు పట్టడం లేదు కానీ  ఇలాంటి రూల్సు మారాలి . రూలు వుందనుకోండి . కమిషన్ వారు కాంగ్రెస్ నాయకులకూ చెప్పాలి - మీరు చెయ్యి దించుకుని వెళ్ళాలి అని . యిప్పుడు వాళ్ళేమో , చెయ్యి సింబల్ , బూతు బయటే , వోటర్లకే చూపుతూ వెళతారు . మిగతా వాళ్ళు మాత్రం ఎక్కడో, వోటర్లు కాని వారికి చూపితే కూడా నేరం , యిదెలా ? సరే . BJP  వాళ్ళు కూడా రెండు చేతులూ కలిపి కమలం లాగా పట్టుకుని వెడితే పరవాలేదా .

యిదేదో - మనం, మన వోటర్లను , వారి తీసుకునే నిర్ణయాలను చిన్న చూపు చూస్తున్నట్టుగా లేదా .

ఎలెక్షన్  కమిషన్ వారు - ఎన్నికలు బాగా  జరుపుతున్నారు .

 కానీ - 1950 నాటి పద్ధతులు , యిప్పుడూ పెట్టుకుంటే , పాటిస్తే అది ఈ నాటి టెక్నాలజీకి , ఈ నాటి వోటర్లకు ,  తగినట్టుగా వుండదు .

యిది నా అభిప్రాయం . ఆ పైన ఎవరిష్టం వారిది .

జూన్ నెలలో - ఏ ప్రభుత్వం వచ్చినా - రాబోయే ఎలెక్షన్ల విషయంలో రావాల్సిన మార్పులు ఎన్నో వున్నాయని చెప్పడానికి ఈ ప్రయత్నం. 

సర్వే  జనాః సుఖినోభవంతు

= మీ

వుప్పలధడియం  విజయమోహన్







22, ఏప్రిల్ 2014, మంగళవారం

ఎలెక్షన్లు - మనమేం చెయ్యాలి ? - జాతీయ నాయకుడు - అంటే - నరేంద్ర మోడీ వొక్కరే - జయప్రకాశ్ నారాయణ్ గారు, చంద్ర బాబు గారు

ఎలెక్షన్లు - మనమేం చెయ్యాలి ?

 


వొకప్పట్లో -వీడు మంచి వాడా, వాడు మంచి వాడా, ,ఎవడు చెడ్డవాడు, ఎందుకు - ఇలాంటి చర్చలు ఎక్కువగా జరిగేవి . అప్పట్లో, సమాజంలో కూడా మంచి వాళ్ళే కాస్త ఎక్కువగా వుండే వాళ్ళు .

యిప్పుడు అటువంటి చర్చలు తక్కువ. ఎవడు "మన" వాడు, మన కులం వాడు , మన మతం వాడు - మన కులం వాడు, మన మతం వాడు ఎంత వెధవైనా, మనం వాడినే సపోర్టు చెయ్యాలి - ఇలాంటి సిద్ధాంతాలు , పట్టుదలలు ఎక్కువై పోతున్నాయి .

యిది మనకు యెలెక్షన్లలో  మరీ ఎక్కువగా కనిపిస్తుంది .

ఫలానా వాడికి ఎంత మంది సపోర్టు - అంటే - వాడి కులం వాళ్ళు ఎంత మంది,   అన్నప్రశ్న ప్రముఖంగా కనిపిస్తుంది . మరి కొంత మంది విషయంలో, వాళ్ళ మతం వాళ్ళు ఎంత మంది అన్న ప్రశ్న ప్రముఖంగా కనిపిస్తుంది .

యిది మారాలి . మార్చాలి . మంచి వాడికి వోటు అన్న భావన,  రావాలి . వస్తుందా ? ఏమో . కనీసం మీరూ   ,నేనూ, మంచి వాళ్లకు వోటు వేద్దామా .

 నాకేమో నరేంద్ర మోడీ గారు , జయప్రకాశ్ నారాయణ్ గారు, చంద్ర బాబు గారు మంచి వాళ్ళు అన్న నమ్మకం  చాలా ఎక్కువ . చంద్రబాబు గారు మన రాష్ట్రానికి  బాగా మేలు చెయ్యగల వ్యక్తి  అని వొక నమ్మకం .

అయితే  ,BJP పార్టీలో కొంత మంది బాగా మారాలి . వాళ్ళలోని మత మౌడ్హ్యం, మాట కాఠిన్యం రెండూ పోవాలి . అలాగే ముస్లిం పార్టీలలో కూడా యిది చాలా ఎక్కువ . వాళ్ళ లోనూ - యిది పోవాలి . కాంగ్రెస్ లాంటి పార్టీ లయితే - ఎప్పుడూ లంచగొండి తనానికి జై - అంటూ వున్నాయి . అది - చాలా, చాలా మారాలి . యిలా వొక్కొక్క పార్టీలో  వొక్కొక్క నకారాత్మకత  ఎక్కువగా వుంది .

సరే . పార్టీల సంగతి ప్రక్కన బెట్టి - నాయకుల సంగతి చూస్తే -

నరేంద్ర మోడీ లాగా, దేశమంతా  కనీసం తిరిగి ప్రతి రాష్ట్రంలోనూ, మాట్లాడిన నాయకుడు కూడా మరొకరు లేరాయె .  జాతీయ నాయకుడు - అంటే - రోజు వరకు ఆయన వొక్కరే . మరొకరు లేరు. రాహుల్ గాంధీ గారిలో  పెద్దగా నాయకత్వ లక్షణాలు లేవు . అరవింద్ కేజ్రీవాల్ గారిలో కూడా వొక ప్రధాన మంత్రి కి కావలసిన లక్షణాలు లేవు . ఆయన ఉద్యమ వాది గా పనికొస్తారు . నాయకుడిగా కాదు . అంతే కాదు . ఆ యిద్దరూ , దేశంలో - ఎక్కడ ఏ రాష్ట్రం వుందో కూడా యిప్పటి వరకు చూడ లేదు . కాబట్టి యిప్పట్లో , దేశానికి ప్రధాన మంత్రి కాగల అర్హత మోడీ గారికి మాత్రమే వుందనడంలో నాకు సందేహం లేదు .

ఆయనను గురించి కాంగ్రెస్ వారు మాటిమాటికీ చెప్పే వన్నీ తప్పులే అని చాలాసార్లు నిరూపితమయ్యాయి .

నేను ఆయన ప్రసంగాలు , ఆయన ప్రెస్ interviews  చాలా విన్నాను . ఆయనలాగా చాలా సహేతుకంగా , దేశీయతా వాది గా, పూర్తీ నిజాయితీగా - మాట్లాడిన  మరెవరినీ నేను చూడ లేదు ; వినలేదు.  మీరంతా కూడా - వోటు వేసే ముందు - ఆయన  హిందీ లో ఆప్ కీ అదాలత్  అన్న ప్రోగ్రాము లో - ఇండియా టీవీ  వారు అడిగిన ఎన్నో ప్రశ్నలకు యిచ్చిన జవాబులు  వింటే - బాగుంటుంది . అలాగే - ANI అన్న వార్తా సంస్థకు కూడా ఆయన యిచ్చిన జవాబులు విని తీరాల్సినవి . ఆయన ప్రధాన మంత్రి అయితే - BJP లో కూడా చాలా మంది బాగా మారుతారు. కనీసం అందుకయినా - ఆయన పార్టీకి వోటు వెయ్యాలి .

మిగతా ఎంత మంది నాయకులు మాట్లాడినవి  విన్నా - మోడీ గారిలో వున్నా నిజాయితీ , మానవతా దృక్పథం నాకెక్కడా కనిపించ లేదు .

సరే . మన రాష్ట్రంలో చంద్ర బాబుగారు , జయప్రకాశ్ నారాయణ్ గారు గొప్ప నాయకులే . వారు రాష్ట్రంలో గెలిస్తే - రాష్ట్రం (యిరు వైపులా ) బాగు పడుతుంది . మొత్తానికి రాజకీయాలకు పట్టిన  కాస్తయినా తొలగాలంటే - వీరు  వొస్తే  మేలు అని నా అభిప్రాయం . రాష్ట్రం బాగు పడడానికి చంద్ర బాబు గారిని నమ్మొచ్చు . ఆయన లాగా అభివృద్ధి ప్రణాళికలు వెయ్య గలిగే వారు, వాటిని సమర్థవంతంగా పూర్తీ చెయ్యగలిగే వారు చాలా అరుదు .

