17, సెప్టెంబర్ 2012, సోమవారం

మతమూ - మానవత్వమూ

మతమూ - మానవత్వమూ 


మానవత్వం తెలియడానికి మతం అవసరమే లేదనిపిస్తుంది. మన సమకాలీన గురువు వొకాయన అంటారు - మీ బొటన వేలును చూడండి. దాన్ని గట్టిగా సుత్తితో కొట్టండి. నరకండి. మీ యిష్టం వచ్చినట్టు గాయపరచండి. ...

ఈ పనులు మీరు చేస్తారా? చెయ్యరు గాక  చెయ్యరు. ఎందుకు? అది మీ వేలు గనుక. అందులో మీరు వున్నారు గనుక. అది గాయపడితే మీరు గాయ పడ్డట్టు.అది బాధ పడితే మీరు బాధ పడ్డట్టు. అది  మీది. అది మీరు - అన్న భావన మీలో వుంది గనుక.

అదే మరొకరి వేలును గాయ పరచమంటే - మనలో - వొక్కొక్కరి స్పందన వొక్కొక్క రకంగా వుంటుంది. వొకరు ససేమిరా -నేను చెయ్యను; చెయ్యలేను.అంటారు. మరొకరిని శారీరకంగానో, మానసికంగానో, హింసించలేని  సున్నిత మనస్కులు యిప్పుడూ మన దేశంలోనూ, చాలా దేశాల్లోనూ - వున్నారు. అంటే - మానవత్వం వున్న వారు ఎంతో మంది వున్నారు.

సరే.  మరో రకం వారు - తమ మిత్రులనైతే , తమ వారినైతే హింసించలేరు గానీ - తమ శత్రువులనో, తమ వారు కాని వారినో  హింసించడానికి   ముందుకొస్తారు. వారిలోనూ, రక రకాల మనుషులున్నారు. కొంత మంది ఉత్త మాటలతో అయితే  హింసిస్తారు గాని - చేతల ద్వారా  హింసించలేరు.

కొంత మంది - ఎవరైనా మరొకరిని పంచ్ బాగ్ లాగా కొడుతూ వుంటే - చూసి ఆనందిస్తారు. సినిమాల్లో నైతే - విలన్లు అలాంటి పంచ్ బాగ్ లు గా మారి - హీరో చేతిలో దెబ్బలు తింటూ వుంటే - వాడిని యింకా కొట్టు, యింకా కొట్టు అనుకుంటూ వుంటాము. ఇక్కడ, మనకు తెలియకుండానే, మనలో - హింసను ఆనందించే ప్రవృత్తి ఏర్పడుతూ వుంటుంది. అదే - హీరోను కొడుతూ వుంటే - సహించలేము.

మన వారికి ఏదైనా ఆపద వస్తే - విలవిల్లాడి పోతాం. కాని - ఆపద వచ్చింది మన వారికి కాదు - అనిపిస్తే - నిశ్చింత వచ్చేస్తుంది మనలో. మన వారికి గోరు కాస్త తగిలితే - మనసులో - విల విల. కానీ పరాయివాడి ప్రాణం పోయినా - మన మనసులో ఏమీ లేదు.

నిజమా, కాదా?

కానీ,  మనలోనే కొందరు, ఎక్కడ, ఏ ఆపదదొచ్చినా - మూటా, ముల్లె సర్దుకుని అక్కడికెళ్ళి - అందరికీ సహాయ పడుతూ వుంటారు. అలాంటి ఎన్నో సంస్థలు వున్నాయి.

అటువంటి - మనస్తత్వం అందరికీ వుంటే - దేశం నందన వనం అయిపోదా? స్వర్గం గా మారిపోదా? మరి అటువంటి మనస్తత్వం మనలో ఎలా వస్తుంది? మన విద్యా విధానం ద్వారా వస్తుంది. గొప్ప గురువుల సాన్నిధ్యంలో వస్తుంది.

నాకు తెలిసి అటువంటి గురువులు మన దేశంలో చాలా మంది వున్నారు. కానీ, కొంత మంది - వారి దగ్గరకు వెళ్ళకుండానే, వారి ప్రబోధాలు వినకుండానే, వారు చేసే ప్రతి పనీ గమనించకుండానే   - వారిపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ వుంటారు.

తాము చేయలేని పని వారు చేస్తున్నారు. అదెలా సాధ్యం. యిందులో, వారి స్వార్థం వుండనే వుంటుంది - వారు తమకంటే - ఏ విధంగానూ గొప్ప వారు అవడానికి వీలే లేదు -అనే భావన వుంటుంది. కానీ అటువంటి గురువుల సాన్నిధ్యానికి వొక సారి వెడితే - యిటువంటి వారు మారడానికి - అవకాశం వుంటుంది.

సరే. ఇలాంటి వారు రక రకాలుగా వున్నారు. 

జీవితంలో, మనిషి - వికాసాత్మకం గానూ, నిర్మాణాత్మకం గానూ వుండొచ్చు . లేదా, విమర్శకుడిగా మిగిలి పోవచ్చు. అందులోనూ  - వికాసాత్మక విమర్సకుడి గానూ వుండొచ్చు. లేదా, వినాశాత్మక విమర్శకుడిగానూ  వుండి  పోవచ్చు.

మన దేశంలో ముఖ్యంగా - నిర్మాణాత్మకతను  మనలో పెంచే విద్యా విధానం రావాలి . ఇప్పుడున్న విద్యావిధానం - అటువంటిది కాదని నిశ్చయంగా చెప్పొచ్చు.అలాగే - సహృదయంతో, వికాసాత్మకంగా చూడగలిగే విమర్శనా దృష్టి కూడా కావాలి.మన ఆలోచనా విధానమే మారాలి.

మరి -నకారాత్మక దృష్టి , నకారాత్మక స్వభావం కొందరిలో - మరీ మితి మీరి పోతుండడం  కూడా మన దేశంలో వుంది. మనం చూస్తూనే వున్నాం. కావాలని, రైళ్ళు  పడగొట్టడం, బస్సులు కాల్చడం, మనుషులను హింసించడం, చంపడం, ఆడవాళ్లనైతే ,అత్యాచారాలకు, సామూహిక అత్యాచారాలకు గురి చెయ్యడం - ఈ మధ్య ఎక్కువై పోతూ వుంది. నా వుద్దేశంలో యిందుకు ప్రధాన కారణం విద్యా విధానం లోని లోపాలే.

మరో కారణం సినిమా , టీ.వీ ల ద్వారా యిటువంటి హింసను -ముఖ్యంగా హీరో ద్వారా హింసను -ఎక్కువగా ప్రోత్సహించడం.  అశ్లీలత కూడా ఈ రోజుల్లో చాలా సరిహద్దులు దాటింది.

కాకపోతే - మన దేశం - మరి కొన్ని యితర దేశాలతో పోల్చి చూసుకుంటే -  కొంత మెరుగేనని చెప్పొచ్చు.

మనం చూస్తున్నాం కదా - మగ వాళ్ళు చేసే నేరాలకు ఆడ వాళ్ళను రాళ్ళతో కొట్టి చంపుతూ దాన్ని ఆనందించే ప్రవృత్తి యింకా కొన్ని దేశాలలో వుంది. మతం పేరిట మన దేశంలో కొంత అంటరానితనం మాత్రం వుంది - కానీ - కొన్ని దేశాలలో - క్రూర మృగాల లాగా, మిగతా మతాల వారిని - హింసించడం, తమ మతంలో చేర్చుకోవడానికి బలాత్కారం చెయ్యడం - తత్ ఫలితంగా వారు దేశాంతరాలకు పోవడం జరుగుతూనే వుంది.

మతం పేరిట ఏదేదో జరుగుతూ వుంది. ఎన్నెన్నో జరుగుతూ వుంది. చాలా మందిలో  - రావాల్సిన మంచి మార్పు  రావడం లేదు.

అన్ని మతాల లోనూ - కొంత మంది మంచి వారూ వున్నారు. కొంత మంది చాందస వాదులూ వున్నారు.మంచి వారి వొక్కటిగా చేరితే - అన్ని దేశాల వారూ, అన్ని మతాల వారూ హాయిగా వుండొచ్చు.

అది జరగక పోతే - ఛాందస వాదుల ద్వారా - మానవత్వం మంట గలిసి, రాక్షసత్వం పెరగడం ఖాయం.

చాందస వాదులు మారాలంటే - ఎలా? ఆయా మతాల లోని మంచివారిద్వారానే - అది జరగాలి.  చెడును ప్రోత్సహించకపోయినా - చెడుని చూసీ చూడనట్లు వుంటే - చెడు పెరగడం ఖాయం. మన పొరుగు దేశాలలో అది జరుగుతుందో, లేదోచెప్పలేం . కానీ, మన దేశంలో - ఈ మార్పు రావాలి. రావచ్చు.వస్తుందనే నమ్మకం కలుగుతూ వుంది.

మతాలలో కూడా -గణనీయమైన మార్పులు రావాలి. మతంలో ఎంతో మంచి వుంది. కానీ- కొంత చెడూ వుంది. కొన్ని అమానుషమైన అలవాట్లూ ఉనాయి. 

మా మతమే గొప్ప - మా నాయకుడే గొప్ప -మా గ్రంధమే గొప్ప అనుకుంటే - మార్పు ఎప్పుడూ రాదు.

ఈ గంధాలన్నీ - వొక కాలంలో - ఆ కాలానికి తగినట్టు చెప్పబడ్డవి; రాయ బడ్డవి. -అందులోనూ  కొన్ని మాత్రం నిత్య సత్యాలే. వొప్పు కుంటాను. కొన్ని - కాలానుగుణంగా  మారాలి.

అందులో వొకటి - హిందు మతానికి -సంబంధించినది  - జాతి వివక్షత, అస్పృశ్యత. యిది మారుతూ వుంది కానీ - యింకా ఎంతో వేగంగా - అందరికీ నచ్చేటట్టుగా  మారాలి. 

మరొకటి మిగతా మతాలకు -మనకూ మధ్య వున్న సంబంధాలకు సంబంధించినది. మిగతా వారి వారి మతాలకు సంబంధించిన  విషయాలను నేను ప్రస్తావించను.

వొకటా మా మతంలో చేరండి - లేదా - మీరు నరకానికి వెళ్లి పోతారు - అన్నది హాస్యాస్పదమైన వాదం.యిందులో పెద్దగా వాదించి తెలుసుకోవలసిన సత్యం ఏమీ లేదు. కొద్దిగా, కళ్ళూ మనసూ తెరిచి చూస్తేనే చాలు - యిట్టే - అర్థమై పోతుంది.  

ఈ మతాలు వచ్చిందే 2000 ఏళ్ళ క్రితం. అంతకు క్రితం మంచి వాళ్ళు ఎంతో మంది వున్నారు కదా. వాళ్ళు ఎవరూ స్వర్గానికి వెళ్ళ లేదా? 

అలాగే - భారత దేశంలో కూడా, కృష్ణుడు లాంటి దేవుడి అవతారాలు 5000-6000 క్రితం వచ్చారంటే - గీత లాంటి   - గొప్ప సందేశాలు - అందించారంటే   -  ఎందుకు నమ్మక పోవడం? అందులో అంతగా నమ్మక పోవడానికి ఏముంది?

అలాగే - విగ్రహారాధన అంటే - ఏమిటో - అసలు తెలుసుకోకుండా - దీన్ని విమర్శించే  వాళ్ళు చాలా మంది  వున్నారు. విగ్రహారాధన చేసే వారిని తెగ కోసి  చంపితే మాకు స్వర్గం వస్తుందనే వారూ వున్నారు.

హిందు తత్వంలో కూడా - దేవుడు నిరాకారుడే అని ఎన్ని సార్లు చెప్పలేదు? కానీ - తన భక్తుల కోసం - దేవుడు - వారు కోరుకున్న రూపాల్లో వస్తాడని చెప్పడమే యిది .  అంతే కాక - పరి పరి విధాలుగా పోయే  మనస్సును మొదట వొక చోటికి చేర్చడమే  యిష్ట దేవతా విగ్రహాల లక్ష్యం.

ఆ తరువాత  నిరాకారుడైన దేవుడు. ఆ దేవుడి ఆరాధన.

