1, ఏప్రిల్ 2014, మంగళవారం

మూర్ఖుడితో సర్దుకుంటారా ? మూర్ఖత్వాన్ని ఎదిరిస్తారా ? - 5 బుద్ధిహీనత సిద్ధాంతాలు - మీరు బుద్ధిమంతులా ?

బుద్ధిహీనత (మూర్ఖత్వం)

ఎలా వస్తుంది ? ఎలా పోతుంది ?




ఆంగ్లంలో 'స్టుపిడిటీ' అంటే - తెలుగులో 'బుద్ధిహీనత' లేదా , 'మూర్ఖత్వం' అని తర్జుమా చేసుకోవచ్చు. 

వున్న విషయాలు తెలియక పోవడం వేరు. తెలిసి,  లేదా, నేను తెలుసుకొను - అని మంకు పట్టు పట్టి , ఆలోచన లేకుండా, తెలిసిన వాళ్ళను అడగకుండా - ఏదేదో చేసెయ్యడం , తద్వారా, తనకూ, తన చుట్టూ వున్న వారికి కష్టాలు ,  నష్టాలు కలుగ జెయ్యడం - యిది బుద్ధి హీనత సాధారణ లక్షణాలు - అంటారు కార్లో  నారియా కిపోలా. 

ఎప్పుడైనా సరే - ఎవరో చెప్పితే  విని , మనలో ఎవరూ బుద్ధి హీనులు కాము . మనకు మనమే బుద్ధిహీనతను కొని తెచ్చుకుంటాము ; లేదా, ఆపాదించుకుంటాము. అంటే - మన బుద్ధిహీనత కు మరొకరు కారణం కాజాలరు . దానికి కారణం మనమే . మన ఆలోచనా విధానమే .

సరే . మనలో ఎవరైనా , ఎల్లప్పుడూ  బుద్ధి హీనులుగానూ,. మూర్ఖులుగానూ  వుంటామా ; వుండగలమా ?  వుండ లేము . వొకప్పుడు  బుద్ధిని బాగానే ఉపయోగిస్తూ , మరొకప్పుడు బుద్ధిని సరిగ్గా ఉపయోగించకుండా మన మూర్ఖత్వాన్ని ప్రదర్శించు కుంటాము .

ఎందుకిలా ? భగవద్ గీతలో శ్రీకృష్ణుడు అంటాడు - మన మనస్సే మన శత్రువు - మనం బుద్ధి మాట విననంత కాలం . కానీ , అదే మనసు , బుద్ధి మాట -వింటే  మన మిత్రుడు గా మారి పోతుంది - అని .

అంటే బుద్ధి మాట వినే మనసు   సరైన నిర్ణయాలు తీసుకోనిస్తుంది . బుద్ధి మాట వినని మనసు, మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది . 

నా ఉద్దేశం లో - "బుద్ధిలేని తనం" -అంటే - బుద్ధిమాట ను మరీ ఎక్కువగా చంపేసి , బుద్ధి లేని మార్గంలో మనసు వెళ్లి పోతుంటే - మనిషి అందరి అభిప్రాయంలో మూర్ఖుడు గా, బుద్దిహీనుడు గా ముద్ర వెయ్య బడతాడు . అప్పుడు - మనకు ఆ పోకడే అలవాటై పోతుంది .

ఉదాహరణకు - పొగ త్రాగడం హానికరం . అందరికీ తెలుసు . కానీ చాలా మంది పొగ త్రాగే వారున్నారు . అది యిలాగే ప్రారంభమవుతుంది. మొదటి సారి బుద్ధి - మనకు బుద్ధి చెబుతుంది .  వద్దు - అంటుంది. కానీ ఏదో ప్రోద్బలం , ఎవరో మూర్ఖుల స్నేహం - మన మనసు, మన బుద్ధిని చంపేసేటట్లు చేస్తుంది. ఆ తరువాత - మన మనసు మరి బుద్ధి మాట పట్టించుకోదు. అలాగే - మిగతా మూర్ఖపు పనులు కూడా. మాదక పదార్థాలు సేవించడం , విడవలేక  వాటికి బానిసవడం , మన జీవితాన్ని మాత్రమే కాక, చుట్టూ వున్న వారి జీవితాల్ని కూడా నరక ప్రాయం చెయ్యడం - యివన్నీ మన దేశంలో - 50 శాతం పైగా మగ వాళ్ళు ముఖ్యంగా చేస్తున్న బుద్ధి లేని పనులు .

దొంగ తనాలు, బలాత్కారాలు, సామూహిక బలాత్కారాలు, చంపడం , అబద్ధాలు చెప్పడం, లంచగొండి తనం  - అన్నీ మూర్ఖపు పనులే .

మూర్ఖపు పనులు మొదట మనసులోనే మొదలవుతాయి . ఆ తరువాత , మాటల ద్వారా , కొద్దో గొప్పో బయటపడుతాయి . మాటల్లో కాఠిన్యం మొదటి మూర్ఖత్వం . యిది కొంత మందికి మరీ ఎక్కువ . కొంత మందికి ఎప్పుడో కొద్ది సమయాల్లో మాత్రమే  వుంటుంది. 

కొంత మంది మాటల్లో బాగా సంయమనం పాటిస్తారు . ఇది అభ్యాసం చెయ్యాలి - అంతే. రోజుకు యిద్దరిని పొగడాలి అని నియమం పెట్టుకుంటే - అది వొక 48 రోజులు పాటిస్తే - మంచి మాటలు మాట్లాడడం మీకు అలవాటై పోతుంది . ఆ తరువాత - మీరు చెడ్డ మాటలు, అబద్ధాలు, పరుషం గా మాట్లాడడం - అన్నీ బాగా తగ్గి పోతాయి. అంటే -బుద్ధిలేనితనం లోని వొక అంశం మిమ్మల్ని విడిచి దూరంగా వెళ్లి పోతుంది . అంటే - బుద్ధిహీనత నిరంతరంగా మన ముద్రగా వుండాల్సిన పని లేదు . 

కానీ - కొందరు తాము పరుషంగా మాట్లాడడము, అందువలన యితరులు బాధ పడడం , ఏదో తమ గొప్పగా భావిస్తూ వుంటారు . ఇతరులు  సహించినంతకాలం - యిది యిలాగే జరుగుతూ వుంటుంది . చుట్టూ వున్న వారు తిరగబడాలి.  అంతకంటే పరుషంగా మాట్లాడినా సరే - సమాజంలో పది మంది ముందు వీరిని బాగా దులిపైనా సరే - పది మంది వారిని పరుషంగా మాట్లాడైనా సరే - పరుష భాషణం మూర్ఖత్వం అనేది - బాగా తెలియజెప్పాలి . ఇలాగే మిగతా  మూర్ఖత్వపు లక్షణాల  విషయం కూడా. వొకరి మూర్ఖత్వం ఎటువంటిదైనా - మరికరిని బాధిస్తూ వుంటే - అది సహించి వూరుకోవడం ,మరొకరి  మూర్ఖత్వమే అవుతుంది .


కార్లో  నారియా కిపోలా  అనే ఆర్ధిక శాస్త్ర - చరిత్రకారుడు , 5 బుద్ధిహీనత సిద్ధాంతాలను  ప్రతిపాదించాడు.  వాటిని కాస్త పరిశీలిద్దాం .

  • ఎల్లప్పుడూ, నిస్సందేహంగా  - మనం , మన చుట్టూ వున్న బుద్ధిహీనుల సంఖ్యను, చాలా తక్కువగానే  అంచనా వేస్తాము. 
  •  వొక మనిషి బుద్ధిహీనుడా, కాదా అన్న విషయం - అతని మరే గుణగణాల పై కానీ, చదువు పై గానీ ఆధార పడి వుండదు . అంటే - బుద్ధి హీనుడి బుద్ధి హీనత స్వతహాగా బ్రతుకుతుంది . మరే గుణగణాల పైన ఆధార పడదు 
  • వొక మనిషి బుద్ధిహీనుడా, కాదా అన్నది ఎలా చెప్పొచ్చు ? వాడు, స్వలాభం ఏ మాత్రం పొందకుండా , యితరులకు నష్టం కలిగిస్తే అతడు బుద్ధిహీనుడే; అంతకంటే ఘోరం - తాను కూడా నష్టపోతూ , యితరులకు నష్టం కలిగిస్తే , వాడు ఖచ్చితంగా మరింత బుద్ధిహీనుడే . 
  • బుద్ధిహీనులు కాని వారు కూడా - బుద్ధిహీనులతో జత చేరితే జరిగే ప్రమాదాన్ని, నష్టాన్ని ఎప్పుడూ , తక్కువ గానే అంచనా వేస్తారు . వారితో చేరడం ఎంత గొప్ప తప్పో ఎల్లప్పుడూ మర్చి పోతూ వుంటారు . 
  • ప్రపంచంలో - బుద్ధిహీనుల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు మరొకరు లేరు . 

యివండీ ఆ 5 సూత్రాలు . మనం - మరెన్నైనా సూత్రాలను , మనకు తోచిన వాటిని చేర్చుకోవచ్చు . బుద్ధి హీన ప్రపంచంలో సర్వం సాధ్యమే .

మొదటి సూత్రం ప్రకారం - మన చుట్టూ వున్న బుద్ధిహీనుల సంఖ్య లేదా వారి శాతం , మనం అనుకోగలిగిన దాని కంటే   ఎప్పుడూ కాస్త ఎక్కువ గానే వుంటుందంటారు కార్లో. అది నిజమే -అంటాను నేను. కనీసం వొక్కరిని ఆ లిస్టు లో చేర్చడానికి   మనం మర్చిపోతూనే  వుంటాం . నిజానికి చాలా మందిని ఆ లిస్టు లో చేర్చం .  అదంతే .  అది - మన బుద్ధిహీనత .

ఇప్పుడు  మీలో ప్రతి వొక్కరూ - మీ చుట్టూ వున్నఅందరి లిస్టు  వెయ్యండి చూద్దాం . ఆ తరువాత , అందులో బుద్ధిహీనులెవరో టిక్కు కొట్టండి. బుద్ధిమంతులెవరో వారి పేర్లను మరో రంగుతో టిక్కు కొట్టండి .

అయిపోయిందా . యిప్పుడు, ఆ బుద్ధిమంతుల గురించి బాగా ఆలోచన చెయ్యండి . వాళ్ళు ఎందుకు అలాగే వున్నారో , ఎందుకు అభివృద్ధి చెందలేదో , ఎందుకు యింకా సంతోషంగా లేదో , ఎందుకు , వారికి రోగాలొచ్చాయో , ఎందుకు వాళ్ళింట్లో , అప్పుడప్పుడూ కొట్లాటలు , వాగ్వాదాలు వస్తుంటాయో - యిలా - వారిని గురించిన నకారాత్మక విషయాల గురించి బాగా యోచన చెయ్యండి . యిప్పుడు, వారు బుద్ధిమంతులు కాదు అనిపిస్తే వారిని బుద్ధిహీనుల లిస్టు లో చేర్చెయ్యండి .

యిప్పుడు చాలా మంది ఈ బుద్ధిహీనుల లిస్టులోకి వచ్చేసారు కదా. అయినా యింకా కొద్ది మంది ఈ లిస్టు లోకి రాలేదు . వారిని ఈ లిస్టు లోకి చేర్చడానికి మీ బుద్ధి కాదు - మనసు యిష్ట పడడం  లేదు . కారణం ఏదైనా కానియ్యండి . మీ దగ్గరి వారిలో కొందరైనా బుద్ధి మంతులు అన్నది మీ భావన; నమ్మకం . అదీ కథ . యిందులో - వొకరిని గురించైతే , మీరు అనుకోవడమే లేదు ! ఎవరు వారు ?

యిప్పుడు మళ్ళీ మీరు మీ లిస్టు చూడండి . అందులో - ఆడవాళ్ళు, మగ వాళ్ళు , పిల్లలు , పెద్దలు , ముసలి వాళ్ళు , చదువు కున్న వాళ్ళు , చదువులేని వాళ్ళు , డబ్బున్న వాళ్ళు , డబ్బు లేని వాళ్ళు ,  అందంగా వున్న వాళ్ళు , అందంగా లేని వాళ్ళు - అందరూ వున్నారు . అంటే ఏమిటి - బుద్ధి హీనత కూ , మిగతా విషయాలకూ సంబంధం లేదు . యిది నిజం . ఎందుకిలా ? ప్రకృతిలో బుద్ధిహీనత  అనే లక్షణం  ఎందుకిలా , యింత విస్తారంగా , ధారాళంగా వుంది ? ఎవరికి తెలుసు ?

సరే . ప్రస్తుతానికి , నేను , మీరు  కాస్త బుద్ధిమంతులం అనుకుందాం . మనసులో అది వొక వూరట . ఏదో కాస్త సందేహం పీకుతోనే వుంటుంది - అయినా యిలా అనుకుందాం . సందేహం ఎందుకు వస్తుందంటే - యింత మంది బుద్ధి హీనులని మనకు తెలిసిన తర్వాత - మనం మాత్రం బుద్ధిహీనులు కాదు - అని అనుకోవచ్చా ? అదెలా కుదురుతుంది ? నలుగురితో బాటు నారాయణా అనుకోవడమే కదా - మనం చేస్తున్నది ! చెయ్యాల్సింది. 

బుద్ధిహీనులకు పుట్టాం . బుద్ధిహీనులతో కాపురం చేస్తున్నాం . బుద్ధిహీనులకు జన్మ నిచ్చాం . బుద్ధి హీనుల పక్కింట్లో , ఎదురింట్లో , ముందింట్లో వుంటున్నాము . మరి మనం మాత్రం వేరేగా ఎలా వుంటాం ? ఈ సందేహం వచ్చే వుంటుంది . అయినా , మనం కాదు అనుకోవడంలో - ఏదో సంతృప్తి వుంది కదా .  అనుకుందాం . పొయ్యేదేముంది ?

రెండో సూత్రం కూడా కొంత వరకు పైన చెప్పిన దాన్లోనే మనకు తెలిసిపోయింది . 15 ఏళ్ళ క్రితం ముకేష్ అంబానీ, అనిల్ అంబానీలు ఆస్తులు దాదాపు సమానంగా పంచుకున్నారు . కానీ ఈ రోజు , ముకేష్ తో పోలిస్తే, అనిల్ ఆస్తి 1 / 5 వంతు కంటే తక్కువగా పడి పోయింది . అంటే ఏమిటి అర్థం? ఈయనకు అదృష్టం తక్కువనా ? అదేం లేదు. అప్పుడప్పుడూ , చుట్టూ వున్న వాళ్ళతో  సర్దుకు పోవడంలో ,ముకేష్ గొప్ప అని తెలుస్తూనే వుంది . ఆపైన కాస్త అదృష్టం. 

బుద్ధి వుండడం, లేకపోవడం అనేది ముఖ్యం కాదు ; వున్న బుద్ధి స్వలాభం కోసం , చుట్టూ వున్న వారి లాభం కోసం ఉపయోగించక పోవడం -  తమ అర్థ రహితమైన అహంకారాన్ని సంతోష పరచడానికి ఉపయోగించడం - అదే  బుద్ధి హీనత అని - మనకు తెలుస్తుంది.

ఎంతో మంది - తమకు వొక కన్ను పోయినా ఫరవా లేదు - ఎదుటి వాడికి రెండు కండ్లు పోవాలి అనుకునే  వారున్నారు ; అలా కావాలని ఎంతో ప్రయత్నాలూ చేస్తారు . మరికొందరు మహా మూర్ఖులు  తమకు రెండు కండ్లూ పోయినా ఫరవాలేదు - ఎదుటి వాడికి కనీసం  వొక కన్నైనా పోవాలి అనుకునే వారున్నారు .

