25, జులై 2013, గురువారం

తోలి విడత పంచాయితీ ఎన్నికల ఫలితాలు ఏం తెలుపుతున్నాయ్?


ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో తోలి విడత పంచాయితీ ఎన్నికల ఫలితాలు ఏం తెలుపుతున్నాయ్?

తెలుగుదేశం పార్టీ అందరికన్నా ముందుంది. అన్ని ప్రాంతాలలోనూ. ఆ తరువాత అసలు కాంగ్రెస్సు, ఆ తరువాత, వై.యస్. ఆర్. పీ - వీరందరికంటే క్రింద - తె. రా. స.

యింకా రెండవ విడత, మూడవ విడత ఎన్నికలు జరుగనున్నాయి.

ముందు. ముందు, ఏం జరుగుతుందో - మనకు తెలీదు. కానీ. ఈ ఎన్నికల ఫలితాల విశ్లేషణ ఎలా చేయాలో , దాని ఫలితాలు ఏమిటో చూద్దాం .

మొదటి అంశం - చంద్ర బాబు గారి నాయకత్వం పైన చాలా మందికి నమ్మకం వుందని తెలుస్తోంది . అదీ - రాష్ట్రం లోని 3 ప్ర్రాంతాల లోనూ.   తెలుగు దేశం పార్టీ లోని మిగతా నాయకులు కూడా - యింకా గట్టిగా, వారికి అండగా నిలిస్తే - వారు మళ్ళీ  ఈ రాష్ట్రానికి CM కావచ్చు - అనిపిస్తోంది. అదే కాక, తెలంగాణా ప్రాంతం లో తె. రా.స. కంటే, ప్రజలకు, యింకా తె.దె.పా పైన, కాంగ్రెసు పైనే  ఎక్కువ మక్కువ అనేది తెలుస్తోంది. ముఖ్యంగా, తెలుగు దేశం పైన. ఈ ప్రజాభిప్రాయాన్ని - ఢిల్లీ లోని - నేతలు బాగా మనసులో పెట్టుకొవాలి. తె. రా. స. ఏది చెబితే, అదే, ప్రజాభిప్రాయం అనుకోవడానికి - లేదు అని తెలంగాణా ప్రజలు చెబుతున్నారు కదా. 

రెండవ అంశం : వై.యస్. ఆర్. పీ ఎంత ప్రచారం చేసినా - కాంగ్రెసు కు కూడా అన్ని ప్రాంతాల లోనూ మంచి బలం వుందనేది తెలుస్తోంది. అంటే -  కిరణ్ కుమార్ గారి నాయకత్వమో, మరేదో, వారిని ఆకర్షించిందనేగా అర్థం.

మూడవ అంశం : వై.యస్. ఆర్. పీ మూడవ స్థానంలో వుండడం కూడా, గొప్ప విషయమే. జగన్ గారిపై నున్న ఆరోపణలు, యిప్పటి వరకు విదితమైన విషయాలు ఎన్నో ఆరోపణలకు బలం యిచ్చేవిగా వున్నాయి.  అయినా వారి పార్టీ కి కూడా చాలా బలం వుందనేది తేలుతూ వుంది. అంటే , లోపాలెన్నో వున్నా, నాయకత్వ లక్షణాలు కూడా వున్నాయని తెలుస్తోంది. అదే  గాక,మరేదైనా కారణాలు కూడా ఉన్నాయా?

నాలుగవ అంశం : తె. రా. స -ఎన్ని మాటలు మాట్లాడినా, వారిపై, ఎవరికీ ఎక్కువ మక్కువ, నమ్మకం లేదనేది  తెలుస్తోంది. పదవికి రాక ముందే ఇలాంటి మాటలు ఇలాంటి చేతలు, వుంటే - పదవికొస్తే - ఎలా వుంటారో - అనే భయం ప్రజలకు వుండొచ్చు. మమతా గారు పశ్చిమ బెంగాల్ లో యిలాగే మాట్లాడే వారు. యిప్పుడు ఎలా మాట్లాడుతున్నారో- వారు గానీ, వారి క్రింద నున్న నాయకులు గానీ - యిది మనకు తెలుస్తోంది. అదే కథ ఇక్కడా జరగొచ్చు. - అని, ప్రజలు అనుకుంటూ వుండవచ్చు.

సరే. ఏ పార్టీ, మందు కోసం, ఎంత ఖర్చు పెట్టింది - అనేది కూడా వొక అంశమే. మరి ఎన్ని విధాల్లో, ఎలా వోట్లు కొన బడ్డాయి -అనే అంశం కూడా రాజకీయ విశ్లేషకులు చూడాల్సిందే.  కులం,మతం  ప్రాతిపదిక పైన ఎన్ని వోట్లు పడ్డాయి - అలా జరగడం మనం ఎప్పుడు విడిచి పెడతాం - అన్నదీ చర్చనీయాంశం.

యివన్నీ వొక ప్రక్క.  వోటు వేసి గెలిచిన వ్యక్తి యిక ముందు తన ప్రజలకు ఏమేం మేలు చేస్తాడనేది ప్రధానాంశం. ప్రజలు ఆయనను నిలదీసి - అన్ని పనులూ చేయించుకోవాలి. అప్పుడే అది పంచాయితీ రాజ్ అవుతుంది.

సర్వేజనాః సుఖినో భవంతు .

= మీ

వుప్పలధడియం విజయమోహన్

22, జులై 2013, సోమవారం

సంతోషంగా వుండడం యింత సులభమా?



నిరంతరం వుండేది  ఆనందం అంటారు; అప్పుడప్పుడూ వచ్చి పొయ్యేది సంతోషం.

 మనం ఎవరో, ఏమిటో  తెలుసుకుంటే అసలైన ఆనందం.  లేదంటే - సంతోషము, దుహ్ఖాల మధ్య జీవితమంతా వూగిసలాట..

కోరికలను మన అదుపులో వుంచుకుంటే ఆనందం. కోరికల వెనుక పరుగెడితే కాస్త సంతోషం; అంత కంటే ఎక్కువ దుహ్ఖాలు, కష్టాలు. నిజానికి , అల్ప సంతోషులకు సంతోషం చాలా యెక్కువ.  కోరికలు ఎక్కువ అయ్యే కొద్దీ, సంతోషం తగ్గి పోతూ వుంటుంది.

యిలా ఎన్నో జీవిత సత్యాలను, సూత్రాలను మన పూర్వీకులు మనకు యిచ్చే వెళ్ళారు.

అయినా - మనం కోరికల వెనుక పరుగెడుతూ వుంటాం;  మన మనసు కోరికలతో బాటే పుట్టింది. కోరికల వెనుక పరుగెడకుండా ససేమిరా వుండదు.

యిది యిలా వుండ నివ్వండి.

అసలు, మనకు సంతోషాన్నిచ్చే విషయాలేమిటి?

ఎలా వుంటే - ఎక్కువ కాలము, ఎక్కువగా సంతోషాన్ని అనుభవించ గలము? యిది తెలుసు కుంటే - మేలే కదా!


గాంధీ గారు  ఏమంటారంటే - మీ మనసు, మాట, చేత - అన్నీ వొక విషయం పైన కేంద్రీకృతం అయితే - దాన్లో మీకు చాలా, చాలా  సంతోషం లభిస్తుంది. మనసొక చోట, మాట వొక చోట , చేత మరో చోట అయితే - సంతోషం వుండదు.  అది - రకరకాల క్లిష్ట పరిస్థితులకు దారి తీస్తుంది.

సంతోషము మనం చేసే  పనుల పైనే ఆధార పడి వుంటుంది - అంటారు దలై లామా.

మనం ఎలాంటి పనులు చేయాలి?

మీ వద్దకు వచ్చిన ప్రతి  వొక్కరు సంతోషంతోనే - తిరిగి వెళ్లేట్టు చూడండి.  మీ మాటలో, మోహంలో, చిరునవ్వులో, దయను ప్రతిఫలించండి -అంటారు మదర్  థెరెసా.  అలాగే,మార్టిన్ ల్యూథర్ కింగ్ (జూనియర్) గారంటారు -  మీరు సంతోషం గా వుండటానికి రాజ మార్గం మీ చుట్టూ వున్న వారి సంతోషానికి కారణంగా మీరు నిలవడమే - అని.

యిదే మాట మార్క్ ట్వైన్ లాంటి  మరెంత మందో అన్నారు.

యిమాన్యువల్ కాంట్ అనే తత్వ శాస్త్రజ్ఞుడు సంతోషానికి మూడు సూత్రాలు చెబుతాడు - (1)  మీకు నచ్చే ఏదో వొక పని ఎప్పుడూ మీకు వుండాలి ; అది మీరు చేస్తూ వుండాలి (2) మీరు ప్రేమించడానికి / బాగా యిష్ట పడడానికి   ఎవరో వొకరు మీ దగ్గర వుండాలి  (3) మీ జీవితంలో ముందు ముందు ఏదో మంచి జరుగుతుందన్న ఆశ, నమ్మకము వుండాలి. అంతే నండి. యివి వుంటే - హాయిగా బ్రతికేయచ్చు.

కొంత మంది మన వద్దకు వస్తే - మనకు చాలా సంతోషం కలుగుతూ వుంటుంది. అలాంటి వారు కొంత మంది ఎక్కడికి వెళ్ళినా - అక్కడ సంతోషం వెల్లివిరుస్తుంది.

 అయితే, మరి కొంత మంది, మన వద్ద నుండి వెళ్లి పోతూ వుండేటప్పుడు - మనం సంతోష పడతాము. వాళ్ళు వుండే టప్పుడు ఎందుకొచ్చారా - అనిపిస్తూ వుంటుంది. - అంటారు ఆస్కార్  వైల్డ్.

ముందే  అన్నాము కదా - సంతోషం  వస్తుంది,పోతుంది కూడా. మనతో అలాగే వుండి పోదు.

కానీ దుహ్ఖం తను వెళ్లి పోయేటప్పుడు - మన మనసులో ఏదో వొక మచ్చను మిగిల్చే పోతుంది. అందుకని, మనం, దుహ్ఖాత్మకమైన సంఘటనలను మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుని బాధ పడుతూ వుంటాము.

సంతోషం మాత్రం చెప్పా చెయ్య కుండా వెళ్లి పోతుంది. వొక్కో సారి వెళ్ళేటప్పుడు -  చాలా  బాధ కూడా పెడుతుంది. ఎటువంటి సంతోషమైనా కొన్నాళ్ళ తరువాత మర్చి పోతాము. అందుకని, మన జీవితంలో జరిగే సంతోష కర సంఘటనలను మాత్రం రాసుకోవడం, అప్పుడప్పుడూ నెమరు వేసుకోవడం మంచిది.

కొంత మందికి  జ్ఞాపక శక్తి తక్కువ. కస్టాలు, దుహ్ఖాలు గుర్తు రావు. అలాంటి మరపు - సంతోషానికి చాలా మంచిది కదా.

ముఖ్యంగా యింట్లో జరిగే కలహాలు అందరూ మర్చి పోవాలి. లేదంటే - ఎప్పుడో యిరవై ఏళ్ళ నాడు జరిగిన కలహం; అది, చిన్నదైనా, పెద్దదైనా, ఆ తరువాత జరిగిన సంతోష కర సంఘటనలన్నీ వదిలేసి - దాన్ని ఈ రోజు ముందు వేసుకుని పెద్దగా పోట్లాడుకునే వారిని, ఎంతో మందిని, మనం చూడొచ్చు. అంటే, అటువంటి వారికి, సంతోషంగా వుండటం ఎలాగో తెలీదన్న మాట. యిటువంటి చిన్న చిన్న సూత్రాలు మర్చి పొతే - జీవితాంతం - కొట్లాటలు, పోట్లాటలే గాని, సంతోషం వుండదు.

మనలో కొంత మంది - అయ్యో, ఈ ప్రపంచం యింత ఘోరంగా, యింత మోసం గా వుందే, అని బాధ పడుతూ వుంటారు. అలా అనిపించడం, కొంత సహజమే అయినా - మనం మరో జీవిత సత్యం తెలుసుకోవాలి .

యిదే - ప్రపంచంలో మంచీ వుంది; చెడూ వుంది. మీరు బాధ పడినంత మాత్రాన చెడు పోదు . మీరు చెయ్య గలిగేది చెయ్యండి  కానీ, ఈ చెడుతో బాటు, యిదే ప్రపంచంలో మీరు సంతోషంగా వుండ గలిగే  అవకాశమూ  పూర్తిగా
వుంది. మీరు ఏ మంచి చేసినా, మీరు సంతోషం గా వుంటూ - చెయ్యండి.  బాధ పడే వారి పట్ల దయ చూపండి . వారికి చెయ్య గలిగే సహాయమూ చెయ్యండి. అంతే గాని, మీరు కూడా వారితో పాటు  బాధ పడితే - వారికి వొరిగేదేమీ లేదు..


మిమ్మల్ని గురించి మీరు ఎంత ఎక్కువ తెలుసు కుంటే - అంత సంతోషంగా వుండే అవకాశం వుంది. యిదొక జీవిత సూత్రం.

యివన్నీ సరే. ఎంతో కొంత సంతోషం, ప్రతి దినం మనం సృష్టించు కోగలమా?  గలము. మనకు ఏది సంతోషం యిస్తుందో - అది మనం చెయ్యాలి. ఏది దుహ్ఖం యిస్తుందో, దాన్నుండి, కాస్త దూరంగా వుండాలి.

 కొన్ని ఉదాహరణాలు చూద్దాం :

1. ప్రేమలో పడడం - చాలా సంతోషం యిస్తుంది. నిజమే. కాకపోతే, ఆ ప్రేమ సరైన వారితో నైతే, జీవితమంతా - సంతోషం వస్తూ వుంటుంది. లేక పొతే - ప్రేమనే తరువాత దుహ్ఖంగా మారిపోతుంది. అమెరికాలో జరిగే ప్రేమ వివాహాల్లో - దాదాపు 51 శాతం విడాకులలో ముగుస్తోందని,  తెలుస్తోంది.

2 . నవ్వడం, నవ్వించడం, నవ్వించే వారి ప్రక్క నుండడం - యివన్నీ సంతోష కారకాలే కదా!

3. చాలా చిన్న చిన్న విషయాలు కూడా సంతోషా న్నిస్తాయి. (1) మీకు నచ్చిన ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తినడం; (2) పిక్నిక్ లకు బాగా తయారయి వెళ్ళడం; (3) మీకు బాగా నచ్చిన సినిమా, మీకు నచ్చిన వారితో బాటు చూడడం;
(4) మీకు నచ్చిన పాట వినడం;అదీ వీడియో తో బాటు వింటే మరీ బాగుంటుంది; (5) మంచి రహదారి పైన  నడవడమో; వొక్కో సారి, కార్లో అటువంటి రోడ్డు పైన చుట్టూ వున్న ప్రకృతిని చూస్తూ, వెళ్ళడ మో, అదీ స్నేహితులతో; (6) వో నలుగురు స్నేహితుల మధ్య కూర్చుని హాయిగా మాట్లాడుకోవడం ; (7)  బీచ్ లో ఆడుకోవడం; (8) చిన్న పిల్లలతో ఆడడం; (9) ఎవరో మీ గురించి చాలా మంచిగా, గొప్పగా పొగుడుతూ వుంటే,  అనుకోకుండా, వారికి తెలీకుండా మీరు వినడం జగడం ;(10)  ప్రేమికుల మధ్య నైతే మీరు మొదటి సారి పెట్టుకున్న ముద్దు లాంటివి; మీరు ఎంత బాగున్నారు అని వారు వర్ణించడం; స్విమ్మింగ్ పూల్ లో దిగి ఆడుకోవడం; వొకరి ప్రక్కన వొకరు కూర్చొని సూర్యాస్తమయమో, చంద్రోదయమో చూస్తూ మాట్లాడుకోవడం;  వొకరి చేతిలో మరొకరి చెయ్యి వేసి నడవడం; ఇలాంటివి ఎన్నో , ఎన్నెన్నో;

ఇలాంటి సంతోష కర సంఘటనలు - మీరు అప్పుడప్పుడూ సృష్టించుకోవాలి.

