7, ఫిబ్రవరి 2012, మంగళవారం

ఎందుకిలా జరుగుతోంది? 24 ఏళ్ళ వయసులో గుండె పోటు ఎందుకు? = నూరేళ్ళ జీవితం, అందంగా, ఆనందంగా గడపాలంటే ఏం చెయ్యాలి?

సమస్య నేనే అనుకుంటే - సమాధానం మనలోనే వెదుకుతాం. సమాధానం మనలోనే వుంటే - అది  తెలుసుకోవడం, దాన్ని అమలు చేయడం చాలా సులభం.

చాలా చాలా సమస్యలకు - నిజానికి సమస్యా మనమే; పరిష్కారమూ మనమే. యిది - క్రిందటి వ్యాసంలో మనం చూసాం.


ఈ ముందు మాట ఎందుకు?

రెండు రోజుల క్రితం - వొక  24  ఏళ్ళ  యువకుడు - ఐ.టీ. రంగంలో వున్న వాడు -  గుండె పోటు(హార్ట్ యటాక్) తో పోయాడు. అతనికి ఏ రకమైన చికిత్సా అందించడానికి మునుపే చని పోయాడు. ఈ మధ్య 24  నుండి 35   లోపుగా వుండే  యువకులిలా  అర్ధాంతరంగా పోవడం - చాలా, చాలా  విన్నాను. 

ఏం జరుగుతోంది? ఎందుకిలా జరుగుతోంది?

భారత దేశానికి - ఐ.టీ. రంగం రావడం వలన - ఎంతో మేలు జరిగినా - యువకుల్లో -  బీ.పీ, చక్కర వ్యాధి, గుండెపోటు సమస్యలు, మరెన్నో ఆరోగ్య సమస్యలు ఎక్కువ కావడం - చూస్తూనే ఉన్నాము.

యివి చాలదన్నట్టు - బెంగుళూరు నగరంలోని - ఐ.టీ. రంగంలోను, బీ.పీ.వో లాంటి మరి కొన్ని రంగాల లోనూ, వివాహ రద్దుల శాతం చాలా ఎక్కువయినట్టు  వార్తలు వస్తున్నాయి.

వివాహేతర సంబంధాలు కూడా ఎక్కువ అవుతూ వుంది.. అయితే - శరీరంలో క్రొవ్వు శాతం పెరిగి, అతి స్థూల కాయం రావడం వలన సెక్సు సామర్థ్యం తగ్గినట్టు కూడా - తెలుస్తూ వుంది.

ఫాస్ట్ ఫుడ్, పిజ్జా లాంటివే ఎక్కువ తినడం వలన - మరెన్నో వ్యాధులకు గురి కావలసి వస్తున్నారు.
 
నిశితంగా చూసే వారికి - వీరిలో - వోర్పు శాతం తగ్గి, వొత్తిడి (స్ట్రెస్)శాతం ఎక్కువయినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఎంతో మందిలో - కోపమూ, వేగమూ - పెద్దల పట్ల అసహనమూ పెరుగుతున్నట్టు - అనిపిస్తుంది.

విదేశాల నుండి వచ్చే డబ్బు తో బాటు - వారి సంస్కృతి పట్ల మోజు కూడా చాల ఎక్కువవుతున్నట్టు అనిపిస్తుంది. యిది ఎంత శాతం మందిలో జరుగుతోందో - చెప్పడం కష్టం. కానీ - ఎంతో మందిలో వుంది, ఎక్కువవుతోంది - అని మాత్రం తప్పక అనిపిస్తుంది.

యిదంతా - వారి తప్పే - అని మాత్రం అన లేము. ఎన్నో కంపెనీల్లో,  6  - 8  గంటల పని ఎప్పుడో పోయింది.  12 గంటలు, అంతకు మించి కూడా పని చేసే వారి శాతం చాలా ఎక్కువగా వుంది. వారికి పని భారం వలన - వొత్తిడి, దాని ద్వారా వచ్చే వ్యాధులు వస్తాయి కదా.

యిటువంటి పనీ, పని కాలాలు -ఎక్కువవడమూ, వాటి వల్ల యువతీ,యువకుల మధ్య ఆకర్షణ పెరగడమూ, పెద్దలకు దూరంగా వుండడం వలన, అది సెక్సు రూపం ధరించడం సహజంగా జరిగిపోతూ వుంది. తప్పు వారిది మాత్రం కాదు. వయసుది; పరిస్థితులది - అని తప్పక చెప్పాలి. 

ఈ విషయంలో - కంపెనీలలోనూ, ప్రభుత్వం లోనూ- చైతన్యం రావాల్సిన అవసరం ఎంతయినా వుంది.


ముఖ్యంగా - యువకుల్లో, యువతుల్లో, చైతన్యం రావాలి.

క్షణికాకర్షణలు - సెక్సు గానీ, ఆహారం గానీ, డబ్బు గానీ-  వొక వైపు వున్నా - మరొక వైపు సమాజం ఎలా వుంటే - అందరికీ మేలో - అన్న చైతన్యం పెరగాలి.

ఆహారమూ, శారీరక ఆరోగ్యము పట్ల శ్రద్ధ పెరగాలి.

పని ఎంత వున్నా - మానసిక వొత్తిడి లేకుండా చేయడం నేర్చుకోవాలి.

అలాగే - వివాహేతర సంబంధాలూ, విడాకులపై మోజు - తగ్గాలి. వివాహం పట్ల గౌరవం పెరగాలి.

అమెరికాలో - 53  శాతానికి పైగా  వివాహాలు - అవీ, అన్నీ ప్రేమ వివాహాలే - విడాకులతో, అతి త్వరగా, ముగుస్తున్నట్టు, గణాంకాలు ద్వారా తెలుస్తున్నాయి. 

మరి ఆ ప్రేమలెంత నిజమైనవి? వాటిలో లోపం ఎక్కడుంది? అన్ని ప్రేమ వివాహాలు ఎందుకు విఫలమౌతున్నాయి? అన్నీ - ఎన్నో నెలల, సంవత్సరాల "డేటింగ్" తరువాత జరిగేవే. అయినా, విఫలమౌతున్నాయి. డేటింగ్ జరిగినంత కాలం కూడా - వివాహం తర్వాత కలిసి వుండలేక పోతున్నారు.

ఎందుకు?

నాకు - ఏదో కావాలి. కానీ ఎం కావాలో, సరిగ్గా తెలీదు. మొదట ఈ బొమ్మ  పైన మనసు పడింది. అది దొరికేంత వరకు అది తప్ప మరోటి వద్దు - అదే కావాలి; అందుకని చిన్న పిల్లలు ఏడుస్తారు. రాద్దాంతం చేస్తారు. సరే. అది తీసిస్తే - వొక్క రోజులో - దాన్ని నాలుగు భాగాలు చేసి పడేస్తారు. మోజు తీరిపోయింది.

మళ్ళీ, మరో బొమ్మ కావాలి. మళ్ళీ అదే తంతు. పెరిగే వరకు అంతే. మనసు ఎదిగే వరకు అంతే. అప్పటికి పుణ్య కాలం గడిచి పోతుంది. వయసు అయిపోతుంది.

జీవితం కూడా బొమ్మలాట లాగ మార్చేస్తున్నారు. మారుస్తూ, జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు.

జీవితం అర్థం కావాలి. మనలో - మిస్టర్ పెర్ఫెక్ట్ కానీ మిస్ పెర్ఫెక్ట్ కానీ - ఎక్కడా లేరు. అందరిలో కొన్ని, కొన్ని లోపాలు వుండనే వుంటాయి. ప్రేమించే సమయంలో లోపాలు తెలియవు. బాధ్యతలు తెలియవు. వివాహం తరువాత - లోపాలు, బాధ్యతలు మాత్రమే గుర్తుకు వస్తాయి. ప్రేమ మెల్లగా మాయమవుతుంది. 

ప్రేమిస్తే - లోపాలతో బాటు, బాధ్యతలతో బాటు - అన్నిటినీ ప్రేమించాలి. అన్నిటినీ స్వీకరించాలి. అది జరగడం లేదు.

ముందు తరంలో - బాధ్యతలు చాలా స్పష్టంగా - విభజింప బడ్డాయి. యిప్పుడా విభజనను వొప్పుకోక పోవడం వలన, మరో స్పష్టమైన, ప్రత్యామ్నాయం చూసుకోక పోవడం వలన -ప్రేమ వివాహాలు విఫలమౌతున్నాయి.

ప్రేమించే సమయంలో - నా ప్రాణాన్ని కూడా కావాలంటే యిచ్చేస్తా - అన్న వారే - కాఫీ నువ్వే పెట్టాలి, నేను పెట్టను. యిది నువ్వే చెయ్యాలి, నేను కాదు - అని అన్నిటికీ పోటీ పడుతున్నారు. నా జీతం నాదే. అందులో - నేను "మన కోసం" ఖర్చు పెట్టను అనే వారిని చాలామందిని  చూస్తున్నాము.

ఇలాంటి మార్పులు ఎన్నో.

ప్రేమల స్వరూపం మారిపోతూ వుంది. వివాహ జీవితాల స్వరూపం మారిపోతూ వుంది.  పిల్లల పట్ల, పెద్ద వారి పట్ల - అభిప్రాయాలు, ప్రవర్తన మారిపోతూ వుంది.

వృద్ధాశ్రమాల సంఖ్య పెరిగిపోతూ వుంది. 

ఈ సమస్యలకు కూడా - నిజానికి సమస్యా మనమే; పరిష్కారమూ మనమే. అందరూ - పెద్దలూ, యవకులూ, యువతులూ, కంపెనీలు, ప్రభుత్వమూ -అందరూ - భాగ స్వామ్యులమే.

నాలోని కోపాన్ని, అసహనాన్ని, వొత్తిడిని, ఎవరు శీఘ్రంగా తగ్గించ గలరు? నేనే.

నా ఆరోగ్యాన్ని - శీఘ్రంగా ఎవరు బాగు చేయ గలరు? నేనే.

నా వివాహ జీవితాన్ని సరిగ్గా ఎవరు చూసుకో గలరు? నేనే.

సమాజం - కొంత వరకు తోడ్పడుతుంది. నా లో సమాజం పట్ల బాధ్యత వుంటే, గౌరవం వుంటే.

24  ఏళ్ళలో  గుండె పోటుతో పోవలసిన  అవసరం ఎవరికీ రాకూడదు. నూరేళ్ళ జీవితం, అందంగా, ఆనందంగా గడపాలంటే - మరి కాస్త బాధ్యతాయుతంగా, మరి కాస్త సామాజిక స్పృహతో, మరి కాస్త ఆరోగ్య స్పృహతో - జీవితం గడపాల్సిన అవసరం వుంది.

= మీ

వుప్పలధడియం విజయమోహన్

5, ఫిబ్రవరి 2012, ఆదివారం

ఏ సమస్యా నిజమైన సమస్య కాదు. అసలు సమస్య నువ్వే = జ్వరం-అనుజ్వరం = మీ అసలు సమస్య అంతా యిదే!


మనం  నీడల్ని చూసి భయపడతాం. "మన నీడ" ని చూసి కూడా వొక్కో  సారి  భయపడతాం. అలాగే, చీకటంటేనూ,  భయ పడతాం.

చీకటి అంటే నీడ. చీకటి, భూమి మీద పడ్డ (చంద్రుడి) నీడ. లేదా, చంద్రుడి పైన పడ్డ (భూమి) నీడ. అంత కంటే - మరేం లేదు. అదే మనకు రాత్రి.

వెలుతురు వుండి  - మనం ఆ వెలుతురు కు అభిముఖంగా నిలిస్తే, నడిస్తే - మన నీడ మనకు  కనిపించదు. వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ - వెలుగుకు వ్యతిరేక దిశలో చూస్తూ నిలిస్తే, నడిస్తే  - మన నీడ పెరుగుతూ, పెరుగుతూ - మన ముందు నడుస్తూ - మనల్ని  మానసికంగా భయ పెడుతుంది.

నిజ జీవితంలోనూ - అంతే.