మరి వారి, వారి యిష్టం వారిది . మీ యిష్టం మీది .

సర్వే  జనాః సుఖినో భవంతు

= మీ

వుప్పలధడియం విజయమోహన్






8, ఏప్రిల్ 2014, మంగళవారం

శ్రీ రామ నవమి - శ్రీ రామ తారక మంత్రము

శ్రీ రామ నవమి 



శ్రీ రామ రామ రామేతి, రమే రామే మనోరమే 
సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే
(శ్రీ రామ తారక మంత్రము )

1, ఏప్రిల్ 2014, మంగళవారం

మూర్ఖుడితో సర్దుకుంటారా ? మూర్ఖత్వాన్ని ఎదిరిస్తారా ? - 5 బుద్ధిహీనత సిద్ధాంతాలు - మీరు బుద్ధిమంతులా ?

బుద్ధిహీనత (మూర్ఖత్వం)

ఎలా వస్తుంది ? ఎలా పోతుంది ?




ఆంగ్లంలో 'స్టుపిడిటీ' అంటే - తెలుగులో 'బుద్ధిహీనత' లేదా , 'మూర్ఖత్వం' అని తర్జుమా చేసుకోవచ్చు. 

వున్న విషయాలు తెలియక పోవడం వేరు. తెలిసి,  లేదా, నేను తెలుసుకొను - అని మంకు పట్టు పట్టి , ఆలోచన లేకుండా, తెలిసిన వాళ్ళను అడగకుండా - ఏదేదో చేసెయ్యడం , తద్వారా, తనకూ, తన చుట్టూ వున్న వారికి కష్టాలు ,  నష్టాలు కలుగ జెయ్యడం - యిది బుద్ధి హీనత సాధారణ లక్షణాలు - అంటారు కార్లో  నారియా కిపోలా. 

ఎప్పుడైనా సరే - ఎవరో చెప్పితే  విని , మనలో ఎవరూ బుద్ధి హీనులు కాము . మనకు మనమే బుద్ధిహీనతను కొని తెచ్చుకుంటాము ; లేదా, ఆపాదించుకుంటాము. అంటే - మన బుద్ధిహీనత కు మరొకరు కారణం కాజాలరు . దానికి కారణం మనమే . మన ఆలోచనా విధానమే .

సరే . మనలో ఎవరైనా , ఎల్లప్పుడూ  బుద్ధి హీనులుగానూ,. మూర్ఖులుగానూ  వుంటామా ; వుండగలమా ?  వుండ లేము . వొకప్పుడు  బుద్ధిని బాగానే ఉపయోగిస్తూ , మరొకప్పుడు బుద్ధిని సరిగ్గా ఉపయోగించకుండా మన మూర్ఖత్వాన్ని ప్రదర్శించు కుంటాము .

ఎందుకిలా ? భగవద్ గీతలో శ్రీకృష్ణుడు అంటాడు - మన మనస్సే మన శత్రువు - మనం బుద్ధి మాట విననంత కాలం . కానీ , అదే మనసు , బుద్ధి మాట -వింటే  మన మిత్రుడు గా మారి పోతుంది - అని .

అంటే బుద్ధి మాట వినే మనసు   సరైన నిర్ణయాలు తీసుకోనిస్తుంది . బుద్ధి మాట వినని మనసు, మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది . 

నా ఉద్దేశం లో - "బుద్ధిలేని తనం" -అంటే - బుద్ధిమాట ను మరీ ఎక్కువగా చంపేసి , బుద్ధి లేని మార్గంలో మనసు వెళ్లి పోతుంటే - మనిషి అందరి అభిప్రాయంలో మూర్ఖుడు గా, బుద్దిహీనుడు గా ముద్ర వెయ్య బడతాడు . అప్పుడు - మనకు ఆ పోకడే అలవాటై పోతుంది .

ఉదాహరణకు - పొగ త్రాగడం హానికరం . అందరికీ తెలుసు . కానీ చాలా మంది పొగ త్రాగే వారున్నారు . అది యిలాగే ప్రారంభమవుతుంది. మొదటి సారి బుద్ధి - మనకు బుద్ధి చెబుతుంది .  వద్దు - అంటుంది. కానీ ఏదో ప్రోద్బలం , ఎవరో మూర్ఖుల స్నేహం - మన మనసు, మన బుద్ధిని చంపేసేటట్లు చేస్తుంది. ఆ తరువాత - మన మనసు మరి బుద్ధి మాట పట్టించుకోదు. అలాగే - మిగతా మూర్ఖపు పనులు కూడా. మాదక పదార్థాలు సేవించడం , విడవలేక  వాటికి బానిసవడం , మన జీవితాన్ని మాత్రమే కాక, చుట్టూ వున్న వారి జీవితాల్ని కూడా నరక ప్రాయం చెయ్యడం - యివన్నీ మన దేశంలో - 50 శాతం పైగా మగ వాళ్ళు ముఖ్యంగా చేస్తున్న బుద్ధి లేని పనులు .

దొంగ తనాలు, బలాత్కారాలు, సామూహిక బలాత్కారాలు, చంపడం , అబద్ధాలు చెప్పడం, లంచగొండి తనం  - అన్నీ మూర్ఖపు పనులే .

మూర్ఖపు పనులు మొదట మనసులోనే మొదలవుతాయి . ఆ తరువాత , మాటల ద్వారా , కొద్దో గొప్పో బయటపడుతాయి . మాటల్లో కాఠిన్యం మొదటి మూర్ఖత్వం . యిది కొంత మందికి మరీ ఎక్కువ . కొంత మందికి ఎప్పుడో కొద్ది సమయాల్లో మాత్రమే  వుంటుంది. 

కొంత మంది మాటల్లో బాగా సంయమనం పాటిస్తారు . ఇది అభ్యాసం చెయ్యాలి - అంతే. రోజుకు యిద్దరిని పొగడాలి అని నియమం పెట్టుకుంటే - అది వొక 48 రోజులు పాటిస్తే - మంచి మాటలు మాట్లాడడం మీకు అలవాటై పోతుంది . ఆ తరువాత - మీరు చెడ్డ మాటలు, అబద్ధాలు, పరుషం గా మాట్లాడడం - అన్నీ బాగా తగ్గి పోతాయి. అంటే -బుద్ధిలేనితనం లోని వొక అంశం మిమ్మల్ని విడిచి దూరంగా వెళ్లి పోతుంది . అంటే - బుద్ధిహీనత నిరంతరంగా మన ముద్రగా వుండాల్సిన పని లేదు . 

కానీ - కొందరు తాము పరుషంగా మాట్లాడడము, అందువలన యితరులు బాధ పడడం , ఏదో తమ గొప్పగా భావిస్తూ వుంటారు . ఇతరులు  సహించినంతకాలం - యిది యిలాగే జరుగుతూ వుంటుంది . చుట్టూ వున్న వారు తిరగబడాలి.  అంతకంటే పరుషంగా మాట్లాడినా సరే - సమాజంలో పది మంది ముందు వీరిని బాగా దులిపైనా సరే - పది మంది వారిని పరుషంగా మాట్లాడైనా సరే - పరుష భాషణం మూర్ఖత్వం అనేది - బాగా తెలియజెప్పాలి . ఇలాగే మిగతా  మూర్ఖత్వపు లక్షణాల  విషయం కూడా. వొకరి మూర్ఖత్వం ఎటువంటిదైనా - మరికరిని బాధిస్తూ వుంటే - అది సహించి వూరుకోవడం ,మరొకరి  మూర్ఖత్వమే అవుతుంది .


కార్లో  నారియా కిపోలా  అనే ఆర్ధిక శాస్త్ర - చరిత్రకారుడు , 5 బుద్ధిహీనత సిద్ధాంతాలను  ప్రతిపాదించాడు.  వాటిని కాస్త పరిశీలిద్దాం .