ఎన్నో యిళ్ళలో - వారానికి కనీసం రెండు రోజులు భార్యాభర్తలు పోట్లాడుకుంటారు . పెద్ద కారణమేమీ వుండదు . కాస్సేపు కొట్లాడి, వొక రోజు మూతి ముడుచుకుని కూర్చుంటే - తాము బుద్ధిహీనులు అన్నది అందరికీ అర్థమయ్యేటట్టు చేసి , తమ పిల్లల ముందు కూడా తాము బుద్ధిహీనులు అన్నది తెలియ జేసి - ఆ తరువాత మెల్లగా సర్దుకుంటారు . పిల్లలకు అర్థం కాదు - వీళ్ళు యింత చిన్న విషయాలకు ఎందుకింత పోట్లాడుకుంటారో అని . అన్నం తినకండా పస్తులుండడం, చిర్రుబుర్రులాడుతూ వుండడం , కొన్ని కుటుంబాలలో సర్వ సాధారణం . యింకా కొన్ని కుటుంబాలలో అసహ్యంగా తిట్టు కోవడం , కొట్టుకోవడం కూడా జరుగుతూ వుంటాయి .  

కొన్ని కుటుంబాలలో అయితే - మేం ఈ కులం లో పుట్టాం గనుక , కొట్లు, తిట్లు, దొమ్మీలు, ఆగడాలు చెయ్యకపోతే అసలు మాకు మర్యాదే లేదు -  అనే వొక మూర్ఖపు   భావన చాలా ఎక్కువ గా కనిపిస్తుంది . అది మిగతా వాళ్ళు సహించడం - అంత కంటే మూర్ఖత్వం .

పిల్లలు కొట్లాడితే - అర గంట; భార్యాభార్తలు కొట్లాడితే కొన్ని రోజులు; కొంత మంది వుత్తి పుణ్యానికి డైవర్స్ వరకు వెళ్లి పోతుంటారు . కొన్ని మంచి స్నేహాలు - అసలు కారణమే లేకుండా - తెగి పోతూ వుంటాయి . యివన్నీ మూర్ఖత్వపు లక్షణాలే . 

ఆల్బర్ట్ ఆయిన్ స్టీన్  అంటారు - "ప్రపంచం , మనిషిలోని మూర్ఖత్వం యివి రెండూ ఎల్లలే లేనంత విస్తారమైనవి . కానీ, వొక వేళ ప్రపంచానికి ఎల్ల వుంటే వుండొచ్చు; కానీ మనిషి మూర్ఖత్వానికి మాత్రం ఎల్లేలే లేవు ." 

యిది నిజమే . తెల్లారి లేచి వార్తా పత్రిక చదివితే - అందులో - మన నాయకులెంత బుద్ధిహీనులో, ప్రజలెంత  బుద్ధిహీనులో తెలుస్తుంది . మనం ఎంత బుద్ధిహీనులో - కాస్త యోచన చేస్తే  తెలుస్తుంది .వొక నాయకుడికి ఏదో కుంభకోణం లో శిక్ష పడింది . మనం, మరో యోచన లేకుండా , ఆయన సతీమణికి , లేదా కుమారుడికి వోటు వేసేస్తాం . యింత బుద్ధిహీనత మనలో వుంటే , అంత బుద్ధి హీనులు నాయకులవడంలో , ఆశ్చర్యం ఏముంది ? మరొకడికి ఎన్నో వేల కోట్లు మరొకరి పదవి వలన , తన నిర్వాకం  ఏమీ లేకుండానే వచ్చి పడిందని  తెలుస్తుంది . అతడినీ గొప్ప నాయకుడిగా పూజిస్తాం .

మనిషి బుద్ధిహీనత  ఎల్లలే లేనంత ఎక్కువ అన్న దాన్లో నాకు సందేహం లేదు. 

మరొకాయన అంటారు - బుద్ధి హీనులు ఎంతో మంది గుంపులు గుంపులు గా వుంటారు అని . అదీ నిజమే .పాకిస్తానుకు , మనకు యుద్ధాలు జరిగాయి . ముందు,  ముందు కూడా జరగ వచ్చు. - అలాగే మనకు, చైనా కు మధ్య వైరం వుంది . ఈ భాగం మాది ; ఆ భాగం మాది - అని చైనా  వారు ముందుకు వచ్చే ప్రయత్నాలు చేస్తూనే వున్నారు . అయినా మనం మాత్రం చైనా లో చేసిన వస్తువులే కావాలని కొనుక్కుంటాం. మన దేశాన్ని కబళించాలని వున్న దేశపు వస్తువుల పట్ల , అది వూరికే యిచ్చినా సరే - మనం ఆశ పడరాదు. ఈ మాత్రం బుద్ధి మనకూ లేదు ; మన ప్రభుత్వానికీ లేదు . మన దేశం లో చిన్న, పెద్ద  పరిశ్రమలన్నీ  చైనా వస్తువుల వల్ల మూత బడుతున్నాయి . BHEL  లాంటి భారీ ప్రభుత్వ రంగ సంస్థ కూడా -  ఆర్డర్లు తగ్గి వెల వెలా పోతోంది . నష్టాల్లోకి వెళ్ళినా వెళ్ళవచ్చు.  L &T లాంటి మరొక భారీ సంస్థ యజమాని  నాయక్  గారు వొక సారి అన్నారు కూడా - చైనా వస్తువుల కొనుగోలు వల్ల మన దేశంలో - నాణ్యతా పోతూ వుంది ; దేశంలో వుత్పత్తీ పోతూ వుంది అని . అయినా - ప్రభుత్వ ధోరణీ మారలేదు; మన ధోరణీ మారలేదు. జపాన్లో అయితే - మొట్ట మొదట జపాన్ వస్తువులకే , ప్రతి వొక్కరూ ప్రాధాన్యత యిస్తారు. మన దేశంలో అయితే - భారత వస్తువులు తప్ప , మరే వస్తువైనా కొనేస్తాము - విదేశీ ముద్ర వుంటే చాలు . అదో మోహం . అదో మూర్ఖత్వం . 

ఇలా - మన మూర్ఖత్వాన్ని గురించి గురించి ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు . మనం బుద్ధి మాట ఎప్పుడు వింటాం ? ఎప్పుడు మారతాం ? 

మనకూ, మన ప్రక్కనున్న భారతీయులకూ, మన దేశానికి , మొట్ట మొదట - మన ద్వారా మేలు జరిగే కార్యక్రమాలకు ఎప్పుడు శుభారంభం పలుకుతాం ?

జయ నామ  సంవత్సరం వచ్చేసింది . అది  వెళ్ళే లోపల - మనకూ , మన దేశానికీ - జయ జయ ధ్వానాలు మనం పలుక గలమా ? మంచి మాట , మంచి ఆలోచన , మంచి పని ద్వారా - మనం ప్రతి వొక్కరూ - మన దేశంలోని కొందరిని అయినా జయ నామ సంవత్సరం లో ఆదుకుంటామా ? 

మంచి పనులు చేసే వారిలో - మూర్ఖత్వం వుండదు . పారిపోతుంది . 



సర్వే  జనాః సుఖినో భవంతు . 

= మీ 

వుప్పలధడియం విజయమోహన్









                                               
  





19, మార్చి 2014, బుధవారం

శ్రీకృష్ణుడా?యదువీరులా ? శల్య సారథ్యమా ? శ్రీకృష్ణ సారథ్యమా ? మీ నిజ జీవితంలో ఏది కావాలి మీకు ?


శ్రీకృష్ణుడా - యదువీరులా ?  
ఎవరు కావాలి మీకు ? 
శల్య  సారథ్యమా ? శ్రీకృష్ణ సారథ్యమా ?
ఏది కావాలి మీకు ? 
 

ఈ మహా భారత కథ మీకు తెలిసే వుంటుంది. కానీ ఈ కథ వెనుక దాగివున్న జీవిత సత్యం మీకు తెలుసా ?  

నిజానికి , మహా భారతంలో వుండే అనేక పిట్ట కథలలో , అలాగే , అందులోని అనేక ముఖ్య సంఘటనలలో - ఈ రోజుకూ మనకు కావలసిన జీవిత సత్యాలు, జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపించ గల జీవిత సూత్రాలు  - ఎన్నెన్నో నిక్షిప్తమై వున్నాయి . 

యిటువంటి, యింత గొప్ప ఇతిహాసం - ప్రపంచం లో మహా భారతం వొక్కటే . దీన్ని మించిన పుస్తకం, కావ్యం , యితిహాసం మరెక్కడా మరొక్కటి లేదు. కాకపొతే , దీన్ని సరైన రూపంలో - ప్రపంచానికి, మనం అందించలేక పోతున్నాము.  అందువలన మహాభారతం లాంటి మహత్తర గ్రంథం కూడా మరుగున పడిపోతున్నది.  మన భారత ప్రభుత్వం వారి వైఫల్యాల్లో యిది కూడా ప్రముఖమైనదిగా చెప్పుకోవాలి. 

సరే . యిప్పుడు అసలు కథకు వద్దాం . 

మహాభారత యుద్ధం ఆరంభం చెయ్యడానికి - ఇరువైపులా సన్నాహాలు జరుగుతున్న సమయం అది . పాండవులూ, కౌరవులూ భారత దేశం లోని అందరు రాజుల సహాయమూ అర్థిస్తున్న సమయం  అది.  ఆ కాలంలో, చాలా మంది రాజులకు వొక నియమం వుండేటట్టు కనిపిస్తుంది. ఎవరు తమను ముందుగా సహాయం అడుగుతారో , వారి ప్రక్కన యుద్ధం చెయ్యడమే కానీ , వారి వైపు ధర్మం వుందా , లేదా - అన్నది పెద్దగా చూడ లేదు వారిలో చాలా మంది . 

ఉదాహరణకు శల్యుడు. శల్యుడు మద్ర దేశపు రాజు . చాలా కాలానికి  ముందు, వొక సారి శల్యుడి సేన, పాండురాజు సేన వొక చోట ఎదురు పడతాయి. అప్పుడు శల్యుడు , శల్యుడి సేనాపతి పాండురాజుతో మాట్లాడే సందర్భం వస్తుంది. శల్యుడి ప్రక్కన సన్నగా ముచ్చటగా వున్న అతడి సేనాపతి పాండురాజు దృష్టిని ఆకర్షిస్తాడు. అది చూసి శల్యుడు , మనలో ఎవరు విజయం చేపట్టుతారో - అది యుద్ధం చేసైనా సరే , లేదా వివాహ బంధం తో నైనా సరే - తేల్చుకుందాం, అంటాడు. నిజానికి అతడి సేనాపతి అతడి చెల్లెలైన మాద్రి .  పాండురాజు సంతోషంతో మాద్రిని వివాహం చేసుకుంటాడు. దీన్ని బట్టి మనకు ,  ఆ కాలంలో మహిళలు కూడా - అందరు కాక పోయినా , కొందరైనా - యుద్ధ విద్యలను అభ్యసించే వారని తెలుస్తుంది . యిలా శల్యుడు పాండవులకు మేనమామ  అయిన వాడు ;

భారత యుద్ధానికి ముందు శల్యుడు , పాండవుల వైపు యుద్ధం చెయ్యాలని , సైన్యం తో సహా బయలుదేరుతాడు. కానీ, మార్గ మధ్యం లో దుర్యోధనుడు శల్యుడికి విందు భోజనం పెట్టి, పెట్టినది పాండవులే అని శల్యుడు అనుకుని , ఆ విందు పెట్టిన వారికి ఏ సహాయమైనా చేస్తానని శల్యుడు నుండి దుర్యోధనుడు కుయుక్తితో మాట తీసుకుని - ఆ తరువాత చెబుతాడు , ఆతిథ్యం యిచ్చింది , కౌరవులని , శల్యుడు వారివైపే వుండాలని . 

యిలా ఏదో చిన్న కారణానికి , శల్యుడు కౌరవుల వైపు యుద్ధం లో చేరిపోతాడు . ఇది దుర్యోధనుడి కుయుక్తి . అయితే , ఈ కుయుక్తిని కాస్త ఆలస్యంగా, కౌరవులకు మాట యిచ్చిన తరువాత,  తెలుసుకున్న శల్యుడు - మళ్ళీ ధర్మరాజు వద్దకు వెళ్లి తన విచారం వెలి బుచ్చుతాడు.  అప్పుడు ధర్మ రాజు, శ్రీకృష్ణుడు, కాస్త ఆలోచించి -  శల్యుడికి వొక సలహా యిస్తారు.  యుద్ధంలో, ఏదో వొక సమయంలో కర్ణుడు సేనాధిపతి అయిన తరుణంలో, శల్యుడు అతనికి సారథ్యం వహించ వలసిన పరిస్థితి వస్తుంది ; ఆ సమయంలో  శల్యుడు , తన మాటలతో కర్ణుడిని నిర్వీర్య పరచవలసినదిగా చెబుతారు. ఈ విధంగా , కర్ణుడికి శల్య సారథ్యం , దాని ఫలితంగా కర్ణుడి మరణానికి శ్రీకృష్ణుడి  సలహాతో యుద్ధానికి ఎంతో ముందే పునాది వెయ్యడం జరుగుతుంది. దుర్యోధనుడి కుయుక్తి అతనికే ఆపద తెచ్చిపెడుతుంది. 

మరి కృష్ణ సారథ్యం గురించి తెలుసుకోవాలిగా . యుద్ధానికి శ్రీకృష్ణుడి సహాయం అర్థించడానికి, అర్జునుడూ దుర్యోధనుడూ , యిద్దరూ దాదాపు ఏక కాలంలో వస్తారు.  వారు వచ్చిన సమయంలో శ్రీకృష్ణుడు నిద్రిస్తూ వున్నట్టు నటిస్తూ వుంటాడు . వచ్చిన దుర్యోధనుడు , కృష్ణుడి తలవైపున్న ఆసనం లో కూర్చుంటాడు . అదో అహంకారం - నేను మహారాజాధిరాజును, ఈ యాదవుడి కాళ్ళ దగ్గర కూర్చోవడమేమిటని.  అర్జునుడు కృష్ణుడి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు.  దుర్యోధనుడి మనసులో అహంకారం . అయినా అతడికి కృష్ణుడి సహాయం కావాలి, యుద్ధం లో. అర్జునుడి మనసులో కృష్ణుడి పట్ల స్నేహానుబంధం;మమతానుబంధం; భక్తిభావం; అన్నీ వున్నాయి.  అర్జునుడికి యెలాగైనా సరే, కృష్ణుడు కావాలి ; కేవలం యుద్దానికని కాదు . అది అతనికి కృష్ణుడితో వున్న జన్మ జన్మల అనుబంధం. అందుకని అతడికి కృష్ణుడే కావాలి.

కృష్ణుడు లేస్తాడు. లేచినట్టు నటిస్తాడు. జగన్నాటక కర్త గదా . లేచిన వెంటనే కాళ్ళ వద్ద నున్న ఆర్జునుడిని చూస్తాడు. కుశల ప్రశ్నలు వేస్తాడు. ఆ తరువాత దుర్యోధనుడినీ చూస్తాడు . అతనితోనూ మాట్లాడుతాడు. ఆ తరువాత అడుగుతాడు విషయం ఏమిటని. యిద్దరూ విషయం చెబుతారు. దుర్యోధనుడు చెబుతాడు - నేనే మొదట వచ్చాను, కాబట్టి , నువ్వు నాకే సహాయం చెయ్యాలని . కానీ, కృష్ణుడు అంటాడు - కానీ, నేను మొదట అర్జునుడి నే చూశాను; అతడినే అడిగాను విషయమేమిటని . అయినా, మీరిద్దరూ , నాకు కావాల్సిన వారే కదా . యిద్దరికీ సహాయం చెయ్యడం నా ధర్మం కదా . కాబట్టి, మీకు వొక నిర్ణయాధికారం యిస్తాను. నేను నిరాయుధుడిగా, అస్త్రం పట్టకుండా, వొకరి వైపు వుంటాను ; మరొకరి వైపు నాతో సమానమైన 10 వేల మంది యదు వీరులు, శస్త్రాస్త్రాలలో ప్రవీణులు , వారు యుద్ధం కూడా చేస్తారు. వారు మరొక వైపు వుంటారు . 