మనం వెలుగు వైపు నడుస్తున్నామా - వ్యతిరేక దిశలో నడుస్తున్నామా? విజ్ఞానం వైపు నడుస్తున్నామా? దానికి వ్యతిరేక దిశలో నడుస్తున్నామా - అన్నదే అసలు ప్రశ్న

విజ్ఞానం వైపు నడిస్తే - భయాలనే మన నీడలన్నీ - వెనక్కి వెళ్ళిపోతాయి.

విజ్ఞానానికి వ్యతిరేక దిశలో నడిస్తే - మన భయాలన్నీ - ముందుకొచ్చి భయపెడతాయి.

గొర్రెలు కొండ అంచు వైపు పరుగెడతాయి. వొక్క గొర్రె అంచు నుండి దూకిందంటే   -   మిగతావన్నీ, దాని వెనకాలే , హాయిగా దూకేస్తాయి. క్రింద పడి ఎముకలు విరిగేంత వరకు  అవేం చేసాయో, ఎందుకు చేసాయో వాటికి తెలీదు. వాటికి  పర్యవసానం యోచన చేసేంత  బుద్ధీ లేదు. వోపికాలేదు.

సమస్య తెలీకుంటేనూ భయం లేదు - గొర్రెల్లాగా.  లేదా, సమస్యతో బాటు , పరిష్కారము  తెలిసుంటేనూ భయం లేదు. సమస్య  సరిగ్గా అర్థం కాకుంటే - చీకటి లాగా, నీడ లాగా, మనల్ని భయ పెడుతుంది. 

ఏ సమస్యా నిజమైన సమస్య కాదు. అసలు సమస్య నువ్వే - అంటారు - భారతీయ తత్వ వేత్తలు.

డేల్ కార్నీజ్ గారి రచనలో, సిగ్మండ్ ఫ్రాయిడ్ గారి రచనలో - చదవడానికి బాగుంటాయి కాని నిజ జీవితంలో- వాటి వల్ల ఏ సమస్యా పరిష్కారం కాదని    ఓషో లాంటి దార్శనికులు చాలా విశదంగా చెబుతారు.

నేను కూడా, యివన్నీ చదివాను. చాలా బాగున్నాయి. నాకూ బాగా నచ్చాయి. కాని - వాటి ఉపయోగం అనుకున్నంత  ఎక్కువ కాదని చాలా కాలం తరువాత తెలిసింది.

వాళ్ళ విమర్శనాత్మకమైన, సకారాత్మకమైన   రచనలలో - వొకే వొక చిన్న లోపం. అన్ని సమస్యలకూ - పరిష్కారం ఎక్కువగా బయటనే వెదకడం. అసలు సమస్య ఎక్కడుందో తెలియక పోవడం. అంతే.

అసలు సమస్య మనమే. ఎవరికి - వారే , అసలు సమస్య.

మనం ప్రపంచాన్ని పూర్తిగా బాగు చెయ్యలేం. మనం - మనల్ని బాగు చేసుకోవచ్చు.

అవతారపురుషుడైన శ్రీ కృష్ణుడు కూడా - కౌరవులలో, ఏ వొక్కరినీ సరి చెయ్య లేక పొయ్యాడు.

జీసస్ క్రైస్ట్ బ్రతికున్న రోజుల్లో - పట్టుమని పది మందిని కూడా పూర్తిగా మార్చలేక పొయ్యాడు. నమ్మిన వాళ్ళే, శిష్యులన్న వాళ్ళే - ఆయనను పట్టిచ్చారు.

బుద్ధుడి వెనుక పదివేల మంది శిష్యులుండే వాళ్ళట. వారిలో చాలా మందికి ఎప్పుడూ సందేహాలే.

కొంత మంది మాత్రం - బుద్ధుడి ఎత్తుకు ఎదిగారు. యిలాగే - ఎవరు మారాలనుకున్నారో - వాళ్ళు మాత్రం మారారు. బుద్ధుడు ఎవరినీ మార్చాలని తీవ్రంగా ప్రయత్నించలేదు.

అయితే - మారాలనుకున్న   ఎందరో - ఆయన దగ్గరకు వెళ్ళారు.   అర్థం చేసుకున్న వాళ్ళు మారారు.

కృష్ణుడి భగవద్గీత విన్న వాళ్ళు నలుగురట.

అర్జునుడు ఎదురుగా కూర్చుని విన్నాడు. రెండవ వాడు, జెండాపై కపిరాజు, హనుమంతుడు. రామావతారంలో విననివన్నీ - యిప్పుడు విన్నాడు. సంజయుడు దూర శ్రవణమూ , దూర దృష్టీ వుండడం వలన విన్నాడు.  సంజయుడు చెబితే - ధృతరాష్ట్రుడు విన్నాడు. విని తరించిన వారు ముగ్గురే. అర్జునుడు, అంజనా తనయుడూ, సంజయుడూ.

భగవద్గీత విన్నా ధృత రాష్ట్రుడికి జ్ఞానోదయం కాలేదు.

మనమూ అంతే.

భగవద్ గీత వెలుతురు. కానీ దుర్యోధనుడు తన నీడ. నీడ నచ్చింది. వెలుతురు నచ్చలేదు - ధృత రాష్ట్రుడికి.

ధృతరాష్ట్రుడికి సమస్య దుర్యోధనుడు కాదు.  తనకు తానే సమస్య. అర్జునుడికి సమస్య మరొకరు కాదు. తనకు తానే సమస్య.

మీకు వెయ్యి సమస్యలున్నట్టుగా అనిపిస్తూ వుంటుంది. కానీ - అసలు సమస్య మీకు మీరే.

బుద్ధుడి దగ్గరకు వొక గొప్ప పండితుడు వచ్చాడు. ఆయనకూ వెయ్యి మంది శిష్యులున్నారు.  శిష్యులడిగే ప్రశ్నలన్నిటికీ జవాబిచ్చేవాడు గానీ  -   అవన్నీ విన్న తరువాత - యిప్పుడాయనకే లక్ష సందేహాలు.

సరే. బుద్ధుడు అన్నీ తెలిసిన జ్ఞాని అంటారు కదా - ఆయన్ను అడుగుదామని వచ్చాడు. బుద్ధుడు నవ్వి - మీ సందేహాలకన్నిటికీ చక్కటి సమాధానాలు నా దగ్గర వున్నాయి, చెబుతాను గానీ - వొక నిబంధన వుంది, అన్నాడు. అదేమిటంటే - వొక సంవత్సరం పాటు - ఏ సందేహమూ,ఎవరినీ అడక్కుండా వుండాలి. వీలైనంత మౌనంగా వుండాలి. అంతే. పండితుడు వొప్పుకున్నాడు. సంవత్సరం పాటు ఏమీ అడగలేదు. మౌనంగా వున్నాడు. బుద్దుడినేమీ అడగలేదు కానీ ఆయన్నే గమనిస్తూ వున్నాడు.

సంవత్సరం అయిపోయింది. బుద్ధుడు  ఆయన్ను పిలిచి అడిగాడు. యిప్పుడు చెప్పండి - మీ సందేహాలన్నీ.

పండితుడు నవ్వాడు. స్వామీ, ఇప్పుడేమీ సందేహాలు లేవు, సమస్యలూ లేవు - అన్నాడు.

సమస్యలెలా తీరింది.?  తన్ను, తాను తెలుసుకుంటే, తన్ను తాను అర్థం చేసుకుంటే -  వున్న సమస్యలన్నీ - కరిగిపోతాయి. వెలుగువైపు నిలబడ్డ వాడికి - నీడ కనపడనట్టుగా. మరీ చెప్పాలంటే, నలు వైపులా వెలుతురుంటే  - నీడ లేనట్టుగా, నీడ పారిపోయినట్టుగా, జ్ఞానమున్న చోట సమస్యలుండవు. జ్ఞానమంటే - తనను తాను తెలుసుకోవడమే. ప్రపంచాన్నంతా, మనం తెలుసుకోనవసరం లేదు.

అంతే - బయటి ప్రపంచంలో సమస్యలేవీ లేవా? - అంటే, వున్నాయి. అవి మీ సమస్యలు కావు.

అమెరికా వారి సమస్య మీ సమస్య కానంత వరకూ  - మీరు వారికేమైనా సహాయం చెయ్యొచ్చు. లేదా- మీ పనులు మీరు చూసుకుంటూ వుండొచ్చు.  అది మీ సమస్య అనుకున్నారంటే మాత్రం - మీరు చిక్కుల్లో పడతారు.

దీన్ని వేదాంతంలో - "అనుజ్వరం" అంటారు. ఉదాహరణకు - మీ అబ్బాయికో, భార్యకో, భర్తకో, జ్వరం వచ్చిం దనుకోండి. మీరు వారికి సేవ చెయ్యొచ్చు. మందులివ్వొచ్చు. మీరు వారికి ఏమేం చెయ్యగలరో అవన్నీ చెయ్యొచ్చు. తప్పు లేదు. కానీ- ఆ జ్వరం మీకే వచ్చినట్టు మీరు బాధ పడితే మాత్రం - అది మూర్ఖత్వమౌతుంది. దాన్నే "అనుజ్వరం" అంటారు.

మీ వారి జ్వరం, మీకు అనుజ్వరం గా మారితే - మీ వారికే ప్రయోజనమూ లేదు. మీరు వారికి చెయ్య గలిగే సహాయం కూడా చెయ్య లేక పోతారు. కానీ, మీ అనుజ్వరం వలన - మీకు మీ వారి జ్వరాన్ని మించిన జ్వరం వచ్చే ప్రమాదం వుంది. మీ వారి జ్వరం విషమించే ప్రమాదమూ వుంది.

మీరు హాస్పిటల్ లో ఏదో వ్యాధి నివారణ కోసం ఉన్నారనుకోండి. మీకు చిరునవ్వు నవ్వుతూ వచ్చి చికిత్స చేసే డాక్టర్లు, నర్సులు అంటే - యిష్టమా, మీ లాగే ఆపసోపాలు పడుతూ, కన్నీరు కారుస్తూ , భయపడుతూ వచ్చే డాక్టర్లు, నర్సులు అంటే - యిష్టమా? చిరునవ్వుతో వున్న వారే కదా. మీ భార్య, లేదా భర్త, నవ్వుతూ, మీతో హాయిగా మాట్లాడుతూ సహాయం చేస్తే యిష్టమా. అయ్యో, మీకిలా వచ్చేసిందే. యిది నాకు వస్తే పోలా -దేవుడా ఈ వ్యాధి నాకిచ్చేసేయ్యి - అంటూ ఏడిచే వారంటే యిష్టమా?

యిందులో అంతర్లీనంగా వుండే - "ప్రతి సమస్య యొక్క  పరిష్కారం, సమాధానం" మనం అర్థం చేసుకోవాలి.

సమస్యలు లేవని కాదు. సమస్యలతో  బాటు, మనం వొకటి అయిపోతే,  మనమే సమస్య అయిపోతాం.

సమస్యను కాస్త దూరం నుండి చూడడం నేర్చుకోవాలి. సాక్షీ భావం - అంటారు దీన్ని.

మొదటి సాక్షీ భావం - సమస్య నేను కాను, కాకూడదు - అన్న భావన. రెండో భావన- సమస్య నాది కాదు అన్న భావన. మూడవది -ప్రతి సమస్యకూ సమాధానం వుంది - అన్నది. చాలా విషయాల్లో - ఇలాంటి భావనను అలవరుచుకోవడం సులభమే.

కొన్ని సమస్యలకు యిలా అనుకోవాలంటే - మరి కాస్త ఎక్కువ పరిణితి కావాల్సి వుంటుంది.

యిది మీ వల్ల కొన్ని సార్లు కాలేదనుకోండి. అప్పుడు - మరో మార్గం వుంది.

సాధారణ మనుషులకు ఉపయోగ పడే మార్గం యిది. ప్రతి సమస్యా రెండు కోణాల్లో చూడొచ్చు.

దీని పరిష్కారానికి - నేనేం చెయ్య గలను. నేనేం చెయ్య లేను - అనే రెండు విషయాలూ మీరు నిర్దిష్టంగా విశ్లేషించి, తెలుసుకోవాలి.