  • ఎల్లప్పుడూ, నిస్సందేహంగా  - మనం , మన చుట్టూ వున్న బుద్ధిహీనుల సంఖ్యను, చాలా తక్కువగానే  అంచనా వేస్తాము. 
  •  వొక మనిషి బుద్ధిహీనుడా, కాదా అన్న విషయం - అతని మరే గుణగణాల పై కానీ, చదువు పై గానీ ఆధార పడి వుండదు . అంటే - బుద్ధి హీనుడి బుద్ధి హీనత స్వతహాగా బ్రతుకుతుంది . మరే గుణగణాల పైన ఆధార పడదు 
  • వొక మనిషి బుద్ధిహీనుడా, కాదా అన్నది ఎలా చెప్పొచ్చు ? వాడు, స్వలాభం ఏ మాత్రం పొందకుండా , యితరులకు నష్టం కలిగిస్తే అతడు బుద్ధిహీనుడే; అంతకంటే ఘోరం - తాను కూడా నష్టపోతూ , యితరులకు నష్టం కలిగిస్తే , వాడు ఖచ్చితంగా మరింత బుద్ధిహీనుడే . 
  • బుద్ధిహీనులు కాని వారు కూడా - బుద్ధిహీనులతో జత చేరితే జరిగే ప్రమాదాన్ని, నష్టాన్ని ఎప్పుడూ , తక్కువ గానే అంచనా వేస్తారు . వారితో చేరడం ఎంత గొప్ప తప్పో ఎల్లప్పుడూ మర్చి పోతూ వుంటారు . 
  • ప్రపంచంలో - బుద్ధిహీనుల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు మరొకరు లేరు . 

యివండీ ఆ 5 సూత్రాలు . మనం - మరెన్నైనా సూత్రాలను , మనకు తోచిన వాటిని చేర్చుకోవచ్చు . బుద్ధి హీన ప్రపంచంలో సర్వం సాధ్యమే .

మొదటి సూత్రం ప్రకారం - మన చుట్టూ వున్న బుద్ధిహీనుల సంఖ్య లేదా వారి శాతం , మనం అనుకోగలిగిన దాని కంటే   ఎప్పుడూ కాస్త ఎక్కువ గానే వుంటుందంటారు కార్లో. అది నిజమే -అంటాను నేను. కనీసం వొక్కరిని ఆ లిస్టు లో చేర్చడానికి   మనం మర్చిపోతూనే  వుంటాం . నిజానికి చాలా మందిని ఆ లిస్టు లో చేర్చం .  అదంతే .  అది - మన బుద్ధిహీనత .

ఇప్పుడు  మీలో ప్రతి వొక్కరూ - మీ చుట్టూ వున్నఅందరి లిస్టు  వెయ్యండి చూద్దాం . ఆ తరువాత , అందులో బుద్ధిహీనులెవరో టిక్కు కొట్టండి. బుద్ధిమంతులెవరో వారి పేర్లను మరో రంగుతో టిక్కు కొట్టండి .

అయిపోయిందా . యిప్పుడు, ఆ బుద్ధిమంతుల గురించి బాగా ఆలోచన చెయ్యండి . వాళ్ళు ఎందుకు అలాగే వున్నారో , ఎందుకు అభివృద్ధి చెందలేదో , ఎందుకు యింకా సంతోషంగా లేదో , ఎందుకు , వారికి రోగాలొచ్చాయో , ఎందుకు వాళ్ళింట్లో , అప్పుడప్పుడూ కొట్లాటలు , వాగ్వాదాలు వస్తుంటాయో - యిలా - వారిని గురించిన నకారాత్మక విషయాల గురించి బాగా యోచన చెయ్యండి . యిప్పుడు, వారు బుద్ధిమంతులు కాదు అనిపిస్తే వారిని బుద్ధిహీనుల లిస్టు లో చేర్చెయ్యండి .

యిప్పుడు చాలా మంది ఈ బుద్ధిహీనుల లిస్టులోకి వచ్చేసారు కదా. అయినా యింకా కొద్ది మంది ఈ లిస్టు లోకి రాలేదు . వారిని ఈ లిస్టు లోకి చేర్చడానికి మీ బుద్ధి కాదు - మనసు యిష్ట పడడం  లేదు . కారణం ఏదైనా కానియ్యండి . మీ దగ్గరి వారిలో కొందరైనా బుద్ధి మంతులు అన్నది మీ భావన; నమ్మకం . అదీ కథ . యిందులో - వొకరిని గురించైతే , మీరు అనుకోవడమే లేదు ! ఎవరు వారు ?

యిప్పుడు మళ్ళీ మీరు మీ లిస్టు చూడండి . అందులో - ఆడవాళ్ళు, మగ వాళ్ళు , పిల్లలు , పెద్దలు , ముసలి వాళ్ళు , చదువు కున్న వాళ్ళు , చదువులేని వాళ్ళు , డబ్బున్న వాళ్ళు , డబ్బు లేని వాళ్ళు ,  అందంగా వున్న వాళ్ళు , అందంగా లేని వాళ్ళు - అందరూ వున్నారు . అంటే ఏమిటి - బుద్ధి హీనత కూ , మిగతా విషయాలకూ సంబంధం లేదు . యిది నిజం . ఎందుకిలా ? ప్రకృతిలో బుద్ధిహీనత  అనే లక్షణం  ఎందుకిలా , యింత విస్తారంగా , ధారాళంగా వుంది ? ఎవరికి తెలుసు ?

సరే . ప్రస్తుతానికి , నేను , మీరు  కాస్త బుద్ధిమంతులం అనుకుందాం . మనసులో అది వొక వూరట . ఏదో కాస్త సందేహం పీకుతోనే వుంటుంది - అయినా యిలా అనుకుందాం . సందేహం ఎందుకు వస్తుందంటే - యింత మంది బుద్ధి హీనులని మనకు తెలిసిన తర్వాత - మనం మాత్రం బుద్ధిహీనులు కాదు - అని అనుకోవచ్చా ? అదెలా కుదురుతుంది ? నలుగురితో బాటు నారాయణా అనుకోవడమే కదా - మనం చేస్తున్నది ! చెయ్యాల్సింది. 

బుద్ధిహీనులకు పుట్టాం . బుద్ధిహీనులతో కాపురం చేస్తున్నాం . బుద్ధిహీనులకు జన్మ నిచ్చాం . బుద్ధి హీనుల పక్కింట్లో , ఎదురింట్లో , ముందింట్లో వుంటున్నాము . మరి మనం మాత్రం వేరేగా ఎలా వుంటాం ? ఈ సందేహం వచ్చే వుంటుంది . అయినా , మనం కాదు అనుకోవడంలో - ఏదో సంతృప్తి వుంది కదా .  అనుకుందాం . పొయ్యేదేముంది ?

రెండో సూత్రం కూడా కొంత వరకు పైన చెప్పిన దాన్లోనే మనకు తెలిసిపోయింది . 15 ఏళ్ళ క్రితం ముకేష్ అంబానీ, అనిల్ అంబానీలు ఆస్తులు దాదాపు సమానంగా పంచుకున్నారు . కానీ ఈ రోజు , ముకేష్ తో పోలిస్తే, అనిల్ ఆస్తి 1 / 5 వంతు కంటే తక్కువగా పడి పోయింది . అంటే ఏమిటి అర్థం? ఈయనకు అదృష్టం తక్కువనా ? అదేం లేదు. అప్పుడప్పుడూ , చుట్టూ వున్న వాళ్ళతో  సర్దుకు పోవడంలో ,ముకేష్ గొప్ప అని తెలుస్తూనే వుంది . ఆపైన కాస్త అదృష్టం. 

బుద్ధి వుండడం, లేకపోవడం అనేది ముఖ్యం కాదు ; వున్న బుద్ధి స్వలాభం కోసం , చుట్టూ వున్న వారి లాభం కోసం ఉపయోగించక పోవడం -  తమ అర్థ రహితమైన అహంకారాన్ని సంతోష పరచడానికి ఉపయోగించడం - అదే  బుద్ధి హీనత అని - మనకు తెలుస్తుంది.