అయితే , మీయిద్దరిలో  చిన్న వాడు  అర్జునుడు గనుక - మొదట కోరుకునే అవకాశం అతడికే యిస్తున్నాను - అంటాడు .    

దుర్యోధనుడికి కోపం . శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి గనుక ఎలాగో యదు వీరులను వారికి యిచ్చి తాను  యుద్ధం చెయ్యకుండా తమ ప్రక్క కూర్చుంటాడేమో నన్న అనుమానం . 

కానీ , అర్జునుడి మనసులో శ్రీకృష్ణుడు తప్ప మరేమీ లేదు. ముల్లోకాలను యిచ్చినా అవేవీ వద్దు గాక వద్దు , కృష్ణుడే కావాలి అన్న మనో భావం వున్న వాడు . మరో అనుమానం , ఆలోచన ఏవీ లేకుండా, తాను కృష్ణుడినే  కోరుకుంటాడు .
కృష్ణుడు దుర్యోధనుడి వైపు చూస్తాడు . దుర్యోధనుడి మనసులో - ఈ అర్జునుడెంత మూర్ఖుడు , యుద్ధం చేసే పది వేల మంది వీరులను వదిలి పెట్టి, యుద్ధం చెయ్యని ఈ శ్రీకృష్ణుడిని ఎన్నుకున్న పరమ బుద్దిహీనుడు - అనుకుంటాడు . సంతోషంతో, పదివేల మంది యదు వీరులను వెంట బెట్టుకుని హస్తినాపురానికి వెళ్లి పోతాడు . 

యుద్ధం చెయ్యని ఆ శ్రీకృష్ణుడే - కౌరవుల అందరు సేనాపతుల మరణానికి ఏదో విధంగా కారణమవుతాడు . అనేక ఆపదల నుండి, పాండవులలో ప్రతి  వొక్కరినీ  రక్షించిన వాడూ అవుతాడు. అంతే కాదు. దుర్యోధనుడిపై  ఎంత ప్రీతిభావం వున్నా, కృష్ణుడి కి ఎదురు పక్షంలో యుద్ధం చెయ్యలేనని చెప్పి , తీర్థ యాత్రలకు బలరాముడు వెళ్లి పోవడానికి కారణం అవుతాడు.

భీష్మ,ద్రోణ, కర్ణుల శస్త్రాస్త్రాల నుండి, అన్ని రకాలుగా అర్జునుడి రక్షణకు చివరి వరకు తానే కారణం గా - శ్రీకృష్ణుడు  నిలుస్తాడు.

అన్నిటినీ మించి , అర్జునుడి మనసులో విషాద భావం బలంగా నాటుకుని వున్న సమయంలో - అర్జునుడికీ , అర్జునుడి పతాకం లో వున్న తన మరో భక్తుడు హనుమంతుడికీ - సంజయుడి ద్వారా, వ్యాసుడి ద్వారా మనకూ-  భగవద్ గీత లాంటి అత్యున్నతమైన వొక సైన్స్ ను బోధిస్తాడు శ్రీకృష్ణుడు . అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగే ప్రశ్నలే - మన జీవితాలలో , మనం ఎదుర్కొనే ప్రశ్నలు . అన్నిటికీ , శ్రీకృష్ణుడు  సశాస్త్రీయమైన సమాధానాలు యిస్తాడు . 

గీత అనే ఆ సైన్స్ ను అర్థం చేసుకున్న వారి జీవితాలలో - విషాదానికి చోటు లేదు . ఆనందానికి అలవి లేదు . జ్ఞానానికి అంతు లేదు . సంపూర్ణ ఆరోగ్యానికి మూల సూత్రాలు అన్నీ గీతలో వున్నాయి.  ఆనంద మయ జీవితానికి మూల సూత్రాలు యిందులో వున్నాయి. విజయానికి కావలసిన  అన్ని మెట్లూ యిందులో వున్నాయి. గీతను A  to Z  ఆఫ్ లైఫ్  అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. శ్రీకృష్ణుడు  అర్జునుడికి ఏదో మతం గురించి బోధించనే లేదు. విజ్ఞానము, జ్ఞానము - అదీ జీవితానికి వొక్కొక్క నిముషమూ వుపయోగపడేవి చెప్పాడు . ఎన్నో రకాల కిటుకులూ , టెక్నిక్స్  చెప్పి - యిందులో నీకేది కావాలో అది నిర్ణయించుకో అన్నాడు. శ్రీకృష్ణుడు అహింస బోధించ లేదు. యుద్ధం ఎందుకు, ఎవరితో, ఎప్పుడు , ఎలా చెయ్యాలో చెప్పాడు .  ఏది ఎలా ధర్మం అవుతుందో చెప్పాడు . మనిషి గుణాలు ఏవి , అవి ఎలా వస్తాయి, ఏది ఎప్పుడు వుంటే మేలు - శ్రేష్టమైనది ఏది - అది ఎలా అలవరచుకోవడం - యివన్నీ గీతలో వున్నాయి . ఈనాటి మనస్తత్వ శాస్త్రానికి ఏమీ తెలీని , గొప్ప మనస్తత్వ శాస్త్రం గీతలో వుంది . ఈ నాటి ఆరోగ్య శాస్త్రానికి తెలీని ఎన్నో ఆరోగ్య సూత్రాలు గీతలో వున్నాయి . కాకపొతే , గీతను బట్టీ పెట్టడం ముఖ్యం కాదు. అది తప్పని కాదు. అది మంచిదే . కానీ అంత కంటే ముఖ్యం - అందులోని అంతరార్థం బాగా ఆకళించుకోవడం , పాటించడం .

వొక అర్జునుడు తనకు పది వేల మంది యదు వీరులు వద్దు - శ్రీకృష్ణుడే కావాలి - అని కోరుకుంటే ,   ఎంత మేలు జరిగింది - అర్జునుడికీ , పాండవులకూ , మనకూ .

మరి మీరేం కోరుకుంటూ వున్నారు ? మీకేం కావాలి ?

యదు వీరులు అంటే -  మనం మరొకరితో  శత్రుత్వం పెంచుకుని ,కొట్లాడి , యుద్ధం చేసి,  సంపాదించాలనుకునే    విజయం . అక్కడ విజయం రావచ్చు; రాక పోవచ్చు . విజయం వచ్చినా , అందులో వచ్చే సంతోషం చాలా తక్కువ ; అది ఎక్కువ కాలం నిలువదు కూడా .

శ్రీకృష్ణుడు అంటే - మనం మొదట - మన బలహీనతల పైన యుద్ధం చేసి విజయం సంపాదించడం . ఇది సాధిస్తే  - మిగత ప్రపంచం పై విజయం సంపాదించడం ఎంత సులభమో గ్రహించడం.  ఈ విజయం, దీని ద్వారా వచ్చే ఆనందం నిరంతరం , మహోన్నతం అని గ్రహించడం , దీన్ని అనుభవించడం. దీన్లో ప్రాపంచిక విజయమూ వుంది; పారమార్థిక విజయమూ  వుంది .

యడువీరులు అంటే - పరిమాణం ; సంఖ్య ; ఆంగ్లం లో క్వాంటిటీ  అనవచ్చు . శ్రీకృష్ణుడు అంటే - ఉత్తమత్వం ; వుపయోగత్వం ; ఆంగ్లం లో క్వాలిటీ - అనవచ్చు . మరి , మీకేది కావాలి?

సర్వే  జనాః సుఖినో భవంతు

= మీ

వుప్పలధడియం విజయమోహన్

( ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ - బ్రాండ్ ఈక్విటీ  సెక్షన్ లో " సేనను కాదు ; కృష్ణుడిని ఎన్నుకోండి ; క్వాంటిటీ  కాదు; క్వాలిటీ ఎన్నుకోండి " అన్న వొక  హెడింగ్ చూసిన సందర్భంగా రాయడం జరిగింది. కానీ ఆ  వ్యాసానికీ, ఈ వ్యాసానికీ మరే సంబంధం లేదు . )

14, మార్చి 2014, శుక్రవారం

కుక్క / పిచ్చి కుక్క కరిస్తే - ఏమి ప్రమాదం ? ఏమి చెయ్యాలి ? ఎంత త్వరగా?

కుక్క / పిచ్చి కుక్క కరిస్తే 
ఏమి ప్రమాదం ? ఏమి చెయ్యాలి ? ఎంత త్వరగా?


జీవితంలో  ఎన్నో మలుపులుంటాయి . జీవితంలో సంతోషం తెచ్చే మలుపులు కొన్ని అయితే , భయానకం చేసేవి కొన్ని ; దుఃఖకరమైనవి మరి కొన్ని ; అనూహ్యమైన మలుపులు కూడా ఎన్నో, ఎన్నెన్నో . 

మన  కళ్ళ ఎదురుగా, ఎంతో  మంది జీవితాలలో ఇలాంటివి జరగడం - మనం అయ్యో; అయ్యో పాపం - యిలా అనుకోవడం  జరుగుతూనే వుంటుంది . కానీ - మన జీవితాలలోనే జరిగితే - మనం ఏం అనుకుంటాం ? ఎలా ప్రతిస్పందిస్తాం ?

రక రకాలుగా స్పందిస్తాం . కొన్ని  ఏళ్ల  క్రితం, మాకు తెలిసిన వొకమ్మాయి కి పెళ్లై అత్తగారింటికి వెళ్ళింది. మొదటి రోజే ఆమె భర్త పిచ్చికుక్క కాటు వల్ల "హైడ్రోఫోబియా " వచ్చి చనిపోయాడు.  పెళ్లి కి కొద్ది రోజుల ముందే పిచ్చి కుక్క కరిచిందట . కానీ, దాన్ని  వారు పట్టించుకోలేదు . ఏదో, ఆంటీ బయోటిక్స్ వేసుకున్నాడు. తరువాత మరిచిపోయారు . ఆ తరువాత పెళ్ళయ్యింది. పెళ్లి కూతురుతో సహా వారి ఊరుకు వెళ్ళారు . వెళ్ళిన కొన్ని ఘంటల  లోనే - కుక్క కాటు ప్రభావం పని చేసి - చనిపొయ్యాడు. అతడు చనిపోయిన విధానాన్ని గురించి చిలవలు పలవలుగా అప్పట్లో వర్ణించే వారు .

కొద్ది రోజుల క్రితం మద్రాసు క్రిస్టియన్ కాలేజీ లో - యిద్దరు విద్యార్థులు , కాలేజీ ఆవరణ లోని చిన్న కుక్క పిల్లలతో ఆడుకుంటూ  వుండగా, అవి వారిని కరిచింది; వో రెండు రోజుల్లో ఆ విద్యార్థులకు హైడ్రోఫోబియా వచ్చి చని పోయారు . కరిచిన వెంటనే , సరైన వాక్సీను వేసుకుని వుంటే , వారి బ్రతికే వారే . అంతే కాదు; ఆ కాలేజీ ఆవరణ లో ఈ మధ్య కుక్కల సమూహం చాలా ఎక్కువగా పెరిగిందట.  అది చూసి సరైన చర్యలు తీసుకున్న వారు లేరు . యిటువంటి అసమర్థత , మూర్ఖత్వం మన దేశం లో చాలా ఎక్కువ .

పిచ్చి కుక్క కరిస్తే - యింత భయంకరంగా పని చేస్తుందా - మనుషులు యిలా చనిపోతారా - అని నాకూ చాలా ఆశ్చర్యంగా వుండేది. అయితే - దానికి ఏం చెయ్యాలో, నాకూ వొకప్పుడు తెలీదు . చాలా మందికి యిప్పటికీ తెలీదు. మన సమాజంలో , మన విద్యా విధానంలో , యిదొక పెద్ద లోపం . అతి పెద్ద దురదృష్టం . 

ఎప్పుడో చనిపోయిన మొగలాయీ వంశం, ఆంగ్ల వైస్ రాయ్ లు - లాంటి వారిని గురించి అంతా చదువుతాం . కాని మన వూర్లో , మన వీధిలో పోతున్న కుక్క మనల్ని కరిస్తే - ఏం చెయ్యాలో - వూర్లో 90 శాతం మందికి తెలీదు.   చాలా ఊళ్లలో పిచ్చి కుక్క కాటుకు వెయ్య వలసిన మందులూ లేవు .

చాలా మందికి కుక్కలంటే అమితమైన ప్రేమ. కుక్కలకు కూడా తమ యజమానులైన మనుషులపై అమితమైన విశ్వాసము. నిజానికి కుక్కలకున్నంత విశ్వాసము, ప్రేమ మరే జంతువుకూ వుండడం మనం చూడలేము . అది మంచిదే. కానీ, యింట్లో పెంచే కుక్కలకు కూడా, అప్పుడప్పుడూ ఆంటీ రాబీస్ వాక్సిన్ వేస్తూ వుండాలి. అలా చేస్తే వాటి వల్ల, మనకు ప్రమాదం లేదు. అలా వాక్సిన్ వేయించకుంటే వాటికీ ప్రమాదమే. వాటి వల్ల మనకూ ప్రమాదమే.  వాటికి రాబీస్ రోగం వచ్చిందంటే, అవీ చావడం ఖాయం; వాటివలన మనయిళ్ళలో , వొకరో, ఇద్దరో చావడం కూడా అంతే ఖాయం .

యిక వూరికుక్కలైతే , వాటికి ఎప్పుడు రాబీస్ వస్తుందో చెప్పలేము . ఎప్పుడైనా రావచ్చు ; ఎన్నో కారణాల వల్ల  రావచ్చు . రాబీస్ వస్తే , ఆ కుక్క కనిపించిన  మనిషినల్లా కొరకడానికి ప్రయత్నించడం మనం చూడవచ్చు . యిది ఎన్నో వూళ్ళలో జరిగింది . యికముందూ జరుగుతుంది . నిజానికి ప్రపంచ దేశాలన్నింటిలో ఈ రాబీస్ మరణాలు మన దేశం లోనే చాలా ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. వూరకుక్కల్ని చంపరాదని మనం చట్టం కూడా చేసుకున్నామని వికీ పేడియా వెబ్ సైట్ చెబుతో వుంది . వూరకుక్కల్ని చంపరాదు సరే ;వాటికి రాబీస్ రాకుండా చేసే చట్టాలేవీ మనం చేసుకోలేదు . అసలు అటువంటి ప్రయత్నాలే మన దేశంలో లేవు . యిదొక పెద్ద మూర్ఖత్వం .

చాలా దేశాలలో అసలు రాబీస్ అనే రోగమే లేదు, రాదు . మరి మన దేశంలో యింత ఎక్కువగా ఎందుకు వుంది? కొన్ని కొన్ని ఊర్లలో, వూరకుక్కలు మనుషుల కంటే  ఎక్కువ సంఖ్యలో వున్నాయి . రాత్రి పూట ఎవరూ మరో  వీధికి కూడా వెళ్ళలేని పరిస్థితి చాలా ఊళ్లలో వుంది .  అయినా అక్కడి ప్రభుత్వ యంత్రాంగం ఇవేవీ పట్టించుకునే  పరిస్థితి లేదు . పంచాయితీ పాలన అంటామే కానీ - అది చాలా దరిద్రం గానూ, అసమర్థంగానూ వుంది.  పూర్తి  లంచ గొండి తనం తో నిండి వుంది.  మన ప్రభుత్వ విధానాలు కూడా చాలా అసమర్థంగా వున్నాయి .