కొందరి మనసులో కదిలిన -  కొన్ని భావనలు చూడండి :-

4.. నన్ను చూసి నవ్వే, నవ్వించే నీ కళ్ళను చూసి  ఎన్ని రోజులయిందో!  నా కళ్ళలో, నా మొహంలో కూడా - నవ్వు  యిన్నిరోజులుగా లేక పోయిందని నీకు తెలుసా?

5. నేను బాగున్నానని అనిపించినప్పుడల్లా,  నేను హాయిగా నవ్వుకున్నప్పుడల్లా, నేను సంతోషంగా వున్నప్పుడల్లా - నా ప్రక్కన వున్నది ఎవరో తెలుసా? నువ్వే?

6. నేను వొక్కో సారి, ఎంతో సేపు, నిన్ను గురించే అనుకుంటూ వుంటాను . ఆ తరువాత తెలుస్తుంది నాకు, అంత సేపూ, నా మోహంలో  చిరునవ్వు, నా మనసులో సంతోషం నిండి వుందని.

7. నీ ప్రక్కన ఉన్నంత సేపూ , నేను సంతోషంగా వుండాలని ప్రయత్నం చెయ్యనక్కర లేదు. అది తానుగా అలా...జరిగి పోయే విషయం

8. వొక్కో సారి , ఎవరో వొకరు వచ్చి వొక్క మాట మాట్లాడి వెళ్లి పొతారు. మరి ఆ రోజంతా, నేను ఉత్సాహంగా, సంతోషంగా వుండి పోతాను. ఆ వోక్కరు ఎవరో తెలుసా?

..... ఈ భావనలు కలిగే వారిలో, కలిగించే వారిలో , ఎప్పుడూ సంతోషం వుంటుంది కదా.

మనసున ఉన్నదీ... , చెప్పాలనున్నదీ... , మాటలు రావే యెలా.... అంటే యిద్దరికీలాభం లేదు.

చెప్పే వారు చెబితే, వినే వారు వింటే నే - యిద్దరికీ సంతోషం కదా!  మనం చాలా మంది, చాలా సమయాల్లో, జంకు తోనో, భయం తోనో , చాలా సంతోషం కోల్పోతాము.

9. అంగట్లో సంతోషం అయితే దొరకదు ; ఐస్ క్రీమ్ దొరుకుతుంది. నిజమే. యిది మనకు తెలిసిన మాటే. అయితే వొక్కో సారి, ఆ ఐస్ క్రీమే, చాలా సంతోషాన్నిస్తుంది కదా.

10. మీరు హాయిగా పడుకుని నిద్ర పోతున్నారు. మీలో ఏ భయాలూ లేవు; సంకోచాలూ లేవు. ఎందుకంటే, మీ ప్రక్కన వున్న వారిపైన , మీకు అమితమైన విశ్వాసమూ, ప్రేమా వున్నాయి గనుక.  నిద్రలో కూడా, మీకు ఆనందమే కదా.  యిది మనం యిచ్చి పుచ్చుకోవలసిన విశ్వాసమూ, ప్రేమా .  మొదట మీరే  యివ్వండి. మీకు అది రెండు రెట్లు ఎక్కువగానే తిరిగి వస్తుంది

11. మీరు  ఏదో వంట  చేశారు. అందులో ఏదో సరిగ్గా పడలేదు. లేదా, కాస్త మాడిపోయింది. కానీ, మీ వారు, అబ్బ, ఎంత బాగుంది, అంటూ తిన్నారు. మీరు తినేటప్పుడు తెలిసింది - అసలు సంగతి.  అడిగితే - నీ మొహం చూస్తూ తిన్నాను కదా. నాకు బాగుందనే అనిపించింది - అన్నారు . మీకు తృప్తిగా లేక పోవచ్చేమో గానీ, సంతోషంగా మాత్రం వుంది కదా.

12. దేవుడి గుడికి వెళ్ళారు. వొకరికోసం వొకరు ప్రార్థన చేశారు.  ఆ ప్రార్థన ఎంత బాగుంటుంది - వినే ఆ దేవుడికి.  ఆ దేవుడు తప్పకుండా మీరు అడిగింది కొద్దో గొప్పో ఇవ్వనే యిస్తాడు.

13. ప్రతి రోజూ, దేవుడి మీకిచ్చిన ఆశీర్వాదాలు, మీరు గుర్తు పెట్టుకోండి. మీ శరీరం, మీ భర్త/ భార్య, పిల్లలు, మీ వుద్యోగం, యిలా ఎన్నో దేవుడు మీకు యిచ్చాడు.  ఎన్నో యివ్వ లేదు కూడా.   నిజమే. కానీ దేవుడు ప్రపంచం లో ఎవరికీ - అన్నీ యివ్వ లేదు. మీకు ముఖ్యంగా - సంతోషంగా వుండ గలిగే మనసు యిచ్చాడు. అది బాగా వుపయోగించండి. మీకు ధనం వుండొచ్చు; లేక పోవచ్చు; అధికారం    వుండొచ్చు; లేక పోవచ్చు; మరెన్నెన్నో వుండొచ్చు; లేక పోవచ్చు; కానే, మీరు తలుచుకుంటే - సంతోషంగా మాత్రం వుండగలరు.

అదే కదా మీకు ముఖ్యం!

=మీ

వుప్పలధడియం విజయమోహన్




;




15, మే 2013, బుధవారం

దీర్ఘ దర్శి గా - గొంతు విప్పి , కలం విప్పి - ఈ వొక్క మార్పు - మనం తీసుకు రావాలి


 పంచ తంత్ర కథలలో - మనకు చాలా ఇష్టమైనవి , మనల్ని ఎంతో ఆలోచింప జేసేవి ఎన్నో వున్నాయి. అందులో - దీర్ఘ దర్శి, సమయోచిత ప్రజ్ఞుడు , మంద బుద్ధి  అనే మూడు చేపల కథ కూడా చాలా ప్రసిద్ధమైనదే. 


ఆ మూడు చేపలూ , తమ పేరుకు తగ్గ బుద్ధి వుండేవే . అవి పుట్టి పెరిగిన జలాశయంలో వొక సారి నీళ్ళు ఐపో వచ్చింది. ఎండలకు ఆవిరై పోతూ వుంది. క్రొత్త గా వర్షాలూ పడడం లేదు. 

ఈ పరిస్థితి గమనించిన     దీర్ఘ దర్శి, తన యిద్దరు స్నేహితులతో యిలా అంది -"మిత్రులారా, మన జలాశయంలో నీరు యింకి పోయే ప్రమాదం కనిపిస్తూ వుంది ; మరి కాస్త యింకిపోతే - చేపలు పట్టే  వాళ్ళు మనల్ని సులభంగా పట్టేస్తారు.  కాబట్టి మనం ముగ్గురం దీనికి నీటి ఊట వచ్చే పై జలాశయానికి యిప్పుడే యీదుకుంటూ  వెళ్లి పోదాం .ఆక్కడైతే , మన జీవిత కాలం హాయిగా గడిచి పోతుంది ."

కానీ దాని యిద్దరు మిత్రులకూ ఈ సలహా నచ్చలేదు .  వారు వద్దు, వద్దు , యిక్కడే వుందాం - అన్నారు. దీర్ఘ దర్శి ఎంత చెప్పినా, వారు వొప్పుకో లేదు.  మరి చేసేదేమీ లేక దీర్ఘ దర్శి వెళ్లి పోయింది. కొన్నాళ్ళకు - దీర్ఘ దర్శి చెప్పినట్టే జరిగింది . నీళ్ళు యింకి పోవడమూ, బెస్త వాళ్ళు వచ్చి, చేపలు పట్టడమూ జరిగింది . 

మంద బుద్ధి సులభంగా   వారికి దొరికి పోయింది. సమయోచిత ప్రజ్ఞుడు వొక   చిన్న ఎత్తు వేశాడు. దొరక్క ముందే - నీళ్ళలోనే - ఎప్పుడో చనిపోయినట్టు నటించ సాగాడు . ఎప్పుడో  చచ్చిన చేప మనకెందుకు - అని     బెస్త వాళ్ళు దాన్ని వదిలేశారు . మంద బుద్ధి మాత్రం వారికి దొరికి, ఆహారమై పోయింది.

చేపలలో ఈ మూడు రకాలూ వున్నాయో లేవో కానీ, మనుషులలో, మన మధ్యలో వున్న ప్రతి వారూ - వీటిలో ఏదో వొక కోవకు చేరుతారు. 

మనం ఏ కోవకు చెందాలో మనమే నిర్ణయించుకోవాలి; నిర్ణయించుకోవచ్చు . జీవితంలో దీర్ఘదర్శి గా మసలే వారు -ఆనందంగా, విజయవంతంగా , ఆరోగ్యంగా వుండ గలగడం పెద్ద వింతేమీ కాదు.  దీన్ని అంగ్లంలో  స్టీఫెన్  కోవీ అనే ప్రసిద్ధ రచయిత తన 'ఫస్ట్ థింగ్స్ ఫస్ట్'   అనే పుస్తకంలో  చాలా బాగా వివరించారు.  

జీవితం లో మన ముఖ్యమైన ధ్యేయాలను మనం గుర్తించగలగాలి . యిది మొదటి మెట్టు. మనకు ఏం కావాలో తెలియక పోతే అవి మనకెలా వస్తాయి? గుర్తించిన వాటిపై మన ధ్యాస, మన కృషి ఎక్కువగా వుండాలి .

 "కృషితో నాస్తి దుర్భిక్షం"  అన్నది మొదటి నుండి వున్న  నానుడే  కదా . కృషి  లేని చోట అపజయం వుంటుంది . అపజయం వున్న చోట కృషి వుండదు. ఎక్కడో వొక 5 శాతం మనుషులను మినహాయిస్తే - 95 శాతం మనుషులకు యిది పూర్తిగా వర్తిస్తుంది.     

చాలా మందికి దీర్ఘ దర్శిత్వం లేక పోవడానికి - ఎన్నో కారణాలు వున్నాయి. 

1. కుటుంబ పరమైన పరిస్థితులు  అతి ముఖ్యమైన కారణం. తండ్రో, మరో పెద్దవారో, యింట్లో - త్రాగుబోతై వుంటే , ఆ యింట్లో పిల్లలు చాలా అవస్థ పడతారు.  వారు ఏ పనిలోనూ ముందుకు పోలేక పోవడానికి ఆ త్రాగుబోతు తండ్రే - కారణం అని నిశ్చయం గా చెప్ప వచ్చు . యిప్పటి త్రాగుబోతు తనానికీ , ప్రభుత్వాల విధానాలే ముఖ్య కారణం.  

2. తల్లిదండ్రుల మధ్య సఖ్యత  లోపించడం మరో కారణం . వారు సంతోషంగా లేకుంటే , పిల్లలనెలా  చూసుకోగలరు?

3. TV సీరియల్సు - పిల్లలకు, పెద్దలకు కూడా -  పెద్ద వ్యసనంగా మారిపోయింది . పిల్లలు పరీక్షలకు చదివే సమయంలో కూడా - పెద్దలు టీవీ సీరియల్సు -చూడకుండా వుండలేక పోతున్నారు . అలాగే పిల్లలు కూడా, క్రికెట్ లాంటివి చూడకుండా వుండ లేక పోతున్నారు.  

4. అన్నిటికంటే అతి ముఖ్య కారణం - స్కూల్లో, పిల్లలకు , వారి వారి జీవితాలను గురించిన  కనీస జ్ఞానము బోధించ బడడం లేదు.  జీవితానికి సంబంధించిన  ప్రాథమిక సూత్రాలు చెప్ప బడడం లేదు. ఉదాహరణకు - మనం చదువుతున్న   "దీర్ఘ దర్శి, సమయోచిత ప్రజ్ఞుడు , మంద బుద్ధి" అనే సూత్రం గురించి ఎంతో బాగా బోధించ వచ్చు.   పిల్లల మనసు మార్చ వచ్చు . ఉపాధ్యాయుడు యిది చెయ్య గలడు. కానీ, మన పాఠ్యాంశాలలో - యిది లేనే లేదు.  ఎక్కడో వున్నా, దానికంత ముఖ్యత్వం యివ్వ బడ లేదు.

జన్యు పరమైన కారణాలు  కొంత వుండ వచ్చు - కానీ వాటిని చాలా వరకు అధిగమించ వచ్చునని ఎంతో మంది జీవితాలు తెలుపుతాయి.    

జీవితానికి ముఖ్యమైన అన్ని అంశాల పైనా మన గమనం, శ్రద్ధ , కృషి వుండాలి. 

ముఖ్యమైన అంశాలంటే - (అ ) చదువు (ఆ) వుద్యోగం / వ్యాపారం  (ఇ ) వైవాహిక జీవితం  (ఈ )ఆరోగ్యం  (ఉ ) సమాజంలో ముఖ్యమైన అంగంగా వుండడం (వూ ) మన జీవితానికి చరమ లక్ష్యం మనం తెలుసు కోవడం 

యివన్నీ మనం తెలుసుకోవాలి.  వీటిలో మన శ్రద్ధ వుండాలి . వీటన్నిటిలో -చక్కటి విజయం సాధించాలి . 

చిన్న ఉదాహరణకు :- 

ఆరోగ్యం పైన అందరి శ్రద్ధా  చాలా తగ్గుతూ వుంది.  చక్కెర  వ్యాధి లాంటివి - అతి చిన్న వయసు నుండే వస్తూ వుంది. దీనికీ, మనం TV ల ముందు ఎక్కువ సేపు కూర్చోవడానికీ, ఎంతో సంబంధం వుంది. మన జీవిత సమస్యలు పూర్తిగా విడిచేసి - TV  సీరియల్సు లోని పాత్రలతో మమేకమై - వారి కోపాలు, తాపాలు. కుట్రలు, శోకాలు మనవిగా చేసుకుని ఆపసోపాలు పడే వారు చాలా ఎక్కువ . వొకే చోట కూర్చుని , యిన్ని రకాల భావాలకు  యింత తీవ్రంగా మనం, మన మనస్సులో చోటిస్తూ పొతే  - రోగాలు రాకేం చేస్తాయి.      