ఎంతో మంది - తమకు వొక కన్ను పోయినా ఫరవా లేదు - ఎదుటి వాడికి రెండు కండ్లు పోవాలి అనుకునే  వారున్నారు ; అలా కావాలని ఎంతో ప్రయత్నాలూ చేస్తారు . మరికొందరు మహా మూర్ఖులు  తమకు రెండు కండ్లూ పోయినా ఫరవాలేదు - ఎదుటి వాడికి కనీసం  వొక కన్నైనా పోవాలి అనుకునే వారున్నారు .

ఎన్నో యిళ్ళలో - వారానికి కనీసం రెండు రోజులు భార్యాభర్తలు పోట్లాడుకుంటారు . పెద్ద కారణమేమీ వుండదు . కాస్సేపు కొట్లాడి, వొక రోజు మూతి ముడుచుకుని కూర్చుంటే - తాము బుద్ధిహీనులు అన్నది అందరికీ అర్థమయ్యేటట్టు చేసి , తమ పిల్లల ముందు కూడా తాము బుద్ధిహీనులు అన్నది తెలియ జేసి - ఆ తరువాత మెల్లగా సర్దుకుంటారు . పిల్లలకు అర్థం కాదు - వీళ్ళు యింత చిన్న విషయాలకు ఎందుకింత పోట్లాడుకుంటారో అని . అన్నం తినకండా పస్తులుండడం, చిర్రుబుర్రులాడుతూ వుండడం , కొన్ని కుటుంబాలలో సర్వ సాధారణం . యింకా కొన్ని కుటుంబాలలో అసహ్యంగా తిట్టు కోవడం , కొట్టుకోవడం కూడా జరుగుతూ వుంటాయి .  

కొన్ని కుటుంబాలలో అయితే - మేం ఈ కులం లో పుట్టాం గనుక , కొట్లు, తిట్లు, దొమ్మీలు, ఆగడాలు చెయ్యకపోతే అసలు మాకు మర్యాదే లేదు -  అనే వొక మూర్ఖపు   భావన చాలా ఎక్కువ గా కనిపిస్తుంది . అది మిగతా వాళ్ళు సహించడం - అంత కంటే మూర్ఖత్వం .

పిల్లలు కొట్లాడితే - అర గంట; భార్యాభార్తలు కొట్లాడితే కొన్ని రోజులు; కొంత మంది వుత్తి పుణ్యానికి డైవర్స్ వరకు వెళ్లి పోతుంటారు . కొన్ని మంచి స్నేహాలు - అసలు కారణమే లేకుండా - తెగి పోతూ వుంటాయి . యివన్నీ మూర్ఖత్వపు లక్షణాలే . 

ఆల్బర్ట్ ఆయిన్ స్టీన్  అంటారు - "ప్రపంచం , మనిషిలోని మూర్ఖత్వం యివి రెండూ ఎల్లలే లేనంత విస్తారమైనవి . కానీ, వొక వేళ ప్రపంచానికి ఎల్ల వుంటే వుండొచ్చు; కానీ మనిషి మూర్ఖత్వానికి మాత్రం ఎల్లేలే లేవు ." 

యిది నిజమే . తెల్లారి లేచి వార్తా పత్రిక చదివితే - అందులో - మన నాయకులెంత బుద్ధిహీనులో, ప్రజలెంత  బుద్ధిహీనులో తెలుస్తుంది . మనం ఎంత బుద్ధిహీనులో - కాస్త యోచన చేస్తే  తెలుస్తుంది .వొక నాయకుడికి ఏదో కుంభకోణం లో శిక్ష పడింది . మనం, మరో యోచన లేకుండా , ఆయన సతీమణికి , లేదా కుమారుడికి వోటు వేసేస్తాం . యింత బుద్ధిహీనత మనలో వుంటే , అంత బుద్ధి హీనులు నాయకులవడంలో , ఆశ్చర్యం ఏముంది ? మరొకడికి ఎన్నో వేల కోట్లు మరొకరి పదవి వలన , తన నిర్వాకం  ఏమీ లేకుండానే వచ్చి పడిందని  తెలుస్తుంది . అతడినీ గొప్ప నాయకుడిగా పూజిస్తాం .

మనిషి బుద్ధిహీనత  ఎల్లలే లేనంత ఎక్కువ అన్న దాన్లో నాకు సందేహం లేదు. 

మరొకాయన అంటారు - బుద్ధి హీనులు ఎంతో మంది గుంపులు గుంపులు గా వుంటారు అని . అదీ నిజమే .పాకిస్తానుకు , మనకు యుద్ధాలు జరిగాయి . ముందు,  ముందు కూడా జరగ వచ్చు. - అలాగే మనకు, చైనా కు మధ్య వైరం వుంది . ఈ భాగం మాది ; ఆ భాగం మాది - అని చైనా  వారు ముందుకు వచ్చే ప్రయత్నాలు చేస్తూనే వున్నారు . అయినా మనం మాత్రం చైనా లో చేసిన వస్తువులే కావాలని కొనుక్కుంటాం. మన దేశాన్ని కబళించాలని వున్న దేశపు వస్తువుల పట్ల , అది వూరికే యిచ్చినా సరే - మనం ఆశ పడరాదు. ఈ మాత్రం బుద్ధి మనకూ లేదు ; మన ప్రభుత్వానికీ లేదు . మన దేశం లో చిన్న, పెద్ద  పరిశ్రమలన్నీ  చైనా వస్తువుల వల్ల మూత బడుతున్నాయి . BHEL  లాంటి భారీ ప్రభుత్వ రంగ సంస్థ కూడా -  ఆర్డర్లు తగ్గి వెల వెలా పోతోంది . నష్టాల్లోకి వెళ్ళినా వెళ్ళవచ్చు.  L &T లాంటి మరొక భారీ సంస్థ యజమాని  నాయక్  గారు వొక సారి అన్నారు కూడా - చైనా వస్తువుల కొనుగోలు వల్ల మన దేశంలో - నాణ్యతా పోతూ వుంది ; దేశంలో వుత్పత్తీ పోతూ వుంది అని . అయినా - ప్రభుత్వ ధోరణీ మారలేదు; మన ధోరణీ మారలేదు. జపాన్లో అయితే - మొట్ట మొదట జపాన్ వస్తువులకే , ప్రతి వొక్కరూ ప్రాధాన్యత యిస్తారు. మన దేశంలో అయితే - భారత వస్తువులు తప్ప , మరే వస్తువైనా కొనేస్తాము - విదేశీ ముద్ర వుంటే చాలు . అదో మోహం . అదో మూర్ఖత్వం . 

ఇలా - మన మూర్ఖత్వాన్ని గురించి గురించి ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు . మనం బుద్ధి మాట ఎప్పుడు వింటాం ? ఎప్పుడు మారతాం ? 

మనకూ, మన ప్రక్కనున్న భారతీయులకూ, మన దేశానికి , మొట్ట మొదట - మన ద్వారా మేలు జరిగే కార్యక్రమాలకు ఎప్పుడు శుభారంభం పలుకుతాం ?

జయ నామ  సంవత్సరం వచ్చేసింది . అది  వెళ్ళే లోపల - మనకూ , మన దేశానికీ - జయ జయ ధ్వానాలు మనం పలుక గలమా ? మంచి మాట , మంచి ఆలోచన , మంచి పని ద్వారా - మనం ప్రతి వొక్కరూ - మన దేశంలోని కొందరిని అయినా జయ నామ సంవత్సరం లో ఆదుకుంటామా ? 

మంచి పనులు చేసే వారిలో - మూర్ఖత్వం వుండదు . పారిపోతుంది . 



సర్వే  జనాః సుఖినో భవంతు . 

= మీ 

వుప్పలధడియం విజయమోహన్









                                               
  





19, మార్చి 2014, బుధవారం

శ్రీకృష్ణుడా?యదువీరులా ? శల్య సారథ్యమా ? శ్రీకృష్ణ సారథ్యమా ? మీ నిజ జీవితంలో ఏది కావాలి మీకు ?


శ్రీకృష్ణుడా - యదువీరులా ?  
ఎవరు కావాలి మీకు ? 
శల్య  సారథ్యమా ? శ్రీకృష్ణ సారథ్యమా ?
ఏది కావాలి మీకు ? 
 

ఈ మహా భారత కథ మీకు తెలిసే వుంటుంది. కానీ ఈ కథ వెనుక దాగివున్న జీవిత సత్యం మీకు తెలుసా ?  

నిజానికి , మహా భారతంలో వుండే అనేక పిట్ట కథలలో , అలాగే , అందులోని అనేక ముఖ్య సంఘటనలలో - ఈ రోజుకూ మనకు కావలసిన జీవిత సత్యాలు, జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపించ గల జీవిత సూత్రాలు  - ఎన్నెన్నో నిక్షిప్తమై వున్నాయి . 

యిటువంటి, యింత గొప్ప ఇతిహాసం - ప్రపంచం లో మహా భారతం వొక్కటే . దీన్ని మించిన పుస్తకం, కావ్యం , యితిహాసం మరెక్కడా మరొక్కటి లేదు. కాకపొతే , దీన్ని సరైన రూపంలో - ప్రపంచానికి, మనం అందించలేక పోతున్నాము.  అందువలన మహాభారతం లాంటి మహత్తర గ్రంథం కూడా మరుగున పడిపోతున్నది.  మన భారత ప్రభుత్వం వారి వైఫల్యాల్లో యిది కూడా ప్రముఖమైనదిగా చెప్పుకోవాలి. 

సరే . యిప్పుడు అసలు కథకు వద్దాం . 

మహాభారత యుద్ధం ఆరంభం చెయ్యడానికి - ఇరువైపులా సన్నాహాలు జరుగుతున్న సమయం అది . పాండవులూ, కౌరవులూ భారత దేశం లోని అందరు రాజుల సహాయమూ అర్థిస్తున్న సమయం  అది.  ఆ కాలంలో, చాలా మంది రాజులకు వొక నియమం వుండేటట్టు కనిపిస్తుంది. ఎవరు తమను ముందుగా సహాయం అడుగుతారో , వారి ప్రక్కన యుద్ధం చెయ్యడమే కానీ , వారి వైపు ధర్మం వుందా , లేదా - అన్నది పెద్దగా చూడ లేదు వారిలో చాలా మంది . 

ఉదాహరణకు శల్యుడు. శల్యుడు మద్ర దేశపు రాజు . చాలా కాలానికి  ముందు, వొక సారి శల్యుడి సేన, పాండురాజు సేన వొక చోట ఎదురు పడతాయి. అప్పుడు శల్యుడు , శల్యుడి సేనాపతి పాండురాజుతో మాట్లాడే సందర్భం వస్తుంది. శల్యుడి ప్రక్కన సన్నగా ముచ్చటగా వున్న అతడి సేనాపతి పాండురాజు దృష్టిని ఆకర్షిస్తాడు. అది చూసి శల్యుడు , మనలో ఎవరు విజయం చేపట్టుతారో - అది యుద్ధం చేసైనా సరే , లేదా వివాహ బంధం తో నైనా సరే - తేల్చుకుందాం, అంటాడు. నిజానికి అతడి సేనాపతి అతడి చెల్లెలైన మాద్రి .  పాండురాజు సంతోషంతో మాద్రిని వివాహం చేసుకుంటాడు. దీన్ని బట్టి మనకు ,  ఆ కాలంలో మహిళలు కూడా - అందరు కాక పోయినా , కొందరైనా - యుద్ధ విద్యలను అభ్యసించే వారని తెలుస్తుంది . యిలా శల్యుడు పాండవులకు మేనమామ  అయిన వాడు ;

భారత యుద్ధానికి ముందు శల్యుడు , పాండవుల వైపు యుద్ధం చెయ్యాలని , సైన్యం తో సహా బయలుదేరుతాడు. కానీ, మార్గ మధ్యం లో దుర్యోధనుడు శల్యుడికి విందు భోజనం పెట్టి, పెట్టినది పాండవులే అని శల్యుడు అనుకుని , ఆ విందు పెట్టిన వారికి ఏ సహాయమైనా చేస్తానని శల్యుడు నుండి దుర్యోధనుడు కుయుక్తితో మాట తీసుకుని - ఆ తరువాత చెబుతాడు , ఆతిథ్యం యిచ్చింది , కౌరవులని , శల్యుడు వారివైపే వుండాలని . 

యిలా ఏదో చిన్న కారణానికి , శల్యుడు కౌరవుల వైపు యుద్ధం లో చేరిపోతాడు . ఇది దుర్యోధనుడి కుయుక్తి . అయితే , ఈ కుయుక్తిని కాస్త ఆలస్యంగా, కౌరవులకు మాట యిచ్చిన తరువాత,  తెలుసుకున్న శల్యుడు - మళ్ళీ ధర్మరాజు వద్దకు వెళ్లి తన విచారం వెలి బుచ్చుతాడు.  అప్పుడు ధర్మ రాజు, శ్రీకృష్ణుడు, కాస్త ఆలోచించి -  శల్యుడికి వొక సలహా యిస్తారు.  యుద్ధంలో, ఏదో వొక సమయంలో కర్ణుడు సేనాధిపతి అయిన తరుణంలో, శల్యుడు అతనికి సారథ్యం వహించ వలసిన పరిస్థితి వస్తుంది ; ఆ సమయంలో  శల్యుడు , తన మాటలతో కర్ణుడిని నిర్వీర్య పరచవలసినదిగా చెబుతారు. ఈ విధంగా , కర్ణుడికి శల్య సారథ్యం , దాని ఫలితంగా కర్ణుడి మరణానికి శ్రీకృష్ణుడి  సలహాతో యుద్ధానికి ఎంతో ముందే పునాది వెయ్యడం జరుగుతుంది. దుర్యోధనుడి కుయుక్తి అతనికే ఆపద తెచ్చిపెడుతుంది. 

మరి కృష్ణ సారథ్యం గురించి తెలుసుకోవాలిగా . యుద్ధానికి శ్రీకృష్ణుడి సహాయం అర్థించడానికి, అర్జునుడూ దుర్యోధనుడూ , యిద్దరూ దాదాపు ఏక కాలంలో వస్తారు.  వారు వచ్చిన సమయంలో శ్రీకృష్ణుడు నిద్రిస్తూ వున్నట్టు నటిస్తూ వుంటాడు . వచ్చిన దుర్యోధనుడు , కృష్ణుడి తలవైపున్న ఆసనం లో కూర్చుంటాడు . అదో అహంకారం - నేను మహారాజాధిరాజును, ఈ యాదవుడి కాళ్ళ దగ్గర కూర్చోవడమేమిటని.  అర్జునుడు కృష్ణుడి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు.  దుర్యోధనుడి మనసులో అహంకారం . అయినా అతడికి కృష్ణుడి సహాయం కావాలి, యుద్ధం లో. అర్జునుడి మనసులో కృష్ణుడి పట్ల స్నేహానుబంధం;మమతానుబంధం; భక్తిభావం; అన్నీ వున్నాయి.  అర్జునుడికి యెలాగైనా సరే, కృష్ణుడు కావాలి ; కేవలం యుద్దానికని కాదు . అది అతనికి కృష్ణుడితో వున్న జన్మ జన్మల అనుబంధం. అందుకని అతడికి కృష్ణుడే కావాలి.

కృష్ణుడు లేస్తాడు. లేచినట్టు నటిస్తాడు. జగన్నాటక కర్త గదా . లేచిన వెంటనే కాళ్ళ వద్ద నున్న ఆర్జునుడిని చూస్తాడు. కుశల ప్రశ్నలు వేస్తాడు. ఆ తరువాత దుర్యోధనుడినీ చూస్తాడు . అతనితోనూ మాట్లాడుతాడు. ఆ తరువాత అడుగుతాడు విషయం ఏమిటని. యిద్దరూ విషయం చెబుతారు. దుర్యోధనుడు చెబుతాడు - నేనే మొదట వచ్చాను, కాబట్టి , నువ్వు నాకే సహాయం చెయ్యాలని . కానీ, కృష్ణుడు అంటాడు - కానీ, నేను మొదట అర్జునుడి నే చూశాను; అతడినే అడిగాను విషయమేమిటని . అయినా, మీరిద్దరూ , నాకు కావాల్సిన వారే కదా . యిద్దరికీ సహాయం చెయ్యడం నా ధర్మం కదా . కాబట్టి, మీకు వొక నిర్ణయాధికారం యిస్తాను. నేను నిరాయుధుడిగా, అస్త్రం పట్టకుండా, వొకరి వైపు వుంటాను ; మరొకరి వైపు నాతో సమానమైన 10 వేల మంది యదు వీరులు, శస్త్రాస్త్రాలలో ప్రవీణులు , వారు యుద్ధం కూడా చేస్తారు. వారు మరొక వైపు వుంటారు . 

అయితే , మీయిద్దరిలో  చిన్న వాడు  అర్జునుడు గనుక - మొదట కోరుకునే అవకాశం అతడికే యిస్తున్నాను - అంటాడు .    

దుర్యోధనుడికి కోపం . శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి గనుక ఎలాగో యదు వీరులను వారికి యిచ్చి తాను  యుద్ధం చెయ్యకుండా తమ ప్రక్క కూర్చుంటాడేమో నన్న అనుమానం . 

కానీ , అర్జునుడి మనసులో శ్రీకృష్ణుడు తప్ప మరేమీ లేదు. ముల్లోకాలను యిచ్చినా అవేవీ వద్దు గాక వద్దు , కృష్ణుడే కావాలి అన్న మనో భావం వున్న వాడు . మరో అనుమానం , ఆలోచన ఏవీ లేకుండా, తాను కృష్ణుడినే  కోరుకుంటాడు .
కృష్ణుడు దుర్యోధనుడి వైపు చూస్తాడు . దుర్యోధనుడి మనసులో - ఈ అర్జునుడెంత మూర్ఖుడు , యుద్ధం చేసే పది వేల మంది వీరులను వదిలి పెట్టి, యుద్ధం చెయ్యని ఈ శ్రీకృష్ణుడిని ఎన్నుకున్న పరమ బుద్దిహీనుడు - అనుకుంటాడు . సంతోషంతో, పదివేల మంది యదు వీరులను వెంట బెట్టుకుని హస్తినాపురానికి వెళ్లి పోతాడు . 

యుద్ధం చెయ్యని ఆ శ్రీకృష్ణుడే - కౌరవుల అందరు సేనాపతుల మరణానికి ఏదో విధంగా కారణమవుతాడు . అనేక ఆపదల నుండి, పాండవులలో ప్రతి  వొక్కరినీ  రక్షించిన వాడూ అవుతాడు. అంతే కాదు. దుర్యోధనుడిపై  ఎంత ప్రీతిభావం వున్నా, కృష్ణుడి కి ఎదురు పక్షంలో యుద్ధం చెయ్యలేనని చెప్పి , తీర్థ యాత్రలకు బలరాముడు వెళ్లి పోవడానికి కారణం అవుతాడు.

భీష్మ,ద్రోణ, కర్ణుల శస్త్రాస్త్రాల నుండి, అన్ని రకాలుగా అర్జునుడి రక్షణకు చివరి వరకు తానే కారణం గా - శ్రీకృష్ణుడు  నిలుస్తాడు.

అన్నిటినీ మించి , అర్జునుడి మనసులో విషాద భావం బలంగా నాటుకుని వున్న సమయంలో - అర్జునుడికీ , అర్జునుడి పతాకం లో వున్న తన మరో భక్తుడు హనుమంతుడికీ - సంజయుడి ద్వారా, వ్యాసుడి ద్వారా మనకూ-  భగవద్ గీత లాంటి అత్యున్నతమైన వొక సైన్స్ ను బోధిస్తాడు శ్రీకృష్ణుడు . అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగే ప్రశ్నలే - మన జీవితాలలో , మనం ఎదుర్కొనే ప్రశ్నలు . అన్నిటికీ , శ్రీకృష్ణుడు  సశాస్త్రీయమైన సమాధానాలు యిస్తాడు . 

గీత అనే ఆ సైన్స్ ను అర్థం చేసుకున్న వారి జీవితాలలో - విషాదానికి చోటు లేదు . ఆనందానికి అలవి లేదు . జ్ఞానానికి అంతు లేదు . సంపూర్ణ ఆరోగ్యానికి మూల సూత్రాలు అన్నీ గీతలో వున్నాయి.  ఆనంద మయ జీవితానికి మూల సూత్రాలు యిందులో వున్నాయి. విజయానికి కావలసిన  అన్ని మెట్లూ యిందులో వున్నాయి. గీతను A  to Z  ఆఫ్ లైఫ్  అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. శ్రీకృష్ణుడు  అర్జునుడికి ఏదో మతం గురించి బోధించనే లేదు. విజ్ఞానము, జ్ఞానము - అదీ జీవితానికి వొక్కొక్క నిముషమూ వుపయోగపడేవి చెప్పాడు . ఎన్నో రకాల కిటుకులూ , టెక్నిక్స్  చెప్పి - యిందులో నీకేది కావాలో అది నిర్ణయించుకో అన్నాడు. శ్రీకృష్ణుడు అహింస బోధించ లేదు. యుద్ధం ఎందుకు, ఎవరితో, ఎప్పుడు , ఎలా చెయ్యాలో చెప్పాడు .  ఏది ఎలా ధర్మం అవుతుందో చెప్పాడు . మనిషి గుణాలు ఏవి , అవి ఎలా వస్తాయి, ఏది ఎప్పుడు వుంటే మేలు - శ్రేష్టమైనది ఏది - అది ఎలా అలవరచుకోవడం - యివన్నీ గీతలో వున్నాయి . ఈనాటి మనస్తత్వ శాస్త్రానికి ఏమీ తెలీని , గొప్ప మనస్తత్వ శాస్త్రం గీతలో వుంది . ఈ నాటి ఆరోగ్య శాస్త్రానికి తెలీని ఎన్నో ఆరోగ్య సూత్రాలు గీతలో వున్నాయి . కాకపొతే , గీతను బట్టీ పెట్టడం ముఖ్యం కాదు. అది తప్పని కాదు. అది మంచిదే . కానీ అంత కంటే ముఖ్యం - అందులోని అంతరార్థం బాగా ఆకళించుకోవడం , పాటించడం .

వొక అర్జునుడు తనకు పది వేల మంది యదు వీరులు వద్దు - శ్రీకృష్ణుడే కావాలి - అని కోరుకుంటే ,   ఎంత మేలు జరిగింది - అర్జునుడికీ , పాండవులకూ , మనకూ .

మరి మీరేం కోరుకుంటూ వున్నారు ? మీకేం కావాలి ?

యదు వీరులు అంటే -  మనం మరొకరితో  శత్రుత్వం పెంచుకుని ,కొట్లాడి , యుద్ధం చేసి,  సంపాదించాలనుకునే    విజయం . అక్కడ విజయం రావచ్చు; రాక పోవచ్చు . విజయం వచ్చినా , అందులో వచ్చే సంతోషం చాలా తక్కువ ; అది ఎక్కువ కాలం నిలువదు కూడా .

శ్రీకృష్ణుడు అంటే - మనం మొదట - మన బలహీనతల పైన యుద్ధం చేసి విజయం సంపాదించడం . ఇది సాధిస్తే  - మిగత ప్రపంచం పై విజయం సంపాదించడం ఎంత సులభమో గ్రహించడం.  ఈ విజయం, దీని ద్వారా వచ్చే ఆనందం నిరంతరం , మహోన్నతం అని గ్రహించడం , దీన్ని అనుభవించడం. దీన్లో ప్రాపంచిక విజయమూ వుంది; పారమార్థిక విజయమూ  వుంది .

యడువీరులు అంటే - పరిమాణం ; సంఖ్య ; ఆంగ్లం లో క్వాంటిటీ  అనవచ్చు . శ్రీకృష్ణుడు అంటే - ఉత్తమత్వం ; వుపయోగత్వం ; ఆంగ్లం లో క్వాలిటీ - అనవచ్చు . మరి , మీకేది కావాలి?