అమెరికా , చైనా లాంటి దేశాలలో - యిప్పుడు రాబీస్ ప్రమాదం చాలా తక్కువ . ముందు చెప్పినట్టు - కొన్ని దేశాలలో అసలు లేనే లేదు . మన దేశంలోనే చాలా ఎక్కువ గా వుంది . భూత దయఅంటే యిటువంటి మూర్ఖత్వం అని కాదు అర్థం . చైనా లోని బీజింగ్ లో యింటికి  వొక   కుక్కకు  పైగా పెంచ రాదని; అది కూడా, 14 ఇంచీలు (35. 5సెం. మీ) కంటే పెద్దవిగానూ వుండకూడదు ;భయం కొలిపేది గానూ వుండకూడదు -అని చట్టం కూడా చేశారట. యిది కూడా రాబీస్ రోగం రాకుండా నివారించడం కోసమే .

రాబీస్ రోగం రాకుండా, ముందే వేసుకునే వాక్సీన్ వుంది కాని, వచ్చింతరువాత దాన్ని పోగొట్టే మందే  లేదు ; మరణం ఖాయం . రాబీస్ వచ్చిన కుక్క ఎంత మంది మనుషుల్ని కరుస్తుందో చెప్ప లేము . ఎంత మంది నైనా కరవ వచ్చు . దానికి చూసిన వారినందిరినీ కరవాలని అనిపిస్తుంది. కరుస్తూ పొతుంది. కరచిన వారందిరికీ రాబీస్ వచ్చే ప్రమాదం వుంది - వారు వెనువెంటనే  వాక్సీన్ వేసుకోక పొతే. 

మన రాష్ట్రం గురించి , ఎన్నో ఊర్లలో ఈ పిచ్చి కుక్కల స్వైర విహారం గురించి, రాబీస్ వచ్చిన వారి గురించి వార్తలు - అప్పుడప్పుడూ వస్తూనే వున్నాయి.  అయినా - రాష్ట్ర ప్రభుత్వం గానీ, పంచాయితీలు గానీ ఈ కుక్కలను అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నమే చెయ్యడం లేదు . దీనికి తోడు , బ్లూ క్రాస్  వారి గొడవ పెద్దది . చస్తున్న మనుషుల గురించి వారికి అస్సలు పట్టదు. కుక్కలకు పిచ్చి పట్టడం గురించి కూడా వారికి బాధ లేదు . కానీ కుక్కలను యెవరు ఏం చేసేస్తారో - అన్నది మాత్రమే బాధ.

మనుషుల క్షేమం మొదట - కుక్కల క్షేమం తరువాత గా వుంటే తప్ప దేశం  బాగుపడదు . మన ప్రభుత్వాలు చేసిన పనికి మాలిన చట్టాలు చాలావి యిలాగే వున్నాయి .

కుక్కల సంఖ్య , ముఖ్యంగా  ఊరకుక్కల సంఖ్య గణనీయంగా తగ్గాలి . వాటికి కుటుంబ నియంత్రణ పథకాలు వున్నాయి  కాని అమలు చేసే ప్రభుత్వ యంత్రాంగం సరిగ్గా లేదు . ప్రతి జిల్లా కలెక్టరూ వొక్క వారం రోజులు , పోలీసు, పంచాయితీ, బ్లూ క్రాస్ - యిలా అన్ని విభాగాలనూ కూడదీసి , కుక్కల కుటుంబ నియంత్రణ 100 శాతం చేయిస్తే తప్ప , ఊరకుక్కల బెడద తగ్గదు . రాబీస్ ప్రమాదం వుండనే వుంటుంది .

అలాగే , మన స్కూళ్ళలో , కుక్కలు కరిస్తే - వెంటనే ఏం చెయ్యాలో చెప్పే వొక పాఠం తప్పకుండా  వుండి తీరాలి . కుక్కలను పెంచాలంటే , ఎలాంటి నియమాలు పాటించాలో తెలియాలి .

 నన్ను కూడా ఆరేళ్ళ క్రితం వొక పిచ్చి కుక్క , వెనుక నుండి వచ్చి,  కరిచింది . నన్ను కరిచిన కుక్క మళ్ళీ యింకెంతో మందిని కూడా కరిచిందట.  ఆ తరువాత , దాన్ని ఎవరో చంపేశారట.   నేను మాత్రం - వెంటనే , 5 నిమిషాల లోపే , నాకు తెలిసిన వొక డాక్టరుకు ఫోను చేశాను . ఆమె సలహా ప్రకారం , వెంటనే, కుక్క కరిచిన శరీర భాగాన్ని సోపు తో కడిగి, వేగంగా వెళ్ళే నీళ్ళలో మరింత బాగా కడిగాను. అక్కడున్న కుక్క నోటి లోని సలైవా వీలైనంత పూర్తిగా పోవాలి. అది మొదట చెయ్య వలసిన పని . వెనువెంటనే, దగ్గరున్న డాక్టరు దగ్గరికి వెళ్లి ఆంటీ రాబీస్ వాక్సీన్ ఇంజెక్షన్ చేయించుకున్నాను . ఆ తరువాత , మరో నాలుగు ఇంజెక్షన్లు డాక్టర్ చెప్పిన రోజులలో - వేయించుకున్నాను. మనం చెయ్యాల్సింది యింతే . యిది చేస్తే, మరిక భయం లేదు .

కానీ, యిది చెయ్యకపోతే - కొన్ని రోజులలోగానే రాబీస్ రావచ్చు . లేదా, కొన్ని మాసాలలో రావచ్చు . వొక్క సారి  రాబీస్ లక్షణాలు వస్తే, మళ్ళీ మందే లేదు.  వొక్కో సారి మనం మంచ్జ్హి కుక్క అనుకునేది , రాబీస్ కుక్కగా వుండవచ్చు . కాబట్టి, కుక్క కాటు ఏ  మాత్రమూ అశ్రద్ధ చెయ్య తగనిది .  పైన చెప్పిన వైద్యం వెనువెంటనే  చెయ్యాలి . నాకు ఆయుర్వేదమంటే , చాలా యిష్టం . చాలా విషయాలకు ఆయుర్వేద మందులే వాడతాను . అయినా కుక్క కాటుకు మాత్రం - ఆంటీ రాబీస్ వాక్సీన్  తప్పని సరి . 

మీ వూళ్ళో ఊరకుక్కలు ఎక్కువగావుంటే - వెంటనే పంచాయితీ వారికో , కలెక్టరు గారికో రిపోర్ట్ చెయ్యండి.  వారిద్వారా , వాటి పెరుగుదలనూ అరికట్టాలి ;  వీలైతే , వాటిని, వూరికి దూరంగా వదిలి వేసే  ఏర్పాటూ చెయ్యాలి . ఏదైనా కుక్క అందరినీ కరవాలని  చూస్తుంటే - దానికి పిచ్చెక్కిందనే అనుకోవాలి . అది ఎవరినీ కరవనీకుండా జాగ్రత్త పడాలి.  అది కరిచిన వారూ, బరికిన వారూ - అందరూ ఇంజెక్షన్లు వేసుకుని తీరాలి .  ప్రతి వూర్లోనూ , గ్రామంలోనూ , ఈ వాక్సీన్ వుండి తీరాలి. యిది కరిచిన వెంటనే , వేసుకుంటే  చాలా మంచిది . ఎంత త్వర పడితే - అంత మేలు . అందుకని, మీరున్న ఊళ్లోనే వాక్సీను వుండి తీరాలి - మీకు అందుబాటులో వున్న డాక్టరు గారి దగ్గర వుండాలి . ముఖ్యమైంది - యిది అందరికీ తెలిసుండాలి .

ఇదండీ సంగతి . ప్రతి వారం చదువుతున్న రాబీస్ చావులను చూస్తూ వుంటే; చదువుకున్న వారు కూడా చేస్తున్న నిర్లక్ష్యం , దాని ఫలితాలు  చూస్తూ వుంటే - యిది తప్పక రాయాలనిపించింది .   మీకు తెలిసిన వారికి తప్పక చెప్పండి .

సర్వే  జనాః సుఖినో భవంతు .

= మీ

వుప్పలధడియం విజయమోహన్

 

4, మార్చి 2014, మంగళవారం

కొత్త రాష్ట్రం ఏది ? తెలంగాణానా -సీమాంధ్రానా ? కె సి ఆర్ ను నమ్మితే...దేన్లో మునిగినట్టు ? కాంగ్రెస్ వారే చెప్పాలి .


కొత్త రాష్ట్రం ఏది ?
తెలంగాణానా -సీమాంధ్రానా 
క్రొత్త రాష్ట్రానికి ఏం కావాలి ?

ఇదీ ప్రశ్న . ఇదివరకెప్పుడూ ఇలాంటి ప్రశ్న , ఏ రాష్ట్ర విభజనలోనూ రాలేదు. వుత్తరాఖాండ్ , ఝార్ఖండ్, ఛత్తీస్ గర్హ్  లాంటి రాష్ట్రాలన్నీ కొత్త రాష్ట్రాలుగా ఆవిర్భవించిన సందర్భంలో - ఈ ప్రశ్నే లేదు. కానీ యిప్పుడొచ్చింది. హైదరాబాద్  కూడా, కర్నూలు, విజయవాడ, విశాఖ  లా వుండి  వుంటే , ఇలాంటి ప్రశ్న వచ్చేది కాదు.  వాళ్ళకూ మనకూ,  ఎందు వల్లనో పొసగ లేదు . పొతే పోనీ . వేరు కుంపటి పెట్టుకుంటే - మనకూ , వారికీ కూడా మేలే - అన్న విధంగా లేదాయె . 

మనం  హైదరాబాదులో రాజధాని పెట్టుకున్నాం. వొక్కటి మాత్రం వొప్పుకుని తీరాల్సిందే . NT రామారావు ముఖ్యమంత్రి  కాకముందు , హైదరాబాదు లో తెలుగు వాతావరణం శూన్యం . ఎక్కడికి వెళ్ళినా , తెలుగు తెలిసిన వారు కూడా - ఉర్దూ లో మాట్లాడే వారు. మరి పట్టణం లో ఏ విధమైన  అభివృద్ధీ  కనిపించేది  కాదు . నిజాముల భవనాలు తప్ప - మిగతా ముస్లిముల యిండ్లు కూడా కూప గృహాలుగా  దర్శనమిచ్చేవి. రామారావు గారు వచ్చిన తరువాతే , నిజంగా అభివృద్ధి ప్రారంభమయ్యింది .  ఆ తరువాతే - అక్కడ కాస్తో కూస్తో తెలుగు మాట్లాడడం కూడా ప్రారంభమయ్యింది . ఆ తరువాత, IT రంగం కానియ్యండి, ఫార్మా రంగం కానియ్యండి - చాలా శీఘ్రంగా అభివృద్ధి  కావడానికి రామారావు గారు , ఆ తరువాత చంద్ర బాబు గారు  కారణం గా నిలిచారు .

ఆ తరువాత మళ్ళీ - కాంగ్రెసు వారి ప్రభుత్వాలు రావడం - క్రమక్రమంగా వున్న విద్యుత్తు  పోయి , కొరతగా మారి  అన్ని రంగాలకు కరెంటు లేదనే స్థితికి వచ్చేసింది . ఆ తరువాత మళ్ళీ - మన రాష్ట్రానికి - హైదరాబాదుకు కూడా -  . క్రొత్త కంపెనీలు రావడం తగ్గి, యిప్పుడు దాదాపు రావడం మానేశాయి . దీనికి కారణం సగం కాంగ్రెస్ ప్రభుత్వాల అసమర్థత, లంచగొండి తనం కాగా, మిగతా సగం, గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి "మధురవాక్కులకు " బెదిరిపోయిన పారిశ్రామిక వేత్తలు  కారణం .

అయితే రామారావు గారు, చంద్రబాబు గారు , మిగతా ముఖ్యమంత్రులు కూడా - చేసిన అతి పెద్ద తప్పు - చెయ్యవలసిన అభివృద్ధిలో సగానికి పైగా , హైదరాబాదు లో మాత్రమే  కేంద్రీకరించడం , దాన్ని మాత్రమే అభివృద్ధి చెయ్యడం .  మిగతా నగరాలేవీ కావలసినంతగా అభివృద్ధి చెంద లేదనే చెప్పాలి . అయినా - ఆంధ్రా ప్రజలు తెలంగాణా కు ఏదో అన్యాయం చేసినట్టుగా చిత్రీకరించడం జరిగింది . అందుకు కారణం కే సీ ఆర్ మాత్రమే కాదు . అసమర్థమైన కాంగ్రెస్ నాయకత్వం. వారికి - వారి వారికి కావాల్సిన సొత్తుల సేకరణ తప్ప మరేదీ పెద్దగా పట్ట లేదు. అందుకే వచ్చింది తెలంగాణా వుద్యమం .

తమిళనాడులో చూస్తే - కోయంబత్తూరు లో వున్నన్ని కంపెనీలు - చెన్నై లో కూడా లేవు . ఇప్పుడు  IT  కంపెనీలు కూడా కోయంబత్తూరు లో చాలా వచ్చాయి . వస్తున్నాయి . మనం ఎందుకలా చెయ్యడం లేదు ? - అంటే తమిళనాడు లో ఎలా వుంటే అలా చెయ్యాలని కాదు . రాష్ట్రము లోని ప్రతి ప్రాంతమూ వీలైనంత సమంగా అభివృద్ధి చెందాలి కదా.


ఈ కేంద్రీకరణలో - ఉత్త ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే కాదు; ఉత్త కంపెనీలు మాత్రం కాదు - మన ఆర్టిస్టులు, రచయితలు, మేధావులు కూడా హైదరాబాదు కు వెళ్లి - అక్కడే స్థిరపడి పోయారు. యిప్పుడు వారందరూ మా వాళ్ళు కాదు - అనే విధంగా , దేశంలో మరెక్కడా జరగని విధంగా మనకు క్రొత్త రాష్ట్రం ఏర్పడుతూ వుంది. రామారావు గారు , వున్నప్పుడు తెలంగాణా ప్రజలు కూడా ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఆ తరువాత, చంద్రబాబు గారికి కూడా అన్ని ప్రాంతాల ఆదరమూ లభించింది . ఎప్పుడైతే - ఘనతవహించిన  YSR  గారు - అన్ని రకాల భూ ఆక్రమణలను , లంచగొండి తనాన్ని ప్రోత్సహించారో, అన్ని రకాల కుల, మత రాజకీయాలను ప్రోత్సహించారో, - అప్పటి నుండే , KCR గారికి అక్కడి ప్రజలు పట్టం గట్టడం ప్రారంభమయ్యింది .

అది, యిప్పుడు - విభజన కు దోహదం చేసింది . మధ్యలో వచ్చిన సమైక్యాంధ్ర వుద్యమం మంచిదే కానీ - దాని వెనుక నున్న నాయకత్వం సరి లేదు . సమైక్యాంధ్ర అంటే ఏమిటి ? ఏ వొక్కరైనా - తెలంగాణా ప్రాంతంలో కూడా తిరిగి , వారిని నమ్మించే ప్రయత్నం చేశారా ? లేదు కదా . మరి సమైక్యాంధ్ర ఎలా వస్తుంది ? సీమాంధ్ర లో బస్సులు నిలపడం, కార్లు నిలపడం, విద్యుత్తు నిలపడం, హాస్పిటళ్ళతో సహా, అంగళ్ళతో సహా, స్కూళ్ళతో సహా - అన్నింటినీ మూయించడం , పార్లమెంటులో గోల గోల చేసి మన పరువు తీయడం - యిది చేసారే  తప్ప - తెలంగాణా ప్రజలను నమ్మించడం  చెయ్య లేదు ; పార్లమెంటులోని - ఏ ముఖ్య పార్టీనీ నమ్మించ లేదు. కాస్తో కూస్తో ఈ ప్రయత్నం చేసింది వొక్క చంద్ర బాబు మాత్రమే . మిగతా వారిలో - రాబోయే రాష్ట్రానికి కాబోయే ముఖ్య మంత్రిని నేనే కావాలి - అన్న ఆత్రుత వొక్కటే నాకు కనిపించింది. యిప్పుడు తెలంగాణా వచ్చేసినట్టే . అది  పోనీయండి . జరిగే ప్రతి కార్యం, జరిగే ప్రతి విపత్తు కూడా - మనకొక క్రొత్త అవకాశాన్నిస్తుంది.  అదే ప్రకృతి నియమం . దాన్ని మనం వుపయోగించుకుంటామా - అన్నదే యిప్పుడు ముఖ్యం .  


యిప్పుడు సీమాంధ్ర ప్రజలు కొత్త రాజధాని నిర్మించుకోవాలి . కొత్తగా పరిశ్రమలను ఆకర్షించాలి . కొత్త, అత్యున్నత విద్యాలయాలను ఆకర్షించాలి. నదులలోని నీరు శ్రీకాకుళం నుండి చిత్తూర్ జిల్లా వరకు అన్ని ప్రాంతాలకూ తీసుకు రావాలి. సినిమా , ఫార్మా, ఐ టీ రంగాలకు కావలసిన ప్రోత్సాహాన్ని, సదుపాయాలను కలుగజెయ్యాలి . యివన్నీ చెయ్యాలంటే - స్వార్థ రహిత నాయకులకే పట్టం కట్టాలి . లంచగొండి తనం తో , కుల మత రాజకీయాలతో, ఫాక్షన్ రాజకీయాలతో పైకొచ్చిన వారిని ప్రక్కన బెట్టాలి . మంచి నాయకులైన జే పీ లాంటి వారిని - యిటు వైపుకు ఆకర్షించాలి .

కానీ, యిప్పుడు జరుగుతున్నదేమిటి ? ఎవరు అవినీతికి పేరు మోశారో , వారికే ఆంధ్ర ప్రజలు పట్టం కట్ట బెడతారేమో అన్న అనుమానం వస్తూ వుంది .

అది వొక  ప్రక్క వుండనిస్తే , మన క్రొత్త రాజధాని ఎక్కడ వుండాలన్నది - పనికి మాలిన స్వార్థాలలో, రాజకీయాలలో చిక్కుకుంటూ   వుంది . మా గ్రామంలో  పెడితే బాగుండు - మా గ్రామంలోనే పెట్టాలి - అనే విధంగా మన (వి)నాయకులు ఘోషిస్తూ వున్నారు .

రాజధాని కనీసం 50 చ కి మీ  విస్తీర్ణం అయినా వుండాలి . వీలైనంతగా రాష్ట్రానికి మధ్యలో వుండాలి . కనీసం వొక ఇంటర్నేషనల్  ఎయిర్పోర్ట్ కు వీలైనంత దగ్గరగా వుండాలి . మనకు వున్న పెద్ద నేషనల్ రహదారికి వీలైనంత సమీపంగా వుండాలి . మంచినీటి వసతి వుండాలి; లేదా, కృష్ణ, గోదావరులనుండి నీరు తీసుకురావడానికి అనుకూలంగా వుండాలి.  IT పరిశ్రమకు అనుకూలంగా వుండాలి . ఫార్మా పరిశ్రమకు అనుకూలంగా వుండాలి .

మనమే వొక ఇంటర్నేషనల్  ఎయిర్పోర్ట్ కట్టుకునే వరకు - చెన్నై ఎయిర్పోర్ట్ ను వాడుకోవడంలో తప్పు లేదు. మళ్ళీ, మళ్ళీ హైదరాబాదు ను, అక్కడి ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చెయ్యడం మన మూర్ఖత్వమే అవుతుంది . కానీ వొక ఇంటర్నేషనల్  ఎయిర్పోర్ట్ మనం కట్టుకునే లాగా సరిపడేటంత  స్థలం యిప్పుడే వుంచుకోవాలి. వొక చిన్న ఎయిర్పోర్ట్ వెంటనే కట్టుకోవాలి కూడా.  చెన్నై - కలకత్తా నేషనల్ రహదారికి వీలైనంత సమీపంలో వుండాలి . చిత్తూరుకు, శ్రీకాకుళానికి రెంటికీ అందుబాటులో వుండాలి - అవే రాష్ట్రానికి ఎల్లలు గనుక. 

గుజరాత్ కూడా అహమదాబాద్ నే పెట్టుకోలేదు . గాంధీనగర్ ను కట్టుకున్నారు. సీమాంధ్ర  కూడా అలాంటి క్రొత్త నగరాన్నే నిర్మించుకోవాలి. అక్కడ స్థలాలను ఆక్రమణ దారుల స్వంతం చెయ్యకూడదు . వొక్కొక్క స్థలాన్నీ - వొక్కొక్క నిర్ణీత పథకానికి కేటాయించాలి . యిళ్ళ  స్థలాలను , సరైన ధరకు సరైన వాళ్లకు అమ్మాలి . అక్కడ వుండాల్సిన ప్రభుత్వోద్యోగులకు - యిళ్ళ స్థలాలను కేటాయించాలి . ఎన్ని క్వార్టర్స్  కావాలో - అన్ని కట్టడానికి స్థలం పెట్టుకోవాలి. నా ఉద్దేశంలో - యివన్నీ నెల్లూరుకు దగ్గరగా , నేషనల్ రహదారికి సమీపంగా, కనీసం 50 చ కి మీ ఖాళీ స్థలం నిర్దేశించి, ఏదైనా ప్రఖ్యాతి చెందిన అంతర్జాతీయ సంస్థకు - ఆ పని వొప్పగిస్తే , బాగుంటుంది - అనిపిస్తుంది .

యిది ఎవరు చెయ్యగలరు ? నా ఉద్దేశంలో - చంద్రబాబు గారు , జే పీ  గారు - మోడీ గారితో కలిస్తే - కలిసి ప్రభుత్వం నెలకొల్పితే - చాలా సులభంగా సాధ్యమవుతుంది . చాలా బాగా సాధ్యమవుతుంది . నాకు మిగతా వారిపై నమ్మకం లేదు . లంచగొండి తనానికి పేరు మోసిన కాంగ్రెస్ వారిపై అసలు నమ్మకం లేదు . అది ఏ కాంగ్రెసైనా  సరే .

ఆలోచించండి మరి . యిందులో మళ్ళీ, కొట్లాటలకు , ఉద్యమాలకు తావు లేదు . వుండకూడదు .

సరే . కెసిఆర్ గారితో కలిస్తే  ఏమవుతుందో కాంగ్రెస్ వారికి ఈ రోజు తెలిసొచ్చింది. తెలంగాణా యివ్వండి - మా పార్టీని మీ పార్టీ లో విలీనం చేసేస్తానన్న పెద్ద మనిషి - తెలంగాణాను కాంగ్రెసు వారు చాలా కష్ట పడి యిచ్చేశాక - యిప్పుడిక విలీనం ప్రసక్తే లేదంటున్నారు .

కాంగ్రెసుకు యిది కావాల్సిందే . కె సి ఆర్ గారిని నమ్మకండి - అని ఎందరో రాసారు; ఎన్నో రకాలుగా చెప్పారు. ఆయన నోరు తెరిస్తే బూతులు, అబద్ధాలు తప్ప  వేరే రావాయె .   దేశాన్ని నట్టేట్లో దింపిన కాంగ్రెసును,  కె సి ఆర్ గారు ఈ రోజు నట్టేట్లో దింపారు. అయినా పిచ్చి గాకపోతే - కె సి ఆర్ ను నమ్మితే , కాంగ్రెసుకే కాదు, తెలంగాణా ప్రజలకూ చివరికి అదే అవుతుంది కదా. కానీ వారు బాగుండాలి; వారు మంచి నాయకులను ఎన్నుకుంటారని ఆశిద్దాం. అలాగే - దేశమంతటా , నమ్మకం కోల్పోయిన కాంగ్రెసుకు , అది పాత కాంగ్రెసైనా, క్రొత్త కాంగ్రెసైనా, ఏదైనా  సరే - దాన్నే మళ్ళీ నమ్మితే - దానికే మళ్ళీ వోటేస్తే  - కే సి ఆర్ ను నమ్మినట్టే వుంటుంది  మన గతీ . 

అయితే - కొంత మంది మారొచ్చు . మారిన నాయకులు మంచి దార్లో నడుస్తారా అన్నది  చూడాలి. వారి పాత చరిత్ర చూడాలి . స్వార్థ రాజకీయాలు, కుల మత  రాజకీయాలు, నేర చరిత్ర, లంచగొండి తనం ,గూండా చరిత్ర లాంటివి లేని వారిని ఎవరినైనా ఆహ్వానించ వచ్చు . నిజానికి - అందరూ అలా మారాలి . అప్పుడే రాష్ట్రం బాగుంటుంది .

సర్వే  జనాః  సుఖినో భవంతు

= మీ

వుప్పలధడియం  విజయమోహన్




22, ఫిబ్రవరి 2014, శనివారం

నా సలహా ఏమిటంటే ... సలహాలు - ఎలా, ఎవరికి , ఎప్పుడు , ఎక్కడ - చెప్పాలో? చెప్పకూడదో ? తెలుసుకోండి . యిది సలహాల సైన్స్ - శ్రీకృష్ణుడి సలహా భగవద్ గీత


నా సలహా ఏమిటంటే ...


మనకు సలహా లివ్వడం పరిపాటి . అడిగిన వాడికీ , అడగని వాడికీ , దావన పోయ్యే  ప్రతి దానయ్యకూ, బస్సులోనో , ట్రైన్ లోనో ప్రక్కన కూర్చున్న వాడికీ,  వినే వాడికీ, వినని వాడికీ, ప్రొద్దు పోకుండా కూర్చున్న సోమరి వాడికీ - అందరికీ సలహాలిస్తాం . మరొకరు మనకిస్తే - వొక్కో సారి వింటాం . వొక్కో సారి వినం .  వాళ్ళూ అంతే .

సాధారణంగా సలహాలన్నీ ఉచిత సలహాలే . కానీ డాక్టర్ సలహా కావాలంటే , ఫీజు యిచ్చుకోవాలి . అలాగే , వొక మంచి లాయరు , చార్టర్డ్  అకౌంటెంట్ , స్టాక్ బ్రోకర్ లాంటి వాళ్ళ సలహాలకు కూడా ఫీజు యిచ్చుకోవాలి .

ప్రపంచంలో  బాగా పేరు మోసిన పాత సలహాదారు  శ్రీకృష్ణుడు .

ఆయన ఎప్పుడు సలహా యిచ్చాడు ? అర్జునుడు  తన గాండీవము , శస్త్రాస్త్రాలు - అన్నీ తీసుకుని దేవతలిచ్చిన దివ్య రథాన్నెక్కి , కౌరవులను అందరినీ చంపేస్తాను - అని బయల్దేరాడు . అతని సారథి సాక్షాత్తు శ్రీకృష్ణుడు . తీరా యుద్ధ భూమికి వచ్చి  - భీష్ముల వారిని , ద్రోణుల వారిని, కౌరవులను చూసే సరికి , అర్జునుడిలో  విషాదం పుట్టుకు వచ్చింది . నాకు ఎంతో యిష్టమైన తాత గారిని, గురువును, ఇతరులను చంపి వచ్చే  రాజ్యమూ , ఆ నెత్తుటి కూడు నాకక్కర లేదు - అని,  శస్త్రాస్త్రాలు అన్నీపారేసి, ఏడుపు మొహం పెట్టుకుని కూర్చున్నాడు . అప్పటికీ శ్రీ కృష్ణుడు  ఏమీ మాట్లాడ లేదు . దాదాపు వొకటిన్నర ఛాప్టరు " నేను యుద్ధం చెయ్యను . ఎందుకంటే ..."  అని ఎన్నో , ఎన్నెన్నో కారణాలు అర్జునుడు చెబుతూ వచ్చాడు . అన్నీ విన్న శ్రీకృష్ణుడు అప్పుడు కూడా ఏ గొప్ప సలహానూ యివ్వ లేదు. మొదట కాస్త మందలించాడు . నీకసలు బుద్ధుందా ? యుద్దానికొచ్చేసి ,  యిక్కడ శస్రాస్త్రాలు పారేసి,  పేడి లాగా  మాట్లాడుతున్నావా ?  నలుగురూ నవ్వి పోతారు  - అన్నాడే కానీ అప్పుడూ సలహా యివ్వ లేదు .

ఈ తిట్లు అర్జునుడిలో - ఎక్కడో - తను ఏదో తప్పు చేస్తున్నట్టే  వుంది - అన్న భావన కలిగించింది .

అప్పుడు అన్నాడు - కృష్ణా ! నేను నీ శిష్యుడిని . నీ దాసుడిని . నాకు నీవు తప్ప మరొకరు మంచి చెప్పే వారు , సక్రమ మార్గంలో పెట్టె వారు ఎవరూ లేరు. దయ చేసి - నాకు సరైన మార్గం చూపించు . నువ్వు చూపించే  మార్గం లోనే నేను నీ వెనుకే వస్తాను. మామేకం శరణం మమ అని పూర్తిగా కృష్ణుడి ముందు దాసోహం  అనేశాడు .

అప్పుడు మొదలైంది శ్రీకృష్ణుడి సలహా . అదే భగవద్ గీత . దాసోహం అనే వారికి ఉపయోగ పడే భగవంతుడి  సలహాల సంపుటి . నాకు తెలిసి అంత కంటే  గొప్ప విజ్ఞాన సంచిక మరొకటి లేదు. రాదు.

అందులో - ఎన్ని రకాల విజ్ఞానం పొందుపరచ బడిందో చూస్తే - చాలా ఆశ్చర్యం వేస్తుంది. దాన్ని గురించిన వివరణ తో కూడిన వ్యాఖ్యానం నా ఆంగ్ల బ్లాగ్ 'wisespiritualideas.blogspot.com ' లో రాస్తూ వున్నాను . సమయం వచ్చినప్పుడు క్లుప్తంగా ఈ తెలుగు బ్లాగ్ లో కూడా రాస్తాను.

యిక్కడ శ్రీకృష్ణుడి పాలసీ మనం గమనించాలి .
  • మొదటిది - అడగనిదే సలహా యివ్వ కూడదు .
  • అడిగినా - ఆ అడిగిన వాడు మనం యిచ్చే సలహా తీసుకుంటాడా, లేదా చూసి,   తీసుకునే  వాడికే సలహా యివ్వాలి . అలా లేని వాడికి సలహా యివ్వ కూడదు .
  • దాసోహం - అన్న వాడికి తప్పకుండా యివ్వాలి .
  • వాడు - చెయ్య గలిగేదే చెప్పాలి కానీ చెయ్య లేనిది చెప్ప కూడదు.
  • సలహా అడిగాడు కదా అని - అడిగిన వాడిని చిన్న చూపు చూడ కూడదు
  •  అడిగిన వాడికి - 4,5 మార్గాలుంటే అన్నీ చెప్పాలి.  ఆ మార్గాలన్నిటిలో  వుండే సాధక బాధకాలన్నిటినీ చెప్పి - అందులో ఏది , ఎందుకు మేలో చెప్పాలి .
  • అడిగిన వాడిని ఉత్సాహ పరచాలే తప్ప , నిరుత్సాహ పరచ కూడదు .
  • ధర్మ మార్గంలో వుండే మార్గాలు చెప్పాలే తప్ప - అధర్మ మార్గాలు కాదు .

- యిలా , సలహాలు - ఎలా, ఎవరికి , ఎప్పుడు , ఎక్కడ - చెప్పాలో  చేసి చూపిన వాడు  శ్రీ కృష్ణుడు . ఆధునిక కాలంలో మనం కమ్మ్యూనికేషన్ స్కిల్స్ అని అంటాము కదా . అందులో ఆయన్ను మించిన నిష్ణాతుడు మరొకరు లేడు . భగవద్ గీత అంతా ఈ స్కిల్ల్స్ కు వొక శాస్త్రీయ గ్రంధం లాంటిది .