ఆ తరువాత వుపనిషద్ వాక్యాల ప్రకారం  -అహం బ్రహాస్మి - నేనే బ్రహ్మమును - అనేదే నిత్య సత్యము. యివన్నీ తెలుసుకోకుండా -  పర మతాల్ని విమర్శిస్తే - సఖ్యత ఎలా కుదురుతుంది. విశ్వ శాంతి ఎలా వస్తుంది?

యిదైనా - ఎందుకు చెప్పాల్సి వస్తూ వుంది? నన్ను ఏం చేసినా తమకు పరవాలేదు - అంతకు మించి స్వర్గం కూడా వస్తుంది - అని కొంత మంది చాందస వాదులు అనుకోవడం - నేను వొప్పుకోలేను కదా. అందుకే. 

ఈ చాందస వాదాన్ని ఎవరు అరికట్టాలి . ఆయా మతాల లోని మంచి వాళ్ళే అరికట్టాలి. వారు అందుకు - ముందుకు వచ్చిన నాడు - చాందస వాదులు అణిగి పోతారు.

హిందూ  సంస్కృతి ప్రకారం - సర్వే జనాః సుఖినో భవంతు . మనమందరూ బాగుండాలి. అంతే 

మొదట చెప్పిన వాక్యాన్ని మరో సారి గుర్తు చేసుకుందాం....మీ బొటన వేలును చూడండి. దాన్ని గట్టిగా సుత్తితో కొట్టండి. నరకండి. మీ యిష్టం వచ్చినట్టు గాయపరచండి. ...మీరు చేస్తారా? చెయ్యరు కదా?  అలాగే. మిగతా వారినీ చూడండి. అందరూ దేవుడి బిడ్డలే. అందరి దేవుడూ వొకడే.  దేవుడి పేర్లు మనం పెట్టుకొన్నవి. ఆయన నా పేరు యిదీ - అని చెప్పిన దాఖలాలు ఏమీ లేవు.

ముందు చెప్పినట్టు - ప్రతి మతం లోనూ - కొంత మంచి, కొంత చెడూ - రెండూ వుంది. 

ప్రతి మతం లోని మంచి స్వీకరిద్దాం. ప్రతి మతం లోని చెడును గుర్తించి వదిలేద్దాం.


 =మీ 

 ఉప్పల దడియం విజయామోహన్  
 





29, ఆగస్టు 2012, బుధవారం

చీకటి వెలుగుల ఆట - అహంకారం, మమకారాల పై మన పోరాటం - శ్రీరాముడు శ్రీకృష్ణుడు తమ జీవితాల్లో నిజంగా చేసింది ఏమిటి?-



మన నిజమైన పోరాటం  ఎవరిపై ?

మన సంస్కృతి  లక్షల సంవత్సరాల నుండి వస్తున్న సంస్కృతి.  


వేదాలు ఎప్పుడు వచ్చాయో, ఎలా వచ్చాయో, ఎవరికీ తెలీదు.



ఆందులోని ఉపనిషత్తులు, ఆరణ్యకాలు లాంటివి  వొక్కటొక్కటి ఎప్పుడు వచ్చాయో - వాటి కర్త ఎవరో - ఎవరికీ తెలీదు . 



నా వరకు నేను - శంకరాచార్యుల రచనలు, ఉపనిషత్తుల సారము - కొంత వరకు  చదవడం వినడం చేసాను - గత నాలుగు సంవత్సరాలలో .




మహానుభావులయిన  గురువుల సమ్ముఖంలో వాటి లోతుపాతులను గురించి వినడం జరిగింది. 


మన సంస్కృతి - చాలా శాస్త్రీయమైన - సైంటిఫిక్ అయిన - సంస్కృతి అని  మనం తప్పకుండా తెలుసుకోవచ్చు. అసలు లోపాలే లేవని నేను చెప్పను. ఏదైనా - కాలం మారే కొద్దీ, కొంత మార్పు చెందాలి. మన సంస్కృతి కూడా, శ్రీకృష్ణుడి కాలం వరకు మార్పులు, చేర్పులు, కాలానుగుణంగా, పొందుతూనే వుంది. శ్రీకృష్ణుడి భగవద్ గీత - ఈ మార్పులు, కూర్పులలో - వొక అంతర్గత భాగమే. 

భారత కాలంలోనే వ్యాసుల వారు - వేదాలను, పురాణాలను - ఎంతో సంస్కరించడము  జరిగింది. వ్యాసుల వారి తల్లి - సత్యవతి అనబడే యోజనగంధి. ఆమె పూర్వపు పేరు, మత్స్య గంధి . మత్స్య కారుల వంశస్తురాలు.  కానీ- ఆమె వొక వైపు మహా గొప్ప వాడై న వ్యాస మహర్షి పుట్టుకకు, మరొక వైపు, పాండవకౌరవ -వంశాలకు  మూల కారణం అయింది. అది ఆ కాలం.


మనిషికి వుండవలసిన గుణాలేవి; వుండకూడని గుణాలేవి - మనిషికి నిజంగా కావలసినది ఏది; వద్దన్నది ఏది - లాంటి విషయాలపైన - ఎంత సుదీర్ఘ  చర్చ జరిగిందో - అది మన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్ గీత లాంటివి  చదివి అర్థం చేసుకుంటే - తెలుస్తుంది.

ఉదాహరణకు - ముఖ్యంగా వుండ కూడని రెండు గుణాలు - అహం; మమ - అంటారు. అంటే అహంకారం; మమకారం. ప్రస్తుతానికి - ఈ రెండింటిని గురించి కొద్దిగా విశ్లేషణ చేద్దాం. 

అహంకారం - అంటే, నేను,నావి,  నాకే -అనే భావం. 

నేను గొప్ప -అనే భావం లో, నేను కాని వారు, నాకంటే  తక్కువ - అనే భావం -మిళితమై వుండనే వుంటుంది.అది - తననూ నాశనం చేస్తుంది. చుట్టూ వున్న వారినీ నాశనం  చేస్తుంది. ఆంగ్లం లో దీన్ని - ఈగో -అని చెప్ప వచ్చు.   

వొక సారి, స్వామి సుఖ బోధానంద గారు -  "ఈగో" అనే పదానికి - ఎడ్జింగ్ గాడ్ అవుట్ -అంటే - లోనున్న దేవుడిని బయటకు గెంటేయడం -అని అర్థం - అని చాలా అందమైన నిర్వచనం చెప్పారు.

మీ లోపల అప్పుడు మీరు మాత్రమే వుంటారు.మరెవరికీ చోటు లేదు. దేవుడికి కూడా లేదు. మీలో ఎవరి ఆలోచనైనా వస్తే - దేవుడి ఆలోచన వచ్చినా సరే - వారు. మీ స్వార్థానికి ఎలా ఉపయోగ పడతారనే విషయానికోసమే అయి వుంటుంది . మీరు మాత్రమే బాగుండాలి;మిగతా వారు - ఎలా పోయినా ఫరవా లేదు -అనే భావన పెరిగి పోతుంది. 

అహంకారానికి - వొక గొప్ప ఉదాహరణం -రావణాసురుడు.   రావణుడికి  తానూ, తన సుఖం తప్ప - మిగతా ఏదీ గొప్ప కాదు. అందులో వొక భాగంగానే - సీతను ఎత్తుకు పోవడం. 

వొక్క సీతపై మాత్రం కామం రాలేదు రావణుడికి.  మహా కవులు  అంటారు - పార్వతీ దేవి పై కామం తో శివుడినే నువ్వెంత అన్నవాడు  రావణుడు. అందుకు ఫలితం అనుభవించాడు. కానీ అహంకారం నిండిన రావణుడు వూరికే  వుండలేడు కదా. నన్ను మించిన వాడు లేడని గర్వం. వొక సారి తన అన్న గారైన కుబేరుడి కోడలు, రంభనే-   బలవంతంగా చెరిచాడు.  నువ్వు నాక మామ గారు, తండ్రి లాంటి వాడు అని ఎంత మొత్తుకున్నా వినలేదు రావణుడు .అందుకు, కోపంతో, ఆమె భర్త నలకూబరుడు - శాపం పెట్టాడు. అలాగే - వేదవతి అనే - తపస్సు చేసుకుంటున్న కన్యను చెరచ బోయి - ఆమె శాపానికీ గురి అయ్యా డు. అయినా, అహంకారం పోలేదు.

ఎంతోమంది ఆడవారిని యిలా బలవంతంగా ఎత్తుకొచ్చిన వాడు రావణుడు. ఎంతో మంది ఋషులకు, రాజులకు, దేవతలకు, ప్రజలకు - ఎన్నో కష్టాలను తెచ్చి పెట్టిన వాడు రావణుడు. తాను సీతను అనుభవించడానికి - తన వాడై న మారీచుడి ప్రాణాలను కూడా పణం గా పెట్టిన వాడు రావణుడు. మారీచుడు వద్దు మొర్రో అంటున్నా, వినక - రాముడి చేతుల్లో చస్తావో లేదో కాని - నా పని చేయక పోతే, నా చేతుల్లో చస్తావు, అని బెదిరించిన వాడు.

సీత కోసం విభీషణుడిని కూడా ఫో అన్న వాడు. కుంభకర్ణుడిని, తన కొడుకులను, తన వంశంలోని అందరినీ  పణం గా పెట్టి - ఏ  మాత్రం బాధ పడని వాడు. సీత దక్క లేదే అన్న బాధ, రాముడిని జయించ లేదే -అన్న బాధ పెద్దది  కాని - యింత  మందిని  పోగొట్టుకున్నామే అన్న బాధ పెద్దది కాదు  రావణుడికి.

ఏదో సినిమాల్లో -చూసి రావణుడు మహా మంచి వాడు అనుకుంటే - చాలా తప్పు . అంటే - రావణుడిలో మంచి గుణాలే  లేవని  కాదు

గొప్ప  శివ భక్తుడు. కానీ శివుడి భార్యనే - లోక మాతనే, కామదృష్టితో చూసిన వాడు.

వేదాలన్నీ చదివిన వాడు. కానీ - వేదాలలోని మంచి నంతా  వదిలేసి - అవి, వద్దు, వద్దు అనే - కామక్రోధాదులనే  అంతః శతృవులకు - పూర్తిగా లోబడిన వాడు. వర గర్వితుడు. నన్ను మించిన వాడు లేదని విర్ర వీగిన వాడు. మొత్తానికి ప్రపంచంలో మహా అహంకారిగా పేరు పొందిన వాడు. కులము లో - వొక అహంకారి -వుంటే  కులమంతా నాశనమవుతుందని -చెప్పడానికి, వొక గొప్ప ఉదాహరణం,  రామాయణం లోని రావణుడు.

అహంకారం లేని, పరోపకారిగా, వొక వైపు రాముడు; మహా అహంకారిగా, మరోవైపు రావణుడు. వీరి మధ్య కాదు -యుద్ధం  ; ఈ గుణాల మధ్య యుద్ధం. అదీ రామాయణం. అహంకారం ఎంత చెడుపు చేస్తుందో , అది - చెప్పడమే రావణుడి పాత్ర లక్ష్యం. అహంకారం లేకుండా వుండాలంటే ఏం చెయ్యాలి మనలో అహంకారం వుందో, లేదో ఎలా తెలుసు కోవడం అన్న దానికి నిదర్శనం రాముడు .  

సరే. మన విషయానికొస్తే - అహంకారం మనలో  వుందో లేదో ఎలా తెలుసు కోవడం?

1. మీరు  మగ వారైతే - మీ తల్లితండ్రులను ఎంత మాత్రం గౌరవిస్తున్నారో - మీరే తరచి చూడండి. మీరు వారికేం చేస్తున్నారు.  వారు మీ పట్ల ఎంత సంతోషంతో వున్నారు - అన్నది మొదటి అంశం. మీరు ఎప్పుడైనా - వారికి నమస్కారం చేసి, వారి ఆశీర్వాదం తీసుకోవాలని ప్రయత్నం చేసారా? మీకు - చేయాలని అనిపించలేదంటే - మీలో అహంకారం దాగి ఉన్నట్టే .

2. మీరు ఆడ వారైతే -  పెళ్ళైన వారైతే - యిదే విషయం - మీ అత్త మామల పట్ల వర్తించుకోవాల్సి వుంటుంది. అదేమిటి. మేమూ మా తల్లి తండ్రుల పట్లే - విధేయంగా - వుంటాము అంటే - నేను చెప్పేదేమీ లేదు.సహ ధర్మ చారిణి, బెటర్ హాఫ్ , గృహ లక్ష్మి -అన్న పదాలు - మీరు ఎంతగా భర్త కుటుంబంలో కలిసిపోతారో -  దానిని బట్టే వుంటుంది.  నిజానికి  భార్యాభర్త లిద్దరూ -అత్తమామలను, తల్లితండ్రులను కూడా  గౌరవించవలసిన వారే. కానీ భార్య ఎంతగా, భర్త కుటుంబంలో కలిసి పోతుందో - అంతగా , ఆమె - రెండు కుటుంబాలకూ  గౌరవ కారణం అవుతుంది. యిది జరగని చోట  -ఆమెలో  అహంకారం వున్నట్టు లెక్క 

3. మీ భార్యకు - కాలో, చెయ్యో తగిలింది , లేదా బెణికింది - అనుకోండి. - నేనేమిటి, తన కాలును తాకడం ఏమిటి - అని మీరు (మగ వారు) -అనుకుంటే, మీలో బాగా అహంకారం ఉన్నట్టే లెక్క.   ధర్మేచ, అర్థేచ, కామేచ - అన్నిటిలో సహధర్మ చారిణి అయిన భార్యను, అన్ని రకాలుగా కాపాడ వలసిన, సంతోష పరచ వలసిన కర్తవ్యం పురుషుడికి తప్పకుండా వుంది. అది చెయ్యని నాడు - అది అహంకారానికి గుర్తే. అలాగే భార్య కూడా - భర్తకు, ఏదైనా సరే -  చెయ్యాలి. నా భర్త (లేదా నా భార్య)  ఆరోగ్యం, సంతోషం, నా పూర్తి బాధ్యత - అని యిద్దరూ - అనుకుంటేనే -వారిలో  అహంకారం లేనట్టు లెక్క. నేనెందుకు చెయ్యాలి - అనుకునే వారిలో అహంకారం వున్నట్టు లెక్క.

4. గురువుల పట్ల, వయోవృద్ధుల పట్ల, జ్ఞాన వృద్ధుల పట్ల- గౌరవం వుండాలి. మనిషికి, ఏ వయసులో నైనా - వొక గురువు వుండాలి. ఎవరినో వొకరిని గురువుగా అంగీకరించి - వారి మాటే వినే వారికి - అహంకారం కాస్త దూరంగా వుంటుంది.

5. నాకు తెలుసు - నాకే తెలుసు - నాకు అన్నీ తెలుసు - అనే భావనలు వస్తూ వుంటే - అహంకారం పెరుగుతూ పోతుంది. నాకు తెలియనిది ఏది, అది నేను  ఎలా తెలుసుకోవాలి  అనుకునే వారికి; తనకు తెలియదు అనే విషయాల్ని -సంకోచం లేకుండా, అంగీకరించే వారికి, అహంకారం దూరంగా వుంటుంది. మన దేశంలో కొంత మంది సినిమా హీరోలు, రాజకీయ వేత్తలు, ఇలాంటి వారు - అన్నీ తమకు తెలిసినట్టు,  ఏ విషయం పైన ప్రశ్నలు అడిగినా - టక్కు టక్కు మంటూ  జవాబులు చెప్పడం  మనం చూడవచ్చు. తెలియనివి, తెలియదని చెప్పడానికి నామోషీ . అ నామోషీ వెనుక అహంకారం తప్పకుండా వుంటుంది.

6. నాకు తెలియదు - అని నేను అంగీకరించనంత వరకు -  మరింత తెలుసుకునే ప్రయత్నం నేను చెయ్యను. ఆ అవకాశం నాకు పోతుంది. నిజంగా తెలిసిన వారు, నాకు దూరంగావెళ్ళుతూ  వుంటారు.  యిది, మన జీవితంలో -జరుగుతూ వుంటుంది . కానీ, మనకు తెలియదు. అర్థమూ కాదు. అహంకారం మహిమ అలా వుంటుంది. మన శ్రేయోభిలాషులను మనకు దూరం చేస్తుంది. మూర్ఖులను, స్వార్థ పరులను చుట్టూ చేరుస్తుంది.

యిలా యెన్నైనా  చెబుతూ పోవచ్చు. ప్రయత్నం చేస్తే , మనలో  అహంకారం వుందా, లేదా అనేది - యిట్టే తెలిసి పోతుంది.

సరే. అహంకారానికి విరుగుడు ఏమిటి? ఏది వుంటే అహంకారం వుండదు?

చాలా, చాలా సులభమైన  ప్రశ్న యిది.

ప్రేమ వున్న చోట స్వార్థమూ వుండదు; అహంకారమూ వుండదు.

అహంకారం స్వార్థాన్ని మాత్రమే కోరుకుంటుంది. ప్రేమనిస్స్వార్థమైనది. ప్రేమకు యివ్వడమే తెలుసు కానీ - అడగడము, దాచడము,  స్వార్థం - ఇలాంటివి తెలీదు.

నాదీ నీదే, నీదే నీదే - అనేది ప్రేమ. నీదీ నాదే.నాదీ నాదే  - అనేది అహంకారము,స్వార్థము. 

ఈ రెండింటి  మధ్య కొంత అహంకారము, కొంత ప్రేమ, కొంత సంశయము - వీటితో కొట్టుకులాడుతుంటారు - చాలా మంది.  ప్రేమంటే ఏమిటో  తెలిసి ; నిజంగా దాన్ని అనుభవించిన నాడు - అహంకారం  పూర్తిగా పోతుంది.



జ్ఞానము రెండవది . జ్ఞానము వున్న చోట కూడా అహంకారం వుండదు.

వొక సారి చీకటి  దేవుడి దగ్గరకు వెళ్లి - వెలుగుపై  ఫిర్యాదు చేసిందట. నేను ఎక్కడకు వెళ్ళినా, ఈ వెలుగు, నన్ను తరిమి కొడుతూ వుంది. దాన్ని కాస్త ఆపి, నన్ను కూడా దానికి సమంగా వుండ నివ్వండి, అని.  సరే, నేను కనుక్కుంటానులే, నువ్వు,వెళ్ళు అన్నాడు దేవుడు. వెలుగును పిలిచి అడిగాడు - చీకటి యిలా నీపై ఫిర్యాదు చేసింది - అని.

వెలుగు ఆశ్చర్య పోతూ అంది. నేనెప్పుడూ  చీకటిని తరమనేలేదు. కనీసం చూడనే లేదు. అయినా మీరు చెప్పారు కాబట్టి, చీకటి ఎక్కడుందో,చూసి, క్షమాపణ అడుగుతాను -అనింది. ఆ రోజు నుండి, ఈ రోజు వరకూ, వెలుగు, చీకటిని వెదుకుతూ వుంది. కానీ చీకటి, వెలుగుకు కనిపించడం లేదు. అలాగే. చీకటి మాత్రం, వెలుగును చూసి భయపడి పారిపోతూనే  వుంది కానీ -  ఎదుట పడటం లేదు.

జ్ఞానం కథ యింతే. జ్ఞానం వచ్చిన వెంటనే - అహంకారం మాయమవుతుంది. అది జ్ఞానం వున్న చోట వుండ  జాలదు. కాక పోతే - సగం తెలిసి,సగం తెలియకుండా వున్న వారిలో - వారి సగం తెలియని తనం లో దాక్కుని వుంటుంది. నాకు - యిది తెలియదు, నేను యిది తెలుసుకోవాలి  అన్న జ్ఞానం వస్తే చాలు - అహంకారం మరి వుండలేదు;  పారిపోతుంది.

జ్ఞానమూ అహంకారాన్ని పారద్రోలుతుంది. ప్రేమ కూడా అహంకారాన్ని పారద్రోలుతుంది.

నిజానికి - జ్ఞానమున్న చోట ప్రేమ వుండనే వుంటుంది. అలాగే - ప్రేమ వున్న చోట - జ్ఞానం కూడా - అంతర్గతంగా వుండనే వుంటుంది. - ప్రేమకు జ్ఞానం ఎవరూ చెప్పకుండానే - తెలిసి పోతుంది. ఈ రెండింటిలో  - ఏది మీలో (కాస్త ఎక్కువగా) వున్నా సరే  - మీలో అహంకారం వుండదు.

అహంకారానికి ప్రతీక రావణుడైతే - మమకారానికి ప్రతీక ధృత రాష్ట్రుడు. భారత యుద్ధానికి  ముఖ్య కారణం  ధృతరాష్ట్రుని  మమకారమే. దుర్యోధనుడు చిన్నతనం నుండీ చేసిన చెడ్డ పనులను - దేనినీ ధృతరాష్ట్రుడు  వారించ లేదు.

మమకారము అంటే - ప్రేమ అని మనం సాధారణంగా అనుకుంటూ వుంటాము. కాదు. రెండింటికీ అంతరం వుంది. ముందే అన్నాం - ప్రేమలో స్వార్థం వుండదని. ప్రేమ -ఎప్పుడూ  చెడును ప్రోత్సహించదు.

మమకారమంటే - నా  వారు మాత్రమే బాగుండాలి - అనే భావన.  మిగతా వారు ఎలా పోయినా ఫరవాలేదు.

భగవద్ గీత అంతటికీ -ధృతరాష్ట్రుడు మాట్లాడే మాట - వొక్క మొదటి శ్లోకం మాత్రమే. ఈ  శ్లోకం మమకారానికి ప్రతీకగా చెబుతారు.

 నా వాళ్లైన కౌరవులు, వారు (పాండవులు) ఏమేమి చేస్తున్నారో, చెప్పు సంజయా -అని అడుగుతాడు. కౌరవులేమో - నా వాళ్ళు.   పాండవులకు - నా వాళ్ళు అనే పదం వర్తింప జేయ లేదు ధృతరాష్ట్రుడు.  ధృతరాష్ట్రుడి అంధత్వం - కళ్ళది కాదు , మనసుది. మనసులోని మమకారానిది.  మమకారానికి  కళ్ళు  లేదు. అది గ్రుడ్డిది. తన వాళ్ళు - అనుకునే వాళ్ళకోసం -మిగతా వారికి ఎంత అన్యాయమైనా చేయడానికి - ప్రోత్సహిస్తుంది.  నిజమైన ప్రేమ వెనుక జ్ఞానం వుంటుంది. అది అన్యాయాన్ని ప్రోత్సహించదు.

దుర్యోధనుడిది అహంకారం. ధృతరాష్ట్రుడిది, గాంధారిది - మమకారమనే గ్రుడ్డి తనం. రెండూ వినాశనానికే  దారి తీస్తాయి. 

మనం  వొక కథ వినే వుంటాం. వొక కొడుకు ప్రక్క నింట్లోని చెట్లో - పళ్ళు కాజేస్తాడు. వాళ్ళమ్మ - ఎవరికీ చెప్పకు, అని  కొడుకును తినమంటుంది . కొడుకు మరో రోజు - కూరగాయలు తస్కరిస్తాడు. అప్పుడూ తల్లి ఏమీ అనదు. ఆ కూరగాయలను  వండి పెడుతుంది . స్కూల్లో - ప్రక్క పిల్లల వస్తువులు కాజేస్తాడు.అప్పుడూ అంతే .


యిలా, తల్లి మమకారంతో, ప్రోత్సాహంతో పెరిగిన కొడుకు గజదొంగ గా  తయారవుతాడు. ఎవరికీ చిక్కడు అప్పుడూ అంతే . తల్లికి కొడుకును ప్రోత్సహించడమే  పని. వొక సారి  హత్య చెయ్యాల్సి వస్తుంది. ఎప్పుడో వొక సారి పట్టు బడతాడు.  ఉరిశిక్ష పడుతుంది. తన కడపటి కోరిక ఏమిటని - అడుగుతారు. తన తల్లిని చూడాలని అంటాడు. తల్లి వస్తుంది. అప్పుడు - కొడుకు తిడతాడు. మొదటి సారి పండు కాజేసిన నాడే - నువ్వు నన్ను తిట్టి , చెయ్యొద్దని చెప్పి వుంటే , నేను బాగు పడే వాడిని కదా - అంటాడు. 

ఈ రోజుల్లో, ముఖ్యంగా - మన దేశ  రాజకీయాల్లో - అహంకారము, మమకారాల పాత్ర మనం చూస్తూనే వున్నాం. పట్టుబడితే దొంగ. లేదంటే - దొర. యిదీ కథ.  వీటి వలన - వారు మాత్రమే కాక, అందరం  రకరకాల బాధలు పడుతున్నాం.


యింట్లోని  వారు కానీ, పార్టీల నాయకులు కానీ - మరెవరైనా కానీ  - తప్పులు చేసే వారిని - తమకు లాభం వచ్చే వరకు - అస్సలు - అడగడం - లేదు. చివరికి - మతాలూ, మిగతా  రకాల సంస్థలూ  కూడా అలాగే  వుంటున్నాయి.

ఎప్పుడో లక్షల ఏండ్ల నాడు ఎవరో వొకాయన రాసిన మనుధర్మ శాస్త్రాన్ని - మనం తప్పు బడతాం.అయినా ,దాన్ని సంస్కరించుకోం. 


కానీ- దేశంలోఎక్కడైనా, కనీసం  వొక్క రోడ్డైనా-  సింగపూర్ లాగా, అమెరికా లాగా - వేయగలుగుతున్నామా - అంటే లేదు. కారణం - 'నా' స్వార్థం. 'నా వారి' స్వార్థం. అంటే - అహంకారం, మమకారం. బియ్యంలో కలపడం; పాలలో కలపడం; పప్పుల్లో కలపడం; మందుల్లో కలపడం; కలపడం లేని - వస్తువే మన దేశంలో దొరకడం లేదు. కారణం - అహం-మమ. ఈ రెండు కారాలే. బ్రిడ్జీలు -కట్టక ముందే -కూలిపోతున్నాయి.అడగ వలసిన వాడు అడగడు . మనం నోరు తెరిచి అడగ లేము. 

లంచ గొండి తనానికి  ముఖ్య కారణం - మనలో ప్రేమ శూన్యమై పోవడమే అంటారు శ్రీ శ్రీ రవిశంకర్ గారు. అందరూ నా వారే - అనుకుంటే - లంచ గొండి తనమూ వుండదు, కలపడమూ వుండదు.

సద్గురు  జగ్గి వాసుదేవ్ గారంటారు - మీ వేలు వొక్క సారి చూసుకోండి. దాన్ని,ఏదైనా రాయెత్తి  కొట్టండి చూద్దాం. మీరు చెయ్యరు. ఎవరూ చెయ్యరు. ఎందుకంటే - అది నాది అనే భావన. మీ కొడుకు దగ్గరో భార్య దగ్గరో లంచం అడుగుతారా? అడగరనే అనుకుంటున్నా . ఎందుకంటే , వీళ్ళు నా వాళ్ళు  అనే భావన మీలో వుంది గనుక. "నా వారు" అని అనుకోని వారి దగ్గరే - మీలో స్వార్థము, వారికేమైనా ఫరవాలేదు అనే భావన తలెత్తుతాయి.

మీరు హాస్పిటలుకు -వెళితే  వెయ్యి ఫారాలు రాసిన తర్వాత గానీ   అడ్మిషన్  యివ్వని డాక్టర్ గారు - తనకైతే ఏం చేస్తారు? మొదట ట్రీట్మెంటు -తరువాత ఫారాలు. మీ వారు రేపుకు గురైతే - పోలీసు వారు ఏంచేస్తారు? తమ వారు గురైతే ఏం చేస్తారు?

వీటన్నిటి వెనుక - అహంకారం వుంది. మమకారం వుంది.  యివే స్వార్థమనే రూపం లో వెయ్యి, వెర్రి తలలు వేస్తూ వుంది.

అసలైన జ్ఞానమూ లేదు. ప్రేమా లేదు.

యివి నశించి పోతూ వుంది మనలో.   "ఐ లవ్ యూ " అనే మాటల్లో కూడా - ఎక్కువగా అహంకారం, మమకారం మాత్రమే వున్నాయి. నువ్వు నాకు ఉపయోగ పడే వరకే  "ఐ లవ్ యూ ". లేదంటే - యిది మరో చోటికి వెళ్లి పోతుంది.

గీతా సారమంతా - వొక్క వాక్యంలో చెప్పాలంటే - "అహంకారం, మమకారం వున్నమీ మనస్సులో , జ్ఞానము, ప్రేమ నింపుకోండి."   శ్రీకృష్ణుడి ప్రబోధమంతా యింతే 

జ్ఞానమూ, ప్రేమా మీలో వున్నట్టు ఏం గుర్తు?

 మీరు మనసారా- "సర్వే జనాః సుఖినోభవంతు" అని అనుకోగాలరా . అలా ఉండగలరా.  అదే గుర్తు.

ఈ మధ్య స్వామి పరిపూర్ణానంద  గారు - దళిత వాడలలో పర్యటించి, వారితో మాట్లాడి, వారి మాటలను విన్న తరువాత - వొక్క మాట అన్నారట - నేను యిప్పుడే  నిజంగా పరిపూర్ణానంద అయ్యా ను. వూరికే ఉపన్యాసాలు, ప్రవచనాలు యిచ్చేటప్పుడు, ఏదో వెలితి వుండేది - అని. ఆ తర్వాతా ఆయన మాట్లాడే మాటలలో సర్వే జనాః సుఖినోభవంతు - అన్న భావన హృదయపు లోతుల నుండి వచ్చేటట్టు మనం గమనించ వచ్చు. 

అంతే . అంతకు మించి చెప్పేదేమీ  లేదు. తమ,తమ జీవితాల్లో, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు యిద్దరూ చేసింది యిదే.

సర్వే జనాః సుఖినో  భవంతు .


= మీ

వుప్పలధడియం విజయమోహన్







27, ఆగస్టు 2012, సోమవారం

మారుతున్న కాలం - ఎటు వైపు మన ప్రయాణం ? - ఏం చెయ్యాలి మనం ?

కిం కర్తవ్యం ?


ప్రపంచం లో  ఎన్నో మార్పులు జరిగి పోతున్నాయి.

మనం వూహించ  గలిగేవి, వూహించ లేనివి  - ఎన్నో, ఎన్నో జరిగి పోతున్నాయి.

వొక్క భారత దేశంలోనే - మనుషులలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మెరిసేదంతా బంగారం  కాదు - అన్న పాత కాలం సామెత లోని నిజం తెలిసి వచ్చేటట్టుగా వుంది.

మచ్చుకు వొక్క విషయం చూద్దాం.

మన ఆరోగ్య -మంత్రి  ఘులాం నబి ఆజాద్ గారు అన్నారు - భారత దేశం లోని   మగ వాళ్ళలో - యిన్ ఫెర్టిలిటీ (పిల్లలు పుట్టలేని స్థితి) -చాలా ఎక్కువవుతున్నదట. దీనికి కారణం - మన దేశంలోని రసాయనిక కర్మాగారాల్లో నుండి వెలువడే - క్సెనో బయోటిక్స్ -అని అన్నారు. వీటి వల్ల - స్పెరం క్రిముల సంఖ్య , వాటి  ఆరోగ్యము , నాణ్యత,సామర్థ్యము  గణనీయంగా తగ్గిపోతున్నవట.
    
సరే . డిల్లీ  లోని అఖిల భారత మెడికల్ సైన్సస్ ఇంస్టి ట్యూట్  వారు ఈ విషయం పై చాలా పరిశోధనలు  నిర్వహించి  క్రింది విషయాలు తేల్చారు :

వొక సాధారణ భారత యువకుడిలో (ఆ పై వయసు వారి లో కూడా) - 3 దశాబ్దాల క్రితం స్పెరం సంఖ్య  60 మిల్లియన్లు (వొక మిల్లీ లీటరుకు) వుండేవట . ఆ సంఖ్య యిప్పుడు 20 మి .న్ల కు పడి  పోయిందట.

దీనికి వొక ప్రముఖ కారణం - వారు పని చేసే చోట వుండే - అధిక ఉష్ణత  అన్నారు. అంటే - ఉష్ణోగ్రత  ఎక్కువగా వున్న  కర్మాగారాలు లాంటివి.

యిది కాక, అనేక కారణాల వల్ల ,  మగ వారి స్పెరం నాణ్యత - ప్రతి సంవత్సరమూ - దాదాపు 2% తగ్గిపోతున్నదట .

దాదాపు 40 శాతం మగ వారిలో -  స్పెరం సంఖ్య , నాణ్యత గణనీయంగా తగ్గిపోతున్నదట . సెమన్ ఉత్పతి కూడా  కూడా తగ్గి పోతున్నదట.

ఆరోగ్యముగా పుట్టే స్పెరం సంఖ్య చూస్తే   - వొక్క దశాబ్దంలో  26 శాతం  స్పెర్మ్స్ లో 60 శాతం ఆరోగ్యంగా వుండేవి - యిప్పుడు 7 శాతానికి పడిపోయాయట. అంతకు  ముందు - అంత కంటే మరింత ఆరోగ్యంగా వుండే వుంటాయి. ఇలాంటి మరెన్నో విషయాలు -పరి శోధనల్లో  తెలిశాయిట.  

కోపెన్ హాగెన్ విశ్వ విద్యాలయం పరిశోధనలలో  కూడా - వారి దేశంలో - యిటువంటి మార్పులు వస్తున్నట్టు తెలిసిందట. 

న్యూ యార్క్ విశ్వ విద్యాలయం పరిశోధనలలో - లాప్ టాప్  కంప్యూటర్లను తమ కాళ్ళపై పెట్టుకొని పనిచేసే  వారిలో - ఈ సమస్య చాలా ఎక్కువగా , చాలా త్వరగా వస్తున్నట్టు తేల్చారు. 

ముఖ్యంగా - పురుషుల మర్మా వయవాలకు -వేడి కాస్త ఎక్కువగా తగిలితే కూడా - ఈ సమస్య త్వరగా వస్తుందని -తెలుస్తోంది . 

సాధారణంగా  ఈ భాగం శరీరానికి వెలుపల, మూడు డిగ్రీలు తక్కువ వేడితో వుంటుందిట. అప్పుడే దాని ఆరోగ్యం, సామర్థ్యం సరిగ్గా వుంటుందట 

అలాగే - క్రిమి సంహారక మందులు వాడబడే తోటల్లో ఎక్కువగా పనిచేసే మగ వారికి కూడా  -యిలా జరుగుతున్న ట్టు, గమనించారు.

సరే.  ఈ కాలం లో శారీరక పరిశ్రమ లేని ఉద్యోగాల్లో వుండే వారికి ఈ సమస్య బాగా  వస్తున్నది. శారీరకంగా క్రొవ్వు ఎక్కువ వుండే వారికి కూడా - యిలా జరుగుతున్నది.

ఎక్కువగా స్మోకింగ్ , త్రాగే అలవాటు వున్న  వారిలో కూడా - ఈ సమస్య ఎక్కువవుతున్నది.

సెల్ ఫోన్లు -శరీరానికి కాస్త దూరం వుంచితే మేలు అంటారు.అలాగే, సైక్లింగ్, బైక్ రైడింగ్  చేసే వారు - సీటింగ్ బాగా సుఖంగా వుందా అని గమనించితే మేలు-అంటారు .

శరీరానికి మరీ బిగుతుగా వుండే దుస్తులు వేసుకుంటే - కొన్ని రకాల సమస్యలు వస్తున్నాయి - అదీ మర్మావయవాల దగ్గర వేడి కొద్దిగా ఎక్కువ కావడం వల్ల .  

నేను చదివిన - ఈ కొన్ని విషయాలు -పాఠకులతో  పంచుకోవాలనిపించింది. ఎందుకంటే -ఈ మార్పులు -మనకు తెలియకుండా , చాలా త్వరగా ,మన అందరి  శరీరాలలో వస్తున్నట్టు  స్పష్టంగా , పరిశోధనా పూర్వకంగా  తెలుస్తూ వుంది. దీనిని కొంతైనా  అరికట్ట వచ్చు - అని, నేను అనుకుంటున్నాను.  

మన శరీరాల్లో, మనస్సులో - జరుగుతున్న తీవ్రమైన మార్పులను - అరికట్టాలంటే , మగ వారు, ఆడ వారు అందరూ జరుగుతున్న మార్పులను, వాటి - కారణాలను అర్థం చేసుకుంటే -  కొంతైనా తగ్గించుకోవచ్చు.

వొక కాలంలో అనే వారు - మగవాడు చలికి భయపడ కూడదు. ఆడది, వేడికి భయపడకూడదు -అని. దాని వెనుక - యిటువంటి కారణాలు - ఏమైనా వున్నాయేమో! వుండినా  వుండొచ్చు . మనకు తెలీదు. 

ఇలాగే ఆడవారిలో కూడా - అనేక రకాలైన మార్పులు వస్తుండడం మనం గమనించ వచ్చు.- వాటికీ  ఎన్నో కారణాలు వుంటాయి. సాధారణ ప్రసవాలు చాలా, చాలా, తగ్గిపోతూ వుండడం చూస్తూనే ఉన్నాము. అదైనా వొకటి లేదా రెండు అని ప్రభుత్వం అనడం మానేసినా - యిప్పుడు చాలా మంది జంటలకు, వొక్క సంతానం  మాత్రమే వుండడం మనం చూస్తున్నాము.వీటికి మనం తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రమే  కారణం కాక పోవచ్చు. మనలో వస్తున్న అంతర్గత మార్పులు కూడా కారణం కావచ్చు. వీటిని గురించి మరో సారి మరింతగా చూద్దాం .

పశ్చిమ దేశాలలో చాలా ఎక్కువగా వస్తున్న గే-యిజం, లెస్బియన్-యిజం, లాంటి వాటికి కూడా - వారు స్వచ్చందంగా తీసుకునే నిర్ణయాల కంటే - శారీరక, మానసిక,జన్యు సంబంధ మార్పులే ఎక్కువ కారణం కావచ్చు. యివి యిప్పుడు, మన దేశంలో కూడా - ఎక్కువవుతున్నాయి.

మొత్తానికి - ఆరోగ్య కరమైన -  స్త్రీ పురుష సంబంధాలలో - పరస్పర  స్నేహము, సహానుభూతి ,ఆకర్షణ వుండాలి. ఎప్పుడూ తగవులాడే జంటలలో - నేనా,నువ్వా,అని ప్రతి దానికీ  పోటీ పడే వారి మధ్య-  ఈ  సమస్యలు  ఎక్కువవడం తప్పవు.

మారుతున్న కాలం - మనం పూర్తిగా ఆపలేం - కానీ ఎటు వైపు మన ప్రయాణం - అనేది తెలుసుకుంటే - -మనలో  ఆలోచన పెరుగుతుంది.  

అన్ని కారణాలూ - మనకు తెలియక పోయినా - తెలిసిన కారణాలు కొంత  తగ్గించుకుంటే - మంచిది  కదా .

మనకున్నది వొక్క జీవితం. అది అందంగా మలుచుకోవాలంటే - సంతోషంగా గడపాలంటే - నూరేళ్ళు నిండుగా  వుండాలంటే - ధర్మేచ అర్థేచ కామేచ అనే సూత్రం ప్రకారం  - స్త్రీ పురుషులిద్దరూ  - కలిసి - ఎలా ఉండాలో - ఎలా వుంటే -యిద్దరికీ మేలో -   తెలుసుకుంటే - మేలు కదా.



= మీ 

వుప్పలధడియం  విజయమోహన్ 




7, ఆగస్టు 2012, మంగళవారం

హిందూ మతంలోని లోటుపాట్లు, రుగ్మతలు = మనం ఏం చెయ్యాలి ?

హిందూ మతంలోని లోటుపాట్లు, రుగ్మతలు 


ఈ రోజు టీవీ 9 ఛానల్ లో స్వామీ పరిపూర్నానంద గారి ఆవేదన,దానికి విరుద్ధంగా కొంత, సపోర్ట్ గా కొంత,  రాజకీయ వాదులు మాట్లాడడం, వినడం జరిగింది. 

రాజకీయాలు ప్రక్కన బెడితే  - మనం చాలా సులభంగా చూడగలిగే విషయం -ప్రతి మతం లోనూ - ఈ రోజు కొన్ని రుగ్మతలు, కొన్ని లోటుపాట్లు చోటు చేసుకున్నాయన్న విషయం.

ఏదో హిందూ మతం లోనే అన్ని లోటుపాట్లు వున్నాయనుకోవడం-  ప్రపంచాన్ని , అందులో వివిధ దేశాల్లో జరుగుతున్న విషయాల్ని పూర్తిగా విస్మరించడమే అవుతుంది. ఈ రోజు ప్రపంచంలో - యుద్దాలు జరిగితే -    అది హిందూ మతం వలన మాత్రం కాదు. ఇండియా లో పుట్టిన ఏ మతం వలనా కాదు.

మొదటి ప్రపంచ యుద్ధం కానీ , రెండవ ప్రపంచ యుద్ధం గానీ - ఆ తరువాత - ఈ రోజు వరకు జరుగుతున్న అనేక యుద్ధాల్లో - పాల్గొంటున్న మతాల వారెవరు? మనం కాదు

వొక మతం వాళ్ళే తమలో తాము - మత ప్రాతిపదికపై -  కొట్టు కుంటున్న  దేశాలు ఎన్నో వున్నాయి. మా మతంలో - అంతా బాగుంది - ఎవరిపై విద్వేషం లేదు - ఏ రకమైన భేద భావాలు లేవు -    అని చెప్పడం - నిజానికి  చాలా దూరం.  

అయితే - యివి - మొదట - దేవుడే చెప్పాడా ప్రవక్త చెప్పాడా - ఆ తరువాత మతంలో చోటు చేసుకున్నాయా -అన్నది - వివాదాంశం . 

సరే. హిందూ మతంలో - రాముడు కానీ కృష్ణుడు కానీ - అట్టడుగు వాళ్ళకే ప్రాధాన్యత యిచ్చినట్టు - మనకు తేట తెల్లంగా తెలుస్తూనే వుంది.  

శంకరాచార్యుల వారు -అంటరానితనం పాటించ రాదని -    తననే వొక ఉదాహరణగా - తనకు మహా శివుడే  చెప్పినట్టు - గొంతెత్తి చెప్పారు.   

అప్పుడు కూడా - మనం మారక - పోతే - తప్పు మనదా ?  మతానిదా?  

హిందూయిజం - ఎన్నో రకాలుగా మొదటి నుండీ - మారుతున్న మతమే కానీ , మారని మతం కాదు. మొన్న మొన్న ద్వాపరయుగంలో కూడా -  శ్రీకృష్ణుడు - గీతోపదేశం చేసాడు. అది పాటిస్తున్నామా లేదా ?  

శంకరాచార్యుల వారు ఎన్నెన్ని చెప్పారు ? రామానుజుల వారు ఎన్నెన్ని చెప్పారు ? 

అందరిలో నిన్ను; నీలో  అందరినీ; చూడకపోతే - నీకు జ్ఞానం లేదనే నిర్దిష్టంగా  చెప్పారు.

అది వొక ప్రక్కన  వుండనియ్యండి. దాన్ని గురించి మరింత విశదంగా మరో సారి చూద్దాం.

యిప్పుడు ముఖ్యంగా - మనం చూసే లోటుపాట్లు కొన్ని చూద్దాం.

వొకటి ఆలయ ప్రవేశం.దేవుడి దగ్గర కు  వెళ్ళడానికి - ప్రతి  వొక్కరికీ హక్కు దేవుడే యిచ్చాడు . భక్త కన్నప్ప వెల్ల లేదా? తిన్నడు వెల్ల లేదా? శివుడు వద్దన్నాడా?

ఎక్కడైనా , హిందువులైన వారికి ఎవరికైనా - ఆలయ ప్రవేశం లేదంటే - అది సరి చేయడానికి - 66 సంవత్సరాలు అక్కర లేదు వొక్క రోజు  చాలు. కాకపోతే - నేను తాగేసి వెడతాను బూతులు మాట్లాడుతాను - అని అనే వారికి; దేవుడి విగ్రహం పై ఏ నమ్మకం లేని వారికి,  దేవుడి విగ్రహాలు పగుల గొట్టాలి - అనే వారికి - ఆలయ ప్రవేశం - మిగతా వారికి మంచిది కాదు.

సర్దార్ వల్లభాయి పటేల్ గారు చేసినట్టు - నమ్మకం వుండి, రావాలనుకున్న -వారినందిర్నీ- గుడి లోపలికి    పోలీసో  ,  మిలటరీనో - సహాయం తీసుకుని - తీసుకెళ్ళి పోవడమే.అంతే.  అన్ని కులాల్లో - సమానత్వం వుండాలన్న భావన         వున్న వారు చాలామంది వున్నారు. వారి సహాయమూ - తోడూ తీసుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడు మిగతా వారు మారడం చాలా సులభంగా జరిగి పోతుంది.     

ఎవడెవడు  వద్దని అంటాడో  - అడ్డు కుంటాడో -   వారిని ఆ గుడి నుండీ - వొక సంవత్సరం నాళ్ళు - బహిష్కరించండి. తప్పే లేదు. మరొకరి హక్కులకు  అడ్డం నిలిచే వాళ్లకు అలాంటి  శిక్ష తగినదే.  ఈ ఆలయ ప్రవేశం - అనే వొక సమస్య  - వొక్క రోజులో పరిష్కరించ వచ్చు .   

అలాగే - టీ అంగళ్లు ,హోటళ్ళలో -   వివక్షత వుంటే - ఆ హోటల్లు మూసేయండి . తప్పే లేదు. ఎవరి హక్కుకూ -ఎవరూ  అడ్డు నిలవడం సరి కాదు. కాకపోతే - శుభ్రత లాంటి విషయాలు - చూడాల్సిందే . ఏ కులం ఏ మతం వారైనా - తాగేసి రావడమో, శుభ్రత లేకుండా రావడమో, బూతులు, మాట్లా మో -  చెయ్య రాదు. యివి -  వొక్కరని కాదు - చాలా కులాల వారు చేస్తున్నారు . అగ్ర వర్ణాల / వర్గాల వాళ్ళు కూడా చేస్తున్నారు  .ఏ సమాజం లో నైనా - యివి పనికి రావు.  

మాట్లాడుతూ వుంటే - సమస్యలు పరిస్ద్ష్కారం కావు. శ్రీకృష్ణుడు ఎన్నో చేసాడు.శంకరాచార్యులు  చేసారు. రామానుజులూ చేసారు. మనం చెయ్యడం లేదు.వూరికే మాట్లాడుతూ ఉన్నాము.  

గోటి తో పోయేదానికి - గోరూ ఉపయోగించడం లేదు . గొడ్డలీ ఉపయోగించడం లేదు. అసలేమీ చెయ్యడం లేదు. సంవత్సరాల తరబడీ - వూరికే  మాట్లాడుతూ  ఉన్నాము. 

మతోద్దారకులూ, సమాజోద్దారుకులూ - అయిన హిందువులందరూ - రంగం లోకి దిగి - సమస్యను - పరిష్కరించండి. వొక్క రోజు కాకున్నా వొక-నెలలో - కనీసం - ఆంధ్ర ప్రదేశ్ లో - ఈ సమస్యలు రూపు మాపండి . అదే విధంగా - వారికి సహాయంగా -ప్రభుత్వం నిలవాలి . చట్ట పరంగా ప్రభుత్వం అందరి హక్కులనూ కాపాడాలి కదా.

యివన్నీ ఏదో విప్లవం లాగా చేయాల్సిన పనేం లేదు. చాలా శాంతి యుతంగా, చెయ్యగల పనే. సులభమైన పనే. చెయ్యాలి - తప్పదు.     

చేసి - అందరికీ మార్గ దర్శకులుగా నిలవండి.  


స ర్వే జనాః సుఖినో భవంతు .  

=మీ

ఉప్పల దడియం  విజయ మోహన్   
       

11, జూన్ 2012, సోమవారం

పాడుతా , తీయగా (ఫైనల్సు ) = యిక్కడి నుండి - మరెక్కడికి?= భారత దేశానికి మరో బాలు, మరో సుశీల - ఆంధ్ర దేశం నుండి రావాలంటే - ఏం చెయ్యాలి?

పాడుతా , తీయగా  (ఫైనల్సు )


కాశీ మజిలీ కథల్లో - వొక్కో మజిలీకి వొక్కో కథ వుంటుంది . ఆ కథ ఎంత  బాగున్నా- కథ తరువాత మరో మజిలీకి వెళ్ళక తప్పదు. 


జీవితమంతా అంతే . జీవితంలోని - ప్రతి భాగమూ అంతే .

ప్రతిదీ ధారా వాహికమే. ఎంత బాగున్నా - అది ఎక్కడో ముగియక తప్పదు.  

పాడుతా, తీయగా ధారా  వాహికంలో - ఈ రోజు  ఫైనల్సు  ముగిసింది.

ఎలా వుంది?

ఉగాది పచ్చడిలా వుంది.

పాటలు అద్భుతంగా వున్నాయి. నలుగురూ "చాలా, చాలా, చాలా, చాలా " బాగా పాడారు.

ఎవరికో వొకరికి ఈ ప్రైజులు  యివ్వక తప్పదు .

ఈ మార్కులు వేసే తతంగం అనివార్యం.వాటిని బట్టి ప్రైజులు యివ్వడమూ అనివార్యమే.

అయితే - ఆంధ్ర దేశంలో - యిప్పుడు ఈ నలుగురు పిల్లలూ - చాలా మందికి గొప్ప గాయకులుగా  పరిచయమయ్యారు. అది ముఖ్యం.

అంత కంటే ముఖ్యం - పాట , సంగీతం - అంటే - యిదీ - అని జన బాహుళ్యానికి - బాలు గారి ద్వారా - యింత నిశితంగా , నిర్దిష్టంగా తెలియరావడం.

హరిణి, తేజస్విని, రోహిత్, సాయి చరణ్ -నలుగురూ - వొకరికొకరు ఏ రకంగానూ - తీసి పోని వాళ్ళు. 

వొక్క రోజు రోహిత్ పాట వొకటి మహాద్భుతం అనిపిస్తే - రెండో రోజు తేజస్విని పాట  ఏదో వొకటి అలా అనిపిస్తుంది.  మరో రోజు హరిణి పాట , మరో రోజు సాయి చరణ్ పాట .

సంగీతం కూడా వొక స్థాయికి మించిన తరువాత - క్రికెట్  లాంటి గేము లాగా వుంటుంది. వొకరు ఎంత బాగా పాడినా- మరొకరు ఆరోజు వారి కంటే - బాగా పాడేస్తారు.

ఎంపిక చేసుకున్న పాట - దాన్ని ప్రాక్టీసు చేసుకున్న తీరు, వేదిక పైన ఆరోజున్న మనో భావన - అన్నీ పాడే విధానం పై తమ ప్రభావం చూపిస్తాయి. కాబట్టి, వొక మార్కు, రెండు మార్కులు తగ్గడమో, ఎక్కువ కావడమో - పెద్ద విషయం కాదు.

చివరి ఎపిసోడ్లకు - మోహన్ బాబు గారు రావడం మరింత రమ్యంగా వుంది. మోహన్ బాబు గారు కష్టమంటే - ఏమిటో తెలిసిన వారు. తాను  కష్ట పడి  సాధించిన వారు. తన విద్యాలయాల్లో - తన విద్యార్థులలో - వొక వున్నత స్థాయికై  పాటు పడుతున్న వారు. వారు రావడం చాలా బాగుంది. 

నవ్వండి. నవ్వుతూ వుండండి - నవ్వుతూ పాడండి - అని ఆయన పిల్లలకు చెప్పడం - నాకు బాగా నచ్చింది.  మనం నవ్వుతూ, చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ వుండడమే - నిజంగా సఫలీకృతమైన   జీవితం .జీవితంలో - విజయానికి వొకే మెట్టు చెప్పాలంటే - అది యిదే.

మోహన్ బాబు గారూ - మీరు పిల్లలకు, వారి ద్వారా అందరికీ  యిచ్చిన - యీ  అమూల్యమైన సలహాకు - మీకు చాలా ధన్య వాదాలు.

అలా నవ్వుతూ గడపాలంటే - ముఖ్యంగా- ఎవరినైనా సరే - క్షమించేసేయడం  చాలాముఖ్యం. మనల్ని కూడా. తప్పులు చేస్తాం. దాన్ని సరిదిద్దుకుంటూ - మనల్ని కూడా క్షమించేసుకుంటూ -ముందుకు వెళ్లిపోవాలి.

క్షమించ లేని వాడికి - జీవితం నరకంగా తయారవుతుంది. ఎందుకంటే - వాడినీ- ఎవరూ - క్షమించ లేరు గనుక. ఎంత  సేపట్లో క్షమించాలి? 5 నిమిషాలు చాలా ఎక్కువ. వొకటి రెండు నిముషాలలో - ఆ భావన  వొచ్చేయాలి. మళ్ళీ - మనం  నవ్వాలి.


ఈ నలుగురు పిల్లల ప్రజ్ఞా పాటవాల్ని - బాలు గారు - వొక గొప్ప స్థాయికి తీసుకొచ్చి - వాళ్ళను తెలుగు సంగీత ప్రపంచానికి  పరిచయం చేసి వదిలారు.వీరే కాదు. సెమి ఫైనల్సు లో పాడిన వారు కూడా బాగా పాడారు.

యిక్కడి నుండి - మరెక్కడికి?

అప్పుడే చెప్పినట్టు - ఈ ఫైనల్సు ఉగాది పచ్చడిలా  వుంది. అయ్యో అయిపోయిందే - అనుకుంటే - చేదుగా అనిపిస్తుంది.  ఎందుకు తేజస్వినికి  మొదటి ప్రైజు రాలేదు? ఎందుకు రోహిత్ కు రాలేదు? ఎందుకు సాయి చరణ్ కు రాలేదు ? అనుకుంటే - కొంచం  కారం అనిపించొచ్చు. కాని అందరూ హాయిగా, తీయగా పాడారు.

అందరూ - మనకు - మొదటి బహుమతే.  అలా అనుకుంటే - అది తియ్యగా వుంది.

సరే. మొదట చెప్పినట్టు - యిక్కడి నుండి - మరెక్కడికి?

భారత దేశానికి మరో బాలు, మరో సుశీల  - ఆంధ్ర దేశం నుండి రావాలంటే - ఏం చెయ్యాలి?

ఎన్నో చెయ్యాలి.  ఈ  గాయనీ గాయకులు - మరో నాలుగు భాషలను నేర్చేసుకోవాలి. ఆ  భాషల వాళ్ళ కంటే  బాగా!

ఏం. బాలూ గారూ, సుశీల గారూ నేర్చుకోలేదా?

ఆ భాషలలో - యింత కంటే - బాగా పాడ  గలగాలి. పాడ గలరు. మాకు తెలుసు. 

సరే. కర్నాటక సంగీతమూ, హిందుస్తానీ సంగీతమూ కూడా - బాగా నేర్చుకోవాలి - నేర్చుకో గలరు. మాకు తెలుసు.

నక్షత్రాలను అందుకోవాలని  ప్రయత్నిస్తే - చంద్రుడిని సులభంగా పట్టుకోగలము.

మీరు సంగీతాన్ని వొక యజ్ఞం లా - సాధన చెయ్యాలి.

వొక పెద్ద ఆడిటోరియం లో వేల మంది శ్రోతల ముందు పాడటం వొక ఎత్తు. యింట్లోనో, తోటలోనో   వొంటరిగా కూర్చుని సాధన  చేయడం మరో ఎత్తు.

ఆ సాధన లోనే - ఉన్నతమైన ఎత్తులకు ఎదగడం చాలా గొప్ప విషయం.

మనం విజయానికి ఎంత దగ్గరలో - ఉన్నామో - వొక్కొక్క సారి మనకు అర్థం కాదు. ఏదో - అందరిలా - కొంత ప్రయత్నం చేసి - వచ్చిన దానితో తృప్తి పడతాం.

దాన్ని  ఆంగ్లంలో  " కంఫర్ట్ జోన్ " లో వుండిపోవడం అంటారు. ఆ కంఫర్ట్  జోన్ దాటితే - అక్కడో అద్భుత ప్రపంచం వుంటుంది.  యింకా ఎన్నెన్ని చేయ గలమో - తెలుస్తుంది. 

అది దాటిన వారికి - వారి  చుట్టూ వున్న ప్రకృతి శక్తులు - ఎంతగానో - సహకరిస్తాయి. మరెన్నో విజయ శిఖరాల వైపు  తీసుకు వెడతాయి.

మరి  ఆ కంఫర్ట్ జోన్ ఎలా దాటుతారో  యోచన  చేయండి ?

అందరికీ -అభినందనలతో 

= మీ 

వుప్పలధడియం విజయమోహన్ 











4, జూన్ 2012, సోమవారం

రాజు గారి గుఱ్ఱం గాడిదయ్యిందట = గాంధీ గారు, నెహ్రూ గారు వోటు అడిగితే -మనం వోటు వెయ్యం = దేవుడిని నమ్మలేం = ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తాడో చెప్పలేం.


రాను రాను రాజు గారి గుఱ్ఱం  గాడిదయ్యిందట. ఇలాంటి మార్పులు - తప్పనిసరి.

 ప్రపంచం లో యేదీ శాశ్వతం కాదు. నిరంతరం కాదు. అన్నీ పుట్టేవే. అన్నీ పొయ్యేవే.

ప్రతి క్షణం, ప్రతిచోటా,  ప్రతి అణువు  లోనూ, ప్రతి జీవకణం  లోనూ,  జరిగే "మార్పు" మాత్రం తప్పనిసరి.

శాశ్వతమైనది  ఈ  ప్రపంచమంతటా  ఎల్లప్పుడూ , జరిగే  మార్పు వొక్కటే !
మార్పు లేనిదేదైనా వుందా - అంటే - వుందని  యోగులు, జ్ఞానులు  చెబుతారు.

అదేమిటి?.... అది నీవే?

కనిపించే , వినిపించే  నీవు కాదు. వాటికి అతీతమైన నీవు  మాత్రమే శాశ్వతం .
అది వొక్కటి పక్కన బెడితే - - మిగతా, వాటిన్నింటిలో - అంటే, కనిపించే , వినిపించే -అన్నింటిలోనూ మార్పు సహజం గా జరుగుతూ  వుంటుంది.
నిన్నటి మీరు - ఈ రోజు లేరు . ఈ రోజు మీరు-  రేపు మరో మీరుగా మారిపోతారు మీ భర్త(భార్య) కూడా అంతే  మీ పిల్లలూ అంతే. దేశమంతా అంతే. సర్వ సాక్షి అయిన సూర్యుడిలో  కూడా ఎన్నెన్నో మార్పులు  జరిగిపోతూ  వున్నాయి.

భూమిపైన  కూడా - సాక్షులు మారడం  సహజమే.
న్యాయవాదులలో  కూడా,  వొకరు - న్యాయం వైపు వాదిస్తే - మరొకరు (ఎవరో వొకరు) అన్యాయం వైపు  వాదించి తీరాలని  వొక  నియమం పెట్టేసుకున్నారు. ఎవరి ప్రక్క నిజంగా న్యాయం వుందో - వాదించే న్యాయ వాదులకిద్దరికీ  నిజంగా తెలీదా?  అయినా-  మా బాధ్యత  కనుక వాదిస్తున్నాం - అంటారు. అన్యాయం ప్రక్కన కూడా - ఎవరో వొకరు వాదించాలనేది - కలియుగ న్యాయం.అలా లేక పోతే న్యాయం జరుగదని మన  వాదన.

మరి వాదించే వారు, గెలవడానికని వాదిస్తారా? వోడడానికనా?   గెలవడానికేగా? అప్పుడు, న్యాయ వాదులలో  ఎవరో వొకరు గెలుస్తారు? సరే. న్యాయం గెలుస్తుందా ?

అలాంటి దైన మన వ్యవస్థలో - గెలిచేదంతా   న్యాయమేనా?
న్యాయ వాదుల సంగతి  పక్కన వుంచితే - న్యాయ మూర్తులు ఎలా వుండాలి?

 అలనాటి పట్టాభి రాముడిలా వుండాలి. న్యాయమంటే రాముడు. ధర్మమంటే - పటాభిరాముడు. 

రాముడిని చూసి తెలుసుకోవాలి  న్యాయమేమిటో ; ధర్మమేమిటో.

అలాంటి పట్టాభి రాముడేగాలి కా వాటంగా తెరచాప ఎత్తితే, న్యాయము  గాలి వాటం కాదా?

అదెలా న్యాయమవుతుంది?

సరే. న్యాయమూర్తి పట్టాభిరామారావు గారిని - కొన్నారని అభియోగం.   అందుకే  ఆయన లో - గాలి గారి పైన చాలా ప్రేమ పుట్టుకొచ్చింది -అనడానికి - సి.బీ.ఐ. వారికి  - వారి వారి బ్యాంకు అకౌంట్ లలో - చాలా చాలా - ఆధారాలు కనిపించాయి.

రౌడీ  కొడితే - పోలీసు వాడి దగ్గరికి వెళ్ళొచ్చు. పోలీసు వాడు కొడితే - న్యాయ స్థానానికి వెళ్ళొచ్చు. న్యాయ మూర్తి కొడితే?

గాలి గారికి, జగన్ గారికి - మధ్య చాలా, సన్నిహిత , ఆర్ధిక సంబంధాలు కనిపించాయి.

జగమే - మాయలా వుంది .

పోయినోళ్ళు -అందరూ మంచి వారే అయితే - ఎంత బాగుండేది. వున్న వాళ్ళు  కూడా కాస్త బాగుండే వారు.

-కానీ  వున్న వాళ్ళ సంగతి లోడితే - పోయిన వాళ్ళ కంపు బయట కొస్తున్నది.

వున్న వాళ్ళు - అంటే మీరూ నేనూ కాదు.

బాగా వున్న వాళ్ళు . కొన్ని వేల ఎకరాల భూమి వున్న వాళ్ళు ;లేదా, రాసివ్వ గలిగిన వాళ్ళు. మీకు లేక పోతే ఎలా రాసిస్తారు?  కొందరు రాసివ్వొచ్చు.

ప్రభుత్వమంటే ఎవరిది? మీది. మరి ప్రభుత్వ భూమి మీరు రాసిస్తే చెల్లదా ? చెల్లుతుంది. అలా రాసిచ్చినప్పుడు - వాళ్ళేదో, కానుకలిస్తారాయె. అది మన దేశంలో ఆనవాయితీ కదా. 

కట్నాలూ, కానుకలూ  మేం పుచ్చుకోం. కానీ  మీ  అమ్మాయికి, మీరు వొక కారు, బంగాళా, కోటి రూపాయల నగలూ  -లాంటివి - లేకుండా పంపించడం బాగుండదు కదా -అలాగే చెయ్యండి మరి. మాకేం అభ్యంతరం లేదు.

యిలా చెప్పడం - మర్యాద.

అలాగే, పరిశ్రమలకు మేం భూములిస్తాం. మీరు నాకుగా ఏమీ యివ్వ వలసిన పని లేదు. నా కొడుకు వృద్ధిలోకి రావలసిన వాడంటారా? అది మీ అభిప్రాయం; మీ యిష్టమండి.  నాకు సంబంధం లేదు.

యిదొక మర్యాద.

యిప్పుడే - ఏ.రాజా  గారు  - బయలులో-బెయిలుతో,  స్వేచ్చా వాయువులు పీల్చుకుంటున్నారు. గాలి గారు కూడా - పట్టాభి రాముల కృప వలన  స్వేచ్చా వాయువులు పీల్చుకుంటున్నారు.

కానీ ఏ సహాయమూ - గాలి గారు వూరికే తీసుకోరు. తగిన ప్రతిఫలం యిచ్చేస్తారు. వారివ్వక పోతే వారి వారెవరో యిచ్చేస్తారు. అది న్యాయం. న్యాయ మూర్తికైనా సరే . 

గాలి గారి యీ న్యాయం వలన - యిప్పుడు, ఆయనా , న్యాయమూర్తి  గారూ కలిసి  లోపల వుండే ప్రమాదం వచ్చి పడింది .

యిలా - గాలి గారూ - వారికి సంబంధించిన  వారందరూ - వొక్క చోట వుంటే -  అదొక గొప్ప న్యాయం. అది లోపలైనా సరే.  ఏదైనా కొన్నాళ్ళే .ఎన్నాళ్ళని జైలులో పెడతారు?

ఏ.రాజా గారు - లోపల వున్నప్పుడు -ఏదో ఆటలంతా అడే వారట. టెన్నిస్ లాంటివి. కనిమొళి గారు కూడా కొన్నాళ్ళు లోపల వున్నారు. అంతా బాగుందనుకుంటుంటే - మళ్ళీ బెయిలు. యిప్పుడు - ఆడటానికి మిత్రులు ఎవరూ లేరు. నిజమే. బయట, నిజమైన మిత్రులు దొరకడం కష్టం. 

యివన్నీ పత్రికలలో చదువుతున్నాం.కానీ - యిందులో - నిజమెంతో మనం చూసొచ్చామా?  ఈ విషయాలలో - పూర్తి న్యాయమెంతో -తెలియడానికి యిరవై ఏళ్ళు  పట్టొచ్చు.  భారత దేశం కదా.

వీటన్నిటికీ, సాక్షులు  వున్నారా? మన న్యాయ వ్యవస్థ అంతా - సాక్షులపై  ఆధారపడి వుంది కదా. వారు దినదినమూ, గాలి వాటానికి  మారుతూ వుంటారు కదా.  కాబట్టి, అసలు సిసలైన న్యాయం ఏమిటో తెలియడానికి - ఎన్నో యుగాలు పట్టొచ్చు .

అయితే - ఈ కేసులలో - నిజమైన - అన్నీ  తెలిసిన - " సాక్షి"  ఎవరు?

సాక్షుల కోసం వెదకడం - మన పని కాదు. అది ఘనత వహించిన న్యాయ వాదుల పని. హేమాహేమీలున్నారు.

జగన్ గారు తలుచుకుంటే - చిన్న కోర్టు కైనా- అమెరికా లాయర్లైనా వచ్చేస్తారు. వారిపై ఆ లాయర్లకు - అంత ప్రేమ.

వీళ్ళందరూ - ఎప్పుడో ఆత్మ కథలు రాసేస్తారు. జైలు కెళ్ళిన వారందరూ - రాసేస్తున్నారు. గాంధీ గారితో - మొదలయింది ఈ పద్ధతి. యివి రాసేటప్పుడు - వీళ్ళంతా మళ్ళీ, మినిస్టర్లు , చీఫ్ మినిస్టర్లు లాంటి  పదవులలో వుండే ఛాన్సు  వుండనే  వుంది. మనం వుండే వరకు వారికి డోకా లేదు గాక లేదు .


పొరుగు రాష్ట్రం కేరళలో - మణి అన్న వొక గొప్ప పార్టీ నాయకుడు - ఏదో గొప్పలు చెప్పుకున్నాడు . మా  - ప్రత్యర్థుల నెవరినైనా లేపేసే ఆనవాయితీ మాకు వుంది -అన్నారు. మరి, ఎంత మందిని యిప్పటి వరకు లేపేసారో - యిప్పుడు తెలుసుకోవాలి. యిదీ, కేరళ ప్రభుత్వం వారి తలనొప్పి యిప్పుడు.

కేరళలో - మర్డర్ చేయబడిన వారి లిస్టు తీసుకోవాలి. అందులో - పాలిటిక్స్ లో వున్న వాళ్ళ   లిస్టు తీసుకోవాలి. ఆ కేసులన్నీ తిరగదోడాలి. యివన్నీ యిక 20 ఏళ్ళు అందరికీ పూర్తి పని.

బెంగాల్  లో మమతా గారి వ్యవహారం మరో రకం. కనిపించిన వాళ్ళంతా - నక్స లైట్లు  గానో, సి.పీ .యం . వారి లాగానో కనిపిస్తున్నారు ఆమెకు.


వొక చీఫ్ మినిస్టర్  గారు సామాన్య ప్రజలలో - యింత సులభంగా నక్స లైట్లను కనిబెట్ట గలగడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

బెంగాల్ లో  వున్న వారు  పెనం మీద నుండి, పొయ్యిలోకి దూకినంత సంతోషంగా వుండొచ్చు. ముందు చెప్పినట్టు - మార్పు  తప్పదు . ఇలాంటి మార్పు వారుగా వోటు వేసి తెచ్చుకున్నారు. మరి, వేరే ఎవరికి వోటు వెయ్యగలం? వుండేది - పొయ్యి, పెనం రెండే . నిజమే. పాలిటిక్స్ లో  ఆరోగ్యకరమైన మార్పు రావాలంటే - చాలా కష్టం.

యూ.పీ. లో మాయావతి  గారు వెళ్ళారు ములాయం గారు మళ్ళీ వచ్చారు.కొడుకును గద్దె ఎక్కించారు. అఖిలేష్ గారు  -మాయావతి గారిని - వీధుల్లోనూ, అసెంబ్లీ లోను కూడా ఎదుర్కొన గలరు. కానీ - మాయావతి గారు చాలా ముందు జాగ్రత్త మనిషి. ఆస్తిపాస్తులతో బాటు - తన శిలావిగ్రహాలు కూడా - రాష్ట్రమంతా తానే  పెట్టించేసారట. మళ్ళీ -దళిత  (అంటే, తన ) విగ్రహాలను ఎవరైనా తాకితే - ఖబడ్దార్ , అని సవాల్ కూడా చేసేసారు.యిప్పుడు అఖిలేష్ గారు ఏం చేస్తారో తెలీదు. వో  పని చెయ్యొచ్చు. ములాయం గారి విగ్రహాలను, తన విగ్రహాలను కూడా - మాయావతి  గారి విగ్రహాల ప్రక్కనే పెట్టేసేయ్యచ్చు. యింకా కావాలంటే వూరిలోని  యం.యల్.ఏ ల విగ్రహాలను కూడా పెట్టచ్చు. యూ.పీ. అంతటా - అందమైన శిలా విగ్రహాలు పెట్టిన కీర్తి మాయావతి గారితో  బాటు వీరిద్దరికీ దక్కుతుంది.

అన్ని రాష్ట్రాల గాధలూ యిలాగే  వున్నాయి. మనం వీళ్ళ నెవ్వరినీ తిట్టడం లేదు.తప్పు బట్టడం లేదు. వీరు వొక ప్రవాహంలో  కొట్టుకు పోతున్నారు. అంతే.  అధికారం, ధనం - ఈ రెండింటి కోసం తపన. యిదీ ఆ ప్రవాహం.

వొకప్పుడు - పదవికోసం పోటీ లేదు. సేవ చేయడానికి పోటీ వుండేది. పదవంటే  -  ప్రజలకు సేవ -అనే వారు. యిప్పుడూ ఆ మాట 5 సంవత్సరాలకొక సారి చెప్పాలి; చెబుతారు. ఆ తరువాత - అది వేరే లోకం.

యిప్పుడు - గాంధీ గారి విగ్రహాలు, నెహ్రూ గారి విగ్రహాలు ఎక్కడా కనిపించడం లేదు. కాబట్టి - ఈ రోజు గాంధీ గారు వచ్చి వోటు అడిగితే -మనం వోటు వెయ్యం.

ఆయన - భారత ప్రజలలో - ఎవ్వరికీ విరోధిగా, కఠోరంగా మాట్లాడరు. ప్రజలను, జాతి, మత ప్రాంత, భాషా బేధాలతో విడదీయరు. అలా విడదీసి మాట్లాడే వారే - మనకు ఈ రోజు నచ్చుతారు. కాబట్టి గాంధీ గారు వోటడిగితే - రైట్ టు రిజెక్ట్  క్రింద ఆయనకు వొక్క వోటు కూడా పడదు.

అలాగే, నెహ్రూ గారు కూడా. ఆయనా అంతే. ఆయన ప్రసంగాలలో కూడా - ఉప్పూ కారం  గానీ, కారాలూ , మిరియాలూ కానీ వుండదు.అరె. అసలు, మన విరోధి ఎవడో చెప్పడు. వాడిపై పోరాటం చెయ్యాలన్న మాట అస్సలు లేదు.

దేశమంతా వొక్కటే - అంటాడు. యింకాస్సేపు మాట్లాడితే - ప్రపంచ ప్రజలంతా - వొక్కటవ్వాలంటాడు. అప్పుడప్పుడూ జై హింద్ అంటాడు.ప్రసంగం కడపట, జనగణమన పాడాలంటాడు.

మనం వేసే వోట్లన్నీ - విరోధి పై అసహ్యంతో, కోపంతో, భయంతో  వేసే వోట్లే కదా. అసలు విరోధి ఎవరో చెప్పక పోతే ఎలా? అదీ కాకపోతే - మన కులం వాడనో, మతం వాడనో, సారా బాటిల్ యిచ్చాడనో, మరేదో  యిచ్చాడనో -  వోటు వెయ్యచ్చు.

 నెహ్రు గారికీ, గాంధీ గారికీ - ఇవేవీ కూడా లేదు. మరెలా వోటు వెయ్యడం?

రాజకీయాల్లో - రాజు గారి గుర్రం కాల క్రమంలో - కంచర గాడిదగా - తయారయ్యింది.


ఎండలు మండిపోతున్నాయ్. సంవత్సరానికి రెండు డిగ్రీలు పెరుగుతూ వుంది. రేపు చెట్లు పెడితే మేలేమో - అన్న ఆలోచన మనకు వచ్చినా రావచ్చు. జగన్ గారికీ, కిరణ్ గారికీ,బాబు గారికీ రాక పోవచ్చు. వారి గోల వారిది.

రాయల సీమలో - చాలా మందికి , నీళ్ళ టాంకుల్లో అప్పుడప్పుడూ - వచ్చే నీళ్ళు ఎక్కడినుండి వస్తూ వుందో  తెలీదు. వొక వేళ  అవి రేపటి నుండీ రాక పోతే ఏమవుతుందో తెలీదు. రేపటిని గురించి అనుకునే నాథుడే లేదు. అది ఈ రోజు.

కానీ మార్పు సహజం. కంచర గాడిద మళ్ళీ గుర్రంగా మారినా మారొచ్చు.రేపు ఏమైనా జరగవచ్చు. 

రాజకీయ వాదుల్ని నమ్మొచ్చు. వాళ్ళు ఎప్పటి లాగే - తమ తమ ఆస్తుల్ని ,పదవుల్ని సర్దుకుంటూ వుంటారు.

కానీ దేవుడిని నమ్మలేం. ఆయన ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తాడో చెప్పలేం.

సిరికిం  జెప్పడు..అంటూ..బయలుదేరి..ఎక్కడికక్కడ వొక తుఫాను కురిపించినా - ఆశ్చర్యం లేదు.

దేవుడిని నమ్మండి. మంచే జరుగుతుంది.

మళ్ళీ - మా దేవుడిని మాత్రమే  నమ్మండి అంటారా? కంచర గాడిద వంకర గాడిదగా తయారవుతుంది.


=మీ

వుప్పలధడియం విజయమోహన్






28, మే 2012, సోమవారం

మనం మారితే - పాలకుల్లో - మార్పు వస్తుంది. కానీ- మనం మారే ఛాన్సు, ఎంత వుందంటారు ? - జగన్ గారి కేసు ఏమవుతుందో ఎవరికి తెలుసు?


కర్నాటక లో గాలి జనార్దన రెడ్డి గారు అరెస్ట్  అయినప్పుడు - వారికీ, ఆంధ్ర లో జగన్ మోహన్   రెడ్డి గారికి వున్న సంబంధాల గురించి  దుమారం రేగింది. అబ్బే.మాకస్సలు అలాంటి సంబంధమేమీ లేదు గాక, లేదని, వీరు కొట్టి పారేసారు.

గాలి గురించి అంతా తెలిసినా - అక్కడి ప్రభుత్వం వారు - వారిని బాగా వెనకేసుకు వచ్చారు. ఆఖరికి సుప్రీం  కోర్టు వారు కన్నెర్ర చేస్తే - వారిపై చట్టం ముందుకు కదిలింది.

మరి ఆంధ్ర ప్రదేష్  రాష్ట్రం వారు జగన్ పై  ఎలాంటి చర్య తీసుకోవడానికీ - ముందుకు రాలేక పోయ్యారు -వారి ఆస్తుల విషయం కర్ణాకర్ణిగా- రాష్ట్రమంతా కొంత తెలుసు. పక్క రాష్ట్రంలో వారికి కూడా తెలుసు. అయినా -  తనకు తానుగా, రాష్ట్రం ముందుకు కదల లేదు.

వారికి తెలుసు - తీగ కదిపితే - డొంకంతా కదులుతుందని.

కాని- కేసు సుప్రీం కు వెళ్లిందంటే - ఏదో కొంత ముందుకు వెళ్ళక తప్పదు. అదే జరిగిందిప్పుడు.

కేసు సి.బీ.ఐ కి వెళ్ళడము ,  సి.బీ.ఐ  వారికి  కొంత  ఆధారాలు  దొరకడము,  ముందుకు  వెళ్ళే  కొద్ది,  మరిన్ని  ఆధారాలు  దొరకడము, యివి జరిగిన తరువాత,  కేసు తప్పక కోర్టుకు వెళ్ళుతుందనడంలో - సందేహం    లేక పోయింది.

కానీ - వారి పార్టీలో, వారి వెనుకే వున్న వారికి, యిదేదో గొప్ప అవకాశం  లభించినట్టుగా -అంటే , జగన్ గారికి, తమ పూర్తి లాయల్టీ  - మద్దతు - తెలపడానికి - వొక మహదావకాశం  గా మురిసిపోయేటట్టు  కనిపిస్తుంది.

దీని వెనుక  పెద్ద రాజకీయ కుట్ర  వున్నట్టు - జగన్ గారు తప్పక బయటకు వస్తారు, గెలుస్తారు, సి.యం  అవుతారు - అన్నంత  ధీమా తో మాట్లాడుతున్నారు. అయితే - ఈ అక్రమాస్తుల విషయం గురించి వారు మాట్లాడరు. జగన్ గారు త్వరగా బయటకు రావాలి, సి.యం  కావాలి - తాము మరేదో కావాలి - ఈ  ఆరాటం  మనకు  బాగా  కనిపిస్తుంది.

మిగతా పార్టీలు - వారి వారి సమస్యలలో - వారున్నారు -కాంగ్రెసుతో సహా.

కిరణ్ కుమార్ రెడ్డి గారు - జగన్ గారి విషయంలో నిర్దోషి . పాపం - ఆయన ఏమీ చెయ్యలేదు. చెయ్యాల్సిన పనులు ఎన్నో వున్నా - అవేవీ ఆయన చెయ్య లేదు. ఆయనను ఈ విషయంలో - పొగడడమో, తిట్టడమో, రెండూ - అనుచితమే.

బాబు గారు కూడా అంతే. వొక ప్రతి పక్ష నాయకుడిగా - ఈ విషయంలో - ఆయన ఏమీ చెయ్యలేక పొయ్యారు. వారిని కూడా - ఈ విషయంలో - పొగడడమో, తిట్టడమో, రెండూ - అనుచితమే.

కే.సి.ఆర్.  గారు - తిట్ట గలరు ఎవరినైనా. ఆయనకు పొగడడం అస్సలు రాదు. తమ పార్టీ వారినైనా. 

కనీసం తెలంగాణా లోనైనా - ఏ వొక్కరినైనా - ఆయన పొగడగా మీరెవరైనా విన్నారా? జగన్ ను ఆయన తిట్టి వుండే వుండొచ్చు - ఎప్పుడైనా.  తెలంగాణా వచ్చేసినా - వారి పధ్ధతి  వారిది గానే వుంటుంది.

కానీ - జగన్ గారి ప్రస్తుత పరిస్తితికి  ఆయన కారణం కానే కాదు. ఆయన తిట్టుకు అంత శక్తి  లేదు.  శ్రీకృష్ణుడే అన్నాడు - ఎప్పుడూ అలగని వాడు, తిట్టని వాడు, అలిగితే,తిడితే, అది ప్రమాదం; కానీ, ఎప్పుడూ అలిగే వాడు, తిట్టే వాడు, అలిగితే, తిడితే - ఏం భయపడాల్సిన పని లేదు.

కాబట్టి,  జగన్ గారి విషయంలో - అదంతా కారణం  ఏమీ కాదు.  

కాగల కార్యం గంధర్వులు (సి.బీ.ఐ) చేస్తున్నారు. అంతే. ఏం జరగబోతోందో - పై వాడికి  (ఘనత  వహించిన కోర్టు వారికి)  మాత్రమే  తెలుసు. అదీ యిప్పుడు కాదు. ఎప్పుడో తెలుస్తుంది  వారికి ! 

కాకపోతే - వొక్క విషయం మాత్రం సందేహం గా వుంది. కొంత  మంది విద్యార్థులు (నేను కూడా చేసాను అలాంటివి ) పరీక్షల్లో  కూర్చుంటే - అరవై మార్కులు వచ్చే వరకు రాసామనుకుంటే -  యిక చాలు, పదండి పోదాం క్రికెట్ చూడ్డానికి - అను పేపర్ యిచ్చేసి, వెళ్లి పోతారు.  

కొన్ని కొన్ని కేసులలో - సి.బీ.ఐ - అలా, అల్ప సంతోషంతో పొంగి పోతోందో -అని అనిపిస్తోంది. చేసింది చాలు. కనిపెట్టింది చాలు -యిక పోదాం మరో కేసుకు -అని - అలా మీకేమైనా అనిపిస్తోందా ? 

యిప్పుడు దేశమంతా  - మిమ్మల్నే నమ్ముకుంది, దేశంలోని, ప్రతి రాష్ట్రం లోని ప్రతి కేసుకూ. మీరు తప్ప మరొకరు ఇవేవీ చెయ్య లేరు. -అని చెప్పాలనిపిస్తుంది.

అది సరే. మళ్ళీ జగన్ కేసు విషయానికి వద్దాం. మీకు జరిగేవన్నీ , మీకు జరగవలసినవే కానీ - మీకు జరగ కూడనివి కాదు - అంటుంది గీత. 

రేపు ఆయన బయటకు వచ్చి సి.యం  అయినా అంతే . లేక ,  శిక్ష తప్పించుకోలేక పోయినా అంతే .

ఎన్ని కుల రాజకీయాలు , మత రాజకీయాలు నడిపినా - ప్రతి దానికి - వొక మూల్యం వుంటుంది. జగన్ కూ  అంతే . ఎవరికైనా అంతే . ప్రజలకూ అంతే . 

మన కులం వాడికి వోటు వేద్దాం ; మన మతం వాడికి వేద్దాం అని ప్రజలు అనుకుంటే - అందుకు , రాష్ట్రమంతా - తగిన మూల్యం చెల్లించక తప్పదు .

యిప్పుడే - రాష్ట్రంలోని, ఎన్నో వూర్లలో, ఎన్నో జిల్లాల్లో, కనీసం "మంచి" నీటి సౌకర్యం లేదు. అసలు నీటి సౌకర్యమే లేని వూళ్ళు చాలా వున్నాయి. విద్యుత్తు  కొరత ఎప్పుడూ వుంది. ఉద్యోగావకాశాలు మన రాష్ట్రంలో చాలా తక్కువ. మన రాష్ట్రంలో పుష్కలం గా దొరికేది - మన కొంప ముంచే మద్యం వొక్కటే.

65 ఏళ్ళుగా - మన - కులం వాళ్లకు వోటు వేసి   మనం సాధించింది యిదే.

ఈ కుల,  మత ప్రాతి పదికలు  పక్కన పెట్టి -  ఏ జయప్రకాష్ నారాయణ్ లాంటి వారికో - వొక్క సారి - మూకుమ్మడిగా వోటు వేసి చూడండి. అయిదు సంవత్సరాలు - ఈ కుల రాజకీయాల వాళ్ళు, మత రాజకీయాల వాళ్ళు - చెప్పే మాటలు పక్కన పెట్టి - ఇప్పుడున్నంత తెలివితోనే - వొక్క సారి - వారికి, మద్దతు యిచ్చి చూడండి.

మనకు పోయేదేమీ లేదు. మరి ఎన్నికలు లేవుగా - అంటారేమో. ఏదో వొకటి వస్తూనే వుంది. అందులో చూపండి మీ విజ్ఞత .

ఈ మధ్యలో  జగన్ గారు ,ఆయన ఆస్తులు, కేసులు, వొక కొలిక్కి రావచ్చు. ఆయన కూడా బాగా మారొచ్చు.

బాబు గారు,  కే.సి.ఆర్. గారు, చిరంజీవి గారు,ఏదేదో ప్రణాళికలు వెయ్యొచ్చు.తమ తమ రాజకీయాల  ధోరణి మార్చుకోవచ్చు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎన్నెన్నో చెయ్యొచ్చు. యిప్పట్లో - ఆయనకు రాజకీయాలు అంతు  బట్టడం లేదు కాబట్టి - కొన్ని నిజమైన ప్రజోపయోగ కార్యాలు చేసినా చెయ్యొచ్చు.

తెలంగాణా వొక వేళ  వస్తే - తమ పాలకుల ధోరణికి, తెలంగాణా ప్రజల మొహం మొత్తచ్చు. ఏ జాతి చరిత్ర చూసినా - ఏమున్నది గర్వ కారణం -అని తెలిసి పోవచ్చు.

మనం మారితే - పాలకుల్లో - ఎన్నో మార్పులు వస్తుంది..... కానీ..... మనం మారే ఛాన్సు, ఎంత వుందంటారు ?


=మీ 

వుప్పలధడియం విజయమోహన్