సర్వే  జనాః సుఖినో భవంతు

= మీ

వుప్పలధడియం విజయమోహన్

( ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ - బ్రాండ్ ఈక్విటీ  సెక్షన్ లో " సేనను కాదు ; కృష్ణుడిని ఎన్నుకోండి ; క్వాంటిటీ  కాదు; క్వాలిటీ ఎన్నుకోండి " అన్న వొక  హెడింగ్ చూసిన సందర్భంగా రాయడం జరిగింది. కానీ ఆ  వ్యాసానికీ, ఈ వ్యాసానికీ మరే సంబంధం లేదు . )

14, మార్చి 2014, శుక్రవారం

కుక్క / పిచ్చి కుక్క కరిస్తే - ఏమి ప్రమాదం ? ఏమి చెయ్యాలి ? ఎంత త్వరగా?

కుక్క / పిచ్చి కుక్క కరిస్తే 
ఏమి ప్రమాదం ? ఏమి చెయ్యాలి ? ఎంత త్వరగా?


జీవితంలో  ఎన్నో మలుపులుంటాయి . జీవితంలో సంతోషం తెచ్చే మలుపులు కొన్ని అయితే , భయానకం చేసేవి కొన్ని ; దుఃఖకరమైనవి మరి కొన్ని ; అనూహ్యమైన మలుపులు కూడా ఎన్నో, ఎన్నెన్నో . 

మన  కళ్ళ ఎదురుగా, ఎంతో  మంది జీవితాలలో ఇలాంటివి జరగడం - మనం అయ్యో; అయ్యో పాపం - యిలా అనుకోవడం  జరుగుతూనే వుంటుంది . కానీ - మన జీవితాలలోనే జరిగితే - మనం ఏం అనుకుంటాం ? ఎలా ప్రతిస్పందిస్తాం ?

రక రకాలుగా స్పందిస్తాం . కొన్ని  ఏళ్ల  క్రితం, మాకు తెలిసిన వొకమ్మాయి కి పెళ్లై అత్తగారింటికి వెళ్ళింది. మొదటి రోజే ఆమె భర్త పిచ్చికుక్క కాటు వల్ల "హైడ్రోఫోబియా " వచ్చి చనిపోయాడు.  పెళ్లి కి కొద్ది రోజుల ముందే పిచ్చి కుక్క కరిచిందట . కానీ, దాన్ని  వారు పట్టించుకోలేదు . ఏదో, ఆంటీ బయోటిక్స్ వేసుకున్నాడు. తరువాత మరిచిపోయారు . ఆ తరువాత పెళ్ళయ్యింది. పెళ్లి కూతురుతో సహా వారి ఊరుకు వెళ్ళారు . వెళ్ళిన కొన్ని ఘంటల  లోనే - కుక్క కాటు ప్రభావం పని చేసి - చనిపొయ్యాడు. అతడు చనిపోయిన విధానాన్ని గురించి చిలవలు పలవలుగా అప్పట్లో వర్ణించే వారు .

కొద్ది రోజుల క్రితం మద్రాసు క్రిస్టియన్ కాలేజీ లో - యిద్దరు విద్యార్థులు , కాలేజీ ఆవరణ లోని చిన్న కుక్క పిల్లలతో ఆడుకుంటూ  వుండగా, అవి వారిని కరిచింది; వో రెండు రోజుల్లో ఆ విద్యార్థులకు హైడ్రోఫోబియా వచ్చి చని పోయారు . కరిచిన వెంటనే , సరైన వాక్సీను వేసుకుని వుంటే , వారి బ్రతికే వారే . అంతే కాదు; ఆ కాలేజీ ఆవరణ లో ఈ మధ్య కుక్కల సమూహం చాలా ఎక్కువగా పెరిగిందట.  అది చూసి సరైన చర్యలు తీసుకున్న వారు లేరు . యిటువంటి అసమర్థత , మూర్ఖత్వం మన దేశం లో చాలా ఎక్కువ .

పిచ్చి కుక్క కరిస్తే - యింత భయంకరంగా పని చేస్తుందా - మనుషులు యిలా చనిపోతారా - అని నాకూ చాలా ఆశ్చర్యంగా వుండేది. అయితే - దానికి ఏం చెయ్యాలో, నాకూ వొకప్పుడు తెలీదు . చాలా మందికి యిప్పటికీ తెలీదు. మన సమాజంలో , మన విద్యా విధానంలో , యిదొక పెద్ద లోపం . అతి పెద్ద దురదృష్టం . 

ఎప్పుడో చనిపోయిన మొగలాయీ వంశం, ఆంగ్ల వైస్ రాయ్ లు - లాంటి వారిని గురించి అంతా చదువుతాం . కాని మన వూర్లో , మన వీధిలో పోతున్న కుక్క మనల్ని కరిస్తే - ఏం చెయ్యాలో - వూర్లో 90 శాతం మందికి తెలీదు.   చాలా ఊళ్లలో పిచ్చి కుక్క కాటుకు వెయ్య వలసిన మందులూ లేవు .

చాలా మందికి కుక్కలంటే అమితమైన ప్రేమ. కుక్కలకు కూడా తమ యజమానులైన మనుషులపై అమితమైన విశ్వాసము. నిజానికి కుక్కలకున్నంత విశ్వాసము, ప్రేమ మరే జంతువుకూ వుండడం మనం చూడలేము . అది మంచిదే. కానీ, యింట్లో పెంచే కుక్కలకు కూడా, అప్పుడప్పుడూ ఆంటీ రాబీస్ వాక్సిన్ వేస్తూ వుండాలి. అలా చేస్తే వాటి వల్ల, మనకు ప్రమాదం లేదు. అలా వాక్సిన్ వేయించకుంటే వాటికీ ప్రమాదమే. వాటి వల్ల మనకూ ప్రమాదమే.  వాటికి రాబీస్ రోగం వచ్చిందంటే, అవీ చావడం ఖాయం; వాటివలన మనయిళ్ళలో , వొకరో, ఇద్దరో చావడం కూడా అంతే ఖాయం .

యిక వూరికుక్కలైతే , వాటికి ఎప్పుడు రాబీస్ వస్తుందో చెప్పలేము . ఎప్పుడైనా రావచ్చు ; ఎన్నో కారణాల వల్ల  రావచ్చు . రాబీస్ వస్తే , ఆ కుక్క కనిపించిన  మనిషినల్లా కొరకడానికి ప్రయత్నించడం మనం చూడవచ్చు . యిది ఎన్నో వూళ్ళలో జరిగింది . యికముందూ జరుగుతుంది . నిజానికి ప్రపంచ దేశాలన్నింటిలో ఈ రాబీస్ మరణాలు మన దేశం లోనే చాలా ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. వూరకుక్కల్ని చంపరాదని మనం చట్టం కూడా చేసుకున్నామని వికీ పేడియా వెబ్ సైట్ చెబుతో వుంది . వూరకుక్కల్ని చంపరాదు సరే ;వాటికి రాబీస్ రాకుండా చేసే చట్టాలేవీ మనం చేసుకోలేదు . అసలు అటువంటి ప్రయత్నాలే మన దేశంలో లేవు . యిదొక పెద్ద మూర్ఖత్వం .

చాలా దేశాలలో అసలు రాబీస్ అనే రోగమే లేదు, రాదు . మరి మన దేశంలో యింత ఎక్కువగా ఎందుకు వుంది? కొన్ని కొన్ని ఊర్లలో, వూరకుక్కలు మనుషుల కంటే  ఎక్కువ సంఖ్యలో వున్నాయి . రాత్రి పూట ఎవరూ మరో  వీధికి కూడా వెళ్ళలేని పరిస్థితి చాలా ఊళ్లలో వుంది .  అయినా అక్కడి ప్రభుత్వ యంత్రాంగం ఇవేవీ పట్టించుకునే  పరిస్థితి లేదు . పంచాయితీ పాలన అంటామే కానీ - అది చాలా దరిద్రం గానూ, అసమర్థంగానూ వుంది.  పూర్తి  లంచ గొండి తనం తో నిండి వుంది.  మన ప్రభుత్వ విధానాలు కూడా చాలా అసమర్థంగా వున్నాయి .

అమెరికా , చైనా లాంటి దేశాలలో - యిప్పుడు రాబీస్ ప్రమాదం చాలా తక్కువ . ముందు చెప్పినట్టు - కొన్ని దేశాలలో అసలు లేనే లేదు . మన దేశంలోనే చాలా ఎక్కువ గా వుంది . భూత దయఅంటే యిటువంటి మూర్ఖత్వం అని కాదు అర్థం . చైనా లోని బీజింగ్ లో యింటికి  వొక   కుక్కకు  పైగా పెంచ రాదని; అది కూడా, 14 ఇంచీలు (35. 5సెం. మీ) కంటే పెద్దవిగానూ వుండకూడదు ;భయం కొలిపేది గానూ వుండకూడదు -అని చట్టం కూడా చేశారట. యిది కూడా రాబీస్ రోగం రాకుండా నివారించడం కోసమే .

రాబీస్ రోగం రాకుండా, ముందే వేసుకునే వాక్సీన్ వుంది కాని, వచ్చింతరువాత దాన్ని పోగొట్టే మందే  లేదు ; మరణం ఖాయం . రాబీస్ వచ్చిన కుక్క ఎంత మంది మనుషుల్ని కరుస్తుందో చెప్ప లేము . ఎంత మంది నైనా కరవ వచ్చు . దానికి చూసిన వారినందిరినీ కరవాలని అనిపిస్తుంది. కరుస్తూ పొతుంది. కరచిన వారందిరికీ రాబీస్ వచ్చే ప్రమాదం వుంది - వారు వెనువెంటనే  వాక్సీన్ వేసుకోక పొతే. 

మన రాష్ట్రం గురించి , ఎన్నో ఊర్లలో ఈ పిచ్చి కుక్కల స్వైర విహారం గురించి, రాబీస్ వచ్చిన వారి గురించి వార్తలు - అప్పుడప్పుడూ వస్తూనే వున్నాయి.  అయినా - రాష్ట్ర ప్రభుత్వం గానీ, పంచాయితీలు గానీ ఈ కుక్కలను అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నమే చెయ్యడం లేదు . దీనికి తోడు , బ్లూ క్రాస్  వారి గొడవ పెద్దది . చస్తున్న మనుషుల గురించి వారికి అస్సలు పట్టదు. కుక్కలకు పిచ్చి పట్టడం గురించి కూడా వారికి బాధ లేదు . కానీ కుక్కలను యెవరు ఏం చేసేస్తారో - అన్నది మాత్రమే బాధ.

మనుషుల క్షేమం మొదట - కుక్కల క్షేమం తరువాత గా వుంటే తప్ప దేశం  బాగుపడదు . మన ప్రభుత్వాలు చేసిన పనికి మాలిన చట్టాలు చాలావి యిలాగే వున్నాయి .

కుక్కల సంఖ్య , ముఖ్యంగా  ఊరకుక్కల సంఖ్య గణనీయంగా తగ్గాలి . వాటికి కుటుంబ నియంత్రణ పథకాలు వున్నాయి  కాని అమలు చేసే ప్రభుత్వ యంత్రాంగం సరిగ్గా లేదు . ప్రతి జిల్లా కలెక్టరూ వొక్క వారం రోజులు , పోలీసు, పంచాయితీ, బ్లూ క్రాస్ - యిలా అన్ని విభాగాలనూ కూడదీసి , కుక్కల కుటుంబ నియంత్రణ 100 శాతం చేయిస్తే తప్ప , ఊరకుక్కల బెడద తగ్గదు . రాబీస్ ప్రమాదం వుండనే వుంటుంది .

అలాగే , మన స్కూళ్ళలో , కుక్కలు కరిస్తే - వెంటనే ఏం చెయ్యాలో చెప్పే వొక పాఠం తప్పకుండా  వుండి తీరాలి . కుక్కలను పెంచాలంటే , ఎలాంటి నియమాలు పాటించాలో తెలియాలి .

 నన్ను కూడా ఆరేళ్ళ క్రితం వొక పిచ్చి కుక్క , వెనుక నుండి వచ్చి,  కరిచింది . నన్ను కరిచిన కుక్క మళ్ళీ యింకెంతో మందిని కూడా కరిచిందట.  ఆ తరువాత , దాన్ని ఎవరో చంపేశారట.   నేను మాత్రం - వెంటనే , 5 నిమిషాల లోపే , నాకు తెలిసిన వొక డాక్టరుకు ఫోను చేశాను . ఆమె సలహా ప్రకారం , వెంటనే, కుక్క కరిచిన శరీర భాగాన్ని సోపు తో కడిగి, వేగంగా వెళ్ళే నీళ్ళలో మరింత బాగా కడిగాను. అక్కడున్న కుక్క నోటి లోని సలైవా వీలైనంత పూర్తిగా పోవాలి. అది మొదట చెయ్య వలసిన పని . వెనువెంటనే, దగ్గరున్న డాక్టరు దగ్గరికి వెళ్లి ఆంటీ రాబీస్ వాక్సీన్ ఇంజెక్షన్ చేయించుకున్నాను . ఆ తరువాత , మరో నాలుగు ఇంజెక్షన్లు డాక్టర్ చెప్పిన రోజులలో - వేయించుకున్నాను. మనం చెయ్యాల్సింది యింతే . యిది చేస్తే, మరిక భయం లేదు .

కానీ, యిది చెయ్యకపోతే - కొన్ని రోజులలోగానే రాబీస్ రావచ్చు . లేదా, కొన్ని మాసాలలో రావచ్చు . వొక్క సారి  రాబీస్ లక్షణాలు వస్తే, మళ్ళీ మందే లేదు.  వొక్కో సారి మనం మంచ్జ్హి కుక్క అనుకునేది , రాబీస్ కుక్కగా వుండవచ్చు . కాబట్టి, కుక్క కాటు ఏ  మాత్రమూ అశ్రద్ధ చెయ్య తగనిది .  పైన చెప్పిన వైద్యం వెనువెంటనే  చెయ్యాలి . నాకు ఆయుర్వేదమంటే , చాలా యిష్టం . చాలా విషయాలకు ఆయుర్వేద మందులే వాడతాను . అయినా కుక్క కాటుకు మాత్రం - ఆంటీ రాబీస్ వాక్సీన్  తప్పని సరి . 

మీ వూళ్ళో ఊరకుక్కలు ఎక్కువగావుంటే - వెంటనే పంచాయితీ వారికో , కలెక్టరు గారికో రిపోర్ట్ చెయ్యండి.  వారిద్వారా , వాటి పెరుగుదలనూ అరికట్టాలి ;  వీలైతే , వాటిని, వూరికి దూరంగా వదిలి వేసే  ఏర్పాటూ చెయ్యాలి . ఏదైనా కుక్క అందరినీ కరవాలని  చూస్తుంటే - దానికి పిచ్చెక్కిందనే అనుకోవాలి . అది ఎవరినీ కరవనీకుండా జాగ్రత్త పడాలి.  అది కరిచిన వారూ, బరికిన వారూ - అందరూ ఇంజెక్షన్లు వేసుకుని తీరాలి .  ప్రతి వూర్లోనూ , గ్రామంలోనూ , ఈ వాక్సీన్ వుండి తీరాలి. యిది కరిచిన వెంటనే , వేసుకుంటే  చాలా మంచిది . ఎంత త్వర పడితే - అంత మేలు . అందుకని, మీరున్న ఊళ్లోనే వాక్సీను వుండి తీరాలి - మీకు అందుబాటులో వున్న డాక్టరు గారి దగ్గర వుండాలి . ముఖ్యమైంది - యిది అందరికీ తెలిసుండాలి .

ఇదండీ సంగతి . ప్రతి వారం చదువుతున్న రాబీస్ చావులను చూస్తూ వుంటే; చదువుకున్న వారు కూడా చేస్తున్న నిర్లక్ష్యం , దాని ఫలితాలు  చూస్తూ వుంటే - యిది తప్పక రాయాలనిపించింది .   మీకు తెలిసిన వారికి తప్పక చెప్పండి .

సర్వే  జనాః సుఖినో భవంతు .

= మీ

వుప్పలధడియం విజయమోహన్