సరే . ఈ సలహాలను గురించి - ప్రపంచం లో నలు మూలలా ఏమనుకుంటున్నారు - అన్నది చూద్దాం .

  • మన సుమతి శతక  కారుడంటాడు - వినదగునెవ్వరు చెప్పిన , వినినంతనే వేగపడక వివరింప  దగున్ - అని. అది 'సలహా' కూ వర్తిస్తుంది .
  • సత్యం బ్రూయాత్ ; ప్రియం బ్రూయాత్ ; న బ్రూయాత్ సత్యమప్రియం :- అంటే సత్యమే చెప్పాలి . కానీ వినేవారికి  ప్రీతికరం గా వుండేటట్లు   చెప్పాలి.  అప్రీతికరం గా సత్యాన్ని చెప్ప వద్దు . యిది చాలా పురాతనమైన సూక్తి . యిది సలహాలు చెప్పే వారికి పూర్తిగా వర్తిస్తుంది. కఠినంగా మాట్లాడే వాళ్ళు సలహా యివ్వకుండా వుండడమే , వుభయులకూ మంచిది .  నేను కట్టె  విరిచినట్టు మాట్లాడే వాడిని - అనే వాళ్ళలో సత్యాని కంటే , నిర్దయ, అమానుషత్వం ఎక్కువగా వుంటాయి . వారు సలహాలు యివ్వడానికి అనర్హులు
  • సలహా యిచ్చే వారికి తీసుకునే వారి పట్ల అభిమానం , అక్కర వుండక పొతే - వారి సలహా సరైన సలహా కానే కాదు.  అలాగే, తీసుకునే వారికి, ఇచ్చే వారి పట్ల గౌరవము ,  అభిమానము లేకపోతే - వారికి సలహా ఇవ్వనే రాదు .
  • సలహా పాటిస్తే వచ్చే పరిణామాలు ఎలా వుంటాయో పూర్తిగా అర్థం చేసుకుని కానీ - సలహా యివ్వ కూడదు; పాటించ కూడదు . 
  • సలహాలు - తీసుకునే వారి మనస్స్థితి , ధైర్య సాహసాలు , వివేకము, విజ్ఞానము , వయస్సు - వీటిని బట్టి మారిపోతూ వుంటాయి . క్రూర మృగం కనిపిస్తే - పోరాడి వధించమని సుక్షత్రియునికి చెప్పాలి . చెట్టెక్కి తప్పించుకోమని   మిగతా వారికి చెప్పాలి .
  • మూర్ఖుడు ఎవరి సలహా తనకు అక్ఖర్లేదు - అని అనుకుంటాడు . కానీ వివేక వంతుడు  యితర్ల ఆలోచనలు వింటాడు - అంటుంది బైబిల్ .
  • మంచి సలహాలు అడగని, తీసుకోని వాడికి - జీవితంలో పడే దెబ్బలే - సరైన సలహాలనివ్వ గలదు   - అంటాడు హొరేజ్ .
  • నా జీవితమే - నేనివ్వగలిగే సలహా - అన్నది మహాత్మా గాంధీ అభిప్రాయం .
  • సహాయం చెయ్యడం - సలహా యివ్వడం కంటే మంచిది - అని మార్క్విస్  అనే ఆయన అంటాడు
  • నువ్వు నీలాగే వుండు - అన్నది కొంత మందికి మనం యిచ్చే మహా మూర్ఖమైన సలహా - అంటాడు థామస్ యల్ మేసన్. బాగు లేని వాడే సలహా అడిగే వాడు - నీవు అలాగే వుండు అనడం సలహా కానే కాదు . 
  •  పోగాలం దాపురించిన వారు - ఆప్త వాక్యమును వినరు - అని ఏకాలం నాటిదో వొక అభిప్రాయం . మరో రకంగా చూస్తే - ఆప్త వాక్యము (శ్రేయోభిలాషులు , వివేకులు అయిన వారు ఆప్తులు ) వినక పొతే - పోగాలము దాపురిస్తుందని అర్థం. 
  • కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, భోజ్యేషు మాతా శయనేషు రంభా - అని భార్యను గురించి వొక "గొప్ప మాట" - భార్య యిలా వుంటే బాగుండునని అన్నారు . అటువంటి  భార్యను మించిన  సలహాదారు మరొకరు వుండరు - అని అర్థం .
  • అలాంటి (భర్త పైన అమితమైన ప్రేమ వున్న) భార్యల మాటలు విని బాగు పడిన భర్తలు, కుటుంబాలు ఎంతో మంది వున్నారు. అటువంటి భార్య దొరకడం దేవుడిచ్చిన వరం - అని తమిళ సామెత . కొంత మంది  (భర్త తప్ప మిగతా విషయాలపై ప్రేమ వున్న) భార్యల మాటలు విని - నాశనమయిన కుటుంబాలూ వున్నాయి . . 
  • సలహాల వరకు - ప్రపంచం లో అడిగే వారి కంటే - యిచ్చే వాళ్ళు చాలా, చాలా  ఎక్కువ అని వొకాయన అభిప్రాయం .
  • అయాచిత సలహాలు యిచ్చే వారికి - వాటిని ఆచరించడం లో వున్న సాధక బాధకాలు అర్థం కావు - అన్నది వొక పూర్వోక్తి .
  • యెవడైనా వొక్కడు నిన్ను  గాడిదా అంటే దాన్ని అసలు పట్టించుకోకు . కానీ మరో యిద్దరు అన్నారంటే - వెంటనే వొక కళ్ళెం కొనుక్కొని తగిలించుకో - అంటాడు తాల్ముడ్ . 
  • పడవలో నుండి - క్రింద నీళ్ళలో మునుగుతున్న వాడికి సలహా యివ్వడం తేలిక . పాటించడం కష్టం .
  • అన్నీ నువ్వనుకున్నట్టు జరిగితే - మరి నేనెందుకు ? దేవుడెందుకు ? నువ్వనుకున్నట్టు జరిగేవి కొన్ని . నేననుకున్నట్టు జరిగేవి కొన్ని . 99 శాతం దేవుడనుకున్నట్టు , నువ్వూ , నేనూ  అనుకోని విధంగా జరుగుతాయి . అందుకే వివేక వంతుల సలహాలు అడగాలి . పాటించాలి . 
  •  నీకే తెలీని విషయాలలో అస్సలు సలహా యివ్వకు 
  •  ప్రేమ లాంటి కొన్ని విషయాలలో - వద్దు, కాదు లాంటి సలహాలను  ఎవరూ వినరు గాక వినరు. 
  • కొంత మందికి సలహా చాలదు . థెరపీ కావాలి. 
  • ధనవంతుడు బీద వాడికి సలహా యివ్వడం మనం చూడొచ్చు . బీద వాడు ధనవంతుడికి సలహా యివ్వడమో , అది యితడు పాటించడమో చూడడం చాలా అరుదు .
  •  ధనవంతుడు - బీదవాడికి యిచ్చే సలహా - సాధారణంగా పాటించ లేనిది గానే వుంటుంది . 
  • నిన్ను వూరికే పొగిడే వాడి సలహాలో నిజం సాధారణంగా వుండక పోవచ్చు . 
  •  నీ సలహా ఎప్పుడూ కాస్త క్లుప్తంగానే వుండనీ - అంటాడు హోరాజ్ 
  • కొంత మంది సలహా అడుగుతున్నారో , తమ కష్టాల్లో భాగస్వామ్యం తీసుకో మంటున్నారో - బాగా జాగ్రత్త గా గమనించి మరీ సలహా యివ్వండి . 
  • వొకరికొకరు సలహా యిచ్చుకో వడం లోనే -అందరి రక్షణా వుంది (బైబిల్  వాక్యం )
  • రాజులకు మంత్రులూ వుంటారు . భట్రాజులూ వుంటారు . మంత్రుల వద్ద పొగడ్త ఎదురు చూడకూడదు . భట్రాజుల వద్ద సలహా అడగ కూడదు .
  • మంచి సలహా దొరికితే - పది మందికి చెప్పండి .
  • తండ్రిని మించిన శ్రేయోభిలాషి అరుదు . ఆయన యిచ్చే సలహా తీసుకోండి . తరువాత మంచి వివేక వంతులనూ  అడగండి . వొక్కో సారి తండ్రి సలహా మిన్న గా వుండొచ్చు -అది మెదడు నుండి మాత్రం కాక , హృదయం నుండి కూడా వస్తుంది గనుక . 
  •  స్టాక్ మార్కెట్ కు చాలా మంది రోల్స్ రాయిస్ కార్లో వస్తారు. సబ్ వే లో నడిచి వెళ్ళే వారి వద్ద సలహా తీసుకుంటూ వుంటారు.    ( వారన్ బఫ్ఫే)
  • పోప్  వద్ద సెక్స్ ను గురించి సలహా అడగొద్దు . అవి ఆయనకు తెలిసి వుండ కూడని విషయాలు  - GB  షా 
  •  సలహా యిస్తే యివ్వు కానీ - ఆ తరువాత ఎదుటి వారు అది పాటించే తీరాలని అనుకోకు . వారిని నీవే సరి చేయాలని అనుకోకు . 
  •  హృదయ కవాటం తెరిచి లేక పొతే - అందులోకి ఏ సలహా ఎక్కదు . అది వృథా శ్రమ . 
  •  నువ్వు  చెయ్యలేనిది ఎదుటి వాడు చెయ్యాలని సలహా యివ్వకు .  అలాగే ఎదుటి వాడు చెయ్య లేనిది - చెయ్యమని సలహా గా యివ్వకు 
  •  నువ్వు మొయ్య లేనిది , ఎదుటి వాడు ఎలా మోయ్యాలో చెప్పకు . అది నువ్వు మోసినప్పుడే తెలుస్తుంది  - అది ఎలా మొయ్యాలో  
  • మన దేశాన్ని ఎంత బాగా ఎలా నడపాలో చెప్ప గలిగే వాళ్ళంతా ఆటో డ్రైవర్ లు గానో , అదీ కాకుండానో  వున్నారు . ఎంత దురదృష్టం!
  • గొప్ప గురువు చెప్పేదంతా గొప్ప సలహా నే -  వొక మంచి గురువు ఎల్లప్పుడూ కావాలి . 
  • ప్రతి రోజూ - లోకాః సమస్తాః సుఖినో భవంతు ; సర్వే జనాః సుఖినో భవంతు; అని మొదట అనుకోండి . ఆ భావం వుంటేనే - సలహాలు యివ్వండి . లేకపోతే  వద్దు .
  • చిట్ట చివర - నా సలహా ఏమిటంటే - ప్రతి రోజూ , మొట్ట మొదట, మీరు, మీకే వొక మంచి సలహా యిచ్చుకోండి .  వీలైనంత పాటించండి . అప్పుడే - అది మంచి సలహానా , కాదా అని మీకు తెలుస్తుంది . 
సర్వే జనాః సుఖినో భవంతు

= మీ

వుప్పలధడియం విజయమోహన్   

19, ఫిబ్రవరి 2014, బుధవారం

తెలంగాణా బిల్లు - యిక వుద్యమాలు,మనలను మనం శిక్షింకోవడం వద్దు - సీమాం ధ్రను దేశంలో నంబర్.1 రాష్ట్రం గా తీర్చి దిద్దాలి - ఎలా? (యిలా!)


తెలంగాణా బిల్లు

తెలంగాణా బిల్లు ప్రపంచానికి తెలియనివ్వకుండా, TV  చానళ్ళు లేకుండా , లోక్ సభలో డిస్కషన్ లేకుండా , అసలేం జరిగిందో  ఎవరికీ తెలియనివ్వకుండా , ఆంధ్రా MP లు లేకుండా - లోక్ సభలో పాస్ చేసుకున్నారు .

పార్లమెంటులో పాసయ్యే  చాలా బిల్లు లకు  కేనీసం 20 శాతం మంది MP లు కూడా సభలో లేకుండా పాస్ చేసేసుకోవడం  పాత విషయం . అది మనం ఎన్నుకుంటున్న నాయకుల గొప్ప తనం. నన్నడిగితే - కనీసం 95 శాతం బిల్లులకు -  మద్దతు గానో ,వద్దనో వోటు చెయ్యని  MP లను జీవితాంతం  అనర్హులుగా ప్రకటించాలి . ప్రభుత్వోద్యోగులూ - మీ లాగే ముఖ్యమైన విషయాలు, పనులు  చెయ్యాల్సి వున్నప్పుడు బయటికి వెళ్లి పోతూ వుంటే  - ఎలా వుంటుంది? నిజానికి - మీ నాయకత్వ లక్షణాల వల్ల ,  వాళ్ళూ కొంత అలాగే వున్నారు కూడా . ఈ MP లు బాగుంటే , ప్రభుత్వోద్యోగులూ బాగానే వుంటారు . యథా రాజా తథా ప్రజా . 

సరే . ఈ పాత , వున్న విషయాలు ప్రక్కన బెడితే - కొత్త  ఏమిటంటే సభలో అసలేం జరిగిందో ప్రజలకు తెలియనివ్వ కుండా  TV  చానళ్ళు కూడా బ్లాక్ అవుట్  చేసి , డిస్కషన్  లేకుండా, సంబంధిత MP లు కూడా లేకుండా , బిల్లు పాస్ చెయ్యడం . కాంగ్రెసే వస్తే - యిక మున్ముందు , ఇలాంటివి ఎన్ని జరగ నున్నాయో ?

L.   రాజగోపాల్  గారు మిరియాల పొడి స్ప్రే  చల్లారట . మరి, ఆయనేమో , తెలంగాణా MP ల నుండి  నన్ను నేను  రక్షించు కునేందుకు అలా చేశాను  అంటారు .  నిజమేది ? కనీసం - ఆ విడియో ప్రజలకు పూర్తిగా చూపండి . ఎవరు ఏం చేసారో తెలుస్తుందిగా . అది చెయ్యండి ముందు . మరో MP,  కత్తి పట్టుకు వచ్చారు - అన్నారు . ఆయనేమో, అయ్యా , అది కత్తి కాదు స్పీకర్  ముందున్న మైకు అంటున్నారు . అందులో ఏది నిజం . ఎక్కడో హోటళ్ళలో , మాళ్ళలో  CCTV లు వుండాలి - అనే వారు , పార్లమెంటులో , ఎందుకు లేదో మాకు చెప్పండి .  వుంటే - ఆ ఫుటేజ్ ప్రజలకు చూపండి .  అది లేకుంటే - మీరు చెప్పేవన్నీ అబద్ధాలే -అనుకోవాల్సి వుంటుంది .

అయినా - మా వాదం యిది అని సమర్థ వంతంగా సభ ముందు పెట్ట లేని వాళ్ళు - స్పీకర్ ముందు గలాటా చెయ్యడం ఏమీ బాగు లేదు . స్పీకర్ గారు కూడా - మీ వాదం వినిపించండి - అని వారికి పూర్తి అవకాశం  యిచ్చి వుండాలి . కనీసం పార్లమెంటు లో నైనా ప్రజాస్వామిక పద్ధతులు , విలువలు పాటింప బడాలి . నాకు ఈ స్పీకర్ గారంటే  చాలా యిష్టం . బాగా నవ్వుతూ, సభను  బాగా సమర్థంగా నడిపేస్తారు . మరి ఈ విషయంలో - ఆమె ఎందుకు యిలా చెయ్యాల్సి వచ్చిందో   తెలియడం లేదు .

నిజానికి తెలంగాణా రాష్ట్ర నినాదమే - TRS  పార్టీ వారి అబద్ధాల తోనూ , కాంగ్రెసు వారి అసమర్థత తోనూ వున్న పునాది పైనే నిలబడి వుంది . NT  రామారావు గారికి తెలంగాణా వారు  పూర్తిగా వోటు వెయ్యలేదా ? వేశారు కదా. అలాగే , చంద్ర బాబు గారికి కూడా తెలంగాణా వారు పూర్తిగా వోట్లు వేశారు కదా . అప్పుడు TRS వారికి, KCR గారికి కూడా తెలంగాణా లో వోట్లే పడ లేదు . మరి ఎప్పుడొచ్చింది , తెలంగాణాకు ఆంధ్రా వారు  అన్యాయం  చేశారన్న వాదం ? చంద్ర బాబు తరువాత -  కాంగ్రెసు వారి కుల, మత రాజకీయాల వలన, వారి అసమర్థ నాయకత్వం వలన నే వచ్చింది. వారి పాలనలో- రెండు లేదా మూడు కులాలు మాత్రమే  విపరీతంగా లబ్ధి పొందాయనే  విషయం తెలియని వారెవరు ? నాకనిపిస్తుంది - KCR  గారు కూడా అలా చెప్ప లేక యిలా   చెబుతున్నారేమో అని . కానీ - ఆయన నోరు తెరిస్తే అపభ్రంశపు  మాటలే కానీ , తిట్లే కానీ మంచి మాటలు అస్సలు రావాయె . యిక ఆయన తెలంగాణా నాయకుడు . తెలంగాణా కు ఎటువంటి నాయకుడు   దొరికాడు?

తెలంగాణా విషయం మర్చి పోయే ముందు వొకే వొక మాట. రాజకీయ నాయకుల సంగతి ప్రక్కన పెడితే - మిగతా సీమాంధ్ర వారు ఎన్నో లక్షల  కోట్లు తెలంగాణా లోనే  ఖర్చు పెట్టారు . వారు ఎప్పుడూ తెలంగాణా వాసుల క్షేమం , అభివృద్ధి కోరారు తప్ప - ఎప్పుడూ వివక్షతో , పక్ష పాతమో చూపలేదు . యిది ముమ్మాటికి నిజం .శ్రీ  కృష్ణ కమిటీ కూడా యిదే  చెప్పింది . మరే నిష్పాక్షిక కమిటీ వేసినా అదే  తేలుతుంది .  రోశయ్య గారు, YSR గారు , కిరణ్ కుమార్ రెడ్డి గారు  మరో నిష్పాక్షిక కమిటీ కూడా వేసి, TRS వారి అబద్ధాలు "నిస్సందేహంగా"  ప్రపంచం ముందు తేల్చి వుండాల్సింది. కానీ వారది చెయ్య లేదు . ,అందువలన ఆంధ్రులేదో  అన్యాయం చేశారు - అని KCR  గారు, వారు పార్టీ వారు చెప్పడం - ఈ పచ్చి అబద్ధాలు వంద సార్లు చెబితే  ప్రజలూ నమ్మడం జరిగి పోయింది. యిలా అబద్ధాలు చెప్పే వారికి - దేవుడే బుద్ధి చెప్పాలి . 

అయితే - రాజకీయ నాయకులు చాలా మంది - అప్పుడూ, యిప్పుడూ వారి స్వప్రయోజనాలకే ఎక్కువ ముఖ్యత్వం యిచ్చారు . అది తెలంగాణా వారైనా సరే , ఆంధ్రా వారైనా సరే .

సరే . యిప్పుడు మేము వేరే , మీరు వేరే - అనే భావానికి తెలంగాణా ప్రజలు కూడా వచ్చినట్లు - వుంది కదా . అలాగే వుండనీ . అదీ మంచిదే. జరిగేవన్నీ మంచిదే . ఇకనైనా , సీమాం ధ్రలో - ఏం చెయ్యాలో  ప్రజలు యోచన  చెయ్యాలి . ఏదో  జగన్ గారో , మరొకరో చెప్పారని, బందులు - చేసుకుంటూ పొతే , మనల్ని మనమే శిక్షిం చుకోవడమే కానీ - అందులో , ప్రయోజకత్వం  ఏ మాత్రమూ లేదు. బందు రాజకీయాలు కట్టి పెట్టి, ఇకపై సీమాంధ్ర ను ఎలా భారత దేశంలో  నంబర్ . 1  రాష్ట్రం గా తీర్చి దిద్దాలో ఆలోచించాల్సిన సమయం వచ్చింది .

ఇందులో - నా అభిప్రాయాలు  ఇవి :

1.  మొట్టమొదట - రాయలసీమ , కోస్తా లాంటి దరిద్రపుగొట్టు విభజింపు పదాలు , అన్ని  పుస్తకాల్లో నుండి తీసి వెయ్యండి . వాటికి అర్థమే లేదు . తమిళనాడులో కూడా కోస్తా వుంది . లోతట్టు ప్రాంతాలూ వుంది . అక్కడా ఏదో చరిత్రలు వుండనే  వున్నాయి . కానీ వారు మనలా, ప్రాంతాల వారీగా - మనుషులను గానీ, మనసులను గానీ , ప్రభుత్వ పాలసీలను గానీ  ఎప్పుడూ విభజించ లేదు .  మనలో - అందు వల్లనే వచ్చింది  తెలంగాణా నినాదం . మరో విభజన నినాదానికి  తావివ్వకుండా - ఈ  అర్థం లేని పదాలను పూర్తిగా విడిచి పెట్టండి. 

సీమాంధ్రలో కూడా, విభజించి పాలించుమన్నా - అనే దరిద్రుడు ఎవడో వొకడు పుట్టనే పుడతాడు,  . ఏదో వొకటి చెబుతాడు , అన్యాయం జరిగింది - అదీ, యిదీ అని . వాడి వెనుక వెళ్ళే మూర్ఖులూ వుండనే వుంటారు . కాబట్టి , సమైక్యాంధ్ర లేకుంటే - ఏం మునిగి పోలేదు. కనీసం సీమాంధ్ర వొకటే ప్రాంతం అనే భావన ప్రజలలో కలిగించాలి . కాబట్టి - విభజింపు  పదజాలం తీసి పారెయ్యండి . ప్రభుత్వ పాలసీలన్నీ - అన్ని జిల్లాలకు సమానంగా వర్తింప జేయండి.

2.  సీమాంధ్ర - భారదేశం లోనే  నెం . 1 రాష్ట్రం గా రావాలంటే - ఏం చెయ్యాలో , అది యోచన చెయ్యండి . గొప్ప, గొప్ప సంస్థలనీ వొకే నగరంలో  వద్దు . అన్ని జిల్లాలూ , అన్ని నగరాలూ అభివృద్ధి చెందాలి . వొక్కొక్క జిల్లాకూ వొక ప్రణాళిక రూపొందించండి .   IIT   తిరుపతి లో పెట్టండి .  IIM విశాఖపట్టణం  లో పెట్టండి . AIIMS  సంస్థ విజయవాడ లోనో, నెల్లూరు లోనో  పెట్టండి.

3. IT రంగం - అభివృద్ధికి సులభమైన , కీలకమైన రంగం . అది - రాబోయే రాజధానిలో పెట్టండి . అన్ని IT  సంస్థలను అక్కడికి ఆహ్వానించండి.  అలాగే - మనకూ వొక రైల్వే జోన్ కావాలి . అది విజయవాడలో పెట్ట వచ్చు . యిదీ కేంద్రాన్ని అడగాలి . సాధించాలి .

4. క్రొత్త రాజధాని అన్ని జిల్లాలకూ అందుబాటులో వుండే లాగా  - వచ్చే 10 సంవత్సరాల కాలం లో త్వరగా అభివృద్ధి చెందే  లాగా - వొక  "క్రొత్త" నగరం గానే  నిర్మించాలి . కనీసం 50 చ.కి.మీ . వైశాల్యంతో  వుండాలి . గుజరాత్ లో క్రొత్తగా  గాంధీ నగర్  పెట్టుకున్నట్టు - అంతకంటే మిన్నగా - పెట్టుకోవాలి . అందులో, మన రాష్ట్రం లో సర్వ సాధారణంగా  జరిగే  భూ-ఆక్రమణలు అసలు లేకుండా చూసుకోవాలి .  నా వుద్దేశంలో - అదేదో , నెల్లూరు విజయవాడ ల మధ్య వుంటే - మేలని - అనిపిస్తుంది . విశాఖ , చాలా ప్రాంతాలకు అతి దూరం . హైదరాబాదు కంటే కూడా చాలా దూరం . అక్కడ తుఫాన్ల నుండి కూడా ఎక్కువ ప్రమాదం వుంది . ప్లేన్లు నిలవడం కూడా కష్టం .  భవిష్యత్తు దృష్ట్యా - అంత మంచి రాజధాని  కాదు - అనిపిస్తుంది . సరిక్రొత్త నగరం ప్లాన్ చెయ్యాలి . అదే మంచిది అని నా అభిప్రాయం . అందుకు సరిపడ్డ నిధులు కేంద్రం యివ్వాలి . ఆ నగరం - అన్ని రాష్ట్రాల రాజధానుల కంటే  ఎక్కువ అభివృద్ధి కాగలిగింది గా వుండాలి .

5. చిత్తూరు జిల్లా లాంటి ప్రాంతాలలో - చాలా ఊళ్లలో - త్రాగు నీళ్ళు కూడా లేవు . ఇదేదీ , YSR  గారికి గానీ , ఆ తరువాత వచ్చిన వారికి గానీ , NTR  గారికి పూర్వం వున్న  వారికి గానీ - ఏ మాత్రము పట్ట  లేదు . కనీసం త్రాగు నీటి వసతి కల్పించ లేని  రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రభుత్వాలు? ఇలాంటి పరిస్థితే తెలంగాణాలో కూడా కొన్ని ప్రాంతాలలో వుంది.  అందు వలన - వచ్చే  క్రొత్త రాష్ట్రం లోని ప్రతి గ్రామానికి , నీటి వసతి కావాలి. యిది కేంద్రాన్ని అడగండి . 66 ఏళ్లలో చెయ్యనిది - యిప్పుడైనా చెయ్యమనండి . ఎలాగైనా యిది సాధించి  తీరాల్సిన అంశం . లేదంటే ఈ ప్రాంతాలలో త్వరలో ఎడారులు తయారు కావడం తథ్యం .

6. క్రొత్త రాష్ట్రానికి - విద్యుచ్చక్తి చాలా ముఖ్యం . ప్రజలు చాలా విషయాలు అర్థం చేసుకోవలసి  వుంది . కాంగ్రెసు పాలనలో - చాలా రాష్ట్రాలలో , అసలు విద్యుచ్చక్తి వుత్పాదన లేకుండా పోయింది . వుత్పాదకులకు కావలసిన భూసేకరణ కూడా చెయ్య లేదు . గత 10 సంవత్సరాలలో భారత దేశమంతటా జరిగిన నిర్వాకం యిది . బడ్జెట్టులో , వచ్చే డబ్బు , ఎన్నికల కోసం , వోట్ల కోసం , పంచడం వొక్కటే జరుగుతో వుందే తప్ప - పరిశ్రమలు, విద్యుత్తు , త్రాగు నీరు - లాంటి మౌలిక సదుపాయాలు కూడా చెయ్యడం లేదు . ఫలితంగా - బాగా చదువుకున్న వారికి కూడా ఉద్యోగావకాశాలు  బాగా తగ్గి పోయాయి . అందరికీ ఉద్యోగావకాశాలు వుంటే - రిజర్వేషన్లు అక్కరే లేదు. వున్నది వెయ్యి మంది ; ఉద్యోగాలు 10 మందికి  - అంటే , రిజర్వేషన్లు, పోరాటాలు   కావాలి . వస్తాయి . ఎన్ని చేసినా , 990 మందికి , ఉద్యోగాలు లేక పోవడం - జరగనే జరుగుతుంది . కాంగ్రెస్ పాలన లో అదే జరుగుతూ వుంది చాలా రాష్ట్రాలలో . 

నరేంద్ర మోడీ పాలనలో  అది లేదు . బీహారీలు వస్తే - రండి , మా వారికే కాదు , మీకూ ఉద్యోగాలున్నాయి రండి అంటారు ఆయన . అదే   KCR  గారు , వారి అనుయాయులు,  దశాబ్దాలకొద్దీ తెలంగాణా లో  వున్న కొంత మంది ఆంధ్రులను - మీరు వెళ్ళిపొండి - అని , పనిగట్టుకుని యిళ్ళకు కూడా  వెళ్లి చెబుతున్నారు . యివన్నీ వార్తా పత్రికలో కూడా అప్పట్లో వచ్చాయి . ఆయన కూడా ఈ దేశంలో వొక నాయకుడు !! అందుకని  క్రొత్త రాష్ట్రంలో - విద్యుచ్చక్తి ఉత్పాదన మనకు కావాల్సిన  దానికంటే 200 శాతం  ఎక్కువ జరగాలి . అందుకు ప్రైవేటు రంగ సంస్థలను పెద్ద ఎత్తున ఆహ్వానించ వలసి వుంది . అలా చెయ్య గలిగే నాయకుడినే ఎన్నుకో వాల్సి వుంది .  ఎంత విద్యుచ్చక్తి  వుంటే అంత ఉద్యోగావకాశాలు , పరిశ్రమలు  అన్నీ వస్తాయి. అందుకే, వున్న పరిశ్రమలన్నీ యిప్పుడు  గుజరాత్ వైపు వెళ్లి పోతున్నాయి. 

7. తెలంగాణా తో యిటువైపు వారికి ఎప్పుడూ వైరం  లేదు . యిక ముందూ వద్దు . మన రాష్ట్రం అభివృద్ధి వైపే మనసు పెట్టాలి . కాకపొతే - నీటి పారుదల విషయంలో - సరైన  జాగ్రత్తలు తీసుకోవాలి . ఈ విషయంలో కాంగ్రెసు పాలనలో మనం ఎంతో ఘోరంగా పొగొట్టుకున్నామనే చెప్పాలి . కనీసం  ప్రతి పక్ష నాయకుడు గా చంద్ర బాబు తీసుకున్న చర్యలకు కూడా అండగా నిలవ లేదు  కాంగ్రెస్ ప్రభుత్వం . యిది మారాలి . యిటువంటి సందర్భాలలో  -  తమిళ నాడు  లోని ,ప్రతి పార్టీ అందరితో బాటు వొక్కటిగా నిలుస్తుంది. అది మనం నేర్చుకోవాలి . 

8.  ఎవరు - మన క్రొత్త రాష్ట్రానికి సరైన మద్దతు యిస్తారో  - కేంద్రం లో వారితోనే పొత్తు పెట్టుకోండి . వారి వద్ద అటువంటి హామీలు అడగండి . తీసుకోండి . 

9. యిక వుద్యమాలు వద్దు . అది వూరికే మనలను మనం శిక్షింకోవడం తప్ప , కొంత మంది రాజకీయ  ప్రయోజనాలకు తప్ప - అందులో ప్రజలకు వొరిగేదేమీ లేదు. ఈ ఉద్యమాలు - దొంగలు పోయిన ఆరు నెలలకు - కుక్కలు మొరిగిన సామెత లాగా వుంటుంది . పదవిలో వున్నప్పుడు - TRS వారిని , వారి అబద్ధాలను - ప్రజల ముందు, పార్లమెంటు ముందు నిర్దిష్టంగా పెట్ట లేని వారు , యిప్పుడు ఉద్యమాలు చెయ్యడం ఏ ప్రయోజనమూ లేదు . ప్రపంచం దృష్టిలో హాస్యాస్పదం గా వుంటుంది . ఈ నాయకులు ఏ కోణంలోనూ , కేంద్రం లోని అధికార , ప్రతిపక్ష నాయకులను  ఎవరినీ మా వాదం వెనుక నున్న బలం యిది అని చెప్పి నమ్మించ లేక పోయారు.  అందు వలన యిక ఉద్యమాలు వద్దు .

