5, అక్టోబర్ 2016, బుధవారం

నా పుస్తకావిష్కరణ - కాంప్రెహెన్సివ్ ట్రీటైజ్ ఆన్ పతంజలి యోగ సూత్రాస్ - ఆర్గాన్ డొనేషన్ - దసరా శుభాకాంక్షలు

పుస్తకావిష్కరణ 

 


2016, సెప్టెంబర్, 29 వ తేదీ, ప్రజాశక్తి దిన పత్రిక వారు పుంగనూరు (చిత్తూర్ జిల్లా) లో, తమ 36 వ వార్షికోత్సవం బసవరాజా గవర్నమెంట్ హై స్కూల్ లో జరిపారు. ఆ  సందర్భంగా  నన్ను పిలవడం, నా పుస్తకాన్ని (కాంప్రెహెన్సివ్ ట్రీటైజ్ ఆన్  పతంజలి  యోగ సూత్రాస్), స్థానిక మునిసిపల్ కమీషనర్ , శ్రీ లోకేశ్వర్ వర్మ గారి చేత, పలువురు స్థానిక ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరింప జేయడం జరిగింది. 

 ఆంగ్లం లో రాయ బడిన 760 పేజీలున్న పుస్తకం యిది. పెద్దదే. అందుకే యిది కాంప్రెహెన్సివ్ ట్రీటైజ్ అన్నాను. ఈ పుస్తకాన్ని యిది వరకే అన్ని పెద్ద లైబ్రరీ లకు , యోగా ప్రముఖులకు పంపించడం జరిగింది. వారిలో చాలా మంది యోగా ప్రముఖులు స్వయంగా నాకు టెలిఫోన్ చేసి నా పుస్తకాన్ని ఎన్నో విధాలుగా ప్రశంసించడం జరిగింది.  అలాగే, చాలా మంది  లిఖిత  పూర్వకంగా కూడా ప్రశంసించడం జరిగింది. ముఖ్యంగా , రామకృష్ణ  మిషన్ స్వామీజీలు భారత దేశపు పలు మిషన్లనుండి ఈ పుస్తకాన్ని రక రకాలుగా ప్రశంసించారు. వారందరికీ నా కృతజ్ఞతా పూర్వక పాదాభివందనాలు. 

ఈ  పుస్తకం లో ఎన్నో ప్రత్యేకతలు వున్నాయి. పతంజలి మహర్షి రాసిన అన్ని సూత్రాలను, వాటికి ప్రతిపదార్థము, సంక్షిప్త అర్థము , సమగ్ర వివరణ, ఉదాహరణలు , భగవద్ గీత , ఉపనిషత్తులు దీన్ని గురించి ఏం చెప్పాయి , వాటికి వివరణ , ప్రాక్టికల్ ఎక్సరసైజ్స్ , యిలా యిన్నో వివరణలు యిందులో సమగ్రంగా రాయ బడింది. 

చివర 4 అనుబంధాలు (Annexures); అందులో, ఒక సాధకుడు  ఏం   చెయ్యాలి, ఎలా చెయ్యాలి , అతని దైనిక యోగా కార్య క్రమం ఎలా వుండాలి అన్నవంతా సమగ్రంగా యివ్వబడింది. 

భారత దేశపు పలు ప్రాంతాల నుండి, ఎంతో మంది  ఈ పుస్తకాన్ని తమ స్థానిక లైబ్రరీ లలో చదివి నాకు ఫోన్ మూలకంగా తమ అభినందనలు తెలియ జేస్తున్నారు. కాపీలు కొనడానికి ఉత్సాహంగా వున్నారు.

యిప్పుడు నా ఈ పుస్తకం, నేను చదివిన స్కూల్ లో ,  నేను చదివిన క్లాస్ రూమ్ (పెద్ద హాల్) లో, నేను ప్రప్రథమంగా యోగా నేర్చుకున్న హాల్ లో, మా వూరి  స్థానిక ప్రముఖుల ముందు ఆవిష్కరింప బడడం చాలా ఆనందం గా  వుండింది . 

 నేను ఈ పుస్తకాన్ని అంతర్జాతీయంగా అమెజాన్ లాంటి కంపెనీల మూలంగా విక్రయానికి సన్నద్ధం చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. త్వరలోనే సఫలం అవుతుందని ఆశిస్తున్నాను. అందుకే దేశీయ సంస్థల వారికి  యివ్వ లేదు. 

మా కుటుంబం లో - అంటే ఉప్పలధడియం వంశంలో , మరో యిద్దరు తెలుగు రచయితలూ  వున్నారు. 

మా చిన్నాన్న , ఉప్పలదడియం రామమూర్తి , వయసు 76 ఏళ్ళు , ఆయన గత 8 ఏళ్లలో మూడు మంచి పుస్తకాలు రాశారు. 

అవి - మహా భారత  నామ కోశము , భాగవత నామకోశము, రామాయణ నామ కోశము. సంస్కృత గ్రంధాల లోని అన్ని పాత్రల వివరణ ఈ తెలుగు పుస్తకాలలో ఆయన చాలా బాగా యిచ్చారు. యివి మూడూ మూడు రీసెర్చ్ గ్రంధాలే. అలాగే , రీసెర్చ్ కు ఉపయోగ పడే గ్రంధాలే. యింకా, యింకా, ఆయన ఇటువంటి ఉత్తమ గ్రంధాలు  రాయాలని కోరుకుంటున్నాము. 

ఆయన పెద్ద కొడుకు, డాక్టర్ వెంకటేశ్వర తెలుగులో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు. కవితలు , పద్యాలు, వ్యాసాలు, కథలు లాంటి అన్ని రకాల తెలుగు సాహిత్య రీతులను ఒక పట్టు పట్టి చూస్తున్నారు. అనేక సత్కారాలనూ అందుకున్నారు. యింకా, యింకా రాస్తూనే వున్నారు.  చాలా  మంచి  రచయిత , వుజ్వల భవిష్యత్తు వున్న వాడు. 

మా అన్న వుప్పలధడియం  నాగరాజ పుస్తకాలు రాయలేదు కానీ అద్వైత సిద్దాంతంలో ఎంతో జ్ఞాని అని చెప్ప వచ్చు. స్వామి దయానంద గారి గొప్ప శిష్యుడైన స్వామి పరమార్థానంద గారి వద్ద ఒక దశాబ్దం పైగా శ్రవణము, మననము, నిదిధ్యాసనము చేసినవాడు. మా 6 మంది అన్నదమ్ములు, ముగ్గురు చెల్లెళ్లను  ఒక తండ్రిగా ముందుకు  తీసుకు వచ్చిన వాడు. 