మీరు చెయ్యగలిగిన దానికి - మీరు చింతలో మునగాల్సిన అవసరం లేదు కదా. చెయ్య గలను - అనుకుంటే - చేసెయ్యండి.

సరే. మీరు చెయ్య లేని దానికి - మీరు చింతించి ప్రయోజనం వుందా? అదీ అక్కర లేదు.

అంటే - మీరు చెయ్య గలిగిన దానికీ - మీరు విచార పడ నవసరం లేదు. చెయ్య లేని దానికీ అక్కర లేదు.

చెయ్య గలిగినది చెయ్యకుండా వుంటే అది తప్పే. అలాగే - చెయ్యలేనిది - చేస్తాననడం కూడా తప్పే. 

మీ అసలు సమస్య అంతా - మీరు మనస్సులో పడే - మీ చింతనే. మరేం కాదు.  

ఉదాహరణకు, కొన్ని సమస్యలు, పరిష్కారాలూ  చూద్దాం.

  • మీ ఆస్తంతా పోయింది. రేపటి నుండి బిచ్చమెత్తుకోవాలి. అయ్యో. యిప్పుడెలా? ఎలా ఏమిటి? పాండవులే బిచ్చమెత్తినప్పుడు, మీకు మాత్రం తప్పేమిటి. యిక్కడ సమస్య ఏమిటి? మీ లోని అహం. మీలోని మీ భూతకాలం, మీ వర్తమానానికి అడ్డు వస్తోంది. అంటే - సమస్య మీరే. మీ అహం అడ్డు రాక పొతే - సమస్య లేదు. భిక్షాటన నుండి మొదలు పెట్టి, మళ్ళీ మీరు ముందుకు రావచ్చు.

  • ఏదో కారణానికి - మిమ్మల్ని జెయిల్లో వేసారు. మీకు శిక్ష వేసారు. అయ్యో. యిప్పుడెలా? ఎలా ఏమిటి? గాంధీ గారు జెయిలుకు వెళ్ళ లేదా. "రాజా" గారు జెయిల్లో హాయిగా టెన్నిస్ ఆడుకోవడం లేదా? మీరు మాత్రం హాయిగా వుండ లేరా. వుండ గలరు. మీ సమస్య - మీలోని అహం, న్యూనతా భావం. అవి పక్కన బెడితే - సమస్యే లేదు.

  • మీ అభిమాన టీ.వీ. సీరియల్ వస్తోంది. కరెంటు పోయింది. యిది సమస్యా? కొందరికి సమస్యే. కొందరికి కాదు. ఎవరికిది సమస్యంటే - ఎవరికి వారు సమస్యగా వున్నారో, వాళ్లకు యిది కూడా సమస్యే.

  • మీ అబ్బాయి సరిగ్గా చదవడం లేదు. పక్కింటబ్బాయికి  తొంభై అయిదు శాతం వస్తే, మీ వాడికి, యాభై శాతం వస్తోంది. మీకు వీలయితే - మీరు, మీ అబ్బాయికి నచ్చేటట్టుగా చెప్పగలిగితే - మీరే పాఠాలు చెప్పండి. లేదా- మంచి ట్యూషన్లు పెట్టండి. అబ్బాయి చదివేటప్పుడు, టీ.వీ. ఆఫ్ చెయ్యండి.చెయ్యాలనిపించ లేదా? ఇవేవీ మీరు చెయ్య లేరా? యిప్పుడు - మీరే సమస్య అన్నది తెలుస్తూ వుంది కదా.   మరి అబ్బాయి నెందు కంటారు? మీరు మాత్రం చింత పడి ప్రయోజనం  ఏమిటి? చెయ్య గలిగింది చెయ్యండి. చెయ్యలేనిది ఎలాగూ చెయ్య లేరు. యిది సమస్య అనుకుంటే - యిక్కడ మీరే సమస్య. మీ అబ్బాయికి యాభై మార్కులే వస్తే - ఎలా బ్రతకాలో నేర్పండి. చాలు. అందరూ పల్లకి ఎక్కాల్సిన పని లేదు. పల్లకి ఎక్కిన వాడి కంటే, మోసే వాడే సంతోషంగా వుండొచ్చు.

  • వ్యాధులు వస్తాయి. వొక్కో సారి తీరని వ్యాధులు వస్తాయి. అది కర్మ ఫలం కావచ్చు. మరేదైనా కావచ్చు. మీరు చెయ్య గలిగింది చెయ్యండి. చెయ్య లేని దానిని గూర్చి చింత పడడం అనవసరం. వ్యర్థం.
  • ఏ వ్యాధి వచ్చినా - చివరి క్షణం వరకూ - నేను సంతోషం గా మాత్రం వుంటాను - అని అనుకోండి. యిది మీరు చెయ్య గలరు. చెయ్య గల పని; చెయ్య వలసిన పని. వ్యాధి - సంతోషంగా వుండే వాడిని బాధ పెట్ట లేదు. డాక్టరు దగ్గరకు వెళ్ళ గలరా. వెళ్ళండి. ఆపరేషనో, మరేదో, చేసుకోవాలా - చేసుకోండి. అది, మీ వల్ల కాదా - వదిలి పెట్టండి. వొక్కటి మాత్రం వదలకండి. మీ సంతోషాన్ని. అది మీరు చెయ్య గలరు. చెయ్యాలి.
  •  
  • శాస్త్ర ప్రకారం - ప్రతి వ్యాధీ - మన శరీరమో, మనస్సో, సృష్టించేదే.  వాటిని, నయం చేయగల శక్తీ - మన శరీరానికి, మనస్సుకూ వుంది. ధ్యాన శక్తితో, ఎటువంటి వ్యాదినైనా నయం చేసుకోవచ్చు - అన్నగట్టి నమ్మకం మన దేశంలో వుంది.
  •   
  • అలాగే - ఆయుర్వేదం ప్రకారం - ప్రతి వ్యాధీ -  మూడు దోషాల సమన్వయము చెడినప్పుడే వస్తోంది - ఆ సమన్వయము తీసుకు వస్తే - వ్యాధి నయము కావడం తథ్యం అంటుంది. యిలా - వ్యాధులకు పలు విధ పరిష్కారాలు వున్నాయి. నమ్మకం ముఖ్యం.

  • అన్నిటికంటే - మనుషుల్ని - భయపెట్టేది - చావు. భారత సంస్కృతిలో - చావును గురించి , ముందెవ్వరూ , బాధ పడే వారు కాదు. భయ పడే వారు కాదు. చావు దగ్గర కొస్తోందంటే   -  అప్పుడు యిష్ట దైవతా ప్రార్థన చేసే వారు. మన నమ్మకం ప్రకారం - మనం చేసిన పాపాలన్నీ పోయి - ఏదో స్వీటు తిన్నట్టుగా చావు కూడా జరిగిపోతుంది. ఏం కష్టం లేదు. చావును చూసి భయ పడాల్సిన పని లేదు. సంతోషంతో ఆహ్వానించాలి.

  • నేను చావనైనా చస్తాను కానీ - నా బిడ్డ బ్రతకాలి - అనే తల్లులు - మన దేశంలో యిప్పటికీ వున్నారు. నేను చచ్చినా పర్వాలేదు కానీ, కొన ఊపిరి ఉన్నంత వరకూ, నాభార్య మాన ప్రాణాలు కాపాడతాను - అనే భర్తలూ వున్నారు. వీరందరి సంఖ్యా తగ్గుతున్న మాట నిజమే అయినా - వొక్క మాట నిజం. చావుకో, వ్యాధికో, ఆస్తి పోయినందుకో -  భయపడిన సంస్కృతి కాదు మనది. 

సంతోషం వున్న చోట - సమస్య లేదు. సమస్య లేని చోట - భయమూ లేదు.

ఇదండీ - సమస్య. యిది అర్థమయితే - సమస్య లేదు గాక లేదు.

= మీ

వుప్పలధడియం విజయమోహన్  








14, జనవరి 2012, శనివారం

సంక్రాంతి శుభాకాంక్షలు

అందరికీ  నా  సంక్రాంతి  శుభాకాంక్షలు.  

మకర సంక్రాంతి నాడు - సూర్యుడు ధనుర్రాశి నుండి మకర రాశికి వచ్చే రాజు. 

సాధారణంగా - పండుగలన్నీ తేదీలు మారి వచ్చినా - మకర సంక్రాంతి మాత్రం జనవరి పదినాలుగవ తేదీ నాడు తప్పక వస్తుంది. యిది నాలుగు రోజుల పండుగగా - అంధ్రదేశంలో   జరుపుకుంటారు.(1 ) భోగి (13  వ తేదీ)  (2 ) మకర సంక్రాంతి (14  వ తేదీ) (3 ) కనుమ (4 )  ముక్కనుమ పండుగ.

కానీ - 2012  సంవత్సరంలో - మకర సంక్రాంతి అరుదుగా 15  వ తేదీ నాడు వచ్చింది. 

ఈ అరుదైన సంక్రాంతి నాడు - మీ  

అందరికీ  నా  సంక్రాంతి  శుభాకాంక్షలు.  

= మీ 

వుప్పలధడియం విజయమోహన్ 




 

సుమతి శతకం = బంగారు తెలుగు వెలుగులు = కొన్ని ఆణి ముత్యాలు

సుమతి  శతకం
కొన్ని ఆణి ముత్యాలు 

తెలుగులో భారతం, రామాయణాల లాంటి కావ్యాలు, అత్యద్భుతంగా అతి గొప్ప  కవీంద్రుల చేత రాయ బడ్డాయి.  మరెన్నో కావ్యాలు, నాటకాలు, ఎన్నో,ఎన్నో వచ్చాయి.

అయితే - తెలుగు వారి నోటిలో - ఎక్కువగా నానేవి - సుమతి, వేమన శతకాలే - అంటే  అతిశయోక్తి కాదు.

తమిళం లో తిరువళ్ళువర్ రచించిన తిరుక్కురళ్ వారికి చాలా గర్వ కారణం అని అందరికీ తెలుసు. అలాగే - ప్రతి భాషలోనూ - ఏదో వొక గొప్ప పుస్తకం వుండనే వుంటుంది. ఎవరి గొప్ప వారికానందం.

తెలుగు వరకు - వేమన, సుమతి శతకాలు - ఎంత గొప్పవి - అంటే - చెప్ప లేనంత.మాకు చిన్న తనంలో - మా అవ్వ గారు - కాళహస్తి గుళ్ళో నేర్పించేవారు - అవన్నీ.

కాబట్టి - వాటిలోని - ఆణిముత్యాలు మనసులో పదిలంగా అలాగే నిలిచి పోయాయి. జీవితంలో - ఏ వొత్తిడి వచ్చినా, ఏ సమస్య  వచ్చినా, ఈ శతకాలలోని పాఠాలు - నన్ను ఆదుకున్నాయని  తప్పకుండా చెప్ప గలను. యివన్నీ ప్రతి వొక్కరికీ - బాల్యంలోనే, తప్పక  నేర్పించాలి. అలా నేర్పించడం వలన, వారి జీవితం సుఖ మయం అవుతుందనడంలో  ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
 
వేమన శతక పద్యం వొక్కటి మొదట చూద్దాం.

తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్వి జనుల కెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తమతప్పులెరుగరు
విశ్వదాభిరామ వినుర వేమ

తప్పులే చేయని వారు ప్రపంచం లో లేనే లేరు. మరొకరి తప్పులే వెదుకుతూ వెళ్ళే వాళ్లకు తమ తప్పులు తెలుసుకునే సమయమూ వుండదు. సామర్థ్యమూ వుండదు. వారి జీవితమంతా - మరొకరి తప్పులు వెదకడంలో జరిగిపోతుంది. వారు - ఏ రకమైన ఆనందమూ అనుభవించ లేరు. ఎంత గొప్ప జీవిత సత్యం యిది! నిజానికి మన తప్పులు మనం సరిజేసుకుంటూ   వెడితే - మనం బాగుపడతాము. యితరుల తప్పులే వెదికితే - ఎవరూ మన దగ్గరికి కూడా రారు. మనకు ఏ స్నేహాలూ, చుట్టాలూ వుండవు. మనం బాగు పడే ఆవకాశమూ వుండదు. 

కానీ, వేమన గారి దగ్గర వేదాంతం పాలు ఎక్కువగా కనిపిస్తుంది. అద్భుతమైన అద్వైత వేదాంతం - అతి సులభ మార్గంలో చెబుతారు వేమన గారు. అవన్నీ మరో సారి చూద్దాం.

సుమతి శతకంలో - నిజ జీవితానికి సంబంధించిన సూక్తులు ఎక్కువ.  అవి పిల్లలకూ, పెద్దలకూ - చాలా బాగా నచ్చుతాయి.సుమతి శతక కర్త పేరు బద్దెన కవి. 13  వ శతాబ్దికి చెందిన వాడు. ఆయన సూక్తులు, చాలా వరకు, ఈ నాటికీ వర్తిస్తాయి. కొన్ని సూక్తులు - యిప్పటి కాలానికి పనికి రానివి వున్నాయి.

మనకు చాలా, చాలా, ఉపయోగ పడే - కొన్ని సూక్తులు యిక్కడ ఉదాహరిస్తున్నాను :

"అక్కరకు రాని చుట్టము ;   మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున తా;నెక్కిన బారని గుఱ్ఱము;  గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ!  " అంటారు ఆయన.

చుట్టమంటే  - సమయానికి సహాయపడే వాడే గానీ మొహం చాటు చేసే వాడు కాదు. మనమూ అలాగే వుండాలి గదా. మీరు ఎవరికి సహాయ పడతారో - వారే, మీకు సహాయ పడే ఆవకాశం ఎక్కువ. వరమీని వేలుపు సంగతి ప్రక్కన పెడితే - మీరు యుద్దానికని  వెళ్ళారు; మీ గుఱ్ఱము, మీకు అనువుగా పరుగెత్త నంటుంది . మీరేం చేయాలి? అక్కరకు రాని చుట్టం లాగే యిదీ. వెంటనే వదిలి పెట్టండి. అవసరానికి పనికి రానివి - మనం వెంటనే వదిలి పెట్టాలి.  జీవితానికి కావలసిన సత్యమే కదా.

"అప్పిచ్చు వాడు, వైద్యుడు; ఎప్పుడు,ఎడతెగక బారు ఏరును, ద్విజుడున్; చొప్పడిన ఊరనుండుము ; చొప్పడకున్నట్టి వూరు చొరకుము సుమతీ! " అంటారు శతక కారుడు. 

మీ వూళ్ళో, అవసరానికి అప్పిచ్చే వాడు వున్నాడా? వైద్యుడు వున్నాడా? నిరంతరం త్రాగునీరు సదుపాయం వుందా? మంచీ,చెడూ చెప్పే బ్రాహ్మణుడున్నాడా? ఈ రోజూ కూడా - ఎవరికైనా -  యివన్నీ వున్న వూళ్ళో వుండడమే శ్రేయస్కరం. వీటి రూపాంతరాలు వుండొచ్చు. కాలంతో బాటు కొంత మార్పు సహజం. కానీ - (1) అవసరానికి అప్పు (2 ) రోగాలకు మంచి వైద్యుడు (3 ) మంచి నీటి సదుపాయం (4 ) మంచి చెడులు తెలియ జెప్పే వాడు - వుండే వూరిలో వుండడం, వుండని ఊరిని వదిలి పెట్టడం  అందరికీ మంచిదే కదా.

"ఎప్పటికెయ్యది ప్రస్తుత; మప్పటికా మాటలాడి యన్యుల మనముల్; నొప్పింపక తానొవ్వక; తప్పించుక   తిరుగువాడె ధన్యుడు సుమతీ!" 

యిది ఎంత మంచి మాట. ఎవరినీ నొప్పించకండి  . మీరూ నొచ్చుకోకండి. అలా - ఎప్పుడు ఏది మాట్లాడితే  అందరి మనుసుకూ బాగుంటుందో - అప్పుడు అది మాట్లాడి - సమస్యలు రాకుండా తప్పించుకోండి.

కొంత మందికి -తమకు తెలియకుండానే - చుట్టూ వున్న వారిని - నొప్పించే మాటలనడం -చాలా అలవాటుగా వుంటోంది . అలా మాట్లాడడం తప్పని ప్రతి వొక్కరూ తెలుసుకోవాలి. తెలియని వారికి, ఎవరో వొకరు,చెప్పి తీరాలి. లేదంటే - వారి వలన, వారి చుట్టూ వున్న వారు ఎప్పుడూ, బాధ పడుతూనే వుంటారు.

"తన కోపమె తన శత్రువు; తన శాంతమె తనకు రక్షా దయ చుట్టంబౌ; దన సంతోషమె స్వర్గము ;తన దుహ్ఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!"

యిది వొక ఆణిముత్యం. మనకు, మన కోపాన్ని మించిన శత్రువు మరొకరు లేరు. మనల్ని కాపాడేది మన శాంతమే. మనలోని దయా గుణమే మనకు బంధువు. మన స్వర్గం మరెక్కడో లేదు - మన సంతోషం లోనే వుంది. అలాగే మన నరకం మరెక్కడో లేదు. మన దుహ్ఖమే మనకు నరకప్రాయము.  ఎంత గొప్ప నిజం!  యిది వొక్కటి  జ్ఞాపకం వుంటే - జీవితాన్ని హాయిగా గడిపెయ్యొచ్చు. మన మిత్రులూ, శత్రువులూ - మనలోనే వున్నారు. గుర్తించండి.

"నవ్వకుమీ సభలోపల; నవ్వకుమీ తల్లి దండ్రి నాథులతోడన్; నవ్వకుమీ పరసతితో; నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!"

యిక్కడ నవ్వకుమీ అంటే - రక రకాల అర్థాలున్నాయి. (1 ) పెద్ద వారున్న సభలలో - వూరికే నవ్వడమో, ఎవరినైనా అపహాస్యం చేయడమో అస్సలు చేయరాదు. సాధారణంగా సభలో, వూరికే నవ్వితే - ఎవరినో అపహాస్యం చేసినట్టు పదుగురు అనుకోవచ్చు.  దాని వలన పదుగురూ, మనలను అసహ్యించుకుంటారు.(2 )  అలాగే - తల్లిని, తండ్రిని, భర్తను గానీ, రాజును కానీ (నాథుడు  అంటే - రెండు అర్థాలూ వున్నాయి) ఎప్పుడూ అపహాస్యం చేయకండి.  యివన్నీ పాప హేతువులు. (3 ) మరొకరి భార్యతో పక పకా నవ్వడం ఎప్పుడూ చెయ్య కండి. అది ఆమెకూ, ఆమె భర్తకూ, మీకూ - మంచిది కాదు. (4 ) మీకు మంచీ ,చెడూ చెప్పే విప్రుడిని అపహాస్యం చెయ్యకండి. యివి చేస్తే ఏమిటనే వారికి -ఎప్పుడో వొకప్పుడు చేటు రానే వస్తుంది.

"కనకపు సింహాసనమున; శునకమును కూర్చుండబెట్టి శుభ లగ్నమునం; దొనరగ పట్టము గట్టిన; వెనుకటి గుణమేల మాను గదరా సుమతీ!"    

యిది కూడా సర్వత్ర, సర్వదా వర్తించే సూక్తి. అర్హుడైన వాడినే ముఖ్య పదవులకు అధికారిగా చేయ వలెను గాని - అనర్హుడైన వాడిని, మూర్ఖుడిని అధికారిగా చేస్తే - ఎవరికీ మంచిది కాదని భావము. ఈ రోజుల్లో - ప్రజలు - మంచి వాడికి, సమర్థుడికి   వోటు వెయ్యాలే కానీ - అసమర్థుడికి  పట్టం కడితే - దేశం దుర్గతి పాలవుతుందని భావం.

"కులకాంత తోడ నెప్పుడు; గలహింపకు, వట్టి తప్పు ఘటియింపకుమీ; కలకంఠి  కంట కన్నీ; రొలికిన సిరి యింట నుండ దొల్లదు సుమతీ!"  

భార్యతో నెప్పుడూ  కలహింపకు;కొట్లాడకు; ఆమెలో లేని తప్పులు వూరికే చెప్పకు; అటువంటి కుల స్త్రీల కంటి నీరు పడిన యింటిలో - లక్ష్మి (అంటే - సిరి సంపదలు) ఎప్పుడూ నివసించదు. నివసించడానికి యిష్టపడదు. యిది మగ వారందరూ గుర్తుంచుకోవాలి.  యిది మనువు కూడా చెప్పాడు. మీ యింట్లోని ఆడ వారు - సంతోషం గా వుండడం - మీ, అంటే, మగ వారి బాధ్యత - అన్నది - భారత సంస్కృతి.

"కూరిమి గల దినములలో; నేరములెన్నడును కలుగ;నేరవు మరియా; కూరిమి విరసంబైనను; నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!"

యిది కూడా గొప్ప ఆణిముత్యమే. మనసులో, స్నేహభావమో, ప్రేమో వుంటే -  ఎదుటి వారిలో మనకు ఎటువంటి చెడూ కనిపించదు. కాని ఆ స్నేహభావము, ప్రేమ ఏ కారణము వలనైనా పోయి, ఏహ్యభావం చోటు చేసుకుంటే - ఎదుటి వారు చేసేవన్నీ - మనకు నేరాలుగానూ, సహింపలేనివి   గానూ కనిపిస్తాయి. కాబట్టి - మన మనసులో ఏం ఉండాలో - స్నేహమా, ఎహ్యమా? అనేది మనమే నిర్ణయించుకోవాలి.

"కొరగాని కొడుకు బుట్టిన; గొరగామియే గాదు తండ్రి గుణముల జెరచున్;జెరకు తుద వెన్ను బుట్టిన;జెరకున తీపెల్ల జెరచు సిద్ధము సుమతీ!"

కొడుకు పనికిరాని వాడితే - వాడు పనికి రాని వాడని మాత్రం అనరు. వాడి తండ్రిని కూడా లోకం తప్పు పడుతుంది. తండ్రి ఎంత మంచి వాడైనా, మూర్ఖపు కొడుకు గుణాలను తండ్రికీ అంటగడతారు. చెరకు గడ ఎంత బాగా వున్నా, దాని చివర వెన్ను పుట్టిందంటే   - గడ అంతటా చేదు తయారవుతుంది. తీపి పోతుంది. యిదీ అలాగే.

"తన వారు లేని చోటను; జనవించుక లేని చోట జగడము చోటన్; అనుమానమయిన చోటను; మనుజున కట నిలువ దగదు మహిలో సుమతీ!"

మనం ఎక్కువ కాలం వుండాలంటే - తన, మన అని అనే వారు, మనం తమ వారు అనుకునే వారు వున్న చోటే వుండాలి కానీ . తన, మన అనే వారు ఎవరూ లేని చోట వుండ రాదు. అదే లాగ, ఏదో కాస్త - మనకూ స్వాతంత్ర్యం వున్న చోట వుండాలి కానీ, కూర్చుంటే తప్పు, లేస్తే తప్పు, అనే చోట వుండ రాదు. ఎప్పుడూ, మనల్ని అనుమానం తో,  చూసే వారున్న చోట కూడా ఉండరాదు. అటువంటి వారు - ఎప్పుడో వొకప్పుడు, మనపై అపవాదులు పెట్టడం ఖాయం. అటువంటి స్థలాల్లో నివసించడం క్షేమ కరం కానే కాదు.

"వినదగునెవ్వరు చెప్పిన; వినినంతన వేగపడక వివరింపదగున్; గనికల్ల నిజం దెలసిన;  మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!"

మనిషికి సలహాలిచ్చే వారు, ఉన్నవీ లేనివీ వార్తలు చెప్పే వారు ఎంతో మంది వస్తారు. సలహాలు, వార్తలు  వినవచ్చు. తప్పు లేదు. కానీ -ఏది వింటే, అది వెంటనే నమ్మేయాలనీ,  చేసేయాలనే ఆత్రుత పనికి రాదు. అదంతా నిజం అనుకునే మనస్తత్వం పనికి రాదు. ఏది నిజమో, కాదో; ఏది చేస్తే మంచిదో కాదో, బాగా వివరంగా తెలుసుకుని - మరీ కార్యంలో దిగాలి కానీ - వినినంతనే - ఆత్రుత పడితే - ముప్పే.

