12, డిసెంబర్ 2011, సోమవారం

లోక్ పాల్ గోల = నిరశన వ్రతాలకు చక్కటి సమాధానం మౌన వ్రతం.=

ప్రహ్లాద్ జాని గారికీ, అన్నా హజారే గారికీ, మనకూ వున్నా తేడా ఏమిటంటే - అందరికీ తెలుసు.

ప్రహ్లాద్ జానీ గారు దాదాపు అరవై డెబ్భై ఏళ్ళుగా ఏమీ త్రాగడం లేదట. తినడం లేదట.  ఆయన ఏమీ తినకుండా, త్రాగకుండా, చేయకుండా ఎందుకున్నారో - అస్సలు ఎందుకుండాలో ,  ఆయనకే అంతు పట్టడం లేదు. యిప్పు డాయనను  ఎవరూ పట్టించుకోవడం లేదు.  లోక్ పాల్ బిల్లు కోసం - ఆయన నిరశన వ్రతం చేస్తే ఎలా వుంటుందో తెలీదు.  వొక వేళ చేస్తే, ఆ నిరశన వ్రతాన్ని ఆయన ఎప్పుడు, ఎలా వదిలి పెడతాడో - అదీ తెలీదు.

కానీ - అన్నా హజారే గారికి మాత్రం - అలసట వచ్చేస్తుంది. పోటీ తట్టుకోలేరు. మన్మోహన్ సింగు  గారితో తో పోటీ పడొచ్చు గానీ ప్రహ్లాద్ జానీ తో పోటీ పడ లేము. 

ఎంతటి, రాజా లాంటి వారి లంచగొండి తనమైనా మనం భరించ గలమేమో కానీ - భరిస్తున్నాము కదా - యిలా దినాల కొద్దీ, వారాల కొద్దీ, నెలల కొద్దీ నిరశన వ్రతాలు చేయడం మాత్రం మన వల్ల కాదు.

అది అన్నా గారికే వదిలేద్దాం. ఆయనకు అలవాటయ్యింది ఆయన చేయ నీయండి. మనకు తెలిసింది, చాతయ్యింది మనం చేద్దాం.  టీం అన్నా సభ్యులందరూ నిజానికి అదే చేస్తున్నారు. అన్నాజీ, నిరశన వ్రతం మీరు చేయండి. మాట్లాడడం మేము చేస్తాము - అని పనులు పంచుకున్నారు.

యిదేదో బాగానే వుంది. బంగారపు తట్టలలో భోంచేసినా - గనులలో ఏం మేసినా - చివరకు, జైళ్ళలో భోం చేయ వలసింది - గాలే కదా.  అది అలవాటున్న వారు చేయడమే మంచిది.

లంచగొండి తనం పోతుందా - లేదా? ఎలా పోతుంది. ఎప్పుడు పోతుంది?

లోక్ పాల్ వస్తారా - లేదా? ఏ రూపంలో వస్తారు? వచ్చి ఏం చేస్తారు? దేశాన్ని వుద్ధరిస్తారా? కాంగ్రెసును, డీ.ఏం. కే. ను వుద్ధరిస్తారా? ప్రతి పక్షాలను వుద్ధరిస్తారా? లంచ గొండులను   జైళ్ళలో పెట్టాలంటే -  ఎన్ని జైళ్ళు కావాలి?  వాళ్ళ, వాళ్ళ ఇళ్ళే   -  వాళ్లకు జైళ్ళు గా మారిస్తే పోలా? రాజా గారు ఏమంటారో?

లోక్ పాల్ గా ఎవరొస్తారు. కాంగ్రెస్ లో   చేరితే, గీరితే, ఎంచక్కా జగత్తునంతా మోహింప చేస్తూ - మన జగన్ గారు కూడా రావచ్చు. లేక పొతే - ఏ కరుణానిధి గారో, వారి అనుచరులో రావాల్సిందే. కొయాలిషన్   రాజకీయాలంటే   మాటలా.  వారొస్తే -  విపక్షాలలో వున్న లంచగొండి తనమంతా కడిగేస్తారు.

రచ్చ గెలిచామంటే -  యింట గెలవకున్నా ఏం మునిగి పోదు.  విపక్షాల రచ్చ గెలిస్తే చాలు.