అందులోనూ - మన టీవీ పాత్రలన్నీ - విలను పాత్రలే . అందులోనూ - ఆడవాళ్ళందరూ విల్లీలే . విల్లీలు కాని వాళ్ళు - మహా  మూర్ఖులుగా వుంటారు . వారిని, ఎవరైనా, ఎలాగైనా మోసగించ వచ్చు. అందుకు వారు ఎప్పుడూ సిద్ధంగావుంటారు - అంటే - మోస పోవటానికి, అన్న మాట . మన టీవీ  సీరియల్సు చాలా మారాలి . కాస్తో కూస్తో, స్వచ్చంగా, మానవత్వంతో కూడిన పాత్రలు , మాటలు,కథలూ రావాలి. 

ఇప్పుడున్న టీవీ  ప్రపంచం లో దీర్ఘ దర్శి  లాంటి వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు?   అస్సలు లేరు.  ఈ పధ్ధతి మారాలి. 

సరే . సగటు మనిషి వైవాహిక జీవితంలో - సరైన అవగాహన, బాంధవ్యం చాలా తగ్గి పోతూ వుంది ఈ కాలంలో . 

నీ పూర్తి  బాధ్యత నాది;  అని, ఆడా మగా మనసారా అనుకున్నప్పుడు, గ్రహించినప్పుడు , యిప్పుడు  పెరుగుతున్న  పోటీ మనస్తత్వం  పోయి, దాని స్థానంలో నిజమైన  ప్రేమ పెరుగుతుంది. ధర్మేచ , అర్థేచ , కామేచ - అన్నిటిలో తోడూ, నీడగా వుందాం - అనే పెళ్లి నాటి ప్రమాణాలకు   కట్టుబడి వుంటే - వైవాహిక జీవితం బాగానే వుంటుంది. 

కానీ, జరుగుతున్న చరిత్రలో -  విడాకులు, వొకరిపై, మరొకరు పెట్టే కోర్టు కేసులు, గృహంలో పెట్టె హింసలు  -ఆడ, మగా యిద్దరూ సరి లేరని చెబుతుంది .  యిలా ఏ రంగం చూసినా  అన్నీ  దిగ జారి పోతూ వుంది. 

సరే . మన భారత రాజకీయ ప్రపంచం   అన్నిటి కంటే - చాలా, చాలా కంపు కొడుతోంది . ఎవరెంత లంచం తింటున్నారన్నది అంతు పట్టకుండా వుంది. తినే వాళ్లకు అస్సలు సిగ్గు భయం ఏమీ లేదు. వారిని సమర్థించే  వాళ్లకు అంతకు ముందే లేదు. 

దేశాన్నీ కూడా ఏదైనా ధర వస్తే అమ్మే లాంటి వాళ్ళు కనిపిస్తున్నారు.  మరి రాజకీయాల్లో  దీర్ఘ దర్శి  ఎవరైనా  వున్నారా? మన రాష్ట్రంలో జయప్రకాశ్ నారాయణ్  లాంటి వారున్నా - వారికి మనం వోటు వెయ్యమ్ కదా. 

మోడీ గారున్నారు. వారు, కుల మత రాజకీయాలు , ఎప్పుడూ నాకు లేదు. యిక మీదట కూడా  నాకొద్దు - అని వొక్క మాట అంటే - వారు ఫరవాలేదు. ఆ వొక్క మాట వారి నోటి నుండి ఊడి పడుతుందా ? ఊహూ. నిజానికి ఆయన ఎవరికీ అన్యాయంగా ప్రభుత్వం నడపడం లేదు. కానీ వొక ముద్ర పడింది . అది సులభంగా  పోతుంది - ఈ వొక్క మాట అంటే. అంటే - అది దీర్ఘ దర్శిత్వం.   కానీ అనరు. 

ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి చదువులు, ఇలాంటి టీవీలు - వీటి మధ్య పిల్లల్లో దీర్ఘ దర్శిత్వం ఎలా వస్తుంది? 

వొకే ఆశా దీపం వుపాధ్యాయులు.  వీరి  ద్వారానే - యిటువంటి  మౌలిక సూత్రాల  బోధన జరగాలి. 

పిల్లలందరి  మానసిక దృక్పథం మార్చవచ్చు . వొక్క వారం రోజుల్లో , పిల్లలలోని అన్ని అవగుణాలు, అలసత్వము, పోగొట్ట వచ్చు . వారిలో మానసిక దృఢత్వం , లక్ష్య సాధన పై ఎకోన్ముఖత్వం - అన్నీ కలిగించ వచ్చు . ఉపాధ్యాయులు ఈ పనికి పూనుకుంటే . 

మళ్ళీ పంచ తంత్ర కథలు రావాలి . దానిపై దీర్ఘమైన పరిశోధనలూ జరగాలి. వాటిని వివరించి చెప్పే నేర్పు ఉపాధ్యాయులకు  కలగాలి.  అలాగే, వేమన శతక  పద్యాలు, సుమతి శతక  పద్యాలు - ఏవేవి నేటికీ పనికొస్తుందో - అవి నేర్పాలి. 

ఉదాహరణకు -

తన కోపమె తన శత్రువు 
తన శాంతమే తనకు రక్ష , దయచుట్టంబౌ   
తన సంతోషమె స్వర్గము 
తన  దుఃఖమె నరకమండ్రు , తథ్యము సుమతీ.   

యిది మన వాళ్ళ దీర్ఘ దర్శిత్వానికి  చాలా గొప్ప తార్కాణము . యిది వివరించి పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు వుండాలి . ఇలాంటివి  నేర్పకుండా - బాబాబ్లాక్ షీప్ లాంటి ఏమాత్రమూ ఉపయోగ పడని  ఆంగ్ల పద్యాలు మాత్రం నేర్పుతున్నాము. వీటిలో చాలా పద్యాలు మంద బుద్ధులనే తయారు చేస్తున్నాయి . 

రెండు మార్కులు తగ్గాయని ఆత్మ హత్య చేసుకునే పిల్లలు, మానసిక రోగాలతో సతమత మయ్యే పిల్లలే ఎక్కువవుతున్నారు. తల్లిదండ్రుల సలహాలను  ఏ మాత్రం ఖాతరు చేయని పిల్లలు ఎంతో మంది . 

వొకాయన IAS రిజల్టులో , తన నెంబరు కు ఎదురుగా, వేరేవరిదో పేరుందని  ఆత్మ హత్య చేసుకున్నాడట మొన్నటికి మొన్న. అంత మానసిక దుర్బలత్వం వున్న వాడు - నిజ జీవితం లో ఎలా రాణిస్తాడు ? జీవితపు ఆటుపోట్లను ఎలా ఎదుర్కొంటాడు? ఆయన తెలివి గల వాడే - కానీ   దీర్ఘ దర్శిత్వం ఏ మాత్రమూ లేని వాడని తెలుస్తుంది . ఆయన కలెక్టరైతే మనం  ఎలా బాగు పడతాం ?  

వీటన్నిటికీ కారణం - మన విద్యా విధానంలో - సరైన బోధన, శిక్షణ లేకపోవడమే . 

తల్లి దండ్రులను గౌరవించాలని వుపాధ్యాయుడు  చెప్పాలి . అది జరగడం లేదు . అలాగే - ఎక్కువ సమయం టీవీ  చూడ రాదని , ఆడ-మగ పిల్లల స్నేహాల్లో పరస్పర గౌరవం  వుండాలని, యిలా ఎన్నో, ఉపాధ్యాయుడు  చెప్పాల్సిన అవసరం వుంది . ఈ వొక్కొక్క విషయానికీ - పిల్లలకు మార్కులు వుండాలి . 

పాసు కావడం పాఠాల్లో మాత్రం కాదు. మనిషి వ్యక్తిత్వ లక్షణాల్లో  కూడా వుండాలి. అదే సరైన బోధన, శిక్షణ. 

దీర్ఘ దర్శి గా మనం పరిశీలిస్తే - మన సమాజం బాగుపడటం - పాఠ శాల  నుండే    ప్రారంభం కావాలి . ఉపాధ్యాయుడి బోధనా పధ్ధతి నుండే ప్రారంభం కావాలి. 


ఈ విషయం ప్రతి వొక్కరూ  - గొంతు విప్పి , కలం విప్పి - ప్రభుత్వానికి , విద్యా యంత్రాంగానికి , ఉపాధ్యాయులకు చెప్పాలి . ఈ వొక్క మార్పు రావాలి. మనం తీసుకు రావాలి . 


యిది వొక్కటే - మిగతా అన్ని మార్పులకు మూల కారణం కాగలదు  

శుభం భూయాత్ 

= మీ

వుప్పలధడియం విజయమోహన్  
  





.  



11, ఏప్రిల్ 2013, గురువారం

శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు - మీ రాశి ఫలాలు

తెలుగు వారందరికీ 

శ్రీ విజయ నామ సంవత్సర 

ఉగాది 

శుభాకాంక్షలు 

మీ రాశి  ఫలాలు 

మేషం :

ఈ సంవత్సరం మీరు చేసే పనిని బట్టి మీకు సరైన ఫలితం లభిస్తుంది. నందన నామ సంవత్సరంలో జరిగిన మంచి, చెడు అన్నీ తలుచుకుని సంతోష పడండి.  మీరు బాగా చదివితే - మంచి మార్కులతో మిమ్మల్ని పాసు చేయడానికి   గురువు సిద్ధంగా వున్నాడు. పౌర్ణమి నాడు చంద్రుడిని చూసిన వారికి మంచి సంతోషం లభించ గలదు.  ప్రతి పౌర్ణమికీ మీ చంద్రుడు, సుస్థానంలో వుంటాడు. ఆ రోజు చంద్ర గ్రహాన్ని చూడడం మర్చి పోకండి.  

వృషభం 


గంట పైన వొకే చోట కూర్చోకండి . రాహు కేతువులు మీ రక్త నాళాల్ని  గట్టిగా పట్టేసు కుంటారు. మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తారు.  ప్రతి దినం,  తెల్లవారి, సాయంకాలం సూర్యునికి నమస్కారాలు చేయండి. ఈ వ్రత ఫలితంగా మీకు సూర్య గ్రహ ఆశీర్వాదం తప్పక లభిస్తుంది  ఆయన ఆశీర్వాద  ఫలితంగా - మీకున్న జబ్బులన్నీ - చాలా వరకు ఈ విజయనామ సంవత్సరాంతం లోగానే  - తగ్గి పోయే సూచనలు కనిపిస్తున్నాయి.

మీరు ప్రేమించే వారి పట్ల - మీ శ్రద్ధ ఎంత మాత్రం వుందో - కాస్త పరిశీలించి చూసుకోండి. వారు మీకు చేయాలని కాదు - మీరు వారికేం చేస్తున్నారని చూసుకుంటే - మీ ఆనందం సంవత్సరమంతా వుంటుంది  

మిథునం 


ఈ సంవత్సరం - ఏమైనా సరే - మీ భార్యతో గానీ, భర్త తో గానీ కొట్లాడ కండి.  వారు ఏ మన్నా మీరు ప్రేమతో జవాబివ్వండి.

కొద్దిగా పొగడడం కూడా అప్పుడప్పుడూ - హృదయ పూర్వకంగా  చేస్తే, చాలా మంచిది. ఈ వ్రతం మంగళ గౌరీ నోము వంటి ఫలితాన్నిస్తుంది. మే-జూన్  నెలల లోగా - వారు పూర్తిగా మీ వైపు  ఆకర్షితులై వచ్చే అవకాశాలు కనపిస్తున్నాయి. అలా జరక్కుంటే - పై వ్రతం మరి కొన్నాళ్ళు పొడిగించండి . మీరే విజయ వంతులవుతారు.  సంవత్సరంలోపు మీరు - గృహమే కదా స్వర్గ సీమ అనగలరు.

మీరు చేసే ప్రామిస్ ల పట్ల శ్రద్ధ వహించండి . మీరు నెరవేర్చలేని ప్రామిస్ లు అసలు చెయ్య కండి. చేసిన ప్రామిస్ లు తప్పకుండా నెరవేర్చండి.    

కర్కాటకం 


మీ భర్త / భార్య - ఆఫీసుకు వెళ్ళేటప్పుడు;మరియు వచ్చిన వెంటనే - మీరు మాట్లాడే మాటలు వారికి సంతోషం కలిగించే విధంగా చూడండి.  వారికి సూర్య చంద్ర గ్రహాలు రెండూ చాలా బాగుంటాయి . మీ వారికి దీర్ఘాయుస్సు  కలిగిస్తాయి.  మరో విజయ నామ సంవత్సరం  ఉగాది నాటి వరకూ సంతోషంగా, ఆరోగ్యంగా  వుంటారు.

పిజ్జాలు, బర్గర్ లు, సమోసాలు లాంటి జంక్ ఫుడ్ ల జోలికి వెళ్ళ కండి . వెడితే మాత్రం , మళ్ళీ - మీ ఆరోగ్యం ఏ గ్రహం  వల్ల  చెడిందో చెప్ప లేము.  

 సింహం 


 మీరు రాజకీయాల్లో వుంటే - వోటర్లకు - ఏ వొక్కటో , రెండో  మంచి పనులు - కనీసం యిప్పుడైనా చేస్తే - మీరు వచ్చే యెలెక్షన్లలొ - గెలిచే ప్రమాదం - ప్రజలకు వుండనే వుంది. 

ప్రజలు ఎప్పటి లాగే, తమ కులం వాడికి, తమ మతం వాడికి వోటు వేసే ప్రమాదం వుంది.  నాయకుల ప్రోద్బలంతో, మీ మూర్ఖత్వంతో, ప్రక్కింటి వాడితో, యెదురింటి  వాడితో, బెంగాల్ లో లాగా,  పోట్లాటలకు దిగే అవకాశం  వుంది. రాహు కేతువుల ప్రభావం మన రాజకీయాల పై పూర్తిగా వుంది.  కొంత మంది రాజకీయ వాదులు, ఎంత లంచ గొండులుగా నిర్ధారితులైనా - మీరు మాత్రం మారరు. వారికే వోటు వేస్తారు. అయితే -  వొకరిద్దరు  మంచి నాయకులు తెర  మీదకు రావచ్చు. తత్కారణం గా - మీ రాజకీయ జీవితం ముగిసి పోయే ప్రమాదం వుంది. ముందుగా మేల్కొని అలాంటి మంచి నాయకులతో చేరితే - మీకు మంచి భవిష్యత్తు వుంటుంది.

యిక విద్యార్థుల ఉద్యోగుల సంగతి - మీ జీవితానికి. మీ ఆరోగ్యానికి, మీ పురోగతికి ముఖ్యం మీ చదువులు, మీ పరిశ్రమ, మీకున్న చాకచక్యాన్ని  బాగా వినియోగించుకోవడం.  దీన్నే - ఆంగ్లంలో - ది మెయిన్ థింగ్ ఇన్ లైఫ్ - ఈజ్ - టు  కీప్  ది మెయిన్ థింగ్ - ఆజ్ ది మెయిన్ థింగ్ - అంటారు .

క్రికెట్టు, సినిమాలు ఎప్పుడో వొకప్పుడు కావాల్సినవే గాని - ప్రతి రోజూ కాదు. దినమంతా కాదు . యిది తెలియని వారి లగ్నంలో - శని గ్రహం కూర్చుని ఆడిస్తున్నట్టు - తెలుస్తుంది - ఎప్పుడో . 

కన్య 


ఈ మధ్య వస్తున్న గ్రహ ఫలితాలు చూస్తుంటే - గ్రహాలూ యింత  త్వరగా తమ ఫలితాలు  యిస్తాయా - అని ఆశ్చర్యం వేయక మానదు. 

గత పదేళ్ళలో - మగ వాళ్ళలో సెక్సు సామర్థ్యం 30 శాతానికి - పడి పోయిందట. ఏ. సి గదుల్లో - గంటల కొద్దీ కూర్చుని - కంప్యూటరే దేవుడు - పిజ్జా లే ప్రసాదం - అనుకుంటే - ఈ ప్రమాదం వుండనే వుంది . ముందు చెప్పినట్లు - ప్రతి రోజూ సూర్యగ్రహానికి నమస్కారాలు చేస్తే - మీ పరిస్థితి మారుతుంది.  మీ ఆరోగ్యం మెరుగు పడుతుంది.  

అలాగే - ఆయా రంగాల్లో వున్న ఆడవాళ్ళకు కూడా ఇలాంటి శుభ వార్తే  - వొక ప్రముఖ పత్రిక ప్రచురించింది . వారికి 29 నుండీ 35 ఏళ్ళ వయసు లో - మెనోపాస్ వచ్చేస్తో వుందట. కన్యగా వుండేటప్పుడే - మేనోపాస్. చంద్రుడి ముఖమూ, సూర్యుడి ముఖమూ చూడక పొతే - ఆ గ్రహాల ప్రభావం అలా వచ్చేస్తూ వుంది.  అది కాకుండా - శని ప్రభావం పెరుగుతుంది. మనలో పెరిగే సోమరి తనము శని గ్రహ ప్రభావమే . వాటి ఫలితాలు జీవితం లోని అన్ని రంగాల్లో కనిపిస్తూ వుంటుంది . 

అయితే - భర్త పిల్లల పట్ల ప్రేమ వున్న ఆడ పిల్లలకు విజయ నామ సంవత్సరం - బాగానే వుంటుంది . అదే విధంగా, తాగుడు, ధూమ పానం లాంటి అలవాట్లు లేక , భార్యను, పిల్లలను బాగా చూసుకునే మగ వారికి కూడా -  ఈ సంవత్సరం మంచిదిగానే వుంటుంది . 

తుల 


తులా రాసి వారు ఆచి తూచి, అందంగా  వ్యవహరిస్తే - వారి జీవితం రాహు కేతువుల బారిన పడ కుండా బాగానే వుంటుంది.  రేపటిని గురించి   శ్రద్ధ తీసుకునే వారికి - ఈ రోజూ బాగానే వుంటుంది. రేపూ బాగానే వుంటుంది . విద్యార్థులు కష్ట పడి చదవాలి . మార్కులు దానికి తులనాత్మకంగా వస్తాయి.

చాలా మంది రాజకీయ వాదులు, కొంత మంది ప్రభుత్వోద్యోగులు  - తమ పనికి వచ్చే లబ్ధి, లంచం - తులలో వేసి తూచి మరీ పని చేస్తారు - ఎప్పటి లాగే.  విద్యుత్తు, బొగ్గు, రహదార్ల నిర్మాణం వంటి రంగాలు ఎప్పుడూ అలాగే వుంటాయి. మనం వోటు వేసే విధానం మారితే తప్ప.

అయితే సంవత్సరాంతంలో - ప్రజలు , ప్రభుత్వంలో, మోడీ-ఫికేషన్  వస్తేనే మనకు మేలు అనుకునే సూచనలు కనిపిస్తున్నాయి .    యివన్నీ, తులా రాశిలో, తులనాత్మకంగా జరగా గలిగే పనులు.

ప్రతి వొక్కరికి - మీ పైన నమ్మకం వుండేట్లు ప్రవర్తించండి. నమ్మ దాగిన వారినే మీరు నమ్మండి. మీ జీవితం నమ్మకం గా మంచి దారిలో నడుస్తుంది.


వృశ్చికం 


కొండెతో కుట్టితే దెబ్బలు పడవా?  కాబట్టి - మన కొండే  మనకు శత్రువు. మన దురుసు మాటే , మన దురుసు చేతే  మనకు కొండె లాంటి  శత్రువు .  యిది జ్ఞాపకం వుంటే - జీవితంలో చాలా తప్పులు అసలు జరుగవు.

"అని అనిపించుకో  అత్తగారా" అన్నది పాత సామెత . అత్త గారు మంచి మాట అంటే -   కోడలు, మా అత్త మంచిది అని పది యిళ్ళలో చెబుతుందట . అత్త గారు వొక్క తిట్టు తిడితే, చీది, ఏడిచి, నానా రభసా చేసి, మొగుడి దగ్గర, మామ గారి దగ్గర, పది మంది దగ్గర - అత్త గారికి చీవాట్లు పడే లాగు చేస్తుందట.

విజయ నామ సంవత్సరం లో బృహస్పతి ఆశీర్వాదం మీకు కావాలి. మంచి వాళ్ళ మాట, బుద్ధి మంతుల మాట వింటే - మీరూ బాగుంటారు. మాచుట్టూ వున్న వారూ   బాగుంటారు.  గురు పూజ చేస్తే మేలు


ధనుస్సు 



వ్యాపారస్తులకు  - కొనే వాడికి - నాణ్యంగా వుండే సరుకు, సరసమైన ధరలలో అమ్మే వాడికి - ఎప్పుడూ - ధన లాభం వుండనే వుంటుంది. ప్రతి వస్తువులో - మరేదో కలిపి అమ్మే వాడు - నరకానికే వెడతాడు. వాడిని శనిగ్రహం వెంటాడుతూనే  వుంటుంది.


ఉద్యోగులకు , విద్యార్థులకు - మనసులో నిరుత్సాహం వీడండి . ధైర్యంగా - మీ అభివృద్ధికి , మీ చుట్టూ వున్న వారి అభివృద్ధికి, కృషి ప్రారంభించండి.    మీరు ధనుస్సు పట్టాలి.  విజయ నామ సంవత్సరంలో - యిలా చేసే మీ వారందిరికీ - విజయం  లభిస్తుంది.

భార్యా భర్తలకు  - మీ జీవితంలో కనీసం వొక్కరి పూర్తి  బాధ్యత మీరు వహిస్తే -   మీ  జీవితం బాగుంటుంది. మీకు పెళ్లి అయి వుంటే - ఆ వొక్కరూ   మీ భార్య / భర్త గా వుండాలి .  అలాగే, మీరు మగ వారైతే - మీ తల్లి దండ్రుల బాధ్యతా కూడా మీదే.  ఆడ వారైతే - మీ అత్తా మామల బాధ్యత . ఆ. అదేమిటి పక్షపాతం అనకండి.  

భార్యలకు - మీ యింటి ఆడ బిడ్డ  మీ అత్తా మామ (అంటే తన తల్లీ దండ్రీ ) బాధ్యత  తాను వహిస్తానంటూ  పూనుకుంటే - మీ కొంప కూల్చేస్తుంది. మీకు, మీ అత్తగారికి, భర్త గారికి మధ్య అగ్గి రాజేస్తుంది.  తెలిసా తెలియకా అన్నది కాదు ప్రశ్న - అలా చాలా చోట్ల జరుగుతూ వుంది.    మీరు మీ పుట్టింటికి 'మరీ ఎక్కువగా వెళ్లి'  చొరవ చేసుకుంటే - అక్కడి కోడలి అవస్థ కూడా అలా కావచ్చు. ఈ కాలం లో హక్కుల కోసం పోరాటం యెక్కువ.  బాధ్యతల పట్ల దృష్టి  తక్కువ -ఆడవారైనా సరే . మగ వారైనా సరే.  అందరూ యిలా వుంటారని కాదు. కానీ చాలా చోట్ల యిది జరుగుతూ వుంది.  

మకరం 


వొక మకరం  వొక ఏనుగు కాలు పట్టుకుని వేల ఏళ్ళు  పోరాడిందట. చివరకు దానికి ముక్తి లభించింది . కష్టే ఫలీ -అన్నారు. ఈ సంవత్సరంలో - మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు  విజయం లభిస్తుంది.

విజయం వచ్చే వరకు, నమ్మకంతో, ప్రయత్నం చెయ్యాలి. యిదే మీరు చెయ్యాల్సింది . అన్ని గ్రహాలూ - మీకు అనుకూలిస్తాయి .

మీరు పెళ్లి కావలసిన అమ్మాయైతే - నా సలహా వొక్కటే . తాగుబోతు వాడిని  మాత్రం  పెళ్లి చేసుకోను - అని మీరందరూ పట్టుదలతో వుంటే - మగ వారందరూ - బాగు పడే సూచనలున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న రేపు  లు లాంటివి కూడా బాగా తగ్గి పోతాయి. మీ జీవితం కూడా  ఆనందంగా వుంటుంది.
  

    

 కుంభం 


యుక్తాహార, విహారస్య , యిక్త చేష్టస్య కర్మణి -   అని - గీతలోనే శ్రీకృష్ణుడు చెప్పాడు . ఏది తినాలో ఎంత, ఎప్పుడు  తినాలో - అదే, అంతే తింటే - ఆరోగ్యం.

ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎంత సేపు తిరగాలో - అలా తిరిగితే , ఆరోగ్యమూ . సంతోషమూ.

ఏ పని చేస్తే మంచిదో - మనకూ ,అందరికీ - అదే చెయ్యాలి.  బృహస్పతి, బుధ గ్రహాలు మీకు  అనుకూలిస్తాయి.

ఏ పని చేసినా - దాని ఫలితాలు - మీకు రానే వస్తాయి. కోట్లు ఈ రోజు - జైలు రేపు వచ్చే పనులు చెయ్యకండి .

ప్రతి వొక్క రోజూ - కనీసం వొక పేద వాడి ముఖం లో సంతోషం  చూడగలిగితే - అటువంటి పనులు చేస్తే - శని గ్రహం కూడా, మిమ్మల్ని కాపాడతాడు.

అలాగే - ప్రతి బుధ వారం - ఈ రోజు , నేను, ఏ  వొక్కరినీ - మనసా వాచా కర్మణా - దూషించను, విమర్శించను, అనే వ్రతం పాటించండి. బుధ గ్రహం మీకు, అనుగ్రహిస్తుంది. మీ సంతోషం  పెరుగుతుంది     


మీనం

సముద్రం లోని చేప - సముద్రం ఎక్కడుందా - అని వెదికిందట .

అలా - మీ ఆరోగ్యం, మీ సౌభాగ్యం, మీ ఐశ్వర్యం - మీలోనే వుంచుకుని - ఎక్కడెక్కడో - వెదుకుతారు . ఎప్పుడో తెలుస్తుంది, మీలోనే వుందని.

అది విజయ నామ సంవత్సరంలో - తెలిసే అవకాశాలు పూర్తిగా వుంది.

అన్ని గ్రహాల ఆశీర్వాదం అన్ని రాసుల వారికీ - అందులో మంచిగా వుంటూ . మంచి పనులు చేసే వారికీ , బాగా, తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగించే వారికి - పుష్కలంగా వుంది.

వోటు వేసేటప్పుడు - మన వాడికి కాదు - మంచి వాడికి అనేది గుర్తుంది చస్తే - మనమూ , దేశమూ బాగు పడతాము . 66 ఏళ్ళుగా యిది జరగడం లేదు . విజయ నామ సంవత్సరంలో - జరగ వచ్చు . 

శుభం భూయాత్  

= మీ

వుప్పలధడియం విజయమోహన్
  


    
    

    

5, మార్చి 2013, మంగళవారం

16 సంవత్సరాల వారికి - విశ్రుంఖల సెక్సు హక్కు- అసలు సమస్య ఏమిటి ?



ప్రపంచం  లో  మార్పు  వొక్కటే ప్రతి క్షణం జరిగేది.ప్రతి అణువు లోనూ జరిగేది.  

మార్పు ఆగదు. ఆపలేము. 

ప్రతి ప్రాణి పుట్టుక, పెరుగుదల, అరుగుదల, చావు అన్నీ మార్పులో అంతర్భాగమే.

ప్రాణిగా - మనిషికీ ఇవేవీ తప్పదు.

అయితే చాలా మార్పులు - మనమే ఆలోచించి తీసుకు వచ్చేవి. అవి మంచా, కాదా, చూడాల్సిన అవసరం తప్పకుండా  మనపై వుంది . ఎందుకంటే,  మన కర్తృత్వం లో, మనం తీసుకువచ్చే మార్పులు విషయంలో - మనకు, ఎంతో కొంత స్వతంత్రం వుంది; కొన్ని పరిధులలో యిదా, అదా, మరోటా - అని ఆలోచించి - ఏది మంచిదో  అది - చెయ్యగలిగే వెసులుబాటు వుంది. అందుకనే శ్రీ కృష్ణుడు "కర్మణ్యేవ అధికారస్తే - మా ఫలేషు కదాచన" అన్నాడు.

నువ్వు చేసే  పనుల విషయం లో  - నీకు పూర్తి  అధికారం వుంది . కానీ వాటికి ఏ ఫలితం వస్తుందో - అది మాత్రం పూర్తిగా నీ అధీనంలో లేదు. నీ పనిని బట్టి, ప్రకృతి  నియమాల బట్టి , నీకు ఏ ఫలితం రావాలో - అదే వస్తుంది గాని  నువ్వు అనుకున్న ఫలితం రాక పోవచ్చు .

ఎందుకు నేను అనుకున్న ఫలితం రాలేదు? అంతా తారుమారు ఎందుకు అయ్యింది? ఈ ప్రశ్నలు అసంబద్ధమైనవి.  ప్రకృతి  నియమాలకు అనుగుణం గా చేసేపనికి ఆ నియమాలకు అనుగుణం గానే ఫలితాలు వస్తాయి. మనం అనుకున్నట్టు రావు.   అయితే - ప్రకృతిలో  ఎన్నో మార్గాలు వున్నాయి. ఆ మార్గాలలో ఉత్తమ మార్గాలు వున్నాయి. మధ్యమ మార్గాలు వున్నాయి. అధమ మార్గాలు వున్నాయి.  వాటి వాటి ఫలితాలు వాటి వాటికి వున్నాయి.

స్థూలంగా చెప్పాలంటే - బుద్ధితో సంప్రతించి బుద్ధి మార్గంలో - వెళితే అది ఉత్తమ మార్గం. మనసుతో మాత్రం సంప్రతించి ఆ మార్గంలో, వెడితే  అది అధమ మార్గము. బుద్ధికీ మనసుకూ - కూడా సబబైన మూడో మార్గం మధ్యే మార్గం.

ఈ రోజు వార్తలలో - వొక చిన్న వార్త.  తమకు తాముగా - సెక్సు లో పాల్గొనడానికి   16 సంవత్సరాల వారికి కూడా హక్కు కల్పిస్తున్నారు(ట) - ప్రభుత్వం వారు.

కానీ, పెళ్ళికి మాత్రం 18-21 సంవత్సరాలు  వయో పరిమితి అలాగే వుంటుంది. యిది మీకేమైనా అర్థం అయ్యిందా?