మా నలుగురు చేసిన, సాధించిన  పై విషయాలను గురుతుంచుకుని, ఒక "ఉప్పలధడియం  సాధకుల సభ"  మా అన్న గారింట్లో, ఈ నెల 2 వ తేదీ నాడు  జరిగింది. మా బంధువర్గమంతా ఒక చోట చేరడం, మా సాధనలను సమీక్షించడం , సత్కరించడం  జరిగింది. మాకు యిది చాలా ఆనంద దాయకమైన విషయం. 




యిది ఆ సందర్భంగా తీసిన ఫోటో. యిందులోని ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ప్రత్యేకత, సృజనాత్మకత ఉండనే వుంది. ఈ సభలో  ఆర్గాన్ డొనేషన్ అన్న అంశం పైన కూడా చిన్న చర్చ జరిగింది. అందరూ కలిసి , ఆర్గాన్ డొనేషన్  కు సరైన సంస్థలకు, లిఖిత పూర్వకంగా అథారిటీ లెటర్లు  ఓకే సారి యివ్వాలని  ఒక నిర్ణయం కూడా తీసుకున్నాము.  ఇదొక మంచి నిర్ణయం. ఇది ప్రతి కుటుంబం లోనూ, చెయ్య గలిగితే  బాగుంటుంది. నా వుద్దేశంతో , యిది ఒక జాతీయ  వుద్యమం లాగా జరుప గలిగితే చాలా బాగుంటుంది. 

యిలా, జీవితం లో ఎన్నో జరుగుతూ వుంది . మలుపులూ, మార్సులూ , పురోగతి , కొంత తిరోగతి ఉంటూనే వున్నాయి. యిప్పుడు దసరా కదా.  మాయింట్లోనూ బొమ్మల కొలువు పెట్టాము. ఇదో చూడండి. 
  





పాఠకులందరికీ నా (మా) దసరా శుభాకాంక్షలు.


 సర్వే జనాః సుఖినో భవంతు 

= మీ 

ఉప్పలధడియం  విజయామోహన్







28, సెప్టెంబర్ 2016, బుధవారం

నిత్య జీవితం లో యోగా


నిత్య  జీవితం లో యోగా 
 ఒక  విశేష యోగా ప్రక్రియ 

చిన్నపిల్లల నుండి పెద్దవాళ్లవరకు మనం అందరూ నిత్యజీవితంలో యోగ ప్రక్రియలు ఎన్నో వాడుతూ వున్నాము. 
ఉదాహరణకు -
గోపీ 10 వ తరగతి విద్యార్థి. బాగా చదువుతాడు. గోపీ సెక్షన్ లో, 30  మంది విద్యార్థులున్నారు. గోపీకి  రాము బెస్ట్ ఫ్రెండ్. చదువులోనూ, ఆటలలోనూ, మాటల లోనూ, అన్నింట్లో గోపీ, రామూతో బాటే వుండాలని ఇష్టపడతాడు. తెల్లవారి లేస్తే గోపీకి మొదట జ్ఞాపకం వచ్చేది రామూ. 

యిప్పుడు ఈ బెస్ట్ ఫ్రెండ్షిప్ ను దాటి కాస్త ముందుకు వెడదాం. 

ఒకవేళ, గోపీకి, రామూ మాత్రమే కాక , తన క్లాసులోని వారందరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా అయ్యారనుకొండి . ఒక్కో సారి అలా జరుగుతుంది . గోపీని వాళ్ళ  మేష్టారు క్లాస్ లీడరుగా పెట్టారనుకొండి.  అందరు  విద్యార్థులను సమానంగా చూడవలసిన అవసరాలు వస్తుంటాయి. అప్పుడు అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు కూడా . 

అప్పుడు గోపీ మనస్థితి ఎలావుంటుంది ? 
అప్పుడు తెల్లవారి లేస్తే గోపీకి ఎవరు జ్ఞాపకం వస్తారు ?
30 మంది పేర్లు చెప్పు కోకున్నా , గోపీ, నా ఫ్రెండ్స్ అందరూ  సుఖంగా వుండాలనుకుంటాడా? 
నా  ఫ్రెండ్స్ అందరూ ఆరోగ్యంగా, రోగాలు లేకుండా - అందరూ క్లాస్ కు రావాలని అనుకుంటాడా?
నా ఫ్రెండ్స్ అందరూ ఏ ఆపదలూ  లేకుండా  భద్రంగా ఉండాలనుకుంటాడా?
నా ఫ్రెండ్స్ అందరూ ఏ శోకాలూ , దుఃఖాలూ లేకండా  వుండాలనుకుంటాడా ?
యిలా గోపీ కాస్త స్ట్రాంగ్ గా మనస్సులో అనుకుంటే , గోపీ యోగా లో ప్రవేశించినట్టే. 

యిదే, గోపీ సంస్కృతం లో చెప్పాలనుకుంటే ఈ శ్లోకం చెబుతాడు :
సర్వే  భవంతు సుఖినః  (లేదా సర్వే  మిత్రాహ్ సుఖినో భవంతు )
సర్వే  సంతు నిరామయాహ్ 
 సర్వే భద్రాణి పశ్యంతు 
మా కశ్చిత్  దుఃఖ భాగ్ భవేత్ 

యిది దేవుడికి  చేసే  ప్రార్థన కాదు . గోపీ మనసులో రేగిన బలమైన, నిస్స్వార్ధమైన కోరిక
యిలా హృదయపూర్వకంగా అనుకున్నప్పుడు గోపీ కొంత యోగిగా మారిపోతాడు.   అందరికీ లీడరు గదా  మరి . 
మానసికంగా అందరూ నాలో వున్నారు , అందరి శ్రేయస్సూ నేను కోరుకుంటున్నాను - అనే భావనే యోగా లో ఒక ముఖ్యమైన  భావన. 
యిప్పుడు ఒక  గొప్ప అద్భుతం జరుగుతుంది . 
గోపీ మనసులోని ఈ బలమైన, నిస్స్వార్ధమైన కోరికను చుట్టూ వున్న ప్రకృతి  కూడా వింటుంది .
మనసులో అనుకున్నాసరే. 
ప్రకృతి ఈ నిస్స్వార్ధమైన, న్యాయమైన కోరికను తప్పకుండా వింటుంది. ప్రకృతికి ఆ శక్తి  ఉంది. ప్రకృతికి అనేక రకాల శక్తులున్నాయి 
సరే . ఎంతైనా కొంత, ఈ గోపీ కోరికను నిజం చేద్దామని ప్రయత్నం చేస్తుంది. 
దీన్ని యిప్పుడు పాశ్చాత్య దేశాల్లో   లా ఆఫ్ అట్రాక్షన్ అని పేరు పెట్టుకున్నారు.
యిప్పుడు యితని బలమైన కోరికకు ప్రకృతి బలం కూడా కొంత తోడవుతుంది . 
ప్రకృతి  ఇతన్ని చూసి 'శభాష్ ' అంటుంది . తన చెయ్యి చాస్తుంది , యితని చేతిలో చెయ్యి కలపడానికి . 

యిది మనకు అనుభవం కావాలి . ప్రకృతి తో చెయ్యి కలపడం మనకు రకరకాలుగా అనుభవం కావచ్చు . 

దీనిపై - ఇప్పుడొక ఎక్స్పరిమెంట్ చెయ్యొచ్చు . 

సర్వే భవంతు సుఖినః - అందరూ సుఖంగా ఉండాలి - అని కళ్ళు మూసుకుని హృదయపూర్వకంగా  ఒక్కసారి అనండి . అన్నారా ?

యిప్పుడు కళ్ళు మూసుకునే ,మీ చెయ్య చాచండి . మీ ముందు విశ్వమంతా వ్యాపించి యున్న ప్రకృతి మాత
అతి సుందరంగా చిరునవ్వు నవ్వుతూ నిలబడి ఉంది. మీ చెయ్యి వైపు తన చెయ్యి చాచింది. మీ చేతిని అందుకుంది - ఒక తల్లి తన బిడ్డ చేతిని పట్టుకున్నట్టు . ప్రకృతి మాత అదృశ్య హస్తం మీచేతిని తాకుతున్న అనుభూతిని మీరు పొందాలి. 

యిది ఒక గొప్ప అనుభూతి . యిది మీరు పొందే వరకు మీరు ఈ ఎక్సపెరిమెంట్  చెయ్యొచ్చు . 

మరొక సింపుల్ ఎక్స్పరిమెంట్ చేద్దాం. 

మీచుట్టూ వున్న ప్రకృతి లో మహా గొప్ప చైతన్యము ఉంది . మీకున్న పంచేంద్రియాల శక్తి కంటే ఎన్నో కోట్ల రేట్లు అధికమైన శక్తి ఆమెకు ఉంది . 

మీరు ఎక్కడ వున్నా ఆమె మీ చుట్టూ వుంది. మిమ్మల్ని చూస్తూనే వుంది. 

మీరు మీ స్వార్థాని  కోసం ఏ  పని చేసినా దానితో ఆమెకు సంబంధం లేదు. 

కానీ, మీరు సర్వే జనః సుఖినో భవంతు అన్నప్పుడు, దాని కోసం పనిచేసినప్పుడు - ఆమె శభాష్ అంటుంది . మీతో చేతులు కలుపుతాను- అంటుంది. ఆ అనుభూతిని మీరు పొందాలి . 

ప్రయత్నించండి. ప్రకృతిమాత మా చుట్టూ వున్న అనుభూతిని మీరు పొందండి. 
 
 ఒంటి చేత్తో చప్పట్లు కొట్టగలరా? కొట్ట లేరు . కానీ ప్రకృతి తో కలిసి కొట్టగలరా ? కొట్ట గలరు.  ప్రయత్నించి  చూడండి . ఒక వైపు మీ చేయి. మరో వైపు ప్రకృతి తన చేయి కలపడం . ఆ అనుభూతి వచ్చే వరకు చెయ్యండి . 

యిలా చేస్తూ ఉంటే - మీరు చేసే ప్రతి పనిలోనూ ప్రకృతి శక్తి కూడా మీకు తోడవుతుంది 

=సర్వే  జనాః  సుఖినో భవంతు 

మీ 

 విజయమోహన్ 
 
 

30, జూన్ 2016, గురువారం

సమాజంలో సమస్యలు - వాటి మూల కారణం

కమ్యూనికేషన్ స్కిల్స్ 

పరస్పర అవగాహనా నైపుణ్యం 



మాట్లాడ వలసిన వాడు -  మాట్లాడ వలసిన సమయంలో, మాట్లాడ వలసిన స్థలం లో, మాట్లాడ వలసిన వారితో మాట్లాడ వలసిన విధంగా మాట్లాడాలి. అలా మాట్లాడక పోతే చిక్కులు, ప్రమాదాలు వచ్చి పడతాయి.

మరి, అలా మాట్లాడితే - వున్న మరియు రాబోయే చిక్కులు, ప్రమాదాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. అలా మాట్లాడ గలిగి, మాట్లాడే వాడు బుద్ధిమంతుడు, జ్ఞాని. సమయస్ఫూర్తి గలవాడు. ప్రతి మనిషికీ, ప్రతి సమాజానికీ అటువంటి మనుషులు కావాలి .


కానీ, మాట్లాడ కూడని  వాడుమాట్లాడ కూడని  సమయంలో, మాట్లాడ కూడని స్థలం లో, మాట్లాడ కూడని వారితో, మాట్లాడ కూడని విధంగా మాట్లాడితే  చిక్కులు, ప్రమాదాలు వచ్చి పడతాయి. వున్నవి జటిలమవుతాయి. అటువంటి వాడు వాచాలుడు, మూర్ఖుడు. వాడి నోరు ముయ్యక పోతే, అన్నీ ప్రమాదాలే . తనకే కాదు, చుట్టూ వున్న వారికీ ప్రమాదాలు తెచ్చి పెడతాడు. 

అయితే, వినవలసిన  వాడు -  విన వలసిన సమయంలో,  విన వలసిన స్థలం లో,  విన వలసిన వారి మాటలను విన వలసిన విధంగా తప్పక వినాలి;అర్థం చేసుకోవాలి; పాటించాలి.

వినవలసిన వాడు -  అలా  వినక పోతే, పాటించక పోతే చిక్కులు, ప్రమాదాలు వచ్చి పడతాయి. వున్నవి జటిలమవుతాయి. వింటే , పాటిస్తే , వున్న చిక్కులు , ప్రమాదాలు మాయమవుతాయి. క్రొత్తవి రాకుండా వుంటాయి. 

అలాగే, విన కూడని  వాడు -   విన కూడని  సమయంలో,  విన కూడని  స్థలం లో,  విన కూడని  వారి మాటలను విన కూడని  విధంగా వింటే కూడా ఎన్నో చిక్కులు, ప్రమాదాలు వచ్చి పడతాయి. వున్నవి జటిలమవుతాయి. అలా వినే వాడు మూర్ఖుడు.

 సరైన విధంగా మాట్లాడడమూ , వినడమూ, మన జీవితానికి కావలసిన అతి ముఖ్యమైన ప్రాథమిక విద్యలు, కళలు, విజ్ఞానమూ కూడా .

మంచి వాడితో, జ్ఞానితో, సమయ స్ఫూర్తి వున్న వాడితో   మాట్లాడమన్నారు; వాడి మాట వినమన్నారు; వాడి స్నేహం కట్టమన్నారు, మన పెద్దలు. అదే ముక్తికి కూడా సులభమార్గమన్నారు. సత్సంగత్వే ..... జీవన్ముక్తిహి - అన్నారు ఆది శంకరాచార్యులు.

భార్యాభర్తలు ఒకరితో ఒకరు  యెలా వుండాలి - అన్న విషయం కూడా ఇందులో మనం తెలుసుకో వచ్చు . తల్లిదండ్రులు పిల్లలు మధ్య సంబంధాలు ఎలా వుండాలి - అన్న విషయం కూడా ఇందులో మనం చూడ వచ్చు. స్నేహ, బాంధవ్యాలకు ముఖ్యంగా  ఈ సూత్రాలు పునాది .

సమయస్ఫూర్తి తో   మాట్లాడగలగడం,వినగలగడం , మంచి గ్రహించగలగడం, చెడు విడిచిపెట్ట గలగడం ఇవీ జీవితంలో విజయానికి పునాదులు. ఆనందానికి సోపానాలు.

ఇవి విద్యలో  మొదటి పాఠాలు గా ఉండవలసినవి. కడపటి పాఠాలు గా కూడా నేర్పడం లేదు.

అందుకే సమాజంలో యిన్ని సమస్యలు.

సర్వే జనాః సుఖినో భవంతు 

-మీ 

ఉప్పలాధడియం విజయమోహన్
 


 



11, మే 2016, బుధవారం

కామ్ప్రెహెన్సివ్ ట్రీ టైజ్ ఆన్ పతంజలి యోగ సూత్రాస్- నా ఆంగ్ల పుస్తకానికి - రామకృష్ణ మిషన్ స్వామీజీ ల ఆశీస్సులు , ప్రోత్సాహాలు

కామ్ప్రెహెన్సివ్  ట్రీ టైజ్  

ఆన్ పతంజలి  యోగ సూత్రాస్



వొక్క సంవత్సరంగ దీర్ఘదర్శి  తెలుగు బ్లాగ్  మౌనం గా వుండవలసి వచ్చింది . అందుకు కారణం యిదో - నేను రాసిన ఈ ఆంగ్ల పుస్తకం :




ఈ పుస్తకం రాయడానికి నాకు 2-3 సంవత్సరాల పైనే పట్టింది . 740 పేజీలు  A 4 సైజ్  పుస్తకం యిది . అంతా పతంజలి రాసిన యోగ సూత్రాల  గురించే . నాకు తెలిసినంత వరకు ,యోగ సూత్రాల గురించి యింత వివరణగా ,సిద్ధాంత పరంగానూ, ఆచరణ పరంగానూ  చెప్పిన పుస్తకం మరొక్కటి  లేదు . 

వీటిని - యోగ నిష్ణాతులైన రామకృష్ణ మిషన్ స్వామీజీ లకు, మిగత యోగా గురువులకు , లైబ్రరీ లకు యూనివర్సిటీ లకు పంపించడం జరిగింది. చాలా మంది  రామకృష్ణ మిషన్ స్వామీజీలు తమ ఆశీస్సులు , తమ హర్షం , తమ ప్రోత్సాహాలను చాలా బాగా వ్యక్తీకరించారు (లెటర్ల ద్వారా, ఫోన్ కాల్ ద్వారా , ఈ మెయిల్  ద్వారా నాకు ఎంతో ప్రోత్సాహం  యిచ్చారు. అలాగే ద్రావిడియన్  యూనివర్సిటీ  వైస్  చాన్సెలర్ గారు కూడా ఫోన్లో తమ ప్రోత్సాహం  వ్యక్తీకరించారు. ఇంకా , ప్రతి రోజూ, ఈ ప్రోత్సాహ వాహిని సాగుతూనే వుంది యిప్పటి వరకూ . 

ఒక స్వామీజీ, యిది మీ జీవితాన్నే ధన్యం చేసే  రచన అన్నారు .

పూరీ రామకృష్ణ మిషన్ స్వామీజీ గారు, స్వామీ  పరిశుద్ధానంద యిలా అన్నారు :

"ఈ పుస్తకం అత్యున్నతమైన   సెల్ఫ్ హెల్ప్ పుస్తకం  అనటం లో సందేహం లేదు . 

"ఈ అద్భుతమైన  వివరణాత్మక పుస్తకం లో యోగా ను గురించి మీ రెంత  అధ్యయనం  చేసారో బాగా తెలుస్తూ వుంది ... యిది యోగా ను దేశ  విదేశాల్లో వ్యాపింపజేయడానికి ,చాలా బాగా ఉపయోగ పడగలదు . అందులోనూ , మన ప్రధాన మంత్రి గారు  పోయిన సంవత్సరం లో అంతర్జాతీయ  యోగా దినోత్సవం ఆరంభించిన  నేపథ్యంలో , దీని ఉపయోగం చాలా వుంది 
"యింత అత్యంత ఉపయోగకరమైన  పుస్తకం మానవాళి కి అందించడానికి మీరు పడ్డ శ్రమకు మా హృదయపూర్వక సంతోషాన్ని వెలి బుచ్చుతున్నాము . 

"రామకృష్ణ దేవుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు వుండుగాక ...... "

యిది స్వామీజీ గారు వ్రాతపూర్వకంగా  అంగ్లంలో రాసి పంపారు . దాదాపు యిలాగే మదురై , బెంగుళూరు స్వామీజీలు ఫోన్ చేసి నాతో    మాట్లాడి  ఎంతో ప్రోత్సహించారు . అలాగే ద్రావిడియన్  యూనివర్సిటీ  వైస్  ఛాన్సలర్  గారు కూడా ఫోన్ చేసి చాలా బాగా అభినందించారు; ప్రోత్సహించారు. 

నా వరకు నాకు - నా శ్రమ, ఈ అభినందనల పరంపర అన్నీ ఈశ్వరార్పణం. శివునాజ్ఞ  లేనిది చీమైనా కదలదు  . ఆయన ఆజ్ఞ అయితే ఏదైనా జరుగుతుంది . అంతే .

అయితే , మానవ ప్రయత్నం  లేనిదే  దైవ సాహాయ్యం  వుండదు కదా . మన ప్రయత్నం వుండాలి . నేను యిది పూర్తిగా నమ్ముతాను .  