కరుణానిధి గారు అర్జెంటుగా ప్రెసిడెంటుగా అయిపోతే - ఎలా వుంటుంది? జయలలితా గారు ఏం చేసినా - ఆయనను ఏమీ చేయలేరు కదా. ఏ లోక్ పాల్ వచ్చినా - ఏం భయం లేదు. యివన్నీ - కొన్ని ఊహలు మాత్రమే. సలహాలు కాదు.

కిరణ్ కుమార్ రెడ్డిగారు  ఎన్నో చేస్తున్నారు. చిరంజీవి గారు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ అవకాశం యిప్పుడో, అప్పుడో వచ్చేస్తుంది. బాబు గారు మాత్రం - పథకాలు వేస్తున్నారు. కలలు చాలా కంటున్నారు. వయసయిన తర్వాత ఎలాంటి కలలు వస్తాయి? అవి నిజమవుతాయా?

రోశయ్య గారికి ఆరోగ్యం బాగాలేక సి.యం పదవి విడిచేసారు. కానీ -  గవర్నరు పదవికి అదేమీ పెద్ద అడ్డంకు కాదు. ఆయనకు - వద్దన్నా పదవులన్నీ వస్తున్నాయి. వడ్డించే వాళ్ళు మన వాళ్ళయితే అంతే మరి.

తెలంగాణా వచ్చేసినట్టు కల. చాలా మందికి. అది రామరాజ్యం లా, రామారావు రాజ్యంలా వున్నట్టు కొంత మందికి కల. కే.సి.ఆర్. గారు అప్పుడూ  ఏదేదో అర్థం లేకుండా మాట్లాడేస్తున్నారు.  తిట్టేస్తున్నారు. అలవాటుగా. కానీ, యిదంతా కలే. కలలో మాటే. నిజమూ అంతే ననుకోండి.

మన్మోహన్ సింగు గారు ఏమీ మాట్లాడడం లేదు. ఎప్పటి లాగే. నిరశన వ్రతాలకు చక్కటి సమాధానం మౌన వ్రతం. ఆయన ఆర్ధిక శాస్త్రం మరిచి పోయారు. రాజకీయ శాస్త్రం తెలీదు. హంస నడక మరిచిపోయే. కాకి నడక రాక పోయె. సోనియా గారికి ఎమోచ్చో ఎవరికీ తెలీదు. కాని చక్రం తిప్పగలరు. అది తిరిగితే.

దేశంలో - చిదంబర రహస్యాలెక్కువై పోయాయి. బురదలో చెయ్యి పెడితే మట్టి అంటుకోదా . ఈ బురద కడుక్కోవడం చాలా కష్టంగానే వుంది చిదంబరం గారికి. కడిగే కొద్దీ కొత్త బురద చల్లుతున్నారు.

శరద్ పవార్ గారిని ఫెళ్ళున చెంప దెబ్బ కొట్టాడట వొకాయన.  సగటు మనిషి కోపమే నేను చూపించాను - అన్నాడట. కూరగాయలు, తినే వస్తువుల ధరలన్నీ పెరిగినా - దాన్ని గురించి ఆయనకు  కొంత కూడా చింత లేదు. కారణం - ఆయనకు క్రికెట్ బోర్డు పై, మిగతా స్పోర్ట్సు బోర్డులపై   చాలా సరదా. మరి స్పోర్ట్సు మినిస్టరు గారికి అవంటే - పట్టదు.  అటు ఆటలూ పోయె. యిటు ఆహార పదార్థాలూ, వాటి వెలలూ  ఆకాశానికి  వెళ్లి పోయె. యివన్నీ కొయాలిషన్ రాజకీయాలు మరి. మన్మోహన్ సింగు గారు అలా చూస్తూ వుందా వలసిందే.

మిగతా వాళ్ళు ఎప్పటి లాగే - వర లక్ష్మీ వ్రతం చేసుకుంటున్నారు. ఏంతొస్తే  అంత రానీ. మరో ఎలెక్షనొస్తే లక్ష్మి ఎవరి పక్కో ఎవరికి తెలుసు? పీత బాధ పీతది.  సీత బాధ సీతది. ఎవరి బాధ వాళ్ళది. రేపటి సంగతి ఎవరు చూసొచ్చారు? లోక్ పాల్ గానీ వచ్చేస్తే?

= మీ

వుప్పలధడియం విజయమోహన్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి