21, ఫిబ్రవరి 2013, గురువారం

వేమన ఏమన్నాడు? = మనం బాగు పడాలంటే = ఈ చిన్ని వ్రతం ( వొక వారం రోజుల పాటు) చేద్దామా ?



జ్ఞాని వేమన ఏమన్నాడు?

తప్పులెన్ను వారు తండోపతండంబు  
లుర్వి జనులకెల్ల నుండు తప్పు 
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు 
విశ్వ దాభిరామ వినుర వేమ !

వేమన తెలుగు వారి కొక మకుటం లాగా, గుర్తింపు  తెచ్చాడు.

ఆయన గురువులకందరికీ  గురువు. ఏ గురువు గారైనా మనకు జీవితం  గురించి  విడమరిచి చెప్పాలంటే ,  వేమన పద్యాలు వివరించి చెబితే చాలు. జీవిత సారాంశం  చాలా వరకు అర్థమై పోతుంది. 

ఈ పద్యాలు నేను ఎప్పుడో, నాలుగేళ్ల వయసులో , మా అమ్మమ్మ గారు నేర్పిస్తే నేర్చుకున్నవి.    అరవై మూడేళ్ళ వయసులో - యిప్పటికీ చాలా వరకు జ్ఞాపకం  వున్నాయి.

మచ్చుకు వొక పద్యం యిక్కడ ఉదాహరించాను.

ఈ నాలుగు చిన్ని చిన్ని వాక్యాలలో - ఎంత అర్థం వుందో - చూడండి.

తప్పులెన్నువారు    తండోపతండంబులు - నిజమే కదా.

ఎక్కడి కెళ్ళినా - యిది మనం చూస్తూనే వున్నాము. ప్రపంచంలో  అందరి తప్పులూ మనకు తెలుసు. అందరినీ విమర్శిస్తాం . మనలాగే మన పక్క వారూ. వారి పక్క వారూ - మనమందరూ అంతే.  విమర్శించడం మన జన్మ హక్కు . పోనీ. మనం విమర్శించే  తప్పు  - కనీసం మనం చెయ్యకుండా వున్నామా?  వూ. అదీలేదు. ఆ తప్పు మనం చేస్తూనే, మరొకరిని విమర్శిస్తూ వుంటాం. అందుకనే వేమన అన్నారు -    తప్పులెన్నువారు    తండోపతండంబులు. నిజమే కదా!

సరే . రెండో వాక్యం చూడండి.      "ఉర్వి జనుల కెల్ల వుండు తప్పు"

తప్పులే చెయ్యని వాడు ప్రపంచంలో పుట్ట లేదు. దేవతలు కూడా తప్పులు చేస్తారు వొక్కో సారి.

దానికి తగిన ఫలితమూ అనుభవిస్తారు. పార్వతీ దేవి మగనికి అవమానం జరిగే యజ్ఞానికి వెళ్లి - తను కూడా అవమానం పాలైంది కదా. మహా యోగి శివుడు కూడా - యివ్వ తగని వరాలు యిచ్చి కస్టాలు అనుభవించాడు కదా. యివి కథలు కావచ్చు. కానీ మన కోసం చెప్ప బడ్డ  జీవిత సూత్రాలు.

 మరి మూడో వాక్యం చూద్దాం : " తప్పులెన్నువారు తమతప్పులెరుగరు "

యిది చాలా ముఖ్యమైనది. చుట్టూ వున్న వారి తప్పులే, చూసే వారికి - తమ తప్పులు అసలు తెలీవు.

నాలుగో వాక్యం అంత కంటే ముఖ్యం - "వినుర వేమా!"

యివన్నీ - ఆయన తనకోసమే చెప్పుకుంటున్నట్టు రాశాడు. అంటే, వేమన గారు - మనిషికి , ఈ విషయాల్లో,  అంతర్మథనం - చాలా ముఖ్యమైనట్టు చెబుతున్నారు.

ఎవరో చేసే తప్పులు వేలెత్తి చూపుతాం. అదే తప్పు మనమూ చేస్తున్నట్టు గుర్తించం.

సరే. మనం చెప్పాం. వారు మారొచ్చు; మారక పోవచ్చు .

మారితే వారు బాగుపడ్డారు.  మంచిదే. కానీ, మనమెప్పుడు బాగు పడేది?  మనం ఎవరు చెబితే వింటాం? "తప్పులెన్నువారు" మిగతా వారి మాటలు వినరు గాక వినరు. తమ తప్పులు చూడరు గాక చూడరు.

"నాలో తప్పులే లేవు" అనే వాడంత మూర్ఖుడు మరొకడు లేడు.   మనందరిలో తప్పులున్నాయి. వాటిని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ప్రతి నిమిషం వుంది. ప్రతి రోజూ పడుకునే ముందు మనం చేసిన తప్పులు ఏమిటి అని చూసుకుని, వాటిని రేపెలా సరిదిద్దు కుంటామో  ప్రణాళిక  వేసుకొవాలి.  దానికి దైవ సహాయం అడగాలి. అదే ప్రార్థన.

మీకు తెలిసే వుంటుంది - మన పూజల్లో - యిది వొక ముఖ్య భాగం.  నేను తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు -వాటిని మనం పాపాలు అని అంటాం - వాటిని క్షమించు . మళ్ళీ వాటిని చెయ్యకుండా కాపాడు -అని ప్రార్థిస్తామ్. దేవుడు ఎక్కడో లెదు. మన లోపలే వున్నాడు. బయటా వున్నాడు. ప్రార్థన రెండింటికీ అందుతుంది.

మన పూజలలో, ప్రార్థనలో - పక్క వాడి తప్పుల గురించి లేదు. వాడి పాపాల గురించి లేదు. మన తప్పులు, మన పాపాల గురించే వుంది.

పక్క వాడి గురించి మాట్లాడ్డం - మన అలవాటు. అంతే.

సరే . మరెవ్వరి గురించీ - మనం మాట్లాడనే కూడదా ?

మాట్లాడొచ్చు .  మొదట - వారి తప్పులు, మనలో  లేకుండా చూసుకోవాలి.  తరువాత - వారికి, మనం చెప్ప దగిన వాళ్ళమా, మనం చెబితే వారు వినే పరిస్థితిలో వున్నారా - అనేది కూడా చూడాలి.

సంస్కృతంలో వొక సూక్తి వుంది. "సత్యం బ్రూయాత్; ప్రియం బ్రూయాత్; న బ్రూయాత్ సత్యమప్రియం".

సత్యం మాత్రమే చెప్పాలి. కాని, అది ప్రియంగా వుండేటట్టు చెప్పాలి . అలా మంచి మాటను మంచిగా చెప్పలేని వారు - చెప్పకుండా వుండడమే మంచిది.

కొంత మంది అంటూ వుంటారు - నాకు కర్ర విరిచినట్టు మాట్లాడడమే అలవాటు అని. అదేదో  గొప్ప అయినట్టు చెబుతూ వుంటారు. వారు, అసలు మాట్లాడడమే తెలీని వారు - అన్న విషయం వారికి తెలీదు.  అంటే - మనం తెలుసుకోవాల్సిన విషయం - మనం అలా వుండకూడదని.

సరే . నాయకుల విషయంలో - వారి తప్పులు వారికి చెప్పాల్సిన అవసరం తప్పకుండా వుంది. అదే - ప్రజాస్వామ్యం.

శ్రీ రాముడు - గూఢ చారుల వద్ద ముఖ్యంగా అడిగేది యిదే.

నా పాలనలో వున్న తప్పుల గురించి ప్రజలేం మాట్లాడుతున్నారు - అని.   శ్రీ రాముడి పాలనలో - ప్రజలకు ఆ స్వతంత్రంవుంది. రాజు పాలన గురించి ప్రజలు -మాట్లాడాలి; మాట్లాడే వారు; అది రాముడు వినే వాడు.

కానీ, ఈ రోజు, మన నాయకులకు - తమను గురించి, ప్రజలు ఏమనుకుంటున్నారో - అన్న బాధేం లేదు.

కొంత మంది నాయకు(లు / రాళ్ళు) - ప్రజలు తమను గురించి - వొక్క మాట - మాట్లాడితే -వారిని జెయిల్లో వేసేస్తున్నారు. వీరంతా - ప్రజాస్వామిక నాయకులనడం - సిగ్గు చేటు. "తప్పులే" చేస్తాననే నాయకులు - మన దేశం లో ఎంతో మంది . మరి మన తప్పేమిటి? వీరిని నాయకులుగా ఎన్నుకోవడం.

నాయకుడు లంచ గొండి  వాడైతే - దేశమంతా లంచ గొండి తనం ప్రాకి పోతుంది.  నాయకుడు స్వార్థ పరుడైతే -దేశమంతా అలాగే తయారవుతుంది. మనం మతం వాడని మన కులం వాడని మనం ఎన్నుకునే నాయకులు - ఎప్పుడూ న్యాయం చెయ్యలేరు, చెయ్యరు. మంచి వాడు, నిజాయితీ పరుడు నాయకుడైతే - అతడెన్ని తప్పులు చేసినా సరే - దేశం బాగు పడుతుంది. అతడు మనం చెబితే వింటాడు కూడా. అదే  రామ రాజ్యం .    అదే ప్రజా స్వామ్యం.

కుల రాజకీయాలు పక్కన బెడితే - మంచి నాయకులు మనకు కనిపిస్తారు.

సరే. దేశం బాగు పడాలంటే -మంచి నాయకులు కావాలి. మన తప్పులు మనం - గుర్తించి , మంచి వారిని మన నాయకులుగా ఎన్నుకోవాలి. 

మనం బాగు పడాలంటే - మన తప్పులు మనం తెలుసుకొవాలి. దిద్దుకోవాలి. యిది రోజూ చెయ్యాల్సిన పని. యిదే దైవ ప్రార్థన . యిదే ముక్తి మార్గం. యిదే మన సంతోషానికి రాచ బాట.  

ఈ రోజు నుండీ - వొక వారం రోజుల పాటు - "నేను ఎవరి తప్పులూ వేలెత్తి చూపను" అని వొక వ్రతం పెట్టుకోండి. మీ జీవన విధానంలో గొప్ప మార్పు వస్తుంది . మీ మనసులో ఎంతో శాంతి, ఆనందం  నిండుతుంది .  

శుభం భూయాత్

= మీ
 
వుప్పలధడియం విజయమోహన్

చివరి మాట : నేను చేసినవే , పాఠకులకూ చెబుతాను. చేయనివి, చెయ్య లేనివి - చెప్పను.