మొదట వినండి. మంచి వారి మాట ఎక్కువగా వినండి.  మీ శ్రేయోభిలాషులైన వారి మాట వినండి.  తల్లీ, తండ్రీ, గురువూ మాట తప్పక వినండి. ఏది విన్నా - అందులోని నిజమెంతో తెలుసుకుని మరీ ఏ కార్యమైనా చేయండి. 

ఇలాంటి ఆణి ముత్యాలు మన శతకాలలో కోకొల్లలుగా వున్నాయి. అవన్నీ - యిప్పుడే చెపినట్టు - యిప్పటికి తగినవే అనుకోవడం సబబు కాదు. కాలానుగుణం గా కొన్ని మార్చుకోవాలి. కొన్ని - అన్ని కాలాలకూ పనికొచ్చేవి వున్నాయి. అవి తెలుసుకోవాలి. మనసులో రంగరించుకోవాలి . మన జీవితం సుఖమయం చేసుకోవాలి.


యిక్కడ యిచ్చినవి - అన్నీ యిప్పటి కాలానికీ తగినవే - యివి మనమూ పాటించాలి. మన పిల్లలికీ నేర్పించాలి.

= మీ

వుప్పలధడియం విజయమోహన్

13, జనవరి 2012, శుక్రవారం

మానవీయ సంబంధాలు = యండమూరి వీరేంద్రనాథ్ = డాక్టర్ బీ.వీ.పట్టాభిరాం = వొక జ్ఞాపకాల వెల్లువ = ఏడవడంలోని సంతోషమూ, సంతోషంగా ఏడవడమూ - జీవితానికి ఎంత ముఖ్యమో


వొక జ్ఞాపకాల  వెల్లువ 

నేషనల్ అకాడెమీ ఆఫ్ టెలికాం ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ మన హైదరాబాద్ లోనే వుంది. అప్పట్లో - అంటే నేను అక్కడ వున్న రోజుల్లో - భారత్ సంచార్ నిగం వారి ఆధ్వర్యంలోచాలా, చాలా బాగా, జరిగేది. జరిపించే వాళ్ళం.

నేను అందులో  మానవీయ సంబంధాలు (హ్యూమన్ రిలేషన్స్) అండ్ మేనేజ్మెంటు విభాగానికి హెడ్ గా వుండే వాడిని.  ఎన్నో రకాల  ట్రైనింగులు, సెమినార్లు,వర్కు షాపులు - రకరకాల నూతన ప్రక్రియలతో నిర్వహించాము.


వొకరికొకరిని పరిచయం చేసే విధానం నుండి - అన్నీ - సరి కొత్త విధానాలే.  అన్నీ, ఎన్నో రకాలుగా యోచించి మేము  తీసుకొచ్చిన ప్రక్రియలే.

ప్రతి మనిషిలోనూ - వొక గొప్ప సృష్టికర్త -ఉన్నాడని - అతన్ని - బయటకు తీసుకు రావడమే - మనిషి చేయాల్సిన పని అని - మాకు బాగా తెలిసి వచ్చింది - అప్పుడే.

హైదరాబాదులో వున్న మన తెలుగు వారిలో - ముఖ్యంగా మానవీయ సంబంధాలలో  - చాలా గొప్ప రచయితలుగానూ, వక్తలుగానూ, పేరుపొందిన వారిని - భారత దేశానికంతా పరిచయం చేయాలని మేము ప్రయత్నాలు చేయడం జరిగింది. 

అందులో భాగంగానే - అప్పట్లో - యండమూరి వీరేంద్రనాథ్   గారిని,  డాక్టర్ బీ.వీ.పట్టాభిరాం గారిని , వారి సోదరుడిని , మరెంతో మంది - ప్రముఖులను ఆహ్వానించే వాళ్ళం.  

వీరేంద్ర నాథ్ గారి ప్రసంగము, పట్టాభిరాం గారి ప్రసంగము - వీటిలో - బయటి వారిని బాగా ఆకర్షించేవి.  సరే. మా అకాడెమీ లోని వక్తలలో - నేను. కల్యాణ్ సాగర్ గారని యింకొకరు - మా యిద్దరి  ప్రసంగాలూ -  చాలా బాగుండేవని - అందరి ప్రశంసలూ పొందేవి .  

వీరేంద్రనాథ్   గారిని -  ముఖ్యంగా వారి విజయానికి అయిదు మెట్లు ను గురించి మాట్లాడమనే వాడిని. ఆయనా - అది తనకిష్టమైన విషయం కాబట్టి - చాలా ఆకర్షణీయంగానూ, మనస్సులో హత్తుకుని పోయే లాగానూ మాట్లాడే వారు.

పట్టాభిరాం గారు - తనకు బాగా నచ్చిన ఏదో వొక విషయం పైన మాట్లాడే వారు. రక రకాల వుదాహరణాలతో,  చాలా ఆసక్తి కరంగా జరిపే వారు.

అన్ని రాష్ట్రాల నుండి - చాలా మంది మా ట్రైనింగ్ కు వచ్చే వారు.

క్లాసు రూములో - సాధారణ సంఖ్య ముప్పైకి మించరాదు. అటువంటిది - వద్దన్నా - వంద మంది వరకు భారత దేశమంతటి నుండీ వచ్చేసే వారు. మేమూ - వారిని నిరుత్సాహ పరచకుండా - రెండు క్లాసు రూముల్లో - వొకే సారి, వొక్కొక్క క్లాసు రూములో, యాభై మంది దాక ఎలాగో సర్ది - జరిపే వాళ్ళం.

మొదటి అంశం పరిచయం. నేనే చేసే వాడిని. నేను జరిపే పరిచయం ఎలా వుండేదంటే   -  వో ముప్పావు  గంటలో - క్లాసులోని ప్రతివొక్కరికి, అందరినీ - వారి పేర్లూ, వారి వూరి పేర్లతో  సహా జ్ఞాపకం వుండేటట్టు చేసే వాడిని.  మరి నాకూ గుర్తుండాలిగా. ఆ ప్రక్రియ వచ్చిన వారికి చాలా ఆశ్చర్యకరంగా  వుండేది. వచ్చిన వారిలో ఏ వొక్కరూ - తాము యాభై మంది క్రొత్త వాళ్ళను - వివిధ రాష్ట్రాలనుండి వచ్చిన వాళ్ళను -  వారి పేర్లు, ఊర్లతో సహా మనుషులను కూడా 45 నిమిషాలలోగా గుర్తించగలమని    మొట్ట మొదట నమ్మగలిగే వాళ్ళు కాదు. కానీ - ఆ 45  నిమిషాల తర్వాత - అది చెయ్య లేని వాళ్ళూ ఎవరూ లేదు.

ఆ ప్రక్రియ మా ట్రైనింగ్ కు గట్టి   పునాదిగా మారింది.   అంతర్జాతీయ ప్రఖ్యాతి గల శివ్ ఖేరా లాంటి వారి ట్రైనింగ్ కు కూడా నేను వెళ్లాను కానీ - మా ట్రైనింగ్ లోని యిటువంటి అద్భుతమైన అంశాలు మరెక్కడా నాకు కనిపించ లేదు.

దానితో, వచ్చిన వారికి ట్రైనింగు పైన - చాలా గౌరవం వెంటనే కలిగేది. మానవీయ సంబంధాల పైన ట్రైనింగు కదా.

ట్రైనింగును - వొక పద్ధతి ప్రకారం తీసుకెళ్ళే వాళ్ళం. అయిదు రోజులు అయ్యే సారికి - వారిలో - మేము కోరుకున్న మార్పు వచ్చి తీరాలని ప్రయత్నం చేసే వాళ్ళం. వచ్చిన వాళ్ళు ప్రతి వొక్కరూ, వచ్చినట్టు  వెళ్ళకూడదు. కొంత, నిరంతరమైన , సకారాత్మకమైన - మార్పు తోనే వెళ్ళాలి.
మొదటి రోజు - జీవితాన్ని - ఆట లాగా, పాట లాగా  హాయిగా, ఆనందంగా గడపాల్సిన అవసరం గురించి చెబుతూ - కడపటి రోజు ప్రతి వొక్కరూ, కనీసం వొక పాట లోని వొక చరణమైనా పాడాలని చెప్పే వాళ్ళం. అందుకని ప్రతి వొక్కరూ ప్రయత్నమూ చేసే వాళ్ళు. పాడే వాళ్ళు.   డాన్సు కూడా చేసే వాళ్ళు. చివరి రోజు, చివరి క్లాసు వాళ్ళదే. చాలా బాగా జరిగేది.

సరే. యండమూరి గారి క్లాసు చాలా విజ్ఞాన దాయకంగా జరిగేది. ఆయన యిచ్చే ఆలోచనలు - ప్రతి వొక్కరి మనస్సులోనూ హత్తుకు పోయేవి. మరి విజయానికి మెట్లు కదా. ఆయనను పరిచయం చేయడం మొదట నా సహ ఆఫీసర్లు లో ఎవరికైనా వొప్పగించే వాడిని. వారు - ఆయనను గురించి పేపర్లో రాసుకుని పూర్తిగా క్లాసులో చదివే వారు.

వొక్కో సారి నేనే చేసే వాడిని. యండమూరి గారి కథలు, నవలలు, అన్నీ- పత్రికలలో ప్రచురితమైనప్పుడే చదివిన వాడిని నేను. ఆయన జీవితం లోని - ముఖ్య సంఘటనలు, ఆయన విజయాలు అన్నీ బాగా తెలిసున్న వాడిని. సరే - ఆయనంటే - బాగా అభిమానమూ వున్న వాడిని అవడం వల్ల -  నాకు పేపర్లో రాసుకోవలసిన అవసరం లేదు. నేను పరిచయం చేయడంలో - ప్రతి సారి చాలా వైవిధ్యం వుండేది.  అది ఆయనకు బాగా నచ్చేది.

తరువాత, తరువాత   - ఆయన, నా పరిచయం మాత్రం మీరే చెయ్యండి - అనే వారు. నేనూ అలాగే చేసే వాడిని. ఆ తరువాత - ఆయన, విజయమోహన్ గారూ, నేను మాట్లాడడానికి ముందు మీరు వొక పది పదిహేను నిమిషాలు మాట్లాడరా, నేను వినాలి - అనే వారు. అప్పటికప్పుడు, ఏదైనా వొక విషయాన్ని గురించి మాట్లాడే వాడిని. అంతా మానవీయ సంబంధాల గురించే. అప్పట్లో - ఎన్నో వందల పుస్తకాలు చదివాను. వేల పస్తకాలు కూడా వుండొచ్చు.

అందులోని - అతి ముఖ్యమైన విషయాల గురించి, ఆ పదిహేను నిముషాలు మాట్లాడే వాడిని. ఆ తరువాత, యండమూరి - తన ప్రసంగం ఆరంభించే వారు.  యండమూరి, పట్టాభిరాం గార్ల ప్రసంగాలు - గొప్ప హై లైట్ గా చెప్పొచ్చు.

వొక రోజు - యండమూరి గారి కారు ఎక్కడో - ట్రాఫిక్ జామ్ లో యిరుక్కు పోయింది. కాస్త ఆలస్యం అవుతుందని వార్త వచ్చింది.   ఆయనకు తెలుసు - అంత వరకు - నేను కొన సాగిస్తానని. సరే. నేనూ ఏదో చెబుతున్నాను. కాని - వచ్చిన వాళ్ళు - సార్,  ఆఖరి రోజు మమ్మల్నంతా పాడమని అన్నారు కదా.  మీరు ఈ రోజు - వొక పాట   పాడండి - అని బలవంతం చేసారు. సరే. తప్పేదేముంది.

నేను పెద్ద గాయకుడిని కాను. కానీ - ఎవరైనా సరే. కొద్దో, గొప్పో పాడగలరు - అని నమ్మే వాడిని. ఆ రోజు - కభీ, కభీ - హిందీ చిత్రంలోని - కభీ,కభీ, మేరె దిల్ మే - అనే పాట కళ్ళు మూసుకుని పాడాను.