యిది, పెళ్ళికి ముందే - విశ్రుంఖల సెక్సు కు అనుమతినిచ్చినట్టు కాదా?

యిది - వస్తే మనం ఎవరినీ ఆపలేము. అమెరికాలో ఇప్పుడున్న వొక ప్రధాన సమస్య - చిన్న పిల్లల గర్భ ధారణ. ఏ వయసులో, ఎవరు, ఎప్పుడు పిల్లలను కంటారో, వారికి తండ్రి ఎవరో,  ఎవరికీ తెలియటం లేదు.

యిక మన దేశంలోనూ - అటువంటి పరిస్థితి  త్వరలో వచ్చేస్తుంది.

మనం యిక్కడ గమనించాల్సింది - ఈ స్వేచ్చా సెక్సుకూ - ప్రేమలకూ - ఏమీ సంబంధం లేదు.

యిది కేవలం శారీరక సంబంధమైన, హర్మోనుల్లో పుట్టిన  వికారమే తప్ప - ప్రేమా కాదు, దోమా కాదు.

పిల్లలకు అర్థం కాక పోవచ్చు కాక. పెద్దలకైనా అర్థం అయ్యి చస్తే బాగుంటుంది.

ఎవరు పెద్దలు ? తమ స్వార్థం తప్ప ప్రజల క్షేమం గురించి ఏమీ పట్టని వారంతా - పెద్దలయి కూర్చుంటున్నారు .

 అసలు సమస్య ఏమిటో అర్థం కాని వారు పెద్దలు గా వుంటున్నారు.

ఆడ మగ - అందరికీ  15 ఏళ్ళ వయస్సులో -  వయో సంబంధమైన హార్మోనుల అలజడి ఎక్కువగా ఉంటుందనేది -అందరికీ తెలిసిన సత్యమే.

అయితే - ఆ వయసు నుండీ ప్రతి వొక్కరితో - సెక్సు లో, పాల్గొనచ్చు ,అని - పర్మిషన్ యివ్వడం, ఈ సమస్యకు అతి దారుణమైన, ప్రమాద కరమైన  - సమాధానము

యివన్నీ లక్షలాది సంవత్సరాల నుండీ వున్న సమస్యలే.   14-15 సంవత్సరాలలో -ఈ హర్మోనుల అలజడి రావడం మనిషి పుట్టిన నాటి నుండీ వుంది.

కాకపోతే , ఆ రోజుల్లో, యిటువంటి సమస్యలకు - సంఘానికీ,  ప్రతి  మనిషికీ,  ఎంతో కొంత, మేలు జరగ గల సమాధానాలు  వెదికారు.

ఆ రోజుల్లో - బాల్య వివాహాలన్నారు. మంచి వాడిగా, వున్న వరుడిని చూసి, మంచి పిల్ల గా వున్న వధువును చూసి పెద్దలు చేసే వారు.

ఆహా. అది తప్పు. 18 - 21 ఏళ్ళ తరువాతే - పూర్తి పరిణితి  వచ్చిన తర్వాతే, పెళ్లి జరగాలన్నారు మధ్యలో.

మాకు యిష్టం వచ్చిన వారిని ప్రేమించి పెళ్లి  చేసుకుంటాం అన్నారు తరువాత.

ఆ యిష్టం ఎలా వస్తుంది?

ఎలా వస్తుందంటే - 16 ఏళ్ళ వయసు నుండీ - పది మందితో తిరిగి-  ఆ తిరగడమంటే ఏమిటో, యిప్పుడు అర్థం మారుతోంది  - అలా తిరిగిన  వారిలో తమకు నచ్చిన వాడిని / దానిని  చేసుకోవడమే.

యిది మంచికంటారా?  మంచి అని - ఎవరంటారో నాకు తెలీదు కాని - నేను మాత్రం మంచి కాదనే అంటాను.

మొదట కో-ఎజుకేషన్ కావాలన్నారు. తరువాత, సెక్సు-ఎజుకేషన్ కావాలన్నారు.   యిప్పుడు అసలు సిసలు సెక్సు కావాలంటున్నారు, 16 ఏళ్ళ వయస్సులో. దీని తరువాత ఏమిటి?

ఏమీ లేదు. దీని తరువాత అమెరికాలో - గే-యిజం, లెస్బియనిజమ్  వచ్చాయి. స్కూళ్ళలో, మించితే కాలేజీల వరకు - మామూలు సెక్సు. ఆ తర్వాత, అవతలి వారెవరూ నచ్చక పోవడమూ -స్వలింగ సంపర్కానికి అలవాటు పడడమూ ; ఆ తరువాత ? మగవారికి, మగ వారితో పెళ్లి. ఆడవారికి ఆడవారితో పెళ్లి. ఎందుకు? ఏమో? యిది అమెరికాలో చాలా రాష్ట్రాలలో చట్ట బద్ధం చేసేసారు. 

ఆ తరువాత ?? ఆ తరువాత ఎలా మారుతుందో మన ప్రవర్తన !! అది దేవుడికి కూడా తెలీదు.

మన దేశంలో , పూర్వకాలం లో - మగ వాడికి - చదువు పూర్తయ్యే వరకు వరకు బ్రహ్మచర్యము అలవాటు చేసే వారు. తనపై తనకు కొంత కంట్రోల్ వచ్చిన తర్వాత - పెళ్లి చేసే వారు. అది కూడా, 16 ఏళ్ళ వయస్సులో చేసేసే వారు. ఏ ఆటలాడినా - పెళ్లి అనే బంధంలో - వొకరితో వొకరు ఆడుకోండని  విడిచే వారు.

ఈ రోజు కంట్రోల్ కాదు. విచ్చల విడి తత్త్వం అలవాటు చేస్తున్నారు .

ఈ భాగ్యానికి,  16 ఏళ్ళకే - పెళ్లి కీ అనుమతి ఇచ్చేస్తే పోలా ?

ఎవరో వొకరితో సెక్సు సంబంధం అలవాటవుతుంది. అదే ప్రేమగానూ మారుతుంది. అదేదో కాస్త ఆరోగ్య ప్రదం గానూ వుంటుంది.

 వెయ్యి కాళ్ళ మంటపం లాంటిది మన సంస్కృతి. యిది బాగాలేదు, అది బాగా లేదు - అని వొక్కొక్క కాలూ  పీకేస్తే - మంటపం కూలిపోతుంది. అదే జరిగింది అమెరికాలో . అదే జరుగుతూ వుంది మన దేశంలోనూ.

ఈ కలికాలాన్ని ఆప గలమా? ఊహూ. ఆపలేము. రేపటి నుండి - మాకు స్వేచ్చా సెక్సు కావాలి, కావాలి అంటూ, కేకలు వేసుకుంటూ కుర్రకారు ప్రదర్శనలు జరిపినా ఆశ్చర్య పోనక్కర లేదు. 16 కాదు - 14 నుండి కావాలి అన్నా - ఆశ్చర్యం అక్కర లేదు.

అడిగే వాడికీ తెలీదు, యిచ్చే వాడికీ తెలీదు - మనం ఎక్కడికి పోతున్నామో ?   

కొస మెరుపు. ఎవరో వొకావిడ - తీరా తాళి కట్టే సమయంలో - హాల్ట్! అనింది. ఎందుకు, అంటే - నాకు , మరొకరితో,  మరో మతం వాడితో ప్రేమ. వాడినే పెళ్లి చేసుకుంటా - అనింది.   మరి, అంత వరకు నోరు మూసుకుని వుండి, మరో మగవాడి ప్రాణం తియ్యడం ఎందుకు? ఎంత ఖర్చు? ఎంత టైం , డబ్బు, గౌరవం, ఆఫీసు లో లీవూ వేస్టు?  సరే. కోపాలు రావడం సహజం.  వాళ్ళూ, వీళ్ళూ కొట్టుకున్నారట - అసలు దోషిని విడిచేసి.

ఈవిడ - అక్కడికెళ్ళి, ఏ నాలుగో పెళ్ళాం గానో, రాజ్యం చెయ్యొచ్చు.  యిదొక ప్రేమా? కంపు కొట్టడం లేదా ? ఎవరన్నా గౌరవం లేదు. తమ హార్మోనుల గొడవ తప్ప మరొక ధ్యాస  లేదు.  మరొకరి కష్టం గురించి అసలు యోచన లేదు. పోనీ - తమ భవిష్యత్తు గురించి ఆలోచన వుందా అంటే - అదీ లేదు.

దేవుడెలాగూ శిక్ష  వెయ్యనే వేస్తాడు. పోతే పొనీ.

16 ఏళ్ళలో - స్వేచ్చా సెక్సు - కనీసం వొక్క సంవత్సరమైనా, వొక్కరితోనే వుండాలి -  అంటే ఎలా వుంటుంది? స్వేచ్చా సెక్సు ఎవరితోనో , పెళ్ళీ వాళ్ళతోనే - అంటే - ఎలా వుంటుంది?

పోనీ ఏకంగా, వొక్క సారి స్వెచ్ఛా సెక్సు జరిగితే - వెంటనే పెళ్లి చేసేసుకోవాలి - అంటే ఎలా వుంటుంది? అసలు స్వేచ్చా సెక్సు పెళ్లి కాని వాళ్ళతోనే - అంటే?  అప్పుడు, నాయకులు, వినాయకులు,  గూండాలు, టీనేజ్  బాలికలతో ఆడుకోవడం కాస్త తగ్గొచ్చు కదా.  ప్రభుత్వం వారికి, ఇవేవీ పట్టడం లేదు. స్వేచ్చా సెక్సు కు, వయస్సు తగ్గించాలి - అదీ 16 ఏళ్ళకు - అంతే వారి ఆలోచన.  


= మీ

వుప్పలధడియం  విజయమోహన్






 

21, ఫిబ్రవరి 2013, గురువారం

వేమన ఏమన్నాడు? = మనం బాగు పడాలంటే = ఈ చిన్ని వ్రతం ( వొక వారం రోజుల పాటు) చేద్దామా ?



జ్ఞాని వేమన ఏమన్నాడు?

తప్పులెన్ను వారు తండోపతండంబు  
లుర్వి జనులకెల్ల నుండు తప్పు 
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు 
విశ్వ దాభిరామ వినుర వేమ !

వేమన తెలుగు వారి కొక మకుటం లాగా, గుర్తింపు  తెచ్చాడు.

ఆయన గురువులకందరికీ  గురువు. ఏ గురువు గారైనా మనకు జీవితం  గురించి  విడమరిచి చెప్పాలంటే ,  వేమన పద్యాలు వివరించి చెబితే చాలు. జీవిత సారాంశం  చాలా వరకు అర్థమై పోతుంది. 

ఈ పద్యాలు నేను ఎప్పుడో, నాలుగేళ్ల వయసులో , మా అమ్మమ్మ గారు నేర్పిస్తే నేర్చుకున్నవి.    అరవై మూడేళ్ళ వయసులో - యిప్పటికీ చాలా వరకు జ్ఞాపకం  వున్నాయి.

మచ్చుకు వొక పద్యం యిక్కడ ఉదాహరించాను.

ఈ నాలుగు చిన్ని చిన్ని వాక్యాలలో - ఎంత అర్థం వుందో - చూడండి.

తప్పులెన్నువారు    తండోపతండంబులు - నిజమే కదా.

ఎక్కడి కెళ్ళినా - యిది మనం చూస్తూనే వున్నాము. ప్రపంచంలో  అందరి తప్పులూ మనకు తెలుసు. అందరినీ విమర్శిస్తాం . మనలాగే మన పక్క వారూ. వారి పక్క వారూ - మనమందరూ అంతే.  విమర్శించడం మన జన్మ హక్కు . పోనీ. మనం విమర్శించే  తప్పు  - కనీసం మనం చెయ్యకుండా వున్నామా?  వూ. అదీలేదు. ఆ తప్పు మనం చేస్తూనే, మరొకరిని విమర్శిస్తూ వుంటాం. అందుకనే వేమన అన్నారు -    తప్పులెన్నువారు    తండోపతండంబులు. నిజమే కదా!

సరే . రెండో వాక్యం చూడండి.      "ఉర్వి జనుల కెల్ల వుండు తప్పు"

తప్పులే చెయ్యని వాడు ప్రపంచంలో పుట్ట లేదు. దేవతలు కూడా తప్పులు చేస్తారు వొక్కో సారి.

దానికి తగిన ఫలితమూ అనుభవిస్తారు. పార్వతీ దేవి మగనికి అవమానం జరిగే యజ్ఞానికి వెళ్లి - తను కూడా అవమానం పాలైంది కదా. మహా యోగి శివుడు కూడా - యివ్వ తగని వరాలు యిచ్చి కస్టాలు అనుభవించాడు కదా. యివి కథలు కావచ్చు. కానీ మన కోసం చెప్ప బడ్డ  జీవిత సూత్రాలు.

 మరి మూడో వాక్యం చూద్దాం : " తప్పులెన్నువారు తమతప్పులెరుగరు "

యిది చాలా ముఖ్యమైనది. చుట్టూ వున్న వారి తప్పులే, చూసే వారికి - తమ తప్పులు అసలు తెలీవు.

నాలుగో వాక్యం అంత కంటే ముఖ్యం - "వినుర వేమా!"

యివన్నీ - ఆయన తనకోసమే చెప్పుకుంటున్నట్టు రాశాడు. అంటే, వేమన గారు - మనిషికి , ఈ విషయాల్లో,  అంతర్మథనం - చాలా ముఖ్యమైనట్టు చెబుతున్నారు.

ఎవరో చేసే తప్పులు వేలెత్తి చూపుతాం. అదే తప్పు మనమూ చేస్తున్నట్టు గుర్తించం.

సరే. మనం చెప్పాం. వారు మారొచ్చు; మారక పోవచ్చు .

మారితే వారు బాగుపడ్డారు.  మంచిదే. కానీ, మనమెప్పుడు బాగు పడేది?  మనం ఎవరు చెబితే వింటాం? "తప్పులెన్నువారు" మిగతా వారి మాటలు వినరు గాక వినరు. తమ తప్పులు చూడరు గాక చూడరు.

"నాలో తప్పులే లేవు" అనే వాడంత మూర్ఖుడు మరొకడు లేడు.   మనందరిలో తప్పులున్నాయి. వాటిని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ప్రతి నిమిషం వుంది. ప్రతి రోజూ పడుకునే ముందు మనం చేసిన తప్పులు ఏమిటి అని చూసుకుని, వాటిని రేపెలా సరిదిద్దు కుంటామో  ప్రణాళిక  వేసుకొవాలి.  దానికి దైవ సహాయం అడగాలి. అదే ప్రార్థన.

మీకు తెలిసే వుంటుంది - మన పూజల్లో - యిది వొక ముఖ్య భాగం.  నేను తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు -వాటిని మనం పాపాలు అని అంటాం - వాటిని క్షమించు . మళ్ళీ వాటిని చెయ్యకుండా కాపాడు -అని ప్రార్థిస్తామ్. దేవుడు ఎక్కడో లెదు. మన లోపలే వున్నాడు. బయటా వున్నాడు. ప్రార్థన రెండింటికీ అందుతుంది.