10. యిక - మంచి నాయకులను వెదకండి . కుల,మత రాజకీయాలకు అతీతంగా  మోడీ లాంటి నాయకుడు దొరుకుతాడేమో చూడండి.  జయ ప్రకాష్ నారాయణ్, చంద్రబాబు లాంటి వారు ప్రజల మనస్సులో విద్వేషాలు రేకెత్తకుండా, అభివృద్ధి సాధించే వారని నా అభిప్రాయం . వారిలో - లంచగొండి తనమూ లేదు.

11. చిట్ట చివర - నా ఆశ, అభిప్రాయం , మనవి  ఏమిటంటే - ప్రజలంతా అభివృద్ధి పథం లోకి వచ్చెయ్యండి . తెలంగాణా ప్రజలూ బాగుండనీ. మనమూ బాగుందాం . ఈ వివాదంలో మనం నేర్చుకోవలసిన విషయాలు యివీ. 

సర్వే జనాః సుఖినో భవంతు 

= మీ 

వుప్పలధడియం  విజయమోహన్




14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

తెలంగాణా బిల్లు - సమైక్యాంధ్ర ఉద్యమం - అన్ని ప్రాంతాలకూ న్యాయం - సర్వే జనాః సుఖినో భవంతు


= తెలంగాణా బిల్లు =


పార్లమెంటులో  తెలంగాణా బిల్లు ప్రవేశ పెట్ట బడింది. అందులో ఏముంది ? తెలంగాణా ప్రాంతం వొక ప్రత్యేక రాష్ట్రం చెయ్యాలని మాత్రం వుంది. 

యిక్కడ సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతోంది కదా . దాని మాటేమిటి ? ఎందుకని సమైక్యాంధ్ర ప్రజలు, నాయకులు అందరూ - ఈ రాష్ట్ర విభజన వద్దంటున్నారు ?  యివి  ఏదీ జాతీయ స్థాయి నాయకులు యోచనే చేయరా?

నాగేశ్వర రావు , రామారావు   గార్ల  నుండి , చిన్న స్థాయి   టెక్నిషియన్ వరకు సినిమా రంగమంతా  మద్రాసు నుండి హైదరాబాద్ కు "మన రాష్ట్రం" అంటూ, అనుకుంటూ వచ్చారు . ఎన్నో స్టూడియోలు , మరెన్నో సినిమారంగ  వ్యవస్థలు అంతర్జాతీయ స్థాయిలో  నిర్మించారు . చంద్రబాబు  గారు  తెచ్చిన ప్రతి సంస్థా , హైదరాబాదు కే తెచ్చారు. 

అలా వచ్చిన వారినెవరూ - యిది మీ రాష్ట్రం  కాదు - యిక్కడికెందుకొచ్చారు, యిక్కడెందుకున్నారు - అని అడగ లేదు; వారూ చెప్పవలసిన అవసరం రాలేదు. 

అంతే కాదు. రామారావు గారికి బ్రహ్మ రథం పట్టి తెలంగాణా వారంతా కూడా వారిని ముఖ్య మంత్రిని చెయ్య లేదా ? అప్పుడు  లేని వేర్పాటు భావం యిప్పుడెక్కడ నుండి  పుట్టుకొచ్చింది ? ఈ విషపుబీజం నాటిన వారెవ్వరు ? పెంచి పెద్ద  చేసిన వారెవ్వరు ? ప్రజలంతా కాస్త యోచన చెయ్యాలి .

రామారావు మాత్రమే  కాదు . చంద్రబాబు నాయుడు గారు, చివరికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు , వేర్పాటు రాష్ట్ర వాదపు విష బీజాలు  తెలంగాణా లో పెద్దగా మొలవ లేదు ; పెరగ లేదు . యిదే  చరిత్ర . వారందరికీ వోటు వేసి గెలిపించిన  వారు తెలంగాణా ప్రజలు . అప్పుడు లేని అన్యాయం  ఎప్పుడు మొలిచొచ్చింది ? 

అన్యాయం, అన్యాయం అని TRS నేతలు ఘోషిస్తే - శ్రీకృష్ణ కమిటీ వేసారు . ఆయన లెక్కలన్నీ చూసి - అయ్యా ఏ అన్యాయమూ లేదు - జరుగ లేదు అని తేల్చి చెప్పారు . మరి - ఆ కమిటీ పైనే బురద చల్లారు TRS  నాయకులు .  కానీ , ఆ కమిటీ వారు చెప్పింది ఎలా తప్పు అన్నది ఎవరూ చెప్ప లేదు ; ఏది రైటో కూడా  వారు చెప్ప లేదు . యిప్పుడు తెలంగాణా  ఎందుకు - అన్న వాదం  మరో రకంగా తిరిగింది . 

మా వూళ్ళలో  - ఆంధ్ర వుద్యోగులు  వున్నారు - వుండకూడదు - అన్నారు. అదే మాకు జరిగిన అన్యాయం  అన్నారు.  పని గట్టుకుని వాళ్ళ యిళ్లకు  వెళ్లి  - మీరు మీ ప్రాంతానికి  వెళ్లి పొండి - అన్నారు . మేము శాంతంగా  చెబుతున్నాం - వెళ్ళిపొండి - అన్నారు, బెదిరించారు . యివన్నీ వార్తాపత్రికలలో  కూడా వచ్చాయి .  యిది ఎంత అరాచకమైన , క్రూరమైన, చట్ట వ్యతిరేకమైన చర్య ? అయ్యా - ఉద్యోగులు అలా ఎలా వెళ్లి పోగలరు ? అసలు, ఎవరయినా  అలా  యెలా  వెళ్లి పోగలరు? అలా వెళ్ళ గొట్టే అధికారం TRS వారికి గానీ, మరెవరికి  గానీ ఎవరిచ్చారు?  యిది అడగాల్సింది ఎవరు ? తెలంగాణా ప్రజలే  అడగాలి.  వొకాయన అంటారు - పక్క వాడికి అన్యాయం జరిగేటప్పుడు  మీరు అడ్డుకోక   పొతే , ఆ తరువాత  జరిగే అన్యాయం మీకే , అని . 

ఇప్పుడున్న వినాయకులు తెలంగాణా పాలకులైతే - ఈ విద్వేషాల బీజాలు పెరగడం తప్ప మరో గొప్ప పనేమే జరగదనేది తథ్యం .

తెలంగాణా లో ఎన్ని పరిశ్రమలు  పెట్టారు! ఎన్ని విశ్వవిద్యాలయాలు పెట్టారు ! అందు వలన తెలంగాణా కు న్యాయం జరిగింది కాదా ? ఎలా జరగలేదంటారు?  

నాకు మాత్రం మొదటి నుండీ ఈ పధ్ధతి నచ్చ లేదు . రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల లోనూ - యివి రావాలి. వొక IIT  కానీ , IIM  కానీ , ISB  కానీ మరే అత్యున్నత విద్యాసంస్థ కానీ , రాయలసీమ లో కానీ , కోస్తా ప్రాంతం లో గానీ  ఎందుకు లేదు ? వొక్క IT రంగ సంస్థ కూడా - తెలంగాణా ప్రాంతం తప్ప - మరెక్కడా ఎందుకు పెట్ట బడ లేదు ? వొక్క జాతీయ / అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కూడా మిగతా ప్రాంతాల్లో ఎందుకు లేదు? యిక్కడే జరిగింది తప్పు . అన్ని ప్రాంతాల లోనూ - అటువంటి సంస్థలు వస్తే , ఈ వేర్పాటు వాదాలు  రావు ; వుండవు ; వచ్చినా , రాష్ట్రాలను విభజించినా  పెద్ద ప్రశ్న లేదు .  యిప్పుడు ప్రశ్న అదే . మేమూ ,మీరూ  అభివృద్ధి చేసిన  ముఖ్యమైన ప్రాంతం మీది - మాకేమీ హక్కు లేదు అంటే - అది అన్యాయం  కాదా .

66 ఏళ్ళ తరువాత కూడా - రాయలసీమలో త్రాగడానికి వూళ్ళలో నీళ్ళు లేవు . రామారావు గారు కూడా హైదరాబాదుకు , మద్రాసుకు  నీళ్ళు వస్తే చాలనుకున్నారు . ఆయన వుంటే - యివన్నీ చేసేవారేమో - నాకు తెలీదు .  కర్ణాటకా  వారు ముందు  యిటు వైపు వస్తున్న నీళ్ళు , వాళ్ళ రాష్ట్రంలో  నిలిపేస్తే -అడిగే వాడే లేడు మన రాష్ట్రంలో . యిప్పుడు సమస్య  తెలంగాణా రాష్ట్రం వస్తే - రాయల సీమకు - కనీసం త్రాగు నీళ్ళు అన్ని ప్రాంతాలకూ  రావాలి . వస్తుందా ? లేదా , TRS  వారు అది జరగనివ్వరా ? జరగనివ్వరనేది అందరి అభిప్రాయం.  కేంద్ర ప్రభుత్వం వారు రాయలసీమ కు ఏం న్యాయం చేస్తారు ? యిది - ఏవీ , పార్లమెంటులోని  బిల్లులో లేవు .  విభజిస్తే - ఏ ప్రాంతం వాళ్లకు , ఏం న్యాయం చేస్తాం - అన్న అంశం ఏదీ - ఈ బిల్లులో లేదు. యిదీ వొక బిల్లేనా ? తొందర పడి తాతాచార్యులు మతం మార్చుకున్నాడట. అలా వుంది పరిస్థితి . మన దేశంలో ఈ మధ్య వచ్చిన చాలా చట్టాలు తొందరపాటుతో చేసిన చట్టాలే . కోడలు ఫిర్యాదు చేస్తే - యింట్లో వాళ్ళందరినీ జైల్లో పెట్టాలని వొక చట్టం . కొంత మంది కోడళ్ళు ఆరడికి గురి అవుతున్న మాట నిజమే . ఎవరూ కాదనటం లేదు. కానీ, ఎంతో మంది కోడళ్లు పెళ్ళైన వెంటనే , యింటిని విడగొట్టడమూ , యింట్లో ఏ బాధ్యతలూ తీసుకోక పోవడమూ అంతే నిజం. మొత్తానికి ఎవరిది తప్పైనా , అది సాంతంగా విచారించి, సమస్యను పరిష్కరించాలా ? యింట్లో వాళ్లందిరినీ జైల్లో  పెట్టాలా ? సరే ; జైల్లో పెట్టిన తరువాత , ఆ కోడలితో , ఆ భర్త కానీ, యింట్లో వాళ్ళు కానీ ఎలా వొకటిగా వుంటారు ? యిదా ఆ కోడలి సమస్యకు పరిష్కారం ? ఈ చట్టం క్రింద ఎవరికీ ఏ రకమైన న్యాయమూ జరగడం లేదు - నాకు తెలిసినంత వరకూ . తెలంగాణా చట్టమూ అంతే . విడగొట్టడం గురించి మాట్లాడుతున్నదే తప్ప - తరువాత ఏమిటన్నది ఏమీ మాట్లాడడం  లేదు .

మన దేశంలో ప్రజలను విడగొట్టడం అంత సులభమైన పని మరొక్కటి లేదు . మీకన్యాయం జరిగింది ; జరిగింది ; అంతా వారివలనే - అంటే చాలు . నిజమే కాబోలు అనుకునే ప్రజలు మనం . ఏమన్యాయం జరిగింది; ఎప్పుడు జరిగింది ? ఎవరి వలన జరిగింది? యివి అడిగే వాడూ లేదు; చెప్పే వాడూ లేడు . 

నిజమే.  ప్రజలందరికీ అన్యాయం జరిగింది - కొన్ని విషయాల్లో . యిది అన్ని ప్రాంతాల్లోనూ  జరిగింది . ఉదాహరణకు , భూ ఆక్రమణలు . యివి పెద్ద ఎత్తున, అన్ని ప్రాంతాల్లోనూ జరిగాయి .  హైదరాబాదు లోనూ జరిగాయి . తిరుపతి లోనూ జరిగాయి . మరెన్నో ప్రాంతాల్లో జరిగాయి . వీటిలో కూడా - కొన్ని ధనిక కుటుంబాలకు చెందిన , కొన్ని  కులాల వారు మాత్రమే   చాలా ఎక్కువ గా చేశారు , చేస్తున్నారు - అన్న విషయం అందరికీ తెలుసు . వీరే రాజకీయాల్లోనూ, రౌడీ యిజం లోనూ, పేరు  మోశారన్నది మనకందరికీ తెలుసు. అంటే - ఆ కులాల వారందరూ అలా చేస్తున్నారని కాదు . చేస్తున్న వారిలో - కొన్ని కులాల వారు చాలా ఎక్కువ అన్నది అందరికీ తెలిసిన విషయం . అదే కులాలలో మంచి నాయకులూ  వున్నారు . 

యిప్పుడు రాజకీయాలు అంటే రౌడీ ఇజం అన్న స్థాయికి దిగిపోయింది . యిటువంటి నాయకులకు యెదురుగా , సాధారణ ప్రజలకు ఎవరికీ న్యాయమూ లేదు ; రక్షణ కూడా లేదు - అన్న విషయం అందరికీ తెలుసు .

మనం మంచి నాయకులను ఎన్నుకుంటే - అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది . లేదా - ఏ ప్రాంతానికీ , న్యాయం జరుగదు . సాధారణ ప్రజలు కులాల వారీ, మతాల వారీ కాకుండా  మంచి వాళ్లకు వోటు వేస్తే , మంచే జరుగుతుంది . మన రాష్ట్రంలో - మనం మంచి  నాయకుడి కోసం వెదకాలే తప్ప , రాష్ట్ర విభజన కోసం కాదు . 

లాంకో హిల్ ఎక్కడ పోయినా - సాధారణ ప్రజలకు పెద్ద నష్టం ఏమీ లేదు. కానీ, ప్రతి ప్రాంతం లోనూ త్రాగే నీళ్ళు  కావాలి కదా . వుద్యోగావకాశాలు అందరికీ కావాలి కదా. పరిశ్రమలు అన్ని చోట్లా రావాలి కదా . గొప్ప విద్యా సంస్థలు అన్ని చోట్లా రావాలి కదా . అన్నీ హైదరాబాదులో పెడితే , కనీసం యికపై వొప్పుకోకండి. మహబూబ్ నగర్  లోనూ రావాలి ; చిత్తూరు లోనూ రావాలి ; శ్రీకాకుళం  లోనూ రావాలి . 

అన్నీ చెప్పినా - చిట్ట చివర , నాకనిపించేది  ఏమిటంటే - ప్రజలుగా  మనం అందరం  వొకటే . దయ చేసి , మీరు వేరు, మేము వేరు -అనకండి. ఈ వేర్పాటు వాదానికి  అంతు  లేదు. ఎంతగానో వొకరినొకరు అభిమానించే  భార్యాభర్తల మధ్య కూడా - యిటువంటి వేర్పాటు విషబీజాల ద్వారా, విడిపోయే పరిస్థితులు  కల్పించే వారున్నారు. విడిపోయే వారూ వున్నారు. అది ఎంత తప్పో ఎప్పుడో తెలుస్తుంది . చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే వొరిగేది ఏమీ లేదు . మాకు నవాబులైనా ఫరవాలేదు ,కానీ మీరు వద్దు - అనే మూర్ఖుల మాట నమ్మ వద్దు . 

సరే . రాష్ట్రాలు విభజించాల్సిందే - అనుకుంటే ; కాస్త  ముందు  చూపుతో,అన్ని ప్రాంతాలకూ న్యాయం జరిగే లాగా వున్న బిల్లు వస్తే - కొంతలో కొంత మేలు .

సర్వే  జనాః సుఖినో భవంతు 

= మీ 

వుప్పలధడియం  విజయమోహన్