ఈ పుస్తకం యింకా కొంత మంది మహానుభావుల ఆశీస్సుల కోసం ఎదురు చూస్తోంది . ఆ తరువాత నే , మార్కెట్ లో విక్రయాలు, యివన్నీ .

ఈ పుస్తకం  లో -వొక్కొక్క యోగ సూత్రానికీ  పూర్తి వివరణ యివ్వడమే కాకుండా, ఆ సూత్రప్రకారం  సాధకుడు ఆచరించవలసిన , పాటించ వలసిన ఎక్సర్సైజ్ లు కూడా యివ్వడం జరిగింది . అంటే - సూత్రం చదివిన వెంటనే  - ఆచరణలో కూడా పెట్టె య్యడమే, తద్వారా , దాని పూర్తి  ఫలితాన్ని పొందడమే పుస్తకం వుద్దేశ్యం .   చాలా సూత్రాలకు యిలా యివ్వడం జరిగింది .

ప్రతి దినం వొక యోగ సాధకుడుగా మీరు ఆచరించ దాగిన దైనిక చర్య కూడా సులభంగా, ఆచరణ యోగ్యంగా , మీ టైం  ప్రకారం  చెయ్య దగినట్టుగా, యివ్వడం జరిగింది . అయినా పతంజలి ఆదేశించిన నియమాలన్నీ పాటించ డమూ  జరిగింది . కొండల్లో, కోనల్లో, గుహలలో, అరణ్యాలలో  మాత్రమే కాదు , ఇళ్ళల్లో కూడా యోగా పూర్తిగా  ఎలా సాధించ  వచ్చో చెప్పడం జరిగింది .

పతంజలి మహర్షి చెప్పింది మాత్రమే  కాక , శ్రీకృష్ణ భగవానుడు, ఉపనిషత్తులు, శంకరాచార్యులు - యోగాచరణ గురించి చెప్పినవి కూడా  యిందులో  విశదంగా పొందు పరచడం  జరిగింది .

అష్టాంగ  యోగా కొరకు - మీరు ఈ పుస్తకం దాటి పోననవసరం లేకుండా వుండటమే నా వుద్దేశ్యం . సిద్ధాంత పరం గానూ , ఆచరణ పరంగానూ , ఈ పుస్తకం చాలు - అన్నంతగా వుంటుంది . అంటే , గురువు  వద్దని చెప్పటం లేదు . కొంత  గురు ముఖంగా నేర్చుకుంటే మేలు . కానీ, మీ వూళ్ళో, మీ దగ్గర్లో  ఎక్కడా , గురువే లేకుంటే ? యోగా మర్చిపోవాలా ? అక్కర్లే దు . అప్పుడూ యోగా చెయ్యొచ్చు . చెయ్యాలి .   యోగా భారత దేశం ప్రపంచానికిచ్చిన గొప్ప విజ్ఞానం . యిది అందరికంటే మనమే ఎక్కువగా నేర్చుకోవాలి .

అష్టాంగ యోగా అంటే - శరీరాన్ని రకరకాలుగా బంధించే విన్యాసాలు కాదు . యిది మొదట మనకు తెలియాలి. ఆ విన్యాసాల అవసరం పతంజలి  అష్టాంగ  యోగా లో చాలా తక్కువ . దాదాపు అవసరం లేనంత తక్కువ . యోగా అనేది మనసుతో మనం ఆడే ఆట . మనసును  మన అధీనం లో సంతోషంగా వుంచుకునే విజ్ఞానం . ఆ పైన మనసును దాటి, మనలను  గురించి  మనం పూర్తిగా తెలుసుకునే విజ్ఞానం యిది .

ఇదండీ కథ...

సర్వే  జనాః  సుఖినో  భవంతు

వుప్పలధడియం  విజయమోహన్ 







10, ఏప్రిల్ 2015, శుక్రవారం

శేషాచలం లో- మానవ హక్కులు - సామూహిక హక్కులు

శేషాచలం లో మానవ హక్కులు 

సామూహిక హక్కులు 


శేషాచలం అడవుల్లో యెర్ర చందనం వృక్షాలను అక్రమం గా కొట్టడమూ , ఆ కలపను అక్రమంగా రవాణా చెయ్యడమూ చాలా కాలం గానే  జరుగుతూ వుంది .   కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం దీన్ని పెద్దగా పట్టించుకోలేదు . ఎందుకు పట్టించుకోలేదో , ఎవరు చెబుతారు ?


యిప్పుడు చంద్రబాబు గారు  ముఖ్య  మంత్రి గా వచ్చారు . తెలంగాణా  విడి పోయిన తర్వాత , రాష్ట్రానికి పెద్దగా  నిధుల కొరత అనే సమస్య కూడా   వచ్చి పడింది.


మొట్టమొదటి నుండి  ముఖ్య మంత్రి గారు, మిగతా మంత్రులూ చెబుతూనే   వున్నారు - వొక్క ఈ యెర్ర చందనం అక్రమ రవాణా  ను నిలిపి ప్రభుత్వ పరంగా దాన్ని అమ్మ గలిగితే , ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్ధిక సమస్యలు  తీరుతాయని .


 ఎన్నో వేల, లక్షల కోట్ల విలువ గలిగిన ఈ యెర్ర చందనం - స్మగ్లర్ల చేతిలో పడి - ఆంధ్ర  ప్రజల వుమ్మడి సొత్తు , స్మగ్లర్ల సొత్తుగా మారి పోతూ వుంది . యింత విలువ గలిగిన, ఆంధ్ర ప్రజల వుమ్మడి సొత్తు దొంగలు దోచుకు పోతూ  వుంటే , అది ప్రజలందరి మానవ హక్కుల ఉల్లంఘన కాదా ? యిది నిలపడానికి మానవ హక్కుల సంఘాలు ఏం చేశాయి ? ఏం చేస్తున్నాయి ? దీన్ని గురించి వారెవరికీ ఏమీ  పట్టినట్టు లేదు . అయ్యా ! ఈ యెర్ర చందనం చంద్రబాబు సొత్తు కాదు . మీ సొత్తే . అది పోతే , మీ అందరి మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్టే .

వ్యక్తి హక్కులూ ముఖ్యమే . కానీ , సామూహిక హక్కులు అంత కంటే ముఖ్యం . అది పట్టించుకోరా ?


సరే . ప్రజలందరి వుమ్మడి సొత్తు పోతూ వుంటే - ప్రజలేం చేస్తున్నారు ? అదేదో చంద్ర బాబు స్వంత విషయమే గాని తమ విషయం కాదన్నట్టు వున్నారు . మన ప్రజలలో ఈ స్తబ్దత పోవాలి .


సర్వే  జనాః సుఖినో భవంతు


= మీ

వుప్పలధడియం విజయమోహన్

20, మార్చి 2015, శుక్రవారం

ఉగాది 2015 - మీకు నా శుభాకాంక్షలు , శుభాభినందనలు

ఉగాది -2015

 

ప్రకృతి లో 

మామిడీ , చెరుకూ , వేపా , మిరపా, ఉప్పూ , చింతా - షడ్రుచులకు ప్రతీకలు .   

 అవి కలసిన ఉగాది పచ్చడి 

జీవితంలో 

సంతోషానికి , మాధుర్యానికి , కష్టాలకూ , శోకాలకూ , బాధలకూ , రోగాలకూ , 

నిజానికి నవ రసాలకూ  ప్రతీకగా  నిలుస్తుంది .

అన్నిటినీ 

 స్థిత ప్రజ్ఞత తో స్వీకరించే తెలుగు మనసులకు 

 మన్మథ నామ సంవత్సర ఉగాది నాడు 

నా హార్దిక శుభాకాంక్షలు 

ఈ సంవత్సరంలో -

మీ జీవితాల్లో 

సంతోషం , ఆరోగ్యం 

ప్రేమ , కరుణ 

ఐశ్వర్యం , ఆర్ద్రత 

నిండాలని -

మీ చుట్టూ వున్న వారిలో, మీ పట్ల 

మీ చుట్టూ వున్న వారి పట్ల , మీలో 

 స్నేహం, ప్రేమ పండాలనీ 
 
ఈ సంవత్సరం , మీ జీవితంలో 

ఒక నవ వసంతం కావాలనీ

మీకు నా శుభాకాంక్షలు , శుభాభినందనలు  తెలియజేస్తున్నాను . 


ఈ సంవత్సరంలో 

మనలో ప్రతి వొక్కరూ 

మనకంటే తక్కువ స్థితిలో వున్న 

మరొక్కరి జీవితాన్ని 

ఆదుకోవాలని , వుద్ధరించాలనీ 

ఆశిస్తున్నాను ; ఆ శక్తి , మానసికత మనలో 

అ దేవుడు నింపాలనీ 

ప్రార్థిస్తున్నాను . 

= మీ 

వుప్పలధడియం విజయమోహన్ 


PS :- పతంజలి యోగ సూత్రాల పై వ్యాఖ్యానంగా వొక పుస్తకం రాస్తూ వుండడం వలన  - ఈ మధ్య కాలం లో బ్లాగులో ఎక్కువగా రాయడం జరగలేదు . మరో నెలలోపు అది పూర్తి అయి పోతుందని నా నమ్మకం .  ఆ తరువాత , ఈ బ్లాగులో , మరింత విస్తృతంగా రాయడం జరుగుతుంది
 
 
 





8, జనవరి 2015, గురువారం

మనం సంతోషంగా వుండి - మరో పది మంది సంతోషానికి కారణమైతే ! - సర్వే జనాః సుఖినో భవంతు

 

బాధ్యత - బాధ్యతా రాహిత్యం 



మీరు లిఫ్టు లో ఏడో అంతస్తు కెళ్ళారు - అక్కడ మీ ఫ్లాటు  వుంది గనుక. పైకి వెళ్ళిన మీరు - లిఫ్టు  తలుపు మూయకపోతే - క్రింది వారు లిఫ్టు కదలక, క్రిందికి పోలేక , పైకి రాలేక - అవస్థ పడతారు . మిమ్మల్ని తిట్టు కుంటారు . లిఫ్టు తలుపులు మూయడం మీ కనీస బాధ్యత.  మీరు చేసిన తప్పే మరొకరు చేస్తే మీరూ తిట్టు కుంటారు కదా . కాబట్టి అది మీ , మన అందరి బాధ్యత . అవునా ! యిది చిన్న విషయం . యిప్పుడు మరో చిన్న విషయం . 

66 ఏళ్ళ స్వాతంత్ర్యం  తరువాత, మోడీ గారు - స్వచ్చ భారత్ ఉద్యమం ఆరంభించారు. భారత దేశం లోని ప్రతి పౌరుడికీ ఇది తన బాధ్యత అని అర్థం చేసుకోవలసిన అవసరం పూర్తిగా వుంది . మన యింట్లో, వీధిలో, వూరిలో, దేశంలో  ప్రతి వొక్కరూ స్వచ్చత , శుభ్రత పాటించాలి . చుట్టూ వున్న వారికీ తెలియ జెప్పాలి . ఇది  చిన్న విషయమే , కానీ యిదే మనం చెయ్యడం లేదు . మరి పెద్ద విషాయాలేం చేస్తాం? ఎప్పుడు చేస్తాం ?

చెయ్యాలనుకునే వారు, చేస్తూ వెడతారు. వారికీ  అడ్డంకులు, కష్టాలు వస్తాయి. కానీ, వాటిని, ఎలాగోలా అధిగమించి, తమ బాధ్యతలను పూర్తి చేస్తారు . 

రిక్షా తొక్కే వాళ్ళు, చెప్పులు కుట్టే వాళ్ళు , కూలీలు ఎంతో మంది తమ కొడుకులు, కూతుర్లను పెద్ద చదువులు చదివించి, పెద్ద ఉద్యోగాల్లో చూడడం, చూసి సంతృప్తి తో మురిసి పోవడం మనం చూస్తూ వున్నాం. అందులో కొంత మంది కొడుకులు,  కూతుర్లు , తమ తల్లిదండ్రులను బాగా చూసుకోవడం  మనకు తెలుసు . 

"మీలో ఎవరు కోటీశ్వరుడు " లో యిటువంటి వారిని మనం అప్పుడప్పుడూ చూస్తూ వున్నాం కదా . మన "నాగార్జున" గారు చాలా చక్కగా నడుపుతూ వున్నారు ఆ ప్రోగ్రామును . 

అయితే, ఎంతో కొంత వున్న వాళ్ళు - పిల్లల భవిష్యత్తును  పూర్తిగా పట్టించుకోక పోవడం , వారిని అప్రయోజకులుగా తయారు చెయ్యడం కూడా  మనం ఎన్నో కుటుంబాలలో చూడొచ్చు . 

నాకు ఈ రెండు  రకాల కుటుంబాలూ  ఎన్నో తెలుసు . 

కొంత మంది పిల్లలు,  పెద్దలు ఎంత చెప్పినా వినక , చదువును , ఆరోగ్యాన్నీ అశ్రద్ధ చేసి , తమ జీవితాలను పాడు చేసుకోవడం నేను చాలానే చూశాను, చూస్తున్నాను . కొంత మంది పెద్దలు రకరకాల వ్యసనాలలొను, అలవాట్లలోను పడి - తమ కుటుంబాన్ని, పిల్లల భవిష్యత్తు ను నాశనం చేసిన , చేస్తున్న కుటుంబాలూ చాలా చూశాను ; చూస్తున్నాను. 

అంటే - బాధ్యతలను నిర్వర్తించే వారు, నిర్లక్ష్యం చేసే వారు - రెండు రకాలూ మనలో వున్నారు. 

మన చుట్టూ వున్న పరిస్థితులను బట్టి, మన బాధ్యతలు మారుతూ వుంటాయి . పరిస్థితులను మనం మార్చలేం .  కానీ,పరిస్థితులకు అనుగుణంగా మనలను మార్చుకునే శక్తి, మన బాధ్యతలను నిర్వర్తించే  శక్తి ఎంతో కొంత దేవుడి మనకు యిచ్చాడు . 

మనకు - తల్లిదండ్రుల పట్ల , పిల్లల పట్ల, సమాజం పట్ల , దేశం పట్ల , అనేక బాధ్యతలు వున్నాయి. కొన్ని నియమాలు , కొన్ని సరిహద్దులూ, కొన్ని అధికారాలూ, కొన్ని హక్కులూ   వున్నాయి . 

ప్రస్తుతం, మన పాఠ శాలల్లో, సమాజం లో మనకు - మన హక్కులు నేర్పుతున్నారే గానీ , బాధ్యతలు  నేర్పడం లేదు. బాధ్యతలు నేర్పని సమాజం - మనం బాధ్యతా యుతంగా ఉంటామని ఎలా అనుకోగలదు. మన సమస్య అదే . 

మన దేశంలో - ముఖ్యంగా, గత 66 ఏళ్ళుగా - హక్కులు , హక్కులు అంటూ ప్రతి వర్గం వారు గోల పెట్టడము , హక్కుల కోసం పోరాడడమే కానీ, ఎవ్వరూ, ఎప్పుడూ తమ తమ బాధ్యతలు ఇవీ అని అనుకోవడం , అవి చెయ్యాలని పూనుకోవడం - చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ  వుంది .

యిప్పుడు మోడీ గారు స్వచ్ఛ  భారత్ వొక ఉద్యమం లాగా ప్రజల ముందుకు తీసుకు వచ్చారు. యిది మెల్ల మెల్లగా , ప్రజల మనస్సులో నాటుకుంటూ వుంది.  చెప్ప వలసిన వాళ్ళు , చెప్ప వలసిన విధంగా , సున్నితంగా , మనసును తాకే విధంగా చెబితే , చాలా మంది  వొప్పుకుంటారు;  పాటిస్తారు . దాదాపు 80 శాతం మందిని  మంచి మాటలతోనే  మార్చొచ్చు . 

నాయకుడుగా వున్నా వాడు , గాంధీ లాగా , రామకృష్ణ పరమహంస లాగా - తానూ చేసి , యిలా మనం చేద్దాం రండి - అంటే ఎంతో మంది ముందుకు వస్తారు. 

'నేను చెబుతున్నాను - మీరు చెయ్యండి' అంటే - అది ఉద్యమం లాగా వుండదు. ప్రజలు ప్రభావితులు కారు. ముందుకు రారు . ఆ.. మునిసిపాలిటీ  లో, జీతాలు తీసుకుంటున్న వాళ్ళు కదా ఈ పని చెయ్యాలి అనే వాళ్ళు వున్నారు యిప్పుడు కూడా. 66 ఏళ్ళు మరి అలాగే గడిచింది కదా . దేశంలో ఎక్కడ చూసినా కుళ్ళు , కంపూ - తప్ప మరొకటి లేదు . 

చిన్న వుదాహరణ - మీరు కోలకాతా నుండి చెన్నై వస్తున్నారనుకోండి . విజయవాడ ప్రాంతంలో, రాత్రి పడుకున్నారు. నిద్రలో వున్నప్పుడు , ఎక్కడో వొక చోట మహా కంపు కొట్టి, భరించ లేక మీరు లేస్తారు. మీరు పై బెర్తులో వున్నా, చీకట్లో మరేం కనిపించకున్నా , మీకు అర్థమై పోతుంది , చెన్నై దగ్గరికి వచ్చేశామని . ఈ మధ్య కాస్త పరవాలేదు కానీ ముందు చాలా దుర్వాసనగా వుండేది. యిది బాగు చెయ్యాలనుకుంటే , చెయ్యొచ్చు . చెయ్యాలని అనుకోవాలి . 60 ఏళ్ళు అనుకోలేదు . యిప్పుడూ యింకా లేదు . 

గంగ - ఆర్థికంగానూ , సామాజికం గానూ , సాంస్కృతికం గానూ - అన్ని విధాలా మనకు ముఖ్యమైన నది . స్వాతంత్ర్యం  వచ్చే వరకూ బాగానే వుండేది . ఆ తరువాత, మన నిర్లక్ష్యం కారణంగా అన్ని రకాలా కలుష పూరితంగా మారింది.  ఎన్నో దేశాల్లో, ఎన్నో నదులు - స్వచ్చంగా మార్చ బడ్డాయి. మన దేశంలో పాలకులు అనుకోలేదు . అంతే . యిప్పుడు మోడీ గారు అనుకున్నారు; అన్నారు; చాలా మంది చేత అనిపించారు.  యిప్పుడు, చుట్టూ వున్న వారి చేత - ఆ ప్రయత్నాలు తీవ్రతరం  చేయిస్తున్నారు. 

వూడవాలంటే - మొదట మోడీ గారు వూడిచి తరువాత - యిలా చెయ్యండి - అంటారు . అలాగే - గంగ విషయంలో కూడా తన స్వ ప్రయత్నం చేసి , యిక మీరు చెయ్యండి అంటారు . అన్ని విషయాల్లోనూ అంతే. 

యిప్పుడు మరో చిన్న (పెద్ద) విషయం చూద్దాం . మోడీ గారు సరే . కానీ - సంఘ్  పరివార్  లో వున్న VHP,  హిందూ మహాసభ లాంటి వారికి మోడీ గారి చిత్త శుద్ధి , కార్య దీక్ష లేదు . మిగతా మతాల వారు హిందువులను మతం మార్చేస్తున్నారు , మార్చేస్తున్నారు , వీరిని మనం మళ్ళీ మన మతం లోకి తీసుకు రావాలి, ఎలాగోలా - అన్న తపనే గానీ, వున్న వారు ఎందుకు వెళ్లి పోతున్నారు - అన్న ఆలోచన కొంత కూడా లేదు.  ఆ ఎందుకు అన్న విషయం - యిప్పుడు కాస్త చూద్దాం .

మన మత  గురువులలో ఆది శంకరాచార్యుల  వారికి  విశిష్ట స్థానం వుంది అని మనకు తెలుసు .  ఆయన అతి చిన్న వయసులో చెప్పిన నిర్వాణ షట్కం ఎంత గొప్ప  భావాలతో వుంటుందో, చదివితే మనకు చాలా ఆశ్చర్యంగా వుంటుంది . మన సంస్కృతి , మన మతం ఏమిటో - ఆ ఆరు 'శ్లోకాల మాల' అర్థం చేసుకుంటే చాలు; మనకు నిజమైన జ్ఞానం వచ్చేస్తుంది . అందులో ఆయన, నాకు  మృత్యువు కానీ, మృత్యు భయం కానీ , జాతి భేదాలు కానీ లేవుగాక లేవు అన్నారు .  

జాతులే లేవని కాదు - అవి  గుణాన్ని బట్టి , చేసే పని బట్టి అని; జన్మ వలన కాదని శ్రీ కృష్ణుడే  అన్నాడు .  పనిని బట్టి వచ్చిన జాతి భేదాల్ని కూడా నేను చూడ వలసిన అవసరం లేదు - అన్నాడు శంకరుడు . ఆ తరువాత - సాక్షాత్  శివుడే కాశీలో తన్ను అంటరానితనం  పాటిస్తున్నావు సుమా - అని మందలించి, తన తప్పు దిద్దినట్టు, ఆయన చెప్పుకున్నాడు . శంకరులు చెప్పినా, రామానుజులు చెప్పినా - మనం మాత్రం త్వరగా మారడం లేదు . 

ఆ తర్వాత వచ్చిన వారు ఎంతో గొప్ప  వారే అయినా - శంకరులు చెప్పిన ఈ మూల సూత్రాలను, తమ మఠాల్లోనూ , దేవాలయాల్లోనూ పెద్దగా అమలు చెయ్య లేదు . ఇది వారు అనుకుంటే  వొక్క రోజులో మార్చొచ్చు . మారిస్తే, ఏ హిందువూ , మరో మతానికి వెళ్ళ  వలసిన అవసరమే వుండదు . వెళ్ళరు . హైందవ సమాజంలో వున్న ఈ వొక్క విషయం సరి దిద్దుకుంటే , మనం ఎంతో ముందుకు వెళ్ళ వచ్చు. యిది ఎవరు చేస్తారు ? ఎప్పుడు చేస్తారు ? 

మోడీ గారు చేస్తారా ? VHP , RSS , మరెవరైనా చేస్తారా ? మన మఠాధిపతులు చేస్తారా ? మరెవరైనా గురువులు చేస్తారా ? ఎందరో మహానుభావులు ; ఈ మహత్కార్యానికి ముందు నిలిచి ఎవరైనా చెయ్యచ్చు . అందరూ కలిసి చెయ్యొచ్చు .  యిది జరగాలి . గంగ పవిత్ర గంగగా మారుతూ వున్న సమయం లో, యిదీ జరిగి పొతే  ఎంత బాగుంటుంది !

నేను - నా చేత అయ్యే పని ఏదో చేస్తున్నాను . రాముడికి వుడత  చేసిన సహాయం లాగా .  సేవాలయ అనే ఆశ్రమం లో - అనాథ పిల్లలకూ, అనాథలు లాంటి లాంటి వృద్దులకూ - ప్రతి సంవత్సరమూ నేను చెయ్య గలిగినంత ధన సహాయం చేస్తూ వచ్చాను. 2014 నుండి మరో రకంగా చేద్దామని, యిద్దరు పిల్లల చదువు కు - 1 నుండి 12 వ తరగతి వరకు - అయ్యే పూర్తి ఖర్చు నేనే వారికి యిచ్చాను (1.7 లక్షలు ). యిక ముందు కూడా, నా శక్తి వున్న మేరకు, ప్రతి సంవత్సరమూ  వొకరో, ఇద్దరో పిల్లలకు చదువు పూర్తి ఖర్చు యివ్వాలని ఆశ , ఆశయం . దేవుడు ఆశీర్వదిస్తే అంత కంటే ఎక్కువే చేస్తాను . 

ఏదో చిన్న తపన నాలోనూ వుంది - నేను ఎవరి కళ్ళలో సంతోషం నింప గలను; ఎవరి కన్నీళ్లు తుడవగలను - అని . అది నన్ను ముందుకు నడిపిస్తుంది - యిక ముందు కూడా . 

నాకు తెలుసు. మన దేశంలో - ఎంతో మంది  డబ్బు వున్న వారు, ఎంతో, ఎంతో చేస్తున్నారు - విప్రో యజమాని ప్రేమ్జీ లాగా . మరెంతో మంది , ముఖ్యంగా, రాజకీయాల్లో వున్న వారు , అక్రమార్కులు గా ఉన్నారే తప్ప - ఏమీ చెయ్యడం లేదు . సరే . వారిని వదిలి పెట్టి , మనం అనుకుంటే, మనం చెయ్య గలిగింది చేస్తే ,  ఎంతో కొంత దేశం బాగు పడుతుంది కదా . 

ఇదొక్కటే కాదు . మనం మరెన్నో చెయ్యొచ్చు . నేను చేస్తున్న మరి కొన్ని పనులు మరో సారి మీతో పంచుకుంటా . 


మనం సంపాదించేదేదీ మన వెనుక రాదు ; మనం యిచ్చేదే  మనతో వస్తుందని , ఉపనిషత్తులు, గీత అన్నీ ఘోషిస్తున్నాయి .

మనం సంతోషంగా వుండి , మరో పది మంది సంతోషానికి కారణమైతే - అదే మన సంస్కృతి ఆశయం, లక్ష్యం. మన జీవన సాఫల్యం కూడా అందులోనే వుంది. 

సర్వే జనాః సుఖినో భవంతు అంటే అదే. మన బాధ్యతా నిర్వహణ అంటే కూడా అదే కదా .  

సరే . మీ అభిప్రాయాలు, సలహాలు తప్పకుండా చెప్పండి . సంతోషంగా స్వీకరిస్తాను . 

సర్వే జనాః సుఖినో భవంతు

= మీ 

వుప్పలధడియం విజయమోహన్ 

మేము యిప్పటికి చదివిస్తున్న యిద్దరు పిల్లలు