మన పూజలలో, ప్రార్థనలో - పక్క వాడి తప్పుల గురించి లేదు. వాడి పాపాల గురించి లేదు. మన తప్పులు, మన పాపాల గురించే వుంది.

పక్క వాడి గురించి మాట్లాడ్డం - మన అలవాటు. అంతే.

సరే . మరెవ్వరి గురించీ - మనం మాట్లాడనే కూడదా ?

మాట్లాడొచ్చు .  మొదట - వారి తప్పులు, మనలో  లేకుండా చూసుకోవాలి.  తరువాత - వారికి, మనం చెప్ప దగిన వాళ్ళమా, మనం చెబితే వారు వినే పరిస్థితిలో వున్నారా - అనేది కూడా చూడాలి.

సంస్కృతంలో వొక సూక్తి వుంది. "సత్యం బ్రూయాత్; ప్రియం బ్రూయాత్; న బ్రూయాత్ సత్యమప్రియం".

సత్యం మాత్రమే చెప్పాలి. కాని, అది ప్రియంగా వుండేటట్టు చెప్పాలి . అలా మంచి మాటను మంచిగా చెప్పలేని వారు - చెప్పకుండా వుండడమే మంచిది.

కొంత మంది అంటూ వుంటారు - నాకు కర్ర విరిచినట్టు మాట్లాడడమే అలవాటు అని. అదేదో  గొప్ప అయినట్టు చెబుతూ వుంటారు. వారు, అసలు మాట్లాడడమే తెలీని వారు - అన్న విషయం వారికి తెలీదు.  అంటే - మనం తెలుసుకోవాల్సిన విషయం - మనం అలా వుండకూడదని.

సరే . నాయకుల విషయంలో - వారి తప్పులు వారికి చెప్పాల్సిన అవసరం తప్పకుండా వుంది. అదే - ప్రజాస్వామ్యం.

శ్రీ రాముడు - గూఢ చారుల వద్ద ముఖ్యంగా అడిగేది యిదే.

నా పాలనలో వున్న తప్పుల గురించి ప్రజలేం మాట్లాడుతున్నారు - అని.   శ్రీ రాముడి పాలనలో - ప్రజలకు ఆ స్వతంత్రంవుంది. రాజు పాలన గురించి ప్రజలు -మాట్లాడాలి; మాట్లాడే వారు; అది రాముడు వినే వాడు.

కానీ, ఈ రోజు, మన నాయకులకు - తమను గురించి, ప్రజలు ఏమనుకుంటున్నారో - అన్న బాధేం లేదు.

కొంత మంది నాయకు(లు / రాళ్ళు) - ప్రజలు తమను గురించి - వొక్క మాట - మాట్లాడితే -వారిని జెయిల్లో వేసేస్తున్నారు. వీరంతా - ప్రజాస్వామిక నాయకులనడం - సిగ్గు చేటు. "తప్పులే" చేస్తాననే నాయకులు - మన దేశం లో ఎంతో మంది . మరి మన తప్పేమిటి? వీరిని నాయకులుగా ఎన్నుకోవడం.

నాయకుడు లంచ గొండి  వాడైతే - దేశమంతా లంచ గొండి తనం ప్రాకి పోతుంది.  నాయకుడు స్వార్థ పరుడైతే -దేశమంతా అలాగే తయారవుతుంది. మనం మతం వాడని మన కులం వాడని మనం ఎన్నుకునే నాయకులు - ఎప్పుడూ న్యాయం చెయ్యలేరు, చెయ్యరు. మంచి వాడు, నిజాయితీ పరుడు నాయకుడైతే - అతడెన్ని తప్పులు చేసినా సరే - దేశం బాగు పడుతుంది. అతడు మనం చెబితే వింటాడు కూడా. అదే  రామ రాజ్యం .    అదే ప్రజా స్వామ్యం.

కుల రాజకీయాలు పక్కన బెడితే - మంచి నాయకులు మనకు కనిపిస్తారు.

సరే. దేశం బాగు పడాలంటే -మంచి నాయకులు కావాలి. మన తప్పులు మనం - గుర్తించి , మంచి వారిని మన నాయకులుగా ఎన్నుకోవాలి. 

మనం బాగు పడాలంటే - మన తప్పులు మనం తెలుసుకొవాలి. దిద్దుకోవాలి. యిది రోజూ చెయ్యాల్సిన పని. యిదే దైవ ప్రార్థన . యిదే ముక్తి మార్గం. యిదే మన సంతోషానికి రాచ బాట.  

ఈ రోజు నుండీ - వొక వారం రోజుల పాటు - "నేను ఎవరి తప్పులూ వేలెత్తి చూపను" అని వొక వ్రతం పెట్టుకోండి. మీ జీవన విధానంలో గొప్ప మార్పు వస్తుంది . మీ మనసులో ఎంతో శాంతి, ఆనందం  నిండుతుంది .  

శుభం భూయాత్

= మీ
 
వుప్పలధడియం విజయమోహన్

చివరి మాట : నేను చేసినవే , పాఠకులకూ చెబుతాను. చేయనివి, చెయ్య లేనివి - చెప్పను.     

  
 

4, జనవరి 2013, శుక్రవారం

ఏ వ్యాధైనా తప్పకుండా తగ్గుతుంది. ఎలా ? రోగాలు ఎలా రాకుండా జాగ్రత్త పడాలి? ఆరోగ్యానికి మూల సూత్రాలు ఏవి?

 

ఏ వ్యాధైనా తప్పకుండా తగ్గుతుంది. ఎలా ?

రోగాలు - ఎలా తగ్గుతాయి? - ఎలా రాకుండా వుంటాయి?

ఆరోగ్యానికి  మూల సూత్రాలు ఏవి?

  


రోగాలు మనిషికి ఎప్పుడైనా రావచ్చు. తల్లి కడుపులో ఉన్నప్పుడే రావచ్చు; పసి పాప గా వున్నప్పుడు  రావచ్చు; పెరిగేటప్పుడు రావచ్చు. యవ్వనంలోనూ రావచ్చు. మధ్య వయస్కులుగా ఉన్నప్పుడు, ముసలితనంలో- ఎప్పుడైనా రావచ్చు. చనిపోయే  వరకు ఏ క్షణంలో నైనా రావచ్చు.

రోగాలు వస్తూ వుంటాయి. ఏదైనా సరే - వొక కాలంలో వచ్చేది, మరో కాలంలో పోతుందని, తాత్త్వికులు చెబుతారు . కానీ- కొన్ని రోగాలు రావడమే గాని, పోవడం అంటూ వుండదు కొందరికి. మనం పోయేటప్పుడు, మనతో బాటే అవీ పోతాయి. అంత వరకు మనతో బాటే వుంటాయి.

కొన్ని మహా బాధ పెట్టేవి. మరి కొన్నిటిలో శారీరక బాధ తక్కువ. అటువంటి వాటిని మనం తరచూ పట్టించుకోక పోవడం  జరుగుతుంది, మన కొంప అవి ముంచే వరకూ .

మరి కొన్ని అసలు  రోగాలా, కాదా - అని చెప్పడం మహా కష్టం. పుట్టే టప్పుడు,  తలలోనో, వీపులోనో, మరెక్కడో అతకబడి పుట్టిన పిల్లలు వున్నారు. అది సరి చెయ్యకపోతే, జీవితాంతం వారికి ఎన్నో రకాల బాధలు తప్పవు. సరి చెయ్యాలంటే  ఎన్నో సమస్యలు.

అయిదారు ఏళ్ళ పాపకు మధుమేహం. కొందరికి పుట్టినప్పుడే గుండెలో ఏదో సమస్యలు. లేదా, కొందరికి ఎప్పుడూ  ఎడతెగని పడిశం, దగ్గు లాంటి చిన్న, చిన్న రోగాలు. పేరు చిన్న, కానీ అవి పెట్టే బాధ, పెద్ద రోగాలు కూడా పెట్టవు . ఏ రోగానికీ తట్టుకోలేని పిల్లలు ఎంతో మంది.

కొంత మందిని, పుట్టేనప్పుడే, అనారోగ్యంతో ఎందుకు పుట్టిస్తున్నాడు దేవుడు? ఆ..అది...వాళ్ళ నాన్నా, అమ్మలకో,  వా...రి నాన్నా అమ్మలకో... ఆ.. జబ్బులు వుంది కాబట్టి వీరికీ వచ్చింది - అంటుంది సైన్స్. పోయిన జన్మ లో చేసిన కర్మ ఫలితం నాయనా - అనుభవించక తప్పదు అంటుంది - కర్మ సిధ్ధాంతం . రెండూ కొంత నిజమే కావచ్చు.

మరి వచ్చినవి - ఎప్పుడు పోతుంది ,ఎలా పోతుంది? కొన్ని పోనే పోవు  అంటుంది సైన్స్. చేసిన కర్మ ఫలితం తీరిపోతే మంచైనా, చెడైనా , ఏదైనా పోతుంది - అంటుంది కర్మ సిద్దాంతం. - అయితే రోగాలకు వైద్యం వొద్దని కర్మ సిద్దాంతం  చెప్ప లేదు.  సమస్యలకు సమాధానాలు వెతకొద్దని ఎప్పుడూ చెప్ప లేదు.

వొక్కో సారి - కొన్ని ప్రాంతాలలో , మహా మారి లాగా కొన్ని రోగాలు లక్షల, కోట్ల మందిని పీడిస్తాయి. ఉదాహరణకు,ఆఫ్రికాలో, కొన్ని ప్రాంతాలలో, ఎయిడ్స్ వ్యాధి, ముప్ఫై శాతం మందికి వుందట. ఎయిడ్స్ వ్యాధి కి యిప్పటికీ మందు లేదు.యిప్పట్లో వచ్చే ఆస్కారం కూడా కనిపించడం లేదు. కానీ వ్యాధి రాకుండా కొంత జాగ్రత్త పడ వచ్చు.  వొక్క  దక్షిణ ఆఫ్రికాలో మాత్రం  2010 లో 2,80,000 మంది ఎయిడ్స్ వలన చని పోయారట చనిపోయే వారిలో  ఎయిడ్స్ తో పోయే వారి శాతం ఆ దేశంలో - చాలా ఎక్కువ .

మన దేశంలో - మధుమేహం, రక్త పోటు, ఆస్తమా, గుండె జబ్బులు -అన్నీ ఎక్కువగా వున్నాయి.-అయితే  భారతీయులంతా - వీటికి భయపడడం మానేశారు. మీకుందా, అంటే మీకుందా అని అడుగుతూ - మీరేం తీసుకుంటున్నారు అంటే, మీరేం తీసుకుంటున్నారు అని తెలుసుకుంటూ - వొకరికొకరు సలహాలిచ్చుకుంటూ - బ్రతికేస్తున్నారు.

అల్లోపతి లో కొన్ని నూతన పరిశోధనలు జరుగుతూ వున్నాయి. పాత రోగాలకు మందులు వస్తే - కొత్త రోగాలు పుట్టుకు వస్తున్నాయి. కలరా పోయిందా. డెంగ్యూ వచ్చింది. మలేరియా పోతే స్వైన్ ఫ్లూ  వచ్చింది. మరి కొన్ని వ్యాధులకు పేర్లే లేదు. రేపేం కొత్త వ్యాధి వస్తుందో ఎవరికీ తెలీదు.

కనీసం వొక్క నెలైనా -  ఏ  రోగంలేకుండా వున్న కుటుంబం ఎక్కడైనా వుంటే - దాన్ని చూడాలని ఆశ  పడుతున్నాను. కానీ ఈ రోజు వరకూ చూడలేక పోతున్నాను.

ఎవరో వొక మాట చెప్పారు ఈ మధ్య.  ప్రతి సగటు మనిషీ, ప్రతి రోజూ,  తెలిసో, తెలియకో, కనీసం నాలుగు అబద్ధాలాడతారట. అంటే - సంవత్సరానికి, దాదాపు 1,500 అబద్ధాలన్న మాట. 70 ఏళ్ళ జీవితంలో లక్షకు పైగా అబద్ధాలాడతారట.కొంత మంది పది లక్షల అబద్ధాలు చెప్పే వారూ వున్నారు. అంత కంటే ఎక్కువ అబద్ధాలు చెప్పే వారూ వుండ వచ్చు.

చిత్రమేమంటే - దీన్లో  సగం భాగం అబద్ధాలు జీవితాంతమూ వొక్కటే అబద్ధమే. అదేమిటంటే - ఐ ఆమ్  ఫైన్  - తెలుగులో , "నేను బాగున్నాను" - అనడం.  కానీ - ఆ తరువాత పది మాటలు మాట్లాడిస్తే - తను ఎన్ని రకాలుగా బాగా లేదో నిజం చెప్పేస్తుంటారు.

నేను బాగున్నాను - అని నోటితో అనే  వారు వున్నారు కానీ, నేను బాగున్నాను అని తనలో తాను నిజంగా, మనస్ఫూర్తిగా  అనుకునే వారు, అనుకోగలిగే వారు - చాలా తగ్గి పోతున్నారు, ఈ రోజుల్లో .

శారీరక రుగ్మతలు మాత్రమే కాదు.  మనకు తెలిసినవి తెలీనివి - అనేక  రకాల మానసిక రుగ్మతలు కూడా మన సమాజంలో చాలా ఎక్కువ;   యింకా ఎక్కువ అవుతున్నాయి  అని - తెలుస్తూనే వుంది.

ఎందుకిలా? మనం బాగుండగలమా? బాగున్నామని మనస్ఫూర్తిగా అనుకోగలమా?ఎందుకు, ఎప్పుడూ బాగుండ  లేని పరిస్థితులలో చాలా మంది వుంటున్నాము?

రామ రాజ్యం అంటే ఏమిటి?  రోగాలు చాలా తక్కువగా వుండడం. అకాల మరణాలు లేకపోవడం. ప్రజలలో ధార్మిక జీవనం వలన - సుఖ సంతోషాలు ఎక్కువగా వుండడం - యివన్నీ  రాజుగా వున్న వారు  ముఖ్యంగా చూసుకోవలసిన విషయం.

భవిష్యత్తులో  వోటు వేసేటప్పుడు - "మన' వాడికి" కాదు - "మంచి వాడికి" వోటు వేద్దాం. ఆ వొక్క పని చేస్తే, మన రోగాలు సగం తగ్గుతాయి.

యిప్పుడు వున్న రోగాలు పోగొట్టుకోవడం ఎలాగో కాస్త చూద్దాం .


చాలా మంది వైద్యులు, మీరు జీవితాంతామూ మందులు తీసుకుంటూ వుండాల్సిందే, కష్ట పడాల్సిందే - అన్న వ్యాధుల గురించి - ముఖ్యంగా, కొంత మంది రోగులు, నన్ను సలహా అడుగుతూ వుంటారు.