యండమూరి ఎప్పుడు వచ్చారో తెలీదు కానీ - పాటంతా అయిన తరువాత- నేను కళ్ళు తెరిచి చూస్తే -  క్లాసులోని అందరితో బాటు - ఆయన కూడా కరతాళ ధ్వనులు చేసేస్తున్నారు.

తరువాత - ఆయన పరిచయం చేసాను. మీరు పాటలో - బాగా లీనమై, చాలా బాగా పాడారని ఆయన మనస్ఫూర్తిగా అనడం - నాకు చాలా బాగా అనిపించింది.

నేను అప్పుడప్పుడూ వెళ్లి ఆయన క్లాసులోనూ, పట్టాభిరాం గారి క్లాసులోనూ వెళ్లి కూర్చుని, వినే వాడిని.

నా  ప్రసంగం -  లైఫ్ స్కిల్స్ - అనే అంశం పైన చేసే వాడిని. అందులో నేను చెప్పే విషయాలు - ఏ పుస్తకం లోనూ దొరకవు. నేను మానవీయ సంబంధాల పైన చేసిన రీసెర్చ్ ఫలితాలే. చాలా సులభంగా - ప్రతి వొక్కరూ - చేయ గలిగే అంశాలే. నేను చేయ లేనివి, నేను చేయనివి - నేను చెప్పకూడదని  సిద్ధాంతం   పెట్టుకున్నాను. అలాంటి అంశాలే చెప్పే వాడిని.

చిన్న రహస్యం - ఏమిటంటే - నా ప్రసంగం లో   - ప్రతి వొక్కరూ - చాలా సార్లు నవ్వాలి. కొన్ని సార్లు వారి కళ్ళల్లో నీళ్ళు రావాలి - యిది జరిగితేనే - నా ప్రసంగం విజయవంతం అయినట్టు - అని వొక  గోల్ / గుర్తు పెట్టుకున్నాను.

అది జరిగేది - కానీ, చివర అందరూ, మీరు బలే ఏడిపిస్తారు సార్ - అని సంతోషంతోనూ, వొక రకమైన సంతృప్తితోనూ, చెప్పే వారు.

ఏడవడంలోని సంతోషమూ, సంతోషంగా ఏడవడమూ - జీవితానికి  ఎంత ముఖ్యమో - ఎంత తృప్తి నిస్తాయో - అందరికీ తెలిసొచ్చేది. హృదయాన్ని కన్నీళ్లు ఎంత బాగా కడగ గలవో - నాకు సద్గురు జగ్గి వాసుదేవ్ గారి "భావ స్పందన" అనే యోగా ట్రైనింగ్ లో - చాలా బాగా తెలిసొచ్చింది.

మనిషికి ఈ రెండూ కావాలి. నవ్వ గలగాలి. యేడవ గలగాలి. తరువాత - ఆ రెండింటినీ -  దాటి పరిణితి చెందాలి. ముందుకెళ్లాలి.

మనిషి ఆనంద స్వరూపుడు. అది తెలుసుకున్న వాడే యోగి. ఆ ఆనందంలోనూ - కన్నీళ్ళున్నాయి. అదీ తెలుసుకోవాలి. రామకృష్ణ పరమ హంస ఎన్నో సార్లు సంతోషంతో కన్నీళ్ళు కార్చే వారు.

నిర్లిప్తంగా, నిర్వేదంగా - వుండటంలో - జీవితం సాఫల్యం చెందదు. ఆడండి. పాడండి. చిన్న పిల్లల్లా గంతులెయ్యండి. నవ్వండి. ఏడవాల్సి వస్తే, తృప్తిగా ఏడవండి. నిద్ర పోయేటప్పుడు - హాయిగా, ప్రపంచాన్ని మరిచి నిద్ర పోండి.

ప్రతి రోజూ, సృష్టి కర్త గా, సకారాత్మకంగా ఏదో వొకటి సృష్టించండి. ముఖ్యంగా - కనీసం వొకరి మనసులో, ఏదో కొంత, సంతోషాన్ని సృష్టించండి.

= మీ

వుప్పలధడియం విజయమోహన్

5, జనవరి 2012, గురువారం

దేశం పాడవడం చెడ్డ వాళ్ళ చర్యల కంటే - మంచి వాళ్ళ మౌనం వలన ఎక్కువ = మాన భంగాలకు అసలైన కారణం ఏమిటి?


ఈ మధ్య మానభంగాల సంఖ్య చాలా ఎక్కువయిపోతోందని - అందుకు కారణాలేమిటని -      మీడియా వారడిగిన వొక ప్రశ్నకు సమాధానంగా ఆంధ్రప్రదేశ్ డీ.జీ.పీ. గారు - అందుకు కొందరి ఆడవారి అర్ధనగ్న దుస్తులు, మితి మీరిన ఫాషన్లు కూడా కారణమని  అన్నారట.

ఆ వొక్క మాటకు - (కొంత మంది) ఆడవారినుండి   - తీవ్ర వ్యతిరేక స్పందన ఎదురైంది.

కానీ యిదే మాట ఢిల్లీ ముఖ్య మంత్రి షీలా దీక్షిత్ గారు కూడా అన్నారట. అసలింతకీ - ఈ విషయం వొక సామాజిక పరిశోధనలో తేలిన అంశమట.

ఎక్కువయి పోతోన్న మాన భంగాల సంఖ్యకు అర్ధ నగ్న, మితిమీరిన  ఫాషను దుస్తులు  కూడా వొక కారణం కాదా?

నిస్సందేహంగా - అది కూడా వొక బలమైన కారణమే  అని - నా వరకు నేను డీ.జీ.పీ గారి పై మాటతో తప్పకుండా అంగీకరిస్తాను. నిజాన్ని చెప్పినందుకు ఆయన ఎవరికీ సంజాయిషీ యివ్వాల్సిన పని లేదు- అన్నది నా అభిప్రాయం. అదే మాట చెప్పిన షీలా దీక్షిత్ గారు -జీవితాన్ని మధించి చెప్పిన మాటే అది.

పాషన్ల పేరిట ప్రపంచం లోని అందరు మగాళ్లనూ - ఆకర్షించాలని కొందరు ఆడవారు చేసే ప్రయత్నాలు -అందరు ఆడ వాళ్ళ కొంప ముంచుతుందనడంలో  నాకు సందేహం లేదు.

ఆడ-మగ మధ్య పరస్పర సంబంధాలు, ఆకర్షణలు,ప్రేమలు, పెళ్ళిళ్ళు, -ఈ వ్యవస్థకు  పునాది నే పీకి పారేయాలని మూర్ఖంగా ఆలోచిస్తే - సమాజమంతా  - అస్తవ్యస్తంగా తయారవుతుంది.

దుస్తుల విషయంలో, ఆడవారికి గానీయండి, మగ వారికి గానీయండి - పూర్తి స్వాతంత్ర్యం లేదు. వుండ రాదు.

వొకరిపై, వొకరికి గౌరవం వచ్చే విధంగా దుస్తులు వుండాలి గాని - సెక్సీ గా, ఆకర్షించే విధంగా వుంటే - ప్రమాదమే - అన్నది ప్రతి వొక్కరు తెలుసుకోవాలి.

మగ వారి విషయంలో - చాలా వరకు, దుస్తులు దేహాన్ని కప్పే వున్నాయి. ఎవరో, వొకరిద్దరు తప్ప.

ఎటుతిరిగీ - కొంతమంది (అందరూ కాదు) ఆడ వారే - సినిమాల్లో కానీయండి, టీ.వీ లో కానీయండి, మరీ బరి తెగించి  ఎంత భాగం నగ్నంగా ప్రదర్శించ గలమా అని చూస్తున్నట్టు తెలుస్తూనే వుంది కదా. పైగా - అది నా యిష్టం అంటున్నారు.

అందుకు కొంత మంది మగ నిర్మాతలూ, దర్శకులూ కూడా చాలా, చాలా, కారణం గా వుంటున్నారు.

సరే. ప్రేక్షకుల్లో వొక భాగం - దీనికి బానిసలై పోతునారు. మందు కొట్టడం, పొగత్రాగడం లాగా, యిది కూడా వొక వ్యసనమే అని - ఆ వ్యసనానికి బానిసలైతే - మనం మరే మంచి పనీ చేయలేమని సమాజం గుర్తించాలి.

టీ.వీ. తెరిస్తే చాలు - ఈ అర్ధ నగ్న డాన్సులు ప్రత్యక్షమవుతున్నాయి. యివి మగ వారి మనస్సులో సెక్సు కాంక్షని కొద్దో, గొప్పోరేకెత్తిస్తాయి- అనడంలో అతిశయోక్తి లేదు.  సమాజం మొత్తం వీటికి బానిసై పోతున్నారు . మరి యివి చూసి, చూసి, మగ వాళ్ళు పక్కన ఎవరున్నారా, వీధిలో ఎవరున్నారా - అని చూస్తే - అది ఎవరి తప్పు?

మన సమాజంలో - యివన్నీ తెలిసే - కొన్ని నిబంధనలు పెట్టారు. అలాగని - పైనుండి, క్రింది వరకు ముసుగులో దాచెయ్యలేదు. మగ వాడు చేసే తప్పుకు కూడా ఆడవారిని కొట్టి చంపాలని చెప్ప లేదు.

కానీ - ఎవరికైనా - ఎప్పుడూ -విశృంఖలమైన   స్వాతంత్ర్యం లేదు. వుండ రాదు.వుంటే - అది కావాలనుకుంటే - మళ్ళీ ఆ సమాజానికి భవిష్యత్తు లేదనే చెప్పొచ్చు.

సరే. యిందులో - మగ వారి తప్పు లేదా? మగ వారి తప్పు లేకుండా - ఆడది తప్పు చెయ్య లేదు. అలాగే - ఆడ వారి తప్పు లేకుండా - మగ వాడు తప్పు చెయ్య లేదు.

మానభంగం జరిగితే - అది చేసేది - మగ వాడే కాని - ఆడది కాదుగా. అది మగ వాడి తప్పే. అందులో ఆవ గింజంత సందేహం కూడా అక్కర లేదు.

వొక ఆడది యిచ్చే నగ్న ప్రదర్శనలను - తప్పు అని మొట్ట మొదటే చెప్ప గలిగే - ధైర్యం మగ వాడికి వుండాలి. ఎందుకు? అది కొంప ముంచేది - మగ వాడినే గనుక!

మన పురాణాల్లో కూడా- యిది మళ్ళీ,మళ్ళీ చెప్ప బడింది. ఎక్కడో అడవిలో కూర్చుని ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే విశ్వామిత్రుడిని - పనిగట్టుకుని వెళ్లి , మేనక చెడిచింది - ఇలాంటి అర్ధ నగ్న దుస్తులు, డాన్సులుతోనే కదా.  

మరి తపస్సు చేసుకునే విశ్వామిత్రుడినే చెడప గలిగే లాంటి దుస్తులు, చాలా మంది ఆడ వారు వేసుకుంటే - జరిగేదేమిటి?   మాన భంగాలు పెరగవా? కాక పొతే - రోడ్డు మీదో, సినిమా లో నో, టీ.వీ. లోనో - యివన్నీ చూసి, చూసి - మనసు పాడైన -  కొందరు - ఎక్కడో దొరికిన చోట, ఎవరో అమాయకులను మాన భంగాలు చేసేస్తున్నారు. తప్పొకరిది. చేటొకరికి. మాన భంగం చెయ్య బడిన అమ్మాయి తప్పు అస్సలు లేక పోవచ్చు. కాని మరెక్కడో తప్పు జరిగింది.

అదే విధంగా - కేవలం డబ్బు కోసం - కొంత మంది నిర్మాతలు, దర్శకులు - ఇలాంటి అర్ధ నగ్న డాన్సులు, ప్రదర్శనలను ప్రోత్సహించడం వలననే - కొంత మంది ఆడ వారు యిలా చేస్తున్నారనడం లో కూడా - సందేహం లేదు. అంటే- సగం తప్పు మగ వారిది. సగం తప్పు ఆడ వారిది. కానీ - నష్టం అందరికీ.

తప్పును - తప్పు అని చెప్పే ధైర్యం మనకు లేదంటే - తప్పులే పెరుగుతాయి.

ఆడవారిపై, మగ వారికీ, మగ వారిపై ఆడవారికి -గౌరవం యిచ్చే లాగా యిద్దరి ప్రవర్తనా వుండాలి. అదే అందరికీ క్షేమం.

రోడ్డు పై నడిచే మగవారిలో - 25 శాతం మంది - సరే. కనీసం అయిదు శాతం మంది - సెక్సు కాంక్షతో   - వుంటే - జరిగేదేమిటి?

యిది పోవాలంటే - సినిమాల్లో, టీ.వీ.లలో, ఆమ్మాయిలు వేసుకునే దుస్తులలో - కాస్త  గౌరవ నీయత వుండాలంటే - తప్పేమిటో - నాకు తెలియడం లేదు.

మగ వారిలో - ఆడవారి పట్ల గౌరవం పెంచాలి - కానీ ఆకర్షణ ను  కాదు - అన్న విషయం - అందరూ అర్థం చేసుకోవాలి.

అప్పుడే - గాంధీ గారు అన్న - "అర్ధ రాత్రి కూడా, ప్రతి ఆడది, వొంటరిగా, భారత దేశంలోని ఏ వీధిలో నైనా నిర్భయంగా తిరగగలిగే" -  స్వాతంత్ర్యం వస్తుంది.

యిప్పుడి జరుగుతున్న కొన్ని సంఘటనలు వింటే, చదివితే, చాలా, చాలా బాధ కలుగుతుంది. మూడేళ్ళ పసిపాపను యింట్లో వారే , లైంగికంగా వాడుకున్నారట. మరో యింట్లో - డెబ్భై ఏళ్ళ ముసలమ్మపై అత్యాచారం జరిగిందట. వాళ్ళు మనుషులేనా - అన్న సందేహం మనకు రావాలి. అమ్మంటే గౌరవం లేదు. అవ్వంటే మర్యాద లేదు. అక్క చెల్లెళ్ళంటే కూడా  ఏమీ స్నేహ భావం లేదు. యిలా తయారవుతున్నారు - కొంత మంది మగ వారు.

మరి కొంత మంది ఆడవారైతే - మామ  గారి ఎదురుగా, తండ్రి ఎదురుగా, మరుదుల ఎదురుగా - ఇలాంటి సెక్సు ఆకర్షణ కలిగించే విధంగా తిరగొచ్చునా   -  అన్న విచక్షణ లేకుండా వున్నారు.

ఈ పధ్ధతి మారాలి.

కొన్నేళ్ళ  క్రితం - దక్షిణ రైల్వే లోని - వొక ట్రైన్ రూటు లో - నేను ప్రతి రోజూ ఫస్టు క్లాసు, సెకండు క్లాసులలో - ఆఫీసుకు వెళ్ళే వాడిని. అప్పట్లో - ఆ రూటులో - స్త్రీ వేధింపు చర్యలు ( ఈవ్ టీజింగ్) చాలా, చాలా ఎక్కువగా  వుండడం నేను చూసాను.

నా సహ ప్రయాణీకులతో ప్రతి రోజూ అనే వాడిని - మనమంతా కలిసి - ఈ రౌడీ వెధవల ఆగడం అరికట్టాలి - అని.  వొక్కరంటే - వొక్కరు కూడా ముందుకు రావడానికి సాహసించ లేదు.

కొన్ని రోజుల పాటు చూసి, చూసి - వోర్చుకోలేక - పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ కు, జనరల్ మేనేజర్ గారికి - పెద్ద ఫిర్యాదు రాసి పంపించాను. వారి పోలీసు ఆఫీసర్లు - మా ఆఫీసుకు వచ్చి - నా వద్ద - రాసింది నేనేనా, నాకు యింకా చెప్ప వలసింది ఏదైనా   వుందా -  అని మాత్రం అడిగి తెలుసుకుని వెళ్ళారు.

అంతే. తరువాత - నెల రాజులు వారు తీసుకున్న చర్యల ఫలితంగా - ఆ రూటులో -యిప్పటి వరకూ స్త్రీ వేధింపు చర్యలు దాదాపు లేవనే చెప్పొచ్చు. కానీ - దురదృష్టమేమంటే   -  వొక్కరంటే, వొక్కరు, నాకు మొదట సపోర్టు యిచ్చిన వారు లేరు. అయినా నేను ముందుకు వెళ్లి పోయాను. అదృష్ట వశాత్తూ - దక్షిణ రైల్వే లోని - ఆఫీసర్లు చిత్త శుద్ధితో వ్యవహరించారు. అందువలన ఆ రూటులో - ఆడవారి సమస్యలు - తీరిపోయాయి.

సరే. ఆడదే , మరో ఆడదానికి సమస్యగా మారితే?

డీ.జీ.పీ. గారు చెప్పిన దానికి అర్థం అదే. ఆ పరిస్థితి కూడా మారాలి.

సరిగ్గా ఆలోచించే ఆడవారు, మగ వారు - అందరూ - వెర్రితలలు వేస్తున్న అర్ధ నగ్న దుస్తులను, శరీరాన్ని  పూర్తిగా అంటుకుని, అంతటినీ - దాదాపు బహిర్గతం చేసే లాగున్న దుస్తులు మంచిది కావన్న సంగతి - మన పిల్లలందరికీ  చెప్పాలి.  అలాగే, ఐటం సాంగు పేరుతో - అశ్లీల ప్రదర్శనలు చేయించే  నిర్మాతలకు, దర్శకులకూ కూడా చెప్పాలి.

లేదంటే - డీ.జీ.పీ. గారు చెప్పినట్టు - మానభంగాలను అరికట్టడం సుసాధ్యం కాదు.

చదివే వారిని - నేను కోరేదేమిటంటే - అయ్యలారా,అమ్మలారా, మీ అభిప్రాయాలూ చెప్పండి. మన పిల్లలు - తప్పు మార్గాల్లో వెళ్ళకూడదంటే   -  అందరూ క్షేమంగా, ఆనందంగా వుండాలంటే - సరైన సమయంలో - సరైన అభిప్రాయం చెప్పక తప్పదు.

దేశం పాడవడం చెడ్డ వాళ్ళ చర్యల కంటే - మంచి వాళ్ళ మౌనం వలన ఎక్కువ - అని అందరం గ్రహించాలి. ఈ విషయంలో అందరూ చేయి కలపండి.

= మీ

వుప్పలధడియం విజయమోహన్

30, డిసెంబర్ 2011, శుక్రవారం

2012 వ సంవత్సరపు శుభారంభం = మీకందరికీ నా హార్దిక శుభాకాంక్షలు = 2011 ఎలా గడిచింది?

2012  వ సంవత్సరపు శుభారంభం 
ఈ శుభ సమయంలో -  మీకందరికీ నా హార్దిక శుభాకాంక్షలు .

2011  - మీ జీవితంలో ఎలా గడిచింది?

కొన్ని సుఖాలు, కొన్ని కష్టాలు; కొన్ని సంతోషాలు, కొన్ని దుహ్ఖాలు;

కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు; కొంత ఆరోగ్యం, కొంత అనారోగ్యం.


సరే. దేశానికెలా  గడిచింది?

లంచగొండితనం రాక్షస విహారం చేసింది. ధరల పెరుగుదల పారాకష్ట చేరింది.

రాజకీయాల్లో - అవినీతి మాత్రమే కాదు, తెలివిమాలిన తనం, కుల,మత రాజకీయాలు, 2011 లో ఎన్నో యింతలు పెరిగింది.

వొక బలిష్టమైన, సమర్థ వంతమైన, నిష్పాక్షికమైన    లోక్ పాల్ తీసుకురండని ప్రజల పక్షాన అన్నా హజారే గారు కోరితే - అందుకు, ప్రజలు, విపక్షాలు వారిని సమర్థిస్తే - చివరికి, రాజకీయ చదరంగంలోని - అన్ని రకాల చాణక్య నీతులూ ఉపయోగించి - ప్రభుత్వం - అది రాకుండా చేసింది. ముందేం జరుగుతుందో తెలీదు.  లోక్ పాల్ వస్తుందా, రాదా? గత 60 సంవత్సరాలలో - ఎందుకు రాలేదో  మాత్రం - చాలా స్పష్టంగా తెలిసి పోయింది.

అంతకు ముందు - అదే బాణీలో, బాబా రాం దేవ్ గారు - నల్ల ధనం గురించి చేపట్టిన ఆందోళన కూడా చాలా గొప్పదే. కాని - ప్రభుత్వం వారు, చేపట్టిన అర్దరాత్రి దాడి వలన - అది వీగిపోయింది.

మహాభారత యుద్ధం తర్వాత నిద్ర పోతున్న వీరుల పై అశ్వత్థామ  దాడి చేసి - వారిని చంపాడట.   ఆ పాపానికి - అప్పటి నుండి, యిప్పటి వరకు, కలియుగాంతం వరకు అశ్వత్థామ శిక్ష అనుభవిస్తూ వుంటాడట . నాకు మాత్రం - ఈసంఘటన తలుచుకుంటే - అదే జ్ఞాపకం వచ్చింది.

కాని - ప్రజలలో - రావాల్సిన స్పందన రాలేదు. రాందేవ్ గారు, పైనుండి క్రిందికి దూకాడట. ఎవరో ఆయన  శిష్యులిచ్చిన   చుడీదార్  వేసుకున్నాడట. నిద్ర నుండి లేచిన ఆ క్షణంలో  జరిగిన ఆ చిన్న చర్యను రకరకాలుగా ప్రభుత్వం వారు చెప్పుకున్నారు గానీ, ప్రజలూ దాన్ని విన్నారు గానీ -  ప్రభుత్వం నిర్వహించిన అమానుష చర్యను ఖండించాల్సినంతగా   ఖండించలేదనే  చెప్పాలి.

నా ఉద్దేశంలో - మన దేశానికి పట్టిన వొక రాక్షసి నల్ల ధనం. మరొకటి, దాని చెల్లెలు లంచగొండి తనం. రాం దేవ్ గారు మొదటి నుండి, మన దేశస్తుల నల్ల ధనం విదేశీ బాంకుల్లో  మూలుగుతోందనీ   - అది తీసుకు రాగలిగితే - మనం దేశం సుసంపన్నంగా వుంటుందనీ   -  చెప్పారు. కానీ - అది వెనక్కు తీసుకు రావడంలో - ప్రభుత్వానికి ఎంత మాత్రం - చిత్త శుద్ధి లేదని తెలుస్తూనే వుంది. ఎన్నో దేశాలు చేస్తున్న ఆ పని - మనం మాత్రం చేయడం లేదు. ఎందుకు? ఎందుకు?

అయితే - ప్రజల మనస్తత్వం విచిత్రమైనది. పక్కింటి వాడిని, రౌడీలో, పోలీసులో - కొడుతూ వుంటే - చంపేస్తే కూడా మనకేమీ పట్టనట్టు ఊరుకునే తత్వం   పెరిగిపోయింది మనకు. అది పోవాలి.

ప్రజల కంటే - టీం అన్నా సభ్యులు కూడా - రాం దేవ్ జీ గారిని - ప్రక్కన బెట్టడం - నాలుగెద్దులు, సింహం కథ లాగా వుంది. తరువాత - అదే పంథాను మళ్ళీ ప్రభుత్వం టీం అన్నా పై కూడా  ప్రయోగించాలని చూసింది.

కానీ - విపక్షాలూ, ప్రజలు, టీం అన్న సభ్యులూ బాగా మేల్కొనడంతో - చేయలేక పోయింది.

యూ.పీ.ఏ -1 ప్రభుత్వం దేశాన్ని నిజంగా,  అభ్యుదయ పంథాలో తీసుకెళ్ళిన  మాట   వాస్తవం. మరి అదే  యూ.పీ.ఏ -2  ప్రభుత్వం  - ఎందుకిలా ప్రవర్తిస్తోందో   అస్సలు తెలియడం లేదు.  ప్రధాని మన్మోహన్  సింగు గారు  యిప్పుడైన మేల్కొనాలి. వారిదైన - నిజాయితీ తో - ప్రభుత్వం నడపాలి. చెప్పుడు మాటలు పక్కన బెట్టి - మహాత్మా గాంధీ గారి పద్దతిలో - దేశాన్ని ముందుకు నడిపించాలి. తన పేరు చెడి పోతోందని, దేశం వక్ర మార్గాన్ని పట్టిందని - ఆయన అర్థం చేసుకోవాలి.

దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా - అస్తవ్యస్తం గా అయిపోతోంది. దేశ పాలనలో - తప్పులు చేయడమే -తమ వుద్యోగమన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. యిది చాలదన్నట్టు, ధరల పెరుగుదలను అరికట్టుతానంటూ -  రిజ ర్వు బ్యాంకి వారు - యిష్టం వచ్చినట్టు - వడ్డీ రెట్లు పెంచి - పారిశ్రామిక పెరుగుదలను పూర్తిగా తగ్గించేసింది. ప్రభుత్వం వారు ధరల తరుగుదలకు చేయవలసిన ఏ పనీ చేయలేదు.   దీనితో - కుక్క అరవాల్సిన చోట -గాడిద అరిచి దెబ్బలు తిన్న చందం అయిపోయింది. ధరలు తగ్గలేదు. అభివృద్ధి పడిపోయింది.

ఎవరు చెప్పినా - ఆర్.బీ.ఐ. పట్టించుకోవడం లేదు.

సరే. ఈ దెబ్బలతో - స్టాక్ మార్కెట్ - ఎప్పుడూ లేనంతగా పడిపోయింది. ఎన్నో, గొప్ప లాభాలు గడిస్తున్న కంపెనీల ధరలు కూడా -     ఎప్పుడూ లేనంతగా పడిపోయాయి.

అమెరికాలో - నిరుద్యోగుల సంఖ్య 6 %  దాటితే - వారు పెద్ద గోల పెట్టేస్తున్నారు. దానికి, ఎన్నో రకాల ప్రయత్నాలు, ప్లాన్లు అమలు చేస్తున్నారు. మన దేశంలో - నిరుద్యోగుల సంఖ్య ఎంత? చిరుద్యోగుల సంఖ్య ఎంత?

గణాంకాలే లేవు. మరి ప్లాన్లు ఎక్కడి  నుండి వస్తాయి? ఇంజనీరింగ్ చదివి నిరుద్యోగులు గానూ, చిరుద్యోగులు గానూ - వున్న వారిని ఎంతో మందిని నేను చూస్తున్నాను. అయిదు వేల రూపాయలు కూడా మాస వేతనం లేని , పట్ట భద్రులయిన నర్సులను, పది వేల జీతంతో పని చేస్తున్న డాక్టర్లను  చూస్తున్నాము.

ఈ పధ్ధతి మారేది ఎప్పుడు? అసలు యిది ఎవరు పట్టించుకుంటారు, ఎప్పుడు?

యిది చాలదన్నట్టు - రీటైల్ ఆర్ధిక వ్యవస్థలో - వాల్ మార్ట్ లాంటి విదేశీ కంపెనీలను తీసుకు రావాలని ప్రభుత్వం రకరకాల వాదనలు చేస్తోంది. తెచ్చేస్తానని బెదిరిస్తోంది. మన దేశంలో, వ్యవసాయం తరువాత - ఉపాధి కల్పన ఎక్కువగా వున్న మొదటి రంగం రీటైల్ వ్యవస్థ. అందులో - దాదాపు ఆరుకోట్ల మంది వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. నిస్సందేహంగా, వీరిలో - అసమర్థత, వుంది. లేదని కాదు. అదే అసమర్థత అన్ని రంగాల్లోనూ - వుంది. దాన్ని సవరించడానికి బదులు - వారి స్థానంలో - విదేశీ సంస్థలను తెస్తాననడం - ఏ మాత్రం న్యాయంగా లేదు. ప్రభుత్వ   రంగంలో - నికరంగా - వొక్క ఉద్యోగమూ సృష్టించ లేని ప్రభుత్వం, ఏకంగా, కోట్ల వుపాధులపై వేటు వేయ బూనడం,  చాలా ప్రమాద కరమైన విషయం. దీని వల్ల వ్యవసాయ దారులకు, వాడకం దారులకు మేలు జరుగుతుందట. అది తప్పని వాల్ మార్ట్ పుట్టిన దేశంలోనే మనకు తెలుస్తూ వుంది.

వొక వేళ రైటే అయినా  - మధ్య వాడిని చంపేస్తే, వాడి అన్నకూ, తమ్ముడికీ ఆస్తి ఎక్కువగా వస్తుంది - అన్న వాదనలాగా వుంది, యిది.  మరి, మధ్య వాళ్ళ నందరినీ చంపేద్దామా?

ప్రక్కనింటి   వాడి పెళ్ళాం కు ముక్కు బాగుందని -స్వంత పెళ్ళాం కు విడాకులిచ్చేసి - ఆవిడను పెళ్లి చేసుకున్నాడట. తరువాత తెలిసింది - ఆవిడ ముక్కు బాగుందని; మెదడు మాత్రం సరి లేదని.  ఇలాంటి పిచ్చి పనులు యిప్పుడు చాలా చూస్తున్నాము.

సరే. ప్రభుత్వం మారాలంటే - మనం చాలా మారాలి.

2012  లో  ప్రభుత్వం తీరు మారుతుందని - ఆశిద్దాము. నాకు మాన్ మోహన్ సింగు గారిపై - చిన్న ఆశ యింకా వుంది.

యింట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. మనం 2012 లో యింట గెలవాలి. యింట్లోని   అందరి మనసులనూ గెలవాలి. ప్రతి యింట్లోనూ - ప్రేమ, అభిమానం, సంతోషం, ఆదరణ చాలా, చాలా పెరగాలి. అహంకారము, కక్షలు, కార్పణ్యాలు పూర్తిగా పోవాలి.

పొరుగు వాడితో సఖ్యత పెరగాలి. పెరగాలంటే - పొరుగు వాడిపై నమ్మకం పెరిగేటట్లు - అందరం ప్రవర్తించాలి.  పొరుగు వాడి కష్టంలో - అడగకుండా మనమే సహాయం అందించే మనస్తత్వం పెరగాలి.

మన దేశంలో - దరిద్రమూ వుంది. మధ్య వర్గమూ వుంది. ధనిక వర్గమూ వుంది. దేశంలోని - అందరు బీద పిల్లలకూ - చదువూ, తిండీ -లోటు లేకుండా చేయడానికి మన వంతు సహాయం మనం ప్రతి వొక్కరూ చెయ్యాలి.  ఏదో వొక శరణాలయానికి, మీ వంతు సహాయం మీరు తప్ప కుండా చెయ్యండి. మీకు తెలుసు. మనం వెళ్ళేటప్పుడు మనతో, వచ్చేది ఈ మంచి (చెడు) పనుల ఫలితం మాత్రమే. యిచ్చేటప్పుడు వున్న సంతృప్తి, మరెప్పుడూ వుండదు.

ఈ కాలంలో -మరో జాడ్యం ప్రబలి పోతోంది. వొక ప్రక్క వయసయిన తల్లి తండ్రులను గమనించడం లేదు. మరో వైపు పిల్లలనూ గమనించడం లేదు. తల్లి దండ్రులపై గౌరవం పెరగాలి. పిల్లలపై ప్రేమ పెరగాలి. యిది రెండూ - సామాజిక వ్యవస్థకు పునాదులు. ఈ పునాదులు కూలిపోతే - మొత్తం వ్యవస్థే కూలిపోతుంది.

నా ఉద్దేశంలో - ఆడ వాళ్లకు - మెట్టినింటిపై   - గౌరవం, మమకారం క్రమక్రమంగా సడలి పోతోంది.  దీనికి - ఎన్నో కారణాలు. వచ్చిన కోడలిపై ప్రేమ చూపక పోవడం వొక కారణం. మరో వైపు, వచ్చే కోడళ్ళకి కూడా, పెద్ద వారిపై ఏ మాత్రము గౌరవం లేక పోవడం మరో కారణం. మన వ్యవస్థను కూల్చేసే చట్టాలు - మరో కారణం. ముఖ్య కారణం, ఆడవారిలో - సహనం బాగా తగ్గి పోతోంది. ప్రేమాభిమానాల స్థానంలో - అహంకారం పెరుగుతోంది. మా చిన్న తనంలో చెప్పే వారు - మగ వాడు చెడితే - వాడు మాత్రమే చెడతాడు; ఆడది చెడితే - ఊరంతా చెడుతుందని.

మన వ్యవస్థలో - ఆడ వాళ్ళకున్నంత గౌరవం - మరెక్కడా లేదు. ఆ గౌరవం తరగరాదు. అదే సమయంలో - ఆడవాళ్ళు - యింటికీ, దేశానికి చెడ్డపేరు తీసుకు రారాదు. ఈ మధ్య కొన్ని చోట్ల కొంత మంది ఆడ వారు, స్లట్ వాక్  అని - మా యిష్టం వచ్చినట్టు, మేము దుస్తులు వేసుకుంటాం, మా యిష్టం వచ్చినట్టు - మేము రోడ్లపై నడుస్తాం - అని ప్రదర్శనలు యిచ్చారు. యింత కంటే మూర్ఖత్వం మరోటి లేదు.  యిలా జరుగుతూ, జరుగుతూ, యిప్పుడు అమెరికా లాంటి దేశాలలో - పరిస్థితి ఏమిటంటే - వొకరిపై వొకరికి ఆకర్షణ పూర్తిగా పోయి, మగ వారిని మగవారు; ఆడవారిని ఆడవారు పెళ్లి చేసుకునే  స్థితికి వచ్చేసింది. యిప్పుడిప్పుడు, మన దేశంలో కూడా, యిది పెరుగుతూ వుంది. ఈ పరిస్థితి మారాలి. ఆడవారిలో - ఎంతో మంది మేధావులున్నారు. వారు, యిటువంటి వాటిని మార్చడానికి పూనుకోవాలి.

సరే. ఈ పరిస్థితికి కారణం 50  శాతం  మగవారిలో చోటు చేసుకున్న - విశ్రుంఖలత్వం  అని చెప్పక తప్పదు. నీకొక రూలు, నాకొక రూలు - అని మగ వాళ్ళు ప్రవర్తించడం మానాలి. రామాయణమంతా -  అదే చెబుతుంది.

మగ వారిలో - భార్యా పిల్లల పట్ల ప్రేమ, గౌరవం, బాధ్యతాయుతమైన ప్రవర్తన చోటు చేసుకోవాలి. మనం మారుతామా? 2012  లో మనం మారాలి.

2012  వ సంవత్సరానికి -కొన్ని ప్రత్యేకతలు వున్నాయని అంటారు.

ప్రపంచం ఏదో అయిపోతుందని - మాయన్ సంస్కృతి వారు వేల  ఏండ్ల క్రిందట రాసి పడేసారు. డిసెంబర్, 21 వ తేదీ నాడు, ఆ తేదీ దగ్గర - ఏదో అయిపోతుందని - వొక నమ్మకం. మిగతా ప్రత్యేకతలు, మరో సారి మాట్లాడదాం.

అయితే, గియితే - ఏం పరవాలేదు. మనమంతా, వొక్క సారి ఎక్కడికి వెళ్ళినా - మంచిదే. ఎక్కడికి వెళ్ళితే - అదే మన ప్రపంచం అయిపోతుంది. దాన్ని గురించి వచ్చే వదంతులను ప్రక్కన పెట్టండి.

దేశమును ప్రేమించుమన్నా ; మంచి అన్నది పెంచుమన్నా -అన్నది ఆర్యోక్తి.

కుల, మత, ప్రాంతీయ, భాషా విభేదాలను ప్రక్కన పెట్టి -మనమంతా వొక్క కుటుంబమే , మనమంతా సహోదరులమే. ప్రేమైక జీవులమే - అని గ్రహించి - మన యింటిని, ఊరినీ, దేశాన్ని - నందన వనం చేద్దాం.   

= మీ

వుప్పలధడియం విజయమోహన్