నేను వైద్యుడు కాదు - కానీ - ఏ రోగాన్నైనా - పూర్తిగా నయం చేయగలిగే మందు వుందని - నేను విశ్వసించే వాడిని.  అలాగే, ఏ రోగాన్ని గురించి ఎవరు నన్నడిగినా - సరైన, వైద్య ప్రముఖులు ఎక్కడ వున్నారని ఇంటర్ నెట్ ద్వారా - కనిబెట్టి, వారికి చెప్పడం నా అలవాటు.అందులోనూ - అల్లోపతీ, ఆయుర్వేదాలు రెండింటినీ  వాడటం వలన అతి త్వరితంగా వ్యాధులు వుపశమిస్తాయని - నా నమ్మకం. అలాగే, కొన్నిటికి, హోమియోపతీ కూడా బాగా పని చేయడం నేను చూసాను. కానీ అల్లోపతీ, హోమియోపతీలు వొకే సారి వాడడం కుదరదని చాలామంది చెబుతారు. రెండూ వొకదానికొకటి, విరుద్ధమైన పద్ధతులు.

ఎక్కడో  వొక గొప్ప వైద్యుడు చెప్పాడని చదివాను - ఎక్కడ రోగం వస్తుందో, అక్కడే,  దానికి విరుగుడు కూడా వుండనే వుంటుంది -అని.  అంటే - చుట్టుపట్ల - మన రోగానికి తగిన వైద్యం వుండనే వుంటుంది - అనేది - సిద్దాంతం.

జీవకుడనే ప్రాచీన కాలపు  వైద్యుడు వొక సారి, శిష్యులతో అన్నాడట - ప్రపంచంలో ఏదైనా "మందు" కాని పదార్ధం  వుంటే కనుక్కుని తీసుకు రండి - అని. ఏతా, వాతా తేలిందేమిటంటే -వైద్యానికి పనికి రాని  పదార్థమంటూ ప్రపంచంలో లేదని.

మనిషి మాట మహా గొప్ప మందు. నమ్మకం కలిగించే ప్రతి మాటా మందే. మీ చుట్టూ వున్న రోగులలో - మీరు మొట్ట మొదట - రోగం పోతుందనే - నమ్మకం కలిగించాలి.

అలాగే, రోగం మనతో ఉన్నంత కాలం కూడా - మనం సంతోషం గా వుండగలం; వుండాలి - అనే విశ్వాసం మనలో వుండాలి. రమణ మహర్షి గారు కానీ, రామకృష్ణ పరమహంస గానీ, ఆది శంకరాచార్యులు గానీ, పెద్ద రోగాలతో బాటు, చాలా  సంతోషంగా - జీవితం గడిపిన వారే.

కాకపోతే - మనం మందులు కూడా తీసుకుంటూ, రోగాలు పోతాయనే నమ్మకంతో - సంతోషంగా వుండొచ్చు. వారు శరీరం పోతే పోనీ అని వదిలేసారు. అలా మనకు వద్దు. మనం సామాన్యులు కదా. శరీరం పైన కాస్తో , కూస్తో ప్రేమ వున్నవాళ్ళం కదా.

మనకోసం చెప్పబడిన వాక్యం - దేహో దేవాలయో ప్రోక్తః -అంటే మీ దేహం వొక దేవాలయం. దాన్ని శుభ్రంగా, రోగాలు రాకుండా, లేకుండా పెట్టుకొండి  - అని.

చిన్న, చిన్న విషయాలలో శ్రద్ధ వహిస్తే - చాలా రోగాలు రానే రావు.

మీకు తెలుసు - చాలా రోగాలకు ప్రధానమైన వాహకాలు - అంటే రోగాన్ని, అది వున్న చోటినుండి , మన శరీరం వరకు తీసుకొచ్చి, మనలోకి చేర్చేవి - దోమలు, ఈగలు.

మీ యింటి దగ్గర యివి లేకుండా చూసుకుంటే - చాలా రోగాలు రావు.  ఎలా? మీ యింటి దగ్గర మురుగు నీరు, కుళ్లి పోతున్న పదార్థాలు  లేకుండా చూసుకోవాలి. వుంటే, వాటిపై, బ్లీచింగ్ పౌడర్ లాంటివి - చల్లాలి. సరే. మీ పంచాయితీ వారి ముఖ్యమైన పని - వీటిపై వొక లాంటి గాస్ విడవడం. లేదా బ్లీచింగ్ పౌడర్ వంటివి చల్లడం.  వూళ్ళో దోమలు, ఈగలు లేకుండా చూసుకోవలసిన అతి ముఖ్య బాధ్యత పంచాయితీ వాళ్ళదే. వాళ్ళు చెయ్యలేదంటే - కంప్లైంట్  యివ్వండి. వాళ్ళు చెయ్యాలి. లేదంటే - చేసేటట్టు మీరు చెయ్యాలి.

యింట్లో దోమలు, ఈగలు వుంటే - మీరు మరీ జాగ్రత్త పడాలి. అవి చావకుండా ఎగిరిపోయేటటువంటి పరికరాలు  వాడొచ్చు. కానీ - మీరు మరీ అంత  అహింసా వాదులైతే  కష్టం. ఈ రోజు వొక ఈగ, వొక దోమ వుంటే, రేపటికి అవి వొక వందగా మారుతాయి.  తరువాత వేలు, లక్షలుగా మారుతాయి. మీ పైన పండుగ చేసుకుంటూ వుంటాయి. మీకు, వాటి వల్ల,  ఎన్ని రకాల రోగాలు రావొచ్చో - చెబితే ఆశ్చర్యపోతారు. ఏనుగు కాలు నుండీ కలరా, మలేరియా,  మరి ఎన్నో వ్యాధులు  వాటి వల్ల వస్తాయి.- అవి తగ్గడం చాలా కష్టమైన వ్యాధులు కూడా. కాబట్టి మీ ఛాయిస్ వొకటే - మీరు బాగుండాలా?  దోమలు, ఈగలు బాగుండాలా?    మరో ఛాయిస్ లేదు. ఎవరో వొకరు బాగుండొచ్చు.యిద్దరూ కాదు.

ఏదో, ఈగ సినిమా చూసేసి, యీగలంటే  భయపడడమో, వాటిపై ప్రేమ పెంచుకోవడమో  లాంటివి చెయ్యకండి. యీగలకూ, దోమలకూ, మీరు విలన్లు కాకపోతే, అవి మాత్రం మీకు పుట్టడమే విలన్లు గానే పుట్టాయి - అన్నది జ్ఞాపకం పెట్టుకోండి.  బాగున్న సినిమాలు, కొందరు మనుషులపై పనికి రాని కొన్ని పెద్ద ముద్రలు వేస్తూ వుంటాయి.

సరే. నా సలహా - ఈగలు, దోమలు మీ యింటి పరిసరాలు, మీ యింటి లోపల - వుండకుండా చూసుకోండి.  వుంటే మాత్రం, కిటికీలకు, వాకిళ్ళకు దోమ తెరల లాంటివి దొరుకుతాయి - అవి కట్టండి.

ఆహార పదార్థాలు అన్నిటి పై మూతలు పెట్టడం ఎప్పుడూ మరిచి పోకండి.

వీలైనంత వరకు - ఆహార పదార్థాలు - అప్పటికప్పుడు చేసుకుని, వేడిగా తింటే - బాధ లేదు. చల్లటి పదార్థాలు, అంటే నిన్నటి రోజు, లేదా, యింకా అంతకు కూడా ముందు చేసినవి - వద్దే వద్దు. అవి తామస గుణ ప్రధానమైనవి. రోగాలతో బాటు, సోమరితనం, మరెన్నో తామస గుణాలు కలుగ జేస్తాయి.   యిది చెప్పింది - గీతలో శ్రీకృష్ణుల వారు. మరి మీ యిష్టం.

చల్లటి ఆహార పదార్ధం వేడి పెడితే చెడి పోతుందని, కొంత మది చల్లగా తినేస్తూ వుంటారు. దాని వాసన మీ ముక్కుకు తెలియక పోవచ్చు కానీ - అది అప్పటికే చెడి పోయినట్టే లెక్క. ఆరోగ్యం కావాలంటే - ఆ మాత్రం శ్రమ పడాలి మనం. లేకుంటే - అనారోగ్యం  మన వెనుకే వస్తుంది. ఎందుకొచ్చిందో తెలీకుండా వచ్చేస్తుంది.

యింట్లో, ఊడ్చిన చెత్త, ఆహారపదార్థాలు, ఆకులు, లాంటివి - వూడ్చి మన ఇంట్లోనే ఏదో మూలలో వున్న చెత్త కుండీ లో వెయ్యడం మన అలవాటు. అవి రోజుకు రెండు సార్లు - యింటి బయట వున్న పంచాయితీ వారి చెత్త కుండీలలో వేసెయ్యాలి.  చాలా వరకు, దోమలు మన  యింట్లోని చెత్త కుండీల్లోనే - నివాసం పెడతాయి. అక్కడి నుండీ, రాత్రి మనపైన స్వైర విహారం చేస్తాయి. అందుకని, రాత్రి పడుకునే ముందు, తప్పక  యింట్లోని చెత్త కుండీ ఖాళీ  చేసెయ్యండి. యిది ముఖ్యం. మీరు పడుకునే గదిలో - దోమలు, ఈగలు  లేకుండా చూసుకోవడం అతి ముఖ్యం.

ఎందుకింత ఉపోద్ఘాతం చెబుతున్నానంటే - వీటిపై చాలా మందికి అవగాహన లేదు గనుక.

నిజానికి - మంచి ఆహారము, మంచి నీరు, మంచి గాలి, మంచి, పరిశుద్ధమైన పరిసరాలు - ఇవీ మన ఆరోగ్యానికి ముఖ్యమైన అవసరాలు; ప్రాతిపదికగా నిలిచే అంశాలు. వీటన్నిటినీ మనం రకరకాలుగా పాడు చేస్తూ ఉన్నాము.

ఆహారంలో ఎన్ని రకాల కలపడాలు జరుగుతున్నాయో, చదువుతూ వుంటే ఆశ్చర్యం వేస్తుంది. దీన్ని అడిగే నాథుడే లేదు. అడగవలసిన వాడు, తనకు డబ్బొస్తే   చాలనుకుంటూ వున్నాడు. మన  ఉద్యోగుల, నాయకుల  లంచగొండి తనానికి హద్దే లేకుండా పోయింది. కాయలు పండ్లు కావడానికి, విష ప్రదమైన లోహాలను  వాడుతున్న వారు చాలా మంది వున్నారు. పాలలో, నీళ్ళు కలపడం కాదు; బోరిక్ పౌడర్ లాంటివి కలుపుతున్నారట. వడ్లలో, బియ్యంలో,  గోధుమల్లో, రాళ్ళు కలపడం పాత విషయం. మనం ఎప్పుడు మారుతాం? ఎవరికి రోగాలోచ్చినా ఎవరు చచ్చినా-నాకేం ఫరవాలేదు. నేను మాత్రం కలపడం చెయ్యకుండా వుండను - అనే వారు చాలామంది. నేను బంగారంలో కలపడం గురించి కాదు - మనం ప్రాణంతో వుండాలంటే కావలసిన శుభ్రమైన  ఆహారాన్ని గురించి మాట్లాడుతున్నాను.  ఈ కలపడం అనే వొక్క అలవాటు మాన్ప గలిగితే దేశంలో సగం రోగాలు రావు.

మొన్న వొక అంతర్జాతీయ వ్యాపార సంస్థ - మన దేశంలో  అమ్మే చికెన్ పదార్థాలలో, పురుగులుండడం చూసిన కొనుగోలుదారులు, వారిని పట్టి నిలదీశారు.లోపలి కెళ్ళి చూస్తే, ఎన్ని పదార్థాలలోనో పురుగులుండడం గమనించారు.    యిండియా కదా - యిక్కడ ఏమైనా చెయ్య వచ్చు అని వారూ అనుకొని వుంటారు. మనలో వున్న ఈ స్తబ్దత పోవాలి. తప్పు చేస్తున్న వాడిని, కలపడం చేస్తున్న వాడిని నిలదీసి అడిగే సామర్థ్యం, ధైర్యం రావాలి.  ప్రతి గ్రామం లోనూ - వొక కన్స్యూమర్ సంఘం రావాలి. అందులో అందరూ, సభ్యత్వం వుండాలి వారి ద్వారా విక్రయ దారులను నిలదీయాలి. 

మంచి ఆహారం వున్నా, చేతిలో డబ్బు కూడా వున్నా - ఆ డబ్బును, మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు, పొగ త్రాగడానికి ఖర్చు చేసే,  తనకూ,యింట్లో వారికీ  సరైన తిండి లేకుండా చేసే  మహానుభావులెందరో వున్నారు.

మరి వారి ఆరోగ్యము, వారి కుటుంబం లోని వారి ఆరోగ్యము, చదువులు, యింట్లోని  సుఖ సంతోషాలు చెడి పోవడం తప్పక జరుగుతాయి కదా.   యిదంతా  దేని ప్రభావం?  వారు ఈ అలవాట్లు మానక పోతే - ఎవరేం సహాయం చేసినా ప్రయోజనం లేదు. ఈ మధ్య మనం చదువుతున్న రేపు కేసులు చాలా వాటిలో - మనకు కనపడుతున్న ముఖ్యాంశం - రేపు చేసిన వారు చాలా వరకు, తాగున్న వారే. మరి కొన్ని కేసులలో - మాదక ద్రవ్యాలు అలవాటున్న వారు.  ఏది తినాలో అది తినరు. ఏది త్రాగాలో అది త్రాగరు. ఏది తమ ఆరోగ్యానికి, సమాజ ఆరోగ్యానికి భంగం  కలిగిస్తుందో - అదే తింటామంటారు, త్రాగుతామంటారు.

 మనం త్రాగే నీరు మంచి, త్రాగు నీరు కాక పోతే, అనేక రోగాలు రానే వస్తాయి. పల్లెలలో కానీయండి పట్టణాలలో కానీయండి; యిప్పటికీ, శుభ్రమైన  త్రాగు నీటి సదుపాయం పూర్తిగా లేదు.  నీళ్ళలో అనేక రకాల ప్రమాద కరమైన రసాయనిక పదార్థాలు వున్న ప్రదేశాలు ఎన్నో వున్నాయి. అక్కడ వున్న చాలా మంది లో - అనేక రకాల రోగాలు ప్రబలం గా వున్నాయి. ఈ మధ్య వచ్చిన వొక రిపోర్ట్ ప్రకారం గంగానది లో కూడా, ప్రమాదకరమైన ఆర్సెనిక్ లాంటి రసాయనాలు కలిపే పరిశ్రమలెన్నో వున్నాయట. తత్ ఫలితంగా -  కొన్ని గంగా తీరప్రాంతాలలో, రక రకాల కాన్సర్లు చాలా ఎక్కువగా వున్నాయట. నదులను కలుషితం చేస్తూ కొంత మంది ధనవంతులు కావడానికి, మనం ఎన్నో ప్రాణాలను పణంగా పెడుతున్నాము.

అలాగే - మనం పీల్చే గాలి శుభ్రంగా వుండాలి. దేవుడు శుభ్రమైన గాలినే యిచ్చాడు.  కానీ దాన్ని కూడా మనం కలుషితం చేస్తున్నాము - రకరకాలుగా .

రెండు నెలల క్రితం  మేము, కాశీ నుండి  చెన్నైకి వస్తున్నాము. మార్గంలో, మహారాష్ట్ర -ఆంధ్ర ల మధ్య , వొక చోట ఏదో వొక మిల్లు ప్రక్కన మా రైలు సిగ్నలు లేక పది నిముషాలకు పైగా ఆగింది.

ఆ మిల్లు నుండి వస్తున్న కలుషితమైన గాలితో, రైలంతా నిండి పోయింది. ఆ గాలి - దట్టమైన చెక్క రంగుతో, ఏదో దుర్గంధమైన వాసనతో నిండి వుంది.  రైలు లో వున్న ఎవరూ వొక్క నిముషం కూడా ఆ గాలిని భరించ లేక పోయారు. అందరూ తలుపులన్నీ  వేసేశాం. అయినా ఆ గాలి పీల్చిన ఫలితంగా - తిరిగి వచ్చిన తరువాత,  వొక వారం రోజులు, ప్రతి వొక్కరూ  ఏదో వొక అనారోగ్యం అనుభవించ వలసి వచ్చింది . మరి అక్కడే ఆ ఫాక్టరీ లో పని చేసే వారి సంగతి ఏమిటి?  చుట్టూ వున్న వారి   సంగతి ఏమిటి? వొక దేశం గా మనం ఏం చేస్తున్నాము?

తినే ఆహారాన్ని కలుషితం చేస్తున్నాం. త్రాగే నీటిని కలుషితం చేస్తున్నాము. పీల్చే గాలినీ కలుషితం చేస్తున్నాము.ఇవీ మనకు, మన శారీరక ఆరోగ్యానికీ కావలసిన అతి ముఖ్యమైన  సాధనాలు. మరి మన ఆరోగ్యం ఎలా బాగుంటుంది?  

మనం సెల్ ఫోన్లను ఎక్కువగా వాడుతున్నాము కదా. ఈ అధిక వాడకం యొక్క ఫలితాలు గవర్నమెంటు  వారే చెబుతున్నారు. ఈ మధ్య   టెలికాం  డిపార్ట్ మెంటు వారి వెబ్ సైటులో విస్త్మృతంగా  దీన్ని గురించి మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఎన్నో వేసారు. ముఖ్యంగా గుండె దగ్గర యిది పెట్టు కోకండి వీలైనంత, శరీరానికి దూరంగా పెట్టుకోండి. ముఖ్యంగా మీ దిండు క్రింద  సెల్ ఫోను పెట్టుకోకండి.   పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వకండి. వీలైనంత వరకు  లాండ్ లైన్ ఫోన్లు వాడండి. సెల్  ఫోన్లో  - వొకే సారి ఎక్కువ సేపు మాట్లాడ కండి.  ఇలాంటివి ఎన్నో.


యిప్పుడు, వచ్చిన వ్యాధులు పోగొట్టుకోవడం, రాని  వ్యాధులు రాకుండా చేయడం కోసం కొన్ని వైద్యాలు చూద్దాం.

మన దేశంలో యిప్పుడు, చాలా ఎక్కువగా వున్న వ్యాదులలో వొకటి రక్త పోటు.  ఆయుర్వేదంలో దీనికి చాలా మంచి మందులు వున్నాయి. యిది వొక సారి వస్తే పోదని అలోపతి వైద్యులు అంటారు. కానీ, నాకే 6-7 ఏళ్ళ క్రితం బీపీ వచ్చింది - చికెన్ గునియా వచ్చినప్పుడు, దానితో బాటుగా చాలా ఎక్కువగానే వచ్చింది. అప్పుడు, నేను స్వామీ రాం దేవ్ గారి యోగా శిబీర్ వారం రోజులు వెళ్లాను. ఆ యోగ శిక్షణ శిబిరం నాలో చాలా మార్పు తీసుకు వచ్చింది.

ఆయన చెప్పినట్టు గానే, ప్రాణాయామాలు, ఆసనాలు, వాటిపై ఆయుర్వేదంలో వారు తయారు చేసే మందులు - ముఖ్యంగా ముక్తావటి అనే టాబ్లెట్లు - వాడాను. మూడు నెలలలో,  బీ.పీ మాటు మాయం. తరువాత యిప్పటి వరకు, ఆరు సంవత్సరాలుగా -  నేను ఏ మందు, బీ.పీ. కోసం, వాడడం లేదు.  అంటే - బీ.పీ, ఈ మందులతోనూ, కొద్ది పాటి ప్రాణాయామాలు, ఆసనాలు తో పూర్తిగా పోతుందని - నా విషయంలో నాకే తెలిసింది.

 కానీ, బీ.పీ. వచ్చినపుడు , అలోపతి వైద్యులు చెప్పిన మాటలు, యిచ్చిన మందులు - ఈ మందులు ఎన్నాళ్ళు తీసుకోవాలని అడిగితే, వారు, జీవితాంతం తీసుకోవాలని చెప్పారు. బీపీ వుండనే వుంటుంది. దాన్ని, మీరు కొంత నియంత్రణలో పెట్టుకోవాలి, ఈ మందులతో - అన్నారు . కానీ నా వరకు, నాకు బీ.పీ. సంపూర్తిగా పోయింది. 

ఎందుకు చెబుతున్నానంటే - కొద్ది పాటి ఆసనాలు, ప్రాణాయామాలు, ముక్తావటి లాంటి మందులతో - బీ.పీ వున్నవారు - అది పోగొట్టుకోవచ్చని   చెబుతున్నాను. మూడు నెలల పాటు అల్లోపతీ టాబ్లెట్ల తో బాటు, మక్తావటి కూడా వేసుకుంటూ, తరువాత, అల్లోపతీ తగ్గిస్తూ ,కొన్నాళ్ళకు అల్లోపతీ పూర్తిగా మానేసి, తరువాత కొన్నాళ్ళకు ముక్తావటి కూడా మానేయ వచ్చు. ఈ మధ్య కాలంలో మీకు బీ.పీ ఎంత  వుందో మాత్రం అప్పుడప్పుడూ చెక్ చేసుకుంటూ వుండడం ముఖ్యం. నా అభి ప్రాయంలో - వొక ఆరు నెలల లో - మీకు బీ.పీ. మరి లేదు - అన్న ఆరోగ్య స్థితికి వస్తారు.

యిలాగే ఎన్నో రోగాలు - పోవు, అనుకొన్నవి, చాలా మందికి  పోవడం నేను చూసాను. ఆయుర్వేదంలో యింకా ఎంతో పరిశోధనలు జరగాల్సి వుంది.

అలాగే, ఆయుర్వేదము, అల్లోపతీ కలిపి వైద్యం చెయ్య వలసిన అవసరం కూడా వుంది.

అంత కంటే - చాలా ముఖ్యం - మనం, మన చుట్టూ వున్న రోగాలను గురించి బాగా తెలుసుకుని , అవి రాకుండా చూసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.

ముందు చెప్పినట్టు, దోమలు, ఈగలు లేకుండా చూసుకుంటే - ఎన్నో రోగాలు రావు. ఎప్పుడు చేసిన ఆహారమో తినడం మానేసి, కనీసం ఈ రోజే చేసిన ఆహారం, వేడి చేసుకుని - తింటే కొన్ని రోగాలు రావు.

కొంత ధ్యానం, ప్రాణాయామం, ఆసనాలు - చేస్తే యింకా ఎన్నో రోగాలు రాక పోవడమే కాక, మనసు కూడా, ప్రశాంతం గానూ ఆహ్లాదం గానూ వుంటుంది.యింట్లో వాళ్ళు వొకరితో  వొకరు, పొరుగువారితో కూడా - వీలైనంత వరకు, మంచి మాటలే  మాట్లాడాలని, నియమం పెట్టుకుంటే మీకూ, అవతలి వారికీ - చాలా రోగాలు రావు; వున్న రోగాలు కూడా తగ్గుతాయి.

ఏ రోగమొచ్చినా - నేను నా సంతోషం మాత్రం  కోల్పోను - అని నిర్ణయించుకుంటే - మన చివరి క్షణం వరకు - మనం సంతోషంగా , వుండగలం. మీకు తెలుసా - ప్రతి రోగంలోనూ, అసలు రోగం -"భయం, నిరాశ, నిస్పృహ" - యివే. యివి వదిలేసి చూడండి.  ఏ రోగమొచ్చినా మనకు దాదాపు రోగం లేనట్టే   వుంటాము.

ఆ పైన మందులు కూడా వాడాలి. కొన్ని రోగాలకు చాలా మంచి మందులే వున్నాయి. అయినా, ఆ రోగాలతో, విపరీతంగా అవస్థ పడుతున్న రోగులను ఎందరినో మనం చూస్తున్నాము.

ఉదాహరణకు - బోదకాలు ,లేదా, ఫైలేరియా వ్యాధితో అవస్థ పడే వారిని మనం చాలా మందిని చూస్తున్నాము. కానీ దీన్ని దాదాపు 95 శాతం వరకు నయం చేసే పద్ధతులు చాలా వున్నాయి. కేరళలో - కాసర్గోడ్ అన్న పట్టణంలో -ఇనస్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ డెర్మటాలజీ లో - డాక్టర్ నరహరి -అనే డాక్టర్ ఆధ్వర్యంలో  - 2 వారాల ట్రీట్మెంట్  తో - ఎంతో బాగా నయమవుతూ   వున్నట్టు - మనకు తెలుస్తూ వుంది.

అలాగే - చర్మవ్యాధులు -సోరియాసిస్ లాంటివి -చెన్నై లో - డాక్టర్ జె.ఆర్ .కృష్ణమూర్తి  అనే   సిద్ధ డాక్టర్ గారు బాగా నయమయ్యే టట్లు చేస్తున్నారు.యిదే సోరియాసిస్ కు రాందేవ్ గారి మందులు కూడా బాగా పని చేస్తాయి.

హృద్రోగాలు రాకుండా చెయ్యడమే కాక, వచ్చిన వాటిని కూడా బాగా తగ్గించగల మందు - అర్జున , లేదా  అర్జునారిష్ట అంటారు. యివి, ఎవరైనా వాడవచ్చు. ఇటువంటిదే, రామ్ దేవ్ వారి హృదయామృత వాటి.

అలా - దాదాపు ప్రతి రోగానికీ - మందులు వున్నాయి.

అయితే - వీటన్నిటిలో చాలా ముఖ్యమైన అంశం - మనం మనసులో ఆరోగ్యంగా వుండాలని, వుండగలనని నమ్మకం వుండడం; వీటితో బాటు దినమూ, ఎంత సేపు వీలైతే అంత - ధ్యానము, ప్రాణాయామము, ఆసనాలు చెయ్యడం - యివి ఎంతో ముఖ్యంగా చెప్పబడుతోంది.

స్వామి రాందేవ్  గారి ట్రీట్మెంట్ చాలా వరకు  దీనిపైనే ఆధారపడి వుంది.ప్రాణాయామాలలో, వారు ముఖ్యంగా అనులోమ,విలోమ ప్రాణాయామం, మరియు, కపాల భాతి ప్రాణాయామం - లకు ప్రాముఖ్యం  యిస్తారు. యివి చాలా సులభం. ఆహారం తీసుకునే ముందు తెల్ల వారి 15 నిముషాలు, సాయంకాలం  15 నిముషాలు తప్పకుండా చెయ్యాల్సినవి.

అంటే - రోగాల వరకు - మనం  పాటించాల్సిన కొన్ని ముఖ్య సూత్రాలు యివి -

1.  రోగాలు రాకుండా జాగ్రత్త పడాలి. (దోమలు, ఈగలు లేకుండా చెయ్యడం; సరైన తిండి, నిద్ర, వ్యాయామం, యోగ, ప్రాణాయామాలు  పాటించడం)

2. రోగాలు వస్తే - అశ్రద్ధ చెయ్యకుండా, వెంటనే సరైన ట్రీట్మెంట్ ఆరంభించాలి.  ఎంత త్వరగా, సరైన ట్రీట్మెంట్ ఆరంభిస్తే - అంత త్వరగా, రోగాలు నయమౌతాయి. 

3. నా ఉద్దేశంలో - అల్లోపతి, ఆయుర్వేద వైద్యాలు రెండూ తీసుకోవడం - చాలా మంచిది.  యిప్పుడు ఆయుర్వేదం లోనే - సిద్ధ, యునాని అన్నీ చేరిపోతున్నాయి.


4. కొన్ని రోగాలకు హోమియోపతీ కూడా బాగా పనిచేస్తుంది - కానీ దానితో, అల్లోపతీ వైద్యాన్ని మాత్రం చేర్చకూడదని  చెబుతారు.

5. ముఖ్యంగా - దీర్ఘ రోగాలనబడే - ఆస్తమా, రక్త పోటు, మధుమేహం , చర్మవ్యాధులు, బోదకాలు - లాంటి వాటికి, రెండు రకాల వైద్యాలు వొకే సారి, త్వరగా ఆరంభించడం చాలా మంచిది.

6.  రోగంలో సగం రోగం - "భయం నిరాశ, నిస్పృహ". యివి పూర్తి వదిలేసేయ్యండి. మన  చివరి శ్వాస వరకు, మనం సంతోషం గానే  ఉంటామని -దృఢ నిశ్చయం తీసుకోవాలి. ఏదొచ్చినా - భయం, నిరాశ పనికి రాదు. యివి లేక పోతే, సంతోషం వుంటే - వచ్చే ఏ రోగమైనా - తొందరగా తగ్గి పోతుంది. సంతోషంగా వున్న వారికి - దీర్ఘ రోగాలు కూడా, మందే  లేకుండా తగ్గిన సందర్భాలు  చాలా వున్నాయి.

7. హిప్పోక్రేట్స్ , యిప్పటి అల్లోపతీ వైద్యానికి మూల పురుషుడు. ఆయన చెప్పడం - ప్రకృతి మాత్రమే  రోగాలకు నిజమైన వైద్యం.

8. వోల్టైర్  అనే విజ్ఞాని అంటాడు - అందరి కంటే గొప్ప వైద్యుడు  రోగాలు రాకుండా మందులు, జాగ్రత్తలు  ముందే చెప్పే వాడు.   అతని తరువాత లెవెల్ వైద్యుడు - కొద్ది రోజుల్లో రాబోయే రోగాన్ని కనిబెట్టి, అది రాకుండా మందులిచ్చే వాడు. చిట్ట చివరి వాడు, వచ్చిన రోగానికి మందు లిచ్చే వాడు.

9. సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు చెప్పడం - దేహానికి అన్నిటి కంటే గొప్ప మందు -  ప్రశాంతం గా వుండే   మనస్సు.

10. మదర్ తథెరెసా గారంటారు - టీ.బీ కంటే, లెప్రసీ కంటే - మరే యితర వ్యాధుల కంటే కూడా - పెద్ద వ్యాధి - నాకెవరూ లేరు, నేనెవరికీ వద్దు - అన్న మనో భావన.

11. మనపై మనకు నమ్మకం లేక పోవడమే - అతి పెద్ద వ్యాధి - అంటారు,  రాల్ఫ్  వాల్డో  ఎమర్సన్  గారు.

12.  మూసి పెట్టుకున్న రోగానికి మందు లేదు - మన దేశం సామెత 

మీరంతా ఆరోగ్యంగా వుండాలి.  మీ చుట్టూ వున్న వారి ఆరోగ్యం కూడా మీరు కాపాడాలని  ఆశిస్తూ 

=  మీ

వుప్పలధడియం విజయమోహన్